3, ఏప్రిల్ 2026, శుక్రవారం
World Autism Awareness Day
చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి?
ఇతను మొన్న మార్చి 19 న అమెరికాలో చనిపోయాడు. ఆ సమయానికి ఇతనికి 86 ఏళ్ళు. చివరిక్షణాలలో ఇతని హెల్త్ గురించి ఏ విధమైన సమాచారమూ మీడియాలో అందటం లేదు. గ్రహాలేమంటున్నాయో చూద్దాం.
ఇతను 10 మార్చి 1940 న ఒక్లహామా లోని ర్యాన్ అనేచోట పుట్టాడు. సమయం ఉదయం 3 గంటలు. ఇతని జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు.
మార్చి 19 వ తేదీన ఇతని జాతకంలో రాహు శుక్ర బుధ బుధ బుధ దశ నడిచింది. రాహువు ఉచ్ఛబుధుని సూచిస్తున్నాడు. ఈ జాతకానికి బుధశుక్రులు మారకులు. బుధునికి వచ్చిన 4/7 భావాధిపత్యాల వల్ల ఇది గుండె సంబంధిత సమస్య అని అర్ధమౌతున్నది.
బుధుడు నీచస్థితిలో గ్రహయుద్ధంలో వక్రించి ఉన్నాడు. వక్రతవల్ల కుంభంలో ఉన్న సూర్యుడిని కలుస్తాడు. ఇదికూడా గుండెసంబంధిత సమస్యకు సూచికయే. పైగా, ప్రస్తుతం ఇతనికి ఏలినాటిశని మధ్యభాగం నడుస్తున్నది.
గతంలో 2017 లో జూలై 16, 17 తేదీలలో ఇతనికి రెండు హార్ట్ ఎటాక్స్ వచ్చాయని ఒక పుకారుంది. ఇతను ప్రపంచ సెలబ్రిటీ గనుక, ఇతనికున్న ఇమేజి దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచారు. ఆ రోజులలో ఏం జరిగిందో, గ్రహాలేమంటున్నాయో చూద్దాం.
ఆ రోజులలో ఇతనికి రాహు గురు శుక్ర శుక్ర శుక్ర దశ నడిచింది.
బుధశుక్రుల ప్రభావం మళ్ళీ స్పష్టంగా కనిపిస్తున్నది. అంతర్దశలో లగ్న, చంద్రలగ్నాలకు అధిపతి అయిన గురువున్నప్పటికీ, నవాంశలో నీచస్థితిలో ఉండటంతో ఇతనికి గురుదోషం ఉన్నది. కనుక ఆ రోజునకూడా ఇతనికి హార్ట్ ఎటాక్స్ వచ్చినది నిజమే అని తెలుస్తున్నది. గురువు పాత్ర వల్ల పార్టీలు, వేళతప్పి ఎక్కువగా తినడం మొదలైన పొరపాట్లు జరిగి ఉండవచ్చు.
సూర్యునిపైన రాహుకేతువుల ప్రతికూల దృష్టులు, మరియు యురేనస్ యొక్క అనుకూలదృష్టి ఉన్నాయి. కనుక, గుండెసంబంధిత సమస్యకు గురైనప్పటికీ, సమయానికి సరియైన వైద్యసహాయం అందటంతో బ్రతికి బయటపడ్డాడు. పైగా ఆనాడు గోచారశని 9 వ భావమైన తులలో వక్రించి, 8వ భావం ఆయుష్యస్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. అందుకని బ్రతికించాడు. ఇప్పుడు ఏలినాటిశని గనుక తీసుకుపోయాడు.
మీడియాలో లీక్ చేయకపోయినా, ఇతను చనిపోయినది గుండె సంబంధిత సమస్యతోనే అని దీనిని బట్టి అర్ధమౌతున్నది.
28, మార్చి 2026, శనివారం
ఎడారిమతాలున్నచోట శాంతి ఉండదు
నిన్న శ్రీరామనవమి నాడు తన నియోజకవర్గంలోని ఆకివీడులో, ఒక రామాలయాన్ని సందర్శిద్దామని వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిమీద, ఆయనవెంట ఉన్న వారిమీద కత్తులతో, మేకులతో భౌతికదాడి జరిగింది. పోలీస్ ఎస్కార్ట్ తో ఆయన ఆ గుంపునుండి బయటకు రావలసి వచ్చింది. ఆయన వెంట ఉన్నవారిలో కొంతమందికి గాయాలయ్యాయి.
దాడిచేసినది దళితక్రైస్తవుల ముసుగులో ఉన్నవారని ఆయన ఆరోపించారు.
శాంతిని అనుసరించవలసిన క్రైస్తవులు దాడిచేయడమేంటి? అదీగాక మేకులతో దాడిచేయడమేంటి? నాకైతే నవ్వొచ్చింది. అంటే, వారు నమ్మే జీసస్ ను రోమన్లు మేకులు కొట్టి చంపేశారు గనుక, వాళ్లకు నచ్చని అందరినీ మేకులతో దాడిచేద్దామని ప్రయత్నమా? ఇదెక్కడి వింతో నాకైతే అర్ధం కాలేదు.
పశ్చిమగోదావరి జిల్లాలలో గత అరవై డెబ్బయి ఏళ్లుగా క్రైస్తవప్రచారం ముమ్మరంగా జరిగింది. అనేక సంస్థలు పుట్టుకొచ్చి, లక్షలమంది నిమ్నవర్గపు హిందువులను క్రైస్తవులుగా మార్చేశాయి. చాలాచోట్ల ఊళ్లకు ఊళ్లే ఈ విధంగా మార్చబడ్డాయి. అలా మారినవారిలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ప్రముఖంగా ఉన్నారు. వారిలో తక్కువశాతం మంది మాత్రం ఇప్పటికీ మారకుండా నీతిగా ఉన్నారు.
నీతిగా అని ఎందుకన్నానంటే, చెప్పుకునే మతమేమో క్రైస్తవం, పేపరుమీద మతమేమో హిందూమతం. లేకపోతే రిజర్వేషన్ రాదుగా? మరి, అది నీతెలా అవుతుంది? అందుకని అలా అనవలసి వచ్చింది !
అంతకుముందు ఆయా ఏరియాలలో అన్నింటిలోనూ రామాలయాలుండేవి. క్రమేణా అవి పాడుబడిపోయాయి. సందుసందుకీ చర్చిలు వెలిశాయి. దశమభాగాలు దండుకొని పాస్టర్లు కోటీశ్వరులయ్యారు. మతవ్యాపారాలు విస్తరించాయి. ఓట్లకోసం నాయకులు వారికి తందానతాన పాడారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి. చీలికలు ఏర్పడ్డాయి.
దేశంలో నార్త్ ఈస్ట్ లోని సెవెన్ సిస్టర్ రాష్ట్రాలు ఏకమొత్తంగా క్రైస్తవంలోకి మార్చబడ్డాయి. ఈ పని గత యాభై ఏళ్లుగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత స్దానం ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లాదే అని నా అనుమానం. అంత ఎక్కువగా కన్వర్షన్స్ అక్కడ జరిగాయి.
ఈ లోపల, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని, రికార్డులో హిందువులుగా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా మారి అనేకమంది డబల్ బెనిఫిట్ పొందారు. అక్కడేమో రిజర్వేషను, ఇక్కడెమో మతప్రచారం, విదేశీఫండ్స్, వాటిలో ముప్పావలా నొక్కేసి, పావలా పంచి మళ్ళీ మతమార్పిడులు, ఈ విధంగా ఈ అవినీతికుట్రలు దశాబ్దాలుగా సాగుతూ వచ్చాయి.
నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో, ఇప్పటివరకూ హిందూరిజర్వేషన్ వరాలను అనుభవిస్తూ, సమాజంలో క్రైస్తవులుగా చెలామణీ అవుతున్న దొంగలందరూ బయటకు రావల్సి ఉంటుంది. పెద్దపెద్ద ఉద్యోగాలలో ఇప్పటికే తరతరాలుగా స్థిరపడి ఉన్న వీరంతా, ఆ విధంగా బయటపడి తమ తప్పులను ఒప్పుకుంటారా? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సరే. పిల్లికి గంటకట్టేదెవరు? చూడాలి.
పోతే, ఇన్ని దశాబ్దాలుగా, ఈ న్యాయవిరుద్ధమైన రిజర్వేషన్ ను ఉపయోగించుకొని ఇప్పటివరకూ ఎన్ని కోట్లమంది ఉద్యోగాలు సంపాదించారో లెక్క తీయవలసిన అవసరం ఉన్నది. మరి, అన్ని కోట్లమంది అసలైన అర్హులు తమ అవకాశాలను పోగొట్టుకున్నట్లే కదా? వారికి జరిగిన నష్టాన్నెవరు పూడుస్తారు? పూడ్చిపెట్టబడిన ప్రభువు లేచొచ్చి పూడుస్తాడా?
అదలా ఉంచితే, శాంతిమతాలైన క్రైస్తవం, ఇస్లాంలు ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీలికలు, విభేదాలు, గొడవలు, హింస, యుద్ధాలు, నాశనం తప్పకుండా జరుగుతుందనేది నిజం. నేడు ప్రపంచంలోని ఏ దేశంలో చూచినా ఇది రుజువౌతుంది. కారణమేంటంటే, వారి మూలసిద్ధాంతమే - 'నా మతం కరెక్టు, నీది తప్పు. మా దేవుడు రైటు, మీవాడు రాంగు, మతం మారతావా చస్తావా?' అనేది తప్ప ఇంకొకటి ఉండదు. ఉన్నతమైన తత్త్వశాస్త్రం గాని, తమకంటే ప్రాచీనమైన మతాలనుండి కాపీకొట్టకుండా సొంతంగా పుట్టిన భావాలు గాని, వాటిలో ఎక్కడా లేకపోవడం ఇంకొక కారణం.
క్రైస్తవానికీ, ఇస్లాముకూ యూదుమతమే మూలం. వాటిపైన తిరుగుబాటుగా పుట్టిన ఇస్లాం ఆ రెండింటితో ఇప్పుడు యుద్ధం చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాల మధ్యన ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? ఈ మూడూ అబ్రహామిక్ మతాలే. వీటితో ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి వస్తున్నది. మళ్ళీ ఈ మూడూ చెప్పేవి శాంతి కబుర్లే. వింతగా లేదూ?
మొదటి ప్రపంచయుద్ధంలో 2 కోట్ల 20 లక్షలమంది చనిపోయారు. రెండవ ప్రపంచయుద్ధంలో 8 కోట్ల 50 లక్షలమంది చనిపోయారు. 1095 CE నుండి 1291 CE వరకూ జరిగిన క్రూసేడ్స్ లో 90 లక్షలమందిని, కేవలం క్రైస్తవులు కాని కారణం చేత, అమానుషంగా హింసించి చంపేశారు పోపు అనుచరులు. అంటే దాదాపుగా 12 కోట్లమంది అమాయకులను ఇప్పటిదాకా ఈ రెండు శాంతిమతాలూ పొట్టనపెట్టుకున్నాయి. ఇదేనా శాంతి అంటే?
1560-1812 CE మధ్యలో జరిగిన గోవా ఇంక్విజిషన్స్ లో వందలాదిమంది హిందువులను దారుణంగా హింసించి సజీవదహనాలు చేశారు. లేదా మతాలు మార్చారు. ఇది మన గోవారాష్ట్రంలోనే జరిగింది. ఏ విధంగా అమాయకులైన హిందువులను హింసించారో చదివితే రక్తం ఉడికిపోతుంది. ఇదా క్రైస్తవం? వీళ్లదా శాంతిమతం? శాంతివచనాలు చెప్పే అర్హత క్రైస్తవానికి అసలుందా?
నేడు సెవన్ సిస్టర్స్ మొత్తాన్నీ ఒక క్రైస్తవదేశంగా మార్చేసి ఇండియానుండి విడదీయాలని పెద్ద కుట్ర జరుగుతోంది. ఇది నిజమా కాదా? సాక్షాత్తు బంగ్లాదేశ్ గతప్రధాని షేక్ హసీనానే ఈ మాట చెప్పింది. నిన్నగాక మొన్న టూరిస్ట్ వీసాలపైన ఇండియాకు వచ్చి మణిపూర్, మిజోరాం ప్రాంతాలలో క్రైస్తవమతప్రచారం చేస్తూ, ఆయుధాలు సప్లై చేస్తూ ఉక్రెయిన్ దేశస్థులు, అమెరికన్లు దొరికిపోలేదా? దీనిని శాంతి అంటారా? క్రీస్తు ఇలాంటి కుట్రలను చెయ్యమని చెప్పాడా?
1947 దేశవిభజన సమయంలో దాదాపు 20 లక్షలమంది భారతీయులు చంపబడ్డారు. వేలాదిమంది హిందూమహిళలు రేపులకు గురయ్యారు. 1989 లో జరిగిన కాశ్మీర్ మారణకాండలో దాదాపుగా 1000 మంది కాశ్మీర్ పండిట్లు దారుణంగా చంపబడ్డారు. కారణం? వాళ్ళు హిందువులు కావడమే. వేలాదిమంది హిందూమహిళలు రేపులకు గురయ్యారు. ఎప్పటివో ఎందుకు? ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మారణకాండ ఏమిటి? ఎంతమందిని చంపారు? ఎన్ని రేపులు జరిగాయి? ఎన్ని ఇళ్ళు ధ్వంసం చేశారు? ఇదంతా ఇస్లాం చేసింది కాదా? ఇది ఇంకొక శాంతి మతమా? మనం నమ్మాలా?
1980 - 88 మధ్యలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని 20 లక్షలమంది చచ్చారు.
అందరూ ముస్లిములే ఉన్నచోట షియాలు, సున్నీలు అని కొట్టుకుంటారు. అందరూ క్రైస్తవులే ఉన్నచోట కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అని కొట్టుకుంటారు. వీళ్ళలో ఇంకా చాలా గ్రూపులు, డినామినేషన్లు ఉన్నాయి. బయటకు ఆ గొడవలన్నీ కనిపించవు. లోతుగా చూచినవారికి మాత్రమే అర్ధమౌతాయి. తెలియనివారికి మాత్రం అవి చాలా శాంతిమతాలని మాయమాటలు చెబుతారు.
జనాభాను పెంచుకొని దేశదేశాలు ఆక్రమించి, విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ దేశస్థులను లేకుండా రూపుమాపడమే వీళ్ళ అజెండా. శాంతి అనేది దీనికి ఒక ముసుగు మాత్రమే.
చరిత్ర చదువుకుంటే ఇవన్నీ అర్ధమౌతాయి. ఏమీ తెలియకుండా డబ్బులకు అమ్ముడుపోయి, పాస్టర్లు, ముల్లాలు చెబుతున్నది నిజమనుకుంటే ఇలాగే ఉంటుంది మరి !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీస్పీకర్ పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఆ ఏరియాలలో ఇతరపౌరులు శాంతిగా బ్రతికేదెలా సాధ్యపడుతుంది? ఆలోచించండి. హైద్రాబాద్ పాతబస్తీ లాగా, పశ్చిమగోదావరి జిల్లా కూడా తయారైనట్లు కనపడుతోంది. దానికీ దీనికీ మూలం ఆ రెండుమతాలే. అవి అడుగుపెట్టిన చోట శాంతి అనేది ఉండదనేది వాస్తవం.
ఇంకా సందేహాలేమైనా మిగిలున్నాయా?
24, మార్చి 2026, మంగళవారం
International Taijiquan Day
R. I. P Chuck Norris
హాలీవుడ్ యాక్షన్ హీరో 'చక్ నారిస్' మొన్న 19 వ తేదీన అమెరికాలోని హవాయ్ లో చనిపోయాడు. అతనికి 85 ఏళ్ళు. చివరివరకూ ఆరోగ్యంగానే ఉన్న ఇతను, ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి పోయాడంటున్నారు. కారణాలు తెలియవు.
23, మార్చి 2026, సోమవారం
మన హిందూమతం చాలా గొప్పది
'ఫలానా హిందూసంస్థ నుండి మాట్లాడుతున్నాము' అంటూ ఈమధ్య ఒక ఫోన్ కాలొచ్చింది.
పరిచయాలయ్యాక. 'ఎందుకు ఫోన్ చేస్తున్నారు?' అడిగాను.
'మీ కృషి చాలా బాగుంది. మీ వ్రాతలన్నీ మేము చదువుతాము. ముఖ్యంగా, క్రైస్తవాన్ని, ఇస్లాంను మీరు విమర్శించే తీరు బాగుంటుంది' అన్నారు.
'మన హిందూమతాన్ని కూడా విమర్శిస్తూనే ఉంటాను. అది చదవలేదా?' అడిగాను.
'చదువుతున్నాము. అందుకే ఈ ఫోన్. మనల్ని మనమే విమర్శించుకుంటే ఎలా?' అన్నాడాయన.
'ఆత్మవిమర్శ మంచిదేగా?' అడిగాను.
'అది తగ్గించి, ఇతర మతాలను ఎండగట్టడంపైన దృష్టి పెట్టండి. ఇది మా రిక్వెస్ట్' అన్నాడు.
'అది సరే. కానీ మన హిందువుల పిచ్చిపోకడలను వదిలేస్తానని మాత్రం చెప్పలేను' అన్నాను.
'అది చెయ్యడానికి మతాచార్యులున్నారుగా?' అన్నాడు.
'ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు మన మతాచార్యులు?' అడిగాను.
'అంటే వాళ్ళ పరిమితులు వాళ్ళకుంటాయి కదండీ' అన్నాడు.
'పరిమితులుంటాయి సరే. హిందువులు తప్పులు చేస్తున్నపుడు, 'ఇది తప్పు. వద్దు చెయ్యకండి' అని ఎందుకు చెప్పడం లేదు? హిందూమత మూలాల గురించి, అసలైన హిందూమతం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు?' అడిగాను.
దానికి జవాబు చెప్పకుండా, 'మనమందరం ఐకమత్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది' అన్నాడు.
'ఇప్పుడు క్రొత్తగా వచ్చేదేముంది? చరిత్రలో ఇటువంటి కాలాలు చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు మనం ఫెయిలయ్యాం' అన్నాను.
'కనుకనే ఇప్పుడు మనం కలిసుండాలి' అన్నాడు.
'కలిసుండక విడిపోయిందెప్పుడు?' అన్నాను.
'అంటే, అందరూ ఒక్క త్రాటిపైకి రావాలి' అన్నాడు.
ఆయన మాటలు రాజకీయ పడికట్టు పదాలలాగా ధ్వనించాయి.
'ఎక్కడుంది ఆ త్రాడు?' అడిగాను.
జవాబు లేదు.
'మీరు చెప్పలేకపోయినా, నేను చెబుతున్నాను వినండి. నేనా త్రాటిపైననే ఉన్నాను. లేనివాళ్ళని దానిపైకి రమ్మనే నేనూ చెబుతున్నాను. ఈ క్రమంలోనే మన హిందూమతంలోకి రోజురోజుకూ వచ్చి చేరుతున్న పిచ్చిపోకడలను ఖండిస్తున్నాను' అన్నాను.
'కొంచెం వివరిస్తారా?' అడిగాడు.
'చూడండి. శివుడు, విష్ణువు. అమ్మవారు, ఇతర ప్రామాణిక హిందూదేవతలందరినీ మేము ఒప్పుకుంటాము. క్రొత్తగా తయారౌతున్నవారిని, చేర్చబడుతున్నవారిని మాత్రం ఒప్పుకోము. పోతే, వైష్ణవులు శైవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.
'ఒప్పుకోరనుకోండి. దానిని కూడా మేము ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.
' మరి శైవులు వైష్ణవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.
' ఒప్పుకోరు' అన్నాడు.
' అలాగే, ఏ శాఖైనా మిగతావారిని ఒప్పుకోవు. ఇదంతా తప్పని, దేవతాస్వరూపాలన్నీ ఒకే పరబ్రహ్మము యొక్క అనేకరూపాలని ఏ ఆచార్యుడు, ఏ గురువు చెబుతున్నారు?' అడిగాను.
' మేమూ ప్రయత్నిస్తున్నాము. ఈ సత్యాన్ని జనంలోకి తీసికెళ్ళడానికి' అన్నాను.
'దానిని అర్ధం అయ్యేటట్లుగా చేయాలంటే, పురాణకధలను వదలిపెట్టి, ఉపనిషత్తులను బోధనాగ్రంధాలుగా తీసుకోవాలి. పురాణాలు తెలివిలేని పామరజనంకోసం వ్రాయబడినవి. ఉపనిషత్తులు జ్ఞానభాండాగారాలు. సామాన్యజనానికి కూడా వాటిలోని జ్ఞానాన్ని వివరించి చెప్పాలి. అంతేగాని పురాణకధలను పట్టుకొని కూచోకూడదు' అన్నాను.
' సామాన్యజనం వాటిని అర్ధం చేసుకోవడం కష్టమే. మేమూ ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.
'నేనూ అదే చేస్తున్నాను. ఈ క్రమంలో మన వెర్రిపోకడలను ఖండించడం కూడా చాలా అవసరం. ఆత్మవిమర్శ లేకపోతే, మనకున్న అతిఉదారత్వానికి, అసలు సత్యమే కొన్నాళ్ళకు మరుగునపడే ప్రమాదముంది. అప్పుడు అసలైన హిందూమతం ఉండదు. చిల్లరదేవుళ్లు, దొంగస్వాములు మాత్రమే మిగులుతారు' అన్నాను.
'మాకు మీరిచ్చే సలహా?' అడిగాడు చివరకు.
'ఇతరమతాల డొల్లతనాన్ని ఎండగట్టవలసిందే. అదే సమయంలో, మన హిందూమతంలో ఇప్పటికే ఉన్నవీ, క్రొత్తగా చేరుతున్నవీ వెర్రిపోకడలను కూడా ఎండగట్టాలి. తొలగించాలి. ఈ రెండుపనులూ సమాంతరంగా సాగాలి. అప్పుడే అసలైన హిందూమతమెంత గొప్పదో, దానిని అర్ధం చేసుకోలేక, హిందువులమనుకుంటున్నవారు కూడా ఎలా తప్పుదారిన పోతున్నారో, జనాలకు అర్ధమౌతుంది. దానినే నా పుస్తకాల ద్వారా, మా సంస్థద్వారా నేను చేస్తున్నాను. చాలామందిని ఇప్పటికే జాగృతపరచాను. ఇంకా కొనసాగిస్తున్నాను. నేనేకాదు. దేశభక్తి, దైవభక్తి ఉన్న ఏ హిందువైనా ప్రస్తుతం చేయవలసింది ఇదే' అన్నాను.
'ప్రణామాలు' అని ఫోన్ పెట్టేశాడాయన.
12, మార్చి 2026, గురువారం
గ్యాసుదేవుని మహిమలు
ఇవాళ తెల్లవారుఝామున బ్రహ్మముహూర్తంలో మంచినిద్రలో ఉండగా నారదమహర్షి కలలో కొచ్చాడు.
'నాయనా ! నీవు ఆశ్రమమునకే పూర్తిగా పరిమితమై పోయితివి. బయటి ప్రపంచమును ఈషణ్మాత్రమూ పట్టించుకొనుటలేదు. మరీ దద్దమ్మవగుచున్నావు. అప్పుడప్పుడు కాస్త బయటకు కూడా వెళ్లి లోకసంచారము చేయుచుండుము. అప్పుడు మాత్రమే నీకు లోకపుతీరు అవగతం కాగలదు' అని సెలవిచ్చి, నేనేదో చెబుదామనుకునేలోపు డామ్మని మాయమైపోయాడు.
'దేవతలకీ ఋషులకీ కూడా ప్రస్తుతం తీరిక ఉండటం లేదు. అందరూ డెలివరీ బాయ్స్ అయిపోతున్నారు. చెప్పాలనుకున్నది చెప్పేయడం మాయమైపోవడం. ఎదుటివాడి రియాక్షన్ కోసం ఆగడం లేదు. స్పీడు బ్రతుకులైపోయాయి. ఏం చేస్తాం?' అనుకుంటూ బద్దకంగా నిద్రలేచాను.
ఫ్రెష్షయ్యి, ప్రధానశిష్యురాలిని తీసుకుని లోకసంచారానికి బయల్దేరాను.
అదేంటో మరి, టిఫిన్ చేద్దామంటే అన్ని హోటళ్ళూ మూసేసి ఉన్నాయి. కనీసం టీ షాపులు కూడా లేవు.
'ఏంటిది? ఇంతఘోరకలిగా యున్నది?' అని శిష్యురాలిని అడిగాను.
'యుద్ధం ప్రభావంతో గ్యాసు ఆగిపోయింది. హోటళ్లు బంద్' అని చెప్పింది
ఒక గేటెడ్ కమ్యూనిటీ ముందు అందరూ కర్రలతో కొట్టుకుంటున్నారు.
'ఇదేంటి? ఈ విధముగా యుద్ధము చేయుచున్నారు?' అడిగాను.
'అది యుద్ధం కాదు. ఒక్కటే గ్యాస్ సిలెండర్ ఉందిట. దానికోసం అందరూ అలా కొట్టుకుంటున్నారు' చెప్పింది.
'గతంలో నా చిన్నప్పుడు, నీళ్ళపంపులవద్ద ఈ దృశ్యములను చూచితిని. ఇప్పుడు ఈ విధముగా చూడవలసి వచ్చినది. ఇదియేకదా మాయాప్రభావము' అన్నాను.
'నోరుముయ్యి' అన్నట్టు చూసింది శిష్యురాలు.
'ఇరాన్ యుద్ధం వల్ల ఇలా ఉంది' అన్నది.
'యుద్దమా? అదెక్కడ?' అన్నాను అయోమయంగా.
'అందుకే అప్పుడప్పుడూ లోకసంచారం చెయ్యమని మహర్షి చెప్పింది' అన్నది కోపంగా.
'ఓహో నా అగ్నానం నీక్కూడా తెలిసిపోయిందా?' అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాను.
కొద్దిగా ముందుకెళ్లాం.
'గ్యాసు నామమె పావనము, ప్రభు గ్యాసే రక్షణ కారణము' అంటూ ఒక ప్రార్ధనామందిరంలో నుంచి మైకు మోగుతోంది.
'రామరామ ! బంగారంలాంటి పాటని ఇదేంటి ఇలా మార్చేశారు? అన్నాను విస్తుపోతూ.
'నిన్ననే గ్యాసుదేవుని వైపు కన్వర్ట్ అయ్యారు.యుద్ధం ప్రభావం' కామ్ గా అంది శిష్యురాలు.
మతిపోయింది.
ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి 'గ్యాసో హో సిలెండర్' అంటూ ఇంకో చోటనుంచి పెద్దగా శోకాలు వినిపించాయి.
భయమేసింది.
'ఇదేంటి? వీళ్ళుకూడానా?' అన్నాను.
'అవును. గ్యాసు దొరకడం లేదుగా. కన్వర్ట్ కాక వాళ్ళకీ తప్పలేదు' అంది శిష్యురాలు.
ఇంకో వందగజాలు వెళ్లేసరికి ఇంకొక గుడిలో నుండి శ్లోకాలు వినిపించాయి.
'గ్యాసుదేవాయ నమః, గ్యాసుప్రభువే నమః, గ్యాసురాజాయ నమః, సిలెండరు మాతాయ నమః' అంటూ మైకు పెద్దగా మ్రోగుతోంది.
'వీళ్ళకేం పోయేకాలం?' అడిగాను.
'కన్వర్ట్ కావడానికి వీళ్ళు ముందుంటారు కదా. నిన్ననే ఎవరో గ్యాస్ సిలెండర్ ఇచ్చారట. వెంటనే మతం మారిపోయారు. గ్యాసుమీద అష్టోత్తరాలు రాసుకున్నారు. పాడుతున్నారు' అన్నది శిష్యురాలు.
విరక్తిగా నవ్వుకున్నాను.
ఇంతలో ఒక పెద్దగుంపు ఎదురొస్తే ప్రక్కకు తప్పుకుని 'ఏంటా?' అని చూచాం.
అందరి తలలపైనా గ్యాస్ సిలెండర్ ఆకారంలో టోపీలున్నాయి.
'వీళ్లెవరు?' అడిగాను.
'సిలెండర్ ఫౌండేషన్' అని క్రొత్తసంస్థ. సిలెండరు బొమ్మని అలా నెత్తిమీద పెట్టుకుని రోడ్లమీద తిరుగుతుంటే, స్థూలదేహంలో నుండి సూక్ష్మదేహం బయటకొచ్చి, ఎక్కడెక్కడో తిరుగుతుందట' అంది శిష్యురాలు.
'అంటే, స్థూలదేహం రోడ్లమీద తిరుగుతుంటే, సూక్ష్మదేహం లోకలోకాలు తిరుగుతుందా? ఎందుకలా? రెండూ ఒకేచోట చావచ్చుగా?' అడిగాను.
'ఏమో? నీ దేహానికి ఒకచోట ఉండటం ఇష్టమైనట్టే, వాళ్ళ దేహాలకు బయటతిరుగుళ్లు ఇష్టం. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, కాదనడానికి మనమెవరం?' అంది శిష్యురాలు.
ఖాళీగా ఉంటే ఎవడైనా వచ్చి సిలెండర్ టోపీ పెడతాడేమో అని భయమేసి వెంటనే జేబులోంచి కర్చీఫు తీసి తలచుట్టూతా కట్టుకున్నాను.
మరికొన్ని అడుగులేసేసరికి, ఒక బోర్డు కనిపించింది.
'గ్యాసు రావడం లేదని విసిగిపోతున్నారా? మీకు గ్యాసు ఎప్పుడు వస్తుందో గ్యారంటీగా చెప్పబడును' ఇట్లు ప్రసిద్ధ కోయజ్యోతిష్కులు, అని దానిమీద రాసుంది.
'గ్యాసు రావడం ఏంటి?' అన్నాను అర్ధం కాక.
'అంటే, గ్యాస్ సిలెండర్ డెలివరీ అని అర్ధం' అంది శిష్యురాలు చిరాగ్గా.
'ఓహో అదా ! చివరకు వీళ్ళుకూడా తయారయ్యారా?' అన్నాను నిరాశగా.
'అప్పుడే ఏమైంది? అటుచూడండి' అంది శిష్యురాలు.
'మీ మోకాలు చూసి, గ్యాసు ఎప్పుడొస్తుందో చెప్పబడును. జాతకంతో పనిలేదు' అని ఇంకో బోర్డు కనిపించింది.
'ఇదేంటి ఇలా పెట్టాడు?' అన్నాను.
'అందరూ చేతులు, ముఖాలు చూసి జ్యోతిష్యం చెబుతున్నారు కదా. వెరైటీగా ఉంటుందని ఇలా పెట్టాడు. బ్రెయిన్ అక్కడే ఉంటుందని వాళ్ళ పెద్దదొర చెప్పాట్ట. అందుకే వాళ్ళు మోకాళ్ళు మాత్రమే చూస్తారు' అంది.
'ఇక నా వల్లకాదు. పీచే ముడ్' అని గట్టిగా అరిచాను.
కట్ చేస్తే, ఇద్దరం ఆశ్రమంలో తేలాం.
'హమ్మయ్య' అని గాలి పీల్చుకునేలోపు, ఫోన్ మ్రోగింది.
ఫోనెత్తి 'హలో' అనేలోపే, 'గురూగారు. నాకిప్పుడే అబ్బాయి పుట్టాడు. బెడ్ పక్కనించే ఫోన్ చేస్తున్నా. ఏం పేరు పెట్టమంటారు?' అడిగాడు ఒక పరమాణువు.
'నీకు పుట్టటం ఏంటి?' అరిచాను విసుగ్గా.
'అంటే, వాళ్ళావిడకని అర్ధం. నువ్వూ నీ చచ్చు సందేహాలు' అని పక్కనించి గిచ్చింది శిష్యురాలు.
'గ్యాసు నాధ్' అని పెట్టుకో ఫో' అని మళ్ళీ ఫోన్లోకి అరిచాను.
'టాంక్యూ గురూజీ. మా ఆవిడక్కూడా కలలో గ్యాసునాధుడు కనపడి, పుట్టబోయే పిల్లాడికి తన పేరే పెట్టాలని. లేకపోతే మా సంగతి తేలుస్తానని బెదిరించాట్ట. మేముకూడా ఇదే అనుకున్నాము. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం మీకు ఫోన్ చేశాము. మీరు కూడా అదే చెప్పారు. టాంక్యూ సోమచ్' అని పొంగిపోతున్నాడు.
'ఎక్కువ పొంగిపోకు, పొయ్యిలో పడగలవు' అన్నాను.
'ఇంకొక్క విషయం గురూజీ. మా చెల్లెలిక్కూడా ఇప్పుడే అమ్మాయి పుట్టింది. దానికేమని పేరు పెట్టాలి?' అడిగాడు.
'అస్సలు టైం వేస్ట్ చెయ్యడం లేదురా మీరు?' అనుకుంటూ, 'సిలెండర్ రాణి' అని పెట్టండి. ఎలాగూ పెద్దయ్యాక అయ్యేది అదేగా' అన్నాను.
'టాంక్యూ గురూజీ' అని ఫోన్ పెట్టేశాడు శిష్యుడు.
'హమ్మయ్య' అని చుట్టూ చూడగానే శిష్యులెవరూ కనిపించలేదు.
'వీళ్లంతా ఎక్కడికి పోయారు?' అరిచాను కోపంగా.
'కట్టెపుల్లలేరుకు రావడానికి పక్కపొలాల్లో తిరుగుతున్నారు. మనకీ గ్యాసు లేదు మరి' అంది శిష్యురాలు.
ప్రశ్నార్ధకంగా చూశాను.
'ప్రపంచం ఎన్ని కష్టాలలో ఉందో చూశారు కదా గురూజీ. ఏదైనా రెమెడీ చెప్పి పుణ్యం సంపాదించుకోండి' ప్రాధేయపడింది శిష్యురాలు.
తీవ్రంగా ఆలోచించాను.
'ఓకే ! దీనికొకటే మార్గముంది. వెంటనే అందరూ టవల్స్ కట్టుకుని దీక్ష మొదలుపెట్టండి. నలభైరోజులపాటు అదే టవల్లో ఉండాలి. అదే మన దీక్షాడ్రస్సు. 'జై గ్యాసుదేవాయ నమః' అనే మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. అన్నిపనులూ మానేసి దీన్ని రోజుకు ఇరవైకోట్లసార్లు జపించాలి. నలభైరోజులపాటు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అయితే, 'స్ట్రా'తో బిందెలోనుంచి పీల్చుకుంటూ తాగచ్చు. కానీ గాలిమాత్రం ఈ నలభైరోజులపాటు అస్సలు పీల్చరాదు. అప్పుడన్ని సమస్యలూ గాలిలో కలసిపోతాయి. వెంటనే అన్నిదేశాలలో ఉన్న మన శిష్యులందరికీ మెయిల్స్ పంపండి. అందరూ ఈ దీక్షను మొదలుపెట్టండి' ఆజ్ఞాపించాను.
'ఓకే గురూజీ !' అని శిష్యురాలు ఆ పనిలోకి దిగింది.
'జై గ్యాసునాధాయ నమః' అనుకుంటూ నేను పక్కమీద వాలాను.
28, ఫిబ్రవరి 2026, శనివారం
ఎలైట్ మేరేజ్

ఇది ప్రేమవివాహం. ఆ తరువాత, పెద్దలు అంగీకరించిన వివాహం.
ఆశ్రమంలో నిరాడంబరంగా జరిగిన వివాహం.
కేవలం నలభైఅయిదు నిముషాలలో పెళ్లి అయిపోయింది.
మంత్రాలు లేవు. హంగులు లేవు. ఆర్భాటాలు లేవు. మేకప్పులు, వీడియోలు, ఫోటోషూట్ల అనైతికపోకడలు లేవు. ఎరువుతెచ్చుకున్న సంగీత్ లు, బారాత్ లు, ఆడాళ్ళ డాన్సులు లేవు. మైకులగోల లేదు.
పిల్లలగోల, సంతమార్కెట్ లాంటి వాతావరణం, అహంకారధోరణులు, అలుగుళ్ళు, అరుచుకోవడాలు, కోపతాపాలు, వస్తువులు పోవడాలు, ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, ఒళ్లలిసిపోయేలా, కళ్ళు తిరిగిపోయేలా కష్టపడిపోవడాలు, కట్నకానుకలు, పెట్టుపోతల గొడవలు, తొంభయి రకాల ఐటమ్స్ తో భోజనాలు, అందులో సగంపైన వృధాకావడం -- ఇవేవీ భూతద్దంతో వెతికినా ఎక్కడా లేవు.
మౌనంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆహ్వానితులు.
మంద్రమైన సన్నాయి మేళం.
హడావుడీ, తొక్కిసలాటా లేని ఆహ్లాదమైన ఆశ్రమవాతావరణం.
చేస్తున్న తంతుకు అర్ధాన్ని తెలుసుకుంటూ అరగంటలో అయిపోయిన పెళ్లి.
అది - పంచవటి నేర్పిన సంస్కారం.
అసలైన సనాతన హిందూధర్మ జీవనవిధానం.
మంత్రాలు లేకపోవచ్చు. కానీ, వాటి అర్ధాలను వివరించడం జరిగింది.
విసుగుపుట్టే తంతులు లేకపోవచ్చు. కానీ, హిందూధార్మిక వివాహంలోని ముఖ్యఘట్టాలన్నీ ఉన్నాయి.
ఉదయం 11.30 కి కార్యక్రమం మొదలైతే, మధ్యాన్నం 1.30 గంటకి ఉపనయనం, పెళ్లి, భోజనాలు అన్నీ అయిపోయి, అతిధులు తిరిగి బయలుదేరడం కూడా జరిగిపోయింది.
ఇదే అసలైన 'ఎలైట్ మేరేజి' అని మావాళ్లతో అన్నాను.
ఎలైట్ అంటే, కులీన, ఉన్నతవర్గానికి చెందిన అని అర్ధాలున్నాయి. 'క్లాస్' అని అర్ధం చెప్పుకోవచ్చు.
పంచవటి శిష్యులందరూ ఈ చీకటిప్రపంచంలో వెలుగుతున్న దీపాలవంటివారు. అంటే లైట్లన్నమాట.
మనలో 'లైట్' ఉన్నపుడు, మనచుట్టూ 'ఎలైట్' లేకుండా ఎలా ఉంటుంది?
ఈ లైటూ, ఎలైటూ, కులంతో, డబ్బుతో, అధికారంతో, హోదాతో, దర్పంతో వచ్చేవి కావు.
ఉన్నతమైన సంస్కారపు విలువలతో, ధర్మబద్ధమైన ఆధ్యాత్మిక జీవనంతో వస్తాయి.
ఇది కులాంతర వివాహం.
'మేము గుణానికి మాత్రమే విలువనిస్తాము. కులానికి కాదు' అని నేను ఎన్నోఏళ్లుగా చెబుతున్నదానికి ఋజువే ఈ వివాహం.
'మేము ఊరకే మాటలను చెప్పము. చెప్పినది చేసి చూపిస్తాము' అనడానికి కూడా ఇదే నిదర్శనం.
పంచవటిలో అన్నికులాలూ ఉన్నాయి. పేదలనుంచి, కోటీశ్వరులవరకూ అన్ని తరగతులవారూ, వర్గాలవారూ ఉన్నారు. కానీ మేమంతా ఒకే కుటుంబం.
దానిపేరు 'పంచవటి' కుటుంబం.
ఇక్కడ అసలైన ఆధ్యాత్మికత ఆచరణాత్మకంగా దర్శనమిస్తుంది.
ఎంతోమంది సంస్కర్తల, మహనీయుల భావాలు ఇక్కడ కార్యరూపం దాలుస్తాయి.
ప్రపంచపు వెకిలితనానికి భిన్నమైన ఉదాత్తమైన, ఉన్నతమైన, సంస్కారపూరితమైన జీవనవిధానం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది.
అందుకే అంటున్నాను ఇది 'ఎలైట్ మేరేజ్' అని.
'వర్గం లేనిదే స్వర్గం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు.
'భక్తేర్ జోతి నోయ్' (భక్తులలో కులం ఉండదు) అని శ్రీరామకృష్ణులన్నారు.
దానిని నిజం చేసి చూపిస్తున్నాం.
స్వర్గాన్ని భూమిపైన ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నాం.
ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలని, ఎంతోమంది జీవితాలలో అవి 'లైట్' ను నింపాలని ఈ సందర్భంగా ఆశిస్తూ, ఈ 'ఎలైట్ మేరేజి' లో పాలుపంచుకున్న అందరికీ, ముఖ్యంగా లండన్, దుబాయ్, అమెరికాల నుండి వచ్చి మరీ ఈ వివాహంలో పాలుపంచుకున్నవారికి, రాగలిగినవారికి, రాలేకపోయినవారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు పంచవటిశిష్యులకు ఈ సందర్భంగా నా ఆశీస్సులందిస్తున్నాను.
అర్ధంలేని ప్రహసనాలుగా నడుస్తున్న నేటి పెళ్లిళ్లన్నీ ఈ 'ఎలైట్ మేరేజి' ని చూచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
26, ఫిబ్రవరి 2026, గురువారం
సోదియోగి
ఆశ్రమంలో ఒక పెళ్లి పెట్టుకున్నాం. దానికని శిష్యులు ఒక్కొక్కరే వస్తున్నారు.
ఇవాళ టిఫిన్లయ్యాక మాట్లాడుకుంటూ ఉండగా శిష్యులు ఒక ప్రతిపాదన తెచ్చారు.
'గురూజీ. మీరేమనుకోకపోయితే ఒక చిన్న మాట' అన్నారు.
'చెప్పండి' అన్నాను.
'ఏమీలేదు. మీరిప్పటిదాకా మొదలుపెట్టిన భజనలు, డాన్సులు అన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడవేవీ అమ్ముడుపోవడం లేదు. ఆశ్రమానికి ఆదాయం తగ్గిపోయింది. అందుకని మాదొక కొత్త ఐడియా' అన్నారు.
ఆదాయమనేసరికి నాకు నూతనోత్సాహం పెల్లుబికింది.
'త్వరగా చెప్పండి' అన్నాను పక్కమీదనుంచి బద్దకంగా లేస్తూ.
'ఏమీలేదు. మీ రెండుపాదాలకు ఫోటో తీసి AI టూల్స్ తో సరిదిద్ది, ఆ ఫోటోలను మార్కెటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ముందు మీ శిష్యులందరూ కొనుక్కుంటారు. ఆ తర్వాత అందరూ కొనుక్కుంటారు' అన్నారు.
నాకనుమానం వచ్చింది.
'అందరూ ఎందుకు కొనుక్కుంటారు?' అడిగాను.
'పిచ్చిజనం ఏదైనా కొనుక్కుంటారు. అంతా మనం మార్కెటింగ్ చేయడంలో ఉంటుంది. ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన బాబాలు, గురువులు అందరూ ఎలా అయ్యారు మరి? ఈ ఫోటో దగ్గరుంటే మీకు అదృష్టం తన్నుకుంటూ వస్తుంది అని ప్రచారం చేద్దాం. చచ్చినట్టు కొనుక్కుంటారు' అడిగారు శిష్యులు.
అదీ నిజమేగా అనిపించింది.
'ఫొటోను కొనుక్కున్నవాళ్ళు దానిని పూజామందిరంలో అందరు దేవుళ్లతో బాటుగా పెట్టుకుంటారు. లేదంటే ఆ దేవుళ్లను మీ పాదాల క్రింద పెడతారు. లేదా, భక్తి ముదిరితే చిన్న చిన్నకార్డులుగా మార్చి జేబులలో పెట్టుకుంటారు. ఇంకా ముదిరిపోతే లాకెట్లుగా మార్చి మెళ్ళో దండలుగా వేసుకుంటారు. మీ పాదాలకు ప్రచారమూ అవుతుంది. మనకు ఆదాయమూ వస్తుంది. ఎలా ఉంది ఐడియా?' అడిగారు శిష్యులు.
ఇన్నాళ్లూ ఈ ఐడియా రానందుకు నామీద నాకే చెడ్డ చిరాకేసింది.
'వెరీ గుడ్ ఐడియా. ఎంత పెడుతున్నారు రేటు?' అడిగాను.
'ఒక కాలుకు రెండువేలు చొప్పున రెండుకాళ్ళకూ నాలుగువేలు పెడదాం' ముక్తకంఠంతో డిసైడ్ చేశారు శిష్యులు.
'మన కాళ్లకు అంత విలువుందా?' అని నాకు అనుమానమేసినప్పటికీ, వాళ్ళు చెబుతున్నారు గనుక, ఉందేమోలే అనిపించి 'ఓకే. ప్రొసీడ్. అయితే ఈ స్కీముకు ఏ పేరు పెడుతున్నారు?' అని అడిగాను.
'బురిడీబాబా లేదా సోదియోగి' అని రెండు టైటిల్స్ అనుకుంటున్నాం, మీరు ఏదో ఒకటి డిసైడ్ చెయ్యండి' అన్నారు శిష్యులు.
'బాబా పాతబడిపోయింది. యోగి బెటర్' అన్నాను.
'సరే గురూజీ, 'సోదియోగి' టైటిల్ ని ఫైనల్ చేద్దాం' అన్నారు శిష్యులు.
'ఎక్సలెంట్. గో ఎహెడ్. విజృంభించండి. ఈ ఫోటోలు లక్షలాది అమ్ముడుపోవాలి. మనకు కోట్లు వచ్చిపడాలి. మరి, ఆ డబ్బుతో ఏం చేద్దాం?' అడిగాను.
'ఏముంది? నల్లమల అడవులలో ఒక నూరెకరాలు కొనేద్దాం' అన్నారు శిష్యులు.
'అడవులు అలా అమ్మరు' అన్నాను కోపంగా
'మరీ మంచిది. అమ్మకపోతే ఆక్రమిద్దాం. ఆక్రమించేసి మన ఆశ్రమం బ్రాంచిని అక్కడ కడదాం' అన్నారు.
'భలే బాగుంది. ఇక పనిమీదుండండి' అని ఆజ్ఞాపించాను.
'సరే గురూజీ, మీరు విశ్రాంతి తీసుకోండి. మిగతా పని మేము చూసుకుంటాం' అంటూ వాళ్ళు పనిలోకి దిగారు.
నేను పక్కమీద వెనక్కు వాలి, మళ్ళీ యూట్యూబులో మునిగిపోయాను.
24, ఫిబ్రవరి 2026, మంగళవారం
నీవే నేను
పసిపాపలా నిద్రిస్తున్న
నీ ముద్దుమోమును చూస్తూ
కనురెప్ప వాల్చలేక
నిద్రకు దూరమయ్యాను
ప్రేమ తప్ప ఏమీ తెలియని
మమత తప్ప ఏమీ ఎరుగని
నీ అమాయకపు మనసును గమనిస్తూ
గుండె కరిగి నీరయ్యాను
కరిగిపోతున్న కాలాన్ని
కళ్ళెదురుగా చూస్తూ
గమ్యంలేని పయనాన్నీ
గతిలేని మన బ్రదుకులనూ
నిస్సహాయంగా పరికిస్తూ
నిశ్చేష్టుడనై నిలుచుండిపోయాను
గతజన్మల మన కథలన్నీ
వరుసగా చదువుకొని
విధి ఆడే వింతాటను తలచి
కన్నీరుమున్నీరయ్యాను
తమ స్వార్థం కోసం
ఇతరులను బలిచేసిన వాళ్లనూ
ఇతరుల స్వార్థం కోసం
తాము బలైపోయిన వాళ్ళనూ
ఎందరినో చూచి
మనసు స్థంభించి శిలనయ్యాను
అదుపులేని ఆవేశాలనూ
వెర్రివైన వ్యామోహాలనూ
బాధ్యత లేని మనుషులనూ
భయంతో సాగే బ్రతుకులనూ
అన్నింటినీ చూస్తూ
బ్రదుకుతీరు అర్ధంకాని వెర్రినయ్యాను
ఎన్నో రూపాలలో ఎన్నో సందర్భాలలో
ఎప్పటినుంచో ఎదురొస్తూ
అన్నింటినీ నేర్పిస్తూ
అనుక్షణమూ ఆదుకున్న
నిన్ను చివరకు గుర్తించి
మాటరాక మూగనయ్యాను
చేయవలసిన పనులు
చెందవలసిన గనులు
చేరవలసిన చోటు
పోరవలసిన పోరు
అసలంటూ ఏవీలేవన్న
అంతిమసత్యం తెలిసిరాగా
నాలో నేనై
అన్ని నేనులూ నేనై
నీవే నేనయ్యాను


