“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, ఏప్రిల్ 2023, శనివారం

పరలోకం - నిత్యజీవం

క్రైస్తవ విషబోధలు తలకెక్కితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో అనడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ ఈ మధ్యనే కెన్యాలో జరిగింది. Good News International Ministries అనే క్రైస్తవ సంస్థను స్థాపించిన పాల్ మెకంజీ తెంగే అనే పాస్టర్ ను ఈ నెల 15 వ తేదీన అరెస్ట్ చేశారు. కారణం? తిండీ నీళ్ళూ మానేసి చనిపోయేదాకా అలాగే ఉపవాసం ఉంటూ క్షీణించి క్షీణించి చనిపోతే, సరాసరి జీసస్ దగ్గరకు వెళతారని నూరి పోసి చాలామందిని ఈ పాస్టర్ చంపేశాడు. ఇతనికి 6౦౦ ఎకరాల చర్చ్ ప్రాపర్టీ ఉంది. అందులో పోలీసులు వెతుకుతుంటే ఎక్కడికక్కడ శవాలను పాతిపెట్టిన దిబ్బలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. ఇప్పటికి కనీసం 100 శవాలను తవ్వి తీశారు. వాటిలో ఎక్కువమంది చిన్నపిల్లల శవాలే ఉన్నాయి. వాళ్ళందరూ ఇతని మాటలు నమ్మి, తిండీ నీళ్ళూ మానేసి, క్షీణించి చనిపోయినవారే. 

2003 కు ముందు ఒక కారు డ్రైవరుగా పనిచేసిన ఈ పాల్ మెకంజీ, 2003 లో ఈ మిషనరీ సంస్థను స్థాపించి అతి త్వరలో వేలాదిమందిని ఆకర్షించాడు. ఇతని బోధనలు ముఖ్యంగా Dooms Day చుట్టూ తిరిగేవి. అంటే, త్వరలో భూమి అంతం కాబోతున్నదని, జీసస్ ను నమ్మితే స్వర్గానికి వెళతారని, లేకపోతే నరకమే గతి అని నూరిపోసే బోధలన్నమాట. ఆ విధంగా భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి, జీసస్ ను నమ్మేలాగా చెయ్యడం ఈ ప్లాన్ లో ఒక భాగం. ఇదే పిచ్చి ఇంకా ముదిరితే, చివరకు ఈ రకంగా సూయిసైడ్ చేసుకుని జీసస్ దగ్గరకు చేరుకోవాలని విషబోధలు ఈ క్రమంలో బోధిస్తారు. 

చెప్పగా చెప్పగా అబద్దాలను కూడా నిజాలుగా ఒప్పించవచ్చు. అమాయకులకు బ్రెయిన్ వాష్ చెయ్యవచ్చు. క్రైస్తవ పిడివాదులు గాని, ఇస్లామిక్ టెర్రరిస్టులు గాని తయారయ్యేది ఇలాగే.

ఇంతమంది అమాయకుల చావులకు కారకుడైన పాస్టర్ పాల్ మెకంజీ, అందరినీ ముందుగా పరలోకానికి పొమ్మని, తను మాత్రం చివరలో వస్తానని వాళ్ళకు చెప్పేవాడు. ఎందుకంటే, చివరలో తను స్వర్గం గేట్లు మూయాలట. లేకపోతే పాపులు లోపలికి వచ్చేస్తారట. ఈ విధంగా జనాన్ని మభ్యపెట్టేవాడు. ఇతని బోధలను నమ్మిన గొర్రెలు తమ ఆస్తులన్నీ అమ్మి ఇతని సంస్థకు డొనేషన్ క్రింద ఇచ్చేసేవారు. ఆ తరువాత పస్తులుండి చనిపోయేవారు. ఈ విధంగా అతను బాగా ఆస్తులను కూడబెట్టి కోట్లకు పడగలెత్తాడ. ఇప్పుడు అరెస్టయ్యాడు.

ఆ వివరాలన్నీ నెట్లో దొరుకుతాయి. ఇతనికి ఒక యుట్యుబ్ చానెల్ కూడా ఉంది. చూడండి. అర్ధమౌతుంది. అయితే, నేను చెప్పాలనుకున్నది అది కాదు. ముఖ్యంగా రెండు విషయాలు నేను చెప్పాలనుకున్నాను.

ఒకటి, అమాయకులైన ప్రజలు ఏ విధంగా గొర్రెలుగా మారి ఇలాంటి పాస్టర్ల మాయలో పడుతున్నారు అనే విషయం.

రెండు, అసలు బైబిలు బోధల లోనే ఉన్న అబద్దాలు, లోపాలు ఏమిటన్న విషయం. ఈ రెండు విషయాలు నేను చెప్పబోతున్నాను.

కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలలో పేదరికం, చదువులేనితనం ఉంటాయి. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో ఇవి ఉన్నాయి. అటువంటి చోట్ల క్రైస్తవ పాస్టర్ల కళ్ళు పడతాయి. డబ్బు ఎరవేసి బైబిల్ అబద్దాలు అమాయకులకు నూరిపోస్తారు. మతాలు మారుస్తారు. సమాజంలో చిచ్చు రేపుతారు. ఇది ఇండియాలో ముమ్మరంగా జరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్రలో చాలా ఎక్కువగా జరుగుతున్నది. ఇక్కడ ప్రతి పల్లెలోనూ కనీసం రెండు చర్చిలున్నాయి. మైకులు మారు మోగుతున్నాయి. కాకమ్మ కబుర్లను పాస్టర్లు బాగా నూరిపోస్తున్నారు. వెర్రి గొర్రెలు నమ్మేస్తున్నారు.

ఈ పాస్టర్లు చెప్పే ముఖ్యమైన బోధ, పరలోకం, నిత్యజీవం అనేవి. పరలోకం అనేది ఒకటి ఉందని, జీసస్ ను నమ్మితే అక్కడకు పోతారని, అక్కడ నిత్యజీవం ఉంటుందని పచ్చి అబద్దాలను పాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా అమాయకులకు నూరిపోస్తున్నారు. ఇవన్నీ అబద్దాలే. అవే నిజాలైతే, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులేంటి?

1. క్రైస్తవం పుట్టి కేవలం రెండువేల సమత్సరాలు మాత్రమే అయింది. భూమి పుట్టి నేటికి 454 కోట్ల సంవత్సరాలైంది. మరి జీసస్ పుట్టకముందు ఉన్న కోట్లాది మనుషులందరూ నరకానికే పోయారా? ఇది నమ్మదగిన విషయమేనా?

2. నేటికీ ఇజ్రాయెల్ దేశంలో జీసస్ ను నమ్మరు. అక్కడ ఓపన్ గా క్రైస్తవాన్ని బోధిస్తే జైల్లో పెడతారు. మరి ఇజ్రాయెల్ దేశస్తులందరూ నరకానికే పోతారా? అప్పుడు వాళ్ళు నమ్ముతున్న యెహోవా ఏం చేస్తాడు మరి?

3. క్రైస్తవం తెలియనివారు, దానిని అనుసరించని ఇతర మతస్తులు, నాస్తికులు  ఎక్కడికి పోతారు? 

4. క్రైస్తవబోధలు నిజాలైతే, ఇజ్రాయెల్ దేశం ఈనాటికీ జీసస్ ను ఎందుకు నమ్మడం లేదు?

అసలు విషయమేమంటే, క్రైస్తవం చెబుతున్న శాశ్వత పరలోకం అనేది ఎక్కడా లేనేలేదు. అది అబ్రహామిక్ మతాలు సృష్టించిన పచ్చి అబద్దం మాత్రమే.

హిందూమతం ప్రకారం, స్వర్గ నరకాలనేవి తాత్కాలికమైన లోకాలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇవి మరణానంతర స్థితులు మాత్రమే. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం కొంతకాలం పాటు ఉంటాయి. అవి అనుభవించిన తర్వాత మళ్ళీ  కర్మానుసారంగా జన్మ ఉంటుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని అందుకునేటంత వరకూ జననమరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది మన సనాతన ధర్మం చెబుతున్న సత్యం.  అంతేకాదు, బౌద్దమూ జైనమూ కూడా ఇదే చెబుతాయి. ఇది మాత్రమే సత్యం. అంతేగాని, జీసస్ ని నమ్మితే స్వర్గం, లేకపోతే శాశ్వత నరకం అనేవి బూటకాలు, పచ్చి అబద్దాలు మాత్రమే. కానీ ఈ అబద్దాలను కోట్లాదిమంది నిజాలని నమ్ముతున్నారు. గొర్రెలుగా మారుతున్నారు. దీనికి కారకులు పాల్ మెకంజీ వంటి దొంగ పాస్టర్లు. ఇది వాళ్ళ వ్యాపారం.

ఈ పాల్ మెకంజీకి పెంటకోస్ట్ డినామినేషన్ తో సంబంధాలున్నాయి. ఇది తీవ్రమైన భావాలున్న సంస్థ. వీరిలో చాలామంది రోగమొస్తే మందులు వాడరు. జీసస్ తగ్గిస్తాడని మూర్ఖంగా నమ్ముతారు. 

ముప్పై ఏళ్ళ క్రితం మా దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఇదే విధంగా నమ్ముతూ, తనకు గుండెజబ్బు వచ్చినా మందులు వేసుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా, జీసస్ రక్షిస్తాడని చెబుతూ అర్ధాంతరంగా చనిపోయాడు. పెంటకోస్ట్ మిషన్ గురించి వారి నమ్మకాల గురించి నాకప్పుడే మొదటిసారి తెలిసింది.

పోతే, పాల్ మెకంజీ దృష్టిలో ఇతను చెప్పేదే అసలైన క్రైస్తవమతం. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో ప్రచారంలో ఉన్న క్రైస్తవం అసలైన క్రైస్తవం కాదని ఇతను బోధిస్తాడు. రోగాలు వస్తే మందులు వేసుకోవడం పాపమని, మొబైల్, కంప్యూటర్ వంటి మోడరన్ పరికరాలు వాడకూడదని, అమెరికా వంటి దేశాలు సైతాన్ అనుచరులని ఇతను బోధించేవాడు. సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది తీసుకోవద్దని, అది Seal of the Beast  అని ఆ గొర్రెలకు ఎక్కించేవాడు. అందుకే, ఓటర్ లిస్టులో నమోదు కూడా చేసుకోకుండా తన బోధలను వినే గొర్రెలకు నూరిపోసేవాడు. చివరకు  తిండీ నీళ్ళు మానేసి ఆత్మహత్యలు చేసుకోమని అదే జీసస్ ను చేరుకునే అసలైన దారి అని వాళ్ళను హిప్నటైజ్ చేశాడు. నమ్మించాడు. వాళ్ళందరూ చచ్చారు. ఇతను మాత్రం హేపీగా ఉన్నాడు.

అసలీ Seal of the Beast అంటే ఏమిటి? ఇది బైబిల్ లోని ప్రకటనల గ్రంధం (Revelations Chapter) లో ఉంటుంది. ఈ చాప్టర్ 66 CE ప్రాంతంలో వ్రాయబడింది. ఇది రాజకీయపరంగా వ్రాయబడిన అబద్దపు వ్రాతలే గాని నిజాలు కావు.

ఎలా అంటే, అప్పట్లో నీరో చక్రవర్తి రోం ను పాలించేవాడు. ఇతని బొమ్మతో నాణేలు చలామణీలో ఉండేవి. పాతకాలంలో రాజులందరూ తమ తమ బొమ్మలతో నాణేలను ముద్రించేవారు. ఇది మామూలే. అయితే, రోమన్ల ఏలుబడిలో ఉన్న యూదులు యెహోవా పిచ్చిలో ఓల్డ్ టెస్టమెంట్ మాయలో పడి, దీనిని వ్యతిరేకించారు. నీరో చక్రవర్తి బొమ్మ ఉన్న నాణేలను Seal of the Beast గా వాళ్ళు వర్ణించారు. అయితే, డైరెక్ట్ గా దీనిని వ్యతిరేకిస్తే రాజు చేతిలో చావు తప్పదు కనుక, మార్మిక భాషలో అర్ధం అయ్యీ కానట్టుగా దీనిని వ్రాసి, 'ప్రకటనల గ్రంధం' అని దీనికి పేరు పెట్టారు. దీనిని నేటి క్రైస్తవులు దైవాదేశంతో వ్రాయబడిన ప్రకరణంగా భావిస్తూ మోసపోతున్నారు.

ఇలాంటి తెలిసీ తెలియని బోధలను చేస్తూ జనాలను చీకటి యుగాలలోకి తీసుకుపోతున్న క్రైస్తవ పాస్టర్లు నేడు ఇండియాలో కూడా లక్షలాది మంది ఉన్నారు. ఇటువంటి పిచ్చి బోధలను నమ్మి పిచ్చోళ్లుగా మారుతున్న అమాయకులు కోట్లల్లో ఉన్నారు 

పాప్ మెకంజీ ఈ బోధలను క్రొత్తగా చెయ్యడం లేదు. 2016 లో కూడా ఇలాగె చేసి కొన్ని వందల మందిని ఇదే విధంగా ఉపవాసాలుండమని ప్రేరేపించి, వాళ్ళ చావులకు కారకుడయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ చేశాడు. ఈ విధంగా జనాభాని తన వంతు కృషితో తగ్గిస్తున్నాడన్న మాట.

ఇటువంటి విషప్రచారాలు చేస్తున్నవారిని చట్టపరంగా నిరోధించవలసిన అవసరం ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ఇండియాలో చాలా ఉన్నది. లేదంటే నిన్న కెన్యాలో జరిగిన ఇటువంటి సంఘటనలే  రేపు ఇండియాలో కూడా జరిగే ప్రమాదం ముందు ముందు ఉన్నదనేది వాస్తవం. 

రూల్ ఆఫ్ లా లేనంతవరకూ ఇలాంటి వెఱ్ఱి పోకడలు తప్పవనేది కూడా వాస్తవమే. 

మతమార్పిడి నిరోధకచట్టం ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ కఠినంగా అమలు కావలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, సక్రమమైన రీతిలో హిందూమతాన్ని హిందూసంస్థలు అందరికీ ప్రచారం చెయ్యవలసిన అవసరం కూడా ఉన్నది. లేకపోతే Dooms Day అనేది త్వరగా రావడానికి ఇటువంటి విషబోధనలే కారణాలు అవుతాయి.

read more " పరలోకం - నిత్యజీవం "

25, ఏప్రిల్ 2023, మంగళవారం

దొడ్డవరం - తెల్లబాడు గ్రామాలు

ఈరోజు మంగళవారం.

నేడు దొడ్డవరం ఊరిలో ఉన్న లక్ష్మినరసింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. అర్చకులు నరసింహాచార్యులు గారు, నడివయసు దాటిన మనిషి. మా వివరాలు విని చాలా సంతోషించారు. 'ఈ ఊరికి మేమొచ్చి పది రోజులైందని, ఊరిలో అతి ప్రాచీన ఆలయం ఏమిటి? అని వాకబు చేస్తే నరసింహస్వామి గుడి అని చెప్పారని, అందుకని ఈ ఆలయానికి నేటికి వచ్చి దర్శనం చేసుకోగలిగామ'ని ఆయనతో అన్నాను.

ఆలయంలో ఎవరూ లేరు. ఇతర గ్రామస్తులు సామాన్యంగా ఈ ఆలయానికి రారని తెలిసింది. ఎందుకంటే, ఇక్కడ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారట. ఇది పెద కమ్మవారి అధ్వర్యంలో నడుస్తున్న ఆలయం. విశాలంగా, శుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. అంకమ్మతల్లి గుడి అయితే, మొక్కులు, బలులు మొదలైన వాటితో గ్రామ్యపంధాలో ఉంది. దానికి విభిన్నంగా నరసింహస్వామి ఆలయం, వైదిక సాంప్రదాయ విధానంలో శుచిగా ఉన్నట్లుగా అనిపించింది. ఇక్కడి 'ఆరా' కూడా చాలా బాగుంది.

వచ్చే నెల 4. 5 తేదీలలో సరసింహ జయంతి జరుగుతుందని, రోజంతా పూజలు, భజనలు ఉంటాయని, రమ్మని ఆచార్యులు అన్నారు. 'అలాగే వస్తామని' అంటూ, 'జనం వచ్చే పర్వదినాలలో కంటే, రాని మామూలు రోజులే మాకు బాగుంటాయి. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఆలయంలో  ఒక్కడినే కూర్చుని జపధ్యానాలు అనుష్టానము చేసుకోవచ్చా?' అని అడిగాను.

'బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంతకంటే కావలసింది ఏముంది? వచ్చి చేసుకోండి' అని ఆయన అన్నారు.

'ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తన జరుగుతుంది. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకూ ఉంటుంది. ఆడవాళ్ళ సంకీర్తనా బృందం ఉంది. వాళ్ళు చాలా బాగా భజన చేస్తారు. మీరూ వచ్చి పాల్గొనండి' అని ఆహ్వానించారు.  

'మా ఆశ్రమంలో కూడా ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తనం మొదలుపెట్టి చెయ్యబోతున్నాము. అయినా, ఇక్కడకు కూడా వస్తాను' అని  ఆయనతో చెప్పాను.

దొడ్డవరం తెల్లబాడు గ్రామాలలో రామనామ సంకీర్తనం చేసే ఆడవాళ్ళ బృందాలున్నాయి. వీరిది అవధూతేంద్ర సరస్వతీస్వామి వారి పరంపర. వీరికే రఘువరదాసుగారని పేరున్నది. నా చిన్నపుడు గ్రామగ్రామాలలో రామనామ ఏకాహాలు, సప్తాహాలు వీరి అధ్వర్యంలో జరిగేవి. రామనామాన్ని  తెలుగునాట గ్రామగ్రామాలలో ప్రచారం చేసి తరించిన మహనీయుడాయన. పాతతరం వారికి ఆయన సుపరిచితుడే. రామనామం మారుమ్రోగుతున్నంత వరకూ పల్లెటూర్లు ఎంతో బాగున్నాయి. కాలక్రమేణా క్రైస్తవ  విషప్రచారాలతోను, ఇతర వెర్రిపోకడలతోనూ నేటి పల్లెటూర్లు ఎంతగా భ్రష్టు పట్టినప్పటికీ, ఈ నాటికీ రామనామ సంకీర్తనమే పల్లెలను కొద్దో గొప్పో రక్షిస్తున్న శక్తి అనేది నా నమ్మకం.

రామనామ సంకీర్తనను నేను చాలా ఇష్టపడతాను. దాని శక్తి నాకు బాగా తెలుసు. దానితో నా అనుబంధం ఇప్పటిది కాదు. నా చిన్నప్పటిది.

దొడ్డవరం, తెల్లబాడు గ్రామాలు రెండూ కలిసే ఉంటాయి. వీటిలో అసలు ఊరు దొడ్డవరం గ్రామమే. ఇది వెయ్యేళ్ళ క్రితం గడ్డ ఎత్తబడిన ఊరు. అప్పటిలో చోళరాజుల పరిపాలనలో ఉండేది. అద్దంకి రాజధానిగా ఉండేది. కాలక్రమంలో యాదవ రాజులు, రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

మొదట్లో ఈ గ్రామం గడ్డను ఎత్తినది బ్రాహ్మణులే. బ్రాహ్మణులు, పెద కమ్మవారు కలసి ఈ గ్రామాన్ని స్థాపించారు. ఈ గ్రామం అసలు పేరు వీరనరసింహపురి అగ్రహారం. అందుకే వెయ్యేళ్ళనాటి నరసింహస్వామి ఆలయం ఈ ఊరిలో ఉన్నది.

ఏభై ఏళ్ళ క్రితం వరకూ ఈ ఊరిలో ముప్పై దాకా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలున్నాయి. అందరూ ఇళ్ళను పొలాలను అమ్ముకుని ఊరు ఒదిలి చదువులు, ఉద్యోగాల కోసం పట్నాలకు వెళ్ళిపోయారు. పెదకమ్మవారి కుటుంబాల పిల్లలు కూడా చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు.ఆ కులంలోని పెద్దవాళ్ళు మాత్రం ఊరిలో మిగిలారు. శివాలయం వైపుగా చిన్న కమ్మవారి కుటుంబాలు ఉన్నాయి. వారు వ్యవసాయవృత్తిలో ఉన్నారు. వారిలో వాడే బత్తుల వెంకటసుబ్బయ్య. వృత్తిరీత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్ అయినప్పటికీ, వేదం మీద ఆసక్తితో ఎంతో పరిశోధన చేసి, 'అతిరుద్రం- షడ్దర్శనాలు' అనే విషయం మీద సంస్కృతభాషలో Ph.D చేశాడు. జ్యోతిష్యశాస్త్రంలో M.A చేశాడు. ఇతని గురించి ఇంతకు ముందు వ్రాశాను. ఈ ఊరి ఆణిముత్యం ఇతడు. బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మవారు గాక, వడ్డెరలు, యాదవులు, మాలలు, మాదిగలు, ఇతర కులస్తులు కొంతమంది ప్రస్తుతం గ్రామంలో ఉన్నారు.

ఈ ఊరు చాలా పేరు గాంచిన ఊరు. సినీనటి భానుమతి పుట్టినది ఇక్కడే. ఇక్కడ రామాలయం వీధిలోనే ఆమె పుట్టిన ఇల్లు ఉన్నది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య బ్రాహ్మణుడు. తల్లి సరస్వతి, కళావంతులని చెప్పారు. మద్రాసులో స్థిరపడి, ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత కూడా, అప్పుడప్పుడు ఆమె తన స్వగ్రామమైన దొడ్డవరానికి వచ్చి పోయేదని ఇక్కడివాళ్ళు చెప్పారు. ఇక్కడి ఆలయ ఉత్సవాలలో ఆమె తల్లి సరస్వతి నాట్యం చేసేదని, తల్లి వెంట చిన్నపిల్ల భానుమతి వస్తూ ఉండేదని అన్నారు. సరస్వతి గారు సంగీత విద్వాంసురాలు. ఆమె దగ్గరే భానుమతి తన మొదటి సంగీత పాఠాలను అభ్యసించి ఉండవచ్చు.

సంగీత విద్వాంసులకు, కళాకారులకు, సాహిత్యప్రియులకు ఈ ఊరు పెట్టింది పేరు.

బుర్రకధకు మన దేశంలోనే పేరు తెచ్చిన మేటి కళాకారుడు జంగం వెంకటస్వామి, ఆయన శిష్యుడు హరిజనుడైన కాకుమాను రాఘవులు ఈ ఊరి వారే. వెంకటస్వామి గాత్రం ఎంత ఖంగుమనేదంటే, దానిని రికార్డు చేయబోతుంటే గ్రామఫోను ప్లేటు చిట్లిపోయిందట. దీనిని ఇప్పటికీ కధగా చెప్పుకుంటారు.

ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు శింగంశెట్టి చంద్రశేఖరం ఈ ఊరివాడే. ఈయన పక్కా కమ్యునిస్టు. కానీ నిరంతరం కృష్ణనామాన్ని జపించేవాడు. భక్తిరసంలో ఓలలాడేవాడు.

ప్రఖ్యాత వీధి భాగవతకళాకారుడు జక్కుల వెంకట రామదాసు ఈ ఊరిలో పుట్టినవాడే.

సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తన నాదస్వర గానంతో మెప్పించిన నాదస్వర ప్రవీణుడు చినబాలాజీ ఈ గ్రామస్తుడే.

(ఈ వివరాలను శ్రీ గొల్లపూడి ప్రకాశరావు రచించిన 'మా జంట గ్రామాలు' అనే పుస్తకం నుంచి గ్రహించాను)

ఇంకా ఎందరెందరో ఎన్నో రంగాలలో ప్రసిద్ధి కెక్కినవారు ఈ గ్రామం నుంచి వచ్చారు. అలాంటిది దొడ్డవరం గ్రామం. కానీ ప్రస్తుతం మాత్రం గతకాలపు సాంస్కృతిక వైభవం అంతా అంతరించింది. జనాల దగ్గర డబ్బు పెరుగుతున్నది గాని సాంస్కృతిక పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

నాలుగు వేల జనాభా ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నది. నరసింహస్వామి ఆలయానికి తోడు, ఒక రామాలయం (అసంపూర్తిగా వదలివెయ్యబడింది. చందాలు వసూలు చేసినవారు కొందరు చనిపోగా, మరికొందరు అమెరికాకు వెళ్ళిపోయారట),  మాలపల్లిలోని రామాలయం, పాత శివాలయం, అంకమ్మ తల్లి గుళ్ళు రెండు, బ్రహ్మంగారి గుళ్ళు మూడు, పోలేరమ్మ తల్లి గుడి ఒకటి, శక్తి క్షేత్రం అనే అమ్మవారి గుడి ఒకటి, అయ్యప్ప స్వామి గుడి, ఈ మధ్యనే కట్టబడిన ఒక పెద్ద నల్లరాతి ఆంజనేయస్వామి విగ్రహం, ఈ విధంగా చాలా గుడులున్నాయి. ఇవిగాక మూడు చర్చిలున్నాయి. ఎవరికి వారే, వారి వారి కులగుళ్ళు కట్టుకుంటూ వాళ్ళ ఉనికిని  సామాజికబలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తున్నది గాని, పాతకాలపు ఆలయాల సంస్కృతిని పద్ధతులను నిలబెట్టే క్రమం మాత్రం గోచరించడం లేదు. మైకులు మాత్రం మోగిపోతున్నాయి.

ఈ గ్రామానికి మాకు గల అనుబంధం ఏనాటిదో? ఎప్పటిదో? నేడు మేము ఈ గ్రామానికి చేరుకున్నాము. మా మొదటి ఆశ్రమం ఇక్కడే వస్తున్నది. మొదటి ఆశ్రమం అని ఎందుకన్నానంటే, గోదావరి తీరంలో మా ఇంకొక ఆశ్రమం రావాలన్నది నా సంకల్పం. పేరుకు చంద్రపాడు గ్రామ పరిధిలో ఉన్నప్పటికీ, ఏది కావాలన్నా మేము రావలసింది దొడ్డవరం గ్రామానికే. కనుక ప్రస్తుతానికి మేము దొడ్డవరం గ్రామస్తులమే.

ఈ ఊరుకు ఆనుకుని ఉన్న ఇంకొక గ్రామం ఇలపావులూరు. 1984 ప్రాంతాలలో మాకు బాగా పరిచయస్తుడైన IT Rao గారు ఈ గ్రామపు ఆయనే. ఆయనపేరు ఇలపావులూరి తిరుమలరావు. ఈయన గుంతకల్లు రైల్వే డివిజన్ లో TTE గా పనిచేశారు. అప్పుడప్పుడూ తన స్వగ్రామానికి వచ్చి పోతూ ఉండేవాడు. ఆ ఇలపావులూరు గ్రామం మా ప్రక్కనే ఉంది.

వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమగ్ర సమన్వయం చేస్తున్న మా ఆశ్రమం ఇక్కడ రావడం ఈ నేల చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి. కానీ ఈ గ్రామస్తులకు మా ఆశ్రమ విధానాలు, ఆశయాలు అర్ధమౌతాయా? ప్రపంచంలో ఎక్కడా దొరకని అత్యున్నత ఆధ్యాత్మిక సంపద వాళ్ళ ముంగిటిలోకి వచ్చి నిలుచున్న విషయం వారికి ఎప్పటికైనా  తెలుస్తుందా? దానిని అందుకోగలిగే వాళ్ళు ఒక్కరైనా ఇక్కడ కనిపిస్తారా?

ఏమో? కాలమే నిర్ణయించాలి.

read more " దొడ్డవరం - తెల్లబాడు గ్రామాలు "

23, ఏప్రిల్ 2023, ఆదివారం

మీ ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారు??

ఆశ్రమం పనులు మొదలయ్యి చురుకుగా ముందుకు కదులుతున్నాయి.

గ్రామస్తులలో కుతూహలం పెరుగుతోంది. రకరకాలుగా వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కొందరైతే మమ్మల్నే అడుగుతున్నారు.

‘యోగాశ్రమం అని పేరు పెట్టారు. డబ్బులు తీసుకొని యోగా నేర్పిస్తారా?’ అడిగింది ఒకామె.

‘మేము డబ్బులూ తీసుకోము, యోగానూ నేర్పించము’ అన్నాను .

‘మరి యోగాశ్రమం అని పేరు పెట్టారు కదా?’ అనుమానం తలెత్తింది ఆమెలో

‘మేము నేర్పే యోగా మీకు అర్ధమయ్యేది కాదు. మీరు చెయ్యగలిగేది కూడా కాదు’ అని ఆమెతో చెప్పాను.

ఇంకొకాయన ఇలా అడిగాడు.

‘చందాలతో ఆశ్రమం కట్టిస్తున్నారా?’

‘మేము చందాలు తీసుకోము’ అని చెప్పాను

అతను నోరెళ్ళబెట్టాడు

‘మేము కూడా చందాలేసుకుని అమ్మవారికి తిరునాళ్ళు చేస్తాము. సంబరాలు చేస్తాము. బ్రహ్మంగారి తిధికి ఊరందరికీ భోజనాలు పెడతాము’ అన్నాడు.

‘మేము అటువంటి పనులు  పొరపాటున కూడా చెయ్యము’ అన్నాను

‘అంటే మీలో మీరే ఉంటారా?’ అడిగాడాయన

‘అంతే. మాలో మేమే ఉంటాము, మా కష్టార్జితాలతో ఆశ్రమం కట్టుకుంటున్నాము.  మా మార్గంలో నడిచేవాళ్ళకే అందులో ప్రవేశం. బయటివాళ్ళకు ప్రవేశం లేదు’ అన్నాను.

'ఇంతమాత్రం దానికి ఆశ్రమం ఎందుకు?' అన్నట్టు చూశాడాయన.

ఇంకొకాయన ఇలా అడిగాడు.

‘ముసలోళ్ళని చేర్చుకుంటారా?’

మాది వృద్ధాశ్రమం అని అతను అనుకుంటున్నాడని నాకర్ధమైంది.

‘అంటే?’ అన్నాను అర్ధం కానట్టు

‘మా ఇంట్లో ముసలోళ్ళున్నారు. ఆశ్రమానికి పంపచ్చా?’ అడిగాడు సిగ్గు లేకుండా.

‘ఎవరు మీ అమ్మా నాన్నానా?’ అడిగాను.

‘అవును. మా అత్తా మామా కూడా ఉన్నారు’ అన్నాడు.

‘చేర్చుకుంటాము. ఒక్కొక్కళ్ళకి నెలకి లక్ష అవుతుంది. పైగా ముసలోళ్ళతో గొడ్డుచాకిరీ చేయిస్తాము. ఊరకే కూచోపెట్టము’ అన్నాను సీరియస్ గా.

‘అంతెందుకవుతుంది?’ అన్నాడు.

‘ఎందుక్కాదు? ఏసీ రూములు, అన్ని సౌకర్యాలు,  ప్రతిరోజూ బిరియానీ, వీకెండ్ లో చికెన్ మటన్, అప్పుడప్పుడు మందు, ఇవన్నీ ఉంటాయి. ఇవిగాక రోజుకి మూడు సినిమాలు చూపిస్తాము, కాదామరి? అయినంత అవుతుంది. మిగతాది మాకు డొనేషన్’ అన్నాను.

మళ్ళీ తిరిగి చూస్తే ఒట్టు.

ఇంకొకామె ఇలా అడిగింది.

‘మీ ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారు?’

‘అన్నీ నేర్పిస్తాము. నేర్చుకోగలిగితే’ అన్నాను 

'అంటే ?' అడిగిందామె. 

'అంటే, మీరు పద్ధతిగా ఉంటే మా దగ్గర అన్నీ ఉంటాయి. మీరు తీరుగా లేకపోతే మా దగ్గర మీకేమీ దొరకదు' అన్నాను.

'అసలు మీ మార్గమేంటి”’ అడిగింది ఆమె మళ్ళీ.

‘అది కొద్దిమాటల్లో చెప్పేది కాదు. చెప్పినా మీకు అర్ధం కూడా కాదు’ అన్నాను.

నిన్న ఒకతను ఆటోలో వచ్చాడు.

‘ఆశ్రమంలో వాచ్ మ్యాన్ కావాలా?’ అడిగాడు నడుం మీద చేతులేసుకుని పోజిచ్చి నిలబడి.

ఆటో మీద ‘యెహోవా నా కాపరి’ అని రాసుంది.

‘నీకే ఒక కాపరున్నాడు. నువ్వు మాకేం కాపలా కాస్తావులే, వద్దు’ అన్నాము.

ఇంకొక గొడ్లు కాసుకునే ముసలోడు ' పొలిమేరలో పొలం కొన్నారు. ఈడ రేత్తిరిపూట బూత వైజ్జకాలు సేత్తాంటారు. జాగర్త' అని భయపెట్టబోయాడు.

'బూతాలతో ఆడుకోటం మాకు సరదా. మా ఆశ్రమంలో రేత్తిరైతే శానా బూతాలు తిరుగుతాంటై. నువ్వీ శాయలకి రామాక' అన్నా సీరియస్ గా.

ముసలోడు పరార్.   

‘అవసరమైతే తప్ప పనివాళ్ళని పెట్టుకోరు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఒకళ్ళ జోలికి రారు. వాళ్ళలో వాళ్ళే ఉంటారు’ అని ఒక అభిప్రాయం గ్రామస్తులలో పడిపోయింది.

అయితే, 'ఈ ఆశ్రమంలో ఉంటూ వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు?’ అన్నది మాత్రం  ఎవరికీ అర్ధం కావడం లేదు.

ముందు మాకర్ధమైతే కదా వాళ్ళకి చెప్పడానికి?

read more " మీ ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారు?? "

21, ఏప్రిల్ 2023, శుక్రవారం

పల్లెటూళ్ళు

పల్లెటూళ్ళు

స్వార్ధపు కంపుల పిచ్చుక గూళ్ళు

పల్లెటూళ్ళు

కులగుంపుల కుళ్ళు లోగిళ్ళు

 

పల్లెటూళ్ళు

మతప్రచారాల మంటల బళ్ళు

పల్లెటూళ్ళు

విష ప్రలోభాల కుంటకావళ్ళు

 

పల్లెటూళ్ళు

రగులుతున్న విభేదాల గుళ్ళు

పల్లెటూళ్ళు

పెరుగుతున్న వైషమ్యాల దళ్ళు

 

కావు కావివి ఒకప్పటి పల్లెటూళ్ళు

నేడు లేవెక్కడా సామరస్యపు మళ్ళు

నేటి పల్లెటూళ్ళు చదరంగపు గళ్ళు

దేశపు ఒంటినిండా గుచ్చిన ముళ్ళు

read more " పల్లెటూళ్ళు "

14, ఏప్రిల్ 2023, శుక్రవారం

అమ్మకు నైటీబాబా సర్టిఫికెట్ అవసరమా?

మొన్న జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు ఒక క్రొత్త విషయం గమనించాను. అదేంటంటే, ప్రచారం పైన పెరిగిన ఫోకస్. నేటి నెట్ సమాజంలో అది అవసరమే. కాదనలేం. కానీ ఆ క్రమంలో సత్యాలను పక్కన పెట్టి అబద్ధాలను ప్రచారం చెయ్యవలసిన అవసరం ఉన్నదా? అనేది నా సందేహం. అలా ఉన్నవీ లేనివీ ప్రచారం చేసే క్రమంలో అమ్మ భావజాలాన్ని, అసలుతత్త్వాన్ని మరుగున పడవెయ్యవచ్చా? అనేది కూడా నా ఇంకొక సందేహం.

ఉదాహరణకు, 'అమ్మ సాక్షాత్తు రాజరాజేశ్వరి అవతారమే' అని  శ్రీశ్రీశ్రీ నైటీబాబా చెప్పినట్టుగా ఒక కొటేషన్ అక్కడ బోర్డుల పైన దర్శనమిచ్చింది. అసలు నైటీబాబానే ఒక పెద్ద ఫ్రాడ్ అనేది ఎప్పుడో ఋజువై పోయింది. టీవీ కెమెరాలు, అశాంతి నిలయంలో జరిగిన అనేక సంఘటనలు ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా ఎప్పుడో  నిరూపించేశాయి. అలాంటి ఫ్రాడ్ బాబా ఇచ్చిన సర్టిఫికెట్ అమ్మకు అవసరమా? ఆ సర్టిఫికెట్ వాడుకోవడం వల్ల అమ్మ ప్రతిష్ఠ కొత్తగా పెరిగేది ఏమైనా ఉందా? అనేది నా సందేహం.

'అమ్మ రాజరాజేశ్వరి అవతారమే" అని నైటీబాబా నిజంగా చెప్పినట్లైటే, మరి అమ్మ దర్శనానికి బాబా ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? బాబాలు జగన్మాత కంటే గొప్పవాళ్లా? అనేది అసలైన ప్రశ్న.

పోతే, తను రాజరాజేశ్వరి అవతారం కానని అమ్మే స్వయంగా చెప్పింది. అమ్మ జీవితాన్ని చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 'అన్నపూర్ణాదేవి అని, రాజరాజేశ్వరి అని నన్ను అనుకునేవారే గాని, నన్ను నన్నుగా చూసేవాళ్ళు ఏరీ?' అని అమ్మ అన్నది.

అమ్మంటే నా అవగాహన కూడా అమ్మ చెప్పిన పై మాటలనే బలపరుస్తున్నది.

ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూడలేని వారే, ప్రతిదానికీ శివునితో విష్ణువుతో అమ్మవారితో ముడిపెట్టి చారిత్రక సంఘటనలకు పురాణరంగులు అద్దాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేస్తే గాని వారికి తృప్తి కలగదు. ఈ క్రమంలో కాకమ్మకధలు సృష్టిస్తూ ఉంటారు. తిరుమలలో జరిగిన శ్రీనివాసుని లోకల్ చరిత్రకు మహావిష్ణువుతోను, కేరళలో జరిగిన అయ్యప్ప జానపద చరిత్రకు మోహినీ అవతారంతోను, బుద్ధునికి దశావతారాల తోను లింకులు పెట్టి రకరకాలైన కథలు అల్లినది, ప్రతిదానికీ పురాణ ప్రతిపత్తిని ఆశించే ఈ పిచ్చిపోకడలే.

ఇక బాబాల సంగతి చెప్పనే అక్కర్లేదు. దివ్యత్వం లేనివారికి దివ్యత్వాన్ని, హిందువులే కానివారికి హిందూత్వాన్ని అద్ది, వాళ్ళను దేవుళ్ళను చేసి కూచోపెట్టినది కూడా ఈ పొకడలే. హిందువులలో ఈ దిగజారుడుతనం పోవాలి. అసలైన హిందూమతం పైన వారికి స్పష్టత రావాలి. వారి మతమేంటో వారికి స్పష్టంగా అర్థం కావాలి. నా పుస్తకాల ద్వారా దీనినే నేను చెబుతున్నాను.

అమ్మ చెప్పిన ఇలాంటి అసలైన మాటలను దాచిపెట్టి, అమ్మ భావజాలాన్ని పక్కదారి పట్టించి, ఫ్రాడ్ బాబాలు చెప్పిన ఇలాంటి కల్లబొల్లి కబుర్లను ప్రచారం చెయ్యడం ఎందుకు?

ఇది సత్యాన్ని అనుసరించడమా? లేక అసత్యాన్ని ఆరాధించడమా?

ఆదాయం కోసం ఆదర్శాలకు తిలోదకాలివ్వడం అవసరమా?

సత్యం నిలబడాలంటే కూడా అసత్యాల దన్ను కావాలా?

ఇదేనా కలిమాయ అంటే?

read more " అమ్మకు నైటీబాబా సర్టిఫికెట్ అవసరమా? "

12, ఏప్రిల్ 2023, బుధవారం

మీతో పరిచయం చేసుకోవాలనుంది

మొన్నొకాయన నుంచి ఫోనొచ్చింది.

'నేను మాస్టర్ CVV మార్గం ఫాలో అవుతాను. దుర్గామంత్రం జపిస్తుంటాను. జ్యోతిష్యం పెద్దగా రాదు, కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఈమధ్యన నేను చెప్పేవి నిజమౌతున్నాయి' అన్నాడాయన.

'సరే. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి' అన్నాను

'మీతో పరిచయం చేసుకుందామని అనుకుంటున్నాను' అన్నాడు

'నాతో ఊరకే పరిచయం చేసుకుంటే మీకేంటి ఉపయోగం?' అడిగాను.

'ఊరకనే' అన్నాడు.

'ఊరకే పరిచయం చేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. నేను మనుషులతో పరిచయాలు, సంబంధాలు తగ్గించుకునే పనిలో ఉన్నాను. మీరు రాంగ్ టైం లో వచ్చారు' అన్నాను.

'అంటే, జ్యోతిష్యం గురించి మీ దగ్గర కొన్ని నేర్చుకుందామని' అన్నాడు

'మీరు జ్యోతిష్యం చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?' అడిగాను.

'అవును. తీసుకుంటాను. కానీ మానేద్దామని అనుకుంటున్నాను' అన్నాడు.

'సారీ. కమర్షియల్ జ్యోతిష్కులతో నేను మాట్లాడను. డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నంత వరకూ మీకు అసలైన జ్యోతిశ్శాస్రం పట్టుబడదు. నాతో మీకు ఉపయోగమూ ఉండదు. పోతే, మాస్టర్ CVV మార్గం ఫాలో అవుతున్నంతసేపూ కూడా నాతో ఉపయోగం ఉండదు. ఈ రెండూ మీరు మానుకుని నా మార్గంలో నడవాలనుకుంటే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం నాతో మీకు ఉపయోగం సున్నా. ముందు నా పుస్తకాలు కొన్నైనా చదవండి. అప్పుడు నా మార్గమేంటో అర్ధమౌతుంది' అని చెప్పాను.

'సరేనండి ఉంటా' అన్నాడాయన.

'మంచిది' అంటూ ఫోన్ కట్ చేశాను.

శుద్ధంగా నా దారిలో నడిచేవారికే నా ఉపయోగం గాని, కాలక్షేపం కోసమో, కబుర్ల కోసమో, జ్యోతిష్య రహస్యాల కోసమో నాతో పరిచయం చేసుకుందామని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.

కమర్షియల్ జ్యోతిష్కులకు నాతో పనేంటి?

అదే విధంగా, వేరే గురువులను ఫాలో అయ్యేవారికి కూడా నాతో పనేంటి?

ప్రపంచపు గోల ఒద్దనుకునేవాడికి మనుషులతో పనేముంటుంది?

read more " మీతో పరిచయం చేసుకోవాలనుంది "

10, ఏప్రిల్ 2023, సోమవారం

సుదూరంగా








శబ్దకాలుష్యాలకూ

వర్గవైషమ్యాలకూ

దుష్టసాంగత్యాలకూ

భ్రష్టసాహిత్యాలకూ

సుదూరంగా


మెతుకు తెరువులకూ

బ్రతుకు బరువులకూ

వెకిలి మనుషులకూ

మకిలి మనసులకూ

సుదూరంగా


పెట్టుపోతలకూ

ఒట్టి కూతలకూ 

ఓటిమాటలకూ

నీటిమూటలకూ

సుదూరంగా


కుళ్ళుసంఘానికీ

కర్మరంగానికీ 

కురచవేషాలకీ

కుదురు మోసాలకీ

సుదూరంగా


మాయస్నేహాలకూ 

మారుమోహాలకూ

పిచ్చిపాపాలకూ

పిల్లిశాపాలకూ 

సుదూరంగా....

read more " సుదూరంగా "

7, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఎవరికివారే యమునాతీరే

ఈ మధ్యన ఆశ్రమాలు చాలా చూస్తున్నారు కదా? వాటిపైన మీ అభిప్రాయం ఏమిటి? అని ఒక శిష్యుడు  అడిగాడు.

ఈ కవితను వినిపించాను. 

ఏ ఆశ్రమం చూచినా
ఏమున్నది గర్వకారణం?
ఆధ్యాత్మిక చరిత్ర మొత్తం
అతిచేష్టల అరాచకత్వం

సమాధి స్థితులు పోయాయి
సమాధులు మిగిలాయి 
మహనీయులు మొదలుపెట్టారు
మరమనుషులు నడుపుతున్నారు

పట్టుపురుగులు పోయాయి
చీడపురుగులు చేరాయి
ఆదర్శాలు వల్లె వేస్తున్నారు
ఆచరణలో చెల్లిపోతున్నారు

స్పిరిట్యువల్ జోకర్లు
ఫిలాసఫీ బ్రోకర్లు
కమెడియన్లు బపూన్లు
కస్టోడియన్లుగా తయారై
ఆశ్రమాల నిండా ఉన్నారు
అసహ్యపు గెంతులేస్తున్నారు

ఆరోవిలన్లు
అన్నాదురైలు
జిల్లేడుముళ్ళు
జిలేబి రాయుళ్లు

బొమ్మల కొలువులు
రమ్మని పిలుపులు
కమ్మని వ్యాపారాలు
ఝమ్మని  సాగుతున్నాయి

తంతుల తాళ్ళతో
తమను తాము కట్టేసుకుని
ఆశపోతు గొర్రెలను పోగేస్తున్న
వెఱ్ఱి వెంగళప్పలు

క్రొత్త దేవతలు
పాత ఆరాధనలు
మహిమల ప్రచారాలు
మనుషులకు గేలాలు

స్పిరిట్యువల్  మార్కెటింగు
కమర్షియల్ టార్గెటింగు
అబద్దాల రూఫింగు 
ఆధ్యాత్మిక డూపింగు

ఆలయాలన్నీ అక్రమాల నిలయాలే
ఆశ్రమాలన్నీ అనాధాశ్రమాలే
గురువులందరూ వ్యాపారస్తులే
శిష్యులందరూ వ్యవహారస్తులే

ఎక్కడ చూచినా డ్రామాలే 
ఫాలోయర్స్ కి నామాలే
ఎవరికివారే యమునాతీరే
చివరికి చూస్తే రైతుబజారే
read more " ఎవరికివారే యమునాతీరే "

6, ఏప్రిల్ 2023, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 55 (స్పిరిట్యువల్ డెంటిస్ట్)

జిల్లెళ్ళమూడిలో ఉండగా ఒకరోజున అమ్మ ఆలయానికి వెళ్లే దారిలో శ్రీ కనిపించాడు.

'రండి కూర్చోండి'  అంటూ ఆహ్వానించి కుర్చీలు వేయించాడు.

'సరే, పిలిచినప్పుడు కాదనడం ఎందుకులే?' అని అందరం కూచున్నాం.

అదీ ఇదీ మాట్లాడుకుంటూ ఉండగా, ఇద్దరు వ్యక్తులు అమ్మ ఆలయం నుంచి వెనక్కు వస్తూ కనిపించారు. చూస్తే కొంచం పెద్దవాళ్లలాగే దర్పంగా ఉన్నారు.

వెంటనే 'శ్రీ' హడావుడిగా లేచి  గౌరవంగా వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు అక్కడ ముఖ్యవ్యక్తులని తెలిసిపోతోంది. నేను మాత్రం లేవకుండా అలాగే కూర్చుని వాళ్ళను చూస్తున్నాను.

దానికి వాళ్ళు హర్టయ్యారు. 

నాకు నవ్వొచ్చింది.

లోకంలో ప్రతివాడూ గౌరవాన్ని కోరుకునేవాడే, సమయమూ సందర్భమూ లేకుండా. ఎదుటివాడు ఏంటో తెలుసుకోకుండా.

శ్రీ ఇది గమనించి, వాళ్ళలో ఒకాయనను నాకు పరిచయం చేస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ డెంటిస్ట్. హైదరాబాద్ లో ఉంటారు' అన్నాడు.

ఈసారి నాకు చచ్చే నవ్వొచ్చింది.

'అంటే?' అన్నాను ఆశ్చర్యంగా.

'అంటే, 32 పళ్ళూ కనిపించేటట్లు నోరంతా తెరిచి మనస్ఫూర్తిగా నవ్వడమే అసలైన స్పిరిట్యువాలిటీ అనేది ఈయన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని కనుక్కున్నందుకు, తనను తాను 'స్పిరిట్యువల్ డెంటిస్ట్' అని పిలుచుకుంటాడు. అందరూ అలాగే పిలవాలని పట్టుబడుతూ ఉంటాడు' అన్నాడు.

'ఓహో. తమిళ సినిమాలో హీరో లాగా పళ్ళన్నీ చూపిస్తూ నవ్వడం ఈయన పిలాసపీ అన్నమాట' అన్నాను.

వాళ్ళు మళ్ళీ హర్టయ్యారు.

శ్రీ కూడా హర్టయ్యాడు నా మాటలకి.

ఈ హర్టులేంటో, చాలా చిరాకేసింది.

వీళ్లకు పిచ్చి ముదిరిందని అర్థమైంది.

ఇక ధర్మోపదేశం మొదలుపెట్టక తప్పదనిపించింది.

నా చుట్టూ ఉన్న శిష్యబృందంలో ఒకాయన్ని వాళ్ళకి చూపిస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ టెర్రరిస్ట్. స్వగ్రామం గుంటూరు' అన్నాను.

వాళ్ళు నోరెళ్లబెట్టారు.

'అంటే, నా భావజాలాన్ని అందరికీ ప్రచారం చేస్తూ అందరినీ టెర్రరైజ్ చేస్తూ ఉంటాడు. అందికని ఈ టైటిలొచ్చింది' అన్నాను.

అర్ధం అయ్యీ కానట్టుగా ముఖాలు పెట్టారు వాళ్ళు.

అక్కడే కూచుని ఉన్న ఇంకొక శిష్యుడిని చూపిస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ రేపిస్టు. స్వగ్రామం నెల్లూరు' అన్నాను.

రెండడుగులు వెనక్కు వేశారు వాళ్ళు.

'భయపడకండి. ఆయనకూ కొంత టేస్టుంది. రేప్ అంటే తెలుగులో 'బలవంతం చెయ్యడం' కదా. తన ప్రెండ్స్ కి, బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ నా ఫిలాసఫీ బలవంతంగా చెబుతూ వాళ్ళని నా మతంలోకి మారుద్దామని బలవంతపు ప్రయత్నం చేస్తో ఉంటాడు, కాబట్టి ఈ టైటిల్' అన్నాను కూల్ గా.

'మీ మతమంటే?' అడిగాడు శ్రీ.

'రెటమతం' అన్నాను.

వాళ్ళు చాలా ఇబ్బందిగా ముఖాలు పెట్టారు. ఉండాలా అక్కడనుంచి కదలాలా అని తటపటాయిస్తున్నారు.

శ్రీ మాత్రం తెలివిగా, 'మరి మీ టైటిల్ ఏంటి?' అన్నాడు సరదాగా అన్నట్టు.

'స్పిరిట్యువల్ మర్డరిస్టు' అన్నాను స్పాంటేనియస్ గా.

షాకయ్యాడు నా మాటకి.

'అంటే, నన్ను ఫాలో  అయితే, మీ పాత వ్యక్తిత్వాన్ని చంపేసి కొత్త వ్యక్తిత్వాన్ని ఆ ప్లేసులో ఉంచుతానన్నమాట. అందుకే ఆ టైటిలు' అన్నాను.

'నాదొక అనుమానం అన్నయ్యా' అడిగాడు శ్రీ.

'చెప్పండి' అన్నాను నవ్వుతూ.

'ఈ టైటిల్సన్నీ ఎవరు పెట్టారన్నయ్య?' అడిగాడు

'నా శిష్యులకు నేనే పెడతాను. నాకు మాత్రం అమ్మ పెట్టింది' అన్నాను మళ్ళీ సీరియస్ గా.

'మీరు చెప్పేది నిజమేనా అన్నయ్యా?' అడిగాడు శ్రీ అనుమానంగా.

'ఆయన టైటిలు నిజమైతే మావీ నిజాలే' అన్నాను 32 పళ్ళూ కనిపించేలాగా ఇకిలిస్తూ.

ఏమనుకున్నారో ఏమో, 'ఉంటామండీ, పనులున్నాయి' అని గబగబా నడుస్తూ వాళ్లిద్దరూ మాయమైపోయారు.

నేనూ కుర్చీలోంచి లేచి, 'ఉంటాం మరి. మళ్ళీ కలుద్దాం' అని శ్రీ తో చెబుతూ. 'లేవండి పోదాం' అన్నా శిష్యులతో.

అందరం నవ్వుకుంటూ ఇంటికొచ్చేశాం.

ఆ తర్వాత స్పిరిట్యువల్ డెంటిస్ట్ గాని,  శ్రీ గాని మాకు మళ్ళీ కనిపిస్తే ఒట్టు !

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 55 (స్పిరిట్యువల్ డెంటిస్ట్) "

4, ఏప్రిల్ 2023, మంగళవారం

ఆశ్రమవాస పర్వం ప్రారంభం

కొంచం పని ఉండటంతో 31 ఉదయాన్నే జిల్లెళ్ళమూడి నుంచి గుంటూరు వచ్చేశాము. ఒకటో తేదీ చైత్ర శుక్ల ఏకాదశి, అమ్మ పుట్టినరోజు. ఆ రోజుకు జిల్లెళ్ళమూడిలో లేము. కారణం? భరించలేనంత సౌండ్ పొల్యూషన్. ఒకేసారి పది మైకులు మోగుతున్నాయి. పండుగ అంటే, మైకులు పెట్టి గోలచెయ్యడం ఒక్కటే నేడు ఇండియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఎవరికీ సివిక్ సెన్స్ గాని, కామన్ సెన్స్ గాని కనిపించడం లేదు. 

ఈ కోణంలో చూస్తే అమెరికా ఒక స్వర్గమే అని చెప్పాలి. ప్రశాంతంగా,  ఎటువంటి చప్పుళ్ళు లేకుండా ఉండాలనుకునేవారికి అక్కడున్నంత సౌకర్యం ఇండియాలో లేదు.  ఒక కారు హారన్ సౌండు కూడా వినకుండా ఆర్నెల్లు అమెరికాలో ఉన్నాను. ఇండియాలో అడుగుపెట్టిన మరుక్షణం అన్నివైపులనుంచీ ధ్వని కాలుష్యం మీదపడి దౌర్జన్యం చేస్తోంది. ఏం చేస్తాం? కొన్ని కావాలంటే కొన్ని ఒదులుకోక తప్పదు మరి !

అనకూడదు గాని, జిల్లెళ్ళమూడి నుండి బయటకు రాగానే, ఒక్కసారిగా మైకుల గోల మాయమై, ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నరకం నుంచి బయటపడిన ఫీలింగ్ కలిగింది.

అమ్మ ఉన్నప్పుడూ ఆమెను ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు ఈ భక్తులు. పోయిన తర్వాత కూడా ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఈ భక్తుల పైనా, ఇండియా వ్యవస్థ పైనా చాలా చీదరేసింది. స్వర్గాన్ని నరకంగా మార్చడంలో ఇండియా ప్రజలు, వ్యవస్థలు ముందుంటాయి.

గుంటూరులో రెండు రోజులుండి పనులు చూసుకుని, ఈరోజున గుంటూరుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పి ఒంగోలు దగ్గర చంద్రపాడు ఆశ్రమానికి వచ్చేశాము. అయిదుగురితో ఆశ్రమం మొదలైంది. 

ప్రస్తుతం ఇక్కడ నేల తప్ప ఏమీ లేదు. అయితేనేం? జనాల గోలకు, మైకుల గోలకు, వాహనాల రణగొణధ్వనులకు, దుమ్ముకు,  సిటీ వేడికి, వీటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉండే మరోప్రపంచం ఇది. అయితే, అన్ని సౌకర్యాలకూ అలవాటు పడినవారు ఇక్కడ ఉండటం, అడవిలో ఉన్నట్లే ఉంటుంది. కానీ, మనుషులకు, వాళ్ళ నిమ్నత్వాలకు, ప్రపంచపు గోలకు దూరంగా బ్రతకాలనుకునే మాలాంటి కొంతమందికి మాత్రం ఇది స్వర్గమే.

ఏదేమైనా, ఏ విధమైన సౌకర్యాలూ లేకపోయినా, అవసరమైతే పొలం మట్టిలోనే పడుకోవలసి వచ్చినా, రేపటినుంచి ఇక్కడే ఉంటూ, ఒక నెలా రెండు నెలల్లో ఆశ్రమానికి ఒక ఆకారం తేవాలని సంకల్పించాను.

అయిదో తేదీ నుంచి, అయిదుగురితో పంచవటి ఆశ్రమం మొదలౌతోంది 

కొన్నేళ్ల నుంచీ నేను చెబుతూ వస్తున్న ఆశ్రమవాసపర్వం ఈ విధంగా ప్రారంభం అయింది.





read more " ఆశ్రమవాస పర్వం ప్రారంభం "

జిల్లెళ్ళమూడి స్మృతులు - 54 (వడ్లగింజలో బియ్యపు గింజ)

'జాగ్రత్తగా వినండి' అంటూ చెప్పడం మొదలుపెట్టాను.

పదకొండో శతాబ్దం నాటికి మనదేశంలోని వేదం, వేదాంతం, యోగం, పురాణం, తంత్రం అన్నీ కలగలసి ఒక క్రొత్త రూపాన్ని ధరించాయి. ఈ అన్నింటినీ సమన్వయపరచి ఒకే బోధనగా బోధించాలని, పల్లెలలోని సామాన్యులకు కూడా వీటి సారాన్ని అందుబాటులోకి తేవాలని మన దేశంలోని అనేకమంది గురువులు మహనీయులు తలపోశారు. ఉత్తర భారతంలో నాధసంప్రదాయం గాని, దక్షిణాదిన సిద్ధసంప్రదాయం గాని, బైరాగులు, గోసాయిలు, యోగులు, అందరూ వారివారి ప్రాంతాలలో పల్లెటూర్లలో  చేసినది అదే. వీరు వ్రాసిన, చెప్పిన బోధనలు తత్త్వాలని, గాధలని, చిటికెలని, జానపదగీతాలని అనేక రూపాలలో పై అన్నింటినీ, అంటే వేదవేదాంతాలను, యోగశాస్త్రాన్ని, తంత్రశాస్త్రాన్ని, పురాణవిజ్ఞానాన్ని అన్నింటినీ సమన్వయం చేస్తూ చెప్పబడినాయి. మన దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ, ప్రాంతంలోనూ ఈ మార్పు వచ్చింది. అనేకమంది మహనీయులు ఎక్కడికక్కడే దీనిని ఒక  ఉద్యమం లాగా తీసుకొచ్చారు. పల్లెపల్లెలకూ దీనిని పాకించారు. తద్వారా ఏమైంది? అత్యున్నతమైన వేదాంత, యోగ, తంత్ర, సిద్ధమార్గాల భావనలు, సాధనలు అన్నీ గ్రామ్య భాషలలో  అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీని ప్రభావం వల్లనే ఇస్లాం మన దేశంలో వ్యాప్తి చెందలేకపోయింది.

ప్రాచీన వేదకాలంలో బుద్ధుడు చేసినదానినే మధ్యయుగాలలో వీరు చేశారు. ఉపనిషత్తులలోని జ్ఞానభాగాన్ని లోకల్ గా మాట్లాడుకునే పాళీభాషలో బుద్ధుడు గ్రామగ్రామాలలో సరళంగా బోధించాడు. అదే విధంగా పదకొండో శతాబ్దం తర్వాత ఎందరో మహనీయులు ఇదే పనిని దేశమంతటా చేశారు.  ఈ మూమెంట్ నేపాల్ నుంచి శ్రీలంక వరకూ, గుజరాత్ నుండి, బెంగాల్ వరకూ ఒక వరదలాగా వచ్చింది

మన తెలుగునేలలో ముఖ్యంగా వేమనయోగి, బ్రహ్మంగారు, స్వాత్మారామ యోగి, శ్రీనివాస యోగి, ఇంకా ఎందరో అవధూతలు, బైరాగులు దీనిని ప్రచారం చేశారు. ఈ విధంగా వేదవేదాంత భావనలు పల్లెపల్లెలకూ పాకి,  సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చాయి.  పరాయి మతాల వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకున్నాయి.

అలాంటిదే ఈ అచల సంప్రదాయం కూడా.

అచలానికీ అద్వైతానికి ఏమీ భేదం లేదు. పదాలను అర్ధం చేసుకోవడంలోనే ఉన్న చిక్కంతా ఉంది. అఖండ అద్వయ అనంతమైన ఎరుక అనేది సగుణ సమాధి. అచలం అనేది నిర్గుణసమాధి. సగుణంలో, సగుణాన్ని గ్రహించేవాడు ఉంటాడు. నిర్గుణంలో వాడూ లయమౌతాడు. అంతే.

ప్రకృతి-పురుష వివేకాన్ని చెప్పేది సాంఖ్యం. ఇది మన తాత్విక చింతనలన్నింటికీ మూలం. కపిలమహర్షి దీనిని చెప్పినవాడు. ఓంకారోపాసనకే తారకమని పేరు. దీనిని మాండూక్యోపనిషత్తు ప్రతిపాదించింది. మనకు తెలిసిన మూడవస్థలను దాటి, వాటికి అతీతమైన నాలుగోదానిని (తురీయాన్ని) అందుకోవడం ఈ దారి. శ్రీరామనామాన్ని కూడా తారకమంత్రమనే అంటారు. ఓంకారం వైదికమైతే, రామనామం పౌరాణికం. రామనామ జపం కూడా  తురీయస్థితిని అందిస్తుంది. ఇకపోతే, మనస్సుకు అతీతమైన స్థితిని అందుకోవడం అమనస్కం. ఇందులో మనోలయం, మనోనాశం అని రెండు మెట్లుంటాయి. క్లుప్తంగా, సాంఖ్య, తారక, అమనస్క యోగాలంటే ఇవే.

అయితే, వీటిని గ్రంధాలు చదివి అర్ధం చేసుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు. సాధన చేసి అనుభవంలో వీటిని పొందాలి. లేకపోతే గ్రంధాలను మోస్తున్న గాడిదమాదిరి అవుతుంది మీ పని. నేటి టీవీ ఉపన్యాసకులు, పండితులు అందరూ, అనుభవజ్ఞానం లేని సామాన్యులే.  వీరికి కావలసింది అనుభవజ్ఞానం కాదు. డబ్బు మాత్రమే. యూట్యూబులో వీటిమీద వీడియోలు చేసుకోవడం వల్ల, వారికి డబ్బులు దండిగా రావచ్చు, కానీ అనుభవజ్ఞానం మాత్రం ఎన్నటికీ అందదు. దానికి దారి వేరే ఉంది.

సగుణబ్రహ్మ సమాధిని అచల మార్గానుసారులు అద్వైతం అంటున్నారు. నిర్గుణసమాధిని అచలం అంటున్నారు. ఈ సమాధి స్థితులను అందించే అనేక యోగ-తంత్ర దీక్షలను పెద్దలమార్గం అంటున్నారు. పేర్లు మార్పు గాని ఉన్న తత్త్వం ఒకటే.

సగుణం, నిర్గుణం, సహజం - ఇదీ దారి. చలాన్ని దాటి ఎరుకను పొందటం అద్వైతం. ఎరుక కూడా లేని స్థితి అచలం. చలంలో అచలాన్ని అందుకోవడం సహజం.

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలను దాటిన తురీయం, అద్వైతం. దానిని మించిన తురీయాతీతం, అచలం. జాగ్రత్ లో తురీయాతీతం సహజం.

న పంచవటి సాధనామార్గంలో మీకు ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కొద్దిరోజులలో ప్రారంభం కాబోతున్న మన ఆశ్రమంలో ఇవన్నీ మీకు నేర్పించబడతాయి. ఉత్త థియరీ మాత్రమే కాదు. ప్రాక్టికల్ గా వీటిని ఎలా సాధన చేయాలో మీకు నేర్పిస్తాను. సాధన చేయిస్తాను. ఈ స్థితులను మీరు ప్రత్యక్షానుభూతిలో అందుకుంటారు. అప్పుడు మీకు అద్వైతం, అచలం మొదలైనవి ఏమిటో డైరెక్ట్ గా అర్ధమౌతుంది.

అందరిలాగా కాకమ్మకబుర్లు చెప్పడానికి కాదు ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా ఇవన్నీ వ్రాస్తూ వస్తున్నది. మన ఆశ్రమం వీటన్నిటినీ సాకారం చేస్తుంది.

కొనఊపిరితో ఉన్న ఈ సాధనామార్గాలన్నీ శ్రీ రామకృష్ణుల కరుణతోనే మళ్ళీ బ్రతికి బట్టకట్టాయి. ఆయనను ఆరాధించి అనుసరించే  మనకు ఇవన్నీ తెలియనివేమీ కావు.  మన అరచేతిలోనే ఇవన్నీ ఉన్నాయి. ముందుముందు మీరే చూస్తారు' అన్నాను.

వింటున్న శిష్యుల ముఖాలు ఆనందంతో వికసించాయి.

'ఇంతేనా? ఆ పెద్దపెద్ద పేర్లన్నీ విని ఇంకా ఏదో అనుకున్నాము. ఇదంతా మీ పుస్తకాలలో మీరు ఇప్పటిదాకా వ్రాసినదేగా?' అన్నారు. 

'అంతేమరి. అర్ధం కానంతవరకూ బ్రహ్మవిద్య. అర్ధమైతే కూసువిద్య. వడ్లగింజలో బియ్యపుగింజ అంతే. ఇక రెస్టు తీసుకోండి లంచ్ టైం దాకా' అన్నాను.

అంతటితో సంభాషణను ఆపి నిద్రకుపక్రమించాం అందరం.

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 54 (వడ్లగింజలో బియ్యపు గింజ) "

3, ఏప్రిల్ 2023, సోమవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 53 (అచలం - అద్వైతం - పెద్దల బోధ)

ఒకరోజున పందిళ్ళలో టిఫిన్ చేసి, టీకోసం క్యూలో నిలబ miడి ఉన్నపుడు, శ్రీకాంత్ కనిపించాడు. తను విశ్వజననీ పరిషత్ ఆఫీసులో వీడియో సెక్షన్ చూసుకుంటూ ఉంటాడు. పదేళ్లనుంచీ నా బ్లాగు చదువుతూ ఉంటాడు. జిల్లెళ్ళమూడిలో ఎప్పుడు ఎదురైనా చాలా అభిమానంగా పలకరిస్తారు.

'ఎప్పుడొచ్చారు?' అడిగాడు.

'వారమైంది' అన్నాను.

'అయ్యో. నాకు తెలీదు. తెలిస్తే వచ్చి కలిసేవాణ్ని' అన్నాడు నొచ్చుకుంటూ. 

'నేనస్సలు బయటకు రావడం లేదు.  ఎవరితోనూ కలవడం లేదు. ఆఫీసు వైపు ఒక్కసారి కూడా రాలేదు ' అన్నాను.

టీ త్రాగుతూ ఒకవైపున నిలబడి మాట్లాడుకున్నాం. మూర్తి, అఖిల, శ్రీమతి, సంధ్య ఒకప్రక్కగా నిలబడి వింటున్నారు.

'మీ బ్లాగును నేను చాలా ఇష్టపడతాను, నిక్కచ్చిగా సూటిగా ఉండే మీ భావాలు నాకు చాలా నచ్చుతాయి' అన్నాడు.

నవ్వాను టీ సేవిస్తూ

'కానీ మీతో మాట్లాడాలంటే ఒకటే భయం బ్లాగులో రాసేస్తారేమో అని' అన్నాడు నవ్వుతూ.

'మంచిగా మాట్లాడితే మంచిగానే వ్రాస్తాను. వేషాలేస్తేనే, ఎలా వ్రాయాలో అలా వ్రాస్తాను. నీకా భయం అవసరం లేదులే' అన్నాను.

'మొదట్లో విశ్వాత్మ గారిని గురించి మీరు వ్రాసిన పోస్టులు చదివి అప్పటినుంచీ మీ బ్లాగు చదవడం మొదటుపెట్టాను.  విశ్వాత్మ గారితో నాకు బాగా పరిచయం ఉండేది. ఆయన నన్ను చాలా అభిమానించేవారు. ఫోన్లో రోజూ టచ్లో ఉండేవారు. ఎంతలా అంటే, నేను ఇక్కడ ఆయన్ను అనుకుంటే మరుక్షణం ఆయన నుంచి ఫోనొచ్చేది. 'మీకెలా తెలుస్తుంది? నేను మిమ్మల్ని తలుచుకున్నట్లు?' అని ఆయన్ను అడిగాను. దానికి ఆయన, 'నేను ఎవరితో మాట్లాడుతున్నానో వారి ముఖంలో నీ ముఖం కనిపిస్తుంది ఆ క్షణంలో. వెంటనే నీకు ఫోన్ చేస్తాను' అని చెప్పారు' అన్నాడు.

నేను మౌనంగా టీ త్రాగుతున్నాను.

గుడివాడ, బందరు, చల్లపల్లి ప్రాంతాలలో నేను కొంతకాలం పాటు ఉన్నాను. అక్కడున్న అచల సంప్రదాయంతో నాకు బాగా పరిచయం ఉంది' అన్నాడు

'అలాగా' అన్నాను

'అచల సాంప్రదాయం గురించి మీకు తెలుసా?' అడిగాడు

'తెలుసు. చల్లపల్లి బ్యాచ్ ఇక్కడ కూడా ఉన్నారు కదా కొంతమంది' అన్నాను నవ్వుతూ.

'అవును ఉన్నారు. అద్వైతం  కంటే అచలం గొప్పదని వాళ్లంటారు' అన్నాడు

'ఏ విధంగా?' అన్నాను

'అఖండమైన ఎరుకను అద్వైతం అంటారు కదా. ఆ ఎరుకను కూడా దాటినదే అచలమని వాళ్ళ భావన.  ఎరుకను కలిగించేవాడు సద్గురువు కాడు. ఎరుకనుండి విడిపించేవాడే సద్గురువని అచలం అంటుంది. మీరు సద్గురువును గురించి చెబుతూ, 'సత్ ను దర్శింపజేసేవాడే సద్గురువు' అన్నారు కదా ! ఆ మాట నాకు చాలా నచ్చింది' అన్నాడు సంతోషంతో ముఖం వెలిగిపోతూ.

'అవును అంతే కదా మరి !' అన్నాను.

'అచల సాంప్రదాయం గురించి తెలుసుకుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. అది మన దేశంలో పల్లెపల్లెల్లోనూ తత్త్వాల రూపంలో ఉంది. అసలు గురుభక్తి అనేదానిని వారినుంచి తెలుసుకోవాలి. గురు అనుగ్రహం కలిగే వరకూ ఎన్నేళ్ళైనా అలా గురువును సేవిస్తూ ఓపికగా ఎదురు చూస్తారు వాళ్ళు. ఈలోపల ప్రతిరోజూ గురువును దర్శిస్తూ, దేహం, ఇంద్రియములు, మనస్సు, ఎరుక మొదలైనవాటిగురించి తెలుసుకుంటూ ఉంటారు. సాంఖ్యం, అమనస్కం, తారకం మొదలైనవాటిని వారికి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. అచలాన్ని అందుకున్న యోగి చాలా విలక్షణంగా ఉంటాడట. చాలా నిదానంగా, అడుగులో అడుగేసున్నట్లుగా అతను నడుస్తాడట. అతన్ని కనుక్కోవడం చాలా కష్టమంటారు' అన్నాడు.

'అడుగులో అడుగేసినంత మాత్రాన అచలాన్ని అందుకున్నట్లు ఏమీకాదు. ఒకవేళ అలాంటివాడు ఎదురైతే నిజంగా వాళ్ళు గుర్తించగలరా?' అడిగాను.

' ఏమో మరి' అన్నాడు.

'వాళ్ళ సాధనావిధానం ఏమిటి? ఎరుకను గురించి ఉత్తగా తెలుసుకున్నంత మాత్రాన అది ఎలా కలుగుతుంది? బుద్ధిపరమైన అవగాహన వేరు, అనుభవం వేరు కదా? ఉత్త భజనలతో, తత్వాలు పాడుకోవడంతో, చర్చలతో అది అందుతుందా? అఖండమైన అనంతమైన ఎరుక అనేది ముందు అందితే కదా, దానిని కూడా దాటి అచలం లోకి వెళ్ళేది? ఈ ఎరుక ఎలా అందుతుంది? దానిని అందుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు? ' అన్నాను

'పెద్దలబోధలో దీనికి మార్గాలున్నాయని విన్నాను. అద్వైతాన్ని మించినది అచలం అయితే, అచలాన్ని మించినది పెద్దల బోధ అంటారు. సాంఖ్యము, తారకము, అమనస్కము దానికి దారులు. ఎంతో పుణ్యాత్ములకు గానీ పెద్దలబోధ అందదని నేను విన్నాను. అందులో దర్పణదీక్ష మొదలైన దీక్షలుంటాయిట' అన్నాడు.

'ఏమౌతుంది దర్పణదీక్షలో?' అడిగాను

'అది రెండు విధాలుగా ఉంటుందని నేను విన్నాను. కన్నుకు కన్ను మనసుకు మనసు అని ఉపనిషత్తులు అన్నాయి కదా. బింబ ప్రతిబింబ న్యాయంతో, తానూ ఈ సృష్టీ ఇవన్నీ బ్రహ్మానికి ప్రతిబింబాలే అని అర్ధమౌతుంది.  ఇంకొక విధానంలో అయితే, సృష్టి మొత్తాన్నీ చూస్తున్న ఒక కన్ను వారికి కనిపిస్తుందట. దానినుంచి చూస్తే సృష్టి యొక్క నిజతత్వం వారికి దర్శనమౌతుందట. ఈ విధంగా నేను విన్నాను. రెండు విధాలుగానూ  దీనిని దర్శించినవారు ఉన్నారు' అన్నాడు.

'ఒకటి జ్ఞానదీక్ష , మరొకటి యోగదీక్ష. ఇంతేగా?' అన్నాను. 

'గతంలో మన తెలుగునేలలో ప్రతి పల్లెలోనూ అచల సాంప్రదాయం ఉండేది. అయితే కాలక్రమేణా అది పెడదారి పట్టిందట. గురుసాంగత్యం, గురుభక్తి అనేవి బాగా ముదిరిపోయి, గురువుతో శయనించడం అనేదాకా వచ్చిందట. ఇటువంటి పెడధోరణులను ఖండిస్తూ మలయాళ స్వాములవారు 'శుష్కవేదాంత తమో భాస్కరము' అనే గ్రంధాన్ని వ్రాశారు. అందులో ఈ భ్రష్ట సాంప్రదాయాలను చీల్చి చెండాడారు. పల్లెటూర్లలో ఉన్న అచలసంప్రదాయాలను అన్నింటినీ ఈ గ్రంధం తుడిచిపెట్టేసింది. అప్పట్లో ఆ గ్రంధం అంత శక్తివంతంగా పనిచేసిందట' అన్నాడుఆశ్చర్యంగా. 

'నేటి ఇంటర్ నెట్ లాగా అన్నమాట' అన్నాను.

'ఇటువంటి పెడపోకడలతో అచల సంప్రదాయం కాలక్రమేణా కనుమరుగైపోయింది' అన్నాడు. 

నవ్వాను.

'విను శ్రీకాంత్. ఏదీ కనుమరుగు కాలేదు. అన్నీ ఉన్నాయి. ఎవడికి అర్హతుందో, వాడికి అందుతాయి. ఆధ్యాత్మికమార్గంలో అర్హతే ప్రధానం.

గురువుతో శయనించడం అనేది కూడా తప్పేమీ కాదు. అది కూడా ఒక ఆమోదయోగ్యమైన తాంత్రిక సాధనావిధానమే. తాంత్రికబౌద్ధాన్ని అనుసరించే టిబెటన్ లామాలు చాలామంది ఈ సాధనను అభ్యసిస్తారు.  సాధనామార్గాన్ని, దాని విభిన్న విధానాలను, వాటి రహస్యాలను తెలుసుకోలేని, తెలిసీ తెలియని పిచ్చిలోకులు దానిగురించి ఏదేదో అనుకుంటూ ఉంటారు. కౌలాచారం, వామాచారాలలో అది సమ్మతమే. అయితే, అది దిగజారకూడదు. గురువుతో శారీరిక, ప్రాణిక, మానసిక ఏకత్వం ఏర్పడినపుడు అతనితో శయనించడం తప్పేమీ కాదు. సాధనామార్గపు రహస్యదారులలో నడిచేవాళ్లకు, లోకులు పెట్టుకున్న పిచ్చిరూల్స్ వర్తించవు. పుస్తకాలు చదువుతూ, నెట్ చూస్తూ, ముచ్చట్లు చెప్పుకుంటూ, అదే పెద్ద గొప్పగా భావించే సామాన్యజనం, అంతరిక సాధనామార్గపు లోతుపాతులను ఏనాటికీ అర్ధం చేసుకోలేరు. అదంతే' అన్నాను.

'అవును. రామకృష్ణులవారు కూడా 'ఇంటికి అనేక దారులుంటాయి. అందులో అది దొడ్డిదారివంటిది' అన్నారు.  దీనిని నేను చదివాను. మీరు కూడా నిత్యానంద రంజితల ఉదంతాన్ని సమర్ధించారు ఒక పోస్టులో. అది కూడా నాకు నచ్చింది' అన్నాడు.

'అవును. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, విమర్శించడానికి మనమెవరం? వాళ్లిద్దరూ మేజర్లు. ఈ మధ్య వస్తున్న సుప్రీంకోర్టు తీర్పులు చూస్తున్నావా? అవికూడా ఇలాంటి ధోరణులను సమర్ధిస్తున్నాయి. పైగా, అవి తంత్రమార్గపు రహస్య సాధనలు. వాటివరకూ అవి వ్యాలిడ్ సాధనలే. అయితే సాధన సాధనగా ఉంటే పరవాలేదు. ఆ పేరుతో దిగజారుడుతనం మొదలైతే అది సమర్ధనీయం కాదు. సాధనకూ, ఆ పేరుతో ఎంజాయ్ చెయ్యడానికి మధ్య నున్న సున్నితమైన గీతను నువ్వు గుర్తించాలి. ఆ సాధన అందరికీ సరిపోదు. దీనిని కూడా స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.' అన్నాను.

'ఆ విధంగా అచలసంప్రదాయం కనుమరుగై పోయింది. అయితే పల్లెల్లో ఈనాటికీ సజీవంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలలో ఉంది. దీనిని పాటించేవారిలో కంసాలివారు ఎక్కువగా ఉంటారు' అన్నాడు.

'అవును. బ్రహ్మంగారి తత్వాలలో ఈ మూడు సాధనా విధానాలనూ నువ్వు చూడవచ్చు. లింగమూర్తి గురుమూర్తి పంతులుగారి 'సీతారామాంజనేయ సంవాదం' లో కూడా ఇవి కన్పిస్తాయి. ఇంకో విషయం విను. అచలం, అద్వైతం, పెద్దలబోధ ఈ మూడూ  మన పంచవటి సాధనావిధానంలో అంతర్భాగాలుగా ఉన్నాయి. ఇవి మాకు తెలిసినవే. క్రొత్తవి కావు. శ్రీ రామకృష్ణులను దాటి ఏదీ లేదు' అన్నాను.

ఇంకా ఏదో చెప్పాలని చాలా ఉత్సాహంతో ఉన్నాడు శ్రీకాంత్. కానీ అవతల ఆఫీసులో పని ఉన్నట్లుందిఉత్సవాలు కదా! అదనపు బాధ్యతలున్నట్టున్నాయి. వెళ్ళాలి లాగా ఉంది. ఆ కాస్త సమయంలోనే తనలో ఉన్న భావాలన్నీ  నాతో చెప్పెయ్యాలని చాలా హడావుడి పడుతున్నాడు.

నేనది గమనించి, 'తొందరేమీ లేదు శ్రీకాంత్. హడావుడి పడకు. ముందు నీ పని చూసుకో. నువ్వు ఖాళీగా ఉన్నపుడు మా ఇంటికి రా. మాట్లాడుకుందాం. ఇది చాలా లోతైన, విశాలమైన సబ్జెక్ట్. కాసేపట్లో అయ్యేది కాదు. మాట్లాడుతూ పోతే రోజులు పడుతుంది' అన్నాను.

'సరేనండి. ఆఫీసులో చాలా పనుంది. ఈ ఈవెంట్ అంతా వీడియో కవరేజి చెయ్యాలి. బయటవాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, కొన్ని ఈవెంట్స్ నేనే కవర్ చెయ్యాలి. ఉంటామరి. నమస్తే' అని తన పని మీద వెళ్ళిపోయాడు.

తాపీగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేశాము.

కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యాక, 'ఈ సంప్రదాయాలన్నీ ఏమిటి గురువుగారు?' అడిగాడు మూర్తి.

మిగతావాళ్ళు శ్రద్దగా వింటున్నారు.

'ఏమీ లేదు. చెప్తా వినండి' అంటూ చెప్పడం సాగించాను.
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 53 (అచలం - అద్వైతం - పెద్దల బోధ) "