“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, జూన్ 2013, ఆదివారం

కొన్ని పాత పద్యాలు

ఎప్పుడో ఇరవై అయిదేళ్ళ క్రితం వ్రాసుకున్న కొన్నిపద్యాలు ఈరోజు పాతపెపర్ల లోనుంచి బయటపడ్డాయి. వాటిని నా అభిమానుల కోసం ఇక్కడ ఇస్తున్నాను.వాటి అర్ధం చాలా సులభంగా గ్రహించవచ్చు.వివరణ అక్కర్లేదు. అన్నీ కందపద్యములే. యధావిధిగా అన్నీ యోగవేదాంత విషయికములే.

1.
చింతలు దొలగుట యోగము
సంతత ధారావాహిగ సత్తై వెలుగన్
అంతము గావలె యాశలు 
పంతముగా యోగమన్న పాటిది సత్యా   

2.
చూచెడి బొమ్మను గాదని 
చూపున్ బ్రతినిముషమందు  చూచెడు ఘనుపై 
మాపును రేపును మదిలో
యోపించగ నిల్పి జూడు చోద్యము సత్యా 

3.
నందానందుని బోధను 
డెందములో నిల్పినీవు జెదరని నిష్ఠన్
అందని ఆత్మజ్ఞానపు 
చంద్రుని నీలోన నిల్చి చూడర సత్యా 

4.
చెల్లని వ్యర్ధపు మాటలు 
కల్లలురా వదలి వాని నాత్మను లోలో  
చల్లగ వీక్షింపు మనుచు 
నెల్లలు దాటించు గురుని నెంచర సత్యా

5.
ఇతరములన్నియు మిధ్యలు
సతతము నీలోని యాత్మ నెరుగ మటంచున్ 
హితముల నెన్నో దెల్పిన 
మితభాషణుడైన గురుని మరువకు సత్యా 

6.
అంతర్యోగంబటంచు 
వింతగ నేమో జేతురు వేడ్కలు దీరన్
ఇంతకు యోగంబటన్న 
అంతరికము గాక బాహ్యమౌనా సత్యా? 

7.
నీలో లేరా వేల్పులు?
లోలోపల వెదకిజూడ లోతులు దెలియున్
నీలోని యాత్మ దెలియక 
నేలను లంఘించి సాములేలర సత్యా 

8.
కర్మల గలుగును జన్మలు 
కర్మల వల్లనె బుట్టును మరిమరి కర్మల్ 
కర్మల వివరము నెరిగిన 
మర్మమ్ములు విచ్చిపోవు మహిలో సత్యా 

9.
కుండలినీ యోగమ్మును
అండగ నేర్పించు గురులు అరుదుర వింటే 
మెండగు సాధన రీతుల  
కొండలు దాటించు ఘనుడు గురుడగు సత్యా

10.
మాయా మర్మపు లోకము 
ఛాయా మాత్రముగ జూచి చెన్నుగ మదిలో 
కాయాతీత రహస్యము 
ఆయా సాధన రీతుల నందర సత్యా 

11.
వాదన లెల్లను మీరుచు 
రోదనముల మోసమెల్ల రోయుచు నిలలో 
బాధామయ బంధమ్ముల 
ఛేదించుము యోగబలిమి చెదరక సత్యా

12.
నందుని మాటల దలచుచు 
అందముగా యనుసరించి యాతని బోధల్
డెందమ్మున మౌనమూని 
బంధమ్ముల మించుమింక బాగుగ సత్యా
read more " కొన్ని పాత పద్యాలు "

28, జూన్ 2013, శుక్రవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-4

కాసేపటికి ఆయన కుదుట పడ్డారు.

'మీరు శ్రీవిద్యోపాసకులే అని నాకిప్పుడు నమ్మకం కుదిరింది.మీ గురువు ఎవరో చెబుతారా? మీది మా సాంప్రదాయమేనా?' అడిగారు శర్మగారు. 

'నాకు ఈ సాంప్రదాయాలంటే నమ్మకం లేదండి.నా భావాలు మీకు కొంచం వింతగా ఉండవచ్చు.వీళ్ళందరూ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే వారని నా భావన.ఇకపోతే నా గురువులు ఒక్కరు కాదు.ఒకరికంటే ఎక్కువమంది ఉన్నారు.వారు కూడా లోకానికి తెలిసిన ప్రసిద్ధులు కారు.వారికి ప్రచారం ఇష్టం ఉండదు.వారి జీవితాలు నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిశాయి.వారు నిజమైన మహనీయులు.నేటివారివలె దొంగగురువులు కారు.' చెప్పాను.

'పోనీలెండి.చెప్పకపోతే మీఇష్టం.కనీసం ఒకవిషయం చెప్పండి.మీరు శ్రీవిద్యాదీక్ష ఎప్పుడు తీసుకున్నారు?'నొచ్చుకున్నట్లుగా అడిగారు శర్మగారు.

పాపం పెద్దాయన అంతగా అడుగుతుంటే దాచడం బాగాలేదని అనిపించింది.

'నా పద్నాలుగోఏట నేను మొదటిసారిగా శ్రీవిద్యాదీక్ష తీసుకున్నాను. పద్దెనిమిదో ఏట ప్రపంచం అంటే విరక్తితో అన్నీ వదిలి సన్యాసం తీసుకుందామని అనుకున్నాను.గురువుగారు కూడా ఒప్పుకున్నారు.కాని కొన్ని కర్మబంధాల వల్ల కుదరలేదు.అలా అని నా సాధన మానలేదు.ఆ సంఘటన జరిగి ఇప్పటికి మూడు పుష్కరాలు గడిచాయి.' చెప్పాను.

ఆయన అమిత ఆనందపడ్డాడు.

'మీరు వయసులో నా కంటే చాలా చిన్నవారు.అయినా ఉపాసనలో  పెద్దవారే.ఇప్పుడు మీతో నా ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి కొంత చెప్పాలని, నన్ను వేధిస్తున్న నా సమస్య గురించి అడగాలని అనిపిస్తున్నది.మా గురువుగారు శరీరంతో ఉన్నట్లయితే ఆయన్ను అడిగేవాడిని.ఆయన  తర్వాత ఇలాంటి విషయాలు అంత అధికారికంగా చెప్పగలవారు నాకు మళ్ళీ కనిపించలేదు.అడగనా?' అన్నారు.

'చెప్పండి.' అన్నాను.

ఆయన సాధన గురించి,అందులో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య గురించి ఆయన చెప్పారు.చెబుతూ ఉన్నప్పుడే దాని విషయం నాకర్ధమైపోయింది. దానికి పరిష్కారం ఏమిటో ఆయనకు సూచించాను.నా సూచనలు విన్న తర్వాత ఆయన తృప్తిగా తలాడించాడు.ఆ వివరాలు ఆయన వ్యక్తిగతాలూ, సాధనాపరమైన రహస్య విషయాలూ గనుక ఇక్కడ వ్రాయడం లేదు.

'నా బాధ గమనించి మా గురువుగారే మిమ్మల్ని నా దగ్గరికి ఈ రూపేణా పంపినట్లున్నారు.' అన్నాడు.

'పోనీ అలాగే అనుకోండి' అన్నాను.

తర్వాత మా చర్చ గురుతత్వం మీదకు మళ్ళింది.

'నిజమైన గురుశక్తి ఇదేనండి.వారు శరీరంతో లేకపోయినా ఎవరో ఒకరి ద్వారా మనకు సమాధానం ఇస్తారు.ఇలాంటి నిదర్శనాలు చూపిస్తారు.' అన్నారాయన.

అదీ నిజమే గనుక నేనేమీ జవాబు ఇవ్వలేదు.

చటుక్కున ఏదో గుర్తొచ్చినట్లు ఆయన లేచి అల్మారా వద్దకు వెళ్ళి ఒక ఫైల్ తీసుకుని వెనక్కు వచ్చారు.అందులో చాలా కాయితాలున్నాయి.

'నేను ఏదైనా చదివినప్పుడు నచ్చితే దానిని ఎత్తి వ్రాసుకుని ఫైల్ చేసుకోవడం ఎప్పటినుంచో నా అలవాటు.ఇప్పుడు జిరాక్స్ వచ్చింది.కనుక పని సులువుగా ఉన్నది.ఎక్కడైనా మంచి సంగతులు కనపడితే జిరాక్స్ చేసి ఫైల్ చేసుకుని తీరికగా చదువుకుంటాను' అంటూ 'ఈ వ్యాసం చూడండి.గురుతత్వం మీద బాగా వ్రాశాడు మా విద్యాసాగర్.' అని రెండు కాగితాలు నాకందించారు.

అవి చేతులోకి తీసుకుని ఒక్క లైన్ చదివేసరికి నేను ఆశ్చర్యపోయాను.అది నేను వ్రాసిన 'గురుపూర్ణిమ(గుండె ధైర్యం లేనివాళ్ళు చదవొద్దు)' అనే పోస్ట్ యొక్క ప్రింట్.

'విద్యాసాగర్ అంటే ఎవరు? చాలా బాగా వ్రాశారు.' అడిగాను పేపర్లు చేతిలో ఉంచుకుని.

'నాకు బాగా తెలిసినవాడు.అతనిదీ తెనాలే.ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాస్తూ ఉంటాడు' అన్నాడాయన.'అయితే ఒకటే చిక్కు,అతని వ్రాత కొంచం పరుషంగా ఉంటుంది.'అన్నాడు.

'ఇందులో అంత ఘాటు ఉందా? ఎవరినైనా విమర్శించాడా?' అడిగాను ఏమీ ఎరుగనట్లు.

'అవును.నేటి గురువులను అందరినీ ఏకి పెట్టాడు.' అన్నాడాయన.

'మరి మీ గురువుగారైన కల్యాణానంద భారతిస్వామి కూడా ఇలాగే అందర్నీ ఏకేవారని  మీరే ఇందాక అన్నారు కదా?'

'అవుననుకోండి.ఆయన శంకరాచార్యులు.జగద్గురువు. పైగా ఆయన ఎక్కడా పరుషంగా మాట్లాడలేదు.సౌమ్యంగా ఉండేవారు.విమర్శించినా సౌమ్యంగా విమర్శించేవారు.ఆయనకూ మామూలు మనుషులకూ పోలికేముంది?' అన్నాడు.

కొద్ది సేపటి క్రితం నేను చదివిన పుస్తకంలో విషయాలు గుర్తొచ్చాయి. 

'లేదండి.విమర్శించేటపుడు ఆయన చాలా ఘాటుగా పరుషంగా విమర్శించే వారు.తప్పు కనపడితే ఎవరినీ ఒదిలేవారు కారు.మహామహా వాళ్ళను కూడా ఆయన వదలలేదు.అటువంటి వారిని అలా తిట్టే సమయంలో కొన్నిసార్లు బూతులు కూడా వాడారు.' అన్నాను.

ఆయన నిర్ఘాంత పోయాడు.

'శర్మగారు.ఏంటి మీరంటున్నది?మా స్వాములవారు బూతులు మాట్లాడారా ?ఎప్పుడు?ఎక్కడ?మీరు ఆయనను చూడలేదు కదా?ఎలా చెబుతున్నారు? దయచేసి అలా అనకండి.' అడిగాడు కొంచం కోపంగా.

ఆయన ఉక్రోషానికి నాకు నవ్వొచ్చింది.

'ఒక్క నిముషం ఉండండి.చూపిస్తాను.'అంటూ ఆ టీపాయ్ మీద ఆయనెదురుగానే ఉన్న'శ్రీ విద్యాస్త్ర పరంపర' అని1944 లో గుంటూరు నుంచి ప్రచురింపబడిన పుస్తకం తీసి ఒక పేజీ తెరిచి ఆయనకిచ్చి ' దీనిని ఒక్కసారి పైకి చదవండి.నేనూ వింటాను' అన్నాను.

కళ్ళజోడు పెట్టుకుని ఆయన పుస్తకంలోకి దృష్టి సారించాడు.

'కౌలమర్మ విభేదినీ' అనే అధ్యాయంలో ఇలా వ్రాసి ఉన్నది.

'ఇట్టి విధి ననుసరించి ప్రతి కులనిష్టుడును ప్రతి శుక్రవారమును తప్పక చండాలస్త్రీ గమనము చేసి తీరవలసినదే.కావున కులనిష్టులగు పురుషులు  చండాలస్త్రీ గమనమును నియతవ్రతముగా నాచరించువారలును వారల ఇండ్ల యందుండు స్త్రీలు కులజ్ఞులను నభిమానమును వహించినవారలతో వ్యభిచారము చేయుటకు బ్రేరేపణ చేయబడి యధేచ్చముగ జాతి కుల విచక్షణము లేకుండ తమ ఇచ్చవచ్చినటుల పురుషులతో చరించు లంజలు గను నలరారుచుందురనిచో నించుకేనియు నాశ్చర్యముండగూడదు.'

చదివిన శర్మగారు నోటమాట రాక అలా చూస్తుండి పోయారు.

ఆయన చేతిలో పుస్తకం తీసుకుని ఇంకో పేజీ తెరిచి 'ఇది కూడా కొద్దిగా చదవండి' అని చూపించాను.

'కులనిష్ట విక్లేదినీ' అనే అధ్యాయం నుంచి ఆయన ఇలా పైకి చదివారు.

'ఇట్టి కులనిష్ట యందుత్తమోత్తమము చండాలస్త్రీ పూజనము.తత్సహవాస సహభోజన సంసర్గాదికమునని సుప్రసిద్ధముగ దెలియవచ్చుచున్నది. రెండవది కులయోగికి తన చెలియలినో కూతునో భార్యనో అప్పగించి ఆనందించుట.ఇట్టి రెండు కృత్యములచే తనకు చండాలస్త్రీ సంబంధము,తన ఇంటి యాడువారికి చండాలాధముని కంటే నికృష్టుడగు త్రాగుబోతు సంబంధమును.దీనిని బట్టి కులనిష్టులందరును చండాలసదృశులే యనుట యందు ఇంచుకేనియు సందియము లేదు.'  

పుస్తకం మూసివేసిన శర్మగారు కాసేపు ఏమీ మాట్లాడలేదు.

'ఏంటండి ఇది? ఇలాంటి భాష ఈ పుస్తకంలో ఉన్నదేమిటి? ఇది వ్రాసినది మా స్వాములవారేనా?ఈ పుస్తకం దాదాపు 70 ఏండ్ల నుంచి మా ఇంటిలో ఉన్నది.నేనీ విషయాలు చదవనే లేదు.మీరు కాసేపటిలో ఎలా చదివారు?' అడిగారు మెల్లిగా గొంతు సవరించుకుంటూ.

నేను మెల్లిగా నవ్వాను.

'శర్మగారు.కంగారు పడకండి.నిదానంగా వివరిస్తాను.వినండి.' అంటూ నేనూ గొంతు సవరించుకున్నాను.

(మిగతాది తర్వాతి భాగంలో)
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-4 "

25, జూన్ 2013, మంగళవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-3

ఈ రోజుల్లో ప్రతిచోటా ఆడవారు లలితాసహస్ర నామావళి పారాయణం చెయ్యడం మనం చూస్తున్నాం.మగవారు కూడా చాలామంది ఈ స్తోత్రం నిత్యం చదువుతారు.కాని ఒక యాభై ఏళ్ళు వెనక్కు వెళ్ళి చూస్తే,అప్పుడు లలితను గాని ఖడ్గమాలను గాని త్రిశతిని గాని పారాయణం చెయ్యాలంటే ప్రజలు భయపడేవారు.అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని తేడావస్తే మాడు పగులు తుందని,నెత్తి అణుస్తుందని,బలి కోరుతుందనీ అనేక భయాలు ప్రచారంలో ఉండేవి.

ఎవరైనా ఇంట్లో ఈ పారాయణాదులు చేస్తుంటే వద్దని పెద్దవాళ్ళు ఆపించేవారు.నేడు చాలా సర్వసాధారణంగా మనం చేస్తున్న లలితా పారాయణ ఒకప్పుడు శిష్టులచే నిషేధించబడినదన్న విషయం చాలామందికి తెలియదు.ఎందుకంటే ఇది తంత్రశాస్త్రానికి సంబంధించిన స్తోత్రం.తంత్రం అనే పేరు వినగానే చాలామంది భయపడతారు.మరి కొందరు అసహ్యించుకుంటారు.అదలా ఉంచితే, లలితాసహస్రనామాలు తంత్రశాస్త్రానికి సంబంధించినవని చాలామందికి తెలియదు.

అలాంటి అజ్ఞాన పరిస్థితులు సమాజంలో ఉన్న సమయంలో స్వామివారు అలాంటి భయాలు పెట్టుకోవద్దని ప్రజలకు వివరించి అందరిచేతా ముఖ్యంగా స్త్రీలచేత ఈ పారాయణాలు మొదలుపెట్టి చేయించారు.అమ్మవారు ఉగ్ర రూపిణి కాదనీ శాంతస్వరూపిణి అనీ సకలలోకాలకూ మాత గనుక తల్లి పిల్లలను ఏమీ చెయ్యదనీ వివరించి ప్రచారంలో ఉన్న దురూహలను మూఢ నమ్మకాలనూ పోగొట్టారు.

నేడు ఎక్కడ చూచినా స్త్రీల బృందాలు లలితాపారాయణం,ఖడ్గమాలా పారాయణం చేస్తున్నాయంటే దానికి కల్యాణానంద భారతీస్వాముల రివల్యూషనరీ అప్రోచ్ ముఖ్యకారణం.ఈ విషయం కూడా నేడు చాలామందికి తెలియదు.

అయితే ఒక్క విషయం గమనించాలి.గురూపదేశ పూర్వకంగా ఒక ఉపాసన చెయ్యడం వేరు.అది ఒక పద్ధతిగా సాగుతుంది.అయితే గురువు నిజంగా సిద్ధశక్తి కలిగినవాడై ఉండాలి.కాని అలాంటివాళ్ళు సామాన్యంగా దొరకరు. ఒకవేళ అలాంటివారు ఉన్నాకూడా,ఎవరిని బడితే వారిని శిష్యులుగా ఒప్పుకోరు,స్వీకరించరు.ఇకపోతే,గురువు లేకుండా ఊరకే స్తోత్ర పారాయణాలు చెయ్యడం వేరు.ఇది పామర పధ్ధతి.కాని ఇదీ మంచిదే.ప్రతి మనిషికీ దైవాన్ని చేరాలన్న తపన ఉంటుంది.వారికి తగిన మార్గం వారికి చూపాలి.అసలేమీ చెయ్యకుండా ఊరకే ఉండటం కంటే ఏదో ఒకటి చెయ్యడం మేలుకదా.

రహస్యాలు రహస్యాలు అంటూ కొందరు దుష్ట బ్రాహ్మణులు అన్నింటినీ దాచిపెట్టడం వల్లే నేడు హిందువులు దిక్కులేక ఇతర మతాల్లోకి మారే పరిస్థితులు వచ్చాయి అనడంలో కొంతనిజం ఉన్నది.నిజం చెప్పాలంటే నేడు బ్రాహ్మణ కుటుంబాల లో కంటే ఇతరకులాలలోనే ఆధ్యాత్మికత అంటే ఎక్కువ ఆసక్తీ శ్రద్ధా కనిపిస్తు న్నాయి.

రాజులలో,కమ్మవారిలో,రెడ్డికులంలో,దళితకులాలలో నిజమైన శ్రదాసక్తు లున్నవారు,ఆధ్యాత్మికాన్ని గురించి తెలుసుకోవాలని తపన ఉన్నవారు, మార్గం చూపిస్తే అనుసరించడానికి సిద్ధంగా ఉన్నవారు ఎందఱో నాకు తెలుసు.కాని వారికి సరియైన మార్గం చూపేవారు లేరు.ఇదీ మనకు పట్టిన దురవస్థ.

ఉన్న కొద్దిమంది గురువులూ చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకునే వారేగాని నిజమైన సాధనాశక్తి తపశ్శక్తి ఉన్నవారు కారు.మా గురువు ఫలానా అని డప్పు కొట్టుకునేవారే ఎక్కువగాని,ఆ గురుశక్తిని మాటల్లో కాకుండా చేతల్లో చూపేవారు చూపగలవారు ఎక్కడో కోటికొకరు ఉంటారు. నేటి ఆధ్యాత్మిక లోకంలో బోగస్ గురువులే ఎక్కువ.జనులు వేలంవెర్రిగా అనుసరిస్తున్న ప్రసిద్ధ గురువులలో కూడా వారు ప్రచారం చేసుకున్నంత శక్తి లేదని నాకు తెలుసు.

టీ తాగుతూ మౌనంగా ఆలోచనలో ఉన్న నన్ను శర్మగారి స్వరం ఈ లోకంలోకి రప్పించింది.

'మీరు శ్రీవిద్యా దీక్షితులేనా?'

నేనేమీ జవాబు చెప్పలేదు.మౌనంగా చిరునవ్వు నవ్వాను.

'ఏంలేదు.దీక్ష తీసుకొనని వారితో కొన్నికొన్ని రహస్య విషయాలు మాట్లాడకూడదు.అందుకని అడిగాను.'అన్నారాయన.

ఆ విషయం నిజమే కాబట్టి నేనేమీ జవాబు చెప్పలేదు.

'శ్రీవిద్యా సాధన సరిగ్గా చేస్తే ఏం జరుగుతుంది?' ఆయన్ను అడిగాను.

'అమ్మ అన్నీ ఇస్తుంది.సంకల్పసిద్ధి కలుగుతుంది.అంటే అనుకున్నవి జరుగుతాయి.మంచి కవిత్వశక్తి వస్తుంది.ఐశ్వర్యం వస్తుంది.మంచి బుద్ధి ఇస్తుంది.సిద్ధులు కలుగుతాయి.ఒకటేమిటి? మన అర్హతను బట్టి,సాధనను బట్టి అన్నీ వస్తాయని మా గురుదేవులు కల్యాణానంద భారతీస్వామి చెప్పారు.' 

ఈయనకు చిన్న నిదర్శనం చూపుదామని అనిపించింది.కళ్ళు తెరిచి ఆయన్ను చూస్తూనే ఉండి రెండు క్షణాలు మనస్సును కేంద్రీకృతం చేశాను.ఎక్కడినుంచో పైలోకాల్లోంచి జాలువారినట్లు ఒక సంస్కృతశ్లోకం నా మనసులోకి వచ్చి నిలిచింది.

'శర్మగారు.ఒక శ్లోకం చెప్తాను.వింటారా?' అడిగాను.

ఆయన ముఖంలో ఉత్సుకత తొంగిచూచింది.

'చెప్పండి' అన్నారు.

శ్లో|| సహితా మత్యంత ధవళ శ్రీకళా పరయంత్రాం
వివిధాగమేన సురపూజితాత్మ వరమంత్రాం
దహితాఘ సర్వ విరళాత్మరూప ఘనముద్రాం 
మహితోజ్జ్వలాంగ యుతశోభితాత్మ మనువిద్యాం   

అని అప్పటికప్పుడు నా మనోఫలకం పైన ప్రతిఫలించిన శ్లోకాన్ని బయటకు చెప్పాను.

'ఏదీ మళ్ళీ ఒకసారి చెప్పండి.' అడిగారాయన.

మళ్ళీ ఆ శ్లోకాన్ని వల్లించాను.శ్రద్ధగా కళ్ళుమూసుకుని విన్నారాయన.

'శ్రీ చక్రారాధ్య అయిన శ్రీమాతను ఎంత చక్కగా వర్ణించారండీ?చాలా బాగుంది. ఇది ఏ పుస్తకంలోని శ్లోకమండీ? ఎప్పుడూ వినలేదు' అన్నారాయన.

'ఏ పుస్తకంలోదీ కాదు.నా మస్తకంలో నుంచి ఇప్పుడే జాలువారింది' చెప్పాను.

'మీకు సంస్కృతం వచ్చా?' అడిగారాయన.

'రాదు.నేను సంస్కృతం చదువుకోలేదు.' అన్నాను.

ఆయన ఆశ్చర్యపోయారు.

'ఇదెలా సాధ్యం?సంస్కృతం రాని మీ నోటినుంచి ఈ శ్లోకం ఆశువుగా ఎలా వచ్చింది?' అడిగారు చాలా వింతగా చూస్తూ.

'శ్రీవిద్యోపాసన సరిగ్గా చేస్తే ఏమి జరుగుతుందో మీరు గతంలో మీ గురువుగారి నుంచి విన్నారు.ఇప్పుడు ఆ అద్భుతాన్ని మీ కళ్ళెదురుగా చూస్తున్నారు.' అని మాత్రం చెప్పాను.

ఆయన బిత్తరపోయి అలా చూస్తూ ఉండిపోయాడు.

(మిగతాది తర్వాతి భాగంలో)
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-3 "

23, జూన్ 2013, ఆదివారం

కేదార్ నాథ్ రుద్రరూపం - అసలు కారణాలు

కేదార్ నాథ్ లో జరిగిన ప్రళయం అందరికీ తెలిసిందే.దీనిమీద మిత్రుడు సోమశేఖర్ తన 'హోరాసర్వం' బ్లాగ్ లో చక్కటి విశ్లేషణ వ్రాశాడు.యధావిధిగా అతనికి కొన్ని కామెంట్స్ వచ్చాయి.

'ముందుగా చెప్పి దీనిని నివారించవచ్చు కదా.వేలమంది ప్రాణాలు కాపాడవచ్చు కదా?ఇప్పుడు విశ్లేషణ చేసి ఉపయోగం ఏమిటి?'-ఈ తరహాలో ఊహించినట్లే కామెంట్స్ వచ్చాయని నాతో చెప్పాడు.దీనికి ఒక జవాబు ఇవ్వమని అతనికి చెప్పాను.అది ఇలా ఉంటుంది.

'అడ్డమైన పనులూ చేసి భయంకర చెడుఖర్మ పోగుచేసుకోటం మీ వంతు.దాని ఫలితం వచ్చినపుడు కాపాడటం మా వంతూనా? ఇక్కడే మీ స్వార్ధమూ, దురాశా కనిపిస్తున్నాయి.మీ ఆలోచనా ధోరణి ఇంత చండాలంగా ఉంది గనుకనే మీకు నిష్కృతి లేదు. మానుంచే కాదు భగవంతుడి నుంచి కూడా మీకు ఎటువంటి సహాయమూ ఉండదు.' అని జవాబివ్వమని చెప్పాను.

కొత్తకోణంలో ఒక విషయాన్ని చెప్పినపుడు కనీసం దానిని ప్రోత్సాహపరుస్తూ మెచ్చుకునే మంచిగుణం కూడా మనలో లేదు.ఇక్కడ ప్ర్రతివాడూ తన జెలసీనీ,గర్వాన్నీ,అతితెలివినీ బయట పెట్టుకునేవాడే.అన్నీ సక్రమంగా నడుస్తున్నపుడు వీళ్ళ అహానికి అడ్డూ ఆపూ ఉండదు.కాని కాలం ఎదురు తిరిగినప్పుడు మాత్రం ముక్కూ ముఖం తెలియనివారికి కూడా సాయం కావాలి.భలే వింత!!

కేదార్నాథ్ రుద్రభూమి.భగవంతుని యొక్క రుద్రస్వరూపం సంహారాత్మక మైనది.దానికి మనాతనా ఉండదు.చెయ్యకూడని పని చేసినప్పుడు ఆ వ్యక్తిని అమాంతంగా నిర్మూలించడమే రుద్రతత్త్వం.రుద్రుని ఫాలనేత్రాగ్ని జ్వాలల్లో చావులేని మన్మధుడే కాలిపోయి భస్మమయ్యాడు.అల్పులైన మనుషులెంత? 

నేనెప్పుడూ చెప్పేది ఇదే.మనవాళ్ళు చాలామంది రుద్రమూ, నమకమూ చమకమూ పారాయణం చేస్తుంటారు.కాని ఆ మంత్రాల భావాన్ని అర్ధం చేసుకుందామని ఎవడూ ప్రయత్నం చెయ్యడు.జీవితంలో ఆ భావాలను ఆచరిద్దామని అసలు ఎవడూ అనుకోడు. వీళ్ళకు తెలిసింది ఒక్కటే. పరమేశ్వరుని ఎదుట ఈ మంత్రాలన్నీ చదివేసి యధావిధిగా పక్కవాణ్ని మోసం చేస్తూ దోచుకుంటూ తమ కుళ్ళు బ్రతుకులు తాము బ్రతకడమే వీరికి తెలిసిన గొప్పవిద్య. కాని ప్రకృతి కళ్ళు మూసుకొని లేదు.దైవం కళ్ళు మూసుకొని లేదు.సమయం వచ్చినపుడు ఎవడికి పడే శిక్ష వాడికి ఖచ్చితంగా పడుతుంది.సృష్టిలోని సంహారతత్త్వం యొక్క ప్రయోజనం ఇదే.

"నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ:" అంటూ రుద్రపారాయణ చేసేవారిని కొన్ని వేలమందిని నేను చూచాను.మాకు రుద్రం మొత్తం నోటికి వచ్చు అని ఎదుటివాళ్ళ దగ్గర గప్పాలు కొట్టేవాళ్ళనూ ఎంతో మందిని చూచాను. వారందరినీ చూస్తే నాకు జాలి కలుగుతుంది.ఎందుకంటే ఆ మంత్రాల అర్ధమూ వాళ్లకు తెలీదు.ఆ అర్ధాలను జీవితానికి అన్వయించుకుని ఆచరించాలనీ అప్పుడే ఫలితం వస్తుంది కాని ఊరకే నోరు నొప్పి పుట్టేటట్లు మంత్రాలు చదివితే ఏమీ కాదన్న సంగతి వాళ్లకు అర్ధం కాదు.ఇలాంటి మనుషులని మార్చడం దేవుడి తరం కూడా కాదు.

ఊరకే మంత్రాలు చదవడం కాదు.దానికి తగిన జీవితాలు జీవించాలి.అదీ అసలైన కీలకం.మంత్రాలు నోటికి వస్తే చాలదు.జీవితంలోకి రావాలి. ఆచరణలోకి రావాలి.మన మోసపు వేషాలు దైవం ఎదుట ఎందుకూ పనికి రావన్నది మనిషి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

చరిత్రను పరికిస్తే ఒక్క సత్యం కనిపిస్తుంది.'దురాశ' 'అత్యాశ' లేదా ఇంకేదైనా పెరు పెట్టండి.దానివల్లే ప్రపంచంలో ఎక్కడ చూచినా అనర్ధాలు ప్రాణనష్టాలూ జరిగాయి జరుగుతున్నాయి. చేతనైనంత డబ్బును దోచుకోగలిగితే చాలు ఎంతమంది  ప్రాణాలు ఏమై పోయినా నాకెందుకు? అన్న ఆలోచనే ఇటువంటి అనర్ధాలకు అసలైన కారణం.

ముస్లిములు మనం దేశంలో జరిపిన విధ్వంసాలలో ఎంతో దోపిడీ జరిగింది.మాలిక్ కాఫర్ దక్షిణాదిన చేసిన దోపిడీ విధ్వంసంతో కనీసం 250 ఏనుగుల మీద బంగారాన్ని మోయించి డిల్లీ పాదుషాకోసం తీసుకుపోయాడని చరిత్రకారులు చెప్తారు.దీనికి మతముసుగు వేసినా ఇంకేం చేసినా,మనిషిని మనిషి చంపి దోచుకోవడమేగా ఇది?

ఏభై ఏళ్లక్రితం జరిగిన రెండో ప్రపంచయుద్ధంలో అయిదుకోట్ల మంది చచ్చారు. ఒక్క రష్యాలోనే రెండు కోట్లమంది చచ్చారు. ఎందుకు? ఒకరిమీద ఒకరు ఆధిపత్యం సాధించాలన్న తపనేగా దీనికి వెనుక మూలకారణం?

కనుక మానవ మనస్తత్వం లోనే ఒక ప్రాధమికమైన లోటు ఉన్నది. ఒక హింస ఉన్నది.ప్రతి మనిషిలోనూ ఒక మృగం ఉంటుంది.అది అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.ఎవరెన్ని మాటలు చెప్పినా అవకాశం వస్తే ఎవడూ ఎదుటివాడిని దోచుకోకుండా ఊరుకోడు.సామాన్యుడికి ఆ అవకాశం లేక అరుపులు అరుస్తూ ఉంటాడు.అదే అవకాశం వస్తే వీడూ నాయకులకంటే ఎక్కువగా విజ్రుంభీంచి దోపిడీ చెయ్యగలడు.నేడు నిస్సహాయస్తితిలో ఉన్న కేదార్నాధ యాత్రికులను ఎలా దోచుకుంటున్నారో చూస్తే నేను చెప్పేది నిజం అని ఎవరికైనా అర్ధమౌతుంది.

నేను కొన్ని ట్రెయిన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ప్రత్యక్షంగా చూచాను. మేము అక్కడికి చేరుకునేలోపు పక్కనే ఉన్న ఊళ్ళ జనం హడావుడిగా అక్కడికి వాలిపోయి శవాలమీది నగలను గబగబా దోచుకోవడమూ కొన్నిసార్లు దానికి పోలీసులు కూడా సహకరించడమూ నాకు తెలుసు.శవాలను కూడా వదలకుండా దోచుకునే మనస్తత్వం, మంచివాళ్ళు అనుకునే పల్లె ప్రజలలో ఉన్నది అన్న నగ్నసత్యం నాకు ప్రాక్టికల్ గా తెలిసింది.

ఈ దోపిడీ అనేది లౌకికంలోనూ ఉన్నది ఆధ్యాత్మికలోకంలో కూడా ఉన్నది. అయితే మతంపేరుతో చేసే దోపిడీ సూక్ష్మంగా ఉండి బయటకు కనపడదు.ప్రస్తుతం సమాజంలో ఉన్న దొంగ గురువులందరూ చేస్తున్నది ఆధ్యాత్మిక దోపిడీనే.

కేదార్నాద్ చుట్టూ ఎన్నో హైడల్ ప్రాజెక్టులు కట్టారు.అన్ని ప్రముఖ కంపెనీలూ, రాజకీయ నాయకుల కంపెనీలూ ఇందులో ఉన్నాయి.అలా కట్టడం పర్యావరణానికి తీవ్రప్రమాదం కలిగిస్తుంది అని ప్రకృతి పరిరక్షణవాదులు ఎందఱో మొత్తుకున్నారు.కాని ఎవరూ వినరు.ఎవరి స్వార్ధం వారిది. నాయకులూ వారి కమీషన్ల కోసం ఈ ప్రాజెక్టులు కట్టేవారినే సమర్ధిస్తారు. అందరూ కలిసి ప్రకృతిని నాశనం చేస్తున్నారు.ఏతావాతా చచ్చేది సామాన్యుడు మాత్రమే.మా డబ్బు మాకొస్తే చాలు ఎంతమంది చస్తే మాకెందుకు అనుకునే మనస్తత్వం నాయకులది.ఏదైనా విపత్తు జరిగినప్పుడు జరిగే సహాయ కార్యక్రమాలలో మళ్ళీ ఇంకా దోచుకోవచ్చు.వీటిల్లో ఎంత ప్రజాధనం స్వాహా అవుతుందో అందరికీ తెలిసిందే.

పేపర్లూ ప్రభుత్వమూ చెప్పే లెక్కలు సరియైనవి కావు.కనీసం 20,000 నుంచి 30,000 మంది మనుషులు గంగాదేవి ఆగ్రహానికి గురై అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారనేది వాస్తవం.

నిన్న ఒక ప్రముఖ వ్యాపారస్తుడు నాతో మాట్లాడుతూ 'నేను పోయినేడాది చార్  ధాం యాత్ర చేసివచ్చాను.' అన్నాడు.'నీ పాపం ఇంకా పండలేదు అందుకే బతికి పోయావు' అని మనసులో అనుకున్నాను.

హిమాలయాలు పవిత్ర భూములు.ఎన్నో వేల ఏళ్ల నుంచి లెక్కలేనంత మంది మహాయోగులు మునులు అక్కడ నివాసం ఏర్పరచుకుని తపస్సులో కాలం గడిపారు.అలాంటి వారు ఎందఱో ఈనాటికీ హిమాలయాలలో ఉన్నారు.అక్కడ పవిత్రమైన స్పందనలు అలముకుని ఉంటాయి.అలాంటి చోట్లకు అందరూ పిక్నిక్ కోసం వెళ్ళినట్లు వెళ్ళకూడదు. దానివల్ల ఆయా స్పందనలకు తీవ్ర విఘాతం కలుగుతుంది.దాని ఫలితాలు విపరీతంగా ఉంటాయి.

మనవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు.క్రమేణా హిమాలయాలలో కూడా హోటళ్ళు వెలిశాయి.అక్కడ కూడా మధ్యపానమూ దూమపానమూ వ్యభిచారమూ జరుగుతున్నాయి.హరిద్వార్ లో అన్నీ దొరుకుతాయి.మనతోపాటు మన అంకచండాలం అంతా ఎక్కడికి పోయినా మన వెంటే వస్తుంది కదా.రుద్రుడు ఒక్కసారి కళ్ళు తెరిచాడు.ఆ చండాలం అంతా కొన్ని నిముషాలలో ప్రక్షాళన అయిపొయింది. కనీసం మూడేళ్ళ వరకూ ఎవరూ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్తితి కల్పించబడింది.

నేను ఎన్నో పాత పోస్ట్ లలో వ్రాశాను.మనుషులు తమ హిపోక్రసీని విడిచి పెట్టాలి.పద్ధతులు మార్చుకోవాలి.లేకుంటే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.దారుణమైన ప్రకృతి కోపానికి గురికావలసి వస్తుంది అని ఎన్నో సార్లు హెచ్చరించాను.ప్రస్తుతం నడుస్తున్న శపితయోగ పరిధిలో తీవ్ర జననష్టం జరుగుతుంది.ప్రక్షాళన జరుగుతుంది అని ఎన్నోసార్లు వ్రాశాను.ఇప్పుడు కళ్ళెదుట కనిపిస్తున్నది అదే.

మనిషిని మనిషి దోచుకోవడం అనేది మామూలు వ్యాపారాలకే పరిమితం కాదు.పుణ్యక్షేత్రాలలో కూడా ఇది చాలా ఘోరమైన స్థాయిలో జరుగుతుంది. దానిని చేసేవారందరూ కూడా మళ్ళీ భక్తులే.ఇక వారికి దైవం పైన ఏమి నమ్మకం ఉన్నట్లు? దీనికి తగిన శిక్ష ఎప్పుడో ఒకప్పుడు పడదా?

మా అమ్మగారు ఇరవై ఏళ్ల క్రితం కేదార్ నాథ యాత్రకు వెళ్లారు.అక్కడ గుర్రం మీద కూచుని కొంతదూరం ప్రయాణం చెయ్యాలి.తన దగ్గరున్న అయిదు వేల రూపాయలను ఒక పర్సులో ఉంచి గుర్రం జీనుకు ఉన్న జేబులాంటి దానిలో ఉంచారు.అలా ఉంచమని ఆ గుర్రం నడిపే వాడే చెప్పాడు.వారు గమ్యస్థానానికి చేరేసరికి గుర్రం నడిపెవాడి హస్తలాఘవం తో ఆ పర్సు మాయం అయింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆమె నిస్సహాయ స్తితిలో అక్కడ నిలిచిపోయింది. చుట్టూ తనతో వచ్చిన బృంద సభ్య్లున్నారు గనుక సరిపోయింది.లేకుంటే కనీసం 'టీ' తాగుదామన్నా చేతిలో పైసా లేని పరిస్తితి. సాటి యాత్రికుల దగ్గర డబ్బు అప్పు తీసుకుని యాత్ర పూర్తి చేసి ఆమె తిరిగి వచ్చింది.తిరుగు ప్రయాణంలో విజయవాడ స్టేషన్లో రైలు వచ్చినపుడు నేను వెళ్ళి ఆ డబ్బులు వారికిచ్చాను.అప్పట్లో ATM,electronic money transfer మొదలైనవి లేవు.

మరి అంత ఎత్తున హిమాలయాలలో ఆ గుర్రం నడిపేవాడు కూడా పొద్దున్న లేచి 'హరహర భం భం భోలే' అని అరిచి తన దినచర్య ప్రారంభిస్తాడు.కాని వాడు చేసిన పనేమిటి? కనుక మన దొంగప్రార్ధనలూ దొంగమంత్రాలూ భగవంతుడు లెక్కపెట్టడు.మనం ఏం చేస్తున్నాం అనేదే ఆయన పరికిస్తాడు అనేది నగ్నసత్యం.మన ఆచరణకూ ప్రవర్తనకూ తగిన ఫలితాలు మనకు ఇవ్వబడతాయి.అంతేగాని మన పూజలకూ దొంగప్రార్ధనలకూ ఏమీ జరగదు.

పుణ్య క్షేత్రాలలో ఎక్కువమంది దొంగలే ఉంటారు.వచ్చిన భక్తులను ఎడా పెడా దోచుకోవడమే వారి పని.ఇప్పుడు కూడా భోజనం పాకెట్ 1000 రూపాయలకు వాటర్ బాటిల్ 200 రూపాయలకు టీ 60 రూపాయలకు అమ్ముతూ అక్కడ నిలిచిపోయిన నిస్సహాయ భక్తులను అక్కడివారు దోచుకోవడమే నేను చెప్పేది పచ్చినిజం అన్నదానికి నిదర్శనం.

గతంలో తురుష్కులు దేవాలయాలు ధ్వంసం చేసి అన్నీ దోచుకు పోయారని మనం వాళ్ళను తిడుతూ ద్వేషిస్తూ ఉంటాం.మరి ఇప్పుడు మనవాళ్ళే అయిన హిందువులు చేస్తున్నదేమిటి? ఇది స్వార్ధానికి దురాశకూ పరాకాష్ట కాకుంటే ఇంకేమనాలి? అంటే,ఇక్కడ నాయకులకూ,ప్రజలకూ అందరికీ డబ్బే దైవం.ఎవడికీ నిజంగా దేవుడంటే భయమూ భక్తీ లేనేలేవు.ఎందరి ప్రాణాలు పోయినా ఎవడికీ పట్టదు. ఇలాంటి హిపోక్రసీతో నిండిన సమాజానికి ఇంతకంటే మంచి వరాలు ఎలా వస్తాయి?

చివరగా ఒక్కమాట.రుద్రుడు తన జటాజూటంలోని గంగాదేవిని కొంచం విదిల్చి మనుషులు చేసిన చండాలాన్ని శుభ్రం చేసుకున్నాడు.దీనికి ప్రస్తుతం నడుస్తున్న శపితయోగం సాయం చేసింది.కాని బ్రతికిఉన్న మిగిలిన ప్రజలను కుమారస్వామి కాపాడుతూ సహాయం చేస్తున్నాడు. సైన్యమూ, పారామిలిటరీ బలగాల రూపంలో సుబ్రమణ్యస్వామి శక్తి వారిచేత ఈపని  చేస్తున్నది. సైన్యానికి కుజుడు కారకుడు.కుజునికి అధిదేవత కుమారస్వామి.తండ్రి కోపాన్ని తనయుడు తగ్గిస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు.ఈ మొత్తం సీన్ వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం ఇదే.

ప్రజల పాపాలకు శిక్ష పాలకులకు పడుతుంది అని మన ప్రాచీన స్మృతులు చెబుతున్నాయి.కాని ప్రస్తుత కలియుగంలో పాలకుల పాపాలకు శిక్షలు ప్రజలకు పడుతున్నాయి.అలాంటి నాయకులను ఎన్నుకోవడమే ప్రజలు చేస్తున్న పాపం."రాజ్యాన్తే నరకం ధ్రువం" - అని మనకు ఒక సూక్తి ఉన్నది.అది మాత్రం తప్పకుండా నిజం అవుతుందని నాకనిపిస్తున్నది.
read more " కేదార్ నాథ్ రుద్రరూపం - అసలు కారణాలు "

21, జూన్ 2013, శుక్రవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు -2

ఆదివారం విజయవాడలో పనిచూచుకుని తెనాలి చేరేసరికి సాయంత్రం అయిదయింది.ఇల్లు తేలిగ్గానే దొరికింది.నేను వెళ్లేసరికి శర్మగారు నాకోసం ఎదురు చూస్తున్నారు.ఇంట్లో ఆయనొక్కరే ఉన్నారు.

కాసేపు కూచుని అవీఇవీ మాట్లాడాక 'రండి మా పూజామందిరం చూద్దురుగాని' అని లోపలకి తీసికెళ్లారు.బయట పంపుదగ్గర కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని లోపలకి దారితీశాను.ఆయన దగ్గరున్న శ్రీచక్రమూ, పంచలోహ మేరుప్రస్తారమూ,పంచాయతనమూ,అందులో ఉన్న రాళ్ళూ రత్నాలూ,అమ్మవారి చిన్న విగ్రహమూ అన్నీ చూపించారు. అక్కడ కాసేపు కూచుని మళ్ళీ హాల్లోకి వచ్చి కూచున్నాము.
  
'ఎప్పుడూ మిమ్మల్ని శర్మగారూ అని పిలవడమే గాని మీ పూర్తిపేరు ఇప్పటిదాకా తెలియదు' అడిగాను నవ్వుతూ.

'నాపేరు వెంకటకృష్ణశర్మ.దీక్షానామం 'అమలానందనాధ' అన్నాడాయన. 'మా నాన్నగారి పేరు వెంకటరామశర్మ.ఆయన వేమూరు ఎలిమెంటరీ స్కూల్లో హెడ్మాస్టరుగా పనిచేశారు.స్వామివారి వద్ద ఆయన 1920 లో మంత్ర దీక్ష తీసుకున్నారు.' అన్నారు.

ఈలోపల ఇల్లు ఒకమోస్తరు తరంగాలతో నిండిఉండటం గమనించాను.

'మీకోసం ఈ పుస్తకాలు తీసి ఉంచాను'అంటూ ఒక టీపాయ్ మీద ఉంచిన ఒక ముప్పై నలభై పుస్తకాలు చూపించాడు.అవన్నీ ముదురు గోధుమ రంగులోకి మారి అవసానదశకు చేరినట్లు కనిపిస్తున్నాయి.

వాటిలో కొన్నింటి పేర్లు:
  • భగవద్గీతా రహస్యం
  • శృతిధర్మ సంగ్రహం 
  • ప్రజావైచిత్ర్యము 
  • The hypocrisy and villainy of the outcaste untouchable Harijan-Mr M.K.Gandhi
  • వేదాంత మీమాంసా శాస్త్ర దర్శనము 
  • గీతామృత తరంగిణి(భగవద్గీతా వ్యాఖ్యానము) - మూడు భాగములు 
  • విరూపాక్ష పీఠ జంత్రి (క్రీ.శ 1331-32 నుంచి)
  • శ్రీ విద్యోదంతము (1953 లో ప్రచురింపబడినది)
  • సంధ్యా కళా 
  • బ్రహ్మకలా 
  • Open and fair challenge -Srimukham-34
  • Many small booklets on different subjects (Srimukhams)
  • మనుస్మృతి సారః (The jurisprudence of Manu)-Printed in 1952
  • శ్రీ విద్యాస్త్ర పరంపర
  • భారతీ సాంప్రదాయము (1929 లో ముద్రితము)
వీటిలో కొన్ని కొంచం పెద్దగ్రంధములు.చాలావరకూ చిన్నచిన్న గ్రంధములు. కొన్ని అయితే పాంఫ్లెట్ ల మాదిరిగా పది ఇరవై పేజీలతో ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతూనే వాటిలో కొన్నింటిని చదివేసి వాటి సారమేమిటో అర్ధం చేసుకుని వాటిని ఒక పక్కన ఉంచాను.

'ఉండండి.మీకు టీ తీసుకొస్తాను.' అంటూ ఆయన లోపలకి వెళ్ళాడు.

ఆయనొచ్చే లోపు కొంచం పెద్ద సైజువి ఇంకొక మూడునాలుగు పుస్తకాలు చదవడం అయిపొయింది.ఆయన టీ కప్పుతో లోపల నుంచి వచ్చి నేను పక్కన ఉంచిన పుస్తకాలు చూచి - 'అన్నీ మీకోసమే తీసుకెళ్ళి చదవండి' అన్నారు. 

'అవి చదవడం అయిపొయింది.వీటిల్లో మాత్రం కొన్ని తీసుకుంటాను.మళ్ళీ ఒక వారంలో వచ్చినపుడు మీవి మీకు తెచ్చి ఇస్తాను'.అన్నాను.

ఆయన అనుమానంగా చూస్తూ 'ఎప్పుడు చదివారు?' అన్నారు.

'ఇప్పుడే.మీతో మాట్లాడుతూ కొన్ని చదివాను.మీరు టీ తెచ్చేలోపు కొన్ని చదివాను.నేను చాలా వేగంగా పుస్తకాన్ని చదవగలను.ఎంత వేగంగా అంటే మీరు ఆశ్చర్యపోయేటంత వేగంగా.మీకు కావాలంటే ఆ పక్కన ఉంచిన పుస్తకాల్లోంచి ఏవైనా ప్రశ్నలు అడగండి' అన్నాను నవ్వుతూ.

ఆయనేమీ మాట్లాడలేదు.

టీ తాగుతూ 'స్వామివారు కొంచం వివాదాస్పద వ్యక్తిలా ఉన్నారే?' అన్నాను గాంధీని ఆయన తీవ్రంగా విమర్శించిన పుస్తకాలు చూస్తూ.

'అమ్మో.మామూలు వ్యక్తి కాదండీ.ఆయనకు తెలియని విషయం అంటూ లేదు.లౌకికం ఆధ్యాత్మికం ప్రతిదాన్నీ తూర్పార పట్టి పారేసేవాడు.చాలా ఇంటలెక్చువల్. ఆరోజుల్లోనే సిద్ధాంతపరంగా గాంధీని కాంగ్రెస్నీ ఏకి పెట్టాడు' అన్నారు శర్మగారు.

'అవును చూచాను.శృంగేరీ మఠాన్ని కూడా చాలెంజ్ చేస్తూ ఓపన్ లెటర్ వ్రాశారే.'అన్నాను.

'అవును.శృంగేరిమఠం కూడా అసలు మఠం కాదనీ ఉపమఠం అనీ ఆయన వాదన.కంచి మఠాన్నైతే అసలు ఆయన ఒప్పుకోనేలేదు. ఆదిశంకరులు స్థాపించినవి నాలుగే మఠాలనీ అయిదోది లేదనీ,శృంగేరికి కంచిమఠం  బ్రాంచనీ  తర్వాత ఎప్పుడో ఒక సమయంలో విడిపోయిందనీ ఆయన సప్రమాణికంగా వాదించేవారు.ఈ విషయం అంతా ఆయన ఇచ్చిన శ్రీముఖాలలో ఉంది చూడండి.' అన్నారు.

'అవును.చూచాను.' అంటూ "అసలీయన ఎక్కడివారు?" అనడిగాను.

"ఆయన స్వగ్రామం అమలాపురం దగ్గర పేరూరుఅగ్రహారం.వేదజ్ఞానులైన పండితుల కుటుంబంలో ఆయన జన్మించారు.1914 లో కాశీలో జరిగిన పండిత సభలో ఆయనకు TT& DVD (Terror of Theosophy & Defender of Vaidic Dharma) అనే బిరుదు అనీబిసెంట్ చేత ప్రదానం చెయ్యబడింది.అప్పటికి ఆయనకు 16 లేదా 17 ఏండ్లు ఉండేవి.అనీబిసెంట్ ఆ బిరుదును ఇచ్చింది.స్వామివారు ఆంగ్ల ఆంధ్ర సంస్కృతాలలో మంచి పండితుడు." చెప్పారు.

'అదేంటి? తమ దివ్యజ్ఞాన సిద్ధాంతానికి వ్యతిరేకమైన బిరుదును ఆమె ఎలా ఇచ్చింది?' అడిగాను.

'అదేమరి వింత.మొదట్లో ఆయనకు మూడు నిముషాలే మాట్లాడటానికి సమయం ఇచ్చింది.తర్వాత స్వామివారి వాగ్ధాటికి ముగ్దురాలై పందోమ్మిది నిముషాలు పొడిగించింది.' అన్నారు.

"ఆయన పారాయణం చేసే లలితలో 1053 నామాలుండేవి.ఆ 53 నామాలు ఎక్కణ్ణించి తెచ్చాడో తెలియదు.బహుశా అవి ఆయన స్ఫురణకు అందిన నామాలు కావచ్చు.ఆయన లలితాసహస్రనామాలకు భాష్యం వ్రాశారు. ఆ భాష్యానికి 'శ్రీకళ' అని పేరు. 1923 డిసెంబర్ లో ఆయన అరండల్ పేటలోని శ్రీ పీఠానికి ఆధిపత్యం వహించారు."

"పరంపరలో చూస్తె విజయనగర సామ్రాజ్యానికి రాజగురువైన విద్యారణ్య స్వామి తర్వాత ఈయన 44వ వాడు.ఈయన గురువు బోధానందభారతి. ఆయన గురువు ఉద్దండభారతిస్వామి.చల్లపల్లి జమీందారు గారు (ఇప్పటాయనకు ముత్తాత) ఉద్దండభారతిస్వామి శిష్యుడు.ఆయనకు కూడా స్వామి శ్రీవిద్యాదీక్ష ఇచ్చారనీ,ఆ సాధనా ఫలితంగా జమీందారుగారికి కూడా శ్రీమాత సాక్షాత్కారం కలిగిందనీ అంటారు.

'బ్రాహ్మణులు కానివారికి శ్రీవిద్యను ఇవ్వరాదని అంటారు కదా? మరి కమ్మవారికి ఉద్దండభారతి శ్రీవిద్యను ఎలా ఇచ్చారు?' అడిగాను.

"స్వామి ఇలాంటివి ఒప్పుకునేవారు కారు.అర్హులైతే ఎవరికైనా ఇవ్వవచ్చు అర్హత ప్రధానం అనేవారు.ఆయనలో సాంప్రదాయ చాందసమూ,నవీనధోరణీ విచిత్రంగా కలిసిమెలసి ఉండేవి. పైగా విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత పీఠం స్థానభ్రంశం చెంది దేశమంతా తిరుగుతూ ఉంటె దానిని ఆదరించినవారు బొబ్బిలిరాజావారు మరియు చల్లపల్లిరాజావారు.వీరిద్దరూ ఈ పరంపరా స్వాముల శిష్యులు.కనుక వాత్సల్యపూర్వకంగా శ్రీవిద్యను వారికి ఉపదేశించి ఉండవచ్చు." అన్నారు. 

"శివగంగ అని మచిలీపట్నంలో ఉన్నది.చల్లపల్లి జమీందారుగారు బండ్లు కట్టుకుని కాశీకి వెళ్లి గంగను తెచ్చి ఇక్కడ నీళ్ళలో కలిపారనీ అప్పటినుంచి దానికి శివగంగ అని పేరొచ్చిందనీ అంటారు.అక్కడే ఆయన గురువుగారైన ఉద్దండభారతీస్వామి సమాధి ఉంది.

కళ్యాణానందభారతీస్వామి 'ఖడ్గమాలా పారాయణం' ఎక్కువగా చెయ్యమని చెప్పేవారు.ముఖ్యంగా స్త్రీలను ఈ పారాయణ ఎక్కువగా చెయ్యమని ఆయన చెప్పేవారు.మా పెత్తల్లులు పినతల్లులు అందరూ కలిసి ఏడుగురు. వారందరూ శ్రీవిద్యాదీక్షాపరులే.ఖడ్గమాలను నిరంతరం పారాయణం చేసేవారు. అందరూ పుణ్యస్త్రీలు గానే గతించారు."అన్నారు.

నా చిన్నప్పటినుంచి ఈ పారాయణాలు గట్రా చేసేవారిని కొన్ని వందల మందిని చూచాను.వీళ్ళమీద నాకేమాత్రం మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే అదే సర్వస్వం అనుకుంటూ అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు.వీళ్ళలో చాలామందికి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు.కాని అన్నీ తెలుసనీ అనుకుంటూ ఉంటారు.ఇతరులకు ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు.కాని ఉపాసనామార్గపు లోతులు వీరికి తెలిసి ఉండవు.అలాంటి వారిని లెక్కలేనంతమందిని నేను చూచాను.ఆ సంగతి బయటకి చెబితే ఆయన బాధపడతాడని మౌనంగా నవ్వి ఊరుకున్నాను.

(మిగతా మూడో భాగంలో)
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు -2 "

20, జూన్ 2013, గురువారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు

వెంకటేశ్వరరావుగారి వద్దనుండి వచ్చిన తర్వాత ఆయన గురువుగారైన కళ్యాణానందభారతీస్వామి గురించి వివరంగా తెలుసుకోవాలనిపించింది. ఆయన జగద్గురువనీ శంకరపీఠాన్ని అధిరోహించిన విశిష్టవ్యక్తి అన్న విషయం నాకు తెలుసు.శ్రీవిద్యను గుంటూరు ప్రాంతంలో బాగా ప్రచారంలోకి తెచ్చిన సద్గురువని కూడా తెలుసు.

స్వామివారి గురించి చాలా ఏళ్ళ క్రితమే చదివి ఉన్నాను.కాని ఆయన యొక్క విధానం ఏమిటి?శ్రీవిద్యలో ఉన్నట్టి అనేక సాంప్రదాయాలలో వారియొక్క సాంప్రదాయమూ సిద్ధాంతమూ ఏమిటి?మొదలైన వివరాలు వారి వ్యక్తిగతశిష్యుల నుంచి విశదంగా తెలుసుకుందామని ఇచ్చ కలిగింది.వారి జననవివరాలు దొరికితే జాతకాన్ని పరిశీలిద్దామని కూడా అనుకున్నాను.

నేను చాలాసార్లు ఒక విషయం గమనించాను.ఏదైనా తెలుసుకోవాలని నాకు బలంగా ఇచ్చకలిగితే ఆ తర్వాత ఏమీ చెయ్యక్కరలేదు. కొద్ది రోజులలో దానికి సంబంధించిన మనుషులే నావద్దకు వస్తారు.దానికి చెందిన పుస్తకాలు వచ్చి చేరతాయి.దానికి అనుకూలమైన పరిస్తితులు కల్పించబడతాయి.ఇలా నా జీవితంలో లెక్కలేనన్నిసార్లు జరిగింది.

శ్రీవిద్య గురించి నేను మొట్టమొదటిసారిగా 1977 లో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులలో తెలుసుకున్నాను.అప్పుడు తెనాలి సాధన గ్రంధమండలి వారు ప్రచురించిన గ్రంధాలద్వారా మొదటిసారిగా శ్రీవిద్య గురించీ, శ్రీచక్రార్చన గురించీ,ఈశ్వరసత్యనారాయణశర్మగారి గురించీ చదివాను. తొమ్మిది పది తరగతులలో క్లాసు పుస్తకాలకంటే ఆధ్యాత్మిక గ్రంధాలే ఎక్కువ చదివాను.తర్వాత అనేక ఊళ్లు తిరిగీ,అక్కడి లైబ్రరీలలో గ్రంధాలు మధించీ, అందులో కృత పరిశ్రములైన అనేకమంది మహనీయులతో చర్చించి, వ్యక్తిగత సాధనచేసి, దాని లోతుపాతులు అర్ధం చేసుకోగలిగాను.

బళ్లారిలో 'లా' చదివే రోజుల్లో కాలేజీలోకంటే ఎక్కువగా పాతబస్టాండ్  దగ్గరున్న వ్యాయామశాలలోనో లేకపోతే లైబ్రరీలోనో కాలం గడిపేవాడిని.బళ్ళారి లైబ్రరీలో ఉన్న అన్ని తెలుగు ఇంగ్లీషు ఆధ్యాత్మికగ్రంధాలనూ నేను కొద్ది రోజులలో చదివేశాను.

ఒక విషయం గురించి నాకెంత తెలిసినా కూడా నిజమైన పెద్దలవద్ద కూచున్నపుడు నాకు ఏమీ తెలియనట్లే భావించి వారు చెప్పేది వినడం నా అలవాటు.వారు చెప్పేది నాకు ఇప్పటికే తెలిసిఉన్నా కూడా,ఒకవేళ వారికంటే ఎక్కువ తెలిసి ఉన్నాకూడా అదేమీ వారిముందు ప్రదర్శించను.నాకు తెలిసిన విషయాల గురించికూడా మళ్ళీ ప్రశ్నలు అడిగి వారేమి చెప్తారో అని వినయంగా పరిశీలించడం నా పధ్ధతి.ఈ పధ్ధతి నాకు ఎంతో ఉపయోగపడింది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే వీలు కల్పించింది. దీనికి వ్యతిరేకంగా, ఉండాల్సిన సరుకు లేకుండా అనవసర పెద్దరికాలు ప్రదర్శించేవారికి బడితెపూజ చెయ్యడం కూడా నాకు భలేసరదా.

అలా మూడునాలుగు రోజులు గడిచాయి.ఒకరోజున ఆఫీస్లో పని చేసుకుంటూ ఉన్నాను.తలుపు దగ్గర 'మే ఐ కమిన్' అని వినిపించింది.ఎవరా అని చూస్తూ 'ప్లీస్ కమిన్' అన్నాను.నాకు పాత పరిచయస్తుడైన 'శర్మగారు' అనబడే ఒకాయన నవ్వుతూ లోపలకు వచ్చాడు.ఆయన అసలు పేరు నాకు తెలియదు.'శర్మగారూ' అని మాత్రమె ఆయన్ను పిలుస్తాం.

కుశల ప్రశ్నలు అయ్యాక, 'ఏమిటి ఇలా వచ్చారు?' అంటూ అడిగాను.

'నేను రిటైరై 26 ఏండ్లు అయింది.అంటే నాకిప్పుడు 86 ఏండ్లు.రైల్వే నుంచి నాకు రావలసిన కొంత డబ్బు బాకీ ఉండిపోయింది.దానికోసం ఎప్పుడో అప్ప్లై చేసాను.పట్టించుకున్నవారు లేరు.ఆఫీస్లో మళ్ళీ ఒక్కసారి కలిసి పోదామని వచ్చాను.మీరున్నారని తెలిసి ఇలా వచ్చాను.'అన్నాడు.

'మీకు రావలసిన డబ్బు ఎంత? అడిగాను.

"రెండువేలు.దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది కదా వదిలిపెట్టడం ఎందుకు అని వచ్చాను." అన్నాడాయన.

'సరే' అంటూ దానికి సంబంధించిన స్టాఫ్ ను పిలిచి అంత పెద్దాయనను అంతలా ఎందుకు తిప్పుతున్నారని మందలించి ఆ ఫైల్ ఎక్కడుందో తీసి ఆయన డబ్బు ఆయనకు త్వరగా వచ్చేటట్లు చూడమని ఆదేశించాను.

'టీ' తీసుకుంటారా? ప్యూన్ ను పిలవడం కోసం బెల్ నొక్కబోతూ అడిగాను.

'వద్దు.టీ కాఫీ అలవాటు మొదటినుంచీ లేదు.కొత్త అలవాట్లు ఇప్పుడెందుకు?' అన్నాడాయన బోసినోటితో నవ్వుతూ.

'సరే.ఈ వయసులో కూడా మీరు బాగా ఆరోగ్యంగా ఉన్నారు' అడిగాను.

'అవును.నేను అన్నం మానేసి నాలుగేళ్ళు అయింది.పగలు ఒక గ్లాసు రాగిజావ తాగుతాను.రాత్రికి పాలూ ఓట్స్ తీసుకుంటాను.అంతే నా ఆహారం. రోజూ బాగా నడుస్తాను.' అన్నాడు.

'కాలక్షేపం ఎలా?' అడిగాను.

'ఏముంది. మా స్వామివారు ఉపదేశించిన మంత్రాన్ని జపం చేసుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ కాలం గడుపుతున్నాను.' అన్నాడు.

'ఎవరా స్వామివారు?' అడిగాను.

'ఆయన ప్రస్తుతం లేరు.ఆయన పేరు కల్యాణానందభారతీ స్వామి.' అన్నాడు.

లోపల్లోపల నవ్వుకుని మనసులోనే జగన్మాతకు ప్రణామం చేశాను.

కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ తెనాలి రామలింగేశ్వరపేటలో తానుంటున్న అడ్రస్ ఇచ్చి వీలున్నపుడు రమ్మని చెప్పాడు.తన దగ్గర స్వామివారు వ్రాసిన చాలా పాత పుస్తకాలున్నాయనీ అవి జీర్ణస్తితికి చేరాయనీ జాగ్రత్తగా ఉంచుకునే వారికి ఇద్దామని అనుకుంటున్నాననీ చెప్పాడు.

'వచ్చే ఆదివారం మీ ఇంటికి వస్తున్నాను.అప్పుడు వివరంగా మాట్లాడు కుందాం' అని ఆయనతో చెప్పాను.ఆయన సరేనంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు "

18, జూన్ 2013, మంగళవారం

ఆత్మహత్యా యోగాలు-జియాఖాన్ జాతకం

ఒక బ్లాగ్మిత్రురాలు నిన్న మెయిల్ చేస్తూ ఇలా అడిగింది.

'జియాఖాన్ జాతకం ఒకసారి చూస్తారా?ఆమె ఆత్మహత్య చేసుకోడానికి జ్యోతిష్యపరంగా కారణాలు ఏమున్నాయో కొంచం చూడగలరా?'

గురువు రాశిమారిన తర్వాత ఇలాటివి జరుగడం,చాలామంది జీవితాలలో అనూహ్య మార్పులు రావడం   ఊహించినదే గనుక ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.జ్యేష్టమాస జాతకంలో కూడా ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోయే కోణం ప్రస్తావించాను.కాని మిత్రురాలు అడిగిన తర్వాత ఒకసారి ఈ నటి జాతకం చూద్దామనిపించింది.

చనిపోయినవారి జాతకాలను సామాన్యంగా నేను చూడను.అయితే వారు ప్రముఖులు అయితే రిసెర్చ్ కోసం ఎప్పుడైనా వారి జాతకాలు చూడవచ్చు అని భావిస్తాను.పైగా ఈ మధ్య ఒక వింతవిషయం నాకు కనిపిస్తున్నది. బ్రతికున్నవారిలోనే నాకు పిశాచాలు దర్శనం ఇస్తున్నాయి. చనిపోయిన వారు నిస్సహాయులు.పాపం ప్రేతాత్మలుగా ఉండి బాధలు పడుతుంటే ఎప్పుడైనా కనిపించి ఏదైనా సాయం అడుగుతారు గాని అంతకంటే వారు ఏమీ చెయ్యలేరు.దానికి భిన్నంగా బతికున్నవారిలోనే అసలైన పైశాచికత్వం రాక్షసత్వం నాకు కనిపిస్తున్నాయి. కనుక చనిపోయినవారి జాతకాలు చూస్తె తప్పేమిటి అనిపించింది.

సాంప్రదాయ జ్యోతిష్యంలో ఆత్మహత్యా యోగాలు బలవన్మరణ యోగాలు చాలా ఇవ్వబడ్డాయి. ఏఏ రకాలుగా వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు?వాటికి ఏఏ గ్రహయోగాలు కారణాలు అవుతాయో కూడా కొన్నిచోట్ల క్లుప్తంగానూ కొన్నిచోట్ల విపులంగానూ చర్చ జరిగింది.

ముఖ్యంగా జైమిని సూత్రాలలో మనం చూస్తె, లగ్నాత్ తృతీయానికి గానీ,ఆత్మకారకాత్ తృతీయానికి గానీ పాపగ్రహసంబంధం ఉంటే బలవన్మరణం లేదా అసహజ మరణం ఉంటుందని వ్రాసి ఉన్నది.

ఈ అమ్మాయి 20-2-1988 న న్యూయార్క్  లో పుట్టింది.జననసమయం నాకు దొరకలేదు.కనుక లగ్నం మనకు తెలియదు.దానిని కూడా కనిపెట్టవచ్చు.కాని అంత శ్రమపడాల్సిన అవసరం లేదు.మిదునలగ్నం అయి ఉండవచ్చు అని ఇంట్యూషన్ చెబుతున్నది.అప్పుడే ఈ అమ్మాయి జీవితం కరెక్ట్ గా సరిపోతుంది. తృతీయానికి  రవిద్రుష్టి ఉన్నది. రవిదృష్టి ఉన్నపుడు ఉరివంటి అసహజ మరణాలు ఉంటాయని జైమిని సూత్రాలు చెప్పాయి.

లేదా సినిమా నటులకు బాగా అచ్చివచ్చే తులాలగ్నం కావచ్చు.అప్పుడు కూడా తృతీయానికి పాపసంబంధం ప్రబలంగా ఉన్నది.ఈ లగ్నం అయినప్పుడు బలవన్మరణ యోగం కూడా కొంత సరిపోతుంది.పైగా తులా లగ్నం వారు ప్రస్తుతం శపితయోగ పరిధిలో ఉన్నారు.


చంద్రుడు కానీ బుధుడు కానీ ఈ అమ్మాయికి ఆత్మకారకుడు అయి ఉండాలి.చంద్రుని నుంచి చూస్తె జైమిని యోగం లేదు.పోతే బుధుడు వక్రి.అంతేగాక అతని నుంచి బలమైన జైమిని యోగం ఉన్నది.కనుక బుదుడే ఈమె ఆత్మకారకుడు.పైగా బుధ కారకత్వాలైన సున్నితత్వమూ, కళాభినివేశమూ ఈ అమ్మాయిలో ఉన్నవి.ఇవి గాక చూడగానే కొన్ని యోగాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
  • శనికుజుల యోగం యాక్సిడెంట్లకూ అసహజ మరణానికీ సూచిక.  
  • చంద్ర,రాహు యోగం వల్ల అతి చంచల మనస్సు ఉంటుంది.ఉచ్ఛ శుక్రుని తోడువల్ల త్వరగా అందరినీ నమ్మడం ప్రేమలో పడటం ఉంటుంది.
  • వక్రిబుధుని వల్ల సున్నిత స్వభావం,తనలో తానె కుమిలిపోవడం ఉంటాయి.అదీగాక ఈ అమ్మాయిది రేవతీ నక్షత్రం. రేవతీ నక్షత్రం వారు సున్నిత మనస్కులు.తేలికగా ఇతరులను నమ్ముతారు.కనుక మోసాలు బాధలు తప్పవు.
  • నవాంశలో శనిబుధుల యోగం వల్ల తేలికగా డిప్రెషన్ లోకి వెళతారు.
  • మీనంలో ఉన్న మూడు గ్రహాలమీద శనికుజుల సమ్మిలిత దృష్టి గమనార్హం.ప్రేమ+వృత్తి+సున్నితమనస్తత్వం+అత్యాశ+డిప్రెషన్+ యాక్సిడెంట్ లను ఈ యోగం సూచిస్తున్నది.

గోచారం (3-6-2013)

  • గోచార చంద్రుడు జనకాల చంద్రునికి చాలా దగ్గరగా అదే రేవతీ నక్షత్రంలో ఉన్నాడు.  
  • గోచారశుక్రుడు జననకాల శనికుజులకు సరియైన అపోజిషన్లో ఉన్నాడు.
  • గోచార బుధుడు కూడా ఈ శుక్రునికి దగ్గరగానే ఉన్నాడు.
  • ఈ అమ్మాయికి చంద్రలగ్నాదిపతి అయిన గోచారగురువు అప్పుడే రాశిమారి సున్నాడిగ్రీలలో బలహీనుడుగా ఉన్నాడు.
దశలు

జనన సమయం ఖచ్చితంగా దొరకనందున దశలు ఖచ్చితంగా నిర్దారించ లేము.కాని ఊహప్రకారం ఈ అమ్మాయికి ఇప్పుడు శుక్రదశలో కుజ అంతర్దశ జరుగుతూ ఉండవచ్చు.కనుక ప్రేమవ్యవహారంలో పడి చావుకొని తెచ్చుకుంది.

మనుషులకు అత్యాశ ఎక్కువై పోయిన నేటి సమాజంలో చదువులో ర్యాంకుల దగ్గరనుండి,జీవితంలో అవకాశాలు రావేమో సరిగా స్తిరపడలేమేమో అనే అభద్రతాభావం ప్రతిదానిలోనూ చాలామంది పిల్లలలో పెరిగిపోతున్నది. ఇటువంటి భావాలు ఉన్న పిల్లలపట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సున్నిత మనస్కులైన పిల్లలను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాచు కోవాలి.అలా చెయ్యకుండా ఇంకాఇంకా వారిని టెన్షన్ కు గురిచేసి హింస పెడితే చివరికి ఆత్మహత్యలే మిగులుతాయి.

జియాఖాన్ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అందరికీ చాలావరకూ తెలుసు. కాని చదువులో టెన్షన్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలను చూస్తె మనసు వికలమై పోతుంది.ఈ సంఘటనల బాధ్యత చాలావరకూ తల్లిదండ్రులదే అని చెప్పాలి.ప్రతివారిలో స్వార్ధమూ,దురాశా పెరిగిపోతున్న నేటి వ్యవస్థలో ఇమడలేని అమాయకులు చెల్లిస్తున్న మూల్యాలుగా వీటిని భావించాలి.వీటిలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంత?చుట్టూ ఉన్న వ్యవస్థ పాత్ర ఎంత అనే విషయాలు ఎవరు ఆలోచిస్తారు?నేటి పరుగుపందెపు జీవితాలలో అలా ఆలోచించే సమయం ఎవరికుంది???
read more " ఆత్మహత్యా యోగాలు-జియాఖాన్ జాతకం "

17, జూన్ 2013, సోమవారం

సర్వతోభద్ర చక్రం - భవిష్య దర్శనం


భవిష్యత్తులోకి తొంగిచూడటానికి భారతీయ జ్యోతిశ్శాస్త్రంలో అనేక పద్ధతులున్నాయి.అలాగే ప్రశ్న జ్యోతిష్యంలో కూడా అనేక విధానాలున్నాయి. ప్రాచీనులు దీనిలో ఎంత పరిశోధన చేశారో తలచుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.అసలు భవిష్యత్తును తెలుసుకోవడం అవసరమా?దానివల్ల ఉపయోగం ఏమిటి? అనే సందేహాలు వెలిబుచ్చే మనమే తెలివైనవారిమని విర్రవీగడం సరికాదు.ప్రాచీన జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకులు మహర్షులనీ,మన ఊహకందని తెలివి వారికుందనీ గ్రహిస్తే మన క్షుద్ర సందేహాలు పటాపంచ లౌతాయి.ఇప్పుడు మనకొస్తున్న సందేహాలను వారు అప్పుడే చర్చించారు.వాటికి యుక్తియుక్తములైన జవాబులను కూడా వారే ఇచ్చారు.జ్యోతిష్యాది విద్యలను వ్యాపారదృష్టితో వారు చూడలేదు. లోకానికి మంచి చేద్దామనే ఉద్దేశ్యంతోనే వారీ విద్యలను నిస్వార్ధంగా మన కందించారు.జ్యోతిశాస్త్రంలో పనికొచ్చే ఎన్నో విధానాలను వారు మనకు అందించారు. వాటిలో ఒకటి సర్వతోభద్ర చక్రం.

జాతకాన్నీ,గోచారాన్నీ,ప్రశ్ననూ,ముహూర్తాన్నీ అన్నింటినీ ఒకేచోటికి చేర్చి ఒక సంపూర్ణభవిష్య దర్శినిని తయారు చేద్దామన్న ప్రయత్నంలా సర్వతోభద్ర చక్రం కనిపిస్తుంది.ఇందులో అచ్చులూ, హల్లులూ, తిధులూ, వారాలూ,నక్షత్రాలూ,రాశులూ,గ్రహాలూ అన్నీ ఇమిడి ఉన్నాయి.

అందుకే సర్వతోభద్ర చక్రాన్ని వాడి జన్మ జాతకాన్నీ విశ్లేషణ చెయ్యవచ్చు. అలాగే ప్రశ్నకూ,ముహూర్తానికీ,గోచారానికీ దీనిని సులభంగా వాడు కోవచ్చు.2008 సంవత్సరంలో నేను దీనిని ఉపయోగించి నాలుగు రోజుల్లో నాకు రాబోతున్న ప్రమోషన్నూ, ట్రాన్స్ఫర్ నూ మాత్రమెగాక అది ఏ ఊరికి రాబోతున్నదో కూడా ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలిగానో ఇక్కడ ఉదాహరణతో చూపిస్తాను.పాత పేపర్లు వెతుకుతుంటే, ఆరోజు నేను వేసిన సర్వతోభద్ర చక్రం ఈరోజున దొరికింది.దాని ఫోటో ని పైన చూడవచ్చు.

విశ్లేషణ అంతా కాగితం మీదే క్లుప్తభాషలో ఉన్నది.ఇక్కడ కూడా క్లుప్తంగా మాత్రమె వివరిస్తాను.యోగకారకులు అభిషేకతారలో ఉన్నపుడు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది.ఔన్నత్యం వరిస్తుంది.31వ తేదీన చంద్రుడు నాకు క్షేమతారలోకి వస్తూ అభిషేకతారలో స్తితులై ఉన్న నా యోగకారకులైన బుధశుక్రులను వీక్షించబోతున్నాడు.ఆ వీక్షణ 'గ' అన్న అక్షరం మీదుగా పోతున్నది.ఈ అక్షరంతో గుంటూరు,గుంతకల్ రెండు ఊర్లున్నాయి.కాని అప్పుడు గుంటూర్లోనే ఉన్నాను.కనుక గుంటూరు కాదు.మిగిలిన సికింద్రాబాద్,హైదరాబాద్,విజయవాడ,నాందేడ్,గుంతకల్ లలో ఆ అక్షరంతో మొదలయ్యేది ఒక్క గుంతకల్ మాత్రమే.

కనుక 27-3-2008 తేదీన నేను వేసిన లెక్క ప్రకారం 31-3-2008 న నాకు గుంతకల్ కు ట్రాన్స్ఫర్ అవుతూ ఆర్డర్స్ రావాలి. 

సరిగ్గా 31-3-2008 న సాయంత్రానికి అనుకున్నది కరెక్ట్ గా జరిగి గుంతకల్ కు  ప్రమోషన్ తో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందుకోవడం జరిగింది.

సర్వతోభద్ర చక్రాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియజెప్పడానికి నా పాత రికార్డ్స్ నుంచి ఇది ఒక మంచి ఉదాహరణ.
read more " సర్వతోభద్ర చక్రం - భవిష్య దర్శనం "

16, జూన్ 2013, ఆదివారం

ఏదో పరవశ వేదనలో...

నీవెవరో నాకు తెలుసేమో !! 
నీవేమిటో నాకు తెలియదు;
నేనేంటో నీకు తెలుసుగాని 
నేనెవరో నాకే తెలియదు!! 

తనకోసం 
నిన్ను ఖాళీ చేసిన నీవు 
నీలోని తనకోసం 
నన్ను మరచిన నేను 

ఒక్కసారైనా
నన్ను చూడని నీవు
ఒక్కక్షణమైనా
నిన్ను వీడని నేను

నిన్ను మరచి 
తనలో మునిగిన నీవు 
నన్ను విడిచి 
నీలో  తేలిన నేను
  
ఎప్పుడూ ఒకటి కాకున్నా 
ఎప్పుడూ ఒక్కరుగా ఉంటున్న 
ఎప్పటికీ ఒకటే అయిన 
ఇద్దరమేగా మనం?

తనకోసం నీవున్నావు
నీకోసం నేనున్నాను
తానే నీవైనప్పుడు 
నీవే నేనైనప్పుడు 
తాను కాదా నేను

నీవూ నేనూ తానూ
కలసిపోయి ఒక్కటిగా 
ఎవ్వరు ఎవరో తెలియని 
ఏదో పరవశ వేదన...
read more " ఏదో పరవశ వేదనలో... "

12, జూన్ 2013, బుధవారం

చాలా రోజులైంది...

చాలా రోజులైంది 

నిన్ను నేను మరచిపోయి  
నాలోనే మునిగిపోయి  
చాలా రోజులైంది.

నీ ధ్యాసను విడచిపెట్టి
నన్ను నేను ప్రేమించి
చాలా రోజులైంది

నాలోపల దాగిఉన్న 
నా తల్లిదండ్రులకు 
తర్పణాలు ఒదిలిపెట్టి
చాలా రోజులైంది 

నన్ను నేను సంహరించి 
నగ్నంగా  నిలిచిపోయి
నవ్వుకుని నవ్వుకుని 
చాలా రోజులైంది 

నట్టేటను నిన్ను ముంచి 
నా దారిన నేనుపోయి 
కొండకొమ్ము నుంచి దూకి 
చాలా రోజులైంది 

కాళ్ళనున్న మట్టి తుడిచి
కల్మషాల కడిగివేసి
కాళీ పదముల నంటి
చాలారోజులైంది 

రొచ్చులోన మునిగిపోయి
రోదనలను మరిగిపోయి 
పాతాళపు పల్లె జేరి 
చాలారోజులైంది 

యోనిచక్ర మండలాన
యోచనలను సంహరించి
యోగారూఢత నొంది 
చాలా రోజులైంది   

మకారాలు ఒదిలిపెట్టి 
మత్తులోన మునిగిపోయి 
మంచుకొండ కొమ్ము జేరి 
చాలా రోజులైంది 

కపాలపు రాజ్యమందు 
కస్తూరీ యంత్రమ్మున
కన్యలెందరినో కలిసి
చాలా రోజులైంది 

వింతదైన తంత్రమ్మున
విద్యలెల్ల సాధించి
వికటంగా నవ్వు నవ్వి
చాలా రోజులైంది 

అమావాస్య రోజులలో 
అన్నిటినీ బలినొసంగి
అమ్మ పాదములు తాకి 
చాలా రోజులైంది

అష్టకష్టముల నీది 
అష్ట కన్యకల నడుమ 
అద్భుత రతులను తేలి
చాలా రోజులైంది

అసహ్యపు లోకమొదిలి
తంత్రాన్వయ సీమలోన
తన్మయత్వమును బొంది
చాలా రోజులైంది

మన్మధుణ్ణి మసిని చేసి 
రతీదేవి చెయ్యిపట్టి 
భైరవత్వమున నిలిచి 
చాలా రోజులైంది......
read more " చాలా రోజులైంది... "

11, జూన్ 2013, మంగళవారం

నరేంద్ర మోడీ జాతకం- 1

నిన్న నరేంద్రమోడీ మీద ఉంచబడిన బాధ్యతను గమనిస్తే ఆయన జాతకం ఒకసారి చూద్దామనిపించింది.

ఎందుకోగాని,చాలాసార్లు చాలా మంది ప్రముఖులవి అసలైన జాతక వివరాలు దొరకవు.ఒకవేళ దొరికినా అవి సరియైనవో కావో తెలియదు. కనుక తప్పు వివరాలతో జాతకాలు వెయ్యడం సరికాదు గనుకా ఒకవేళ వేసినా అవి ఎలాగూ సరిపోవు గనుకా ఆ ప్రయత్నం చెయ్యడం సాహసమే అవుతుంది.అయినా సరే కొంత ప్రయత్నం చేసి చూద్దాం.

మోడీ జనన వివరాల కోసం వెదికితే  మూడు రకాలైన సమాచారం దొరుకుతున్నది.

జననతేదీ 17-9-1950;వాద్ నగర్;మెహసాన జిల్లా;గుజరాత్.ఇంతవరకూ  కొంత క్లారిటీ ఉన్నట్లు కన్పిస్తుంది.ఆరోజున భాద్రపద శుక్లషష్టి, ఆదివారం,అనూరాధా నక్షత్రం అయింది.

జ్యోతిష్యవిద్య బాగా పట్టుబడితే కొన్ని సులువులు సూత్రాలు అర్ధమౌతాయి. వాటివల్ల, జాతకం వెయ్యకుండానే జననతేదీ నుంచి,తిధి వార నక్షత్రాలనుంచే జాతకుడి జీవితం చాలావరకు స్థూలంగా తెలిసిపోతుంది. అతని జీవితగమనం ఎలా ఉంటుంది,గమ్యం ఏమిటి అనే విషయాలు తెలిసిపోతాయి.

పై స్వల్ప పంచాంగ వివరాలను బట్టి ఈయనకు లోకంతో చాలా గట్టి రుణానుబంధం ఉందని తెలిసిపోతున్నది.అంతేగాక ఈయనది కష్టజాతకం అన్న విషయమూ తెలిసిపోతున్నది.

సరదాగా సంఖ్యాశాస్త్ర సాయం తీసుకుందాం.ఈయన జనన తేదీలోని శని, చంద్రుడు,కుజుడు,బుధుల ప్రభావం వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి.

ఈయన జీవితం నల్లేరు మీద నడకకాదు.చాలా కష్టం తర్వాతే ఫలం దక్కుతుంది.ముఖ్యంగా బాల్యం కష్టాలతో గడుస్తుంది.ఆధ్యాత్మిక కోణంలో జీవితాన్ని చూస్తాడు.చాలా పట్టుదల ఉన్న వ్యక్తి.తెలివైనవాడు అని ఈ స్వల్ప వివరాలవల్ల తెలుస్తున్నది.ఇవన్నీ నిజాలే అని ఈయన జీవితం చదివితే తెలుస్తుంది.

ఇంకొంచం లోతుగా జాతకాన్ని పరిశీలించాలంటే జనన సమయం కావాలి.అవి మాత్రం మూడు కనిపిస్తున్నాయి.ఇందులో ఏది సరియైన జనన సమయమో ముందుగా తేల్చిన తర్వాత, జాతకంలోని సూక్ష్మవివరాల జోలికి,భవిష్యత్తు జోలికి వెళ్ళాలి.దానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలను ఉపయోగిస్తాను.

10.11 hours -- ఈ సమయానికి చంద్రహోర నడుస్తున్నది. 
11.00 hours -- ఈ సమయానికి శనిహోర.
12.21 hours -- ఈ సమయానికి గురుహోర.

వీటిలో మొదటిది తులా లగ్నాన్ని ఇస్తున్నది.మిగిలిన రెండూ వృశ్చిక లగ్నాన్ని ఇస్తున్నాయి.ఇక విశ్లేషణ మొదలు పెడదాం.
  • తులాలగ్నం వారు అందంగా ఉంటారు.మోడీ అంత అందగాడు కాదు.
  • మోడీ పెదవులు కొంచం బండగా ఉంటాయి.అలా ఉండాలంటే వృశ్చిక లగ్నం అయ్యి ఉండాలి.కారణం అక్కణ్ణించి నవమం మీద రాహు దృష్టి.
  • ఈయన పైన ముగ్గురు జ్యేష్టులున్నారు.తులా లగ్నం అయితే అలా కుదరదు.వృశ్చికం అయితే సరిపోతుంది.
  • మోడీ చిన్నప్పుడు బస్టాండ్ లో టీ కొట్లో పనిచేశాడు.అలాంటి వృత్తి చిన్నప్పుడు ఉండాలంటే దశమానికి శని సంబంధం ఉండాలి.వృశ్చిక లగ్నానికే అది సరిపోతుంది.
  • మోడీ బ్రహ్మచారి.తులా లగ్నం అయితే లాభంలో శని శుక్రులవల్ల వివాహం అవ్వాలి,వివాహ జీవితం బాగుండాలి. సప్తమాధిపతి కుజుని కుటుంబస్తితివల్ల కూడా అదే జరగాలి.అదే వృశ్చికం అయితే, సప్తమాధిపతి శుక్రుని దశమ కేంద్రస్తితివల్లా,లగ్న శత్రువైన శనియుతి వల్లా వివాహం బాగా ఆలస్యం కావాలి లేదా అసలు ఆ యోగమే ఉండదు.లేదా వివాహ జీవితంలో వెలితి ఉంటుంది.రెండోదే కరెక్ట్ కనుక ఈయనది వృశ్చిక లగ్నమే.
  • ఇంకొక్క ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.తులా లగ్నం అయితే ఎప్పుడూ గడ్డం పెంచుకుని తిరగడు.వృశ్చికం అయితేనే అందులోని నీచచంద్ర కుజులవల్ల గడ్డంతో తిరిగే యోగం కలుగుతుంది.మోడీ ఎప్పుడు చూచినా గడ్డంతో దర్శనమిస్తాడు.కనుక ఈయనది వృశ్చిక లగ్నమే.
  • ఈయన పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు.కనుక వృశ్చిక లగ్నం అయితేనే చతుర్ధ గురునివల్ల రాజపరిపాలనా సంబంధ విద్య ఉంటుంది. అదే తులాలగ్నం అయితే ఆ యోగం లేదు.కనుక ఇలా చూచినా వృశ్చిక లగ్నమే కరెక్ట్ అని అనిపిస్తుంది.
పై ఏడు పాయింట్స్ వల్ల మొదటి సమయం కరెక్ట్ కాదు అని తేలుతుంది. మిగతా రెండు సమయాలలో ఏదైనా వృశ్చికలగ్నాన్నే ఇస్తుంది.వాటిలో ఏది కరెక్టో వచ్చే పోస్ట్ లో విశ్లేషణ చేసి చూద్దాం.ముందుగా జనన సమయాన్ని సరి చేస్తే, ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో తీరికగా దృష్టి సారించవచ్చు.
read more " నరేంద్ర మోడీ జాతకం- 1 "

10, జూన్ 2013, సోమవారం

జ్యేష్ట శుక్ల పాడ్యమి-దేశజాతకం


జ్యేష్ట శుక్ల పాడ్యమి కుండలి పరిశీలించి ఈ నెల దేశానికి ఎలా ఉంటుందో చూద్దాం.8-6-2013 న 22-25 గంటలకు గ్రహస్తితి ఇలా ఉన్నది.శనివారం మృగశిరా నక్షత్రం కుజ హోరలో జ్యేష్టమాసం మొదలైంది.

  • దశమంలో శపితయోగం వల్ల పరిపాలన ఏమంత బాగుండదు.అధికారులకు చికాకులు తప్పవు.
  • శుక్ర శనుల మధ్య కోణదృష్టి వల్ల సెక్స్ సంబంధమైన వివాదాలలో అధికారులు చిక్కుకుంటారు.దీనికి వారిమధ్యన గల పరస్పర విభేదాలే కారణం అవుతాయి.
  • కుజ శనుల మధ్య ప్రతికూల దృష్టి వల్ల షేర్ మార్కెట్ కల్లోలాలకు లోనౌతుంది.
  • మేధావులకు తెలివి మందగిస్తుంది.తద్వారా పరిపాలనలో తప్పుడు నిర్ణయాలు తీసుకోబడతాయి.
  • చతుర్ధ కేతువు వల్ల ప్రజా జీవనం శాంతిగా ఉండదు.
  • ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలవల్ల ఆర్ధిక రంగంపైన ప్రతికూల ప్రభావం పడుతుంది.
  • పంచమంలో శుక్రక్షేత్ర కుజునివల్ల అమావాస్య ప్రభావం వల్ల ప్రేమ వ్యవహారాలలో బాలికలు నమ్మి మోసపోవడం దాడులకు గురికావడం యధావిధిగా కొనసాగుతుంది. 
  • ఇదే యోగం వల్ల కొందరు క్రీడాకారులపైనా పోలీస్ అధికారులపైనా చీకటి కమ్ముకుంటుంది.వారి కెరీర్ లు దెబ్బతింటాయి.
  • న్యాయవిభాగం అధికారుల పరిపాలనా తీరుపైన దృష్టి సారించి వారిని నియంత్రించాలని చూస్తుంది.
  • న్యాయాదికారులు కొందరు అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
  • జూన్ ఇరవై తేదీన ప్రజా సంబంధ/పరిపాలనా పరమైన చిక్కులు ఎక్కువగా ఉంటాయి.
read more " జ్యేష్ట శుక్ల పాడ్యమి-దేశజాతకం "

9, జూన్ 2013, ఆదివారం

త్రిశంకు స్వర్గం

ఎన్నో జన్మల ఆరాటంలో
కనిపించిందొక స్వర్గం 
ఎన్నో ఏళ్ళ సంఘర్షణలో 
అందిందొక పుంజం  

ఎన్నో దారుల వెతుకులాటలో 
ఎదురైందొక గమ్యం 
ఎన్నో తరాల తపోఫలంగా 
ఎగసిందొక హర్మ్యం 

అందరికీ అందని ఈ స్వర్గం 
కొందరికైనా అందించే సంకల్పం 
వద్దని వారించారు సహచరులు 
వృధా ప్రయాసన్నారు ఖేచరులు 

ఒక ప్రయత్నం చేద్దామనుకున్నా 
ఒక వెలుగుల తెర తీద్దామనుకున్నా
ప్రాణజలాల కాంతి సరస్సుకు
నలుగురినైనా నడుపుదామన్నా 

నా వంతు ప్రయత్నం చేస్తే 
నాతో వచ్చేవారికోసం చూస్తే
కనిపించిందొక విచిత్రం 

కొందరి కళ్ళకు గంతల్లు
కొందరి కాళ్ళకు సంకెళ్ళు  
కొందరి చేతుల బంధాలు 
కొందరి చెవులకు బిరడాలు 

కొందరు మనుషుల మంటారు
కొందరి మనసులు వ్యగ్రాలు 
కొందరు కొమ్ముల జీవాలు 
అమ్ముల పొదిలో ఆవాలు

కొందరికి లేవడమే అయిష్టం
కొందరి నడకే అతికష్టం
కొందరు మత్తున జోగారు
కొందరు నిద్రను మునిగారు

కొందరు కోరల సింహాలు 
కొందరు పాకెడి సర్పాలు
కొందరు ఆశల అగచాట్లు 
కొందరు మబ్బుల ఖగరాట్లు 

కొందరమాయక కుందేళ్ళు 
కొందరు బందీ పెంగ్విన్లు
కొలనున ఎగిరే పెలికాన్లు
కోపపు మాటల టైఫూన్లు

ఎత్తులు మరిగిన పాండాలు
ఏళ్ళు వచ్చినా పసివాళ్ళు
జిత్తులు నేర్చిన జంబుకులు 
మెత్తగ కోసెడి కత్తెరలు

కొందరు కోపపు తోడేళ్ళు 
గడ్డలు కట్టిన సెలయేళ్ళు 
ఎన్నోజన్మల ఎండలలోన 
ఎన్నడు ఉతకని మేజోళ్ళు 

నడకలు మరచిన తాబేళ్లు 
వెలుగును కోరని రాత్రిళ్ళు 
కర్మల బడిలో గుంజిళ్ళు 
కట్లు ఊడని మెడతాళ్ళు

ఆశలు అతిగా ఉన్నప్పటికీ
అడుగులు పడబోవెవ్వరికీ
ఆత్మవంచనల ముసుగులలోని
చీకటి నచ్చును అందరికీ

రెక్కలున్నా మరచి
ఎగరలేనీ నరులు 
వేళ్ళను విడచి వెలుగును
చేరలేనీ తరులు

ఆకాశాన ననుచూచి 
నవ్వుతూ నావాళ్ళు 
నేలనున్న నావారిని 
వీడలేని ఈ నేను...
read more " త్రిశంకు స్వర్గం "

8, జూన్ 2013, శనివారం

ఆఖరి మజిలీ

కొండల్లో కోనల్లో తిరిగా 
ఎన్నాళ్ళో బాధలతో ఒంటరిగా
అడవుల్లో లోయల్లో వెతికా 
ఎన్నేళ్ళో వేదనలో మౌనంగా

నాకోసం నాలోపల నేనే వెతికా 
నీకోసం ఈ లోకపు దారుల్లో వెతికా
అంతులేని వ్యధార్త అన్వేషణలో 
ఏళ్లకు ఏళ్ళంటూ మౌనంగా గడిపా

ఎన్నో కన్నుల ఎడారుల్లో వెతికా
నీ కన్నుల నదిజాడల కోసం  
ఎన్నో మోముల సంజెల్లో వెతికా
నా హృదయపు గుడినీడల కోసం

గతస్మృతుల చీకటి సమాధుల్లో 
గడిచాయెన్నో నిరాశా నిశీధులు 
సుమధుర భావాల వెన్నెల వీధుల్లో  
మెరిశాయెన్నో వెలుగుల తెలిమబ్బులు  

ఎందరి ముంగిటనో పట్టుగా వంచాను
వంగని నా మొండి శిరస్సులను  
అందరి వద్దా గుట్టుగా పొందాను
మరువలేని మౌన ఆశీస్సులను

అంతరాళ వీధులను వెతికాను 
సుంతైనా విసుగు లేకుండా  
వింతవైన ఆత్మలను కలిశాను 
కొంతైనా బెదిరి పోకుండా

ఒకటే వెలితి పీడించింది 
ఎక్కడా నీవు కనిపించలేదని 
ఒకటే బాధ వెంటాడింది 
అసలు నీవున్నావో లేవోనని

ఎక్కడో ఉన్నావని మనసు చెప్పేది 
అదెక్కడో తెలియక తానే వగచేది
ఏదోనాడు ఎదురౌతావనిపించేది   
మనమెపుడో కలుస్తామని తోచేది

అది నా భ్రమేమో అనుకున్నా 
నీవసలు లేవేమో అనుకున్నా 
మనం కలవమేమో అనుకున్నా 
ఈ జన్మకు గెలవనేమో అనుకున్నా

ఆశ ఒదిలేసిన నిముషంలో  
ఈ జన్మకింతేలే అనుకున్నక్షణంలో 
మెరుపులో కనిపించావు 
వానజల్లులో తడిపేశావు

నిను చూచిన క్షణంలో 
అన్నీఇక మరిచాను 
ఉప్పొంగిన నా మదిలో 
నిన్నేమరి తలచాను

మెలకువలో నిద్రలో
నిన్నే నిత్యం స్మరించా
నిదుర మత్తులో మునిగిన 
నిన్ను తట్టి లేపాలని 
అనునిత్యం పరితపించా 

అమాయకంగా అనుకున్నా
నాదారిన నాతో నడుస్తావని
ఒంటరి పయనంలో నా తోడుంటావని 
వేచిన నా మనసును ఓదారుస్తావని  
ఎవరికీ పట్టని నా పిచ్చి ఊసులను 
నీవైనా కొంచం వింటావని 

కానీ....

బండబారిన నీ రాతిగుండెను చూచి
వెలగని నీకళ్ళ లోగిళ్ళను చూచి 
అందరిలో ఒకరుగా మారి 
అవనికి జారిన నింగిని చూచి 

నిజాన్ని కాదని 
నీడలను కోరుకుని
నిన్ను నీవు గెలవలేక
నాతో మరి కలవలేక
నిత్య సంఘర్షణలో నీరౌతూ
నిలిచిపోయిన నిన్ను చూచి

మూతపడిన నీ జ్ఞాపకాల వాకిళ్ళను 
తట్టి తెరచి చూపాలని తలచాను
అసలైన నీ లోకపు వెలుగులనొకసారి
నీ ముంగిట నిలపాలని చూచాను

నాకు మాత్రమేమి తెలుసు 
ఆ ఉద్వేగపు వెల్లువలో   
నీవు బెదిరిపోతావని
నీకు మాత్రమేమి తెలుసు 
ఈ సుదీర్ఘ పయనంలో  
ఇదీనాటి మజిలీ కాదని

నీ మౌనం నా పిచ్చిగుండెను 
లోతుగానే కోసింది 
మానుతున్న పచ్చిగాయాన్ని
ఇంకొంతగా రేపింది

నువ్వు మొదట్నించీ ఇంతే
నీకేం కావాలో నీకే తెలీదంతే 
ఎదురుగా ఉన్నదాన్ని ఒప్పుకోలేవు
సుదూర తారలపై చూపు తిప్పుకోలేవు

తరచి చూడు నీ మనసును ఒకసారి 
ఏదో రూపం లీలగా కనిపిస్తుంది 
వెతికి చూడు నీ హృదయాన్నొకసారి 
ఏదో వేదన నీడలా తెలిసొస్తుంది

తెలుసుకో ఆ రూపం ఎవ్వరిదో  
తరచి చూడు నీ వేదన ఎందులకో   
హృదయాన్ని నమ్ము నీ కళ్ళను కాదు 
ఒకనాటికీ సత్యం నీకూ తెలీకపోదు

బహుజన్మల బాటసారిగా నీకోసం
వేచిందొక హృదయమని
వినిపించని పాటపాడుతూ నీతోనే
నిలిచుందొక ఉదయమని

స్నేహపు రహదారిని వదలి
ఊహలు నీ మదిలో మెదిలి 
జన్మల ప్రవాహంలో మునిగి
కర్మల వలయంలో చిక్కావు
అంతులేని అయోమయంలో 
వింతగా ఎటో దారితప్పావు   

ఎన్నో ఉన్నత శిఖరాలెక్కినా
ఎన్నో వెలుగులు చేజిక్కినా 
నా సుదీర్ఘ పయనం ఆపి 
నీకోసం చూస్తున్నాను
మరచిన నీ దారిని మళ్ళీ 
నీకు గుర్తు చేయాలని 

ఆగిన నీ పయనాన్ని మళ్ళీ
నీవు మొదలు పెట్టాలని
వేచిఉన్న నీ గమ్యాన్ని   
నీవు అందుకోవాలని  

చీకటిలో మునిగిన
నీ కళ్ళు తెరిపించాలని 
సుదూర కాంతి సీమలు 
నీకు చూపించాలని

ఘూర్ణించే ప్రళయాలను
స్థైర్యంతో వాయిదా వేస్తూ 
యుగాలుగా నీకోసం 
రాయిలా నిలిచున్నాను

ఎంతగా హృదయాన్ని 
నీకోసం విప్పినా 
ఎన్నెన్ని సున్నితభావాలను 
నీకోసం చెప్పినా 

ఎప్పటికీ తీరదు 
నాకొక సంశయం 
ఏమిటో మారదు
ఈ వింత సంకటం 
  
అసలంటూ నీలో  
నీవున్నావో లేవోనని 
నాదైన ఈ మౌనరాగం 
నీలో మ్రోగుతుందో లేదోనని

నీ మనసును నీవసలు 
గెలవగలవా అని
నిశ్చలంగా నీవసలు  
నిలవగలవా అని 

నీ ఎదురుచూపులెందుకో
నీకెన్నటికీ అర్ధం కాదు
నా పిచ్చినిరీక్షణ కూడా
నాలాగే అంతంకాదు

మరపురాని గతఛాయలు
నన్నెపుడూ వదలి పోవు
గుర్తులేని గుండె చప్పుళ్ళు 
నిన్నెపుడూ కదిలించ లేవు

వెదికిన గమ్యం కనిపిస్తున్నా
వెచ్చని ఉదయం ఎదురొస్తున్నా 
నచ్చిన నేస్తం ఎదురుగ ఉన్నా
మధ్యన దూరం తరిగేపోదు

నీ మొద్దునిద్దుర అంతం కాదు
నా పిచ్చిమనసుకు బుద్దే రాదు
అంతా చేసే ఆ వింత విధికి 
అలుపెప్పటికీ లేనేలేదు

విధివ్రాతకు అర్ధం లేదు
నీ మనసే నీకు తెలీదు
హృదయమంటూ నీకొకటుందని 
మ్మకమేమో నాకైతే లేదు

తలపులు రేగిన సంజెవేళలో
అలుపుల నెరుగని ఆరాటంలో
వలపులు నింపిన ఆరాధనలో
తలుపులు మూసిన ముంగిళ్ళల్లో

కొంత నిడివిగల బ్రదుకుబాటలో
వింతదైన ఈ వెదుకులాటలో 
అంతులేని నా అన్వేషణలో 
ఆఖరిమజిలీ అంటూ లేదు...
read more " ఆఖరి మజిలీ "