“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, జులై 2024, ఆదివారం

మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల

ఈరోజు మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 66 వ పుస్తకం, మరియు మొదటి హిందీ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు హిందీ అనువాదం. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఆదరణను పొందడంతో. దీనిని హిందీ లోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నాం.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి హిందీలోకి చాలా త్వరగా అనువాదం చేసిన నా శిష్యురాలు పూజా బగాడియాకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. శుద్ధమైన, సరళమైన హిందీలోకి ఈ అనువాదం జరిగింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

హిందీ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల "

5, జులై 2024, శుక్రవారం

The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల


ఈరోజు మా క్రొత్తపుస్తకం The Wine House విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 65 వ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు ఇంగ్లీష్ అనువాదం. తెలుగుపుస్తకం మంచి పాఠకాదరణను పొందింది. అందుకని దానిని ఇంగ్లీష్ లోకి అనువాదం చేద్దామన్న సంకల్పం కలిగింది.

కేవలం రెండునెలల లోపే 'మధుశాల' ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన నా శిష్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  అంతేకాదు, ఈ పుస్తకం హిందీ అనువాదం కూడా అయిపోయింది. పదిరోజులలో అది కూడా मधुशाला అనే 'ఈ బుక్' గా హిందీరాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

నా పుస్తకాలన్నీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడుభాషలలోనూ వస్తాయని ఇంతకు ముందు చెప్పాను. అది నేడు The Wine House తో మొదలుపెట్టబడింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

ఏకాంత ధ్యానసాధనను ఇష్టపడేవారికి ఈ పుస్తకంలోని 140 చిన్నికధలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు, నా ఫిలాసఫీ మొత్తం ఈ పుస్తకంలో అతి తేలికమాటలలో చెప్పబడింది. ప్రయత్నించండి.

read more " The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల "

24, జూన్ 2024, సోమవారం

ప్రపంచ యోగ దినోత్సవం - 2024

జూన్ 21 2024 న వేసవి అయనాంతపు రోజు. ఆ రోజున  ప్రపంచమంతా యోగదినోత్సవాన్ని జరుపుకుంది. పంచవటి సాధనామార్గాన్ని అనుసరించేవారందరూ, ఆనాడు మా శైలిలో యోగవ్యాయామాన్ని చేసి ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు. 

మాకిది ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే చేసే మొక్కుబడి తంతు కాదు. ఇది మా రోజువారీ దినచర్యలో భాగం.

యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామాలు మొదటిమెట్లు మాత్రమే. కనీసం వీటి విలువనైనా ప్రపంచం నేడు గుర్తిస్తోంది. రోగాలకు భయపడి కొందరైనా యోగాన్ని చేస్తున్నారు. కొంతలోకొంత నయం.

మన ప్రధానమంత్రి మోదీగారు మన దేశానికి చేసిన గొప్ప మేళ్లలో ఇదీ ఒకటి. మనం మర్చిపోతున్న మన విజ్ఞానాన్ని మనకు, ప్రపంచానికి గుర్తుచేసిన ఈ మహానుభావుడికి దేశం మొత్తం ఋణపడి ఉంది. కానీ ఆయనకు మనం ఓట్లు వెయ్యం. మెజారిటీ ఇవ్వం. మనకు మేలు చేసేవాడు మనకు అక్కర్లేదు. మనల్ని నాశనం చేసేవాళ్ళే మనకు కావాలి. వాళ్లనే గెలిపించుకుంటాం. నాశనమౌతూనే ఉంటాం. ఇది మెజారిటీ ఇండియన్స్ పరిస్థితి.

అదలా ఉంచితే, పంచవటి సభ్యులందరూ ఎవరి ఇళ్లలో వారు చేస్తున్న యోగసాధనా కొలేజ్ ను ఇక్కడ చూడవచ్చు. 






read more " ప్రపంచ యోగ దినోత్సవం - 2024 "

19, మే 2024, ఆదివారం

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది ఇది నా కలం నుండి వెలువడుతున్న
64 వ పుస్తకం. ఆశ్రమం ప్రారంభించిన తర్వాత నేను విడుదల చేస్తున్న రెండవ పుస్తకం.

ఈ పుస్తకంలో 140 సంఘటనలు, సంభాషణలు ఉన్నాయి. అవి చిన్నవే. నిత్యజీవితంలో మనకు రోజూ ఎదురయ్యేవే. కానీ అవే మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితపు లోతులను స్పృశింపజేస్తాయి. వాటిలో ప్రధాన పాత్రధారి సాకీ. వీటన్నిటిలోనూ, సాకీ అడుగుతుంది. నేను చెబుతూ ఉంటాను. నేనెవరో మీకు తెలుసు.

ఈ ‘సాకీ’ ఎవరు?

ఉమర్ ఖయ్యాం పేరును వినని సాహిత్యపిపాసి ఉండడు. ఆయన వ్రాసిన "రుబాయత్" ను, దువ్వూరి రామిరెడ్డిగారు, ‘పానశాల’ అనే పేరుతో తెలుగులో పద్యాలుగా వ్రాశారు. అది చదవని సాహిత్యాభిమాని కూడా ఉండడు. ఇదే రుబాయత్ ను, హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ ‘మధుశాల’ అనే పేరుతో హిందీలో వ్రాశాడు. హిందీ అభిమానులు దానిని తప్పకుండా చదివి ఉంటారు. పరమహంస యోగానంద గారు కూడా దీనిపైన వ్యాఖ్యానించారు.

ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరి సాకీ. ఈ సాకీ అనే పాత్ర, మధుశాలలో మధువును పొసే అమ్మాయి. అనేకమంది కవులు అనేకవిధాలుగా సాకీని తీసుకున్నారు. ఒక మంచి స్నేహితురాలిని, ప్రియురాలిని, ఊహాసుందరిని, ఆత్మసహచరిని, సమాధిస్థితిలో కలిగే మత్తును, చివరకు దైవానుభూతిని కూడా ‘సాకీ’ అంటూనే కొందరు మార్మికవాదులు పిలిచారు.

ఏతావాతా, ఈ సాకీ, ఒక మానవవనిత కాదు. కల్పితభావన మాత్రమే. సాకీ అనే పేరులోనే ఏదో గమ్మత్తుంది. బహుశా మన 'సఖి' కి ఇది పార్సీ రూపమై ఉంటుంది. మన తెలుగుకవులలో కూడా ఎవరి సాకీ వారికుంది.

వారందరినీ వదిలేసి, ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరిని నేను కాజేసినందుకు ఆయనకు క్షమార్పణలు చెబుతున్నాను. కాకపోతే, మేమంతా ఒకటే కాబట్టి, ఆయన ఏమీ అనుకోడనే నా భావన.

కవి చెప్పాలనుకున్నదానిని, కల్పితపాత్రల ద్వారా చెప్పడం, చెప్పించడం, సాహిత్యప్రక్రియలో సర్వసాధారణం. ప్రాచీన కవులందరూ అదే చేశారు. నేనొక కవినని చెప్పను గాని, నేనూ అదే చేశాను.

ఉమర్ ఖయ్యాం సాకీ ఎవరో అందరికీ తెలుసు. మరి, నా రచనలో ప్రత్యక్షమయ్యే ‘సాకీ’ ఎవరు? అని చాలామంది నా శిష్యులు, అభిమానులు అడిగారు. దీనికి జవాబును ఎలా చెప్పాలి?

నా నిత్యజీవితంలో ఎదురైన, ఎదురౌతున్న అనేక సంఘటనలలో పాత్రధారులైన మనుషులందరూ సాకీలే. వారిలో నా శిష్యులున్నారు, పరిచయస్తులున్నారు, స్నేహితులున్నారు. దారిలో ఎదురయ్యే సంబంధంలేని మనుషులున్నారు. అందరూ సాకీలే.

ఏమంటే, ప్రతివారినుంచీ నాకొక వెలుగు కనిపిస్తుంది. ఒక క్రొత్త దృక్కోణం గోచరిస్తుంది. ఒక క్రొత్త మెరుపు దర్శనమిస్తుంది. నేను నేర్చుకున్నదంతా జీవితం నుంచే నేర్చుకున్నాను. అవన్నీ వ్రాయాలంటే కొన్ని వేలున్నాయి. కానీ వాటన్నిటి సారం మాత్రం ఒకటే. వాటినే, దానినే, ఈ 140 చిన్న చిన్న సంభాషణలుగా ఈ పుస్తకంలో మీకందిస్తున్నాను.

నా మిగతా పుస్తకాలు చిక్కటి వేదాంతగ్రంధాలు. వాటి భాష చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇబ్బంది పెట్టవచ్చు కూడా. కానీ వాటిల్లో ఏముందో ఈ చిన్న పుస్తకంలో కూడా అదే ఉంది. చాలా తేలికైన భాషలో ఉంది.

చిక్కటి వేదాంతాన్ని అతి సులభమైన తేలికభాషలో చెప్పడం రామకృష్ణులు, జిల్లెళ్ళమూడి అమ్మగార్ల విధానం. మామూలు మాటలను కూడా అర్థంకాని కవితాధోరణిలో చెప్పడం జెన్ సాధువుల, మార్మికకవుల విధానం. ఈ పుస్తకంలో నేనీ రెంటినీ అనుసరించాను.

‘మధువు’ అనే పదానికి కొంచెం వివరణ అవసరం. మధువంటే తేనె. మధువంటే సారాయి. అదే విధంగా, మధువు అంటే బ్రహ్మానుభూతి కూడా. ఉపనిషత్తులలో ‘మధువిద్య’ అనే విద్య ఉన్నది. కనుక మధువు అనే పదానికి చాలా అర్థాలున్నాయి.

మధువంటే మనకందరికీ తెలిసిన సారాయి కాదు. మధువంటే అనుభూతి. ఆ అనుభూతి భౌతికం కావచ్చు, అంతరికం కావచ్చు. చాలాసార్లు అది అంతరికమైనదే అయి ఉంటుంది.

భావప్రపంచంలో లీనుడై కవి బాహ్యప్రపంచాన్ని మరచిపోతాడు. ఇంద్రియప్రపంచాన్ని అధిగమించిన యోగి మనుషులకు తెలియని ఏదో చోట తన ఆత్మను లీనం చేస్తాడు. సారాయికి బానిసైన చవకబారు మనిషి ఆ మత్తులో కొద్దిసేపు తన బాధలను మరచిపోతాడు. మౌలికంగా ఇవన్నీ ఒక్కటే అనడం సాహసమే అయినప్పటికీ, ‘మత్తు’గా ఇవన్నీ ఒక్కటే అని చెప్పాలి. ఆ మత్తు యొక్క గుణంలోనూ, జీవితానికి అదిచ్చే పరిణతిలోనూ తేడాలుండవచ్చు. కానీ మౌలికంగా చూచినపుడు, అన్నీ మత్తులే.

జీవితమే మధుశాల అనేది నా అభిప్రాయం. ఏమంటే, లౌకికులైనా, వేదాంతులైనా, సామాన్యులైనా, అసామాన్యులైనా, ఎవరైనా ఇక్కడ బ్రతకవలసినవారే. అందరికీ అదే రంగస్థలం. దీనిని విడచి ఎవరూ సాము చెయ్యలేరు. ఎవరికి కలిగే అనుభవాలైనా ఇక్కడనుంచే కలుగుతాయి. కనుక, దీనికంటే వేరే మధుశాల లేదని నా ఉద్దేశ్యం. దీనిని విడచి వేరే మధుశాలకు పోవలసిన పని కూడా లేదని నేనంటాను.

నీ నిత్యజీవితాన్ని విడచి, ఆధ్యాత్మికమంటూ వేరే ఎక్కడా లేదు. ఇదే నా అభిప్రాయం. జీవితాన్ని 50 ఏళ్లపాటు పరిశీలించినమీదట నేనీ నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. ఇదే మాటను జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా అనేవారు.

ఇందులో నేనొక త్రాగుబోతుగా మీకు కనిపిస్తాను. సరదాగా నేను వేసిన నాటకాలలో చాలా పాత్రలు ధరించాను. అలాగే, ఇదికూడా ఒక పాత్ర. ఈ పాత్రపోషణ ద్వారా లోతైన జీవితసత్యాలను తేలికైన మాటలలో మీకు వివరించే ప్రయత్నాన్ని చేశాను. ఈ నాటకంలో నా సహపాత్రధారిణి సాకీ. నా జీవితంలో నాకెదురైన అందరూ సాకీలే. అసలు నా జీవితమే పెద్ద నాటకం.  అందులో అన్నీ పాత్రలే.

త్రాగుడును నేనస్సలు సమర్ధించను. మనిషి జీవితానికి అది అవసరమైనది కాదు. దాని జోలికి పోవద్దని మీకందరికీ సలహా ఇస్తాను కూడా. ఈ పుస్తకంలో చెప్పబడిన మధుసేవనం అంతర్మధనమే గాని, సారాయిని త్రాగడం కాదు.

జీవితమే మధుశాల. అందులో, మనకిష్టమైనవారు, మనతో వారి మనస్సును అరమరికలులేకుండా పంచుకునే వారు, ఆత్మీయంగా మనతో మాట్లాడేవారు, అందరూ సాకీలే. ఈ కోణంలో మాత్రమే మీరు ఈ పుస్తకాన్ని, ఇందులో కనిపించే సాకీని అర్థం చేసుకోవాలి.

జీవితంలో ప్రతి సన్నివేశమూ మనల్ని అలౌకికమైన అనుభూతి మత్తులో ముంచుతున్నపుడు వేరే మధువు యొక్క అవసరం మనకు ఏముంటుంది?

మనసు పెట్టి చదివితే, ఈ చిన్నపుస్తకం మీ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చివేస్తుంది. ఈ మాట మాత్రం గట్టిగా చెప్పగలను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకు తోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవి,  శిష్యులు, శిష్యురాళ్ళు, అఖిల. లలిత, ప్రవీణ్, శ్రీనివాస్ చావలి లకు, పంచవటి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

సాకీలకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వారెందరో ఉన్నారు, అందరి పేర్లూ వ్రాయలేను. అందుకే సాకీ పేరుతోనే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

యధావిధిగా ఈ 'ఈబుక్' ఇక్కడ నుండి మీకు లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
read more " మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది "

12, మే 2024, ఆదివారం

బ్లాగు పోస్టుల తొలగింపు

ఈ మధ్యన నా బ్లాగులో వ్రాతలను చాలావరకూ తగ్గించిన విషయం మీకందరికీ తెలుసు. దానికి కారణం ఆశ్రమ జీవితం.

అర్హులైనవారికి వ్యక్తిగత బోధన, సాధన మాత్రమే ప్రస్తుతం ఎక్కువౌతుంది. వ్రాతలు తగ్గుతాయి.

త్వరలో రాబోతున్న 'మహనీయుల జీవితాలు - జాతకవిశ్లేషణలు' అనే నా లేటెస్ట్ గ్రంధం దృష్ట్యా, ఇప్పటివరకూ నా బ్లాగులో ఉన్న మహనీయుల జాతక విశ్లేషణలనన్నింటినీ (దాదాపు నూరు పోస్టులను) తొలగిస్తున్నాను.

గమనించండి. 

read more " బ్లాగు పోస్టుల తొలగింపు "

21, ఏప్రిల్ 2024, ఆదివారం

UAE లో విపరీత వర్షాలు వరదలు - హిందూ దేవాలయ ప్రతిష్ఠాపనా మహత్యమా?

'బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ' అని  మనకొక సామెతుంది. 'కోడలు అడుగుపెట్టినవేళ' అని కూడా ఇంకొకటుంది. అంటే, కొంతమంది ఇంటిలో అడుగుపెడితే, మంచో చెడో కొన్ని సంఘటనలు తప్పకుండా జరుగుతాయని అర్ధం. ఈ సామెతల వెనుక చాలా అనుభవము, పరిశీలన, చరిత్ర ఉన్నాయి. ఇవన్నీ నిజాలే. 

మన పల్లెటూరి సామెతలను మనం ఏమాత్రమూ నమ్మం. కానీ ఇంగ్లీష్ వాడొచ్చి, Coming events cast their shadows అంటే మాత్రం 'అబ్బా  ఎంత బాగా చెప్పాడో తెల్లోడు?' అని తెగ మురిసిపోతాం. మన సారాయి అయినా సరే, తెల్లసీసాలో ఉంటే దాని విలువ ఒక్కసారిగా మారిపోతుంది మరి !

అలాంటిదే 'UAE లో విపరీత వర్షాలు వరదలు' అనే న్యూస్.

ఏడాది మొత్తం ఎంత వర్షం పడుతుందో అంతకు ఒకటిన్నర రెట్ల వర్షం ఒక్క రోజులో అక్కడ పడింది. దుబాయ్ విమానాశ్రయమూ, సిటీ అన్నీ నీళ్లలో మునిగిపోయాయి. ఇదంతా ఇప్పటిదాకా UAE చరిత్రలో లేదు.

క్లౌడ్ సీడింగ్ చెయ్యడం వల్లే ఈ వర్షాలని కొందరంటే, ఉత్త క్లౌడ్ సీడింగ్ ఒక్కటే ఇంత పని చెయ్యలేదు, మారుతున్న వాతావరణం కూడా కారణమని మరికొందరి మాట ! 

ఇదంతా ఇలాగుంటే, దుబాయ్ లో హిందూదేవాలయం కట్టడం వల్లే ఈ వర్షాలు వరదలు వచ్చాయని కొందరు తురుష్కులు తెగ బాధపడిపోతున్నారని ఉవాచ.

దానికి మనవాళ్ళు, 'ఇంకా మరిన్ని హిందూ దేవాలయాలు కట్టండి. నెలకొక వర్షం చొప్పున వర్షాలు పడి మిడిల్ ఈస్ట్ అంతా సస్యశ్యామలం అవుతుంది' అని సలహాలిస్తున్నారు.

నిజమే కదా. మొన్న ఫిబ్రవరిలో అక్కడ హిందూదేవాలయం కట్టబడింది. వేదఘోష అక్కడ ప్రతిధ్వనిస్తున్నది. మరి వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి? రెండు నెలలు తిరక్కుండా, ఆ దేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత వర్షం పడింది. దీన్నేమనాలి మరి ! 

ఈ మొత్తం విషయానికి మన పురాణాలతో లింకుంది.

సీతాన్వేషణలో లంకా నగరానికి వెళుతుంటే సముద్రం అడ్డుగా ఉందని, దానిని ఎండగట్టడానికి ఆగ్నేయాస్త్రం ప్రయోగించబోయాడు శ్రీరామచంద్రుడు. దానికి సముద్రుడు గడగడలాడి, వేదవిరోధులు, ధర్మవిరోధులు ఉన్న వాయవ్యదిశగా దానిని ప్రయోగించమని సూచించి, లంకకు వెళ్ళడానికి దారినిచ్చాడు. మనకు వాయవ్యమంటే భూమికి మిడిల్ ఈస్ట్ అవుతుంది. శ్రీరాముని ఆగ్నేయాస్త్ర ప్రభావం చేత సౌదీ ప్రాంతాలలో అంతా చెట్లూ చేమలూ నశించి ఎడారిగా మారిపోయింది. ఇది పురాణవచనం. ఇదంతా రామాయణంలో రికార్డ్ కాబడి ఉంది.

ఇన్ని వేల ఏళ్లకు మళ్ళీ మన దేవాలయం అక్కడ కట్టబడటం వల్ల మళ్ళీ ఆ ప్రాంతానికి శాపవిమోచనం కలిగి, శ్రీరాముని ఆగ్నేయాస్త్ర ప్రభావం నశించి, అక్కడ వర్షాలు పడుతున్నాయని మరికొందరి ఊహ. ఈ ఊహ చాలావరకూ సత్యానికి దగ్గరగానే ఉంది.

అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకోవడానికి దుర్యోధనుడు ఒక ప్లాను వేస్తాడు. ధర్మరాజు సత్యాన్ని తప్పడు గనుక, ఆయన ఎక్కడుంటే అక్కడ నెలకు నాలుగు వానలు ఖచ్చితంగా పడతాయి గనుక, ఏ రాజ్యంలో (ఏ రాష్ట్రంలో) వర్షాలు సక్రమంగా పడుతూ, పంటలు బాగా పండుతూ, ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉన్నారో అక్కడ పాండవులు దాక్కున్నారని భావించాలని ఆయన సహచరులు ఆయనకు సలహా ఇస్తారు. ఇదీ నిజమే ! ఇదంతా లాజికల్ గానే ఉంటుంది.

ఎక్కడ దేవాలయాలు, దేవతా విగ్రహాలు కూలగొట్టబడతాయో అక్కడ వర్షాలు పడవని, పంటలు పండవని, కరువు కాటకాలు తాండవిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి నిదర్శనాలు ఎన్నో చరిత్రలో మనకు కనిపిస్తాయి. భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా 50 ఏళ్లపాటు పరిపాలించి, లెక్కలేనన్ని దేవాలయాలను కూలగొట్టిన ఔరంగజేబు, చివరకు తన సైన్యానికే కాదు, తన బాడీగార్డ్స్ కు కూడా నెజీతాలు  ఇవ్వలేని కటిక నిరుపేద పరిస్థితిలో చనిపోయాడు. అతను రాసిన చివరిలేఖలో ఇది స్పష్టంగా ఉంది.

ఇప్పుడు మన కాంగ్రెస్ వాదులకు, లెఫ్టిస్ట్ లకు, నాస్తికులకు, హేతువాదులకు ఒక ధర్మసందేహం వస్తుంది.

'ఇదంతా నిజమైతే, మరి హైదరాబాద్ లో నీటికరువు ఎందుకు రాబోతోంది? కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఎందుకు వచ్చేసింది?బెంగుళూర్ లో బిందెడు నీటికి కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చేసింది. జనాలంతా మాల్స్ కి వెళ్లి అక్కడ టాయిలెట్స్ లో స్నానాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరి శాపం? ఏ అస్త్రం ప్రభావం? చెప్పండి?' అని వారు అడుగుతారు.

దానికి మన దగ్గర ఆన్సర్ రెడీ గా ఉంది.

ఇదంతా కాంగ్రెసాస్త్ర ప్రభావం. కమ్యూనిష్టాస్త్ర ప్రభావం. బీజేపీతో విభేదించే పార్టీ అస్త్రాల ప్రభావం.

దేశాభివృద్ధిని ముఖ్యంగా  చూడకుండా, సరిహద్దు రక్షణను ప్రధానంగా చూడకుండా, కులమతాలను రెచ్చగొట్టి, ఉచితపథకాలను అమలుచేస్తూ, దేశాన్ని  ప్రాంతాల పరంగా చీల్చి, అప్పుల ఊబిలోకి నెట్టి, లా అండ్ ఆర్డర్ ను నీరుగార్చి, వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వాలదే. అందుకే ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే నీటి కరువు వచ్చింది. అవి అల్లకల్లోలాలు అవుతున్నాయి.

మరోప్రక్కన, యోగి ఆదిత్యనాధ్ వంటి నిజమైన మహనీయులు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ, అప్పులరాష్ట్రం అనే బిరుదు నుండి బయటపడి, బడ్జెట్ సర్ ప్లస్ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. 

ప్రపంచదేశాల మధ్యన 75 ఏళ్ళనుంచీ నవ్వులపాలౌతున్న భారతదేశం, మోదీగారి రామరాజ్య పరిపాలనలో కేవలం 8 ఏళ్లలో ఊహించలేని అభివృద్ధిని సాధించి, అగ్రదేశాలతో సమానంగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడే స్థితిలో నేడు ఉంది.  ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా కాకతాళీయం ఎలా అవుతుంది? 

ధర్మస్వరూపుడైన శ్రీరాముని దేవాలయం ఉన్నచోట, ప్రజలు ధర్మాన్ని తప్పకుండా ఉన్నచోట, ప్రకృతి కూడా తన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. వర్షాలు ఖచ్చితంగా పడతాయి. ఇది తిరుగులేని సత్యం ! ఇప్పుడు UAE లాంటి దేశాలలో కూడా ఇది రుజువైంది.

ఇప్పుడు చెప్పండి. ఏ శాపం వల్ల కర్ణాటకలో నీళ్లు లేని పరిస్థితి వచ్చింది? తెలంగాణాలో ఎందుకు ఇప్పటికే రాబోతోంది? ఏ పార్టీ ప్రయోగించిన అస్త్రాలివి? ధర్మస్వరూపుడైన శ్రీరాముడిని, శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ద్వేషించే ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో వర్షాలు ఎలా పడతాయి? అవి సస్య శ్యామలంగా ఎలా ఉంటాయి?

రామబాణం మహిమ అంటే ఇలా ఉంటుంది. అది రాక్షసభూములను ఎడారిగా మార్చగలదు. బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపపడితే, ఎడారిలో కూడా వర్షాలను కురిపించగలదు.   UAE ఉదాహరణ చాలదా? ఇంకా చాలకపోతే మరిన్ని ఉదాహరణలు భవిష్యత్తులో చూద్దురుగాని సిద్ధంగా ఉండండి !

'గ్రహబలమేమి రామానుగ్రహ బలము గాని? (What can planets do if there is Lord Rama's grace?)'  అని త్యాగరాజస్వామి వంటి మహనీయులు ఊరకే అన్నారా?

read more " UAE లో విపరీత వర్షాలు వరదలు - హిందూ దేవాలయ ప్రతిష్ఠాపనా మహత్యమా? "

1, ఏప్రిల్ 2024, సోమవారం

విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం




గత మూడురోజులపాటు మా చండ్రపాడు ఆశ్రమంలో జరిగిన మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ నిన్న విజయవంతంగా ముగిసింది. 

పాత క్రొత్త శిష్యులందరూ మూడు రోజులపాటు ఆశ్రమంలో ఉండి, వారి  జీవితానికి మరింత నిండుదనాన్ని అద్దుకుని, ఆనందంతో నిండిన మనసులతో వారివారి ఇండ్లకు తిరిగి వెళ్లారు.

క్రొత్తవారికి పంచవటి సాధనామార్గంలో ప్రాధమిక దీక్షనివ్వడం జరిగింది. పాత శిష్యులకు ఉన్నతస్థాయికి చెందిన యోగసాధనా మార్గాలను ఉపదేశించడం జరిగింది.  పంచవటి సాధనా మార్గంలో పాటించవలసిన నియమాలను, విధివిధానాలను, జీవితంలో తెచ్చుకోవాల్సిన మార్పులను వారికి స్పష్టంగా వివరించడం జరిగింది.

దేహాన్ని నిర్లక్ష్యం చెయ్యడం ఎంతమాత్రమూ మా విధానం కాదు. కనుక, మా యోగసాధనా మార్గాన్ని అనుసరిస్తూ, గత రెండు నెలలలో 15 కేజీలనుండి 5 కేజీల వరకూ ఆరోగ్యవంతంగా బరువును తగ్గినవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా, బరువు పెరగవలసిన కేటగిరీలో, 4 నుండి 9 కేజీల వరకూ బరువు పెరిగిన వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది.

జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులను అందరికీ పరిచయం చేస్తూ, 1887 BCE కి చెందిన గౌతమబుద్ధుని అసలైన జాతకచక్రాన్ని వారికి వివరించడం జరిగింది. నా విశ్లేషణా విధానాన్ని బుద్ధుని జాతకచక్రం యొక్క విశ్లేషణతో వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది. బుద్ధుని యొక్క ఈ అసలైన జననతేదీని వెలుగులోకి తెచ్చినవారు ప్రఖ్యాత భారతీయ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారు.

త్వరలో వెలువడబోతున్న 'మహనీయుల జాతకాలు - జీవిత విశ్లేషణలు' అనే 500 పేజీల మా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనా గ్రంధంలో ఈ జాతక విశ్లేషణను మీరు చూడవచ్చు.

ఇకపోతే, పదేళ్ళనుండీ నేను చెబుతూ వస్తున్న రీతిలోనే మా ఆశ్రమం నేడు ఎదుగుతున్నది. అసలైన హిందూమతాన్ని కులానికతీతంగా ఆచరణాత్మకంగా అందరికీ బోధిస్తూ, అజ్ఞానపు మురికిని వదిలిస్తూ, శిష్యుల దేహ-ప్రాణ-మానసిక స్థాయిలను సరిచేస్తూ, ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా నిజమైన హిందువులను, నిజమైన మనుషులను తయారు చేస్తూ,  అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది.

తిరిగి, మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చే నా పుట్టినరోజు సందర్భంగా గురుపూర్ణిమా రిట్రీట్ జరుగుతుంది. ఇప్పటివరకూ ఉపదేశించిన సాధనలలో మంచి పరిపక్వతను అందుకుని, అసలైన హిందువులుగా అసలైన యోగులుగా తయారై ఆ రిట్రీట్ కు రావలసిందిగా శిష్యులనందరినీ కోరుతున్నాను.

క్రొత్తగా మా వద్ద దీక్షాస్వీకారం చేసి మా సాధనామార్గంలో నడవాలనుకునేవారు ఈ క్రింది 5 పుస్తకాలను తప్పకుండా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు. లేనిచో మా మార్గంలో ప్రవేశం లభించదు. గమనించండి.

1. శ్రీవిద్యా రహస్యం

2. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

3. తారా స్తోత్రం

4. ధర్మపథం

5. వెలుగు దారులు లేదా MUSINGS

read more " విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం "

8, మార్చి 2024, శుక్రవారం

శివరాత్రి అంతరార్ధం

కాదేదీ వ్యాపారానికనర్హం

శివరాత్రి నవరాత్రి

సంకురాత్రి తొలిరాత్రి

ఏదైనా సరే


వాళ్ళు చూద్దామా అంటే ...


శివరాత్రి వైపు జనాన్ని పోనివ్వకుండా

'దేవుడితో ఒక రాత్రి' అంటాడొకడు

నవరాత్రులు చేసుకోనివ్వకుండా

'దేవతతో ఒక రాత్రి' అని ఆహ్వానిస్తాడొకడు


శివరాత్రి అంటే

రాత్రంతా డాన్సులంట

'దేవుడితో ఒక రాత్రి' అంటే

రాత్రంతా ఛాన్సులంట

కాదేదీ వ్యాపారానికనర్హం


పోనీ వీళ్ళు చూద్దామా అంటే...


శివరాత్రి అంటే

శివుడికి నీళ్లు పోస్తారంట

వీళ్ళు పోసుకోవడం ఎప్పుడో?


శివరాత్రి అంటే

జాగారం చేస్తారంట

జాగృతం ఎప్పుడో?


శివరాత్రి అంటే

ఉపవాసం ఉంటారంట

సహవాసం ఎప్పుడో?


శివరాత్రి అంటే

పూజలు చేస్తారంట

పూనకం ఎప్పుడో?


శివరాత్రి అంతరార్ధం

ఎవరికి కావాలి?

అసలు శివరాత్రి ఎలా జరపాలో

ఎవరికి తెలియాలి?


కాదేదీ వ్యాపారానికనర్హం

శివరాత్రి నవరాత్రి

సంకురాత్రి తొలిరాత్రి

ఏదైనా సరే

read more " శివరాత్రి అంతరార్ధం "

7, మార్చి 2024, గురువారం

మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో)

ఎన్ని ప్రవచనాలు వినినా, ఎన్ని పుస్తకాలను చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూచినా, ఎన్ని కబుర్లు చెప్పినా, అసలైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా నడవనిదే దమ్మిడీ ఉపయోగం కూడా ఉండదు. మిగతావన్నీ టైం వేస్ట్ పనులు మాత్రమే.

ఇది సత్యం.

అందుకే 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ఉద్భవించింది. తపన ఉన్న జిజ్ఞాసువులకు, సాధకులకు అసలైన ఆధ్యాత్మికలోకపు దారులు చూపిస్తుంది. నడిపిస్తుంది.

అందుకే ఈ ఆహ్వానం.

ఈ నెల 29, 30, 31 తేదీలలో మా ఆశ్రమంలో మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (పంచవటి సాధనా సమ్మేళనం) జరుగుతుంది.

ఈ మూడు రోజులు, ఉదయం 4 నుండి రాత్రి 7 గంటల వరకు. మధ్యాహ్నం భోజనవిరామం తప్ప, మిగిలిన సమయమంతా వివిధరకాల సాధనలలో మీరు సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఆ వివరాలన్నీ, ఇక్కడకు వచ్చిన తర్వాత చెప్పబడతాయి. నేర్పబడతాయి.

ఎదురుచూస్తున్నవారికి ఇదే ఆహ్వానం.

ఈ రిట్రీట్ లో రెండు విభాగాలు ఉంటాయి.

ఇప్పటివరకూ ఆశ్రమానికి రాని క్రొత్తవారికి, మొదటిరోజున అంటే మార్చి 29 తేదీన, అవగాహనా సమ్మేళనం ఉంటుంది.  ఈ ఒక్క రోజు మాత్రమే వారికి ఆశ్రమంలో మాతోబాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పంచవటి సాధనామార్గం గురించి వారికి వివరించబడుతుంది. మీ మీ సందేహాలను తీర్చుకునే అవకాశం కలుగుతుంది.

పాతవారికి మరియు గతంలో అటెండ్ అయినప్పటికీ, దీక్షాస్వీకారం చెయ్యని క్రొత్తవారికి ఈ సారి ఆశ్రమంలో  మూడు రోజులు ఉండే అవకాశం ఇవ్వబడుతుంది. వారు సీనియర్ సభ్యులతో కలసి మూడు రోజులు ఆశ్రమంలో ఉండవచ్చు, కలసి సాధనలు చెయ్యవచ్చు. మా మార్గం యొక్క లోతుపాతులను మీ శక్తిమేరకు గ్రహించవచ్చు.

ఆశ్రమంలో మినిమమ్ సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. కంఫర్ట్స్ ఉండవు. వేసవి ఎండలు బాగా ఉంటాయి. వాటికి తట్టుకునే సంసిద్ధత ఉన్నవారు మాత్రమే రాగలరు. ఆశ్రమంలో ఉన్నపుడు ఆశ్రమ నియమాలను పాటించవలసి ఉంటుంది. మీరు ఏవైనా మందులను వాడుతూ ఉంటే, వాటిని తెచ్చుకోవడం మరచిపోకూడదు. 

రాదలచుకున్నవారు 98493 - 89249 అనే నంబర్ లో పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తి గారిని సంప్రదించగలరు.

read more " మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో) "

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

R.I.P Pankaj Udhas




నిన్న పంకజ్ ఉదాస్ చనిపోయాడు. ఈయన 72 ఏళ్ళు బ్రతికాడు. కొద్ది నెలలుగా పాంక్రియాస్ కేన్సర్ తో బాధపడుతున్నాడు.

ఘజల్స్ పాడటంలో ఈయనదొక ప్రత్యేకశైలి.  ఈయన తండ్రిగారు, ఇద్దరు అన్నలు ఆందరూ గాయకులే. వీరిది గుజరాత్ లోని రాజకోట్ దగ్గరలో ఒక జమీందారీ కుటుంబం. ఫరీదా అనే పార్శీ వనితను ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

ఈయన మే 17, 1954 న గుజరాత్ లో పుట్టాడు. ఈయన జనన, మరణ జాతకాలను ప్రక్కన చూడవచ్చు. 

ఈయన గాయకుడే  గాక, తబలా, వయోలిన్, పియానో, గిటార్ లను వాయించడంలో ప్రావీణ్యం ఉన్న బహుముఖ కళాకారుడు.

ఈయన పౌర్ణమినాడు పుట్టాడు. రాహుకేతువులు నీచ స్థితులలో ఉన్నారు. వేరే కులం, వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివాహజీవితం బాగానే నడిచింది.

ఈ రెండు చార్ట్ ల పరిశీలన కొన్ని జ్యోతిష్య రహస్యాలను తెలియజేస్తుంది.

ఈయన వివాహజీవితం, కెరీర్, చివరకు పాంక్రియాస్ కేన్సర్ ఇవన్నీ ఈ చార్ట్ లు  స్పష్టంగా చూపిస్తున్నాయి.

read more " R.I.P Pankaj Udhas "