“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, డిసెంబర్ 2013, మంగళవారం

సాధారణ జీవితంలో...

సాధారణ జీవితంలో 
సమున్నత సత్యం అందివచ్చింది

నీటి చెలమలో నీలాకాశం
నింగి స్వర్గాన్ని నేలకు తెచ్చింది

అనుక్షణికపు అల్పత్వంలో
అమరత్వం అవధులు దాటింది

నేను వెదికే నిత్యసత్యం
నా చుట్టూ నిలచి నవ్వింది
read more " సాధారణ జీవితంలో... "

12, డిసెంబర్ 2013, గురువారం

పిచ్చి నాకు-మందు నీకు

పోయినవారం ఒకరోజున మధ్యాన్నంపూట ఏదో పనిమీద మార్కెట్లో ఉన్నాను.పనిచూసుకుని ఇంటికి బయలుదేరుతుంటే పరిచయస్తుడు ఒకాయన ఎదురయ్యాడు.

కుశలప్రశ్నలు గట్రా అయ్యాక 'సామవేదం షణ్ముఖశర్మగారు లలితా సహస్ర నామముల మీద ప్రవచనాలు ఇస్తున్నారు.రాకూడదూ?' అని అడిగాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.సామవేదంగారు గతవారంగా గుంటూర్లో ప్రవచనాలు ఇస్తున్నారని నాకు తెలుసు.

పరిచయస్తుడు ప్రతి ప్రవచనానికీ ఉపన్యాసానికీ ముందువరసలో ఉంటాడు. గుంటూరు కాక తిరుపతీ,హైదరాబాద్ వంటి ఇతర ఊళ్లకు కూడా అటువంటి ఏవైనా పెద్ద కార్యక్రమాలకు వెళ్ళివస్తూ ఉంటాడు.మంచివాడే కాని పాపం కొంచం చాదస్తుడు.

'శర్మగారు చాలా బాగా చెప్తారు.'అన్నాడు.

'తెలుసు.తిరుపతిలో ఒకసారి విన్నాను' అన్నాను.

'మరి మన ఊళ్ళో కార్యక్రమం జరుగుతుంటే మనం వెళ్ళకపోతే ఎలా?' అన్నాడు.

'మీరు వెళ్తున్నారు కదా' అన్నాను.

'నేనెలాగూ వెళతాను.మీరు కూడా రండి.చాలాబాగా చెప్తున్నారు.లలితా సహస్ర నామముల గురించి ఎన్నో విషయాలు.' అన్నాడు.

'ఏం చెప్పారు?' అడిగాను.

'చాలా చెబుతున్నారు.వింటే మీకే అర్ధమౌతుంది' అన్నాడు.

నవ్వితే బాగుండదని ఊరుకున్నాను.

'ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ కార్యక్రమాలు వింటున్నారు?' అడిగాను

'గుర్తులేదుగాని చాలా ఏళ్లనుంచి వెళుతూనే ఉన్నాను.అదలా ఉంచండి. సాయంత్రం వస్తున్నారా మరి?' అడిగాడు.

ఏదో ఒకటి చెప్పేవరకూ ఊరుకునేలా లేడు.

'నేను చిన్నప్పుడు బాగానే చదువుకున్నాను.ప్రస్తుతం వయోజన విద్య అవసరం లేదు' అన్నాను.

ఆయనకు అర్ధం కాలేదు.

'తెలుసు సార్.నేనుకూడా ఎమ్మే బీయీడీ చేశాను.అయితే దానికీ దీనికీ సంబంధం ఏముంది?అది మామూలు విద్య.ఇది ఆధ్యాత్మికం.మనం చదువుకున్న చదువు వేరు.ఇది వేరు' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.ఈసారి బయటకే నవ్వేశాను.

'నవ్వడం కాదు.మీలాంటి వాళ్ళు కూడా రాకపోతే ఎలా? ఇలా ఎవరికి వారు ఊరుకోబట్టే మన హిందూధర్మం ఇలా క్షీణిస్తున్నది.మనధర్మం గురించి మనమతం గురించి మనం తెలుసుకోవాలి.అలా తెలుసుకోవాలంటే ఇలాంటి ఉపన్యాసాలు వింటూ ఉండాలి.' అన్నాడు.

వదిలేటట్టు లేడనిపించింది.

చుట్టూ చూశాను.ఒక మంచి హోటల్ దగ్గరలోనే కనిపించింది.అక్కడ భోజనం బాగుంటుంది.

'సరే.అలాగే చేద్దాం.ఆ హోటల్లో భోజనం చేస్తూ మాట్లాడుకుందామా?' అడిగాను.

'నేను ఇప్పుడే భోజనం చేసి ఇంట్లోంచి బయల్దేరాను.కావాలంటే మీ తోడుగా కూచుంటాను.కాని తినను.' చెప్పాడు.

'అలా తినకుండా ఎవరైనా తోడు కూచుంటే నాకు బాగుండదు.మీరూ నాతో పాటు భోజనం చెయ్యాలి.మధ్యలో లేస్తే ఊరుకోను.నాతో బాటు సుష్టుగా తినాలి.' చెప్పాను.

'లేదండి.ఇప్పుడే అరగంట కూడా కాలేదు.చెయ్యలేను' చెప్పాడు.

'అయినా సరే పరవాలేదు.తినొచ్చు.ఇంకా బలమొస్తుంది.ఈ వయసులో మీకు బలం చాలా అవసరం.' చెప్పాను.

అతను వింతగా చూచాడు.

'సారీ సార్.నావల్ల కాదు.తిన్నది అరగాలిగా మళ్ళీ తినాలంటే.ఇపుడే అరగంట కూడా కాలేదు.' అన్నాడు.

'ఇంట్లో తినడానికీ హోటల్లో తినడానికీ సంబంధం ఏముంది?ఇంటి తిండి వేరు.హోటల్ తిండి వేరు.ఇప్పుడే తింటే మాత్రం ఏం?మళ్ళీ తినొచ్చు.ఏం పరవాలేదు.అదే అరిగిపోతుంది. పరవాలేదు రండి' అంటూ అతని చెయ్యి పట్టుకుని హోటల్లోకి దారితీశాను.

అతను ఆగిపోయి వింతగా చూస్తున్నాడు.

'ఏంటి అలా చూస్తున్నారు? నా మాటలు అర్ధం కాలేదా?' అడిగాను.

అతను మెల్లిగా చెయ్యి విడిపించుకుని అనుమానంగా చూస్తున్నాడు.

నేనూ ఆగిపోయి 'మీ ప్రశ్నలకు మీరే సమాధానాలు ఇచ్చారు'. అన్నాను నవ్వుతూ.

'ప్రశ్నలేంటి?నేనేం అడిగాను?జవాబులేమిచ్చాను?ఏంటి సార్ ఇదంతా?' అన్నాడు ఇబ్బందిగా చూస్తూ.

'ఏం లేదు.నాకీ మధ్యన కొంచం పిచ్చెక్కింది.కాని మందు మాత్రం మీకే అవసరం.మీరు మందేసుకుంటే నాకు తగ్గిపోతుంది.ఒకవేళ అప్పటికీ నాకు తగ్గకపోతే సామవేదంగారికి కూడా మీచేత్తో ఒక డోస్ వెయ్యండి.అప్పుడు గ్యారంటీగా సరిపోతుంది.వస్తా'అంటూ అతన్నక్కడే ఒదిలేసి వెనక్కు తిరిగి చూడకుండా నాదారిన నేను ఇంటికి బయలుదేరాను.
read more " పిచ్చి నాకు-మందు నీకు "

4, డిసెంబర్ 2013, బుధవారం

రాష్ట్రాల విభజనకు ఒక మంచి పరిష్కారం

ప్రత్యేకరాష్ట్రాల ఏర్పాటుకోసం చాలా రాష్ట్రాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి.ఇవ్వాలని కొందరూ ఒద్దని కొందరూ ఒకటే గొడవ చేస్తున్నారు.నా దృష్టిలో అసలు ఇదొక సమస్య కానేకాదు.

అసలు ఇంత సింపుల్ విషయానికి ఇంత చర్చా,గొడవా,గోలా అవసరమా అని నాకెప్పటినుంచో ఒక పెద్దసందేహం.వీళ్ళందరూ ఎందుకింత గొడవ పడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.విడగొట్టుకునే చిత్తశుద్ధి ఉండాలే గాని దీనికి పరిష్కారం చాలా తేలిక.పల్లెల్లో అన్నదమ్ములు ఎలా విడిపోతున్నారు?ఇదీ అంతే.మనం ఎక్కడికి పోతున్నాం?ఇదే దేశంలో ఉంటాం కదా.విభజన వల్ల నష్టం ఏముంది?

నిర్మించుకోవడం మనకు ఎలాగూ తెలియదు.ఆ సంగతి లోకానికి ఎప్పుడో తెలుసు.సరిగ్గా విడగొట్టుకోవడం కూడా మనకు చాతకాదని ఇప్పుడు తెలుస్తోంది.మన తెలివి తెల్లవారినట్టే ఉన్నది.తెలుగుజాతి మనది అని పాడుకోటం తప్ప మనకు తెలిసినది శూన్యం అని దీన్నిబట్టి చక్కగా తెలుస్తోంది.

మాట్లాడే భాషలో యాసను బట్టీ,ప్రాంతీయ సంస్కృతిని బట్టీ ఒక్కొక్క రాష్ట్రం ఏర్పడితే బాగుంటుంది అన్న భావన ఇప్పుడు వినిపిస్తున్నది.తద్వారా ప్రగతి కూడా వేగంగా ఉంటుంది అని అంటున్నారు.అది నిజమే కావచ్చు. ఇప్పుడు తెలంగాణా ఇస్తే ముందుముందు ప్రత్యెకరాష్ట్రాల ఉద్యమాలు ప్రతి రాష్ట్రంలోనూ ఇంకా ఉధృతం కావచ్చు అని కొందరంటున్నారు.అప్పుడు ఏం చెయ్యాలి?అంటే,దీనికి నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉన్నది.

మనకు స్వతంత్రం రావడానికి ముందు 562 రాజ్యాలు(princely states)మనదేశంలో ఉండేవి.మళ్ళీ ఆ రోజుల్లోకి పోయి దేశాన్ని చిన్నచిన్న ముక్కలుగా విభజించుకుంటే సరి.అయిపాయె.అభివృద్ధి శరవేగంగా ఉంటుంది.ఒకవేళ అభివృద్ధి ఉన్నా లేకున్నా జనాభా అభివృద్ధి ఎలాగూ ఉండనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు.

ప్రస్తుతం మనకు 671 జిల్లాలున్నాయిట.ఒకపని చేస్తే పోతుంది.ప్రతి జిల్లానూ ఒక రాష్ట్రంగా డిక్లేర్ చేసేస్తే అభివృద్ధి శరవేగంతో ఏం ఖర్మ,రాకెట్ వేగంతో ముందుకు పోతుంది.అయితే రాకెట్ కూలిపోయినట్లు అదికూడా ఏ సముద్రంలోనో కూలిపోవచ్చు అంటే మళ్ళీ నెగటివ్ యాటిట్యూడ్ అని కొందరు అనవచ్చు.ఎవరేమనుకున్నా రాకెట్లు అప్పుడప్పుడూ కూలిపోవడం వాస్తవమే గనుక ఈ వాదనను కాదనలేం.

మన దేశంలో ప్రతిజిల్లాకూ భాషలో యాస బిన్నంగా ఉంటుంది.ఒకే భాష మాట్లాడే ఒకేరాష్ట్రంలో కూడా జిల్లాజిల్లాకూ యాస మారుతుంది. ప్రాంతీయంగా ఆహారపు అలవాట్లూ మారతాయి.కడప జిల్లాలో తినే ఆహారం కరీంనగర్లో తినరు.ప్రకాశం జిల్లాలో తినే ఆహారం గోదావరి జిల్లాలో తినరు.ప్రతి జిల్లాకూ తెలుగుభాష మాట్లాడే తీరూ యాసా తేడాగా ఉంటాయి.అలాగే ప్రతి రాష్ట్రంలోనూ పరిస్తితి చక్కనైన ప్రాంతీయభేదాలతో ఇలాగే భిన్నభిన్నాలుగా ఉంటుంది.కనుక ప్రతిజిల్లానూ ఒక రాష్ట్రంగా విడగోట్టుకుంటే తప్ప మనదేశం ఎప్పటికీ ప్రగతిని సాధించలేదు.వేగంగా ముందుకు పోలేదు అనేది సింపుల్ లాజిక్.

ఈ వేగంగా ముందుకు పోయె ప్రక్రియలోకూడా దిశతప్పి ఏ సముద్రంలోకో పోయే అవకాశం కూడా ఉంటుంది.దానికి తగ్గట్టు మన దేశానికి మూడు వైపులా సముద్రం ఎలాగూ ఉన్నది.మన అభివృద్ధిని ఊహించేనేమో ప్రకృతి ఈ వరాన్ని ఎప్పుడో మన దేశానికిచ్చింది.ఎవరికి దగ్గరగా ఉన్న సముద్రంలోకి వారు అభివృద్ధి చెందుతూ వేగంగా ముందుకు పోవచ్చు. మునిగీపోవచ్చు.అక్కడకూడా తేడాలొస్తే సముద్రాన్ని కూడా తడికెలతో 671 ముక్కలుగా విభజించుకుని ఎవరి రేవులో వాళ్ళు మునిగిపోవచ్చు.

మరి ఏ సముద్రమూ లేని ఉత్తరాదివాళ్ళు ఏం జెయ్యాలి? అనే సందేహం కొందరు తెలివితక్కువ దద్దమ్మలకు రావచ్చు.వారి అజ్ఞానానికి జాలిపడుతూ దానికీ ఒక పరిష్కారం సూచిస్తున్నాను.వాళ్ళంతా హిమాలయాల మీదికెక్కి అవతలివైపునున్న చైనాలోకి అభివృద్ధి చెందవచ్చు(దూకొచ్చు).

ఉంకొంతమంది మేదావులకు ఉంకొక సందేహం రావచ్చు.జిల్లాలో కూడా తాలూకాకీ తాలూకాకీ మళ్ళీ తేడాలున్నాయి.జాగ్రత్తగా గమనిస్తే భాషలోనూ యాసలోనూ తిండిలోనూ గుడ్డలు కట్టుకునే తీరులోనూ ఆ తేడాలు అర్ధమౌతాయి.కనుక ప్రతి తాలూకానీ ఒక రాష్ట్రంగా ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు?

అబ్బ! భలే అయిడియా వచ్చింది.అలాగే చేసుకుందాం.ఇబ్బంది లేదు.మన దేశంలో ప్రస్తుతం 5500+ తాలూకాలున్నాయి.వాటినన్నింటినీ రాష్ట్రాలుగా డిక్లేర్ చేసుకుందాం.అప్పుడు అభివృద్ధి ఇంకా అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆ అభివృద్ధి కూడా చాలకపోతే ప్రస్తుతం ఉన్న 6,30,000+ పల్లెలనే రాష్ట్రాలు అనుకుంటే ఇంకా బాగుంటుంది.అంతమంది ముఖ్యమంత్రులూ, అంతంతమంది ఇతర మంత్రులూ...ఎంత బాగుంటుందో?

అప్పుడు దేశంలో ప్రతి వంద ఇళ్ళకొక ముఖ్యమంత్రీ,ఇంటికొక మంత్రీ ఉన్నా ఆశ్చర్యం లేదు.ఇక ప్రతి ఇంటినుంచీ కలెక్టర్లూ ఎస్పీలూ ఇతర సివిల్ సర్వేంట్లూ చెప్పాల్సిన పనేలేదు.కుప్పలు తెప్పలుగా ఉంటారు.ఎక్కడ చూచినా మంత్రులే ఎక్కడ చూచినా సివిల్ సర్వెంట్లే.ఎక్కడ చూచినా కాంట్రాక్టులే.ప్రతి వీధిలోనూ అభివృద్ధి పనులే.అద్భుతమైన ప్రగతి ఉంటుంది. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.ఆ రకంగా పాపం ఆయన కలనూ నిజం చేసినవాళ్ళం అవుతాం.

ఇంకాకూడా చాలకపోతే ప్రతి ఇంటినీ ఒక రాష్ట్రంగా అనుకుంటే ఇంకా బాగుంటుంది.ఈ అవుడియాకి తిరుగే లేదు.ఇంటింటికీ ఒక ప్రభుత్వం ఉంటుంది.యజమాని ముఖ్యమంత్రి కావచ్చు.ఇల్లాలు ఆర్ధికమంత్రి ఎలాగూ అవుతుంది.మిగిలిన పోస్ట్ లను వీలును బట్టి నామినేట్ చేసుకోవచ్చు.

ఇక ఒకటే ప్రగతి.ఎక్కడ చూచినా దేశం కళకళలాడుతూ ఉంటుంది.ఎవరి బడ్జెట్ వారిదే.ఎవరి కేటాయింపులు వారికే.ఎవరి ప్రగతి వారిదే.చదువు అక్కర్లేదు.పేదరికం ఉండనే ఉండదు.అందరూ హాయిగా ప్రభుత్వనిధులు బొక్కుతూ కూచోవచ్చు.ప్రతి ఇంటినుంచీ ఎవడోఒకడు ఏదో పదవిలో ఉంటాడు గనుక నిరుద్యోగసమస్య రాత్రికిరాత్రి పరిష్కారం అయిపోతుంది.

అయితే ఒక్కటే సమస్య మిగులుతుంది.ఇంతమంది ప్రజాప్రతినిధులు కూర్చునే సభ ఎక్కడ కట్టాలి?ఎలా కట్టాలి?అంత పెద్ద కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి? అదే అసలైన పెద్ద సమస్య అయి కూచుంటుంది.

దానికీ నాదగ్గిర ఒక పరిష్కారం ఉన్నది.పూర్వకాలంలోని కురుక్షేత్రయుద్ధం లాగా ప్రతి ఏడాదీ ఒక దేశవ్యాప్త యుద్ధం పెట్టుకుంటే అందులో అంతిమంగా ఎవరు గెలిస్తే,వారు ఆ కాంట్రాక్ట్ చేజిక్కించుకోవచ్చు.అయితే దీంట్లో ఉంకో సమస్యుంది.సభ జరిగేటప్పుడు వీళ్ళు ఇసుకతో కట్టిన భవనం ఎలాగూ కూలిపోతుంది గాబట్టి ప్రతినిధులలో చాలా పోస్ట్ లు ఆటోమేటిగ్గా ఖాళీ అవుతాయి.అప్పుడెలా?

అసలు ఇదొక సమస్య కానేకాదు.ప్రతిసారీ శీతాకాల సమావేశాల తర్వాత వేసంకాలంలో మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఇచ్చి సభాభవనం కట్టుకుంటూ ఉంటే సరిపోతుంది.మళ్ళీ శీతాకాలంలో అది కూలిపోవడం.వేసంకాలంలో కట్టుకోవడం.ప్రతేడాదీ ఒక కాంట్రాక్ట్ కురుక్షేత్రం పెట్టుకోవడం.సింపుల్.భలేగా ఉంటుంది.ఇలా ఒకపదేళ్లు గడిచేసరికి జనాభా కూడా బాగా తగ్గుతుంది.మన జనాభా మనమే తగ్గించుకుంటున్నాం గనుక పాకిస్తాన్ చైనాలతో విరోధం కూడా తగ్గుతుంది.తద్వారా ఉపఖండంలో శాంతి నెలకొంటుంది.తద్వారా ప్రపంచశాంతికీ మనం దోహదం చేసినవాళ్ళమౌతాం.మన ప్రగతీ బ్రహ్మాండంగా ఉంటుంది.దేశం ప్రగతి చెందాలంటే మనల్ని మనం ఇట్టా ఇబజించుకోడమే మారగం.

ప్రస్తుతం మన దేశంలో 6,30,000+ పల్లెలున్నాయిట.అర్జంటుగా మన దేశాన్ని 6,30,000+ రాష్ట్రాలుగా విభజించుకుందాం.మన దేశం త్వరగా ముందుకు పోవాలంటే ఇదొక్కటే మార్గం.అందరూ కలసి త్వరగా ముందుకు రండి.ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. స్వర్ణభారతాన్ని నిర్మించుకుందాం.

చర్చిల్ మహాశయుడు ఒక మాటన్నాడు.'భారతదేశంలో నాయకులు అందరూ గడ్డిబొమ్మలు(men of straw). ఇప్పుడుగనుక మనం స్వతంత్రం ఇస్తే నిమిషాల్లో దేశాన్ని ముక్కలు చెక్కలు చేసుకోగల సమర్ధులు' అని విన్స్టన్ చర్చిల్ ఎప్పుడో చెప్పాడు.అంత పెద్దాయన అప్పుడే చెప్పినప్పుడు మనం కనీసం ఇప్పుడైనా చెయ్యకపోతే ఎలా?ఆయన ఆత్మ క్షోభించదూ?

అందుకే కదలండి ముందుకు.నడవండి విందుకు.అదుగో ప్రగతి ఎలా పిలుస్తోందో చూడండి.ఏందీ?ఇంత జెప్పినా గూడా ఇందులో పెగతి యాడా గనబట్టం లేదా?అయితే మీకు దుట్టిదోసం ఉన్నట్టే.నేనేం జైలేను.మిమ్మల్ని నేం బాజైలేను బాబోయ్.ఇక మీ కర్మ.
read more " రాష్ట్రాల విభజనకు ఒక మంచి పరిష్కారం "

కాలజ్ఞానం -21

డిసెంబర్ 3 నుంచి 15 వరకూ ఉన్న ఒక గ్రహస్తితి వల్ల రాష్ట్ర పరిస్తితి మరింత దురదృష్టకరమైన పీటముడిగా మారుతుంది.రాజకీయపరిస్తితి ఇంకా దిగజారుతూ పోతుంది.డిసెంబర్ 9 న నాయకత్వం సందిగ్ధపరిస్థితిలో పడుతుంది.నాయకులు ప్రజలపైనే కుట్ర చేస్తున్నారా అన్న అనుమానం ప్రజలలో బలపడుతుంది.15 వ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ఆవేశాలు ఎక్కువౌతాయి.సంయమనం కోల్పోయిన నాయకులు రకరకాల ప్రకటనలతో ప్రజలను గందరగోళంలోకి ప్రవేశపెడతారు.ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం.
read more " కాలజ్ఞానం -21 "

2, డిసెంబర్ 2013, సోమవారం

లూయీ బ్రెయిలీ జాతకం-అంధత్వయోగాలు

మొన్న అంధుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు లూయీ బ్రెయిలీ జాతకం పరిశీలిద్దామని తోచింది. ఎందరిలాగానో  అతను కూడా గుడ్డివాడైనా తన ఖర్మను తిట్టుకుంటూ కూర్చోకుండా బ్రెయిలీ లిపిని తయారు చేసి తద్వారా నేడు లక్షలాది అంధులకు వెలుగును ప్రసాదించాడు.అందుకే అతని జాతకంలో ఏ గ్రహస్తితి ఈ యోగాన్ని ఇచ్చిందో చూద్దామని అనుకున్నాను.

లూయీ బ్రెయిలీ 4-1-1809 న ఫ్రాన్స్ లో కూవ్రే అనే ఊళ్ళో పుట్టినాడు.స్విస్ ఎఫిమెరిస్ వారి ఆస్ట్రో డేటాబాంక్ ప్రకారం జనన సమయం ఉదయం నాలుగు గంటలు.ఆ సమయానికి వచ్చె జాతకచక్రం ఇక్కడ చూడవచ్చు.

జాతకంలో రెండూ పన్నెండూ భావాలు కళ్ళకు సూచికలు.సూర్యచంద్రులు నేత్రాలకు సహజకారకులు.సహజరాశి చక్రంలో ఈ భావాధిపతులైన గురుశుక్రులు కూడా నేత్రాలకు కారకులే.ఇప్పుడు బ్రెయిలీ జాతకం ఏమంటున్నదో చూద్దాం.

ఇతని జాతకం చూడగానే స్ఫురించే విషయం లగ్నంలో రాహువూ,లగ్నానికి గల పాపార్గళమూ.ఇది 'నేత్రహీనయోగం' అనబడుతుంది.చాలా లగ్నాలకు పాపార్గళం ఉంటుంది.అది వింతకాదు.మేషానికీ తులకూ పాపార్గళం ఉండటం ఒక ప్రత్యేకత.అప్పుడు ఆ రెండు పాపగ్రహాల సప్తమదృష్టి వల్ల సప్తమానికి కూడా పాపార్గళం ఉంటుంది.ఈ రెంటిలో మళ్ళీ తులకు ఈ స్తితి ఉంటే అది మరీ ప్రత్యేకత అవుతుంది.ఎందుకు?

మేషానికి ఈ స్థితి ఉంటే తుల సహజసప్తమం కనుక దోషం లగ్నానికీ సప్తమానికీ పంచబడుతుంది.అదే తులకు ఉంటే,రెండూ లగ్నాలే అవుతాయి గనుక లగ్నదోషం రెండింతలు అవుతుంది.అదీ భేదం.ఈ విధమైన సూక్ష్మపరిశీలన జ్యోతిష్యశాస్త్ర విద్యార్ధికి చాలా అవసరం.

ప్రస్తుతజాతకంలో లగ్నమైన తులవల్ల సహజలగ్నానికి కూడా ఆదోషం పట్టింది.జాతకలగ్నమూ సహజలగ్నమూ కూడా దోషాన్ని సంతరించు కున్నాయి.కనుక తలకూ కళ్ళకూ ప్రమాదం ఖచ్చితంగా ఉన్నదని జాతకం చూడగానే తెలుస్తుంది.చిన్నప్పుడు ఆయా దోషపూరిత దశలు గనక నడిస్తే,ఆ ప్రమాదం ఆయా వయస్సుల్లో ఖచ్చితంగా జరుగుతుంది.ఇతను బుధ నక్షత్రంలోనే జన్మించాడు గనుక చిన్నప్పుడు అదేదశ జరుగుతుంది. ఇక కళ్ళు ఎలా మిగులుతాయి?బుధుడు ఈ లగ్నానికి మంచివాడే.అయితే దోషం ఎలా వచ్చిందో ఇప్పుడు వివరిస్తాను. 

లగ్నంలో రాహువూ యురేనస్సూ ఒకే బిందువు మీద స్వాతీనక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు.ఇది నవాంశలో గురువుదైన మోక్షరాశి,మీనరాశి అవుతుంది.కనుక ఇతను గతజన్మలో ఆధ్యాత్మికంగా మహనీయులైన వారికి ఆకతాయితనంతో ద్రోహం చెయ్యడంవల్ల ఈజన్మలో కళ్ళు పోగొట్టుకున్నాడని తెలుస్తున్నది.

పాతతరంలో పల్లెటూళ్ళలో ఉన్నవారికి కొన్ని సామెతలు గుర్తుంటాయి. ఎవరైనా ఏదైనా ఘోరమైన తప్పు చేస్తుంటే -'ఒరే వద్దురా కళ్ళు పోతాయిరా' అని పెద్దలు హెచ్చరించేవారు.ప్రకృతిలో ఏపనికి ఏశిక్ష పడుతుందో పాతకాలంవారికి అతి మామూలుగా తెలిసిపోయేది.ఆ విషయాలు సామెతలుగా వాడుకమాటలుగా నిత్యజీవితంలో కలసిమెలసి ఉండేవి. ఇప్పటివారికి అవి తెలియను కూడా తెలియవు.ఇదొక దౌర్భాగ్యం.తెలిసినా ఎవరూ ఆగమంటే ఆగరు.ఇది ఇంకొక మహాదౌర్భాగ్యం.

ఈ లగ్నానికి సూర్యుడు బాధకుడు.కనుక నేత్రదోషం ఉన్నది.ద్వాదశాదిపతి అయిన బుధుడు బాధకుడైన సూర్యునితో కలసి దోషాన్ని పంచుకోవడమే గాక మారకశక్తి కలిగిన కేతువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు.కనుక ఇతని ఎడమ కంటికి గండం స్పష్టంగా కనిపిస్తున్నది.

అదీగాక ఈ లగ్నానికి ప్రబలదోషీ మారకుడూ అయిన కుజుడు ద్వాదశంలో నేత్రకారకుడైన చంద్రుని నక్షత్రంలో కూర్చుని ఉన్నాడు.సూర్యుడు కుడికంటికీ చంద్రుడు ఎడమకంటికీ సూచకులనేది జగమెరిగిన జ్యోతిష్య సూత్రం.కనుక ఎడమకంటికి ప్రమాదాన్ని సూచిస్తున్నాడు.లగ్నానికి ఇరువైపులా ఉన్న శనికుజులవల్ల ఈ జాతకానికి లగ్నపాపార్గళదోషం పట్టింది.తద్వారా ముఖానికి ప్రమాదం జరుగుతుందన్న సూచన ఉన్నది.

ఇతను మూడేళ్ళ వయస్సులో ఉండగా తండ్రి పనిముట్లతో ఆడుకుంటూ కంటి దగ్గర ఒక అట్టముక్కలాంటి దానిని పెట్టుకుని దానిలోకి ఒక మేకును గుచ్చాలని ప్రయత్నించాడు.ఆ ప్రయత్నంలో మేకు అట్టముక్కను చీల్చుకుని ఇతని కంటిలో దిగబడింది.ఈ సంఘటన బుధ/శుక్ర దశలోగాని బుధ/కేతు దశలోగాని జరిగింది.బుధుడు ఏ విధంగా ఎడమకంటిని సూచిస్తున్నాడో,ఏ విధంగా దోషాన్ని సంతరించుకున్నాడో పైన వివరించాను.కేతువు మారకుడు.శుక్రుడైతే లగ్నదోష పూరితుడైనాడు.

సూర్యుని బాధకాదిపత్యం వల్ల తండ్రికి చెందిన పనిముట్ల వల్లే ఇతని కన్ను పోయింది.భయంకరమైన లగ్నదోషంవల్ల తన కన్ను తానే పోడుచుకునే స్తితి కల్పించబడింది.క్రమేణా కన్ను సెప్టిక్ అయి అది రెండవ కంటికి కూడా సోకి ఇతనికి రెండు కళ్ళూ పోయాయి.రెండవ కన్ను ఎందుకు పోయిందో చూద్దాం.

కుడికంటిని సూచించే వృశ్చికంలో శని కూర్చుని ఉన్నాడు.శని ఈ లగ్నానికి మంచివాడే.అయితే మారకస్థానంలో ఉండటం ఇతని మంచితనాన్ని పాడు చేసింది.కుజుని ఇంటిలో శని స్తిమితంగా ఉండలేడు.పైగా నెప్ట్యూన్ కి అతిదగ్గరగా ఉన్నాడు.కనుక దోషపూరితుడైనాడు.

సహజరాశిచక్రంలో ప్రధమం కేతుగ్రస్తమైంది.కేతువు యమాధిష్టితమైన భరణీ నక్షత్రంలో ఉన్నాడు.అది లగ్నాధిపతి నక్షత్రంకూడా అయింది.కనుక ముఖానికీ కంటికీ గండం సూచితం అవుతున్నది.ద్వితీయాదిపతి అయిన శుక్రుడు బుధనక్షత్రంలో ఉన్న చంద్రునిచే చూడబడుతున్నాడు.

ఇక ద్వాదశాదిపతి అయిన గురువు శనిరాశిలో ఉంటూ రాహుదృష్టిలో ఉన్నాడు.ఇది పైన వివరించిన పూర్వకర్మను సూచిస్తున్నది.దీనికి దోహకంగా లగ్నం శనికుజ దృష్టులతో పాపార్గళ దోషానికి లోనైంది.

మారకుడైన కుజుడు నవాంశలో నీచస్థితిలో ఉండి దారుణమైన పాపత్వాన్ని సంతరించుకుని ఉన్నాడు.అందుకే తనచేతితో తన కంటినే పొడుచుకునేటట్లు చేశాడు.అదికూడా ఎడమకంటికి అధిపతి అయిన బుధునితో కలసి ఉండటం వల్ల ఎడమకంటికే ప్రమాదం వచ్చింది.

ఆ సమయానికి గోచారకుజుడు లగ్నంలోకి వచ్చాడు.రాహువు ద్వాదశంలోకి పోయినాడు.శని యధావిధిగా రెండింట ఉన్నాడు.ఇక కళ్ళుపోక ఏమి జరుగుతుంది?రాహువూ కుజుడూ శనీ ఇలా మూడుస్థానాలనూ ఆక్రమిస్తే ఇదికాక ఇంకేమి జరుగుతుందో జ్యోతిష్యవేత్తలకు వివరించపనిలేదు.

అయితే లగ్నాధిపతి శుక్రుడు చతుర్దంలో మిత్రస్థానంలో ఉండటంవల్ల గుడ్డివాడైనా బాగా చదువుకోగలిగాడు.బ్రెయిలీలిపిని సృష్టించి ఎందరికో మేలు చెయ్యగలిగాడు.దానికి దశమంలోని పూర్ణచంద్రుడూ అతనిపైన గల శుక్రదృష్టీ కారణాలు.

శుక్రుడు ఆత్మకారకుడు.కారకాంశ కన్య.అక్కడనుంచి తృతీయమూ అష్టమమూ దెబ్బ తినడంవల్ల మధ్యాయుష్కుడై 6-1-1852 న సూర్య/చంద్ర/శని/కేతు దశలో 43 ఏళ్లకే మరణించాడు.సూర్యచంద్రులకుగల దోషాన్ని పైనే వివరించాను.శనికేతువులిద్దరూ మారకస్థానంలో ఉన్నారు.వీరిలో కేతువు కుజున్ని సూచిస్తున్నాడు.కనుక ఈ సమయంలో మరణించాడు.

ఇతని కళ్ళు పోవడానికి ఏ గ్రహయోగాలు కారణం అయ్యాయో మరణానికీ అవే యోగాలు కారణం అయ్యాయి.అంటే పూర్వజన్మ పాపం ఇతన్ని జీవితమంతా వెంటాడుతూనే ఉందనీ మధ్యాయుష్క మరణాన్నికూడా అదే తెచ్చిందనీ తెలుస్తున్నది.

ఈ లగ్నానికి మంచివాడుకాని గురువు షష్టాధిపతిగా పంచమంలో ఉండటం చూస్తే ఇతనికి పూర్వకర్మ బాగాలేదని తెలుస్తుంది.పైగా నవమాధిపతి అయిన బుధునికి ఇంత దోషం ఆపాదించబడటం కూడా దీనినే సూచిస్తుంది. పై గ్రహస్తితులనుబట్టి ఆపాపం ఏమిటో తేలికగా ఊహించవచ్చు.కాని అలాంటివి వ్రాయడమూ చదవడమూ మంచిదికాదు.అవి వినడానికి అంత బాగుండవు కూడా.కనుక వ్రాయడం లేదు.

ఇటువంటి అనలిటికల్ స్కిల్ వల్లే పాతకాలంలో జ్యోతిష్యవేత్తలు ఒకని జాతకం చూడగానే అతని జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పగలిగేవారు.

అయితే,పుట్టిన వెంటనే జాతకం చూచి,ఈ దోషాన్ని గమనించి,పరిహారాలు చేస్తే,ఇలా జరుగకుండా ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.పరిహారం చేస్తే దోషం ఉపశమిస్తుందనీ పోతుందనీ భ్రుగు,గర్గ,పరాశరాది మహర్షులు చెప్పినారు.ఒకవేళ చేసిఉంటే ఏమయ్యేది అని ఇప్పుడు ఊహించడం సరికాదు.ఇతని తల్లిదండ్రులకు భారతీయజ్యోతిష్యం తెలిసే అవకాశం లేదు. తెలిసినా పరిహారం చేద్దామని బుద్ధి పుట్టాలి.మోసగాడు కాని జోస్యుడు దొరకాలి.పరిహారం చెయ్యాలి.ఇన్ని చిక్కులను దాటగలిగితే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది.

కాని అలా జరగకుండా పూర్వకర్మ అడుగడుగునా అడ్డు పడుతుంది. అందులోనూ దోషం బలీయంగా ఉన్నపుడు పరిహారం జరగనివ్వకుండా ప్రకృతిశక్తులు అనుక్షణమూ అడ్డుకుంటాయి.వాటిని దాటి పరిహారం చెయ్యగలిగితే దోషం పోవడం ఖాయం.కానీ అంత శక్తి ఎవరికుంటుంది?

అందుకే,పుట్టిన పన్నెండేళ్ళవరకూ జాతకం చూడరాదు అనేమాట నేను అంతగా హర్షించను.కొందరు జ్యోతిష్కులు ఈమాటను చెబుతారు.కాని ఇది నేను ఒప్పుకోను.ఈలోపలే జరగాల్సిన దారుణం జరిగితే ఇక ఆపైన జాతకం చూచి ఉపయోగం ఏముంటుంది?కనుక శిశువు పుట్టిన వెంటనే జాతకం చూచి బాలారిష్టాలు ఏమైనా ఉంటే దోషపరిహార శాంతులు జరపడం ఉత్తమం.బాలారిష్టం అంటే అర్ధం కూడా అదే.

పూర్వకాలంలో మహారాజులూ చక్రవర్తులూ కూడా ఇదేపని చేసేవారు.వాళ్ళు తెలివితక్కువవారు కారనీ మనకంటే చాలా లౌక్యులనీ,జ్ఞానులనీ,జీవితాన్ని మనకంటే ఎంతో చూచినవారనీ గుర్తుంటే జ్యోతిష్యశాస్త్రాన్ని విమర్శించేవారి నోళ్ళు టక్కున మూతపడతాయి.

ఈవిధంగా ఎన్ని జాతకాలు చూచినా జ్యోతిష్యశాస్త్రం యొక్క అద్భుతమైన మహత్యం మళ్ళీ మళ్ళీ ఋజువౌతూనే ఉంటుంది.కర్మసిద్ధాంతం నిజమే అనేది కూడా ఎన్నిసార్లైనా ఋజువౌతూనే ఉంటుంది.
read more " లూయీ బ్రెయిలీ జాతకం-అంధత్వయోగాలు "

1, డిసెంబర్ 2013, ఆదివారం

'పంచవటి' సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి

పంచవటి సంస్థ నుంచి మేము తలపెట్టిన సేవా కార్యక్రమాలలో భాగంగా నిన్న గుంటూరులోని 'షిర్డీసాయి దీనజన సేవాసమితి' వారికీ 'మాతృశ్రీ వృద్దాశ్రమానికీ' కొంత ధనసహాయం చెయ్యడం జరిగింది.నేనూ,పంచవటి సభ్యుడూ మిత్రుడూ మదన్ కలసి నిన్న ఈ పని చేశాము.

'షిర్డీసాయి దీనజన సేవాసమితి' గుడ్డివారికోసం మొదలుపెట్టబడిన సంస్థ. ఇది 2/13 గుంటూరు బ్రాడీపేటలో ఉన్నది.ఇక్కడ 71 మంది గుడ్డివారు ఉండి చదువుకుంటున్నారు.వీరిలో నలుగురైదుగురు గ్రాడ్యుయేట్లూ,పోస్ట్ గ్రాడ్యుయేట్లూ కూడా ఉన్నారు.ఒకరిద్దరు మానసిక వికలాంగులు కూడా ఉన్నారు.తీరా అక్కడకి వెళ్లేసరికి మిత్రుడు పీ.ఎస్.మూర్తి గారే దాని సెక్రెటరీ అని తెలిసింది.ఆయనేదో రాజకీయ మీటింగ్ లో ఉండటం వల్ల సమయానికి అక్కడకు రాలేకపోయారు.

'మాతృశ్రీ వృద్దాశ్రమం' గుంటూరు శ్రీనగర్లో ఉన్నది.ఇందులో నలుగురు మగవారూ,22 మంది ఆడవారూ ఉన్నారు.అనాధలలో ఎక్కువగా స్త్రీలే ఉంటారు.కారణం-వారికి చదువు లేకపోవడమూ ఆస్తులు లేకపోవడమూ, స్వతంత్రంగా బ్రతికేశక్తి లేకపోవడమూ ఇలా రకరకాలైన కారణాలు ఉంటాయి.వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాధ.అందరూ వృద్ధులే.వీరిలో కొందరు బాగా ముసలివారుగా ఉన్నారు.వారి పనులు వారు చేసుకుంటూ ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ నిరాడంబరంగా ఒక కుటుంబంలా కలసి ఉంటున్నారు.

కాని అందరి ముఖాల్లోనూ ఏదో నిరాశా నిర్లిప్తతా కనిపిస్తున్నాయి.పెద్ద వయస్సులో 'నావాళ్ళు' అనుకున్నవారి నిరాదరణకు గురవ్వడం చాలా బాధాకరం.ఎంతగా సమయానికి అన్నీ జరుగుతున్నా మనస్సులో ఆ వెలితి వారిని బాధిస్తున్నట్లు కనిపించింది.

నవంబర్ నెలలో ఈ రెండు సంస్థలకూ మాకు చేతనైన ధనసహాయం చెయ్యడం జరిగింది.
read more " 'పంచవటి' సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి "