“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, నవంబర్ 2012, బుధవారం

కాలజ్ఞానం -17

మొదలు నందనమ్ము మార్గశీర్షమ్ములో   
తుదిని  జయము యాషాఢసీమ వరకు    
బాధలెన్నో రేగి తలకిందు చేసేను 
వేషాలు జనులలో హెచ్చు మీరేను 
ఎవరి గోతిని వారు తవ్వుకొబోతారు  

విప్లవం రేగేను రాజ్యాలు కూలేను 
యుద్ధాలు ముప్పులు ప్రకృతి భీభత్సాలు 
సాధారణమ్ముగా జరిగేను
ఏలికలు పయనమ్ము కట్టేరు

మార్గశిర ద్వాదశి మార్పులను తెచ్చేను 

కళ్ళు మూసినా గట్టి రుజువులగుపించేను  
పెంచుకున్నపాపమ్ము బద్దలై పగిలేను 
వికటాట్టహాసమ్ము కాళికయే చేసేను

రానున్న వత్సరమున  భూలోక స్వర్గమున 

గడ్డుకాలమ్మొకటి వచ్చేను కలి ప్రభావమ్ము చూపేను
విపరీత బుద్ధులే వెలిగేను విధ్వంసమే జూడ పెరిగేను 
మ్లేచ్చవర్గాలలో చిచ్చులే రేగేను మృత్యువే నాట్యమ్ము చేసేను  
   
విర్రవీగేవారు వెర్రివారౌతారు బుద్ధి నిలిచేవారు ఒడ్డెక్కి వస్తారు
తప్పదీ మాట తధ్యమింకను జూడ తెలివి తోడను జూచి తేటబడుము 
read more " కాలజ్ఞానం -17 "

23, నవంబర్ 2012, శుక్రవారం

కాలజ్ఞానం - 16

వాహనాలు రిపెర్లతో చికాకు పుట్టిస్తాయి
నటులకు కళాకారులకు సాహితీవేత్తలకు 
చెడుకాలంతో చుక్కెదురౌతుంది
ఒక ఆధ్యాత్మిక నేతకు గండం పొంచి ఉంది 
మేధావుల గోడు ఎవరికీ పట్టదు

అంతా తానే అని భావించే మనిషి 
తానొక అణువుననే సత్యం గ్రహించాలి
విశాల విశ్వపు కధలో తనదొక 
చిన్నపాత్ర మాత్రమేనని గుర్తించాలి


read more " కాలజ్ఞానం - 16 "

17, నవంబర్ 2012, శనివారం

మానవజీవిత గమ్యం -- వేమన పద్యం

తెలుగునాట పుట్టిన మహనీయుల్లో వేమన యోగి ఉత్తమ శ్రేణికి చెందినవాడు.ఆయనను చాలామంది ఒక సంఘసంస్కర్తగా భావిస్తున్నారు. ఇది పొరపాటు.ఆయనను ఒక కులానికి పరిమితం చెయ్యడమూ తప్పే.సాధారణ మానవ పరిమితులను దాటినవారే మహానీయులనబడతారు. వారు కులానికి మతానికి జాతికి అతీతులౌతారు. మానవత్వమూ దైవత్వమే వారి విధానాలు అవుతాయి.వేమన అటువంటి సద్గురువులలో ఒకడు.మానవాతీతులైనవారిని ఒకకులానికి మతానికి ప్రాంతానికి పరిమితం చెయ్యకూడదు.

ఆయన పద్యాలలో ఉత్తమమైన యోగసాధన రహస్యంగా చెప్పబడింది. వేదాంతమూ వైరాగ్యమూ యోగమూ ఆయన తన పద్యాలలో సరళంగా బోధించాడు.రసవాదం కూడా రహస్యంగా ఆయన పద్యాలలో చెప్పబడింది."తాళకంబెరుగరో తగరంబు నెరుగరో" అనే పద్యం రసవాద రహస్యమే.అలాంటి పద్యాలు ఇంకా ఉన్నాయి.క్షుద్రలోహాలను బంగారంగా మార్చే విధానాన్ని గుప్తంగా వాటిలో వేమన వివరించాడు.కాని వాటిని అర్ధంచేసుకున్నవారు తక్కువ.

రసవాదమూ మొదలైన ఇతర భావాలను అలా ఉంచితే,అసలు మానవజన్మకు ఏమి చేస్తే సార్ధకత వస్తుందో వేమన భావాలలో కొంచం పరిశీలిద్దాం.

పశు పక్ష్యాదులవలె ఆహారనిద్రాభయమైదునాలలో వృధాగా గడపడానికి ఉద్దేశించబడింది కాదు మానవజన్మ.మానవజన్మకు ఒక పరమార్ధం ఉన్నది. వృధాగా పుట్టి గిట్టుటకొరకు వచ్చినది కాదు మానవజన్మ. తిరిగి పుట్టనట్టి చదువును చదువుకోవటమే మనిషిజన్మకు పరమార్ధం. జననమరణచక్రం నుంచి విముక్తి పొందగలిగే మహత్తర అవకాశం మానవజన్మకు దైవంచేత ఇవ్వబడింది. కాని దానిని గ్రహించేవారెందరు? కొండొకచో కొందరు గ్రహించినా ఆ మార్గంలో నడిచేవారెందరు? నడిచినా గమ్యాన్ని చేరేవారెందరు? నిరంతరం ఆహార సముపార్జనకు, సుఖలాలసకు అంకితం అయిన మనిషి పరమార్ధాన్ని పొందేది ఎప్పుడు?

పగలు పొట్టకోరకు బహు ధనార్జనచింత
రాత్రి రమణి తోడ రతులచింత
మోక్షచింత ఇంక మూడాత్ముకెపుడురా
విశ్వదాభిరామ వినురవేమ

మోక్షచింత వైపు మనసు పోకుండా తిండి,సంపాదన,భోగలాలసలనే మాయతో మనిషిని కప్పింది జగన్మాత.ఈ మాయను గెలిచినవాడే పరమపదం వైపు అడుగులు వెయ్యగలడు.లేకుంటే ఆ ఊబిలో మునగక తప్పదు.అసువులు బాయక తప్పదు. నిరంతరం ఈషణాత్రయంలో ఈత కొట్టే వారికి ఒడ్డు దొరికేదేన్నడు? రాగద్వేషాలనే వలలో చిక్కినవానికి విముక్తి ఎట్లా దొరుకుతుంది?తమస్సుతో నిండిన మనస్సుకు మోక్షచింత ఎప్పుడు ఉద్భవిస్తుంది? ఎంతసేపూ తిండి,సుఖం వీటిగురించే ఆలోచించే మూర్ఖునికి మోక్షచింత ఎప్పుడు కలుగుతుంది?

వినవలె దశవిధ నాదము 
గనవలె నిర్భేద పదము గాంచిన పైపై 
గనవలె సోహంభావము 
మనవలె పరిపూర్ణమూని మదిలో వేమా      

యోగాభ్యాసపరుడై లోలోన వినిపించే పదిరకాల నాదాలను వినాలి. దానిని మించినట్టి చెక్కుచెదరని గట్టిదైన భూమిని చూడాలి. దానినికూడా దాటి సోహం భావమున ప్రతిష్టితుడై పరిపూర్ణమైన బ్రహ్మపదమును సాధకుడు చేరుకోవాలి. అప్పుడే అతని జన్మకు పరిపూర్ణత.సాధనాపరుడై పరమపదాన్ని అందుకున్నపుడే మనిషి జన్మకు ధన్యత.అది లేకుంటే ఎన్నెన్ని వేషాలు వేసినా అన్నీ చివరకు వృధా అవక తప్పదు.

వ్యాపించి యున్న లోకము 
ప్రాపించక గురుని వేడి బహుతంత్రముగా 
దీపించి మనసు నిల్పుము 
రూపంబగు బట్టబయలు రూఢము వేమా

చిత్ర విచిత్రమైన హంగులతో నిండిన ఈ లోకాన్ని లెక్కించక సద్గురువైనవాడిని  సమీపించి తంత్రోక్తమైన అతని ఉపదేశము పైన మనసు నిల్పితే అంతా తేటతెల్లముగా కనిపిస్తుంది. మనిషికి ప్రధమ కర్తవ్యం ఇదే. కాని మానవులు ఇదిమాత్రం వదిలిపెట్టి తక్కిన అన్నింటినీ చక్కగా ఆచరిస్తున్నారు.అందుకే సంసార సాగరంలో మునిగి మరణిస్తున్నారు గాని దరిచేరేవారు ఒక్కరూ లేరు. మాయామోహాలతో నిండిన ఈ లోకం మనిషిని ఎంతో ఆకర్షించి అతన్ని కాళ్ళూ చేతులూ కట్టి ఒక బానిసలా వాడుకుంటుంది. ఆ బానిసత్వమే ఆనందం అన్న భ్రమలో మనిషి గానుగెద్దులా జీవిస్తూ తన ఆయువు హరించుకు పోవడాన్ని గమనించడు. ఈ భ్రమ నుండి మనిషి బయటపడి సద్గురుప్రోక్తమైన  సాధనామార్గంలో నడక సాగించాలి. అప్పుడే అతనికి సత్యం సాక్షాత్కరిస్తుంది.

లోకము తను 'ఛీ' యనగా 
లోకము తా 'ఛీ' యనంగ లోకములోనే 
ఏ కర్మల నోనరింపక 
లోకములెంచంగ ముక్తిలోకము వేమా

లోకవిధానాలను తాను ఏవగించుకోవాలి. అనగా తనకు లోకవాసనలపైన విరక్తి కలగాలి. లోకమూ తనను అసహ్యించుకోవాలి. అంటే సమాజపు కుళ్ళుపోకడలకు విరుద్ధమైన సత్యమార్గంలో తాను నడవాలి. లోకాన్ని తాను  ఛీకోడితే లోకమూ తనను 'ఛీ' అంటుంది.అంటే లోకరీతికి భిన్నమైన మార్గంలో సాధకుడు నడవాలి.అటువంటి స్తితిలో ఉంటూ,కర్మను క్షయింపచేసుకునే రహస్యయోగమార్గాన్ని అనుసరించి,తద్వారా లభించినట్టి  యోగసిద్ధితో, సమస్త లోకాలను సాక్షిగా తిలకించగలిగితే అదే ముక్తి.

రానిది కోరిన రాదది
రానున్నది కోరకున్న రానేవచ్చున్ 
తానెంత చింత చేసిన 
కానున్నది కాకపోదు గదరా వేమా 

తనకు యోగం లేకపోతే ఎంత కోరుకున్నా అది దక్కదు.అలాగే,తనకు రాసిపెట్టి ఉంటే ఎంత వద్దనుకున్నా అది అనుభవించక తప్పదు.కనుక తానెంత చింతించినా కానున్నది కాకమానదు.రానున్నది రాకమానదు. జరుగనున్నది జరుగక మానదు.ఇది అంతిమ సత్యం.దీనిని గ్రహించి ఆచరించగలిగినవాడు ధన్యుడు.అటువంటివాడు ఒక రమణమహర్షిగా రూపు దిద్దుకుంటాడు. జిల్లెళ్ళమూడి అమ్మ కూడా ఇదే భావాన్ని"అనుకున్నది జరగదు.తనకున్నది తప్పదు"అని చెప్పారు.మహనీయులు ఎవ్వరైనా ఇదే సత్యాన్ని ఎన్నో మార్లు చెప్పారు.కాని మూడత్వంతో నిండియున్నవానికి ఇది తలకేక్కుతుందా? ఎక్కదు.అందుకే లోకంలో జ్ఞానులు కొందరే ఉంటారు.మిగిలినవారు మిడుతల దండులే.పుట్టలోని చెదలే.

మాయల సంసారముకై 
మాయలలో బొరలుచుండు మనుజుడు మరితా 
మాయను మదిలో దలచిన 
మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా 

ఈ మాయదారి సంసారమోహంతో నిండిన మానవుడు మాయ అనే బురదగుంటలో పడిన పందిలాగా దొర్లుతున్నాడు. మాయాస్వరూపాన్ని తన మనసులో చింతనచేత చక్కగా అర్ధం చేసుకుంటే, ఆ మాయలో నుంచే ముక్తి అనే మార్గం చక్కగా కనిపిస్తుంది. కాని మాయను ఆనందిస్తున్న మనుజునికి మాయపై మనసు విరిగేదేన్నడు?సాధనామార్గంపైన మనసు నిలిచేది ఎప్పుడు? అసలలా జరిగే అవకాశం ఉన్నదా?

జ్ఞాననిష్ఠ బూని మేను మరచువాడు 
కామిగాడు మోక్షగామి గాని 
నియమ నిష్ఠలుడిపి నిర్గుణమ్మందురా
విశ్వదాభిరామ వినురవేమ 

జ్ఞానకాంక్షి యైనవాడు మొదటిలో నియమ నిష్టలను ఎన్నో ఏళ్ళు పాటించాలి. తర్వాత జ్ఞాననిష్టను బూని నియమనిష్టలకు అతీతుడై సర్వాతీతమైన నిర్గుణపదవిని అందుకోవాలి.ఇదే మనిషి యొక్క ప్రధమకర్తవ్యం.అంతే కాదు.ఇదే మానవ జీవితపు నిజమైన గమ్యం కూడా. దీనిని సాధించినవాడే నిజమైన మానవుడు. అతని జన్మ మాత్రమే సార్ధకమైన జన్మ.
read more " మానవజీవిత గమ్యం -- వేమన పద్యం "

7, నవంబర్ 2012, బుధవారం

ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి

ఆంద్రప్రదేశ్ లో ప్రతి నవంబర్ లోనూ తుఫాన్ రావడం మామూలైపోయింది. వాతావరణశాఖవారు దీనిని కనిపెట్టలేకపోయినా సామాన్యుడు చెప్పగలుగుతున్నాడు.అయితే, ప్రతి ఏడాదీ తుఫాను రావడమూ ఊళ్లు జలదిగ్బంధనం అవడమూ, లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడమూ, ఊరిలోనే మనుషులు పడవలు వేసుకొని తిరగడమూ సర్వ సాధారణం అయిపోయింది. కానీ దీనికి తగిన శాశ్వతచర్యలు ప్రభుత్వం ఏమి తీసుకుంటున్నదో తెలియదు. పోనీ తనకు చేతనైనంతలో ప్రభుత్వం ఏవో కొన్ని చర్యలు చేపడుతున్నదీ అనుకుందాం.రాజకీయ నాయకులు పార్టీలూ మాత్రం ఏమి చేస్తున్నారో ఎవరికీ  తెలియదు.

స్వచ్చందసంస్థలూ,మానవతావాదులూ,వారి స్వల్పస్థాయిలో ఏవో చిన్నచిన్న సహాయశిబిరాలు పెట్టడమూ వరదబాధితులకు తమకు తోచిన సహాయం చెయ్యడమూ ప్రతి ఏడాదీ చూస్తున్నాం.కానీ రాజకీయపార్టీలు ఇలాంటి స్వచ్చందశిబిరాలు పెట్టడం ఎక్కడా చూడలేదు.వారు ఉత్తమాటలు చెప్పెబదులు ఆపని ఎందుకు చెయ్యరు అనేది నాప్రశ్న.ఈ మధ్య ఒక టీవీ చానల్ వారు తుఫాన్ బాధితులకు సహాయకార్యక్రమం ఒకటి చేశారు. అలాంటి పని రాజకీయ పార్టీలు ఎందుకు చెయ్యకూడదు?

రాజకీయ పార్టీల దగ్గర ఆడిట్ కాబడని డబ్బు వందలవేల కోట్లు మూలుగుతోంది. ఎలక్షన్ల సమయంలో ప్రజలకు సారాయీ డబ్బుసంచులూ  పంచేబదులు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయశిబిరాలు నిర్వహించే పని రాజకీయపార్టీలు ఎందుకు చెయ్యవు? అనేది నాకెప్పటినుంచో ఒక సందేహం. బహుశా దానివల్ల వాళ్లకు ఉపయోగం ఏమీ ఉండదు గనుక ఆ పని చెయ్యరు. ఓట్లకోసం డబ్బులు పంచుతారు గాని ఇలాంటి విపత్కరస్తితిలో మాత్రం ప్రజలకు ఏ సాయమూ చెయ్యరు. ఊరకే ఊరూరూ తిరిగి హామీలు మాత్రం గుప్పిస్తారు.ఇక అధికారంలో ఉన్న పార్టీవారు,నివేదికలు పంపి కేంద్రం నుంచి నిధులు తెస్తారు.ఆ నిధుల్లో సింహభాగం ఎక్కడికి చేరుతుందో ఈరోజుల్లో అందరికీ తెలుసు.

రాజకీయపార్టీలకు మహిళావిభాగాలూ, యువసేనలూ ఇలా రకరకాల శాఖలు ఉన్నాయి. వారు ఇలాంటి సమయాల్లో రంగంలోకి దిగి మారుమూల మునిగిపోయిన పల్లెలకు వెళ్లి సహాయకార్యక్రమాలు చెయ్యవచ్చు కదా. అలాంటి చిత్తశుద్ధి మాత్రం ఎవరిలోనూ కనపడదు. 

ఇకపోతే సినిమానటులకు కూడా సేనలున్నాయి. ఈ సేనలు తాగి బజార్లో పడి రౌడీలలాగా వీరంగం చెయ్యడమే గాని ఇలాంటి ఆపత్సమయాల్లో మంచి సేవాకార్యక్రమం ఒక్కటి చేసిన దాఖలాలు ఎక్కడా కనపడవు.వాళ్ళ సంస్కారస్థాయి అలా ఉంటుంది.

నిన్న విజయవాడలో ఒక సంఘటన జరిగింది. ఊరిలో లోతట్టు ప్రాంతం కొంత భాగం వర్షాలకు మునిగిపోయింది. ఆ పేటలో నివసిస్తున్న ఒక గృహిణి మంచినీటి కోసం బిందె తీసుకుని మోకాలిలోతు నీళ్ళలో వెళుతూ రోడ్డుమీద ఉన్న ఒక గుంతలో కాలేసి మునిగి చనిపోయింది. నీటిలో మునిగిన రోడ్డులో ఎక్కడ గుంతలున్నాయో కనపడవు కదామరి. బజారుకెళ్ళిన భర్త ఇంటికి వచ్చేసరికి భార్యశవం వరద నీళ్ళలో తేలుతూ కనిపించింది.ఈ పాపం ఎవరిదీ?

స్వతంత్రం వచ్చి అరవైఏళ్ళైనా సిటీలలో కూడా ఇప్పటికీ మంచినీరు సప్లై చెయ్యలేని ప్రభుత్వానిదా? టౌన్ ప్లానింగ్ అనేది పేరుకే గాని అసలంటూ ఎక్కడా ఏ ప్లానింగూ లేని మునిసిపాలిటీ శాఖదా? వాడవలసిన పాళ్ళలో కంకరా సిమెంటూ వాడకుండా సగం పైగా బొక్కేసి పైపైన నాసిరకం రోడ్లు వేస్తున్న రాజకీయ కాంట్రాక్టర్లదా? దానిని చూచీ చూడనట్లు ఊరుకుంటూ మామూళ్ళతో జేబులు నింపుకుంటున్న అధికారులదా? ఒక ప్లానింగ్ అంటూ లేకుండా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న రాజకీయులదా? సామాన్యుడి  ఉసురు వీరిలో ఎవరికి తగలాలి?

తుఫాన్ వొచ్చినా దానిని తమ జేబులు నింపుకోడానికి మాత్రమె నాయకులూ అధికారులూ ఉపయోగించుకుంటున్నారు అన్నది ఒక చేదునిజం. నిన్న ఒక రాష్ట్ర ప్రభుత్వోద్యోగి ఒక మాట చెబితే విని నివ్వెరపోయాను."పోయినేడాది ఒచ్చినట్లే ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి దేవుడా"--అని మొక్కుకునే ఉద్యోగులు రాష్ట్రప్రభుత్వంలో ఉన్నారట.రాజకీయ నాయకులు కూడా కొందరు ఇలా మొక్కుకుంటారట.ఎందుకంటే,తుఫాన్ వస్తే మళ్ళీ కేంద్రనిధులు వస్తాయి.కాంట్రాక్టులు వస్తాయి.రోడ్లు వేసుకోవచ్చు,గుంటలు పూడ్చుకోవచ్చు, అసలే వెయ్యని కొన్ని రోడ్లను తుఫాన్ ఎకౌంట్లో కొట్టుకు పోయినట్లు చూపించవచ్చు,అసలు పంటేవెయ్యని పొలాలలో కూడా పంట మునిగి నష్టపోయినట్లు చూపించి పరిహారం బొక్కేయ్యవచ్చు, ఇలా ఎన్నో ఇంకేన్నో రకాలుగా ఈ తుఫాన్ను వాడుకుని నిధులు రాజమార్గంలో స్వాహా చెయ్యవచ్చు.అందుకని అలా మొక్కుకుంటారట. తుఫాన్ ను నమ్ముకుని కోటీశ్వరులైనవారు ఎందఱో ఉన్నారట.

మనుషుల రూపంలో సమాజంలో తిరుగుతున్నది జంతువులే అని నేను ఎప్పుడూ అనుకుంటాను. అది నిజమే అని రోజురోజుకూ రుజువులు లభిస్తుంటాయి.నాది పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అని కొందరు నాతో అన్నారు. కాని నా ఈ అభిప్రాయం వెనుక బలమైన అనుభవాలున్నాయి.ఆ మధ్య నేను లక్నో వెళ్లి ఒస్తున్నపుడు ఒక సంఘటన జరిగింది. మధ్యలో భోపాల్ లోనో ఏదో ఒక పెద్ద స్టేషన్లో ట్రెయిన్ ఆగినపుడు టిఫిన్ తిందామని దిగినప్పుడు ఒక హృదయ విదారకమైన సంఘటన చూచాను. ఆ ప్లాట్ఫారం మీద ఒక బట్టలు లేని స్త్రీశవం పడి ఉంది. సన్నగా స్కెలిటన్ లాగా అయిపోయి ఉంది ఆమె. ఈగలు భయంకరంగా ముసురుతున్నాయి. అన్ని వేలమందీ ఆ ప్లాట్ఫారం మీద బిజీగా తిరుగుతూ కూడా ఆ శవాన్ని  చూడనట్లుగా నటిస్తూ వెళ్లి టిఫిన్లు కొనుక్కోచ్చుకుని తింటున్నారు గాని ఒక్కరూ ఆ శవాన్ని పట్టించుకోవడం లేదు.ఆ శవాన్ని చూడలేక వెనక్కితిరిగి నా బోగీ దగ్గరికి వచ్చి, సూట్కేస్ లోని దుప్పటి తీసి ట్రెయిన్ దిగి ఆ శవానికి కప్పివస్తుంటే  నన్నొక పిచ్చివాణ్ని చూసినట్లు చూచారు జనమంతా. పైగా ఒక ప్రయాణీకుడు " ఆమెకు ఎయిడ్స్ ఉందేమో ఎందుకు అలా రిస్క్ తీసుకున్నారు? అది రైల్వే పోలీసుల పని. మన పని కాదు" అని ఇంగ్లీషులో చాలా గొప్ప సలహా ఇచ్చాడు. అప్పటిదాకా దేశసమస్యల గురించీ రాజకీయాల గురించీ అనర్గళంగా చర్చిస్తున్న పెద్దమనిషి అతగాడు.ఆపైన వాడితో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం కలిగింది. ఈ సంఘటన చూచాక, ట్రెయిన్ విజయవాడ చేరేవరకూ నేను మామూలు మనిషిని కాలేకపోయాను. 

ఇలాంటి వెధవలతో నిండిఉన్న దేశం మనది.శవాలమీద డబ్బులేరుకునే నాయకులూ అధికారులూ ప్రజలూ ఉన్న ఈ దేశం అసలు బాగుపడుతుందని ఊహించడమే తప్పు.మంచివాళ్ళు అసలు లేరా?మీకేవరూ ఎక్కడా కనిపించలేదా అని అనుమానం చదివేవారికి రావచ్చు. కనిపించారు. మన చుట్టూ ఎందఱో మంచివాళ్ళు ఉన్నారు. కానీ వారి సంఖ్య అతిస్వల్పం. సముద్రంలో కాకిరెట్ట లాగా, నల్లటి బ్లాక్ బోర్డ్ మీద చిన్న తెల్లటిచుక్కలాగా ఉంది మన సమాజంలో హృదయమున్న మంచివాళ్ళ సంఖ్య.ఉన్న కొద్దిమందీ 'ఆ మనకెందుకులే' అనుకుంటూ సజీవశవాలుగా బతుకుతున్నారు.

పై సంఘటనకు పూర్తి కాంట్రాస్ట్ గా నేను చూచిన ఇంకొక సంఘటన చెప్తాను. కొన్నేళ్ళ క్రితం అరుణాచలం వెళ్ళాను.లేచి నడవలేక రోడ్డుమీద ఈడ్చుకుంటూ వెళుతున్న ఒక అడుక్కుతినే స్త్రీని అక్కడ చూచాను. ఆమెకు నడుములు పడిపోయినట్లు ఉన్నాయి. ఆమె కొంత దూరం అలా పాకి,చివరకు  పాకడానికి కూడా శక్తి లేక రోడ్డుపక్కనే పడిపోయింది. మొఖం చూస్తే,తిండి తిని కనీసం రెండు మూడు రోజులైనట్లు ఉన్నది. మర్యాదస్తులైన భక్తులూ  నగరపౌరులూ షరా మామూలుగా ఏమీ పట్టనట్లు వారిదారిన వారు అలా పోతూనే ఉన్నారు. ఇంతలో ఇంకొక సాధువు ఆ దారిన పోతున్నాడు. అతనూ అడుక్కు తినేవాడే. తన దగ్గరున్న చిల్లర పోగేసి రోడ్డుపక్క బండి దగ్గర అప్పుడే ఇడ్లీ కొనుక్కున్నాడు.నేనూ అదే బండి దగ్గర ఒక బల్లమీద కూచుని ఉన్నాను. ఇడ్లీని నోటి దగ్గర పెట్టుకోబోతూ ఈ దృశ్యాన్ని అతను చూచాడు.వెంటనే చెమర్చిన కళ్ళతో "భగవంతుడా ఏమిటి నీ సృష్టి" అని తమిళంలో అంటూ తన చేతిలోని ఇడ్లీలు ఆమెకు ఇచ్చి తనదారిన తాను వెళ్ళిపోయాడు. ఇది నేను కళ్ళారా చూచిన సంఘటన.

మన ఎడ్యుకేటెడ్ యానిమల్స్ కంటే, రాజకీయ కుష్టురోగులకంటే, అవినీతి కేన్సర్ ముదిరిన ఉద్యోగులకంటే, ఒక పూట డిన్నర్ కు పదివేలు ఖర్చుపెట్టే మనుషుల కంటే, ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయిన ఒక మహర్షిలా ఆ బిచ్చగాడు నా కంటికి కనిపించాడు.ఎందుకంటే, ఎందరిలోనో లేని స్పందించే హృదయం అతనిలో ఉంది. తానూ అడుక్కుతినేవాడై ఉండీ, తన నోటి దగ్గర తిండిని ఆకలితో ఉన్న ఇంకొక జీవికోసం ఇవ్వగలిగాడంటే మనలాంటి జంతువుల మధ్యన అతనే అసలైన మానవుడు అని నాకనిపించింది. భగవంతుని కరుణకు అతనే అసలైన పాత్రుడు అనిపించింది.

అవసరం ఉన్నా లేకున్నా వేల కోట్లు పోగేసి, అదీ చాలక 'ఇంకా ఇంకా' అని దాహంతో కొట్టుకుంటున్న నేటి నాయకులు, అవినీతి అధికారులు,వ్యాపారుల కంటే తన నోటిదగ్గర ఆహారం ఇంకొకరికి ఇచ్చిన ఆ బిచ్చగాడు ఎంతో ఉన్నతమైన 'మహా మనీషి' అని నేనంటాను. ప్రతి ఏడాదీ తుఫాన్ రావాలని మొక్కుకునే మన ఆంధ్రాజంతువులతో పోలిస్తే ఆ అడుక్కుతినేవాడు ఒక మహర్షి అని నా అభిప్రాయం. "ఆ శవాన్ని ఎందుకు తాకావు? ఆమెకు ఎయిడ్స్ ఉందేమో?" అని నన్ను ప్రశ్నించిన 'ఏసీక్లాస్ ఎడ్యుకేటెడ్ బ్రూట్' కంటే అరుణాచలం బిచ్చగాడు ఎన్నో వేలరెట్లు ఉన్నతుడే.కాదని ఎవరైనా అనగలరా? 

ప్రకృతి విలయాన్ని కూడా తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా మలచుకుని,పక్కవాడి నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్న నేటి మనుషుల కంటే , తాను ఆకలితో ఉండి కూడా తన తిండిని ఇంకొక జీవికి ఇచ్చిన అతను నిశ్చయంగా ఉత్తమోత్తముడే. ఇందులో ఏమీ అనుమానం లేదు.'మంచి మనుషులు సమాజంలో ఉన్నారు అని నాకు తెలుసు' అని చెప్పడానికే ఈ ఉదాహరణ ఇచ్చాను. కానీ వారి సంఖ్య చాలడం లేదు. వారికున్న వనరులూ స్వల్పమే. కానీ ఒక మంచిపని చెయ్యడానికి ఆర్ధిక స్తోమతతోనూ వనరులతోనూ పని లేదు. స్పందించే హృదయం ఒక్కటే కావలసింది. అదుంటే,ఆపదలో ఉన్న మనిషికి తమ పరిధిలో తాము సాయం చెయ్యవచ్చు. ఈ ఆలోచన మన రాజకీయ పార్టీలకూ, సోది సంఘాలకూ ఎందుకు రాదు? అన్నదే నా ప్రశ్న.

ఆ బిచ్చగాడికి ఉన్న మానవతా హృదయం మనకు కూడా కలిగే అదృష్టం ఆ దేవుడు కలిగిస్తే ఎంత బాగుంటుంది? అప్పుడీ భూమి స్వర్గంగా మారదూ? ఒక నిరాడంబరమైన పర్ణశాలలో ఉండే ప్రశాంతత, సంపన్నుల విలాస భవనాలలో కూడా ఉండాలని ఆశించడం నాదే పొరపాటంటారా? సరే అలాగే కానివ్వండి. కాదని నేను మాత్రం ఎలా అనగలను?
read more " ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి "

1, నవంబర్ 2012, గురువారం

వింతదేశంలో ఎన్నో వింతలు

మన దేశాన్ని ఇప్పటివరకూ నాశనం చేసిన,ఇంకా చేస్తున్న,రెండు ప్రధానశక్తులు ఏవంటే- ఒకటి రాజకీయాలు, రెండు సినిమాలు అని చెప్పచ్చు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమె కాదు.నిష్పక్షపాతంగా ఆలోచించగలిగిన ఎవరైనా ఇదే అంటారు. ప్రస్తుతం అందరు మేధావులూ ఇదే అంటున్నారు.

నీతిలేని రాజకీయరంగం వల్ల మనదేశం ఎదగవలసినంత ఎదగలేక పోయింది అన్నది సత్యం. ఒకప్పుడు మనలాంటి దేశమైన చైనావైపు ప్రస్తుతం మనం కనీసం కన్నెత్తి చూడలేని స్తితిలో ఉన్నామంటే మొదటి కారణం మన దేశపు నీతిలేని,స్వార్ధపూరిత రాజకీయాలు.వ్యక్తిగత స్వార్ధం కోసం దేశ ప్రయోజనాన్ని అమ్ముకోడానికి ఏమాత్రం వెనుదీయని నాయకులే కారణం. చైనాలో వారికి దేశం ముఖ్యం.మనకో,గ్రూపులు కట్టి ఎవడికి చిక్కినంత వాడు దోచుకోవడం ముఖ్యం.అందుకే మన దేశం ఇలా అఘోరిస్తోంది.

సగటు భారతీయుడు తన గురించే ఆలోచిస్తాడు.పక్కవాడి గురించి కొంచం కూడా ఆలోచించడు.దేశం గురించి అసలే ఆలోచించడు.ఇదికూడా నేను చెబుతున్న మాట కాదు. అంతర్జాతీయసంస్థలు సర్వే చేసి చెబుతున్న నిజం.సగటు భారతీయుడు పచ్చి స్వార్ధపరుడు అనేది నగ్నసత్యం. తన స్వార్ధంకోసం ఏ రూల్ నైనా తుంగలో తొక్కడానికి వెనుదియ్యడు అనేది ఇంకో సత్యం.

కానీ ఒకప్పుడు పరిస్తితి ఇలా ఉండేది కాదు.ప్రాచీన భారతీయుడు ఇలా ఉండేవాడు కాదు.నిలువెల్లా నిఖార్సైన విలువలతో నిండి ఉండేవాడు.మరి నేటి దిగజారుడుతనానికి కారణం ఏమిటి? అంటే రాజకీయాలదే ప్రధానపాత్ర అని చెప్పాలి.రాజకీయ పార్టీలన్నీ కులపార్టీలూ,మతపార్టీలే.మళ్ళీ మనదేశం కులానికీ మతానికీ చెందని సెక్యులర్ దేశం అని చెబుతాం.కానీ ఇక్కడ ఉన్నవి ఆరెండే.చెప్పెదోకటీ చేసేదోకటీ కావడమూ,డబ్బే దైవం కావడమూ,విలువలను తుంగలో తోక్కడమే మన సమాజపు ప్రధాన సమస్యలు.ఈ జాడ్యాలను పెంచి పోషిస్తున్నవి దారితప్పిన రాజకీయాలూ సినిమాలే.

ప్రజాస్వామ్యంలో మౌలిక విలువలను కాపాడవలసిన వ్యవస్థలను అన్నింటినీ రాజకీయ జోక్యం నిర్వీర్యం చెయ్యడమే కాక,తమ స్వార్ధానికి ఉపయోగపడే తొత్తులుగా వాటిని మార్చుకుంది.కనుక సమాజం క్రమేణా భ్రష్టుపట్టింది.నేడు సమాజంలో పోలీస్ వ్యవస్థపైనా,న్యాయవ్యవస్థ పైనా, ఇంకా అనేక మూలస్తంభాల్లాంటి వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం సడలిపోయిందంటే దానికి కారణం నీతితప్పిన రాజకీయవ్యవస్థ యొక్క అనవసర జోక్యం మాత్రమే.

నన్ను సరిగ్గా పనిచేసుకోనివ్వడం లేదు అని ఒక సెన్సార్ బోర్డు సభ్యురాలు ఈ మధ్యన మొత్తుకున్నా, రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని దేవాదాయ శాఖలోని ఒక అసిస్టెంట్ కమీషనర్ స్థాయి అధికారిణి ఈమధ్యనే ఆత్మహత్య చేసుకున్నా,నిజాయితీగా వ్యవహరిస్తున్నందుకు అయ్యేఎస్ ఐపీఎస్ అధికారులు వేధింపులకు గురైనా -- ఇవన్నీ కూడా దేశాన్ని నాశనం చేస్తున్న రాజకీయం యొక్క వివిధ రూపాలే.బడా వ్యాపారవేత్తలతో కుమ్మక్కై రాజకీయులు దేశాన్ని ఎలా సర్వనాశనం చేస్తున్నారో ఈదేశపు సామాన్యుడికి ఈ జన్మకి అర్ధం కాదు.అసలు ఆ స్థాయిలో ఏమేం జరుగుతున్నాయో సగటు పౌరుడు ఊహించను కూడా ఊహించలేడు.

ఇకపోతే సమాజంలో విలువలూ,మంచిభాషా,మంచిప్రవర్తనా దిగజారి పోవడానికి ప్రధానపాత్ర సినిమాలదే.సినిమా అనేది సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.సమాజానికి చవకలో వినోదాన్ని పంచేవి సినిమాలే.అవి స్లో పాయిజన్ ఎక్కించడం మొదలుపెడితే కొన్నేళ్ళకు తెలీకుండానే సమాజం మొత్తం నాశనం అవుతుంది.ప్రస్తుతం జరుగుతున్నది అదే.ఎంతసేపూ హింసనూ,అశ్లీలభాషనూ,అశ్లీలదృశ్యాలనూ చూపించి,వివాదాస్పద అంశాలను రెచ్చగొట్టి,సొమ్ము చేసుకునే సినిమారంగంవల్ల గత ఇరవై ముప్పైఏళ్లలో సమాజం దారుణంగా దిగజారింది అన్నమాట ఇంకో నగ్నసత్యం.నాసిరకం వినోదాన్ని సమాజానికి ఒక వ్యసనంలా అంటగడుతూ సినిమారంగం అప్రతిహతంగా వర్దిల్లుతున్నది. దానిని సగటుపౌరుడు ఎంజాయ్ చెయ్యడం వెకిలివింత.  

సినిమావాళ్లకు ఒంట్లో శక్తితగ్గి మొహంలో ముసలితనం కన్పించేసరికి అక్కడ రిటైరై, ప్రజల్లో తమకున్న క్రేజ్ ను పెట్టుబడిగా పెట్టి,  రాజకీయాలలోకి రావడం భలేవింత.ప్రపంచంలోని ఏరంగానికైనా ట్రైనింగ్ అవసరం. కానీ రాజకీయానికి ట్రెయినింగ్ అవసరం లేదు.నిన్నటివరకూ అతడు ఎవరైనాసరే పర్లేదు,ఈరోజు నుంచి రాజకీయనాయకుడు కావచ్చు.దేశాన్ని ఎటో తీసుకుపోవచ్చు. పొలిటికల్ సైన్స్ లో ఓనమాలు తెలియని నాయకులకు జనం ఓట్లేసి వాళ్ళను అధికారంలోకి తేవడం అతిపెద్దవింత. సినిమానటులూ రాజకీయులూ వ్యాపారులూ వియ్యం కలుపుకుని ఒకరినొకరు పరస్పరం కాపాడుకుంటూ వారివారి అవినీతి సామ్రాజ్యాలు విస్తరించుకుంటూ సమాజం భ్రష్టు పట్టడానికి స్పీడుగా దోహదం చెయ్యడం ఇంకో అసలైన వింత.

ఇకపోతే ఎడాపెడా సమాజధనాన్ని దోచుకున్న రాజకీయులూ సినిమావాళ్ళూ దొంగవ్యాపారులూ ఆ డబ్బును విదేశాలలో హోటళ్ళకూ ఇతర ప్రాజెక్టులకూ పెట్టుబడి పెడుతూ ఈ దేశపు సంపదను ఇతర దేశాలకు దోచిపెట్టడం తెలివైనవింత.ఇవన్నీ తెలియని సగటు సామాన్యుడు,తన కులపార్టీకి కిమ్మనకుండా  కొమ్ముకాస్తూ ఆ నాయకుడు ఏమి చేసినా గుడ్డిగా సమర్ధించడం బానిసత్వపు వింత. మన కులంవాడైతే చాలు వాడేం చేసినా కరెక్టే అనే భావజాలం నీచమైన వింత. 

ఇదిలా ఉంటే, వీరి ఎదుగుదలకు కారకుడైన సగటుపౌరుడు మాత్రం సీసాకీ, నోటుకీ అమ్ముడుపోతూ విచక్షణ లేకుండా ఓటును అమ్ముకోవడం చాలా చీపైన వింత. అలాగే సినిమాల వల్ల విలువలపరంగా తానెంత నష్టపోతున్నాడో తెలుసుకోలేని సగటు ప్రేక్షకుడు టికెట్టుకొని అదే సినిమా చూస్తూ, తాగుడుకు బానిసై చావుకు చేరువౌతున్న తాగుబోతులాగా,ఆ హీరోల గురించీ,పాటల గురించీ,సినిమా కథల గురించీ,హీరోయిన్ల వెకిలివేషాల గురించీ మాట్లాడుకుంటూ ఇంకాఇంకా హీనమైన ప్రవర్తనకు అలవాటు పడుతూ దిగజారుతూ ఉండటం 'తన గొయ్యి తానే తవ్వుకునే'  తెలివిలేని వింత.

నిరంతర జాగరూకతతో కూడిన,జ్ఞానపూరితమైన,ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. మరి అలాంటి జాగరూకత వైపూ, జ్ఞానంవైపూ పోకుండా పాలకులే ప్రజలను అడ్డుకుంటూ,పౌరులను నైతికంగా నిర్వీర్య్లులను చేస్తూ, తమ పబ్బం గడుపుకుంటూ,దేశాన్ని దోచుకుంటూ ఉంటే అలాంటి దేశానికి ఏది దారి?

తాగుడునీ,చవకబారు సినిమాలనూ,వ్యసనాలనూ ప్రోత్సహిస్తూ,వాటిని ఆదాయవనరులలాగా పెంచిపోషిస్తూ,కులమతాలతోనూ,అడుగడుగునా అవినీతితోనూ నిండి,అవకాశవాదమే అసలైన రాజ్యాంగంగా వెలుగుతున్న   దేశానికి ఔన్నత్యం ఎటునుంచి వస్తుందో ఎలా వస్తుందో ఆ దేవునికే తెలియాలి.ఒకవేళ ఆ ఔన్నత్యం అంటూ వస్తేమాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో దానినే అతిపెద్ద వింతగా చెప్పుకోవాలి.
read more " వింతదేశంలో ఎన్నో వింతలు "