“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, ఫిబ్రవరి 2009, శుక్రవారం

అవతార మూర్తి శ్రీ రామ కృష్ణుని శుభ జయంతి


నేడు అత్యంత విశిష్ట దినం.
ధర్మోద్ధరణ
కోసం భగవంతుడు భూమికి దిగి వచ్చిన రోజు.
ప్రపంచంలో
కోట్లాదిమంది జనులు నేడు భగవంతుని అవతారముగా కొలుస్తున్న శ్రీ రామ కృష్ణుని జననం 1836 సంవత్సరంలో ఇదే ఫాల్గుణ శుక్ల తృతీయ రోజున జరిగింది.
ఆయన దివ్య జాతకం మరియు జీవితం లో ముఖ్య ఘట్టములు త్వరలో నా శక్తి మేరకు విశ్లేషణ చేస్తాను.
దివ్య మూర్తి కి ఇదే ప్రణామాంజలి.

వివేకానంద స్వామి విరచిత శ్రీ రామకృష్ణ స్తోత్రం నుండి

శ్లో|| ఓం స్థాపకాయచ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే

అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః||

తా|| క్షీణించిన ధర్మమును ఉద్దరించిన వాడు, సర్వ మత, ధర్మ స్వరూపుడు, భగవత్ అవతారములలో వరిష్టుడు అయిన శ్రీ రామకృష్ణునికి ప్రణామము.

శ్లో|| అద్వయ తత్వ సమాహిత చిత్తం
ప్రోజ్వల భక్తి పటావ్రుత వృత్తం
కర్మ కళేబర మద్భుత చేష్టం
యామి గురుం శరణం భవ వైద్యం ||

తా || ఒక్కటి యగు పర బ్రహ్మ తత్వమునందు లగ్నమగు చిత్తముకలవాడు, ఉజ్జ్వల భక్తి యనుదానిని మనసున ధరించినవాడు (అనగా భక్తి జ్ఞానముల మూర్తీభావము), తనంత తానుఆరోపించుకొన్న దేహముచేత అద్భుత కార్యములు చేసినవాడు, భవము అనెడి లోక వ్యామోహమునకు వైద్యుడుడునుఅయిన గురుదేవుని శరణు కోరెదను.

అభేదానంద స్వామి విరచిత శ్రీ రామ కృష్ణ స్తోత్రం నుండి

శ్లో|| సర్వ ధర్మ స్థాపకత్వం సర్వ ధర్మ స్వరూపకః
ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయతే నమః ||

తా || సర్వ ధర్మములను ఉద్దరించినవాడు, సర్వ ధర్మముల స్వరూపమైనవాడు, ఆచార్యులలో మహాచార్యుడు అయిన రామకృష్ణునికి ప్రణామము.

శ్లో || ఓంకార వేద్యా పురుష పురాణో

బుద్దేశ్చ సాక్షీ నిఖిలశ్చ జంతో
యో వేత్తి సర్వం నచ యస్య వేత్తా

పరాత్మ రూపో భువి రామకృష్ణ ||

తా || ఓంకార జపముచేత తెలియబడు వాడు, పురాణ పురుషుడు, సర్వ ప్రాణుల బుద్ధికి లోపల సాక్షిగా ఉన్నవాడు, సర్వం తెలిసినవాడు, ఎవరిచేతా తెలియబడని వాడు, పరమాత్మ రూపుడు అయిన రామకృష్ణునకు ప్రణామము.

శ్లో || వందే జగద్బీజ మాఖండ మేకం

వందే సురై సేవిత పాద పీఠం
వందే భవేశం భవ రోగ వైద్యం
తమేవ వందే భువి రామకృష్ణం ||


తా || జగత్తు మూలమగు అఖండ బీజమునకు, దేవతలచే పూజించబడు పాద పీఠము కలవానికి, లోకేశ్వరునకు, భవరొగమునకు వైద్యుడైన రామకృష్ణునకు ప్రణామం.

శ్లో || తేజో మయం దర్శయసి స్వరూపం
కోశాంతరస్థం పరమార్థ తత్త్వం

సంస్పర్శ మాత్రేణ నృణాం సమాధిం
విహాయ సద్యో భువి రామకృష్ణ ||


తా || పంచ కోశములకు లోపల గల తేజోమయము, స్వస్వరూపము నగు పరమార్థ తత్వమును దర్శించినవాడు, స్పర్శ మాత్రమున మానవునికి సమాధి స్థితిని అనుగ్రహించగల శక్తిమంతుడు అగు రామకృష్ణునికి ప్రణామం.

అనుభవానంద స్వామి విరచిత శ్రీ రామకృష్ణ స్తోత్రం నుండి


శ్లో|| సర్వ సాధన సంయుక్తం సర్వ ధర్మ సమన్వయం

సకలానుభవ సంపన్నం రామకృష్ణం నమామ్యహం ||


తా || సర్వ సాధనలు తెలిసిన వాడు, సర్వ ధర్మములను సమన్వయ పరచిన వాడు, సకల ఆత్మానుభవములచే సంపన్నుడు అగు రామకృష్ణునికి ప్రణామం.

విరజానంద
స్వామి విరచిత శ్రీ రామకృష్ణ స్తోత్రం నుండి

శ్లో|| బ్రహ్మ రూప మాది మధ్య శేష సర్వ భాసకం

భావ శక్త హీన రూప నిత్య సత్య మద్వయం
వాన్మనోతి గోచరంచ నేతి నేతి భావితం
తం నమామి దేవ దేవ రామకృష్ణ మీశ్వరం ||


తా || పరబ్రహ్మ రూపుడు, ఆది మధ్య అంతములలో నిండి సర్వత్రా భాసించువాడు, కామ క్రోధాది షడ్వర్గములు లేనివాడు, నిత్యము, సత్యము అగు ఏకాత్మ రూపుడు, వాక్కుకు మనస్సుకు అందని వాడు, ఇది కాదు ఇది కాదు అనెడి జ్ఞాన మార్గ సాధన చేత తెలియబడు వాడు, దేవ దేవుడు, ఈశ్వరుడు అగు రామకృష్ణునికి ప్రణామం.

కేశవ తీర్థ స్వామి విరచిత శ్రీ రామకృష్ణ స్తోత్రం నుండి


శ్లో ||స్వాన్తములో వెలుంగు పరమాత్మ దలంపకా కామ కాంచన
భ్రాంతికి వశ్యమై వెతల పాలై పోయిన మర్త్యకోటి

హృద్వాంతము బాపి కావ వసుధా తలిపై ఉదయించినట్టి శ్రీ

కాంతుని రామకృష్ణ జగద్గురు నెంతు నితాంత మాత్మలో ||

తా || తమలోనే ఉన్న పరమాత్మను దర్శింపలేక కామ కాంచన భ్రాంతికి వశులై బాధల పాలగుచున్న మానవుల హృదయ అంధకారము పోగొట్టుటకు భూమిపైన అవతరించిన విష్ణు అవతారమగు రామకృష్ణ జగద్గురుని ఎల్లప్పుడూ ఆత్మలో ధ్యానించేదను.

ఒట్టూర్
బాల భట్టు విరచిత శ్రీ రామకృష్ణ కర్ణామృతం నుండి


శ్లో|| ఆబద్దాంజలి సంపుటం వినయినం సౌఖ్యాసనే సంస్థితం

మీలత్ స్నిగ్ధ విలోచనం స్మితల సద్వక్త్రం సమాధౌ రతం

సమ్యక్ కుమ్భిత మారుతం స్థిరవపుర్యోగీంద్ర విస్మాపనం
వందే పావన దక్షినేస్వర గతం తేజో జగన్మంగళం.

తా || అంజలి ముద్రతో చక్కని సుఖాసనమున కూర్చొని ఉన్నవాడును, నిమీలిత నేత్రుడు, చిరునవ్వుతో వెలుగు మోముకలవాడు, సమాధి స్థితి యందు ఆనందించు వాడు, వాయువు ను
చక్కగా కుంభించిన వాడు, స్థిరమైన దేహముగలవాడు, యోగీంద్రుడు, పావనుడు, దక్షినేశ్వర వాసియు, జగత్తుకు శుభము చేకూర్చువాడు అగు తేజో మూర్తికి ప్రణామం.

శ్లో || నిత్యం నమోస్తు గురవే పరదేవతాయై

విశ్వాత్మనే భగవతే కరుణార్ణవాయ

శ్రీ శారదా ప్రియతమాయ గదాధరాయ

చంద్రాత్మజాయ క్షుదిరామ సుతాయ తుభ్యం

తా || పరదేవతా స్వరూపుడు, గురుదేవుడు, విశ్వాత్మకుడు, భగవంతుడు, కరుణా సముద్రుడు, శ్రీ శారదా ప్రియతముడు, చంద్రమణీ క్షుదిరాముల తనయుడు అగు గదాధరునికి ప్రణామం.

శ్లో || సచ్చిద్ ప్రమోద ఘన సౌహృద మేరుశైల
కారుణ్య దుగ్ధ జలదేఖిల ధర్మమూర్తే

ముక్తి ప్రభాకర సమాధి సుధా మయూఖ
శ్రీ రామకృష్ణ భగవాన్ సతతం నమస్తే ||

తా || సచ్చిదానందము ఘనీభవించి మేరుపర్వతమువలె, కరుణతో నిండి పాల సముద్రమువలె, అఖిల ధర్మముల స్వరూపమువలె , ముక్తి సూర్యుని వలె , అమృత సమాధి స్థితుల పుష్ప గుచ్చము వలె ప్రకాశించుచున్న శ్రీ రామకృష్ణునకు ప్రణామం.


శ్లో|| విస్మారకం భవరుజా మఖిలాభిరామం

విస్మాపకం సుమనసాం సుకృతైక దృశ్యం

ఆనంద మత్త మతిముగ్ధ విదగ్ధ నృత్తం
శ్రీ రామకృష్ణ పదాయో రనుసంధదామి ||



తా || నాశములేని ఆత్మ స్వరూపములా! భవ రోగమును పోగొట్ట సమర్థములా ! ఆనందముతో మత్తెక్కి, భక్తిపారవశ్యములో అతి మనోహరముగా నృత్యము చేయుచున్న శ్రీ రామకృష్ణ పాదములను ధ్యానించేదను. ఇది మంచిమనస్సు, మంచి సుకర్మలు కలిగినవారికి మాత్రమే ప్రాప్తించు దృశ్యము.

శ్లో || నిరంజనం నిత్య మనంత రూపం
భక్తానుకంపార్చిత విగ్రహం వై

ఈశావతారం పరమేశ రూపం
శ్రీ రామకృష్ణం శిరసా నమామి ||

తా || మాలిన్యము లేనివాడు, నిత్యుడు, అనంత రూపుడు, భక్తులకు ఆనందమును ప్రసాదించు రూపము గలవాడు, పరమేశ్వరుడు, అవతార మూర్తి యగు శ్రీ రామకృష్ణునికి ప్రణామం.
read more " అవతార మూర్తి శ్రీ రామ కృష్ణుని శుభ జయంతి "

24, ఫిబ్రవరి 2009, మంగళవారం

నిన్నటి ధ్యానం









ఎగురుతున్న ఆలోచనా విహంగాలు
వేటగాడిని చూచి మాయమయ్యాయి
ఎటు చూచినా శూన్యం
నిశ్చల నీరవత

నిశీధ మౌనం
చిమ్మ చీకటిలో తారా తోరణాలు
మిణుగురు పురుగులుగా మెరుస్తున్నాయి 


ఏదీ ప్రపంచం?
ఏవీ ఆలోచనలు?
శరీరం ఉందా? లేదా?
నేనన్న అస్పష్ట ఉనికి తప్ప....
read more " నిన్నటి ధ్యానం "

23, ఫిబ్రవరి 2009, సోమవారం

శివ తత్త్వం


ఈ రోజు శివ రాత్రి. శివ తత్వాన్ని కొంత తెలుసుకుందాం.

ప్రపంచంలొ శివ శక్తులు తప్ప వేరేమీ లేదు అంటుంది శైవం.అనగా పురుష స్త్రీ తత్వములు.దీనికి అతీత మైనది పరమెశ్వర తత్వం.



ఒకటిగా
ఉన్నదేదో అదే రెండుగా మారినది
రెండైనదే అనేకం అయింది
ఇంతే సృష్టి...
అంటారు వివేకానంద స్వామి తన లేఖలలో.


వాక్కుకు, మనస్సుకు, ఇంద్రియములకు అందని అతీత నిర్గుణ, నిరాకార, నిశ్చల స్థితిలో ఏముందో అదే శివుడు. అది ఒక స్థితి అని భావిస్తున్నామే కాని నిజానికి అది స్థితి కాదు. ఉండటానికి, లేకుండటానికి మించిన చెప్పలేని ఒక మౌనం. యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ, దేనిని అందుకోనలేక వాక్కు మనస్సులు వెనుకకు మరలుతున్నవో అది అని వేదములు వర్ణించిన భూమిక.

ప్రతి దెవత వెనుకా ఉన్నటువంటి పర బ్రహ్మ తత్వమును చూడడం వేదాంతము యొక్క ఉన్నత భావనలో ఒకటి. లయ కారకుడైన శివుని ద్వారా పర బ్రహ్మోపాసన చెయ్యడం శైవం. శివం అనగా శుభంకరము అని అర్థము. నిర్వికల్ప సమాధిలో ఏదైతే ఉన్నదో అదే శివ తత్త్వం. దానిని అనుభూతి లోనికి తెచ్చుకోవటం మానవ జన్మ ఉద్దేశం.

read more " శివ తత్త్వం "

21, ఫిబ్రవరి 2009, శనివారం

హోమియోపతి మూల సూత్రములు



నాకు తెలిసిన ప్రత్యామ్నాయ వైద్య విధానములలో హోమియోపతి ఒకటి. ఈ వైద్య విధానము యొక్క మూలసూత్రాలను ఈ పోస్టులో పరిశీలిద్దాము.

దీనిని శామ్యూల్ హన్నేమాన్ అనే జర్మన్ దేశీయుడు కనిపెట్టినాడు. ఆయన జీవితాన్ని మరియు జాతకాన్ని రాబోయే వ్యాసములలో చూద్దాము. ప్రస్తుతం హోమియోపతి సిద్ధాంతమును మాత్రం తెలుసుకుందాము.

హోమియోపతి వైద్యవిధానము ముఖ్యముగా నాలుగు సూత్రములపై ఆధారపడి యున్నది.

1 . Individualism : ప్రతి మానవుడు తనకు తాను ఒక ప్రత్యేకజీవిగా ఉంటాడు. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనిఒక భావన ఉంది. కాని వారు కూడా పూర్తిగా ఒకరిని పోలి ఒకరు ఉండరు. వారిలో కూడా శారీరక, మానసిక భేదములు ఎన్నోఉంటాయి. ప్రాణశక్తి తీరు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కనుక ఈ వ్యక్తిగత విభిన్నత్వములను పరిశీలించకుండా వారి రోగాలకు మనం ఇచ్చే మందులు ఆ వ్యక్తికి పూర్తీ ఆరోగ్యమును కలిగించలేవు. ఎందుకంటే, మనం ఆ 'వ్యక్తి' యొక్క ప్రాణశక్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు గనుక. ప్రతి మనిషి ప్రాణశక్తీ ఒకే విధంగా ఉండదు. కనుక ఆ ప్రాణశక్తిని మనం లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది.

2. Dynamism : వ్యాధి అనేది ఒక శక్తి. అది బాహ్య జడపదార్థము కాదు. అంతర్గతముగా వ్యాపించగలిగే ఒక జీవశక్తి. నేడు వ్యాధులకు కారణము బాక్టీరియా, వైరస్ మొదలైన సూక్ష్మ జీవులు అని సైన్సు చెబుతున్నది. కాని మనిషిలో జీవశక్తి బలముగా ఉంటే ఏ వ్యాదీ శరీరమును ఏమీ చెయ్యలేదు. కనుక జీవశక్తిలో ఏర్పడిన ప్రాధమిక లోపమే వ్యాధికి కారణము గాని సూక్ష్మ జీవులు కాదు. జీవశక్తిలో ప్రాణస్థితిలో ఏర్పడిన లోపమును స్థూలస్థితిలో కల మందులు బాగుచెయ్యలేవు. పోటేన్సీల లోనికి మార్చ బడిన ప్రకృతి సహజమైన మందులే జీవశక్తిలోని వైకల్యమును అధిగమించ గలవు.

3. Totality Of Symptoms : మానవుడు జడయంత్రము కాదు. జీవముతో నిండిన వాడు. అతడు శరీరము, మనస్సు, ప్రాణము అనే వాటి కలయిక. వ్యాధి ఏర్పడినపుడు ఈ మూడు స్థాయిలలో తేడాలు స్పష్టముగా కనిపిస్తాయి. కనుక మొత్తము లక్షణములను క్రోడీకరించిన స్వరూపమునే వ్యాధి రూపముగా చూడాలి. అంటే కాని ఒక్కొక్కభాగమును విడివిడిగా చూస్తూ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటము సరియైన విధానము కాదు.

4 . Law Of Similars : ఒక మందు ఆరోగ్య వంతునిలో ఏ మార్పులు తేగలదో, అనారోగ్య వంతునిలో అవే మార్పులను నివారించగలదు. దీనిని " Similia Similibus Curentur " or Like cures Like అని అంటారు. ఉష్ణం ఉష్ణేన శీతలం, ముల్లును ముల్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి అనే ఉవాచలలో ఈ సూత్రం దాగి ఉందని కొందరిభావన. కాని ఈ సూత్రమును ప్రామాణీకరించి ఒక రూపాన్నిచ్చిన ఖ్యాతి డాక్టర్ శామ్యూల్ హన్నేమాన్ కు దక్కింది.

1990 - 95 మధ్య, నేను విజయవాడలో ఉన్నపుడు పొన్నూరు వాస్తవ్యులైన Dr P.V.Gopala Rao గారి వద్ద హోమియోపతి నేర్చుకునే అవకాశం మరియు వారు, వారి శిష్యులు నడుపుతున్న ఫ్రీ క్లినిక్ లో పనిచేసే అవకాశంకలిగింది. 5 సంవత్సరాలు హోమియోపతిని అధ్యయనం చేయటం జరిగింది.

శామ్యూల్ హన్నేమాన్ జీవితం మరియు జాతకాన్ని వచ్చే వ్యాసాలలో చూద్దాం.
read more " హోమియోపతి మూల సూత్రములు "

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

నవ విధ ప్రాణాయామములు


స్వాత్మారామ యోగీంద్రుని "హఠయోగప్రదీపిక" ప్రకారం ప్రాణాయామము ఎనిమిది విధములు. ప్రాణాయామమును ఆయన కుంభకం అని పెర్కొనినాడు. కుంభకం అనేది ప్రాణాయామములో ఒక ముఖ్య భాగము. పీల్చిన ఊపిరిని లోపలబిగబట్టుట అంతర కుంభకం అంటారు. వదిలిన ఊపిరిని బయటే ఉంచుట బాహ్య కుంభకం అంటారు.

బ్రహ్మచర్య పాలన లేకుండా కుంభకం ఆచరిస్తే నరాల వ్యవస్థ దెబ్బ తింటుందనీ తత్ఫలితంగా పిచ్చేక్కుతుందని,లేదా అసాధ్య రోగాలు వస్తాయనీ యోగశాస్త్రం యొక్క లోతులు తెలిసిన విజ్ఞులు చెబుతారు. 

శ్లో||సూర్య భేదన ముజ్జాయీ సీత్కారీ సీతలీ తథా
భస్త్రికా భ్రామరీ మూర్చా ప్లావినీ అష్ట కుంభకా ||

అనునది స్వాత్మారామ యోగీంద్రుడు హట యోగ ప్రదీపిక ప్రాణాయామ అధ్యాయములో చెప్పిన శ్లోకం. ఎనిమిదిరకములైన ప్రాణాయామములు క్రింద చూపిన విధంగా ఉన్నవి. 



1 . సూర్య భేదనము.
2 . ఉజ్జయీ
3 . సీత్కారి
4 . శీతలి
5 . భస్త్రిక
6 . భ్రామరి
7 . మూర్ఛ
8 . ప్లావిని

ఇవి గాక "హఠరత్నావళి" అను గ్రంథము "భుజగీకరణము" అను తొమ్మిదవ ప్రాణాయామమును చెప్పియున్నది. పాము బుసకోట్టినట్లుగా ఊపిరి పీల్చి వదలడం దీని లక్షణం. 


వీటిలో ఒక్కొక్క ప్రాణాయామానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. 

సూర్యభేదనం వల్ల ఒంట్లో వేడి పుడుతుంది.దీనివల్లే హిమాలయాలలో మైనస్ డిగ్రీల వాతావరణంలో కూడా యోగులు గోచీతో ఉండగలుగుతారు. 

ఉజ్జాయి వల్ల ఊపిరితిత్తులకు శక్తి పెరుగుతుంది.ఆయాసం ఆస్మా ఈసినోఫిలియా మొ|| రోగాలున్నవారికి ఇది చాలా మంచిది.మార్షల్ ఆర్ట్స్ లో కూడా దీనిని అధికంగా వాడుతారు. కరాటే కుంగ్ఫూ లలో ఉన్న "శాంచిన్" కటా లో వాడేది ఉజ్జయి ప్రాణాయామమే. 

శీతలి వల్ల ఒళ్ళు చల్లబడుతుంది. వేసవిలోనూ,ఎండదెబ్బ తగిలి టెంపరేచర్ పెరిగినప్పుడూ,అమిత దాహంతో ఉన్నపుడూ ఇది చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది.

భ్రామరి నాదయోగ సాధనకు సహాయకారి.క్రియాయోగం లో కూడా దీని ఉపయోగం ఉన్నది. మనస్సును అంతర్ముఖం చేస్తుంది.

మూర్చ అనేది మైండ్ ను బ్లాక్ అవుట్ చేస్తుంది. ఒకరకమైన జడసమాధిని కల్పిస్తుంది. ఏమీ తెలియని అచేతన స్తితిలోకి మనిషి వెళతాడు.

ప్లావిని వల్ల మనిషి నీటిమీద తేలగలడు.భుజగీకరణం వల్ల మనిషిలోని ప్రాణశక్తి అమితంగా వృద్ధి చెందుతుంది. కుండలినీ జాగృతి కలుగుతుంది.ఇక భస్త్రిక వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఒకటని చెప్పలేము. 

ఈ ప్రాణాయామాల సాధనకు ముఖ్యంగా గురువు యొక్క పర్యవేక్షణ , సమయం,సందర్భం,ఆహారనియమం,బ్రహ్మచర్యం అత్యంత ఆవశ్యకాలు. ఇవి లేకుండా టీవీలలో చూచి అమితంగా వీటిని ఆచరిస్తే అంతు బట్టని రోగాలు రావడమో,పిచ్చి ఎక్కడమో జరుగుతుంది. తస్మాత్ జాగ్రత.
read more " నవ విధ ప్రాణాయామములు "

19, ఫిబ్రవరి 2009, గురువారం

నాడీ జ్యోతిషం : తంత్ర నాడీ గ్రంథాలు


తంత్రనాడి అంటే భయపడే అవసరం లేదు. తంత్రము అంటే గణిత తంత్రము అని అర్థము. పూర్తిగా గణితము, సాంప్రదాయ జ్యోతిషము, ఇతర నూతన విభిన్న పద్ధతులద్వారా ఆశ్చర్యకరమైన ఫలితములు చెప్పునది శాఖ. దీనికి మంత్రములతో పని లేదు.

దీని గ్రంథములు చాలావరకు సంస్కృతములో ఉంటాయి. భ్రుగునాడి, ధృవనాడి లేక సత్యనాడి, దేవకేరళం లేక చంద్రకళానాడి, బుధనాడి, శుకనాడి, ఇత్యాది గ్రంథములు ఈ కోవకు చెందినవి. వీటి యొక్క పద్ధతులు ఒక్కొక్కటి విభిన్నములైనవి. వీటిలో నాడీఅంశను మొదటగా గుర్తించవలసి ఉంటుంది. దానిని బట్టి మిగతా గణితము ప్రారంభం అవుతుంది.

మొదటగా కొంత కాలవిభజనము మరియు రాశిచక్రవిభజనం చూద్దాము. దాని ద్వారా నాడీఅంశ అర్థం అవుతుంది.

భారతీయ జ్యోతిషానికి గల అనేక ముఖ్య ప్రత్యేకతలలో అంశచక్రములు ఒకటి. జననకాలమునకు గల గ్రహస్థితిని బట్టి తయారుచేయునది రాశిచక్రము. దీనిని ఆకాశమున గల రాశులు, గ్రహముల యథాతథస్థితి అని చెప్పవచ్చు. ఇది అన్ని విషయములను చూపలేదు. జాతకములోని వివిధ అంశములను తెలుసుకోవటానికి, వివిధ అంశచక్రములను పరిశీలించాలి. రాశిచక్రమును అంశ చక్రముతో సమన్వయ పరచుకుంటూ విశ్లేషణ సాగించాలి.

పరాశరమహర్షి షోడశవర్గచక్రములను చెప్పి యున్నాడు. కొందరు షడ్వర్గములను, కొందరు సప్తవర్గములను, దశవర్గములను ఇత్యాదిగా ఎవరి అనుభవమును బట్టి వారు పరిశీలిస్తారు.

రాశి, హోర, ద్రేక్కాన, చతుర్థాంశ, పంచాంశ,షష్టఅంశ, సప్తాంశ, నవాంశ, దశమాంశ ఇత్యాదిగా అంశ లేదా వర్గ చక్రములు ఉన్నాయి. షష్టి అంశ అనగా 60 విభాగం వరకు సామాన్యంగా పరిగణిస్తారు. బాగా జ్యోతిషజ్ఞానము కలవారు నవనవాంశ( 81 ), నవద్వాదశాంశ ( 108) మొదలగు ఉన్నత వర్గములను కూడా పరిశీలిస్తారు. ఒక్కొక్క రాశిని అనేక సూక్ష్మ భాగములుగా చేస్తే విభాగములు ఏర్పడతాయి. వీటిలో 150  సూక్ష్మ విభాగమునే నాడీఅంశ అని అంటారు.

ఒక్కొక్క రాశి కి 30 డిగ్రీలు ఉన్నవి. అట్లా 12 రాశులకు 30 డిగ్రీలతో, 12 x 30 = 360 డిగ్రీల రాశి చక్రము ఏర్పడుతుంది. ఒక రాశి దాదాపుగా రెండు గంటలు ఉదయిస్తుంది. అట్లా 12 రాసులు 12 x 2 = 24 గంటలలో రాశి చక్రము మొత్తం తిరిగివస్తుంది.

ఇప్పుడు కొంత గణితభాగం చూద్దాం.

రాశి ప్రమాణం ముప్ఫై డిగ్రీలు = ఒక రాశి ఉదయించే సమయం దాదాపుగా రెండు గంటలు.

30 degrees = 2 hours

30x60x60 seconds of arc = 2x 60x60 seconds of time.

దీనిని నాడీఅంశ కోసం 150 తో భాగించగా,

(30x60x60) / 150 = (2x60x60) / 150

720 seconds of arc = 48 seconds of time

12 minutes of arc = 48 seconds of time

అనగా 48 సెకండ్ల కాలం ఒక నాడి అంశ. సత్యాచార్యుడు దీనిని తిరిగి పూర్వ, పరభాగములుగా విభజించాడు. అనగా, పూర్వభాగములో 24 సెకండ్ల కాలం, పర భాగములో మరొక 24 సెకండ్ల కాలం ఉంటాయి. 24 సెకండ్ల కాలాన్ని తిరిగి 4 భాగములు చేసాడు. అంటే ఒక 6 సెకండ్ల కాలంలో ఒక జన్మ జరుగుతుంది. జనన సమయం 6 సెకండ్ల తేడావస్తే, జాతకం సూక్ష్మ వివరాలలో పూర్తిగా మారిపోతుంది. నాడీజాతకానికి ఇంత సరియైన సమయం కావాలి.

150 నాడీ అంశలకు వసుధ, వసుధారిని, వైష్ణవి, బ్రాహ్మి ఇత్యాది పేర్లు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 150 నాడి అంశల చొప్పున 12 రాశులకు కలిపి 1800 నాడీ అంశలు ఉంటాయి. దీనిని పూర్వ, పర, చతుర్థభాగములుగా విభజించగా 225 విభాగంలో ఒక జాతకుని జీవిత కథ దర్శనం ఇస్తుంది. 1800 భాగాలను తిరిగి 8 విభాగములు చెయ్యగా 14,400 జాతకములు ఒక రోజులో ఒకప్రదేశంలో మనకు లభిస్తాయి. ఇంతటి సూక్ష్మవిభాగము చెయ్యడము వలన జాతకుని ప్రస్తుతజననమే గాక పూర్వజన్మలు, పూర్వం చేసిన పాపకర్మలవల్ల వచ్చే ఫలితములు ,దోషములు, శాపములు, చేయవలసిన రేమేడీలు, భవిష్యత్తులో వచ్చే జన్మలు, మరణం తరువాత కలిగే లోకములు అన్నీ అద్దంలో చూచినట్లు తెలుసుకోగలుగుతాము.

వీటిని లెక్కించే విధానం ఏమనగా: చరరాసులలో ( మేష, కటక, తుల, మకర) ఇదే వరుసలోను, స్థిర రాసులలో (వృష, సింహ, వృశ్చిక, కుంభ) వ్యుత్క్రమ దిశలోనూ, ద్విస్వభావరాసులలో (మిథున, కన్య,ధనుష్, మీన) 76 అంశ నుండి వీటిని లెక్కిస్తూ రావాలి.

వచ్చే వ్యాసంలో ఇంకొంత గణిత, ఫలిత భాగములు చూద్దాము.
read more " నాడీ జ్యోతిషం : తంత్ర నాడీ గ్రంథాలు "