1, మే 2026, శుక్రవారం
మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల
20, ఏప్రిల్ 2026, సోమవారం
సీనియర్ సిటిజన్స్
మనదేశానికి అనేక సమస్యలున్నాయి. పదేళ్లక్రితం వ్రాశాను, త్వరలో మనం ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య 'ఊబకాయం' అని. ఇప్పటికీ ఈ సమస్య తీరలేదు. ఇంకా ఎక్కువైంది.
ఇప్పుడు మరొకసమస్య వచ్చిపడింది. నిజానికి ఈ సమస్య పదేళ్లక్రితం నుంచే ఉన్నప్పటికీ, నేడు ఇంకా ఎక్కువైంది. అదే 'సీనియర్ సిటిజెన్స్' సమస్య.
పదేళ్లక్రితం సీనియర్ సిటిజెన్స్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు 'సూపర్ సీనియర్ సిటిజెన్స్' అయ్యారు.
ప్రస్తుతం మన దేశజనాభా 147 కోట్లు. దీనిలో 7 వ భాగం సీనియర్ సిటిజెన్స్ ఉన్నారు. అంటే, 21 కోట్లు. అందుబాటులోకి వచ్చిన మెడికల్ సదుపాయాలతో, మెరుగుపడిన ఆర్ధికవనరులతో, ఇప్పుడు మనం ఎక్కువకాలం బ్రతుకుతున్నాం. 90 దాకా బ్రతుకుతున్నవారు నేడు చాలామంది ఉన్నారు.
అయితే, వీరిలో క్వాలిటీ లైఫ్ ఉందా? అంటే, లేదనే చెప్పాలి. మందులేసుకుంటూ, సోఫాలకు, వీల్ చెయిర్లకు పరిమితమైపోయి, టీవీలు చూసుకుంటూ బ్రతుకుతున్నవారు కనీసం వీరిలో 5 కోట్లమంది ఉంటారు. ఇంకా పైమాటే కావచ్చు. వీరికి ఎదురౌతున్న అతిపెద్ద సమస్య - చూసుకునేవాళ్ళు లేకపోవడం.
వీళ్ళదగ్గర డబ్బులున్నాయి. ఇంకా కావలసివస్తే, పంపడానికి అమెరికావంటి దేశాలలో పిల్లలు మంచిపొజిషన్లలో ఉన్నారు. కానీ వాళ్ళిక్కడికి రాలేరు. వీళ్ళక్కడికి పోయి ఉండలేరు. ట్రంప్ రానివ్వడు. అయన ఒప్పుకున్నా యుద్ధం రానివ్వదు. అక్కడకెళ్లినా చివరకు ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేరవలసిందే.
ఇక్కడా వీళ్ళను చూసుకునేవారు లేరు. అక్కడా ఉండరు. మరేం చెయ్యాలి?
మా ఆశ్రమం దగ్గర్లోనే ఒక ఊరుంది. అందులో, ఇంటికొకరు చొప్పున అమెరికాలో ఉన్నారు. ఇక్కడేమో, ఇంటిలోని ముసలాళ్ళు అరుగులమీద కూచుని శూన్యంలోకి చూస్తూ ఉంటారు. పెద్దపెద్ద ఇళ్ళు. చేసేవారు లేరు. చూసేవారు లేరు. ఏం చెయ్యాలో తెలియని స్థితి.
ఇదీ నేడు మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో ఒకటి.
అందుకనే వృద్ధాశ్రమాలు ఎక్కువౌతున్నాయి. అయితే వాటిలో కూడా తేడాలున్నాయి. కొన్నింటిలో మంచి సదుపాయాలుంటే, చాలావాటిల్లో అరకొర సదుపాయాలే ఉంటున్నాయి.
కొంతమంది సాఫ్ట్ వేర్ నిపుణులు కూడా 40కే ఉద్యోగాలు మానేసి వృధ్ధాశ్రమాలు నడుపుకుంటూ జీవిస్తున్నారు. టెన్షన్ ఉండదు. వృద్ధులకు సేవ చేసినట్లు ఉంటుంది. అన్న ఆలోచనతో దీనిని చేస్తున్నారు.
వృద్ధాశ్రమం అంటే బాగుండదని, వీటిని 'కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్' అంటున్నారు. అమెరికాలో అయితే, సీనియర్ సిటిజెన్స్ కోసం పెద్దపెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడే సెటిలైన కొంతమంది మనవాళ్ళు కూడా వీటిని పెట్టారు. పెట్టబోతున్నారు.
మొన్న హైద్రాబాద్ వెళ్ళినపుడు ఒకాయన్ని కలిశాను. ఆయనకు 85 ఏళ్ళు.
'నేను 125 వరకూ బ్రతుకుతాను' అన్నాడాయన. 'డైట్ లో జాగ్రత్తగా ఉంటూ, మంచిమందులు వాడుకుంటూ ఉంటే 125 దాకా బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు' అన్నాడు.
'అన్నాళ్ళు బ్రతికి ఏం చేద్దామని?' అన్నాను చనువుగా.
'ఏమీ లేదు. బ్రతకడమే. కొత్తగా చేసేదేమీ లేదు. చేసేదంతా వయసులో ఉన్నపుడు చేశాం. ఇప్పుడు చేసేదేమీ లేదు' అన్నాడాయన.
'మిమ్మల్ని చూసుకునే పనివారి జీతభత్యాలకు నెలకు ఎంత ఖర్చవుతుంది?' అనడిగాను.
'దాదాపుగా లక్షా ఏభై వేలౌతుంది' అన్నాడు.
'మీరు భరించగలరు కాబట్టి భరిస్తున్నారు. అందరూ పెట్టుకోలేరు. వాళ్ళ గతేంటి?' అడిగాను.
'వాళ్లకు తగిన కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్ వారికున్నాయి' అన్నాడాయన.
స్వయానా ఆయనే అటువంటి ఒక సెంటర్ను కొన్నేళ్లపాటు నడిపి ఇప్పుడు చేతకాక విరమించుకున్నాడు.
'మీ ఆశ్రమంలో ఇటువంటి ఫెసిలిటీ పెడితే బాగుంటుంది కదా' అని కొందరడిగారు.
'మాది సాధనాశ్రమం, వృద్ధాశ్రమం కాదు' అని వారికి చెప్పాను.
ఈ వృద్ధులకు హఠాత్తుగా ఏదైనా అయినా కూడా, విదేశాలనుండి వెంటనే వచ్చే పరిస్థితిలో వీళ్ళ పిల్లలు లేరు. 'ఏదో ఒకటి చేసెయ్యండి. వీడియోలో చూస్తాం. డబ్బులు పంపిస్తాం' అని కొందరంటున్నారని ఒక వృద్ధాశ్రమం నడిపేవారు నాతో అన్నారు.
కాళ్ళూచేతులూ సరిగ్గా ఉన్నంతవరకే ఎవరి ఆటలైనా సాగుతాయి. ఏదైనా తేడా వస్తే, మామూలు మనిషైనా, రిటైర్డ్ ఐఏఎస్ అయినా, డిప్యూటీ సిఎం అయినా, ఆస్పత్రిపాలు కావలసిందే. ఒకరిపైన ఆధారపడవలసిందే. డబ్బుంటే కొంతవరకూ నడుస్తుంది. ప్రేమగా చూడకపోయినా, ఏదోరకంగా చూసుకునేవారైనా కనీసం ఉంటారు. అదికూడా లేకపోతే, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
నేడు అలాంటి దారుణపరిస్థితిలో ఉన్న పెద్దవారి సంఖ్య 21 కోట్లు. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.
వీళ్ళను జాగ్రత్తగా చూసుకునే 'కమ్యూనిటీ లివింగ్ సెంటర్లు' మరిన్ని రావలసిన అవసరం ఉన్నది. టెన్షన్ లేని జీవితం మనదేశంలోనే గడపాలని అనుకునేవారికి ఇదొక మంచి బిజినెస్ అవకాశం. ఔత్సాహికులు ముందుకొస్తే బాగుంటుంది.
రేప్పొద్దున వీళ్ళ పరిస్థితైనా, ఇంకెవరి పరిస్థితైనా ఇంతేగా మరి!
18, ఏప్రిల్ 2026, శనివారం
రాజశ్యామల - బగళాముఖి
కొంతమంది బంధుమిత్రులను కలిసే పనిమీద రెండ్రోజులపాటు హైద్రాబాద్ లో ఉండి ఆశ్రమానికి తిరిగి వచ్చాము. మొదటిసారి హైద్రాబాద్ నరకంలాగా అనిపించింది.
1980 లో నేను హైదరాబాద్ లో మొదటిసారి అడుగుపెట్టాను. బెంగుళూరుకూడా అప్పుడే చూశాను. ఆ రోజులలో ఆ సిటీలు రెండూ స్వర్గాలు. నేడు నరకాలయ్యాయి.
1980 డిసెంబర్ లో చీకటిపడ్డాక దిల్సుఖ్ నగర్ రోడ్డుమీద నడుస్తుంటే, చలి అలవాటు లేనివాళ్లకు స్వెటర్ వేసుకోవలసిన అవసరం అయ్యేది. బడుగువర్గాలు కంబళ్ళు కప్పుకుని చిన్నచిన్న చలిమంటలేసుకుంటూ ఉండేవారు.
నేడు పొద్దున్న పదిగంటలకి రోడ్డుమీద నడుస్తుంటే గాడ్పు కొడుతోంది. వడదెబ్బ తగిలేటట్టుంది. ఒక గంట పనిమీద బయటకెళ్ళి వస్తే, షవర్ క్రింద స్నానం చేసి, ఏసీలో కూర్చోవలసి వస్తోంది. హైద్రాబాద్ వాతావరణం అంతగా పాడైపోయింది. ఇక బెంగుళూరు మాటైతే చెప్పాల్సిన పనే లేదు. జీవితం పైన విరక్తి పుట్టేట్టుగా ఉన్నది.
ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్. నేల, మట్టి, ఎక్కడా లేవు. చెట్లు లేవు. వెహికిల్ పొగ, పెరిగిపోయిన జనాభా, ఏసీల నుండి వస్తున్న వేడి, కాంక్రీట్ బిల్డింగ్స్ నుండి రిఫ్లెక్ట్ అవుతున్న ఎండ, అన్నీ కలసి చల్లటి హైద్రాబాద్ ని నిప్పులకుంపటిగా మార్చేశాయి. నేను విజయవాడలో ఉన్నానా? లేక హైద్రాబాద్ లో ఉన్నానా? అర్ధం కాలేదు. రెండూ ఒకే విధంగా అనిపించాయి.
హైద్రాబాద్ తో పోలిస్తే మా ఆశ్రమం స్వర్గంలాగా ఉంది.
ఈలోపల ప్రక్కనున్న ఒక శిష్యురాలు, 'రాజశ్యామలంటే ఎవరు?' అని అడిగింది ఒక వాల్ పోస్టర్ను చూస్తూ.
అటు చూశాను. విషయం అర్ధమైంది.
'రాజుగారింట్లో ఉండే శ్యామల' అన్నాను.
'జోకులాపి విషయం చెప్పండి' అన్నది.
'రాజశ్యామలంటూ ఎవరూ లేరు. అదొక మాయ. దశమహావిద్యలలో ఆమెపేరు మాతంగి. ఆమె ఉపాసన మంచి కవిత్వశక్తినిస్తుంది. మంచిమేధస్సునిస్తుంది. లలితకళలలో మంచి ప్రజ్ఞనిస్తుంది. తారాదేవికే మరొకపేరు శ్యామల. మామూలుభాషలో సరస్వతీదేవి, తాంత్రికప్రపంచంలో మాతంగి అయింది. మన 'తారాస్తోత్రం' చదివావు కదా. తార అన్నా, మాతంగి అన్నా, శ్యామల అన్నా ఆమెనే. తెలుగు సరిగ్గారాని నేను ఇప్పటికి పదివేలపైగా పద్యాలు వ్రాశానంటే అదెలా కుదిరిందంటావు? ఆలోచించు' అన్నాను.
'మరి రాజశ్యామల అని ఎందుకంటారు?' అడిగింది.
'శ్రీవిద్యోపాసనా విధానంలో, లలితాపరమేశ్వరిని ఒక రాణిగా అనుకుంటే, ఆమెకొక మంత్రి, ఒక సేనాపతి ఉంటారు. ఆ మంత్రిణీదేవత పేరే మాతంగి. రాజపరివారంలో ఉంటుంది గనుక, రాజ్యాధికారాన్ని నడిపిస్తుంది గనుక రాజశ్యామల అని పేరు మార్చారు. ఈమెకు హోమం చేస్తే రాజ్యాధికారం వస్తుందని మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ రాదు. దశమహావిద్యలు తెలుగువారి చేతులలో భ్రష్టు పడుతున్నాయి. అంతే.
మహావిద్యలు అవినీతిని సపోర్ట్ చెయ్యవు. అవి మన గొంతెమ్మకోరికలను తీర్చుకునే మంత్రవిద్యలు కావు. పాతాళభైరవి, బాలనాగమ్మ సినిమాలు చూస్తే ఇలాంటి పైత్యాలు పుడతాయి. అవి ఆత్మసాధనా విద్యలు మరియు మోక్షవిద్యలేగాని, మోసవిద్యలు కావు.
నువ్వు చేసే మినప్పప్పు, కందిపప్పు, మిరపకాయల హోమాలతో జగన్మాత కరుణిస్తుందని, నీ గొంతెమ్మ అవినీతికోరికలను తీరుస్తుందని అనుకుంటే అంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి ఉండదు. దురదృష్టవశాత్తూ, గత పాతికేళ్లుగా ఇటువంటి ట్రెండ్ లను కొంతమంది సోకాల్డ్ స్వాములు పెంచి పోషిస్తున్నారు. వీళ్లకు రాజకీయులు వంతపాడుతున్నారు. నేడు దీనినొక వ్యాపారంగా మార్చారు. వెరసి మహావిద్యోపాసనను క్షుద్రవిద్యల స్థాయికి దిగజార్చారు.
దశమహావిద్యలనేవి ఇనుమును బంగారంగా మారుస్తాయి. కానీ మనం వాటినుపయోగించి బంగారాన్ని మట్టిగా మార్చుకుంటున్నాం. రామకృష్ణులు చెప్పలేదా, రాజు దగ్గరకెళ్ళి పుచ్చువంకాయలు కోరతారని? అంతే' అన్నాను.
'మరి తెలిసినవాళ్ళు చెప్పచ్చు కదా?' అన్నది.
'ఎవరు వింటారు? స్వార్ధపుకోరికలతో కుళ్లిపోతున్న ప్రపంచానికి నిజాలెందుకు? మాయలే కావాలి. ఉన్నతమైన భావజాలం ఎవరికుంది? కోరికలు తీరడం, అప్పనంగా కోట్లు వచ్చి పడటం, పవర్ చేతిలోకి రావడం, దానితో మళ్ళీ అవినీతి చేసి వేలకోట్లు వెనకెయ్యడం ఇదేకదా నేటి ట్రెండ్? సమాజంలోగాని, మనుషులలోగాని నీతి ఎక్కడుంది? అసలైన ఆధ్యాత్మికత ఎవడికి కావాలి ఈరోజుల్లో? అన్నీ నకిలీబ్రతుకులేగా?' అన్నాను.
'దశమహావిద్యలలో అన్నీ అంతేనా?'అడిగింది.
'అంతే. ఉదాహరణకు బగళాముఖిని చూడు. మొన్నొకామె 'నేనుకూడా బగళాముఖి చేస్తున్నా' అన్నది. 'రాత్రికి ఉప్మా చేస్తున్నా' అన్నట్టు.
ఎందుకమ్మా అంటే, 'శత్రుస్తంభన' అన్నది.
'అదేంటంటే, 'శత్రువులు నాశనమైపోతారు' అన్నది.
'ఎవరిదగ్గర ఉపదేశం పొందావు?' అంటే, 'ఉపదేశం ఎందుకు? యూట్యూబ్ లో చూసి మంత్రం జపిస్తున్నా' అన్నది.
'నువ్వేమైనా దావూద్ ఇబ్రహీంవా? లేక ఏవైనా చీకటివ్యాపారాలు చేస్తున్నావా? అంతమంది శత్రువులు నీకెందుకున్నారు?' అని నేనడిగాను.
'అదికాదు. మన మాట చెల్లుబాటు కావడానికి' అంది.
'నువ్వు ధర్మంగా జీవించడం ముఖ్యంగాని, నువ్వు వాగేది ఏదైనా సరే చెల్లుబాటు కావాలని అసలెందుకు కొరుకుంటున్నావు? శత్రువులైనా ఇంకొకరైనా నాశనం కావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది తప్పుకాదా? దీనికి బగళాముఖి సపోర్టా? పైగా యూట్యూబ్ లో చూసి జపిస్తున్నావా?' అని అడిగాను.
జవాబు లేకపోగా, 'నీకింతేనా తెలిసింది?' అన్నట్టు చూసింది' అన్నాను.
శిష్యురాలు ఆలోచనలో పడింది.
'అసలీ దేవతలందరూ ఉన్నారా? మనం చేసే అన్నిపనులలో మనకు సపోర్ట్ చేస్తారా?' అడిగింది.
'ఉన్నది ఒకటే శక్తి. దానిని నీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకొని ఆరాధిస్తున్నావు. అదికాదు ముఖ్యం. నీ జీవితంలో నువ్వెంత శుద్ధంగా బ్రతుకుతున్నావనేది ముఖ్యం. నీ మంత్రాలకు, హోమాలకు, నైవేద్యాలకు పడిపోవడానికి దేవుడు ఒక వెర్రివెంగళప్ప కాదనే విషయం నువ్వు ముందుగా అర్ధం చేసుకోవాలి. మనుషులకు లంచాలిచ్చి పనులు చేసుకున్నట్టు, దేవుడికి పూజలు హోమాలు చేసి పనులు సాధించాలనుకోవడం ఎంత వెర్రో చూడు.
బగళాముఖి అంటే శత్రుస్తంభన నిజమే. కానీ, వాళ్ళు బయటి శత్రువులు కారు. నీలోపల ఉన్న శత్రువులు. నీలోని షడ్వర్గాలు స్తంభించడమే శత్రుస్తంభన. మూతపడాల్సింది ఎదుటివ్యక్తి నోరు కాదు, నీ నోరు. విచక్షణాశక్తి నీలో కళ్ళు తెరిస్తే అది జరుగుతుంది. అది అసలైన బగళాముఖి.
అలాంటిదే రాజశ్యామల కూడా. రాజ్యాధికారం అంటే ఆత్మజ్ఞానం. అది కలగడమే రాజశ్యామల అనుగ్రహం. అంతేగాని, అవినీతిపనులు చేసి కుర్చీ ఎక్కడం కాదు. ఎక్కి, ఇంకా అవినీతి చెయ్యడమూ కాదు. నీ లౌకికవిజయాలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఆధ్యాత్మికమెలాగూ ధర్మం లేకుండా రాదు. ఇదీ అసలైన మహావిద్యోపాసన' అన్నాను.
'మనం అడిగేది ఏదైనా సరే దేవుడు ఇవ్వడా?' అడిగింది.
'నీ పిల్లలు ఒక గొంతెమ్మకోరిక కోరారనుకో. నువ్విస్తావా?' అడిగాను.
'ఇవ్వను' అంది
'మరి దేవుడికి నీకంటే తెలివి ఎక్కువుందా? తక్కువుందా?' అడిగాను.
'మరి ఈ విషయాన్ని ఎవరూ చెప్పడం లేదేంటి?' అడిగింది.
'వాళ్ళూ వాళ్ళూ భాగస్వాములేగా. నిజాలను ఎందుకు చెప్తారు? చెప్పినా వినేదెవరు? అందరూ అదే తానులో ముక్కలేగా?' అన్నాను.
'మరి ఈ గోలతో హిందూధర్మం నాశనం కావడం లేదా?'అడిగింది.
'నాశనమయ్యేది ధర్మమెలా అవుతుంది? ధర్మం నాశనం కాదు. మనం అవుతాం. సమాజంలో వెర్రిపోకడలు పెరుగుతున్నాయి. అంతే. అందుకే రాజశ్యామల, వారాహి, ఛిన్నమస్త, ప్రత్యంగిర, ఉగ్రభైరవి మొదలైన దేవతల ఆరాధన పెరుగుతున్నది. మనుషులలో పెరుగుతున్న పిచ్చికోరికలకు, దౌర్జన్యపూరిత ధోరణులకు ఇది సంకేతం.
గీతలో కృష్ణభగవానుడు చెప్పలేదా, ఎవరెవరి సంస్కారాలను బట్టి వారువారు ఆయా దేవతలను కొలుస్తారని? సాత్వికం, రాజసికం, తామసికం అంతే. సత్త్వం తగ్గిపోతున్నది. తక్కిన రెండూ పెరుగుతున్నాయి. దానికి తగినట్టే దేవతారాధన కూడా ఉంటోంది. మన కర్మకూడా దానికి తగినట్టే ఉంటుంది. కర్మకు తగినట్టే ఫలితం ఉంటుంది.
నీ కర్మను ఏ దేవతా తగ్గించదు. నువ్వే తగ్గించుకోవాలి. వీళ్ళు ఇంకాఇంకా పెంచుకుంటున్నారు. తెలుసుకునేనాటికి సమయం చేజారిపోతుంది. అంతే. అసలు తెలుసుకోగలుగుతారా లేదా అన్నది కూడా డౌటే' అన్నాను.
'అలాగా' అంది శిష్యురాలు సాలోచనగా.
మాటల్లోనే ఇల్లొచ్చేసింది. కారు దిగి ఇంట్లోకి దారితీశాను.
ఆశా భోంస్లే జాతకం - కొన్ని ఆలోచనలు
తన సోదరి లతామంగేష్కర్ లాగానే ఈమెకూడా 92 ఏళ్ళు బ్రతికింది. కనుక, వీరి జీన్స్ గట్టివే. అయితే వీరి తండ్రి దీనానాధ్ మంగేష్కర్ మాత్రం 41 ఏళ్లకే చనిపోయాడు. కనుక తల్లిగారి జీన్స్ బలమైనవి కావచ్చు. తల్లిగారు శేవంతి 90 ఏళ్ళు బ్రతికారు కాబట్టి లెక్క సరిపోతున్నది.
ఈమె 8-9-1933 న సాంగ్లీ లో పుట్టింది. జననసమయం 9. 30 pm అని ఉంది. దీనిని నేను 9. 28 కి సవరించాను. జాతకాన్ని ఇక్కడ చూడవచ్చు.
2 మరియు 3 భావాలకు అధిపతులుగా ఈమె జీవితంలోని సంగీతవిజయాలకు బుధశుక్రులే కారకులు. వీరు లలితకళలకు కారకులు కూడా. అయితే, ఈమె పడిన కష్టాలకు కూడా వీరే కారకులయ్యారు. రవిబుధులు సింహంలో ఉండటం బుధాదిత్యయోగం. అయితే, బుధుడు అస్తంగతుడయ్యాడు. కనుక కష్టసుఖాలు కలగలసి ఈమె జీవితంలో వచ్చాయి.
4 వ అధిపతియైన చంద్రునికి, 5 వ అధిపతియైన రవికి ఏర్పడిన కోణదృష్టి రాజయోగాన్నిచ్చింది.
విజయాలు
12-12-2001 న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. అప్పుడు గురు రాహు శుక్ర బుధ దశ నడిచింది. గురువు పూర్వపుణ్యాధిపతి. రాహువు కర్మాధిపతి. అయితే, శనికి సూచకుడు. కనుక శపితయోగం ఉంది. బుధశుక్రులు దోషులు, కానీ యోగకారకులయ్యారు.
5-5-2008 న పద్మవిభూషణ్ అవార్డు ఈమెను వరించింది. ఆనాడు శని కేతు చంద్ర శని దశ నడిచింది. శని కర్మస్థానాధిపతిగా పూర్వపుణ్య స్థానంలోకి వస్తున్నాడు. కేతువు బుధాదిత్యయోగంలో ఉన్నాడు. చంద్రుడు సుఖస్థానాధిపతిగా బలంగా ఉన్నాడు.
అయిదుదేశాలలో, ముఖ్యంగా దుబాయ్, కువైట్ లలో Asha's అనే చైన్ రెస్టారెంట్లను పెట్టింది. అవి బాగా నడుస్తున్నాయి. 10 వ భావంలో ఉన్న వక్రశని, ఆయనపైన ఉన్న గురుశుక్ర దృష్టులు ఈ విజయాలకు కారణాలు. శుక్రుడు 2 వ భావాధిపతిగా ఎలైట్ డైనింగ్ ను సూచిస్తాడు.
1949 లో లతామంగేష్కర్ యొక్క సెక్రటరీ అయిన గణపత్ రావ్ భోంస్లేను ఈమె పెళ్ళిచేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అప్పటికి ఆమెకు 16 ఏళ్ళు, గణపత్ కు 31 ఏళ్ళు. ఆ సమయంలో అర్ధాష్టమశని నడిచింది. దశగా రవి గురుదశ నడిచింది. పంచమరవి ప్రేమవ్యవహారాలకు, 7వ అధిపతితో కలసి ఉన్న గురువు పెళ్ళికి సూచకులు. నీచశుక్రుడు సాంప్రదాయవ్యతిరేక వివాహాన్ని సూచిస్తున్నాడు.
7 వ అధిపతియైన శుక్రుడు, 9 వ అధిపతి గురువుతో కలసి కర్మస్థానంలో నీచలో ఉండటంతో, తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడైన గణపత్ రావ్ భోంస్లేను పెళ్లి చేసుకోవలసివచ్చింది. తరువాత తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన R. D. బర్మన్ ను రెండవవివాహం చేసుకుంది. గురువు ధనుస్సు 6 వ డిగ్రీలో ఉండటం చూడవచ్చు. దీనికి తగినట్లుగా, R. D. బర్మన్ ఈమెకంటే 6 ఏళ్ళు చిన్నవాడు.
1960 లో గణపత్ తో విడిపోయింది. అప్పుడు చంద్ర-కేతుదశ నడిచింది. దానికి కారణం సంగీతదర్శకుడు O.P.Nayyar తో ఆమెకున్న ప్రేమసంబంధం కూడా. గణపత్ రావ్ పెడుతున్న హింసను తట్టుకోలేక నయ్యర్ కు దగ్గరైంది. చంద్రకేతుదశ గ్రహణదశ. 7 వ భావం దెబ్బతినడం, దానిపైనున్న శనిగురువుల ప్రభావాలు దీనికి కారణాలు. పంచమకేతువువల్ల ప్రేమవియోగం సూచితమౌతున్నది. అప్పటికి వారికి ముగ్గురుపిల్లలు. పంచమభావంలో మూడు గ్రహాలుండటం చూడవచ్చు.
అప్పటినుండి, తన ముగ్గురు పిల్లలనూ పెంచుకుంటూ, సినిమాలలో పాటలు పాడుతూ కాలం గడిపింది.
1980 లో తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన సంగీతదర్శకుడు R. D. బర్మన్ ను రెండవపెళ్లి చేసుకుంది. అప్పడు రాహు-కేతుదశ నడిచింది. కొన్ని వందలజాతకాలలో రుజువైన ఈ సూత్రం ఇక్కడ మళ్ళీ రుజువైంది.
కష్టాలు
తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 24-4-1942 న తన 41 వ ఏట చనిపోయాడు. అప్పటికి ఆశాకు 8 ఏళ్ళు మాత్రమే. ఆ సమయంలో ఆమెకు శుక్ర శని కుజ దశ నడిచింది. దశమమైన మకరం నుండి, శని 12 వ భావంలోకి పోవడం, శుక్రుడు మరణాన్ని సూచించే 9 వ భావంలో నీచస్థితిలో ఉండటం, కుజుడు బాధకునిగా దశమం నుండి సుఖస్థానాన్ని చూడటం కారణాలు.
ఈమెయొక్క రెండవసంతానమైన వర్షా భోంస్లే, 8-10-2012 న తుపాకీతో తలను షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ కారణమన్నారు. అప్పుడు ఆశాకు శని రవి బుధ దశ నడిచింది. తులనుండి, యోగకారకుడైన శనికి భ్రష్టత్వం కలగడం, రవి కేతుగ్రస్తుడవడం, బుధునికి అస్తంగత్వం పట్టడం కారణాలు. ఆనాడు, తులకు 2/8 ఇరుసులో నీచరాహుకేతువులున్నాయి. రాహువుతో కలసి కుజుడున్నాడు. కనుక, డిప్రెషన్లో, దూకుడునిర్ణయం తీసుకుని కాల్చుకుని చనిపోయింది.
ఈమెయొక్క మొదటిసంతానమైన హేమంత్ భోంస్లే 26-9-2015 న కేన్సర్ వ్యాధితో చనిపోయాడు. అప్పుడీమెకు శని రాహు రాహు దశ నడిచింది. సింహం నుండి, శని రోగాధిపతి అవుతాడు. రాహువు మారకస్థానంలో ఉన్నాడు. శపితదశ నడిచింది. పంచమభావం దెబ్బతిని ఉన్నది. కనుక మొదటికుమారుడు దీర్ఘవ్యాధితో చనిపోయాడు.
ముగింపు
చివరకు 12-4-2026 న 92 వ ఏట తను చనిపోయింది. అప్పుడు బుధ శుక్ర శని దశ నడిచింది. ఈ ముగ్గురూ ఈ లగ్నానికి మారకులే కావడం గమనించవచ్చు.
1937-44 మధ్యలో మొదటిసారి, 1967-74 మధ్య రెండవసారి, 1997-2004 మధ్య మూడవసారి, ఇప్పుడు 2026 లో నాలుగవసారి ఏలినాటిశని వచ్చింది. అవి అనేక కష్టాలనిచ్చినప్పటికీ, 92 ఏళ్ల పూర్ణాయుష్షు నిచ్చాయి. దీనికి కారణం లగ్నాష్టమాధిపతి కుజుడు సప్తమకేంద్రంలో ఉండటం.
సంగీతరంగంలో, కళారంగంలో ఉన్నవారికి జీవితాలు బాగుండవని, సంతృప్తిగా ముగియవని, ఏదో ఒక వెలితి వారికి ఉంటుందని, అంటారు. అది చాలావరకూ నిజమే అనిపిస్తుంది,
ఈ విధంగా, సుఖదుఃఖాలనేవి పడుగుపేకలలాగా పేనుకుని ఉండటం ఆశాభోంస్లే జాతకంలో గమనించవచ్చు. ఇది ఈమె జాతకంలోని ఒక విలక్షణమైన యోగం.
17, ఏప్రిల్ 2026, శుక్రవారం
జిల్లెళ్ళమూడి స్మృతులు - 60 (పునర్జన్మలు)
మర్నాడు ఉదయం 'వ' దగ్గర కాసేపు కూర్చుని వద్దామని వెళ్ళాము.
మాటల సందర్భంలో, 'ఈ ఏడాది జనవరిలో ఇక్కడివారు, వేరేచోట్ల ఉన్న అమ్మ భక్తులు, చాలామంది పోయారు' అని 'వ' అన్నది.
'అవును. అమ్మను చూచినవారు, మాట్లాడినవారు, సన్నిహితంగా మెలిగినవారు అందరూ వెళ్లిపోతున్నారు. ఒక స్వర్ణయుగం గతిస్తున్నది' అన్నాను.
ఆమేం మాట్లాడలేదు.
'అమ్మ పునర్జన్మ లేదన్నది కదా ! మరి వీళ్ళందరూ ఏమౌతారు? ఎక్కడకు పోతారు?' నాకు తెలిసినా, ఆమె ఏం చెబుతుందో చూద్దామని అడిగాను.
'వ' ఇలా అన్నది.
'పునర్జన్మ లేదని అమ్మ ఖరాఖండిగా చెప్పలేదు. ఏదైనా ఒక సందర్భంలో అలా అని ఉండవచ్చు. విన్నవాళ్ళు దానిని ఒక సిద్ధాంతంగా మార్చారు. అమ్మ అలా అనలేదు. 'సముద్రంలో అలలవంటివి జన్మలు. ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కానీ ఏ రెండు అలలూ ఒక్కటి కావు' అన్నది. దానిని వీళ్ళు అలా అర్ధం చేసుకున్నారు'.
'ఒకకోణంలో పునర్జన్మ ఉన్నది. మరొక కోణంలో లేదు. క్రొత్త అల వస్తుంది. పాత అలగా మాత్రం మళ్ళీ రాదు. నిజమే. ఇది చాలా లోతైన భావన' అన్నాను.
'అవును. అమ్మ చెప్పేవన్నీ ఇలాగే ఉండేవి. ఆమె దేనినీ వివరించి చెప్పదు, క్లుప్తంగా, సూక్ష్మంగా చెబుతుంది. వినేవారు ఎవరికి అర్ధమైనట్లుగా వారు అన్వయించుకొని అర్ధం చేసుకున్నారు' అన్నది 'వ'.
'పునర్జన్మ ఉండటం నిజమే. రికార్డ్ అయిన కేసులే చాలా ఉన్నాయి. కానీ అదే జన్మ మళ్ళీ రాదనేది కూడా నిజమే. అదే మనుషులుండరుకదా మళ్ళీ అలాగే పుట్టడానికి? ఆత్మ లేదన్న బుద్ధుడే తను గతంలో 500 జన్మలెత్తానని అన్నాడు.
అబ్రహామిక్ మతాలకు ఉన్నతమైన తాత్వికచింతన లేదు గనుక, వారు ఊహించుకున్న స్వర్గనరకాలు వారికున్నాయి. వాళ్లకు బంధమోక్షాల గురించిన చింతన లేదు. పైగా వాళ్ళవి శాశ్వతస్వర్గనరకాలు. అది చాలా మోటుభావన. తెలివిలేనివారు మాత్రమే అటువంటి స్వర్గనరకాలను ఊహించుకుంటారు.
క్రైస్తవస్వర్గంలో ఎప్పుడూ సండే చర్చి జరుగుతూ ఉంటుంది. కాయర్ పాడుతూ, దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు. అక్కడ ప్రతిరోజూ ఆదివారమే. నాలుగురోజులు పోయాక అదే పెద్ద నరకమనిపిస్తుంది.
ఇక ఇస్లామిక్ స్వర్గంలో ప్రతిరోజూ శుక్రవారమే. పచ్చికబయళ్ళు, పారే సారాయి సెలయేర్లు, ఒక్కొక్కరికి 72 మంది అమ్మాయిలు, ఒక లాస్ వెగాస్ లాగా ఉంటుంది. వారు ఎడారిజీవులు గనుక అటువంటి స్వర్గాన్ని ఊహించుకున్నారు. ఎవరికేవి లేవో, వాటిని తమ స్వర్గంలో ఊహించుకున్నారు. అదీ మూన్నాళ్ళ ముచ్చటేగా. కొన్నాళ్ళకు అదీ బోరు కొడుతుంది. లేదా అమ్మాయిలకోసం అక్కడకూడా కొట్టుకుని చస్తారు. స్వర్గంలో ఛస్తే ఇంకెక్కడికి పోతారో ఏమో? ఇలా ఉంటుందా అన్న బుర్రకూడా వాళ్లకు లేదు. ఆ మతాల తెలివి అంతవరకే.
మన మతంలో చెప్పబడిన పునర్జన్మ అనేదే సత్యమైన సైంటిఫిక్ భావన. అది వాస్తవం కూడా. అమ్మ ఎవరో ఒకరితో మాట్లాడుతున్న సందర్భంలో 'ఆ వ్యక్తికి ఇక పునర్జన్మ లేదు' అని ఉండవచ్చు. దానిని జనరలైజ్ చెయ్యడం తప్పు. శాంతిదేవి కేసు నుండి నేటివరకూ రికార్డు కాబడిన రుజువులు చాలా ఉన్నాయి. కనుక పునర్జన్మ వాస్తవమే
పునర్జన్మంటే అదే మనిషి అదే రూపంలో మళ్ళీ అదే కుటుంబంలో పుడతాడని కాదు. అలా జరగడానికి అన్నీ అలాగే ఉండవు కదా. మారిపోతుంటాయి. అదే జీవి ఇంకొక రూపంలో ఇంకొకచోట పుడుతుందని మాత్రమే అర్ధం. అది నిజమే. కోరికలు మిగిలి ఉన్నంతవరకూ పునర్జన్మ లేకుండా ఎలా పోతుంది?' అన్నాను
'ఈ తాత్వికచర్చలు నాకు రుచించవు. అమ్మ ఉన్నపుడు అమ్మ చెప్పినట్లు చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. నాకు తెలిసినది ఇంతవరకే' అన్నది 'వ'.
'మీకు అవసరం లేకపోవచ్చు. మీకు కేవలం విశ్వాసమే సరిపోవచ్చు కూడా. ఇంకొందరికి తంతులు రుచించవచ్చు. కానీ అందరికీ అవే నచ్చాలని రూలేమీ లేదు. ఒకేదారి అందరికీ నచ్చకపోవచ్చు కదా !
తాత్వికచింతన ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకది అవసరమే. నన్నడిగితే, అమ్మ బలమంతా అమ్మయొక్క తాత్వికచింతనే అంటాను. అది వేదాంతమే. అది చాలా అవసరం. లేదంటే చివరకు ఇదంతా వ్యక్తిపూజగా మారే ప్రమాదం ఉన్నది. కోరికలు, మొక్కులు, అమ్మని ఒక దేవతగా మార్చి పూజలకు పరిమితం చెయ్యడం. ఇదే చేస్తారు చివరకు ఈ భక్తులు. మహనీయులందరినీ ఇలాగే మార్చారు చివరకు' అన్నాను.
'వ' మౌనం వహించింది.
నేను లేచి సెలవు తీసుకుని బయటకు వచ్చేశాను.
14, ఏప్రిల్ 2026, మంగళవారం
జిల్లెళ్ళమూడి స్మృతులు - 59 (ఆధ్యాత్మిక అనుభవాలు - బైబిలు వాక్యాలు)
'కనుక ఈ అనుభవాలన్నీ ఇంతే. అవేవో గొప్పగొప్ప ఆధ్యాత్మికమైనవి అనుకోకు. అవి చిన్నచిన్న సతోరి స్థితులు మాత్రమే' అన్నాను.
'ఏవైనా సరే, అవి మామూలు మనుషులకు అందేవి కావు కదా' అన్నాడు
'మామూలు మనుషులకు ఏవి అందుతాయి అసలు? పొద్దున్న లేస్తే తిండి, సంపాదన, ఆశలు, కోపతాపాలు, బ్రతుకుపరుగులు ఈ రొచ్చే కదా. వీటిల్లో పడి ఉండే సామాన్యుడికి అసలేం అందుతుంది? ఏమీ అందదు.
సతోరిలు ఉంటాయి. నాకు 12 ఏళ్ల వయసులో మొదటిసారి కలిగింది. దీనికేమంటావు మరి? 'వెలుగుదారులు' లో అదంతా వ్రాశాను. చదివావా?'అడిగాను.
'లేదు. చదవలేదు' అన్నాడు.
'మరేం చదువుతావు? బైబిలా?' అన్నాను నవ్వుతూ.
తనేమీ మాట్లాడలేదు.
'అలాంటి అనుభవాలు రోజుకు పది కలుగుతై నాకు. ఒక్కోరోజున ఇంకా ఎక్కువ ఉంటాయి. అంతమాత్రం చేత అదేదో రామకృష్ణులకు కలిగే సమాధిస్థితులవంటివని అనుకోకూడదు. అంతెందుకు? ఇందాక నువ్వు నన్ను పలకరించినప్పుడు నేనేం స్థితిలో ఉన్నానో నీవు గమనించగలిగావా?' అన్నాను.
'లేదే? మీరు అలాంటి స్థితిలో ఉన్నారా?' అన్నాడు.
'అదేమరి. నీ దృష్టి ఎక్కడో ఉంది. ఎదురుగా ఉన్నదాన్ని మిస్సయ్యావు. ఇది అందరికీ జరిగేదే. ఇప్పటిదాకా నేను చెబుతున్నది అదే. మన దృష్టిని బట్టి మనకు కనిపిస్తుంది. మన దృష్టి ఎక్కడో ఉంటే, ఎదురుగా ఉన్నది కూడా కనిపించదు' అన్నాను.
'ప్రతిరోజూ ఎలా కలుగుతాయి అలాంటి అనుభవాలు?' అన్నాడు.
'ఎందుకు కలగవు? పొద్దున్న లేస్తే, ఎవడికి కలిగే అనుభవాలు వాడికి కలుగుతూనే ఉంటాయి కదా. నువ్వున్న స్థితిని బట్టి నీ అనుభవాలుంటాయి. జ్ఞానీ ఇక్కడే ఉంటాడు. అజ్ఞానులూ ఇక్కడే ఉంటారు. ఈ సృష్టిని దాటి ఎవడున్నాడు? ఇదే సృష్టి ఎవడి అనుభవాన్ని వాడికిస్తుంది. సృష్టిరహస్యాలు తెలిస్తే, వాటిని ఎలా పొందాలో తెలిస్తే, చక్కగా కలుగుతాయి. దానికి అభ్యంతరమేముంటుంది? గ్రహరహస్యాలు, ధ్యానరహస్యాలు, ప్రకృతిరహస్యాలు తెలిస్తే అన్నీ జరుగుతాయి. అన్నీ చేయవచ్చు' అన్నాను.
'అదే ఎలా?' అన్నాడు.
'చూడు. ఇందాక భరద్వాజగారికి కలిగిన అనుభవం వెనకున్న గ్రహస్థితులను వివరించాను కదా. అలాంటి రహస్యాలు జ్యోతిషశాస్త్రంలో కొన్ని వందలున్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే, నీ జీవితంలో ఏరోజు ఏం జరుగుతుందో నీకు స్పష్టంగా అర్ధమౌతుంది. వాటిని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకున్నావనుకో, అనుభవాలెందుకు కలగవు?
మామూలు మనుషులు జ్యోతిష్యాన్ని లౌకికంగా ఉపయోగించుకుంటారు. మనం దానిని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలి. తంత్రమంటే అదే. అలాంటి టైం స్లాట్లు అనంతమైన కాలంలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడం నీకు తెలియాలి. తంత్రసాధనలో ఇదొక భాగం. అప్పుడన్నీ అవుతాయి. అంతే ' అన్నాను.
ఆ సబ్జెక్ట్ వదిలేసి ఇంకోదానికి దూకాడు.
'మీరిందాక బైబిలన్నారే. నిజానికి నాకు మన గ్రంధాల కంటే బైబిలే ఎక్కువ ఇష్టం. దానిలోని మాటలు నన్ను చాలా కదిలిస్తాయి' అన్నాడు.
'అలాగా నాయనా. నువ్వుకూడా ఈ పిచ్చిలో పడ్డావన్నమాట ! ఈసారి కలిసేసరికి 'శ్రీనివాస్ దైవసహాయం' అని పేరు మార్చుకుంటావేమో?' అన్నాను.
'ఛీ అలా ఎందుకు చేస్తాను. ఊరకే బైబిలంటే నాకిష్టం అని చెప్పానంతే' అన్నాడు.
తన పాండిత్యాన్ని ప్రదర్శించాలని తెగ ఉబలాటపడుతున్నాడు కదా, చూద్దాంలే అనిపించి, 'సరే బైబిల్లోంచి నీకు నచ్చిన ఒక మంచిమాట చెప్పు వింటాను' అన్నాను.
వెంటనే ఉత్సాహంగా, 'ఒకడు సమస్తలోకమునూ జయించినప్పటికీ తన ఆత్మను పోగొట్టుకున్నట్లైతే అతనికేమి ప్రయోజనము?' అని జీసస్ అన్నాడు. ఇదెంత బాగుందో చూడండి' అన్నాడు.
జ్ఞానోపదేశ కాండం మొదలుపెట్టక తప్పదనిపించింది.
'దాంట్లో అంత పరవశించిపోయేది ఏముంది?' అన్నాను.
'అది నిజమే కదా' అన్నాడు భక్తిగా.
'ఎలా నిజమౌతుంది? దానిలో రెండున్నాయి. ఒకటి, లోకాన్నంతా సంపాదించడం లేదా జయించడం. అది కుదిరేపని కాదు. అలెగ్జాండర్ వల్లే ఆ పని కాలేదు. ఇక మామూలు మనిషి వల్ల ఏమౌతుంది? రెండోది నీ ఆత్మను పోగొట్టుకోవడం. అదీ కుదరదు. కనుక అదొక అర్ధం లేని స్టేట్ మెంట్ మాత్రమే' అన్నాను.
'అదేంటి?' అన్నాడు అయోమయంగా.
'నీ ఆత్మను నీవెలా పోగొట్టుకోగలవు? నిన్ను వదలి నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఎలా పోతుంది? అసలు ఆత్మంటే ఏమిటి? ఆత్మ ఉందా అసలు? ఏదీ ఒకసారి నీ ఆత్మని పోగొట్టుకొని చూపించు, చూస్తాను' అన్నాను.
నిర్ఘాంతపోయాడు.
'నిజమే కదా. మీరు చెబుతుంటే అర్థమౌతోంది. ఈ విధంగా నాకెవరూ చెప్పలేదు ఇప్పటిదాకా' అన్నాడు.
'ప్రపంచాన్ని జయించడమూ సాధ్యం కాదు. ఆత్మను పోగొట్టుకోవడమూ సాధ్యం కాదు. వెరసి అదొక అర్ధంపర్ధం లేని స్టేట్ మెంట్ మాత్రమే. ఇలాంటివి చదివి, నీలాంటివాళ్ళు గుడ్డలు చించుకోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. అంతే' అన్నాను.
'మరి ఈ ఊరి పాస్టర్ అలా చెప్పలేదే?' అన్నాడు.
'కూటాలకి పోతున్నావా ఏంటి? 'ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటెనకాల' అన్నట్టుంది నీపని' అన్నాను.
'ఛీ ఛీ అదేం లేదు. ఇక్కడొక పాస్టరున్నాడు. అతను అప్పుడప్పుడూ వాకింగ్ లో కలుస్తాడు' అన్నాడు.
'ఓహో. వాకింగులో టైం వేస్ట్ చెయ్యకుండా, నీకు బైబిలెక్కించి, బ్రెయిన్ వాష్ చేద్దామని చూస్తున్నాడు. నీక్కూడా కొద్దో గొప్పో ఎక్కింది. అంతేనా?' అన్నాను.
'అబ్బే అదేం లేదు' అన్నాడు.
'మరైతే బైబిల్ని అంత భక్తిగా చెబుతున్నావేంటి? సరే బైబిలువాక్యం ఒకటి చెప్పావు. భగవద్గీతలోనించి కూడా నాలుగుశ్లోకాలు వినిపించు వింటాను.' అన్నాను.
పిచ్చిచూపులు చూస్తున్నాడు.
'అదీ సంగతి. నువ్వు చదవాల్సింది భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర మన గ్రంధాలు. ముందు వాటినేడువు. ఆ తర్వాత బైబిలు సంగతి చూద్దువుగాని. నీది నీకు తెలీకపోతే రోడ్డుమీదవన్నీ బానే ఉంటాయి' అన్నాను.
'మరి ఆ బైబిలు వాక్యంలో ఏమీ లేదా?' అన్నాడు.
'ఉంది. వేదాంతం ఉంది. జీసస్ నేర్చుకున్నదంతా మన దేశంలోనే నేర్చుకున్నాడు. ఆత్మతత్త్వాన్ని, అవతారతత్త్వాన్ని అన్నీ ఇక్కడున్నపుడే స్టడీ చేశాడు వాటిని తీసుకెళ్లి అక్కడ చెప్పబోయాడు. అవన్నీ పాతనిబంధనకు విరుద్ధమైన భావాలు. వాళ్లకు కోపమొచ్చింది. అందుకే చంపబడ్డాడు' అన్నాను.
'మరి ఆ మాటకు మీరు చెప్పే అర్థమేమిటి?' అన్నాడు.
'నేను చెప్పే అర్ధంకాదు. ఉన్న అర్ధం ఒకటే. 'నువ్వు ప్రపంచసుఖాలను ఎన్నాళ్ళు అనుభవించినా, ఆత్మజ్ఞానివి కానంతవరకూ నీ బ్రతుకు వృధానే' అని ఆ వాక్యం అంటోంది. మన వేదాంతం చెప్పినది అదేగా. రామకృష్ణులు, రమణులు అందరూ అదే అన్నారు. ఇందులో వింతేముంది?
వాళ్ళకేమో ఆత్మ అంటే ఏమిటో తెలీదు. ఆత్మజ్ఞానం అంటే అసలే తెలీదు. కనుక, 'నీ ఆత్మను పోగొట్టుకోవడం' అంటే, 'క్రైస్తవాన్ని కాకుండా వేరే మతాలను నమ్మడం' అని పెడర్ధాన్ని తీసుకుని, మతమార్పిడులు చేస్తూ, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు.
మన వేదాంతం చెప్పినదాన్నే జీసస్ కాపీ కొట్టి ఇజ్రాయెల్ లో చెప్పబోయాడు. బైబిల్ నీకు అర్ధం కావాలంటే, వేదాంతపు పునాదులమీదనే అది సాధ్యమౌతుంది. ఈ మాట నేను చెప్పడం లేదు. వివేకానందస్వామి అంతటివాడే ఈ మాటన్నాడు. మనదగ్గర లేనిది బైబిల్లో ఏమీ లేదు.
ఆ వాక్యానికి నిలువెత్తు నిదర్శనం రమణమహర్షి వారే. ఆ వాక్యంలో జీసస్ చెబుతున్నది రామకృష్ణులు, రమణమహర్షి, అమ్మగారు వంటి జ్ఞానులగురించి మాత్రమే.' అన్నాను.
'ఇంకొక్క చిన్నసందేహం ఉంది. అది చెప్పి మన చర్చ ముగిస్తాను' అన్నాడు శ్రీనివాస్.
అప్పటికి చర్చ మొదలై రెండుగంటలైంది. నేనేదో చిన్నవాకింగ్ కని వచ్చి, మనవాడి చేతుల్లో ఇరుక్కుపోయాను. నాకోసం చూసీ చూసీ, మూర్తి సంధ్యలు భోజనం చేయకుండా, రెండు అరటిపండ్లు తిని, నిద్రపోయారు. మిగతావాళ్ళు మాత్రం డిన్నర్ చేయకుండా నాకోసం వేచిచూస్తున్నారు.
'చూడు నాయనా. అవతల, తిండితినకుండా నాకోసం చూస్తున్నవాళ్లున్నారు. నీతో తెల్లవార్లూ మాట్లాడటానికి నేను సిద్ధమే. కానీ ఈ సోదిచర్చలవల్ల ఉపయోగమేమీ లేదు.
ఎన్ని మాట్లాడుకున్నా, నువ్వు సాధనేమీ చెయ్యవు. చెయ్యకుండా జ్ఞానాన్ని పొందలేవు. దానికి, దారిచూపేవాడు ఒకడు కావాలి. వాడు ఎదురుపడినా, నువ్వు గుర్తించలేవు. పైగా, వాడికే నీ విజ్ఞానప్రదర్శన చెయ్యాలని చూస్తావు.
పోనీ చర్చలో అన్నా consistency ఉందా అంటే, అదీ ఉండదు. ఒక టాపిక్ నుంచి ఇంకోదానికి దూకుతావు. చివరకు ఏదీ తేలదు. ఇంకెందుకు ఈ గోల? కాలక్షేపచర్చలకు అంతూపొంతూ ఉండదు. ఇక చాల్లే. రేపు చూద్దాం'
చివరగా ఒక మాట ! రేపటినుంచీ వాకింగుకెళ్ళినపుడు, అతను చెప్పే బైబిలువాక్యాలు నువ్వెక్కించుకోవడం కాదు, అతనికి నీ భగవద్గీతను ఎక్కించు. దారితప్పిన ఒక్క సోదరుడినైనా మళ్లీ సరైనదారిలోకి తీసుకురా. అలా చెయ్యాలంటే దానిలో ఏముందో ముందు నీకు తెలియాలి. అర్జెంట్ గా గీత చదవడం మొదలుపెట్టు' అని లిఫ్ట్ దగ్గరికి దారితీశాను.
'సరేనండి. గుడ్నైట్' అని తానూ సెలవు తీసుకున్నాడు.
ఆ చర్చ అలా ముగిసింది.
13, ఏప్రిల్ 2026, సోమవారం
జిల్లెళ్ళమూడి స్మృతులు - 58 (సత్యం - ఊహ - నమ్మకం)
'విశ్వాత్మ గారికి టిబెటన్ మాంక్స్ తో థాట్ వేవ్స్ ద్వారా సంబంధాలుండేవి' అన్నాడు శ్రీనివాస్.
'ఆయన సత్యసాయిని నమ్ముతాడని నువ్వు చెప్పినప్పుడే ఆయన గ్రాఫు దిగిపోయింది. ఇటువంటి భ్రమలు ఆయనకుండటం వింతేముంది?' అన్నాను.
'అలా అనకండి. ఆయన వాళ్ళతో రాత్రుళ్ళు మాట్లాడుతూ ఉండేవాడు' అన్నాడు.
'టిబెట్ చైనాలో ఉంది కదా. అక్కడకు ఫోన్ కనెక్షన్ ఉందా? చైనా ప్రభుత్వం అనుమతిస్తుందా?' అడిగాను.
'అబ్బా. థాట్ వేవ్స్ తో నండి' అన్నాడు శ్రీనివాస్ విసుగ్గా.
'అర్ధమైందిలే. కొద్దిగా జోకులెయ్యనీయ్. లేదంటే డిస్కషన్ సీరియస్ గా మారే ప్రమాదం ఉంది' అన్నాను.
'ఆయన రేపు చనిపోతాడనగా, ఇవాళ రాత్రంతా నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు' అన్నాడు.
'అవధూతలంటే అంతే. రాత్రుళ్ళు నిద్రపోకుండా అందరినీ కదిలిస్తూ ఉంటారు. లేదా, రేపు పోతానని ముందే తెలిసిందేమో. తను దాచిపెట్టిన నిధి ఎక్కడుందో నీకు చెప్పి పోదామనుకుని ఉంటాడు. నిధెక్కడుందో చెప్పాడా మరి?' అన్నాను.
'జోకులాపండి ప్లీజ్' అన్నాడు.
'సరే చెప్పు' అన్నాను.
'అదేమీ లేదు. అప్పుడప్పుడూ నాతో అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అప్పుడప్పుడూ ఒక మాటనేవాడు. 'మనకెప్పుడైనా బాగా సంతోషం కలిగినపుడు, 'నాకు ఇవాళ భలే సంతోషంగా ఉంది. అయామ్ వెరీ హేపీ' లాంటి మాటలు అనకూడదు. అన్నామంటే, వెంటనే ఒక పెద్దసమస్య తలెత్తుతుంది. నీ సంతోషమంతా ఆవిరైపోతుంది. ఇదొక సైకలాజికల్ రూల్' అనేవాడు. కానీ ఆరోజు రాత్రి నాతో మాట్లాడుతూ, 'జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది నాకివాళ' అన్నాడు. ఆ రాత్రి చాలాసార్లు ఆ మాటన్నాడు. మర్నాడు యాక్సిడెంటయింది. నడిరోడ్డుమీద చనిపోయాడు' అన్నాడు.
'ప్రకాశం బ్యారేజి మీదనో, సీతానగరం సెంటర్లోనో కదూ ఆయనకు యాక్సిడెంటయింది?' అడిగాను.
'అవును. కొన్ని గంటలపాటు ఆయన శవం రోడ్డుమీదనే పడిఉంది. ఎవరూ పట్టించుకోలేదు' అన్నాడు.
'పోనీలే 'అవధూత' టైటిల్ అలా నిజమైంది. అప్పుడు నేను గుంటూరులో పనిచేస్తున్నాను. దానిపైన ఒక పోస్టు కూడా రాశాను' అన్నాను.
'ఆరోజు ఉదయం విద్యాసాగర్ గారు ఫోన్ చేసి నాతో అన్నారు, 'విశ్వాత్మ గారు ఇక లేరు' అని . అదేంటి రాత్రంతా నాతో మాట్లాడుతూనే ఉన్నాడుగా' అని నేననుకున్నాను'
'ఏం రాత్రంతా నీతో మాట్లాడినంత మాత్రాన, పొద్దున్నే ఏమీ కాకూడదా ఏంటి? నువ్వూ అవధూతవైపోయావా కొంపదీసి? అదిసర్లేగాని, విద్యాసాగర్ అంటే ఎవరు? బందరాయనా? ' అడిగాను.
'అవును. మాది చల్లపల్లి' అన్నాడు.
'అప్పట్లో రాధిక అని ఒక మహాయోగిని మా గ్రూపులో కొన్నాళ్ళుంది. ఆమెది కూడా మీ ఊరే. నీకు తెలుసా?'అడిగాను.
' తెలీదు' అన్నాడు.
'సరే ఆ టాపిక్ వదిలేయ్. అయినా. నువ్వుకూడా థాట్ వేవ్స్ నేర్చుకుని ఉన్నట్లయితే, ఫోన్ ఖర్చు తప్పేది కదా? రాత్రంతా ఫోన్ మాట్లాడితే ఎంత బిల్లయ్యిందో నీకు? టిబెటన్ మాంక్స్ తో థాట్ వేవ్స్ లో మాట్లాడేవాడు, నీతో మాట్లాడలేడా? ఫోనెందుకు? ' అడిగాను సీరియస్ గా.
'ఇక జోకులు ఆపండి సార్ అన్నగారు' అన్నాడు.
'అన్నగారు అన్నాడు కదా అని నేనుకూడా మెత్తబడి, 'సరే ఒక మాట చెప్పు. భరద్వాజగారికి జిల్లెళ్ళమూడి అమ్మగారు, షిరిడీసాయి లాగా దర్శనమిచ్చారని పొద్దున్న 'వ' అన్నది. నువ్వు అమ్మసాహిత్యం లోతుగా చదివావు కదా. అలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా?' అడిగాను.
'నేను చదివినంతవరకూ ఎక్కడా అలాంటి సంఘటన లేదు. సాయిబాబా కూర్చునే భంగిమలో అమ్మ కూచుని ఉంటే, ఆయన అలా అనుకోని ఉండవచ్చు' అన్నాడు.
'అదేంటమ్మా ఇలా కనిపించావు?' అని భరద్వాజగారు అమ్మను అడిగితే, 'నీకాయనంటే ఇష్టం కదా నాన్నా. అందుకే అలా కనిపించాను' అన్నదట అమ్మ. ఈ మాటకూడా 'వ' నే చెప్పింది' అన్నాను.
'ఏమో నేను వినలేదు' అన్నాడు.
'చాలా సందర్భాలలో నువ్వూనేనూ కూడా కాలుమీద కాలేసుకుని బాబాలాగానే కూచుంటాము. అంతమాత్రం చేత మనం ఆయనైపోతామా? అమ్మ ఊరికే బాబాలాగా కూర్చుని ఉన్నంతమాత్రాన 'బాబాయే అమ్మ' అని భరద్వాజగారు అనుకుని ఉన్నట్లైయితే అది ఆయన భ్రమమాత్రమే కదా? అది నిజమెలా అవుతుంది?' అన్నాను.
తను వింటున్నాడు.
'ఒకవేళ ఆ దర్శనం నిజమే అయితే, అమ్మలో బాబాను చూచిన తర్వాత మళ్ళీ షిరిడీకి వెళ్ళవలసిన పనేముంది? వేరే సంస్థను పెట్టవలసిన పనేముంది? అంత దర్శనం కలిగాక, అసలు అమ్మను వదిలి వేరేచోటకు పోగలడా? పైగా, అలాంటి దర్శనం కలిగినపుడు దానిని ఆస్వాదించి, దానిలో మునిగిపోవాలిగాని, 'ఇదేంటమ్మా? బాబాలాగా కనిపిస్తున్నావు? అని అడగవలసిన పనేముంది?' ఆలోచించు' అన్నాను.
'అంతేననిపిస్తోంది' అన్నాడు.
'ఉన్నదాన్ని ఉన్నట్లు చూడకుండా, మనం మనసులో ఏవేవో ఊహించుకుంటుంటే ఇలాగే అవుతుంది. భరద్వాజగారికి మహత్యాలపిచ్చి ఎక్కువ. ఆయనకే కాదు, ఈ సాయిబాబా బ్యాచ్ అందరికీ ఇదే గోల. అప్పనంగా జరిగే మహత్యాలు వాళ్లకు కావాలి. అవి జరుగుతాయో లేవోగాని, వాటికోసం మన దేవుళ్ళందరినీ వదిలేసి ఇస్లామిక్ జిహాద్ మాయలో పడిపోతున్నారు. క్రమంగా హిందూమతాన్ని సంకరం చేస్తున్నారు' అన్నాను.
'అమ్మ చెప్పలేదా? దృష్టిని బట్టి సృష్టి ఉంటుందని. సైకాలజీకూడా దీనినే చెబుతుంది. నువ్వు చూచేదృష్టిని బట్టి ఎదుటివిషయం నీకు కనిపిస్తుంది. నీ మనసులో ప్రేమ ఉంటే, అనాకారికూడా దేవతలా కనిపిస్తుంది. అదిలేనపుడు దేవతకూడా దెయ్యంలాగా కనిపిస్తుంది. ఇది నీక్కూడా తెలుసుకదా ! సహజంగా జరిగేవాటిని కూడా నువ్వు 'మిరకిల్స్' అనుకుంటే అలాగే అనిపిస్తాయి. కానీ అవి మిరకిల్స్ కావు. నీ భ్రమలు మాత్రమే. సెన్సిటివ్ మనస్సు ఉన్నవాళ్లు సాధారణంగా ఇలా తప్పుదారిన పడతారు. అలాగే, నిజంగా మిరకిల్స్ జరిగినా నువ్వు వాటిని పట్టించుకోకపోతే మామూలు సంఘటనల మాదిరిగానే ఉంటాయి. అలాంటివి ప్రతిరోజూ ఎన్నో జరుగుతూనే ఉంటాయి' అన్నాను.
వింటున్నాడు.
'ఇంకొక సంఘటన చెబుతా విను. అమ్మ సాహిత్యంలోనే ఈ విషయం ఉంది. ఒకరోజున భరద్వాజగారు అమ్మను ఇలా అడిగాడు.
'అమ్మా. పంచదార డబ్బాలోకి నేను పొయ్యకుండానే పంచదార వచ్చింది. ఇలాంటి మిరకిల్స్ ఎలా జరుగుతాయి?'
దానికి అమ్మ ఇలా అన్నారు.
'ఎందుకు నాన్నా అవన్నీ?' అంటూ తన కాళ్ళపైన ఉన్న మందారపువ్వును తీసి చూపిస్తూ, 'ఈ మందారపువ్వును చూడు నాన్నా. దీని రంగులూ, ఈనెలూ, పుప్పొడీ ఇవన్నీ ఎంత మనోహరంగా ఉన్నాయో చూడు. ఇది అద్భుతం కాదా? డబ్బాలోకి పంచదార వస్తేనే అద్భుతమా?' అన్నది.
ఈ మాటచెప్పి ఇలా అన్నాను.
'సృష్టిని మించిన పెద్ద మిరకిల్ ఎక్కడుంది శ్రీనివాస్? చీప్ మిరకిల్స్ ఎందుకసలు? దానికోసం మన దేవుళ్ళని మార్చేసి, అసలు దేవుడే కానివాడిని దేవుడంటూ పూజలు చెయ్యడం ఎంత వెర్రితనం? పంచదార డబ్బా ఖాళీగా ఉందని చూసిన ఆయన స్టూడెంట్లో, లేక అక్కడి స్త్రీ భక్తులో ఎవరో ఒకరు, చెప్పకుండా దానిలో పంచదార నింపి ఉంటారు. లేదా అమ్మే అలా నింపించి ఉంటుంది. చెప్తే ఆయన ఒప్పుకోడని అలా చేసి ఉండవచ్చు ! దాన్నేమో ఆయన 'బాబా లీల' అనుకున్నాడు. బాబాని ఒక మహనీయుడిగా ప్రచారం చేశాడు. ఆయన చెప్పే స్థానంలో ఉన్నాడు. వినే స్థానంలో ఉన్న వేలాదిమంది నమ్మేశారు. మాయ అనేది ఇలాగే మనుషులను ఆక్రమిస్తుంది. అందుకే నేనంటాను, 'చెప్పేస్థానంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే, వినేవాళ్ళు తేలికగా దారితప్పే ప్రమాదం ఉంది. ఆ కర్మంతా వీళ్లకు పట్టుకుంటుంది' అంటాను.
'మరి ఆయనకైన షిరిడీఅనుభవం కూడా అలాంటిదేనా? ఇందాక అడిగాను. మీరేమీ చెప్పలేదు' అన్నాడు.
పోనీలే అడుగుతున్నాడని ఆ రహస్యాన్ని వివరించాను.
'సరే విను. నువ్వు ఇంతగా అడుగుతున్నావని చెబుతున్నాను. ఆయనకా అనుభవం 9-2-1963 న షిరిడీలో జరిగింది. ఆ రోజేంటో తెలుసా?'
'తెలీదు' అన్నాడు.
'మాఘబహుళ పాడ్యమి. అంటే, పౌర్ణమి మరుసటిరోజు. అంటే, పౌర్ణమిఛాయలో ఆయనున్నాడు. గత పదేళ్లలో నేను వ్రాసిన పోస్టులు చూడు, కొన్ని వందల సంఘటనలను నిరూపించాను. పౌర్ణమి, అమావాస్య షాడోలలో ఇటువంటి సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. వీటియొక్క ఇంకా రహస్యాలను నా శిష్యులతో మీటింగులలో వివరిస్తూనే ఉన్నాను. అలాంటిదే ఆ అనుభవం కూడా.
ఆయన స్వతహాగా చాలా సెన్సిటివ్ మనిషి. సహృదయుడు. పైగా 1955 లో తన కజిన్ అకస్మాత్తుగా చనిపోవడంతో షాక్ లో ఉన్నాడు. ఆధ్యాత్మికమైన వెతుకులాటలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో అలాగే అవుతుంది. మునిగిపోతున్న మనిషి గడ్డిపోచను కూడా పట్టుకుంటాడు. మానసికంగా గందరగోళ పరిస్థితిలో ఉన్నపుడు అలాంటి సంఘటనలు చాలా కదిలిస్తాయి. అమాయకులు, మంచివాళ్ళు అందరూ ఇలాగే మోసపోతూ ఉంటారు. మతమార్పిడులు జరిగేది ఇలాగే.
అది షిరిడీలోనే కానక్కరలేదు.ఆ సమయానికి ఎక్కడున్నా అలాగే జరుగుతుంది. అదే అనుభవం వస్తుంది. దానికి కారణం ఆనాటి గ్రహాలు. ఆ సమయానికి అక్కడున్నాడు కాబట్టి 'బాబా మహిమ' అనుకున్నాడు. ఇందాక చెప్పలా? డబ్బాలో ఎవరో పంచదార నింపితే, ఈయన చూడలేదు కాబట్టి, బాబా అంటే విపరీతమైన భక్తి ఉంది కాబట్టి, 'బాబాయే పంచదార తెచ్చి డబ్బాలో పోశాడు' అనుకున్నాడు. అలాగే ఇదీ అనుకున్నాడు. It is his attribution, not a truth' అన్నాను.
'అంతేనా?' నిరాశగా అన్నాడు.
'చూశావా మరి? 'ఇంతేనా' అనుకుంటే నిరాశ పుడుతుంది. అలాకాకుండా, 'దేవుడే వచ్చి నాకోసం ఈ మిరకిల్ చేశాడు, డబ్బాలో పంచదార పోశాడు' అనుకుంటే నీ ఈగో చాలా తృప్తి పడుతుంది. 'నాకోసం దేవుడే దిగివచ్చాడా? నేనెంత గొప్పవాణ్ణి? అనిపిస్తుంది. లేదా, 'నా మొర వినడానికి ఒక దేవుడున్నాడు. ఆ దేవుడు కూడా ఈ రూపంలోనే ఉన్నాడు. మిగతా దేవుళ్లందరూ అబద్దాలు. ఎవరూ నా మొర ఆలకించలేదు. ఈయనొక్కడే విన్నాడు. నన్ను కరుణించాడు' అనిపిస్తుంది. నీ ఈగో బలపడటం, ఆ దేవుడిపైన నమ్మకం, ఇతర దేవుళ్లపైన ద్వేషం మొదలౌతాయి. ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్. ప్రతిమనిషికీ అంతిమంగా కావలసింది తన ఈగో తృప్తిపడటమే. అందుకనే, అక్కడేమీ లేకపోయినా 'మిరకిల్' అనుకుంటారు. ఈగోలో మునిగిపోతారు.
'నీకు భరద్వాజగారి జాతకచక్రం తెలుసా?'అడిగాను.
'తెలీదు. నాకసలు జ్యోతిష్యమే రాదు' అన్నాడు.
'మరీ మంచిది. దానిజోలికి పోకు. చేతులు కాల్తాయి. విను. ఆయన జాతకంలో శాపగ్రస్త గజకేసరీయోగం ఉంది. మకరరాశిలో ఉంది. నిజానికి, మకరంలో ఏర్పడేదాన్ని గజకేసరీయోగం అనకూడదు. కానీ, గురుచంద్రసంయోగం కనుక కాసేపు అనుకుందాం. నీచగురువుతో ఏర్పడినందువలన దానికి నీచత్వం పట్టింది. 9-2-1963 న ఆయన తన సోదరుడైన వేదవ్యాసతో కలసి షిరిడీ వెళ్ళాడు. ఆరోజున మకరంలో రవి, బుధ, శని, కేతువులున్నారు. కర్కాటకంలో చంద్ర, రాహు, వక్రనీచకుజులున్నారు. మకరానికి గురుశుక్రుల అర్గళం ఉంది. అంటే మొత్తం తొమ్మిదిగ్రహాలు మకరాన్ని, అక్కడున్న గురుచంద్రులను ప్రభావితం చేస్తున్నాయి. మరి ఆరోజున అలా జరగక ఇంకేమౌతుంది?' అన్నాను.
'అవునా?' అంటూ నోరెళ్లబెట్టాడు.
'ఇంకో రహస్యం కూడా చెబుతా విను. అంతకు ముందురోజు కూడా వేదవ్యాసతో కలసి ఆయన బాబాసమాధి దగ్గరికి వెళ్ళాడు. అంటే, పౌర్ణమినాడన్నమాట. బహుశా సోదరులిద్దరూ 'పౌర్ణమినాడు అక్కడుందాం' అనుకొని వెళ్లి ఉండవచ్చు. కానీ ఆరోజున ఆయనకేమీ అనిపించలేదు. పైగా, ఒక విధమైన వ్యతిరేకభావనతో ఉన్నాడు. మర్నాడు అంటే, పాడ్యమినాడు మాత్రం ఆయనంటున్న ఆ అనుభవం కలిగింది. ఎందుకు?' అడిగాను.
'ఏమో మరి, మీరే చెప్పండి' అన్నాడు.
నిన్నటిదాకా ధనుస్సులో ఉన్న బుధుడు రాశిమారి అదేరోజున మకరంలోకి వచ్చి రవి, శని, కేతువులతో కలిశాడు. పైగా సున్నాడిగ్రీలలో ఉన్నాడు. అంటే, బుద్ధి స్తంభించింది. లాజిక్ అడుగంటింది. దాని స్థానాన్ని నమ్మకం ఆక్రమించింది. అందుకే, ముందురోజు జరగని అనుభవం ఆనాడాయనకు కలిగింది. ఇందులో బాబా మహిమ ఏమీ లేదు. ఒకవేళ ఉంటే, ముందురోజు కూడా ఆయన బాబా సమాధిని దర్శించాడుగా. మరి అప్పుడెందుకు జరగలేదు? మర్నాడు బుధుడు రాశిమారగానే ఎందుకు జరిగింది? నువ్వే ఆలోచించు. అది ఖచ్చితంగా గ్రహప్రభావమే. బాబా మహిమేమీ కాదు' అన్నాను.
బిత్తరపోయాడు. పట్టించుకోకుండా, కొనసాగించాను.
అదేరోజున ఆయన ఒక నదీతీరంలోనో, ఒక కొండపైననో, ఒక చర్చిలోనో లేదా ఇంకొక చోట ఎక్కడున్నా అదే అనుభవం కలిగేది. అప్పుడా నదికి, ఆ కొండకు, ఆ కోనకు, ఆ చర్చికి, ఆ మసీదుకు భక్తుడయ్యేవాడు. షిరిడీలో ఉన్నాడు గనుక బాబా భక్తుడయ్యాడు. ఆయనవడమే గాక, ఆయనంటే నమ్మకం ఉన్న వేలాదిమంది ఈనాడు అదే దారిలోకి పోయారు. చివరకు హిందూమతంలోనే ఒక చీలికవర్గం ఏర్పడే పరిస్థితి వచ్చేసింది. చాపక్రింద నీరులాగా జిహాద్ జరుగుతున్నది. చిన్నవిషయం అర్ధం కాకపోవడంతో, ఎంత నష్టం జరిగిందో చూడు.
గురుదోషమంటే ఇదే. దానిప్రభావాలు మనం ఊహించలేనన్ని రకాలుగా ఉంటాయి.
అసలు సత్యం ఒకటి ఉంటుంది. మనం చూసేది ఇంకొకటుంటుంది. అర్ధం చేసుకునేది మూడోది ఉంటుంది. మాట్లాడేది నాలుగోది అవుతుంది. ఇక మనం ఏమౌతామో ఆలోచించు. ఆధ్యాత్మికమంటే నాలుగుపుస్తకాలు చదివి పిచ్చినమ్మకాలు పెంచుకొని, నలుగురికి నాలుగుమాటలు చెప్పడం కాదు. అసలైన ఆధ్యాత్మికమంటే సత్యాన్వేషణ. నువ్వు చిల్లరమహత్యాలను నమ్ముతున్నంతవరకూ నీకు సత్యమెలా అర్ధమౌతుంది?' అన్నాను.
'అంతేనంటారా?' అన్నాడు.
'చూశావా ఇంత చెప్పినా నీకు నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే, ఇప్పటిదాకా నువ్వు నమ్ముతున్నది నీకు చాలా హాయిగా చాలా బాగున్నట్లుగా ఉంది. నేను చెబుతున్నది దానికి విరుద్ధంగా ఉండేసరికి, ఇది సత్యమైనా సరే, నీకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. నీకు అనుభవించే కర్మ ఉన్నంతవరకూ నువ్వు సత్యాన్ని అందుకోలేవు. ఇది ఫైనల్' అన్నాను.
'మీరూ భరద్వాజగారూ కలుసుకున్నట్లైతే ఎంత బాగుండేదో?' అన్నాడు.
'ఇప్పుడు నువ్వు కలిశావుగా? నీకేం ఒరిగిందో చెప్పు. నీ సంగతి మాట్లాడకుండా, ఆయన సంగతెందుకు నీకు? తప్పించుకుందామని చూస్తున్నావా?' అడిగాను.
'మీతో చాలా కష్టం అన్నగారు' అన్నాడు.
'ఇప్పటికి ఈ మాటని వందలమంది అన్నారు, నేను విన్నాను' అన్నాను
'వాళ్ళన్నారు కాబట్టి మీరు నమ్ముతున్నారా?' నా లాజిక్ నాకే ప్రయోగించాడు.
'కాదు. వాళ్ళనకముందే 'నాతో చాలా కష్టమని' నాకు బాగా తెలుసు కాబట్టి నమ్ముతున్నాను. కనుక ఇది నా భ్రమ కాదు. సత్యానుభవమే' అన్నాను నవ్వుతూ.
(ఇంకా ఉంది)
10, ఏప్రిల్ 2026, శుక్రవారం
జిల్లెళ్ళమూడి స్మృతులు - 57 (విశ్వాత్మ - దత్తాత్రేయుడి అవతారాలు)
'ఏం? పెద్దపెద్దవాళ్లకి పిచ్చి రాకూడదా? లేక పిచ్చోళ్ళు పెద్దవాళ్ళు కాకూడదా? నీ ఉద్దేశం ఏంటి?' అడిగాను.
'అలాకాదు, చాలామంది వాళ్ళని నమ్ముతున్నారు కదా !' అన్నాడు
'ఒకప్పుడు ప్రపంచంలో చాలామంది భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. ఈనాటికీ అలా నమ్మే సొసైటీలు కొన్ని ఉన్నాయి. మనం కూడా అదే నమ్మాలిగా నీ లాజిక్ ప్రకారం?' అన్నాను.
తనేమీ మాట్లాడలేదు.
'అందరూ నమ్ముతున్నారని నువ్వు నమ్ముతావా? లేక నీ బుద్ధితో నువ్వు ఆలోచించుకొని నమ్ముతావా? ప్రకృతి నీకు బుద్ధినిచ్చింది ఎందుకు?' అడిగాను.
'పుట్టపర్తిలో నాకొక డివైన్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అందుకని నేను నమ్ముతున్నాను' అన్నాడు శ్రీనివాస్
నవ్వాను.
'అదేంటో నాకూ చెప్పు. విని తరిస్తాను. మనమనుకునే డివైన్ ఎక్స్పీరియెన్స్ లన్నీ చాలావరకూ మన భ్రమలే. మనకు కలిగే విజువల్, ఆడిటరీ, థాట్ లెవల్ ఇల్యూషన్స్ అన్నింటినీ డివైన్ ఎక్స్పీరియన్స్ లుగా అనుకోవడం మనలోని అహంకారానికి సూచన. "నాకంటే గొప్పవాడు ఇకలేడు. నాకు కాకపోతే ఇంకెవరికి ఇవి కలుగుతాయి? నేనొక అవతారపురుషుడిని" అనుకోవడమే ఒక పెద్ద మానసికరోగం' అన్నాను.
'విశ్వాత్మ గారు కూడా సత్యసాయిని నమ్మేవారు' అన్నాడు.
'దానికి నన్నేం చెయ్యమంటావు? చెప్పాగా, పెద్దపెద్దవాళ్ళకి పిచ్చి ఉండకూడదని రూలేమీ లేదని. విశ్వాత్మగారిని కొన్ని విషయాలలో నేను అభిమానిస్తాను. అంతమాత్రంచేత, ఆయన నమ్మేవన్నీ నేనెందుకు నమ్ముతాను?' అన్నాను.
'ఆయన తెలివిలేనివాడా?' అడిగాడు.
'అంతే ! కొన్నివిషయాలలో తెలివి ఉండవచ్చు. అన్నింటిలో ఉండాలని లేదు. అలా ఉండదు కూడా. ఉంటే, 1992 లో హైద్రాబాద్ మీటింగులో పళ్లెం కింద అంటించి ఉన్న బంగారుగొలుసును చేతులోకి తీసుకొని, దానిని తను సృష్టించినట్లు నటిస్తూ, టీవీ కెమెరాలకు బాబా దొరికిపోయిన విషయాన్ని విశ్వాత్మగారు ఎలా సమర్థిస్తారు?' అడిగాను.
మౌనం.
'పోనీ, 1993 లో పుట్టపర్తిలో జరిగిన విద్యార్థుల హత్యకేసును ఎలా సమర్థిస్తాడు? లేదా, బాబామీద ఉన్న హోమోసెక్స్ ఆరోపణలను ఎలా సమర్థిస్తాడు?' అడిగాను.
'అవేవీ రుజువు కాలేదుగా?' అన్నాడు.
'ఆధారాలన్నింటినీ మాయం చేస్తుంటే ఎలా అవుతాయి?' అన్నాను.
'అదేంటి?' అన్నాడు.
'అవును. రూంలో దాక్కుని ఉన్న నలుగురు స్టూడెంట్స్ నీ కాల్చి చంపకుండా, పట్టుకొని ఉంటే నిజాలు బయటకొచ్చేవి. వాళ్ళ రూంకి బయట తాళంపెట్టిన తర్వాతనే కదా భక్తులు పోలీసులను పిలిచారు? వాళ్ళను షూట్ చేయవలసిన పనేముంది? ఇది ఆధారాలను మాయం చేయడమే కదా. అతీతశక్తులున్న బాబా, మెట్లదారి గుండా పై రూంకి పారిపోయి దాక్కోవలసిన పనేముంది?' అన్నాను.
మౌనం.
'పిచ్చివాడా ! నీకింకా చాలా విషయాలు తెలీవు. నా ప్రశ్నకు నువ్వెలా జవాబు చెప్పాలో కూడా నేనే చెబుతా విను. "కాలయవనుడు తరుముతుంటే కృష్ణుడు కూడా పారిపోయి ముచికుందుని గుహలో దూరాడు కదా? పారిపోవడం కూడా ఒక లీలే" అని నువ్వు సమర్ధించుకోవాలి. ఇది కూడా తెలీదా? ఎప్పుడు ఎదుగుతార్రా మీరు?' అన్నాను నవ్వుతూ.
వింటున్నాడు.
'అసలు విశ్వాత్మగారి పేరు విశ్వాత్మేనా?' అన్నాను.
నేను ఏ సెన్స్ లో అన్నానో అతనికి అర్ధం కాలేదు. నిజంగా "విశ్వాత్మ" అయితే ఇలా ఎలా బొక్కబోర్లా పడతాడనేది నా ప్రశ్న.
'కాదు. ఆయన పేరు విశ్వాత్మ దిగంబర అవధూత' అన్నాడు.
'మరి ఆయన బట్టలు కట్టుకునేవాడుగా? మాతో కలిసి విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ కి కూడా వచ్చాడు' అడిగాను నవ్వుతూ.
'ఆయన గదిలో విప్పేసే ఉండేవాడు' అన్నాడు.
'ఓహో ! దిగంబర అవధూత అంటే, తన గదిలోనో, బెడ్రూంలోనో, బాత్రూంలోనో మాత్రమే విప్పుకునేవాడా? అలా అయితే, లోకంలో అందరూ దిగంబర అవధూతలేగా. అక్కడిదాకా ఎందుకు? 2008-10 మధ్యలో నేను గుంతకల్లు రైల్వేక్వార్టర్స్ లో ఒక్కడినే ఉన్నాను. ఇంట్లో ఉన్నపుడు నేనుకూడా దిగంబరంగానే తిరిగేవాడిని. ఆఫీసుకెళ్లేటప్పుడు మాత్రం బట్టలేసుకుని వెళ్ళేవాడిని. మరి నేనూ అదేగా?' అన్నాను.
మౌనం.
'ఆయనది ఏ సాంప్రదాయం?' అడిగాను.
'దత్తసాంప్రదాయమే అనుకుంటా. ఆయన కడపలో అవధూతదీక్ష తీసుకున్నారు' అన్నాడు.
ఈసారి ఇంకా పెద్దగా నవ్వొచ్చింది.
'అవధూత దీక్షలా? అవేమైనా అయ్యప్పదీక్షలా నెలకొకసారి వేసుకొని, ఇంకోనెలకు విప్పెయ్యడానికి? వాటినసలు ఇచ్చేవాళ్లున్నారా? అలా తీసుకుంటే అవధూతలు అయిపోతారా?' అడిగాను.
తను పుస్తకాలు బాగా చదివాడు. కానీ అన్వయం దొరకడం లేదు. అయితే, నేను చెబుతున్నదానిని కనీసం అర్ధం చేసుకోగలుగుతున్నాడు.
'దత్తాత్రేయులకు ఒక సాంప్రదాయము. అవతారాలు ఉన్నాయా అసలు?' అడిగాను.
'ఎందుకు లేవు? మహారాష్ట్రలో ఆయన అవతారాలు చాలామంది ఉన్నారు. షిరిడీబాబా కూడా ఆ అవతారాలలో ఒకరే' అన్నాడు.
'ఇది నీ అనుభవమా? లేక బల్లపరుపు బ్యాచ్ ఎక్కించిన వైరసా?' అడిగాను.
'భరద్వాజ గారికి కూడా షిరిడీలో అనుభవం అయిన తర్వాతనే మారిపోయారు' అన్నాడు.
'చెప్పాగా, మన అనుభవాలన్నీ మన భ్రమలే అని' అన్నాను.
'మరి ఆయన అనుభవం అబద్దమా?' అడిగాడు.
'అని అనడానికి నేనెవర్ని? ఎవరి అనుభవం వారిదే. కానీ అది సత్యానుభవం కావాలని రూలేమీ లేదనే నేనంటున్నాను. ఆరోజున్న గ్రహస్తితులను బట్టి సెన్సిటివ్ మనుషులకు ఏవేవో అనిపిస్తాయి. వాటిని నువ్వు డివైన్ ఎక్స్పీరియన్స్ అని పేరు పెట్టుకుంటే నేనేం చేసేది? భరద్వాజగారి జాతకం చూడు. దానిలో బలమైన గురుదోషం ఉంది. అందుకే ఆయన సాంప్రదాయ వైష్ణవకుటుంబంలో పుట్టికూడా, ముస్లిం ఫకీరైన షిరిడీసాయి భక్తుడయ్యాడు. ఇది నా అవగాహన' అన్నాను.
'సాయిలిద్దరినీ అమ్మ కూడా ఒప్పుకున్నారు. "వాళ్ళూ నా పిల్లలే" అని అమ్మ అన్నారు' అన్నాడు.
'అమ్మ ఎవర్ని కాదన్నది? 'తల్లికి తప్పే కనిపించదు' అనిన మహాతల్లి ఆమె. అమ్మ పిల్లలు కానివారెవరు? నువ్వూ నేనూ కూడా అమ్మ పిల్లలమే. మరి నేను చెబుతున్నది నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు?' అన్నాను.
'భరద్వాజగారు సివిల్స్ పాసయ్యారు. మహా తెలివైనవాడు' అన్నాడు.
'కావచ్చు. సివిల్స్ నేనూ పాసయ్యాను. ఒక తెలివైన వ్యక్తి, ఆర్నెల్లు కష్టపడితే సివిల్స్ క్లియర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. స్వానుభవంతో నేనీమాట చెబుతున్నాను. ఆయన కూడా అదే ప్రూవ్ చేశాడు. నిజానికి వేదవ్యాస విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి ఆయన ఆ పనిని చేశాడుగాని, సివిల్స్ పాసవ్వాలని ఆయనకేమీ లేదు' అన్నాను.
మౌనం.
'అకాడెమిక్ తెలివికి, ఆధ్యాత్మికతెలివికీ సంబంధం లేదు. ముందే చెప్పాగదా, పెద్దవాళ్ళకి పిచ్చి ఉండకూడదని రూలేమీ లేదని. అందుకే, పెద్దపెద్ద బ్యూరోక్రాట్లు, మేధావులు, సయింటిష్టులు, దేశాధినేతలు కూడా చిన్న బూడిదట్రిక్కుకు పడిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళ తెలివేమైంది మరి?' అన్నాను.
'ఇంతకీ దత్తాత్రేయుడికి అవతారాలు లేవా?' అడిగాడు.
'ఖచ్చితంగా లేవు' అన్నాను.
'ఈ మాట ఎవరు చెప్పారు?' అన్నాడు.
'నేనే చెబుతున్నాను' అన్నాను.
'మీరు చెబితే ఎలా సరిపోతుంది?' అన్నాడు.
'మరి ఎవరు చెబితే సరిపోతుంది?' అడిగాను.
'ఉన్నాయని అందరూ అంటున్నారు' అన్నాడు.
'కధ మళ్ళీ మొదటికొచ్చింది' అన్నాను.
(ఇంకా ఉంది)
విజయపత్ సింఘానియా జాతకం - గురుదోషం
ఈయన తండ్రి L. K. సింఘానియా చాలా ధనవంతుడు మరియు వ్యాపారవేత్త. కనుక 3.01 pm తర్వాత ఇతను పుట్టి ఉండాలి. అప్పుడు మకరలగ్నం మేషనవాంశ అవుతుంది. 4.00 లోపు మేషంనుండి కన్యవరకూ నవాంశలు నడుస్తాయి. వీటిలో మేషనవాంశ అయినప్పుడే జీవిత సంఘటనలు సరిపోతున్నాయి. అందులోనూ 3. 01 pm అయితేనే ఇవన్నీ సరిపోతాయి.
కొన్ని ముఖ్య సంఘటనలను చూద్దాం.
1980 - రేమాండ్స్ గ్రూపుకు చైర్మన్ అయ్యాడు. అప్పుడు గురు రాహుదశ నడిచింది. రాహుకేతువులు నవాంశచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని చూడవచ్చు.
2000 - ఈ సంవత్సరంలో రేమాండ్స్ సంస్థ పగ్గాలను మూడవ సంతానమైన గౌతమ్ సింఘానియాకు అప్పగించాడు. బుధ బుధ దశ నడిచింది. 9 వ భావమైన కన్యలో 8 వ భావాధిపతి సూర్యునితో కలసి ఉచ్చ బుధుఁడున్నాడు. కనుక అధికారమూ సంపదా రెండూ తనచేతినుంచి జారిపోయాయి. భావాద్భావ సూత్రాన్ని బట్టి 9 వ స్థానం కూడా సంతానభావమే.
20 మార్చి 2006 - పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ముంబాయి మేయర్ అయ్యాడు. బుధ రవి కేతు దశ నడిచింది. ఉచ్ఛస్థితిలో ఉన్న బుధునితో రవి కలసి నవమస్థానంలో ఉన్నాడు. కేతువు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.
2015 లో రేమాండ్స్ సంస్థలో తన వాటా (37%) ను కూడా కొడుక్కి ఇచ్చేశాడు. అక్కడే లీగల్ గొడవలు మొదలైపోయాయి. అప్పుడు బుధ శని కుజ దశ నడిచింది. ఈ దశలో మానసికచింత, గొడవలు సహజమే.
87 ఏళ్ల వయసులో 28 మార్ఛి 2026 న చనిపోయాడు. ఆ రోజున శుక్ర రవి రాహు గురుదశ నడిచింది. పెద్దవయసులో వచ్చేవి తప్ప చెప్పుకోదగ్గ జబ్బులేమీ లేవు. దశలు సరిపోతున్నాయి. కనుక, ఇదే ఈయన జననసమయంగా అనుకోవచ్చు.
ఈయన జాతకంలో ఉన్న బలమైన గురుదోషం వల్ల కొడుకులతో, వారి పిల్లలతో, గొడవలు, కోర్టుకేసులు, మనోవ్యధ కలిగాయి. తన ఇంటినుండి గెంటివేయబడ్డాడు. ఏ ముంబాయికైతే తను మేయర్ గా పనిచేశాడో, ఎక్కడైతే ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడో, అదే ముంబాయిలో ఒక అద్దెఇంటిలో ఉంటూ చనిపోయాడు. An Incomplete Life అనే ఆత్మకథను పుస్తకంగా వ్రాసి అసంతృప్తితో కన్నుమూశాడు.
12,000 కోట్లు సంపాదించి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కూడా చివరకు అసంతృప్తితో కుటుంబపు గొడవలతో చనిపోయాడంటే, ఇతని జాతకంలో గురుదోషం ఎంత బలంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
దీనికంతటికీ కారణం, మూడవకొడుకు గౌతమ్ సింఘానియాతో ఉన్న ఆస్తిగొడవలు. మూడవ కొడుకును సూచించే 9 వ భావంలో ఉచ్చబుధుడు, రవి ఉన్నారు. రాహుకుజులతో శనికేతువులతో ఆర్గళంలో ఉంటూ, చాలా తెలివైన సంతానాన్ని, అదేసమయంలో బలమైన సంతానదోషాన్ని సూచిస్తున్నారు.అందుకే, ఆస్తిని కంపెనీని అన్నింటినీ మూడవకొడుకుకు రాసిచ్చేయగానే ఈయన రోడ్డున పడ్డాడు. పద్మభూషణ్ అవార్డును అందుకుని, అంతర్జాతీయస్థాయిలో ఒక వెలుగు వెలిగిన రేమాండ్స్ దిగ్గజం చివరకు అద్దెఇంటిలో దిక్కులేకుండా చనిపోయాడు.
గురుదోషం అంటే ఇలా ఉంటుంది !
మరి అన్నిదోషాలనూ పిచ్చిపిచ్చి హోమాలతో, పిచ్చిపిచ్చి రెమెడీలతో బాగుచేస్తామని డప్పు కొట్టుకునే జ్యోతిష్కులు పాపం ఈయనకు అందుబాటులో లేరా? ఉన్నా, ఈ గురుదోషాన్ని తొలగించడం వారివల్ల కాలేదా? లేక ఈయన దగ్గరున్న పన్నెండువేలకోట్లు ఆ దోషాన్ని పోగొట్టడానికి సరిపోలేదా?
దీనివల్ల రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా?
ఒకటి - జాతకదోషాలు అంత తేలికగా పోవు. మామూలు జ్యోతిష్కులకు అర్ధంకాని లోతులు దీనివెనుక ఉంటాయి.
రెండు - డబ్బులు పారేసి చేసే రెమెడీలతో అవి అస్సలు లొంగవు. మీ అవినీతిసొమ్ము జ్యోతిష్కుడికి చేరడం తప్ప దీనివల్ల జరిగేది ఇంకేమీ ఉండదు.
జాతకదోషాలను పోగొడతానని, పోగొట్టగలనని, ఏ జ్యోతిష్కుడైనా డప్పు కొట్టుకుంటుంటే, ఆ మాటలు నమ్మారంటే, మీరు మోసపోతున్నట్లే. జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులు అతనికి తెలీకనైనా ఉండాలి. లేదా మిమ్మల్ని అతను మోసం చేస్తూనైనా ఉండాలి. రెండూ కూడా కావచ్చు.
మీరు పెట్టుకునే ఉంగరాలవల్ల, చేసే దొంగపూజలవల్ల, తిరిగే గుళ్ళవల్ల మీ జాతకదోషాలు ఎక్కడికీ పోవు. మీరు దేనినైనా మోసం చేయవచ్చుగాని, మీ కర్మను మోసం చేయలేరు.
ఈ జాతకం చూచాక కూడా అర్ధం కాలేదా?
అయితే మీ కర్మ !
9, ఏప్రిల్ 2026, గురువారం
జిల్లెళ్ళమూడి స్మృతులు - 56 (రీల్స్ చెయ్యండి)
మూడురోజులు జిల్లెళ్ళమూడిలో ఉండి నిన్ననే ఆశ్రమానికి తిరిగి వచ్చాము. అప్పుడప్పుడూ అక్కడకెళ్లి ఇంటిని చూసుకోకపోతే అది దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. అందుకని ఇష్టం లేకపోయినా అలా వెళ్లి రావడం తప్పనిసరి అవుతోంది.
చీకటిపడ్డాక ఆశ్రమంలోనూ, ఊళ్లోనూ తిరుగుతూ ఉండటం ఒక అలవాటు గనుక, మొదటిరోజు సాయంత్రం ఏడుగంటల సమయంలో సంచారానికి బయలుదేరాను. ఎదురౌతున్న వింతజీవులను చూస్తూ అమ్మ గుడికెళ్ళి వెనక్కు వస్తూ ఉండగా, ఒక పాతవ్యక్తి కనిపించాడు. పేరు శ్రీనివాస్ కాకపోయినా, అసలు పేరు చెప్పడం బాగోదు గనుక, అలా అనుకుందాం కాసేపు.
సంభ్రమంగా నమస్కారం పెడుతూ, 'చాలా రోజుల తర్వాత చూశాను మిమ్మల్ని' అన్నాడు.
మాట్లాడే పరిస్థితిలో లేను గనుక, మౌనంగా తలూపాను.
'మౌనంలో ఉన్నారా?' అన్నాడు అనుమానంగా.
'కాదు' అంటే బాగుండదని 'అవును' అన్నాను.
ఎలా అన్నా మౌనం చెదిరిపోతుందిగా !
'మాట్లాడు. మళ్ళీ వస్తా' అంటూ అది చక్కాపోయింది.
నవ్వుకుంటూ, సంభాషణను పొడిగించకుండా నా దారిన నేనొచ్చేశాను.
తరువాత, ఇంటికిపోయే దారిలో ఒక చెట్టుకింద నిలబడి ఉండగా స్కూటర్లో వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్నాడు.
'మీకోసం వెతుకుతున్నాను. అక్కడ గుళ్లో ఎందుకులే అని ఎక్కువగా మాట్లాడించలేదు' అన్నాడు.
'ఏంటి?' అన్నట్లు చూశాను.
'మీరింతకు ముందు బ్లాగు బాగా వ్రాసేవారు. ఇప్పుడు వ్రాయడం లేదు. నేను మీ వీరాభిమానిని' అన్నాడు.
పాపం కనిపించిన ప్రతిసారీ ఇదే మాట చెబుతూ ఉంటాడు.
'సరే' అన్నాను.
'పదహారేళ్ళ నించి, అంటే దాదాపు 2008 నుంచీ మీరు వ్రాసినవన్నీ చదివేవాడిని. నాకు బాగా నచ్చేవి. నేనపుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. 'మీ వ్రాతలలో ఒక వెలుగుంది' అని మీకు మెయిలిచ్చాను. దానికేమో మీరు 'నీలో వెలుగుంది కాబట్టి దానిని గుర్తించగలిగావు' అని రిప్లై ఇచ్చారు', అన్నాడు.
'అవునా' అన్నాను.
'తర్వాత, మీరు విశ్వాత్మ గారి గురించి వ్రాశాక, నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను. ఆయన నాతో చాలా చనువుగా ఉండేవారు' అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు.
'మీరు వ్రాస్తుంటే, ఒక కధ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కలిసిన సినిమా ఎదురుగా చూస్తున్నట్లు ఉంటుంది. పాతకాలం సినిమాలలో, హీరోయిన్ లెటర్ చదువుతుంటే అందులో హీరో కనిపిస్తూ, అదే మేటర్ చెబుతూ ఉన్నట్టు చూపించేవారు. అలా ఉంటుంది. అందుకే మీ శైలి నాకు నచ్చుతుంది' అన్నాడు.
'సరే' అన్నాను.
'ఎందుకని వ్రాయడం తగ్గించారు?' అడిగాడు.
'అవసరం లేదనిపించింది' అన్నాను.
'ఎందుకలా అనుకుంటున్నారు? మీ అభిమానులు వేలల్లో ఉన్నారు. మీరలా ఆపేస్తే ఎలా?' అన్నాడు.
'చదివేవాళ్ళు వేలల్లో ఉండవచ్చు. అంతేనా? ఊరకే చదివి వదిలెయ్యడానికి ఇది న్యూస్ పేపర్ కాదు. నా వ్రాతల విలువ ఒక న్యూస్ పేపరే అయితే, ఆ విలువ నాకక్కర్లేదు. నన్ను వదలకుండా అనుసరించేవారు ఒక వందమంది ఉన్నారు. వారికి కావలసినది చెబుతున్నాను. వారు అందుకుంటున్నారు. చాలుగా' అన్నాను.
'అలా అయితే మిగిలిన వారి పరిస్థితేంటి మరి? మీరలా ఆపకండి. ఇది నా రిక్వెస్ట్' అన్నాడు.
'అనిపిస్తే రాస్తాలే' అన్నాను.
' ఇంకొక మాట. మీరేమీ అనుకోకపోతే ' అన్నాడు.
' మర్యాదలొద్దు. సూటిగా చెప్పు ' అన్నాను.
' బ్లాగు కంటే రీల్స్ మంచివి. ఆడియో విజువల్ మాధ్యమానికున్న శక్తి మీకు తెలీనిది కాదు. రీల్స్ ఎక్కినంత బాగా బ్లాగు పోస్టులు ఎక్కవు. అందుకని మీరు రీల్స్ చేస్తే బాగుంటుంది' అన్నాడు.
'నాకెందుకా గోల?' అన్నాను.
' మీలాంటి జ్ఞానులు మౌనంగా ఉండకూడదు. జ్ఞాని మౌనం ప్రపంచానికి మంచిది కాదు' అన్నాడు.
' జ్ఞాని ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అజ్ఞాని నిర్ణయిస్తాడా?' అడిగాను.
నవ్వేశాడు.
' కాదనుకోండి. కానీ ప్రస్తుతట్రెండ్ ను బట్టి, ఇలా చేస్తే ఎంతోమందికి సరియైనదారిని చూపించినవారౌతారు' అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు.
'మీకు అందరు మహనీయుల గురించీ క్షుణ్ణంగా తెలుసు కదా. ఉదాహరణకు ఒక రామకృష్ణులో, అమ్మగారో, రమణులో, షిరిడీబాబానో, సత్యసాయిబాబానో, ఒక టాపిక్ మీద ఏం చెప్పారు? అన్న విషయం చిన్నచిన్న వాక్యాలలో మీరు రీల్స్ చేస్తే ఎంతోమందికి ఎంతో దిశానిర్దేశంగా ఉంటుంది కదా?' అన్నాడు.
'ఆగాగు. ఏమన్నావ్?' అన్నాను.
'నేనేమన్నాను?' అన్నట్టు అయోమయంగా చూశాడు.
'మిగతావాళ్ల విషయం అలా ఉంచు. షిరిడీబాబా, సత్యసాయిబాబా అసలు మహనీయులెలా అవుతారు? వాళ్ళు ప్రత్యేకంగా చెప్పినదేముంది? చేసినదేముంది? వాళ్ళ గురించి మళ్ళీ నేను రీల్స్ చెయ్యడమేంటి? తలకాయ ఉండి మాట్లాడుతున్నావా?' అన్నాను సీరియస్ గా.
ఖంగు తిన్నాడు.
'అదేంటి అలా అన్నారు?' అన్నాడు.
'చూశావా నేను నిజం మాట్లాడితే నీకే నచ్చలేదు. మళ్ళీ పాతికేళ్ళనుంచీ నా అభిమానినంటున్నావు. ఇక బయటివాళ్ళకెలా నచ్చుతుంది? నిజాలు లోకానికి నచ్చవు కాబట్టే నేను మునుపటిలాగా మాట్లాడటం లేదు' అన్నాను.
'లోకం అంతా నమ్ముతున్నది కదా. నమ్మేవాళ్ళలో చాలా పెద్దపెద్ద వాళ్ళున్నారు కదా. మరి, వాళ్ళందరూ పిచ్చోళ్లా?' అడిగాడు.
విషయం పాకాన పడుతోందనిపించి గొంతు సవరించుకున్నాను.
(ఇంకా ఉంది)


