10, ఏప్రిల్ 2026, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 57 (విశ్వాత్మ - దత్తాత్రేయుడి అవతారాలు)

'ఏం? పెద్దపెద్దవాళ్లకి పిచ్చి రాకూడదా? లేక పిచ్చోళ్ళు పెద్దవాళ్ళు కాకూడదా? నీ ఉద్దేశం ఏంటి?' అడిగాను.

'అలాకాదు చాలామంది వాళ్ళని నమ్ముతున్నారు కదా !' అన్నాడు

'ఒకప్పుడు ప్రపంచంలో చాలామంది భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. ఈనాటికీ అలా నమ్మే సొసైటీలు కొన్ని ఉన్నాయి. మనం కూడా అదే నమ్మాలిగా నీ లాజిక్ ప్రకారం?' అన్నాను.

తనేమీ మాట్లాడలేదు.

'అందరూ నమ్ముతున్నారని నువ్వు నమ్ముతావా? లేక నీ బుద్ధితో నువ్వు ఆలోచించుకొని నమ్ముతావా? ప్రకృతి నీకు బుద్ధినిచ్చింది ఎందుకు?' అడిగాను.

'పుట్టపర్తిలో నాకొక డివైన్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అందుకని నేను నమ్ముతున్నాను' అన్నాడు శ్రీనివాస్

నవ్వాను.

'అదేంటో నాకూ చెప్పు. విని తరిస్తాను. మనమనుకునే డివైన్ ఎక్స్పీరియెన్స్ లన్నీ చాలావరకూ మన భ్రమలే. మనకు కలిగే విజువల్, ఆడిటరీ, థాట్ లెవల్ ఇల్యూషన్స్ అన్నింటినీ డివైన్ ఎక్స్పీరియన్స్ లుగా అనుకోవడం మనలోని అహంకారానికి సూచన. "నాకంటే గొప్పవాడు ఇకలేడు. నాకు కాకపోతే ఇంకెవరికి ఇవి కలుగుతాయి? నేనొక అవతారపురుషుడిని" అనుకోవడమే ఒక పెద్ద మానసికరోగం' అన్నాను.

'విశ్వాత్మ గారు కూడా సత్యసాయిని నమ్మేవారు' అన్నాడు.

'దానికి నన్నేం చెయ్యమంటావు? చెప్పాగా, పెద్దపెద్దవాళ్ళకి పిచ్చి ఉండకూడదని రూలేమీ లేదని. విశ్వాత్మగారిని కొన్ని విషయాలలో నేను అభిమానిస్తాను. అంతమాత్రంచేత, ఆయన నమ్మేవన్నీ నేనెందుకు నమ్ముతాను?' అన్నాను.

'ఆయన తెలివిలేనివాడా?' అడిగాడు.

'అంతే ! కొన్నివిషయాలలో తెలివి ఉండవచ్చు. అన్నింటిలో ఉండాలని లేదు. అలా ఉండదు కూడా. ఉంటే, 1992 లో హైద్రాబాద్ మీటింగులో పళ్లెం కింద అంటించి ఉన్న బంగారుగొలుసును చేతులోకి తీసుకొని, దానిని తను సృష్టించినట్లు నటిస్తూ, టీవీ కెమెరాలకు బాబా దొరికిపోయిన విషయాన్ని విశ్వాత్మగారు ఎలా సమర్థిస్తారు?' అడిగాను.

మౌనం.

'పోనీ, 1993 లో పుట్టపర్తిలో జరిగిన విద్యార్థుల హత్యకేసును ఎలా సమర్థిస్తాడు? లేదా, బాబామీద ఉన్న హోమోసెక్స్ ఆరోపణలను ఎలా సమర్థిస్తాడు?' అడిగాను.

'అవేవీ రుజువు కాలేదుగా?' అన్నాడు.

'ఆధారాలన్నింటినీ మాయం చేస్తుంటే ఎలా అవుతాయి?' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'అవును. రూంలో దాక్కుని ఉన్న నలుగురు స్టూడెంట్స్ నీ కాల్చి చంపకుండా, పట్టుకొని ఉంటే నిజాలు బయటకొచ్చేవి. వాళ్ళ రూంకి బయట తాళంపెట్టిన తర్వాతనే కదా భక్తులు పోలీసులను పిలిచారు? వాళ్ళను షూట్ చేయవలసిన పనేముంది? ఇది ఆధారాలను మాయం చేయడమే కదా. అతీతశక్తులున్న బాబా, మెట్లదారి గుండా పై రూంకి పారిపోయి దాక్కోవలసిన పనేముంది?' అన్నాను.

మౌనం.

'పిచ్చివాడా ! నీకింకా చాలా విషయాలు తెలీవు. నా ప్రశ్నకు నువ్వెలా జవాబు చెప్పాలో కూడా నేనే చెబుతా విను.  "కాలయవనుడు తరుముతుంటే కృష్ణుడు కూడా పారిపోయి ముచికుందుని గుహలో దూరాడు కదా? పారిపోవడం కూడా ఒక లీలే" అని నువ్వు సమర్ధించుకోవాలి. ఇది కూడా తెలీదా? ఎప్పుడు ఎదుగుతార్రా మీరు?' అన్నాను నవ్వుతూ.

వింటున్నాడు.

'అసలు విశ్వాత్మగారి పేరు విశ్వాత్మేనా?'  అన్నాను.

నేను ఏ సెన్స్ లో అన్నానో అతనికి అర్ధం  కాలేదు. నిజంగా "విశ్వాత్మ" అయితే ఇలా ఎలా బొక్కబోర్లా పడతాడనేది నా ప్రశ్న.

'కాదు. ఆయన పేరు విశ్వాత్మ దిగంబర అవధూత' అన్నాడు.

'మరి ఆయన బట్టలు కట్టుకునేవాడుగా? మాతో బుక్ ఎగ్జిబిషన్ కి కూడా వచ్చాడు' అడిగాను నవ్వుతూ.

'ఆయన గదిలో విప్పేసే ఉండేవాడు' అన్నాడు.

'ఓహో ! దిగంబర అవధూత అంటే, తన గదిలోనో, బెడ్రూంలోనో, బాత్రూంలోనో మాత్రమే విప్పుకునేవాడా? అలా అయితే, లోకంలో అందరూ దిగంబర అవధూతలేగా. అక్కడిదాకా ఎందుకు? 2008-10 మధ్యలో నేను గుంతకల్లు రైల్వేక్వార్టర్స్ లో ఒక్కడినే ఉన్నాను. ఇంట్లో ఉన్నపుడు నేనుకూడా దిగంబరంగానే తిరిగేవాడిని. ఆఫీసుకెళ్లేటప్పుడు మాత్రం బట్టలేసుకుని వెళ్ళేవాడిని. మరి నేనూ అదేగా?' అన్నాను.

మౌనం.

'ఆయనది ఏ సాంప్రదాయం?' అడిగాను.

'దత్తసాంప్రదాయమే అనుకుంటా. ఆయన కడపలో అవధూతదీక్ష తీసుకున్నారు' అన్నాడు.

ఈసారి ఇంకా పెద్దగా నవ్వొచ్చింది.

'అవధూత దీక్షలా? అవేమైనా అయ్యప్పదీక్షలా నెలకొకసారి వేసుకొని, ఇంకోనెలకు విప్పెయ్యడానికి? వాటినసలు ఇచ్చేవాళ్లున్నారా? అలా తీసుకుంటే అవధూతలు   అయిపోతారా?' అడిగాను.

తను పుస్తకాలు బాగా చదివాడు. కానీ అన్వయం దొరకడం లేదు. అయితే, నేను చెబుతున్నదానిని కనీసం అర్ధం చేసుకోగలుగుతున్నాడు.

'దత్తాత్రేయులకు ఒక సాంప్రదాయము. అవతారాలు ఉన్నాయా అసలు?' అడిగాను.

'ఎందుకు లేవు? మహారాష్ట్రలో ఆయన అవతారాలు చాలామంది ఉన్నారు. షిరిడీబాబా కూడా ఆ అవతారాలలో ఒకరే' అన్నాడు.

'ఇది నీ అనుభవమా? లేక బల్లపరుపు బ్యాచ్ ఎక్కించిన వైరసా?' అడిగాను.

'భరద్వాజ గారికి కూడా షిరిడీలో అనుభవం అయిన తర్వాతనే మారిపోయారు' అన్నాడు.

'చెప్పాగా, మన అనుభవాలన్నీ మన భ్రమలే అని' అన్నాను.

'మరి ఆయన అనుభవం అబద్దమా?' అడిగాడు.

'అని అనడానికి నేనెవర్ని? ఎవరి అనుభవం వారిదే. కానీ అది సత్యానుభవం కావాలని రూలేమీ లేదనే నేనంటున్నాను. ఆరోజున్న గ్రహస్తితులను బట్టి సెన్సిటివ్ మనుషులకు ఏవేవో అనిపిస్తాయి. వాటిని నువ్వు డివైన్ ఎక్స్పీరియన్స్ అని పేరు పెట్టుకుంటే నేనేం చేసేది? భరద్వాజగారి జాతకం చూడు. దానిలో బలమైన గురుదోషం ఉంది. అందుకే ఆయన సాంప్రదాయ వైష్ణవకుటుంబంలో పుట్టికూడా, ముస్లిం అయిన షిరిడీసాయి భక్తుడయ్యాడు. ఇది నా అవగాహన' అన్నాను.

'సాయిలిద్దరినీ అమ్మ కూడా ఒప్పుకున్నారు. "వాళ్ళూ నా పిల్లలే" అని అమ్మ అన్నారు' అన్నాడు.

'అమ్మ ఎవర్ని కాదన్నది? 'తల్లికి తప్పే కనిపించదు' అనిన మహాతల్లి ఆమె. అమ్మ పిల్లలు కానివారెవరు? నువ్వూ నేనూ కూడా అమ్మ పిల్లలమే. మరి నేను చెబుతున్నది నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు?' అన్నాను.

'భరద్వాజగారు సివిల్స్ పాసయ్యారు. మహా తెలివైనవాడు' అన్నాడు.

'కావచ్చు. సివిల్స్ నేనూ పాసయ్యాను. ఒక తెలివైన వ్యక్తి, ఆర్నెల్లు కష్టపడితే సివిల్స్ క్లియర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. స్వానుభవంతో నేనీమాట చెబుతున్నాను. ఆయన కూడా అదే ప్రూవ్ చేశాడు. నిజానికి వేదవ్యాస విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి ఆయన ఆ పనిని చేశాడుగాని, సివిల్స్ పాసవ్వాలని ఆయనకేమీ లేదు' అన్నాను.

మౌనం.

'అకాడెమిక్ తెలివికి, ఆధ్యాత్మికతెలివికీ సంబంధం లేదు. ముందే చెప్పాగదా, పెద్దవాళ్ళకి పిచ్చి ఉండకూడదని రూలేమీ లేదని. అందుకే, పెద్దపెద్ద బ్యూరోక్రాట్లు, మేధావులు, సయింటిష్టులు, దేశాధినేతలు కూడా చిన్న బూడిదట్రిక్కుకు పడిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళ తెలివేమైంది మరి?' అన్నాను.

'ఇంతకీ దత్తాత్రేయుడికి అవతారాలు లేవా?' అడిగాడు.

'ఖచ్చితంగా లేవు' అన్నాను.

'ఈ మాట ఎవరు చెప్పారు?' అన్నాడు.

'నేనే చెబుతున్నాను' అన్నాను.

'మీరు చెబితే ఎలా సరిపోతుంది?' అన్నాడు.

'మరి ఎవరు చెబితే సరిపోతుంది?' అడిగాను.

'ఉన్నాయని అందరూ అంటున్నారు' అన్నాడు.

'కధ మళ్ళీ మొదటికొచ్చింది' అన్నాను.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 57 (విశ్వాత్మ - దత్తాత్రేయుడి అవతారాలు) "

విజయపత్ సింఘానియా జాతకం - గురుదోషం

విజయపత్ సింఘానియా 4 అక్టోబర్ 1938 న కాన్పూర్ లో  పుట్టాడు. రేమాండ్స్ సంస్థ అధినేతగా బిజినెస్ సర్కిల్స్ లో ఈయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఈయన మార్చి 28 న ఒక అద్దెఇంటిలో చనిపోయాడు. వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయినప్పటికీ చివరకు ఈయన జీవితం విషాదాంతం అయింది.  దానికి కారణం గురుదోషం. ఈయన జాతకాన్ని చూద్దాం.

అయితే, ఈయన జననసమయం దొరకడం లేదు. కనుక సవరణ చేద్దాం. దీనిని చాలా తేలికగా చేయవచ్చు. 

ఈయన తండ్రి L. K. సింఘానియా చాలా ధనవంతుడు మరియు వ్యాపారవేత్త. కనుక 3.01 pm తర్వాత ఇతను పుట్టి ఉండాలి. అప్పుడు మకరలగ్నం మేషనవాంశ అవుతుంది. 4.00 లోపు మేషంనుండి కన్యవరకూ నవాంశలు నడుస్తాయి. వీటిలో మేషనవాంశ అయినప్పుడే జీవిత సంఘటనలు సరిపోతున్నాయి. అందులోనూ 3. 01 pm అయితేనే ఇవన్నీ సరిపోతాయి.

కొన్ని ముఖ్య సంఘటనలను చూద్దాం.

1980 - రేమాండ్స్ గ్రూపుకు చైర్మన్ అయ్యాడు. అప్పుడు గురు రాహుదశ నడిచింది. రాహుకేతువులు నవాంశచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని చూడవచ్చు.

2000 - ఈ సంవత్సరంలో రేమాండ్స్ సంస్థ పగ్గాలను మూడవ సంతానమైన గౌతమ్ సింఘానియాకు అప్పగించాడు. బుధ బుధ దశ నడిచింది. 9 వ భావమైన కన్యలో 8 వ భావాధిపతి సూర్యునితో కలసి ఉచ్చ బుధుఁడున్నాడు. కనుక అధికారమూ సంపదా రెండూ తనచేతినుంచి జారిపోయాయి. భావాద్భావ సూత్రాన్ని బట్టి 9 వ స్థానం కూడా సంతానభావమే.

20 మార్చి 2006 - పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ముంబాయి మేయర్ అయ్యాడు. బుధ రవి కేతు దశ నడిచింది. ఉచ్ఛస్థితిలో ఉన్న బుధునితో రవి కలసి నవమస్థానంలో ఉన్నాడు. కేతువు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.

2015 లో రేమాండ్స్ సంస్థలో తన వాటా (37%) ను కూడా కొడుక్కి ఇచ్చేశాడు. అక్కడే లీగల్ గొడవలు మొదలైపోయాయి. అప్పుడు బుధ శని కుజ దశ నడిచింది. ఈ దశలో మానసికచింత, గొడవలు సహజమే.

87 ఏళ్ల వయసులో 28 మార్ఛి 2026 న చనిపోయాడు. ఆ రోజున శుక్ర రవి రాహు గురుదశ నడిచింది. పెద్దవయసులో వచ్చేవి తప్ప చెప్పుకోదగ్గ జబ్బులేమీ లేవు. దశలు సరిపోతున్నాయి. కనుక, ఇదే ఈయన జననసమయంగా అనుకోవచ్చు.

ఈయన జాతకంలో ఉన్న బలమైన గురుదోషం వల్ల కొడుకులతో, వారి పిల్లలతో, గొడవలు, కోర్టుకేసులు, మనోవ్యధ కలిగాయి. తన ఇంటినుండి గెంటివేయబడ్డాడు. ఏ ముంబాయికైతే తను మేయర్ గా పనిచేశాడో, ఎక్కడైతే ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడో, అదే ముంబాయిలో ఒక అద్దెఇంటిలో ఉంటూ చనిపోయాడు. An Incomplete Life అనే ఆత్మకథను పుస్తకంగా వ్రాసి అసంతృప్తితో కన్నుమూశాడు.

12,000 కోట్లు సంపాదించి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కూడా చివరకు అసంతృప్తితో కుటుంబపు గొడవలతో చనిపోయాడంటే, ఇతని జాతకంలో గురుదోషం ఎంత బలంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

దీనికంతటికీ కారణం, మూడవకొడుకు గౌతమ్ సింఘానియాతో ఉన్న ఆస్తిగొడవలు. మూడవ కొడుకును సూచించే 9 వ భావంలో ఉచ్చబుధుడు, రవి ఉన్నారు. రాహుకుజులతో శనికేతువులతో ఆర్గళంలో ఉంటూ, చాలా తెలివైన సంతానాన్ని, అదేసమయంలో బలమైన సంతానదోషాన్ని సూచిస్తున్నారు.అందుకే, ఆస్తిని కంపెనీని అన్నింటినీ మూడవకొడుకుకు రాసిచ్చేయగానే ఈయన రోడ్డున పడ్డాడు. పద్మభూషణ్ అవార్డును అందుకుని, అంతర్జాతీయస్థాయిలో ఒక వెలుగు వెలిగిన రేమాండ్స్ దిగ్గజం చివరకు అద్దెఇంటిలో దిక్కులేకుండా చనిపోయాడు.

గురుదోషం అంటే ఇలా ఉంటుంది !

మరి అన్నిదోషాలనూ పిచ్చిపిచ్చి హోమాలతో, పిచ్చిపిచ్చి రెమెడీలతో బాగుచేస్తామని డప్పు కొట్టుకునే జ్యోతిష్కులు పాపం ఈయనకు అందుబాటులో లేరా? ఉన్నా, ఈ గురుదోషాన్ని తొలగించడం వారివల్ల కాలేదా? లేక ఈయన దగ్గరున్న పన్నెండువేలకోట్లు ఆ దోషాన్ని పోగొట్టడానికి సరిపోలేదా?

దీనివల్ల రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా?

ఒకటి - జాతకదోషాలు అంత తేలికగా పోవు. మామూలు జ్యోతిష్కులకు అర్ధంకాని లోతులు దీనివెనుక ఉంటాయి.

రెండు - డబ్బులు పారేసి చేసే రెమెడీలతో అవి అస్సలు లొంగవు. మీ అవినీతిసొమ్ము జ్యోతిష్కుడికి చేరడం తప్ప దీనివల్ల జరిగేది ఇంకేమీ ఉండదు.

జాతకదోషాలను పోగొడతాని, పోగొట్టగలనని, ఏ జ్యోతిష్కుడైనా డప్పు కొట్టుకుంటుంటే, ఆ మాటలు నమ్మారంటే, మీరు మోసపోతున్నట్లే. జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులు అతనికి తెలీకనైనా ఉండాలి. లేదా మిమ్మల్ని అతను మోసం చేస్తూనైనా ఉండాలి. రెండూ కూడా కావచ్చు.

మీరు పెట్టుకునే ఉంగరాలవల్ల, చేసే దొంగపూజలవల్ల, తిరిగే గుళ్ళవల్ల మీ జాతకదోషాలు ఎక్కడికీ పోవు. మీరు దేనినైనా మోసం చేయవచ్చుగాని, మీ కర్మను మోసం చేయలేరు. 

ఈ జాతకం చూచాక కూడా అర్ధం కాలేదా?

అయితే మీ కర్మ !

read more " విజయపత్ సింఘానియా జాతకం - గురుదోషం "

9, ఏప్రిల్ 2026, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 56 (రీల్స్ చెయ్యండి)

మూడురోజులు జిల్లెళ్ళమూడిలో ఉండి నిన్ననే ఆశ్రమానికి తిరిగి వచ్చాము. అప్పుడప్పుడూ అక్కడకెళ్లి ఇంటిని చూసుకోకపోతే అది దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. అందుకని ఇష్టం లేకపోయినా అలా వెళ్లి రావడం తప్పనిసరి అవుతోంది.

చీకటిపడ్డాక ఆశ్రమంలోనూ, ఊళ్లోనూ తిరుగుతూ ఉండటం ఒక అలవాటు గనుక, మొదటిరోజు సాయంత్రం ఏడుగంటల సమయంలో సంచారానికి బయలుదేరాను. ఎదురౌతున్న వింతజీవులను చూస్తూ అమ్మ గుడికెళ్ళి వెనక్కు వస్తూ ఉండగా, ఒక పాతవ్యక్తి కనిపించాడు. పేరు శ్రీనివాస్ కాకపోయినా, అసలు పేరు చెప్పడం బాగోదు గనుక, అలా అనుకుందాం కాసేపు.

సంభ్రమంగా నమస్కారం పెడుతూ, 'చాలా రోజుల తర్వాత చూశాను మిమ్మల్ని' అన్నాడు.

మాట్లాడే పరిస్థితిలో లేను గనుక, మౌనంగా తలూపాను.

'మౌనంలో ఉన్నారా?' అన్నాడు అనుమానంగా.

'కాదు' అంటే బాగుండదని 'అవును' అన్నాను.

ఎలా అన్నా మౌనం చెదిరిపోతుందిగా ! 

'మాట్లాడు. మళ్ళీ వస్తా' అంటూ అది చక్కాపోయింది.

నవ్వుకుంటూ, సంభాషణను పొడిగించకుండా నా దారిన నేనొచ్చేశాను.

తరువాత, ఇంటికిపోయే దారిలో ఒక చెట్టుకింద నిలబడి ఉండగా స్కూటర్లో వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్నాడు.

'మీకోసం వెతుకుతున్నాను. అక్కడ గుళ్లో ఎందుకులే అని ఎక్కువగా మాట్లాడించలేదు' అన్నాడు.

'ఏంటి?' అన్నట్లు చూశాను.

'మీరింతకు ముందు బ్లాగు బాగా వ్రాసేవారు. ఇప్పుడు వ్రాయడం లేదు. నేను మీ వీరాభిమానిని' అన్నాడు.

పాపం కనిపించిన ప్రతిసారీ ఇదే మాట చెబుతూ ఉంటాడు.

'సరే' అన్నాను.

'పదహారేళ్ళ నించి, అంటే దాదాపు 2008 నుంచీ మీరు వ్రాసినవన్నీ చదివేవాడిని. నాకు బాగా నచ్చేవి. నేనపుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. 'మీ వ్రాతలలో ఒక వెలుగుంది' అని మీకు మెయిలిచ్చాను. దానికేమో మీరు 'నీలో వెలుగుంది కాబట్టి దానిని గుర్తించగలిగావు' అని రిప్లై ఇచ్చారు', అన్నాడు.

'అవునా' అన్నాను.

'తర్వాత, మీరు విశ్వాత్మ గారి గురించి వ్రాశాక, నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను. ఆయన నాతో చాలా చనువుగా ఉండేవారు' అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు.

'మీరు వ్రాస్తుంటే, ఒక కధ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కలిసిన సినిమా ఎదురుగా చూస్తున్నట్లు ఉంటుంది. పాతకాలం సినిమాలలో, హీరోయిన్ లెటర్ చదువుతుంటే అందులో హీరో కనిపిస్తూ, అదే మేటర్ చెబుతూ ఉన్నట్టు చూపించేవారు. అలా ఉంటుంది.  అందుకే మీ శైలి నాకు నచ్చుతుంది' అన్నాడు.

'సరే' అన్నాను.

'ఎందుకని వ్రాయడం తగ్గించారు?' అడిగాడు.

'అవసరం లేదనిపించింది' అన్నాను.

'ఎందుకలా అనుకుంటున్నారు? మీ అభిమానులు వేలల్లో ఉన్నారు. మీరలా ఆపేస్తే ఎలా?' అన్నాడు.

'చదివేవాళ్ళు వేలల్లో ఉండవచ్చు. అంతేనా? ఊరకే చదివి వదిలెయ్యడానికి ఇది న్యూస్ పేపర్ కాదు. నా వ్రాతల విలువ ఒక న్యూస్ పేపరే అయితే, ఆ విలువ నాకక్కర్లేదు. నన్ను వదలకుండా అనుసరించేవారు ఒక వందమంది ఉన్నారు. వారికి కావలసినది చెబుతున్నాను. వారు అందుకుంటున్నారు. చాలుగా' అన్నాను.

'అలా అయితే మిగిలిన వారి పరిస్థితేంటి మరి? మీరలా ఆపకండి. ఇది నా రిక్వెస్ట్' అన్నాడు.

'అనిపిస్తే రాస్తాలే' అన్నాను.

' ఇంకొక మాట. మీరేమీ అనుకోకపోతే ' అన్నాడు.

' మర్యాదలొద్దు. సూటిగా చెప్పు ' అన్నాను.

' బ్లాగు కంటే రీల్స్ మంచివి. ఆడియో విజువల్ మాధ్యమానికున్న శక్తి మీకు తెలీనిది కాదు. రీల్స్ ఎక్కినంత బాగా బ్లాగు పోస్టులు ఎక్కవు. అందుకని మీరు రీల్స్ చేస్తే బాగుంటుంది' అన్నాడు.

'నాకెందుకా గోల?' అన్నాను.

' మీలాంటి జ్ఞానులు మౌనంగా ఉండకూడదు. జ్ఞాని మౌనం ప్రపంచానికి మంచిది కాదు' అన్నాడు.

' జ్ఞాని ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అజ్ఞాని నిర్ణయిస్తాడా?' అడిగాను.

నవ్వేశాడు.

' కాదనుకోండి. కానీ ప్రస్తుతట్రెండ్ ను బట్టి, ఇలా చేస్తే ఎంతోమందికి సరియైనదారిని చూపించినవారౌతారు' అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు.

'మీకు అందరు మహనీయుల గురించీ క్షుణ్ణంగా  తెలుసు కదా. ఉదాహరణకు ఒక రామకృష్ణులో, అమ్మగారో, రమణులో, షిరిడీబాబానో, సత్యసాయిబాబానో, ఒక టాపిక్ మీద ఏం చెప్పారు? అన్న విషయం చిన్నచిన్న వాక్యాలలో మీరు రీల్స్ చేస్తే ఎంతోమందికి ఎంతో దిశానిర్దేశంగా ఉంటుంది కదా?' అన్నాడు.

'ఆగాగు. ఏమన్నావ్?' అన్నాను.

'నేనేమన్నాను?' అన్నట్టు అయోమయంగా చూశాడు.

'మిగతావాళ్ల విషయం అలా ఉంచు. షిరిడీబాబా, సత్యసాయిబాబా అసలు మహనీయులెలా అవుతారు? వాళ్ళు ప్రత్యేకంగా చెప్పినదేముంది? చేసినదేముంది? వాళ్ళ గురించి మళ్ళీ నేను రీల్స్ చెయ్యడమేంటి? తలకాయ ఉండి మాట్లాడుతున్నావా?' అన్నాను సీరియస్ గా.

ఖంగు తిన్నాడు.

'అదేంటి అలా అన్నారు?' అన్నాడు.

'చూశావా నేను నిజం మాట్లాడితే నీకే నచ్చలేదు. మళ్ళీ పాతికేళ్ళనుంచీ నా అభిమానినంటున్నావు. ఇక బయటివాళ్ళకెలా నచ్చుతుంది? నిజాలు లోకానికి నచ్చవు కాబట్టే నేను మునుపటిలాగా మాట్లాడటం లేదు' అన్నాను.

'లోకం అంతా నమ్ముతున్నది కదా. నమ్మేవాళ్ళలో చాలా పెద్దపెద్ద వాళ్ళున్నారు కదా. మరి, వాళ్ళందరూ పిచ్చోళ్లా?' అడిగాడు.

విషయం పాకాన పడుతోందనిపించి గొంతు సవరించుకున్నాను.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 56 (రీల్స్ చెయ్యండి) "

3, ఏప్రిల్ 2026, శుక్రవారం

World Autism Awareness Day



నిన్న ఏప్రిల్ 2 వ తేదీ World Autism Awareness Day.

ఆటిజం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఇవాళా రేపూ పుడుతున్న పిల్లలలో చాలామంది ఆటిజం లక్షణాలతోనే పుడుతున్నారు. అమెరికాలో చూస్తే, గతంలో ప్రతి 45 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో పుట్టేవారు. తరువాత అది 36 కి ఒకటిగా పెరిగింది. ఆ తరువాత 31 కి ఒకటిగా ఇంకా పెరిగింది. నేడు ప్రతి వందమంది పిల్లలలో నలుగురు ఆటిజంతో బాధపడుతున్నారు. అంటే, ప్రతి 25 మందిలో ఒక అటిజం పేషంటున్నాడు. అంటే ప్రతి ఏడాదీ అటిజం పేషంట్లు పెరుగుతున్నారు. 

ఇండియాలో అయితే లెక్కలు సరిగ్గా లేవు. కాకపోతే, ప్రతి 65 మందిలో ఒకరు ఆటిజం పిల్లవాడని ప్రస్తుతపు కాకిలెక్కలు చెబుతున్నాయి.

ప్రపంచజనాభాలో చూస్తే, ప్రతి వందమందిలో ఒకరు అటిజం పేషంటని లెక్కలున్నాయి. ప్రస్తుత ప్రపంచజనాభా 8.3 బిలియన్లు (830 కోట్లు) దాటింది.  

అంటే 8 కోట్లమంది అటిజం పేషంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నమాట !

విచ్చలవిడిగా వేస్తున్న టీకాల వల్ల, అనవసరంగా వాడబడుతున్న యాంటీ బయాటిక్స్ మరియు స్టెరాయిడ్స్ వల్ల ఈ ఖర్మ మానవాళికి పట్టుకున్నదని హోమియోపతి వైద్యశాస్త్రం అంటుంది. చాలామంది ఈ మాటను నమ్మడం లేదు. మనం నమ్మినా నమ్మకపోయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కదా మరి !

అన్నీ సక్రమంగా ఉన్న మనిషికే ఈ ప్రపంచంలో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉన్న రోజులివి. ఇక బుద్ధిమాంద్యం ఉంటే, అటువంటి పిల్లల పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే ఎంతో బాధ కలుగుతుంది. వారిని చూచుకునేవారు ఉంటే పరవాలేదు. చూచుకునేవారు ఎవరూ లేకపోతే, అటువంటి పిల్లలు ఈ దుర్మార్గపు ప్రపంచంలో ఏమైపోతారో ఊహించడానికే సాధ్యం కాదు.

కుంగ్ ఫూ సూపర్ స్టార్ జెట్ లీ, ఇదే సబ్జెక్ట్ పైన 2009 లోనే చైనాభాషలో ఒక సినిమా తీశాడు.  దాని ఇతివృత్తం మార్షల్ ఆర్ట్స్ కాదు. ఆ సినిమా పేరు Ocean Heaven. దాని కధ చాలా హృదయవిదారకంగా ఉంటుంది.

ఒక తండ్రికి లివర్ కేన్సర్ ఉంటుంది. భార్య చనిపోయి ఉంటుంది. తనుకూడా త్వరలోనే చనిపోతానని అతనికి తెలుసు. అతనికి ఒక ఆటిజం పిల్లవాడుంటాడు. అతనికి 22 ఏళ్ళు. తాను పోయాక, ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆ పిల్లవాడికి ఆ తండ్రి నేర్పిస్తూ ఉంటాడు. ఇదీ కధ.

ఈ స్క్రిప్ట్ ను చదువుతున్నప్పుడే ఎన్నోసార్లు ఏడ్చేశానని జెట్ లీ 'So Be It' అనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సినిమా పెద్ద హిట్టయింది. ఎంతోమందికి అటిజం గురించి అవగాహనను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది ఆటిజం కేర్ సెంటర్లు పుట్టడానికి కారణమైంది.

మార్షల్ ఆర్ట్స్  అభ్యాసం చేసేవారు రౌడీలై ఉంటారని, దురుసుగా ఉంటారని, వారిలో మానవత్వం ఉండదని చాలామంది పొరపాటుగా అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు భావన.

ఈ సినిమాను చూడండి. కాస్తంత మంచితనం మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే కదిలిపోతారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ సమస్యను తీర్చడానికి మనవంతుగా ఏం చేయాలా అని ఆలోచిస్తారు.

జెట్ లీ ఒక కుంగ్ ఫూ సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఒక మనసున్న మంచిమనిషి కూడా అని  ఈ సినిమా చూచాక మీరంటారు.

This film is dedicated to all the ordinary heroes among our parents అంటూ సినిమాను ముగించిన తీరు ఎంతో బాగుంది. హీరోలనేవాళ్లు సినిమాలలో చూపించినట్లుగా ఉండరు. మన చుట్టూనే ఎందరో ఉంటారు. తమ కష్టాలను నవ్వుతూ భరిస్తూ, ఏది చేయాలో దానిని మౌనంగా పబ్లిసిటీ లేకుండా చేసే ప్రతివారూ హీరోలే.

అసలు, మన తెలుగురాష్ట్రాలను చెడగొట్టినవి మన సినిమాలే అని నా గట్టినమ్మకం. తెలుగు సినిమాలంటేనే చవకబారుగా, లేకిగా, పిల్లికూతలు, కోతిగంతులు, వెకిలిపాటలు హింసలతో, ఒక చక్కని కథంటూ లేకుండా, వాస్తవాలకు దూరంగా చీప్ గా ఉంటాయి. ఒక సందేశం అంటూ లేకుండా కేవలం డబ్బుకోసం మాత్రమే సినిమాలు తీసినందువల్ల, మూడు నాలుగుతరాలు వరుసగా పాడైపోయాయి. ఇది మన కర్మ.

ఈ సినిమాను చూసి, మంచి సినిమాలంటే ఎలా ఉంటాయో కనీసం తెలుసుకోండి.
read more " World Autism Awareness Day "

చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి?

ప్రపంచ ప్రఖ్యాత కరాటే ఛాంపియన్ చక్ నారిస్ గురించి తెలియనివారు మార్షల్ ఆర్ట్స్ సర్కిల్లో ఉండరు. The Way Of The Dragon అనే సినిమాలో బ్రూస్ లీ తో ఇతను చేసిన ఫైట్ చాలా పాపులర్ అయింది. ఈ సినిమా పేరును తరువాత Return Of The Dragon గా మార్చారు.

ఇతను మొన్న మార్చి 19 న అమెరికాలో చనిపోయాడు. ఆ సమయానికి ఇతనికి 86 ఏళ్ళు. చివరిక్షణాలలో ఇతని హెల్త్ గురించి ఏ విధమైన సమాచారమూ మీడియాలో అందటం లేదు. గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

ఇతను 10 మార్చి 1940 న ఒక్లహామా లోని ర్యాన్ అనేచోట పుట్టాడు. సమయం ఉదయం 3 గంటలు. ఇతని జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు.

మార్చి 19 వ తేదీన ఇతని జాతకంలో రాహు శుక్ర బుధ బుధ బుధ దశ నడిచింది. రాహువు ఉచ్ఛబుధుని సూచిస్తున్నాడు. ఈ జాతకానికి బుధశుక్రులు మారకులు. బుధునికి వచ్చిన 4/7 భావాధిపత్యాల వల్ల ఇది గుండె సంబంధిత సమస్య అని అర్ధమౌతున్నది.

బుధుడు నీచస్థితిలో గ్రహయుద్ధంలో వక్రించి ఉన్నాడు. వక్రతవల్ల కుంభంలో ఉన్న సూర్యుడిని కలుస్తాడు. ఇదికూడా గుండెసంబంధిత సమస్యకు సూచికయే. పైగా, ప్రస్తుతం ఇతనికి ఏలినాటిశని మధ్యభాగం నడుస్తున్నది.

గతంలో 2017 లో జూలై 16, 17 తేదీలలో ఇతనికి రెండు హార్ట్ ఎటాక్స్ వచ్చాయని ఒక పుకారుంది. ఇతను ప్రపంచ సెలబ్రిటీ గనుక, ఇతనికున్న ఇమేజి దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచారు. ఆ రోజులలో ఏం జరిగిందో, గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

ఆ రోజులలో ఇతనికి రాహు గురు శుక్ర శుక్ర శుక్ర దశ నడిచింది.

బుధశుక్రుల ప్రభావం మళ్ళీ స్పష్టంగా కనిపిస్తున్నది. అంతర్దశలో లగ్న, చంద్రలగ్నాలకు అధిపతి అయిన గురువున్నప్పటికీ, నవాంశలో నీచస్థితిలో ఉండటంతో ఇతనికి గురుదోషం ఉన్నది. కనుక ఆ రోజునకూడా ఇతనికి హార్ట్ ఎటాక్స్ వచ్చినది నిజమే అని తెలుస్తున్నది. గురువు పాత్ర వల్ల పార్టీలు,  వేళతప్పి  ఎక్కువగా తినడం మొదలైన పొరపాట్లు జరిగి ఉండవచ్చు.

సూర్యునిపైన రాహుకేతువుల ప్రతికూల దృష్టులు, మరియు యురేనస్ యొక్క అనుకూలదృష్టి ఉన్నాయి. కనుక, గుండెసంబంధిత సమస్యకు గురైనప్పటికీ, సమయానికి సరియైన వైద్యసహాయం అందటంతో బ్రతికి బయటపడ్డాడు. పైగా ఆనాడు గోచారశని 9 వ భావమైన తులలో వక్రించి, 8వ భావం ఆయుష్యస్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకని బ్రతికించాడు. ఇప్పుడు ఏలినాటిశని గనుక తీసుకుపోయాడు.

మీడియాలో లీక్ చేయకపోయినా, ఇతను చనిపోయినది గుండె సంబంధిత సమస్యతోనే అని దీనిని బట్టి అర్ధమౌతున్నది.

read more " చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి? "

28, మార్చి 2026, శనివారం

ఎడారిమతాలున్నచోట శాంతి ఉండదు

నిన్న శ్రీరామనవమి నాడు తన నియోజకవర్గంలోని  ఆకివీడులో, ఒక రామాలయాన్ని సందర్శిద్దామని వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిమీద, ఆయనవెంట ఉన్న వారిమీద కత్తులతో, మేకులతో భౌతికదాడి జరిగింది. పోలీస్ ఎస్కార్ట్ తో ఆయన ఆ గుంపునుండి బయటకు రావలసి వచ్చింది. ఆయన వెంట ఉన్నవారిలో కొంతమందికి గాయాలయ్యాయి.

దాడిచేసినది దళితక్రైస్తవుల ముసుగులో ఉన్నవారని ఆయన ఆరోపించారు.

శాంతిని అనుసరించవలసిన క్రైస్తవులు దాడిచేయడమేంటి? అదీగాక మేకులతో దాడిచేయడమేంటి? నాకైతే నవ్వొచ్చింది. అంటే, వారు నమ్మే జీసస్ ను రోమన్లు మేకులు కొట్టి చంపేశారు గనుక, వాళ్లకు నచ్చని అందరినీ మేకులతో దాడిచేద్దామని ప్రయత్నమా? ఇదెక్కడి వింతో నాకైతే అర్ధం కాలేదు.

పశ్చిమగోదావరి జిల్లాలలో గత అరవై డెబ్బయి ఏళ్లుగా క్రైస్తవప్రచారం ముమ్మరంగా జరిగింది. అనేక సంస్థలు పుట్టుకొచ్చి, లక్షలమంది నిమ్నవర్గపు హిందువులను క్రైస్తవులుగా మార్చేశాయి. చాలాచోట్ల ఊళ్లకు ఊళ్లే ఈ విధంగా మార్చబడ్డాయి. అలా మారినవారిలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ప్రముఖంగా ఉన్నారు. వారిలో తక్కువశాతం మంది మాత్రం ఇప్పటికీ మారకుండా నీతిగా ఉన్నారు.

నీతిగా అని ఎందుకన్నానంటే, చెప్పుకునే మతమేమో క్రైస్తవం, పేపరుమీద మతమేమో హిందూమతం. లేకపోతే రిజర్వేషన్ రాదుగా? మరి, అది నీతెలా అవుతుంది? అందుకని అలా అనవలసి వచ్చింది !

అంతకుముందు ఆయా ఏరియాలలో అన్నింటిలోనూ రామాలయాలుండేవి. క్రమేణా అవి పాడుబడిపోయాయి. సందుసందుకీ చర్చిలు వెలిశాయి. దశమభాగాలు దండుకొని పాస్టర్లు కోటీశ్వరులయ్యారు. మతవ్యాపారాలు విస్తరించాయి. ఓట్లకోసం నాయకులు వారికి తందానతాన పాడారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి. చీలికలు ఏర్పడ్డాయి.

దేశంలో నార్త్ ఈస్ట్ లోని సెవెన్ సిస్టర్ రాష్ట్రాలు ఏకమొత్తంగా క్రైస్తవంలోకి మార్చబడ్డాయి. ఈ పని గత యాభై ఏళ్లుగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత స్దానం ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లాదే అని నా అనుమానం. అంత ఎక్కువగా కన్వర్షన్స్ అక్కడ జరిగాయి.

ఈ లోపల, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని, రికార్డులో హిందువులుగా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా మారి అనేకమంది డబల్ బెనిఫిట్ పొందారు. అక్కడేమో రిజర్వేషను, ఇక్కడెమో మతప్రచారం, విదేశీఫండ్స్, వాటిలో ముప్పావలా నొక్కేసి, పావలా పంచి మళ్ళీ మతమార్పిడులు, ఈ విధంగా ఈ అవినీతికుట్రలు దశాబ్దాలుగా సాగుతూ వచ్చాయి.

నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో, ఇప్పటివరకూ హిందూరిజర్వేషన్ వరాలను అనుభవిస్తూ, సమాజంలో క్రైస్తవులుగా చెలామణీ అవుతున్న దొంగలందరూ బయటకు రావల్సి ఉంటుంది. పెద్దపెద్ద ఉద్యోగాలలో ఇప్పటికే తరతరాలుగా స్థిరపడి ఉన్న వీరంతా,  ఆ విధంగా బయటపడి తమ తప్పులను ఒప్పుకుంటారా? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సరే. పిల్లికి గంటకట్టేదెవరు? చూడాలి.

పోతే, ఇన్ని దశాబ్దాలుగా, ఈ న్యాయవిరుద్ధమైన రిజర్వేషన్ ను ఉపయోగించుకొని ఇప్పటివరకూ ఎన్ని కోట్లమంది ఉద్యోగాలు సంపాదించారో లెక్క తీయవలసిన అవసరం ఉన్నది. మరి, అన్ని కోట్లమంది అసలైన అర్హులు తమ అవకాశాలను పోగొట్టుకున్నట్లే కదా? వారికి జరిగిన నష్టాన్నెవరు పూడుస్తారు? పూడ్చిపెట్టబడిన  ప్రభువు లేచొచ్చి పూడుస్తాడా?

అదలా ఉంచితే, శాంతిమతాలైన క్రైస్తవం, ఇస్లాంలు ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీలికలు, విభేదాలు, గొడవలు, హింస, యుద్ధాలు, నాశనం తప్పకుండా జరుగుతుందనేది నిజం. నేడు ప్రపంచంలోని ఏ దేశంలో చూచినా ఇది రుజువౌతుంది. కారణమేంటంటే, వారి మూలసిద్ధాంతమే - 'నా మతం కరెక్టు, నీది తప్పు. మా దేవుడు రైటు, మీవాడు రాంగు, మతం మారతావా చస్తావా?' అనేది తప్ప ఇంకొకటి ఉండదు. ఉన్నతమైన తత్త్వశాస్త్రం గాని, తమకంటే ప్రాచీనమైన మతాలనుండి కాపీకొట్టకుండా సొంతంగా పుట్టిన భావాలు గాని, వాటిలో ఎక్కడా లేకపోవడం ఇంకొక కారణం.

క్రైస్తవానికీ, ఇస్లాముకూ యూదుమతమే మూలం. వాటిపైన తిరుగుబాటుగా పుట్టిన ఇస్లాం ఆ రెండింటితో ఇప్పుడు యుద్ధం చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాల మధ్యన ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? ఈ మూడూ అబ్రహామిక్ మతాలే. వీటితో ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి వస్తున్నది. మళ్ళీ ఈ మూడూ చెప్పేవి శాంతి కబుర్లే. వింతగా లేదూ?

మొదటి ప్రపంచయుద్ధంలో 2 కోట్ల 20 లక్షలమంది చనిపోయారు. రెండవ ప్రపంచయుద్ధంలో 8 కోట్ల 50 లక్షలమంది చనిపోయారు. 1095 CE నుండి 1291 CE వరకూ జరిగిన క్రూసేడ్స్ లో 90 లక్షలమందిని, కేవలం క్రైస్తవులు కాని కారణం చేత, అమానుషంగా హింసించి చంపేశారు పోపు అనుచరులు. అంటే దాదాపుగా 12 కోట్లమంది అమాయకులను ఇప్పటిదాకా ఈ రెండు శాంతిమతాలూ పొట్టనపెట్టుకున్నాయి. ఇదేనా శాంతి అంటే?

1560-1812 CE  మధ్యలో జరిగిన గోవా ఇంక్విజిషన్స్ లో వందలాదిమంది హిందువులను దారుణంగా హింసించి సజీవదహనాలు చేశారు. లేదా మతాలు మార్చారు. ఇది మన గోవారాష్ట్రంలోనే జరిగింది. ఏ విధంగా అమాయకులైన హిందువులను హింసించారో చదివితే రక్తం ఉడికిపోతుంది. ఇదా క్రైస్తవం? వీళ్లదా శాంతిమతం? శాంతివచనాలు చెప్పే అర్హత క్రైస్తవానికి అసలుందా?

నేడు సెవన్ సిస్టర్స్ మొత్తాన్నీ ఒక క్రైస్తవదేశంగా మార్చేసి ఇండియానుండి విడదీయాలని పెద్ద కుట్ర జరుగుతోంది. ఇది నిజమా కాదా? సాక్షాత్తు బంగ్లాదేశ్ గతప్రధాని షేక్ హసీనానే  ఈ మాట చెప్పింది. నిన్నగాక మొన్న టూరిస్ట్ వీసాలపైన ఇండియాకు వచ్చి మణిపూర్, మిజోరాం ప్రాంతాలలో క్రైస్తవమతప్రచారం చేస్తూ, ఆయుధాలు సప్లై చేస్తూ ఉక్రెయిన్ దేశస్థులు, అమెరికన్లు దొరికిపోలేదా? దీనిని శాంతి అంటారా? క్రీస్తు ఇలాంటి కుట్రలను చెయ్యమని చెప్పాడా?

1947 దేశవిభజన సమయంలో దాదాపు 20 లక్షలమంది భారతీయులు చంపబడ్డారు. వేలాదిమంది హిందూమహిళలు రేపులకు గురయ్యారు. 1989 లో జరిగిన కాశ్మీర్ మారణకాండలో దాదాపుగా 1000 మంది కాశ్మీర్ పండిట్లు దారుణంగా చంపబడ్డారు. కారణం? వాళ్ళు హిందువులు కావడమే. వేలాదిమంది హిందూమహిళలు రేపులకు గురయ్యారు. ఎప్పటివో ఎందుకు? ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మారణకాండ ఏమిటి? ఎంతమందిని చంపారు? ఎన్ని రేపులు జరిగాయి? ఎన్ని ఇళ్ళు ధ్వంసం చేశారు? ఇదంతా ఇస్లాం చేసింది కాదా? ఇది ఇంకొక శాంతి మతమా? మనం నమ్మాలా?

1980 - 88 మధ్యలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని 20 లక్షలమంది చచ్చారు.

అందరూ ముస్లిములే ఉన్నచోట షియాలు, సున్నీలు అని కొట్టుకుంటారు. అందరూ క్రైస్తవులే ఉన్నచోట కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అని కొట్టుకుంటారు. వీళ్ళలో ఇంకా చాలా గ్రూపులు, డినామినేషన్లు ఉన్నాయి. బయటకు ఆ గొడవలన్నీ కనిపించవు. లోతుగా చూచినవారికి మాత్రమే అర్ధమౌతాయి. తెలియనివారికి మాత్రం అవి చాలా శాంతిమతాలని మాయమాటలు చెబుతారు.

జనాభాను పెంచుకొని దేశదేశాలు ఆక్రమించి, విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ దేశస్థులను లేకుండా రూపుమాపడమే వీళ్ళ అజెండా. శాంతి అనేది దీనికి ఒక ముసుగు మాత్రమే.

చరిత్ర చదువుకుంటే ఇవన్నీ అర్ధమౌతాయి. ఏమీ తెలియకుండా డబ్బులకు అమ్ముడుపోయి, పాస్టర్లు, ముల్లాలు చెబుతున్నది నిజమనుకుంటే ఇలాగే ఉంటుంది మరి ! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీస్పీకర్ పరిస్థితే  ఇలా ఉంటే, ఇక ఆ ఏరియాలలో ఇతరపౌరులు శాంతిగా బ్రతికేదెలా సాధ్యపడుతుంది? ఆలోచించండి. హైద్రాబాద్ పాతబస్తీ లాగా, పశ్చిమగోదావరి జిల్లా కూడా తయారైనట్లు కనపడుతోంది. దానికీ దీనికీ మూలం ఆ రెండుమతాలే. అవి అడుగుపెట్టిన చోట శాంతి అనేది ఉండదనేది వాస్తవం.

ఇంకా సందేహాలేమైనా మిగిలున్నాయా?

read more " ఎడారిమతాలున్నచోట శాంతి ఉండదు "

24, మార్చి 2026, మంగళవారం

International Taijiquan Day



మార్చి 21 వ తేదీని 
International Taijiquan Day (అంతర్జాతీయ తైచి దినం) గా  UNESCO ప్రకటించింది.

మార్చి 21 అనేది చాలా పాతకాలం నుంచీ 'వసంత విషువత్ దినం' గా అనేకదేశాలలో పాటించబడుతూ వస్తున్నది. ఆయా దేశాలలో దీనిని రకరకాల పేర్లతో పిలుస్తారు.

జూన్ 21 ఇప్పటికే యోగా డే అయింది. ఇప్పుడు మార్చి 21 తైచి డే అయింది. మంచిదే. బాయ్ ప్రెండ్ డే, గర్ల్ ప్రెండ్ డే, ఎఫైర్స్ డే లాంటి దరిద్రాల బదులు తైచి డే, యోగా డే వంటివి మంచివి కదూ !

తాయ్ చి అనే చైనావారి వీరవిద్య ఇప్పుడు కోట్లాదిమందిచేత ప్రపంచవ్యాప్తంగా అభ్యాసం చేయబడుతూ వస్తున్నది.

అయితే, ఇది ఆత్మరక్షణ కోసం ప్రాక్టికల్ గా ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక వివాదాస్పదమైన విషయం అయినప్పటికీ, ఆరోగ్యపరంగా చూచినపుడు, రిలాక్సేషన్ వ్యాయామంగా, సీనియర్ సిటిజెన్స్ మరియు నడివయసుకు చేరిన ఆడవారు హాయిగా చేసుకునే శరీరవ్యాయామంగా గుర్తించబడింది.

దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి.

కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఇతర దీర్ఘవ్యాధులలో ఒక మంచివ్యాయామంగా ఉపయోగపడుతుంది. కదలికను మెరుగుపరుస్తుంది. flexibility ని బేలెన్స్ ను ఇస్తుంది. మంచి నిపుణుని దగ్గర నేర్చుకుని సరిగ్గా అభ్యాసం చేస్తే ప్రాణాన్ని బలోపేతం చేస్తుంది. ఆయుస్సును పెంచుతుంది.

ప్రస్తుతం నాకు 63 నడుస్తోంది. ఇప్పటికీ నేను యోగాభ్యాసాన్ని, మార్షల్ ఆర్ట్స్ ను చేస్తూనే ఉన్నాను. చాలామంది రెగ్యులర్ గా వేసుకునే మందులేవీ  ఇంతవరకూ నాకవసరం పడలేదు.  బీపీ, షుగర్, హార్ట్ సమస్య, ఊబకాయం, కీళ్ళనొప్పులు, అజీర్ణం, థైరాయిడ్ సమస్య, నిద్రసమస్యలు, ఆదుర్దా మొదలైనవాటిని ఇతరులు చెబుతుంటే నాకు నవ్వొస్తూ ఉంటుంది. వారిపైన జాలి కలుగుతుంది. జీవనవిధానం సరిగా లేనపుడు, ఇలాంటి రోగాలు రాక ఇంకేం వస్తాయి?

సరైన ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవనవిధానం ఈ మూడూ లోపించడమే నేటి రోగాలకు కారణం.

మొన్న 21 వ తేదీన మా ఆశ్రమంలో నేను చేసిన 'యాంగ్ స్టయిల్ తైచి' మొదటి భాగాన్ని పైనున్న వీడియో క్లిప్ లో చూడండి.

జూలైలో జరగబోయే ఆధ్యాత్మిక రిట్రీట్ నుండి, తైచి అభ్యాసాన్ని కూడా నా శిష్యులందరికీ నేర్పబోతున్నాను. ఇకనుంచీ, యోగాభ్యాసంతో బాటుగా దీనిని కూడా మా ఆశ్రమంలో క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే, రెండూ ప్రాణశక్తికి బలాన్నిచ్చి, దానిని సక్రమంగా ఉంచే అభ్యాసాలే.

కుంగ్ ఫు సూపర్ స్టార్ జెట్ లీ కూడా ఇప్పుడు తైచిని బాగా ప్రోమోట్ చేస్తున్నాడు. అతనికి థైరాయిడ్ సమస్య వచ్చి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రంగా  మొదలైనప్పటి నుండీ తైచి పైన గట్టిగా దృష్టిపెట్టినట్లు కనపడుతున్నది. బౌద్ధుడైన ఇతను ప్రస్తుతం, అమెరికాను వదలిపెట్టి,  సింగపూర్ కు మకాం మార్చాడు. తైచి ని ప్రోమోట్ చేస్తున్నాడు. ఇది మంచిపని.

వయసు 50 దాటిన తర్వాత, కండలను పెంచే హార్డ్ స్టయిల్ కుంగ్ ఫూ మంచిది కాదు. ప్రాణశక్తిని పెంచే ఇంటర్నల్ కుంగ్ ఫూ మంచిది.  దానిలో తైచి, బాగ్వా, జింగ్ యి అని మూడు విద్యలున్నాయి. మూడూ మంచివే. 50 దాటాక తైచి మంచిది.

'యోగాభ్యాసం చేయండి. తైచి అభ్యాసం చేయండి. ఆరోగ్యంగా జీవించండి', అని నా శిష్యులను, అభిమానులను కోరుతూ, ఈ సందర్భంగా జెట్ లీ కి, తైచి అభిమానులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
read more " International Taijiquan Day "

R. I. P Chuck Norris


హాలీవుడ్ యాక్షన్ హీరో 'చక్ నారిస్' మొన్న 19 వ తేదీన అమెరికాలోని హవాయ్ లో చనిపోయాడు. అతనికి 85 ఏళ్ళు. చివరివరకూ ఆరోగ్యంగానే ఉన్న ఇతను, ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి పోయాడంటున్నారు. కారణాలు తెలియవు.

'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' లో బ్రూస్లీ తో ఇతను చేసిన క్లైమాక్స్ ఫైట్ చాలా హిట్టయింది. ఆ విధంగా ఇతనికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చినప్పటికీ, అప్పటికే ఇతను వరల్డ్ కరాటే ఛాంపియన్ అయి ఉన్నాడు. వరుసగా ఆరేళ్లపాటు ఈ టైటిల్ ను ఇతను గెలుచుకున్నాడు.

1958 లో US ఎయిర్ ఫోర్స్ లో చేరి,  డిప్యూటేషన్ పైన దక్షిణకొరియాలో పనిచేస్తున్నప్పుడు, తన 18 ఏట 'టాంగ్ సు డో' (కొరియన్ కరాటే) అభ్యాసాన్ని మొదలుపెట్టిన ఇతను ఆ తరువాత జూడో, టాయ్ క్వాన్ డో, బ్రెజిలియన్ జుజుట్సు మొదలైన ఇతరవిద్యలలో కూడా బ్లాక్ బెల్టులను పొందాడు. 

1967 లో ఇతను అమెరికన్ కరాటే ఛాంపియన్ అయ్యాడు. 1968 లో, 1969 లో కూడా మళ్ళీ ఛాంపియన్ షిప్ గెలుచుకుని రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ప్రాక్టీస్ ఆపలేదు. తన 85 వ ఏట చనిపోయేవరకూ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు.

యోగా, మార్షల్ ఆర్ట్స్ అనేవి వైరస్ ల వంటివి. ఒకసారి పట్టుకుంటే జీవితాంతం వదలవు. కానీ ఈ వైరస్సులు చాలా మంచివి. మనకు మంచినే చేస్తాయి. అందుకే, మార్షల్ ఆర్టిస్టులు ఎంత వయసొచ్చినా అభ్యాసం చేస్తూనే ఉంటారు.

ఇతను వివాదాలు లేని వ్యక్తి. మంచివాడు. కలుపుగోలు మనిషి. సౌమ్యుడు. ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ గర్వం లేనివాడు. ఈ గుణాలవల్ల ఇతనిని నేనుకూడా అభిమానిస్తాను.

ఇతని ఆత్మకు శాంతి కలుగుగాక !
read more " R. I. P Chuck Norris "

23, మార్చి 2026, సోమవారం

మన హిందూమతం చాలా గొప్పది

'ఫలానా హిందూసంస్థ నుండి మాట్లాడుతున్నాము' అంటూ ఈమధ్య ఒక ఫోన్ కాలొచ్చింది.

పరిచయాలయ్యాక. 'ఎందుకు ఫోన్ చేస్తున్నారు?' అడిగాను.

'మీ కృషి చాలా బాగుంది. మీ వ్రాతలన్నీ మేము చదువుతాము. ముఖ్యంగా, క్రైస్తవాన్ని, ఇస్లాంను మీరు విమర్శించే తీరు బాగుంటుంది' అన్నారు.

'మన హిందూమతాన్ని కూడా విమర్శిస్తూనే ఉంటాను. అది చదవలేదా?' అడిగాను.

'చదువుతున్నాము. అందుకే ఈ ఫోన్. మనల్ని మనమే విమర్శించుకుంటే ఎలా?' అన్నాడాయన.

'ఆత్మవిమర్శ మంచిదేగా?' అడిగాను.

'అది తగ్గించి, ఇతర మతాలను ఎండగట్టడంపైన దృష్టి పెట్టండి. ఇది మా రిక్వెస్ట్' అన్నాడు.

'అది సరే. కానీ మన  హిందువుల పిచ్చిపోకడలను వదిలేస్తానని మాత్రం చెప్పలేను' అన్నాను.

'అది చెయ్యడానికి మతాచార్యులున్నారుగా?' అన్నాడు.

'ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు మన మతాచార్యులు?' అడిగాను.

'అంటే వాళ్ళ పరిమితులు వాళ్ళకుంటాయి కదండీ' అన్నాడు.

'పరిమితులుంటాయి సరే. హిందువులు తప్పులు చేస్తున్నపుడు, 'ఇది తప్పు. వద్దు చెయ్యకండి' అని ఎందుకు చెప్పడం లేదు? హిందూమత మూలాల గురించి, అసలైన హిందూమతం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు?' అడిగాను.

దానికి జవాబు చెప్పకుండా, 'మనమందరం ఐకమత్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది' అన్నాడు.

'ఇప్పుడు క్రొత్తగా వచ్చేదేముంది? చరిత్రలో ఇటువంటి కాలాలు చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు మనం ఫెయిలయ్యాం' అన్నాను.

'కనుకనే ఇప్పుడు మనం కలిసుండాలి' అన్నాడు.

'కలిసుండక విడిపోయిందెప్పుడు?' అన్నాను.

'అంటే, అందరూ ఒక్క త్రాటిపైకి రావాలి' అన్నాడు.

ఆయన మాటలు రాజకీయ పడికట్టు పదాలలాగా ధ్వనించాయి.

'ఎక్కడుంది ఆ త్రాడు?' అడిగాను.

 జవాబు లేదు.

'మీరు చెప్పలేకపోయినా, నేను చెబుతున్నాను వినండి. నేనా త్రాటిపైననే ఉన్నాను. లేనివాళ్ళని దానిపైకి రమ్మనే నేనూ చెబుతున్నాను. ఈ క్రమంలోనే మన హిందూమతంలోకి రోజురోజుకూ వచ్చి చేరుతున్న పిచ్చిపోకడలను ఖండిస్తున్నాను' అన్నాను.

'కొంచెం వివరిస్తారా?' అడిగాడు.

'చూడండి. శివుడు, విష్ణువు. అమ్మవారు, ఇతర ప్రామాణిక హిందూదేవతలందరినీ మేము  ఒప్పుకుంటాము. క్రొత్తగా తయారౌతున్నవారిని, చేర్చబడుతున్నవారిని మాత్రం ఒప్పుకోము. పోతే, వైష్ణవులు శైవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.

'ఒప్పుకోరనుకోండి. దానిని కూడా మేము ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.

' మరి శైవులు వైష్ణవాన్ని ఒప్పుకుంటారా?' అడిగాను.

' ఒప్పుకోరు' అన్నాడు.

' అలాగే,  ఏ శాఖైనా మిగతావారిని ఒప్పుకోవు. ఇదంతా తప్పని, దేవతాస్వరూపాలన్నీ ఒకే పరబ్రహ్మము యొక్క  అనేకరూపాలని ఏ ఆచార్యుడు, ఏ గురువు చెబుతున్నారు?' అడిగాను.

' మేమూ ప్రయత్నిస్తున్నాము. ఈ సత్యాన్ని జనంలోకి తీసికెళ్ళడానికి' అన్నాను.

'దానిని అర్ధం అయ్యేటట్లుగా చేయాలంటే, పురాణకధలను వదలిపెట్టి, ఉపనిషత్తులను బోధనాగ్రంధాలుగా తీసుకోవాలి. పురాణాలు తెలివిలేని పామరజనంకోసం వ్రాయబడినవి. ఉపనిషత్తులు జ్ఞానభాండాగారాలు. సామాన్యజనానికి కూడా వాటిలోని జ్ఞానాన్ని వివరించి చెప్పాలి. అంతేగాని పురాణకధలను పట్టుకొని కూచోకూడదు' అన్నాను.

' సామాన్యజనం వాటిని అర్ధం చేసుకోవడం కష్టమే. మేమూ ప్రయత్నిస్తున్నాము' అన్నాడు.

'నేనూ అదే చేస్తున్నాను. ఈ క్రమంలో మన వెర్రిపోకడలను ఖండించడం కూడా చాలా అవసరం. ఆత్మవిమర్శ లేకపోతే, మనకున్న అతిఉదారత్వానికి, అసలు సత్యమే కొన్నాళ్ళకు మరుగునపడే ప్రమాదముంది. అప్పుడు అసలైన హిందూమతం ఉండదు. చిల్లరదేవుళ్లు, దొంగస్వాములు మాత్రమే మిగులుతారు' అన్నాను.

'మాకు మీరిచ్చే సలహా?' అడిగాడు చివరకు.

'ఇతరమతాల డొల్లతనాన్ని ఎండగట్టవలసిందే. అదే సమయంలో, మన హిందూమతంలో ఇప్పటికే ఉన్నవీ, క్రొత్తగా చేరుతున్నవీ వెర్రిపోకడలను కూడా ఎండగట్టాలి. తొలగించాలి. ఈ రెండుపనులూ సమాంతరంగా సాగాలి. అప్పుడే అసలైన హిందూమతమెంత గొప్పదో, దానిని అర్ధం చేసుకోలేక, హిందువులమనుకుంటున్నవారు కూడా ఎలా  తప్పుదారిన పోతున్నారో, జనాలకు అర్ధమౌతుంది. దానినే నా పుస్తకాల ద్వారా, మా సంస్థద్వారా నేను చేస్తున్నాను. చాలామందిని ఇప్పటికే జాగృతపరచాను. ఇంకా కొనసాగిస్తున్నాను. నేనేకాదు. దేశభక్తి, దైవభక్తి ఉన్న ఏ హిందువైనా ప్రస్తుతం చేయవలసింది ఇదే' అన్నాను.

'ప్రణామాలు' అని ఫోన్ పెట్టేశాడాయన.

read more " మన హిందూమతం చాలా గొప్పది "

12, మార్చి 2026, గురువారం

గ్యాసుదేవుని మహిమలు

ఇవాళ తెల్లవారుఝామున బ్రహ్మముహూర్తంలో మంచినిద్రలో ఉండగా నారదమహర్షి కలలో కొచ్చాడు.

'నాయనా ! నీవు ఆశ్రమమునకే పూర్తిగా పరిమితమై పోయితివి. బయటి ప్రపంచమును ఈషణ్మాత్రమూ పట్టించుకొనుటలేదు. మరీ దద్దమ్మవగుచున్నావు. అప్పుడప్పుడు కాస్త బయటకు కూడా వెళ్లి లోకసంచారము చేయుచుండుము. అప్పుడు మాత్రమే నీకు లోకపుతీరు అవగతం కాగలదు' అని సెలవిచ్చి, నేనేదో చెబుదామనుకునేలోపు డామ్మని మాయమైపోయాడు.

'దేవతలకీ ఋషులకీ కూడా ప్రస్తుతం తీరిక ఉండటం లేదు. అందరూ డెలివరీ బాయ్స్ అయిపోతున్నారు. చెప్పాలనుకున్నది చెప్పేయడం మాయమైపోవడం. ఎదుటివాడి రియాక్షన్ కోసం ఆగడం లేదు. స్పీడు బ్రతుకులైపోయాయి. ఏం చేస్తాం?' అనుకుంటూ బద్దకంగా నిద్రలేచాను.

ఫ్రెష్షయ్యి, ప్రధానశిష్యురాలిని తీసుకుని లోకసంచారానికి బయల్దేరాను.

అదేంటో మరి, టిఫిన్ చేద్దామంటే అన్ని హోటళ్ళూ మూసేసి ఉన్నాయి. కనీసం టీ షాపులు కూడా లేవు.

'ఏంటిది? ఇంతఘోరకలిగా యున్నది?' అని శిష్యురాలిని అడిగాను.

'యుద్ధం ప్రభావంతో గ్యాసు ఆగిపోయింది. హోటళ్లు బంద్' అని  చెప్పింది

ఒక గేటెడ్ కమ్యూనిటీ ముందు అందరూ కర్రలతో కొట్టుకుంటున్నారు.

'ఇదేంటి? ఈ విధముగా యుద్ధము చేయుచున్నారు?' అడిగాను.

'అది యుద్ధం  కాదు. ఒక్కటే గ్యాస్ సిలెండర్ ఉందిట. దానికోసం అందరూ అలా కొట్టుకుంటున్నారు' చెప్పింది.

'గతంలో నా చిన్నప్పుడు, నీళ్ళపంపులవద్ద ఈ దృశ్యములను చూచితిని. ఇప్పుడు ఈ విధముగా చూడవలసి వచ్చినది. ఇదియేకదా మాయాప్రభావము' అన్నాను.

'నోరుముయ్యి' అన్నట్టు చూసింది శిష్యురాలు.

'ఇరాన్ యుద్ధం వల్ల ఇలా ఉంది' అన్నది. 

'యుద్దమా? అదెక్కడ?' అన్నాను అయోమయంగా.

'అందుకే అప్పుడప్పుడూ లోకసంచారం చెయ్యమని మహర్షి చెప్పింది' అన్నది కోపంగా.

'ఓహో నా అగ్నానం నీక్కూడా తెలిసిపోయిందా?' అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాను. 

కొద్దిగా ముందుకెళ్లాం.

'గ్యాసు నామమె పావనము, ప్రభు గ్యాసే రక్షణ కారణము' అంటూ ఒక ప్రార్ధనామందిరంలో నుంచి మైకు మోగుతోంది.

'రామరామ ! బంగారంలాంటి పాటని ఇదేంటి ఇలా మార్చేశారు? అన్నాను విస్తుపోతూ.

'నిన్ననే గ్యాసుదేవుని వైపు కన్వర్ట్  అయ్యారు.యుద్ధం ప్రభావం' కామ్ గా అంది శిష్యురాలు.

మతిపోయింది.

ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి 'గ్యాసో హో సిలెండర్' అంటూ ఇంకో చోటనుంచి పెద్దగా శోకాలు వినిపించాయి.

భయమేసింది.

'ఇదేంటి? వీళ్ళుకూడానా?' అన్నాను.

'అవును. గ్యాసు దొరకడం లేదుగా. కన్వర్ట్ కాక వాళ్ళకీ తప్పలేదు' అంది శిష్యురాలు.

ఇంకో వందగజాలు వెళ్లేసరికి ఇంకొక గుడిలో నుండి శ్లోకాలు వినిపించాయి.

'గ్యాసుదేవాయ నమః, గ్యాసుప్రభువే నమః, గ్యాసురాజాయ నమః, సిలెండరు మాతాయ నమః' అంటూ మైకు పెద్దగా మ్రోగుతోంది.

'వీళ్ళకేం పోయేకాలం?' అడిగాను. 

'కన్వర్ట్ కావడానికి వీళ్ళు ముందుంటారు  కదా. నిన్ననే ఎవరో గ్యాస్ సిలెండర్ ఇచ్చారట. వెంటనే మతం మారిపోయారు. గ్యాసుమీద అష్టోత్తరాలు రాసుకున్నారు. పాడుతున్నారు' అన్నది శిష్యురాలు.

విరక్తిగా నవ్వుకున్నాను.

ఇంతలో ఒక పెద్దగుంపు ఎదురొస్తే ప్రక్కకు తప్పుకుని 'ఏంటా?' అని చూచాం.

అందరి తలలపైనా గ్యాస్ సిలెండర్ ఆకారంలో టోపీలున్నాయి.

'వీళ్లెవరు?' అడిగాను.

'సిలెండర్ ఫౌండేషన్' అని క్రొత్తసంస్థ. సిలెండరు బొమ్మని అలా నెత్తిమీద పెట్టుకుని రోడ్లమీద తిరుగుతుంటే, స్థూలదేహంలో నుండి సూక్ష్మదేహం బయటకొచ్చి, ఎక్కడెక్కడో తిరుగుతుందట' అంది శిష్యురాలు.

'అంటే, స్థూలదేహం రోడ్లమీద తిరుగుతుంటే, సూక్ష్మదేహం లోకలోకాలు తిరుగుతుందా? ఎందుకలా? రెండూ ఒకేచోట చావచ్చుగా?' అడిగాను.

'ఏమో? నీ దేహానికి ఒకచోట ఉండటం ఇష్టమైనట్టే, వాళ్ళ దేహాలకు బయటతిరుగుళ్లు ఇష్టం. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, కాదనడానికి మనమెవరం?' అంది శిష్యురాలు.

ఖాళీగా ఉంటే ఎవడైనా వచ్చి సిలెండర్ టోపీ పెడతాడేమో అని భయమేసి వెంటనే జేబులోంచి కర్చీఫు తీసి తలచుట్టూతా కట్టుకున్నాను.

మరికొన్ని అడుగులేసేసరికి, ఒక బోర్డు కనిపించింది.

'గ్యాసు రావడం లేదని విసిగిపోతున్నారా? మీకు గ్యాసు ఎప్పుడు వస్తుందో గ్యారంటీగా చెప్పబడును' ఇట్లు ప్రసిద్ధ కోయజ్యోతిష్కులు, అని దానిమీద  రాసుంది.

'గ్యాసు రావడం ఏంటి?' అన్నాను అర్ధం కాక.

'అంటే, గ్యాస్ సిలెండర్ డెలివరీ అని అర్ధం' అంది శిష్యురాలు చిరాగ్గా.

'ఓహో అదా ! చివరకు వీళ్ళుకూడా తయారయ్యారా?' అన్నాను నిరాశగా.

'అప్పుడే ఏమైంది? అటుచూడండి' అంది శిష్యురాలు.

'మీ మోకాలు చూసి, గ్యాసు ఎప్పుడొస్తుందో చెప్పబడును. జాతకంతో పనిలేదు' అని ఇంకో బోర్డు కనిపించింది.

'ఇదేంటి ఇలా పెట్టాడు?' అన్నాను.

'అందరూ చేతులు, ముఖాలు చూసి జ్యోతిష్యం చెబుతున్నారు కదా. వెరైటీగా ఉంటుందని ఇలా పెట్టాడు. బ్రెయిన్ అక్కడే ఉంటుందని వాళ్ళ పెద్దదొర చెప్పాట్ట. అందుకే వాళ్ళు మోకాళ్ళు మాత్రమే చూస్తారు' అంది.

'ఇక నా వల్లకాదు. పీచే ముడ్' అని గట్టిగా అరిచాను. 

కట్ చేస్తే, ఇద్దరం ఆశ్రమంలో తేలాం.

'హమ్మయ్య' అని గాలి పీల్చుకునేలోపు, ఫోన్ మ్రోగింది.

ఫోనెత్తి 'హలో' అనేలోపే, 'గురూగారు. నాకిప్పుడే అబ్బాయి పుట్టాడు. బెడ్ పక్కనించే ఫోన్ చేస్తున్నా. ఏం పేరు పెట్టమంటారు?' అడిగాడు ఒక పరమాణువు.

'నీకు పుట్టటం ఏంటి?' అరిచాను విసుగ్గా.

'అంటే, వాళ్ళావిడకని అర్ధం. నువ్వూ నీ చచ్చు సందేహాలు' అని పక్కనించి గిచ్చింది శిష్యురాలు.

'గ్యాసు నాధ్' అని పెట్టుకో ఫో' అని మళ్ళీ ఫోన్లోకి అరిచాను.

'టాంక్యూ గురూజీ. మా ఆవిడక్కూడా కలలో గ్యాసునాధుడు కనపడి, పుట్టబోయే పిల్లాడికి తన పేరే పెట్టాలని. లేకపోతే మా సంగతి తేలుస్తానని బెదిరించాట్ట. మేముకూడా ఇదే అనుకున్నాము. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం మీకు ఫోన్ చేశాము. మీరు కూడా అదే చెప్పారు. టాంక్యూ సోమచ్' అని పొంగిపోతున్నాడు.

'ఎక్కువ పొంగిపోకు, పొయ్యిలో పడగలవు' అన్నాను.

'ఇంకొక్క విషయం గురూజీ. మా చెల్లెలిక్కూడా ఇప్పుడే అమ్మాయి పుట్టింది. దానికేమని పేరు పెట్టాలి?' అడిగాడు.

'అస్సలు టైం వేస్ట్ చెయ్యడం లేదురా మీరు?' అనుకుంటూ, 'సిలెండర్ రాణి' అని పెట్టండి. ఎలాగూ పెద్దయ్యాక అయ్యేది అదేగా' అన్నాను.

'టాంక్యూ గురూజీ' అని ఫోన్ పెట్టేశాడు శిష్యుడు.

'హమ్మయ్య' అని చుట్టూ చూడగానే శిష్యులెవరూ కనిపించలేదు.

'వీళ్లంతా ఎక్కడికి పోయారు?' అరిచాను కోపంగా.

'కట్టెపుల్లలేరుకు రావడానికి పక్కపొలాల్లో తిరుగుతున్నారు. మనకీ గ్యాసు లేదు మరి' అంది శిష్యురాలు.

ప్రశ్నార్ధకంగా చూశాను.

'ప్రపంచం ఎన్ని కష్టాలలో ఉందో చూశారు కదా గురూజీ. ఏదైనా రెమెడీ చెప్పి పుణ్యం సంపాదించుకోండి' ప్రాధేయపడింది శిష్యురాలు.

తీవ్రంగా ఆలోచించాను. 

'ఓకే ! దీనికొకటే మార్గముంది. వెంటనే అందరూ టవల్స్ కట్టుకుని దీక్ష మొదలుపెట్టండి. నలభైరోజులపాటు అదే టవల్లో ఉండాలి. అదే మన దీక్షాడ్రస్సు. 'జై గ్యాసుదేవాయ నమః' అనే మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. అన్నిపనులూ మానేసి దీన్ని రోజుకు ఇరవైకోట్లసార్లు జపించాలి. నలభైరోజులపాటు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అయితే, 'స్ట్రా'తో బిందెలోనుంచి  పీల్చుకుంటూ తాగచ్చు. కానీ గాలిమాత్రం ఈ నలభైరోజులపాటు అస్సలు పీల్చరాదు. అప్పుడన్ని సమస్యలూ గాలిలో కలసిపోతాయి. వెంటనే అన్నిదేశాలలో ఉన్న మన శిష్యులందరికీ మెయిల్స్ పంపండి. అందరూ ఈ దీక్షను మొదలుపెట్టండి' ఆజ్ఞాపించాను.

'ఓకే గురూజీ !' అని శిష్యురాలు ఆ పనిలోకి దిగింది.

'జై గ్యాసునాధాయ నమః' అనుకుంటూ నేను పక్కమీద వాలాను.

read more " గ్యాసుదేవుని మహిమలు "