29, జూన్ 2026, సోమవారం

అసహ్యమేస్తున్న పబ్లిక్ జీవితం

నేను రైల్వేలోనే రిటైరయ్యాను. కానీ నేడు రైల్లో ప్రయాణం చేయాలంటే ఇష్టపడటం  లేదు. ఏసీలో ఫ్రీపాస్ ఉన్నప్పటికీ రైల్వేప్రయాణం చేయకుండా ఏసీబస్సుల్లోనో, సొంతకార్లోనో పోతున్నాను. దూరమైతే విమానమే. సర్వీస్ లో ఉన్నప్పుడూ రైల్వేపాసులు వాడలేదు. ఇప్పుడూ వాడటంలేదు. అప్పుడు లీవులు కూడా మురిగిపోయేవి. ఇప్పుడు పాసులు కూడా మురిగిపోతున్నాయి. కారణం?

జనాల వెకిలి, దురుసు, మాస్ ప్రవర్తనలు నచ్చక ! రైలు ప్రయాణాలు నచ్చక !

ఎవడికీ ఎక్కడా సివిక్ సెన్స్ గాని, కామన్ సెన్స్ గాని ఉండటం లేదు.  నాకు ఊహ తెలిసినప్పటినుండీ ఇలాగే ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా ఎక్కువైంది. అప్పుడు మంచి, మర్యాద, మానవత్వం అనేవి కాస్త ఉండేవి. ఇప్పటి మనుషులలో ఎక్కడా కనిపించడం లేదు.

"ప్రయివేట్ లైఫ్ మీ ఇష్టం, పబ్లిక్ లోకి వస్తేమాత్రం ఏమైనా అంటాం" అని శ్రీ శ్రీ అనేవాడు. దాని సందర్భం వేరే ఏదో అయినప్పటికీ, అందరూ ఆయన మాటలని మాటల్లోనే కాక, చేతలలో కూడా అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది.

పబ్లిక్ రంగం మొత్తం, అది ఏదైనా సరే, దారితప్పింది. ప్రభుత్వసర్వీసులు ఏవైనా సరే, ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్ రంగాలు ఛండాలంగా తయారయ్యాయి. పెరిగిపోయిన జనాభా, సంస్కారం లేని డబ్బు, వెకిలి సినిమాలు, ఇక రాజకీయుల సంగతి చెప్పనే అక్కర్లేదు, అన్నింటినీ మించి సోషల్ మీడియా - ఇవన్నీ కలిసి మనిషిని చాలావేగంగా సంస్కారహీనుడిగా మార్చేస్తున్నాయి.

మొన్న బాంబేట్రెయిన్లో చిన్నగొడవ పెద్దదై, పొడుచుకునేదాకా పోయింది. అతను చనిపోయాడు. ఇతను అరెస్టయ్యాడు. మళ్ళీ ఇద్దరూ వాళ్ళ జీవితాలలో సామాన్యపౌరులే. ఇరుగూపొరుగూ "ఇద్దరూ మంచివాళ్ళే" అని చెబుతారు.

రైల్వే ఏసీలలో ఒకప్పుడు క్లాస్ పాసింజర్లు మాత్రమే ప్రయాణించేవారు. ఇప్పుడు మాసై పోయింది. ఏసీ ఫస్ట్ క్లాస్ కూడా ఛండాలంగా తయారైంది. తిన్నవన్నీ కాళ్ళదగ్గరే పారేస్తూ, మొబైల్ సౌండ్ పెద్దగా పెడుతూ, గట్టిగా అరుస్తూ, సంతలాగా చేస్తున్నారు. చాలా ట్రెయిన్లలో ఏసీల కంటే స్లీపర్లే కాస్త నయమనిపిస్తున్నాయి. వాటిల్లో పాసింజర్స్ కొంచెం పద్దతిగా ఉంటున్నారు. ఆఫ్ కోర్స్ ఇది అన్ని రూట్లకూ వర్తించదనుకోండి. బీహార్, బెంగాల్ వైపును నుండి వచ్చే రైళ్లయితే, అది ఏ క్లాసయినా సరే, ఎక్కకపోవడమే మేలు.

ఒక రైల్వే ఆఫీసర్ అయి ఉండీ మీరిలా చెబుతున్నారేంటని మీరనుకోవచ్చు. సర్వీసులో ఉన్నపుడు కూడా ఇదే చెప్పేవాణ్ణి. నా పరిధిలో సమస్యలను వెంటనే సాల్వ్ చేసేవాణ్ణి. కానీ నాలాంటి వాళ్ళు ఆ వ్యవస్థలో సముద్రంలో కాకిరెట్టలు. రైల్వే ఒక్కటే కాదు, ప్రతి ప్రభుత్వవ్యవస్థా, పబ్లిక్ వ్యవస్థా ఇలాగే ఉన్నాయి.

ఎక్కడైనా వ్యవస్థలు కొద్దిగా బాగుంటే, జనాలు ఛండాలంగా తయారయ్యారు.

అసలు, జనజీవనంలోకొస్తే, ఎక్కడైనా సరే, అది నరకమే. మనుషులే అలా తయారయ్యారు. క్లాస్ ను మన దేశంలో కోరుకుంటే, హైక్లాస్ గేటెడ్ కమ్యూనిటీలలో ఉండాలి. లేదా నాలాగా ఒక అడవిలోకెళ్ళిపోయి ఉండాలి. ఆఫ్ కోర్స్, హైక్లాస్ కమ్యూనిటీలలో హైక్లాస్ మెంటాలిటీస్ ఉంటాయని గ్యారంటీ ఏమీ లేదు. అక్కడెక్కువగా హైక్లాస్ క్రిమినల్స్ ఉంటారు. మరేం చెయ్యాలి? మిగిలిన ఛాయిస్ ఒక్కటే, అయితే హిమాలయాలు, లేదా అడవి. 

లేకిమనుషులు కన్పించనంత దూరం వెళ్ళిపోయి అక్కడ అజ్ఞాతంగా ఉండటం ఒక్కటే పరిష్కారం. అయితే ఇలా చెయ్యడానికి అందరికీ అవకాశాలుంటాయా? అంటే, ఖచ్చితంగా ఉండవు. కర్మ ఒప్పుకోదు. బంధాలు వదలవు. బ్రతుకుపోరును వదిలిపోలేరు.

ఇలాంటి జ్ఞానోదయాలు మన దేశంలో చాలా త్వరగా వస్తాయి. వేరే దేశాలలో అయితే రావు. అందుకే, విదేశాలకు వెళ్ళినవాళ్ళు, ఏదోరకంగా అక్కడే సెటిలవుదామని అనుకుంటారు గాని, తిరిగిరారు. వాళ్ళు చెప్పే కారణాలు కూడా ఇవే - ఎక్కడచూసినా జనం, ట్రాఫిక్ సమస్యలు, సరైన రోడ్లు పరిశుభ్రతా లేకపోవడం, పెరిగిపోతున్న ఖర్చులతో నిత్యజీవితమే టెన్షన్ గా మారడం, మనుషులలో సివిక్ సెన్స్ లేకపోవడం, వ్యవస్థలన్నీ జవాబుదారీతనం లేనివిగా అవడం, ఆహారకల్తీ, మెడికల్ మాఫియా, భవిష్యత్తు గ్యారంటీ లేకపోవడం ఇవన్నీ కారణాలుగా వారు చూపిస్తున్నారు. ఇవన్నీ నిజాలే.

విదేశాలలో కొన్నే సమస్యలుంటాయి. మనదేశంలో మాత్రం నిత్యజీవితమే ఒక సమస్య. డబ్బున్నవాడికైనా, లేనివాడికైనా, మధ్యలోవాడికైనా ఎవరికైనా ఇది తప్పదు. ఇక్కడ ప్రతిదీ ఒక పోరాటమే. ఒక గందరగోళమే. ఒక పరుగే. కారణాలేంటంటే, ఎక్కడ చూసినా జనం, సివిక్ సెన్స్ లేకపోవడం, వ్యవస్థలు ఫెయిలై పోతూ ఉండటం, ఎక్కడా జవాబుదారీతనం లేకపోవడం. 

కనుక, చివరాఖరికి తేలేది ఒక్కటే, ఎవడి ఖర్మ వాడు అనుభవిస్తూ, ఏడుస్తూ బ్రతకడమే.

చేతనైతే ఈ జనాలకు, ఈ పొల్యూషన్ కు, దూరంగా పోయి మనదేశంలోనే బ్రతకడం,  లేదంటే విదేశాలకు పారిపోయి అక్కడ బ్రతకడం, ఈ రెండూ కాకపోతే, మన ఖర్మ అనుకుని ఏడుస్తూ ఇక్కడే ఇదే సొసైటీలో బ్రతకడం. ఈ మూడే చివరికి మిగులుతున్నాయి.

పబ్లిక్ మాత్రం భరించలేనంత చౌకబారుగా, లేకిగా తయారౌతున్నారనేది వాస్తవం ! దీనికి కారణాలెన్నున్నప్పటికీ, వాటిని ఎవరూ ఏమీ చేయలేనంతగా కుళ్లిపోతున్నాయనేది కూడా వాస్తవమే !