2, ఆగస్టు 2026, ఆదివారం

దేవుడిని తిడతారా జంతువుల్లారా?

75 ఏళ్ల వయసున్న తననూ, చనిపోయిన తన తల్లిగారినీ బూతులు తిట్టిన పదిహేనూ ఇరవైఏళ్ల జాంబీలను క్షమిస్తూ మోదీగారు ప్రకటన చేశారు. వారు దారితప్పిన పిల్లలని, వారిని సరిదిద్దటమే చేయాలిగాని, శిక్షించడం సరికాదని అన్నారు. అది ఆయనలోని మానవత్వాన్ని, దైవత్వాన్ని చూపిస్తున్నది. 

అంతేకాదు, ఆ పిల్లలు అసలెలా పెరుగుతున్నారో, ఆ తల్లిదండ్రులు వారిని ఎలా పెంచుతున్నారో కనిపిస్తున్నది. అసలంటూ వాళ్లకు తల్లిదండ్రులున్నారా అని నాకు సందేహం తలెత్తుతున్నది. బహుశా గాలికి పుట్టి, గాలికి పెరిగిన రకాలై ఉంటారు. డ్రగ్స్ మత్తులో ఉన్నారని ఈజీగా అర్థమవుతున్నది.

'వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకు తెలియదు. వాళ్ళను క్షమించు' అని జీసస్ ప్రార్ధించాడని, కనుక ఆయనలో దైవత్వం ఉన్నదని అందరూ అంటుంటారు. అదే నిజమైతే, మోదీగారిలో కూడా అదే దైవత్వం ఉన్నది. ఒక ప్రధానమంత్రి తలచుకుంటే, ఈ బచ్చాలందరూ ఏమై పోతారసలు? ఊహకికూడా అందదు.

కానీ ఆయన క్షమించారు. అది ఆయనలోని దైవత్వం !

ఇంకా చెప్పాలంటే, ఆ టైములో జీసస్ నిస్సహాయుడు. శిలువ వేయబడుతున్నాడు. ఎంతగా మొరపెట్టుకున్నా తన దేవుడు కూడా పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రార్ధించడం తప్ప జీసస్ ఇంకేం చేయగలడు? అయినా, కోప్పడకుండా క్షమించాడు. అంతవరకూ గొప్పవిషయమే !

కానీ మోదీగారు నిస్సహాయుడు కాదు. యంత్రాంగమంతా ఆయన చేతులలో ఉన్నది. ఒక కనుసైగ చేస్తే చాలు, ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ ఆయనలా చేయలేదు. ఓర్పువహించాడు. క్షమించాడు. కనుక, నా దృష్టిలో జీసస్ కంటే మోదీగారే గొప్పవాడు.   

ఆయన దేశానికి క్షమార్పణ చెప్పాలట ! ఇదొక డిమాండారా అసలు?

క్షమార్పణ ఆయన చెప్పడమేంట్రా దరిద్రుల్లారా ! మనందరి చర్మాలతో ఆయనకు చెప్పులు కుట్టించినా, ఆయన ఋణాన్ని ఈ దేశం తీర్చుకోలేదురా  దేశద్రోహుల్లారా !

---------------------

పార్లమెంటు సమావేశాలను ముందుకు పోనివ్వకుండా, బిల్లులు పాసు కానివ్వకుండా  మీరు చేస్తున్న అల్లరీ గోలా ప్రజలలో అసహ్యాన్ని పుట్టిస్తున్నది. 

వీళ్లా మన MP లు? అని సిగ్గుపడవలసి వస్తున్నది. ఏదో రోడ్లమీద అరిచే జంతువులలాగా 'ఓ...' అని MP లు పార్లమెంటులో అరుస్తున్నారంటే, మన దేశానికి ప్రజాస్వామ్యం ఏమాత్రమూ సరిపోదని నేనెప్పుడూ అనేమాట నిజమేనని రుజువౌతున్నది. ఎంత డబ్బులుపెట్టి ఓట్లు కొనుక్కుని గెలిస్తే మాత్రం, కాస్త డీసెన్సీ డెకోరం ఉండద్దూ ! మేన్యుఫేక్చరింగ్ డిఫెక్టా?

----------------------

గతపదేళ్లలో మన దేశం ఎన్నో మైలురాళ్లను దాటింది. ఎన్నో దేశాలను దాటేసి ముందుకొచ్చేసింది. మోదీగారు సాధించిన విజయాలను, దాటిన మైలురాళ్లను వ్రాయాలంటే వందకు పైన ఉన్నాయి. 

దేశం బాగుపడిపోతున్నది. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడా ఎలాంటి గొడవలూ లేవు. పెడదామన్నా వీలుకావడం లేదు. ఇంకోసారి మోదీగారి ప్రభుత్వం వస్తే ఇక మనం దుకాణాలు మూసుకోవలసిందే, అన్న తీవ్రమైన భయానికి కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇస్లామిక్ పార్టీలు, ఇతర కొమ్ముపార్టీలు లోనయ్యాయి. వాటికి మనచుట్టూ పొంచి ఉన్న శత్రుదేశాలు కాపుకాశాయి. వీళ్ళను ఎగదోశాయి. సరే, వీళ్లకు ఫండింగ్ చేసే దొంగలెలాగూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బొద్దింకలు పుట్టుకొచ్చాయి. 

సరే, వాటికి కూడా వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వబడింది. దానిని సాకుగా తీసుకొని 'చలో పార్లమెంట్' అని పార్లమెంట్ వైపు పోబోయాయి. వేటు పడింది. అదికూడా లైట్ గా పడింది.

దానిని హైలైట్ చేసి, FCRA వంటి ముఖ్యమైన బిల్లులు పాసవ్వకుండా చెయ్యాలని విపక్షాలు పార్లమెంట్ సమావేశాలలో నానా అల్లరీ చేస్తున్నాయి. కానీ వాటి దేశద్రోహపోకడలను దేశం గమనిస్తూనే ఉంది. వీళ్ళవెనుక ఎవరున్నారో, ఫండింగ్ ఎక్కడనుంచి వస్తున్నదో, పార్లమెంట్లో చర్చలకు ఎందుకిలా అడ్డుపడుతున్నారో, నేడు అందరికీ తెలుసు.

విపక్షాల ఎజెండా ఒకటే. ఏదోరకంగా గొడవలు లేవనెత్తి, నేపాల్, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో జరిగినట్టు ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కంకణం కట్టుకున్నాయి. మనదేశం బాగుపడకూడదు. అగ్రరాజ్యంగా అవతరించకూడదు. మిగతాదేశాలతో సమానంగా తలెత్తుకుని గర్వంగా నిలబడకూడదు. నాశనం కావాలి. ఇదే వీళ్ళ ఆశయం.

పేపర్ లీకు జరిగింది. దానిని గుర్తించి తగిన చర్యలన్నీ వెంటవెంటనే తీసుకున్నారు. ఇంకేం కావాలి? ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది? సరే, నైతికకోణంలో చేశాడు. ఇప్పుడు అమిత్ షాను, మోదీగారిని కూడా చేయమంటున్నారు. తర్వాత దేశం దేశద్రోహపార్టీల చేతులలోకి వెళ్ళిపోతుంది. చైనా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ఇంకా ఇతరశత్రుదేశాల చేతులలోకి వెళ్ళిపోతుంది. ఐదారేళ్లలో సర్వనాశనమై పోతుంది. అదేగా వీళ్లకు కావలసింది?

దీనిని మనమెందుకు జరగనివ్వాలి? మా డిమాండ్లు మాకూ ఉన్నాయ్ !

FCRA బిల్లు పాసవ్వాలి. మతమార్పిడి మాఫియాలు అంతం కావాలి. దేశద్రోహపార్టీలు అంతం కావాలి. అల్లర్లు ఆగడాలు, కుట్రలు అంతం కావాలి. ఆ దిశగా ఏమేం చెయ్యాలో అన్నీ చెయ్యాలి.  అంతేగాని, ప్రభుత్వం వెనుకకు తగ్గడానికి వీల్లేదు. ఇదే మా డిమాండ్.

ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడం మీవల్ల అవుతుందా?

---------------------

శాంతియుతంగా నిరసన చెయ్యవలసిన విద్యార్థులు విధ్వంసానికి దిగవచ్చా?

నిరసనలో పాల్గొన్నవారికి పాకిస్తాన్ నుంచి, బాంగ్లాదేశ్ నుండి ఫుడ్ ఆర్దర్లు ఎలా జరిగాయి?

నిరసనకారులు మాట్లాడిన మాటలేంటి? చేసిన నినాదాలేంటి?

పోలీసులను కొట్టటమేంటి? మహిళా జర్నలిస్టులను అల్లరి చేయడమేంటి?

ఇవన్నీ మంచిపనులేనా? శాంతియుతం అంటే ఇదేనా?  

పెల్లెట్ గన్స్ వాడారని గోలచేస్తున్న కమ్యూనిస్టులు, మీ చైనాలో జరిగిన తియానన్ మెన్ స్క్వేర్ సంఘటనకు ఏమంటారు?

పోలీసుచర్య అంటూ గోలచేస్తున్న కాంగ్రెస్, ఎమర్జెన్సీని గురించి ఏమి జవాబు చెబుతుంది?

ఇతర రాష్ట్రాలలో పేపరులీకులైనపుడు, విద్యాశాఖామంత్రులు ఎందుకు దిగిపోవడం లేదు?

సరే, శాంతియుతంగా నిరసన చేసినవారిపైన కేసులుండవు. మరి, విధ్వంసకారులను, ఆ గుంపులో దూరిపోయిన నేరస్తులను, పాతకేడీలను కూడా వదిలేయాలా? ఏ చట్టప్రకారం?

--------------------------

మోదీగారు మనిషి కాదురా దరిద్రుల్లారా ! ఆయన దైవాంశసంభూతుడు. మన దేశాన్ని రక్షించడానికి పుట్టిన దేవుడు. ఆయనే లేకపోతే, నేడు మనమందరమూ మనదేశంలోనే బానిసబ్రతుకులు బ్రతుకుతూ ఉండేవాళ్ళం. అలాంటి దేవుడిని అలా తిడుతున్నారా? మీరసలు మనుషులేనా?

పెద్దమనసుతో మీరు క్షమించినా, ఈ దేశద్రోహులను మేము క్షమించలేము. చిన్నపిల్లలైనా సరే, వీళ్లకు తీవ్రమైన శిక్షలు పడాల్సిందే. వీళ్ళనిలా వదిలేస్తే, కొన్నేళ్ళకు వీళ్ళే తీవ్రవాదులు, నేరస్తులు, సమాజానికి చీడపురుగులు అవుతారు. వీళ్ళను వదిలెయ్యడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం !

------------------

FCRA బిల్లు రావాలి. మతమార్పిడులు పూర్తిగా ఆగాలి. రిజర్వేషన్ అంతం కావాలి. మెరిట్ కు గుర్తింపు రావాలి. అవినీతి అంతం  కావాలి. రాజ్యాంగాన్ని మార్చాలి. డెమోక్రసీని తొలగించి, ఉదారవాద నియంతృత్వం రావాలి. 

ఇవి మా డిమాండ్స్.

----------------------------

మన దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు. ఉదారవాద నియంతృత్వం (Benevolent Dictatorship) ఒక్కటే మనకు సరైనది. నేడుకాకపోయినా, భవిష్యత్తులోనైనా ఇదే నిజమౌతుంది. అమ్మాబాబూ అని ఒళ్ళో కూచోబెట్టుకుంటే మనదేశంలో ఎవడూ మాటవినడు. తొక్కి నారతీస్తేనే మంచిగా ఉంటారు.

దేశద్రోహులనెవరినీ క్షమించకూడదు. వాళ్ళు ప్రజలైనా సరే ! పార్లమెంటులో లేకిగా ప్రవర్తిస్తున్న నాయకులైనా సరే ! వాళ్ళను సపోర్ట్ చేస్తున్న పార్టీలైనా సరే. ఎవరినీ వదలడానికి వీల్లేదు.

మన దేవుడైన మోదీగారిని దూషించేవాళ్లను ఆయన క్షమించినా, మనం క్షమించకూడదు. అలాంటివాళ్ళందరినీ క్షమిస్తూ కూచుంటే, దేశద్రోహుల కుట్రలకు బలై, దేశం అధోగతి పాలవుతుంది. నిజాయితీపరులు, దేశభక్తులు, కాస్తైనా ఆలోచన ఉన్నవారందరూ కళ్లుతెరవాలి. మారుమాటలేకుండా మోదీగారిని, బీజేపీని సపోర్ట్ చేయాలి. దేశద్రోహుల పనిపట్టాలి.

దేశద్రోహుల ప్రచారాలను త్రిప్పికొట్టండి. మీమీ స్థాయిలలో ప్రతిఘటించండి. న్యాయాన్ని ధర్మాన్ని రక్షించండి.

బాగా గుర్తుంచుకోండి !

ధర్మం మౌనంగా ఉంటే, అధర్మానికి వంతపాడినట్లే అవుతుంది ! 

read more " దేవుడిని తిడతారా జంతువుల్లారా? "

30, జులై 2026, గురువారం

సత్యం - అసత్యం

దూరపు ఊళ్లలో ఉన్న శిష్యులను గురుపూర్ణిమ కోసం ఆశ్రమానికి రావద్దనే నేను చెబుతాను. ఈ ఇంటర్నెట్ యుగంలో అసలెక్కడికీ పోనవసరం లేదు. ఎక్కడవాళ్ళు అక్కడే ఉండి, అన్నీ చేయవచ్చు.

ఇక్కడున్నా, ఎక్కడున్నా, ఉండవలసిన విధంగా ఉంటే అన్నీ జరుగుతాయి. అది లేనప్పుడు, ఎక్కడికొచ్చినా ఏమీ ఒరగదు.

కానీ, దగ్గర ఊళ్లలో ఉన్న శిష్యులు కొంతమంది, వద్దన్నా వస్తూ ఉంటారు. భౌతికంగా వచ్చి ఇక్కడ కాసేపైనా ఉంటే, వాళ్లకు బాగుంటుంది. అదేవిధంగా, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాదులనుండి కొంతమంది నిన్న ఆశ్రమానికి వచ్చారు.

మాటలసందర్భంలో, ఒక శిష్యురాలు ఇలా అన్నది. 

'ఒంగోలు నుండి వస్తుంటే దారిపొడుగూతా  పందిళ్లు, బాబా కటౌట్లు. రోడ్డుపక్కన పందిళ్ళేసి గురుపౌర్ణమంటూ భోజనాలు చేస్తున్నారు. చాలా జాలేసింది వాళ్ళని చూస్తుంటే'.

నవ్వాను.

'కానీ నాకు మాత్రం, బాబా కటౌట్ చూసిన ప్రతిసారీ మీరే గుర్తుకు వచ్చారు' అన్నది.

'మంచిదేగా. అలాగైనా ఒక మంచిపని జరిగింది బాబావల్ల' అన్నాడొక శిష్యుడు.

అందరూ నవ్వేశారు.

'అంతే ! అసత్యాన్ని చూచినా సత్యం గుర్తుకురావడమే హిందూమతవిధానం' అన్నాను.

'వాళ్లకూ మాకూ తేడా ఏమిటి?' అని ఒక శిష్యుడడిగాడు.

'సత్యమేదో ఆసత్యమేదో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళున్నారు, సత్యాన్ని సత్యంగా గుర్తించగలిగే స్థితిలో మీరున్నారు. అదే తేడా' అన్నాను.

ఆర్భాటాలకు, అన్నసంతర్పణలకు, అతిచేష్టలకు, అనవసరపుగోలకు అతీతంగా, అసలైన గురుపౌర్ణమి వేడుక మా ఆశ్రమంలో అద్భుతంగా జరిగింది.

read more " సత్యం - అసత్యం "

29, జులై 2026, బుధవారం

గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల

2021 లో నా కలంనుండి MUSINGS - Part I అనే పుస్తకం విడుదలైంది. అది వెయ్యిపేజీల పుస్తకం. దానిలో 360 టాపిక్స్ చర్చించబడ్డాయి. అది విడుదలై నేటికి ఐదేళ్లు గడిచాయి. ఆ పుస్తకం ఎంతో పాఠకాదరణను పొందింది.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జిజ్ఞాసువులను కదిలించింది. ఆలోచింపజేసింది. చాలామంది జీవితాలను మార్చివేసింది.

తరువాత దాని తెలుగు అనువాదం 'వెలుగుదారులు' అనే పేరుతో విడుదలై, తనపేరును సార్ధకం చేసుకుంటూ, ఎంతోమందికి వెలుగుదారులను చూపించింది.

ఈ ఐదేళ్లలో ఎన్నో జరిగాయి. ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. పంచవటిని విస్తృతపరచడం జరిగింది. నేను చూపిస్తున్న సాధనామార్గాన్ని ఎంతోమందికి పరిచయం చెయ్యడం జరిగింది. ఈ మధ్యలో అనేకమంది జ్ఞానార్థులు, శిష్యులు, సందర్శకులు, ఔత్సాహికులతో ఎన్నో విషయాలపైన నేను మాట్లాడాను. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. ఆ సంభాషణలలో నుండి ఇంకొక 360 టాపిక్స్ ను ఏర్చికూర్చి ఇప్పుడు గురుపూర్ణిమ సందర్భంగా ఈ పుస్తకం యొక్క  రెండవభాగంగా విడుదల చేస్తున్నాము. ఇదికూడా వెయ్యిపేజీల పుస్తకమే.

మొదటిభాగంలోలాగే ఇందులోకూడా, అన్నీ నిత్యజీవితంలో జరిగిన సంఘటనలనుండి, ఇతరులు అడిగిన ప్రశ్నలనుండి  తీసుకున్నవే. ఊహించి వ్రాసినది ఒక్కటికూడా లేదు. కనుక, మీ జీవితంలో జరుగుతున్న అనేకవిషయాలకు, మీకొస్తున్న అనేక ఆధ్యాత్మికసందేహాలకు ఈ  పుస్తకం అద్దాన్ని పడుతుంది. వాటికి స్పష్టములైన జవాబులనిస్తుంది.

ఒక్కవారంలో రాబోతున్న నా 63 వ పుట్టినరోజు సందర్భంగా దీని తెలుగు అనువాదం "వెలుగుదారులు-రెండవభాగం" గా విడుదల అవుతుంది. అనువాదం ఇప్పటికే పూర్తయింది. అదికూడా వెయ్యిపీజీలను దాటిపోయింది. దానిని ఒకే పుస్తకంగా ముద్రించడం కష్టం కనుక,  రెండుభాగాలుగా ముద్రించి, 'వెలుగుదారులు' - 3 మరియు 4 భాగాలుగా, డిసెంబర్లో జరుగబోయే హైదరాబాద్ పుస్తకప్రదర్శన నాటికి మీకు అందుబాటులోకి తెస్తాము.

అజ్ఞానంలో పడి, ఎవరేది చెబితే దాన్ని నిజమని నమ్ముతూ, నానారకాల గురువులతో, గుడులతో, దేవుళ్లతో, దీక్షలతో, మతవ్యాపారాలతో దిక్కుతెలియకుండా పోతున్న నేటి హిందువులకు జ్ఞానజ్యోతిని చూపిస్తూ, సరియైనదారిలో వారిని నడిపించేదిశగా మేము చేస్తున్న ఈ జ్ఞానయజ్ఞాన్ని సఫలం చేయమని, సమస్తసృష్టికీ పరమగురువైన పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ ఉద్గ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల "

27, జులై 2026, సోమవారం

రాములవారు

మొన్న ఒంగోలుకు వెళుతూ దారిలోని ఒక వెల్డింగ్ షాపుదగ్గర ఆగాను.

అక్కడ ఇనుపపైపులతో ఒక రధాన్ని తయారు చేస్తున్నారు. తయారు చేయిస్తున్నది మనకు తెలిసినవాళ్ళే.

అక్కడ నా పనిని ముగించుకుని ఒంగోలుకు బయలుదేరబోతుండగా, అడగకపోయినా రధం గురించి చెబుతూ ' మా ఊళ్లో రామాలయానికి, ఊరేగింపుకి' అన్నాడతను.

'అలాగా. బాగుంది' అన్నాను.

'ఒకసారి రాండి. మా రాములవారిని చూద్దురుగాని' అని ఆహ్వానించాడతను.

 'సరే వీలైనప్పుడు వస్తాలే' అన్నాను.

'అట్టా అనుకుంటే ఎప్పుడొచ్చేది? రేపు పౌర్ణమికి రధం ఊరేగింపు. భలే ఉంటుంది. రాండి' అన్నాడు.

'చిన్నప్పటినుంచీ చాలా చూశాను. ప్రస్తుతం ఆసక్తి లేదు' అన్నాను.

'పోనీ రాములవారిని చూడండి' అన్నాడు.

ఒక్కక్షణం అతనివైపు చూచి, 'చూస్తున్నాను' అన్నాను.

'ఎక్కడా?' అన్నాడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ.

'ఇక్కడ' అంటూ ఛాతీపైన చేయివేసుకున్నాను.

ఈసారి అయోమయంగా చూస్తున్నాడు.

'రాములవారు ఇక్కడే ఉన్నారు. ఆయన్ని చూట్టానికి గుడికెందుకు? అయినాసరే, మీరు మంచిగా పిలిచారు కదా. వీలైనప్పుడు తప్పకుండా వస్తాను మీ ఊరికి' అన్నాను.

అతనికర్ధమైంది. ఇంకేమీ అడగలేదు.

నా దారిన ఒంగోలుకు బయల్దేరాను.

read more " రాములవారు "

పేలపిండి

చాలామందిలో ఒక జబ్బును గమనిస్తున్నాను. 

ఆశ్రమంలో మేమేం చేస్తున్నాము? మా ఆదర్శాలేమిటి? మా గమ్యాలేమిటి? వాటిని అందుకోవడానికి మేమనుసరిస్తున్న మార్గమేమిటి? ఇవేవీ వారికి ఆవసరం లేదు. దానిబదులు, వాళ్ళిష్టప్రకారం గానూ, వాళ్ళు ఊహించుకున్నట్లుగానూ మేమున్నామా లేమా? అన్నదానిని మాత్రమే చూస్తున్నారు. 

నన్ను కలుస్తున్నవారిలో, మాట్లాడుతున్న వారిలో అందరూ ఇలాగే ఉన్నారు.

వాళ్ళెలా ఉన్నప్పటికీ,  యధాప్రకారం నాకు మాత్రం నవ్వూ, జాలీ, ఈ రెండే కలుగుతున్నాయి.

మొన్నొకరోజున ఒకాయనతో ఫోన్లో మాట్లాడుతున్నాను.

మాటలసందర్భంలో 'ఈరోజు తొలి ఏకాదశి' అన్నాడాయన.

నేనేమీ మాట్లాడలేదు.

'ఇవాళ విష్ణుదేవునికి పేలపిండి నైవేద్యం పెట్టాలి' అన్నాడు.

'అవునా !' అన్నాను.

'మీరు చేస్తున్నారా ఆశ్రమంలో?' అడిగాడు.

'మీరన్నది పేలపిండా లేక పేలాలపిండా?' అడిగాను.

అంత సున్నితంగా చెబితే ఈ జనానికెక్కడ అర్ధమౌతుంది?

'అదేలెండి. పేలాల పిండే. మా పల్లెటూళ్ళలో ఇలా కూడా అంటాము' అన్నాడు నవ్వుతూ.

నేనేమీ అనలేదు.

'ఏకాదశినాడు విష్ణుదేవునికి ఈ నైవేద్యం పెడిదే మంచిది' అన్నాడు మళ్ళీ.

యూట్యూబ్ యూనివర్సిటీలో బాగానే చదువుకుంటున్నాడు. ముచ్చటేసింది.

'విష్ణువు అనే పదానికి అర్ధమేమిటి?' అడిగాను.

'ఏముంది? విష్ణువే' అన్నాడు.

ఇంకేం మాట్లాడగలం?

నాకీమాత్రం కూడా తెలీనందుకు అతనికి నామీద చాలా జాలేసినట్టుంది.

'చెయ్యండి గురువుగారు. చేస్తే మంచిది' అన్నాడు మళ్ళీ.

'నాకు బట్టతలుంది. పేలు పడే అవకాశం లేదు.' అన్నాను.

పెద్దగా నవ్వి, 'అయితే ఏమైంది? నాకూ ఉంది, ప్రతి మొగాడికీ కొద్దో గొప్పో ఉంటుంది' అన్నాడు.

'పేలే లేనప్పుడు పేలపిండితో పనేముంది?' అన్నాను.

'అర్ధం కాలేదు' అన్నాడు నీరసంగా.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అని ఫోన్ పెట్టేశాను.

read more " పేలపిండి "

26, జులై 2026, ఆదివారం

తెలివిలేని సంత

మొన్న పనుండి ప్రక్కఊరికెళ్ళాను.

మైకులో సాయిబాబా భజన వినవచ్చింది.

కావలసిన వస్తువులు కొంటూ ఉండగా, తెలిసిన ఒకతను కనిపించి, 'సాయిబాబా సప్తాహం జరుగుతోంది. గుడికి రండి' అని పిలిచాడు.

'ఎందుకది?' అన్నాను.

' నాలుగురోజులలో గురుపౌర్ణిమ కదా ! అందుకని చేస్తున్నాం' అన్నాడు.

జాలికలిగింది.

'గురుపూర్ణిమ అయితే, సాయిబాబాకి భజనెందుకు? అసలు సాయిబాబాకి భజనేంటి? మీరు చేయడమేంటి?' అన్నాను.

ఈ పల్లెటూరి జనానికి ఏమి చెప్పినా ఎక్కదు.

'భజన బాగుంటుంది. వచ్చి చూడండి' అన్నాడు నా మాట వినిపించుకోకుండా.

'తెలివిలేని సంతలోకి తెలివితో ఉన్నవారెందుకు?' అని, నాకు కావలసిన వస్తువులను తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాను.

read more " తెలివిలేని సంత "

18, జులై 2026, శనివారం

O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2

"తెలియనంతవరకూ బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య" అన్నట్లు, లోతుపాతులు తెలియనంతవరకూ జ్యోతిషశాస్త్రం గందరగోళంగా ఉంటుంది. ఒకసారి దానిలో పట్టుచిక్కితే మాత్రం, ఆపైన నల్లేరుమీద నడకే అవుతుంది. అప్పుడు ఒక జాతకాన్ని గానీ, జీవితాన్ని గానీ చదవడం మంచినీళ్లు త్రాగినంత సులభమౌతుంది. 

నయ్యర్ జాతకంలో - సుఖస్థానమైన మకరంలో సన్యాసయోగముంది. అందులోనే నీచగురువున్నాడు. కనుక తీవ్రమైన గురుదోషం కూడా ఉంది. దానికి తోడుగా, వృశ్చికంలో విధ్వంసయోగముంది. కళలను, ప్రేమలను, భావుకతను, సృజనాత్మకతను సూచించే శుక్రుడు బుద్ధిస్థానంలో శనిక్షేత్రంలో ఉన్నాడు. శనిదృష్టి సన్యాసయోగంపైన ఉంది. కుజదృష్టి శుక్రునిపైన ఉన్నది. ధనుస్సుకు, మకరానికి అర్గళం పట్టింది. రాహువు ఏకాకిగ్రహమయ్యాడు. 

అయిపోయింది. మొత్తం జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి ఇవి చాలు. ఒక మనిషిని అర్ధం చేసుకోవడానికి, అయిదునిముషాలు సరిపోయినట్లే, ఒక జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా అయిదే నిముషాలు చాలు. 

ఈయన జీవితాన్ని మొత్తాన్నీ శాసించినవి ఈ గ్రహస్థితులే.

అయితే, రాశిచక్రాన్ని ఒక్కదాన్ని చూచి, మనకంతా అర్థమైందని అనుకోకూడదు. నవాంశను, ఇతర వర్గచక్రాలను సరిదిద్దాలి. షష్ట్యంశ వరకూ సరిచేయాలి. అప్పుడు మాత్రమే ఆ జాతకం సరియైనదౌతుంది. లేదంటే తప్పుదారి పట్టిస్తుంది. ఇదంతా చేయాలంటే, జననకాలసంస్కరణ ఎలా చేయాలో  తెలియాలి. దానికి స్ఫురణశక్తి (ఇంట్యూషన్) ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడే ఒక జాతకాన్ని స్పష్టంగా చదవగలుగుతాము. అప్పుడే కర్మరహస్యాలు అర్ధమౌతాయి. జన్మజన్మాంతరాలలో ఆ జీవి యొక్క నడకా అర్ధమౌతుంది.

థియరీని పక్కనపెట్టి, జాతకంలోకొద్దాం.

నయ్యర్ జననసమయం ఎక్కడా దొరకడంలేదు. కొందరు వృషభలగ్నమని, కొందరు తులాలగ్నమని అంటున్నారు. ఇంకొందరేమో ఏకంగా, జననసంవత్సరం 1926 కాదు, 1927 అంటున్నారు. ఉదయం 2 గంటలని కొన్నిచోట్ల ఉన్నది. కానీ ఏదీ ఖచ్చితంగా లేదు.

ఈ గందరగోళాన్నంతా సరిదిద్ది, ఈయన జననసమయాన్ని నేను సంస్కరించాను. అంటే, రెక్టిఫై చేశాను. అది 16-1-1926 ఉదయం గం. 1.23 అయింది. ఎలాచేశానో అడక్కండి. చెప్పను. ఆ సమయానికి షష్ట్యంశచక్రం ఇలా ఉంది.

రాశిలో నీచస్థితిలో ఉన్న గురువు, ఇక్కడ ఉచ్ఛస్థితిలోకి పోయాడు. కానీ, నీచకేతుశుక్రుల అర్గళంలో చిక్కుకున్నాడు. ఇదే అర్గళం శనిచంద్రులకు కూడా వర్తిస్తుంది. నీచకేతువును రవిగురుల అర్గళం బంధించింది. రాహుకేతువులు నీచస్థితులలో ఉన్నారు. శనిచంద్రయోగం ఉన్నది. నీచబుధ, కుజయోగం ఉన్నది. సూర్యుడు బలంగా ఉన్నాడు. శుక్రుడు లగ్నంలోకి వచ్చాడు. ఇప్పుడు, రాశిచక్రంతో షష్ట్యంశను అన్వయించుకుంటే, ఈయన జాతకం అద్దంలో చూచినంత స్పష్టంగా ఉన్నది.

సింహావలోకనం

శనికుజులవల్ల నోటిదురుసూ, కోపం, స్నేహితుల నుంచి మోసపోవడం, పైల్స్ మొదలైన రోగాలు కనిపిస్తాయి. శుక్రునివల్ల ప్రేమవ్యవహారాలు, కళాతృష్ణ, గొప్పదైన టాలెంట్,  సినిమారంగంలో పేరు, సృజనాత్మకత వస్తాయి. సన్యాసయోగంవల్ల వృత్తికి, కుటుంబానికి దూరంకావడం, ఒంటరిగా జీవించడం, అలాగే మరణించడం మొదలైనవి కలుగుతాయి. బుధునివల్ల వాయిద్యాలతో నేర్పరితనం, రాగాలను పాటలను సృష్టించడం వస్తుంది. అయితే, ఈయన దుర్మార్గుడు కాదని, సంసారం దెబ్బతింటుందని, తప్పులను చేశానని గ్రహించి, వాటిని దిద్దుకునే క్రమంలో ఒంటరిజీవితాన్ని గడిపి, అనామకంగా కన్నుమూస్తాడని షష్ట్యంశచక్రం చూపిస్తోంది.

జననకాలదశ
 
నా విధానంలో జననకాలదశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమంటే, అది జీవితం మొత్తాన్నీ ఒక ముద్దలో పెట్టి చూపిస్తుంది. జననకాలదశ అయిన కుజ రాహు రాహు గురు శుక్రదశ - దూకుడు ప్రవర్తన, స్నేహితులతో మోసపోవడం, అక్రమసంబంధాలు, సినిమాజీవితం, గురుదోషం వల్ల చిన్నాభిన్నమై జీవితం, కళారంగంలో పేరుప్రఖ్యాతులను స్పష్టంగా చూపిస్తోంది.

కుజదశ

ధనిష్టానక్షత్రం ఒకటోపాదం కాబట్టి, జననసమయానికి 6 ఏళ్ల 6 నెలల 26 రోజుల కుజమహర్దశ మిగిలి ఉన్నది. ఆరేళ్లతర్వాత 18 ఏళ్ల రాహుమహాదశ నడిచింది. దానికి తగినట్లుగానే, ఈయనకు చదువుపైన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దానిబదులు సంగీతమూ, సౌందర్యపోషణా ఈయన మనసును ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఆయనే బాహాటంగా చెప్పాడు.

"Woman, I am of woman, by woman, for woman. Women are my inspiration.' అని  తన తర్వాతి జీవితంలో ఆయన చాలాసార్లు అంటూ ఉండేవాడు.

వీరిది సంగీతకుటుంబం కాదు. తండ్రి, మెడికల్ స్టోర్స్ లో సూపర్నెంటుగా పనిచేసేవాడు. నయ్యర్ మాత్రం చిన్నప్పటినుంచే సంగీతమంటే చెవికోసుకునేవాడు. దానికి కారణం, గర్భవతిగా ఉన్న సమయంలో ఈయన తల్లిగారు, హార్మనీ ముందేసుకుని స్వరాలను అభ్యాసం చేస్తూ ఉండటం కావచ్చు. అంతకంటే వేరే కారణమేదీ కనిపించదు.

ఈయనపైన ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య ఉన్నారు.  అక్కయ్య తప్ప మిగిలిన అన్నలందరూ, డాక్టర్లే. వారిలో ఒకన్నయ్య హైద్రాబాద్ లోనే మిలిటరీ డాక్టర్ గా ఉండేవాడు. సంగీతరంగంలో అడుగుపెట్టినప్పటికీ, చివరకు ఈయనకూడా హోమియోపతి డాక్టరే అయ్యాడు. ఇది, కుటుంబంలో ఎప్పటినుండో ఉన్న మెడికల్ జీన్స్ ను చూపిస్తోంది. ఇదెలా వచ్చిందో చూడటం మన సబ్జెక్టు కాదు కాబట్టి దానిని వివరించడం లేదు.

రాహుదశ

ఏడేళ్లవయసులో రాహుదశ మొదలైంది. నయ్యర్ సంగీతాన్ని నేర్చుకోవడం తండ్రికి ఇష్టముండేది కాదు. ఆ రంగం అంత మంచిది కాదని, అప్పట్లో అనుకునే చాలామంది సాంప్రదాయకుటుంబాలలాగే ఆయనకూడా అనుకుని, 'సంగీతం నేర్చుకుని ఏం చేస్తావ్? రోడ్లమీద పాటలు పాడుతూ అడుక్కుతింటావా?' అంటూ నయ్యర్ ను తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. కానీ నయ్యర్ మనసంతా సంగీతం పైనే  ఉండేది. తండ్రిమాటను వినలేదు. కానీ చివరకు తండ్రిమాటే చాలావరకూ నిజమైంది. జీవితం ఆఖరిలో ఇతరులపైననే ఆధారపడి అనామకంగా జీవించి, చనిపోయాడు.

అయితే సంగీతాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. సొంతంగా రహస్యంగా అభ్యాసం చేసి పియానో, ధోలక్, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. ఇలా దేనినైనా సొంతంగా నేర్చుకునే ప్రజ్ఞ ఆయనలో ఉండేది. దీని సాయంతోనే, పెద్దయ్యాక, హోమియోపతిని, జ్యోతిషాన్ని కూడా స్వయం-అధ్యయనంతో నేర్చుకున్నాడు. దీనికి కారణం దశమంలోని రాహువు. ఇలాంటి జాతకులు సంప్రదాయానికి భిన్నంగా నడుస్తారు. ఒకవిధమైన మొండిగా, విప్లవాత్మకంగా ఉంటారు. నయ్యర్ కూడా అలాగే తయారయ్యాడు.

చిన్నవయసులోనే లాహోర్ ఆల్ ఇండియా రేడియోలో సింగర్ గా పనిచేస్తున్న సమయంలో, సరోజ్ అరోరా అనే డాన్సర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె రచయిత్రి కూడా. ఈమె వ్రాసిన 'ప్రీతమ్ ఆన్ మిలో' అనే పాటను 19 ఏళ్ల నయ్యర్ స్వరపరచగా, Ch. Atma పాడాడు. ప్రయివేట్ ఆల్బమ్ అయినప్పటికీ, ఈ పాట పాన్ ఇండియా హిట్ అయింది. ఈ సంఘటన 1945 లో జరిగింది. అప్పుడు నయ్యర్ కు  రాహు-శుక్రదశ నడుస్తున్నది. వయసు 19 ఏళ్ళు. ఈ దశ ఏం చేస్తుందో జ్యోతిషవిద్యార్థులకు తెలిసినదే కదా !  ఈయనకు సరోజ్ అరోరాకు ప్రేమ మొదలైంది.

ఈలోపల 1947 లో దేశం మూడుముక్కలైంది. అప్పుడీయనకు రాహు-చంద్ర-రాహు గ్రహణదశ నడిచింది. వీరి కుటుంబం ఇండియాలోని అమృత్ సర్ కు మారింది. పాటియాలాలో ఉంటూ, ఒక స్కూల్లో మ్యూజిక్  టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు. 

19-5-1951 తేదీన, నయ్యర్, సరోజ్ అరోరాల పెళ్లిజరిగింది. అప్పటికి నయ్యర్ కు 25 ఏళ్ళు. సరోజ్ కు కూడా అటూఇటుగా అంతే ఉండవచ్చు. అయితే, నయ్యర్ చాలా ముక్కుసూటి మనిషి. 'నేను పక్కా స్త్రీలోలుడిని. నా జీవితంలో, అనేకమంది స్త్రీలతో నేను సంబంధాలను పెట్టుకోవచ్చు. ముందే చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం' అని పెళ్ళికి ముందే సరోజ్ తో  ఖండితంగా చెప్పేశాడు. 

దానికి ఒప్పుకున్న సరోజ్ 'సరే నీ ఇష్టం. కానీ ఇంకో పెళ్ళిమాత్రం చేసుకోకు' అని షరతు పెట్టింది. దానికి నయ్యర్ ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందాలతో వీరి పెళ్లి జరిగింది. అప్పట్లోనే ఇంత విశాలదృక్పథాలతో కూడిన పెళ్లిళ్లు జరిగేవన్నమాట !

ఆనాడు నయ్యర్ జాతకంలో గురు గురు చంద్ర రాహు శుక్రదశ నడుస్తోంది. ఇందులో వ్యామోహమే ఎక్కువగా కనిపిస్తోంది. గజకేసరీయోగాన్ని కాస్తా గురువుయొక్క నీచత్వం మ్రింగేసింది. దానికింకొక కారణం గోచారశని. ఈయన కన్యలో ఉంటూ వక్రించి సింహంలోకి వస్తున్నాడు.  అంటే,అష్టమశని దశ జరుగుతోంది. అందుకే ఈ పెళ్లి చివరకు పెటాకులై పోయింది.

గురుమహర్దశ

గురుదశ నవంబర్ 1949 లో మొదలైంది. ఇది ఈయన జీవితాన్ని అనేక మలుపులు త్రిప్పింది. గురుదశలోనే గురుదత్ తో పరిచయం ఏర్పడింది. తను తీసిన సినిమాలన్నింటిలో నయ్యర్ కు ఛాన్సిచ్చాడు గురుదత్. అంతేగాక, నయ్యర్ కూడా గీతాదత్ చేత  తన పాటలన్నింటినీ పాడించేవాడు. 

1949 లోనే  బాంబేకు మకాం మార్చి 'కనీజ్' అనే సినిమాకు నేపధ్యసంగీతాన్ని అందించాడు. 1952 లో 'ఆస్మాన్' అనే సినిమాకు మొదటిసారి సంగీతదర్శకత్వాన్ని వహించాడు.

కెరీర్ ప్రారంభ దశ

ఈయన కెరీర్ లో 1949-52 మధ్య సమయాన్ని ప్రారంభదశగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో గురు-గురు, గురు-శని దశలు నడిచాయి. గోచారగురువు మకరం నీచస్థితినుండి వృషభం వరకూ సంచరించాడు. గోచారశని సింహ, కన్యలలో సంచరించాడు. అది అర్ధాష్టమశని దశ. కనుక మొదటి మూడుసినిమాలు సంగీతపరంగా అంత బాగా ఆడలేదు.

గీతాదత్ దశ

1953-56 మధ్యదశను గీతాదత్ దశగా చెప్పుకోవచ్చు.

1954 లో తన 'ఆర్ పార్' సినిమాకు గురుదత్ ఈయనను సంగీతదర్శకుడిగా ఎన్నుకున్నాడు. ఆ సమయంలో గోచారశని దశమంలో ఉచ్ఛస్థితికి వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్  అయింది. 

దానితర్వాత 1955, 56 లలో వరుసగా గురుదత్ తీసిన మిస్టర్ అండ్ మిసెస్ - 55, సిఐడీ సినిమాలు ఘనవిజయాలను సాధించాయి. గోచారశని దశమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకే అలా జరిగింది.

అయితే, గోచారశని వృశ్చికంలోకి మారి, జననకాల శనికుజులపైకి రాగానే,  ఈయన జీవితాన్ని ధ్వంసం చేసిన ఆశాభోంస్లే పరిచయం అయింది. ఆ సమయంలో ఈయనకు గురు-బుధదశ మొదలైంది. బుధుడు నవమాధిపతి, చంద్రలగ్నాత్ కూడా 6-9 ఆధిపత్యం ఉన్నది. కనుక బలమైన గతకర్మానుసారంగా, ఈ పరిచయం ప్రేమగా మారింది.

ఆమెను తన టీమ్ లోకి తీసుకున్నాడు. అప్పటివరకూ అక్క లతా నీడలో దాగి, క్లబ్బు పాటలను పాడుకుంటున్న ఆమెను ఒక ముఖ్యగాయనిగా తీర్చిదిద్దాడు. అప్పటివరకూ తన పాటలను పాడుతున్న షంషాద్ బేగం, గీతాదత్ లను పక్కనపెట్టి ఈమెకు ఛాన్సులివ్వడం మొదలుపెట్టాడు. ఇది తన జీవితంలో చేసిన పొరపాట్లలో ఒకటని తర్వాతి కాలంలో ఒప్పుకున్నాడు.

ఆశాభోంస్లే దశ

1957-68 ను ఆశాభోంస్లే దశగా చెప్పుకోవచ్చు.  ఈ సమయంలో 20 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. వాటిల్లో అన్నీ హిట్ పాటలే. 

1957 లో బీ.ఆర్.చోప్రా తీసిన  'నయా దౌర్' తో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫెర్ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. వృశ్చికశని వక్రించి తులాశని ఫలితాన్నిచ్చాడు.

1958 లో వీరిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. పంచమశుక్రుడు మళ్ళీ ప్రేమలో పడవేశాడు. అప్పుడు మొదలైన వీరి ప్రేమాయణం 14 ఏళ్లపాటు సాగి, 1972 లో ముగిసింది. 

Ek Musafir Ek Hasina (1962), Phir Wohi Dil Laya Hoon (1963), Kashmir Ki Kali (1964) ల  వరుసవిజయాలతో ప్రసిద్ధ రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. ఆ సమయంలో రాహుకేతువులు మిధున-ధనుస్సులలో ఉచ్ఛస్థితులలో ఉన్నారు.

అక్టోబర్ 1964 లో గురుదత్ అర్ధాంతరంగా చనిపోవడం నయ్యర్ ను దెబ్బకొట్టింది. అది గురు-రాహు దశ. దీనిని ఛిద్రదశ అంటారు. ఇది  జీవితాలను చిదిమేస్తుంది. గురుదత్ మరణంతో నయ్యర్ కు కష్టకాలం మొదలైంది. ఆ సమయంలో నయ్యర్ కు ఏలినాటిశని రెండవపాదం నడుస్తోంది. శని కుంభంలో వక్రించి  ఉన్నాడు. గురువు వృషభంలో వక్రించాడు. కనుక, అదృష్టం వక్రించింది.

శనిమహర్దశ

1965 లో మొదలైన శనిదశతో ఈయనకు అవకాశాలు సన్నగిల్లడం మొదలైంది. దానికి కారణాలు అనేకం.  జ్యోతిషకారణం మాత్రం, శని బాధకస్థానంలో, శత్రువైన కుజునితో కలసి ఉండటం. అది దుర్ఘటనాయోగం కావడం.

ఈయనకు PR చేతకాదు. తనదగ్గరకు వచ్చిన నిర్మాతలకు మాత్రం మ్యూజిక్ చేసిపెట్టేవాడు. కానీ, పరిచయాలు పెంచుకొని, స్నేహాలు కలుపుకొని, పార్టీలిచ్చి, ఛాన్సులను సంపాదించడం ఈయనకు రాదు. పైగా, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. దానికితోడు అతి డిసిప్లిన్ ఈయనతో ఉండేది. 

ఒక రికార్డింగ్ కు రెండుసార్లు పిలిచినా లతామంగేష్కర్ రాలేదని, ఆమెతో ఎప్పటికీ పనిచెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. ఆమేమో, హీరోయిన్లకు తప్ప వేరే పాత్రలకు తను పాడనంటుంది. క్రమేణా ఆమెకూడా ఈయనపైన పగబట్టి, తన చేతిలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన అనిల్ బిశ్వాస్ ద్వారా పావులు కదిపి ఈయనకు అవకాశాలు రాకుండా చేసింది. 

సమయపాలన లేకపోతే ఎంతటివాడినైనా అందరిముందూ తిట్టేసేవాడు. రఫీ, ఆశాల డ్యూయెట్స్ ను ప్రోత్సహించి, రఫీని బాగా సపోర్ట్ చేసింది ఈయనే. అలాంటిది, ఒకరోజున శంకర్ జైకిషన్ రికార్డింగ్ లో లేటై, తన రికార్డింగ్ కు ఆలస్యంగా వచ్ఛాడని మహమ్మద్ రఫీని తిట్టి పంపేసి, రెండేళ్లపాటు పాటలివ్వకుండా బహిష్కరించాడు. 

ప్రముఖ వేణువిద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాను కూడా ఇదే కారణంతో వెనక్కు పంపించేశాడు.

తలత్ మహమూద్ మంచి గాయకుడు. కానీ, మన పీబీ శ్రీనివాస్ లాగా, ఆయనది సాఫ్ట్ మేల్ వాయిస్. గొంతును కొంచెం బొంగురుగా చేసుకోవడానికి అప్పట్లో కొంతమంది గాయకులు సిగరెట్ త్రాగేవారు. రికార్డింగ్ గ్యాప్ లో తలత్ మెహమూద్ సిగిరెట్ త్రాగుతుండటం నయ్యర్ చూచాడు. కోపంతో అతన్ని తిట్టి పంపించేశాడు. ఆ తర్వాత అతనికి  ఛాన్సులివ్వలేదు.

ఈ విధంగా, ఆర్టిస్టుల దగ్గర క్రమశిక్షణ లేకపోతే ఊరుకునేవాడు కాదు. ఆత్మాభిమానం, కోపాలు ఎక్కువ. పట్టూవిడుపూ లేకపోతే సినిమారంగంలో నెగ్గడం కష్టం. ముఖంమీద ఉమ్మేసినా తుడుచుకొని పోయేవారికే అక్కడ రాణింపు  ఉంటుంది. అది ఈయనకు చేతకాదు.

ఇలాఉండగా, ఈయన మార్కు సంగీతం క్రమేణా పాతబడిపోయింది. వెస్ట్రన్ బీట్స్ కలిసిన మ్యూజిక్ పాపులర్ అయింది. ఆర్దీ బర్మన్ వంటి క్రొత్తతరం ముందుకొచ్చింది.

ఈయన ఆశాభోంస్లే ను అమితంగా ప్రేమించాడు. కానీ ఆశా, తన అవకాశాలను, కెరీర్ ను మాత్రమే ప్రేమించింది. నయ్యర్ కు క్రమేణా ఛాన్సులు తగ్గాయి. పైగా ఈయన బాగా పొసెసివ్ గా ఉండేవాడు. ఆశా ఏ పాటను పాడాలో ఏదివద్దో ఈయనే నిర్ణయించేవాడు. ఏ సినిమా ఒప్పుకోవాలో ఏది వద్దో తనే చెప్పేవాడు. ఇదంతా అనవసరమైన నసగా ఆశాకు అనిపించింది. నయ్యర్  తన కెరీర్ కు అడ్డుగా మారాడని ఆశా భావించింది. ప్రతిదానికీ గొడవలు మొదలయ్యాయి. క్రమేణా ఈయనకు దూరమై, ఆర్దీబర్మన్ కు దగ్గరైంది. 

ఒకరోజున ఏదో చిన్నతప్పు చేసిందని, ఆశా కూతురు వర్షాభోంస్లేను అరిచి, చెయ్యెత్తి కొట్టబోయాడు. దానికి ఆశా అడ్డొచ్చింది. ఇద్దరికీ గొడవైంది. కోపంతో ఆమెను వదలి బయటకు వచ్చేశాడు.

ఆ విధంగా 5-8-1972 న ఆశాభోంస్లే తో విడిపోయాడు. అప్పటికి ఆమెతో 324 పాటలను పాడించాడు. కానీ ఆశా ఈయనను వదిలేసి ముందుకెళ్ళిపోయింది. ఈయన ఒక పిచ్చివాడిలాగా మిగిలిపోయాడు.

ఆ సమయంలో, ఈయన జాతకంలో శని-శుక్ర-రవి దశ నడిచింది. రవికేతువులు గ్రహయుద్ధంలో ఒకే డిగ్రీమీదున్నారు. పదకొండో అధిపతిగా రవి, పేరు ప్రఖ్యాతులున్న ఆశాను సూచిస్తున్నాడు. కనుక ఆ సమయంలో వీరిద్దరికీ గొడవై, విడిపోయారు. తిరిగి జీవితంలో కలుసుకోలేదు.

1972-79 కష్టాలు మొదలు

ఆశాతో విడిపోయాక, నయ్యర్ కెరీర్ బాగా తగ్గడం మొదలైంది. లతాతో పాటలు చెయ్యడానికి ఒప్పుకోడు. రఫీని దూరం పెట్టాడు. అందరితో సత్సంబంధాలు లేవు. PR లేదు. ఇక ఛాన్సులెలా వస్తాయి?

చివరకొకనాడు, తగ్గి, తనే రఫీ ఇంటికి వెళ్లి మాట్లాడాడు. రఫీ మెత్తబడ్డాడు. మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారు. కానీ ఆశా దూరమైంది. ఆమె స్థానంలో వాణీజయరాం, దిల్రాజ్ కౌర్, కృష్ణా కల్లే, పుష్పా పగ్దరే, కవితాకృష్ణమూర్తి మొదలైన అప్పుడప్పుడే పైకొస్తున్న సింగర్స్ కు ఛాన్సులిచ్చి, వారిచేత పాడించాడు. కానీ వారెవరూ, ఆశా భోంస్లే మ్యాజిక్ ముందు తూగలేకపోయారు.

రఫీ మాత్రం నయ్యర్ ను బాగా సపోర్ట్ చేశాడు. కానీ మారిన సంగీతపు ట్రెండ్ లో, నయ్యర్ సంగీతం జనానికి నచ్చడం తగ్గింది. 1979 కల్లా ఛాన్సులు బాగా తగ్గిపోయాయి.

మాధురీ జోగ్లేకర్ దశ

అది శని - చంద్రదశ. 1976-77 ప్రాంతాలలో మాధురీ జోగ్లేకర్ అనే మరొక సింగర్ ఈయనకు పరిచయమైంది. ఈ దశను బట్టి వీరిది అందరూ అనుకునేటట్లుగా శృంగారసంబంధం కాదని అనిపిస్తుంది. శృంగారం కంటే ఎక్కువగా, అభిరుచులు, భావుకత, ఫిలాసఫీ మొదలైన హృదయసంబంధమైన విషయాలలో వీరికి శృతి కలిసి ఉండాలి.  ఇదే నిజమని తన తర్వాతి ఇంటర్వ్యూలలో మాధురీ చెప్పింది.

మొదట్లో, ఈయన మ్యూజిక్ ట్రూపులో కోరస్ సింగర్ గా ఈమె చేరింది.  అప్పటికే ఆమె మ్యూజిక్ లో MA చేసి ఉన్నది. ఈమెలో టాలెంట్ ను చూచిన నయ్యర్ ఈమెను దగ్గరకు తీశాడు. చర్చ్ గేట్ ఏరియాలో ఉన్న నయ్యర్ ఇంటికి ఈమె రోజూ వస్తూ ఉండేది. అప్పటికే నయ్యర్ హోమియోపతి, జ్యోతిష్యాలను బాగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వాటిలో కూడా ఈమె సాయం చేస్తూ ఉండేది. చాలావరకు ఈయనకు సెక్రటరీగా పనిచేసేది. ఈయనకూడా 1976 నుంచే, బాంబే శివార్లలో వీరార్లో ఉన్న ఈమె ఇంటిలోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు.

1974 లో (అంటే 22 ఏళ్ల వయసులోనే) ఈమె UPSC పరీక్షను క్లియర్ చేసి FCI లో ఆఫీసర్ గా చేరింది. అయినా సరే, సంగీతంపైన ఉన్న మక్కువతో, ఒకవైపు ఉద్యోగం చేస్తూ కూడా, నయ్యర్ కు సాయపడుతూ ఉండేది. క్రమేణా వీరిమధ్య రొమాంటిక్ సంబంధం ఏర్పడింది. ఈమె నయ్యర్ కంటే 26 ఏళ్ళు చిన్నది. అప్పటికి నయ్యర్ కు 50 ఏళ్ళు, ఈమెకు 24 ఏళ్ళు.

అప్పటివరకూ నయ్యర్ ప్రేమాయణాలను ఓపికగా భరిస్తూ వచ్చిన భార్యాపిల్లలు దీనికి అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు. నయ్యర్ పిల్లలుకూడా పాతికేళ్ళవయసులోకి వచ్చారు. ఎన్నాళ్ళని ఈయన వేషాలను భరిస్తారు? వాళ్ళనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేసరికి నయ్యర్ కోపం తెచ్చుకున్నాడు. ఒకవైపు ఛాన్సులు తగ్గిపోయాయి. ఇంకోవైపు తను అమితంగా ప్రేమించిన సంగీతరంగం వెక్కిరిస్తోంది. ఆశా ఇచ్చిన షాకు చాలా గట్టిగా తగిలింది. ఇప్పుడు కుటుంబసభ్యులు ఎదిరించేసరికి తట్టుకోలేక, వారిని ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మని గద్దించాడు. గట్టిగా నిలబడిన వాళ్ళు, ఆస్తిలో వాటాకోసం కోర్టులో కేసువేశారు. తెగేవరకూ లాగవద్దని, కోర్టుబయట ఒప్పందమే మంచిదని లీగల్ నిపుణులు ఈయనకు సలహా ఇచ్చారు. ఇంటిని, ఆస్తిని వారికి రాసేసి, నయ్యర్ కట్టుబట్టలతో ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఇదంతా 1979 లో జరిగింది.

తనవైపునుండి తాను కరెక్ట్ కావచ్చు. కానీ ఎదుటివారినుండి, అందులోనూ కుటుంబసభ్యులనుండి కూడా ఆలోచించాలి. భౌతికసంబంధాలు లేకుండా, గాలికి ఎగిరిపోతూ, భావప్రపంచాల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉండే ఇటువంటి కళాత్మకమనస్తత్వాలు, జీవితవిధానాలు ఉన్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోకూడదు.

'నేనింతే' అని పెళ్ళికి ముందే చెప్పాడు కాబట్టి నయ్యర్ కరెక్టే అనడమే అసలు కరెక్ట్ కాదు. 'నేనింతే, నేను పెళ్ళికి పనికిరాను. మన పెళ్లి ఒద్దు. నాతో నువ్వు సుఖపడలేవు. నువ్వేకాదు, నాతో ఎవ్వరూ సుఖపడలేరు. నా దారి వేరు.' అని చెప్పాలి. అలా చెప్పకపోవడం నయ్యర్ చేసిన తప్పు. నయ్యర్ చెప్పినప్పటికీ సరోజ్ ఒప్పుకోవడం ఆమె తప్పు. వెరసి ఇద్దరిఖర్మా అలా ఉంది. పాపం, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? 

ఆ విధంగా, 1979 లో కుటుంబంతో విడిపోయి  విలాసవంతమైన తన చర్చ్ గేట్ ఇల్లును వదిలిపెట్టాడు. ఆ సమయంలో శని-రాహుదశ నడిచింది. ఇది శపితదశ అని గతంలో ఎన్నో జాతకాలలో నిరూపించాను. ఈ దశ ఏం చేస్తుందో కూడా వందలాది జాతకాలలో వివరించాను. ఈయన్ని కూడా ఈ దశ చావుదెబ్బ కొట్టింది.

ఇంటినుండి బయటకు వచ్చి, కుటుంబంతో తెగతెంపులు చేసుకుని, బాంబే శివార్లలో ఉన్న వీరార్ లో మాధురీతో కలసి ఆమె ఇంటిలో ఉండటం మొదలుపెట్టాడు. వీరి సహజీవనం 1976 నుండి 1996 వరకూ 20  ఏళ్లపాటు సాగింది. అయినా సరే, మధ్యమధ్యలో అప్పుడపుడు కొన్ని సినిమాలకు సంగీతాన్నిస్తూ ఉండేవాడు.

(ఇంకా ఉంది)

read more " O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2 "

15, జులై 2026, బుధవారం

O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1

పాతతరం హిందీ మధురగీతాలను ఇష్టపడేవారిలో ఓపీ నయ్యర్ పేరును తెలియనివారు ఉండరు. ఈయన అభిమానులందరూ తమను తాము OPiums అని పిలుచుకుంటారు.

ఈయన పూర్తిపేరు ఓంకార్ ప్రసాద్ నయ్యర్.  ఈయనపుట్టి ఇప్పటికి నూరేళ్లు దాటింది. అయినా సరే, నేటికీ ఈయన స్వరపరచిన పాటలను ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు.  

ఈయన తెలుగులో కూడా 'నీరాజనం' అని ఒక సినిమాను చేశారు. అది 1989 లో విడుదలైంది. అందులోని పాటలు కూడా ఆపాతమధురాలే. ఈయన ట్యూన్స్ ను తెలుగులోకి కూడా కాపీ కొట్టారు. ఉదాహరణకు "ఒ లేకే పెహలా పెహలా ప్యార్"  అనే పాటరాగాన్ని తెలుగులో "ఓహో బస్తీ దొరసానీ" అనే పాటకు తీసుకున్నారు.

అయితే, పాతతరం హిందీసినిమా దర్శకులలో అత్యధిక మొత్తాన్ని ఫీజుగా తీసుకున్న ఈయన, తన జీవితం రెండవభాగంలో సంగీతంవైపూ, సినీఫీల్డ్ వైపూ తిరిగి చూడకుండా, వాటిని పూర్తిగా వదిలేసి, ఒక హోమియోపతి వైద్యునిగా, ఒక జ్యోతిష్కునిగా మంచిప్రజ్ఞను సంపాదించి, పదేళ్లపైగా బాంబే స్లం ఏరియాలలోని పేదవారికి నిస్వార్థమైన సేవలందించి, చివరకు తన కుటుంబానికి దూరంగా, ఒంటరిగా కన్నుమూశాడు.

తన కుటుంబసభ్యులు కానీ, సినిమాజీవులుకానీ, విలేఖరులుగానీ, టీవీ జనాలు గానీ,  ఎవరూ తన అంత్యక్రియలకు రాకూడదని, కనీసం తన శవాన్ని తాకడానికి కూడా వీల్లేదని విల్లు వ్రాసిపెట్టి మరీ కన్నుమూశాడు. తన అంత్యక్రియలు కూడా అతినిరాడంబరంగా జరగాలని, ఆ తరువాత సంస్మరణసభలు పెట్టకూడదని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు.

ఈయన సంగీతాన్ని నేర్చుకోలేదు. కానీ సంగీతదర్శకుడయ్యాడు. నూరేళ్ళతర్వాత కూడా ప్రపంచం మరచిపోలేని స్వరాలందించాడు. కేవలం 19 ఏళ్ల వయసులో "ప్రీతమ్ ఆన్ మిలో" అనే  సూపర్ హిట్ పాటను స్వరపరచాడు. దీనిని ఈయన స్నేహితుడైన Ch. ఆత్మా పాడాడు. 80 ఏళ్ల తర్వాత ఈనాటికి కూడా ఈ పాట ఆపాతమధురమే.

ఈయన వైద్యశాస్త్రాన్ని చదవలేదు. కానీ, ముంబాయికి చెందిన ప్రముఖ హోమియోవైద్యుడు డా. ఎస్సార్ పాఠక్ దగ్గర హోమియోపతిని నేర్చుకుని, వైద్యుడయ్యాడు. వేలాదిమంది పేదరోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేశాడు. ముంబాయ్, కలకత్తా, హైదరాబాద్ లలో ఉచితహోమియో క్లినిక్స్ నడిపాడు. అలా పేదవారికి సేవను చేయడంలో ఆనందాన్ని పొందాడు. 

జ్యోతిషాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. కానీ, సొంతంగా దానిని నేర్చుకుని దానిలో మంచిప్రజ్ఞను సంపాదించాడు. ఎంతోమంది సినీ ప్రముఖులకు, ఇతరులకు జోస్యాన్ని కరెక్ట్ గా చెప్పాడు. తను పుట్టిననెలలోనే మధుబాల చనిపోతుందని చెప్పాడు. ఆమె అలాగే చనిపోయింది. చివరకు తన మరణాన్ని కూడా తనే కరెక్టుగా జోస్యం చెప్పుకున్నాడు. అదేవిధంగా చనిపోయాడు. 

ఎన్ని చేసినా తన 81 ఏళ్ల సుదీర్ఘజీవితంలో ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. జీవితపు ప్రతిమలుపులోనూ తలెత్తుకునే బ్రతికాడు. అత్యంతవిలాసాలనూ, సాధారణజీవితాన్నీ రెండింటినీ చూశాడు. చివరలో ఒక ఋషిలా బ్రతికి, ఒక అనామకుడుగా చనిపోయాడు.

ఈయనలో ఒక కళాతపస్వి, ఒక ప్రేమపిపాసి, ఒక భావుకుడు, ఒక తాత్వికుడు, ఒక క్రమశిక్షణను కలిగిన రూల్ మాస్టర్, ఒక మొండివాడు, ఒక నోటిదురుసు మనిషి, ఒక నిస్వార్ధహృదయుడు, ఒక నిరాడంబరజీవి  అందరూ కలిసి ఉన్నారు.

ఈయన 16-1-1926 న లాహోర్ లో ఒక బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. 2007 లో 81 ఏళ్లవయసులో గుండెపోటుతో థానేలో  చనిపోయాడు. 1957 లోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. అప్పట్లోనే బాంబే మొత్తమ్మీద 'కాడిలాక్' కార్లున్న ఇద్దరిలో ఈయనొకడు. కానీ విలాసవంతమైన అటువంటి జీవితాన్ని వదిలిపెట్టి బాంబే స్లంలో ఒక చిన్నగదిలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంతో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడు.చివరకు అక్కడే కన్నుమూశాడు.

తన కెరీర్ మొత్తంలో 500 పైన పాటలను సృష్టించినా, లతామంగేష్కర్ తో ఒక్కపాటను కూడా పాడించలేదు. వాళ్లిద్దరి మధ్యా గొడవలుండేవి. కానీ 1950-60 మధ్యలో హిందీసినిమా సంగీతాన్ని ఏలాడు. 'రిథమ్ కింగ్' అనే బిరుదును సంపాదించాడు. 

1990 లో తనకు డబ్బు ఇబ్బందులున్న రోజులలో కూడా, లతామంగేష్కర్ అవార్డు క్రింద లక్షరూపాయలను తనకు ఇస్తామంటే, ' ఆమెపేరుతో పెట్టిన అవార్డు నాకేంటి? నాన్సెన్స్ !' అని దానిని తిరస్కరించాడు. అలాంటి మొండివాడు. ఆత్మాభిమాని.

అందుకే ఈయనది చాలా విచిత్రమైన జీవితమని అంటాను.  ఈయన జాతకాన్ని చూద్దాం ! 

అంతకుముందుగా,  ఈయన స్వరపరచిన 500+ పాటలనుంచి కొన్ని ప్రముఖపాటలు :

1. ప్రీతమ్ ఆన్ మిలో - ప్రయివేట్ ఆల్బమ్ - 1945

2. మాంగ్ కె సాత్ తుమారా -  నయా దౌర్ -1957

3. బాబూజీ ధీరే చల్నా - ఆర్ పార్ -1954

4. ఆవో హుజూర్ తుమ్కో - కిస్మత్ -1968

5. పుకార్తా చలా హు మై - మేరే సనమ్ -1965

6. యే దిల్ హై ముషికిల్  జీనా యహా - CID 1956

7. దీవానా హువా బాదల్ - కశ్మీర్ కీ కలీ -1964

8. లేకే పెహలా పెహలా ప్యార్ - CID 1956

9. కజరా మొహబ్బత్ వాలా - కిస్మత్ 1968

10. ఇషారో ఇషారో మె - కశ్మీర్ కీ కలీ -1964

11. జాయియే ఆప్ కహా జాయేంగే - మేరె సనమ్ -1965

12. తారీఫ్ కరూ క్యా ఉస్కీ - కశ్మీర్ కీ కలీ -1964

13. జానే కహా మేరా జిగర్ గయా జీ - Mr Mrs 55 - 1955

14. ఆయియే మెహర్ బాన్ - హౌరా బ్రిడ్జ్ - 1958

15. జరా హౌలే హౌలే చలో మేరే సాజ్నా - సావన్ కీ ఘటా -1966

16. ఆఖో హి ఆఖో మే ఇషారా హోగయా - CID -1956

17. యూ తో హంనే లాఖ్ హసీ దేఖే హై - తుంసా నహీ దేఖా - 1957

18. తుం జో హుయే మేరే హంసఫర్ - (12 O'Clock) - 1958

19. యే హై రేష్మీ జ్యూల్పోన్ క అంధేరా - మేరె సనమ్ - 1965

20. ఆప్ యూహీ అగర్ హం సే మిల్తే రహే - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962 

21. చైన్ సే హంకో కభీ - ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే - 1974

22. ఉడే జబ్ జబ్ జుల్పే తేరీ - నయా దౌర్ -1957

23  మేరా నామ్ చిన్ చిన్ చిన్ - హౌరా బ్రిడ్జ్ -1958

24. ఏక్ పరదేశి మేరా దిల్ లేగయా - ఫాగున్ - 1958

25. కభీ ఆర్ కభీ పార్ - ఆర్ పార్ - 1953

26. సున్ సున్ సున్ జాలిమా - ఆర్ పార్ -1953

27. పియా పియా పియా మేరా జియా పుకారే - బాప్ రే బాప్ -1955

28. సర్ పర్ టోపీ లాల్ దుపట్టా - తుంసా నహి దేఖా -1957

29. తూ ప్యార్ కా సాగర్ హై - సీమా -1955

30. దిల్ కి ఆవాజ్ భి సున్ - హం సాయా -1968

31. రేష్మి సల్వార్ కుర్తా జాలీ కా - నయా దౌర్ - 1957

32. మై ప్యార్ కా రాహీ హూ - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962

33. లాఖో హై నిగాహ్ మే - ఫిర్  ఓహీ దిల్ లాయా హు. - 1963  

(ఇంకా ఉంది )
read more " O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1 "

9, జులై 2026, గురువారం

U.G గారి 108 వ పుట్టినరోజు

ఇవాళ జూలై తొమ్మిది. 

యూజీగారి 108 వ పుట్టినరోజు.

యూజీగారి సన్నిహితులలో ఒకరైన చంద్రశేఖర్ బాబుగారు (బెంగుళూరు) నాకు పంపించిన యూజీగారి మాట ఒకటి మనకోసం.

"The absence of imagination, the absence of will, the absence of effort, the absence of any movement in any direction, on any level, in any dimension - that is the thing."

" ఊహ లేకపోవడం, ఇచ్ఛ లేకపోవడం, ప్రయత్నం లేకపోవడం, ఎటువైపూ, ఏ స్థాయిలోనూ, ఏ భూమికలోనూ, ఏ విధమైన కదలికా లేకపోవడం - అదీ అసలైన విషయం. "

read more " U.G గారి 108 వ పుట్టినరోజు "

30, జూన్ 2026, మంగళవారం

రామమందిర చందాచోరీ వివాదం

అయోధ్య రామమందిరం మొదలవడమే గొడవలతో మొదలైంది. 

మొదలుపెట్టి రెండేళ్లు కూడా కాకముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. భక్తులిచ్చిన చందాలు దొంగిలించబడటం చాలా బాధాకరం. దేశం మొత్తంమీద హిందువుల నమ్మకం తీవ్రంగా దెబ్బతిన్నది.

తిరుమలలో ఇదే జరిగింది. పట్టుకున్న S.I హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అయోధ్యలోనూ అదే నేరం జరిగింది. పద్మనాభస్వామి ఆలయంలో వేరేరకంగా ఇదే జరిగింది. మొత్తానికి, దేవుడంటే భక్తులకు భక్తి ఉన్నప్పటికీ, ఆలయంలో పనిచేసేవాళ్లకు  మాత్రం ఏదీ ఉండదని తేలిపోయింది.

ఆలయాలలో అవినీతి, దొంగతనాలు,  జరగడం. అదికూడా భక్తులు చేయడం చాలా బాధాకరం. 'మిశ్రా, శుక్లా, పాండే' అనేపేర్లు బ్రాహ్మణులు. 'బన్సాల్' అంటే వైశ్యులు. యాదవ్ అంటే తెలిసినదే. వీళ్ళే ఇలాంటిపనులు చేస్తే ఇక ఎవర్ని ఏమనుకోవాలి? మేనేజ్మెంట్ లో వేరే కులాలు మతాలవాళ్ళు ఉన్నపుడు వారిని అనుకున్నాం గతంలో. ఇప్పుడు చేసిందెవరు? ఎవర్ని అనాలి? ఏమనాలి?

మేనేజ్ మెంట్ అంటే ఇదేనా? అందులోనూ అయోధ్యరామాలయం వంటి సంస్థను ఇలాగేనా నడిపేది? పైగా, ఉన్నవాళ్ళందరూ పెద్దపెద్దవాళ్లు?

చిన్నదొంగలను పట్టిచ్చి. లేదా పట్టుకున్నవారిని లేపేసి, సినిమాటిగ్గా పెద్దదొంగలు తప్పించుకుంటారని గతంలో చాలావాటిలో రుజువైంది. ఇప్పుడేమౌతుందో చూడాలి.

---------------------

ఎప్పుడూ ఎదురుగా కనిపిస్తుంటే దేవుడు కూడా చీపై పోతాడు. అందుకే, దూరాన్నించి దర్శనంకోసం వచ్చిన భక్తులకున్న భక్తి, అక్కడున్న పూజారికి ఉండదు. హుండీ డబ్బులు లెక్కించేవారికి అసలే ఉండకపోవచ్చు.

ఎదురుగా ఊరిస్తున్న డబ్బూ బంగారాలు ముఖ్యంగాని, గుళ్లో ఉన్న రాతిబొమ్మ మనకెందుకు? మనం పెడితేనేగా దానికి తిండి? అయినా తినేది దేవుడు కాదుగా, మనమే. కనుక మనకు మనమే ముఖ్యం, దేవుడు కాదు.

దేవుడికి కూడా డబ్బుతోనే విలువ. ఇంకా చెప్పాలంటే, అసలు విలువ డబ్బుకే గాని, దేవుడికి  కాదు.

నిజానికి, డబ్బు సంపాదించడానికి దేవుడొక ఆధారం. ఇది వాస్తవం.

ఇదే వాస్తవం !

అదంతా అలా ఉంచితే, జ్యోతిషం ఏమంటున్నదో చూద్దాం.

------------------------

ప్రాణప్రతిష్ఠ 22 జనవరి 2024 న మధ్యాన్నం 12. 30 కు జరిగింది.

అప్పట్లోనే పుష్యమాసం ముహూర్తం మంచిది కాదని చాలామంది అన్నారు. ఎవరూ వినలేదు. అది శూన్యమాసం. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది.

దేవాలయ శిఖరం, కలశం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం మంచిది కాదని కూడా చాలామంది అన్నారు. కానీ చేసేవారు చేశారు. ఇప్పుడిలా అయింది.

ఆనాటి గ్రహస్థితులు ఇలా ఉన్నాయి.

ఉచ్ఛచంద్రుడు ఎదురులేని ప్రజాభిప్రాయాన్ని సూచిస్తున్నాడు. కనుక దేశంలోని హిందువులందరి మద్దతుతో ఆలయం నిర్మాణమైంది.

అష్టమంలో కుజ బుధ శుక్రులున్నారు. శుక్రుడు ఇంటిదొంగలకు సూచకుడు. బుధుడు కుటుంబసభ్యులకు, అనుచరులకు సూచకుడు. కుజుడు రహస్యశత్రువులకు సూచకుడు. ఈ ముగ్గురూ కలసి నష్టానికి సూచికైన అష్టమంలో ఉన్నారు. ప్రస్తుతం జరిగింది అదే !

ప్రస్తుతం నడుస్తున్న దశ -- కుజ శుక్ర చంద్ర దశ. కుజశుక్రులిద్దరూ పెద్దనష్టాన్ని సూచిస్తున్న అష్టమంలో ఉండటాన్ని చూడవచ్చు. ఈ దశ మార్చి 2026 నుండి ఏప్రియల్ 2027 వరకూ ఉంది. మార్చిలోనే ఈ గొడవంతా బయటపడటం మొదలుపెట్టింది.

అధికారయంత్రాగాన్ని సూచించే సూర్యుడు మతసంబంధమైన నవమంలో పాపార్గళంలో చిక్కుకుపోయాడు. కనుక అధికారులూ యంత్రాంగమూ ఇరుకున పడ్డారు. సూర్యవిదశ సరిగ్గా మే - జూన్ నెలలలోనే నడిచింది.

దశమాధిపతి శని దశమంలో ఉన్నప్పటికీ, పాపార్గళంలో చిక్కుకున్నాడు. లాభస్థానంలోని గురుఛండాలయోగం నీతిలేని అనుచరులను (ఆలయ సిబ్బందిని) సూచిస్తున్నది. వీరివల్ల ఆలయమర్యాదకు ఘోరమైన కళంకం చుట్టుకుంది.

కుజదశ మార్చి 2028 వరకు ఉన్నది. అంతవరకూ పరిస్థితి బాగుపడదు.

ఆ పైన వచ్చే రాహుదశ 2046 వరకూ ఉంటుంది. అప్పుడూ, గురుఛండాలయోగం వల్ల ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది.

ఇంతకంటే ముందుకు ప్రస్తుతం చూడనవసరం లేదు.

-------------------------

బయటనుండి వచ్చి దేవాలయాలను కొల్లగొట్టారని, కూలగొట్టారని రాక్షసులమాదిరిగా ప్రవర్తించారని తురకలను అనుకోవడం దేనికి? ఇంటిదొంగల సాయం లేకుండా వాళ్ళు ఆపనులు చేయగలిగేవారా? ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నదేమిటి?

ఇప్పుడు దోషులు కూడా ఇంటిదొంగలే. హిందూమతం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఇంటిదొంగలమీదనే.

మన దేవుళ్ళపైన దేవాలయాలపైన మనకే గౌరవం లేదు. ఇక బయటవాళ్ళకెలా ఉంటుంది?

దేవుడికే ద్రోహం చేసేవాళ్ళు, మనుషులను ఒదులుతారనుకోవడం వెర్రితనం ! కాకపోతే, నీతికి మారుపేరుగా నిలవాల్సిన వాళ్ళే ఇలా చేస్తే, ఇక ఎవర్ని నమ్మగలం? అందులోనూ VHP, RSS కార్యకర్తలా? కోట్లాది హిందువుల హృదయాలు గాయపడ్డాయి.

వచ్చిన చెడ్డపేరు పోవడం చాలా కష్టం.

ముహూర్తసమయంలో నవాంశలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాశిలోనే ఉన్నాడు. గురువు అనుగ్రహిస్తే కష్టాలనుండి తేలికగా బయటపడవచ్చు.  కానీ, ఆ అనుగ్రహానికి తగిన అర్హత మనలో ఉండాలి. అప్పుడే అది మనకు లభిస్తుంది. ఊరకే మాత్రం రాదు. 

ఈ మొత్తం వ్యవహారంలో యోగి ఆదిత్యనాథ్ ఒక్కడే నిజాయితీగా, ధైర్యంగా నిలబడ్డాడు.

చూద్దాం దీనినెలా పరిష్కరిస్తారో? పోయిన పరువునెలా తిరిగి రాబట్టుకుంటారో?

read more " రామమందిర చందాచోరీ వివాదం "