“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, డిసెంబర్ 2011, బుధవారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం-2

రజనీష్ జాతకంలో కొన్ని ముఖ్యఘట్టాలు మనకు తెలుసు. వీటి సాయంతో, ఆయా దశలనుబట్టి జన్మసమయాన్ని కొంత సరిచేద్దాం.

రజనీష్ తండ్రి (స్వామి దేవతీర్థభారతి)  8-9-1979 న మరణించారు. ఆయన జ్ఞానిగా మారి సమాధిస్తితిలో శరీరాన్ని వదిలిపెట్టాడని రజనీష్ చెప్పాడు. 5.09 అనేది జననసమయంగా మనం తీసుకుంటే ఆరోజున రజనీష్ కు శుక్ర/శని/గురు/రాహు/రాహుదశ జరిగింది. పితృస్థానమైన మకరం నుంచి శుక్రుడు యోగకారకుడు. రాహువు అష్టమాధిపతియగు గురువుకు సూచకుడు. నవమంనుంచి ఈఅష్టమం ద్వాదశం అవుతుంది. రాహువుదృష్టి గురువుమీద ఉంది. గురువు నవమాత్ సప్తమమారకంలో ఉచ్చస్తితిలో ఉన్నాడు. కనుక ఈదశ పితృమారకానికి సరిగ్గా సరిపోయింది. ఇక 5.10 అనేది జననసమయం అనుకుంటే, ఇదే దశ శుక్ర/శని/గురు/శుక్ర/రవి అవుతుంది. సూక్ష్మదశ ప్రాణదశలలో రాహువుస్థానంలో శుక్రరవులు ప్రత్యక్షమైనారు. ఆరోజున గోచారకుండలిని  పరిశీలిస్తే, మీనంలో చంద్రుడు 9 డిగ్రీలలో ఉండి జననకాలరాహువు ఉన్నటువంటి 8 డిగ్రీలకు చాలా దగ్గరలో ఉన్నాడు. కనుక ఈ సంఘటనకు రాహువుకు సంబంధం ఉంది. రాహువు నవమస్థానం నుండి ఆయుష్యస్థానం అయిన తృతీయంలో ఉండటం చూడవచ్చు. కనుక రాహు సూక్ష్మ, ప్రాణదశలను చూపిస్తున్న 5.09 మాత్రమే జననకాలసమయం కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోజున నవమాత్ అష్టమం అయిన సింహంలో ఆరుగ్రహాలు గుమిగూడి ఉండటం చూడవచ్చు. ఈ గ్రహకూటమినిబట్టి రజనీష్ తండ్రిగారు సమాధిస్తితిలో శరీరాన్ని ఒదిలిపెట్టటం నిజమే అని సూచన ఉంది.      

రజనీష్ 19-1-1990 న సాయంత్రం 5 గంటల సమయంలో పూనాలో మరణించాడు. ఆ సమయానికి జాతకంలో శుక్ర/శుక్ర/గురు/చంద్ర/రాహు దశలలో గురుదేహదశ జరిగింది. గోచారకేతువు జననకాల గురువుపైనా, గోచార శనిబుధులు జననకాల చంద్రబుధుల పైన సంచరించారు. శుక్రుడు లగ్నాధిపతి. గురువు ఉచ్ఛస్తితిలో ఉన్న అష్టమాదిపతి. ఇకపోతే చంద్రరాహువుల సూక్ష్మప్రాణదశలను బట్టి ఓషోరజనీష్ కు తీరనికోరికలు ఇంకా ఉన్నాయనీ, ఆయనకు పరిపూర్ణముక్తి లభించలేదనీ చెప్పక తప్పదు. ఓషోరజనీష్ చివరిరోజుల గురించి వచ్చిన పుస్తకం ఒకటుంది. దాని పేరు "Notes of a madman". అందులో ఒకచోట -- "ఓం" అనే అక్షరం రకరకాల రంగులలో వెలుగుతూ తన కళ్ళముందు దర్శనం ఇస్తూ ఉందని, ఆ రంగులలో ఎక్కువగా ముదురునీలం, వయొలెట్ రంగులు కనిపిస్తున్నాయనీ -- ఆయన అంటాడు. ఇలా ఎందుకు జరుగుతున్నదో అర్ధంకావడం లేదనీ, తాను కావాలని ఆ దర్శనాన్ని కోరుకోవడం లేదనీ, అయినా ఆ దర్శనం తనను వెంటాడుతున్నదనీ అంటాడు. ఓం అనేది శబ్దబ్రహ్మానికి, విశ్వచైతన్యానికీ (Universal Consciousness) సూచిక. కాని ఆస్థాయిలో ఉన్నవారికి కూడా తిరిగి పునర్జన్మ ఉంటుంది. దశలో అంతిమంగా రాహుస్పర్శ కూడా దీనినే సూచిస్తున్నది. పునర్జన్మ ఉంటుంది అనిఅన్నంత మాత్రాన రజనీష్ మామూలు మనుషులవంటి సామాన్యుడు అని మనం అనుకోకూడదు.


తనకు జ్ఞానోదయం కలిగిన సమయం 21 -3 -1953 రాత్రి అని, అప్పుడు తనకు 21 ఏళ్ళు అనీ రజనీష్ చెప్పాడు. అప్పుడు ఈయన జాతకంలో గురు/బుధ/బుధ/గురు/బుధ దశ జరుగుతున్నది. జననసమయం 5.09  అనుకుంటే శుక్ర దేహదశా, 5.10 అనుకుంటే చంద్రదేహదశా జరుగుతాయి. శుక్రుడు లగ్నాధిపతి, చంద్రుడు తృతీయాధిపతి  కనుక 5.09 వైపే సమయం మొగ్గు చూపుతున్నది. ఈ సమయంలో  దశానాధులైన గురు, బుధులవల్ల ఒకవిషయం స్పష్టం అవుతున్నది.గురువు అష్టమాదిపతి, బుధుడు పంచమాదిపతి. కనుక ఈయనకు ఆరోజున ఒక అతీత మార్మికఅనుభవం కలిగినమాట వాస్తవమే అని తెలుస్తున్నది. అయితే అది బౌద్ధికపరమైన అనుభవం మాత్రమే అని ఒకసూచన ఉంది. ఇది ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతఅనుభవం అయినప్పటికీ, పూర్ణసిద్ధికి సూచన మాత్రం కాదు. ఆ రోజున తనకు కలిగిన అనుభవం గురించి రజనీష్ చాలా వివరంగా వర్ణించాడు. ఆ అనుభవం తర్వాతకూడా చెయ్యవలసిన సాధన ఇంకా చాలా ఉంటుంది. చేరవలసిన గమ్యాలు చాలా ఉంటాయి. బహుశా అదే అంతిమఅనుభవం అని ఆయన అనుకోని ఉండవచ్చు. అలా అనుకోవడమే తర్వాత తర్వాత ఆయన చేసిన తప్పులకు కారణం అయి ఉండవచ్చు. 

గోచారరీత్యా ఆరోజున కుజశుక్రులు మేషం 8వ డిగ్రీలో ఉండి, జననకాల ధనూకుజునికి సరిగ్గా కోణస్థితిలో ఉన్నారు. గోచారగురువు మేషంలో 26 డిగ్రీలో ఉండి, జననకాల ధనూశనికి కోణస్తితిలోనూ, జననకాలగురువుకు కేంద్రస్తితిలోనూ ఉన్నాడు.   

ఇక్కడ దాగిఉన్న ఒక రహస్యాన్ని వివరిస్తాను. మార్చ్ 21 అనేది సాయనజ్యోతిషరీత్యా వసంతవిషువత్ అనబడుతుంది. ఖగోళశాస్త్రం ప్రకారం ఆరోజున భూమధ్యరేఖ క్రాంతికక్ష్యలు ఒకదానినొకటి ఖండించుకునే ఖగోళబిందువు మీదకు సూర్యుడు ప్రవేశిస్తాడు. అంటే సాయనమేషసంక్రమణం ఆరోజున జరుగుతుంది. మార్చ్ 21 సెప్టెంబర్ 23 లను equinoctial points అంటారు. అంటే ఆరోజులలో భూమ్మీద ఎక్కడచూచినా రాత్రీ పగలూ సమవ్యవధిలో ఉంటాయి. ఈ రెంటిలో మార్చ్ 21 అనేది వసంతవిషువత్ అనీ మేషసంపాతం అనీ   పిలువబడుతుంది. అంటే వసంతఋతువు ఆ రోజున మొదలౌతుంది. ఋతువులు సూర్యుని అనుసరించి ఏర్పడతాయి. రుతువులకూ మనిషిలోని హార్మోన్ స్రావాలకూ సంబంధం ఉంది. శరీరంలోని హార్మోన్ లెవెల్స్ బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. సూర్యగమనం ఆధారంగా లెక్కించే జ్యోతిష్య విధానాన్ని సాయనవిధానం అనీ సూర్యమానం అనీ అంటారు. దీనిని పాశ్చాత్యులు అనుసరిస్తారు. ఇటువంటి ప్రత్యేకమైన రోజునే రజనీష్ కు జ్ఞానోదయం కలిగింది. బుద్ధునికి పూర్ణిమ రోజున జ్ఞానోదయం కలిగింది. మహావీరునికి అమావాస్య రోజున జ్ఞానోదయం కలిగింది. రజనీష్ కు వసంత విషువత్ రోజున జ్ఞానోదయం కలిగింది. కనుక భూమ్మీద జరిగే సామూహిక సంఘటనల పరంగానే కాకుండా వ్యక్తిగత అంతరికవిషయం అయిన  సాధనాపరంగా కూడా ఈ ప్రత్యేకమైన రోజుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అంతేకాక ఆయా సాధకులకు కలిగే అనుభవాలు కూడా ఆయారోజులలో ఉండే ప్రత్యేకప్రభావాలకు అనుగుణంగానే ఉంటాయి. అందుకనే సంక్రాంతి రోజుల్లోనూ, విషువత్తులలోనూ , పౌర్ణమి అమావాస్యల లోనూ సాధన తీవ్రతరం చెయ్యాలని పెద్దలు అంటారు.  

పగలూ రాత్రీ ప్రపంచం మొత్తం సమమైన నిడివితో ఉండే రోజులలో భూమిమీద సమత్వస్తితి నెలకొని ఉంటుంది. "సమత్వం యోగ ఉచ్యతే"- అని యోగానికి నిర్వచనం ఉంది. కనుక ఆ రోజులలో యోగసాధకులకు సిద్ధికారక స్పందనలు ఎక్కువగా ఉంటాయి. రజనీష్ బోధలలో ముఖ్యమైనవి "ఎరుక" మరియు "సాక్షీభావ స్తితి". ఇవి సమత్వానికి పర్యాయపదాలు. సమత్వానికి సూచిక అయిన విషువత్ రోజున సమత్వానికి ప్రతీక అయిన యోగంలో సిద్ధికలగడం ఒక యోగరహస్యం. అంతేకాక ఆత్మజ్ఞానకారకుడైన సూర్యునికి ఈ రోజునించి ఉచ్ఛస్తితి మొదలౌతుంది. దీనికి ఇంకా లోతులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువగా వివరించను. ఒక్కటి మాత్రం చెప్తాను. చాలామంది నిరయనజ్యోతిష్కులు సాయనసిద్ధాంతాన్ని హేళన చేస్తుంటారు. ఈ హేళనాత్మకభావన పూర్తిగా తప్పు అని నేను నమ్ముతాను. సూర్యుడు లేకుండా జ్యోతిష్యం లేదు. కనుక సాయనవిధానాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే అదికూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సాయన విషువత్ రోజుననే రజనీష్ కు జ్ఞానోదయం కలగడం వెనుక సాయనవిధానం యొక్క ప్రాముఖ్యత దాగుంది.

రజనీష్ కు 7 వ ఏట చావు రాసిపెట్టి ఉందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. ఈయన పుట్టినపుడు వీరి తాతగారు ఆఊరిలోని ఒక ప్రసిద్ధజ్యోతిష్కుని సంప్రదించాడు. తీవ్రబాలారిష్టం ఉన్న జాతకమని ఆ జ్యోతిష్కుడు చెబుతూ, ఏడవఏట ఈబాలుడు మరణిస్తాడనీ ఒకవేళ అది తప్పిపోతే అప్పుడు ఇతని జాతకం వేస్తానని, అంతవరకూ ఈ జాతకం చూడననీ చెప్పాడు. ఇతని జాతకంలో ప్రతి ఏడేళ్ళకూ గండాలు ఉన్నాయని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే 14 , 21 కూడా మరణ సూచక వయస్సులేనని అతను అంటాడు.ఏడేళ్ళ వయస్సులో రజనీష్ చనిపోలేదు కాని, ఈయన్ని అమితంగా ప్రేమించిన తాతగారు(తల్లి తండ్రిగారు)  మరణించాడు. అదికూడా ఏడేళ్ళ పిల్లవాడైన రజనీష్ ఒడిలో తలపెట్టుకుని అయన చనిపోయాడు. రజనీష్ కూడా ఆయన్ని అమితంగా ప్రేమించాడు. అది రజనీష్ జీవితంలో అతిపెద్ద మొదటి షాక్. 

"ఆ వయసులో నాకు చావు రాలేదు. కాని నాలో ఒకభాగం చనిపోయింది. అది మా తాతగారితో వెళ్ళిపోయింది" అని తర్వాతికాలంలో రజనీష్ చెప్పాడు. తాతగారికి జబ్బుచేస్తే వైద్యంకోసం వాళ్ళున్న పల్లెనుంచి ముప్పైమైళ్ళ దూరంలోని  పట్నానికి ఎద్దుబండిలో వెళుతూ మార్గమధ్యంలో రజనీష్ ఒడిలో తలపెట్టుకుని తాతగారు నిస్సహాయంగా చనిపోయాడు. అది బాలరజనీష్ మనస్సును తీవ్రంగా కలచివేసింది. వేగంగాపోయే వాహనం లేకపోవడంవల్ల వైద్యసహాయం అందక తాతగారు చనిపోయారు అన్నబాధవల్లేనేమో తర్వాత జీవితంలో 93 రోల్స్ రాయస్ కార్లను ఆయన పోగుచేసాడు. ఇదే నిజమైతే ఆయనలో సంస్కారాలు నశించలేదని, మనోనాశం కలగలేదనీ అర్ధం అవుతున్నది. అలాంటప్పుడు ఆయన పొందిన సిద్ధి పరిపూర్ణసిద్ధి కాదు అనే చెప్పవలసి ఉంటుంది. 

కాని ఒక్కవిషయం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. సిద్ధపురుషులకు ఉండే సంస్కారాలకూ మామూలు మనుషులకు ఉండే సంస్కారాలకూ హస్తి మశకాంతరం  ఉంటుంది. మామూలు మనుషులకు క్షుద్రమైన సంస్కారాలుంటాయి. ఏదో సంపాదించాలని, దేన్నో అనుభవించాలన్న కోరికలుంటాయి. సిద్దులైన వారికి అలాటి కోరికలుండవు. చీకటిలో మగ్గుతున్న లోకులకు జ్ఞానజ్యోతిని చూపిద్దామన్న కోరిక వారిలో కొందరికుంటుంది. స్థూలదృష్టిలో దానిని కోరిక అనీ, సంస్కారం అనీ, అనలేం. కానీ అదికూడా ఒక సంస్కారమే. దానివల్ల కూడా పునర్జన్మ కలుగుతుంది.

అదలా ఉంచితే, ఏడోఏటికి ముందున్న పాతరజనీష్ ఒకరకంగా ఆరోజుతో చనిపోయాడు. జ్యోతిష్కుని జ్యోస్యం తాతగారి మరణంద్వారా నిజమైంది. అప్పుడు రజనీష్ జాతకంలో  అష్టోత్తరీదశాప్రకారం శని/శని/గురుదశ జరిగింది. ఈ సంఘటన జరిగిన తేదీ తెలియదు కనుక సూక్ష్మదశా ప్రాణదశలు లెక్కించలేము. శని గురువులిద్దరూ అష్టమభావంలో ఉండటంవల్ల, మాతామహుని సూచించే ద్వాదశభావం (చతుర్ధానికి నవమం) యొక్క అధిపతి కుజుడుకూడా వీరితో అష్టమంలో ఉండటంవల్ల బహుశా కుజసూక్ష్మదశ అయి ఉండవచ్చు. కుజసూక్ష్మదశ 10 -11 -1938  నుంచి 15 -11 -1938 వరకూ జరిగింది.  శని ఈజాతకానికి యోగకారకుడే కాని అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమాదిపతిగా తృతీయ ఆయుష్యస్థానంలో ఉచ్ఛస్తితిలో వక్రించి ఉన్నాడు. కనుక ఇది మారకదశ అయినప్పటికీ పూర్తిగా మారకదశ కాదు. కనుక ఈయనకు బాగా ఇష్టుడైన తాతగారి మరణం జరిగింది.

అయితే ఈ సంఘటన ఇతని లేతమనస్సు మీద బలమైన ముద్ర వేసింది. అంతేగాక -- "మరణం అంటే ఏమిటి? ఆ సమయంలో అసలేం జరుగుతుంది?" అన్న చింతన ఆ లేతమనస్సులో తీవ్రంగా మొదలైంది. ఈ చింతనాప్రభావం వల్లనే తన సాటివయస్కులతో కలిసి ఆడుకోవడం మొదలైనపనులు రజనీష్ ఆవయసులో చేసేవాడు కాదు. ఆ చేష్టలన్నీ అతనికి పిల్లచేష్టలుగా తోచేవి. ఇక్కడనుంచి 14 ఏళ్ళ వరకూ ఆయన జీవితం ఈ జిజ్ఞాసతోనే సాగింది.

ఇకపోతే 14 ఏళ్ల వయస్సులో ఇంకొక విచిత్రఅనుభవం ఈయన్ను వరించింది. 14 ఏళ్ళు దగ్గరపడుతున్న కొద్దీ జ్యోతిష్కుడు చెప్పిన జోస్యం మళ్ళీ నిజమౌతుందేమో, మళ్ళీ చావు ఇతనికి ఎదురౌతుందేమో అని కుటుంబసభ్యులు చాలా కంగారుపడ్డారు. ఈసంగతి రజనీష్ కి కూడా తెలిసింది. అప్పటికే అతను తన వయస్సుకు మించిన మానసికపరిపక్వతను పొంది ఉన్నాడు. సరే మరణం ఎలాగూ తప్పనపుడు దానికి మనమే ఎదురుపోతే పోలేదా? అలా చావుకు ఎదురువెళితే ఏమి జరుగుతుందో చూద్దామని రజనీష్ అనుకున్నాడు.

ఒక వారంరోజులలో తన 14 వ జన్మదినం వస్తుందనగా రజనీష్ ఒక ప్రయోగం చేసాడు. వారున్న పల్లెటూరిలో ఊరిబయట చెరువుగట్టున ఒక చిన్నగుడి ఉంది. అది దాదాపుగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ రారు. రోజుకొకసారి మాత్రం తనకు కొంత ఆహారం ఇవ్వమని ఆ గుడిపూజారితో ఒప్పందం కుదుర్చుకుని రజనీష్ ఆగుడిలో పడుకొని మరణంకోసం ఎదురుచూడసాగాడు. అది వచ్చినపుడు కంగారుపడకుండా ప్రశాంతంగా దానికి స్వాగతం చెప్పాలని అతని ఊహ. అంతేగాక మరణం ఎలా వస్తుందో, మరణంలో ఏమి జరుగుతుందో చూద్దామని, దాని రహస్యాన్ని చేదించాలనీ అతను భావించాడు. ఒక వారంరోజులు ఒక్కడే ఆగుడిలో రాత్రింబవళ్ళూ ఉంటూ మరణంకోసం ఎదురుచూశాడు. పద్నాలుగేళ్ళ పిల్లవానిలో అంత మానసికపరిపక్వత ఉండటం మామూలువిషయం కాదు. అది చాలా గొప్పవిషయం. ఎన్నోజన్మలనుంచీ అతను చేస్తున్న సాధనవల్లనే అంత పరిపక్వత అతనికి కలిగింది అని మనం భావించవచ్చు. 

ఒకరోజు రాత్రి రజనీష్ అలా పడుకొని మరణంకోసం ఎదురుచూస్తూ ఉండగా ఒక తాచుపాము ఆ గుడిలోకి ప్రవేశించింది. అదొక పల్లెటూరు, చుట్టూ పొలాలు చెరువూ ఉండటంతో అక్కడ పాములు బాగా తిరుగుతూ ఉండేవి. రజనీష్ దానిని గమనించి ఆ రూపంలో చావు వచ్చిందని భావిస్తూ కదలకుండా దానిని చూస్తూ ఉండిపోయాడు. ఆపాము పాకుతూ వచ్చి, పడుకొని ఉన్న రజనీష్ మీదికెక్కి, పాకుతూ అవతలకి దిగి ఎటో వెళ్ళిపోయింది. ఇదంతాకూడా చూస్తూ రజనీష్ కదలకుండా కట్టెలా పడుకుని ఉన్నాడు. ఈ వారంరోజుల చావుకోసం ఎదురుచూపులో, చివరికి జరిగిన ఈ పాము సంఘటనలో అతనికి ఎన్నోవిషయాలు అర్ధం అయ్యాయి.  మరణం అనేది అసలు లేనేలేదనీ, అది శరీరానికే వర్తిస్తుందనీ, శరీరం మరణించిన తర్వాతకూడా నిలిచి ఉండేది ఒకటి ఉంటుందనీ అతనికి అర్ధమైంది.

మరణం అంటే భయపడవలసిన పని లేదనీ, అది ఎంతో విశ్రాంతిగా హాయిగా ఉండే స్తితి అనీ, మన భయంవల్లనే దానిని మనం స్వీకరించలేకపోతున్నామనీ, భయాన్ని వదిలి దానిని స్వాగతిస్తే, ప్రపంచంలో అంతచక్కని విశ్రాంతి ఇచ్చేస్తితి ఇంకొకటి లేదనీ ఆయనకు తెలిసింది. ఆ సమయంలో గురు/రవి/శనిదశ ఆయన జీవితంలో జరిగింది. గురువు అష్టమాధిపతి, రవి మారకస్థానమైన సప్తమంలో ఉన్నాడు. శని ఏకాంతవాసానికీ ఆధ్యాత్మికజీవనానికీ సూచకుడు. కనుక ఈసమయం ఈసంఘటనకు చాలాసరిగ్గా సరిపోయింది. ఇకపోతే, 21 ఏళ్ళ వయస్సులో తనకు కలిగిన జ్ఞానోదయానుభవమే అసలైనమరణం అని రజనీష్ చెప్పాడు.అది ఎలాజరిగిందోపైనచూచాం. ఈ విధంగా పల్లెటూరిలోని   జ్యోతిష్కుడు చెప్పినట్లు ప్రతి ఏడేళ్ళకొకసారి రజనీష్ జీవితంలో మరణం ఎదురుపడింది. మొదటిసారి ఏడేళ్ళ వయస్సులో తాతగారి మరణంతో అప్పటివరకూ అతనిలో ఉన్న బాల్యం చనిపోయి ఆస్థానంలో జిజ్ఞాసతో కూడిన పరిపక్వతా అంతరికపరిశీలనా చోటుచేసుకున్నాయి. 14 ఏళ్ళ వయస్సులో వారం రోజులపాటు అహోరాత్రులూ తదేకంగా మరణంకోసం చూచిన ఎదురుచూపు ఒక తీవ్రధ్యానంగా మారి అతనికి అంతరికలోకపు లోతులు చూపించింది.అప్పటివరకూ ఉన్న రజనీష్ మరణించి మళ్ళీ ఒక కొత్త వ్యక్తీ ఉద్భవించాడు.తిరిగి 21 ఏళ్ళ వయస్సులో తన పరిమిత అహంకారాన్ని దాటిపోవడం ద్వారా కలిగిన అనుభూతి నిజమైన మరణంగా పరిణమించి ఎన్నో జన్మలనుంచీ ఎదురుచూస్తున్న సిద్ధస్తితిని ఆయనకు ఇచ్చింది.పరిమితాహంకారనాశనమూ,విశ్వవ్యాప్త చైతన్యానుభవమూ కలిగేస్థితినే జ్ఞానోదయం అని అంటారు.  ఆధ్యాత్మికకోణంలో అదే నిజమైన మరణం అని చెప్పవచ్చు.

రజనీష్ జీవితంలో జరిగిన ఇంకొక ముఖ్యసంఘటన -- చిన్ననాటి తన స్నేహితురాలైన వివేక్ మరణం. రజనీష్ చిన్నతనంలో ఆయనకు ఒక స్నేహితురాలుండేది. ఆ అమ్మాయి పేరు శశి. ఇద్దరూ ఒకేవయస్సువాళ్ళు అవటంతో, ఆపల్లెటూళ్ళో ఆడుతూపాడుతూ నిష్కల్మషంగా తిరుగుతూ కాలంగడిపారు. వారిద్దరి మధ్యన ప్రేమఉందని మనం ఊహించవచ్చు. రజనీష్ కు 17 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి 15 ఏళ్ళు ఉండేవి. అయితే, ఏదో జబ్బుచేసి ఆ అమ్మాయి హటాత్తుగా చనిపోయింది. ఆ రోజుల్లో మలేరియా, టైఫాయిడ్, జాండీస్, కలరావంటి రోగాలకు కూడా పల్లెల్లో మందులుండేవి  కావు. అలాటిదే ఏదో రోగంతో ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయే ముందు రజనీష్ చేతిలో చెయ్యివేసి, తాను మళ్ళీ పుడతాననీ తనని వెతుక్కుంటూవస్తాననీ చెప్పింది.

తర్వాత కొంతకాలానికి ఇంగ్లాండ్ లో "క్రిస్టిన్ వూల్ఫ్" అనే పేరుతో పుట్టిన ఒకఅమ్మాయి ఇరవైఏళ్లతర్వాత ఏదోతెలియని ఆకర్షణచేత లాగబడి, వెతుక్కుంటూ ఇండియాకు వచ్చింది. రజనీష్ ఉపన్యాసాలు విన్న ఆఅమ్మాయి ఇక ఇంగ్లాండ్ కు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయింది. ఇలాఉండగా రజనీష్ సమక్షంలో ఒకరోజున అనుకోకుండా ఆఅమ్మాయి ఒక రకమైన ట్రాన్స్ లోకివెళ్లి తన పూర్వజన్మఘట్టాలను సినిమాతెరమీద సీన్లలాగా చూసింది. పూర్వజన్మలో  శశిగా ఉన్నప్పుడు తాను రజనీష్ తో కలిసి ఎలా ఆడుకున్నదీ, తరువాత ఎలా చనిపోయిందీ, అప్పుడు తాను చేసిన వాగ్దానమూ ఆ ఘట్టాలన్నీ కళ్ళముందు సినిమాసీన్లలాగా కనిపించాయి. అదే సమయంలో రజనీష్ కూడా ఆఅమ్మాయికి పూర్వజన్మ గురించి చెప్పాడు. ఆ అమ్మాయిని మొదటి సారి చూచినప్పుడే ఆమె తన గతజన్మస్నేహితురాలైన "శశి" అని రజనీష్ గుర్తించాడని చెప్తారు. అయితే ఆవిషయం ఆమెతో చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె ట్రాన్స్ లో తన గతజన్మ జ్ఞాపకాలను చూచిందో అప్పుడు ఆమెకు విషయాన్ని తెలియచేసాడు.

అప్పటినుంచి ఆమె చనిపోయేవరకూ రజనీష్ తోనే ఉండి అతనికి సేవ చేస్తూ ఉండిపోయింది. "మా యోగవివేక్" అని రజనీష్ ఆమెకు సన్యాసనామాన్ని ఇచ్చాడు. అయితే ఈఅమ్మాయి అనుమానాస్పద పరిస్తితుల్లో బాంబేలోని ఒక హోటల్లో 9-12-1989 న మరణించింది. ఆరోజున రజనీష్ జాతకంలో శుక్ర/శుక్ర/గురు/శుక్ర/శుక్రదశ జరిగింది. స్నేహితులను ఏకాదశస్థానం నుంచి చూడాలి. రజనీష్ జాతకంలో ఇది మీనం అవుతుంది. మీనంలో రాహువుయొక్క స్తితివల్ల రజనీష్ కు విదేశీశిష్యులూ స్నేహితులూ ఎక్కువగా ఉన్నారు. రజనీష్ జాతకంలో గురువు, తనయొక్క అష్టమ లాభాదిపత్యాల వల్ల పూర్వజన్మబంధాన్ని సూచిస్తున్నాడు. శుక్రుడు మీనలగ్నానికి మారకుడు. గురువు రజనీష్ కు  లాభాధిపతిగా స్నేహితులను సూచిస్తున్నాడు. శుక్రుడు లగ్న షష్ఠ అధిపతిగా తనకు ఈ కోణంలో మిగిలిఉన్న కర్మశేషాన్ని సూచిస్తున్నాడు.

ఆ రోజున గోచారగ్రహాలస్తితిని బట్టి - గోచారశని సరిగ్గా ధనుస్సు 19 డిగ్రీలమీద సంచరిస్తూ జననకాల శుక్రునిమీద ఉన్నాడు. గోచారబుధుడు ధనుస్సు 9 డిగ్రీల మీద జననకాల సప్తమాధిపతి అయిన కుజునికి చాలా దగ్గరగా ఉన్నాడు. గోచారకుజుడు వృశ్చికం 0 డిగ్రీలో ఉన్నాడు. ఈమె చనిపోయిన సరిగ్గా 40 రోజులకు రజనీష్ కూడా శరీరాన్ని ఒదిలిపెట్టాడు. అప్పటికే రజనీష్ ఆరోగ్యం బాగా క్షీణిస్తూన్నదనీ, దానినిచూచి భరించలేని  వివేక్, ఆయనకంటే ముందుగా పోవాలని, హైడోస్ లో స్లీపింగ్ పిల్స్ మింగిందనీ కొందరంటారు. అదేమీ లేదు, ఆ అమ్మాయి ఏదో వ్యాధితో బాధపడేది. దానికి సంబంధించిన మందులు ఎక్కువ డోస్ లో వేసుకోవడంతో చనిపోయింది అని కొందరంటారు.  

అవన్నీ ఎలా ఉన్నప్పటికీ , ఈ విశ్లేషణ అంతా 5.09 నిమిషాల జనన సమయానికే సరిపోతున్నది.  కనుక ఈ సమయమే రజనీష్ జనన సమయం అని అనుకోవచ్చు.
read more " ఓషో రజనీష్ జాతకం, భావజాలం-2 "

22, డిసెంబర్ 2011, గురువారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం -1

రజనీష్ చంద్రమోహన్ జైన్ అనేది ఓషో అసలు పేరు. ఈయన 11-12-1931  రోజున మధ్యప్రదేశ్ లోని కచ్వారా అనే ఊరిలో పుట్టాడు. జనన సమయం సాయంత్రం 5.00 నుంచి 5.45 లోపు అని అంటారు. ఈయన జాతకంలో ముఖ్య సంఘటనలు మనకు తెలుసు. కనుక ఆయా సంఘటనల ఆధారంగా ఈ జాతకాన్ని రెక్టిఫై చేద్దాం. అదే సమయంలో ఈయన భావజాలాన్నీ పరిశీలిద్దాం.

రజనీష్ చెప్పిన విషయాలలో చాలా నిజాలు ఉన్నమాట వాస్తవమే. అదే సమయంలో ఆయన బోధనలు అనుసరించినవారిలో జ్ఞానులైనవారు ఎక్కడా కనిపించరు. నాకు తెలిసినవారిలో రజనీష్ బోధలు ఆచరించిన వారందరూ దారితప్పారు. రజనీష్ శిష్యులలో ఒక్కరంటే ఒక్కరు జ్ఞానులైన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగినవాళ్ళు నాకు కనిపించలేదు. 

ఇతరులను ఏఏ కోణాలలో అయితే విమర్శించాడో అవే లోపాలు ఆయన దగ్గరా ఉన్నాయి. ఇతర మతాలలో ఏఏ లోపాలను ఎత్తి చూపాడో అంతకు మించిన లోపాలు ఆయన సంస్థలోనూ బోలెడన్ని ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే మామూలు లోపాలు కాదు, భయంకరమైన లోపాలు  ఉన్నాయి. కనుక ఆచరణలేని బోధలవల్ల ఉపయోగం ఏమిటి అని కొందరంటారు. ఓషో మూవ్ మెంట్ కూడా ఒక వెల్లువలాగా పెరిగి, పెద్దకెరటంలాగా విరిగి పతనమై పోయింది. దానికి అనేక కారణాలున్నాయి. అవేమిటో ముందుముందు చూద్దాం. ఆయన నిజమైన మహాత్ముడు అని కొందరంటారు. అదేమీ లేదు ఆయనొక మహాతెలివైన మతవ్యాపారి మాత్రమె, ఆయన చెప్పింది ఎక్కువ, ఆచరించింది తక్కువ అని కొందరంటారు.

ఏదైనా ఒకవిషయాన్ని ఓషో చెప్పేవిధానం చాలా బాగుంటుంది, కాని ఆయన చెప్పినదానిని ఆయనే పూర్తిగా ఆచరించలేకపోయాడు. ఎదుటివారినిమాత్రం తన బోధలతో ఎగదోశాడు. వాటిని ఆచరించినవాళ్ళు అందరూ  భ్రష్టుపట్టారు అని కొందరంటారు. ఏది ఏమైనా ఆయనవల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనుషుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి అన్నది నిజం. చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి అన్నదికూడా నిజం. అదే సమయంలో ఎంతోమందికి మెరుగైన ఉన్నతమైన అంతరిక జీవితం సాధ్యం అయింది అన్నదికూడా నిజం. ఇప్పటికీ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారంటే దానికి కారణాలలో ఒకటి -- విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఓషో లక్షణం. అలాగే లోకానికి ఒక విలక్షణమైన ఆధ్యాత్మికకోణం ఈయన అందించగలిగాడు అన్నదీ నిజమే. దాన్ని ఆయన ఎంతవరకూ ఆచరించాడు అన్నది మళ్ళీ వేరే సంగతి.

ఇప్పుడు, మనకు తెలిసిన ఓషో జీవిత సంఘటనలను బట్టి ఆయన జనన సమయాన్ని రెక్టిఫై చేద్దాం. ఒక జాతకాన్ని ఎన్నో రకాలుగా రెక్టిఫై చెయ్యవచ్చు. భారతీయజ్యోతిష్యం ఎన్నోరకాలైన విధానాలను ఇందుకోసం ఇచ్చింది. ప్రస్తుతానికి వర్గచక్రాలు మరియు దశల సాయంతో ఈ పని చేద్దాం.

తన తల్లిదండ్రులకు కలిగిన 11మంది సంతానంలో ఈయన పెద్దవాడు. తనయొక్క సోదరులను ద్రేక్కాణ చక్రం చూపిస్తుంది. ఓషో జనన సమయాన్ని (వివాదాస్పద నలభైఅయిదునిముషాలను) కనుక ద్రేక్కాణచక్రంలో చూస్తే మనకు మూడుభాగాలుగా  కనిపిస్తాయి. 5.03 వరకూ కన్య, 5.04 నుంచి 5.45 వరకూ మకరం, 5.46  తర్వాత మిథునం ద్రేక్కాణలగ్నాలౌతాయి. కన్యాలగ్నంలో కేతువుండి, సహోదరదోషాన్ని చూపిస్తున్నాడు. ఏకాదశంలో రవి ఉంటూ తనకుపైన అన్నలు ఉన్నారని సూచిస్తాడు. కనుక మొదటిద్రేక్కాణంలో జన్మ జరగలేదు. ఇక రెండవ ద్రేక్కాణంలో, లగ్నంలో ఏ గ్రహమూ లేదు. ఏకాదశాధిపతి కుజుడు ద్వాదశంలో ఉంటూ తనపైన ఎవరూ అన్నలు అక్కలు లేరని సూచిస్తున్నాడు. తృతీయం గురురాహువులతో కూడి చాలామంది కనిష్టులు ఉన్నారన్న సూచన ఇస్తోంది. ఇక మిధునద్రేక్కాణం బట్టి చూస్తే, ఇక్కడ కూడా  జ్యేష్టులూ కనిష్టులూ ఉన్నారని సూచిస్తోంది. కనుక తృతీయద్రేక్కాణంలో జన్మ జరుగలేదు. జననసమయం రెండవ ద్రేక్కాణంలో ఉంది. అంటే జననసమయం 5.04  నుంచి 5.45  మధ్యలో ఉంది.


సమయాన్ని మరికొంత ఫైన్ ట్యూన్ చేద్దాం. ఓషోరజనీష్ జీవితమంతా ఆస్త్మాతో బాధ పడ్డాడు. చివరిదశలో ఏమిటో తెలియని అనేక రోగాలు ఈయన్ని చుట్టుముట్టాయి. కాని జీవితమంతా వదలకుండా  ఈయన్ని బాధపెట్టింది మాత్రం ఒక్క ఆస్త్మానే. దీనికోసం, రోగాలను సూచించే షష్ఠఅంశ చక్రాన్ని పరిశీలిద్దాం. ఇందులో మూడు లగ్నాలు వస్తాయి. 5.03  వరకూ మకరం.అక్కణ్ణించి 5.24  వరకూ కుంభం. అక్కణ్ణించి 5.45 వరకూ మీనం. మకర లగ్నాధిపతి శని నవమంలో మిత్రస్థానంలో కొలువై ఉన్నాడు. మకరం ఆస్తమాను సూచించదు. ఇక కుంభలగ్నాన్ని చూస్తే, శని దీర్ఘరోగాలకు సూచిక అయిన అష్టమంలో ఉంటాడు. ఊపిరితిత్తులకు సూచిక అయిన మిథునం కుంభానికి త్రికోణరాశి అవుతుంది. కనుక కుంభషష్ఠఅంశ సరిపోతుంది. ఇక మిగిలిన మీనరాశి ఇతరకారణాల వల్ల సరిపోదు. కనుక 5.04 నుంచి 5.24 వరకూ జనన సమయం కుదించబడింది.


ఈ ఇరవైనిముషాలను ఇప్పుడు మరింతగా ఫైన్ ట్యూన్ చేయడం కోసం నవాంశం చూద్దాం. రజనీష్ తన జీవితమంతా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. కాని తాను బ్రహ్మచారిని మాత్రం కానని చాలాసార్లు చెప్పాడు. ఈయనకు చాలామంది స్వదేశీ విదేశీ శిష్యురాళ్ళతో సంబంధాలున్నాయని ఆయన శిష్యులే చెప్తారు. ఓషో అనుసరించినమార్గంలో ఈ పద్దతి తప్పుకాదు. ఓషో యొక్క ఈ భావజాలం ఎంతవరకూ కరెక్టో ముందుముందు పరిశీలిద్దాం. ప్రస్తుతానికి ఈకోణంలో నవాంశను పరిశీలిద్దాం. ఇందులో నాలుగు నవాంశలు వస్తాయి. 5.03  వరకూ మిథున నవాంశ. ఇది ద్రేక్కాణ పరిశీలనలో తొలగించబడింది. అక్కణ్ణించి 5.17 వరకూ  కటక నవాంశ. సప్తమాధిపతి శని ఆరింట ఉండి, ద్వాదశం నుంచి కుజునిచే చూడబడుతున్నాడు. సుఖస్థానాధిపతి శుక్రుడు నీచలో ఉండి నవమంనుంచి ధార్మికగ్రహాలైన గురు కేతువులచేత చూడబడుతున్నాడు. కనుక ఈయన మతజీవితం గడపడంకోసం, పెళ్లి చేసుకోకుండ అలా ఉండిపోయాడు అని తెలుస్తోంది.  కాని రాహువుతో శుక్రుడు కలిసిఉన్నందున చాలామందితో సంబంధాలున్నాయని సూచిస్తోంది. అక్కణ్ణించి 17.31  వరకూ సింహ లగ్నం. రవి సప్తమంలో ఉన్నాడు. సుఖస్థానాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. కనుక ఈ సమయంలో పుట్టినవాళ్లకు వివాహం జరుగుతుంది. ఓషో జీవితంలో అలా జరగలేదు గనుక ఈ టైంస్లాట్ పనికిరాదు. 17.45  వరకూ కన్యాలగ్నం ఉంది. ఇందులో రాహుశుక్రులు, సప్తమంలో గురుకేతువులు ఉన్నారు. కనుక రెండు పెళ్ళిళ్ళు అంతకు మించి రహస్యసంబంధాలు ఉండాలి. పెళ్లి జరుగలేదు కనుక ఈ టైంస్లాట్ కూడా కరెక్ట్ కాదు. కనుక ఈ విశ్లేషణ  ప్రకారం 5.04 నుంచి 5.17 లోపు కర్కాటకనవాంశలో జననం జరిగింది అని తెలుస్తోంది.


ఇప్పుడు పదమూడు నిముషాల ఈ జననసమయాన్ని ఇంకా కుదించడానికి విమ్శాంశకుండలి చూద్దాం. ఆధ్యాత్మికవేత్తలకు ఈ వర్గచక్రం చాలా ముఖ్యమైనది. ఇందులో 5.03 వరకూ మకర లగ్నం అవుతుంది. ఇది చరరాశి. కుజుడు రాహుకేతువులూ ఇందులో ఉన్నారు. లగ్నాధిపతి శని కమ్యూనికేషన్ ను సూచించే మూడింట ఉన్నాడు. నాలుగింట తెలివినీ తర్కాన్నీ సూచించే బుధుడు ఉన్నాడు. అయిదింట ఆత్మజ్ఞానకారకుడైన సూర్యుడున్నాడు. ఇది బాగానే సరిపోతుంది. ఇక్కన్నించి 5.14 వరకూ కుంభలగ్నం అయింది. ఇది లోకానికి సహాయపడే రాశి. లగ్నాధిపతి వాక్స్తానంలో ఉన్నాడు. కుజ,రాహు,కేతువులు ద్వాదశంలోకి వస్తారు. తెలివిని సూచించే గ్రహం బుధుడు మూడింటికి వస్తాడు. పైగా శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. అందుకే ఈయన ఇచ్చిన చాలా ఉపన్యాసాలలో బూతుజోకులూ , సెక్స్ టాపిక్సూ చాలా మామూలుగా తడుముకోకుండా చెప్పేవాడు. ఈయన బోధనలలో సెక్స్ అనేది మిళితమై ఉంటుంది. కనుక  ఈ శుక్రప్రభావాన్ని కుంభవిమ్శాంశ మాత్రమే సరిగ్గా చూపిస్తున్నది. అదే మకర లగ్నం అయితే సప్తమం ఖాళీగా ఉంది. అదీగాక చంద్రస్థానం అయింది. అప్పుడు ఈయన సిద్ధాంతంలో ఉన్న సెక్స్ కోణం జాతకంలో ఉండదు. కనుక ఈయన జాతకానికి కుంభవిమ్శాంశ బాగా సరిపోయేటట్లు కనిపిస్తున్నది. అంటే విమ్శాంశ ప్రకారం 5.04 నించి 5.14 లోపల జననం జరిగింది. 

ఈ పదినిముషాల సమయాన్ని కూడా ఇంకా సూక్ష్మీకరించడానికి  చతుర్విమ్శాంశ(సిద్ధాంశ) చక్రాన్ని చూద్దాం. ఇది విద్యను సూచిస్తుంది. రజనీష్ తత్వశాస్త్రంలో PG చేసాడని మనకు తెలుసు. సిద్ధాంశ కుండలిలో 5.09 నుంచి 5.13 వరకూ ధనుర్లగ్నం అవుతుంది. గురు, బుధ, శనులు సప్తమంలో ఉండి   లగ్నాన్ని చూస్తుండటం వల్ల ఈయన విద్యాభ్యాసం అంతా తత్వశాస్త్రం మీదే సాగింది అని సూచన ఈ వర్గచక్రంలో ఉంది. మిగతా సమయపు విభాగాలను లెక్కించవలసిన పని లేదు. కనుక జననసమయం 5.09 నుంచి 5.13  లోపు ఉంది.

ఈ నాలుగునిముషాలను కూడా ఇంకొంచం ఫైన్ ట్యూన్ చెయ్యడానికి, వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే త్రింశాంశ కుండలిని చూద్దాం. ఇందులో పై నాలుగునిముషాల సమయమూ మకర లగ్నమే అవుతుంది. మకరం పట్టుదలకు సూచన. రజనీష్ మహా మొండివాడని మనకు తెలుసు. లగ్నానికి వెనుకా ముందూ ఉన్న బుధకుజుల వల్ల, తెలివీ పట్టుదలలు ఈయన వ్యక్తిత్వానికి పునాదులు అన్న విషయం తెలుస్తుంది. అంతే గాక ఒక ముఖ్య విషయం ఈ వర్గ చక్రం పట్టిస్తుంది. లగ్నాధిపతి దశమంలో ఉచ్ఛస్తితిలో ఉండటం చూస్తే ఈయన యొక్క అంతిమఉద్దేశ్యాలు బోధనలూ మంచివే అని, అవి  ఆధ్యాత్మికతపైన ఆధారపడి ఉన్నాయన్నది సత్యమే అనీ, అందరూ అనుకునేటట్లు విచ్చలవిడి ఎంజాయ్మెంట్ ను అతను బోధించలేదనీ తెలుస్తుంది.

మరికొంత ఫైన్ ట్యూన్ చెయ్యడం కోసం ఇంతకంటే బాగా సూక్ష్మమైన షష్ట్యంశను చూద్దాం. సామాన్యంగా ఈ వర్గ చక్రంలో ప్రతి రెండు నిముషాలకూ లగ్నం మారిపోతుంది. అక్షాంశ రేఖాంశాలను బట్టి ఒక్కొక్కసారి ప్రతి నిముషానికీ కూడా మారుతుంది. ఇందులో 5.09 కి వృశ్చికలగ్నమూ 5.10 కి ధనుర్లగ్నమూ అవుతాయి. వృశ్చికం లగ్నం అయితే నవమాదిపతి చంద్రుడు దశమంలో ఉంటూ ధార్మికపరమైన వృత్తిని సూచిస్తున్నాడు. నాలుగింట రవిబుధశుక్రులు ఉంటూ ఉన్నతవిద్యనూ విస్తృతజ్ఞానాన్నీ సూచిస్తున్నారు. లాభస్థానం నుంచి శని లగ్నాన్ని చూస్తూ విద్యవల్ల తనకు కలిగిన మేలును సూచిస్తున్నాడు. రజనీష్ కొన్నివేల పుస్తకాలను చదివాడని అంటారు. వాళ్ళ శిష్యులు చెప్పేదాన్ని బట్టి ఆయన లక్షా ఏభైవేల గ్రంధాలను చదివి వాటిలోని సారాన్ని జీర్నించుకున్నాడు. ఇది నిజమో లేక కొంత ఎక్కువగా చెప్పారో తెలీదు కాని, ఓషో రజనీష్ చిన్నప్పటినుంచీ పుస్తకాలపురుగు అనేది నిజమే. 

1998 లో నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో ఉన్నప్పుడు విస్తృతమైన ఆయన పర్సనల్ లైబ్రరీని చూచి చాలా ఆశ్చర్యపోయాను. అందులో లక్షకు పైన పుస్తకాలు ఉన్నమాట వాస్తవమే. ఇక మన ఎనాలిసిస్ కు వస్తే, ఈ కుండలిలో మూడింట కేతువుఉండి ఆధ్యాత్మికపరమైన కమ్యూనికేషన్ ను సూచిస్తున్నాడు. అదే ధనుస్సు లగ్నం అయితే వాక్స్తానంలో కేతువువల్ల వాక్చాతుర్యం ఉండదు. కానీ ఓషో రజనీష్ గొప్ప ఉపన్యాసకుడనీ, యూనివర్సిటీ స్థాయిలో ఆల్ ఇండియా డిబేటింగ్ చాంపియన్ అనీ మనకు తెలుసు. కాని మిగతా ఇతర జీవితవిషయాలు ఈ లగ్నానికి కూడా చూచాయగా సరిపోతాయి. కనుక అంతిమంగా సాయంత్రం 5.09 లేదా 5.10 అనే సమయాలు ఈయన జాతకానికి సరిపోతున్నాయి. ఇప్పుడు దశలను పోల్చిచూచి, ఈరెండు సమయాలలో ఏది సరియైన జన్మ సమయమో చూద్దాం.

(మిగతా రెండవ భాగంలో) 
read more " ఓషో రజనీష్ జాతకం, భావజాలం -1 "

18, డిసెంబర్ 2011, ఆదివారం

మార్గశిర పౌర్ణమి - మేదినీజ్యోతిష్యం

మార్గశిరపౌర్ణమికి కొన్ని ముఖ్యమైన గ్రహస్తితులు వచ్చాయి. వాటివల్ల చంద్రుని ప్రభావం నూటికి నూరుపాళ్ళు భూమ్మీద ఉంటుందనీ, అనేక సంఘటనలకు  ఇది కారణం అవుతుందనీ ఈ పౌర్ణమికి మళ్ళీ రుజువైంది. దీనికి సంబంధించి ఎన్నో విషయాలు నేను వ్రాస్తూ రుజువుచేస్తూ వచ్చాను. కనుక  దీన్నొక తిరుగులేని యాస్ట్రో ఎనలిటికల్ ఫేక్టర్ గా పరిగణించవచ్చు అనేది రూడిగా తేలింది. 

ఈ నేపధ్యంలో కొద్దిగా వెనక్కు వెళ్లి వరుస సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మెక్సికోలో 6 .7  స్థాయిలో భూకంపం, రష్యాలో ఎలక్షన్ కుంభకోణం వల్ల లక్షలాది ప్రజల నిరసన, కలకత్తాలో AMRI ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, తమిళనాడు - కేరళ రాష్ట్రాలమధ్య డ్యాం చిచ్చు, నటుడు దేవానంద్ మరణం, ఆంధ్రలో అవిశ్వాసతీర్మానం రూపంలో ప్రభుత్వ ఉనికికి తాత్కాలికప్రమాదం, ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద దాడి, ఇలా చాలా చాలా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ జరిగే చిన్నచిన్న విషయాలు నేను వ్రాయడంలేదు. ఎప్పుడో ఒకసారి జరిగే ముఖ్యమైన పెద్దవిషయాలు మాత్రమె పరిగణనలోకి తీసుకున్నాను.

ఈసారి పౌర్ణమికి తోడుగా సంపూర్ణ చంద్రగ్రహణం కూడా వచ్చి పడింది. కనుక రకరకాలైన ఘటనలు జరిగాయి. మామూలుగానే మార్గశిర పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పుకోబోయే ముందుగా, 26 -12 -2004 న దక్షిణభారతాన్ని కుదిపేసిన సునామీ సరిగ్గా ఇదే మార్గశిర పౌర్ణమి రోజున వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఆ రోజున గ్రహస్తితులను తెలిపే కుండలి ఇక్కడ ఇస్తున్నాను. ఆరోజున వచ్చిన సునామీ ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ దేశాలను అతలాకుతలం చేసింది. దీని ప్రభావం వల్ల హిందూమహాసముద్ర తీరంలోని పద్నాలుగుదేశాలలో దాదాపు రెండులక్షల ఏభైవేలమంది పైగా ఒకే దెబ్బతో మరణించారు. ఇది మన దేశంలో ఉదయం 9.30 నుంచి 10.00 మధ్యలో జరిగింది. 

ఈ సారి వచ్చిన మార్గశిర పౌర్ణమికి ఉన్న ప్రత్యేకతలలో రాహుకేతువుల నీచస్తితి ఒకటి. ఇలాంటి స్తితి పద్దెనిమిది ఏళ్లకొకసారి వస్తుంది. అలాంటి నీచస్తితిలో ఉన్న కేతువుతో కూడిన చంద్ర గ్రహణం కూడా ఈసారి వచ్చింది. అందుకే ఇన్ని సంఘటనలు జరిగాయి.

పోయినసారి ఇలాంటి గ్రహస్తితి పద్దెనిమిది ఏళ్లక్రితం 10-12-1992  న వచ్చింది. దాని ప్రభావంగా అప్పుడు ఏమేం జరిగాయో ఒక్కసారి చూద్దాం.

>> 6-12-1992 న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. దానివల్ల ఇన్నేళ్ళలో ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు.

>>యెమెన్ లో గోల్డ్ మొహర్ హోటల్లో బసచేసి ఉన్న అమెరికన్ సైనికులమీద మొట్టమొదటి ఆల్ ఖైదా ఎటాక్ 29-12-1992 న జరిగింది. 

>> ప్రిన్స్ చార్లెస్ డయానాల పెళ్లి పెటాకులైందనీ వాళ్ళు  విడిపోతున్నారనే ప్రకటన కూడా డిసెంబర్   లోనే  వెలువడింది. కొందరి దృష్టిలో ఇదంత ముఖ్య సంఘటన కాకపోవచ్చు. కాని వారు ప్రముఖవ్యక్తులు గనుక వ్రాస్తున్నాను.

>>అంతకు ముందు 1992  మే లో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో కల్తీ సారా తాగి 200 మంది మరణించారు. దాదాపు ఇంకో 600 మంది ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఈ సంఘటన రాహుకేతువులు నీచస్తితిలో ఉన్నపుడే జరిగింది. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత రాహుకేతువులు అదే నీచ స్తితిలో ఉన్నపుడు మళ్ళీ 13-12-2011  న పశ్చిమ బెంగాల్లో అదే కల్తీమద్యం తాగి దాదాపు 150 మంది చనిపోయారు. 

ఎప్పుడూ ఏదో ఒకటి జరిగి మనుషులు పిట్టల్లా చావడం, మర్నాటికి దానిని అందరూ మర్చిపోవడం, మనదేశంలో సర్వసాధారణం. ఇక్కడ కల్తీసారానే నిందించడం ఎందుకు? మన దేశంలో చాలాప్రాంతాలలో ఉత్తనీళ్ళు  తాగితే చాలు పరలోకప్రయాణం సుఖంగా జరుగుతుంది. ఇక సారా సంగతి చెప్పే పనేముంది? అసలు సారాకీ  గ్రహాలకూ ఏమిటి లింకు? అని కొందరికి సందేహం రావచ్చు. ఒక్క మంచినీళ్లకూ  సారాయికే కాదు, లోకంలో చీమ చిటుక్కుమనడానికి కూడా కారణాలుంటాయి. ఆ కారణాలను గ్రహాలు వాటి భాషలో చెబుతూనే ఉంటాయి. అయితే ఆయా కారణాలను మనం అర్ధం చేసుకోవడంలోనే మన తెలివి పనిచెయ్యాలి. నాదొక్కటే ప్రశ్న. ఒకే రకమైన సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీమళ్ళీ అవే రకమైన గ్రహస్తితులు ఎందుకుంటున్నాయి? వీటి వెనక ఉన్న సంబంధం ఏమిటి?  అన్న నా ప్రశ్నకు వారూ జవాబు చెప్పాలి మరి. ఇది కాకతాళీయం అంటే నేనొప్పుకోను.

>> పోయినసారి రాహుకేతువులు నీచలో ఉన్నప్పుడు 1992 లో సినీరంగానికి చెందిన ప్రముఖులు సత్యజిత్ రే, అమ్జాద్ ఖాన్, ప్రేమ్ నాథ్ మరణించారు. మళ్ళీ పద్దెనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు 2011 లో దేవానంద్, మల్లెమాల చనిపోయారు. 2012 ఏడాది మొత్తం రాహుకేతువులు ఇదే నీచపరిస్తితిలో ఉంటారు. జనవరి 2013 లో మాత్రమే వారి స్థానాలు మారుతాయి. కనుక 2012 లో మరికొందరు సినీపెద్దల మరియు దేశప్రముఖుల అస్తమయం జరుగనుంది అని ఖచ్చితంగా ఊహించవచ్చు.

గ్రహప్రభావం మనుషులమీదా భూమ్మీదా ఉంది అన్నమాట నిర్వివాదాంశం. అది ఏ విధంగా ఉంటుందో  అర్ధంచేసుకుని విజ్ఞతగా ప్రవర్తించడంలోనే మానవుల తెలివి దాగుంటుంది.
read more " మార్గశిర పౌర్ణమి - మేదినీజ్యోతిష్యం "

9, డిసెంబర్ 2011, శుక్రవారం

శ్రీరామరాజ్యం

ఈ సినిమామీద మీఅభిప్రాయం ఏమిటో వ్రాయకూడదా అని ఒకమిత్రుడు అడిగాడు. ఎందుకులే బాబు, నా అభిప్రాయాలు చాలామందికి నచ్చవు. ఏదన్నా అంటే అదుగో ప్రతిదానికీ విమర్శిస్తావు అంటారు. అని తప్పుకుందామని చూశాను. నచ్చటం నచ్చకపోవటం వేరేసంగతి ముందు మీరేమనుకుంటున్నారో మాకు తెలియాలి. చెప్పండి అని బలవంతం చేసాడు. సరే వ్రాస్తాలే అని చెప్పాను.

మొన్నెప్పుడో వినుకొండలో దోమలచేత కుట్టించుకుంటూ ఒక మామూలుహాల్లో ఈసినిమా చూశాను. కొందరు అంటున్నంత మహాగొప్పగానూ లేదు, అలాగని చెత్తగాకూడా ఏమీలేదు అనిపించింది. బాగులేని హాలూ, దోమలబాధ వల్ల కలుగుతున్న అసహనమూ నా అభిప్రాయాన్ని ఏమాత్రమూ ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్తపడుతూ మరీ ఈ సినిమా చూశాను.

బాపు స్వతహాగా చిత్రకారుడు గనుక ప్రతి ఫ్రేమూ చక్కగా చిక్కగా ఒక పెయింటింగ్ లాగా ఉండేలా జాగ్రత్తపడుతూ సినిమాని తీశాడు. కాని ఒక కళాఖండాన్ని తీసేటప్పుడు అదొక్కటే సరిపోదు. అందులోనూ ఉత్తరరామచరితం వంటి మహత్తరమైన కథని తీసేటప్పుడు చాలాజాగ్రత్తగా తియ్యాలి. ఒక్క ఆర్టిస్టిక్ అవుట్ లుక్ ఒక్కటే చాలదు.

ముందుగా కేరక్టర్ ఫిట్నెస్ ఉన్న నటులను ఎంచుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బహుశా ఆయనకు ఈ విషయంలో స్వతంత్రం లేదేమో అనిపించింది.  సీతారాములను మన దేశంలో వాడవాడలా పూజిస్తారు. అలాటి పురాణపాత్రల కథను తీసేటప్పుడు ఎంతో రీసెర్చిచేసి ఎన్నోకోణాల్లో ఆలోచించి మరీ సినిమా తియ్యాలి.అందులోని సంగీతమూ, సాహిత్యమూ, తరతరాలకూ చిరస్థాయిగా నిలిచిపోయేలా జాగ్రత్త వహించాలి.  సరైన ట్యూన్లకోసం, సరైన సాహిత్యం కోసం ఒక తపస్సులాగా నెలల తరబడి సిట్టింగ్స్ చెయ్యాలి. నటీనటుల ఉచ్చారణా, ఆహార్యమూ స్పష్టంగా ఆహ్లాదంగా ఉండేలా చూచుకోవాలి. డైలాగ్స్ మంచి భాషలో ఉండేటట్లు చూచుకోవాలి. ఇవేవీ ఈ సినిమాలో లేవు.  ఇలా చెప్పుకుంటే బోలెడన్ని లోపాలు ఈ సినిమాలో ఉన్నాయి.

>> పౌరాణిక చిత్రానికి ఒక ప్రత్యేకమైన భాష వాడాలి. జానపద భాషలోనో, సాంఘిక భాషలోనో డైలాగులు వ్రాస్తే పౌరాణికానికి అతకదు. పోనీ కధలోని గ్రామీణప్రజల చేత గ్రామ్యభాష మాట్లాడించినా నాగరిక పాత్రలచేతకూడా గ్రామ్యమాండలిక పదాలను పలికిస్తే పాయసంలో రాళ్ళలాగా బాధ కలిగిస్తాయి. గ్రాంధికభాష వాడితే సామాన్యజనానికి అర్ధం కాదు అందుకే అలా  మామూలుభాష వాడారులే అని సర్ది చెప్పుకోవచ్చు. ఇక  ఆ విధంగా దిగజారుతూ పొతే ఆ దిగజారుడుతనానికి అంతూపొంతూ ఉండదు. కనుక ఎక్కడో ఒకచోట ఒక స్థాయిలో సర్దుబాటు చేసుకుని గ్రాంధికానికీ గ్రామ్యానికీ మధ్యేమార్గం పాటించాలి. అలా చెయ్యలేకపోవడం ఈ సినిమాలోని ఒక పెద్ద లోపం.

>> ఇకపోతే ఒక భాషాశైలిని  ఎంచుకున్న తర్వాత, అదే భాషను అన్ని ఫ్రేముల్లోనూ అన్ని సీన్లలోనూ ఉండేలా దర్శకుడు జాగ్రత్తపడాలి. దీన్నే 'డిక్షన్ కంటిన్యూటీ' అంటారు.అందుకు విరుద్ధంగా ఈ సినిమాలోని  కొన్ని ఫ్రేముల్లో గ్రాంధికమూ, కొన్ని ఫ్రేముల్లో సాంఘికమూ, ఇంకొన్ని ఫ్రేముల్లో అదేదో అర్ధంకాని కలగలుపు భాషా,  వినిపిస్తుంది. ఇవీ పాయసంలోని రాళ్ళేనని  చెప్పుకోవచ్చు. ఉదాహరణకు సీతాదేవిని లక్ష్మణుడు అడివిలో వదిలి వెళ్ళిపోయాక భూదేవి ప్రత్యక్షమౌతుంది. అప్పుడు శ్రీరాముని శపించబోతున్న భూదేవిని అడ్డుకుని సీతాదేవి " అసలు నువ్వెందుకోచ్చావ్ ? వెళ్ళిపో ఇక్కణ్ణించి " అనే సాంఘికనాటకరీతిలో మాట్లాడటం చాలా చికాకుగా అనిపిస్తుంది. ఇదే డైలాగులు ఇంకాబాగా వ్రాసి ఉండవచ్చు. ఇలాటి పరిస్తితి సినిమా మొత్తంమీద చాలాసార్లు ఎదురౌతుంది. భాషాశైలిలో ఒక స్తిరమైన నడక లేకపోవడం  పెద్ద లోపం.

>> ఇకపోతే అక్కినేని నటన చాలా నిరాశపరిచింది. ఆయన ముఖంలో వాల్మీకిమహర్షి ముఖంలో ఉండవలసిన మార్దవం ఎక్కడా కనిపించలేదు. ఏదో కరుకుదనం గోచరిస్తూ ఉంది. వాల్మీకి ఒక మహర్షి మాత్రమేకాదు, క్రౌంచపక్షుల వ్యధనుచూచి చలించిన దయార్ద్రహృదయుడు. తన బాధాపూరితభావాన్ని ఆశువుగా శ్లోకరూపంలో చెప్పిన మహాకవి. వాల్మీకియొక్క మహర్షిత్వాన్నీ, ఒక కవియొక్క ముఖంలో ప్రతిఫలించే సున్నితమైన సుకుమారమైన దార్శనికతనూ అక్కినేని పండించలేకపోయాడు. బహుశా ముసలితనం వల్ల ఆయన ముఖంలో భావవ్యక్తీకరణా సామర్ధ్యం తగ్గిపోయిందేమోలే  అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

>> బాలకృష్ణకూ శ్రీకాంత్ కూ ఒత్తులు స్పష్టంగా పలకవు. అయినా సరే డైలాగ్స్ చెప్పడానికి వాళ్ళు శ్రమించిన తీరు పరవాలేదనిపించింది. ఇలా ఎక్కడికక్కడ సర్దుకుంటూ సినిమా చూడటమే కాని శభాష్ అనిపించేలా ఒక్క సీనూ లేదు.

>> పాత్రలకు మేకప్ చేసిన తీరు చూస్తే,  పౌరాణికానికి సరిగ్గా మేకప్ చేసే ఆర్టిస్టులు ఇప్పుడు లేరేమో అన్న సందేహం కలిగింది. ముఖ్యంగా వాల్మీకి ని దగ్గరగా చూపించిన సీన్లలో అవి పెట్టుడుగడ్డమూ, పెట్టుడుమీసమూ, విగ్గూ అని స్పష్టంగా తెలిసేటట్లు మేకప్ చేశారు. ఆంజనేయుడి మూతిని కూడా మరీ కదలటానికి సాధ్యంకాకుండా బిగించి మరీ అతికించారు. ఆయన డైలాగులు చెప్పేటప్పుడు నోరు తెరవలేక పడుతున్న అవస్త స్పష్టంగా కనిపించింది. ఇలాటివి  చికాకు కలిగించాయి.

>> ఇకపోతే ఆంజనేయుడు ఒక పిల్లవాని రూపంలో వాల్మీకి ఆశ్రమంలో కోతిచేష్టలు చేస్తూ సీతమ్మ వారిని అలరిస్తూ ఉన్నట్లు చూపించడం, వినోదంకోసం సినిమాలో  చేసిన మార్పు అని సర్దుకున్నప్పటికీ, మూలకథలో లేదుకనుక అసహజంగా ఉంది. ఇలా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు మార్చడంవల్లే మన పురాణకధలు గందరగోళంగా తయారయ్యాయి. పురాణపాత్రల్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చి రావణుణ్నీ  కర్ణుణ్నీ   దుర్యోధనున్నీ హీరోలుగా చూపించే ఇటువంటి ట్రెండ్ ఎన్టీఆర్ తో మొదలైంది.

>> లవకుశలో ఘంటసాల ఇచ్చిన సంగీతానికీ ఈ సినిమాలో ఇళయరాజా ఇచ్చిన సంగీతానికీ పోలికే లేదు. ఘంటసాల సంగీతమూ అప్పటి సాహిత్యమూ తపోఫలాలుగా అనుకుంటే, ఈ సినిమా సంగీతం ఇమిటేషన్ పండ్లలాగా ఉంది.  ఎంతగా పోలిక కూడదనుకున్నప్పటికీ, ఘంటసాల కూర్చిన పాతపాటలు గుర్తురాక మానవు. ఘంటసాల బాణీలముందు ఇళయరాజా బాణీలు పేలవంగా తేలిపోయాయనే చెప్పాలి. అయితే వినగా వినగా ఇళయరాజా పాటలు కూడా బాగున్నట్లుగానే అనిపించినప్పటికీ, ఘంటసాల పాటలతో పోల్చుకుంటే చాలా నాసిరకంగా ఉన్నాయి.

>>పాటలలో వాడిన సాహిత్యం అన్నింటిలోకీ పరమచెత్త అని చెప్పవచ్చు. పాటలు ఎవరు వ్రాశారో నేను గమనించలేదు గాని, సాహిత్యం ఖూనీ అయింది అనిమాత్రం చెప్పగలను. అది గ్రాన్దికమో, గ్రామ్యమో, ఇంకేదో తెలీనంతగా ఇష్టంవచ్చిన పదాలు కలగాపులగంగా వాడుతూ వినడానికి కంపరం పుట్టించారు. పాటల సాహిత్యంలో జీవం లేదు. కృతకంగా ట్యూన్ కోసం అక్కడ ఆ పదాలను బలవంతంగా ఇరికించి  వాడినట్లుగా ఉన్నాయి.  

>> సీతాదేవిగా నయనతార అభినయం పరవాలేదు అనిపించిందిగాని, సీతాదేవి ముఖంలో పలకవలసిన భావాలు ఆమె ముఖంలో ఏమాత్రం పలకలేదు. మరీ ఎక్కువగా ఒదిగిపోయి నటించడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కన్నెసీతగా చూపించిన సీన్లలో ఆమె హావభావాలు అస్సలు అతకలేదు. పరికిణీ ఓణీ వేసినంత మాత్రాన ప్రౌఢవయస్కురాలు కన్యగా కనిపించడం కష్టమని దర్శకుడు మర్చిపోయాడు లాగుంది. పైగా జీరోసైజు కోసం డైటింగ్ చేసి ఎక్సర్సైజులూ గట్రాలూ చేసేవారి ముఖంలో లావణ్యమూ నవకమూ లోపిస్తాయి. ముఖం ఎండిపోయినట్లుగా, జీవం లేనట్లుగా తయారౌతుంది. ఎంత మేకప్ చేసినా జీవకళ లోపం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా కొన్ని క్లోజప్ షాట్లలో ఆమె నవ్వినపుడు అస్తిపంజరం నవ్వినట్లు అనిపించింది. శ్రీరాముని పాత్ర ఎవరైనా చెయ్యవచ్చు. కాని సీతాదేవి పాత్ర చెయ్యటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖంలో దేవతాభావం, కళ్ళలో పవిత్రతాభావం ప్రతిఫలించాలి. గ్లామర్ పాత్రలకు అలవాటుపడ్డ నయనతార, తన కళ్ళల్లో ముఖంలో పవిత్రతాభావాన్ని పలికించటంలో  పూర్తిగా విఫలం అయింది. నీరసంగా నవ్వినంత మాత్రాన ముఖంలో దైవత్వం కనిపించదు  అన్నది వీళ్ళు తెలుసుకోవాలి.

>> బాలయ్యా, మురళీమోహన్ వంటి సీనియర్ నటుల డైలాగ్ డెలివరీ చాలా అసహజంగా బట్టీపట్టి పట్టిపట్టి ఒప్పజేప్పినట్లు ఉంది. వాళ్ళకు సరిగా అతకని పెట్టుడుపళ్ళసెట్లు ఉన్నాయేమో అని అనుమానం వచ్చింది.

>> ఇకపోతే, సీతాదేవి భూప్రవేశం అడివిలో జరగలేదు. వాల్మీకం ప్రకారం అది సభామధ్యంలో జరిగింది. జైమినిమహర్షి ప్రకారం అసలు జరగనేలేదు. లవకుశలో చూపినట్లు మక్కీకిమక్కీగా ఈ సినిమాలోనూ చూపబోయారు. కాకపోతే నేటి టెక్నాలజీ ఉపయోగించి గ్రాఫిక్స్ బాగా వాడుకున్నారు. నేను లవకుశ చూడలేదు. చాలా చిన్నప్పుడు ఒకటి రెండు సంవత్సరాల వయసులో చూసానేమో గుర్తులేదు. మొన్న యూట్యూబ్ లో లాస్ట్ సీన్ మాత్రం చూశాను.  

>> సీతాదేవి రామబాణాన్ని పూజించడమూ  అదోచ్చి రామ-కుశుల యుద్ధాన్ని ఆపడమూ వంటి కృతకఘట్టాలు ఏమాత్రం అలరించలేకపోయాయి. తన సృజనాత్మకతను దర్శకుడు ఇలాకాకుండా వివిధ రామాయణాలలో ఉన్న ఘట్టాలను రీసెర్చిచేసి ఒక గొప్ప కళాఖండాన్ని నిర్మించడంలో చూపించి ఉంటె ఇంకా బాగుండేది. 

>> మొత్తం మీద రామాయణంమీదా, ఇంకా ఘట్టిగా చెప్పాలంటే సీతాదేవియొక్క ఔన్నత్యంమీదా ఉన్న భక్తీగౌరవాల కొద్దీ ఈసినిమాను చూడవచ్చు. అంతేగాని పెద్ద గొప్పగా ఏమీలేదు. నేను లవకుశ చూడలేదు కాబట్టి దానితోపోల్చి ఈ సినిమాను చూడలేకపోయాను. కాకపోతే లవకుశ పాటలు చిన్నప్పటినుంచి విన్నాను.

>>  బాలకృష్ణ బాగా కష్టపడి జాగ్రత్తగా నటించాడు. అయితే దగ్గర్నించి అతన్ని చూడలేం. వయసుమళ్ళిన చాయలు స్పష్టంగా కనిపించాయి. అదీగాక క్లోజప్ షాట్లలో నీలి మందుడోసు మరీ ఎక్కువైనట్లుంది. లాంగ్ షాట్లు పరవాలేదు.
లవకుశులుగా పిల్లలనటన బాగుంది. బాలహనుమంతుడి నటనా బాగుంది. ఇంతమంది సీనియర్ నటులు నటించిన ఈ సినిమాలో పిల్లల నటన మాత్రమే బాగుంది  అని చెప్పుకోవాల్సి రావడం బాధాకరం.

ముఖ్యంగా నేటికాలంలో ఇలాటి సినిమా తియ్యాలన్న సాహసంచేసిన నిర్మాత ఒక్కడే ఈచిత్రం మొత్తానికీ అభినందనీయుడు.
read more " శ్రీరామరాజ్యం "

5, డిసెంబర్ 2011, సోమవారం

అభీ నా జావో ఛోడ్ కర్

మొన్నొకసారి స్కైప్ మీటింగ్ లో మిత్రులతో అన్నాను గోచారరవి నీచరాహువు దగ్గరకి వచ్చినపుడు ప్రముఖుల మరణం సంభవిస్తుంది,అని. ఇంకా అనేక విషయాలు సంభవించవచ్చు అని కూడా అనుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం వంటివి. కాని విధి విచిత్రం కాకపోతే, దేవానంద్ మరణం కూడా ఇప్పుడే జరగాలా?

మనకున్న సమాచారాన్ని బట్టి దేవానంద్ 26 -9 -1923  న గురుదాసపూర్ లో పుట్టాడు. ఆయన జన్మసమయం తెలియదు. అందుకని చంద్రలగ్నాత్ జాతకాన్ని చూద్దాం. ఈయన రేవతీనక్షత్రంలో పుట్టాడు. రేవతీనక్షత్ర జాతకులకు ప్రస్తుతం అష్టమశని జరుగుతున్నది. అష్టమశని అనేది చెడుకాలం అని ఇంతకుముందు పోస్ట్ లో వ్రాశాను. ఈయనకు ప్రస్తుతం 88 ఏళ్ళు. ఎనిమిదో అంకె శనియొక్క ఆధీనంలో ఉంటుంది. 88 అంటే డబల్ శనిప్రభావం అనుకోవచ్చు. ఈ సమయంలోనే మరణం ఆయన్ను వరించింది.

కన్యారాశిలో ఉన్న బుధశుక్రులయుతి అనేది ఈయన జాతకంలో ఒక విచిత్రయోగం. కన్యారాశి బుధునికి ఉచ్చస్తితినీ, శుక్రునికి నీచస్తితినీ ఇస్తుందని మనకు తెలుసు. శుక్రుడు కళత్రకారకుడేకాక, ప్రేమవ్యవహారాలకు కారకుడనీ మనకు తెలుసు. ఈ శుక్రుని నీచస్తితివల్లనే తాను అమితంగా ప్రేమించిన సురయాను పెళ్లిచేసుకోలేక పోయాడు. శుక్రునినీచత్వం, చంద్రునినుంచి బుధుని యొక్క కేంద్రస్తితివల్ల రద్దుఅయిందని అనుకోవచ్చు. కాని ఇది పూర్తిగా నిజంకాదు. ఎందుకంటే బుధుడు వక్రస్తితిలో ఉండి బలహీనుడుగా ఉన్నాడు. కనుక శుక్రునియొక్క నీచత్వాన్ని బుధుడు పూర్తిగా రద్దు చెయ్యలేడు. అందుకే శుక్రునియొక్క దుష్టప్రభావం ఇతని జీవితంలో అలా పనిచేసింది. ఇతనికి ఒక రొమాంటిక్ హీరో ఇమేజినీ ఇదే ఇచ్చింది. భగ్నప్రేమనూ, బాధాతప్తహృదయాన్నీ ఇదే ఇచ్చింది. ఈ బుధశుక్రులకలయిక ఇతనిజాతకంలోని  "కార్మిక్ సిగ్నేచర్" అని చెప్పవచ్చు. 

ఇతని జీవితంలోని ప్రతిఘట్టంలోనూ ఈగ్రహయుతి ప్రభావం కనిపిస్తుంది. ఈయన వ్రాసుకున్న " రొమాన్సింగ్ విత్ లైఫ్" అనేపుస్తకం పేరుకూడా బుధశుక్రుల ప్రభావానికి అతీతంగా ఏమీలేదు. రొమాన్స్ శుక్రుని ఆధీనంలోనూ, ఓపెన్ గా మాట్లాడటం బుధుని ఆధీనంలోనూ ఉంటుందని మనకు తెలుసు. అందుకే ఆ పుస్తకం పేరుకూడా అలా పెట్టబడింది. ఈ విధంగా జీవితంలో ఒకరు చేసే ప్రతిపనీ గ్రహాధీనంలోనే ఉంటుంది. మన సొంతంగా మనం చేస్తున్నాం అనుకునేపని వెనుకకూడా మనకు తెలీని శక్తులప్రభావం ఉంటుంది. ఇదే గ్రహప్రభావం వల్ల, తనజీవితంలో ఎంతమంది అమ్మాయిలతో తానుప్రేమలో పడిందీ దేవానంద్ బాహాటంగా చాలాసార్లు చెప్పేవాడు. 

ప్రస్తుతం గోచారశుక్రుడు రాహువునుదాటి ముందుకు వచ్చాడు. 14 -11 -11  న శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నప్పటినుంచీ ఈయనగానీ ఈయనసతీమణి గానీ అనారోగ్యంతో బాధపడుతూ ఉండాలి అని నాఊహ. కాని జాతకబలం వల్ల గోచారసూర్యుడు రాహువుతోకలిసి బాగా దగ్గరకు వచ్చేవరకూ మరణం దూరంగా వేచిచూచింది. ఈయన రవివారంరోజున రవిహోరలో కన్నుమూయడం ఒకవిచిత్రం. రవి గుండెకు కారకుడని మనకు తెలుసు, రాహువు నిద్రకు కారకుడు. కనుక రవివారంనాడు, రవిహోరలో, గోచారసూర్యుడు రాహువుకు బాగాదగ్గరగా ఉన్నప్పుడు నిద్రలో గుండెపోటుతో తనువు చాలించాడు.

అష్టమశనికి తోడు, గోచారరవిబుధులు నీచరాహువుకు బాగాదగ్గరగా వచ్చారు. రాహువు విదేశాలకు కారకుడు. అందుకే విదేశం అయిన లండన్లో మరణాన్ని ప్రసాదించాడు. అంతేకాక  రవిబుధులు వృశ్చికం 17 డిగ్రీ మీద కంజంక్షన్లో ఉన్నారు. వృశ్చికం 17 డిగ్రీ అంటే నవాంశలో ధనుస్సు అవుతుంది. జైమినిమహర్షి ప్రకారం ధనురాశి హటాత్ పరిణామాలకూ, ఉన్నతస్థానంనుంచి  పతనానికీ కారణం అవుతుంది. ప్రస్తుతం అదే జరిగింది.

నవంబర్ 15  న శనిభగవానుడు తులారాశికి మారినప్పటి నుంచీ రేవతీనక్షత్రజాతకులకు అష్టమశని ప్రభావంవల్ల అనేక బాధలు మొదలయ్యాయి. ఈ బాధలనేవి ఆయా జాతకుల దశాభుక్తులను బట్టి, వారివారి వయస్సును బట్టి జరుగుతుంటాయి. ప్రస్తుతం దేవానంద్ 88 ఏళ్ల వృద్ధుడు. ముసలివయసులో శనిగోచారం ప్రమాదకరమైనది. కనుక అష్టమశని ఈయనకు దేహబాధల నుంచి విముక్తి ప్రసాదించింది. జీవితమనే స్టేజిమీదనుంచి గ్రీన్ రూం లోకి  తీసుకెళ్ళింది. మళ్ళీ కొత్తమేకప్ వేసుకుని ఇంకోకొత్తవేషంలో ఎక్కడో ఏదోనాటకంలో ఇంకోపాత్ర ధరింపచేయడానికి భగవంతుడు ఆయన్ని తీసుకెళ్ళాడు. 


జీవకారకుడైన జననగురువుపైన కర్మకారకుడైన గోచారశని సంచరించడం మరణసూచకం (సరైన దశలు నడుస్తుంటే). నాడీజ్యోతిష్యంలో ఇదొక రహస్యం. ప్రస్తుతం దేవానంద్ జాతకంలో అదే జరిగినట్లుంది.

ఈ రహస్య విశ్వప్రణాళికలో, తన కర్మానుసారం చేరవలసిన సరైనచోటుకి, దేవానంద్ ఆత్మ చేరుతుందని ఆశిద్దాం.   
read more " అభీ నా జావో ఛోడ్ కర్ "