“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జూన్ 2011, బుధవారం

నిత్యజీవితంలో జ్యోతిశ్శాస్త్రం

మొన్న 27-6-2011 న ఒక పనిమీద విజయనగరం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని కలవవలసిన పని ఉంది. ఉదయం 9.30 కల్లా వాళ్ళ ఆఫీసుకు చేరి వెయిట్ చేస్తూ కూచున్నాము. ఆయనకు ఆ రోజున ఏదో పని ఉందనీ, లేటుగా వస్తారనీ, ఎప్పుడు వస్తారో తెలీదనీ  వాళ్ళ పీ.ఏ. చెప్పారు.

నాతొ వచ్చిన వారికి ఆదుర్దాగా ఉంది. పని చూసుకొని వెంటనే వెనక్కు తిరిగి వెళ్ళాలని వారి తాపత్రయం. తిరుగు ట్రెయిన్ మధ్యాన్నం మూడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఒకవేళ ఈయన మధ్యాన్నం వరకూ రాకపోతే మాకు తిరుగు ట్రెయిన్ దొరకదు. విజయనగరం నుంచి విశాఖపట్నానికి ఒక గంట ప్రయాణం ఉంటుంది. అప్పుడు రాత్రికి విశాఖపట్నం లో  ఉండి మర్నాడు ఉదయం బయలుదేరి వెళ్ళాలి. ఒకరోజు ప్రయాణంలో  వెస్ట్ అవుతుంది. ఈ రకమైన ఆలోచనలతో నాతొ వచ్చినవారు కొంత కంగారుగా ఉన్నారు. అప్పటికి 10.30 అయ్యింది.

సరే ఎలాగూ వెయిటింగ్ లో ఉన్నాం కదా, ఖాళీగా కూర్చోవడం ఎందుకు, జ్యోతిశ్శాస్త్ర సహాయం తీసుకొని మేము ఎదురు చూస్తున్న వ్యక్తీ ఎన్నింటికి ఆఫీసుకు వస్తారో చూద్దామని అనిపించింది. 

నా దగ్గర ఏ కంప్యూటర్ గాని, ఇతర మెటీరియల్ గాని, పెన్ను పేపర్ గాని లేదు. ఎడారిలో మనం ఉన్నా కూడా పనికొచ్చే జ్యోతిష్య కిటుకులు కొన్నున్నాయి. ఇలాటప్పుడు అవసరానికి పనికొచ్చే హోరా విధానాన్ని ఉపయోగించాను. లాంజ్ లో వెయిట్ చేస్తూ, కుర్చీలో వెనక్కువాలి, కళ్ళు మూసుకొని, మనసులో ఈ విధంగా లెక్కించాను.

ప్రస్తుతం గుంటూరులో అయితే సూర్యోదయం 5.42 కు అవుతున్నది. విజయనగరం తూర్పున ఉన్నది గనుక ఇంకా ముందుగా సూర్యోదయం జరుగుతుంది. గుంటూరుకు విజయనగరానికి మధ్యన దూరం దాదాపు 440 కిమీ ఉంటుంది. భూమి చుట్టుకొలత దాదాపు 40,000 కి.మీ. 

40,000 కి.మీ దూరం 24 గంటలలో భూమి ఒకసారి తిరుగుతుంది. అంటే 24x60=1440 నిముషాలు పడుతుంది. అదే 400 కి.మీలు 14.4 నిముషాలు పడుతుంది. అంటే దాదాపు 15 నిముషాలు పడుతుంది. 440 కి.మీలలో ఉన్న 40 కి.మీ కోసం ఇంకొక్క నిముషం వేసుకుని 16 నిముషాలు అనుకోవచ్చు. కనుక విజయనగరంలో ఆ రోజున 5.42-0.16= 5.26 కే సూర్యోదయం అయ్యి ఉండాలి. ఇది వాస్తవమే ఎందుకంటే ఉదయం 5.45 కి అక్కడ దిగినప్పుడే సూర్యోదయం అయ్యి ఉండటాన్ని గమనించాను. కనుక 5.26 నుంచి దైనందిన గ్రహహోరలు లెక్కించాలి. దాదాపు ప్రతి 28 కిమీ లకూ సూర్యోదయంలో ఒక నిముషం తేడా వస్తుంది. తూర్పుకు పోయేకొద్దీ ముందుగా సూర్యోదయం అవుతుంది. పశ్చిమానికి పోయేకొద్దీ ఆలస్యం అవుతుంది.

ఆ రోజు సోమవారం గనుక చంద్ర, శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ హోరలు వరుసగా నడుస్తాయి. 10.26 నుంచి శుక్ర హోర నడుస్తున్నది. ఆ రోజు భరణీ నక్షత్రం ఉన్నది. భరణికి అధిపతి శుక్రుడు. ఈ నక్షత్రం అంత మంచిది కాదు. ఈ నక్షత్రం పైన యముని యొక్క ప్రభావం ఉంటుంది. 

పైగా వెయిట్ చేస్తున్న మా ముగ్గురికీ భరణీ నక్షత్రం విపత్తార, నైధనతార, ప్రత్యక్తార అవుతుంది. కనుక ఈరోజు వచ్చిన పని జరుగక పోవచ్చు. కాని తిధి బహుళ ఏకాదశి గనుక ఆలస్యం మీద పని సఫలం కావాలి. కనుక  ఖచ్చితంగా శుక్ర హోరలో పని జరుగదు. శుక్ర హోర 11.26 వరకూ ఉన్నది. కనుక మేం వెయిట్ చేస్తున్న వ్యక్తి  ఆ తర్వాతే రావడం జరుగుతుంది. అప్పటినుంచీ వచ్చేది బుధ హోర కనుక, మేము వచ్చిన పని బుధుని యొక్క ఆధిపత్యం లోనికే వస్తుంది గనుకా, బుధ హోర మొదలు కావడం తోనే, అంటే, 11.26 తర్వాత ఆయన రావచ్చు.

ఇలా మనసులోనే గుణించుకొని, రేమేడీగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తూ  గమనిస్తున్నాను. నాతొ వచ్చిన వారికి కళ్ళు మూసుకొని నేనేమి చేస్తున్నానో తెలీలేదు. బహుశా ఏదో ధ్యానంలో ఉన్నానని అనుకున్నారు. గడియారం లో ముళ్ళు ముందుకు కదులుతున్నాయి. నాతొ వచ్చిన వాళ్ళు అసహనంగా కదులుతున్నారు. నేను ఏం జరుగుతుందో చూద్దామని గమనిస్తున్నాను. చివరికి 11.26 అయిపొయింది. కానీ ఏమీ జరుగలేదు.

సరిగ్గా 11.27 కి కారు వచ్చి ఆగడం, మేం వెయిట్ చేస్తున్న వ్యక్తీ వచ్చి చేంబర్ లోకి వెళ్ళడం టకటకా జరిగిపోయాయి. నాకు నవ్వొచ్చింది. ఎందుకు చిరునవ్వు నవ్వావని నాతొ వచ్చినవారు అడిగారు. నేనేమీ జవాబు చెప్పలేదు. సరిగ్గా 11.30 కి మమ్మల్నిచేంబర్ లోకి పిలవడం, 11.45 కి ఆయనతో మాట్లాడి, వచ్చిన పని పూర్తి చేసుకోవడం జరిగిపోయాయి. వెంటనే తిరుగు ప్రయాణం అయ్యి, సరైన సమయానికి విశాఖపట్నం చేరి, ట్రెయిన్ అందుకొని రాత్రికి గుంటూరు చేరడం జరిగిపోయింది.

మన జీవితం మీద అనుక్షణం గ్రహ ప్రభావం ఉంటుంది. గమనించేవారికి అది అర్ధమౌతుంది. గమనించే నేర్పు లేకపోతే అర్ధం కాదు.
read more " నిత్యజీవితంలో జ్యోతిశ్శాస్త్రం "

24, జూన్ 2011, శుక్రవారం

కవలల జాతకాలు -- పరిశీలన -- 2

జ్యోతిశ్శాస్త్రమనేది ఒక అద్భుతమైన శాస్త్రం. మానవ జీవితాన్ని సంపూర్తిగా చదవడానికి అది తోడ్పడుతుంది. అయితే ఎవరికిబడితే వారికి అది దక్కదు. అది బజారులో దొరికే వ్యాపార వస్తువు కాదు. జ్యోతిషం అంటే  మాయమాటలు చెప్పటమే అనుకుంటారు కొందరు. ఇది పొరపాటు అభిప్రాయం. అది ఉత్త గణితం మాత్రమే  అని చాలామంది అనుకుంటారు. ఇదీ పొరపాటు అభిప్రాయమే.

గణితం శరీరం వంటిది. స్ఫురణ ఆత్మ వంటిది. రెండూ కలిసినప్పుడే ఫలితం గోచరిస్తుంది. గణితానికి గట్టి పరిశ్రమ అవసరం. గణితమంటే ఉత్త లెక్కలే అని మాత్రమే అర్ధం కాదు. గ్రహ/రాశి/భావ స్వభావాలు, కారకత్వాలు, బలాబలాలు, ఇవేగాక యోగాలు, వివిధ దశలు, ముహూర్తం, ప్రశ్న, గోచారం, అష్టకవర్గు, మొదలైన అనేకములైన ఇతర సూత్రాలు అన్నీ దీనికిందకే   వస్తాయి.  వీటిని ఆకళింపు చేసుకోడానికి బహుగ్రంధ పరిశీలన అత్యంత ఆవశ్యం. ఆ తరువాత,  చదివిన దానిని సింధసైజ్ చేసుకుంటూ, నిత్యజీవితంతో సమన్వయం చేసుకుంటూ పరిశీలిస్తూ, గ్రహిస్తూ ఉండాలి. ఇక  స్ఫురణకో, ఉపాసనాపూర్వక మంత్ర బలం, దైవానుగ్రహం తప్పనిసరి. ఈ రెండూ అంత తేలికగా పట్టుబడేవి  కావు. దీనికి మంత్రసాధన అవసరం. సాధనకు నియమపూర్వక జీవితం అవసరం. ఇవిగాక మానవ మనస్తత్వాన్నీ, లోక వ్యవహారాన్నీ నిత్యమూ సూక్ష్మంగా పరిశీలించగల దృష్టి ఉండాలి. ఇవన్నీ ఆచరించినప్పుడే జ్యోతిశ్శాస్త్రం పట్టుబడుతుంది.

ప్రాచీన కాలంలో నిష్టా గరిష్టులూ, నియమ సంపన్నులూ, నిరాడంబర జీవనులూ, నిస్వార్ధ మనస్కులూ, ఉన్నతాదర్శ ప్రేరితులూ, మహనీయులూ, జ్యోతిర్విద్యా విశారదులైన మహర్షులూ  ఎందఱో ఉండేవారు. నేడు అటువంటివారు  అక్కడక్కడా మాత్రమె చాలా అరుదుగా కనిపిస్తున్నారు. కనుకనే నిజమైన జ్యోతిర్విద్య కూడా  అరుదుగా మాత్రమె నేడు కనిపిస్తుంది. అన్ని రంగాలలో ఉన్నట్లే దీనిలో కూడా మోసగాళ్ళు ఎక్కువనే విషయం మర్చిపోరాదు. నకిలీ లు ఉన్నంత మాత్రాన అసలు విద్యే తప్పు అనడం మూర్ఖత్వం అవుతుంది.

నేడు మనం పెద్ద సమస్యలుగా పరిగణిస్తున్న వాటిని ప్రాచీనులు పరిష్కరించినవారే. కాలక్రమేణా గ్రంధములూ, గురుశిష్య సంప్రదాయమూ కనుమరుగు కావడం వల్ల  ఈ విజ్ఞానం మరుగున పడింది. మనకు వస్తున్న సందేహాలు పూర్వకాలం లోని వారికీ కలిగేవి. వాటికి పరిష్కారాలకోసం వారూ ప్రయత్నించేవారు. ఈ కృషిలో భాగం గానే జ్యోతిష్యం స్థూలం నుంచి సూక్ష్మానికి పయనం సాగించింది. చివరికి జన్మ జన్మాన్తరాలను కూడా చూడగలిగే నాడీశాస్త్రంగా అవతరించింది.

లగ్నం శరీర భావాన్ని మాత్రమె సూచిస్తుంది.కవలల లగ్నాలు ఒకటిగానే ఉంటాయి. కనుకనే కవలల శరీరాలు చాలావరకూ ఒకటిగానే ఉంటాయి. ఇద్దరి లగ్నాలూ ఒకటే అనే విషయం అంతవరకే పనిచేస్తుంది. కాని వారి విభిన్న సూక్ష్మ సంస్కారాలను అది చూపలేదు. దానికి సూక్ష్మ పరిశీలన అవసరం. ఈ పనికి తోడ్పడేవే వర్గ చక్రాలు. 

లగ్నం దాదాపు రెండు గంటల కాలం ఉదయిస్తుంది. ఈ రెండుగంటల సమయంలో ఎంత మందైనా పుట్టవచ్చు. కనుక వ్యక్తిగత సూక్ష్మ పరిశీలనకు ఇది చాలదు. అందుకనే ప్రాచీనులు అనేక ప్రత్యేకలగ్నాలను లెక్కలోకి తీసుకున్నారు.నక్షత్ర లగ్నం దాదాపు ఒకరోజు ఉంటుంది. హోరాలగ్నం ఒక గంట వ్యవధి. ఘటీ లగ్నం 24 నిముషాల వ్యవధి వరకూ ఉంటుంది. అర్ధ ఘటీ లగ్నం 12 నిముషాల వ్యవధి. భాగలగ్నం నాలుగు నిముషాల వ్యవధిగా ఉంటుంది. నిమేష లగ్నం ఒక నిముష వ్యవధి. ఇంత కంటే సూక్ష్మ లగ్నాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూడాలనుకుంటున్న విషయాన్ని మైక్రోస్కోప్ లో చూడడానికి ఉపకరించే సాధనాలు.
"భాగ" అనేదాన్ని ఇంగ్లీషులో డిగ్రీ అన్నారు. ఇది దాదాపు నాలుగు నిముషాలు ఉదయిస్తుంది. మన గ్రంధాలలో "మృత్యుభాగలు" అనేవి ఉన్నాయని వివరించ బడ్డాయి. ఫలదీపిక, సారావళి, జాతకపారిజాతం, సర్వార్ధ చింతామణి, బృహత్ ప్రాజాపత్యం వంటి గ్రంధాలలో వీటి వివరణ ఉన్నది. అంటే ఇవి మారణశక్తి   కలిగిన Death inflicting degrees అన్నమాట. కొన్ని డిగ్రీల దగ్గరలో జననం జరిగినప్పుడు అది మృత్యు కారకమౌతుంది. ప్రస్తుత కవలల విషయంలో ఇవే ప్రధానపాత్ర పోషించాయి. ఆరోజున 11 .25 .02 కి కన్యా లగ్నంలో మృత్యు భాగలు ఉదయిస్తున్నాయి. ఇవి 11 .23 నుంచి 11 .28 వరకూ అయిదు నిముషాల వ్యవధిలో ఉదయించాయి.ఈ సమయంలో లగ్న డిగ్రీ త్రిమ్శంశ లో కూడా మృత్యు భాగల మీద ఉన్నది. కనుక ప్రస్తుతం జీవించి ఉన్న పాప దీనికంటే ముందుగా 11.22 నిముషాలకు, మృత్యుభాగలకు దూరంగా పుట్టి ఉండవచ్చు. రెండవ పాప 11.23 నుంచి 11.28 లోపు పుట్టి ఉండాలి. వీరిద్దరికీ మధ్యన రెండు లేదా మూడు నిముషాల కంటే దూరం లేదని అన్నారు. కనుక రెండవ పాప 11.23 లేదా 11.24 లేదా 11.25 నిముషాలకు జన్మించి ఉండాలి.  ఈ మూడు నిముషాల జాతకాలను జల్లెడ పట్టి ఎవరికి ప్రాణగండం ఉందొ, ఎవరికి లేదో నిర్ణయించాలి.

మరి ఆ సమయంలో జన్మించిన అందరికీ మృత్యువు వాటిల్లిందా అని అనుమానం సహజంగానే  వస్తుంది.ఈ విషయం నిర్ధారణగా తెలియాలంటే ఆ సమయానికి హాస్పిటల్స్ లోనూ, ఇళ్ళలోనూ పుట్టిన శిశువులలో ఎందరు జీవించి ఉన్నారో, ఎవరికి ఏమైందో గణాంకాలు సేకరించాలి. అటువంటి స్టాటిస్టికల్ స్టడీ వల్లనే ఈ విషయాలకు రుజువులు లభిస్తాయి. శిశ్నోదర పరాయణులైన ప్రస్తుత కలిప్రజలలో ఇటువంటి పనులకు పూనుకునే వారెందరున్నారు? విలాస జీవితాల మోజులో దిక్కు తెలీకుండా సంచరిస్తున్న నేటి జనానికి ఇటువంటి సబ్జెక్టులూ, రీసెర్చీ పిచ్చితనంగా కనిపిస్తాయి.

ఆ సంగతి అలా ఉంచితే, ఈ మూడు నిముషాలలోనూ పుట్టిన శిశువులలో ఎవరికి 21-10-2001 న గండం ఉన్నదో ముందుగా చూడాలి. దానిని బట్టి చనిపోయిన పాప జనన సమయాన్ని లెక్కించవచ్చు. మొదటగా, 11.23 కి జన్మించిన పాప వివరాలు చూద్దాం. 

 సిద్ధాంశ చక్రం వరకూ ఇద్దరి వర్గ చక్రాలలో పెద్ద మార్పులు లేవు. కనుక అక్కడ నుంచి పై చక్రాలను పరిశీలించాలి. 11.23 వరకూ సిద్ధాంశ లగ్నం కర్కాటకం గా ఉన్నది. చంద్రుడు రాశిచక్రం  లో లాభాదిపతిగా లగ్నంలో ఉంటూ  విద్యా లాభాన్ని సూచిస్తున్నాడు. విద్య ఉండాలంటే ఆయుస్సు ఉండాలి. కనుక ఈ రెండు నిముషాలలో పుట్టిన పాపకు ఆయుస్సు ఉంది. కాని 11.24 నుంచి 11.28 వరకూ మాత్రం సిద్ధాంశ చక్రంలో సింహ లగ్నం వచ్చింది. సూర్యుడు రాశి చక్రంలో రాహు గ్రస్తుడై ప్రమాదం ద్వారా విద్యా నాశనాన్ని సూచిస్తున్నాడు. కనుక ఈ సమయంలో పుట్టిన పాపకు విద్యా లేదు. కనుక ఆయుస్సూ లేదని ఊహించాలి. కాని అయిదు నిముషాల సమయం చాలా ఎక్కువ నిడివి కలిగినది. ఇది మన సమస్యను తీర్చలేదు. కనుక ఇంతకంటే పై స్తాయిదైన నక్షత్రాంశను చూద్దాం.


 నక్షత్రాంశ కుండలిలో 11.22 వరకూ కర్కాటక లగ్నం ఉన్నది. చంద్రునికి పైన ఇచ్చిన వివరణమే  దీనికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ చంద్రుడు లగ్నంలోనే, విద్యా కారకుడగు బుదునితో కలిసి ఉండటం చూడవచ్చు. కనుక ఈ పాపకు నక్షత్ర బలం బాగానే ఉంది. కాని 11.23 నుంచి ఈ లగ్నం సింహానికి మారుతున్నది. సింహ లగ్నంలో రోగ, మారక స్తానాదిపతిగా ఉన్న శని కొలువై ఉన్నాడు. యితడు ఈ లగ్నానికి బద్ధ శత్రువు కూడా. 11.27 వరకూ నక్షత్రాంశలో సింహ లగ్నమే నడిచింది. సిద్ధాంశ లో అయితే 11.28 వరకూ ఇదే లగ్నం ఉన్నది. అంటే నక్షత్రాంశ స్థాయిలో ఒక నిముషం ఎలిమినేట్ అయిపొయింది. అంటే చనిపోయిన పాప ఈ నాలుగు నిముషాల వ్యవధిలోనే పుట్టి ఉండాలి. కనుకనే ఈ పాపకు నక్షత్రబలం లేదు. సమయాన్ని ఇంకా నేరో డవున్ చెయ్యడం కోసం,  ఇంతకంటే పైదైన ఖవేదాంశను  చూద్దాం.

ఇందులో 11.24 వరకూ వృశ్చిక లగ్నం ఉన్నది. లగ్నాధిపతి అయిన  కుజుడు వక్రించి బలహీనుడుగా ఉన్నా, యోగకారకుడైన  గురువు భాగ్య స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉంటూ ఈ జాతకానికి బలాన్నిస్తున్నాడు. 11.25 కి మాత్రం లగ్నం ధనుస్సు గా మారుతున్నది. లగ్నాధిపతి గురువు అష్టమంలో ఉన్నాడు. అంతే గాక మిధునం నుంచి కుజ దృష్టి లగ్నం పైన ఉండి, ఊపిరితిత్తులకు, రక్తానికీ సంబంధించిన దుర్ఘటనను సూచిస్తున్నది. అంటే 11.22 నుంచి 11.24 లోపు మొదటి పాప జననమూ, ఆ తర్వాత రెండవ పాప జననమూ జరిగి ఉండాలి.  ఇప్పుడు జనన సమయం ఇంకొక రెండు నిముషాలు నేరో డవున్ అయ్యింది. మరింత మెరుగైన దృష్టి కోసం ఇంతకంటే పై స్తాయిదైన షష్ట్యంశ ను చూద్దాం.
 
ఇక్కడ చిక్కు ముడి పూర్తిగా విడిపోతున్నది. ఎలాగో కాస్త అర్ధం చేసుకుందాం. 11.22 కి షష్ట్యంశ స్థాయిలో తులా లగ్నం అయ్యింది. లగ్నంలో యోగకారకుడైన శని ఉచ్ఛ స్థితిలో ఉండి లగ్నాన్ని కాపాడుతున్నాడు. ఈ నిముషంలో పుట్టిన శిశువుకు గండం లేదు. కనుక మొదటి పాప ఈ సమయానికి పుట్టింది. 11.23 కి లగ్నం వృశ్చికం అవుతున్నది.కుజ గురులు ఇక్కడ ఉండటం వల్ల లగ్నానికి రక్షణ కలిగింది. 11.24 కి కూడా ఇదే లగ్నం నడిచింది. కాని 11.25 నిముషాలకు లగ్నం మారి ధనుర్లగ్నం అవుతుంది. శుక్ర కేతువులు ఇక్కడ ఉండటంవల్లా, రాహు కేతు ఇరుసు మిధునం నుంచి లగ్నాన్ని చేదించడం వల్లా, పాలకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, ఒక హటాత్ దుర్ఘటన జరుగుతుంది అని తెలుస్తున్నది. పాలు తాగుతూ అవి ఊపిరి తిత్తులలోకి పోవడం వల్లే ఈ పాప చనిపోయింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొదటి పాప 11.22 కి పుట్టింది. రెండవ పాప 11.25 కి పుట్టింది. షష్ట్యంశ స్థాయిలో టైం అనేది ఇంకా నేరో డవున్ అవడం వల్ల నిముష నిముషానికీ జాతకంలో తేడా స్ఫుటంగా కనిపించింది. అంటే ఒక లగ్నాన్ని అరవై భాగాలు చేసి సూక్ష్మంగా మైక్రోస్కోప్ లో పరిశీలించినట్లు పరిశీలిస్తే తప్ప జాతకం లో క్లారిటీ రాదని అర్ధం అవుతున్నది.

సిద్ధాంశ చక్రం ప్రకారం 11.22,11.23 నిముషాలలో మొదటి పాప పుట్టినట్లూ, 11.24 నుంచి 11.28 లోపు రెండవ పాప పుట్టినట్లూ కనిపిస్తున్నది. నక్షత్రాంశ ప్రకారం  11.22 కి మొదటి పాప, 11.23 నుంచి 11.27 లోపు రెండవ పాప పుట్టినట్లు సూచన వచ్చింది.ఖవేదాంశ ప్రకారం 11.22 నుంచి 11.24 వరకూ మొదటి పాప, ఆ తర్వాత రెండవ  అమ్మాయి పుట్టినట్లు తెలుస్తున్నది. షష్ట్యంశ కుండలి ప్రకారం  11.22 కి మొదటి అమ్మాయి, 11.25 నుంచి 11.26 వరకూ రెండో అమ్మాయి పుట్టినట్లు సూచించింది. ఇద్దరి మధ్యనా రెండు లేక మూడు నిముషాల కంటే తేడా ఉండరాదు. కనుక అన్నింటిలో కామన్ గా వచ్చిన ఫలితాన్ని చూడగా 11.22, 11.25 అనే టైం విండోస్ మిగులుతున్నాయి.

ఇంతకంటే ఇంకా సూక్ష్మ స్థాయికి వెళ్ళవచ్చు. కొన్ని జాతకాలలో షష్ట్యంశ స్థాయి కూడా సరిపోదు. అప్పుడు  లగ్నాన్ని 81,108,144,150,300,600 భాగాలు చేసి నాడీ అంశను రాబట్టి, దాన్ని మళ్ళీ పూర్వ - పర భాగాలుగా విభజించి, అందులో మళ్ళీ పంచ భూతాలనూ, పురుష స్త్రీ విభాగాలనూ చదవగలిగితే అది ఇంకా సూక్ష్మ విశేషాలను, జన్మ జన్మాంతర సుకృత దుష్క్రుతాలనూ, ఈ పాపకు  ఇటువంటి మరణం ఎందుకు కలిగింది? రెండవ పాప జాతక బలం ఎక్కడ ఉన్నది? వీటికి కారణాలేమిటి అన్న విషయాలను, అద్దంలో చూసినట్లు చూపగలదు.ఈ ప్రక్రియ జీన్ మాపింగ్ లాటిది. కాని అంత లోతుకు ప్రస్తుతం పోవడం అక్కర్లేదు. ఆ రహస్య వివరాలు అందరికీ అవసరం లేదు కూడా. అవి ఎవరికి అవసరమో వారికి మాత్రమే చెప్పడం జరుగుతుంది.

ఇప్పటికీ మన ఎనాలిసిస్ నిజమేనని మనం నమ్మరాదు. దీన్ని ఇంకా శల్య పరీక్షలకు గురి చేస్తేనే గాని నిజానిజాలు బయట పడవు. ఇప్పుడు మన ఎనాలిసిస్ నిజమో కాదో డబల్ చెక్ అప్ చెయ్యడం కోసం దశలను పరిశీలిద్దాం. పరాశర మహర్షిచే కొనియాడబడిన విమ్శోత్తరీ దశను తీసుకుందాం.

11.22 కి పుట్టిన పాపకు 21.10.2001 న ఉదయం ఆరుగంటలకు చంద్ర/గురు/రాహు/శని/శని దశ జరిగింది. ఇద్దరి జాతకాలలో ప్రాణదశ మాత్రమే మారుతున్నది. సూక్ష్మదశా, ప్రాణదశలలో యోగకారకుడూ, లగ్నంలో ఉన్నటువంటి  ఉచ్ఛశని కాపాడుతూ ఉండటం చూడవచ్చు. పైగా తులా లగ్నానికి రాహువు నవమ స్థానంలో ఉండి, ఈ లగ్నానికి మిత్రుడైన బుధున్ని సూచిస్తూ శుభాన్ని కలిగిస్తున్నాడు. శరీరాన్ని యోగ కారకుడైన శని కాపాడుతూ ఉన్నాడు. కనుక ఈ పాపకు ఏమీ కాలేదు.

11.25 కి పుట్టిన పాపకు అదే రోజున చంద్ర/గురు/రాహు/శని/రాహు దశ జరిగింది. మూడునిముషాలలో  ప్రాణదశ మాత్రం మారి, ప్రాణం రాహువు యొక్క పరిధిలోకి వచ్చింది. విదశానాధుడు కూడా అయిన రాహువుకు మరింత బలం చేకూరింది. రాహువు మారక స్థానమైన మిధునంలో ఉండటమూ, ధనుర్ లగ్నానికి ఇది బాధకస్థానం కూడా కావడమూ గమనించవచ్చు. పాలను సూచించే శుక్రుడూ, హటాత్ సంఘటనలకు కారకుడైన కేతువూ ధనుర్లగ్నం లో ఉండటమూ, ఊపిరితిత్తులకు సూచిక అయిన మిథునం నుంచి మారక శక్తి కలిగిన రాహువు యొక్క ప్రభావమూ ఇవన్నీ కలిసి ఆ సమయంలో ఆ విధంగా మరణాన్ని కలిగించాయి.   

11.22 కి మృత్యుభాగలు కొంచం దూరంగా ఉన్నాయి. జాతకంలో బలం ఉంది. కనుక ఈ అమ్మాయి బ్రతికింది. 11.25 కి మృత్యుభాగలు బాగా దగ్గరగా ఉన్నాయి. దానికితోడు జాతకంలో బలం లేదు.  కనుక ఈ అమ్మాయి చనిపోయింది. వెంటనే ఎందుకు చనిపోలేదు అని అనుమానం వస్తుంది. మృత్యుచ్చాయలో పుట్టినప్పటికీ కొంత ఆయుస్సు ఉండటం వల్ల మూడునెలలపాటు బ్రదికింది. అనువైన దశాకాలం రావడం తోనే ఆయుస్సు తీరింది. మృత్యువాతబడింది. ఈ ఆయుస్సును ఎలా లెక్కించాలి అన్నది ఇంకొక సబ్జెక్టు గనుక ప్రస్తుతానికి దానిని అలా ఉంచుదాం. 

ఒకే సమయంలో పుట్టినవారికి కూడా పూర్వ కర్మానుసారం ఇలా విభిన్నమైన కర్మఫలితాలు కలుగుతూ ఉంటాయి. వారి కర్మకు తగినట్లే ఆయా గ్రహసమయాలకు వారి జన్మలు కలుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలన్నింటి వెనుకా ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నదనీ, మన ఊహకు అందని ఒక అతీతమైన దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నదనీ, చీమ చిటుక్కుమనడం కూడా ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుందనీ,   మనకు అర్ధం కావడానికి జ్యోతిష్యం బాగా తోడ్పడుతుంది. మన అజ్ఞానం వల్ల, హ్రస్వదృష్టి వల్లా, తెలిసీ తెలీక మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్రాన్ని హేళన చేస్తూ ఉంటాము. ఋషిప్రోక్తమైన వేదవిజ్ఞానాన్ని  అలా ఎగతాళి చెయ్యడం చాలా పొరపాటు అన్న విషయం గ్రహించాలి.

కనుక ఈ విశ్లేషణ వల్ల, ప్రస్తుతం జీవించి ఉన్న పాప 11.22 కి పుట్టిందనీ, చనిపోయిన పాప 11.25 కి పుట్టిందనీ అర్ధం అవుతున్నది.  దీనికి ఇంకా రుజువులు కావాలంటే, ప్రస్తుత దశలు పరిశీలించి, జీవించి ఉన్న పాప యొక్క జీవితంతో పోల్చి చూచుకుంటే కరెక్ట్ గా సరిపోవడం కనిపిస్తుంది. ఈ ఎనాలిసిస్ కరెక్ట్ అనడానికి ఇదే రుజువు అవుతుంది. మొదట్లోనే చెప్పినట్లు, జ్యోతిష్యం అనేది మాయమాటలు చెప్పటం కాదు, దీని వెనుక సూక్ష్మ పరిశీలనా, డిడక్టివ్ మరియు ఇండక్టివ్ లాజిక్కూ, శాస్త్రజ్ఞానమూ, దైవబలమూ కలిసి మెలిసి ఉండాలన్న విషయం చెప్పడానికే ఇదంతా వివరించాను.  

ఇన్ని కోణాలలో సూక్ష్మంగా పరిశీలిస్తేగాని కవలల జాతకాల చిక్కుముడి విప్పడం సాధ్యంకాదు. సాంప్రదాయ జ్యోతిష్యం లోకూడా ఈ పని సాధ్యమే అని నా అంతర్వాణి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.
read more " కవలల జాతకాలు -- పరిశీలన -- 2 "

20, జూన్ 2011, సోమవారం

కవలల జాతకాలు - పరిశీలన

ఒకే సమయంలో పుట్టిన కవలల జీవితాలు విభిన్నంగా ఎందుకుంటాయి? ఈ ప్రశ్నను చాలా చోట్ల వింటుంటాము. 

ఈ ప్రశ్న జ్యోతిష్యాన్ని నమ్మేవారికీ వస్తుంది. నమ్మనివారికీ వస్తుంది. నమ్మేవారికి ఈ ప్రశ్న మరింత లోతైన రీసెర్చికి దారితీస్తుంది. సూక్ష్మ రహస్యాలను అర్ధం చేసుకోడానికి వారిని ప్రేరేపిస్తుంది. నమ్మనివారిని వితండవాదానికి పురికొల్పుతుంది. అలాటి వితండ వాదాలు చేసేవారిని చూచి విజ్ఞులు నవ్వుకొని ఊరుకుంటారు. వేదాంగమైన ఈ శాస్త్రం ఎవరికి బడితే వారికి అర్ధం కాదన్న సంగతి వారికి తెలుసు. జ్యోతిష్యశాస్త్రం వంటి విషయాలలో వాదన ద్వారా ఒకరిని నమ్మించవలసిన పని అస్సలు లేదని నా భావన. 

కంప్యూటర్ సైన్స్ నిజమేనని నన్ను ఎవరైనా నమ్మించండి చూద్దాం. నేను కంప్యూటర్ వాడుతున్నప్పటికీ దానివెనుక ఒక సైన్స్ ఉన్నది అని  నేను నమ్మను అని భీష్మించుకు కూచుంటే ఎవరూ నాచేత ఆ పని చేయించలేరు. దాన్ని అర్ధం చేసుకుందామన్న ప్రయత్నం లేనపుడు అది అర్ధం కాదు.

అలాగే ఉదయం లేచిన దగ్గరనుంచీ మనం వేసే ప్రతి అడుగూ గ్రహాదీనంలోనే ఉంటుంది. కాని అదెలా జరుగుతుంది అన్న రహస్యం మనకు తెలీదు. కనుక ఆ లింకులు మనకు కనిపించవు. అంత మాత్రం చేత జ్యోతిష్య విజ్ఞానమే తప్పు అనడం సరికాదు. నిజమో అబద్దమో నాకు తెలీదు, నాకు ఇంకా సరిగా అర్ధం కాలేదు అని చెప్పడం తార్కికం అవుతుంది.

కవలల జీవితాలకొస్తే -- సారూప్య కవలలు కూడా ఒకే క్షణంలో ఈ భూమ్మీదకు రారు. కనీసం ఒకటి రెండు నిముషాలు తేడా ఉంటుంది. సూక్ష్మ స్థాయిలో జాతకంలో మార్పులు రావడానికి అది చాలు. లగ్న సంధిలో గనుక జన్మ సమయం పడితే ఒక్కొక్కసారి ఒక నిముషం తేడాలో లగ్నం మారిపోతుంది. ఒకవేళ లగ్నం మారకపోయినా, నవాంశ నుంచి షష్ట్యంశ వరకూ ఉన్న వర్గ చక్రాల గతులు మారిపోతాయి. ఇక అంతకంటే పైవైన నవనవాంశ, నవద్వాదశాంశ, ద్వాదశద్వాదశాంశ, నాడీఅంశ మొదలైన అతి సూక్ష్మ చక్రాలు వేగంగా మారిపోతుంటాయి. వీటిని పరిశీలిస్తే కవలల జాతకాలు ఎందుకు భిన్నంగా ఉంటాయో తెలుస్తుంది.

సాంప్రదాయ జ్యోతిష్యం ఈ సమస్యను గూర్చి లోతుగా చర్చించింది. ఈ రకమైన సందేహాలు మనకే వస్తున్నాయనీ మనమే మహా తెలివైనవాళ్ళమనీ అనుకుంటే అంతకంటే పొరపాటు అనేది ఇంకోటి ఉండదు. ప్రాచీనులు ఈ కోణాలను ఎప్పుడో పరిశీలించారు. వాళ్లకు మనకంటే తెలివి తేటలు ఎక్కువగానే ఉండేవి. అంతే గాక మనకు లేని సూక్ష్మ పరిశీలనా, తపోబలమూ వారికి బాగానే ఉండేవి. కనుకనే ప్రకృతిలో నేటివారికి అర్ధం కాని రహస్యాలు వారికి కలతలామలకంగా మారేవి.

అటువంటి సూక్ష్మపరిశీలనలోనుంచి పుట్టినదే నాడీశాస్త్రం. రెండువేల సంవత్సరాల తర్వాత పుట్టబోయే వ్యక్తి యొక్క తల్లి దండ్రుల పేర్లనూ అతని సోదర సోదరీల పేర్లను, అతడు ఏ జన్మలో ఏం చేసాడు, దాని ఫలితంగా ఏమి అనుభవిస్తాడు అన్న విషయాన్ని  కూడా ఈ రోజే వ్రాసి పెట్టిన ఖచ్చితమైన ప్రజ్ఞ  దాని సొంతం.ఇదెలా సాధ్యమో నేటివారికి ఊహించడానికి కూడా శక్తి చాలదు. 

నాడీశాస్త్రాన్ని ప్రస్తుతానికి పక్కన ఉంచితే, సాంప్రదాయ జ్యోతిష్యం లోకూడా కవలల జన్మకు పరిష్కారం ఉన్నది అని నేను చెప్పగలను. ఈ మధ్యనే నేను పరిశీలించిన ఒక జాతకాన్ని ఉదాహరణగా చూద్దాం. తల్లిదండ్రుల వివరాలను కావాలనే గోప్యంగా ఉంచుతున్నాను.

28 -6 -2001 న ఉదయం 11 .30 ప్రాంతంలో నరసరావుపేటలో ఒక కవలల జన్మ జరిగింది. వీరిలో ఒకమ్మాయి మూడు నెలల  తర్వాత చనిపోయింది. రెండవ అమ్మాయి జీవించింది. ఎందుకిలా జరిగింది అన్నది మనకివ్వబడిన సమస్య. దీన్ని సాల్వ్ చెయ్యడానికి మనకున్న డేటా ఏమిటంటే -- 

1 . 21 -10 -2001 న ఈ ట్విన్స్ లోని ఒక పాప పాలు తాగుతూ ఊపిరి తిత్తుల్లోకి అవి పోవడం వల్ల చనిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది.   

2 . ఇద్దరికీ మధ్యన దాదాపు రెండు లేదా మూడు నిముషాల సమయం ఉండవచ్చు.  ఈ రెండు క్లూలతో మనం ఈ సమస్యను వర్క్ అవుట్ చెయ్యాలి. 

౩. ఇద్దరిదీ కన్యా లగ్నమే. ఇద్దరికీ ఒకే యోగాలు ఒకే దశలు జరుగుతాయి. అటువంటప్పుడు వీరి జీవితాలు ఎందుకని భిన్నంగా ఉన్నాయి? 

సాధారణంగా ఇటువంటి జాతకాల చిక్కు ముడి విప్పాలంటే, కృష్ణమూర్తి పద్ధతినో, లేక నాడీ జ్యోతిష్యాన్నో  ఆశ్రయించాలి.

కాని అలా చెయ్యడం నాకిష్టం లేదు. సాంప్రదాయ జ్యోతిష్యంలో కూడా దీనికి దారి ఉందని నా భావన. కనుకనే కేపీసిస్టం జోలికో, నాడీశాస్త్రం లోతుల్లోకో పోకుండా సాంప్రదాయ జ్యోతిష్యాన్ని ఉపయోగించి దీన్ని ఎలా సాల్వ్ చేసానో వచ్చే పోస్ట్ లో చూద్దాం. 
read more " కవలల జాతకాలు - పరిశీలన "

16, జూన్ 2011, గురువారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం తత్త్వం - 7

ఆరుభాగాలూ చదివినమీదట కొందరికి కొన్ని సందేహాలు రావచ్చు. ఇంతకీ ఈయన చెప్పాలనుకున్నదేమిటి? జిడ్డు ఒక గొప్ప మహాత్ముడనా? ఒక భ్రష్ట యోగి అనా? ఒక పరాజిత తాత్వికుడనా? ఒక విఫల జగద్గురువనా? ఒకటి చెబుతూ ఒకటి చేసిన మోసగాడనా ? లేక లోకాన్ని ఉద్దరించాలని తలచిన బోధిసత్వుడనా? గ్రూపులతో, సంస్థలతో విసిగిపోయిన చింతనాపరుడనా? అని రకరకాల సందేహాలు చదివినవారికి ముంచేత్తవచ్చు.  నేను ఏమి చెప్పాలని ప్రయత్నం చేసానో చదువరులకు వెంటనే అర్ధం కాక పోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క భాగమూ ఆయన జీవితంలోని ఒక్కొక్క కోణాన్ని, ఒక్కోసారి అనేక కోణాలను స్పృశించింది. ఆయాకోణాలు ఒకదానికొకటి  భిన్నంగా ఉండవచ్చు. అందుకే గజిబిజి గందరగోళం  తలెత్తవచ్చు. పైగా ఒక "మనీషి" జీవితం అంత తొందరగా అర్ధం కాదు. దానికి చాలా లోతైన పరిశీలన కావాలి. కనుక  ఈ భాగంలో నేను చెప్పాలని అనుకున్నదాన్ని క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను.

జిడ్డు పైన చెప్పిన అన్నీనూ. అంతే గాక వాటికి అతీతుడైన ఒక సత్యప్రేమికుడూ, తాత్వికుడూ, యోగీనూ. ఆయన తియోసఫీ ప్రభావానికి లోనై, దాని సాధనలు చేస్తున్నంత వరకూ మాయలో బ్రతికినవాడే. అనీబెసంట్ మొదలైనవారు తాము నమ్మినదే నిజమని, తమకు తెలిసినదే అంతిమం అనీ భ్రమించారు. ఆ దారిలో ఆయన్ను నడిపించారు. అక్కల్ట్ లోకం అంతా మాయ అనే విషయం ఆయనకు నిత్యానంద మరణం వరకూ తెలియలేదు. చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు తియోసఫీ గురువులు ఏది చెబితే అది చేసాడు. వారు నడవమన్న దారిలో నడిచాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. అది మంచో కాదో తనకు నప్పుతుందో నప్పదో ఆయనకు తెలీలేదు.  ఆ మాయ అనేది నిత్యానంద మరణంతో విడిపోయింది. అప్పటినుంచీ ఆయన తనంతట తాను తనదైన సాధనా మార్గంలో నడవటం మొదలు పెట్టాడు. ఏ మనిషైనా ఎప్పటికైనా చెయ్యవలసింది ఇదే.

బుద్దుడు కూడా ఇదే చేసాడు. సత్యాన్వేషణలో ఆయన కొందరు గురువుల వద్ద శిష్యరికం చేసాడు. కాని వారి బోధనలు ఈయన దాహాన్ని తీర్చలేకపోయాయి. అందుకే వారిని మర్యాద పూర్వకంగా వదిలి తన దారిలో పయనించాడు. తనదైన సాధనతో గమ్యం చేరాడు. అలాగే జిడ్డు కూడా చేసాడు. జిడ్డు బుద్ధుని మార్గమే అనుసరించాడు. జిడ్డు బుద్ధుని శిష్యుడే. అతను బౌద్ధ భిక్షువు కానక్కరలేదు. కాని బుద్ధ మార్గంలో నడిచినవాడే.   మైత్రేయ ఒక బోధిసత్వుడే. మైత్రేయను తనలోకి ఆహ్వానించి జిడ్డు కూడా ఒక బోధిసత్వుడయ్యాడు. ఆయన బుద్ధుని మీద రోజుల తరబడి ధ్యానం చేసేవాడని ఆయనే చాలా చోట్ల చెప్పాడు. 

నిత్యానంద మరణం తర్వాత దియసఫీ సాధన ఒదిలిపెట్టి,  తన సొంత సాధనలో తాను పురోగమించాడు. ఏమిటా సాధన అని చూస్తె, అది "జెన్" అని అర్ధమౌతుంది. జెన్ అంటే బౌద్ధ ధ్యానసాధన. దానికీ అద్వైత వేదాంత సాధనకూ పెద్ద తేడా లేదు. అద్వైతం (వేదాంత ధ్యానం) పాజిటివ్. జెన్(బౌద్ధ ధ్యానం) నెగటివ్. అంతే తేడా.  

అంతర్ముఖుడై తనను తాను  పరిశీలించుకుంటూ, తన లోలోపలికి తానే మునిగి సత్యాన్ని ముఖాముఖి అనుభూతి చెందటమే జెన్. ఇందులో పూజలు జపాలు ధ్యానాలు గుళ్ళూ గోపురాలూ గ్రంధాలూ ఏవీ ఉండవు. ఇది శుద్దమైన జ్ఞానమార్గ సాధన. అందరూ దీనిని చెయ్యలేరు. దీనికి కొన్ని అర్హతలు ఉండాలి. అటువంటివానికే ఇది సాధ్యమౌతుంది. తనకు తెలిసో తెలియకో జిడ్డు ఆ మార్గంలోకి ఆకర్షింప బడ్డాడు. ఆ మార్గంలో నడిచాడు. అదికూడా సహజంగా నడిచాడు. కనుకనే అద్భుతమైన అంతరిక కోణాలు లోకానికి ఇవ్వగలిగాడు. సహజంగా నడవటం అంటే ఏమిటి?

దెబ్బ తిన్నవానికి మందు పూస్తే గాయం నయమౌతుంది. కాని దెబ్బ తగలకుండా, తగిలినట్లు భావించుకుని మందు పూసుకుంటే అది ఉపయోగపడదు. ఆకలి వేసినవానికి తిండి పెడితే అతని ఆకలి తీరుతుంది. కాని ఆకలి వెయ్యకుండానే టైం అయిందనో, ఇంకోటనో అనుకుని తినడం మొదలు పెడితే అది కృత్రిమంగా ఉంటుంది. రోగానికి దారితీస్తుంది. లోకుల పరిస్తితి కూడా అలాగే ఉంది. 

నిజమైన తపన ఉన్నవాడు సాధన చేస్తే, అతనికి దారి కనిపిస్తుంది. ప్రకృతే అతన్ని నడిపిస్తుంది. కాని తపన లేకుండా, పక్కవాడు చేస్తున్నాడని ఫాన్సీ గా తానూ చెయ్యడం మొదలుపెడితే అది కృత్రిమ సాధన అవుతుంది. నేడు లోకంలో నూటికి తొంభై తొమ్మిది మంది కృత్రిమ సాధనలు చేస్తున్నవారే. ఎవరికీ నిజమైన దాహం లేదు, నిజమైన ఆకలి లేదు, నిజమైన తపన లేదు. అందుకే వాళ్ళ సాధనలూ, పూజలూ, ధ్యానాలూ ఏడిసినట్లే ఉంటున్నాయి. 

తనకు ఆకలివేస్తే తాను తినాలి గాని, ఎదుటివాడు తింటున్నాడని మనం తినరాదు. రోడ్డుమీద మనం డ్రైవ్ చేస్తున్నపుడు, ఎవడో మనల్ని దాటిపోతే, వాడి అవసరానికి వాడు పోతున్నాడని  మన స్పీడులో మనం పోవాలి గాని, వాణ్ని చూచి మనమూ అంతకంటే స్పీడుగా పోవాలని ప్రయత్నించరాదు. ఇదీ అలాటిదే. 

ఈ కారణంవల్లనే నేడు జనాలందరూ వేలంవెర్రిగా తీసుకుంటున్న యోగ దీక్షలూ, శక్తిపాతాలూ, గ్రూపు కోర్సులూ ఎందుకూ పనికిరావడం లేదు. కారణమేమంటే, ఇచ్చే గురువులకు శక్తీ లేదు, తీసుకునే శిష్యులకు తపనా లేదు. ఇద్దరి ఉద్దేశాలలోనూ స్వచ్చతలేదు.  యోగం అనేది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాదు. ఏదో ఒకటి ఆర్డరిచ్చి గబగబా తిని బయటపడటానికి. అది ఒక రహస్యలోకం. ఆ లోకంలో ప్రవేశించాలంటే కావాల్సింది డబ్బుచెల్లించడం కాదు. దానికి నిజమైన తపన ఉండాలి. గురువు నిజాయితీపరుడై తాను చెబుతున్నదాన్ని ముందుగా అనుభూతి పొందినవాడై ఉండాలి. అది లేకుండా ఎన్నెన్ని కోర్సులు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు.

జిడ్డు మొదటినుంచీ కృత్రిమ సాధన చేసాడు. ఆ సాధన వెనుక తపన లేదు. తపనను పుట్టించే సంఘటనలు అప్పటికి ఏవీ జరుగలేదు. కాని నిత్యానంద మరణం తర్వాత అది సహజ సాధనగా మారింది. బాధ నుంచి పుట్టినదే అసలైన సాధన అవుతుంది. అందుకే జీవితం సుఖంగా గడుస్తున్నవాళ్ళు ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడరు. ఒకవేళ ఆకర్షింపబడినా ముందుకు వెళ్ళలేరు. అందుకనే బాబాల భక్తులూ స్వామీజీల శిష్యులూ జీవితాంతం అలాగే ఎదుగూ బొదుగూ లేక ఉంటుంటారు. వాళ్ళలో జ్ఞానులైన వాళ్ళు ఎక్కడా కనిపించరు. జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకున్నవాడే నిజమైన మానవుడు. జిడ్డు జీవితంలో అది జరిగింది. కనుక అప్పటినుంచీ వేగంగా పురోగమించాడు. తర్వాత కూడా ఆయన కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. అంత మాత్రాన ఆయన జీవితం విలువలేనిది అయిపోదు. ఆయన చెప్పినది పనికిరానిది అవదు. 

ఈయనలో జెన్ కు తోడుగా కుండలినీ సాధన కూడా కలిసింది. అయితే అది ఆయన కావాలని చేసినది కాదు. జ్ఞాన మార్గ సాధనలో కుండలిని దానంతట అదే జాగృతమైంది. అది ఆయన బ్రెయిన్ స్ట్రక్చర్ లోనూ, నాడీమండలం లోనూ  మార్పులు తెచ్చింది. అందుకే ఆయన తలలోనూ వెన్నులోనూ అమితమైన నొప్పి కలుగుతూ ఉండేది. అదే సమయంలో అద్భుతమైన అనుభవాలూ కలిగేవి.

అయితే జిడ్డు చేసిన పొరపాటు ఒకటి ఉంది. తాను పొందిన జ్ఞానాన్ని అందరికీ చెప్పాలని ప్రయత్నం చేసాడు. అందరూ దీన్ని ఆచరించ గలరని అనుకున్నాడు. అది అసాధ్యం. అందుకే ఆయన బోధన ఎవరికీ ఎక్కలేదు. శంకరుల బోధన కూడా అంతే. విన్నంత సేపూ వేదాంతమూ జెన్ రెండూ చాలా బాగుంటాయి. కాని ఆచరణలోకి తేవాలంటే తాతలు దిగి వస్తారు. ఎక్కడో నూటికి కోటికి ఒకరో ఇద్దరో మాత్రమె వీటిని  సాధించగలరు. 

తన జీవితం చివరలో ఎవరో ఆయన్ను ఇదే అడిగారు. " మీరు చెప్పినది ఎవరికైనా అర్ధం అయ్యిందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయనిలా సమాధానం చెప్పాడు. "అలాటివాళ్ళు ఉన్నారని నేననుకోను. చాలా కొద్ది మంది ఉండొచ్చు. లేదా అసలు లేరేమో" అన్నాడు.

కాని ఆయన చేసినదాన్ని పొరపాటు అనవచ్చా? అనలేమేమో. ఎందుకంటే గమ్యాన్ని చేరిన ప్రతి మహానీయుడూ అదే చేస్తాడు. కొందరు అతిజాగ్రత్తగా పరిశీలించి శిష్యుల్ని ఎంచుకొని వారికి తన అనుభవాన్ని గుప్తంగా వినిపిస్తారు. కొందరు వారూ వీరనక అందరికీ వెదజల్లుతారు. అర్ధం అయినవాడికి అర్ధం అవుతుంది. లేనివాడికి లేదు. ఇద్దరూ కరెక్టే. ఈ దృష్టితో చూస్తె జిడ్డు చేసినదాన్ని పొరపాటు అనలేము అనిపిస్తుంది. బుద్ధుడు కూడా ఇదే చేసాడు. తాను పొందిన జ్ఞానాన్ని లోకానికి బోధిస్తూ ఆయన దాదాపు నలభై ఏళ్ళు దేశమంతా తిరిగి ప్రసంగాలు ఇస్తూనే గడిపాడు. ఎంతమందికి అర్ధమైంది అంటే ఏం చెప్పగలం? అర్ధమైనవాడికి అర్ధమౌతుంది. లేనివాడికి లేదు.

జిడ్డు మీద చేసే ముఖ్య ఆరోపణ, రోసలిన్ మొదలైన వారితో రహస్య సంబంధం కలిగి ఉన్నాడు అని. అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. ఆరోపణలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ అది నిజమే  అనుకున్నప్పటికీ, దాన్ని పెద్ద విషయంగా పరిగణించవలసిన పని లేదు. ఆధ్యాత్మిక జీవితం హైవే కాదు. ఒకే స్పీడులో మొదట్నుంచీ చివరిదాకా రయ్యిమంటూ దూసుకుపోవడానికి అది అమెరికా రోడ్డు కాదు. ఎగుడు దిగుడు బాట. ముళ్ళ బాట.  ఇండియా పల్లెటూరి బాట. దానిలో నడిచిన వాళ్లకు దాని లోతులు, గతుకులూ, ఎత్తుపల్లాలూ తెలుస్తాయి. దారిలో ఒకసారి కింద పడినంత మాత్రాన ప్రయాణం ఆగిపోదు. పడినవాడు మళ్ళీ లేచి నడుస్తాడు. ముందుకు వెళతాడు. గమ్యాన్ని చేరతాడు. Every saint has a past, every sinner a future అని ఊరకే అనలేదు. 

ఇంకొక కోణం చెప్తాను. దీన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. త్వరగా మింగుడు పడదు. ఇటువంటి ఉన్నత మైన సత్యాలు సామాన్య జనానికి ఎక్కవు.  ప్రపంచాన్ని, జీవితాన్ని ఒక్క జ్ఞాని మాత్రమె నిజంగా ఎంజాయ్ చెయ్యగలడు. ఎంజాయ్ చేసే అర్హత అతనికే ఉంటుంది. మామూలు మనిషికి లోకాన్ని ఎంజాయ్ చెయ్యటం తెలీదు. ఎంజాయ్ చేస్తున్నానని భ్రమ పడుతూ, జీవితం తన చేతిలోనుంచి జారి పోతున్నదని అనుక్షణం భయపడుతూ బతుకుతూ  ఉంటాడు అంతే. ఆ మాటకొస్తే ఒకరితో కాదు, వందలాదిమందిలో సంబంధాలు కలిగి ఉండే అర్హత ఒక్క జ్ఞానికే ఉంటుంది. వేలమందితో సంబంధం కలిగి ఉన్నాకూడా చలించని మనసు కలిగినవాడే అసలైన జ్ఞాని. ఈ కాన్సెప్ట్ అర్ధం చేసుకోవడం అతి కష్టం.  శ్రీకృష్ణుడే దీనికి ఉదాహరణ. ఆయన్ను మించిన విజ్ఞాని ఎవ్వరూ లేరు. కాని లోకానికి ఆయన సరిగా అర్ధం కాడు. కృష్ణ తత్త్వం లోకానికి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే దాన్ని అర్ధం చేసుకునే స్థాయి లోకానికి లేదు. బహుశా ఇంకొక వెయ్యి సంవత్సరాలకైనా ఆ స్థాయి వస్తుందో లేదో అనుమానమే. 

అంత మాత్రాన విచ్చల విడి తనాన్ని నేను సమర్ధిస్తున్నానని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. లోకంలో ఒక విచిత్ర నియమం ఉంది. ఒకదాన్ని మనం పొందటానికి నిజమైన అర్హత వచ్చిన వెంటనే దానిమీద మనకు ఆసక్తి లేకుండా పోతుంది. లోకంలో ఏదైనా సరే, అది మనకు లభించనంతవరకే దానిమీద మోజు ఉంటుంది. మనం వెతుకుతున్నది దొరికిన తర్వాత ఏమీ ఉండదు. ఓస్ ఇంతేనా అనిపిస్తుంది.  కాని అప్పుడే మనకు దానిమీద అధికారమూ అర్హతా కలుగుతాయి. ఆసక్తి లేనివాడికే అన్నీ ప్రాప్తిస్తాయి. బంగారం మీద ఏమాత్రం ఆసక్తి లేనివాడికే పరుసవేది విద్య లభిస్తుంది. ఈ రహస్య నియమాన్నే నేను చెబుతున్నాను. జ్ఞానికి దేనిపైనా ఆసక్తి ఉండదు కనుక అతనికి అన్నీ అందుబాటులోకి వస్తాయి. వాటివెనక మనం పరిగెత్తితే మాత్రం అవి దూరంగా పారిపోతుంటాయి. ఇదొక విచిత్ర నియమం. ఎవరి జీవితంలో వారు దీన్ని పరిశీలించి చూసుకోవచ్చు.

జిడ్డు జీవితంలో తప్పులు చేసి ఉండవచ్చు. రజనీష్ కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కాని ఆ తప్పులతోనే వారు ఆగిపోలేదు. అవే తప్పులు జీవితమంతా చేస్తూ ఉండిపోలేదు. వాటిని దాటి ఎంతో ముందుకు ఎదిగారు. ఆ ఎదుగుదల మనకు కనిపించదు. వారు చేసిన తప్పులే ( ఒకవేళ అవి నిజాలు అయితే) కనిపిస్తాయి. అందుకే వాళ్ళను మనం ఎప్పుడూ తప్పుగానే అర్ధం చేసుకుంటాం. అదే మనం చేసే పొరపాటని నేనంటాను. 

ఆధ్యాత్మిక లోకంలో వేసిన ఏ అడుగూ వృధా కాదు. అది ఇంకొక అడుగుకు పునాది అవుతుంది. మున్ముందుకు మనిషిని తీసుకెళుతుంది. జిడ్డు దియసఫీలో ఉన్నంతవరకూ చేసిన సాధన అంతా వృదాగానే గడిచింది.  కాని దాన్ని పునాదిగా చేసుకొని చేసిన తన సొంత సాధన మాత్రం ఆయనకు అంతరిక లోతులు చూపించింది. కనుకనే ఆయన జీవితాన్ని సాధనా పరంగా చూస్తె రెండు భాగాలుగా కనిపిస్తుంది. మొదటి భాగం పెద్ద గొప్పగా ఏమీ ఉండదు. రెండో భాగంలోకూడా కొన్ని ఎత్తు పల్లాలు కనిపిస్తాయి. అంత మాత్రాన ఆయన ఒక మోసగాడని చెప్పటానికి వీల్లేదు. ఆయన ఉన్నతుడే. అందులో అనుమానం లేదు.  

తన జీవితం చివరి చివరికి, ఒక జెన్ మాస్టర్ కు ఎటువంటి అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి ఆయనకూ కలిగిందని నా భావన. ఎందుకంటే ఆయన చివరికి చెప్పిన మాటలు ఆ భావననే కలిగిస్తాయి. There is nothing beyond this, this is the beginning and ending. This seems to be the ultimate state. అని ఆయన అన్నాడు. All the creation is most holy. అన్న అద్భుతమైన మాట కూడా ఆయన చెప్పాడు. ఆయన బోధన అంతా జెన్ తో నిండి ఉంది.  Truth is a pathless land అన్నప్పుడూ Meditation is choiceless awareness అన్న ప్పుడూ అదే జెన్ ఫ్లేవర్ అందులో కనిపిస్తుంది. 

మనిషి తన ఆలోచనలనూ, ఆకాంక్షలనూ, భయాలనూ, కోరికలనూ, ఊహలనూ, అనుభూతులనూ నిశితంగా, ఏ మాత్రం తొట్రు పడకుండా, రాజీ పడకుండా పరిశీలిస్తే మూలానికి దారి అదే కనిపిస్తుంది. ఆ మూలానికి చేరిన తరువాత సత్యం తానె స్వయంగా సాక్షాత్కరిస్తుంది. ఇదే అత్యుత్తమ సాధన. బుద్ధుని నుండి నేటి వరకూ అందరు జెన్ గురువులూ పాటించినదీ సాధించినదీ ఇదే. సమస్త సమస్యలకూ పరిష్కారం ఇందులోనే ఉంది. జిడ్డు కూడా బోధించినది ఇదే.   

కాని దానికి మంచి గట్టిదైన సత్యాన్వేషణ ఉండాలి. ఈ అన్వేషణలో ఏ ప్రలోభాలకూ లొంగని పట్టుదల ఉండాలి. లోకాన్ని కాకుండా తనను తానె అనుక్షణం విమర్శించుకోవాలి. తన అంతరంగాన్ని తానె పరిశీలించుకోవాలి. గమ్యం చేరేవరకూ నిరంతరం ఈ అన్వేషణ కొనసాగించాలి. ఈ అన్వేషణ తోనే మనిషి బుద్ధుడు కాగలుగుతాడు. అప్పుడే అతని జీవితం ధన్యత్వాన్ని సంతరించుకుంటుంది. అతడు తన ప్రయాణాన్ని ముగించగలుగుతాడు. మానవ జన్మ ఎత్తినందుకు చెయ్యవలసిన పనిని అతడు చెయ్యగలుగుతాడు.  

అటువంటి వారిలో ఒకడు జిడ్డు కృష్ణమూర్తి అని నా అభిప్రాయం. ఆయన గమ్యాన్ని చేరాడా లేదా అనేది ప్రశ్న కాదు. కాని లక్షల మందికంటే ఆయన ముందున్నాడు. పాత సారానే కొత్త సీసాలో పోసి చూపించాడు. ఎవరైనా కూడా చెయ్యగలిగేది ఇంతే. పాత వాటినే తన జీవితంలో అనుసరించి, ఆచరించి చూపించాలి. తద్వారా వాటికి మళ్ళీ నూతనత్వాన్ని ఇవ్వాలి. ఆ క్రమంలో అంతరిక జీవితంలో చేతనైనంత ముందుకెళ్లాలి.  

ఈ కోణంలో జిడ్డు జీవితాన్ని చూస్తె మనకు సరియైన అవగాహన వస్తుంది. మనం ఆయన్ను ప్రేమించాల్సిన పనీ లేదు, ద్వేశించాల్సిన పనీ లేదు. ఆయన చెప్పింది సరిగ్గా అర్ధం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టగలిగితే చాలు. ఏ మహానీయుడైనా కోరుకునేది ఇదే. ఎందుకంటే ఆ ఆచరణ మాత్రమె, వారందుకున్న శిఖరాలకు మనల్ని కూడా చేర్చగలదు. మిగిలిన చర్చలన్నీ ఉత్త వృధా మాటలేనని మనం మర్చిపోరాదు.  

ఏది ఏమైనప్పటికీ, 1929 లో తానిచ్చిన డిసొల్యూషన్ స్పీచ్ లో ఆయన చెప్పిన ఆఖరి మాట ఆలోచనాపరులను ఎప్పటికీ ఉత్తెజపరుస్తూనే ఉంటుంది. జిడ్డు యొక్క తాత్విక చింతనా, బోధనా, అంతా కూడా ఈ ఒక్క వాక్యంలో ఇమిడి ఉంది.

"My only concern is to set men absolutely, unconditionally free."    
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం తత్త్వం - 7 "

13, జూన్ 2011, సోమవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం-6

జిడ్డు జాతకంలో ఒక విచిత్రం ఉంది. రాహువు గురునక్షత్రంలో ఉన్నాడు. గురువు రాహు నక్షత్రంలో ఉన్నాడు. అంటే రాహు గురువులకు నక్షత్ర స్థాయిలో పరివర్తన ఏర్పడింది. ఇది ఒకరకమైన గురుచండాలయోగం. పైగా ఈయనకు నవాంశలో గురువు నీచస్తితిలో ఉన్నాడు. అందుకే ఈయనకు విదేశీ గురువులతోనూ, కలగూర గంప లాటి దియోసఫీ తోనూ పరిచయం ఏర్పడింది. ఆ గురువుల పర్యవేక్షణలో జరిగిన సాధనలో తీవ్ర ఆశా భంగం కలిగింది. తమ్ముడు నిత్యానంద మరణమే ఆ ఆశాభంగం.  

చిన్నప్పటి నుంచీ కృష్ణమూర్తీ, నిత్యానందా ఒకే ప్రాణంలా బతికేవారు. తన అన్నదమ్ములలో అందరిలోకీ తమ్ముడంటే కృష్ణమూర్తికి చాలా ప్రేమగా ఉండేది.  అనీబెసంట్ వీళ్ళిద్దరినీ దగ్గరకు తీసింది. యూరప్ లో చదివించింది. తనతో దేశదేశాలు తిప్పింది. అన్నాతమ్ముల మధ్యన చాలా గాఢమైన అనుబంధం ఉండేది. వరల్డ్ టీచర్ గా తన భవిష్యత్ జీవితంలో నిత్యానంద కూడా ముఖ్య భూమిక పోషిస్తాడని కృష్ణమూర్తి అనుకునేవాడు. అనీబెసంట్ మొదలైన తియసఫీ గురువులు కూడా అదే నమ్మబలికారు. అందుకే కృష్ణమూర్తికి నిత్యానంద మరణం మింగుడు పడలేదు.

1925 నవంబర్ లో నిత్యానంద టీబీ తో మరణించాడు. ఆ సమయంలో ఈయనకు గురు/గురు/రాహు దశ నడిచింది. గురువు త్రుతీయాదిపతిగా తమ్ముణ్ణి సూచిస్తూ రోగస్తానమూ, ఊపిరితిత్తులకు సూచికా అయిన మిధునం లో ఉన్నాడు. రాహువు ద్వితీయ మారక స్థానంలో ఉన్నాడు. ద్రేక్కాణచక్రంలో గురువూ రాహువూ కలిసి సోదర కారకుడైన కుజునితో లగ్నాత్ ద్వితీయ మారక స్థానమైన తులలో ఉన్నారు. మాస్టర్స్ కాపాడతారనీ, అతనికి ఏమీ కాదనీ అందరూ కృష్ణమూర్తిని నమ్మించారు. కాని నిత్యానంద మరణించాడని వీళ్ళకు టెలిగ్రాం ద్వారా తెలుస్తుంది. 

ఆ సమయంలో వీళ్ళంతా ఓడలో భారత దేశానికి వస్తుంటారు. నిత్యానంద మాత్రం అనారోగ్య కారణాల వల్ల "ఒజాయ్"  లో ఉంటాడు. అదే కృష్ణమూర్తి జీవితంలో పెద్ద మలుపు. ఓడ ప్రయాణం సాగిన దాదాపు పదిరోజులపాటు ఆయన తన కేబిన్ లో ఏడుస్తూ, తనలో తాను మధనపడుతూ, కలవరిస్తూ, ఆ షాక్ నుంచి తేరుకోడానికి ప్రయత్నిస్తూ గడిపాడు. ఆ సమయంలో ఏ గురువులూ ఆయనకు సహాయం రాలేదు. ఏ మాస్టర్ లూ ఆయన్ను ఓదార్చలేదు. ఎందుకిలా జరిగిందంటే ఎవరూ ఆయనకు సమాధానం ఇవ్వలేదు. 


అది ఒక మామూలు సంఘటన కాదు. చిన్న తనం నుంచి తాను నమ్ముతున్న నమ్మకాలకు గొడ్డలి పెట్టు. గురువులమీదా, మాస్టర్ ల మీదా ఆయన చిన్నతనంనుంచీ  పెంచుకున్న విశ్వాసానికి చావుదెబ్బ. ఆ దెబ్బతో ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. గురువులూ, మహాత్ములూ, సాధనలూ, ధ్యానాలూ, దర్శనాలూ, అన్నీ భ్రమలే అన్న జ్ఞానోదయం కలిగింది.  ఇవన్నీ మనసు చేసే మాయలనీ, ఈ మాయలను దాటి ఆవలికి చూడగలిగితే సత్యం తేటతెల్లంగా కనిపిస్తుందన్న సంగతి ఆయనకు బోధపడింది. 

అప్పటి నుంచి ఆయన సాధన కొత్త పుంతలు తొక్కింది. స్వచ్చమైన అంతర్ద్రుష్టితో తన అంతరంగాన్ని తానే  పరిశీలించుకోవడం మొదలుపెట్టాడు. కృతకమైన  సాధనలూ ధ్యానాలూ చెయ్యడం ఆపేశాడు. తద్వారా ఆయన గొప్ప అంతరిక స్తితులను అందుకున్నాడని చెప్పక తప్పదు. దియసఫీ గురువులు బోధించిన సాధన ఆయనకు ఏమీ దారి చూపలేదు. తనలో సహజంగా ఉన్న అంతర్ద్రుష్టీ, ఇప్పుడు తనలో కలిగిన విరక్తీ, అసలేం జరిగిందన్న ఆలోచనా, లోతైన పరిశీలనా శక్తీ ఇవన్నీ కలిసి ఆయనకు ఒక కొత్త సాధనా మార్గాన్ని చూపించాయి. ఆ మార్గమే ఆయనకు అద్భుత అనుభవాలను అందించింది. ఈమాటను ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన జీవితచరమాంకంలో "బ్రహ్మానుభూతి" ఆయనకు కలిగిందని మనకు  అర్ధమౌతుంది.   

3-8 -1929 న హాలెండ్ లోని ఆమెన్ లో జరిగిన దియోసఫీ మహాసభలో మాట్లాడుతూ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేసాడు. "ఆర్డర్ ఆఫ్ ది స్టార్"   సంస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పుడాయన జాతకంలో రాహు/శుక్ర/బుధ/రాహు/శుక్ర దశ జరిగింది. బుధుడు పంచమంలో ఉన్నాడు. శుక్రుడు పంచమాధిపతి గా శత్రుత్వానికి చిహ్నమైన ఆరో ఇంటిలో ఉన్నాడు. రాహువు శనిని (లగ్నాధిపతి) సూచిస్తున్నాడు. ఈ నిర్ణయం వెనుక కొంత విరక్తి కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. 

అప్పటికే ఎన్నో లుకలుకలతో నిండి ఉన్న థియోసాఫికల్ సొసైటీ కి ఇదే సరియైన మందు అని ఆయన తలచి ఉండవచ్చు. ఈ అక్కల్ట్ నాటకానికి ఇక తెర దించాలని ఆయన భావించి ఉండవచ్చు. కాని ఈ విషయం ఆయన చెబితే వినడానికి సంస్థలో  ఎవరూ సిద్ధంగా లేరు. ఎవరి అహంకారాలు వాళ్ళకున్నాయి. కనుక తానే తప్పుకుంటే మంచిదని ఆయన భావించి ఉండవచ్చు. 

పైగా, ఆధ్యాత్మిక సాధన అనేది గ్రూపుతో చేసేది కానే కాదు. అది ఎప్పటికీ వ్యక్తిగతమైనదే. ఒక గ్రూపులో మనం ఉండవచ్చు. కాని ఎవరి అంతరిక సాధన వారిదే. ఈ సృష్టిలో ప్రతి మనిషీ విభిన్నుడే. ఒకరికి ఇంకొకరితో పోలికే ఉండదు. కనుక సాధనా మార్గంలో కూడా ఎవరి దారి వారిదే. అంతరిక లోకంలో గుంపుగా నడవడం అనేది ఉండనే ఉండదు. కనుక తన దారి తాను పట్టక తప్పదని ఆయన అనుకుని ఉండవచ్చు. 

అప్పటికే సొసైటీ నాలుగైదు గ్రూపులుగా తయారై ఒక్కొక్కరు ఒక్కొక్క హిమాలయన్ మాస్టర్ తో అనుబంధం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, ఆధ్యాత్మిక గురువులుగా గుర్తింప బడాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇంకొందరైతే, కృష్ణమూర్తి ఫేయిలయ్యాడనీ, కనుక  మైత్రేయను తమలోకి రప్పించే ప్రయత్నాలు తామే చేస్తున్నామనీ చెప్పటం సాగించారు.   ఈ గ్రూపులను చూచి ఆయనకు చికాకు కలిగి ఉండవచ్చు. తాము అప్పటిదాకా నమ్ముతున్న అక్కల్ట్ విషయాలన్నీ భ్రమలని ఆయన నిత్యానంద మరణంతో ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. 

కానీ "ఆర్డర్ ఆఫ్ ద స్టార్" రద్దు అనే తన హటాత్ నిర్ణయంతో ఎందరితోనో శత్రుత్వాన్ని తెచ్చుకున్నాడు. తన గురువులకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించాడు. ఒక రకంగా చూస్తె ఇది దియోసఫికల్ సొసైటీకి తీవ్రమైన దెబ్బ. దాదాపు ముప్ఫై ఏళ్ల నుంచి, మైత్రేయను ఈ లోకానికి చెందిన ఒకనిలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, త్వరలో అవి సఫలం కాబోతున్నాయనీ అనీబెసంటూ లెడ్ బీటరూ ప్రపంచవ్యాప్తం గా ఉన్న తియోసఫీ సభ్యలకు చెబుతూ వచ్చారు. 

చివరికి, ముప్పై ఏళ్ల ఎదురుచూపు తర్వాత,  అన్నీ సక్రమంగా జరిగాయని, జగద్గురువు అవతార ప్రకటన చెయ్యబోతున్నాడనీ చెప్పి దేశ దేశాలనుండి సభ్యులని రప్పించి హాలెండ్ లోని "ఆమెన్" లో మహాసభ ఏర్పాటు చేసారు. కాని కృష్ణమూర్తి ఆ సభలో ప్రసంగిస్తూ ఇదంతా అబద్దమనీ, పగటికల అనీ కుండ బద్దలు కొట్టడమే కాక, తన సంస్థనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. దీన్నే "డిసోల్యూషణ్ స్పీచ్"  అంటారు. ఇది తప్పక చదవ వలసిన ఉపన్యాసం.దాన్ని ఇక్కడ చదవ వచ్చు. 


ధియోసఫీ గురువులకూ సభ్యులకూ ఇది ఒక శరాఘాతంలా తగిలింది. వారిలో చాలామంది సైకలాజికల్ షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ముప్పై ఏళ్ల నుంచీ అనీబెసంట్ మాటలు నమ్మి, ఎందఱో పాశ్చాత్యులు తమ ఆస్తుల్ని ఈ కార్యక్రమానికి వెచ్చించారు. అవతార పురుషుడు ఈ భూమ్మీదకు వస్తున్నపుడు దానికి తోడ్పడటానికి మించిన పని ఏముంది? అని భావించి ఎంతో మంది సంఘంలో ఉన్నత స్థితిలో నున్న కులీనులు తమ తమ స్తిరాస్తులను ధనాన్నీ సొసైటీకి అప్పగించారు. వారిలో చాలామంది ఈ షాక్ నుంచి కొన్నేళ్ళ పాటు తేరుకోలేకపోయారు. స్వయానా అనీబెసంట్ తీవ్రమైన షాక్ కు గురైంది. 

అప్పటినుంచీ ధియోసఫీ సభ్యులు ఈయన్ను వెలి వేశారు. అంతేగాక ఈయన్ను తీవ్రంగా ద్వేషించడం మొదలుపెట్టారు.  కాని ఎవరేమనుకున్నా సరే,  తాను నమ్మిన విషయాన్ని ధైర్యంగా చెప్పాడు. అబద్దాలు చెప్పి అవతారపురుషునిగా చెలామణీ కావడం కంటే సత్యాన్ని చెప్పి మామూలు జీవితం గడపడం మంచిది అనుకున్నాడు. ఆకోణంలో చూస్తె నేటి అబద్దపు గురువులకంటే జిడ్డు చాలాచాలా మంచివాడే, ఉన్నతుడే  అనిపిస్తుంది. ఒక అవతారంగా లోకం పూజించడానికి సిద్ధంగా ఉంటే, దాన్ని కాదని సామాన్యమానవునిగా బ్రతకడానికి, తనకున్న పేరునూ ఇమేజినీ ఒక్క ఉపన్యాసంతో తృణీకరించాడంటే   అది నిజంగా గొప్ప సత్యసంధత అని ఒప్పుకోవాలి. ఆ తర్వాత దాదాపు నలభై ఏళ్లవరకూ ఆయన తిరిగి అడయార్ లో అడుగు పెట్టలేదు.  

ఈనాడు టీవీలలో కనిపిస్తూ, తమకు అనుభవం లేని విషయాలను ఉపన్యాసాలుగా దంచుతూ, ఏడాదికోసారి అమెరికా వెళ్లి, ఉన్నవీ లేనివీ అబద్దాలు అక్కడివాళ్ళకు చెప్పి,  డాలర్లు పోగేసుకుంటున్న  కార్పోరేట్ నకిలీగురువులతో పోలిస్తే, ఉన్న విషయాన్ని ఉన్నట్లు తేటతెల్లంగా చెప్పిన జిడ్డు మహోన్నతుడే అని చెప్పక తప్పదు. 

1928 లో ఈయనకు రాహుదశ మొదలైంది. ఇక అక్కణ్ణించి 1940 వరకూ దేశదేశాలు తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తూ గడిపాడు. 1933 లో అనీబెసంట్ చనిపోయిన తర్వాత దాదాపు పదేళ్ళపాటు ఈయన ప్రపంచమంతా తిరిగాడు. 1939 -1944 రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఉపన్యాసాలు ఆపి ప్రశాంత జీవితం గడిపాడు. ఆయనకు 1932 లో రోసలిన్ తో మొదలైన ప్రేమాయణం 1950 దాకా నడిచిందని అంటారు. ఆ సమయంలో ఆయనకు రాహు/చంద్ర నుంచి శుక్ర/శని వరకూ దశలు జరిగాయి. రాహు చంద్రులిద్దరూ లగ్నాన్ని ఆవహించి ఉండడం చూడవచ్చు. ఇది ఒక గ్రహణం. కనుక ఆ సమయంలో ఆయనక్కూడా రోసలిన్ అనే గ్రహణం పట్టి ఉండవచ్చు.  అలాగే నవాంశలో శుక్రుడు పంచమంలో కుజ క్షేత్రంలో ఉండటమూ శని సప్తమంలో స్వక్షేత్రంలో ఉండటమూ చూడవచ్చు. కనుక ఈ గ్రహ స్థితులను బట్టి చూస్తె, ఈ ఎఫైర్ అనేది నిజమే కావచ్చు అనిపిస్తున్నది.

1961 - 67 మధ్య నడిచిన సూర్య దశ ఆయనకు కొన్ని గొప్ప అనుభవాలను అందించి ఉండవచ్చు. ఎందుకంటే సూర్యుని ఉచ్చస్థితి ఆయనకు ఆధ్యాత్మికంగా ఉన్నత అనుభవాలను ఇచ్చి ఉంటుంది. ఆ సమయంలో తన ఆలోచనలనూ అనుభవాలనూ ఎప్పటి కప్పుడు వ్రాసిపెట్టుకునేవాడు. అలా ఆయన వ్రాసిన "నోట్ బుక్" అనే పుస్తకం ఇప్పటికీ చదివిన వారిని గొప్పగా  ఉత్తేజితుల్ని చేస్తుంది. అందులో ఆయన తన అంతరిక అనుభవాలను కొన్నింటిని వ్రాసుకున్నాడు. అలా వ్రాయమని తన మిత్రుడైన ఆల్డస్ హక్స్లె ఆయనకు చెప్పాడు.

1980 లో చంద్ర/సూర్య దశ ఆయన జాతకంలో జరిగింది. ద్వాదశ చంద్రుడు, అక్కణ్ణించి పంచమంలో ఉచ్ఛసూర్యుని వల్ల, సహజం గానే ఈ దశ ఆయనకు ఒక ఉన్నత అంతరిక అనుభవాన్ని ఇచ్చి ఉండాలి. అలాగే జరిగింది కూడా. ఆ సమయంలో ఆయన భారత దేశంలోనే రిషి వాలీ లో ఉన్నాడు. అప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని గురించి ఆయన ఇలా వ్రాసాడు. ఇందులో తనను తాను "కే" అని సంబోధించుకున్నాడు. 

"K went from Brockwood to India on November 1, 1979 (actually October 31). He went after a few days in Madras staright to Rishi Valley. For a long time he has been awakening in the middle of the night with that peculiar meditation which as been pursuing him for very many years. This has been a normal thing in his life. It is not a conscious, deliberate pursuit of mediation or an unconscious desire to achieve something. It is very clearly uninvited and unsought. He has been adroitly watchful of though making a memory of these meditations. And so each meditation has a quality of something new and fresh in it. There is a sense of accumulating drive, unsought and uninvited. Sometimes it is so intense that there is pain in the head, sometimes a sense of vast emptiness with fathomless energy. Sometimes he wakes up with laughter and measureless joy. These peculiar mediations, which naturally were unpremediated, grew with intensity. Only on the days he travelled or arrived late of an evening would they stop; or when he had to wake early and travel. 

With the arrival in Rishi Valley in the middle of November 1979 the momentum increased and one night in the strange stillness of that part of the world, with the silence undisturbed by the hoot of owls, he woke up to find something totally different and new. The movement had reached the source of all energy. This must in no way be confused with, or even thought of, as god or the highest principle, the Brahman, which are projections of the human mind out of fear and longing, the unyielding desire for total security. It is none of those things. Desire cannot possibly reach it, words cannot fathom it nor can the string of thought wind itself around it. One may ask with what assurance do you state that it is the source of all energy? One can only reply with complete humility that it is so.

All the time that K was in India until the end of January 1980 every night he would wake up with this sense of the absolute. It is not a state, a thing that is static, fixed, immovable. The whole universe is in it, measureless to man. When he returned to Ojai in February 1980, after the body had somewhat rested, there was the perception that there was nothing beyond this. This is the ultimate, the beginning and the ending and the absolute. There is only a sense of incredible vastness and immense beauty."     


1981 , 1982 లలో  శరీరాన్ని ఒదిలి వెళ్లిపోవాలనే  ఆకాంక్ష ఈయనలో బలంగా ఉండేది. ఒక అనారోగ్య సమయంలో ట్రాన్స్ లో ఉన్నప్పుడు మరణం అనే డోర్ కనిపిస్తున్నదనీ, ఏ క్షణమైనా తాను దానిలోకి వెళ్లిపోవచ్చనీ  చెప్పేవాడు. కాని తాను చెయ్యవలసిన పని ఇంకా ఉందని కొన్నాళ్ళు ఆగుతాననీ అన్నాడు.     

చివరికి 1986 లో ఈయనకు పాంక్రియాస్ కాన్సర్ అని తేల్చారు. అప్పుడు ఆయనకు కుజ/గురు/గురు/గురు దశ జరిగింది. కుజ గురువులిద్దరూ రోగస్తానంలో ఉండటం చూడవచ్చు. శుక్రుడు పొత్తికడుపును సూచిస్తాడు. కాన్సర్ ను సూచించే అనేక కాంబినేషన్స్ లో ఇదీ ఒకటి.  చివరికి ఫిబ్రవరి 17 , 1986   న కుజ/రాహు/శుక్ర/గురు/రాహు దశలో నిద్రలో ప్రశాంతంగా కన్నుమూశాడు.   

కుజ శుక్ర గురులు రోగ స్థానంలో ఉండటమూ, రాహువు మారక స్థానంలో ఉండటమూ క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఆయన్ను మరణం వరించింది. మహనీయులు కూడా గ్రహ ప్రభావానికి అతీతులు ఏమీ కారనే విషయానికి ఇదొక రుజువు.

అయితే, జిడ్డు మరణవార్తను పత్రికలు పెద్దగా పట్టించుకోలేదు.  ఒక మూలకు ఆ వార్తను ప్రచురించాయి. లోకానికి అద్భుతమైన బోధను అందించిన అటువంటి విలువైన  వ్యక్తి మరణిస్తే లోకం ఆయనకు ఇచ్చే విలువ ఇదా ?  అంటూ  ఒక్క రజనీష్ మాత్రం తన ఆవేదనను వ్యక్తం చేసాడు.  

జిడ్డు తత్వాన్ని వచ్చే పోస్ట్ లో చూద్దాం.
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం-6 "

11, జూన్ 2011, శనివారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం, తత్త్వం --5

జిడ్డు జాతకంలో ఆధ్యాత్మిక సాధనా పరంగా ముఖ్య పాత్ర వహించినది బుధుడని ముందే అనుకున్నాం. జ్యోతిష్య జ్ఞానం ఉన్న వారికి బుధుని యొక్క లక్షణాలు తెలుసు. బుధుడు తటస్థగ్రహం. మంచివారితో ఉంటె మంచివాడుగానూ, చెడ్డవారితో ఉంటె చెడ్డగానూ మారిపోతాడు. మనిషి లోని బుద్ధికి ఇతడే కారకుడు. కనుకనే మనిషి బుద్దికూడా అతని స్నేహితాన్ని బట్టి,  సహవాసాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ బుధుని యొక్క స్థితిని కొంచం అవగాహన చేసుకోవాలి. ఇతను ఒక గ్లాసులోని నీళ్ళ వంటివాడు. దానిలో ఏ రంగు చేరితే ఆ రంగులోనే నీరుకూడా కనిపిస్తుంది. అంటే తాను పక్కకు తప్పుకొని ఇంకొక వ్యక్తిత్వాన్ని తన స్థానంలోనికి బుధుడు ఆహ్వానించగలడు. ఇది ఒక ఆత్మను తనమీదకి ఆహ్వానించుకోవడం లాటిది. కృష్ణమూర్తి విషయంలో జరిగింది అదే. 

 "మైత్రేయ" ను తనలోకి ఆహ్వానించాలి. అన్న ఏకసూత్ర గమ్యం మీదే ఆయన సాధన అంతా మొదట్నుంచీ సాగింది. కాలక్రమేణా తనను తాను ఆ పనికి సిద్ధం చేసుకుంటూ ఆయన వేచి చూచాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. సాంప్రదాయ ఆధ్యాత్మిక సాధనలో అయితే -- తాను మారుతూ తన ఆశయస్థాయికి ఎదగడం ద్వారా ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి అవసరమైన ప్రక్షాళన అంతా ఈ లోపల జరిగిపోతుంది.ఈ క్రమంలో, తనను తాను మార్చుకోవటం జరుగుతుంది. అట్టి ప్రయత్నంలో సాధకుని వ్యక్తిత్వంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. మురికీ, మకెలా అన్నీ వదిలిపోతాయి.

కాని కృష్ణమూర్తి విషయంలో అది జరుగలేదు. తన సీటును తాత్కాలికంగా ఖాళీ చేసి కాసేపు ఆ ప్రదేశంలో  ఇంకొకరిని కూర్చోబెట్టినట్లుగా, తన శరీరంలోనుంచి తాను బయటకి పోయి, ఆ స్థానంలోకి, మైత్రేయను ఆహ్వానించడం ఆయన అభ్యాసం చేసినట్లు కనిపిస్తుంది. అందుకనే ఆయన వ్యక్తిత్వంలో మౌలికమైన మార్పులు ఏమీ రాలేదు. చివరికి తాను తానుగానే ఉండిపోయాడు.

కాలిఫోర్నియాలోని "ఒజాయ్"  లో ఈయన శరీరంలో "ప్రాసెస్" అనబడే ప్రక్రియ జరిగినప్పుడు గమనించిన ఇతని స్నేహితురాలు రోసలిన్ కూడా ఎవరో ఇద్దరు ఆత్మలు వచ్చి ఈయన ఆత్మను బయటికి తీసుకుపోతున్నారని చెబుతుంది. ఆ తరువాత మైత్రేయ ఈయన్ను ఆవహించేవాడు. ఆ సమయంలో అక్కడి వాతావరణం అద్భుతంగా మారేది. పక్కన ఉన్నవాళ్ళ మనస్సులు బాగా ఎలివేట్ అయ్యేవి. 

అలాగే, ఉపన్యాసం ఇచ్చిన కొద్దిసేపు మాత్రం మైత్రేయ ఆయనలోకి వచ్చేవాడు. ఆ సమయంలో అంతా అద్భుతమైన ప్రసంగం నడిచేది. వినేవాళ్ళు మంత్ర ముగ్దులయ్యేవాళ్ళు. మిగతా సమయంలో "మైత్రేయ" వెళ్ళిపోయేవాడు. అప్పుడు తన శరీరంలో తనే ఉండేవాడు. తనలో మార్పుకోసం ఏ ప్రయత్నమూ, సాధనా లేదు కాబట్టి,  తనలోని కామమూ, కోపమూ, భయమూ, విసుగూ, చికాకూ, మొండి తనమూ, ఇతరులని ఎగతాళి చెయ్యటమూ అన్నీ తనలోనే ఉండేవి. అందుకే రోసలిన్ తో రాసలీల నడుపగలిగాడు. ఆమెకు రెండుమూడు అబార్షన్లు అయ్యాయి. ఆయనకు ఈమెకాక ఇంకా ఒకరిద్దరితో ప్రేమలూ, రహస్య సంబంధాలూ ఉన్నాయని అంటారు. సమయానుకూలంగా అబద్దాలు బాగానే చెప్పేవాడు. మామూలు మనుషుల్లాగే భయానికి లోనయ్యేవాడు. తన స్నేహితుడూ, సహాయకుడూ, రోసలిన్ భర్తా అయిన రాజగోపాల్ తో గొడవ పడ్డాడు. అతనితో కోర్టుకేసులు, ఆస్తి తగాదాలూ అన్నీ నడిచాయి. 

తన ఉపన్యాసాలలో మొదటి వరుసలో రజనీష్ శిష్యులు కూచుంటే ఆయనకు మహా చిరాకు కలిగేది. వాళ్ళను లేచి వెనుక వరసల్లోకి పొమ్మనేవాడు. మొండితనం కూడా ఈయనలో బాగానే ఉండేది. ఎదుటివాళ్ళను ఎగతాళి చేసేవాడు. నేనే ప్రపంచ గురువునన్న భావన ఆయనలో గట్టిగా ఉండేది. వెరసి ఒక మామూలు మనిషికుండే బలహీనతలు అన్నీ ఈయనకూ ఉండేవి. అంటే ఇదంతా ఒక పూనకం లాటి వ్యవహారం అని చివరకు అర్ధమౌతుంది. పూనకం వచ్చిన కాసేపు ఆ వ్యక్తిలో అంతా బాగుంటుంది. తర్వాత తనూ అందరిలాటి మామూలు మనిషే. 

పల్లెటూళ్ళలో పూనకం తెచ్చుకునే వారు ఉంటారు. వాళ్ళు ఒకరకమైన హిస్టీరికల్ స్తితిలో తమను తాము ప్రవేశపెట్టుకోగలరు. ఆ సమయంలో వారిలోని అంతచ్చేతన బయటకి వస్తుంది. అంతరాన్తరాలలోని ఆవేశాలూ,  ఆకాంక్షలూ, కోరికలూ విపరీత ప్రవర్తనలూ ఉబికి మనస్సు ఉపరితలానికి వస్తాయి. ఇంకొందరిలో నిజంగానే కొన్ని ఆత్మలు ప్రవేశిస్తాయి. కొన్ని సార్లు గ్రామదేవతలు ప్రవేశిస్తాయి. ఎవరు వారిలోకి వస్తారన్నది వారి వారి సాధన మీదా వారిచ్చే ఆహ్వానం మీదా, వారి శరీరపు పవిత్రతా స్థితి మీదా  ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ సమయంలో వాళ్ళ ముఖకవళికలు మారిపోతాయి. వారి మాటతీరు మారిపోతుంది. ప్రవర్తన విపరీతంగా మారుతుంది. చూచే వారికి ఇదంతా నటనగా అనిపిస్తుంది. వాళ్ళలో కొందరు మోసగాళ్ళు ఉండవచ్చు. చాలా భాగం అది నటనే కావచ్చు కూడా. కాని నిజమైన పూనకం అనేది కూడా నిజమే.

ఆవాహన అనేది కూడా నిజమే. భూ వాతావరణంలో అఘోరిస్తూ తిరుగుతున్న  ఆత్మలను తన శరీరంలోకి ఆవాహన చేసుకోవడం, వాటిని మాట్లాడించి, వివరాలు రాబట్టడం అనే విద్య నిజమైనదే. ఈ విధమైన సెన్సిటివిటీ కొందరిలో సహజంగా ఉంటుంది. కొందరు దీన్ని సాధనద్వారా పెంచుకుంటారు.  పాతకాలంలో మంత్రగాళ్ళు ఈ పని చెయ్యగలిగేవాళ్ళు. పాశ్చాత్య దేశాలలో "షమానిజం" అనే తాంత్రిక అభ్యాసం కూడా ఇలాటిదే. 

కృష్ణమూర్తి సాధన కూడా ఆవాహన - విసర్జన అనే ఇటువంటి సూత్రాల మీదే నడిచింది.  దానికి కారణం--మొదట్నుంచీ దియసఫికల్ సొసైటీ లో ఇటువంటి మార్మికరహస్య సాధనల పట్ల మోజు ఉండటమే. ఊజా బోర్డు, స్పిరిట్ గేమ్, ఆత్మలను  శరీరం మీదకు ఆహ్వానించుకునే "మీడియం షిప్" మొదలైన నిమ్న స్థాయికి చెందిన మార్మిక విద్యలో ఇవన్నీ భాగాలు. బ్లావత్స్కీ వ్రాసిన "ద సీక్రెట్ డాక్ట్రిన్" అన్న పంచకూళ్ళ  కషాయం ఈ భావనలన్నింటికీ మూలంగా దియోసఫీలో ఉంటూ వచ్చింది. అది గొప్ప మాస్టర్ పీస్ అని దియోసఫీ అనుచరులు తలుస్తారు. కాని చాలా ఇతర గ్రంధాలనుంచి కాపీకొట్టిన గందరగోళం ఈ పుస్తకం అని, దానిలో ఒరిజినాలిటీ ఏమాత్రం లేదనీ తెలిసినవాళ్ళంటారు .   

నిజమైన ఆధ్యాత్మిక సాధన ఇలా ఉండదు. తన ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో పోయి, ఆ కాసేపు ఇంకెవరినో ఆహ్వానించడం, ఆ తర్వాత మళ్ళీ తను ప్రవేశించటం -- ఇలాటి పనులు అందులో ఉండవు.  తానూ ఉన్నచోటే ఉంటూ తననుతాను సంస్కరించుకోవడం అందులో ప్రధానమైన భాగం. అనుక్షణం తన్ను తాను గమనించుకుంటూ తన తప్పుల్ని దిద్దుకుంటూ, తనలోని రాక్షసత్వాన్ని నిర్మూలించుకుని, మానవత్వాన్ని అధిగమించి, దైవత్వాన్ని అందుకోవడం సాధనలో భాగంగా ఉంటుంది. తనలో మార్పు తెచ్చుకోవడం ఉంటుంది గాని తానేక్కడికో పారిపోవడం ఉండదు. 

అందుకే ఏడాదిలో కొద్ది రోజులు చేసే పార్ట్ టైం సాధనలూ పార్ట్ టైం దీక్షలూ ఎందుకూ పనికిరావు అని నేను ఎప్పుడూ చెబుతాను. వాటివల్ల మనిషి వ్యక్తిత్వంలో మార్పు రానేరాదు. దీనికి నిదర్శనంగా నేడు తామరతంపరగా పుట్టుకొస్తున్న అయ్యప్పదీక్షలూ, షిర్డీదీక్షలూ, ఇంకా ఇతర దేవుళ్ళ దీక్షలూ చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లనుంచీ వీటిని రెగ్యులర్ గా చేస్తున్న అనేక దగుల్బాజీలను మనం ఎక్కడైనా చూడవచ్చు. 

సద్గురువైన వాని పర్యవేక్షణ లేకుంటే ఇలాటి పరిస్తితులే తలెత్తుతాయి. నేనెన్నో సార్లు చెప్పినట్లుగా " గుడ్డి గురువు గుడ్డి శిష్యుడు ఇద్దరూ కలిసి నడవటం మొదలు పడితే ఇద్దరూ గుంటలో పడటమే జరిగేది". జిడ్డుకు కూడా సద్గురువుల సాంగత్యం దొరకలేదు, పైగా గుడ్డి గురువులతో చేరాడు గనుకనే ఆయన సాధన అంతా అలా తయారైంది. వ్యక్తిత్వంలో ఉన్నతమైన మార్పులు తీసుకురాని సాధన అంతా వ్యర్ధం అని గ్రహించాలి.

మనం ఎన్ని పూజలు చేసాము, ఎన్ని గంటలు జపమూ ద్యానమూ చేసాము, ఎన్ని ఉపవాసాలున్నాము, ఎన్ని సారులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చాము, రోజుకెన్ని సారులు గుడికి వెళ్లివచ్చాము, హుండీలో ఎంత వేశాము, వినాయక చవితి చందా ఎంతిచ్చాము అనే విషయాలు ముఖ్యం కానేకాదు. దానివల్ల మనలోని కామమూ, కోపమూ, అహంకారమూ, అసూయా, అబద్ధాలు చెప్పే గుణమూ, భయమూ, చాడీలు చెప్పే అలవాటూ, ఇంకా ఇతర అనేక  దురలవాట్లూ ఎంతవరకూ తగ్గాయి అన్నదే ముఖ్యం. సాధనవల్ల మనలో ఎంత దివ్యత్వం వచ్చింది? అన్నదే ముఖ్యం. మన ప్రవర్తనలో ఎంత తేడా వచ్చింది అన్నదే ముఖ్యం. మన హృదయం ఎంత విశాలం అయింది? ఇతరులతో మనం ఎంత చక్కగా ప్రవర్తించగలుగుతున్నాం అన్నదే ముఖ్యం.  అటువంటి మార్పును తీసుకురాని సాధన పూర్తిగా వ్యర్ధం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.

మంచి వ్యక్తిత్వమూ, మంచి లక్షణాలూ ఉండి, ఈ సాధనలూ పూజలూ తెలియని ఒక మామూలుమనిషి కంటే, సద్గుణాలు లేకుండా పూజలూ గట్రాలూ చేసే  మనిషి చాలా తక్కువ స్తాయివాడే అని నేను నమ్ముతాను. లోపల మురికి పట్టి బయటికి శుభ్రం గా కనిపించే పాత్ర కంటే, బయట ఆడంబరం ఏమీ కనిపించకపోయినా లోపల శుభ్రంగా ఉన్న పాత్ర ఖచ్చితంగా విలువైనది. ఇదీ అలాటిదే.


దీపం గడపమీద ఉంచినప్పుడు దాని వెలుగు ఇంటి లోపలికీ బయటికీ ప్రసరించాలి కదా. అలా ప్రసరించడం లేదంటే, దీపంలోనో ఇంటిలోనో లోపం ఉన్నట్లే.
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం, తత్త్వం --5 "

7, జూన్ 2011, మంగళవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 4

మనిషి జీవితం చాలా చిత్రమైనది. అన్నీ తెలిసి కూడా తప్పులు చెయ్యటం మనిషి బలహీనత. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అతని నైజం. కానీ ఈలోపల జరగాల్సినవి జరిగిపోతుంటాయి. కాలమూ ప్రకృతీ దేనికోసమూ ఆగవు. మనిషి ఒకపని మొదలుపెడతాడు. దాని ఫలితం తాను ఆశించినట్లే వస్తుందని అనుకుంటాడు. చాలా సార్లు అలాగే జరుగుతుంది . కాని చాలా సార్లు అలా జరుగకపోవచ్చు కూడా. అటువంటప్పుడు నిరాశ పడకుండా దాన్ని జీర్ణించుకున్నవాడే నిజమైన మానవుడు. కొత్తదనాన్నీ మార్పునూ స్వాగతించలేనివాడు నిరాశకు లోనుగాక తప్పదు.


జిడ్డు క్రిష్ణమూర్తిలోకి మైత్రేయను దించి తీసుకొచ్చి తద్వారా లోకాన్ని ఉద్దరించాలని అనీబెసంటూ లేద్బీటరూ అనుకున్నారు. మైత్రేయ వచ్చినపుడు అతను చెప్పబోయేది  అంతా కొత్తగా ఉంటుందనీ పాతవాటిని అతను తిరస్కరించే అవకాశం ఉందనీ  వాళ్లకు తెలుసు. ఆ తిరస్కరణ లోకంవైపు ఉంటుందని వాళ్ళనుకున్నారు. అలాగే మైత్రేయబోధ  లోకాన్ని విమర్శించింది. కాని తనవాళ్ళ పద్ధతుల్ని కూడా అంతే తీవ్రం గా విమర్శించింది. లోకాన్ని విమర్శిస్తే వాళ్లకు బాధ లేదు. ఎందుకంటే లోకం చీకటిలో ఉందని వాళ్ళకూ తెలుసు. కాని  ఆ తిరస్కరణ తాము అప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాలవైపు కూడా గురిపెట్టబడుతుందని  వాళ్ళు ఊహించలేదు. అదే వాళ్లకు మింగుడు పడలేదు.


అహం అనేది నిర్మూలన అవ్వటం మహాకష్టం. ఎంతటి మహానుభావులకైనా అది ఏదో ఒక రూపంలో ఉండనే ఉంటుంది. ఒక సంఘటన జరిగినప్పుడు దాని తీరు కూడా మనం ఆశించిన రూపంలోనే ఉండాలని కోరుకోవడం బలహీనత అవుతుంది. కృష్ణమూర్తి లోకి మైత్రేయ దిగి వచ్చినపుడు ఆ అవతరణ అనేది వీళ్ళు ఆశించిన రీతిలో జరుగలేదు. అక్కడే వీళ్ళలో అనుమానం ఏర్పడటానికి దోహదం చేసింది. పైగా అప్పటివరకూ వాళ్ళు అనుభవిస్తున్న అధికారాలూ, ఆధ్యాత్మిక పదవులూ అన్నీ హుష్ కాకీ అయ్యే ప్రమాదం తలెత్తింది. అందుకే మైత్రేయ దిగిరావడం అబద్దం అనీ, కృష్ణమూర్తి భ్రమలో ఉన్నాడనీ వాళ్ళు అనుకున్నారు. మైత్రేయ దిగిరావటం నిజమేననీ  వాళ్ళు భ్రమ పడుతున్నారని కృష్ణమూర్తి అనుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా భ్రమకు అతీతులేమీ కాదని ఇప్పుడు లోకం అనుకుంటున్నది. వీళ్ళిద్దరూ కూడా తమను తాము మోసం చేసుకుని , ఒకరినొకరు మోసం చేసుకుని, లోకాన్ని కూడా మోసం చేసారని తెలిసినవాళ్ళు అనుకుంటున్నారు.


లెడ్ బీటర్ కు కొన్ని అతీత శక్తులు ఉండేవని ఒక రూమర్ అప్పట్లో ఉండేది . మైత్రేయ యొక్క తెజస్సునూ, విభవాన్నీ, దివ్యత్వాన్నీ అతను దర్శనం పొందానని చాలాసార్లు చెప్పాడు. అవన్నీ కృష్ణమూర్తిలో కనిపించక పోయేసరికి అతను మైత్రేయ యొక్క అవతరణను అనుమానించాడు. మానసికంగా కృష్ణమూర్తిలో వచ్చిన మార్పును అతనూ గమనించాడు. కాని కృష్ణమూర్తి శరీరంలో మైత్రేయ దిగివచ్చిన దివ్యలక్షణాలు  లేవని లేద్బీతర్ భావించాడు.     

అసలు కృష్ణమూర్తి సాధనే విచిత్రంగా సాగింది. శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ లోకాలలో విహరించే సాధనతో అది ప్రారంభం అయింది. అప్పటికే కృష్ణమూర్తికి కొంత అక్కల్ట్ లక్షణాలు ఉండేవి. అతనిలో ఒక వేకేంట్ లుక్ ఉండేది. అతని కళ్ళు ఎప్పుడూ ఏదో స్వప్నలోకం లో దేన్నో చూస్తున్నట్లుగా ఉండేవి. దీనికి కారణం ఆయనది మూలా నక్షత్రం కావడం అని, ఇంకా ఇతర జ్యోతిష్య పరమైన కారణాలనూ మనం ఇంతకూ ముందే అనుకున్నాం. ఎవరైనా ఒకటి రెండుసార్లు పిలిస్తేగాని అతను ఈ లోకంలోకి వచ్చేవాడు కాదు. దియసఫీ ఇనిషియేషన్స్ అతనికి ఇవ్వబడ్డాయి. అతను చాలా మార్మిక సాధనలు చేసినవాడే. కాని వాటివల్ల అతనికి పెద్ద ఉపయోగం కలగలేదని ఆయనే కొన్నిసార్లు చెప్పాడు. జ్ఞాన మార్గంలో నడిచిన వారితో ఇదే చిక్కు. మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చి ఆ మెట్ల వల్ల ఉపయోగం లేదని చెప్పటంలోని ఔచిత్యం ఏమిటో మరి?  


కృష్ణమూర్తి సాధన అంతా బుధుని ఆధీనంలో నడిచింది. ఈయన జాతకంలోని నవమాధిపతి బుధుడు పంచమంలో మిత్రక్షేత్రంలో ఉంటూ మంచి బలంగా ఉన్న సూర్యుని నక్షత్రంలో ఉన్నాడు. కనుక ఈయన సాధనా బోధనా అంతా బుద్ధి స్థాయిలో జరిగాయి. అందుకే ఈయన బోధనలు ఇంటలేక్చువల్ మనుషులకే అర్ధం అవుతాయి కాని మామూలు మనుషులకు విసుగ్గా ఉంటాయి. డ్రైగా ఉన్నట్లు  అనిపిస్తాయి.


1909 లో గురుదశ మొదలైనప్పుడు ఈయన సాధన కూడా మొదలైంది. 1909 - 1911 వరకూ  గురు/రాహు జరిగింది. గురువు సప్తమంలో ఉన్నాడు. కనుక ఈయన విదేశీ గురువుల చేతుల్లో పడ్డాడు.  ఈ సమయంలోనే ఈయనకు మొదటి రహస్య దీక్ష ఇవ్వబడింది. 1911 -1921 పదకొండేళ్ళ పాటు ఈయన సాధనా చదువూ సాగాయి. 1920 -23 వరకూ ఈయనకు గురువులో బుధ అంతరం నడిచింది. అప్పుడే ఈయన సాధనలో ఒక విచిత్రమైన అనుభవాన్ని పొందాడు.


తనలోని పంచకోశాలనూ ఒకే స్పందనలో నిలబెట్టాలని ఆయన ప్రయత్నం చేసాడు.  దానికి ఆధారంగా బుద్ధి స్థాయిలో ఉన్న బలీయమైన ఆకాంక్షను కనిపెట్టాలని ప్రయత్నించాడు. మైత్రేయనూ, మాస్టర్స్ నూ సేవించడమే దాని ఆకాంక్ష అని తెలుసుకున్నాడు. అదే స్పందనతో మిగిలిన తన అన్ని శరీరాలనూ ఏకీకృతం చెయ్యాలని మూడు వారాలు ప్రయత్నించాడు. నిరంతరమూ రోజంతా కూడా మైత్రేయ రూపాన్ని మనస్సులో నిలుపుకుంటూ ధ్యానించాడు. దానిఫలితంగా ఒకరోజు  అతనికి ఒక విచిత్ర అనుభవం కలిగింది.


గురువూ బుదుడూ ఈయన జాతకంలోని  విమ్శాంశ కుండలిలో లాభస్తానంలో ఉండటం చూడవచ్చు. అందుకే ఈయనకు అంతరిక అనుభవం ఈ సమయంలో కలిగింది.  1922 ఆగస్టులో కాలిఫోర్నియాలోని ఒజై లో ఉన్నప్పుడు ఒకరోజున ఈయనకు ఈ అనుభూతి కలిగింది. అప్పుడు ఆయనకు గురు దశలో, బుధ అంతరంలో, సూర్యుని విదశ జరిగింది. సూర్యుడు చంద్ర లగ్నాత్ మంత్ర స్థానంలో ఉచ్చ స్తితిలో బలంగా ఉండటం చూడవచ్చు.ఒకరోజున హటాత్తుగా మెడవేనుక వెన్నులో తీవ్రమైన నొప్పి మొదలైంది. అది పెరిగి పెరిగి తీవ్ర స్థాయికి చేరింది. అతనిలో ఆలోచించడానికీ, పనిచెయ్యడానికీ, కనీసం నిలబడటానికీ ఓపిక నశించింది. స్పృహ కోల్పోయి అలా పడి ఉండేవాడు. కాని చుట్టూ జరుగుతున్నది ఆయనకు తెలుస్తూనే ఉండేది. ఇలా ఉండగా ఒకరోజున మధ్యాన్నం పూట ఆయనకు ఈ అనుభవం కలిగింది.


రోడ్డు నిర్మాణం చేస్తున్న ఒక కార్మికున్ని ఆయన చూచాడు. రోడ్డూ, కార్మికుడూ, అతని చేతిలోని పారా, పగల గొట్ట బడుతున్న రాయీ అన్నీ తానే అని అనుభూతి చెందాడు. చెట్లూ, కొండలూ, పక్షులూ, గడ్డీ, పురుగులూ, అన్నీ తనలో భాగాలైనట్లూ, తానే అన్నింటిలో ఉన్నట్లూ అనుభవం కలిగింది. దూరంగా పోతున్న ఒక కారును చూచాడు. కారూ తానే, డ్రైవరూ తానే, ఇంజనూ తానే, టైర్లూ తానే, రోడ్డూ తానే. కారు దూరంగా పోతుంటే తననుంచి తానే దూరంగా పోతున్నాడు. ఇటువంటి స్థితిలో రోజంతా ఉన్నాడు. సాయంత్రానికి మళ్ళీ దేహస్పృహ  పోయింది. 


ఇంకోన్నాళ్ళకు తన వెన్నులో ఏదో ఒక బంతి లాటిది కదిలి పైదాకా వచ్చి తలవేనుక నుంచి రెండు భాగాలుగా చీలి ఒకటి కుడివైపూ ఒకటి ఎడమ వైపూ  వచ్చి మళ్ళీ కనుబొమల మధ్యన కలిసినట్లు ఆయనకు ఒక అనుభవం కలిగింది. ఆపుడు ఆయనకు ఒక వెలుగు లాటిది కనిపించింది. దానిలో మైత్రేయను దర్శించానని ఆయన చెప్పాడు.


ఇకపోతే ఇలాటి అనుభవాలు ఆయనకు జీవితమంతా కలుగుతూనే ఉండేవి. కాకపొతే ఈ ప్రాసెస్ అనేది తరువాత కాలంలో ఇంత ఉధృతంగా ఉండేది కాదు. అయితే ఇటువంటి ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినంత మాత్రాన  ఆయన్ను ఒక రుషితో పోల్చడానికి లేదు. ఇదే ఈయన జీవితంలోని విచిత్రం. ఎందుకంటే ఈ అనుభవాలు కలిగిన తర్వాత ఎన్నో ఏళ్లకు ఆయన ఒకరికంటే ఎక్కువ స్త్రీలతో రహస్య సంబంధాలు నేరిపాడని తరువాత లోకానికి వెల్లడైంది. ఇందులో నిజానిజాలు దేవుని కెరుక. కాని చాలామంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. ఈ స్త్రీలలో రోసలిన్ అనే అమ్మాయి, తన మిత్రుడైన రాజగోపాల్ భార్య కావడం ఇంకా దారుణమైన విషయం.


కనుక కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినంత మాత్రాన మనిషి పవిత్రుడై పోతాడనీ, రుషి గా మారతాడనీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విశ్వామిత్రుడు అంత తపశ్శక్తి సంపన్నుడై ఉండీ మేనక అందం ముందు దాసోహం అన్నాడు. ఇక , మొన్నటి ముక్తానందలూ, నిన్నటి రజనీషులూ, ఈనాటి నిత్యానందలూ సరే సరి. స్త్రీ వ్యామోహానికి లొంగని అసలు సిసలు మహనీయుల పేర్లు చెప్పాలంటే శ్రీ రామకృష్ణ, రమణ మహర్షి, వివేకానంద, షిర్డీ సాయిబాబా మొదలైన వాళ్ళ పేర్లే చెప్పాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్త జిడ్డు కి కూడా ఒక రహస్య జీవితం ఉందని తెలిస్తే అది దిగ్భ్రాంతిని కలిగించక మానదు.


ఇంద్రియ వ్యామోహాలకు పూర్తిగా అతీతుడై ఆత్మానుభూతిలో అనుక్షణం ఉండటాన్నే జీవపరిణామంలో  అత్యుత్తమ స్థాయిగా  భారతీయ వేదాంతం అభివర్ణించింది. దానికి తక్కువ అయిన దేనినీ భారతీయులు గోప్పతనంగా పరిగణించరు. ఇక్కడే ఉత్త పండితులకూ, నిజమైన మహాత్ములకూ తేడా అనేది కనిపిస్తుంది. ఒకడు వేదాలను బట్టీ పట్టవచ్చు. కాని అతనికి ఆత్మానుభవం లేకపోతే అది ఔన్నత్యం కిందికి రాదు. గొప్ప వేదాంతాన్నీ, తత్వ శాస్త్రాన్నీ బోధిస్తూ ఒకడు మంచి ఉపన్యాసాన్ని ఇవ్వవచ్చు. కాని అతను స్వయానా తన ఇంద్రియ ఆకర్షణలకు అతీతుడు కాకపోతే అతని పాండిత్యం అంతా ఎందుకూ పనికిరాని చెత్త అవుతుంది.


ఈ కోణంలో చూచినపుడు, జిడ్డు స్థాయి జర్రున దిగజారి పోతుంది. దానికి కారణం ఏమిటో, ఇటువంటి పరిస్తితి ఎందుకు రావలసి వచ్చిందో దానికి గల జ్యోతిష్య కారణాలేమిటో వచ్చే పోస్ట్ లో చూద్దాం.
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 4 "

4, జూన్ 2011, శనివారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 3

ధియోసాఫీ అనేది బౌద్ధమతాన్నీ, హిందూమతాన్నీ, క్రైస్తవాన్నీ కలిపి వండిన కిచిడీ అని చెప్పవచ్చు. దీనిలో రహస్య సాధనామార్గం ఒకటి ఉంది.  

మాస్టర్ మోర్య, మాస్టర్ కుతూమి, మాస్టర్ మహాచోహన్ -- వీళ్ళు ముగ్గురూ మానవ స్థాయిని దాటి ఎంతో ఎత్తుకు ఎదిగిన మహాపురుషులని వాళ్ళు ఉండేది దివ్యలోకాలలో అయినప్పటికీ ప్రస్తుతం వాళ్ళ దివ్య శక్తులతో టిబెట్ పరిసర ప్రాంతాల్లో మానవ రూపాలలో ఉన్నారని, వీరి కంటే పై స్థాయిలో  "మైత్రేయ" అనే ఒక దివ్య పురుషుడున్నాడని, ఈ మైత్రేయ ఊర్ధ్వ లోకాలలో ఉన్నాడనీ, క్రితం సారి ఇతను కృష్ణునిగానూ, క్రీస్తుగానూ లోకంలోకి వచ్చాడనీ, పవిత్రాత్ముడైన ఒక వ్యక్తి శరీరంలోకి అతను దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడనీ,  అతని కంటే పై స్థాయి బుద్ధునిదనీ ఒక ప్రాధమిక నమ్మకం దియోసఫీలో ఉంది. ఈ నమ్మకాన్ని మేడం బ్లావత్స్కీ మొదటగా ప్రారంభించింది.

ఆమె నేపాల్ లో నివసించిన రోజులలో  బౌద్ధమత ప్రభావానికి లోనై, వీరిని భౌతిక స్థాయిలో కలుసుకున్నట్లూ మాట్లాడినట్లూ నమ్ముతారు. ఈ ముగ్గురు సిద్ధ పురుషులూ దివ్యజ్ఞాన సమాజాన్ని నడుపుతున్న మార్గదర్శకులని భావిస్తారు. 

వీరి శిష్యులుగా మారి వారంతటి ఉన్నత స్థాయికి ఎదగాలంటే వరుసగా అయిదు దీక్షలున్నాయని వీరి నమ్మకం. శిష్యుడు ఎదిగిన స్థాయిని బట్టి ఉన్నత దీక్షలు ఒకదాని తరువాత ఒకటిగా ఇవ్వబడతాయి.  కల్నల్ ఆల్కాట్, మేడం బ్లావత్స్కీ ల తర్వాత అనీబిసెంట్, లెడ్ బీటర్లు ఈ సంస్థకు నాయకులయ్యారు. ఒక పవిత్రాత్ముడైన బాలుని  ఎన్నుకొని అతనికి కొన్నేళ్ళు సరియైన రహస్య ట్రయినింగ్ ఇవ్వటం ద్వారా, అతని శరీరంలో "మైత్రేయ" దిగివచ్చి లోకానికి వెలుగు చూపిస్తాడనీ, ఈ దిగిరావడమే అనేక మతాలలో చెప్పబడిన అవతార పురుషుని రాకడ అనీ వీళ్ళు నమ్మారు. అహంకారపు స్పర్శ ఏ మాత్రం లేని తేజో వలయాన్ని కలిగి ఉన్నాడని లెడ్బీటర్ నమ్మబలికిన జిడ్డు కృష్ణమూర్తిని ఆ పవిత్రబాలునిగా ఎన్నుకున్నారు.

కృష్ణమూర్తినీ, అతని తమ్ముడు నిత్యానందనూ దీక్షలు ఇచ్చి సాధన చేయిస్తూ వచ్చారు. వాళ్ళు ట్రాన్స్ వంటి నిద్రావస్తలోకి వెళ్ళాక వాళ్ళ ఆత్మలను తీసుకుని టిబెట్ లోని మాస్టర్స్ ఇంటికి లెడ్ బీటర్ వెళ్ళేవాడు. అక్కడ మాస్టర్స్ ఇచ్చే ఉపదేశాలు అందుకుని వాళ్ళు తిరిగి వచ్చేవారు. ఇదంతా ఒక మార్మిక సాధనగా సాగేది.

అయితే ఈ అనుభూతులన్నీ నిద్రలో వారి కలలా లేక నిజంగా జరిగాయా తెలుసుకోడానికి వాళ్ళ పరస్పర అంగీకారం తప్ప వేరే రుజువు ఏదీ ఉండేది కాదు. నిన్న రాత్రి మేం హిమాలయాలలో ఉన్న మాస్టర్ కుతూమి ఇంటికి సూక్ష్మ శరీరాలతో వెళ్లి వచ్చాము. నీవూ అక్కడ కనిపించావు. ఇది నిజమేనా? నీవు అక్కడకు వచ్చావా? అని లేద్బీతర్ అనీబెసంట్ ను అడిగేవాడు. ఆమె అవునని చెప్పేది. ఇద్దరూ కలిసి అది నిజమే అనుకునేవారు. ఈ మొత్తం వ్యవహారం నచ్చని జిడ్డు తండ్రి, తన పిల్లల్ని తనకు కాకుండా చేస్తున్నదంటూ, అనీబెసంట్ మీద కేసుపెట్టి కోర్టుకెళ్ళాడు. ప్రీవీ కౌన్సిల్ దాకా సాగిన కేసులో అనీబెసంట్ నెగ్గింది. ఇలా దాదాపు పదహారేళ్ళు గడిచాయి.  ఈ లోపు కృష్ణమూర్తీ, నిత్యానందా అనీబెసంట్ తో కలిసి దేశదేశాలు తిరుగుతూ, ఇంగ్లీషు చదువు నేర్చుకుంటూ,  కొన్నాళ్ళు యూరప్ లోనూ కొన్నాళ్ళు అమెరికాలోనూ ఉంటూ గడిపారు.

ఈ లోపు కృష్ణమూర్తి శరీరంలో  " ప్రాసెస్" అనబడే ఒక విచిత్ర చర్య మొదలైంది. అతను ఒకరకమైన మూర్చవంటి స్తితికి లోనయ్యేవాడు. ఆ సమయంలో అతని శరీరం నుంచి ఆత్మ దూరంగా వెళ్ళిపోయేది. వెన్నులోనూ, తలలోనూ విపరీతమైన నొప్పి మొదలయ్యేది. శరీరం బాధతో కూడిన అనేక మార్పులకు లోనయ్యేది. అతను బాధతో మెలికలు తిరిగిపోయేవాడు. ఇలా కొన్ని గంటలు జరిగేది.  తరువాత ఏమీ జరుగనట్లు మామూలుగా ఉండేవాడు. కొన్ని సార్లు ఆ స్తితిలో ఏం జరిగిందో కూడా ఇతనికి గుర్తుండేది కాదు. ఇదంతా కూడా "మైత్రేయ" దిగిరావడానికి ఇతని శరీరంలో జరుగుతున్న ప్రక్షాళన ప్రక్రియగా అందరూ భావించారు. కొందరు మాత్రం ఇవి అతన్ని జీవితాంతం బాధించిన మలేరియా ఎటాక్స్ గా అనుకునేవారు. కృష్ణమూర్తిని అవతార పురుషుడిగా భావిస్తూ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్" అన్న సంస్థను ప్రారంభించారు. దానికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అవతారపురుషుడైన "మైత్రేయ" జిడ్డు శరీరంలోకి అతి త్వరలో రాబోతున్నాడనీ, దానికి సర్వం సిద్ధం అయిందనీ అందరూ నమ్మేవారు. ఈ లోపల ధియసాఫికల్ సొసైటీ లో లుకలుకలు మొదలయ్యాయి. జార్జి అరుండేల్, వేడ్జివుడ్ మొదలైన వారితో ఒక యాంటీ గ్రూపు మొదలైంది. 

లేద్బీతర్ కూడా ఒక విడి గ్రూపును ప్రారంభించాడు. మధ్య యుగాలలో జీవించిన మాస్టర్ కౌంట్ అనబడే ఒక యూరోపియన్  సిద్ధమాంత్రికుడు  ఈ భూమ్మీద యూరప్ లో  ఎక్కడో  ఒక  కోటలో ఉన్నాడని, అక్కడకు వెళ్ళడానికి తమకు రహస్య సందేశాలు అందుతున్నయనీ భావించిన ఒక బృందం అనీబెసంట్ తో సహా యూరప్ అడవుల్లో కొంతదూరం వెళ్లి, వాళ్ళనుకున్న సిగ్నల్స్ అందక, అదెక్కడుందో కనుక్కోలేక నిరాశతో తిరిగి వచ్చింది. ఇన్నాళ్ళ, వారి నమ్మకాలు తప్పేమో, ఇదంతా భ్రమేమో  అన్న ఆలోచన అందరిలో మొదలైంది.


ఈలోపల ఇంకొక ముఖ్య సంఘటన జరిగింది. కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానందది  మొదట్నుంచి అనారోగ్యపు ఒళ్ళు. ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉండేవాడు. ఈలోపు అతనికి టీబీ సోకింది. అతనికి యూరప్ లో అత్యుత్తమ ట్రీట్మెంట్ ఇప్పించారు. అతనికి ఏమీ కాదని, మాస్టర్స్ అతన్ని కాపాడతారనీ, ఆ రకమైన సందేశాలు తమకు హిమాలయన్ మాస్టర్స్ నుంచి  అందాయనీ కృష్ణమూర్తీ, అనీబెసంటూ, లెడ్ బీటరూ, ఇతర సంఘప్రముఖులూ  నమ్మేవారు. కాని వారందరి నమ్మకాలనూ వెక్కిరిస్తూ నిత్యానంద రోగంతో  మరణిస్తాడు. ఆదెబ్బతో కృష్ణమూర్తికి జ్ఞానోదయం అవుతుంది. తాను ఇన్నాళ్ళు అనుకుంటున్నది అబద్దం అనీ, మాస్టర్స్ అనేవాళ్ళు ఎవరూ లేరనీ ఇదంతా తమ భ్రమ అనీ తెలుసుకుంటాడు. అక్కణ్ణించి అతని నమ్మకాలలో మార్పు రావడం కనిపిస్తుంది. తాము అప్పటిదాకా గుడ్డిగా నమ్ముతున్న అనేక విషయాలను అతను ప్రశ్నించడం మొదలుపెడతాడు. ఇది ఎంత వరకూ పోతుందంటే, మాస్టర్స్ అనేవాళ్ళు ఈవెంట్స్  మాత్రమే అని ఒక ఉపన్యాసంలో చెప్పి సంచలనం సృష్టిస్తాడు. ఇది అనీబెసంట్ ను చాలా బాధిస్తుంది. 

తరువాత కొన్నాళ్ళకి, ఇదే కృష్ణమూర్తి, తనలోకి "మైత్రేయ" దిగి వచ్చాడని చెబుతూ ఉపన్యాసాలు ఇవ్వసాగాడు. అతని ద్వారా మాట్లాడేది " మైత్రేయ " కాదనీ, చీకటిసైతాన్ శక్తులు అతన్ని ఆవహించాయనీ, అవే అలా మాట్లాడుతున్నాయనీ, జార్జి అరుండేల్ చీలికబృందం అనీబిసెంట్ ను నమ్మించింది. దానికి తగినట్లే కృష్ణమూర్తి చెప్పేది కూడా వాళ్ళు అప్పటిదాకా నమ్ముతున్న విషయాలకు భిన్నంగా వ్యతిరేకంగా ఉండేది. చాలాసార్లు వాళ్ళ నమ్మకాలను ఆయన సూటిగా విమర్శించేవాడు.  థియాసాఫికల్ సొసైటీ గ్రూపులుగా విడిపోవడం ఆరంభించింది.

ఈలోపు  ప్రపంచ వ్యాప్తంగా ధియసాఫికల్ సొసైటీ చేసిన ప్రచారంలో-- "వరల్డ్ టీచర్" అనబడే "మైత్రేయ"-- అనేక సంవత్సరాల సాధనలో శుద్ధి పరచబడిన కృష్ణ మూర్తి శరీరంలోకి దిగి వచ్చాడని నమ్మించారు. ఈ క్రమంలో,  ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సభ్యులు కృష్ణమూర్తికి అనేక దేశాలలో ఇళ్ళూ, ఎస్టేట్లూ సమర్పిస్తారు. కృష్ణమూర్తి మాత్రం తాను వరల్డ్ టీచర్ నని, మైత్రేయ తనలోకి దిగి వచ్చాడనీ భావించినప్పటికీ, దియసాఫికల్ సొసైటీలో వస్తున్న అనేక గ్రూపులను, వాళ్ళ నమ్మకాలను మాత్రం  ఖండిస్తాడు. వీళ్ళది అంతా భ్రమ అని, వాళ్ళు ఈగో ట్రిప్స్ లో చిక్కుకున్నారనీ  నమ్ముతుంటాడు.  

చివరికి 1929 లో ఆమెన్ లో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన సమావేశంలో దేశ దేశాలనుంచి వచ్చిన దివ్యజ్ఞానసమాజ సభ్యుల సమక్షంలో కృష్ణమూర్తి అసలు నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడిస్తాడు. "ఆర్డర్ ఆఫ్ ది స్టార్" సంస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి తనకు వచ్చిన ఇళ్ళూ భూములూ అన్నీ ఎవరివి వారికి తిరిగి ఇచ్చేస్తాడు.

Truth is a pathless land అంటూ సత్యం అనేది ఒక సంస్థద్వారా తెలుసుకునేది కాదనీ అది ఎవరికీ వారు తమలో తాము తెలుసుకోవాలనీ చెప్తాడు. గురువులు, మాస్టర్స్ అంతా మాయ అంటూ సత్యం ఎవరి సొత్తూ కాదనీ, ఏ గురువూ దాన్ని చూపించలేడనీ, దాన్ని ఎవరికి వారే తెలుసుకోవాలనీ చెప్తాడు. ఇది పెద్ద సంచలనం సృష్టిస్తుంది. తరువాత థియాసాఫికల్ సొసైటీకి కూడా రాజీనామా చేసి తనదారి వేరంటూ కాలిఫోర్నియాలోని "ఒజై" లో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోతాడు. అంతకుముందే  అనీబెసంటు రాజకీయాల్లోకి దిగి "హోంరూల్" ఉద్యమాన్ని నడుపుతుంది. చివరికి అక్కడా సక్సెస్ కాలేకపోతుంది. ఆమె, లెడ్ బీటరూ కొద్ది తేడాతో మరణిస్తారు. అనీబెసంట్ కు చివరిలో మతిభ్రమిస్తుంది.

(వచ్చే పోస్ట్ లో కృష్ణమూర్తి సాధనానుభవాలను  జ్యోతిష్య పరంగా పరిశీలిద్దాం)
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 3 "