“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, డిసెంబర్ 2020, శనివారం

క్రిస్మస్ ప్రార్ధన

హే ప్రభువా !

ఈ క్షమాప్రార్ధనను ఆలకించుడి


నువ్వు మమ్మల్ని హిందువులుగా పుట్టించినా

నీ ఆలోచనకు విరుద్ధంగా మతం మారుతున్నాం

మమ్మల్ని క్షమించుడి


ప్రేమను సహనాన్ని నువ్వు బోధించినా

ద్వేషాన్ని మేము ప్రచారం చేస్తున్నాం

మమ్మల్ని క్షమించుడి


కొండమీద ప్రసంగాన్ని కొండమీదే వదిలేసి 

దండిగా సంపాదిస్తూ నిండుగా బ్రతుకుతున్నాం 

మమ్మల్ని క్షమించుడి


నీ విప్లవభావాలకు రోమన్లు నిన్ను శిలువేసినా 

మనుషులందరూ బాధ్యులేనని అబద్దాలు చెబుతున్నాం 

మమ్మల్ని క్షమించుడి


ప్రార్థనలతో కరోనా పోతుందని నమ్మిస్తూ

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నాం 

మమ్మల్ని క్షమించుడి


నువ్వు పుట్టింది డిసెంబర్ 25 కాకపోయినా

అదేనని అబద్దాలు చెబుతూ లోకాన్ని నమ్మిస్తున్నాం

మమ్మల్ని క్షమించుడి


పాపాలు చెయ్యడానికే మేము పుట్టాం 
మమ్మల్ని క్షమిస్తూ ఉండటానికి నువ్వు పుట్టావ్ 
ఈ మాటన్నామని కోపమొచ్చిందా?
అయితే మళ్ళీ క్షమించుడి
నీకంతకంటే ఇంకేం పనుంది గనుక?

ఈ ఏడాదంతా మరిన్ని పాపాలు చేసి
మళ్ళీ క్రిస్మస్ ప్రార్ధనలో కలుస్తాం
అంతవరకూ మమ్మల్ని క్షమిస్తూ
రెస్టు తీసుకొనుడి
 
టాటా....
read more " క్రిస్మస్ ప్రార్ధన "

24, డిసెంబర్ 2020, గురువారం

సంవత్సరాంత వేడుకలు

పొద్దున్న రవి మళ్ళీ ఫోన్ చేశాడు. తను రోజూ ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ నేను ఎత్తను. ఆ టైంకి  నేనేదో పనిలో ఉంటాను.  ఎన్నిసార్లు ఎత్తకపోయినా పాపం విసుక్కోకుండా రోజూ ఒకే టైం కి చేస్తూనే ఉంటాడు.

అలాగే పొద్దున్న కూడా ఫోన్ మ్రోగింది. అప్పుడుకూడా ఏదో పనిలో ఉన్నాను. ఇక బాగోదని ఫోనెత్తాను. మనలని తలచుకునేవాళ్ళని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదనేది మొదట్నుంచీ నా సిద్ధాంతం. అందులోనూ మా స్నేహం ఇప్పటిది కాదు. దీనికి ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది.

'ఇవాళకూడా అమితాబ్ బచ్చన్ని వినేసి ఫోన్ పెట్టెయ్యాలేమో అనుకున్నా. మొత్తమ్మీద ఫోనెత్తావు' అన్నాడు కించిత్ నిష్టూరంగా.

'లేదులే. రోజూ నిన్ను డిజప్పాయింట్ చేయడం నాకూ బాలేదు. అందుకే కాసేపు' అన్నా.

అలా కాసేపు  అవీఇవీ మాట్లాడాక ' సంవత్సరాంత  వేడుకలు ఏం ప్లాను చేస్తున్నావ్ ?' అడిగాడు.

'ఏ ప్లానూ లేకుండా ఎలా ఉండాలా అని ప్లాన్ చేస్తున్నా' అన్నా. 

'అంటే?' అన్నాడు

'ఎవరికీ తెలీని, ఎవరూ రాలేని ప్రాంతానికి వెళదామనుకుంటున్నా' అన్నా.

'ఏదైనా ఐలెండ్ కి పోతున్నావా?' అన్నాడు.

'అవును. నా మనసే ఆ ఐలెండ్' అన్నా.

నవ్వేసి 'మన జోసెఫ్ పాండిచ్చేరి వెళుతున్నాడు జనవరి ఫస్ట్ దాకా రాడు.' అన్నాడు.

'అదేంటి? అరబిందో తీర్ధం పుచ్చుకున్నాడా?' అడిగా.    

'కాదు. అక్కడేదో పురాతన చర్చిలున్నాయిట. వాటిలో ప్రార్ధనలు చేసి ఆ బీచుల్లో తిరిగి వస్తానని పేమిలీతో కలసి వెళుతున్నాడు' అన్నాడు.

'మంచిదే. పొమ్మను. అక్కడే చర్చిలో శేషజీవితం గడపమని చెప్పు. వెనక్కి రావద్దను' అన్నా.

'చర్చిలో ఒక్కరోజే. మిగతా రోజులు బీచ్లో తిరుగుతాట్ట. అంటే ప్లెజర్ ట్రిప్పన్నమాట' అన్నాడు.

'ఓహో. ప్రభుత్వం సొమ్ముతో ప్రభువు దర్శనం చేసుకుని చివర్లో ప్రజలవద్దకు పాలన అన్నమాట' అన్నా.

'అలాటిందేలే. ఎవడి టేస్ట్ వాడిది. నువ్వూ వెళ్లచ్చుగా. ఎప్పుడో ఫిబ్రవరిలో వెళ్ళొచ్చావ్. కావాలంటే చెప్పు మన మూర్తితో చెప్పి ఏర్పాట్లు చేస్తా' అడిగాడు.

'అనుకున్నా. కానీ వద్దన్నాడు' అన్నా.

'ఎవరూ?' అడిగాడు అనుమానంగా.

'ప్రభువు' అన్నా.

'ఛా..' అన్నాడు నవ్వుతూ.

'అవును. మొన్నరాత్రి ఫోన్ చేశాడు. ముందు నువ్వనుకుని ఎత్తలా. తర్వాత చూస్తే ప్రభువు. 'పోయినసారి పాండిచ్చేరి వచ్చి చాలా డిజప్పాయింట్ అయ్యావు. ఈసారి అలా ఎవరితో పడితే వారితో రాకు.' అని తనే చెప్పాడు. సర్లే ఆయనమాట కాదనడం ఎందుకులే అని కాన్సిల్ చేశా ట్రిప్' అన్నా సీరియస్ గా.

'సర్లే నీ గోల నాకర్ధం కాదులే గాని, మన ఇంకో ఫ్రెండ్ ప్రసాద్ చూడు హాయిగా తిరుమల వెళ్లి చక్కగా మూడురోజులు కొండమీద ఉండేలా ప్లాన్ చేసుకుని వెళ్ళాడు. అదన్నా చెయ్యి కనీసం' అన్నాడు కోపంగా.

'అడుసు త్రొక్కనేల కాలు కడుగనేల?' అన్నా.

'అదేంటి/' అన్నాడు.

'పాపాలు చేసినవాడికే దేవుడి అవసరం. నాకు తెలిసి నేనే పాపమూ చెయ్యలేదు. కాబట్టి నాకు ప్రభువూ అవసరం లేదు. ఎవరూ అవసరం లేదు. నేనే అడుసూ  తొక్కలేదు. కాబట్టి కాళ్ళు కడుక్కునే పని లేదు' అన్నా.

'పోనీ డిసెంబర్ 31 రాత్రి మన ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉంటుంది. అక్కడికైనా రా' అన్నాడు.

'నేన్రాను. ఏముందక్కడ? తాగుడు, వాగుడు, తినుడు, ఎగురుడు అంతేగా. పనికిమాలిన చెత్త ! అదీగాక, అదే సమయంలో నాకోసం చాలామంది ఫ్రెండ్స్ వస్తారు నన్ను కలవడానికి' అన్నా. 

'ఎవరు వాళ్ళు?' అడిగాడు.

'వాళ్లంతా గతించి చాలా కాలమైందిలే. నా బ్లెస్సింగ్స్ కోసం ఆరోజు రాత్రికి వచ్చిపోతారు. నీక్కనిపించరు' అన్నా.

'ఓహో ! వాళ్ళక్కూడా న్యూ ఇయర్ ఉంటుందా?' అడిగాడు.

'ఎందుకుండదు? వాళ్ళు బ్రతికున్నపుడు మనలాంటివాళ్లే కదా ! అందుకే మన అలవాట్లు వాళ్లకూ ఉంటాయి. కావాలంటే నువ్వే మా ఇంటికి రా ఆరోజు రాత్రికి . పరిచయం చేస్తా' అన్నా.

'బాబోయ్ వద్దులే. మా పార్టీలేవో మేం చేసుకుంటాం. ఏదైనా నీ దారి వేరులే. 'అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా' అంతేగా?' అడిగాడు ఈసారి సీరియస్ గా.

ముప్పై ఏళ్ల క్రితం మేము ట్రెయినింగ్ లో రెండేళ్లపాటు కలసి ఉన్నపుడు, నా పరధ్యానపు ఎపిసోడ్స్ ని దగ్గరనుంచి తను చాలాసార్లు గమనించాడు.  అందుకే అలా అడిగాడని నాకర్షమైంది.

'అంతే. చెప్పడం చాలా తేలిక. చెయ్యడం బహు కష్టం' అన్నా.

'అదేంటి' అన్నాడు.

'బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే' అన్నా.

'ఏంటో నీ గోల! సరే ఉంటామరి. ఆ టైంకి కనీసం ఫోన్ చేసి విషెస్ చెప్పచ్ఛా నీకు?' అడిగాడు.

'నీ అదృష్టం ! పరీక్షించుకో. ఆ టైంకి నేనేదో పనిలో ఉన్నాననుకో, వాళ్లలో ఎవరైనా ఫోనెత్తితే ఆ స్వరం విని కంగారుపడకు' అన్నా నవ్వుతూ.

'ఎందుకు పడతాను? ముందే చెప్పి రక్షించావ్ కదా?' అన్నాడు

'అదికాదు. నాతోలాగా వాళ్ళతో కూడా ముచ్చట్లు పెట్టుకున్నావనుకో. ఆ తర్వాత వాళ్ళు మీ ఇంటికి కూడా వస్తే అప్పుడుంటుంది నీకు' అన్నా నవ్వుతూ.

'బాబోయ్ ! అంతపని చెయ్యకు. ఉంటా మరి" అని ఫోన్ పెట్టేశాడు రవి.

నేనూ నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశా.

ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్ ట ! మతిలేకపోతే సరి ! పిచ్చిలోకమూ పిచ్చి పనులూనూ ! తాగడానికి తందనాలాడటానికి ఏదో ఒక సాకు !

మన సెలబ్రేషన్ అలా ఉంటుంది !

read more " సంవత్సరాంత వేడుకలు "

కొద్దిమంది...

లోకంలో అందరూ దేవుడిని ఆరాధిస్తున్నారు 

కానీ దేవుడు ఎవరికీ కనిపించడం లేదు 

లోకానికి తెలిసిన దేవుడు 'భయం' ఒక్కటే

అందుకే... 

నిజమైన దేవుడు అందరికోసం కాదు

అతడు కొద్దిమంది కోసం మాత్రమే


భూమ్మీద అందరూ ప్రేమకోసం తపిస్తున్నారు

కానీ ప్రేమ ఎవరికీ దక్కడం లేదు

లోకానికి తెలిసిన ప్రేమ 'స్వార్ధం' మాత్రమే

కనుకనే...

నిజమైన ప్రేమ అందరికోసం కాదు

అది కొద్దిమంది కోసం మాత్రమే


ప్రపంచంలో అందరూ దేనికోసమో వెదుకుతున్నారు

కానీ అది ఎవరికీ చిక్కడం లేదు

లోకానికి తెలిసిన గమ్యం 'సుఖం' మాత్రమే

అందుకే...

నిజమైన సుఖం అందరికీ అందదు

అది కొద్దిమంది కోసం మాత్రమే


సమాజంలో అందరూ అన్నీ తెలుసనుకుంటున్నారు 

కానీ శాంతి ఎవరి దగ్గరా కనపడటం లేదు

లోకానికి తెలిసిన జ్ఞానం 'గర్వం' మాత్రమే

కనుకనే... 

నిజమైన జ్ఞానం అందరికోసం కాదు

అది కొద్దిమంది కోసం మాత్రమే


అందరూ సమానమే అని అందరూ చెబుతున్నారు

కానీ ఏ ఇద్దరికీ ఇక్కడ పడటం లేదు

మనుషులకు తెలిసిన 'సమానత్వం' మాటల్లో మాత్రమే 

అందుకే... 

అసలైన సమానత్వం అందరికోసం కాదు

అది కొద్దిమంది కోసం మాత్రమే.. 


కొద్దిమంది నన్ను కలసి ఇలా అన్నారు

మీరు చెబుతున్న కొద్దిమంది మేమే కదూ?

వారిని చూస్తూ ఇలా అన్నాను

కాదు.... 

నేను చెబుతున్నది మీలాంటి కొద్దిమందికోసం కాదు

అది 'కొద్దిమంది' కోసం మాత్రమే...

read more " కొద్దిమంది... "

23, డిసెంబర్ 2020, బుధవారం

Our E Books available from Amazon and Google Play Books

మా E Books ఇకనుంచీ Amazon నుంచి, Google Play Books నుంచి లభిస్తున్నాయి. కావలసినవారు సైడ్ బార్ లో ఉన్న బటన్  నుంచి mapanchawati.org కు వెళ్లిచూడవచ్చు.

































read more " Our E Books available from Amazon and Google Play Books "

19, డిసెంబర్ 2020, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 40 (భక్తులు - తాత్త్వికులు)

పదేళ్ళక్రితం నేను జిల్లెళ్ళమూడికి తరచుగా వెళ్ళడం మొదలుపెట్టినపుడు అప్పారావన్నయ్య నాతో ఒకమాటన్నారు.

'జిల్లెళ్ళమూడిలో మీకు చాలామంది భక్తులు కన్పిస్తారు. వాళ్ళలో చాలామంది అమ్మ ఉండగా అమ్మను చూచినవాళ్ళు, ఆమెతో మాట్లాడినవాళ్ళు. వాళ్ళందరూ మీకు చాలా సాదాసీదాగా కనిపిస్తారు. అంతమాత్రం చేత వాళ్ళు మామూలు మనుషులని అనుకోకండి. వాళ్ళు మహాయోగులు. నిరంతరం వాళ్ళు అమ్మ స్మరణలో అమ్మ ధ్యానంలో ఉంటారు. అమ్మనే తలుస్తూ ఉంటారు. కనుక బయటకు పల్లెటూరి మనుషులలాగా కనిపించినప్పటికీ వాళ్ళు అంతరికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్లే'.

ఈ మాట నిజమని నేను చాలాసార్లు గమనించాను. అయితే, అక్కడున్న అందరిలోనూ అమ్మ యొక్క ఉన్నతమైన తాత్వికచింతన కనిపించదు. అమ్మ భావజాలం అత్యున్నతమైనది. అది వేదవేదాంత, సాంఖ్య, యోగ, తంత్రశాస్త్రాల పరిధులను తనలో ఇముడ్చుకుని ఉంటుంది. కానీ అతి సులువైన మామూలుభాషలో ఉంటుంది. కానీ ఈ తాత్వికచింతన, అక్కడున్న భక్తులలో కనిపించదు. ఇది సహజమే కదా. అందరికీ అంతటి ఉన్నతమైన తాత్త్వికచింతన ఉండదు.

భక్తులందరూ భక్తిలో ఉంటారు. శరణాగతభావంలో ఉంటారు. వాళ్లకున్న సమస్యలు తీరాలని, పనులు కావాలని అమ్మను వేడుకుంటూ ఉంటారు. అయితే అమ్మ భావాలు వేరు. ' నువ్వనుకున్న పనులు అవడమూ కాకపోవడమూ రెండూ అనుగ్రహమే' అంటుంది అమ్మ. ఇంతటి అత్యున్నతమైన స్థితిని అందరూ అందుకోలేరు. కనుక వాళ్ళు భక్తులుగానే ఉంటారు. జ్ఞానులు కాలేరు. అమ్మదేమో శ్రీ రామకృష్ణుల వారి లాగా భక్తి జ్ఞానముల పరాకాష్ట స్థితి.

కొద్దిగా గమనించేవారికి జిల్లెళ్ళమూడిలో ఈ సూక్ష్మమైన భేదాలు కనిపిస్తాయి. అక్కడున్న వారిలో భక్తులున్నారు, భక్తి జ్ఞానం కలసినవాళ్ళున్నారు. జ్ఞానపరిపక్వతను అందుకున్నవాళ్ళున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో అక్కడవాళ్ళు కనిపిస్తారు. ఒక దారిలో నడుస్తున్న వాళ్ళు అందరూ కట్టగట్టుకుని ఒకేచోట ఎలా ఉంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క మజిలీలో ఉంటారు. సహజమే కదా !

మూర్తి తరచుగా ఇదే అంటుంటాడు. అమ్మ స్థాయి అక్కడివారిలో కనిపించడం లేదు అనేది అతని బాధ. ఈరోజు ఉదయం కూడా ఏదో మాటల సందర్భంలో ఇదే మాట అన్నాడు. అమ్మ స్థాయి ఇతరులలో ఎలా ఉంటుంది? అది అసంభవం. కనీసం అమ్మ తాత్వికచింతనా స్థాయి కూడా కనపడటం లేదే అని అతని బాధ !

రాత్రి పదింటికి రైలు. సెలవు తీసుకుందామని, చీకటిపడ్డాక అక్కయ్య దగ్గరకు వెళ్ళాము. పడుకుని ఉన్న ఆమె మమ్మల్ని చూస్తూనే లేచి కూర్చుని, లోనికి రమ్మని మమ్మల్ని పిలిచారు.

'సాయంత్రం ఓంకారానందగిరి స్వామి వచ్చి ఇప్పుడే వెళ్లారు. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి కాసేపు కూచుని కాఫీ త్రాగి ఆమాటా ఈ మాటా మాట్లాడి వెళుతూ ఉంటారాయన' అంటూ సూటిగా అక్కయ్య సంభాషణ మొదలుపెట్టారు.

'ఆయన సన్యాసా? ఇక్కడే ఉంటారా?' అడిగాను నేను.

'కాదు. ఆయనకు భార్యా పిల్లలున్నారు. ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ రిటైరయ్యారాయన. ఇప్పుడాయనకు 67 ఏళ్లు. ప్రస్తుతం ఇక్కడే ఉంటూ మన కాలేజీలో పనిచేస్తున్నారు. ఆయనకు తెలియని విషయమంటూ లేదు. అమ్మ తత్త్వం ప్రజల్లోకి వెళ్ళడం లేదని ఆయన బాధ. అమ్మ తాత్త్వికచింతన ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైనదని, అది ఈ మారుమూల కుగ్రామంలో దాగి ఉందని, అందరికీ తెలియాలని, చాలా తపనపడుతూ ఉంటారాయన. అమ్మను గురించి ఆయన కూడా చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఒక్కసారి తెలిశాక, అమ్మను గురించి చదివాక, ఇక ఇక్కడకు వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు. అమ్మను గురించి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు ధారగా కారిపోతూ ఉంటాయి. అంత భావోద్రేకం వస్తుంది ఆయనకు' అంది అక్కయ్య.

'ప్రస్తుతం ఆయనకు అనుకూలమైన కాలం నడుస్తోందక్కయ్య. ఇంతకు ముందైతే కమ్యూనికేషన్ లేదు. ఏమీ లేదు. కనీసం ఫోన్లు కూడా లేని కాలాన్ని మనం చూశాం. ఇప్పుడో, అనుకున్న క్షణంలో అమెరికాలో ఉన్నవాళ్ళతో మాట్లాడుతున్నాం. యూట్యూబ్ ఉంది. ఒక చానల్ పెట్టి ఆయన భావజాలాన్నీ, అమ్మ గురించి ఆయన చెప్పాలనుకున్న వాటిని ఆ ఛానల్లో చెప్పవచ్చు, ఇల్లు కదలకుండా ప్రపంచమంతా తిరగవచ్చు ఈ రోజుల్లో' అన్నా నేను.

'అవును. కొన్ని యూట్యూబ్ లో పెట్టారు. ఇంకా కొన్ని చేస్తున్నారు. కానీ ఆయన తపన చూచి నేను ఒకటే చెబుతూ ఉంటాను. 'అమ్మను గురించి ఎవరూ చెప్పడం లేదు. అమ్మ తత్త్వచింతనను గురించి చెప్పడం లేదు' అని కదా మీ బాధ. ఇక్కడ ఉన్న అందరికీ అది సాధ్యం కాదు. ఇక్కడ ఉన్నది భక్తులు. వాళ్ళు, అమ్మ జీవించి ఉన్నపుడు, అమ్మతో కలసి మెలసి తిరిగిన ఆయా అనుభవాలను నెమరు వేసుకుంటూ మౌనంగా అమ్మ ధ్యానంలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు తత్త్వప్రచారం చేయరు. వారికి అమ్మే లోకం. అమ్మ ధ్యానంలో మౌనంగా అలా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళలో చాలామంది వెళ్లిపోయారు. అమ్మను చూచిన ఆ తరం వాళ్ళందరూ ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. కొద్దిమంది మాత్రం ప్రస్తుతం మిగిలి ఉన్నారు. వాళ్ళు అమ్మను తలచుకుంటూ, గతంలో అమ్మ సమక్షంలో వారు గడిపిన క్షణాలను నెమరు వేస్తుకుంటూ మౌనంగా జీవిస్తూ ఉంటారు గాని, స్టేజి లెక్కి ఉపన్యాసాలివ్వరు. ఎందుకంటే, వాళ్ళు భక్తులు. భక్తుడు భగవంతునిలో కరిగిపోవాలని కోరుకుంటాడు గాని ప్రచారం చేద్దామని కోరుకొడు. అమ్మ తత్త్వం వారికి తెలియక కాదు. తెలుసు. కానీ ప్రచారం చేయరు. అమ్మ దగ్గర వారికంటిన పరిమళాన్ని వారి స్థాయిలో వారు వెదజల్లుతూ ఉంటారు. అంతేగానీ, మీరు ఆశించిన స్థాయిలో ఆర్భాటంగా ప్రచారం ఉండదు.

నేనాయనకు ఇంకా ఇలా చెప్పాను ' మీకు అమ్మ శక్తినిచ్చింది. తెలివి నిచ్చింది. అర్ధం చేసుకునే ప్రజ్ఞనిచ్చింది. మీరు ప్రచారం చేయండి. నలుగురికీ అమ్మ గురించి చెప్పండి. అమ్మ చేసిన మహత్యాలు కాదు. అమ్మ తత్త్వాన్ని చెప్పండి. అది భక్తుల వల్ల కాదు. అది వారి పని కూడా కాదు. అదంతా మీలాంటి తెలివైన వాళ్ళ పని'. అందక్కయ్య.

'అంతే' అన్నాను.

ఇదే మాటలు మూడుసార్లు మార్చి మార్చి చెప్పిందక్కయ్య.

అంతా విని 'సన్యాసి కాకపోతే ఆయనకా పేరు ఎలా వచ్చింది?' అడిగాను.

'వేదాద్రిమహర్షి దగ్గర ఈయన యోగాన్ని నేర్చుకున్నాడు. ఆయనే ఈయనకీ పేరు పెట్టాడు' అందక్కయ్య.

'సరే ఈ సారి వచ్చినపుడు వీలైతే కలుస్తాను' అన్నాను.

అక్కయ్య దగ్గర సెలవు తీసుకుని వెనక్కు వచ్చేస్తూ ఉండగా మూర్తి ఇలా అన్నాడు.

'ఎంత విచిత్రం గురువుగారు ! పొద్దున్న మనం మాట్లాడుకున్నదానికి అక్కయ్య నోటినుంచి అమ్మే ఇలా సమాధానం చెప్పించిందని నాకనిపిస్తున్నది'

'అవును. ఒక అతీతమైన విశ్వమానసం మనల్ని అనుక్షణం గమనిస్తున్నదని, మన సందేహాలకు వెంటనే స్పందించి అది జవాబులిస్తుందని నేనెప్పుడూ చెప్పేదానికి ఇదే నీకు నిదర్శనం. నాతో నడిచే ప్రయాణంలో ఇలాంటివి ముందుముందు చాలా చూడబోతున్నావు నువ్వు' అన్నాను.

అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేశాము.

భక్తులు పిల్లలవంటివారు. వాళ్ళకే కష్టం వచ్చినా 'అమ్మా' అని అరుస్తారు. వాళ్ళ పని అంతే. అమ్మ పెట్టింది తింటారు. ఉంటారు. తాత్త్వికులు పెరిగిన పిల్లలవంటివారు. వాళ్ళు ప్రపంచంలోకి వెళతారు. అవీ ఇవీ సాధించాలని చూస్తారు. ఆ క్రమంలో ఎందరితోనొ మాట్లాడవలసి వస్తుంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ప్రచారం వాళ్ళ వల్ల అవుతుంది. భక్తుల వల్ల అవదు. అంతమాత్రం చేత భక్తులు తక్కువా కాదు, తాత్వికులు ఎక్కువా కాదు. ఎవరి పాత్ర వారిది. ఎవరి పాత్రత వారిది. ఈ ఇద్దరిలో, ఎవరి కష్టాలు వారికుంటాయి, వారివారి సాధనామార్గంలో ఎవరి అడ్డుగోడలు వారికుంటాయి.

శ్రీరామకృష్ణులు ఇలా అంటారు 'భక్తుడు జిలేబీని తిని దాని రుచిని ఆస్వాదించాలని అనుకుంటాడు. జ్ఞాని తానే జిలేబీగా మారుతాడు'. ఆయనింకా ఇలా అంటారు - 'బావి త్రవ్విన తరువాత కొంతమంది ఆ పలుగూ పారలను అందులోనే పడేస్తారు, మరికొందరు మాత్రం 'ఇతరులకు అవి ఉపయోగిస్తాయిలే' అనుకుంటూ వాటిని తీసి ప్రక్కన పెడతారు'.

ఎంత గొప్ప లోతైన మాటలు !

దీనికి నేను కొంచం జత చేస్తాను. ఇవిగాక, 'వ్యాపారస్తుడు' అనే మూడో తెగ ఉన్నది. వీడు హోటలు పెట్టి, జిలేబీని అందరికీ అమ్ముతూ వ్యాపారం చేసేవాడు. వీడు తినడు, మారడు. ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అయితే, వీళ్లలో కొందరికి జిలేబీరుచి తెలిసి ఉండవచ్చు. మరి కొందరికి తెలీకపోవచ్చు. కానీ ప్రచారంలో తెలివితేటలు ఉంటే, బిజినెస్ లో సక్సెస్ అవుతారు. స్వీట్ షాపులో కూచున్నవాడు సాధారణంగా స్వీట్ తినడు. అలాగే, మతాలు మారుస్తూ, ప్రచారాలు చేస్తూ, ఉపన్యాసాలిస్తూ, అనుచరులను పోగేసుకుని మతబిజినెస్ లు చేసేవాళ్లకు నిజమైన స్వీట్ రుచి తెలియదు. వాళ్ళకు తెలిసింది బిజినెస్ మాత్రమే. అసలైన స్వీట్లు మాత్రం, అమ్మ బోధనల లాగా, ఎక్కడో అజ్ఞాతంగా ఉంటాయి. కొద్దిమంది మాత్రమే వాటిని రుచి చూడగలుగుతారు. వారిలో కొందరు, తాము చూచిన రుచిని ఇతరులకు చెప్పాలని తాపత్రయపడతారు. వేదన పడతారు. అలాంటివాళ్లే తాత్త్వికులు.

ఆధ్యాత్మికజీవితంలో ఏదీ తేలిక కాదు. ఏదీ తేలికగా రానూరాదు. పుస్తకాలు చదవడం, టీవీలో ప్రవచనాలు వినడం, డొల్లపూజలు చేయడం, ఇతరులకు బోధలు చేయడం - ఇది కాదు నిజమైన ఆధ్యాత్మికత. అదొక అంతరిక ప్రయాణం. ఆ దారిలో నడచిన వారికే అది అర్ధమవుతుంది.

అడుక్కునేవాడు భక్తుడు, అర్ధం చేసుకునేవాడు తాత్త్వికుడు, సొమ్ము చేసుకునేవాడు వ్యాపారస్తుడు. మనం భక్తులమా, తాత్త్వికులమా లేక ఉత్త వ్యాపారస్తులమా అనేది ఎవరికి వారు తేల్చుకోవాలి.

ఈసారికి వచ్చినపని అయిపోయింది. అదేరోజు రాత్రి పదికి బాపట్లలో రైలెక్కి ఉదయానికి హైదరాబాద్ వచ్చి చేరుకున్నాము.

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 40 (భక్తులు - తాత్త్వికులు) "

18, డిసెంబర్ 2020, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 39 (దూషణ - భూషణ)




జీవితం చాలా విచిత్రమైనది. జీవనగమనంలో ఎందరో తారసపడుతూ ఉంటారు. కలుస్తూ ఉంటారు. విడిపోతూ ఉంటారు. వారిలో కొందరితో మనకెంతో అనుబంధం ఏర్పడుతుంది. వాళ్ళు ఎంతగానో మనల్ని అభిమానిస్తారు. అర్ధం చేసుకుంటారు. మరికొందరు, మనం చెబుతున్నదాన్ని అర్ధం చేసుకోకపోగా, మనమీద  అకారణశతృత్వాన్ని పెంచుకుంటారు. దూరమౌతారు. ఈ క్రమంలో సహజంగానే కొందరు మెచ్చుకుంటారు. కొందరు తిడతారు. కొందరు సంతోషాన్ని కలిగిస్తే, కొందరు బాధపెడతారు. ఏది ఏమైనా, ఎవరేమన్నా, ముందుగా మనమేంటో మనకు తెలియాలి. కొన్ని సిద్ధాంతాల కోసం మనం ఆచంచలంగా నిలబడాలి. అప్పుడే బాధా ఉండదు. ఒకరు మనల్ని పొగిడినా లేక తిట్టినా మనలో ఏ మార్పూ ఉండదు. ఈ స్థిరత్వం లేకపోతే ఆటుపోట్లకు తట్టుకోలేక ఊగిపోయి మానసికంగా చెదిరిపోతాం. చివరకు మనకంటూ ఒక స్థిరత్వం లేకుండా తయారవుతాం. ఆధ్యాత్మికమార్గంలో నడిచేవారు అలా ఉండకూడదు.

మర్నాడు పొద్దున్నే లేచి యధావిధిగా కార్యక్రమాలన్నీ కానిచ్చి, గోశాలకు వెళ్ళి గోవులు ఎలా ఉన్నాయో చూచి కాసేపు అక్కడే ఉండి వెనక్కు వచ్చాము. వాటి ఆలనాపాలనా తిండీ తిప్పలూ చూసుకుంటూ అక్కడే ఉంటున్న అబ్బాయిని పలకరించి వచ్చాము. అతను వాటిని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. వాటికి దోమతెరలు, ఫాన్లు, మంచి తిండి, చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. వాటి పాలతో చేసిన పెరుగు మజ్జిగలనే అన్నపూర్ణాలయం (భోజనశాల) లో వాడుతున్నారు. మొత్తం మీద గోశాల చాలా చక్కగా నడుపబడుతున్నది. అక్కడనుంచి అందరం చాలా సంతృప్తితో వెనక్కు వచ్చాము.

ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి, అమ్మ ఆలయానికి వెళదామని లేచాము. ఈలోపల ఫోన్లో ఏదో మెయిల్ వచ్చింది. ఎవడో నన్ను తిడుతూ మెయిల్ ఇచ్చాడు. ఇలాంటివి ఈ పదేళ్ళలో ఎన్నో చూచి ఉండటంతో, 'ఇప్పటిదాకా వినని కొత్త తిట్లు ఏం తిట్టాడా తెలుసుకుందాం' అనుకుంటూ సరదాగా మెయిల్ తెరిచాను.

ఎవడో నార్త్ ఇండియన్, అమెరికాలో ఉంటున్నాడు, ఇంగ్లీషులో తిడుతూ మెయిల్ చేశాడు. ఎందుకయ్యా అంటే, 'ఓషో ప్రియురాలు వివేక్ అనుమానాస్పద మరణం' మీద జ్యోతిష్యపరమైన విశ్లేషణ చేస్తూ నేను వ్రాసిన పోస్ట్ ను నా ఇంగ్లీష్ బ్లాగులో చదివాడు. అందులో ఓషోలోని చీకటికోణాలను బాగా విమర్శించాను. అది అతనికి నచ్చలేదు. ఓషోకి వీరభక్తుడులాగుంది. బాగా హర్టయ్యాడు. కోపం పట్టలేక నన్ను తిడుతూ మెయిల్ ఇచ్చాడు.

అతని మెయిల్లో తార్కికమైన వాదన ఏమీ లేదు. 'ఓషో ముందు నువ్వెంత? అసలు ఓషోని విమర్శించేటంత మొనగాడివా నువ్వు? ఓషో అంత ఇంత. అలాంటివాడు ఇప్పటిదాకా పుట్టలేదు. ప్రపంచానికి నువ్వు చేసింది ఏమిటసలు?' అంటూ ఒక వీరభక్తుడి ధోరణిలో తిట్లపురాణంలాగా సాగింది ఆ మెయిల్. చదివేకొద్దీ చచ్చే నవ్వొచ్చింది. ఓపికగా అతను వ్రాసిన ఒక్కొక్క లైన్ కూ సరైన జవాబులిచ్చి ఆ మెయిల్ క్లోజ్ చేశాను. మూఢభక్తులను ఎవరు మార్చగలరు? నిజాలు చెబితే వాళ్లేందుకు నమ్ముతారు? ఓపెన్ మైండ్ తో చూస్తే అన్నీ అర్ధమౌతాయి. మనసుకు మూతేసుకుంటే ఎలా ఎక్కుతాయి? ఇన్ని నిజాలు బయటపడిన ఈనాటికీ సత్యసాయిబాబాను నమ్ముతున్న మూఢభక్తులు లక్షల్లో ఉన్నారు. మిగతావాళ్ళు కూడా కొద్దోగొప్పో అంతే. అన్నీ అర్ధం కావడానికి టైమ్ పడుతుంది. ఈ లోపల మన టైమ్ అయిపోతుంది. నవ్వొచ్చింది. ఇక ఆ విషయాన్ని మనసులోనుంచి చెరిపేశాను.

ఈ రకంగా రకరకాల పనుల్లో ఉదయమంతా జరిగింది. భోజనశాలలో మధ్యాన్నం భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా, దారిలో అప్పారావన్నయ్య కనిపించారు. ఆయన నన్ను చూస్తూనే మహదానందపడిపోయాడు. కుశల ప్రశ్నలయ్యాయి.

'ఇక్కడకొచ్చి కూడా నన్ను కలవకుండా వెళుతున్నారా?' అంటూ కొంచం నొచ్చుకున్నాడాయన.

'అదేం లేదండీ ! కరోనా కదా. అందర్నీ కలబెట్టడం ఎందుకని మీ దగ్గరికి రాలేదు. అది తప్ప వేరే కారణం ఏమీ లేద'ని చెప్పాను.

మా అల్లుడినీ అమ్మాయినీ ఆయనకు పరిచయం చేశాను. ఇక ఆయన ఆనందాన్ని మా అల్లుడితో చెప్పసాగాడాయన.

'మీ మామగారు వ్రాసిన పుస్తకాలు కొన్ని నేను చదివాను. ఇప్పటికీ చదువుతూ ఉంటాను. మావాళ్ళతో ఆయన భావాలను చర్చిస్తూ ఉంటాను. ఎంతో స్థాయి ఉంటే తప్ప అలాంటి పుస్తకాలు వ్రాయలేరు. ఆయన్ని చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. 'మనుష్యాణాం సహస్రేషు' అన్నట్లు ఆయనలాంటివాళ్ళు వేలల్లో ఒక్కరుంటారు' అంటూ ఆయన ఆప్యాయతను మాటల్లో కుమ్మరించాడాయన.

వాళ్ళు మౌనంగా వింటున్నారు. నేనూ వింటున్నాను.

'ఆయన క్లాసులకు నేనూ వస్తానంటే మాత్రం వద్దంటాడు. నన్ను మాత్రం రానివ్వడు' అంటూ నిష్టూరంగా నవ్వాడాయన.

ఎనభై దగ్గరలో ఉన్న ఆయన అలా అంటుంటే నాకు బాధనిపించింది.

'మీకెందుకండి? మీకు నా క్లాసులు అవసరం లేదు. అందుకే మిమ్మల్ని రానివ్వను. అంతేగానీ వేరే ఏం లేదు' అన్నాను.

నేను అక్కడకు వెళ్ళిన ప్రతిసారీ, తన సాధన గురించి నాతో చెబుతూ ఉంటాడాయన. ఈసారి తన ఛాతీమీద చేయి ఉంచుకుని 'బాగున్నాను. హాయిగా ఉంది' అన్నాడాయన. ఆయన స్థితి అర్ధమై నాకూ ఆనందం కలిగింది.

ఆయన దగ్గర సెలవు తీసుకుని వెనక్కు వచ్చేశాము. దారిలో నడుస్తూ ఉండగా, నాలో ఆలోచనలు మొదలయ్యాయి.

పొద్దున ఎవడో ముక్కూముఖం తెలీనివాడు నానాతిట్లూ తిడుతూ మెయిల్ చేశాడు. మధ్యాన్నానికి ఎనభైఏళ్ల యోగి ఒకాయన అమితంగా అభిమానిస్తూ మెచ్చుకుంటూ పొగుడుతున్నాడు. ఈ రెంటిలో ఏది నిజం? ఏదబద్దం? మొదటివాడికి నేనెవరో పూర్తిగా తెలీదు. అతనికి ఓషో అంటే కూడా పూరిగా తెలీదు. ఏదో మిడిమిడిజ్ఞానంతో కొన్ని పుస్తకాలు చదివి ఏదో ఊహించుకుంటున్నాడు. అతనికి తెలీని కోణాలు నేను చెబితే తట్టుకోలేక తిడుతున్నాడు. ఇక ఇక్కడ చూస్తే, ఈయనేమో నలభై ఏళ్లనుంచీ యోగసాధనలో ఉన్న వృద్ధుడు. నా భావజాలం చదివి అందులోని సత్యాలు అర్ధమై నన్ను అభిమానిస్తున్నాడు. దేనిని నేను తీసుకోవాలి? దేనిని విడిచిపెట్టాలి?

విచిత్రంగా, ఆ మెయిల్లోని తిట్లు నాలో ఏ చలనాన్నీ తీసుకురాలేదు. ఆఫ్కోర్స్ నవ్వొచ్చింది. జాలికలిగింది. అజ్ఞానంతో అహంకారంతో కూడిన మనస్సు అక్కడ అగుపించింది. దానిపైన జాలి కలిగింది. అంతేగాని నా అహమేమీ దెబ్బతినలేదు. ఇక, ఈ పొగడ్తల వల్ల నేనేమీ ఉబ్బిపోలేదు. ఇంకొక మనిషిలోని జ్ఞానస్థితిని గమనించి అందరిముందూ మెచ్చుకోవాలంటే మనలో విశాలమైన మనస్సుండాలి. ఈయనలో అదుంది. దానిని గమనించి నాకు సంతోషం కలిగింది. వారివారి మనసులున్న స్థితులను చూసి జాలీ సంతోషమూ కలిగాయిగాని, నాలో కోపంగాని, అహం దెబ్బతినిన ఫీలింగ్ కానీ కలగలేదు. లోపల ఏ విధమైన చలనమూ లేదు. నా స్థితిని గమనించి నాకింకా సంతోషం కలిగింది.

వారివారికి అర్ధమైన పరిస్థితిని బట్టి వారు మాట్లాడారు. అది వారి మానసిక అవగాహనకు సంబంధించిన విషయం. దానితో నాకేంటి సంబంధం? నేను నేనే. నేనెంటో నాకు తెలుసు. వారేంటో కూడా తెలుసు. కనుక వారి మాటలు నన్నెందుకు చలింపజేయాలి? నేనెందుకు పొంగిపోవాలి? లేదా క్రుంగిపోవాలి? అవసరం లేదు.

మొదటిది అజ్ఞానపూరిత మనస్సు. హర్టయింది. మరి అజ్ఞానం అహంకారం ఉన్నపుడు హర్టవక ఇంకేమవుతుంది? కనుక దానికది సరైనదే. రెండవది అవగాహనతో కూడిన యౌగిక మనసు. విషయం అర్ధమై దానికానందం కలిగింది. దీనికిదీ సరైనదే. వాళ్ళవరకు వాళ్ళూ కరెక్టే. నా వరకు నేనూ కరెక్టే. వాళ్ళలా వాళ్ళున్నారు. నాలా నేనుండాలి. వాళ్ళ సంగీతానికి నేను నాట్యం చేయకూడదు.

మాటమాటకీ చలించేది అచలమెలా అవుతుంది?

ఈ విధంగా లోలోపల ఆలోచనలు సాగుతున్నాయి. పక్కనున్నవాళ్ళతో మాత్రం అవీ ఇవీ మాట్లాడుకుంటూ  ఇంటికి చేరుకున్నాము.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 39 (దూషణ - భూషణ) "

16, డిసెంబర్ 2020, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 38 (నమ్మకం - పునాదులు - దారి)

మొన్న వారాంతంలో జిల్లెళ్ళమూడి సందర్శనం, 'వైద్యజ్యోతిష్యం' పుస్తకం విడుదల జరిగాయి.

దానికోసం, రాత్రి పదకొండుకు హైదరాబాద్ లో రైలెక్కి, ఉదయం ఆరింటికల్లా బాపట్లలో దిగాము. సిద్ధంగా ఉన్న కారులో ఇరవై నిముషాలలో జిల్లెళ్ళమూడిలోని ఇంటికి చేరుకున్నాము. ఇంకా తెల్లవారలేదు. దారిలో పొలాలన్నీ పొగమంచుతో నిండి ఉన్నాయి. జిల్లెళ్ళమూడి చేరుకునేసరికి, రాత్రే అక్కడకు చేరుకున్న మూర్తి దంపతులు, ఇల్లంతా సర్ది శుభ్రం చేసి, మాకోసం వేచిచూస్తూ సిద్ధంగా ఉన్నారు.

కాలకృత్యాలు తీర్చుకుని పాలు సేవించి, డాబామీదకెక్కి నీరెండలో పచార్లు మొదలుపెట్టాము. చుట్టూ పొలాలు, చల్లని వాతావరణం, నీరెండ - వెరసి వాతావరణం చాలా హాయిగా ఉంది. అక్కడివాళ్లు 'చలి' అంటున్నారు గాని, హైదరాబాద్ చలికి రెండేళ్ళనుంచీ అలవాటుపడిన మాకు ఏమీ చలి అనిపించలేదు.

అనేక విషయాల మీద సంభాషణలు జరిగాయి. మాటల మధ్యలో మూర్తి ఇలా అన్నాడు.

'ఏది జరిగినా ఏమీ ఆలోచించకుండా, మారు మాట్లాడకుండా గురువును అనుసరించడమే అత్యుత్తమమని, సాధనామార్గంలో అదే చివరిమాటని నాకనిపిస్తోంది'.

'ఎందుకలా అనిపిస్తోంది నీకు?' అడిగాను.

'జారిపోతున్న వాళ్ళని చూస్తుంటే అలా అనిపిస్తున్నది. వాళ్ళందరూ వారివారి మనసులలో ఒక అజెండా పెట్టుకుని మిమ్మల్ని అనుసరిస్తున్నామని అనుకుంటూ, లేదా, ఇతరులని అలా భ్రమింపజేస్తూ కొంతకాలం మీతో ఉంటున్నారు. కొన్నాళ్ళకు వాళ్ళ ఊహలు నెరవేరకపోయేసరికి, ఏవేవో కుంటిసాకులు చెప్పి జారిపోతున్నారు. ఈలోపల మీ విలువైన సమయం వృధా అవుతున్నది. వాళ్ళకూ ఏమీ దొరకడం లేదు. దీనికంతటికీ మూలకారణం ఇదేనని గమనిస్తుంటే అనిపిస్తున్నది'  అన్నాడు మూర్తి.

నేనిలా చెప్పాను.

'అవును. దానిని మించిన సాధన లేదు. చేయగలిగితే అందులోనే అంతా దొరుకుతుంది. కానీ మాటలు చెప్పడం సులభం. చేయడం అతి కష్టం. అనుక్షణం నీ మనసే నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. అది సరియైన దారే అని మాయ కమ్ముతుంది. అక్కడే నువ్వు నిలబడాలి. లేకపోతే సాధనామార్గం నుంచి పడిపోతావు. ఇక వృధా అయిన సమయం సంగతంటావా? అలాంటిదేమీ లేదు. దానినుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకోగలిగితే, జీవితంలో ఏదీ వృధా కాదు! అంతరికమార్గంలో మనం ఎదిగే విధానం అలాగే ఉంటుంది. ఒక విధంగా చూస్తే, ఈ భూమ్మీద ప్రతివాడి సమయమూ వృధా అవడం తప్ప ఇంకేముంది? అదికాదు. నాతో నడవడానికి అందరికీ అవకాశం ఇస్తాను. పట్టుదల ఉంటే నడవవచ్చు. మధ్యలో మనసు చేసే మాయలకు పడిపోతే అది వారిష్టం. నా తప్పేమీ ఉండదు. నాకు కలిగే నష్టమూ ఏమీ లేదు. నష్టపోయేది వాళ్ళే. 

భక్తి, శరణాగతి, ప్రపత్తి అనే మాటలకు అర్ధం ఏమిటి చెప్పు? నువ్వు చెప్పినది అదే. మనమందరం ఈ మాటలను తరచుగా వింటాం. చెబుతాం. కానీ ఆచరణలో ఎవ్వరికీ ఇవి సాధ్యం కావు. ఎందుకంటే, అహం అనేది అణగడం చాలా కష్టం. అది ఎన్నో రూపాలు ధరించి నిన్ను మాయచేస్తుంది. ఆ మాయకూడా ఎలా ఉంటుందంటే అది మాయ అని నీకనిపించదు. నువ్వు చేస్తున్నది కరెక్టే అని నీకు అనిపించేలా నీ అహమే నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. అక్కడే అందరూ జారిపోతూ ఉంటారు.

నువ్వు చెప్పినట్లుగా ఉండగలిగితే ఇక మారుమాట లేనేలేదు. అలాంటి శిష్యుడికి సమస్తం అరచేతిలోకి వచ్చి నిలుస్తుంది. దేవతలు అతన్ని వెతుక్కుంటూ వస్తారు. కానీ అలా ఎంతమంది అహాన్ని చంపుకుని సాధనామార్గంలో నడవగలరు? కోటికి ఒకరు కూడా ఉండరు. కనుక అవి ఉత్తమాటలుగానే మిగిలిపోతాయి. అయ్యప్ప భక్తులు పాటలు పాడుతారు చూడు 'శరణం శరణం' అంటూ అరుస్తూ. అలాంటి జీవంలేని డొల్లపదాలే అవి'.

గుడికి వెళ్ళే సమయం అవడంతో ఆ సంభాషణ అలా ముగిసింది.

క్రిందకు దిగివచ్చి, అందరం కలసి అమ్మ ఆలయానికి బయల్దేరాము. దారిలో వసుంధరక్కయ్య ఇంటికి వెళ్ళి, అక్కయ్యను పలకరించి కాసేపు కూర్చున్నాము. జిల్లెళ్ళమూడి వచ్చి రెండేళ్ళు కావడంతో, అక్కడకూచుని గతస్మృతులన్నీ మళ్ళీ గుర్తుచేసుకున్నాము. తరువాత దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని, పుస్తకం విడుదల చేసి, వెనక్కు వచ్చేశాము. ఆ తరువాత మేడమీద అమ్మ గదికి వెళ్ళి అక్కడ కాసేపు కూచుని, అన్నపూర్ణాలయంలో భోజనం చేసి ఇంటికి వెళ్ళి సాయంత్రం దాకా విశ్రాంతి తీసుకున్నాము.

సాయంత్రం నేనూ మూర్తీ కలసి జిల్లెళ్ళమూడి గ్రామంలో ఉన్న నాలుగుబజార్లూ కాలినడకన సర్వే చేశాము. అమ్మ ఆలయం వెనుకగా అప్పికట్ల వెళ్ళేవైపు దారిలో వెళితే పొలాలు వచ్చాయి. అక్కడ కాసేపు నిలబడి సాయంకాలపు గాలిని నీరెండను ఆస్వాదించి ఊరి చివరగా ఉన్న వీధిలోనుంచి అమ్మ ఆలయం చుట్టూ తిరిగి మన ఇంటిదగ్గరకు వద్దామని చూస్తే అక్కడనుంచి దారి కనిపించలేదు. మళ్ళీ వచ్చిన దారినే వెనక్కు వెళదామా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉండగా, ఇద్దరు ఆడవాళ్ళు పొలం పనులు చేసుకుని, కొడవళ్లు,  ఖాళీ చేసిన భోజనం క్యారియర్లు పట్టుకుని ఇళ్లకు వస్తూ కనిపించారు. వారిని దారి అడిగాము.

వాళ్ళలో వకామె ' ఇక్కడ ఈ తుప్పలలోనుంచి దారి ఉన్నది. కానీ కప్పడిపోయింది. మేమూ అటే వెళుతున్నాము. మాతో రండి' అన్నది నడుస్తూ.

వాళ్ళని అనుసరించి ఆ రాళ్లలో, బురదలో, తుప్పలలో నడుస్తూ కొద్దిదూరం వచ్చేసరికి దారి కనిపించింది. ఇళ్లమధ్యగా నడుస్తూ వచ్చి, ఆంజనేయస్వామి ఆలయం దగ్గరకు వచ్చి చేరాము. వాళ్ళు వాళ్ళ దారిన వెళ్లిపోయారు. మేము ఏదో మాట్లాడుకుంటూ అక్కడే కాసేపు నిలబడ్డాము.

అక్కడ ఇళ్ళు, ప్రహరీ గోడలు కొంచం నేలలోకి క్రుంగినట్లు కనిపిస్తున్నాయి. ఎవరో భక్తులు అక్కడ ఉండటానికి కొన్ని ఇళ్ళను చెదురుమదురుగా కట్టించుకున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు లాగుంది. అందుకే ఎక్కువభాగం ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయి. వాటిని చూపిస్తూ ఇలా అడిగాను.

'ఎందుకు మూర్తి అవలా క్రుంగిపోయి ఉన్నాయి?'

'నల్లరేగడి నేల కదా గురువుగారు ! అందుకే, పునాదులు గట్టిగా లోతుగా లేకపోతే కొంతకాలానికి గోడలు క్రుంగుతాయి' అన్నాడు మూర్తి.

'అర్ధమైందా మరి? సాధనామార్గంలో కూడా అంతే. పునాదులు గట్టిగా ఉండాలి. లేకపోతే సాధన అనేది ఎక్కువకాలం సాగదు. అప్పుడు మన ఆధ్యాత్మికసౌధం కూడా క్రుంగుతుంది. ఏంటా పునాదులు? దారంటే సరియైన అవగాహన, శ్రద్ధ, గురువంటే నమ్మకం, నడిచే ఓపిక ఇవీ పునాదులు. వీటిలో లోపం ఉన్నపుడు నీ ఇల్లు నేలలోకి క్రుంగిపోతుంది. పొద్దున నువ్వడిగింది ఇదే.

అంతేకాదు. ఇందాక మనకు దారి చూపించిన ఆడవాళ్ళే మనకు గురువులు. గుర్తు చూపించేవాడే గురువని కదా అమ్మ మాట. కనుక మనకు గుర్తు చూపించినవారు మన గురువులు. దారికోసం నీలో నిజమైన తపన ఉన్నపుడు దారి చూపేవాడు నీకు తప్పకుండా తారసపడతాడు. వాడిని అనుసరించి నీవు నడవాలి. ఊరకే మాటలు చెబితే కుదరదు. మనం గనుక, వాళ్లమీద అనుమానంతో, 'వాళ్ళ దగ్గర కొడవళ్లున్నాయి, చీకటి పడిపోయింది, ఈ దారి మంచిది కాదు, బురదగా ఉంది, ముళ్ళున్నాయి. వద్దులే' ఇలా అనుకుంటూ మధ్యలోనే ఆగిపోయి ఉంటే, మనం ఇక్కడకు చేరేవాళ్ళం కాదు. లేదా, 'ఏం నడుస్తాంలే, ఏదో ఒక బండి రాకపోతుందా అదెక్కి పోదాం' అనుకుంటూ ఆగిపోయినా కూడా అంతే. ఇక్కడికి రాలేం. పొద్దున నీకు కలిగిన సందేహానికి ఇవే ప్రత్యక్ష ఋజువులు. ఈ విధంగా, చూడగలిగే చూపు ఉంటే, అనుక్షణం నీకు దారి కనపడుతూనే ఉంటుంది. దారి ఎక్కడో వేరే చోట ఉండదు. నీ పక్కనే ఉంటుంది. అనుక్షణం ఎక్కడికక్కడే, నీతోనే, నీలోనే ఉంటుంది. కానీ చూచే దృష్టి నీకు ఉండాలి. అనుసరించే తెగువా, పట్టుదలా, శ్రద్దా ఉండాలి. నీ మనసు చెబుతున్న ప్రతిదానినీ నువ్వు నమ్మి, దాని దారిలోకి పోతే ఇంతే సంగతులు. జారిపోతావు. లేదంటే నిలబడతావు. అదీ సంగతి'. అని ముగించాను.

ప్రపంచంలో అందరూ ఏదో ఒక దేవుడిని నమ్ముతారు. ఆధ్యాత్మికమార్గంలో ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. కానీ అదంతా ఉత్త భ్రమ. నిజమైన ఆధ్యాత్మికమార్గం అతి కొద్దిమందికి మాత్రమే అందుతుంది. అందరికీ అది అందదు. ఆ మార్గంలో ఎక్కడా ఆగకుండా నడిచేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఒక పదిమంది ఉంటారు. అంతే ! మిగతా అందరూ ఉత్తమాటలే గాని, నిజమైన దారీ దొరుకదు. నిజమైన నడకా ఉండదు. ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉన్నది. మనుషులందరూ భ్రమల్లోనే ఉన్నారు. ఈ ఊబిలోనుంచి బయటపడటం అందరికీ సాధ్యం కాదు.

చివరగా మూర్తీతో ఇలా చెప్పాను.

'మనతో నడిచేవాళ్ళు నిజంగా మనతో నడుస్తున్నారని భ్రమపడకు. వాళ్ళ వాళ్ళ మనసులు చెప్పినట్లు నడుస్తున్నారు. మనతో ఉంటూ, మనల్ని ఊరకే చూస్తున్నారు. అందుకే ఎక్కడో ఒకచోట రాలిపోతున్నారు. అందుకే నేనంటాను, 'మనకు చూసేవాళ్ళు వద్దు, చేసేవాళ్ళు కావాలి' అని. మన సంస్థ తాటాకుమంటలాగా గప్పుమని వెలగదు. మనకు పేరుప్రఖ్యాతులూ అక్కర్లేదు. అవి మనకు రావు కూడా. మనం ఈ లోకంలో ఎప్పటికీ మైనారిటీ గానే ఉంటాము. అజ్ఞాతంగానే మిగులుతాము. అలాగే ఉండాలి కూడా. ఎందుకంటే, క్రిందనేల మీద లక్షలాది జనం తిరుగుతూ ఉంటారు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేవాళ్ళు ఒక్కరో ఇద్దరో ఉంటారు. వాళ్ళు ఎంతో ఎత్తులో ఉంటారు. కానీ ఒంటరిగానే ఉంటారు. ఇదీ అంతే'.    

అలా మాట్లాడుకుంటూ ఆ గ్రుడ్డిదీపాల వెలుతురులో నడుస్తూ మెల్లిగా ఇంటికి చేరుకున్నాము.

( ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 38 (నమ్మకం - పునాదులు - దారి) "

15, డిసెంబర్ 2020, మంగళవారం

వైద్య జ్యోతిష్యం (మొదటి భాగం) ప్రింట్ పుస్తకం విడుదలైంది


ఇంగ్లీషులో చదవడం రానివారికోసం, లేదా ఇంగ్లీషును అంతగా ఇష్టపడనివారి కోసం 'వైద్యజ్యోతిష్యం' (మొదటి భాగం) తెలుగు ప్రింట్ పుస్తకాన్ని విడుదల చేశాము. ఈ కార్యక్రమం జిల్లెళ్ళమూడిలో అమ్మపాదాల దగ్గర నిరాడంబరంగా జరిగింది. రెండేళ్ళ క్రితం బుద్ధపౌర్ణిమ రోజున జిల్లెళ్ళమూడి నుంచి 'ధర్మపదం' పుస్తకాన్ని విడుదల చేశాం. ఇప్పుడు వైద్యజ్యోతిష్యం. ఈ విధంగా జిల్లెళ్ళమూడి నుంచి ఇపటికి రెండు పుస్తకాలను విడుదల చేశాము.

అతి త్వరలో ఈ పుస్తకం మా వెబ్ సైట్ mapanchawati.org నుంచి లభిస్తుంది.

read more " వైద్య జ్యోతిష్యం (మొదటి భాగం) ప్రింట్ పుస్తకం విడుదలైంది "

11, డిసెంబర్ 2020, శుక్రవారం

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...

అంతులేని ఎడారిలో

తెల్లవారని చీకటిరాత్రిలో

ఒంటరిపయనం సాగిస్తున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


ఈ లోకపు విపణివీధిలో 

బేరం ఎరుగని బేలవుగా

నిర్ధనురాలవై నిలిచావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


మోసం నిండిన లోకంలో

కపటం నిండిన కన్నులని చూచి

భయంతో వణుకుతున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


కామం తప్ప తెలియని సంఘంలో

ప్రేమను కోరుకుంటూ అమాయకంగా

దిక్కులు చూస్తూ నిలబడ్డావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


స్వార్ధం నిండిన మనుషులతో

తప్పక సహజీవనం సాగిస్తూ

తల్లడిల్లుతున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


వసంతమెరుగని తోటల్లో

వయారమొలికే గులాబీ కోసం

యుగాలుగా ఎదురుచూస్తున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


మృగాలు తిరిగే అడవుల్లో

దిగాలు పడుతూ దారులు మరచి

తిరిగి తిరిగి విసిగిపోయావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


గుళ్ళూ గోపురాల నగరంలో

ఆచారాల కృత్రిమ వీధులలో

అంతు తెలియక నిలుచున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


మతాల ముసుగుల నీడలలో

దైవం వెలుగును కనలేక

దారితప్పిపోయావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...

read more " భయపడకు..నేనున్నా నీకు తోడుగా... "

సరైన నిర్ణయం...

నా ముంగిట్లో నీవు యాచించినప్పుడు

ఎగతాళిగా నవ్వాను

నీ కౌగిట్లో నాకు చోటిచ్చినప్పుడు

వెక్కిరించి వెళ్లాను

ఈరోజు నీకోసం ఎదురుచూస్తున్నా

నీవు తిరిగిచూడటం లేదు

నీ నిర్ణయం సరైనదే...


అన్నీ అనుకూలంగా ఉన్నపుడు

నా గొప్పే అనుకున్నాను

అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నపుడు

నా తెలివే అనుకున్నాను

ఈరోజు కాలం చేతిలో దెబ్బలు తింటున్నా

నువ్వున్నావని ఇప్పుడు తెలుస్తోంది

నీ నిర్ణయం సరైనదే...


ఎన్నో మొగ్గల్ని నా చేతులతో చిదిమేశాను

వాటి రోదన నాకు పట్టలేదు

ఎన్నో పువ్వుల్ని ఈ చేతులతో నలిపేశాను

వాటి వేదన నాకు తట్టలేదు

ఇప్పుడు కాలం నా గొంతు నులుముతుంటే

నా క్రౌర్యం నాకర్ధమౌతోంది

నీ నిర్ణయం సరైనదే...


సాయం చెయ్యవలసిన ప్రతిచోటా

సందేహిస్తూ ఆగిపోయాను

గాయం చెయ్యకూడని ప్రతిచోటా

ఘరానాగా ముందుకు దూకాను

ఇప్పుడు నేను చేసినదే నాకు జరుగుతుంటే

నీ ప్రణాలికను అర్ధం చేసుకుంటున్నాను

నీ నిర్ణయం సరైనదే...


చెయ్యవలసినవి వెంటనే చెయ్యకుండా

చెత్తమాటలతో పొద్దుపుచ్చాను

చెయ్యకూడనివి చెంగుచెంగున చేస్తూ

చేటు మూట కట్టుకున్నాను

చెయ్యిదాటిపోయిందని ఇప్పుడు గుర్తించి

చేష్టలు దక్కి నిలుచున్నాను

నీ నిర్ణయం సరైనదే...


ఎన్నో రూపాలలో నాతో ముచ్చటించావు

ఎవరోలే అనుకున్నాను

ఎన్నో పాపాలలో నన్ను హెచ్చరించావు

ఎప్పుడూ వినకున్నాను

అవన్నీ వృధా అని ఇప్పుడు తెలుసుకున్నాను

కానీ సమయం మించిపోయింది

నీ నిర్ణయం సరైనదే...
read more " సరైన నిర్ణయం... "

9, డిసెంబర్ 2020, బుధవారం

Medical Astrology - Part I print book released

మీలో ఎంతోమంది ఎదురుచూస్తున్న Medical Astrology - Part I print book విడుదలైంది. ఇది వైద్యశాస్త్రానికి జ్యోతిష్యశాస్త్రానికి ఉన్న లింక్స్ ను వివరించే పుస్తకం గనుక, దీనిని మా అమ్మాయి డా || శ్రీ భార్గవి M.D (Homoeo), మా అల్లుడు డా || కృష్ణతేజ  M.S (Ortho) ల చేతుల మీదుగా హైదరాబాద్ లోని మా ఇంటినుండి విడుదల చేయించాము.

ఈ పుస్తకం మా వెబ్ సైట్ mapanchawati.org నుండి త్వరలో లభిస్తుంది. మా పుస్తకాలనన్నింటినీ మా వెబ్ సైట్ కి లింకు చేసే పని శరవేగంతో జరుగుతున్నది. ఒక పదిరోజులలో అది పూర్తవుతుంది. ఆ తర్వాత మా ఈ బుక్స్, మరియు ప్రింట్ బుక్స్ యధావిధిగా మా వెబ్ సైట్ నుండే లభిస్తాయి.

read more " Medical Astrology - Part I print book released "

8, డిసెంబర్ 2020, మంగళవారం

అంతములేని ఈ భువనమంత .....

'అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల..' అనే పద్యాన్ని వ్రాసింది దువ్వూరి రామిరెడ్డిగారు కదూ. పానశాలనుంచి నేను కంఠస్ఠం పట్టిన పద్యాలలో అదీ ఒకటి ! ఉమర్ ఖయాం వ్రాసిన రుబాయత్ కి అది తెలుగు. లోకమంతా ఒక పెద్దసత్రం లాగా కన్పించింది ఉమర్ ఖయాం కళ్ళకి. కానీ నాకు మాత్రం లోకమంతా ఒక పెద్ద పిచ్చాసుపత్రిలాగా కనిపిస్తోంది.

పిచ్చాసుపత్రి వార్దుల్లో ఉన్న పిచ్చోళ్ళు నా కళ్ళకి పిచ్చోళ్ళలాగా ఆనడం లేదు. మూమూలు మనుషుల లాగే కన్పిస్తునారు. ఎందుకంటే, లోకంలో ఉన్న జనాల్లో పిచ్చి లేనిదెవరికి? మరి వాళ్లనేమో లోకంలో వదిలేసి, వీళ్ళని ఆస్పత్రిలో చేరుస్తున్నారు. పిచ్చోళ్ళు హాయిగా సొసైటీ అంతా ఉన్నారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లమీద తిరుగుతున్నారు. వాళ్ళచేత పిచ్చోళ్ళుగా ముద్ర వెయ్యబదిన కొందరు పిచ్చోళ్ళు మాత్రం పిచ్చాసుపత్రిలో ఇన్ పేషంట్లుగా చేర్చబడ్డారు. పిచ్చి జనమూ పిచ్చి లోకమూనూ !

నా దృష్టిలో లోకంలోని జనమందరూ పిచ్చోళ్ళే. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన పిచ్చి. కొందరికి మొదట్లో ఉంటే, మరికొందరికి కొద్దిగా ముదిరితే, ఇంకొందరికి పూర్తిగా ముదిరింది. అంతే ! 

కొందరికి డబ్బుపిచ్చి. వారి బ్రతుకంతా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.వారికి మానవసంబంధాలు ఏమాత్రం పట్టవు. డబ్బు సంపాదించడం ఒక్కటే జీవితంలో సక్సెస్ కి కొలబద్ద అనుకుంటారు. ప్రతిదానినీ డబ్బుతోనే కొలుస్తారు. ఆ డబ్బును సంపాదించడంలో ఎంతో పాపఖర్మను మూట గట్టుకుంటారు.'డబ్బు డబ్బు' అని కలవరిస్తూనే వాళ్ళు కన్నుమూస్తారు. కానీ ఆ డబ్బు ఇక్కడే ఉంటుంది. వాళ్లు మాత్రం పోతారు. వాళ్ళ ఖర్మ మాత్రం వాళ్ళతో వెంటనంటి ఉంటుంది.

మరికొందరికి దురహంకారపు పిచ్చి. 'అంతా మాకే తెలుసు, అన్నీ మాకే తెలుసు, ఎదుటివారికి ఏమీ తెలియద'ని అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ప్రతిదానికీ ఎదుటివారికి పాఠాలు నేర్పబోతారు. 'అదలా చెయ్యాలి, ఇదిలా చెయ్యాలి. దాన్నలా చెయ్యకూడదు. దీన్నిలా చెయ్యకూడదు. అని నోరు తెరిస్తే చాలు అనవసరమైన పెద్దరికం తీసుకుని అందరికీ లెక్చర్లు ఇస్తూ ఉంటారు. వీరి అదృష్టం బాగుంటే తమకేమీ తెలియదని, అన్నీ తెలుసని అనుకుంటూ ఏమీ తెలియకుండా బ్రతికామని వారికి చివరిఘడియలలో తెలుస్తుంది. అంతదృష్టం లేకపోతే అదీ తెలియదు. ఈ లోపల జీవితమంతా వాళ్ళు చేసిన గోలతో పక్కవాళ్ళు నలిగిపోతారు.

మరికొందరికి ఐడెంటిటీ క్రైసిస్ పిచ్చి. నోరు తెరిస్తే బడాయిలు తప్ప ఇంకేమీ ఉండవు వీళ్దదగ్గర. ఇక ప్రతిదానికీ - 'మాకింత ఉంది. నేనింత చేశాను. ఇంత సంపాదించాను. ఇంతమందికి ఇంత చేశాను. నేనంత నేనింత' అని చెప్పుకుంటూ ఒక భ్రమపూరిత లోకంలో బ్రతుకుతూ ఉంటారు.

మరికొంతమందికి రెలిజియస్ పిచ్చి. నోరు తెరిస్తే రెలిజియస్ బడాయిలు. 'నేను గొప్ప భక్తుడిని, నేను పుట్టినప్పటినుంచీ అసలు తిండే తినలేదు. ఉపవాసాలే ఉంటున్నాను. నా జీవితమంతా పూజగదిలోనే గడిపాను. నేను జోలపాడకపోతే దేవుళ్ళు నిద్రే పోరు' ఇలాంటి బడాయిలు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు పుట్టకముందు కూడా దేవుడున్నాడనీ, తర్వాతా కూడా ఉంటాడనీ మర్చిపోతారు. వీళ్ళది కూడా ఐడెంటిటీ క్రైసిస్సే. అందులో ఇదొక షేడ్. అంతే.

మరికొంతమంది పూజలని, పునస్కారాలని నాలుగు మాయమాటలు, మంత్రాలు,  వచ్చీరాని జ్యోతిష్యాలు నేర్చుకుని జనాన్ని మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళ మాయరంగులు రెండు మూడు రోజులలోనే బయటపడుతూ ఉంటాయి.

కదిలిస్తే డిల్లీ రాజకీయాల నుంచి, పల్లెటూరి పంచాయితీల వరకూ అన్నీ మాకే తెలుసనీ ఇంకొందరు. వీళ్ళ బ్రతుకంతా 'మేము మేము' అని అరవడం లోను, 'వాళ్ళు అలాగ, వీళ్ళు ఇలాగ' అని తీర్పులు తీర్చడంలోనూ అయిపోతుంది. చివరికా దురహంకారపు మాయలో పడి జీవితాన్ని ఎంత కోల్పోయామో తెలియని స్థితిలో చనిపోతారు వీళ్ళు.

ఇంకొందరికి అభద్రతాభావం పిచ్చి. ఎప్పుడూ ఏదో ఒక భయంతో పీక్కుంటూ ఉంటారు. ఎవరో ఒకరు వీరికి ఆసరాగా అండగా ఉండాలి. కానీ వారిమీద మళ్ళీ ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. వాళ్ళని తొక్కి పెడతారు. మళ్ళీ వాళ్ళు లేకపోతే క్షణం కూడా శాంతిగా సుఖంగా బ్రతకలేరు. వీళ్ళ జీవితం కూడా  ఈ మాయలోనే గడిచిపోతుంది. వీరిది ద్వంద్వమనస్తత్వం.

దీనిలో ఇంకొక షేడ్ ఏంటంటే, ఒక మనిషి మన చేతిలోనుంచి జారిపోతున్నాడని లేదా జారిపోతోందని భయపడి తమ గుప్పిట్లోనే పెట్టుకోవాలని నానా రకాల ప్లాన్స్ వేయడం. ఈ క్రమంలో గోలగోల  చేయడం. ఎంత విచిత్రం? అంతిమంగా చూస్తే ఈ లోకంలో ఎవరికెవరు? ఇక్కడ మనమే శాశ్వతం కాదు. మళ్ళీ ఇంకొకరు మన గుప్పిట్లో లేరని మనం భయపడటం! ఫన్నీ గా లేదూ?  

మరికొందరికి అతితెలివిపిచ్చి. ఎత్తులతో జిత్తులతో అందరినీ బోల్తా కొట్టించగలమని అనుకుంటారు. వాళ్ళ ప్లాన్లకు ఎవరైనా పడిపోతారని అనుకుంటారు. అవసరం ఉన్నంతవరకూ నక్కవినయాలు నటిస్తారు. అవసరం తీరాక అసలు స్వరూపాలు బయటపెడతారు. ఈ క్రమంలో ఎదుటివారిని భలే మేనేజ్ చేసామని అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. కానీ చివరకు వాళ్ళే బొక్కబోర్లా పడ్డామన్న విషయాన్ని గ్రహిస్తారు. అదికూడా వాళ్ళ అదృష్టం బాగుంటే. లేకపోతే అదీ తెలియదు. అలాగే నక్కజిత్తులు వేసుకుంటూ, అదే పెద్ద తెలివి అనుకుంటూ బ్రతికి, చివరకు అలాగే పోతారు.

వెరసి వీళ్ళందరికీ స్వార్ధం పిచ్చి. 'ముందు నేను నాది. ఆ తర్వాతే ఇంకెవరైనా, చివరికి దేవుడైనా సరే' - అనే సిద్ధాంతం అందరిదీనూ. కానీ అది చాలా నీచమైన మనస్తత్వమన్న సంగతి వాళ్లకు చావుమంచం మీద కూడా తెలియదు.

ఈ విధంగా అహంకారం (సుపీరియారిటీ కాంప్లెక్స్), భయం (ఇంఫీరియారిటీ కాంప్లెక్స్), అభద్రతాభావం (ఫియర్ కాంప్లెక్స్), అతితెలివి (ఇంటలెక్చువల్  కాంప్లెక్స్), అతిస్వార్ధం (సెల్ఫిష్ కాంప్లెక్స్), మతపిచ్చి (రెలిజియస్ మానియా) - వీటి ఊబిలోనే మనిషి జీవితమంతా మునిగిపోతూ ఉంటుంది. ఇవే సర్వస్వమనీ ఇదే అంతా అనీ భావిస్తూ కోట్లాదిమంది బ్రతికేస్తూ ఉంటారు. చనిపోతూ ఉంటారు. కానీ ఎలా బ్రతకాలో ఎవరికీ ఏమాత్రమూ తెలియదు. వీళ్ళంతా జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ తెలుసుకోలేరు. మనిషి జీవితం ఎంత విలువైనదో దానిని ఎలా బ్రతకాలో వీళ్ళలో ఎవరికీ తెలియదు.

ఇవేవీ లేకుండా కూడా చక్కగా బ్రతకవచ్చు. ఆ బ్రతుకు చాలా హాయిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. అలా ఉంటే కోల్పోయేది ఏమీ ఉండదు. పోగొట్టుకునేదీ ఏమీ ఉండదు. హీనంగా బ్రతికేదీ ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించి ఈ భూమ్మీద పడేశాడో, ఖచ్చితంగా దానికి అనుగుణంగా బ్రతకవచ్చు. అదే అసలైన జీవితం. కానీ ఎవరూ అలా బ్రతకరు.

ప్రతివాళ్ళూ 'దేవుడు దేవుడు' అంటారు. ఏ మతం దేవుడు ఆ మతానికి ఉంటాడు. అందరూ దేవుడిని కొలుస్తారు. కానీ ఆ దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా మాత్రం బ్రతకరు. ఎలా వద్దని చెప్పాడో అలాగే ఉంటారు. మళ్ళీ అదే దేవుడిని కొలుస్తూ ఉంటారు. దేవుడు వద్దన్నదానిని చేస్తూ, మళ్ళీ ఆయన సహాయం కోసం ప్రార్ధిస్తారు. ప్రతి మతంలోనూ ఇదే తంతు !

నిజమైన గురువులు 'నువ్వెలా బ్రతకాలి?' అనేదే నేర్పిస్తారు. అది తప్ప మిగతా సోది చెప్పేవాడు నిజమైన గురువు కానేకాడు. పై కాంప్లెక్స్ లు ఏవీ లేకుండా బ్రతకడమే అసలైన జీవితం. కానీ వాళ్ళమాటలు ఎవరు వింటారు? ఎవరు అనుసరిస్తారు? ఎవరు ఆచరిస్తారు? ఎవరూ ఉండరు. చెప్పినా ఎవరూ వినరు.

చెత్త మనుషులు ! చెత్త లోకం !

ఈ ప్రపంచం ఇంతే ! ఈ మనుషులింతే ! ఎవరి కాంప్లెక్స్ లు వారివి. ఎవరి పిచ్చి వారిది. ఇవి నయమయ్యే పిచ్చులు కావు.  

ఏంటీ వింత? ఇంత వింతలోకం ఇంకెక్కడా ఉండదేమో?

అంతములేని ఈ భువనమంత ఒక పురాతన పిచ్చాస్పత్రి....

read more " అంతములేని ఈ భువనమంత ..... "

5, డిసెంబర్ 2020, శనివారం

డిసెంబర్ 24 న మహమ్మద్ రఫీకి నివాళిగా మా మ్యూజికల్ ప్రోగ్రామ్

డిసెంబర్ 24 మహమ్మద్ రఫీ పుట్టినరోజు. ఆయన 24-12-1924 న పుట్టాడు. బ్రతికుంటే ఆ రోజున 96 వ పుట్టినరోజు జరుపుకునేవాడు. ఈ మధురగాయకుని గుర్తు చేసుకుంటూ ఆ రోజున హిమశైల ఆర్ట్స్ బ్యానర్ క్రింద, హైదరాబాద్ లో మ్యూజికల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం !

రఫీ పాడిన సుమధురగీతాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో నుంచి 40 పాటలను పాడబోతున్నాం. వాటిల్లో సోలోస్, డ్యుయేట్స్ రెండూ ఉంటాయి. ప్రోగ్రామ్ మొత్తం లైవ్ టెలీకాస్ట్ అవుతుంది. లింకు మూడురోజుల ముందు ఇదే బ్లాగ్ లో ఇవ్వబడుతుంది.

కిషోర్ కుమార్ ప్రోగ్రామ్ లాగే దీనినీ చూచి ఆనందించండి మరి !

read more " డిసెంబర్ 24 న మహమ్మద్ రఫీకి నివాళిగా మా మ్యూజికల్ ప్రోగ్రామ్ "

3, డిసెంబర్ 2020, గురువారం

ఈ నెలంతా గడ్డుకాలమే ముఖ్యంగా 7 నుంచీ 16 వరకూ....

మకరరాశిలో గురుశనుల ప్రభావం వల్ల, గతకర్మ ప్రభావాన్ని మనుషులు బలంగా అనుభవిస్తారు. అది ఈ సమయంలో జరుగుతుంది. తప్పించుకోవడం చాలా కష్టం. ఈ ప్రభావం ప్రపంచంలో అందరి మీదా ఉన్నప్పటికీ, భారతదేశం మీద మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఈ నెల 7 నుంచి 16 లోపు ఈ కర్మ అనుభవింపబడుతుంది. ఆ సమయంలో ఈ క్రింది సంఘటనలు జరుగుతాయి. 

1.ప్రకృతి వైపరీత్యాలు, యాక్సిడెంట్లు, జనజీవనం కష్టాలపాలు కావడం.

2.ప్రముఖుల మరణాలు. వయసుమీరిన వారు, దీర్ఘరోగాలతో బాధపడుతున్న వారు గతించడం.

3.మతపరమైన సంఘటనలు జరగడం.

జాగ్రత్తపడండి మరి.

read more " ఈ నెలంతా గడ్డుకాలమే ముఖ్యంగా 7 నుంచీ 16 వరకూ.... "

1, డిసెంబర్ 2020, మంగళవారం

అఘటితఘటనా పటీయసీ మాయా ..

ఆదిశంకరాచార్యులవారు రచించిన 'మాయా పంచకం'
---------------------------------------------------------------------------

శ్లో ||  నిరుపమ నిత్య నిరంశకేఽప్యఖండే
మయి చితి సర్వవికల్పనాదిశూన్యే
ఘటయతి జగదీశజీవభేదం
త్వఘటితఘటనా పటీయసీ మాయా ||

నిరుపమము, నిత్యము, నిరంశకము, అఖండము, సర్వవికల్పనాదిశూన్యము అయిన నా చైతన్యములో, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అనే భేదములను సృష్టిస్తున్నది మాయ. ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు కదా !    

అద్వైతవేదాంత తత్త్వరీత్యా ఆత్మకు ఈ లక్షణములున్నాయి.

నిరుపమము - పోలిక లేనిది.
నిత్యము - ఎల్లప్పుడూ ఉండేది.
నిరంశకము - తనకు అంశలు లేనిది. 
అఖండము - తనలో ముక్కలు లేనిది
సర్వవికల్పనాదిశూన్యము - ఎటువంటి మార్పులకు లోనుకానిది.

ఇటువంటి ఆత్మలో కూడా ఈశ్వర - జీవ - జగత్తులనే త్రిభేదములను మాయ కల్పించి, అవి నిజములని మనల్ని భ్రమింపజేస్తున్నది. ఇక ఈ మాయ చేయలేని పని ఇంకేముంటుంది? విశ్వస్థాయిలోనే ఇంతటి ఘనకార్యం చేయగలిగిన మాయ, వ్యక్తిస్థాయిలో ఏం చేయలేదు? ఏమైనా చేయగలుగుతుంది. 

శ్లో ||  శ్రుతి శతనిగమాంత శోధకాన
ప్యహహ ధనాదినిదర్శనేన సద్యః
కలుషయతి చతుష్పదాద్యభిన్నా
నఘటితఘటనా పటీయసీ మాయా ||

ఆహా ! వేదములను నూరు నిగమాంతములను శోధించగలిగే సమర్ధులను కూడా, ధనము మొదలైన ఆశలు చూపించి, కలుషములతో నింపి, పశువులతో సమానులుగా మారుస్తున్నది కదా మాయ ! ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు కదా !    

వేదములు నాలుగు, ఉపనిషత్తులు 108 దాకా ఉన్నాయి. వీటన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి గొప్ప ఉపన్యాసములు చెప్పే మహాపండితులున్నారు. కానీ అంతటివారిని కూడా ధనాశతో నింపి, ఇంకా ఎన్నెన్నో ఆశలకు వారిని లోను చేసి, లొంగదీసుకుని, వారి మనస్సులను పాడుచేసి, వారిని పశువులతో సమానమైనవారుగా మార్చి పారేస్తుంది మాయ ! ఇక స్వతహాగానే పశువుల వంటి మామూలు మనుష్యులను ఇది ఇంకేం చేయలేదు? ఏమైనా చేయగలదు. 

శ్లో ||  సుఖ చిదఖండ విబోధమద్వితీయం
వియదనలాది వినిర్మితే నియోజ్య
భ్రమయతి భవసాగరే నితాంతం
త్వఘటితఘటనా పటీయసీ మాయా ||

సుఖస్వరూపము, చిద్రూపము, అఖండము, అద్వితీయము అయిన ఆత్మను ఆకాశము, వాయువు మొదలుగాగల పంచభూతముల వలలో పడవేసి, భవసాగరంలో త్రిప్పుతున్నది కదా మాయ ! ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు !

తనలో ఎటువంటి విభాగములు లేని, ఏకస్వరూపమై, సృష్టికి అతీతమై, సచ్చిదానందస్వరూపమైన ఆత్మను కూడా, సృష్టిలో పడవేసి, పంచభూతముల ఊబిలో దించి, ఈ లోకవ్యామోహమనే సముద్రంలో ముంచి తేలుస్తున్నది మాయ !

మాయ ముందు దివ్యాత్మకే దిక్కు లేకపోతే, ఇక మామూలు మనుషులెంత? దానిముందు వారెక్కడ నిలబడగలుగుతారు?  

శ్లో ||  అపగత గుణ వర్ణ జాతిభేదే
సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ
స్ఫుటయతి సుతదార గేహమోహం
త్వఘటితఘటనా పటీయసీ మాయా ||

గుణము, వర్ణము, జాతి మొదలైన భేదములు లేని సుఖస్వరూపము, చిద్రూపము అయిన ఆత్మలో 'నేను బ్రాహ్మణుడను' మొదలైన  అహంస్ఫురణలను కల్పించి, ఇంకా దానిలో భార్య, పుత్రులు, ఇల్లు మొదలైన మోహములను సృష్టిస్తున్నది కదా మాయ ! ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు కదా !    

సత్ - చిత్ - ఆనందస్వరూపమైన ఆత్మకు గుణములు లేవు. అది త్రిగుణాతీతము. దానికి రంగు లేదు. అది వర్ణాతీతము. దానికి పుట్టుకే లేదు. కనుక అది జాతికి అతీతము. కాని మాయాప్రభావమునకు లోనై, 'నేను ఫలానా' అని అది భావిస్తున్నది. పైగా, భార్యాబిడ్డలు, ఇళ్ళూవాకిళ్ళు మొదలైన మాయామోహములకు లోనైపోతున్నది. ఇంత చేయగలిగే మాయ, ఒక మామూలు మనిషిని ఇంకెంత ఊపగలదు? ఎక్కడికి తీసుకుపోగలదు? ఎంత పతనంలోకి నెట్టగలదు?
 
శ్లో ||  విధిహరిహర విభేదమప్యఖండే
బత విరచయ్య బుధానపి ప్రకామం
భ్రమయతి హరిహరభేదభావా
నఘటితఘటనా పటీయసీ మాయా ||

బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే భేదములు లేని అఖండాత్మలో హరి హరుడు మొదలైన భేదభావములను కల్పించి పండితులను కూడా భ్రమింపజేస్తున్నది కదా మాయ ! ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు కదా !

ఆత్మలో త్రిమూర్తిభేదం లేదు. వాటికి అతీతమైనదే ఆత్మ. కానీ అలాంటి ఆత్మలో కూడా విష్ణువని, శివుడని, ఇంకో దేవుడని నానారకములైన భ్రమలు కల్పింపజేసి, ఎన్నో గ్రంధములు చదివి పెద్ద పండితులమని విర్రవీగేవారిని కూడా బహుదేవతారాధనలోకి మళ్ళిస్తున్నది కదా మాయ ! ఇలాంటి మాయ చేయలేని పని ఈలోకంలో ఏముంటుంది?

ఈ అయిదుశ్లోకాలలో మాయకున్న అయిదుముఖాలను వివరించారు శంకరులు.

1. అఖండచైతన్యంలో ఈశ్వర, జీవ, జగత్తులనే త్రిపుటిని సృష్టించడం. ఇది మాయ చేసే ప్రాధమికమైన పని. అంటే మొదటి మెట్టు.
2. వేదవేదాంగములు చదువుకుని జ్ఞానులమని భావించే పండితులను కూడా పశువులుగా మార్చగలదు మాయ. ఇక మామూలు మనుషుల పని చెప్పనే అక్కర్లేదు. ఇది రెండో మెట్టు.
3. సృష్టికి అతీతమైన ఆత్మను సృష్టిలో భాగములైన పంచభూతములలో పడవేసి గిరగిరా త్రిప్పుతున్నది మాయ. ఇక సృష్టిలో భాగమైన మనుషులను ఇంకెలా ఆడిస్తుంది? ఇది మూడో మెట్టు.
4. మనిషికి జాతి, కులము, గుణము, ధనము, అందము, పదవి మొదలైన గర్వములను కల్పించి, కళ్ళు కనపడకుండా చేసి, భార్య, భర్త, పిల్లలు, నావాళ్ళు అనే భ్రమల్లో ముంచి ఆడించి పిచ్చివాడిని చేస్తున్నది మాయ. ఇది నాలుగో మెట్టు.
5. అన్నీ తానే అయిన బ్రహ్మములో నానా దేవతాభేదములను కల్పించి మనుషులకు పిచ్చిపుట్టిస్తున్నది మాయ. ఇది ఐదో మెట్టు.

మాయ తలచుకుంటే మనిషి ఎంత? వాడి బ్రతుకెంత?
ఈ రోజు వేటిని చూచుకుని విర్రవీగుతున్నాడో రేపు అవన్నీ ఉంటాయా?
ఉంటే, ఎన్నాళ్ళు ఉంటాయి?
అవి ఊడినపుడు మనిషికెవరు దిక్కు?
ఈనాడు ఉండి రేపు పోయేవాటిని చూసుకుని, ఎల్లప్పుడూ నీతో ఉండేదాన్ని వదులుకోవడం ఏం పని?
కానీ, చెబితే ఎవరు వింటారు?
శంకరులు ఈ మాట చెప్పి వెయ్యేళ్ళు దాటింది.
ఆయనకంటే ముందు, ఎన్నో వేల ఏళ్ళ నుంచీ ఇంకెందరో మహనీయులు చెబుతూనే ఉన్నారు.
కానీ ఎవరూ వినరు. వినలేరు. ఆచరించలేరు.
అలా జరిగితే ఇక మాయ ఎందుకు???

అఘటితఘటనా పటీయసీ మాయా ....
read more " అఘటితఘటనా పటీయసీ మాయా .. "