మొన్న బెంగుళూరులో చంద్రశేఖర్ గారిని కలిసినపుడు, యూజీగారు ఇలా అనేవారని ఆయనన్నారు, "ఎవరైనా జ్యోతిష్యశాస్త్ర పరిశోధకులు, నా జాతకాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ జ్యోతిషశాస్త్ర ప్రకారమే జరిగాయి" అని ఆయన ఆనేవారట. యూరోప్ లో ఉన్న సమయంలో స్వయానా ఆయనే హస్తసాముద్రికాన్ని సరదాగా నేర్చుకున్నారని చంద్రశేఖర్ గారు నాతో అన్నారు.
ఆయన సమక్షంలో చాలామంది ప్రసిద్ధజ్యోతిష్కులు ఆయన జాతకాన్ని విశ్లేషించారు. వారి విశ్లేషణలను ఆయన సరదాగా వింటూ ఉండేవారు.
ఇప్పుడు కెలామిటీని జ్యోతిషశాస్త్ర పరంగా పరిశీలిద్దాం.
ప్రప్రధమంగా ఆయనకు కుండలినీజాగృతి అనేది లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ లో ఉన్న సమయంలో కలిగింది. అక్కడి సాధువులు భక్తులు అందరూ జపధ్యానాలు చేస్తూ ఉండటం చూసి, వాళ్లంతా సమయాన్ని వృధా చేసుకుంటున్నారని, అలాంటి సాధనలవల్ల ఏమీ ఉపయోగం లేదని యూజీగారు అనుకున్నారు. ఏమంటే, అవన్నీ ఆయన తన 14-21 ఏళ్ల మధ్యలో స్వామి శివానందగారి పర్యవేక్షణలో హిమాలయాలలో చేసి ఉన్నాడు. కనుక అవన్నీ ఆయనకు బాగా తెలిసినవే.
అలా అనుకుంటూ శూన్యమనస్సుతో అలా కూచుని ఉండగా, ఉన్నట్టుండి ఏదో శక్తి తనలో క్రిందినుండి పైకి సుడులుగా తిరుగుతూ పైపైకి లేస్తున్నట్లు ఆయన అనుభూతి చెందాడు. అది కాసేపు సవ్యదిశలోనూ, మరికాసేపు అపసవ్యదిశలోనూ తిరుగుతున్నది. అంతకుముందు విమానాశ్రయంలో తను చూసిన విల్స్ సిగరెట్ యాడ్ లో పొగ సుడులు తిరుగుతున్న విధంగా అది ఆయనకు అనిపించింది.
ఇది 1963 లో జరిగింది. ఆ ఏడాది వేసవిలో ఆయన లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ లో ఆశ్రయాన్ని పొంది, మూడు నెలలపాటు అక్కడున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7 వ తేదీన ఆ ఆశ్రమ స్వామీజీకి ఒక ఉత్తరాన్ని వ్రాసి అక్కడనుండి బయటకు వచ్చేశాడు.
కనుక జూన్ నెల నుండి మూడు నెలలపాటు ఆయన లండన్ లో ఉన్నాడని మనం అనుకోవచ్చు. ఆ సమయంలో ఆయనకు శుక్రమహర్దశ నడుస్తున్నది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, శుక్ర శుక్ర శని శుక్ర దశ నడుస్తున్నది. ఏరోజున ఈ సంఘటన మొదటిసారి జరిగిందో ఆయనయొక్క జీవితచరిత్రలలో ఎక్కడా దొరకడం లేదు గనుక, ప్రాణదశను ఖచ్చితంగా గుర్తించడం సాధ్యం కావడం లేదు. కానీ త్రవ్వి బయటకు తీయవచ్చు.
యూజీ గారి జీవితంలో శుక్రమహర్దశ 4-4-1961 న మొదలైంది. దీనిలోనే ఆయనకు కుండలినీ జాగృతి కలిగింది. దానికి కారణాలేమిటో జాతకం నుండి గమనిద్దాం.
జాతకంలో శుక్రకేతు యోగాన్ని కలిగి ఉండటం కుటుంబపరంగా, జాతకపరంగా అంత మంచిది కాదు. ఇది భార్యావియోగాన్నిస్తుంది. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆందులోనూ, ఈయన జాతకంలో నీచకేతువున్నాడు. శుక్రక్షేత్రంలో ఉండటంతో మళ్ళీ శుక్రుడినే సూచిస్తున్నాడు. కనుక 1961 లో శుక్రమహర్దశ ఆయనను ఒంటరివాడిని చేసేసింది.
నిజానికి 1959 లో అమెరికాలో ఉన్న సమయంలోనే ఈయన కుటుంబంలో కలతలు మొదలైపోయాయి. అమెరికాలో ఉండలేక కుటుంబంతో సహా ఇండియాకు వెళ్ళిపోదామని అప్పుడే నిశ్చయం జరిగిపోయింది. ఆ సమయంలో ఆయనకు కేతు శని దశ నడుస్తున్నది. కర్కాటకరాశికి శని సప్తమాధిపతి అవుతాడు. కేతువుచే సూచింపబడుతున్న శుక్రుడు బాధకుడౌతాడు. కనుక, ఆ దశలోనే కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. కానీ భార్యాపిల్లలతో ఇండియాకు వెళ్లకుండా ఈయన యూరప్ లో ఉండిపోయాడు.
యూజీగారి జాతకంలో కాలసర్పయోగం ఉన్నది. అందుకే, కేతుదశలో కోటీశ్వరుడల్లా బికారైపోయాడు. 1955 ప్రాంతాలలోనే లక్షరూపాయలకు చెక్కురాసి ఇవ్వగల ఆస్తిపరుడాయన. కానీ ఆ ఆస్తినంతా పెద్దకొడుకుకు అమెరికాలో ఇప్పించిన పోలియో ట్రీట్మెంట్ రూపంలో మింగేసిన కేతువు ఆయనను బిచ్చగాడిగా మార్చి యూరప్ వీధులలో వదిలేశాడు.
సరిగా ఇదే సమయంలో ఆయనకు శుక్రదశ మొదలైంది.
డిగ్రీపరంగా శుక్రుడొక్కడే దీనికి బయట ఉన్నాడు. కనుక కాలసర్పం నోటపడకుండా తప్పుకున్నది శుక్రుడొక్కడే. కనుకనే రాహుకేతుస్వరూపమైన కర్మకు అతీతస్థితిని తన దశలో అందించాడు.
చంద్రలగ్నం నుంచి రాహుకేతువులు 5-11 ఇరుసులో నీచస్థితిలో ఉన్నారు. కనుక బుద్ధిని నశింపజేసే జ్ఞానయోగవిధానం ఈయనదై కూచుంది. రాహువున్నది వృశ్చికరాశి గనుక, కుండలినీయోగం దానికి తోడైంది.
2-12 ఇరుసులో చంద్రకుజులు, 3-11 లో బుధ సూర్యులు, 4-10 లో రాహుకేతువులు, 6-8 లో దృఢకర్మ గ్రహాలైన గురుశనులు వెరసి అన్ని గ్రహాలూ తమతమ శక్తులను శుక్రునిపైన కేంద్రీకరించాయి. కనుక, ఎన్నో జన్మలనుంచి చేస్తున్న సాధన ఈ శుక్రదశలో ముగింపుకు వచ్చింది. జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని అందించింది.
ఆనాటి గోచారగ్రహాలను గమనిద్దాం.
1960 - గురుశనులు ధనూరాశిలో ఉన్నారు. ఇది కర్కాటకరాశికి కర్మస్థానమౌతుంది.
1961 - ఇద్దరూ మకరంలోకి మారారు. గురువు నీచస్థితిలో పడ్డాడు. శని స్వస్థానంలో బలంగా ఉన్నాడు. కానీ గురుయుతి మంచిది కాదు. గోచారంలో ఇటువంటి స్థితి ఉన్న సమయంలో ఈయనకు శుక్రమహర్దశ మొదలైంది.
1962 - శని మకరంలో ఉండిపోయాడు. గురువు కుంభంలోకి ప్రవేశించాడు.
1963 - గురువు మీనంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకూ యూజీగారు లండన్ లోని రామకృష్ణా మిషన్ బ్రాంచిలో ఉన్నాడని పైన చెప్పాను. అప్పుడే కుండలినీ జాగృతిని ఈయన మొదటిసారిగా అనుభూతి చెందాడు.
ఆయన జననలగ్నమైన మిధునంలో నాలుగు గోచార గ్రహాలున్నట్లుగా మనం చూడవచ్చు. వీరిలో గోచారరవి సరిగ్గా జననరవి పైన సంచరిస్తున్నాడు. రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో ఉన్నారు. శనిచంద్రులు కలసి సప్తమంలో అస్తమిస్తూ శూన్యమానసాన్ని సూచిస్తున్నారు. నవాంశలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. బుధుడు నీచస్థితిలో ఉంటూ బుద్ధి మాయం కావడాన్ని సూచిస్తున్నాడు.మిధునంలోని నాలుగు గ్రహాలు ఈయన యొక్క రాశియైన కర్కాటకం నుండి 12 వ భావంలో ఉంటూ అంతచ్ఛేతనలోని శక్తి జాగృతం కావడాన్ని సూచిస్తున్నాయి.
ఇక్కడ ఇంకొక విచిత్రం ఉన్నది. స్విట్జర్లాండ్ లో ఈ సంఘటన జరిగిన సరిగ్గా మూడురోజులకు జూలై 13 వ తేదీన ఇండియాలో నేను పుట్టాను. కనుక, ఒక్క చంద్రుని స్థితి తప్ప, నా జాతకచక్రం కూడా ఇదే. యూజీగారికి కుండలినీజాగృతి కలిగినది నేను పుట్టినది, కేవలం మూడురోజుల తేడాతో, ఒకే సమయంలో జరిగింది.
అది 1963 వ సంవత్సరం. మళ్ళీ ఇన్నాళ్లకు, సరిగ్గా నాకు 63 వ ఏట బెంగుళూరు వెళ్లి చంద్రశేఖర్ గారి ఇంటిలో యూజీగారి గదిని దర్శించి వచ్చాను. ఇదంతా అనుకోకుండా జరిగింది. ప్లాన్ వేసుకొని చేసినది కాదు. ఇవన్నీ కాకతాళీయం కాదని, వీటి వెనుక మామూలు దృష్టికి కనిపించని కర్మసంబంధాలున్నాయని నా భావన. ప్రస్తుత టాపిక్ అది కాదు గనుక, అందరికీ వీటిని వివరించవలసి పని లేదు గనుక, ఆ రహస్యాలలోకి ఇంతకంటే ఎక్కువగా పోవడం లేదు.
నేడు కుండలిని అనేది ఒక ఫేషన్ అయిపోయింది. అందులోను విదేశీయుల చేతులలో పడి కుండలిని, చక్రాలు మొదలైనవన్నీ భ్రష్టు పడుతున్నాయి. డ్రగ్సు వాడడం, పిచ్చిపిచ్చిగా అరవడం, గెంతడాన్నే కుండలిని అని చెబుతున్నారు. ఇదంతా పెద్దమాయ.
మార్కెట్లో కనిపించే కుండలిని అంతా వ్యాపారమే. కుండలిని కోర్సులు, చక్రా హీలింగ్ కోర్సులు, చక్రా రేకీ కోర్సులు, మెడిటేషన్ క్లాసులు అన్నీ బూటకాలే. వీళ్ళలో ఎవరికీ కుండలిని గురించి ఏమీ తెలియదని నేను ఘంటాపథంగా చెప్పగలను.
కుండలినీ జాగృతి అనేది అందరికీ కలగదు. అలా జరిగినవారిలో కూడా పూర్ణజాగృతి అనేది మళ్ళీ వెయ్యిమందిలో ఒకరికి మాత్రమే అవుతుంది. దానికి మార్మికమైన కారణాలున్నాయి. కుండలినీ జాగృతి జరగడానికి కావలసిన దైహిక, ప్రాణిక, మానసిక అర్హతలు చాలామందిలో ఉండవు. అదే దీనివెనుక ఉన్న ముఖ్యమైన కారణం !
ఇంకా చెప్పాలంటే, ఆధ్యాత్మికత అనేది అందరికీ పనికొచ్చే బటాణీ కాదు. మానవులలో చాలామంది ఆధ్యాత్మికతకు అస్సలు పనికిరారు. పనికొస్తాం అని వాళ్ళనుకోవచ్చు, కానీ పనికిరారు. ఆధారాలు లేకుండా కేవలం మనం ఊరకే అనుకున్నంతమాత్రాన అన్నీ నిజాలైపోవు. ఈ రంగంలో గత ఏభై ఏళ్లుగా నేను చేస్తున్న పరిశీలన, పరిశోధనల వల్ల నేనీ అభిప్రాయానికొచ్చాను.
జీవితంలోని అన్ని సంఘటనలకూ జాతకంలోని గ్రహాలకూ ఖచ్చితమైన సంబంధం ఉంటుంది. అదేవిధంగా,కుండలినికి కూడా ఉంటుంది !
ఒకనికి కుండలినీజాగృతి కలగాలంటే అతని జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్థితులలో గాని, నీచస్థితులలోగాని ఉండాలి. అదికూడా, మిధున-ధనూరాశుల ఇరుసులో వీరున్నపుడు మాత్రమే ఈ అద్భుతం సాధ్యమౌతుంది.
యూజీగారి జాతకంలో రాహుకేతువులు వృశ్చిక-వృషభరాశుల ఇరుసులో నీచస్థితిలో ఉన్నాయి. కనుక ఈయనకు కుండలినీ జాగృతి విధిగా వ్రాసిపెట్టి ఉన్నది. కానీ 1963 లో రాహుకేతువులు మిధున - ధనూరాశులలో ఉచ్ఛస్థితిలోకి వచ్చిన సమయంలో మాత్రమే జాతకంలో ఈ యోగం జాగృతమైంది.
5, మే 1963 న రాహువు మిధునరాశిలోకి కేతువు ధనూరాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిలోకి వచ్చారు. అప్పటికింకా యూజీగారు దిక్కులేనివాడిగా లండన్ వీధులలో తిరుగుతూనే ఉన్నాడు.కానీ చేతిలో డబ్బులు అయిపోవస్తున్నాయి. పగలంతా వీధులలో తిరుగుతూ, రాత్రిళ్ళు హైడ్ పార్కులో పడుకుంటూ, ఒక పిచ్చివాడిలాంటి స్థితిలో ఆయన ఉండేవాడు. అదేసమయంలో ఒకనాడు పోలీసుచేత హైడ్ పార్కు నుండి వెళ్లగొట్టబడ్డాడు. ఇది 1963 జూన్ నెలలో జరిగింది.
ఆ సమయానికి ఆయన చేతిలో అయిదు పెన్నీలు మాతమే మిగిలి ఉన్నాయి. అవికూడా అయిపోయాక ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? అని ఆలోచిస్తూ ఉండగా, రామకృష్ణా మిషన్ సెంటర్ కు వెళ్లమనిన ఒక సూచన ఆయనకు అందింది. అందుకని, ఆ అయిదు పెన్నీలతో వచ్చిన స్టేషన్ వరకూ టికెట్టు కొనుక్కుని, అక్కడ దిగి, అక్కడనుండి లండన్ రామకృష్ణా మిషన్ కు నడుచుకుంటూ వెళ్ళాడు.
ఆ సమయంలో స్వామి ఘనానందగారు ఆ కేంద్రానికి అధ్యక్షులుగా ఆన్నారు. 1948 లో ఆ కేంద్రాన్ని ఆయనే స్థాపించి, 1969 లో చనిపోయేవరకూ ఆయనే దానిని నడిపారు.
ఆయన రామకృష్ణుల ప్రత్యక్షశిష్యుడైన స్వామిశివానందగారి శిష్యుడు. శివానందస్వామివారు నా పరమగురువులు. మా గురువుగారైన గంభీరానందగారు, ఘనానందగారు ఇద్దరూ సోదరశిష్యులు. ఇప్పుడర్ధమైందా యూజీగారితో నాకున్న సంబంధం ఏమిటో?
మొన్న బెంగుళూరులో చంద్రశేఖర్ గారి ఇంటికెళ్ళినపుడు, అక్కడున్న రజని అనే యూజీగారి ఫాలోయర్, 'యూజీగారితో మీకెలా పరిచయం?' అని ఒక మాటను అడిగారు.
'నేనాయనను చూడలేదు' అని చెప్పాను.
'మరి?' అని ఆమె అడిగారు.
దానికేదో నెట్లో చదివానని ఆమెతో చెప్పాను. కానీ, నెట్లో చదివినంతమాత్రాన, పుస్తకాలు చదివినంత మాత్రాన అందరూ మనల్ని కదిలించరు. వెళ్లి వాళ్ళను కలవాలని కూడా అనిపించదు. అలా అనిపించాలన్నా, అలా ఒకరిని కలవాలన్నా, ఆ వెనుక బలమైన కర్మసంబంధాలుండాలి. వాటినెలా వివరించి మీటింగులలో అందరితో చెప్పగలం? కనుక ఆమెకు అలా చెప్పాను.
స్వామి ఘనానందగారు యూజీగారి పరిస్థితిని విని, తమ ఆశ్రమంలో ఆయనను ఉండమని ఆశ్రయం ఇచ్చారు. Complete Works of Swami Vivekananda పుస్తకాల ప్రూఫ్ రీడింగ్ చెయ్యమని యూజీగారికి చెప్పారు. ఆయన ఆ పనిని చేసుకుంటూ అక్కడ ఉంటూ ఉండేవారు. ఆ విధంగా 1963 జూన్ నెల నుండి సెప్టెంబర్ 7 వ తేదీ వరకూ మూడు నెలలపాటు రామకృష్ణులు ఆయనకు ఆశ్రయాన్నిచ్చి కాపాడారు.
రామకృష్ణులంటే కాళికామాతనే. కాళికామాతనే కుండలినీశక్తి. కాళీఅనుగ్రహం లేనిదే ఎవరికీ కుండలినీజాగృతి అనేది కలగదు.
లండన్ రామకృష్ణా మిషన్ ఆశ్రమంలో ఉన్న సమయంలోనే ఆయనకు కుండలినీ జాగృతి కలిగింది. ఈ విధంగా లోకానికి అర్ధం కాని కర్మరహస్యాలు మహనీయుల జీవితాలలో చాలా ఉంటాయి. తరచి చూస్తేగాని వాటి లోతుపాతులు అర్ధం కావు.
(ఇంకా ఉంది)









.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)

