“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జూన్ 2014, ఆదివారం

బ్లాక్ సాటర్ డే

నిన్న శనివారాన్ని బ్లాక్ సాటర్ డే అని అనుకోవచ్చు.

ఎందుకంటే నిన్న ఒకే రోజున ఎన్నో ప్రమాదాలు జరిగాయి.

ఉదయం డిల్లీలో భవనం ఒకటి కూలిపోయి జనం చనిపోయారు.

సాయంత్రం చెన్నైలో భవనం కూలిపోయి 11 మంది చనిపోయారు.కనీసం ఇంకా 20 మంది శిధిలాలక్రింద చిక్కుకుని ఉన్నారంటున్నారు.

ఇందులో విచిత్రం ఏమంటే,ఉదయం డిల్లీ సంఘటనకూ సాయంత్రం చెన్నై సంఘటనకూ నవాంశ చక్రం ఒకటే.నవాంశ లగ్నం రెంటికీ మీనమే అయింది.చతుర్దాతిపతి అయిన బుధుడు ఈ రెండు చక్రాలలోనూ అష్టమంలో రాహువుతో కలసి ఉన్నాడు.ఇదొక నమ్మలేని నిజం.జ్యోతిష్య విద్యార్ధులకు ఈ విచిత్రం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించడమేగాక,గ్రహప్రభావాలు ఎంత విచిత్రంగా ఉంటాయో మరొక్కసారి కళ్ళకు కట్టిస్తుంది.

ఈ రెండు సంఘటనలకూ దాదాపు తొమ్మిది గంటలు తేడా ఉన్నది.కానీ రెండు సంఘటనలలోనూ నవాంశలో గ్రహస్తితులు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. మనకు కనపడని శక్తులు ఏ విధంగా సంఘటనా క్రమాన్ని నిర్దేశిస్తూ ఉంటాయో చెప్పడానికి ఇదొక మచ్చుతునక.ఖచ్చితంగా ఆయా సమయాలకు ఆయా గ్రహస్తితులు సరిగ్గా ఎవరో కదిపినట్లు ఆయా ప్రదేశాలకు చేరుకుంటాయి.మనకు తెలియని ఒక అతీతశక్తి పర్యవేక్షణలో అంతా నడుస్తున్నదని చెప్పడానికి ఇవే నిదర్శనాలు.

అయితే ఈ సమయంలో హోరాదిపతి శుక్రుడు అయ్యాడు.రాశి చక్రంలో చతుర్దాదిపతి అయిన శని నవాంశలో నీచంలో ఉంటే ఆయనతో కలసి ఈ శుక్రుడున్నాడు.కనుకనే కూలి చేసుకునే సాదాసీదా జనం ఈ ఘటనలో చనిపోయారు.

విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలో పేలుడు జరిగింది.

కాన్పూర్ లో గ్యాస్ ప్రమాదం జరిగింది.

గుజరాత్ పోర్ట్ లో ఇలాంటిదే ఒక ప్రమాదం జరిగింది.

ఇలా రకరకాల చోట్ల ఒకేరకమైన ప్రమాదాలు ఒకేరోజున జరగడం కాకతాళీయం కాబోదు.దీనివెనుక ఉన్న కారణం ప్రతికూల గ్రహస్థితులు మాత్రమే.

ఈరోజు మళ్ళీ ఏమీ జరగలేదు.దానికి కారణం అమావాస్య ప్రభావం బలహీనపడటమే.

ఈ విధంగా వ్యక్తిగత జీవితాలలో గత పదిరోజులుగా ఎన్నో సంఘటనలు జరిగాయి.మచ్చుకి కొన్ని చూద్దాం.

మా స్నేహితుని అబ్బాయికి 14 ఏళ్ళు.అతనికి ఉన్నట్టుండి షుగర్ లెవెల్ 800 కి వెళ్ళిపోయింది.కళ్ళు తిరిగి పడిపోతే ఆస్పత్రిలో చేర్పించారు.షుగర్ లెవల్ ఈ స్థాయిలో ఉంటె అసలు బ్రతకడం కష్టం.ఇదేదో మిరకిల్ గా ఉన్నది అని ట్రీట్ చేస్తున్న డాక్టర్లే నోరెళ్ళబెట్టారు.ఈ వయసులోనే అతను ఇన్సులిన్ డిపెండెంట్ అయ్యాడు.ఇది జరిగి 5 రోజులు అయింది.ఈ విషయం చెప్పి స్నేహితుడు వాపోయాడు.ఊహించని అంతుబట్టని ఆరోగ్య సమస్యలకు రాహువు కారకుడని చాలాసార్లు గతంలో వ్రాశాను.

గతవారంలో అనేకమంది అకస్మాత్తు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిని దర్శించడం జరిగి ఉంటుంది.ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి.నా చుట్టుపక్కల నేనే ఎన్నో కేసులు చూచాను.ఇదీ ఈ గ్రహప్రభావమే.

అంతేకాదు ఇరాక్ లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం కూడా రాహువు ప్రభావమే.ముస్లిం దేశాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి.

ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద సంఘటనలూ,వ్యక్తిగత జీవితాలలో అనేక రోజువారీ సంఘటనలూ రాహుప్రభావంతో జరుగుతున్నాయి.చూచే దృష్టితో చూస్తే వాటిని చక్కగా అర్ధం చేసుకోవచ్చు.

అయితే కొంతమందికి అనుమానం వస్తుంది.

ఈ ప్రమాదాలలో అందరూ సామాన్యులే పోతున్నారు.తెరవెనుక ఉండి ఈ పనులను చేయిస్తున్న పెద్దవారు హాయిగానే ఉన్నారు కదా అని.

కర్మ ఎవరినీ వదలదు.దానికి ధనవంతులనీ పేదవారనీ తేడా ఉండదు. ఎవరిసమయం వచ్చినపుడు వారికి వాత పెడుతుంది.అయితే ఆ వాతను పెట్టే విధానంలో తేడాలుంటాయి.మోసకారులకు మోసపూరితంగానే దెబ్బ తగులుతుంది.అతితెలివి ఉన్నవారికి ఇంకా తెలివిగా దెబ్బ తగులుతుంది. కర్మను చేసికూడా తప్పుకుందాం అనుకునేవారికి వారు ఊహించని విధంగా, తప్పుకోలేని విధంగా దెబ్బ తగులుతుంది.అహంకారులకు వారి అహం అణగిపోయే విధంగా శిక్ష పడుతుంది.క్రూరంగా కర్మ చేసినవారికి ఇంకా క్రూరంగా శిక్ష పడుతుంది.దీనిని ఆపడం ఎవరి తరమూ కాదు.

పేదవాళ్ళ బాధలు బయటకు కనిపిస్తాయి.ధనికుల బాధలు అలా కనిపించవు.వాళ్ళ బాధలు చెప్పుకోలేనివి.కానీ వాళ్లవి వాళ్ళకూ ఉంటాయి.వారి సమయం వచ్చినపుడు వారూ అనుభవిస్తారు.

తన జీవితంలో జరిగిన సంఘటన ఒకటి నా స్నేహితుడు నాతో చెప్పాడు.

వాళ్ళ అబ్బాయి చైనాలో MBBS చదువుతున్నాడు.అతన్ని చూడటానికి మా స్నేహితుడు చైనా వెళ్లాడు.చేతిలో పదిలక్షల క్యాష్ ఉన్నది.కానీ దురదృష్టవశాత్తూ దానిని మార్చుకోడానికి ఆరోజున బ్యాంకులు మూసేసి ఉన్నాయి.ఇతను షుగర్ పేషంటు.కనీసం టీ త్రాగుదామంటే చేతిలో డబ్బులు లేవు.మన కరెన్సీ అక్కడ చెల్లదు.చేతిలో పదిలక్షల ఇండియన్ కరెన్సీ ఉండికూడా టీ తాగడానికి డబ్బుల్లేని పరిస్తితిని అతడు చైనా రోడ్లమీద అనుభవించాడు.

తిండిలేక షుగర్ లెవల్స్ పడిపోయి చివరకు కళ్ళుతిరిగి రోడ్డుమీద పడిపోయే స్థితిలో ఉన్నాడు.అక్కడ ఎవడికీ ఇంగ్లీష్ రాదు.మావాడికి చైనీస్ రాదు.ఏం చెయ్యాలి?చివరికి తట్టుకోలేక రోడ్డు పక్కనే ఉన్న కొన్నిషాపులలో అడుక్కున్నాడు కూడా.అయితే భాష రాకపోవడంతో వాళ్లకు ఇతనేమి చెబుతున్నాడో అర్ధం కాలేదు.ఇతను మనదేశంలో ఒక హోటల్ యజమాని. ఏసీ రూం దాటి సాధారణంగా బయటకు రాడు.కాని ఆరోజున చైనాలో ఒక కప్పు 'టీ' కోసం అడుక్కునే స్థితిలోకి నెట్టబడ్డాడు.

ఇంతలో ఇతని అదృష్టం బాగుండి ఒక చైనా అమ్మాయి అక్కడకు వచ్చింది. ఆ అమ్మాయి అక్కడ యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్.ఇతను చెబుతున్నది ఆమెకు అర్ధమై,వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆరోజుకు ఆశ్రయం ఇచ్చింది. మర్నాడు బ్యాంకులు తెరిచాక ఇతను డబ్బు మార్చుకున్నాడు.

ఆరోజున ఆ అమ్మాయి గనుక అక్కడ కన్పించకపోతే చేతిలో పదిలక్షల కరెన్సీతో చైనారోడ్లమీద టీ నీళ్ళకోసం ముఖంవాచి కుక్కచావు చచ్చి ఉండేవాడిని అని నాతో చెప్పి వాపోయాడు.చేతిలో డబ్బున్నా కొన్నిసార్లు కర్మపెట్టే బాధలు ఇలా ఉంటాయి.డబ్బు అన్నివేళలా అన్నింటినీ పరిష్కరించలేదు.

అతను తరచుగా గుంటూరులో అన్నదానం చేస్తూ ఉంటాడు.ఎంతోమంది దిక్కులేనివాళ్లకు తనచేత్తో తరచుగా అన్నం పెడుతూ ఉంటాడు.ఆ సంగతి నాకు తెలుసు.

అతనితో ఇలా చెప్పాను.

"నీవు చేసిన అన్నదానమే ఆ సమయంలో నిన్ను ఆదుకుంది. అన్నపూర్ణాదేవి ఆ అమ్మాయి రూపంలో వచ్చి ఆ దేశంకాని దేశంలో ఆపదలో ఉన్న నిన్ను ఆదుకుంది.నిన్ను ఆదరించి నీకు అన్నం పెట్టింది. నీవు ఇక్కడ చేసిన మంచిపని అక్కడ నీకు అక్కరకు వచ్చింది." అని చెప్పాను.

మన కర్మ మన వెనకే  ఉంటుంది.ఎక్కడికీ పోదు.అది మనకు కనిపించక పోవచ్చు.కాని మన నీడలా వెన్నంటే ఉంటుంది.

ఒక హిందీ సామెత ఇలా అంటుంది.

"భగవాన్ కే ఘర్ మే దేర్ హై అంధేర్ నహీ"

'భగవంతుని ఇంటిలో(సృష్టిలో) ఆలస్యం ఉందేమో గాని చీకటి లేదు.' అంటే ఆలస్యమైనా చివరికి న్యాయం జరుగుతుంది అని.

నన్నడిగితే మాత్రం ఈ సామెత తప్పంటాను.

భగవంతుని న్యాయస్థానంలో ఆలస్యమూ లేదు.చీకటీ లేదు.

మనం అనుకున్న సమయానికి అనుకున్నట్లు జరగకపోతే అలా అనుకుంటాము.కాని అది నిజం కాదు.ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా ఖచ్చితంగా జరుగుతుంది.ఎలా జరపాలో దైవానికి తెలుసు.ఎప్పుడు జరపాలో కూడా ఖచ్చితంగా తెలుసు.

కాకపోతే ఆ జరిగేదాని వెనుక ఉన్న రహస్యసూత్రాలను అర్ధం చేసుకోవడమే మనం చెయ్యవలసిన పని.జ్యోతిష్యశాస్త్రపు పరమ ప్రయోజనం అదే. సృష్టిరహస్యాలను చక్కగా ఆకళింపు చేసుకోవడమే జ్యోతిష్యశాస్త్రపు పరమ ప్రయోజనం.

అలా అర్ధం చేసుకుని ప్రయోజనం ఏమిటీ అని అడగవచ్చు.

అలా వాటిని అర్ధం చేసుకుంటే ఆ తప్పులను మన జీవితంలో మనం చెయ్యకుండా ఉంటాం.ఆ బాధలు పడకుండా తప్పుకోగలుగుతాం. దైవన్యాయానుసారం జీవించగలుగుతాం.దైవానికి దగ్గర కాగలుగుతాం.

మనిషి జన్మలో ఇంతకంటే ఇంకేం కావాలి?
read more " బ్లాక్ సాటర్ డే "

28, జూన్ 2014, శనివారం

డిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల భవనం-శపితయోగానికి మరో తిరుగులేని తార్కాణం

ఈరోజు ఉదయం 8.55 ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒకటి డిల్లీలో కూలిపోయింది.పదకొండు మంది చనిపోయారని అంటున్నారు. ఎంతమంది కూలిపోయిన సిమెంట్ స్లాబుల క్రిందా,రాళ్ళక్రిందా చిక్కుకుని ఉన్నారో తెలియదు.నిదానంగా ఆ లెక్క తెలుస్తుంది.

రాహువు కుజుడు అమావాస్య కలసిన ప్రభావాలకు ఇది ఇంకొక తిరుగులేని నిదర్శనం.శపితయోగపు నిరాఘాటమైన పదఘట్టనకు ఇది మరొక ఋజువు.జ్యోతిష్యపరమైన కోణాలు ఇందులో ఏమున్నాయో ఒక్కసారి పరికిద్దాం.

లగ్నం ఆశ్లేషా నక్షత్రంలో ఉన్నది.ఆశ్లేషా నక్షత్రం సర్పనక్షత్రం.దీనికి అధిష్టాన దేవత రాహువు.కనుక రాహుప్రభావం స్పష్టంగా ఉన్నది.

గృహాలను సూచించే చతుర్దంలో శపితయోగం కూర్చొని ఉండటం స్పష్టంగా కనిపిస్తున్నది.కనుక భవనం కూలిపోయింది.కానీ లగ్నంలో గురువు ఉచ్చంలో ఉండటం వల్ల ప్రాణనష్టం తగ్గింది.లేకుంటే మంచి రద్దీగా ఉండే ప్రాంతంలో అంత భవనం కూలిపోతే చుట్టుపక్కల భవనాలకు కూడా నష్టం జరగాలి.ఇక్కడ కూడా గురు అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నది.గురువుగారి అనుగ్రహానికి మరొక్క నిదర్శనం ఈరోజు పునర్వసు నక్షత్రం నడుస్తూ ఉండటం.కరుణామయుడైన గురువు వల్లనే ఇంత ఘోరప్రమాదంలో కూడా ప్రాణనష్టం తగ్గింది.

ఈప్రాంతంలో 7.30 నుంచి 8.30 వరకూ కుజహోర నడిచింది.ఆ సమయం లోనే భవనం కూలడానికి ఇతర కారణాలు బలాన్ని సంతరించుకుని ఉండాలి.ఆ చుట్టుపక్కల ఏదో ఇంకొక కట్టుబడి జరుగుతూ ఉన్నదని అంటున్నారు.ఆ ప్రకంపనలకు ఆ భవనం బాగా వీక్ అయి ఉండాలి.అంటే కుజహోరలో భవనం పడిపోవడానికి రంగం సిద్ధం అయింది.తర్వాత ఒక అరగంటలో రాహునక్షత్రంలో ఉన్న సూర్యహోరలో అది కూలిపోయింది.

8.30 నుంచి సూర్యహోర మొదలైంది.సూర్యుడు కూడా ఆశ్లేషా నక్షత్రంలో ఉండటం స్పష్టంగా చూడవచ్చు.అంటే ఈ సమయం పైన కూడా రాహువు ప్రభావం నక్షత్రపరంగా ఉన్నది.

నవాంశను ఒక్కసారి పరికిద్దాం.లగ్నాధిపతి గురువు పంచమంలో ఉచ్చంలో ఉన్నప్పటికీ నీచంలో ఉన్న కుజునితో కలసి ఉన్నాడు.వీరిద్దరినీ నీచంలో ఉన్న శనిస్థానం నుంచి హోరాధిపతి సూర్యుడు చూస్తున్నాడు.కుజుడు భవనాలకు భూమికి అధిపతి.చతుర్దాదిపతి బుధుడు అష్టమంలో రాహువుతో కలసి వక్రించి ఉన్నాడు.

అమావాస్య ప్రభావం దాని తర్వాత మూడురోజుల వరకూ ఉంటుందని కూడా ఎన్నోసార్లు పాతపోస్ట్ లలో వ్రాశాను.ఈరోజు అమావాస్య తర్వాతి రోజే.గమనించండి.

గత మూడురోజులనుంచీ జరుగుతున్న సంఘటనల వల్ల ఇంకొక విషయం కూడా స్పష్టంగా తెలుస్తున్నది.ప్రమాద కంపాస్ అనేది స్థిరంగా ఉండదు. భూమి తిరుగుతున్నట్లే అదికూడా తిరుగుతూ ఉంటుంది.కర్మబీజాలు ఎక్కడ పక్వానికి వచ్చాయో అక్కడ అది ప్రభావం చూపిస్తుంది.అందుకే ఒక్కొక్కరోజు ఒక్కొక్కచోట అది తన చేతిని విదిలిస్తున్నది.

వ్యక్తిగత జీవితాలలో అయితే గత అయిదురోజులుగా ఎన్నో రకాలైన దుర్ఘటనలు జరుగుతున్నాయి.ఎవరికి వారు గమనించుకుంటే తెలుస్తుంది.

శపితయోగానికీ,రాహువు,కుజుడు,అమావాస్య ప్రభావాలకు ఇది మరొక్క ప్రత్యక్షనిదర్శనం.
read more " డిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల భవనం-శపితయోగానికి మరో తిరుగులేని తార్కాణం "

27, జూన్ 2014, శుక్రవారం

గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అగ్నిప్రమాదం - అమావాస్య ప్రభావానికీ రాహుప్రభావానికీ మరో ఋజువు

ఈరోజు నిండు అమావాస్య.

ఈరోజు తెల్లవారు ఝామున తూర్పుగోదావరి జిల్లా 'నగరం'లో గెయిల్ పైప్ లైన్ బద్దలై అగ్నిప్రమాదం జరిగింది.11 మంది సజీవదహనం అయ్యి నిలువునా కాలిపోయారు.ఇంకొక 15 మందికి తీవ్రంగా ఒళ్ళు కాలిపోతే వారిని ఆస్పత్రికి తరలించారు.

'నగరం' అక్షాంశ రేఖాంశాలు

Longitude: 81E54
Latitude:16N29

గ్యాస్,పెట్రోల్,కెమికల్స్,తదితర ఇంధనాలూ,పేలుడు పదార్ధాలూ మొదలైనవి రాహువు కారకత్వాలని చాలాసార్లు ఇంతకుముందే వ్రాసి ఉన్నాను.ప్రస్తుతం శపితయోగం ప్రజలను వెంటాడుతున్నదనీ వ్రాశాను.అమావాస్య ప్రభావం ఉంటుందనీ ఎన్నోసార్లు చెప్పాను.రాహు కేతువులు రాశులు మారబోతూ చాలా అన్ స్టేబుల్ గా ఉన్నారనీ వారి ప్రభావాలు దారుణంగా ఉంటాయనీ వ్రాస్తూనే ఉన్నాను.

ఇప్పుడు మన కళ్ళముందే ఈ దారుణ సంఘటన జరిగింది.

నేను వ్రాస్తున్నవి నిజాలే అనడానికి ఇంతకంటే మళ్ళీమళ్ళీ ఋజువులు అవసరం లేదు.

నిన్నటి కుండలికీ ఈరోజు కుండలికీ స్థూలంగా పెద్దతేడాలు ఉండవు.కొన్ని కొన్ని పారామీటర్స్ మాత్రం మారుతాయి.అవేమిటో మాత్రమె క్లుప్తంగా చూద్దాం.

ఈరోజు ఆర్ద్రానక్షత్రం నడుస్తున్నది.వింశోత్తరీ విధానం ప్రకారం ఇది రాహువు అధీనంలో ఉంటుంది.ఈ నక్షత్రం ఉదయం 3.45 ప్రాంతం నుంచీ మొదలైంది అన్న విషయం గమనించాలి.రాహుసమయం మొదలుకావడంతోనే ఈ ప్రమాదం జరిగింది.ఇదొక బలీయమైన ఋజువు. 

కుజుడు హస్తా నక్షత్రంలో ఉన్నాడు.అంటే రాహువు ప్రభావం చంద్రునిమీదుగా ప్రయాణించి అంగారకుని కారకత్వాన్ని యాక్టివేట్ చేసింది.బుధుడు మృగశిర నక్షత్రంలో వక్రించి ఉన్నాడు.అంటే అంగారకుని ఆధీనంలో ఉన్నాడు. అగ్ని ప్రమాదాలలోనూ పేలుళ్ళలోనూ అంగారకునికి గల శక్తిని ఇంతకుముందు చాలాసార్లు వివరించాను.

ఉదయం 3.42 నుంచి  4.42 వరకూ కుజహోర ప్రమాదం జరిగిన ప్రాంతంలో నడిచింది.ఇది అగ్నికి ఆజ్యాన్ని తోడుచేసింది.రాహువుయొక్క నక్షత్రమూ కుజుని హోరాసమయమూ ఒకదానికొకటి తోడైతే ఇంకేం జరుగుతుంది? ఏం జరగాలో అదే జరిగింది.

మొన్న కేరళలో ఇడుక్కి ప్రాంతంలో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం కూడా ఇదే సమయంలో తెల్లవారుఝామునే జరిగింది.అందులో ఒక కుటుంబంలో ఇద్దరు అక్కడే చనిపోతే ఇద్దరు బయటపడ్డారు.వాళ్ళు ప్రయాణిస్తున్న కారు పట్టుదప్పి 1000 అడుగుల లోతులోకి పడిపోయింది.దానికి పొగమంచు కారణం అన్నారు.పొగమంచు ఒకరకమైన మాయే.కళ్ళముందు ఉన్నదానిని కనపడకుండా అడ్డుకునే ప్రతిదీ మాయ క్రిందికే వస్తుంది.అన్ని మాయలకూ రాహువే కారకుడు.

బీహార్లో రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడమూ తెల్లవారుఝామునే జరిగింది.కనుక తెల్లవారుఝాము సమయంలో రాహువు యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటున్నదని తెలుస్తున్నది.రాహువు సూర్యుడిని మ్రింగుతాడని పురాణవచనం.కనుక సూర్యోదయం కాబోయే ముందు ఉన్న చీకటిని రాహువుగా అనుకోవచ్చు.ఆ చీకటిని చీల్చుకుంటూ సూర్యోదయం జరుగుతుంది.అంటే సూర్యోదయానికి కొన్ని గంటలముందు రాహువు సూర్యుడిని బంధించి ఉండటం అన్న భావన చాలా తార్కికంగా ఉన్నది.అందుకే ఆ సమయంలో రాహువు బలీయంగా ఉంటున్నాడు.అనేక ప్రమాదాలు ఆ సమయంలోనే జరుగుతున్నాయి.

అంతేకాదు.యోగధ్యానాది మార్మికసాధనలు చేసేవారు కూడా ఈ సమయంలోనే వాటిని చెయ్యాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.మాయను జయించాలంటే దానిప్రభావం గట్టిగా ఉన్న సమయంలోనే దానిని ఎదుర్కోవాలి.బ్రాహ్మీముహూర్తం వెనుక ఉన్న రహస్యం ఇదే.

ప్రమాదం జరిగిన తర్వాత భద్రతాప్రమాణాలు సరిగ్గా లేవని ప్రజలు గోలచెయ్యడమూ వాటిమీద కమీషన్ వెయ్యడమూ అది ఎటు పోతుందో ఏమైపోతుందో తెలీకపోవడమూ మన దేశంలో మామూలే కదా.ముందే ఎందుకు వీటిని చూచుకోరో అర్ధం కాదు.

ఏదేమైనా,నేను కొన్ని నెలలనుంచీ హెచ్చరిస్తున్న శపితయోగమూ రాహుప్రభావమూ కర్మసిద్ధాంతమూ ప్రత్యక్షనిజాలే అనడానికి ప్రతిరోజూ మన కళ్ళముందు జరుగుతున్న ఈ సంఘటనలే నిదర్శనాలు.

కొంతమంది అంటారు.జరిగిన తర్వాత మీరు అన్నీ వ్రాస్తున్నారు.ముందే చెప్పవచ్చు కదా అని.

కోట్లాది మంది జీవితాలలో ప్రతిరోజూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి;ప్రతివారికీ బొట్టు పెట్టి చెప్పడం సాధ్యం కాదు.

రాహువు కారకత్వాలు ఏమిటో వ్రాస్తూనే ఉన్నాను.ఆయన అధీనంలో ఏయే పదార్ధాలు ఉంటాయో వ్రాస్తున్నాను.ఆయా పదార్ధాలతో డీల్ చేస్తున్నపుడు ప్రస్తుతం చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి అనేదే దీని అర్ధం.ఈ జాగ్రత్త పాటిస్తే ప్రమాదం తప్పుతుంది.లేకుంటే జరుగుతుంది.లక్షలాది జనంమీద స్థూలంగా మాత్రమె చెప్పడానికి వీలవుతుంది.వ్యక్తిగత జాతకాలైతే వ్యక్తిగతంగా చెప్పవచ్చు.అదీ తేడా.

చాలామంది ఇలా అంటారు-'కరెక్ట్ గా ఫలానాచోట ఫలానా సంఘటన ఫలానా నిముషానికి జరుగుతుంది అని చెప్పవచ్చు కదా'- అని.

వీరికి తెలియని రహస్యం ఒకటున్నది.గ్రహాలు మనం అనుకునేటట్లు జడపదార్ధాలు కావు.అవి చైతన్యపు పుంజాలు.అందుకే వాటిని దైవీశక్తులని అంటాము.సైన్సు జీవులు వాటిని మట్టిముద్దలుగా భావించవచ్చు.కానీ మార్మిక యోగదృష్టికి అవి మట్టిముద్దలు కావు.అవి శక్తిస్వరూపాలు. ప్రపంచంలో జడం అనేది ఏదీలేదు.మనం జడం అనుకునేది నిజానికి ఒక చైతన్యపు ఘనీభవరూపం.మనం రాయి అనుకునే దానిలో కూడా ఎంతో ఎటామిక్ ఎనర్జీ ఘనీభవించి బంధింపబడి ఉంటుంది.కనుక అదీ శక్తిస్వరూపమే. 

ఒకచోట గట్టి కర్మానుభవం ఉన్నది అక్కడ ఏదో ఒక తీవ్రమైన ప్రమాదం జరుగబోతున్నది అనుకుందాం.దానిని మనం కనిపెట్టి అడ్డుకుంటే,ఆ శక్తి ఇంకొక రూట్ తీసుకుంటుంది.ఎందుకంటే అది తెలివిలేని శక్తికాదు.ఆ శక్తిని నడిపే ఒక మోటివ్ ఫోర్స్ ఉంటుంది.ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే,మనం అనుకోనివిధంగా ఊహించని విధంగా అది రూట్ మార్చుకుని ఇంకొక రకంగా ఆ ప్రమాదాన్ని జరిపిస్తుంది.దీనిని దృఢకర్మ అంటాము.అంటే ఎంత ప్రయత్నించినా తప్పనిది.

మనకు శక్తి చాలకపోతే,దానిని ఆపుతున్న మనమీద కూడా ఆ శక్తి తిరగబడుతుంది.ఎందుకంటే ఇతరుల కర్మలో మనం చేతులు పెడుతున్నాం గనుక.

'Final destination' అనే ఇంగ్లీష్ సినిమా సీక్వెల్స్ చాలామంది చూచి ఉంటారు.ఆ సినిమాలో ఈ సూత్రాన్నే వాళ్ళు వాడుకుని ఒక సీరియల్ కధగా మలిచారు.అయితే వాళ్లకు 'పరిహార క్రియలు' అనే కాన్సెప్ట్ తెలియదు గనుక దాని జోలికి పోలేదు.

మన భారతీయ జ్యోతిశ్శాస్త్రంలో ఈ కాన్సెప్ట్ ఉన్నది.బలీయమైన కర్మను తుడిచి పెట్టాలంటే దానికి సరిపోయే బలీయమైన పరిహారం చెయ్యాలి.అప్పుడు కర్మను పరిహారం చెయ్యవచ్చు.కాని ఆ అదృష్టం అందరికీ కలగదు.అది ఎవరికి దక్కుతుంది? ఎవరికి అలా పరిహారాలు చేసుకోవడం సాధ్యమౌతుంది? అన్నది పాత పోస్ట్ లలో చర్చించాను.కావలసిన వారు చూడవచ్చు.

ఒక్క విషయం మాత్రం తేటతెల్లంగా రుజువౌతున్నది.మనుష్యుల పైన గ్రహప్రభావం సత్యం.కర్మఫలితాలనేవి సత్యం.వాటిని అనుభవించడమూ సత్యమే.ఈ మహత్తరమైన విజ్ఞానం భారతీయుల సొంతం.దీనిని ఇప్పుడిప్పుడే ప్రపంచం గుర్తిస్తున్నది.మనం మాత్రం ఇంకా మన ప్రాచీనసంపదను గుర్తించకుండా దానిని విమర్శించుకుంటూ కూచుంటున్నాం.

చుట్టూ నీరున్నా తాగేవాడికే అది దాహం తీరుస్తుంది.తాగుదామా వద్దా అని మీనమేషాలు లెక్కిస్తూ కూచుంటే ఈలోపల ఉన్న సమయం కాస్తా గడచిపోతుంది.

ప్రపంచం మొత్తం కర్మబద్ధమై నడుస్తున్నది.కర్మను జయించేవారెవ్వరు? ప్రస్తుత జీవనపోరాటంలో అంతటి ఓపిక ఎవరికుంది?
read more " గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అగ్నిప్రమాదం - అమావాస్య ప్రభావానికీ రాహుప్రభావానికీ మరో ఋజువు "

26, జూన్ 2014, గురువారం

రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం-ఒక పరిశీలన




రాహు ప్రభావానికి ఇంకొక తార్కాణం నిన్న జరిగింది.

నిన్న ఉదయం 2.15 కి బీహార్ లోని చాప్రా దగ్గర రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.12 బోగీలు పట్టాలు తప్పాయి.కొన్నైతే విసిరేసినట్లు చాలా దూరంగా పడిపోయాయి.ఆ విషయాలన్నీ టీవీలలో చూచి ఉంటారు.

ఈ సంఘటనను ఒక్కసారి విశ్లేషిద్దాం.
  • లగ్నడిగ్రీ మేషం 26.భరణీనక్షత్రంలో నిలిచి ఉన్నది.భరణికి అధిష్టానదేవత యమధర్మరాజు అని మనకు తెలుసు.మృత్యుకారక నక్షత్రంలో ఇలాంటి సంఘటన జరగటం కాకతాళీయం ఏమీ కాదు.
  • లగ్నం కేతువుతో కలసి ఉన్నది.ఆ కేతువు 0 డిగ్రీలలో రాశి మారబోతూ చాలా చికాకుగా ఉన్నాడు.రాహుకేతు ప్రభావాలవల్ల ప్రమాదాలు జరుగబోతున్నాయని అనుకుంటూనే ఉన్నాం. కేతులగ్నం లోనే ఈ ప్రమాదం జరగడం కూడా కాకతాళీయం కాదు.
  • లగ్నాధిపతి అంగారకుడు షష్ఠంలో శత్రుస్థానంలో ఉన్నాడు.ప్రమాదాలలో అంగారకుని పాత్ర గురించి ఇప్పటికి ఎన్నో పోస్ట్ లలో వ్రాశాను.దానికి అనుగుణంగానే ఇది కూడా జరగడం చూడవచ్చు.
  • అంత్యరాశి అయిన మీనంలో ఉన్న అకస్మాత్తు సంఘటనలకు కారకుడైన యురేనస్ అంగారకునితో ఖచ్చితమైన సమసప్తక దృష్టిలో ఉన్నాడు.ఇది చాలా ముఖ్యమైన యోగం.అకస్మాత్తుగా జరిగే సంఘటనలలో యురేనస్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.ఇక్కడ కూడా అది మళ్ళీ ఋజువైంది.
నవాంశ పరిస్థితి చూద్దాం.

  • వాహనకారకుడు శుక్రుడు యురేనస్ తో కలసి ఉన్నాడు.రాశిచక్రంలో అంగారకుని దృష్టి ఉండటం గమనించాలి.కనుక అకస్మాత్తు వాహన ప్రమాదం జరిగింది.
  • శని,కేతువులతో కలసి చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు.శనీశ్వరుడు నీచంలో ఉన్నాడు.దీని గురించి ఇక చెప్పనే అక్కర్లేదు.
  • కుజుడు నీచంలో ఉండి ఉచ్ఛగురువుతో కలసి ఉన్నాడు.కనుకనే ప్రమాదపు ఉద్ధృతి తగ్గింది.ఆ బోగీలు విసిరేసినట్లు దూరంగా పడిపోవడం చూస్తె ప్రస్తుత జరిగిన ప్రాణాపాయం చాలా తక్కువ అనే చెప్పాలి.దీనికి గురువు యొక్క కరుణే కారణం.
  • ప్రమాద సమయంలో కుజహోర జరిగింది.ఇంతకంటే ఋజువు ఇంకొకటి అవసరం ఉండదు.ఖచ్చితంగా అంగారకుని అధీనంలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం గమనార్హం.కొన్ని కొన్ని సమయాలు కొన్ని గ్రహాల అధీనంలో ఉంటాయన్నది నిజమే అని ఇది ఋజువు చేస్తున్నది.
తిధి:- కృష్ణత్రయోదశి.
ఒక్కరోజులో అమావాస్య రాబోతున్నది.అమావాస్య ప్రభావం గురించి నేను లెక్కలేనన్ని పాత పోస్ట్ లలో వ్రాశాను.హెచ్చరిస్తూ వస్తున్నాను.మళ్ళీమళ్ళీ ఇది నిజం అవుతూ వస్తున్నది.ఈ సారి కూడా మళ్ళీ నిజమైంది. కావలసిన వారు ఒక్కసారి పాత పోస్ట్ లు తిరగెయ్యండి.

చతుర్దంలో గురువు ఉచ్చంలో ఉండటమూ,ఆరూడలగ్నం నుంచి శుక్రుడు స్వక్షేత్రంలో వాహనస్థానంలో ఉండటమూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టాన్ని చాలావరకూ తగ్గించాయి.లేకుంటే రాజధాని ఎక్స్ ప్రెస్ పోతున్న వేగానికీ ప్రమాదం జరిగిన ధాటికీ ఇంకా ఎందఱో చనిపోయి ఉండాలి.

గురువు అనుగ్రహం ఈ విధంగా ఎన్నో ప్రాణాలను రక్షించింది.

కాని ఈ విషయం ఎందరు గ్రహిస్తారు?ఎందరు దైవానికి కృతజ్ఞతలు తెలుపు కుంటారు?ఎందరు బుద్ధి తెచ్చుకుని ధర్మానికి కట్టుబడి జీవించడం ప్రారంభిస్తారు?ఎందరు తమను తాము మార్చుకుని అహంకారం తగ్గించుకుని ధర్మపు నీడలోకి వస్తారు?అందరూ రకరకాలైన అహంకారాలతో విర్రవీగేవారే గాని వాస్తవాలను గ్రహించేవారు ఎందరున్నారు? 

అన్నీ శేషప్రశ్నలే.అందుకేనేమో శేషుని ప్రతిరూపం అయిన రాహువు ఈ రకంగా కర్మక్షాళనం గావిస్తున్నాడు.ఇదొక్కటే కాదు.ప్రతిరోజూ అనేక రకాలుగా ఈ ప్రక్షాళన సాగుతున్నది.చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయో??
read more " రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం-ఒక పరిశీలన "

25, జూన్ 2014, బుధవారం

రాహుప్రభావాలు -- నిత్యజీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు

ప్రస్తుతం రాహుశనుల మీద గురువుగారి కంట్రోల్ పోయింది గనుక రాహువు ప్రజలమీద రకరకాలుగా బాగా విజృంభిస్తున్నాడు.ఈ విషయం మొన్ననే హెచ్చరించాను.

కాని రాహువుయొక్క ఆయాచర్యలు మామూలుగా కేజువల్ దృష్టితో చూస్తే అర్ధంకావు.వాటిని అర్ధం చేసుకోవాలంటే లోతైన మార్మికదృష్టి ఉండాలి.

ప్రస్తుతం ఎన్ని రకాలుగా రాహువు యొక్క చర్యలు జరుగుతున్నాయో అర్ధం చేసుకునే దిశగా కొన్ని ఉదాహరణలు మాత్రం గమనిద్దాం.

ఒకటి

మొదటగా గుంటూరు విజయవాడ మధ్యలో ఈమధ్య జరిగిన యాసిడ్ ట్యాంకర్ రోడ్డు ప్రమాదం గురించి చూద్దాం.ఇది చాలా విచిత్రమైన ప్రమాదం.

ఒక పెళ్ళికి అటెండ్ అయిన కొందరు విజయవాడకు పోదామని బయలుదేరారు.ఒక క్వాలిస్ ఖాళీగా ఉంటె అదెక్కారు.వీళ్ళకు కర్మానుభవ సమయం దగ్గరపడింది.ఆ డ్రైవర్ మీద రాహుప్రభావం విపరీతంగా ఆవహించింది.విపరీతమైన స్పీడుతో కారు తోలడం మొదలుపెట్టాడు.లోపల కూచున్నవారికి పైప్రాణాలు పైనే పోయినంత భయం పుట్టింది.

'బాబూ!!ఇంత స్పీడ్ పోవద్దు.తగ్గించు.లేదంటే మేము దిగిపోతాము'- అని వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నా వినకుండా విపరీతమైన స్పీడ్ తో పోనిచ్చి తమకంటే ముందుపోతున్న ఒక యాసిడ్ ట్యాంకర్ ను వెనకనుంచి గుద్దేశాడు.ఆ ట్యాంకర్ వెనుక భాగంలో ఈ కారు ఇరుక్కుంది.ఆ ధాటికి యాసిడ్ ట్యాంక్ మూత తెరుచుకుని కారులోని వారికి యాసిడ్ తో అభిషేకం జరగడం మొదలైంది.అలా యాసిడ్ తో కారునూ అందులోని మనుషులనూ అభిషేకం చేసుకుంటూ కారును మూడు కిలోమీటర్లు లాక్కెళ్ళింది ట్యాంకర్. కారులో ఒకామె అక్కడికక్కడే కారులోనే చనిపోయింది.మిగతావాళ్ళకు తీవ్ర యాసిడ్ గాయాలయ్యి ఒళ్లంతా కాలిపోయింది.అలా కాలిపోతూ హాహాకారాలు చేస్తూ మూడుకిలోమీటర్లు ట్యాంకర్ తో లాగబడుతూ ప్రయాణం చేశారు. చివరకు యాసిడ్ తో ఒళ్ళు కాలిపోయి రోడ్డుమీద పడి బాధతో కేకలు పెడుతూ ఉంటె చాలాసేపటి వరకూ వారిని పట్టించుకున్న నాధుడు లేడు.ఇది జరిగి రెండురోజులయ్యింది.

ఇదెంత విచిత్రమైన సంఘటనో గమనించండి.

యాసిడ్ కు రాహువు కారకుడు అన్న విషయం జ్యోతిష్య విద్యార్ధులకు సుపరిచితమే.రోడ్డు ప్రయాణాలకూ ప్రమాదాలకూ కూడా ఆయనే కారకుడని మళ్ళీ చెప్పనక్కరలేదు.కీటకాలకూ సర్పాలకూ ఇతర పాకే జంతువులకూ రాహువే అధిష్టాన దేవత అని జ్యోతిష్య ప్రామాణిక గ్రంధాలు అంటాయి.

ఒక్కసారి భూమిని వదలి ఆకాశంలో మేఘాలవరకూ వెళ్లి చూద్దాం. అక్కడనుంచి క్రిందికి చూస్తె,భూమిమీద పోతున్న కార్లు అన్నీ పాకుతున్న చిన్నచిన్న పురుగులలాగా కనిపిస్తాయి.రైళ్ళు అన్నీ చిన్నచిన్న పాముల లాగా కనిపిస్తాయి.కనుకనే వీటిమీద రాహువు ప్రభావం అమితంగా ఉంటుంది. దీనిని మార్మిక పరిభాషలో 'లా ఆఫ్ సిగ్నేచర్' అంటారు.ప్రామాణిక గ్రంధాలలో గ్రహకారకత్వాలన్నీ ఈ సూత్రం ఆధారంగానే నిర్ణయించబడ్డాయి.

భిన్నధ్రువాల మధ్యన ఆకర్షణ ఉంటుంది.అలాగే ఒకే రకమైన ధ్రువాలు ఒక్కచోటికి చేరడమూ కరెక్టే.మార్మిక విషయాలలో ఈ రెండుసూత్రాలూ వర్తిస్తాయి.ఎక్కడ ఏ సందర్భంలో ఏసూత్రం ఎలా వర్తిస్తున్నదో సూక్ష్మంగా గమనించి గ్రహించాలి.

రెండు

ఇకపోతే మొన్న జరిగిన కలకత్తా మెట్రో రైల్వే ప్రమాదం చూద్దాం.

కలకత్తా మెట్రో రైల్వేలోని సొరంగంలో మెట్రో ట్రెయిన్ చాలాసేపు నిలిచి పోయింది.ఊపిరాడక,బయటకు రాలేక ప్రయాణీకులు నానా నరకం అనుభవించారు. చివరకు వారిని నిచ్చెనల మీదుగా బయటకు లాగారు.

పాము అనే జీవి నేలలో ఉన్న సొరంగాలలో బొరియలలో తిరుగుతుంది. మెట్రోరైలు కూడా ఒకరకంగా నేలబొరియలలో తిరిగే పామువంటిదే. రాహువు యొక్క రూపం సర్పమే.కనుక మొన్న జరిగిన మెట్రోరైలు ఘటన కూడా రాహుప్రభావమే అనడానికి సంశయం అక్కర్లేదు.ఆరకంగా భూసొరంగంలో బంధించి జనాన్ని రాహువు హింస పెట్టాడు.

రాహువు హింసపెట్టాడు అనడంకంటే,చేసుకున్న పాపాలకుగాను ఎవరి ఖర్మను వారు అనుభవించారు అనడం సబబుగా ఉంటుంది.గ్రహాలు దైవ స్వరూపాలనీ వాటిని ఎగతాళిగా సంబోధించడం,ఎకసెక్కాలు చెయ్యడంవల్ల, వాటి కోపానికీ చెడుప్రభావానికి తీవ్రంగా గురికావలసి ఉంటుందనీ ఇంతకు ముందు ఎప్పుడో వ్రాసిన పోస్ట్ లో ఒకసారి హెచ్చరించాను.

మూడు

ఋతుపవనాలు వెనక్కు పోవడం కూడా రాహుప్రభావమే.

వస్తున్నాయి వస్తున్నాయి అనుకున్న ఋతుపవనాలు ఎక్కడా పత్తా లేకుండా వెనక్కు పారిపోతున్నాయి.ఎండలు మండిపోతూ,మళ్ళీ రోహిణీకార్తె వచ్చిందా అనిపిస్తూ ప్రతిరోజూ ఎంతోమంది వడదెబ్బ తగిలి చనిపోతున్నారు.

ఇది కూడా రాహుప్రభావమే అని నేనంటాను.

ఇదెలా సాధ్యమో చూద్దాం.

'ఎల్ నినో' అంటే ఏమిటో ఆ టెక్నికాలిటీస్ ఏమిటో నేనిక్కడ వివరించబోవడం లేదు.క్లుప్తంగా చెప్పాలంటే --'సముద్రం మీదనుంచి వీచే వేడిగాలుల వల్ల భూమిపైన చాలామార్పులు కలుగుతాయి'-- అనుకోవచ్చు.దీని ప్రభావంవల్ల మనకు ప్రస్తుతం రావలసిన ఋతుపవనాలు వెనక్కు పోతున్నాయి.లేదా న్యూట్రలైజ్ అయిపోతున్నాయి.

ఇక్కడ ఒకసారి రామాయణంలోకి తొంగిచూద్దాం.

హనుమంతుడు సముద్రాన్ని దాటే సమయంలో ఆయన నీడను పట్టుకుని క్రిందకు లాగాలని ఒక శక్తి ప్రయత్నిస్తుంది.దాని పేరు 'సింహిక'.అది 'రాహువు'కు తల్లి అని రామాయణం అంటుంది.రాహువుకు 'సైంహికేయుడు' అని నామాంతరం ఉన్నది.సముద్రం మీద ప్రయాణించే వాటిని అది అరికట్టి క్రిందకులాగి స్వాహా చేసేస్తూ ఉంటుంది.అయితే హనుమంతుడి ముందు దాని శక్తి సరిపోదు.ఆయన దానిని సునాయాసంగా ఓడించి ముందుకు సాగిపోతాడు.అందుకే రాహువు యొక్క దుష్ప్రభావాలనుంచి తప్పుకోవడానికి హనుమంతుడిని పూజించాలి.

మనం ఇప్పుడు 'ఎల్ నినో' అంటున్నదానినే వాల్మీకి 'సింహిక' అన్నాడు. పూర్తిగా అదే ఇది కాకపోవచ్చు.కాని రెండూ సముద్రప్రభావాలే.దగ్గరదగ్గరగా రెండూ ఒక రకమైనవే.

అప్పుడు ముందుకు వెళుతున్న హనుమంతుడిని క్రిందకు లాగాలని ప్రయత్నించింది సింహిక.ఇప్పుడు ముందుకు వెళుతున్న ఋతుపవనాలను వెనక్కు లాగేసింది 'ఎల్ నినో ఎఫెక్ట్'.ఇది రాహుప్రభావమే అంటే ఇప్పుడు ఒప్పుకుంటారా మరి??

ఆమధ్యన మాయమైన మలేషియా విమానం కూడా శపితయోగం మంచి పట్టుమీద ఉన్నపుడే మాయమై ఇంతవరకూ కనిపించకుండా పోయింది.ఇది గమనార్హం.

ఒక్కసారి పక్కన ఉన్న బొమ్మను చూడండి.Wet and warm packet ను మింగుతున్నట్లుగా Dry warm packet సర్పాకారంలో ఉండటం స్పష్టంగా చూడవచ్చు.ఇక్కడ రాహువు మనకు స్పష్టంగా దర్శనం ఇస్తున్నాడు.ఈ కోణంలో చూస్తే, ఇప్పుడు చదువరులకు విషయం కొంత అర్ధం అయిందనుకుంటాను.

కనుక ప్రస్తుతం మండే ఎండలకూ,వడదెబ్బతో ప్రతిరోజూ పోయే ప్రాణాలకూ కూడా  రాహువే కారణం అయ్యాడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయాలు చాలా విచిత్రంగా సూక్ష్మంగా ఉంటాయి.వాటిని చూచే దృష్టితో చూస్తేనే అవి అర్ధం అవుతాయి. ఆషామాషీగా పైపైన చూస్తే అవి అర్ధంకావు.రాహుప్రభావం చిత్రవిచిత్రాలతో కూడి ఉంటుందని ఇంతకు ముందే వ్రాశాను.రాహువుకు 'మాయావి' అని ఒక పేరున్నది.దీనిని మనం జాగ్రత్తగా గమనించాలి.

రాహువు యొక్క విచిత్రమైన ప్రభావాలు ఎలా ఉంటాయో కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇక్కడ వివరించాను.అవి ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి.ఎక్కడికక్కడే ప్రత్యేకంగా ఉంటాయి.ప్రతి సంఘటనా విభిన్నంగా ఉంటుంది.కర్మనుంచి తప్పుకోవడానికి మనిషి అతితెలివితో తీసుకునే జాగ్రత్తలను రాహువు చాలా తేలికగా ఇంకా తెలివిగా అధిగమించగలడు.ఆ వరం ఆయనకు దైవం చేతనే ఇవ్వబడింది.

రాబోయే రోజులలో ఇంకా ఎన్నెన్ని చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతాయో, ప్రజలకు వారివారి కర్మక్షాళనం ఎలా జరుగుతుందో,శపితయోగం ఇంకా ఎన్నిరకాలుగా జనులను కాటేస్తుందో వేచిచూద్దాం.
read more " రాహుప్రభావాలు -- నిత్యజీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు "

24, జూన్ 2014, మంగళవారం

స్వామీ నిత్యానంద-తిరుమల దర్శనం

నిన్న ఇద్దరు కొలీగ్స్ ఏదో మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఖర్మకాలి నేనూ అక్కడకు వెళ్లడం తటస్థించింది.

వారిద్దరూ తమిళులే.కాకుంటే ఒకాయన వీరవైష్ణవుడు.ఇంకొకాయన మామూలు మనిషి.సామాన్యంగా సాంప్రదాయ తమిళ వైష్ణవులకు చాలా చాదస్తమూ,నసా,ఇంకా అనేక ఇతర అతిలక్షణాలూ కలగలిసి ఉంటాయి. ఈయనకూడా వాటికి అతీతుడేమీ కాదు. 

నేను వెళ్లేసరికి వీరవైష్ణవుడు భక్తి గురించి రెండో ఆయనకు వీర లెక్చరిస్తున్నాడు.ఏమి చెబుతున్నాడా అని కాసేపు ఆలకించాను.

కాసేపు వినేసరికి ఆయనకు ఆచరణ లేని విషయాలను ఎకాడెమిక్ గా రెండో వ్యక్తికి వివరిస్తున్నాడని నాకు అర్ధమైపోయింది.

తాము ఆచరించని విషయాలను ఎవరైనా ఇతరులకు చెబుతుంటే అలాంటివారిని ఆటపట్టించడం నాకు భలే సరదాగా ఉంటుంది.

తిరుమల గురించీ అక్కడ ఉన్న పవిత్రత గురించీ,స్వామి యొక్క మహిమల గురించీ లేని తన్మయత్వం నటిస్తూ ఏమేమో చెబుతున్నాడు.

కొద్దిసేపు విని 'ఈమధ్య స్వామి నిత్యానందా రంజితా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు.మీకు తెలుసా?' అన్నాను.

'అవునా?'అని ఆశ్చర్యపోయాడు.

'అవును.వారికి వీఐపీ దర్శనం లభించింది.ఆలయమర్యాదలు కూడా దక్కాయి.'అన్నాను.

ఆయనకు భలే కోపం వచ్చేసింది.

'అలాంటివాళ్ళను అసలు ఆలయం లోనికి రానివ్వకూడదు.' అని అరిచాడు.

ఉడుక్కునే వాళ్ళను మరీ ఉడికించడం మనకు బాగా సరదా కాబట్టి కాసేపు ఈయనతో ఆడుకుందాం అనుకున్నా.

'ఏం తప్పేముంది?' అన్నాను.

'తప్పా?స్వామీజీ అయి ఉండి అలా ఒక స్త్రీతో దర్శనానికి రావడమా?' అని అరిచాడు.

'స్వామీజీనా?ఆయన స్వామీజీ అని ఎవరన్నారు?' అడిగాను.

'అదేంటి కాదా?' అన్నాడు.

'ఏమో నాకేం తెలుసు?మీరేగా స్వామీజీ అన్నారు.ఏ సాంప్రదాయపు స్వామీజీనో మీకే తెలియాలి.పైగా ఆడవాళ్ళతో దర్శనానికి వస్తే తప్పేముంది?చాలామంది అలా వస్తూనే ఉంటారుకదా?' అన్నాను.

'కానీ ఇలాంటివి నేను ఒప్పుకోలేను.'అన్నాడు కోపంగా.

'ఎందుకొప్పుకోలేరు?మీ స్వామికే ఇద్దరు భార్యలున్నారు.ఆయన కృష్ణావతారంలో ఉన్నపుడు ఏకంగా పదహారువేలమంది భార్యలున్నారు. ఆయన పూజారులలో కూడా చాలామందికి ఇద్దరేసి ఉన్నారని జనం అనుకుంటున్నారు.మరి దేవుడికీ పూజారికీ ఇద్దరేసి చొప్పున ఉన్నప్పుడు భక్తుడికి ఎందుకు ఉండకూడదు?ఏం మీ అన్నమయ్యకు ఇద్దరు భార్యలు లేరా?అలాగే ఈ స్వామీజీకీ ఉంటారు.తప్పేముంది?' అన్నాను నవ్వుతూ.

'అయినా పబ్లిగ్గా ఏమిటండి?అసహ్యంగా?' అన్నాడు.

'ఓహో.అదా సంగతి?ప్రైవేట్ గా చేస్తే పర్లేదా?' అడిగాను.

'అదికాదండి.ఆలయమర్యాదలు పాటించాలి కదా?' అన్నాడు.

'ఆలయమర్యాదలు ఆయనేం ఉల్లంఘించలేదే?అందరిలాగే వచ్చాడు. అందరిలాగే తనుకూడా దర్శనం చేసుకున్నాడు.వెళ్ళిపోయాడు. తప్పేముంది?అయినా భక్తుడికీ దేవుడికి లేని బాధ మీకెందుకు?పైగా ఆలయమర్యాదలు ఆయనకు దక్కాయి కదా.ఇంకేమి?' అన్నాను.

'ఇలా చెయ్యబట్టే పవిత్రక్షేత్రాలు భ్రష్టు పడుతున్నాయి.'అన్నాడు.

'అదా మీబాధ?ఇప్పుడు కొత్తగా భ్రష్టు పట్టేదేముంది?తిరుమలలో ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరుగుతున్నదో మీకు తెలియనిదా?పోనీ నేను చెప్పమంటారా?అయినా ఒక్క నిత్యానంద వచ్చి దర్శనం చేసుకుంటే అక్కడ అపవిత్రం అయిపోతుందా?అక్కడకు వచ్చి హుండీలో లక్షలువేసే మిగతా జనాలందరూ పరమ పవిత్రులూనూ నిత్యానంద ఒక్కడే అపవిత్రుడా?దేవుడి దగ్గరకు రావడానికి పవిత్రత అనేది ఒక కొలతా?దానిని ఎలా కొలుస్తారు?పూర్తిగా పవిత్రులూ పతివ్రతలూ మాత్రమె అక్కడకు రావాలి అంటే ఆ వచ్చే భక్తులలో అసలెందరు మిగులుతారో?నిత్యానంద దొరికాడు కాబట్టి దొంగ అంటున్నారు.దొరకని వారంతా దొరలేనా?' అడిగాను అనుమానంగా.

నాతో అనవసరం అనుకున్నాడో ఏమో,'సరే సార్.మనకెందుకు లెండి ఆగోల. వదిలెయ్యండి.'అని టాపిక్ మార్చాడు.

రెండో ఆయనవైపు తిరిగి,'చక్రధ్యానం అని చాలా మంచిది.నెట్లో డౌన్లోడ్ చేశాను.వినండి' అంటూ ఏదో మ్యూజిక్ సెల్లులో వినిపిస్తున్నాడు.నేనూ కాసేపు అది విన్నాను.

'చక్రాస్ అంటే ఏమిటి?'అని రెండో ఆయన అడిగాడు.

ఇక మనవాడు విజ్రుంభించాడు.ఉన్నవీ లేనివీ కల్పించి తెగ చెబుతున్నాడు.

చాలాసేపు మౌనంగా వింటున్నాను.నవ్వాగడం లేదు.

నేను నవ్వడం చూచి 'నవ్వడం కాదు సార్.ఈ ధ్యానం కొన్నాళ్ళు చేస్తే మీకు తెలుస్తుంది.'అన్నాడు.

'కొన్నాళ్ళకే అంతా తెలిసిపోతుందా?ఆ ధ్యానం ఎలా చెయ్యాలి?' అడిగాను.

'అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కవిధంగా తెలుస్తుంది.నెట్లో ఉన్నది.మీరూ డౌన్లోడ్ చేసుకుని కళ్ళుమూసుకుని ఈ మ్యూజిక్ వింటూ ఉండండి.అదే ధ్యానం' అన్నాడు.

'అదేంటి ధ్యానం అంటే ఇంత సింపులా?అయినా నాదొక సందేహం.ఈ చక్రాలూ ఇదంతా శైవతంత్రం కదా.మీరేమో వైష్ణవులు.వైష్ణవంలో దీనిని ఒప్పుకోరేమో?' అడిగాను.

'ఏమో అదంతా నాకు తెలియదు.నాకు బాగుంది.నేను చేస్తున్నాను.' అన్నాడు మొండిగా.

'మరి మనం అడిగితే,స్వామి నిత్యానంద కూడా ఇదేమాట అంటాడేమో?'అడిగాను.

కాసేపు ఆలోచించాడు.

'అలాకాదు.స్వామీజీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి.' అన్నాడు.

'అవును.మన ఇష్టం వచ్చినపనులు మనం చెయ్యవచ్చు.కాని స్వామీజీ కాబట్టి ఆయన అలాంటి పనులు చెయ్యకూడదు.చేస్తే మనకు కోపం వస్తుంది.అంతేనా? పైగా ఆయన సమాజానికి ఆదర్శంగానే ఉన్నాడుకదా. జనానికీ అదే కావాలి.ఆయనా అదే చేస్తున్నాడు.సరిపోయింది.అంతా బానే ఉందికదా?ఇక మనకెందుకు కోపం?' అన్నాను.

'ఏమో నాకర్ధం కావడం లేదు.కాని ఆయన చేసినది తప్పే.' అన్నాడు.

'తప్పో ఒప్పో నాకు తెలీదు.కాని ఒక్క విషయం నాకు బాగా అర్ధమౌతున్నది.'అన్నాను.

'ఏంటది' అడిగాడు.

'మీకు దక్కని సుఖాలు ఆయనకేవో దక్కుతున్నాయన్న అసూయ మీలో బాగా కనిపిస్తున్నది' అన్నాను నవ్వుతూ.

'ఛీ ఛీ నాకెందుకు అసూయ?' అన్నాడు కోపంగా ముఖం పెట్టి.

నాకు ఒకపక్కన చచ్చే నవ్వు వస్తున్నది.

'అసూయ లేకపోతే మధ్యలో మీకెందుకు కోపం?ఆయన బాధలేవో ఆయన పడుతున్నాడు.ఆయన్ను అనుసరించేవారు అనుసరిస్తున్నారు.ఆయనకీ వాళ్ళకీ లేనిబాధ మధ్యలో మీకెందుకు?' అడిగాను.

'ధర్మం నాశనమౌతున్నది.'అన్నాడు ఆవేశంగా.

'ఓహో అదా.ధర్మం నాశనం అవుతున్నదనా మీబాధ?నాశనమయ్యేది ధర్మం ఎలా అవుతుంది?ఎప్పటికీ నశించనిదే కదా ధర్మం?ఆయన తిరుమలకు రాకముందు అక్కడ ధర్మం నాలుగుపాదాలతో నడుస్తున్నదా?మీరు సర్టిఫై చెయ్యగలరా?' ప్రశ్నించాను.

'లేవని కాదు.ఉంటాయి.జరుగుతాయి.కానీ అన్నీ స్వామి చూచుకుంటారు.' చెప్పాడు.

'మరయితే దీనిని మాత్రం స్వామి చూచుకోడా? ఈ ఒక్క విషయం మీద మన తీర్పు ఎందుకు? దేవుడే అన్నీ చూచుకుంటాడు అనుకున్నపుడు ఇంక మనం కామెంట్ చెయ్యకూడదు.అన్నీ దేవుడికే వదిలెయ్యాలి.కొన్ని మాత్రం ఆయనకు వదిలి మరికొన్నింటిని మాత్రం మనం వ్యాఖ్యానం చెయ్యబోవడం ఎందుకు?అన్నిటినీ చూచుకునే దేవుడు నిత్యానందను వదిలేస్తాడా?ఆయనే నిత్యానందను తనవద్దకు రప్పించుకున్నాడేమో?మనకేం తెలుసు?' అడిగాను.

'అయితే మీరు నిత్యానందను సమర్ధిస్తున్నారా?' అడిగాడు.

'ఆయన్ని నేను సమర్ధించడం లేదు.విమర్శించడమూ లేదు.ఆయన నాకు చుట్టమూ కాడు.శత్రువూ కాడు.ఆయనతో నాకు పనిలేదు.మీ ఆధారరహిత అభిప్రాయాలను మాత్రమె నేను ప్రశ్నిస్తున్నాను' చెప్పాను.

'ఏంటో అంతా గందరగోళంగా ఉన్నది.మీతో మాట్లాడకముందు అంతా క్లియర్ గా ఉంది.ఇప్పుడు అంతా అయోమయం అయిపొయింది'-అన్నాడు.

'కరెక్ట్.అయోమయం ఈజ్ డైరెక్ట్ లీ ప్రోపోర్షనల్ టు ట్రూ నాలెడ్జ్.ఎంతగా అయోమయం అయిపోతే అంతగా మీకు సత్యం అర్ధమౌతుంది.పూర్తిగా అయోమయం అయితే అప్పుడు మీకు సత్యం పూర్తిగా ఎక్కుతుంది. ప్రస్తుతానికి మీరింకా ఆ స్థితికి రాలేదు గనుక ఇప్పుడు తత్త్వం పూర్తిగా అర్ధం కాదు.ఇంకా బాగా అయోమయంగా మారడానికి ప్రయత్నించండి.ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం.'అన్నాను.

అతను అలాగే అయోమయంగా చూస్తున్నాడు.

'మళ్ళీ కలుద్దాం.మీ చక్రధ్యానం కొనసాగించండి.' అంటూ నాదారిన నేను వచ్చేశాను.
read more " స్వామీ నిత్యానంద-తిరుమల దర్శనం "

23, జూన్ 2014, సోమవారం

ఆనంద నాట్యం




ప్రకృతి మొత్తం 
ఆనందనాట్యం చేస్తోంది 
తన హృదిలో ఉన్న ప్రియునిమోమును 
తదేకంగా చూస్తోంది 

యుగయుగాల ఆటల్లో  
చిలిపి దాగుడుమూతల్లో 
చిప్పిల్లిన ఆనందం 
లోకంగా మారింది 

ప్రియునిగా ఉన్న తాను 
ప్రేయసిగా మారింది 
తిరిగి ప్రియుని వెదుకుతోంది 
వింతైన ఆటలలో వినోదాన్ని పొందుతోంది 

ఆటకోసం ఈ జాలం 
సమస్తం సృష్టించింది 
ఆట జోరుగా సాగుతోంది 
ఆనందం వెదజల్లుతోంది 

తెలియని వారికి వెలుగులూ చీకట్లు 
తెలిసినవారికి రెండూ ఒకటే
రెంటినీ మించిన రెండూ తానైన 
వెలుగు కానట్టి ఒక వింతవెలుగు 

ఎగిరే గాలిపటాలలో 
ఏదో ఒకటి తెగిపోతోంది 
విశ్వాంతరాళంలో వేగంగా ఎగురుతోంది 
దారం ఆధారం లేకనే దిక్కులలో విహరిస్తోంది 

క్షణకాలం ప్రియుని కౌగిలిలో 
కళ్ళుమూసి సేదతీరుతుంది 
మరునిముషం ప్రియునితో 
చిలిపి ఆటలాడుతుంది 

ఇంకోక్షణం బుంగమూతితో 
అలిగి దూరంగా పోతుంది 
మరుక్షణం ముద్దు మాటలతో 
ప్రేమగా లాలిస్తుంది 

ఒక నిముషం భక్తిగా సేవిస్తుంది 
మరునిముషం కాలితో తాడిస్తుంది 
చిలిపితనం రూపుదాల్చింది 
ప్రేమహృదయం తనకే ఉంది 

ఏడ్చేవారిని చూస్తూ
ఎక్కువగా నవ్వుతుంది 
నవ్వేవారిని మట్టుకు 
ఏడిపింప చేస్తుంది  

రెండూ సంద్రపు అలలని  
ఎరిగినవారిని మాత్రం 
ఓరకంట చూస్తూ
చిలిపినవ్వు రువ్వుతుంది

ఆట వద్దు పొమ్మంటే 
అమితబాధలు పెడుతుంది 
వాటిలో గెల్చినవారిని  
ఒడిలోనికి లాగుతుంది

తనలా మారినవారిని 
తనతో ఆడనిస్తుంది
వారడిగిన తాయిలం 
ఏదైనా వెంటనే ఇస్తుంది  

ప్రకృతి ఆనందనాట్యం చేస్తోంది
తన ప్రియుని మోమును 
పరవశించి చూస్తోంది...........
read more " ఆనంద నాట్యం "

22, జూన్ 2014, ఆదివారం

వింతలోకం

1.
తే||పెట్టి పుట్టుదురిచ్చట పెద్దలగుచు
గోసుమీరగ లోకులు గొప్పలంది
పుట్టి పెట్టకపోయిన ఫలము లేదు
పుట్టగతులను గాంచరు పుడమిలోన

పూర్వపుణ్య బలం వల్ల ఈ జన్మలో అన్నీ అమరిన జన్మ కలుగుతుంది.కానీ అంతటితో గర్వాన్ని పెంచుకొని,ఇప్పుడు దాతృత్వాన్ని కలిగి ఉండక, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యక,విలాసాలలో కాలం గడిపితే, ముందు జన్మలలో పుణ్యబలం తగ్గి ఘోరమైన పరిస్థితులలో పుట్టడం జరుగుతుంది. 

2.
కం||పుట్టిన చాలదు భువిలో
పుట్టిన దానికి పరులకు పెట్టగ వలయున్
పుట్టియు పెట్టని వారలు
పుట్టలవలె చెదలుబట్టి పోదురు సత్యా

ఈలోకంలో పుట్టడం గొప్పకాదు.పుట్టినడానికి నలుగురికీ చేతనైనంత సహాయం చెయ్యాలి.పుట్టికూడా పెట్టనివారు చెదలు బట్టిన పుట్టలవలె నిరర్ధకులౌతారు.

3.
ఆ||చేసికొన్న కర్మ చెల్లించవలెగాదె
రాజులైన వీతరాగులైన
కర్మపట్టి నడపు మర్మంపు రీతులన్
కర్మ దాటువాడె గట్టివాడు

చేసికొన్న కర్మ ఎంతటివారినీ వదలిపెట్టదు.అది రాజులైనా విరాగులైనా ఎవరు చేసిన కర్మను వారనుభవించక తప్పదు.పూర్వకర్మ చాలా విచిత్రమైన రీతులలో మనిషిని నడిపిస్తుంది.ఆ కర్మగతిని అర్ధం చేసుకొని దానిని జయించిన వాడే నిజమైన ఘనుడు.

4.
ఆ||మదము నిండియున్న మనుజుడెప్పుడు గాని
మంచిమాట లాలకించబోడు
కాలమెదురు వచ్చు కల్లోల సమయాన
కుమిలి ఏడ్చుకొనుచు కుందుగాని

మదం నిండి యున్నపుడు మంచిమాటలు చెప్పినా రుచించవు.కానీ కాలం ఎదురు తిరిగి ఆ మదం మాయమైన రోజున ఏడ్వవలసి వస్తుంది.కాలం ఎవరినీ ఎల్లకాలం చక్కగా చూడదు.

5.
ఆ||కూడబెట్టువారు ఖర్చుజేసెడివారు
వేచిచూచువారు వెరయువారు
జగమునందు నిండు జనసమూహము లెల్ల
దిక్కు దెలియలేక సొక్కువారు

ఈ లోకంలో నాలుగు రకాలైన మనుష్యులున్నారు.

1.కర్మను కూడబెట్టుకుంటున్నవారు.
2.కర్మను ఖర్చు చేస్తున్నవారు.
3.భయంతో జాగ్రత్తగా కర్మను చేస్తున్నవారు.
4.ఏమీ చెయ్యకుండా వేచిచూస్తున్నవారు.

వెరసి వీరెవరూ కర్మరహస్యాన్ని అర్ధం చేసుకున్నవారు కారు.

6.
ఆ||బలిమి యున్ననాడు బంబోతుగా నిల్చు
బలిమి దప్పునాడు బొగిలి ఏడ్చు
హీనులైనవారి మానంబులీ తీరు
సమత నిల్చువాడె సజ్జనుండు

బలం ఉన్నపుడు అట్టహాసంగా విర్రవీగుతారు.బలం పోయినపుడు భోరున ఏడుస్తారు.హీనమనుష్యుల తీరు ఇలాగే ఉంటుంది.ఉన్నా లేకున్నా సమత్వంలో ఉన్నవాడే సజ్జనుడు.

7.
ఆ||ఉన్ననాడు జూడ నువ్వెత్తుగా లేచి
లేనినాడు సొక్కు లౌకికునకు
కర్మచిత్రమెట్లు కనవచ్చు?నిలలోన
కాలుసేతులెల్ల గట్టియుండ

ధనం ఉన్నపుడు గర్వంతో విర్రవీగి,లేనప్పుడు కుంగిపోయే లోకులకు కర్మరహస్యాలు ఎలా అర్ధమౌతాయి?వారి కాళ్ళూ చేతులు కర్మ అనే బలమైన త్రాళ్ళతో కట్టివేయబడి ఉన్నాయి.కనుక వారు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోలేరు.

8.
ఆ||బాధలందుగాని బయలంద రాబోడు
విసిగి ఏడ్చుగాని విడువబోడు
లొట్టిపిట్ట మేయు గట్టి కంటకముల
నోరు కోతబడిన నొచ్చుకొనక

నానాబాధలూ పడుతూ సంసార సముద్రంలో మునకలేస్తూ ఏడుస్తూ ఉంటారుగానీ లౌకికులు దానిని వదలిపెట్టరు.బయటకు రారు.తన నోరు చీరుకొని పోయి రక్తమోడుతున్నా కూడా ఒంటె, ముళ్ళను మేస్తూనే ఉంటుంది గాని విడచిపెట్టదు.

9.
 ఆ||కర్మదగులువాడు కల్ల మీరగలేడు
కల్లమీరబోక కడమ రాదు
కల్లకర్మ నెల్ల కమనీయముగమార్చు
పరుసవేది నంద పట్టుజిక్కు

కర్మజాలంలో చిక్కుకున్నవాడు అసత్యపు పట్టునుంచి బయట పడలేడు. అసత్యాన్ని వదలకపోతే సత్యం అందదు.కల్లయైన కర్మను సుకర్మగా మార్చే పరుసవేదిని పట్టుకుంటే అప్పుడు కర్మరహస్యం అర్ధమౌతుంది.

10.
కం||నానా బాధల నందుచు
హీనంబుల వెంట దిరుగు హీనాత్ములకున్
కానగ వచ్చునె మోక్షము?
దీనాంధుడు గానలేని దినకరు పగిదిన్

గుడ్డివాడు సూర్యుని ఎలాగైతే చూడలేడో అలాగే,హీనమైన విషయాల వెంట పరువెత్తే హీనాత్ములు మోక్షమును ఎలా చూడగలరు?దానికోసం ఎలా ప్రయత్నం చెయ్యగలరు? చెయ్యలేరు.

11.
ఆ||ఏండ్లు బెరుగునంచు హెచ్చులందుటె గాని
ఆయువణగు నంచు నెరుగలేరు
బంధనముల దగిలి భేషజమ్ములె గాని
మోసపోతిరన్న మాటవినరు

వయస్సు పెరుగుతున్నదని పొంగిపోవడమేగాని ఆయువు హరించుకు పోతున్నదని గ్రహించరు లోకులు.రకరకాలైన బంధాలలో చిక్కుకుని విర్ర వీగడమేగాని అనుక్షణమూ మోసగింపబడుతున్నామన్న విషయం వారికి స్ఫురించదు.

12.
కం||నావారలు నావారని
జీవితమంతయు జెలగిన చిత్రపు రీతుల్
జీవన్మరణపు ఘడియల
వివరంబుగ దెలియవచ్చు వడిజను వేళన్

నావాళ్ళు నావాళ్ళని జీవితమంతా ఎవరికోసమైతే నీవు వెంపర్లాడుతున్నావో వారు నీ చివరి ఘడియలలో ఒక్కరైనా నీతో తోడుగా వస్తారా? ఆలోచించు.ఈ విషయం ఇప్పుడు అర్ధం కాదు.చివరి క్షణాలలో కొంత అర్ధమౌతుందేమో?అప్పుడు అర్ధమయ్యీ ఉపయోగం ఏమీ ఉండదు.అప్పటికే అంతా ఆలస్యమై పోతుంది.

13.
కం||మాయను జిక్కిన లోకులు
మాయాతీతుల మటంచు మదిలో నెంచన్
లోయల దిరిగెడి సర్పము
వాయుపధంబున నెగిరెడు వాటము గాదే?

మాయలో నిండుగా కూరుకుని ఉన్న మనుష్యులు తాము చాలా తెలివైన వారమని మాయాతీతులమని భావించుకోవడం ఎంత విచిత్రం?చీకటి లోయలలో రాళ్ళూరప్పల మధ్యన తిరిగే పాము,విశాలమైన ఆకాశంలో తాను హాయిగా ఎగురుతున్నానన్న భ్రమలో ఉండటం వంటిదే ఇదికూడా.

14.
కం||నాకోసమె నావారలు
నాకొరకే వస్తుచయము నానా విధముల్
నాకే సర్వం బనుచున్
వ్యాకులతల జిక్కియుంద్రు లోకులు సత్యా

15.
కం||నేనను గర్వంబందున
తానేమని దెలియలేని తామసుడొకచో
నేనేమను నిజమెరుగగ;
నానాటికి దీరునిచటి నాటకమెల్లన్

నాకోసమే నావారిని నేను ప్రేమిస్తున్నాను.నాకోసమే సమస్త వస్తువులనూ నేను ప్రేమిస్తున్నాను.నేను నేననే గర్వం ఎందుకు?ఇది ఎక్కడనుంచి వస్తున్నది?ఎలా ఉద్భవిస్తున్నది?అసలు ఈ 'నేను' ఎవరు?అన్న ఒక్క విషయం చక్కగా గ్రహిస్తే ఈ నాటకం అంతా ఆరోజే ముగుస్తుంది.

16.
కం||ఎందుకు జేరితినిలలో?
ఎందుకు నేజేయుచుంటి నెంచగ కర్మల్
ఎందుకు జిక్కితి నానా
బంధంబుల నంచు జూడు పదపడి సత్యా

ఈలోకానికి ఎందుకు వచ్చినాను?ఎందుకు ఈ కర్మలను చేస్తున్నాను?ఈ నానా బంధాలలో ఎందుకు చిక్కుకున్నాను?అన్న విషయాలను లోతుగా పరిశీలించి గ్రహించాలి.

17.
కం||నమ్మితి వందరి నిలలో
నమ్మిన ప్రతిచోట నీకు నగుబాటయ్యెన్
నమ్మకుమీ నాటకముల
సొమ్మగు నీయాత్మ నెపుడు నమ్మర సత్యా

ఇప్పటివరకూ అందరినీ నమ్మి మోసపోయావు.నమ్మిన ప్రతిచోటా నీకు మోసమే ఎదురైంది.నగుబాట్ల పాలయ్యావు.ఇక ఈ నాటకాలను నమ్మకు. ఎప్పుడూ నీతోడుగా ఉండే నీ ఆత్మనే ఎల్లప్పుడూ నమ్ము.

18.
ఆ||కాలహరణ జేయు కపటంబులను మీరి
సూటిమార్గమందు వాటమొప్ప
వేగ నడువవలయు వైరాగ్యమును బూని
మోసమందు గలదె మోక్షసుఖము?

అనవసరములైన మాయమాటలనూ కపటపు వేషాలనూ వదలిపెట్టు. వైరాగ్యఖడ్గాన్ని చేతబూని రాజమార్గంలో నడచి ముందుకు సాగు.మోసంతో మోక్షం ఎన్నటికైనా లభిస్తుందా?

19.
కం||ఆశింపకు లోకులకడ;
నాశింపకు లోకమొసగు ఆడంబరముల్
ఆశింపకు మన్యాయపు
మోసంబగు విత్తమెపుడు మదిలో సత్యా

లోకుల వద్ద ఏమీ ఆశించకు.లోకపు ఆడంబరాలను అసలే కోరుకోకు. అన్యాయంగా సంపాదించే ధనాన్నీ కోరకు.ఇవన్నీ నీ కర్మను విపరీతంగా పెంచుతాయి.నిన్ను ఇంకా ఇంకా బంధాలలో బిగిస్తాయి.

20.
ఆ||రెండు మూడునాళ్ళ రంగంబు నేగోరి
కాలదన్న నగునె కలిమికొండ
నిరతముండు విభుని నిర్లక్ష్యమే జేసి
ముద్దు జేయనగునె? మూర్ఖజనుల

రెండు మూడు రోజులుండే ఈ నాటకాన్ని ఆశించి ఎప్పుడూ నీతోడుగా ఉండే శ్రీపర్వతాన్ని కాలదన్నుకుంటావా?నిత్యమూ నీ వెన్నంటి ఉన్న దైవాన్ని నిర్లక్ష్యం చేసి మూర్ఖపు లోకులను చేరదియ్యడం సబబేనా?

21.
ఆ||బ్రదుకు తెరువు కొరకు భవబంధముల జిక్కి
అదియె సర్వమనుచు అరవనేల?
జీవమెటుల గలిగె? జీవనంబేమన్న
చింతనంబు గలుగ చిక్కుదీరు

బ్రతకడం కోసం పని చేస్తున్నాము.కానీ అహంలో చిక్కి పదవులూ ధనమూ పరమార్ధమనీ అదేదో గొప్ప అనీ విర్రవీగడం సరియేనా?అసలు నీలో జీవం ఎలా వచ్చింది?నీ జీవితగమనం ఎటు పోతున్నది?దీని తీరుతెన్నులేమిటి?ఇప్పటివరకూ ఆధ్యాత్మికంగా నీవు అసలేమైనా పొందినావా?లేదా? అనే చింతన నిజంగా చేసిచూస్తే నీ కర్మగతి అర్ధమయ్యి కనులకు కప్పిన గంతలు వీడిపోతాయి. అప్పుడు సత్యమేమిటో తెలుస్తుంది.
read more " వింతలోకం "

20, జూన్ 2014, శుక్రవారం

శపితయోగపు ఆఖరి ఘట్టం

ప్రస్తుతం శపితయోగం తన చివరిఘట్టంలోకి వస్తున్నది.త్వరలో రాహువు శనీశ్వరుని చెలిమిని వదలి వెనక్కు మరలి కన్యారాశిలోకి అడుగుపెట్ట బోతున్నాడు.ఏడాదిన్నర నుంచీ ప్రజలను పీడిస్తున్న రాహుప్రభావం త్వరలో మాయం కాబోతున్నది.

కానీ ఏడాదినుంచీ బలీయమైన శపిత యోగాన్నించి జనులను ఒక శక్తి రక్షిస్తున్నది.అదే దేవగురువు బృహస్పతి యొక్క దృష్టి.మిధునరాశినుంచి తన కరుణాపూరితమైన పంచమదృష్టితో శనిరాహువులను వీక్షిస్తున్న గురువువల్ల అనేకమంది అనేక ప్రమాదాలనుంచి వారికి తెలియకుండానే రక్షింపబడ్డారు.

కానీ మరి నిత్యం జరుగుతున్న సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.

ఎవరైతే అయాచితంగా లభిస్తున్న దేవగురువు యొక్క అనుగ్రహాన్ని చేజేతులా కోల్పోయారో,లెక్కచెయ్యకుండా అహంతో దానిని కాల దన్నుకున్నారో అలాంటివారే ఈ శపితయోగానికి బలయ్యారు.ధర్మాన్ని అనుసరిస్తూ పద్దతిగా దానికి లోబడి ఉన్నవారిమీద శపితయోగపు ప్రభావం ఎంతమాత్రమూ లేదు.

జాగ్రత్తగా గమనిస్తే ఒక్కవిషయం స్పష్టంగా గోచరిస్తుంది.అందరూ దీనికి బలికాలేదు.కొందరే దానివాత బడ్డారు.దీనికి కారణం ఇదే.తెలిసో తెలియకో ఎవరైతే దేవగురువు బృహస్పతి నీడలో ఉన్నారో,ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉన్నారో వారు ఈ శపితయోగపు ఛాయనుంచి క్షేమంగా బయటకు వచ్చారు.ఎవరైతే దానిని కాలదన్నుకున్నారో వారు కాలసర్పం నోట పడిపోయారు.

ప్రస్తుతం రాబొయే నెలా నెలన్నరలో అతికీలకమైన మార్పులు చోటు చేసుకో బోతున్నాయి.దానికి ఒక బలీయమైన కారణం ఉన్నది.

ఇన్నాళ్ళూ శపితయోగపు బారి నుంచి రక్షిస్తున్న బృహస్పతి అనుగ్రహం ఇప్పుడు నిన్నటినుంచి తొలగిపోయింది.బృహస్పతి కర్కాటకరాశి లోకి మారడంద్వారా తులారాశి మీద ఇప్పటివరకూ ఉన్న ఆయన దృష్టి మాయమైంది.

కనుక చకచకా కలిగే కొన్ని మార్పులను ఇప్పుడు అందరూ ప్రత్యక్షంగా చూడవచ్చు.

ఎవరైతే దైవానుగ్రహానికి దూరంగా ఉన్నారో వారందరికీ ఇప్పుడు శిక్షలు పడటం మొదలౌతుంది.నిత్యజీవితంలో ఎవరికివారు గమనించుకుంటే నిన్నటినుంచీ చిన్నాపెద్దా సంఘటనలలో ఎవరికి వారికి సమస్యలు పెరగడం,మానసికశాంతి కోల్పోవడం,యాక్సిడెంట్లు కావడం,దెబ్బలు తగలడం,రోగాలు తిరగబెట్టడం,దూరపు ప్రయాణాలు చెయ్యవలసి రావడం, జీవితం విసుగ్గా మారడం,ఉన్నట్టుండి చెడుకాలం మొదలుకావడం మొదలైన సంఘటనలు జరగడాన్ని గమనించవచ్చు.

నేను చెబుతున్న దానిలో నిజం ఎంతో మీకుమీరే మీ జీవితాలనూ మీ చుట్టుపక్కల జరుగుతున్న అనేక సంఘటనలనూ కళ్ళు తెరిచి చూడండి. గమనించండి.నా మాటలలో నిజం ఏమిటో మీకే గోచరిస్తుంది.

రాబోయే నెలన్నర కాలం చాలా కీలకమైనది.మనల్ని రక్షిస్తున్న దైవకృప ఇప్పుడు పక్కకు తప్పుకుంది.ప్రస్తుతం అందరమూ దైవన్యాయస్థానపు బోనులో నిలబడి ఉన్నాము.శిక్షకోసం వేచిచూస్తున్నాము.ఇక ఎవరి తప్పులకు తగినట్లు వారికి శిక్షలు పడటం ఖాయం.దీనినుంచి మనల్ని రక్షించగలిగేది ఒక్క ధర్మం మాత్రమే.

ధర్మపుఛాయలో నిశ్చింతగా ఉండండి.

శపితయోగపు కోపం నుంచి తప్పుకోండి.

లేదా మీఇష్టం.

మిగిలి ఉన్న కర్మబాకీలను రాబోయే నెలన్నరలో రాహువు చాలా చిత్రవిచిత్రమైన విధానాలలో,ఎవరి ఊహలకూ అందని అనూహ్యమైన రీతులలో పూర్తి చెయ్యబోతున్నది.ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నవారైనా ఈ ప్రభావానికి అతీతులు ఏమాత్రమూ కారు.

ఈ కర్మాగ్రహం నుంచి రక్షించేది ప్రస్తుతం ఒక్క ధర్మాచరణమే అన్నది ప్రత్యక్ష సత్యం.ధర్మపు చేతిని పట్టుకుని ఉన్నంతవరకూ ఏమీకాదు.దానిని వదలిన మరుక్షణం రాహుప్రభావంలోకి మీరు వెళ్ళవలసి వస్తుంది.అప్పుడు చింతించి ఎంతమాత్రం ఉపయోగం ఉండదు.

చెప్పడమే నా ధర్మం.వినకపోతే మీ ఖర్మం.
read more " శపితయోగపు ఆఖరి ఘట్టం "