“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జులై 2019, గురువారం

కలబురిగి కబుర్లు - 5 (తాంత్రిక బౌద్ధం)

మళ్ళీ ఒక వారం పాటు కలబురిగిలో నివాసం ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతిరోజూ మా అమ్మాయినడిగి తన స్కూటర్ తీసుకుని, బుద్ధవిహార్ దర్శనం, అక్కడి ధ్యానమందిరంలో కూచుని ధ్యానం చెయ్యడం, లైబ్రరీలో కూచుని బౌద్ధగ్రంధాల అధ్యయనం చెయ్యడం యధావిధిగా జరిగింది. ఇవి తప్ప ఆ ఊరిలో ఇంకేమీ నేను చూడలేదు.

ఊరికి ఏడు కి.మీ దూరంలో విశాలమైన పొలాల మధ్యన నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్న కొండగుట్ట పైన ఉన్న బుద్ధవిహార్ చాలా పెద్ద పాలరాతి కట్టడం. చెట్లూ తోటలతో విశాలంగా ఉంటుంది. దానిలో ఒక మూలన ఉంటుంది ఈ లైబ్రరీ భవనం. ఇవన్నీ కట్టడానికి, మెయిన్ రోడ్డు నుంచి రెండు కి.మీ పొడవున పొలాలలోకి పక్కా సిమెంట్ రోడ్డు వెయ్యడానికి, ఎన్ని వందల కోట్లు ఖర్చయ్యాయో నాకైతే తెలీదు.

ఈ లైబ్రరీ చాలా పెద్ద భవనం. ఒక్కొక్క బీరువాలో కొన్నివందల పుస్తకాలు అక్కడ ఉన్నాయి. వాటిల్లో పాళీ మూలగ్రంధాలే గాక, నవీన కాలపు యూరోపియన్ అమెరికన్ స్కాలర్లు వ్రాసినవీ, టిబెటన్ లామాలు వ్రాసినవీ చాలామంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. మన ఫేవరేట్ టాపిక్ అయిన తాంత్రికబౌద్ధం మీద మంచి పుస్తకాలు చాలా కన్పించాయి అక్కడ.

నేనక్కడికి వెళ్ళిన రోజున సాయంత్రం నాలుగైంది. మబ్బులు పట్టి వర్షం పడుతోంది. అంత పెద్ద ప్రాంగణంలో లైబ్రరీ ఎక్కడో అర్ధం కాలేదు. లైబ్రరీకోసం వెతుక్కుంటూ వెళ్లి, "ఈ బిల్డింగ్ లో లైబ్రరీ ఎక్కడా?" అని, ఒక్కడినే తిరుగుతుంటే, ఒక మూలనున్న గదిలోనుంచి శవాకారంతో ఉన్న ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చి నన్ను అనుమానంగా చూచింది. ఆమె చంకలో ఒక రెండేళ్ళ పిల్లాడు ఈసురోమంటూ కూచుని చూస్తున్నాడు. మాల్ నూట్రిషన్ కు ప్రతిబింబాలుగా ఉన్నారు వాళ్ళిద్దరూ.

'లైబ్రరీ ఎల్లి ఇద్ది?' అడిగా కన్నడంలో.

'అల్లి. ఆ మూలదల్లి' అందా అమ్మాయి. అంటూ ఆ మూలడోర్ వైపు దారి తీసింది. అనుసరించా.

ఆ తలుపు తీసి విశాలమైన కారిడార్ లాగా ఉన్న ఒక పెద్ద హాల్లోకి అడుగు పెట్టింది ఆమె. ఆ హాలంతా లైట్లు లేకుండా చీకటిగా ఉంది. గోడలకు ఆనించి పెద్ద పెద్ద బీరువాలూ, వాటిల్లో వందలాది గ్రంధాలూ కనిపిస్తున్నాయి. ఆమె, ఆమెకు తోడుగా పిల్లాడు, నేను తప్ప అంత పెద్ద చీకటి హాల్లో ఎవరూ లేరు. అసలు, ఊరికి దాదాపు ఏడు కి.మీ.దూరంలో ఆ కొండమీద ఉన్న ఆ లైబ్రరీకి నాలాంటి పిచ్చోడు తప్ప ఇంకెవరూ రానట్లు నాకనిపించింది.

ఆమెకు తోడుగా కనీసం ఒక పిల్లాడున్నాడు. నాకు తోడు ఎవరూ లేరు.

మాట్లాడకుండా నిలబడి ఉన్న నన్ను చూస్తూ, రిజిస్టర్ ను ముందుకు తోసింది ఆమె. తన టేబుల్ దగ్గర ఉన్న లైటు వెలిగేటట్లు ఏదో స్విచ్ వేసింది. అంత పెద్ద చీకటి హాల్లో ఒక లైట్ మాత్రమే వెలిగి, అక్కడి భయానక వాతావరణాన్ని ఇంకా ఎక్కువ చేసింది. ఆ బుక్కులో నా పేరు వ్రాస్తూ పేజీలు  తిప్పి చూచాను. పన్నెండేళ్ళు అయింది ఆ లైబ్రరీ కట్టి. కనీసం రోజుకు ఒక్కడు కూడా వచ్చి ఆ పుస్తకాల ముఖం చూడటం లేదు. నా పేరు, వివరాలు అందులో వ్రాసి, బీరువాల వైపు నడిచాను. వాటిల్లో నుంచి నాక్కావలసిన పుస్తకాలు ఎంచుకుని ఆమెకు దూరంగా ఉన్న ఒక టేబిల్ దగ్గర కూచుని చదవడం సాగించాను.

పుస్తకం తెరిచానో లేదో కరెంట్ పోయింది. అంత పెద్ద భవనంలో ఆ చీకటి హాల్లో నేనూ ఆ దయ్యం లాంటి ఆమె, ఆమె దయ్యం పిల్లాడు, బయటేమో వర్షం, చదవబోతున్నది తంత్రం గురించి. "మంచి స్కేరీగా ఉందిరా బాబూ సెట్టింగ్" అనిపించింది. ఒక కిటికీ తెరిచి, దాని దగ్గరకు కుర్చీ లాక్కుని కూచుని ఆ గుడ్డి వెలుతురులోనే చదవడం మొదలుపెట్టాను.

మధ్యలో తలెత్తి దూరంగా తన టేబుల్ దగ్గర కూచున్న ఆమె వైపు చూచాను. ఆ చీకట్లో, పిల్లాడితో కూచుని వింతగా నావైపు చూస్తోంది ఆమె. "ఈ చీకట్లో ఈ వర్షంలో వీడెవడ్రా బాబూ, వచ్చి కూచుని ఈ పుస్తకాలు గుడ్డి వెలుతురులో చదువుతున్నాడు?' అన్నట్లుగా.

అదేమీ పట్టించుకోకుండా నా అధ్యయనం సాగించాను. రెండు గంటల తర్వాత ఇంకా చదువుతూ ఉంటే, ఏదో అలికిడి అయినట్లు అయితే, తల తిప్పి చూచాను. ఎప్పుడొచ్చిందో ఆమె సైలెంట్ గా వచ్చి నా వెనుకే నిలబడి ఉంది. అదేదో పాత తెలుగు సినిమాలో దయ్యం సీను గుర్తొచ్చింది.

'టైం ఆయిత్తు. హోగబేకు' అంది అదే దయ్యం గొంతుతో, భావరహితంగా ఉన్న ముఖంతో చూస్తూ.

'సరే' అంటూ లేచి, పుస్తకాలు యధావిధిగా బీరువాలో ఉంచి, రిజిస్టర్ లో డిటైల్స్ వ్రాసి బయటకు వచ్చి చూస్తే, వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షంలోనే తడుస్తూ ఆ చిన్న కొండ క్రిందకు దిగి నా స్కూటర్ దగ్గరకు వచ్చాను. వర్షం ఇంకా ఆగలేదు. అక్కడ కొంచం సేపు వేచి చూచి, వర్షం తగ్గాక, చదివిన విషయాలు నెమరు వేసుకుంటూ, ఇంటికి బయల్దేరాను.

ఇంటికొచ్చాక అనుమానం వచ్చింది. అసలా లైబ్రరీ ఉందా? లేక నా భ్రమా? ఆమె మనిషేనా? లేక దయ్యమా? ఏమీ అర్ధం కాలేదు. "రేపు మళ్ళీ వెళ్లి చూడాలి. అవన్నీ అక్కడే ఉంటే, నిజమని అర్ధం లేకపోతే ఆమె ఖచ్చితంగా దయ్యమే" అనుకున్నాను.

"నా పిచ్చిగానీ, బుద్దిస్ట్ టెంపుల్ లో దయ్యం ఎందుకుంటుంది?" అని మళ్ళీ అనుమానం వచ్చింది. అంతలోనే - "ఎందుకు కాకూడదు. అది బుద్ధిష్ట్ దయ్యం కావచ్చుగా" అని వచ్చిన నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది.

"రేపు చూద్దాంలే" అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాను.

(ఇంకా ఉంది)
read more " కలబురిగి కబుర్లు - 5 (తాంత్రిక బౌద్ధం) "

జిల్లెళ్ళమూడి స్మృతులు - 37 (మహిమలు అల్పవిశ్వాసుల కోసమే)

జిల్లెళ్ళమూడి అమ్మగారి దగ్గర ఒకాయన ఉండేవాడు. చాలాకాలం అమ్మను నమ్ముకుని ఉన్నప్పటికీ ఆయన జీవితంలో ఎప్పుడూ ఏ మహిమా, ఏ అద్భుతమూ జరగలేదు. చాలామంది భక్తులు మాత్రం అమ్మ దగ్గరకు వచ్చి, "మిమ్మల్ని నమ్మాక, ప్రార్దించాక, మాకీ అద్భుతం జరిగింది. మా జీవితంలో ఈ మహిమలు జరిగాయి' అంటూ రకరకాలైన సంఘటనలు చెబుతూ ఉండేవారు. అవన్నీ వినీ వినీ, 'ఒకవేళ తనలో ఏదైనా లోపం ఉందేమో? అందుకే తనకు ఏ అధ్బుతమూ జరగడం లేదని ' ఆయనకు అనుమానం వచ్చింది.

ఈ విషయమై అమ్మనే ఒకరోజున అడిగాడాయన.

'అమ్మా ! అందరూ వారి వారి జీవితాలలో ఎన్నెన్నో మహిమలు జరిగాయని చెబుతున్నారు. మరి నాకేమీ అలాంటి నిదర్శనాలు కనిపించడం లేదు. ఏంటిది?'

దానికి అమ్మ ఇలా జవాబిచ్చారు.

'విశ్వాసం లేనివాళ్ళకోసమే మహిమలు. అవి నీకెందుకు ?'

అమ్మ చెప్పిన ఈ మాటలో ఎంతో లోతైన అర్ధముంది. నేటి లోకానికి చెంపపెట్టు లాంటి మహత్తరమైన బోధ దాగి ఉంది. ఎందుకంటే నేటి భక్తులూ, మతాలూ అన్నీ ఆశిస్తున్నదీ, గొప్పగా చెబుతున్నదీ ఈ అద్భుతాలు మహిమల గురించే. కానీ నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతాలకు ఏమాత్రం విలువ లేదు.

అల్పవిశ్వాసుల విశ్వాసాన్ని ఎక్కువ చెయ్యడం కోసమే, మహనీయుల చేత మహిమలు చూపించబడతాయి. కాకపోతే, అలా మహిమలు చెయ్యడం వల్ల, అసలైన ప్రయోజనం నెరవేరక పోగా, ఎవరికోసమైతే ఆ మహిమలు చేశారో, వారు ఇంకా ఇంకా బురదలో కూరుకుపోయే ప్రమాదమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

ఇదెలా జరుగుతుందంటే - ఆ మహనీయులు చెబుతున్న మార్గం మీద దృష్టి తగ్గి, వారి మహత్యం మీద ధ్యాస ఎక్కువౌతుంది. దాని ఫలితంగా - "మనం ఎలా ఉన్నా పరవాలేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఏదన్నా ఉపద్రవం వచ్చినపుడు 'గీ' పెడితే ఆ కష్టాన్ని ఆయనే తీరుస్తాడు. కానీ ఆయన చెప్పినట్లు మనం ఉండవలసిన పనిలేదు. మన జీవితంలో మనిష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఆయన పటానికి పూజ చేస్తే చాలు" అనే దరిద్రపు మైండ్ సెట్ అలవాటు అవుతుంది ఈ భక్తులకు. ఇదే అతిపెద్ద ప్రమాదం. ప్రపంచం మొత్తంమీద భక్తులందరూ ఎక్కడ చూచినా ఇదే దరిద్రపు ఊబిలో దిగిపోయి ఉన్నారు.

'నేనెలా బ్రతికినా పరవాలేదు. ఎంత అధర్మంగా, ఎంత అవినీతిగా బ్రతికినా పరవాలేదు. దేవుణ్ణి నమ్మితే చాలు, లేదా ఎవడో ఒక గురువును నమ్మితే చాలు. ఇక నాకన్నీ విజయాలే." అనే మైండ్ సెట్ నేడు అందరిలోనూ ఉంది. ఆధ్యాత్మికలోకంలో ఇదే అతిపెద్ద ప్రమాదం.

ఇది ఆ మహనీయులకు తీవ్రమైన నిరాశను కలిగిస్తుంది. "నేను ఇన్నాళ్ళ బట్టీ చేస్తున్న బోధల ఫలితం ఇదా?" అని వారికి చాలా నిరుత్సాహమూ నిర్లిప్తతా కలుగుతాయి.

అసలు, అధ్బుతాలను, మహిమలను ఆశించడం ఒక పెద్ద తప్పు మాత్రమే కాదు, అది దురాశకు, అహంకారానికి చిహ్నం కూడా. ఏమీ చెయ్యకుండా తేరగా ఏదో కొట్టెయ్యాలని అనుకోవడమే దురాశ. "నేనింత భక్తుడిని, నాకు ఏదో అద్భుతం తప్పకుండా జరుగుతుంది. దేవుడు నన్ను కాకుంటే ఇంకెవరిని కరుణిస్తాడు?" అనుకోవడమే అహంకారం. నేటి సోకాల్డ్ భక్తులలో, ముఖ్యంగా షిర్డీ సాయిబాబా భక్తులలో ఈ చెడు లక్షణాలు చాలా ఎక్కువగా ఉండటాన్ని మనం గమనించవచ్చు.

నిజమైన భక్తునికి, నిజమైన విశ్వాసికి ఏ అద్భుతాలతోనూ పని లేదు. ఏ మహిమలనూ అతడు ఆశించకూడదు. ఏదో ఆశించి అతడు ఏ పూజలనూ చెయ్యకూడదు. ఇదే నిజమైన భక్తుని లక్షణం.

జిల్లెళ్ళమూడి అమ్మగారు చెప్పిన మాటలో ఏంతో గొప్ప అర్ధం ఉంది. నేటి లోకానికి చెంప చెళ్ళుమనిపించే మహత్తరమైన బోధన దాగుంది.

'అల్పవిశ్వాసులకోసమే మహిమలుగాని, అవి నీకెందుకు?' అంది అమ్మ. నిజమే కదూ !

కానీ, అమ్మ దగ్గర ఎంతోకాలం ఉండి ఆమె బోధనలు విని, తరువాత ఆమెకు దూరమై వేరే కుంపట్లు పెట్టుకుని గురువులుగా స్వామీజీలుగా సిద్దులుగా చెలామణీ అవుతున్న చాలామంది నేడు చేస్తున్న పని  ఏంటంటే - నోరుతెరిస్తే చాలు అద్భుతాలను, మహిమలను చెబుతూ ఊదరగొట్టడం.

అమ్మ దేనినైతే చెప్పిందో దాన్ని గాలికొదిలేసి, దేనినైతే వద్దన్నదో దానినే అనుసరిస్తున్నారు వీరందరూ !

చివరకి, నేటి అమ్మ భక్తులలో కూడా ఎక్కువమంది అమ్మ చేసిన మహత్యాల మీదే కధలు చెబుతున్నారు గాని, అమ్మ తాత్వికచిన్తననూ, అమ్మ జీవనవిధానాన్నీ చెప్పడం లేదు. తమతమ జీవన విధానాలలో అమ్మను ఏమాత్రమూ అనుసరించడం లేదు.

మాయాప్రభావం అంటే ఇది కాకపోతే మరేంటి?

వీరిలో అల్పవిశ్వాసులు ఎంతమంది? నిజమైన భక్తులు ఎంతమంది?
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 37 (మహిమలు అల్పవిశ్వాసుల కోసమే) "

2, జులై 2019, మంగళవారం

రెండవ లక్నో యాత్ర - 2

గెస్ట్ లెక్చరర్స్ లో డా. రాజేష్ హర్షవర్ధన్ ఒకరు. ఈయన లక్నో లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక విభాగానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. చాలా డిగ్రీలున్న ప్రముఖుడు. 'మెడికల్ వేస్ట్ మేనేజిమెంట్' అనే సబ్జెక్ట్ మీద ఈయన మాకు లెక్చర్ ఇచ్చారు. ఎక్కువగా పర్యావరణం గురించి, దానిపట్ల మనకున్న బాధ్యత గురించి, ప్రకృతిని కాపాడవలసిన అవసరం గురించి తాత్వికంగా మాట్లాడాడు. ఈయనకు మెడికల్ నాలెడ్జ్ తోడు మన భారతీయ వేదాంతం మీద మంచి అవగాహన ఉన్నట్లుగా తోచింది.

క్లాస్ అయిపోయింది. టీ బ్రేక్ సమయంలో అటెండర్ వచ్చి 'ప్రొఫెసర్ శుక్లా గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు' అన్నాడు.

నేను లేచి విశాలమైన లాన్స్ మీదుగా అడ్మిన్ బ్లాక్ కి నడుచుకుంటూ వెళ్లాను. నేను వెళ్లేసరికి ప్రొఫెసర్ శుక్లా గారు, డా. హర్షవర్ధన్ గారు కూర్చుని 'టీ' సేవిస్తున్నారు.

'రండి శర్మాజీ. వీరు డా. హర్షవర్ధన్ గారు' అంటూ శుక్లాగారు నాకు పరిచయం చేశారు.

నేనాయన్ని విష్ చేసి, 'మీ లెక్చర్ చాలా బాగుంది. మీకు పర్యావరణ పరిరక్షణ మీద మంచి అవగాహన ఉంది' అన్నాను.

ఆయన చిరునవ్వు నవ్వాడు.

అంతలో గ్రీన్ టీ వచ్చింది. దాన్ని సేవిస్తూ ఉండగా మాటలు సాగాయి.

'మీ వెబ్ సైట్ చూచాము. చాలా బాగుంది. డాక్టర్ గారు మీ ఇంగ్లీష్ బ్లాగ్ ఫాలో అవుతారట. క్లాస్ రూమ్ లో మిమ్మల్ని చూచి గుర్తుపట్టారు. నా రూమ్ కి రావడం తోనే, విషయం చెప్పారు. ఇద్దరం కలసి మీ వెబ్ సైట్ చూస్తున్నాము' అన్నారు శుక్లా గారు.

ఎదురుగా ఉన్న శుక్లా గారి లాప్ టాప్ వైపు చూచాను. 'ఆలోచనా తరంగాలు' బ్లాగ్ పేజి కనిపించింది. తెలుగు అర్ధం కాకపోయినా దాన్ని చూస్తున్నారు వాళ్ళు.

'మీ పుస్తకాలలో ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి కదా. అవి మాకు కావాలి, మీ సబ్జెక్ట్స్ మాకు చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.' అన్నాడాయన.

 'పంపిస్తాను. ఇంకా వస్తున్నాయి. అవైతే మీకు ఇంకా బాగా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి డాక్టర్ గారు' అన్నాను హర్షవర్ధన్ గారితో.

'ఏంటవి?' అన్నారు హర్షవర్ధన్ గారు.

'మెడికల్ ఆస్ట్రాలజీ' మీద పుస్తకం వ్రాస్తున్నాను. త్వరలో అయిపోతుంది. అందులో నూరు జాతకాలను విశ్లేషిస్తూ జలుబు నుంచి ఎయిడ్స్ వరకూ రకరకాల రోగాలు ఎలా వస్తాయో, అలా రావడానికి ఏయే గ్రహయోగాలు కారణాలు అవుతాయో వివరించాను. మీరు డాక్టర్ కదా, ఆ పుస్తకం మీకు బాగా నచ్చుతుంది' అన్నాను.

డా. హర్షవర్ధన్ గారు విభ్రమంగా చూచారు.

'చాలా బాగుంది. అంటే, మనుషుల మీద గ్రహాల ప్రభావం గురించి మీరు రీసెర్చి చేస్తున్నారన్న మాట' అన్నాడాయన.

'అవును. నా రీసెర్చి అంతా అదే' అన్నాను.

ముగ్గురం రిలాక్స్ గా కూచుని టీ సేవిస్తూ మాట్లాడుకుంటున్నాం.

'ఈ సబ్జెక్ట్ గురించి కొంత క్లుప్తంగా చెప్పగలరా?' అడిగాడాయన.

'ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను వినండి. ఆడవారి మెన్సస్ కీ, చంద్రుని మూమెంట్ కీ డైరెక్ట్ సంబంధం ఉన్నది. రెండూ సరిగ్గా 28.5 రోజులలో జరుగుతాయి. ఆడవారు cycle based beings. సముద్రం ఆటుపోట్లకు గురైనట్లు అందుకే వారు ఎక్కువగా చెదిరిపోతూ ఉంటారు. దీనికి చంద్రుని స్థితులు కారణం. ఒక స్త్రీ పుట్టిన తేదీ తెలిస్తే, ప్రతినెలా ఆమెకు మెన్సస్ ఏ రోజు వస్తుందో కరెక్ట్ గా చెప్పవచ్చు.' అన్నాను.

'అవును. ఇది నాకు తెలుసు. ఆడవారిలో ఇదొక్కటే సైకిల్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి. వారి జీవితమే అనేక సైకిల్స్ లో సాగుతూ ఉంటుంది. మెడికల్ గా కూడా ఇది ప్రూవ్ అయింది.' అన్నాడాయన. 

'మగవారు కూడా అంతే, అయితే గ్రహప్రభావం వీరి మీద ఇంకొక రకంగా పనిచేస్తుంది. మళ్ళీ ఆడవారిలోనూ మగవారిలోనూ జనరల్ ప్రభావం వేరు. వారి వారి జాతకాన్ని బట్టి వ్యక్తిగత ప్రభావాలు వేరు. ఇదంతా నేను చాలా కాలం నుంచీ పరిశోదిస్తున్నాను' అన్నాను.

మధ్యలో కల్పించుకుంటూ శుక్లా గారు ' అసలు ఇన్ని పనులు చెయ్యడానికి మీకు సమయం ఎక్కడుంటుంది?' అన్నారు ఆశ్చర్యంగా.

'అదే నా జాతకం' అన్నాను నవ్వుతూ.

వాళ్ళు కూడా పెద్దగా నవ్వేశారు.

'శర్మాజీ. మీకు ఒక జాతకం ఇస్తాను. దానిని చూచి కొన్ని వివరాలు నాకు చెప్పాలి' అన్నారు శుక్లాగారు.

ఉత్త మాటలెందుకు? వీరికి కొంత ప్రూఫ్ చూపిద్దామని అనిపించింది. మనసులోనే ఆ సమయానికున్న ప్రశ్నచక్రాన్ని గమనించాను. లగ్నం నుంచి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. లగ్నాధిపతిని చూస్తున్నాడు. శుక్రుడు బలమైన స్థితిలో ఉన్నాడు.

'మీరు అడగాలనుకుంటున్నది మీ భార్య గురించి' అన్నాను.

త్రాగుతున్న టీ కప్పును టేబిల్ మీద ఉంచాడు శుక్లాగారు.

'ఇంకా చెప్పండి?' అన్నాడు.

'ఆమె ఆరోగ్యం గురించి మీరు అడగాలనుకుంటున్నారు' అన్నాను.

కాసేపు మౌనంగా ఉన్న ఆయన ఇలా అన్నాడు - 'శర్మాజీ. నేనేమీ ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే, మా బాబాయి గారు మంచి జ్యోతిష్కుడు. ఆయన దగ్గర ఇలాంటి విచిత్రాలు చాలా చూచాను. మీరు సరిగానే ఊహించారు.' అంటూ ఆమె జనన వివరాలు ఇచ్చాడాయన. నిదానంగా జాతకం చూచి మిగతా వివరాలు చెబుతానని ఆయనతో చెప్పాను.

'ఈ సారి మీరు లక్నో వస్తే మా యింటికి తప్పకుండా రావాలి. మా హాస్పిటల్ చాలా పెద్దది. మీకు దగ్గరుండి అన్నీ చూపిస్తాను.' అన్నాడు డా. హర్షవర్ధన్ గారు.

సరేనని చెప్పాను.

నా ఫోన్ నంబర్ ఇద్దరూ తీసుకున్నారు. నా పుస్తకాలు పంపమని మరీ మరీ చెప్పారు. టీ త్రాగడం అయిపొయింది. వారి దగ్గర సెలవు తీసుకుని క్లాస్ కి బయల్దేరాను.

క్యాంపస్ చాలా పెద్దది. చెట్ల మధ్యలో నడుస్తూ అడ్మిన్ బ్లాక్ నుండి క్లాస్ రూమ్స్ కి రావడానికి ఒక అయిదు నిముషాలు పడుతుంది. నడుస్తూ ఉండగా నాకే నవ్వొచ్చింది.

ఇరవై ఏళ్ళ క్రితం మా ఫ్రెండ్ వెంకటాద్రి గారు ఒక మాట అంటూ ఉండేవాడు. 'జ్యోతిష్యం, వైద్యం బాగా తెలిస్తే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికెయ్యవచ్చు. మంచి పేరూ, గౌరవమూ సంపాదించవచ్చు'. అంటూ.

ఈ రెంటికోసమూ నేనెప్పుడూ ప్రాకులాడలేదు. కానీ, తెలుగు రాని హిందీవాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టి, గౌరవించడం గమనించి, మనస్సులోనే నా గురువులకు, ఇష్టదైవానికి ప్రణామాలు అర్పిస్తూ క్లాస్ రూమ్ కి చేరుకున్నాను.
read more " రెండవ లక్నో యాత్ర - 2 "