4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

కృష్ణ కృష్ణా !

ఇవాళ కృష్ణాష్టమి.

మరి తెలుగురాష్ట్రాలలో చడీచప్పుడూ లేదేంటి?

హిందువుల ఇళ్లూ, గుళ్ళూ అన్నీ మౌనంగా ఉన్నాయేంటి?

ఓ సారీ ! మర్చేపోయాను.

మనకు పొరుగింటి పుల్లకూరే రుచి కదా !


అయినా  నా పిచ్చిగానీ,

సాయిబాబాలకూ, బోయబాబాలకూ, పీర్లకూ, ఫకీర్లకూ అభిషేకాలూ, పూజలూ చేసేవాళ్లకు పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? అసంభవం ! 

మహా అయితే ఆయననొక ద్వారపాలకుడిగా పెట్టేద్దాం !

పొరుగురాష్ట్రపు అప్పయ్యస్వామి ఆధార్ కార్డునే తెలుగునాడుకు మార్చేసి, ఆ నీడన చక్కని వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే సుమీ ! 

కేరళం కంటే గుజరాత్ ఇంకా దూరం కదా !

ఛిన్నమస్త చిన్నబోయినచోట, ప్రత్యంగిర పట్టించుకోని వేళ, రాధాదేవి మాత్రమే రక్షిస్తుంది. ఆ క్షణానికి ఆమె కావలసి వస్తుంది. మరుక్షణమే ఆమె పనికిరాకుండా పోతుంది. మళ్ళీ భయంకర హోమదేవతలే మనకు కావాలి. అవున్లే రాధాదేవి మన వ్యాపారానికి పనికిరాదు కదా !

మన బ్రతుకులింతే !

వ్రేలాడే శవమంటే వేలంవెర్రిగా పరిగెత్తేవాళ్లకు, జగన్మోహనుడైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే. 

ఆయనేమీ బిర్యానీ పెట్టి, ఖర్చులకు డబ్బులివ్వడు కదా ! రాత్రిపూట కూడికలూ, తీసివేతలూ నేర్పించడు కదా !  

గుండు సాధువులనూ, బండస్వాములనూ, 'ళ' కీ, 'ల' కీ తేడా తెలియని మహాయోగులనూ పూజించేవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? సహజమే కదా ! 

ఆయనేమీ వీళ్ళలాగా నైటీ వేసుకోడుగా !

అర్ధరాత్రిళ్ళు క్షుద్రదేవతలకు బొగ్గులూ ఎండుమిర్చిలతో హోమాలు చేసే క్షుద్రులకు చిన్నికృష్ణుని చిరునవ్వులెలా నచ్చుతాయి? అర్ధం చేసుకోగలం ! 

90 వచ్చినా, మాకింకా వయసుడిగి పోలేదుగా? కోరికలు చావలేదుగా? చిన్నికృష్ణుడిని పూజించడానికి?

మళ్ళీ నోరుతెరిస్తే అందరూ చెప్పేది భగవద్గీతా శ్లోకాలే ! కానీ శ్రీకృష్ణుడెవరికీ అక్కర్లేదు.

ఆయన ఎనిమిదేళ్ల వయసులోనే రాసలీలలు చేశాడంట ! గోపికలు స్నానాలు చేస్తుంటే బట్టలు కాజేసి చెట్టుపైన కూర్చున్నాడంట ! ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. మనకు కావలసింది కూడా అదే కదా !

మనం చెయ్యాలనుకుంటూ, చేయలేకపోతున్న పనులన్నీ ఆయనెప్పుడో అయిదువేల ఏళ్ళక్రితమే చేసేశాడు. లక్కీ ఫెలో ! దీనిని 'అసూయ' అంటారేమో? సర్లే ఏదో ఒకటి !

కానీ, అంతకు ముందే, గోవర్ధన పర్వతాన్ని చిటికెనవ్రేలితో ఎత్తి తనవారిని కాపాడాడు. నెలలపిల్లవాడుగా ఉన్నపుడే ఎంతోమంది రాక్షసులను సంహరించి, లోకపీడను వదిలించాడు. బోసినోటిలో విశ్వాన్ని చూపించాడు. అవెలా చేశాడు? మనకనవసరం ! అవన్నీ యశోదాదేవి భ్రమలు !

ఆ తర్వాత ఎన్నో మానవాతీతపు పనులను చేశాడు. రాజ్యాలేలాడు. రాజకీయాలు చేశాడు. మహాభారతయుద్ధాన్ని కూడా నడిపించాడు. ఆగండాగండి ! ఈ పాయింట్ మాకు బాగా నచ్చింది.

మేము కూడా మా ఆశ్రమం పై ఫ్లోరులో, అమ్మాయిలతో అర్ధరాత్రి, శివరాత్రి, డాన్సులెయ్యచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. వాళ్లేమో గోపికల అంశలతో పుట్టారు.

మేముకూడా రాజకీయులతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ బ్లాక్ మనీని మా భూగృహాలలో దాచిపెట్టి, రాజకీయం చెయ్యవచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. కాకపోతే మా తర్వాత లారీలలో ఆ బంగారమంతా ఎక్కడికో తరలిపోతుంది. పోతేపోనీ. బ్రతికున్నన్నాళ్లు మా పబ్బం గడిచిందిగా !

మేముకూడా విద్యార్థులను స్థంభాలకు కట్టేసి కాల్చిపారెయ్యొచ్చు. మేమూ  కృష్ణుని అంశలమే. కేసులేమీ ఉండవు. ఏం, భారతయుద్ధాన్ని దగ్గరుండి నడిపించిన కృష్ణుడిపైన ఉన్నాయా?

కృష్ణుడు శివుడిని ఆరాధించాడట. మేముకూడా చేస్తాం. మాటమాటకూ 'షివా షివా' అంటాం. లేదా 'చెంబో చెంబో' అంటాం. కానీ ఆ చెంబెక్కడుందో మాకైతే తెలీదు. కైలాసయాత్రకని పోయి, దారితప్పి సరాసరి కైలాసానికే పోతాం. లేదా 'కైలాస' అని ఒక ద్వీపాన్నే కొనేస్తాం. దానికి మా ప్రధానగోపికని, సారీ శిష్యురాలిని, ప్రధానమంత్రిగా చేసేస్తాం. కృష్ణుడెప్పుడైనా ఇలాంటి పనులు చేశాడా? చేయగలిగాడా? కనుక ఆయనకంటే మేమే గొప్పవాళ్ళం.

'కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే' అని మా శాస్త్రాలంటున్నాయి. కానీ మేమాయనను పూజించము. మాకు భగవంతుడెందుకు? ఈరోజు మందుకు ఎవడు డబ్బులిస్తే వాడే మా దేవుడు.

ఆయన మాకర్ధం కాడు. 

గౌడీయమఠానికీ, ఇస్కానుకే ఆయన అర్ధం కాలేదు. ఇక మాకెలా అవుతాడు?

అయినా మా పూజామందిరాలూ, పందిళ్ళూ ఖాళీగా లేవు. వాటిల్లో ఎక్కడ చూసినా పీర్లూ, ఫకీర్లూ, వ్రేలాడుతున్న శవాలూ, క్షుద్రదేవతలూ, గుండుస్వాములూ, బండయోగులూ, గడ్డంస్వాములూ, అజ్ఞాతసిద్ధులూ, ప్రతిరాత్రీ యముడితో డిన్నర్ చేసి, మార్కింగ్ బ్రేక్ ఫాస్ట్ హిమాలయాలలో బాబాజీతో చేసి, సాయంత్రానికి సిద్ధాశ్రమం దొడ్లో రెస్టు తీసుకునే పిరమిడ్లూ,  క్రియాయోగ గృహిణులూ, కళ్ళు మూసుకుంటే లోకలోకాలు తిరిగే NRI మహిళలూ, వీళ్ళ ఫొటోలే. 

వీరి మధ్య కృష్ణుడికి చోటేది?

ఆయన పరిపూర్ణ అవతారమైతే మాకేంటి? కాకపోతే మాకేంటి? వితంతువులకూ, అనాదులకూ డబ్బులిస్తాడా లేదా? మా వ్యాపారానికి పనికొస్తాడా లేదా? అది చెప్పండి !

మనల్ని ఆ శ్రీకృష్ణుడే రక్షించాలి. మనల్నే  కాదు. భూమి మొత్తాన్నీ ఆయనే రక్షించాలి.

రక్షిస్తాడా? మనలాంటి వాళ్ళని? ఒకవేళ ఏదైనా బలహీనక్షణంలో ఆయన ముందుకొస్తే మాత్రం, మనం రక్షించనిస్తామా?

ఏమో నాకైతే సందేహమే !

read more " కృష్ణ కృష్ణా ! "

31, ఆగస్టు 2026, సోమవారం

నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు

నేపాల్ దుర్ఘటన జరిగింది.

850+ మంది చనిపోయారు. 2500+ మంది ఆచూకీ లేరు. 

నిత్య, నైమిత్తిక ప్రళయాలకు ఇదొక ఉదాహరణ. 

కాకపోతే, ఇంటర్నెట్ గురువులెవ్వరికీ ఈ విషయం చూచాయగా కూడా ముందస్తుగా తెలియలేదు.

----------------------

వీరిలో ప్రతిరాత్రీ శంభలాకు చెంబుతీసుకొని పోయి వచ్చేవాళ్ళున్నారు. 

సిద్ధాశ్రమంలోనే పుట్టిపెరిగామని చెప్పుకునే హిమాలయయోగులున్నారు. 

కైలాసపర్వతంలో వారంవారం జరిగే సీక్రెట్ మీటింగులకు హాజరయ్యేవాళ్లున్నారు.

సాక్షాత్తూ శివుడితోనే సరాసరి హాట్ లైన్లో మాట్లాడేవాళ్లున్నారు. 

శివుడి భుజాలపైనే ఎప్పుడూ కూర్చుని ఉండే సద్గురువులున్నారు. 

మాటమాటకీ 'షివా షివా' అని 'షో' చేసేవాళ్లున్నారు. 

అతీతలోకాలన్నీ అలా అలా సరదాగా ధ్యానంలో తిరిగొచ్చే యో/రోగులున్నారు. 

గడ్డాలు పెంచినవాళ్ళూ, పెంచనివాళ్ళూ, గుండు చేయించుకున్నవాళ్లూ, జుట్టు పెంచినవాళ్ళూ, కొప్పు కట్టుకున్న వాళ్ళూ, విప్పుకున్నవాళ్ళూ, ఇలా రకరకాల వేషాలతో ఎంతో వినోదాన్ని పంచుతున్నవారున్నారు.

అతితెలివితేటల ఉపన్యాసాలతో, చర్చలతో, గొఱ్ఱెప్రజలకు "గ్నానాన్ని" పంచుతూ  అదరగొట్టేవాళ్లున్నారు.

సినీనటుల అక్రమసంబంధాల దగ్గరనుంచీ, వాళ్ళ కాపురాలు నిలుస్తాయా లేదా అన్నదానివరకూ ప్రతిదానినీ చెప్పే కమెడియన్ జ్యోతిష్కులున్నారు.

ఇంకా ఎంతోమంది ఆన్లైన్ విదూషకులున్నారు.

ఎవరికీ ఈ ప్రమాదం గురించిన ముందస్తు సూచన కొంచెం కూడా లేదు.

ఎన్నో లోకాలలో ఏమి జరుగుతోందో చూడగలిగే జ్ఞానులకు, ఈ లోకంలో ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో తెలీదు !

ఈషా భక్తబృందమైతే అదేదో ఎపాయింట్ మెంట్ తీసుకున్నట్టు సరిగ్గా పదినిముషాల  ముందు ఠంచన్ గా అక్కడకు చేరుకొని 'రామ్మా ! వరదా ! వచ్చి  మమ్మల్ని ముంచెయ్యి' అన్నట్టు సామాన్లు సర్దుకొని మరీ రెడీగా ఉంది.

కాబట్టి వాళ్ళకొక్కరికే, కైలాసం నుండి కరెక్ట్ గా ముందస్తు సమాచారం ఉందని నేననుమానిస్తున్నాను. లేకపోతే సరిగ్గా పదినిమిషాల ముందుగా అక్కడికెలా చేరుకుంటారు వాళ్ళు?

ఇప్పుడంతా అయిపోయాక,  మళ్ళీ వేరే రకం 'షో' లు, "షివా షివా" అంటూ షంతాప షభలు, విశ్లేషణలు, సమర్ధింపులు, నాటకాలు.

-------------------

వైకుంఠద్వారం టికెట్ల త్రొక్కిసలాటలో పడి సరాసరి వైకుంఠానికే పోయారు గతంలో కొందరు.

ఇప్పుడు కైలాసయాత్ర చేసొస్తూ, కైలాసానికే డైరెక్ట్ గా చేరుకున్నారు మరికొందరు.

బ్రహ్మలోకానికి మాత్రం ఎవరూ పోవడం లేదు ! పాపం ఆయనని పూజించేవారు లేరుకదా !

పిచ్చిభక్తులు నిజంగా వైకుంఠానికీ, కైలాసానికీ పోతున్నారో లేదో తెలియదు గానీ, వీళ్ళ డబ్బులు మాత్రం చేరవలసినవారికి చేరుతున్నాయి.

రెలిజియస్ వ్యాపారాలూ, రెలిజియస్ టూరిజం వ్యాపారాలూ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి.

---------------------

అసలూ, హిమాలయాలతో మనకెందుకు?

ఎవరుండవలసిన చోట వాళ్ళుండాలి.

మనకు దూరంగా ఎక్కడో ఉన్న మంచుకొండలలోకి మనం పోయి, అక్కడ మన చెత్తా చెదారమూ, సారాసీసాలూ, ప్లాస్టిక్కులతో నింపడం అవసరమా?

అక్కడెవరో పాపం ముక్కులు మూసుకుని, గోచీలు పెట్టుకుని కూర్చుని ఉంటే, మనం పోయి, వాళ్ళనింకా లోతట్టు కొండల్లోకి తరిమికొట్టడం అవసరమా?

స్వచ్ఛమైన హిమాలయాలను టూరిస్టు సెంటర్లుగా మార్చేసి, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు కట్టి, మబ్బుచాటు వ్యాపారాలు చెయ్యడం అవసరమా?

అక్కడకూడా డ్యాములు, బ్రిడ్జీలు కట్టి, కొండలను తొలిచి సొరంగాలు త్రవ్వడం అవసరమా?

ప్రకృతిని ఈ విధంగా పాడు చెయ్యడం అసలంటూ అవసరమా?

చేస్తే, అది చూస్తూ ఊరుకుంటుందా?

---------------------

గత మూణ్నెళ్లుగా వర్షాలెందుకు లేవు?

ఎక్కడచూచినా ఈ వేడీ, ఉడకా, కొనసాగుతున్న ఈ వేసవీ ఏమిటి?

యూరప్ లో ఎండవేడికి వేలాదిమంది చావడమేమిటి?

ఉత్తర అమెరికాలో కూడా పెరుగుతున్న ఉష్టోగ్రతలేమిటి?

ఇవన్నీ ఎందుకో, గ్లేషియర్లు కరగడమూ అందుకే.

కానీ, మనుషులేమీ నేర్చుకోరు. నేర్చుకోకండి. ఇలాగే ఉండండి.

---------------------------- 

సర్లే, ఈ న్యూసు ఇప్పటికే పాతబడిపోయింది.

బోరుకొడుతోంది. ఇంకో క్రొత్త న్యూసు రాదేంటి?

ఎవరైనా ఒక రేపో, ఒక మర్డరో, ఇంకొకటో, ఇంకొకటో కాస్త వెరైటీగా చెయ్యండ్రా బాబూ !

ఇంకెన్ని రోజులీ నేపాల్ గోల?

ఇవన్నీ చూస్తుంటే గతంలో వ్రాసుకున్న ఒక కవిత గుర్తుకొస్తోంది.

------------------------

కొందరు బాధాపీడితులు
కొందరు మాయామోహితులు.

కొందరు మాయగాళ్లు.
కొందరాశ్చర్య చకితులు.

కొందరు ఆపకుండా వాగేవాళ్ళు
కొందరు లేవకుండా వినేవాళ్ళు

కొందరు  నాటకాలేసేవాళ్ళు
కొందరు నవ్వుకుంటూ చూసేవాళ్ళు

కొందరు తీర్పులు తీర్చేవాళ్ళు
కొందరు తిరిగిరాకుండా పోయేవాళ్లు.

చివరికందరూ,
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడేవాళ్లు !

ఓ జీవితమా ! అర్థంకాని నీ ఆట జరుగుతూనే ఉంటుంది !
ఓ విశ్వమా ! అంతులేని నీ పయనం సాగుతూనే ఉంటుంది !!
read more " నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు "

9, ఆగస్టు 2026, ఆదివారం

గడపలో దీపం

మొన్నామధ్యన కాలేజీరోజుల నాటి ఒక స్నేహితుడు ఆశ్రమానికి వచ్చాడు.

కుశలప్రశ్నలయ్యాక, "ఆశ్రమం నిర్మించావని తెలిసింది. చూద్దామని వచ్చాను" అన్నాడు.

"మంచిది. చూడు" అన్నాను.

"నీ ఇంటర్వ్యూ తీసుకుని మా ఛానల్లో వేస్తాము. అందుకని కెమెరాలతో సహా వచ్చాను. కార్లో ఉన్నాయి. నువ్వు సరేనంటే మొదలుపడదాం." అన్నాడు.

"అవసరం లేదు" అన్నాను.

ఆశ్చర్యంగా చూచాడు.

"పబ్లిసిటీ అవుతుంది. ఇంకా చాలామంది వస్తారప్పుడు" అన్నాడు.

"ఏం చేస్తారు చాలామంది వచ్చి?" అడిగాను.

"ఏవో బాధలుంటాయిగా వాళ్లకు" అన్నాడు.

"వాళ్ళ బాధలను తీరుస్తూ, నాకు బాధలను సృష్టించుకోమంటావా?" అడిగాను. 

"మరి బ్లాగు, బుక్సు, ఆన్లైన్ మీటింగ్స్ ఇవన్నీ చేస్తున్నావుగా" అడిగాడు.

"అవి లోకుల కష్టాలను తీర్చడంకోసం కాదు. జనం పెరిగితే గోలతప్ప ఇంకేదీ ఉండదు. లోకపు కర్మబరువును మొయ్యడం అవతారపురుషులకే సాధ్యం కాలేదు. మనమెంత? ఛానల్స్ చూసేవాళ్ళు కాలక్షేపానికి మాత్రమే ఆ పని చేస్తారని నీకూ తెలుసు. నాకూ తెలుసు. ఎందుకలాంటి వాళ్లంతా ఇక్కడికొచ్చేది? " అన్నాను.

"మరి ఇదంతా ఎందుకు?" అడిగాడు చుట్టూ చూస్తూ. 

"దీపాన్ని వెలిగించి గడపలో ఉంచాను. నాలుగురోడ్ల కూడలిలో ఉంచవలసిన పని లేదు" అన్నాను.

సాయంత్రం వరకూ ఉండి, అదీఇదీ మాట్లాడి, సెలవు తీసుకున్నాడు.

కారులోని కెమెరాలు  కారుతోబాటే వెళ్లిపోయాయి.

గడపలో దీపం వెలుగుతూనే ఉంది.

read more " గడపలో దీపం "

5, ఆగస్టు 2026, బుధవారం

మా 80 వ పుస్తకం "వెలుగుదారులు - రెండవభాగం" విడుదల

ఇవాళ నా 63 వ పుట్టినరోజు. 63 పూర్తై 64 లోకి అడుగుపెడుతున్నాను.

ఈ సందర్భంగా, నా కలం నుండి వెలువడుతున్న 80 వ పుస్తకంగా "వెలుగుదారులు" రెండవభాగాన్ని నేడు విడుదలచేస్తున్నాము.

ఇది "మ్యూజింగ్స్ - II" కు తెలుగు అనువాదం. "ఈ-బుక్" కనుక ఒకే పుస్తకంగా విడుదలౌతోంది. ప్రింట్ లో  రెండు పుస్తకాలుగా వస్తుంది.

ఇందులోకూడా 360 ఆధ్యాత్మిక టాపిక్స్ మీద నేను చెప్పిన విషయాలు, సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయి. దీనిని, దీని మొదటిభాగాన్ని దగ్గర ఉంచుకుని వీటిలో ఉన్న 720 టాపిక్స్ ను చదువుతూ ఉంటే, ఆధ్యాత్మికప్రపంచంలో మీకొచ్చే ఎటువంటి సందేహమైనా పటాపంచలైపోతుందని నేను  చెప్పగలను. 

పంచవటి శిష్యులకు "వెలుగుదారులు", ఒక భగవద్గీత వంటిదని చెప్పడం అతిశయోక్తి కాబోదు.

మొదటిభాగంలాగే ఇదికూడా జిజ్ఞాసువులకు అభిమానపాత్రమౌతుందని భావిస్తున్నాము.

ప్రచురణలో పాలు పంచుకున్న అందరికీ ఆశీస్సులందిస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " మా 80 వ పుస్తకం "వెలుగుదారులు - రెండవభాగం" విడుదల "

2, ఆగస్టు 2026, ఆదివారం

దేవుడిని తిడతారా జంతువుల్లారా?

75 ఏళ్ల వయసున్న తననూ, చనిపోయిన తన తల్లిగారినీ బూతులు తిట్టిన పదిహేనూ ఇరవైఏళ్ల జాంబీలను క్షమిస్తూ మోదీగారు ప్రకటన చేశారు. వారు దారితప్పిన పిల్లలని, వారిని సరిదిద్దటమే చేయాలిగాని, శిక్షించడం సరికాదని అన్నారు. అది ఆయనలోని మానవత్వాన్ని, దైవత్వాన్ని చూపిస్తున్నది. 

అంతేకాదు, వాళ్ళు మాట్లాడిన మాటల్నిబట్టి, ఆ పిల్లలు అసలెలా పెరుగుతున్నారో, ఆ తల్లిదండ్రులు వారినెలా పెంచుతున్నారో  కూడా కనిపిస్తున్నది. అసలంటూ వాళ్లకు తల్లిదండ్రులున్నారా అని నాకు సందేహం తలెత్తుతున్నది. బహుశా గాలికి పుట్టి, గాలికి పెరిగిన రకాలై ఉంటారు. లేదా, డ్రగ్స్ మత్తులో ఉన్నారని ఈజీగా అర్థమవుతున్నది.

Gen Z అంటే ఏమిటా? అని ఇన్నాళ్ళూ అనుకునేవాడిని. ఇప్పుడు సందేహం తీరిపోయింది. జనరేషన్ జాంబీ అని అర్థమైపోయింది.

'వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకు తెలియదు. వాళ్ళను క్షమించు' అని జీసస్ ప్రార్ధించాడని, కనుక ఆయనలో దైవత్వం ఉన్నదని అందరూ అంటుంటారు. అదేనిజమైతే, మోదీగారిలో కూడా అదే దైవత్వం ఉన్నది. ఒక ప్రధానమంత్రి తలచుకుంటే, ఈ బచ్చాలందరూ ఏమై పోతారసలు? ఊహకికూడా అందదు.

కానీ ఆయన క్షమించారు. అది ఆయనలోని దైవత్వం !

ఇంకా చెప్పాలంటే, ఆ టైములో జీసస్ నిస్సహాయుడు. శిలువ వేయబడుతున్నాడు. ఎంతగా మొరపెట్టుకున్నా తన దేవుడు కూడా  తనను పట్టించుకోలేదు. ఆ సమయంలో, ప్రార్ధించడం తప్ప జీసస్ ఇంకేం చేయగలడు? అయినా, కోప్పడకుండా క్షమించాడు. అంతవరకూ గొప్పవిషయమే !

కానీ మోదీగారు నిస్సహాయుడు కాదు. యంత్రాంగమంతా ఆయన చేతులలో ఉన్నది. ఒక కనుసైగ చేస్తే చాలు, ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ ఆయనలా చేయలేదు. ఓర్పువహించాడు. క్షమించాడు. కనుక, నా దృష్టిలో జీసస్ కంటే మోదీగారే గొప్పవాడు.   

ఆయన దేశానికి క్షమార్పణ చెప్పాలట ! ఇదొక డిమాండా అసలు? దీనినొక ఇష్యూ చేస్తున్నాడు పప్పు. తన ముందున్న మైకు స్విచ్చి ఆన్ చేసుకోకుండా, మైకు కట్ చేశారని గోల చేస్తున్నాడు. అందుకే పప్పు అనేది !

క్షమార్పణ ఆయన చెప్పడమేంట్రా దరిద్రుల్లారా ! మనందరి చర్మాలతో ఆయనకు చెప్పులు కుట్టించినా, ఆయన ఋణాన్ని ఈ దేశం తీర్చుకోలేదురా  దేశద్రోహుల్లారా !

---------------------

పార్లమెంటు సమావేశాలను ముందుకు పోనివ్వకుండా, బిల్లులు పాసు కానివ్వకుండా  మన ఎంపీలు చేస్తున్న అల్లరీ గోలా ప్రజలలో అసహ్యాన్ని పుట్టిస్తున్నది. 

వీళ్లా మన MP లు? అని సిగ్గుపడవలసి వస్తున్నది. ఏదో రోడ్లమీద అరిచే జంతువులలాగా 'ఓ...' అని MP లు పార్లమెంటులో అరుస్తున్నారంటే, మన దేశానికి ప్రజాస్వామ్యం ఏమాత్రమూ సరిపోదని నేనెప్పుడూ అనేమాట నిజమేనని రుజువౌతున్నది. ఎంత డబ్బులుపెట్టి ఓట్లు కొనుక్కుని గెలిస్తే మాత్రం, కాస్త డీసెన్సీ డెకోరం ఉండద్దూ ! మేన్యుఫేక్చరింగ్ డిఫెక్టా?

----------------------

గతపదేళ్లలో మన దేశం ఎన్నో మైలురాళ్లను దాటింది. ఎన్నో దేశాలను దాటేసి ముందుకొచ్చేసింది. మోదీగారు సాధించిన విజయాలను, దాటిన మైలురాళ్లను వ్రాయాలంటే వందకు పైన ఉన్నాయి. 

దేశం బాగుపడిపోతున్నది. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడా ఎలాంటి గొడవలూ లేవు. పెడదామన్నా వీలుకావడం లేదు. ఇంకోసారి మోదీగారి ప్రభుత్వం వస్తే ఇక మనం దుకాణాలు మూసుకోవలసిందే, అన్న తీవ్రమైన భయానికి కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇస్లామిక్ పార్టీలు, ఇతర కొమ్ముపార్టీలు లోనయ్యాయి. వాటికి మనచుట్టూ పొంచి ఉన్న శత్రుదేశాలు కాపుకాశాయి. ఎగదోశాయి. సరే, వీళ్లకు ఫండింగ్ చేసే దొంగలెలాగూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బొద్దింకలు పుట్టుకొచ్చాయి. 

సరే, వాటికి కూడా వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వబడింది. దానిని సాకుగా తీసుకొని 'చలో పార్లమెంట్' అని పార్లమెంట్ వైపు పోబోయాయి. వేటు పడింది. అదికూడా లైట్ గా పడింది.

దానిని హైలైట్ చేసి, FCRA వంటి ముఖ్యమైన బిల్లులు పాసవ్వకుండా చెయ్యాలని విపక్షాలు పార్లమెంట్ సమావేశాలలో నానా అల్లరీ చేస్తున్నాయి. కానీ వాటి దేశద్రోహపోకడలను దేశం గమనిస్తూనే ఉంది. వీళ్ళవెనుక ఎవరున్నారో, ఫండింగ్ ఎక్కడనుంచి వస్తున్నదో, పార్లమెంట్లో చర్చలకు ఎందుకిలా అడ్డుపడుతున్నారో, నేడు అందరికీ తెలుసు.

విపక్షాల ఎజెండా ఒకటే. ఏదోరకంగా గొడవలు లేవనెత్తి, నేపాల్, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో జరిగినట్టు ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కంకణం కట్టుకున్నాయి. మనదేశం బాగుపడకూడదు. అగ్రరాజ్యంగా అవతరించకూడదు. మిగతాదేశాలతో సమానంగా తలెత్తుకుని గర్వంగా నిలబడకూడదు. నాశనం కావాలి. ఇదే వీళ్ళ ఆశయం.

పేపర్ లీకు జరిగింది. దానిని గుర్తించి తగిన చర్యలన్నీ వెంటవెంటనే తీసుకున్నారు. ఇంకేం కావాలి? ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది? సరే, నైతికకోణంలో చేశాడు. ఇప్పుడు అమిత్ షాను, మోదీగారిని కూడా చేయమంటున్నారు. తర్వాత దేశం దేశద్రోహపార్టీల చేతులలోకి వెళ్ళిపోతుంది. చైనా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ఇంకా ఇతరశత్రుదేశాల చేతులలోకి వెళ్ళిపోతుంది. ఐదారేళ్లలో సర్వనాశనమై పోతుంది. అదేగా వీళ్లకు కావలసింది?

దీనిని మనమెందుకు జరగనివ్వాలి? మా డిమాండ్లు మాకూ ఉన్నాయ్ !

FCRA బిల్లు పాసవ్వాలి. మతమార్పిడి మాఫియాలు అంతం కావాలి. దేశద్రోహపార్టీలు అంతం కావాలి. అల్లర్లు ఆగడాలు, కుట్రలు అంతం కావాలి. ఆ దిశగా ఏమేం చెయ్యాలో అన్నీ చెయ్యాలి.  అంతేగాని, ప్రభుత్వం వెనుకకు తగ్గడానికి వీల్లేదు. ఇదే మా డిమాండ్.

ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడం మీవల్ల అవుతుందా?

---------------------

శాంతియుతంగా నిరసన చెయ్యవలసిన విద్యార్థులు విధ్వంసానికి దిగవచ్చా?

నిరసనలో పాల్గొన్నవారికి పాకిస్తాన్ నుంచి, బాంగ్లాదేశ్ నుండి ఫుడ్ ఆర్దర్లు ఎలా జరిగాయి?

నిరసనకారులు మాట్లాడిన మాటలేంటి? చేసిన నినాదాలేంటి?

పోలీసులను కొట్టటమేంటి? మహిళా జర్నలిస్టులను అల్లరి చేయడమేంటి?

ఇవన్నీ మంచిపనులేనా? శాంతియుతం అంటే ఇదేనా?  

పెల్లెట్ గన్స్ వాడారని గోలచేస్తున్న కమ్యూనిస్టులు, మీ చైనాలో జరిగిన తియానన్ మెన్ స్క్వేర్ సంఘటనకు ఏమంటారు?

పోలీసుచర్య అంటూ గోలచేస్తున్న కాంగ్రెస్, ఎమర్జెన్సీని గురించి ఏమి జవాబు చెబుతుంది?

ఇతర రాష్ట్రాలలో పేపరులీకులైనపుడు, విద్యాశాఖామంత్రులు ఎందుకు దిగిపోవడం లేదు?

సరే, శాంతియుతంగా నిరసన చేసినవారిపైన కేసులుండవు. మరి, విధ్వంసకారులను, ఆ గుంపులో దూరిపోయిన నేరస్తులను, పాతకేడీలను కూడా వదిలేయాలా? ఏ చట్టప్రకారం?

--------------------------

మోదీగారు మనిషి కాదురా దరిద్రుల్లారా ! ఆయన దైవాంశసంభూతుడు. మన దేశాన్ని రక్షించడానికి పుట్టిన దేవుడు. ఆయనే లేకపోతే, నేడు మనమందరమూ మనదేశంలోనే బానిసబ్రతుకులు బ్రతుకుతూ ఉండేవాళ్ళం. అలాంటి దేవుడిని అలా తిడుతున్నారా? మీరసలు మనుషులేనా?

పెద్దమనసుతో మీరు క్షమించినా, ఈ దేశద్రోహులను మేము క్షమించలేము. చిన్నపిల్లలైనా సరే, వీళ్లకు తీవ్రమైన శిక్షలు పడాల్సిందే. వీళ్ళనిలా వదిలేస్తే, కొన్నేళ్ళకు వీళ్ళే తీవ్రవాదులు, నేరస్తులు, సమాజానికి చీడపురుగులు అవుతారు. వీళ్ళను వదిలెయ్యడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం !

------------------

FCRA బిల్లు రావాలి. మతమార్పిడులు పూర్తిగా ఆగాలి. రిజర్వేషన్ అంతం కావాలి. మెరిట్ కు గుర్తింపు రావాలి. అవినీతి అంతం  కావాలి. రాజ్యాంగాన్ని మార్చాలి. డెమోక్రసీని తొలగించి, ఉదారవాద నియంతృత్వం రావాలి. 

ఇవి మా డిమాండ్స్.

----------------------------

మన దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు. ఉదారవాద నియంతృత్వం (Benevolent Dictatorship) ఒక్కటే మనకు సరైనది. నేడుకాకపోయినా, భవిష్యత్తులోనైనా ఇదే నిజమౌతుంది. అమ్మాబాబూ అని ఒళ్ళో కూచోబెట్టుకుంటే మనదేశంలో ఎవడూ మాటవినడు. తొక్కి నారతీస్తేనే మంచిగా ఉంటారు.

దేశద్రోహులనెవరినీ క్షమించకూడదు. వాళ్ళు ప్రజలైనా సరే ! పార్లమెంటులో లేకిగా ప్రవర్తిస్తున్న నాయకులైనా సరే ! వాళ్ళను సపోర్ట్ చేస్తున్న పార్టీలైనా సరే. ఎవరినీ వదలడానికి వీల్లేదు.

మన దేవుడైన మోదీగారిని దూషించేవాళ్లను ఆయన క్షమించినా, మనం క్షమించకూడదు. అలాంటివాళ్ళందరినీ క్షమిస్తూ కూచుంటే, దేశద్రోహుల కుట్రలకు బలై, దేశం అధోగతి పాలవుతుంది. నిజాయితీపరులు, దేశభక్తులు, కాస్తైనా ఆలోచన ఉన్నవారందరూ కళ్లుతెరవాలి. మారుమాటలేకుండా మోదీగారిని, బీజేపీని సపోర్ట్ చేయాలి. దేశద్రోహుల పనిపట్టాలి.

దేశద్రోహుల ప్రచారాలను త్రిప్పికొట్టండి. మీమీ స్థాయిలలో ప్రతిఘటించండి. న్యాయాన్ని ధర్మాన్ని రక్షించండి.

బాగా గుర్తుంచుకోండి !

ధర్మం మౌనంగా ఉంటే, అధర్మానికి వంతపాడినట్లే అవుతుంది ! 

read more " దేవుడిని తిడతారా జంతువుల్లారా? "

30, జులై 2026, గురువారం

సత్యం - అసత్యం

దూరపు ఊళ్లలో ఉన్న శిష్యులను గురుపూర్ణిమ కోసం ఆశ్రమానికి రావద్దనే నేను చెబుతాను. ఈ ఇంటర్నెట్ యుగంలో అసలెక్కడికీ పోనవసరం లేదు. ఎక్కడవాళ్ళు అక్కడే ఉండి, అన్నీ చేయవచ్చు.

ఇక్కడున్నా, ఎక్కడున్నా, ఉండవలసిన విధంగా ఉంటే అన్నీ జరుగుతాయి. అది లేనప్పుడు, ఎక్కడికొచ్చినా ఏమీ ఒరగదు.

కానీ, దగ్గర ఊళ్లలో ఉన్న శిష్యులు కొంతమంది, వద్దన్నా వస్తూ ఉంటారు. భౌతికంగా వచ్చి ఇక్కడ కాసేపైనా ఉంటే, వాళ్లకు బాగుంటుంది. అదేవిధంగా, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాదులనుండి కొంతమంది నిన్న ఆశ్రమానికి వచ్చారు.

మాటలసందర్భంలో, ఒక శిష్యురాలు ఇలా అన్నది. 

'ఒంగోలు నుండి వస్తుంటే దారిపొడుగూతా  పందిళ్లు, బాబా కటౌట్లు. రోడ్డుపక్కన పందిళ్ళేసి గురుపౌర్ణమంటూ భోజనాలు చేస్తున్నారు. చాలా జాలేసింది వాళ్ళని చూస్తుంటే'.

నవ్వాను.

'కానీ నాకు మాత్రం, బాబా కటౌట్ చూసిన ప్రతిసారీ మీరే గుర్తుకు వచ్చారు' అన్నది.

'మంచిదేగా. అలాగైనా ఒక మంచిపని జరిగింది బాబావల్ల' అన్నాడొక శిష్యుడు.

అందరూ నవ్వేశారు.

'అంతే ! అసత్యాన్ని చూచినా సత్యం గుర్తుకురావడమే హిందూమతవిధానం' అన్నాను.

'వాళ్లకూ మాకూ తేడా ఏమిటి?' అని ఒక శిష్యుడడిగాడు.

'సత్యమేదో ఆసత్యమేదో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళున్నారు, సత్యాన్ని సత్యంగా గుర్తించగలిగే స్థితిలో మీరున్నారు. అదే తేడా' అన్నాను.

ఆర్భాటాలకు, అన్నసంతర్పణలకు, అతిచేష్టలకు, అనవసరపుగోలకు అతీతంగా, అసలైన గురుపౌర్ణమి వేడుక మా ఆశ్రమంలో అద్భుతంగా జరిగింది.

read more " సత్యం - అసత్యం "

29, జులై 2026, బుధవారం

గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల

2021 లో నా కలంనుండి MUSINGS - Part I అనే పుస్తకం విడుదలైంది. అది వెయ్యిపేజీల పుస్తకం. దానిలో 360 టాపిక్స్ చర్చించబడ్డాయి. అది విడుదలై నేటికి ఐదేళ్లు గడిచాయి. ఆ పుస్తకం ఎంతో పాఠకాదరణను పొందింది.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జిజ్ఞాసువులను కదిలించింది. ఆలోచింపజేసింది. చాలామంది జీవితాలను మార్చివేసింది.

తరువాత దాని తెలుగు అనువాదం 'వెలుగుదారులు' అనే పేరుతో విడుదలై, తనపేరును సార్ధకం చేసుకుంటూ, ఎంతోమందికి వెలుగుదారులను చూపించింది.

ఈ ఐదేళ్లలో ఎన్నో జరిగాయి. ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. పంచవటిని విస్తృతపరచడం జరిగింది. నేను చూపిస్తున్న సాధనామార్గాన్ని ఎంతోమందికి పరిచయం చెయ్యడం జరిగింది. ఈ మధ్యలో అనేకమంది జ్ఞానార్థులు, శిష్యులు, సందర్శకులు, ఔత్సాహికులతో ఎన్నో విషయాలపైన నేను మాట్లాడాను. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. ఆ సంభాషణలలో నుండి ఇంకొక 360 టాపిక్స్ ను ఏర్చికూర్చి ఇప్పుడు గురుపూర్ణిమ సందర్భంగా ఈ పుస్తకం యొక్క  రెండవభాగంగా విడుదల చేస్తున్నాము. ఇదికూడా వెయ్యిపేజీల పుస్తకమే.

మొదటిభాగంలోలాగే ఇందులోకూడా, అన్నీ నిత్యజీవితంలో జరిగిన సంఘటనలనుండి, ఇతరులు అడిగిన ప్రశ్నలనుండి  తీసుకున్నవే. ఊహించి వ్రాసినది ఒక్కటికూడా లేదు. కనుక, మీ జీవితంలో జరుగుతున్న అనేకవిషయాలకు, మీకొస్తున్న అనేక ఆధ్యాత్మికసందేహాలకు ఈ  పుస్తకం అద్దాన్ని పడుతుంది. వాటికి స్పష్టములైన జవాబులనిస్తుంది.

ఒక్కవారంలో రాబోతున్న నా 63 వ పుట్టినరోజు సందర్భంగా దీని తెలుగు అనువాదం "వెలుగుదారులు-రెండవభాగం" గా విడుదల అవుతుంది. అనువాదం ఇప్పటికే పూర్తయింది. అదికూడా వెయ్యిపీజీలను దాటిపోయింది. దానిని ఒకే పుస్తకంగా ముద్రించడం కష్టం కనుక,  రెండుభాగాలుగా ముద్రించి, 'వెలుగుదారులు' - 3 మరియు 4 భాగాలుగా, డిసెంబర్లో జరుగబోయే హైదరాబాద్ పుస్తకప్రదర్శన నాటికి మీకు అందుబాటులోకి తెస్తాము.

అజ్ఞానంలో పడి, ఎవరేది చెబితే దాన్ని నిజమని నమ్ముతూ, నానారకాల గురువులతో, గుడులతో, దేవుళ్లతో, దీక్షలతో, మతవ్యాపారాలతో దిక్కుతెలియకుండా పోతున్న నేటి హిందువులకు జ్ఞానజ్యోతిని చూపిస్తూ, సరియైనదారిలో వారిని నడిపించేదిశగా మేము చేస్తున్న ఈ జ్ఞానయజ్ఞాన్ని సఫలం చేయమని, సమస్తసృష్టికీ పరమగురువైన పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ ఉద్గ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల "

27, జులై 2026, సోమవారం

రాములవారు

మొన్న ఒంగోలుకు వెళుతూ దారిలోని ఒక వెల్డింగ్ షాపుదగ్గర ఆగాను.

అక్కడ ఇనుపపైపులతో ఒక రధాన్ని తయారు చేస్తున్నారు. తయారు చేయిస్తున్నది మనకు తెలిసినవాళ్ళే.

అక్కడ నా పనిని ముగించుకుని ఒంగోలుకు బయలుదేరబోతుండగా, అడగకపోయినా రధం గురించి చెబుతూ ' మా ఊళ్లో రామాలయానికి, ఊరేగింపుకి' అన్నాడతను.

'అలాగా. బాగుంది' అన్నాను.

'ఒకసారి రాండి. మా రాములవారిని చూద్దురుగాని' అని ఆహ్వానించాడతను.

 'సరే వీలైనప్పుడు వస్తాలే' అన్నాను.

'అట్టా అనుకుంటే ఎప్పుడొచ్చేది? రేపు పౌర్ణమికి రధం ఊరేగింపు. భలే ఉంటుంది. రాండి' అన్నాడు.

'చిన్నప్పటినుంచీ చాలా చూశాను. ప్రస్తుతం ఆసక్తి లేదు' అన్నాను.

'పోనీ రాములవారిని చూడండి' అన్నాడు.

ఒక్కక్షణం అతనివైపు చూచి, 'చూస్తున్నాను' అన్నాను.

'ఎక్కడా?' అన్నాడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ.

'ఇక్కడ' అంటూ ఛాతీపైన చేయివేసుకున్నాను.

ఈసారి అయోమయంగా చూస్తున్నాడు.

'రాములవారు ఇక్కడే ఉన్నారు. ఆయన్ని చూట్టానికి గుడికెందుకు? అయినాసరే, మీరు మంచిగా పిలిచారు కదా. వీలైనప్పుడు తప్పకుండా వస్తాను మీ ఊరికి' అన్నాను.

అతనికర్ధమైంది. ఇంకేమీ అడగలేదు.

నా దారిన ఒంగోలుకు బయల్దేరాను.

read more " రాములవారు "

పేలపిండి

చాలామందిలో ఒక జబ్బును గమనిస్తున్నాను. 

ఆశ్రమంలో మేమేం చేస్తున్నాము? మా ఆదర్శాలేమిటి? మా గమ్యాలేమిటి? వాటిని అందుకోవడానికి మేమనుసరిస్తున్న మార్గమేమిటి? ఇవేవీ వారికి ఆవసరం లేదు. దానిబదులు, వాళ్ళిష్టప్రకారం గానూ, వాళ్ళు ఊహించుకున్నట్లుగానూ మేమున్నామా లేమా? అన్నదానిని మాత్రమే చూస్తున్నారు. 

నన్ను కలుస్తున్నవారిలో, మాట్లాడుతున్న వారిలో అందరూ ఇలాగే ఉన్నారు.

వాళ్ళెలా ఉన్నప్పటికీ,  యధాప్రకారం నాకు మాత్రం నవ్వూ, జాలీ, ఈ రెండే కలుగుతున్నాయి.

మొన్నొకరోజున ఒకాయనతో ఫోన్లో మాట్లాడుతున్నాను.

మాటలసందర్భంలో 'ఈరోజు తొలి ఏకాదశి' అన్నాడాయన.

నేనేమీ మాట్లాడలేదు.

'ఇవాళ విష్ణుదేవునికి పేలపిండి నైవేద్యం పెట్టాలి' అన్నాడు.

'అవునా !' అన్నాను.

'మీరు చేస్తున్నారా ఆశ్రమంలో?' అడిగాడు.

'మీరన్నది పేలపిండా లేక పేలాలపిండా?' అడిగాను.

అంత సున్నితంగా చెబితే ఈ జనానికెక్కడ అర్ధమౌతుంది?

'అదేలెండి. పేలాల పిండే. మా పల్లెటూళ్ళలో ఇలా కూడా అంటాము' అన్నాడు నవ్వుతూ.

నేనేమీ అనలేదు.

'ఏకాదశినాడు విష్ణుదేవునికి ఈ నైవేద్యం పెడిదే మంచిది' అన్నాడు మళ్ళీ.

యూట్యూబ్ యూనివర్సిటీలో బాగానే చదువుకుంటున్నాడు. ముచ్చటేసింది.

'విష్ణువు అనే పదానికి అర్ధమేమిటి?' అడిగాను.

'ఏముంది? విష్ణువే' అన్నాడు.

ఇంకేం మాట్లాడగలం?

నాకీమాత్రం కూడా తెలీనందుకు అతనికి నామీద చాలా జాలేసినట్టుంది.

'చెయ్యండి గురువుగారు. చేస్తే మంచిది' అన్నాడు మళ్ళీ.

'నాకు బట్టతలుంది. పేలు పడే అవకాశం లేదు.' అన్నాను.

పెద్దగా నవ్వి, 'అయితే ఏమైంది? నాకూ ఉంది, ప్రతి మొగాడికీ కొద్దో గొప్పో ఉంటుంది' అన్నాడు.

'పేలే లేనప్పుడు పేలపిండితో పనేముంది?' అన్నాను.

'అర్ధం కాలేదు' అన్నాడు నీరసంగా.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అని ఫోన్ పెట్టేశాను.

read more " పేలపిండి "

26, జులై 2026, ఆదివారం

తెలివిలేని సంత

మొన్న పనుండి ప్రక్కఊరికెళ్ళాను.

మైకులో సాయిబాబా భజన వినవచ్చింది.

కావలసిన వస్తువులు కొంటూ ఉండగా, తెలిసిన ఒకతను కనిపించి, 'సాయిబాబా సప్తాహం జరుగుతోంది. గుడికి రండి' అని పిలిచాడు.

'ఎందుకది?' అన్నాను.

' నాలుగురోజులలో గురుపౌర్ణిమ కదా ! అందుకని చేస్తున్నాం' అన్నాడు.

జాలికలిగింది.

'గురుపూర్ణిమ అయితే, సాయిబాబాకి భజనెందుకు? అసలు సాయిబాబాకి భజనేంటి? మీరు చేయడమేంటి?' అన్నాను.

ఈ పల్లెటూరి జనానికి ఏమి చెప్పినా ఎక్కదు.

'భజన బాగుంటుంది. వచ్చి చూడండి' అన్నాడు నా మాట వినిపించుకోకుండా.

'తెలివిలేని సంతలోకి తెలివితో ఉన్నవారెందుకు?' అని, నాకు కావలసిన వస్తువులను తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాను.

read more " తెలివిలేని సంత "