“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, డిసెంబర్ 2021, ఆదివారం

మా ఆశ్రమ స్థలమహత్యం

ఉత్సాహభరిత పండుగ రోజులు

24-12-2021 న మా ఆశ్రమస్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రోజు మార్గశిర బహుళ పంచమి. పంచమిరోజున పంచవటికి పంచ దొరికింది. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు.

"పెట్టింది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం" అనేది జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కులలో ఒకటి. అదే విధంగా, ఈ సంఘటన కూడా జరిగింది. ఇది నేననుకొని పెట్టిన ముహూర్తం కాదు. ఆ విధంగా అలా కలసి వచ్చింది. ఒక అద్భుతమైన రోజున, మేము ఊహించనిరీతిలో, శరవేగంగా ఈ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది.

ఈ రోజు ప్రాముఖ్యతను వినండి మరి.

24-12-1886 న నరేన్,  రాఖాల్,బాబూరామ్, తారక్, శశిభూషణ్, శరత్ మొదలైన యువకులు సన్యాసదీక్షను స్వీకరించి, వివేకానంద, బ్రహ్మానంద, ప్రేమానంద, శివానంద, రామకృష్ణానంద, శారదానంద మొదలైన సన్యాసనామాలను స్వీకరించారు. ఇది బెంగాల్లో అంతపూర్ అనే ఊరిలో జరిగింది. కామార్పుకూరు వెళ్లే దారిలో మేమీ అంతపూర్ అనే ఊరిలో ఆగి ఉపాహారం సేవించాము. అంతపూర్ అనేది ఆ విధంగా ఒక చారిత్రాత్మకమైన ఊరు. అక్కడే రామకృష్ణ మఠానికి పునాది పడింది. 

సరిగ్గా 135 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ 24 తేదీన "పంచవటి ఆశ్రమస్థలం" రిజిస్ట్రేషన్ జరిగింది. మర్నాడు క్రిస్మస్, అది కూడా పవిత్రమైన రోజే. క్రీస్ట్ అంటే మాకేమీ ద్వేషం లేదు. క్రిస్టియన్స్ మనల్ని  ద్వేషిస్తారు గాని, మనకు వాళ్ళన్నా, క్రీస్ట్ అన్నా వ్యతిరేకభావం ఏమీ ఉండదు. మతమార్పిడులు, హిందూదేవతలను తిట్టడాలంటే మనకు గిట్టదు గాని, క్రీస్ట్ యొక్క ఒరిజినల్ బోధనలంటే మనకిష్టమే. ఎందుకంటే, వాటికీ హిందూమతానికీ ఏ భేదమూ లేదు కాబట్టి. పైగా, క్రీస్ట్ కూడా భారతదేశం వచ్చి యోగసాధన చేసినవాడే. ఆయన నేర్చుకున్నదంతా ఇక్కడే నేర్చుకున్నాడు. హిమాలయాలలో బౌద్ధాన్ని నేర్చుకున్నాడు. కనుక ఆయనంటే మాకేమీ ద్వేషం లేదు.

ఇకపోతే, ఈరోజు శారదామాత జన్మదినం. ఇది క్రిస్మస్ కంటే ఇంకా పవిత్రమైన రోజు. ఆమెను సాక్షాత్తు కాళికాదేవిగా, శ్రీ రామకృష్ణులవారే పూజించారు. కనుక, ఇలాంటి పవిత్రమైన రోజులలో మా ఆశ్రమస్థలం రావడం చాలా శుభసూచకమని నా భావన.

కాళీకటాక్షం - శక్తి ఉపాసన

మా ఆశ్రమస్థలం వచ్చిన ఊరి గ్రామదేవత పేరు అంకమ్మతల్లి. అంకమ్మ. అంకాలమ్మ అనేవి  కాళికాదేవి యొక్క గ్రామీణపేర్లు. పల్లెటూర్లలో, అంకమ్మ, అంకయ్య, అంకమ్మరావు మొదలైన పేర్లున్నవారు చాలామంది కనిపిస్తారు. ఈ పేర్లు చాలా మంచివి. శక్తిస్వరూపిణి అయిన కాళికాదేవి పేర్లవి. ఆ పేర్లను పెట్టుకున్న వాళ్ళందరూ జీవితంలో బాగా వృద్ధిలోకి రావడాన్ని నేను గతంలో చాలాసార్లు గమనించాను\. తమిళనాడులో కూడా అమ్మాయిలకు 'అంకి' 'అంకు' అనే పేర్లుంటాయి. అవికూడా అంకమ్మతల్లి పేర్లే.

మన గ్రంధాలలో ఈమెకే "చాముండి" అనే పేరుంది. ఈమెను సప్తమాతృకలలో  ఒకరుగా దేవీభాగవతం వర్ణించింది. ఈమెకే మరోపేరు మహిషాసురమర్దిని. విజయవాడలోని దుర్గమ్మతల్లి మూలవిగ్రహం మహిషాసురమర్దినీ రూపంలోనే ఉంటుంది. మైసూరు చాముండీహిల్స్ లో ఉన్న అమ్మవారు ఈమెయే. అమ్మతల్లులుగా మన దేశంలోని పల్లెపట్టులలో పూజించబడేవారు నిజానికి సప్తమాతృకలే. వీరిలో కాళి, చాముండిల గ్రామీణనామమే అంకమ్మతల్లి. ఆ ఊరిలో ప్రవేశిస్తున్నపుడే, అంకమ్మతల్లి గుడి కనిపించింది. చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా, ఆశ్రమస్థలంకోసం ఎక్కడెక్కడో తిరిగి, చివరకు మా ఆరాధ్యదేవత కాళికాదేవి పాదాలచెంతకే చేరాం మేము.

తాంత్రికబౌద్ధం

ఏడవ శతాబ్ద సమయంలో  తాంత్రికబౌద్ధం పరిఢవిల్లిన కాలంలో ధరణికోట మొదలైన బౌద్ధక్షేత్రాలు  తాంత్రికబౌద్ధానికి పట్టుకొమ్మలుగా ఉన్నాయి. చైనా వాడైన హ్యూయన్ సాంగ్ కూడా, ప్రాణాలకు తెగించి, మంచుకొండలలో ప్రయాణించి, చైనానుండి ఆంధ్రాలో ఉన్న ధరణికోటకొచ్చి ఆయా మంత్రసాధనలు నేర్చుకుని వెళ్ళాడు.

తాంత్రికబౌద్ధంలో తారాదేవి, మరీచి, లలిత, ఛిన్నముండ మొదలైన దేవతలున్నారు. వీరందరూ కాళికాదేవికి మారురూపాలే. ఈ ప్రభావంతోనే, దక్షిణాదిన పల్లెలలో అమ్మ తల్లులు వెలిశారు. ఆ విధంగా మలి వేదకాలపు శక్తి ఆరాధన, కాలగమనంలో కనుమరుగై, బౌద్ధతంత్రాలలో మళ్ళీ మొలకలెత్తి, మధ్యయుగాలలో పునరుజ్జీవింపబడిన హిందూమతంలో  రకరకాల దేవీరూపాలుగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయాలు సామాన్యజనానికి తెలియవు. సామాన్యులకే కాదు, హిందువులమని చెప్పుకునే కోట్లాదిమందికి కూడా, హిందూమతం యొక్క పరిణామక్రమమూ, పతనోధ్ధానాలూ  ఏవీ తెలియవు. గుడికెళ్ళి మొక్కుకోవడం తప్ప వారికేమీ తెలియదు. వారికి వారి మతం యొక్క గొప్పదనం తెలిదు కాబట్టే, మతమార్పిడులు జరుగుతున్నాయి. అమాయక హిందువులు, ఎవరేది చెబితే వాటిని నమ్ముతున్నారు. మతాలు మారుతున్నారు. ఇదొక చేదువాస్తవం.

సరే, ఆ విషయాలనలా ఉంచితే, అప్పట్లో ఒంగోలు ప్రాంతమంతా తాంత్రికబౌద్ధం విలసిల్లింది. నేటికీ ఒంగోలు సిటీకి అధిదేవత రాజరాజేశ్వరీదేవియే. అంటే, లలితాదేవి.  నేను వ్రాసిన 'లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' పుస్తకాన్ని చదివినవారికి, లలితోపాసనా, శక్తి ఆరాధనా రహస్యాలూ, ఆచరణపరంగా కాకపోయినా, కనీసం బౌద్ధికంగా నైనా అర్ధమై ఉంటాయని ఆశిస్తున్నాను.

అదే ఒంగోలు దగ్గరకు, అవే పల్లెటూర్లకు ఇప్పుడు మేమొచ్చి చేరాము. మా ఆశ్రమం ఇక్కడే వస్తున్నది. బయటకు కనిపించని కర్మలింకులు  ఆ విధంగా ఉంటాయి మరి !

బుద్ధునితో నా అనుబంధం

బుద్ధునితో నాకున్న అనుబంధం గురించి 'మ్యూజింగ్స్', 'వెలుగు దారులు' పుస్తకాలలో వ్రాశాను. ఆ అనుబంధం ఇప్పటిది కాదు. అనేక వందల సంవత్సరాల క్రిందటిది. అదే లేకపోతే, "ధమ్మపదం", "మహాస్మృతిప్రస్థానం" అనే నా పుస్తకాలు వెలుగు చూచేవి కావు. అవేకాదు, ముందుముందు ఇంకా ఎన్నో బౌద్ధగ్రంధాలు నా కలం నుండి వెలుగుచూడబోతున్నాయి. 

రెండువేల సంవత్సరాల క్రితం కృష్ణాతీరమంతటా బౌద్ధం విలసిల్లింది. దీనికి తార్కాణంగా కృష్ణానదీ పరీవాహకప్రాంతమంతటా ఉన్న బౌద్ధారామాలు, స్థూపాల శిధిలాలే  నిదర్శనాలు. కృష్ణానదికి ఒక చిన్న పాయలాంటిదైన గుండ్లకమ్మ వాగు తీరమంతటా ఒకప్పుడు బౌద్ధం విలసిల్లింది.

మా ఆశ్రమస్థలం దగ్గర్లో అంటే, రెండు కిలోమీటర్ల దూరంలోనే, వెల్లంపల్లి అనే  ఊరుంది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ దగ్గరనే, 1962 లో జరిగిన త్రవ్వకాలలో ఒక బౌద్ధస్థూపం బయటపడింది. ఇది సాంచీ స్థూపాన్ని పోలి ఉంటుంది. అమరావతి కంటే ఇది ప్రాచీనమైనదని అంటున్నారు.  ఇక్కడనుండి దొనకొండ దగ్గరలో ఉన్న చందవరం బౌద్ధస్థూపానికి దారి ఉంది. ఇవి రెండూ, ప్రాచీనకాలంలో, అంటే రెండువేల ఏళ్ల నాడు, కాశీ, కంచిల మధ్యన ప్రయాణించే పండితులకు విడిది కేంద్రాలుగా ఉండేవి. ఈ రెండు నగరాలూ  ప్రాచీనకాలంలో విద్యా, ఆధ్యాత్మిక కేంద్రాలన్నది మనకు తెలిసినదే కదా !

కనుక, వెల్లంపల్లి బౌద్ధస్తూపం ప్రక్కనే నేడు మా ఆశ్రమం వస్తున్నది. దీని వెనుక కూడా కర్మలింకులు , పూర్వజన్మ సంబంధాలు ఉన్నాయి. వివరించినా, వాటిని అర్ధం చేసుకునే స్థాయి, పాఠకులలో లేనందువల్ల, వాటిని ఇక్కడ వ్రాయడం లేదు. పైగా అటువంటి రహస్యాలను బాహాటంగా చెప్పడం సరి కూడా కాదు. మా ఆశ్రమంలో స్పిరిట్యువల్ రిట్రీట్స్ జరిగినప్పుడు మా శిష్యులకు మాత్రమే వాటిని వివరించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళే వాటిని సరియైన రీతిలో అర్ధం చేసుకోగలుగుతారు.

నేను వ్రాసిన మొదటి పుస్తకాలలో ముఖ్యమైనది "తారాస్తోత్రం". ఇది భవతారిణి కాళికాదేవి మీద నేను వ్రాసిన  గొప్ప తంత్రగ్రంథం. రాశిలో చిన్నదేగాని వాసిలో చాలా పెద్దది. తంత్రసాధనలో నాకున్న అనుభవమేంటో తంత్రప్రధానమైన నా పుస్తకాలను చదివినవారు, కొంతకాకపోతే కొంతైనా గ్రహించగలరని భావిస్తాను.

ఈ విధంగా మా  ఆశ్రమస్థలానికి - బౌద్ధమతంతోనూ, శక్తి ఉపాసనతోనూ సూటి సంబంధాలున్నాయి.  అలాంటి ప్రాచీనస్థలం లోనే మా ఆశ్రమం సాకారమౌతున్నది. అవే సాధనలు మళ్ళీ మా ఆశ్రమంలో జరుగబోతున్నాయి. చరిత్ర పునరావృతం కాబోతున్నది.

ఒక స్థలంలో మనం ఉండాలంటే, ఆ స్థలానికి మనకూ కర్మసంబంధాలుండాలి. ఒకచోట తిండి మనం తిని,  అక్కడి నీరు త్రాగాలంటే ఆ స్థలానికి మనకూ ఋణానుబంధం ఉండాలి.  అలాంటిదే ఈ ఆశ్రమస్థలం. మామూలు కళ్ళతో చూచేవారికి ఈ సంబంధాలు అర్ధం కావు. అవి అర్ధం కావాలంటే ఉండవలసిన దృష్టి వేరు. అదున్నపుడు, ఆ లింకులన్నీ స్పష్టంగా అర్ధమౌతాయి.

మా ఆశ్రమం గురించిన మరిన్ని వివరాలను ముందు ముందు పోస్టులలో చూడండి !
read more " మా ఆశ్రమ స్థలమహత్యం "

ఆశ్రమ స్థల సందర్శన ఫోటోలు



















read more " ఆశ్రమ స్థల సందర్శన ఫోటోలు "

24, డిసెంబర్ 2021, శుక్రవారం

ఆశ్రమస్థలాన్ని సేకరించాం !




మీకందరికీ ఒక శుభవార్త !

పదేళ్లక్రితం నేను చెప్పిన మాట నేడు నిజమైంది. దాదాపుగా ఏడాది నుంచీ మేము చేస్తున్న ప్రయత్నం నేటికి సఫలమైంది. మా మొదటి ఆశ్రమస్థలం వచ్చేసింది ! ఎక్కడో మారుమూల అడవిలో కాదు. ప్రకాశం జిల్లాకేంద్రమైన ఒంగోలు సిటీకి దగ్గరగా !

కలకత్తా - చెన్నై హైవే కు జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో, ఒంగోలు పట్టణానికీ, మేదరమెట్ల అనే ఊరికీ చాలా దగ్గరలో, అంటే జస్ట్ అరగంట ప్రయాణదూరంలో, ప్రశాంతమైన పల్లెటూరి పొలాల మధ్యలో, ఐదెకరాల స్థలాన్ని కొనడమూ, రిజిస్ట్రేషన్ చేయించడమూ  జరిగిపోయాయి.        

ఈ రోజున ఆశ్రమస్థలం రిజిస్ట్రేషన్ జరిగింది.

మా మొదటి ఆశ్రమం సాకారం కాబోతున్న ఈ స్థలం,

  • హైదరాబాద్ నుండి రావాలంటే, నార్కట్ పల్లి, అద్దంకి హైవే మీదుగా, 5 గంటల కారు ప్రయాణ దూరంలోను,
  • గన్నవరం (విజయవాడ) ఎయిర్ పోర్ట్ నుండి రెండున్నర గంటల ప్రయాణ దూరంలోను, - 
  • గుంటూరు నుండి - NH 16 మీద గంటన్నర దూరంలోను,
  • చిలకలూరిపేట నుండి NH 16 మీద ఒక గంట ప్రయాణదూరంలోను,
  • మా జిల్లెళ్ళమూడి ఆశ్రమం నుండి - బాపట్ల చీరాలల మీదుగా గంటన్నర ప్రయాణ దూరంలోను,
  • చెన్నై నుండి NH 16 మీదుగా, అయిదున్నర గంటల ప్రయాణ దూరం లోను,
  • బెంగుళూరు నుండి, 9 గంటల ప్రయాణంలోను,
  • తిరుపతి నుండి అయిదున్నర గంటల ప్రయాణ దూరంలోను,
  • ఒంగోలు సిటీ నుండి కేవలం అరగంట దూరంలోను, 
  • దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరికి ఒకటిన్నర కి. మీ దూరంలోను, రెండో వైపున్న పల్లెటూరికి 2 కిమీ దూరంలోను ఉన్నది.
  • గుండ్లకమ్మ రిజర్వాయర్ కు కేవలం 25 నిముషాల దూరంలో ఉన్నది.
నిజానికి, ఆశ్రమస్థలం కోసం మా ప్రయత్నం, అయిదేళ్ల క్రితమే మొదలైంది. అప్పట్లో, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉందామన్న ప్రయత్నంతో, వికారాబాద్ పరిసర ప్రాంతాలలోను, శ్రీశైలం రూట్ లోను పొలాల కోసం వెదకడం జరిగింది. నా శిష్యులందరూ వీకెండ్స్ లో కార్లేసుకుని తెగ తిరిగారు. కొన్ని కారణాల వల్ల, అప్పట్లో మా ప్రయత్నాలు సఫలం కాలేదు. శ్రీశైలంలో కూడా ప్రయత్నం చేశాము. బురదతో నల్లబడి పోయి ఉన్న లోకంలో, ఒక స్వచ్ఛమైన ప్రయత్నం ఎలా సఫలమౌతుంది? ఎక్కడ చూచినా రాజకీయాలే, పైరవీలే, కులాలే, అవినీతే. చివరకు విసుగొచ్చి, తాత్కాలికంగా, జిల్లెళ్ళమూడిలో ఒక ఇంటిని కొనుగోలు చేయడం జరిగింది. అది ప్రస్తుతం, మా సభ్యుల సాధనామందిరంగా ఉపయోగపడుతున్నది. పంచవటి సభ్యులు ఎవరైనా అక్కడికెళ్లి, ఎన్నాళ్లయినా ఉంటూ, ప్రశాంతంగా సాధన చేసుకునే వీలును కల్పిస్తున్నది.

అంతమాత్రం చేత, మాదైన స్వంత ఆశ్రమం కోసం  మా సంకల్పమూ, మా ప్రయత్నమూ ఆగిపోలేదు. గత ఏడాదిగా మళ్ళీ ముమ్మరంగా వెదుకులాటను సాగించాము. తెలంగాణా, ఆఁధ్రాలలో ఎన్నోచోట్ల ప్రయత్నించినప్పటికీ, ప్రతిచోటా విశ్వరూపం దాల్చిన రియల్ ఎస్టేట్ దందాల వల్ల, ఒక మంచి ఉద్దేశ్యంతో మొదలుపెట్టాలనుకున్న మా ఆశ్రమానికి స్థలసేకరణ గగనమై కూచుంది. కానీ చివరకు, నా జన్మస్థలమైన ప్రకాశంజిల్లాలోనే ఇది సాకారమైంది. చీకటిశక్తులు ఎంతగా ఆపాలని చూచినా, వెలుగు ఆగదు కదా !

నేను పుట్టినది ప్రకాశం జిల్లాలోనే. పెరిగినది గుంటూరు జిల్లాలో, ఉద్యోగం వెలగబెట్టినది రాయలసీమలో మరియు గుంటూరులో, చివరకు రిటైర్ అవుతున్నది హైదరాబాద్ లో. కానీ పుట్టిన గడ్డ ప్రకాశంజిల్లాలోనే, మా మొదటి స్వతంత్ర ఆశ్రమం సాకారమైంది. స్వతంత్ర ఆశ్రమం అని ఎందుకంటున్నానంటే, జిల్లెళ్ళమూడిలో మాకొక ఇల్లున్నప్పటికీ, అది అమ్మ ఊరు, అమ్మ ఆశ్రమం. ఇప్పుడు ఒంగోలు దగ్గర వస్తున్నది మాదైన ఆశ్రమం.

తెలిసినవాళ్ళూ, ప్రక్కనున్న పల్లెటూర్లలోని వాళ్ళూ అందరూ అడుగుతున్నారు.  'ఆశ్రమమంటే ఎలా ఉంటుంది? గుడీ, బడీ, ఆస్పత్రీ, పూజలూ, పండుగలూ, పబ్బాలూ, దీక్షలూ, తిరణాలలూ, కొలుపులూ ఉంటాయా?' అని. వారందరికీ ఒకటే సమాధానం.  మా ఆశ్రమంలో ఇవేవీ ఉండవు. నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది.

మా ఆశ్రమం, మీరు చూస్తున్న వ్యాపార ఆశ్రమాలలాగా ఉండదు. నిజమైన ఆశ్రమంలా ఉంటుంది. కృత్రిమత్వమూ, రాజకీయాలూ, డబ్బు కోసం కొట్లాటలూ, పలుకుబడి కోసం పరుగులూ, అవినీతి డబ్బులూ, రాజకీయులతో సంబంధాలూ, గుళ్ళు కట్టి దేవుడి విగ్రహాలు పెట్టి వ్యాపారం  చెయ్యడాలూ, దీక్షలనీ, హోమాలనీ, ప్రత్యేకపూజలనీ నాటకాలాడటాలూ, ఇంకా అలాంటి చిల్లరపనులూ, కక్కుర్తిపనులూ భూతద్దంతో వెతికినా మీకిక్కడ కనిపించవు.
  • మాది గ్రీన్ ఆశ్రమం.  అంటే, కాంక్రీట్ బిల్డింగ్స్ ఉండవు. కుటీరాలే  ఉంటాయి. 
  • మా మట్టితో మేమే ఇటుకలను చేసుకుని, ఇనుము వాడకుండా, సిమెంట్ వాడకుండా, ప్లాస్టిక్ వాడకుండా, సాధ్యమైనంతగా ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో, మా కుటీరాలను మేమే కట్టుకుంటాం.
  • ప్లానింగ్, డిజైనింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అంతా సాధ్యమైనంత వరకూ మేమే చేసుకుంటాం.
  • చెక్క వాడకాన్ని కూడా సాధ్యమైనంత తగ్గించి, వెదురు కర్రలను, బద్దలను, కుటీరాల నిర్మాణంలో వాడబోతున్నాం.
  • కుటీరాలలో, మంచాలు, కుర్చీలు, టేబుల్స్ మొదలైన అనవసర వస్తువులు  లేకుండా, మట్టిఅరుగులు కట్టుకుని వాటినే మంచాలుగా, కుర్చీలుగా వాడుతాం.
  • AC లు వాడకుండా, కుటీరాల ఎత్తును సరిగ్గా డిజైన్ చేయడంతో, క్రాస్ వెంటిలేషన్ ప్రక్రియతో, కుటీరాల లోపలి వాతావరణం చల్లగా ఉండేలాగా   ప్లాన్ చేస్తాం.
  • కుటీరాలను రెండు అంతస్తులతో, డుప్లెక్స్ ఇళ్ళలాగా నిర్మించి, వెదురు కర్రల మెట్లు, వెదురు కర్రలతో ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చేస్తాం.
  • ఆశ్రమంలో ఏ మూల నుంచి చూచినా పచ్చనిచెట్లు, పండ్లచెట్లు, కూరగాయల, పూలమొక్కలు కనిపించేలా, కళ్ళకు మనసుకు ఆహ్లాదకరంగా ఉండేలా డిజైన్ చేస్తాం.
  • భూసంరక్షణ, జలసంరక్షణ చేస్తూ, సోలార్ విద్యుత్తును వాడుతూ ప్రకృతితో మమేకమై, శబ్దకాలుష్యానికి దూరంగా  బ్రతుకుతాం.
  • పదీ ఇరవైసెంట్ల విస్తీర్ణంలో 15 అడుగుల లోతులో పెద్దగొయ్యిని తవ్వి, వాననీటిని అందులో నిలువ చేయడం ద్వారా, ఆశ్రమంలో ఒక కొలనును నిర్మిస్తాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు ఈ నీటిని వాడుతాం.
  • ఆరుబయట వేపచెట్లక్రింద ఎక్కువసేపు ఉంటూ, అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నులకమంచాలు వేసుకుని పడుకుంటూ, పూలమొక్కలను, పండ్ల చెట్లను, కూరగాయల మొక్కలను  పెంచుకుంటూ, నేలసాగు చేసుకుంటూ ఉంటాం.
  • స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, యోగాభ్యాసమూ, మావైన మంత్ర సాధనలూ, ధ్యానసాధనలూ, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసాలూ చేసుకుంటూ, సహజమైన సాత్వికాహారం తింటూ, నిరాడంబరములైన ఆనందపు జీవితాలను గడపబోతున్నాం.
క్రొత్త సంవత్సరంలో, పాండిచ్చేరి లోని ఆరోవిల్ కు వెళ్లి, రెండు వారాలక్కడ ఉండి,  అక్కడ విదేశీయులు స్వదేశీ దేశవాళీ ప్రకృతి జీవితాలను ఎలా గడుపుతున్నారో అధ్యయనం చేసి, అవే పద్ధతులను మా ఆశ్రమంలో అమలు చేయబోతున్నాం.

మా ఆశ్రమంలో కులమతాలకు విలువ లేదు. డబ్బుకు, అహంభావానికి, కపటానికీ, మోసానికి చోటు లేదు. స్వచ్ఛమైన మనసులూ, ప్రకృతితో మమేకమయ్యే జీవితాలూ, కుళ్ళూ కుత్సితాలకు అతీతంగా, ప్రేమించే హృదయాలతో, చిన్నపిల్లల్లాంటి మనస్తత్వాలతో, నిజమైన ఆనందాన్ని ఆస్వాదిస్తూ, అతి నిరాడంబరంగా జీవితం గడిపే వాళ్లకే మా ఆశ్రమం స్వాగతం పలుకుతుంది.

నేనిన్నాళ్ళూ ఏదైతే నా ఉపన్యాసాలలో చెబుతున్నానో, ఏదైతే నా బ్లాగ్ లోనూ, పుస్తకాల లోనూ వ్రాస్తున్నానో, అదంతా మా ఆశ్రమంలో ప్రాక్టికల్ గా సాకారం కాబోతోంది. అసలైన యోగసాధన, అసలైన ధ్యానసాధన, అసలైన తంత్రసాధన మా ఆశ్రమంలో  జరుగుతుంది.

ఇక్కడ టీవీలుండవు, న్యూస్ పేపర్ల వాసన సోకదు. మొబైల్ వాడకం, రోజు మొత్తంమీద ఒక గంట కంటే ఎక్కువసేపు ఒప్పుకోము. పోసుకోలు మాటలుండవు, సినిమాలూ రాజకీయాలూ వంటి చెత్తకబుర్లు వినపడనే వినపడవు. కన్స్యూమరిజం మా ఆశ్రమానికి ఆమడదూరంలో ఉంటుంది. వ్యాపారభక్తీ, కుహనా ఆధ్యాత్మికతల నీడలు కూడా మా ఆశ్రమానికి సోకవు.

"ఈ రకంగా, నేచురల్ లివింగ్ ను అనుసరిస్తూ చాలామంది ఇప్పుడు ఫార్మ్ హౌసులు కట్టుకుని ఉంటున్నారు కదా? వాటికీ మీకూ తేడా ఏమిటి?", అని అనుమానం వచ్చిందా మీకు? చెప్తా వినండి.

ఫామ్ హౌస్ ఊరికి దూరంగా ఉంటుంది నిజమే. అక్కడ మొక్కలుంటాయి, చెట్లుంటాయి, ప్రకృతిజీవనం ఉంటుంది. ఇదంతా నిజమే. కానీ అక్కడుండే మనుషులు ఎలా బ్రతుకుతారు? జీవితంలో వారికేమీ ఉన్నతమైన ఆదర్శాలు ఉండవు. సిటీలో బ్రతికినట్లే అక్కడా బ్రతుకుతారు. అదే టీవీ, అదే మొబైల్, అదే వాగుడు, అదే త్రాగుడు, అదే తిండి, అవే కోపతాపాలు, అవే అసూయాద్వేషాలు, అవే అహంకారాలు, అవే తాపత్రయాలు, అదే డబ్బుయావ, అవే పైరవీలు, అదే చెత్తమైండ్,  అదే చెత్త లైఫ్ స్టైల్. కాకపోతే సిటీ లైఫ్ కి దూరంగా ఉంటారంతే, దానివల్ల ఏమిటి ఉపయోగం? ఏమీ లేదని నేనంటాను.

క్రొత్తసీసాలో పాతసారా. అంతే ! బయటి సీసా నిస్సందేహంగా క్రొత్తదే. కానీ లోపలున్నది మాత్రం కంపు కొడుతున్న పాతసారాయే. బైటకు నేచురలే. లోపల మాత్రం అంతా అన్ నాచురల్. ఎందుకది? అలాంటి సూడో లైఫ్ వల్ల ఉపయోగమేంటి? అలాంటి జీవితం గడపడానికి ఫామ్ హౌస్ అయితే ఏంటి? సిటీలో ఉంటే ఏంటి? ఎక్కడైనా ఒకటే. మా ఆలోచన అది కాదు.

మా ఆశ్రమంలో మేం ప్లాన్ చేస్తున్న ప్రకృతి ఆధారిత జీవనం, దానికదే ఒక పరమావధి కాదు. ఉన్నతమైన జీవితానికి అదొక ఆసరా మాత్రమే. ఇక్కడ పునాదిగా అంతరిక సాధనామయమైన జీవితం ఉంటుంది . బయటనుంచి నేచురల్ లైఫ్ దానికి తోడౌతుంది. అదే మాకూ, మిగతా వారికి తేడా !

నన్ననుసరించే ఇండియా శిష్యులకూ, అమెరికా శిష్యులకూ ఈ ఆశ్రమం సొంతిల్లు కాబోతోంది. వారిలో కొంతమంది, అమెరికాను వదలిపెట్టి ఇక్కడికొచ్చి సెటిల్ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. 40 ఏళ్లపాటు, లోకానికీ బయటివారికీ ఏమాత్రం తెలియకుండా, లోకం మధ్యలోనే ఉంటూ చేసిన సాధనద్వారా నేను అవగతం చేసుకున్న అనేక సాధనా రహస్యాలను వారికి నేర్పించి, రహస్య యోగసాధనా క్రమంలో వారిని చెయ్యి పట్టి నడిపించబోతున్నాను

ప్రతి రెండు మూడు నెలలకు ఆశ్రమంలో జరిగే స్పిరిట్యువల్ రిట్రీట్స్ లో, శాంతినికేతన్ తరహాలో, చెట్ల క్రింద తరగతులు పెట్టి, యోగం, రకరకాల ధ్యానవిధానాలు, జ్యోతిష్య శాస్త్రం, హోమియోపతి విజ్ఞానం, తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, మార్షల్ ఆర్ట్స్ లను నా శిష్యులకు ప్రాక్టికల్ గా నేర్పించబోతున్నాను. ఇన్నేళ్ళుగా నమ్మకంగా నన్ననుసరిస్తున్న వారిని, నా సాధనామార్గంలో నడిపించి,  ఆయావిద్యలలో వారిని ఉద్దండులను చేయబోతున్నాను. అసలైన జీవితమంటే ఏమిటో వారికి రుచి చూపించబోతున్నాను.

2022 నుంచి పంచవటి చరిత్రలో నూతనాధ్యాయం మొదలు కాబోతున్నది. ఒక ఆధ్యాత్మిక మౌనవిప్లవం ఆంధ్రప్రదేశ్ లో సాకారం కాబోతున్నది. అక్కడనుంచి ఇది ప్రపంచవ్యాప్తమౌతుంది. 2022 లో ఇది జరుగుతుందని, పదేళ్లక్రితం పంచవటి సభ్యులతో, నా శిష్యులతో అన్నాను. వారిలో కొందరు నన్ను నమ్మారు, కొందరు నమ్మలేదు. కొందరు ఎగతాళి చేశారు. కొందరు చాటుగా నవ్వుకున్నారు. కొందరు బాహాటంగా విమర్శించారు. నా దారి నచ్చని  కొంతమంది నన్ను వదలి వెళ్లిపోయారు. నచ్చిన చాలామంది నన్నంటిపెట్టుకుని నాతోనే ఉన్నారు. నేను వేటినీ పట్టించు కోలేదు. నా దారిలో నేను నడుస్తున్నాను. నాతో నడిచేవాళ్ళను నడిపిస్తున్నాను.

అయితే, ఇప్పటివరకూ, మా కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు చెబుతా వినండి. ఇది జరుగుతుందని నలభై ఏళ్ళక్రితం, అంటే, 1980 లోనే, మా కజిన్స్ తో, మా బంధువులతో అన్నాను. ముందుముందు నా శిష్యులొస్తారని, ఆశ్రమం వస్తుందని, మేమంతా అందులో ఉంటామని, సాధనామయములైన జీవితాన్ని గడుపుతామని అన్నాను. అప్పట్లో వాళ్ళు కూడా నా మాటలను  నమ్మలేదు. లేతవయసు ఉడుకు  రక్తంలో ఏదేదో వాగుతున్నానని అనుకున్నారు. ఎగతాళిగా నవ్వారు.  40 ఏళ్ల తర్వాత, నేడు నా మాటలు నిజమౌతున్నాయి. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు కూడా ముందు ముందు నిజాలు కావడం  మీరు చూస్తారు.

ఈ ప్రయాణంలో నాతో నడుస్తున్నవారు నిజంగా అదృష్టవంతులు. ఈ పనిలో  పాలు పంచుకుంటున్నవారు ధన్యజీవులు. వారి జీవితాలు సార్ధకాలౌతాయి. ఆధ్యాత్మిక లోకంలో ఉత్త మాటలను చాలామంది చెబుతారు, కానీ, నా దారిలో నాతో కలసి  నడిచేవారు, ఫలితాలను వారి కళ్ళతో చూస్తారు. ఫలాలను వారి చేతులతో అందుకుంటారు.

మా ఆశ్రమ పురోగతిని ఎప్పటికప్పుడు, నా బ్లాగ్ లో, మా వెబ్ సైట్స్ లో, మా యూ ట్యూబ్ చానల్స్ లో ఇకనుంచీ వీక్షించండి మరి !

read more " ఆశ్రమస్థలాన్ని సేకరించాం ! "

19, డిసెంబర్ 2021, ఆదివారం

'శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము' ఈ బుక్ విడుదలైంది



'పంచవటి పబ్లికేషన్స్' నుండి మా సరిక్రొత్త పుస్తకం, 'శ్రీ మాలినీ  విజయోత్తర తంత్రము' 'ఈ బుక్' రూపంలో నేడు విడుదలైంది. దీనిలో 23 అధ్యాయములు, 1275 శ్లోకములు ఉన్నాయి. నా వివరణతో కూడిన ఈ పుస్తకం 408 పేజీలను కలిగి ఉన్నది.

ఈ పుస్తకాన్ని గురించి కొద్ది మాటలలో చెప్పడం చాలా కష్టం. ప్రాచీనమైన సిద్ధయోగీశ్వరీ మతమును, దాని రహస్య తంత్రసాధనా మార్గాలను వివరించే ఈ గ్రంధం శివాగమము (శైవ తంత్రము) లలో ఒకటి.

కాశ్మీరశైవం గురించి తెలిసినవారికి అభినవగుప్తాచార్యులవారు సుపరిచితులే. ఈయన 10 వ శతాబ్దంలో కాశ్మీర్ లో నివసించారు. ఆది శంకరాచార్యుల వారితో సమానమైన మేధాసంపత్తి, తపశ్శక్తులను కలిగిన మహనీయుడాయన. ఆయన వ్రాసిన అనేక గ్రంధాలలో 'తంత్రాలోకము', 'తంత్రసారము'  అనేవి నేటికీ ప్రపంచస్థాయిలో అత్యుత్తమ శైవతంత్ర గ్రంధములుగా చూడబడుతున్నాయి. ఎంతోమంది యూరోపియనులు, అమెరికన్లు ఈ గ్రంధాలను చదివి, శివభక్తులుగా మారి, కాశ్మీరశైవాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి శక్తివంతములైన గ్రంధాలవి.

తాను ఈ రెండు గ్రంధములనూ వ్రాయడానికి ప్రేరణ 'మాలినీ విజయోత్తర తంత్రము' అనే ప్రాచీన గ్రంథమని  అభినవగుప్తులవారు చెప్పినారు. మన అదృష్టవశాత్తూ ఈ గ్రంధము నేటికీ బ్రతికి ఉన్నది. సంస్కృతంలో మనకు లభిస్తున్నది. శివాద్వైతము, పరమేశ్వరాద్వైతము అనబడే శైవతంత్రము యొక్క సిద్ధాంతమును ఎంతో చక్కగా వివరించడమేగాక, ఎన్నో ప్రాణాయామ, ధారణావిధానములను, ధ్యానసాధనా రహస్యాలను సులభమైన భాషలో వివరించింది ఈ గ్రంధం. 'విజ్ఞానభైరవ తంత్రం' లో చెప్పబడిన 112 ధ్యాన విధానములకు 'మాలినీ విజయోత్తర తంత్ర'మే  మాతృక.

షడధ్వములనబడే వర్ణ, మంత్ర, పద, కళా, తత్త్వ, భువనముల వివరము, వాటి ధ్యానవిధానములు ఈ గ్రంధపు ప్రత్యేకతలు. లలితా సహస్రనామములను  పారాయణ చేసేవారికి 'షడధ్వాతీత రూపిణీ' అనే నామం సుపరిచితమే కదా ! ఈ షడధ్వములే శైవతంత్రము యొక్క సాధనలు.

శైవసిద్ధాంతములో చెప్పబడిన పృధివి నుండి శివతత్త్వము వరకూ గల ముప్పై ఆరు తత్త్వముల పైన చేయవలసిన అనేక ధ్యానములతో బాటు, అమానుష సిద్ధుల సాధన, ఇంకా, స్వప్నసిద్ధి, వాక్సిద్ధి, పరకాయప్రవేశ సాధన, గ్రామార్వణ సాధన, ఛాయాపురుష సాధన, లోకాకర్షక సాధన, రోగనిర్మూలనా సాధన, ఉచ్చాటనాది కామ్యప్రయోగములలో ఈ తంత్రమును ఏవిధంగా ఉపయోగించాలి? మొదలైన చిన్న చిన్న సాధనల వివరం కూడా దీనిలో ఇవ్వబడింది.

మా సంస్థనుండి, నా వివరణతో వస్తున్న మరొక్క అతి విలువైన, ప్రాచీనమైన తంత్రగ్రంధం ఇది. నేను అనుసరించిన, అనుసరిస్తున్న, బోధిస్తున్న మార్గంలోని సాధనలలో చాలావరకూ ఈ తంత్రంలో మీకు లభిస్తాయి. తంత్రసాధకులకు ఈ గ్రంధం ఒక అమూల్యమైన నిధి లాంటిదని చెప్పడం  అతిశయోక్తి కాబోదు.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో అనుక్షణం నాకు తోడుగా నిలచిన నా శ్రీమతి సరళాదేవికి, సంస్కృత శ్లోకములను  తెలుగులో వ్రాయడం, ప్రూఫ్ రీడింగ్,  టైప్ సెట్టింగ్ మొదలైన పనులను ఎంతో ఓపికగా చేస్తూ, ఈ పుస్తకం వెలుగు చూడటానికి నాతో బాటు కలసి నిరంతరం పనిచేసిన నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీ లలిత లకు, కవర్ పేజీ డిజైన్ చేసిన నా శిష్యుడు ప్రవీణ్ కు, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ సభ్యులందరికీ ఆశీస్సులు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.

read more " 'శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము' ఈ బుక్ విడుదలైంది "

13, డిసెంబర్ 2021, సోమవారం

యుగపురుషుడు నరేంద్ర మోడీ

13-12-2021 మార్గశిర శుక్ల దశమి సోమవారం - భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు.  ఎందుకంటే, వెయ్యేళ్ళుగా కాశీ విశ్వనాధుని భవ్య మందిరానికి పట్టిన దురవస్థ నేటితో తీరిపోయింది కాబట్టి.

కాలగమనంలో పనికిరాని మనుషులు కోట్లకొద్దీ పురుగులలాగా పుట్టి పోతూ ఉంటారు. కానీ వెయ్యేళ్ళ కొకసారి మాత్రమే పుట్టే కారణజన్ములు కొందరుంటారు. అలాంటివారిలో ఒకరు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు. నేనిలా అనడానికి ఎన్నో కారణాలున్నాయి.

  • 75 ఏళ్లుగా రావణకాష్టంలా మండుతున్న కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెచ్చింది ఆయనే కాబట్టి.
  • వెయ్యేళ్ళుగా కోట్లాది హిందువుల హృదయాలను మెలిపెడుతున్న బాధకు కారణమైన కాశీ విశ్వనాధాలయ దీనావస్థను రూపుమాపింది కూడా ఆయనే కాబట్టి. 
ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన గొప్ప పనులు. కానీ ఈ రెండు చాలు, భారతజాతి మొత్తం ఆయనకు శిరసు వంచి పాదాభివందనం చేయడానికి. పొద్దున్నే లేవగానే తలచుకుని నమస్కరించడానికి. 

తరతరాలకూ గుర్తుండిపోతారు కొందరు. ఉదయాన్నే, వారిని మనం తలచుకుని భక్తితో చేతులను జోడించి నమస్కరిస్తాము. వారినే ప్రాతఃస్మరణీయులంటారు. అలాంటి వారిలో ఆదిశంకరులు, వివేకానందస్వామి వంటి వారు ప్రముఖులు. నా దృష్టిలో నరేంద్రమోడీగారిని ఆ వరుసలో ఉంచాలి. భారతజాతి ఆయనకంతగా ఋణపడి పోయింది.

'దివ్యకాశీ భవ్యకాశీ' అంటూ శ్రీ నరేంద్రమోదీగారు  రెండేళ్ల క్రితం తలపెట్టిన ప్రాజెక్ట్  మొదటి దశ పూర్తయింది. అంతకు ముందే సంకల్పించిన గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. నేడు కాశీలో జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో కాశీ విశ్వనాధ్ కారిడార్ ను  మోడీగారు జాతికి అంకితం చేశారు.

గంగామాత శుభ్రపడింది. సరాసరి నదినుండి విశ్వనాధాలయానికి వెళ్లే దారి సుగమమైంది. కోట్లాది హిందువుల బాధ మాయమైంది. దేశం పులకరించింది. 

ఈ సందర్భంలో ఆయనిచ్చిన ఉపన్యాసాన్ని మొదటినుండీ చివరివరకూ వినమని అందరినీ నేను కోరుతున్నాను. అలాంటి  అద్భుతమైన ప్రసంగాన్ని మనము కొన్నిసార్లు మాత్రమే వింటాము. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా  అలాంటి ప్రసంగం ఇవ్వడాన్ని నేను చూడలేదు. ఆ ఉపన్యాసం వింటే, మోడీగారిలోని దేశభక్తుడు మాత్రమే గాక, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని అందుకున్న కర్మయోగి మనకు దర్శనమిస్తాడు.  ఒక యోగి, ఒక ఆధ్యాత్మికవేత్త మన కళ్ళముందు కనిపిస్తాడు. వినేవారి ఒళ్ళు పులకరించి, కళ్ళు చెమర్చే అద్భుతమైన ఉపన్యాసమది. ప్రేక్షకులలో  ఉన్న 6000 మంది స్వామీజీలలో చాలామంది కళ్ళు తుడుచుకోవడం నేను గమనించాను.

విశ్వనాధాలయాన్ని ముస్లిములు ఎంతగా అపవిత్రం చేశారో, ఎన్నిసార్లు దాన్ని కూలగొట్టారో, ఎంతగా భారతీయుల హృదయాలను గాయపరచారో తెలియాలంటే చరిత్రలోకి తొంగి చూడాలి.

అది క్రీ. శ. 1194 వ సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ తన తురక మూకలతో కాశీని  ముట్టడించి, భవ్యమైన విశ్వనాధుని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దానికి సపోర్ట్, ఖురాన్లో మహమ్మద్ చెప్పిన మతిలేని హింసాత్మక సూక్తులు. దాని తర్వాత క్రీ. శ 1240 ప్రాంతంలో ఒక గుజరాతీ వైశ్యుడు ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. మళ్ళీ దానిని 1400-1500 మధ్యకాలంలో సికందర్ లోడీ పాలనాకాలంలో కూలగొట్టారు. అక్బర్ పాలించే సమయంలో 1585 లో రాజా మాన్ సింగ్, రాజా తోడర్ మల్లులు మళ్ళీ దానిని నిర్మించారు.  తరువాత ఔరంగజేబు అనే నీచుడు మన దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించాడు. వాడి పాలనాకాలంలో 1669 లో ఆలయాన్ని మళ్ళీ కూలగొట్టి, మసీదును కట్టించాడు. 1780 లో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్, మసీదును కదిలించకుండా  ప్రక్కనే ఆలయాన్ని కట్టించింది. 1835 లో మహారాజా రంజిత్ సింగ్ , ఈ ఆలయానికి బంగారు పూత పూయించాడు.

ఇస్లాం ను అనుసరించేవారు, వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు. కానీ మన దేవాలయాలను ధ్వంసం చేయడానికి వాళ్లెవరు? అలా చేయమని వాళ్ళ ఖురాన్ లో రాసుంటే, ముందా ఖురాన్ సూక్తులను వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. హింసను ప్రబోధించే అలాంటి పుస్తకం మానవాళి మనుగడకే ప్రమాదం. దానిని దైవగ్రంధమనడం హాస్యాస్పదం.

ఈ 75 ఏళ్లలో వచ్చిన నాయకులందరూ, ఎవరు సంపాదనను వారు చూచుకున్నారు గాని, హిందువుల దేవాలయాలు మసీదులుగా అఘోరిస్తున్న విషయాన్నీ పట్టించుకున్న వాళ్ళు లేరు. హిందువుల ఆత్మక్షోభను పట్టించుకున్నవారు లేరు. ఎవరికీ వారు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపారు. వారి పబ్బం వారు గడుపుకుని మెల్లిగా జారుకున్నారు.

బయటనుంచి వచ్చి మన సంస్కృతినీ, మన దేవాలయాలనూ ధ్వంసం చేసిన తురకలకూ, ఈ 75 ఏళ్లలో మన దేశాన్ని పాలించిన నాయకులకూ ఏమిటి తేడా? నా దృష్టిలో అయితే, ఏమీ లేదు. అందరూ స్వార్ధపరులే. భరతమాత ఏడుపును పట్టించుకున్న వారే లేరు.

ఈనాటికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీగారి పుణ్యమా అని, కాశీ విశ్వనాధాలయం తన పూర్వ వైభవాన్ని పొందింది. వెయ్యేళ్ళ హిందువుల తపస్సు ఈ  రోజున ఫలించింది.

ఇదొక్కటేనా? ఈ క్రమంలో ఇంకా చాలా జరిగాయి.

ముస్లిముల రాక్షస పాలనాకాలంలో, అసలైన అన్నపూర్ణాదేవి విగ్రహం దొంగలచేత పెకలించబడి, అమ్ముకోబడి, చివరకు సముద్రాలను దాటి కెనడాలో తేలింది. దానిని మళ్ళీ వెనుకకు తెప్పించి, పునః ప్రతిష్ట చేసిన పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ గారు.

అంతే కాదు. కాశీ సందుగొందులను వెడల్పు చేసే పనిలో, దాదాపు 1500 మంది కుటుంబాలను వేరే చోట స్థలాలిచ్చి తరలించారు. ఆ ఇళ్ల మధ్యలో, చరిత్ర ప్రసిద్ధి గాంచిన 40 ఆలయాలు బయటపడ్డాయి. మన పురాణాలలో వీటి ప్రస్తావనలున్నాయి. కానీ, కాశీలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఏమంటే, ఆక్రమణలకు గురై ఇళ్లలో ఇళ్ళుగా మారిపోయాయి. ఇపుడా 40 ఆలయాలు మళ్ళీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.

ఎంతటి పుణ్యాత్ముడో మోడీగారు?  ఇటువంటి కారణజన్ములు ప్రతితరంలోనూ పుట్టనుగాక పుట్టరు.

'పందికేం తెలుస్తుంది పన్నీటి వాసన?' అన్నట్లు వావీ వరసలూ, నీతీనియమాలూ లేని ఆఫ్ఘన్, ఇరాన్, పాకిస్తాన్ దొంగలగుంపులకు హిందూమతం యొక్క ఔన్నత్యం ఎలా అర్ధమౌతుంది? మన దేవాలయాల గొప్పదనమేంటో, నీతీజాతీ లేని అలాంటి నీచులకెలా అర్ధమౌతుంది?

స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు కూడా మన దేవాలయాలను మనం స్వాధీనం చేసుకోలేకపోవడానికి, ధ్వంసం చేయబడిన ఆలయాలను మళ్ళీ కట్టుకోలేకపోవడానికి, సోకాల్డ్  గాంధీ నెహ్రూలూ, ఘనత వహించిన కాపీ రాజ్యాంగ నిర్మాతలూ, మతప్రాతిపదికన దేశాన్ని విడగొట్టికూడా, మన దేవాలయాలను స్వాధీనం చేసుకోకుండా వాటినలాగే వదిలేసిన సోకాల్డ్  నాయకులే కారకులు. ఈ మహాపాపం వారిదే.

యువకునిగా ఉన్నపుడు వైరాగ్యపూరితుడై, ఉన్నతాదర్శప్రేరితుడై, రామకృష్ణా మిషన్ లో బ్రహ్మచారిగా చేరుదామని ప్రయత్నించిన మోడీగారిని ఆపి, 'నీ కార్యరంగం సమాజమే గాని ఆశ్రమం కాదు. దేశానికి నీవు చేయవలసినది చాలా ఉంది. సన్యాసం నీదారి కాదు. వెళ్ళు. భరతమాతకు నీ సేవలందించు' అంటూ వెనుకకు త్రిప్పి పంపిన రామకృష్ణా మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి ఆత్మస్థానందగారి దూరదృష్టి, దివ్యదృష్టి ఫలితాలను ఈనాడు మనం కన్నులారా చూస్తున్నాం. 

మనమే కాదు, రాబోయే వేలాది తరాల భారతీయులందరూ, రాజకీయపార్టీలకు అతీతంగా, నరేంద్రమోడీ గారి ఫోటోను ఇళ్లలో పెట్టుకుని ప్రతిరోజూ పూజించాలి. ఖచ్చితంగా ఆయన కారణజన్ముడే కాదు, భరతమాత ముద్దుబిడ్డా, మన హిందూధర్మాన్ని మళ్ళీ నిలబెట్టిన యుగపురుషుడు కూడా ! ఇలాంటి మనుషులు వెయ్యేళ్లకు ఒక్కరే పుడతారు. ఆయనలో ఒక జనకమహారాజూ, ఒక శంకరుడూ, ఒక వివేకానందుడూ నాకు కనిపిస్తున్నారు.

భారతదేశం ఆయనకు శాశ్వతంగా ఋణపడిపోయింది ! ఇంకొక నూరేళ్ళపాటు ఆయనే మన ప్రధానమంత్రిగా ఉండాలి !

read more " యుగపురుషుడు నరేంద్ర మోడీ "

9, డిసెంబర్ 2021, గురువారం

భారత రక్షణదళాల ముఖ్యాధికారి బిపిన్ రావత్ దుర్మరణం - గ్రహచారం

తమిళనాడు లోని కూనూర్ దగ్గర జరిగిన IAF హెలికాఫ్టర్ కూలుడులో భారత  రక్షణదళాల ముఖ్యాధికారి జనరల్ బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ మరణించారు. ఆయనతో బాటు, ఆయన భార్యా, ఇతర ఆర్మీ స్టాఫ్ 11 మంది చనిపోయారు. వరుణ్ సింగ్ అనే ఒక్క ఆఫీసర్ మాత్రం బ్రతికి బయటపడ్డాడు.

వీరంతా ఉదయాన్నే ఢిల్లీ నుంచి విమానంలో సూళూర్ కు వచ్చారు. అక్కడనుండి మధ్యాన్నం 11. 50 కి హెలీకాఫ్టర్ లో బయలుదేరి వెల్లింగ్ టన్ మిలటరీ కాలేజీకి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ సంఘటనతో యావత్ భారతదేశం మొత్తం బాధతో కృంగిపోతున్నది. ఎందుకంటే, పాకిస్తాన్, చైనాల కుతంత్రాలను సమర్ధవంతంగా త్రిప్పి కొట్టడంలో జనరల్ రావత్ ఎంతో పేరుగాంచాడు. ఈ మధ్యనే కాశ్మీర్ లో జరిగిన ఆపరేషన్ ను కూడా ఎంతో సమర్ధవంతంగా నిర్వహించాడు. చాలా సమర్ధుడైన, ధైర్యవంతుడైన, దేశభక్త ఆఫీసర్ ఈయన. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన సంఘటన.

గ్రహచారం ఎలా ఉంది?

జ్యోతిష్యపరంగా చూస్తే, ప్రస్తుతం యురేనస్ - శనుల మధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఏర్పడుతున్నది.  కొద్దిరోజుల క్రితం వ్రాసిన పోస్ట్ లో ఈ గ్రహయోగం గురించి వ్రాస్తూ ఇది జరుపబోయే విధ్వంసం ఘోరంగా ఉంటుందని వ్రాశాను. ఓమైక్రాన్ కోణంలో దానిని వ్రాశినప్పటికీ, అది ఇండియాను సూచించే మకరరాశిలో జరుగుతున్నది గనుక, ఇండియాకు ఈ విధమైన పెద్ద దెబ్బ తగిలింది.

విమానప్రమాదాలలో వాయుతత్వ రాశుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది? ప్రస్తుత చక్రంలో ఇదెలా ఉందో వివరిస్తాను వినండి.

శనియొక్క దశమ దృష్టి వాయుతత్వరాశియైన తుల మీదుంది. యురేనస్ సప్తమదృష్టి కూడా దీనిమీదే ఉంది. ఈ తులా రాశి, భారతదేశానికి సూచికయైన మకరానికి దశమస్థానం అయింది. కనుక దక్షిణభారతదేశంలో వాయుయాన ప్రమాదం జరిగింది. ఇది ఖచ్చితంగా శని, యురేనస్ ల ప్రభావమే.

రావత్ గారి జాతకం చూద్దాం.


ఈయన 16-3-1958 న ఉత్తరాఖండ్ లోని పౌరీ అనే ఊరిలో పుట్టాడు. జనన సమయం తెలియదు గనుక ప్రస్తుతానికి చంద్రలగ్నాత్ లెక్కిద్దాం.  జాతకచక్రాన్ని ప్రక్కన చూడండి.

పట్టుదలకు సూచకమైన మకరరాశి అయింది. శ్రవణానక్షత్రం ఈయన యొక్క నక్షత్రం. సప్తమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉండటమూ, చంద్రుడు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండటమూ చూస్తుంటే, ఈయన భార్య అదృష్టజాతకురాలని తెలుస్తున్నది. కాబట్టే, భర్తతో బాటు ఒకేసారి చనిపోయింది. బ్రతుకులోనూ, చావులోనూ భర్తకు తోడుగా ఉన్నది. ఈమె ఉత్తరప్రదేశ్ లోని ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఖచ్చితంగా ఈమె అదృష్టజాతకురాలే. ఎందుకంటే, ఏ హిందూస్త్రీ అయినా దీనినే కోరుకుంటుంది కాబట్టి.

లగ్నంలో ఉన్న ఉఛ్చకుజుని వల్ల చిన్నవయసులోనే సైన్యంలో చేరి CDS గా ఈయన ఎదిగాడు. చంద్రమంగళ యోగం వల్లా, అందులోనూ కుజుని ఉచ్చస్థితివల్లా, మహా పట్టుదలగల సమర్ధుడైన ఆర్మీ ఆఫీసర్ అయ్యాడు. కానీ చివరకు ఇలా చనిపోయాడు. బాధాకరం !

నిన్నటి గ్రహస్థితిని గమనిద్దాం. శుక్రుడు ఇప్పుడిప్పుడే మకరరాశిలోకి అడుగుపెడుతున్నాడు. అక్కడే, యముడైన ప్లూటో ఉన్నట్లు గమనించాలి. శుక్ర ప్లూటో ల కలయిక విమానప్రమాదాలను కొనితెస్తుంది. అన్ని విమాన ప్రమాదాలలోనూ, శుక్రుని పాత్ర ఎన్నోసార్లు గతంలో గమనింపబడింది. కనుక ఈ విమాన ప్రమాదం జరిగింది. మకరం భారతదేశానికి, అందులోనూ దక్షిణదిక్కుకూ సూచిక, కనుక దక్షిణభారతదేశంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదసమయంలో గోచారశని, ఖచ్చితమైన డిగ్రీ కలయికతో జననకాల చంద్రుని మీద సంచరించాడు. జననకాల చంద్రుడూ, గోచార శనీ ఇద్దరూ 15 వ డిగ్రీ మీదే ఉన్నట్లు గమనించండి. అంటే, మారకాధిపతి నక్షత్రం.  గోచార చంద్రుడు 17 వ డిగ్రీ మీదున్నాడు. ఇది ఖచ్చితమైన చెడుయోగం, ఇంకా చెప్పాలంటే మారకయోగం. ఈ సమయంలో ఈయనస్సలు ప్రయాణం చెయ్యకూడదు. కానీ చేశాడు. సమయం వచ్చినపుడు అలా తోసుకుపోతుంది. ఆపడం కష్టం. ఎవరైనా చెప్పినా కూడా, అలాంటి సమయంలో ఎవరూ వినరు.

దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా?

నిన్నటి చక్రాన్ని గమనించండి. కుట్రలకు, కుతంత్రాలకు సూచిక అయిన వృశ్చికంలో నాలుగు గ్రహాలున్నాయి. అవి, రవి, బుధ, కుజ, ఉచ్చ కేతువులు. వృశ్చికం చైనాకు సూచిక. ఈ నాలుగు గ్రహాలను రాహువు చూస్తున్నాడు. రాహువు దృష్టి మకరం ఉన్న శని, చంద్రులమీద ఉన్నది. నాలుగు గ్రహాలు సూచిస్తున్నట్లు, ఒక గుంపుగా వీరందరూ మరణించారు. కనుక, ఈ సంఘటనలో శత్రుదేశాల పాత్ర లేదు అని చెప్పలేం.

ముఖ్యంగా, పాకిస్తాన్ చైనాలకు సింహస్వప్నమయ్యాడు జనరల్ రావత్. లడాఖ్ లో చైనా ఆటలనూ, కాశ్మీర్లో పాకిస్తాన్ ఆటలనూ త్రిప్పికొడుతున్నాడు. సైన్యంలో ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాడు. అలాంటి మనిషిని అడ్డు తొలగించుకోవడానికి ఈ దేశాలు ఏమయినా చేయవచ్చు.  చైనా దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది. భూమి చుట్టూ నాలుగు సార్లు తిరిగి, ఎంచుకున్న ప్రదేశాన్ని సరిగ్గా కొట్టగలిగే మిసైల్ ను ఈమధ్యనే విజయవంతంగా ప్రయోగించింది చైనా. కాశ్మీర్లో పాకిస్తాన్ ఆటలను సైన్యం త్రిప్పికొడుతోంది. కనుక ఈ రెండు దేశాలూ మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించాలని చూస్తూనే ఉంటాయి. వాటికి అనుకూలమైన పరిస్థితులు కూడా మన దేశంలో బాగా ఉన్నాయి. డబ్బుకు అమ్ముడుపోయే మనుషులు, దేశద్రోహులు మన దేశంలో అడుగడుగునా ఉన్నారు. చెప్పలేం, ఏదైనా జరిగి ఉండవచ్చు.

ఇది ఖచ్చితంగా కుట్ర ఫలితమే అని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది. కామన్ సెన్స్ ఏమంటున్నదో చూద్దాం.

సాక్షులేమి చెబుతున్నారు?

కూలిపోక ముందు, ఈ హెలికాఫ్టర్ ఒక ఇంటి పైభాగాన్ని ఢీకొట్టింది. హెలికాఫ్టర్ లోనుంచి, మంటలలో కాలిపోతూ ఇద్దరు ముగ్గురు బయటకు పడిపోవడాన్ని గ్రామస్థులు చూచారు.  అంటే ఏమిటి? పడిపోయిన తర్వాత హెలికాఫ్టర్ కాలిపోలేదు. ముందే ఆకాశంలో కాలిపోతూ క్రిందపడింది. అంటే ఏం జరిగి ఉంటుంది? లోపలే ఏదో ప్రేలుడు జరిగి ఉంటుంది. అంటే, ఈ పదముగ్గురిలోనే ఎవరైనా ఆత్మాహుతి దళపు తీవ్రవాదులున్నారా? తమను తాము పేల్చేసుకుని, ఇంతమంది చావుకు కారకులయ్యారా? లేక ఇంటిని కొట్టుకున్న హెలికాఫ్టర్ ఇంధన ట్యాంక్ అంటుకుందా? అపుడు లోపల మంటలు చెలరేగాయా? అసలు, అనుభవజ్ఞుడైన వింగ్ కమాండర్ నడుపుతున్న హెలికాఫ్టర్ ఇంటినెందుకు కొట్టుకుంటుంది? దానినెలా నడపాలో అతనికి అనుభవం లేదా? ఒకవేళ లేకపోతే, అలాంటి అనుభవం లేనివాడిని, ఇంత ముఖ్యమైన వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ గా ఎలా నియమిస్తారు? ఎవరు నియమించారు? చనిపోయిన 13 మంది వ్యక్తిగత జీవితాలేంటి? ఎవరెవరితో వీరికి కాంటాక్ట్స్ ఉన్నాయి? ఎవరెవరితో వీళ్ళు ఈ మధ్యలో ఫోన్లో మాట్లాడారు? మొదలైన వన్నీ విచారణ చేయించాలి.

ఒకవేళ, పొగమంచు వల్ల ఇలా జరిగింది? అంటే, పొగమంచు ఉన్నపుడు, హెలికాఫ్టర్ ను ఎలా నడపాలో వింగ్ కమాండర్ పైలట్ కు తెలియదా? లోపల రాడార్, GPS లు ఉండవా? వాతావరణం కళ్ళకు కనిపించడం లేదా? ఎంత ఎత్తులో ఎగరాలో పైలట్ కు తెలీదా? అతనికి ట్రెయినింగ్ లేదా? అన్నీ ప్రశ్నలే.

లేదా, హెలికాఫ్టర్ కండిషన్ బాగాలేదా? అలా అయితే, అలాంటి హెలికాఫ్టర్ ను కండెమ్ చెయ్యకుండా, ఇంకా ఎందుకు దానిని వాడుతున్నారు? మోడీగారు కూడా ఇదే హెలికాఫ్టర్ లో వెడుతూ ఉంటారని అంటున్నారు. అదెంత ప్రమాదం? ఇలాంటి విషయాలలో కక్కుర్తి అవసరమా?

మూడే కారణాలు

ఈ సంఘటన మొత్తాన్నీ జల్లెడ పడితే, మూడే కారణాలు కనిపిస్తున్నాయి.

1. హెలికాఫ్టర్ లోపం. ఇదే కారణమైతే, ఈ క్రింది అనుబంధ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

A. పాతబడిన హెలికాఫ్టర్ ఎందుకు వాడుతున్నారు?

B. పాతబడకపోతే, మెయింటెనెన్స్ సరిగా ఎందుకు చేయడం లేదు?

2. పైలట్ లోపం. ఇది కారణమైతే, ఈ ప్రశ్నలు తలెత్తుతాయి.

A, అలాంటి పైలట్ ను ఎవరు ఈ ప్రయాణానికి వేశారు? వారి చరిత్ర, వారి కాంటాక్ట్స్ ఏమిటి? వారికి తీవ్రవాదులతో సంబంధాలున్నాయా?

B. సరియైన ట్రెయినింగ్ పైలట్ కు ఎందుకు ఇవ్వలేదు? అతను వింగ్ కమాండర్ ఎలా అయ్యాడు?

3. కుట్ర కోణం. ఇది కారణమైతే, ఈ ప్రశ్నలు తలెత్తుతాయి.

A. ఇంటలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి?

B. CDS పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఆర్మీలో సామాన్య జవాన్ పరిస్థితేంటి?

పైమూడు కారణాలకూ ఎవరు బాధ్యత వహిస్తారు?  అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇలాంటి అల్పకారణాలకూ, జరిగిన నష్టానికి ఏమైనా పోలిక ఉందా? అంత అనుభవజ్ఞుడైన ఆఫీసర్ ను ఈ విధంగా కోల్పోవడం దేశానికి ఎంత నష్టం? 

ఇప్పుడు మనమేం చెయ్యాలి?

1. పాతబడిన హెలికాఫ్టర్లు, విమానాలను అర్జంటుగా ఇప్పుడైనా అటకెక్కించాలి.

2. మోడీ, రాజనాధ్ సింగ్, అమిత్ షా, యోగి ఆదిత్యనాధ్ లకు భద్రతను ఇంకా కట్టుదిట్టం చేయాలి.  ఇలాంటి వాహనాలలో వాళ్ళసలు ప్రయాణించకూడదు.

3. ముస్లిం తీవ్రవాద స్లీపర్ సెల్స్ ను, వారి సపోర్టర్స్ ను నిర్దాక్షిణ్యంగా ఏరి పారెయ్యాలి.

అన్నింటినీ మించి, ఈ ప్రమాదంలో బ్రతికిన ఒకే ఒక్క ఆఫీసర్, వరుణ్ సింగ్ ను ఎలాంటి వైద్యమైనా చేసి బ్రతికించాలి. అతడి ప్రాణాలకు గట్టి రక్షణ కల్పించాలి. ఎందుకంటే, హెలికాఫ్టర్ లో ఏం జరిగిందో చెప్పగల ఏకైక వ్యక్తి అతనొక్కడే కాబట్టి.

ఇప్పుడిప్పుడే మన దేశం నిలదొక్కుకుంటూ, ప్రపంచదేశాల సమక్షంలో గర్వంగా నిలబడుతున్నది. మనం బలహీనపడకూడదు. ఇది బాధాకరమే, కానీ శత్రువుల కుట్రలకు మనం బలికాకూడదు. ఈ కుట్రను ఛేదించాలి. దోషులను శిక్షించాలి. మన దేశం ముందుకే నడవాలి.

దేశభక్తి గల భారతీయులుగా, జనరల్ రావత్ ఆత్మకు, ఆయన భార్య ఆత్మకు, ఆయన సహచరుల ఆత్మలకు శాంతి కలగాలని మనమందరం ఈశ్వరుని ప్రార్ధిద్దాం.

read more " భారత రక్షణదళాల ముఖ్యాధికారి బిపిన్ రావత్ దుర్మరణం - గ్రహచారం "

5, డిసెంబర్ 2021, ఆదివారం

ధూమావతీ మంత్రం


దశమహావిద్యల మీద మనకున్న మోజు అంతా ఇంతా కాదు. కారణమేమంటే, వాటిని సాధన చేయడం వల్ల కష్టాలు పోతాయని, ఏవేవో లాభాలు వచ్చిపడతాయని గ్రంధాలలో వ్రాయబడి ఉన్న సమాచారమే. దానికితోడు, కొంతమంది స్వామీజీలు అదేపనిగా ఈ పోకడను ప్రజలలో పెంచి పోషిస్తున్నారు. 

ఇంతాచేస్తే, నేటి స్వామీజీలు జనాలకు నేర్పవలసింది ఏమిటి? మంత్రతంత్రాలతో చింతకాయలను ఎలా రాల్చాలి? అన్న విషయం కాదు. మనిషిగా ఎలా బ్రతకాలి? సాటి మనిషితో ఎలా ఉండాలి? అన్న విషయాలనే వారు ముందుగా వారి శిష్యులకు నేర్పాలి. విచిత్రమేమంటే, అదొక్కటి తప్ప మిగతావన్నీ నేర్పుతున్నారు. స్వార్ధంతో కుళ్లిపోతున్న నేటి జనాలేమో అలాంటి గొంతెమ్మ కోరికలనే కోరుతున్నారు.  శుద్ధమైన శిష్యులూ లేరు, శుద్ధులైన గురువులూ లేరు. కలికాలమంటే ఇదేనేమో?

మొన్నొకాయన నుంచి నాకు ఫోనొచ్చింది.

పరిచయాలు అయ్యాక, ఆయనిలా అడిగాడు.

'మీరు వ్రాసిన 'తారాస్తోత్రం' చదివాను. చాలా అద్భుతంగా ఉంది. తారాతత్వాన్ని, ఆ సాధనా విధానాన్నీ ఇంత వివరంగా  ఎవరూ వ్రాయలేదు. అది చదివి అందులో ఉన్న నంబర్ కి ఫోన్ చేస్తున్నాను. ఇది మీ నంబర్ అని నాకు తెలియదు' అన్నాడాయన.

'మీకా పుస్తకం నచ్చినందుకు సంతోషం' అన్నాను.

నా మిగతా పుస్తకాలను చదివి, బాగున్నాయని చాలామంది ఫోన్లు చేస్తుంటారు. కానీ 'తారాస్తోత్రం' గురించి అభినందించేవారు తక్కువగా ఉంటారు. తంత్రసాధన మీద ఆసక్తి ఉన్నపుడే వారు నన్ను సంప్రదించాలని భావిస్తారని నాకుతెలుసు.

'తారాదేవి గురించేనా, లేక మిగతా విద్యల గురించి కూడా వ్రాశారా?' అడిగాడాయన.

'లేదు, ప్రస్తుతానికి అదొక్కటే, మిగతావి ముందుముందు రావచ్చు' అన్నాను.

'మిగతా వాళ్ళు వ్రాసే విధానానికీ మీ విధానానికీ చాలా తేడా ఉన్నది. మిగిలినవి, రకరకాల పుస్తకాల కూర్పు లాగా ఉంటే, మీ వ్రాతలు అనుభవపూర్వకంగా ఉన్నట్లు అనిపిస్తున్నది' అన్నాడాయన.

'థాంక్స్' అన్నాను.

'ఏమీ లేదు. నేను ఫలానా గురువుగారిని అనుసరిస్తుంటాను' అన్నాడు.

'మంచిదే' అన్నాను.

'నాకు చిన్నప్పటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మాది ఫలానా కులం. నాకు బాలామంత్రమంటే ఇష్టం. దానిని నాకు ఉపదేశించేవారు ఎవరున్నారా అని  వెదుకుతుంటే, మా స్వామీజీని కలిశాను. ఆయన బాలామంత్రాన్ని ఇచ్చారు. తర్వాత కొంతకాలానికి ధూమవతీ మంత్రాన్ని ఇచ్చి జపం చెయ్యమన్నారు. కానీ వివరాలేమీ చెప్పలేదు.  అందుకని, ఆ దేవత గురించి మరింత వివరంగా ఎవరైనా  వ్రాశారా అని వెదుకుతుంటే మీ 'తారాస్తోత్రం' కన్పించింది. చదివి, మీకు ఫోన్ చేశాను' అన్నాడాయన.

'సరే బాగుంది. ఇంత వెదుకులాట మీకెందుకు? మీ గురువుగారినే సూటిగా అడగవచ్చు కదా !' అన్నాను.

'ఆయన చాలా ఫేమస్. ఆయన దర్శనం అంత తేలికగా సాధ్యం కాదు. ఎప్పుడైనా  ఆయన్ను చూడ్డానికి వెళితే, కనీసం రెండువేలమంది క్యూలో ఉంటారు. సందేహాలు తీర్చుకోడానికి వీలుకాదు. అందుకే ఈ ప్రయత్నం' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'మరి అంత తీరిక లేనాయన, మీకు మంత్రోపదేశం చేయడమెందుకు? అలాంటాయన దగ్గర మీరు ఉపదేశం తీసుకోవడమెందుకు?' అన్నాను.

'కష్టాలు పోతాయని తీసుకున్నాను. బాలామంత్రం జపం చేసి, కొన్ని కష్టాలను తొలగించుకున్నాను. ఇప్పుడు ధూమావతీ మంత్రం చేస్తున్నాను. ఆరోగ్య  సమస్యలున్నాయి. అవి  పోవడం లేదు' అన్నాడాయన.

'మరి, మీకుపదేశం చేసిన స్వామీజీకి ఎన్నో ఏళ్ల నుంచీ డయాబెటీస్ తగ్గడం లేదెందుకని? ఆ మంత్రాలు ఆయనకు  పనిచేయవా?' అందామని అనుకున్నాను కానీ  బాధపడతాడని ఊరుకున్నాను.

'ధూమావతి గురించి మీకు తెలిస్తే ఒక మంచి పోస్ట్ వ్రాయండి' అని అడిగాడు.

మళ్ళీ నవ్వొచ్చింది.

''తినేది మొగుడి తిండి, పాడేది ఎవడిదో పాట' అన్నట్లు, మంత్రాలను పప్పుబెల్లాల మాదిరి పంచేది ఆయనానూ, దాని లోతుపాతులూ వివరాలూ చెప్పేది నేనా? దశమహావిద్యలు ఎంత చీప్ అయిపోయాయిరా దేవుడా?' అనుకున్నాను.

'నెట్లో వెదుక్కోండి. చాలా సమాచారం లభిస్తుంది. మీకు వీలైతే నా మిగతా పుస్తకాలూ చదవండి. విషయం బాగా అర్ధమౌతుంది. ఇంకా అనుమానాలు మిగిలుంటే, ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయండి, మాట్లాడుకుందాం' అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

దశమహావిద్యలు తాంత్రికవిద్యలు. నెట్లో  చూచి, లేదా ఎవరో ఒక సెలబ్రిటీ గురువు దగ్గర ఫేన్సీగా ఉపదేశం తీసుకుని వాటిని ఊరకే జపిస్తే ఏమీ రాదు. వాటికి కొన్ని విధానాలుంటాయి. వాటిని అనుసరిస్తేనే అవి ఫలిస్తాయి.

గతంలో ఇదే స్వామీజీ ఇదే ధూమావతీ మంత్రాన్ని నా స్నేహితుడైన ఇంకొక ఆఫీసర్ కి ఇచ్చి  జపించమన్నాడు. ప్రెండ్ భార్యకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది.  అందుకని ఈ స్వామీజీని కలిస్తే, ధూమావతీ మంత్రం ఇచ్చాడు. ఫ్రెండ్ గాడు జపించడం మొదలుపెట్టాడు.

'ధూమవతీ మంత్రాన్ని సంసారులు జపించకూడదు. భర్తో భార్యో ఒకరు చనిపోయి, ఒంటరిగా ఉంటూ, ప్రపంచం మీద వైరాగ్యంతో, నిరాశతో, ఉన్నవారికే అది సరిపోతుంది. నువ్వు దానిని జపించకు.  మహావిద్యలతో ఆటలాడటం మంచిది కాదు' అని నేను మా ఫ్రెండ్ గాడికి చెప్పాను.

'స్వామీజీ కంటే నీకెక్కువ తెలుసా?' అంటూ ఎగతాళిగా నవ్వాడు మా ఫ్రెండ్.   

ఆ తర్వాత కొద్దికాలానికే మా ఫ్రెండ్ భార్య చనిపోయింది. అప్పటిదాకా ఆ స్వామీజీని మా ఫ్రెండ్ తెగ పొగిడేవాడు. ఆ తర్వాత తిట్టడం మొదలుపెట్టాడు.

'ఎందుకురా ఆయన్ని తిడతావ్?' అన్నాను.

'మరి అలాంటి మంత్రాలివ్వచ్చా? మాకు తెలీక అడుగుతాం. అన్నీ తెలిసిన వాళ్ళు అలా చేయొచ్చా?' అన్నాడు మా ఫ్రెండ్.

'నాకేం తెలుసు? పోయి ఆయన్నే అడుగు. కానీ తిట్టకు' అన్నాను. 

కొన్ని కొన్ని మంత్రాలను జపించడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఆ మంత్రసాధనకే ప్రత్యేకమైన కొన్ని కొన్ని ఫలితాలు వెంటనే కనిపిస్టాయి. అందుకే, తెలిసీ తెలియకుండా  తాంత్రికమంత్రాలతో ఆటలు పనికిరావు. అందులోనూ, ఒకకోణంలో చూచినపుడు, దశమహావిద్యలందరిలోకీ ధూమావతి మహాశక్తివంతురాలు. ఆమె సాధనను, ఆషామాషీగా, తగిన నియమనిష్టలను పాటించకుండా, పిచ్చి కోరికలు తీరాలన్న సంకల్పంతో చేస్తే, ఫలితాలు దారుణాతి దారుణంగా ఉంటాయి. అప్పుడా శిష్యుడికీ గురువుకీ ఇద్దరికీ వేటు పడుతుంది. కుటుంబాలకు కుటుంబాలే నాశనం అవుతాయి.

ధూమావతీ దేవిని ఒక అందవికారపు ముసలామెగా, విధవరాలిగా, చీపిరి చేటలను దగ్గర పెట్టుకుని,  కాకి వాహనం మీద తిరిగే ఒక బికారి ఆకారంలో ఉన్నట్లుగా చిత్రిస్తారు. ఆమె ధ్యానశ్లోకాలు కూడా ఇదే రూపాన్ని చూపిస్తాయి. విధవలకు(భర్త చనిపోయిన ఆడవారికి), విధురులకు (భార్య చనిపోయిన మొగవారికి),  ఇల్లూ వాకిలీ లేకుండా బ్రతికే సన్యాసులకు, బైరాగులకు, అన్నింటినీ వదలిపెట్టి ఒంటరిగా అడవులలో గుహలలో ఉంటూ సాధన చేసేవారికి, ఈమె సాధన త్వరగా ఫలిస్తుంది.  ఆమె కూడా ఇలాంటివారినే ఇష్టపడుతుంది. సంసారులను ఇష్టపడదు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈమె ధనదేవత కాదు, జ్ఞానదేవత. దరిద్రమే జ్ఞానానికి దారి  గనుక, ఈమె ఇచ్చే మొదటి వరం దరిద్రమే. ఎవరైనా తోడుంటే జ్ఞానం రాదు గనుక, ముందు భర్తనో భార్యనో తీసుకుపోతుంది. ఒంటరిని చేసేస్తుంది. అపుడు వివేకమూ, వైరాగ్యమూ, జ్ఞానమూ, ఆధ్యాత్మిక సిద్దీ అన్నింటినీ ఇస్తుంది.

ఆకలితో ఉన్న ఈమె, తన భర్తయైన శివుడినే తినేసినట్లు, విధవగా మారినట్లు, తాంత్రికగాధలు చెబుతున్నాయి. కనుక దశమహావిద్యలలో భర్త లేని దేవత ఈమె ఒక్కతే. అసలు విషయమేమంటే, శివశక్తులను మించిన కాళరాత్రికి ఈమె సూచిక. అప్పటికి సృష్టి లేదు.  కనుక వైభవమూ ఉండదు. ఆ పైది  పరమేశ్వర తత్వమే. సృష్టిగా ఉన్న శుభస్వరూపుడైన శివుడిని మ్రింగేస్తుంది గనుక, సృష్టిని మించిన మహాప్రళయానికి సూచిక గనుక, ఈమెను విధవరాలిగా చిత్రీకరిస్తాయి ఈమె యొక్క ధ్యానశ్లోకాలు.

ఆయా అంతరికస్థితులను ధ్యానసాధనతో అందుకోవాలని ప్రయతించే సాధకులకు మాత్రమే ఈమె యొక్క సాధన యోగిస్తుంది. ఈ విషయం తెలియని గురువులు, ఏదేదో చెబుతున్నారు. తెలియనివారు నమ్ముతున్నారు. ఆ గురువులు కూడా ఈ మంత్రంలో సిద్ధిని పొందినవారు కారు. ఊరకే ఏదో ఉపదేశం చేస్తుంటారు. శిష్యులు జపిస్తుంటారు. అసలైన సాధనావిధానం అదికాదు గనుక అక్కడేమీ జరుగదు. ఏ ఫలితమూ కనిపించదు.

వేదాలలో ఈమె నిరృతి, జ్యేష్ఠ అనే పేర్లతో పిలువబడింది. క్రీ. శ 10 వ శతాబ్దం ప్రాంతంలో వేదకాలపు నిరృతి, జ్యేష్ఠ అనబడే దేవతలే, తాంత్రిక దేవతయైన ధూమావతిగా అవతరించారు. మామూలు భాషలో అలక్ష్మి, పెద్దమ్మ అని పిలువబడే దేవత ఈమెయే. పోతనామాత్యుడు  తన భాగవత గ్రంధం మొదట్లో 'అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ' అంటూ 'పెద్దమ్మ' గా వర్ణించింది ఈ ధూమావతీ స్వరూపాన్నే అని నా నమ్మకం. 'పెద్దమ్మ' అంటే జ్యేష్టాదేవి యని, సృష్టికీ, త్రిమూర్తులకూ, ముగ్గురమ్మలకూ ముందున్న పరాత్పరశక్తి యని అర్ధం. అంటే, ధూమావతి. తానే అన్నీ గనుక ఒంటరిది. తనకు వేరుగా ఎవరూ లేరు గనుక, భర్త లేనిది. అటువంటి ఏకైక వైరాగ్యపూరిత జ్ఞానశక్తి ఈ దేవత.

కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని, ధూమావతీ శక్తిని వర్ణిస్తూ, తన 'ఉమాసహస్రం' లో ఇలా అంటారు.

శ్లో || శూన్య ప్రఖ్యాయా చిల్లీనా 

ప్రళయే బ్రహ్మణి జన్మిషు సుప్తౌ:

కబళిత సకల బ్రహ్మాండం

తాం కవయః శ్రేష్టామ్ జ్యేష్టా మాహు:                     (ఉమాసహస్రం 38-13)


చిత్ యందు లీనమవ్వడమే శూన్యమనబడుతుంది. ఇది ప్రళయసమయంలో బ్రహ్మను ఆక్రమిస్తుంది. గాఢనిద్రా సమయంలో అన్ని జీవులనూ ఆక్రమిస్తుంది. బ్రహ్మాండం మొత్తాన్నీ కబళిస్తుంది. శ్రేష్టమైన ఈ శక్తినే జ్ఞానులు' జ్యేష్టా' అంటారు.

శ్లో || నిద్రా విస్మృతి మోహాలస్య 

ప్రవిభేధైస్సా భవమగ్నేషు 

ఏషై వశ్యాద్ద్యున్జ్నౌవేషు

ధ్వస్త వికల్ప: కోపి సమాధి:                                     (ఉమాసహస్రం 38-14)


నిద్ర, మరపు, మోహము, ఆలస్యము అనే భేదములతో లోకవ్యామోహం కలిగిన సంసారులలో  ఈ శక్తి ఉంటుంది. మనస్సు యొక్క చాంచల్యం ధ్వంసమైన యోగులలో అయితే, సమాధిగా ఉంటుంది.

అసలు విషయం ఇదైతే, పనులు కావడానికి, రోగాలు తగ్గడానికి,  కోర్టు కేసులు గెలవడానికి, గర్ల్ ఫ్రెండ్ ని వశం చేసుకోడానికి, ఇలాంటి తుచ్ఛమైన పనులకు మహావిద్యలను వాడుతున్నారు కొందరు. పోనీ వాడారే అనుకుందాం, సరియైన విధానంలో వాడటం లేదు. నేర్పవలసినవారు కూడా ఒక బాధ్యతతో నేర్పడమూ లేదు. వారి శిష్యులకు మంచిబుద్ధినీ నేర్పడం లేదు.  

నా శిష్యులలో కొందరు నన్నిదే అడుగుతారు,

'ఎవరూ సరిగ్గా చేయడం లేదు' అంటారు, మీరేమో చెప్పరు, ఎలా మీతో?' అని.

శుద్ధంగా చేసేవాళ్ళుంటే చెప్పడం నాకిష్టమే. అయితే, గొంతెమ్మ కోరికలు తీరే మార్గాలు కావాలంటే నేను చెప్పను. శుద్ధమైన సాధన కావాలంటే రండి. నేర్పడానికి నేను సిద్ధం. అయితే నా పరీక్షలలో మీరు పాసు కావాలి. ఎవరిని బడితే వారిని నేను నమ్మను. శిష్యునిగా తీసుకోను. అయినా, ఒక ఏడాది ఆగండి. మన ఆశ్రమం వచ్చాక మీ ఓపిక, ఎన్ని విద్యలు కావాలంటే అన్నింటినీ సాధన చేయవచ్చు. అయితే, నా దగ్గరే ఉండి, నేను చెప్పిన రీతిలో ఉంటూ, సాధన చేయాలి. అప్పుడన్నీ నేర్పిస్తాను. సాధనామార్గంలో చెయ్యిపట్టి నడిపిస్తాను. జస్ట్ కొద్దినెలల పాటు ఓపిక పట్టండి' అని వారికి చెబుతూ ఉంటాను.

నిజమైన సాధనామార్గాలు ఉన్నాయి. నిజమైన సాధకులకోసం అవి వేచి చూస్తూనే ఉంటాయి. వాటిని అందుకునే నిజమైన మనుషులే కావాలి. వారేరీ?

read more " ధూమావతీ మంత్రం "

3, డిసెంబర్ 2021, శుక్రవారం

'వెలుగు దారులు' ఈ బుక్ విడుదలైంది

'వెలుగు దారులు' ఈ బుక్ నేడు విడుదలైంది.

తెలుగుభాష మాత్రమే తెలిసినవారికి, లేదా, పుస్తకాలను తెలుగులో మాత్రమే చదవడానికి ఇష్టపడేవారికి, తెలుగులోకపు ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు  పాఠకులకు, 'వెలుగుదారులు' అనే ఈ పుస్తకం చేతికందడం ఒక గొప్ప అదృష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఎందుకంటే, వేలాది గ్రంధాలలో ఉన్న ఆధ్యాత్మిక మార్గాల సారాన్నంతా ఈ పుస్తకంలో ఒక్కచోటనే మీరు చూడవచ్చు. దీనిలో 360 టాపిక్స్, 1278 పేజీలు ఉన్నాయి.

జూలై 13 2021 న 'MUSINGS' ఇంగ్లీష్ ఈ బుక్ ను విడుదల చేసినపుడు, దాని తెలుగు అనువాదంగా 'వెలుగు దారులు' అనే పుస్తకాన్ని జూలై 2022 లో విడుదల చేస్తామని అన్నాను. ఆ రోజునుంచీ ఆ పుస్తకంలోని ఇంగ్లీషు  వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేసే పనిని యుద్ధప్రాతిపదికన స్వీకరించారు తొమ్మిదిమంది నా శిష్యులు. అలుపు సొలుపూ లేకుండా పనిచెయ్యడంలోనూ, పుస్తకాలను వ్రాయడం లోనూ నేనే అనుకుంటే, వీరందరూ నన్ను మించిపోయారు. ఏడాది పడుతుందనుకున్న పనిని మూడు నెలలలో పూర్తి చేసిపారేసి, నవంబర్ కల్లా 'వెలుగు దారులు' పుస్తకాన్ని సిద్ధం చేశారు. అందుకే, వెలుగులను విరజిమ్ముతున్న ఈ గ్రంధాన్ని ఈరోజున 'ఈ బుక్' గా విడుదల చేస్తున్నాం.

ప్రస్తుతానికి ఆశ్రమం మా మొదటి ప్రాధాన్యత గనుక, పుస్తకాల ప్రింటింగ్ పనిని ఆపాము. ఆశ్రమం సాకారమైన తర్వాత, వరుసగా అన్ని పుస్తకాలనూ మళ్ళీ ప్రింట్ చేసే పని మొదలౌతుంది. అప్పుడిది ప్రింట్ పుస్తకంగా వస్తుంది. వచ్చే ఏడాది నుంచీ విజయవాడ, హైదరాబాద్ బుక్ ఎక్జిబిషన్ లలో పెట్టబోయే మా స్టాల్ లో 'పంచవటి' పుస్తకాలన్నీ మీకు దొరుకుతాయి.

ఈ అనువాదాన్ని ఒక రాధనగా భావిస్తూ, ఎంతో భక్తితో, శ్రద్హతో, పట్టుదలతో, 360 వ్యాసాలనూ చక్కని తెలుగులోకి అనువాదం చేసిన నా శిష్యులు, సురేష్ బాబు కదిరి, స్నేహలతారెడ్డి, శ్రీరామమూర్తి, శ్రీభార్గవి, గణేష్ ఆళ్ళ, రంగనాధ్ దరూరి, గిరీష్ సూరపనేని, DVR ప్రసాద్, శ్రీనివాస్ నూకలగార్లకు నా కృతజ్ఞతలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. వీరందరూ వారివారి ఉద్యోగాలు, వృత్తులలో ఎంతో బిజీగా ఉన్న వ్యక్తులు. తీరికసమయం దొరకని వాళ్ళు. వారివారి సమస్యలంటూ వారికెన్నో ఉన్నాయి. కానీ, వారి బిజీ జీవితంలో కూడా ఎక్కువ  సమయాన్ని ఈ పనికోసం కేటాయించి, 'ఇది మన పని' అనే  అంకితభావంతో, దీక్షతో ఈ అనువాదాన్ని పూర్తి చేశారు. అందుకు వారికి ఋణపడి ఉన్నాను.

పోతే, నా పుస్తకాలన్నింటికీ ప్రూఫ్ రీడింగ్, టైప్ సెట్టింగ్ లలో నిరంతరం నాతో సమానంగా శ్రమిస్తున్న డెట్రాయిట్ సిస్టర్స్, అఖిల జంపాల, శ్రీలలితలకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా, మేమందరం చేసినది ఒక ఎత్తైతే, అఖిల జంపాల చేసిన పని మరొక ఎత్తుగా  ఉన్నది. మేమందరం ఒక్కొక్క పనిని మాత్రమే చేశాం, కానీ, అన్నీ తనే అయి ఈ పనిని చేసింది. ఈ పుస్తకం ప్రతి పేజీలో, ప్రతి లైన్లో, తన పాత్ర ఉన్నదని చెప్పడానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. కవర్ పేజీ డిజైన్ చేసిన నా శిష్యుడు ప్రవీణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. నా పుస్తకాలన్నింటికీ ఎంతో చక్కని కవర్ పేజీలను అతను తయారు చేస్తున్నాడు. వీళ్ళందరూ ధన్యజీవులే. నా మార్గాన్ని స్పష్టంగా అర్ధం చేసుకుని, దానిలో నడుస్తూ, వెలుగుదారులలో శరవేగంతో పురోగమిస్తున్న వీరందరిపైనా జగన్మాత కాళి యొక్క కటాక్షం నిరంతరమూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

నా శ్రీమతి నిరంతర సహకారం లేనిదే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. మా పుస్తకాల వెనుకా, మా కార్యక్రమాల వెనుకా తన సహాయం, సహకారం ఎంతో ఉన్నాయి. తనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  

ఈ పుస్తకం కూడా google play books నుండి ఇక్కడ మీకు లభిస్తుంది. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా, మా మార్గమేంటో, ఇంకా చెప్పాలంటే, అసలైన ఆధ్యాత్మికమార్గమేంటో తెలుసుకోండి. ఆ తర్వాత, మీ జీవితాలు ఎలా మార్పు చెందుతాయో మీరే గమనించండి !

read more " 'వెలుగు దారులు' ఈ బుక్ విడుదలైంది "

28, నవంబర్ 2021, ఆదివారం

ఓ మైగాడ్ - ఓమైక్రాన్ రంగప్రవేశం

ప్రస్తుతం, గురువు కుంభరాశిలో సున్నా డిగ్రీల మీదున్నాడు. ప్లూటో మకరరాశి సున్నా డిగ్రీలమీదున్నాడు. ఇద్దరికీ ఆచ్చాదనా యోగం ఏర్పడింది. గురువు జీవకారకుడు, ప్లూటో యముడు, ఫలితం? జీవశక్తిని మరణం కమ్మేస్తుందని అర్ధం. జ్యోతిష్యశాస్త్రపరంగా దీనిని 'మరణయోగం' అనవచ్చు.  అంటే, లోకానికి మళ్ళీ మూడిందని అర్ధం. అందుకే, ఇప్పటివరకూ వచ్చిన అన్ని రకాల కోవిడ్ వైరస్ ల కంటే ఎన్నోరెట్లు భయంకరమైన 'ఓమైక్రాన్' వేరియంట్ హఠాత్తుగా తలెత్తింది.

ఇప్పటివరకూ పెద్దగా కోవిడ్ న్యూస్ అంటూ లేని ఆఫ్రికాలో, మొట్టమొదటి ఓమైక్రాన్ వేరియంట్ కనిపించింది. కనిపించీ కనిపించగానే, యూరప్ లో అడుగుపెట్టింది. యూకే, జర్మనీ, ఇటలీలు ఇప్పటికే వణికిపోతున్నాయి. ఇజ్రాయెల్ తన బార్డర్స్ ను మూసేసింది. యూరప్ లో కనీసం 7 లక్షలమంది చావబోతున్నారని WHO అంటోంది. అంటే ఏమిటి? మళ్ళీ  ప్రపంచానికి మూడిన సంకేతాలు వెలువడుతున్నాయి.

గతంలో చాలామంది, 'కరోనా పని అయిపోయింది. ఇదుగో పోయింది, అదుగో పోయింది, మార్చి తర్వాత పోతుంది, ఏప్రిల్ తర్వాత పోతుంది', అని వ్రాశారు. ఇదిప్పుడే పోదని, గ్లోబల్ కర్మ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, స్వార్ధమూ, లెక్కలేనితనమూ జనాలలో ముదిరిపోయాయని, మనుషులకి గట్టిగా బుద్ధి చెప్పనిదే ప్రకృతి ఊరుకోదని, నేనన్నాను. చూడండి ఏం జరుగుతోందో మరి?

ఓమైక్రాన్ కు ఎదురులేదని, వాక్సిన్లేవీ దానిని అడ్డుకోలేవనీ, అది వ్వాపించే వేగం చాలా ఎక్కువగా ఉంటుందని, దాని విధ్వంసం కూడా ఎక్కువేననీ, నిపుణులు అంటున్నారు. కనుక, ఇప్పటిదాకా వాక్సిన్  వేసుకున్నవారైనా, వేసుకోనివారైనా, ప్రస్తుతం అందరూ ఒకటే అయిపోయారు. ఒక ఆర్నెల్లలో దీనికి కూడా వాక్సిన్ తయారు చేస్తామని కంపెనీలు అంటున్నాయి.  మళ్ళీ 'రెడ్డొచ్చె మొదలాడు' అన్నట్లు, ఈ క్రొత్త వాక్సిన్ కోసం మళ్ళీ క్యూలు మొదలవబోతున్నాయి.  ఇంతా చేస్తే, ఆ క్రొత్త వాక్సిన్ ఎంతవరకూ పనిచేస్తుందో దేవుడికే ఎరుక ! భలే ఉంది కదూ మనుషులతో వారి కర్మ ఆడుతున్న ఆట !

గురువు - ప్లుటోల మరణయోగం మానవాళికి డేంజర్ సిగ్నల్స్ ను మ్రోగిస్తోంది. విమాన సంస్థలు, తమ సర్వీసుల గురించి ఆలోచిస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ ప్రయాణ రంగం మళ్ళీ కుదుపులకు లోనవబోతోంది. అంతేకాదు, దేశదేశాలన్నీ మళ్ళీ లాక్ డౌన్ దిశగా చూస్తున్నాయి.

ఇంకొక్క నెలలో శని యురేనస్ ల మధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఏర్పడబోతున్నది. అప్పుడుంటుంది అసలు  విలయం ! ఈలోపల యూరోప్ అట్టుడుకుతుంది. అప్పటినుంచీ, ఇండియా, పాకిస్తాన్, యూకే లలో అసలైన డ్రామా మొదలౌతుంది. జనమంతా తట్టా బుట్టా సర్దుకోవడం మొదలుపెట్టాలి. 'మేం రెండు వాక్సిన్లూ వేయించుకున్నాం, మాకేమీ కాదు' అంటూ మాస్కులు తీసేసి మోర విరుచుకుని తిరుగుతున్నవారందరూ మళ్ళీ మాస్కులు బయటకు తియ్యండి మరి !  

సరే, 'ఓ మైగాడ్' అనుకుంటూ ఓమైక్రాన్ విధ్వంస న్యూస్ కోసం ఎదురుచూద్దాం !

read more " ఓ మైగాడ్ - ఓమైక్రాన్ రంగప్రవేశం "

21, నవంబర్ 2021, ఆదివారం

నవంబర్ 2021 పౌర్ణమి ప్రభావం - పెనువర్షాలు

ఈ సృష్టిలో మనం అదుపు చెయ్యలేనివి పంచభూతాలూ, నవగ్రహాలే. అందుకే మనమెంతగా విర్రవీగినా, మన జీవితాలు మన చేతులలో ఉండవు.  

మొన్న పౌర్ణమి. రాహుకేతువుల ఇరుసుతో చంద్ర సూర్యుల ఇరుసు ఒకటైంది. చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు, సూర్యుడిప్పుడే నీచస్థితినుంచి బయటపడ్డాడు.

జలతత్వరాశైన వృశ్చికానికి అర్గళం పట్టింది.లాల్ కితాబ్ సిద్ధాంతం ప్రకారం కుజబుధులు కలిస్తే శుక్రుడౌతాడు. కనుక వృశ్చికరాశికి రెండుప్రక్కలా శుక్రునితో అర్గళం పట్టింది. శుక్రుడు జలతత్వ గ్రహం. వృశ్చికం జలతత్వ రాశి. రాహుచంద్రుల కోణదృష్టి భారతదేశానికి సూచికైన మకరం మీదుంది. ఇక ఫలితాలను చూడండి.

అన్నమయ్య జలాశయం, పోచి జలాశయాల గట్లు తెగి, కడపజిల్లాలోని నందలూరు - రాజంపేటల మధ్యన రైల్వే ట్రాక్ ఒక కిలోమీటరు పొడుగునా కొట్టుకుపోయింది. పనిలో పనిగా ఒక రైల్వే బ్రిడ్జి కూడా కొట్టుకుపోయింది. ముంబాయి చెన్నై రూట్లో రైళ్లు స్తంభించాయి. వర్షంలో తడుస్తూ, భయంకరంగా ఉన్న బురదలో 500 మంది స్టాఫ్ రాత్రింబగళ్ళూ పనిచేస్తూ ట్రాక్ ను వేసే పనిలో, బ్రిడ్జిని మళ్ళీ కట్టే పనిలో ఉన్నారు.

కడపజిల్లా గందరగోళమైంది. వరదలలో 40 మంది గల్లంతయ్యారు. వరదమధ్యలో ఇరుక్కుపోయిన బస్సు మీదనున్న జనాన్ని IAF హెలికాఫ్టర్ ఎయిర్ లిఫ్ట్ చేసింది.

చెన్నైలో, తిరుపతిలో కుండపోత వర్షాలతో రోడ్లు జలమయాలయ్యాయి. తిరుమలలో కురిసిన వర్షాలకు , కపిలతీర్థం మునిగింది. తూర్పు కోస్తా అంతటా వర్షాలు పడుతున్నాయి. సౌత్ మొత్తం గందరగోళమైంది. మకరం దక్షిణదిక్కును సూచిస్తుందని మర్చిపోకండి.

ఒక్క మనదేశమేనా దెబ్బతినేది? అన్న చొప్పదంటు అనుమానాన్ని రానివ్వకండి.

కెనడాలో బ్రిటిష్ కొలంబియా గుర్తుందా? వందలాది మంది పిల్లల సమాధులు ఒక చర్చి స్కూల్ ఆవరణలో  బయటపడ్డాయి కొంతకాలం క్రితం ! అదే ప్రావిన్స్ లో ఇప్పుడు భయంకరమైన వరదలు ముంచెత్తుతున్నాయి. వృషభరాశి కెనడాను సూచిస్తుందని గతంలో వ్రాశాను గమనించండి. వేలాదిగా పశువులు చనిపోయాయి. కనీసం 18000 మంది వరదలలో చిక్కుకుని అల్లాడుతున్నారు. బ్రిటిష్ కొలంబియా ఎమర్జెన్సీని ప్రకటించింది. అక్కడ జలగ్రహమైన చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటూ, రాహుగ్రస్తుడైన ఈ సమయంలోనే అక్కడ వరదలెందుకొచ్చాయో అర్థమైందా మరి? 

తిరుమలలో ఇలాంటి వర్షాలు గత 500 ఏళ్లలో లేవని అంటున్నారు. ఈ గ్రహణం కూడా దాదాపు  7 గంటలపాటు ఉంది. గత 600 ఏళ్లలో ఇలాంటి చంద్రగ్రహణమూ రాలేదని అంటున్నారు.  కనుక లెక్క సరిపోయిందా మరి?

గ్రహణాలూ, అమావాస్యా పౌర్ణములూ ఇలా భూమిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. గత పదేళ్లుగా నా పోస్టులు చూడండి. ఎన్ని సార్లు రుజువైందో గమనించారా?

మనపైన గ్రహప్రభావం లేదని  ఎలా అనగలం చెప్పండి?
read more " నవంబర్ 2021 పౌర్ణమి ప్రభావం - పెనువర్షాలు "

18, నవంబర్ 2021, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 45 (మహనీయుల మాటలలోని గూఢార్ధాలు - కర్మనియమం)

వెనుకకు తిరిగి వస్తుండగా మూర్తి ఇలా అన్నాడు.

'మీరు ఆయనతో అలా మాట్లాడుతుంటే చాలా సంతోషం వేసింది గురువుగారు. ఊరకే అలా మీ ఇద్దరినీ చూస్తూ ఉండాలనిపించింది. ఇలాంటి సన్నివేశాలలో పాత్రధారులమైనందుకు మేం అదృష్టవంతులం'

'అది నిజమే. జరుగుతూ ఉన్నపుడే, వారి అదృష్టాన్ని అర్ధం చేసుకునేవారు చాలా తక్కువమంది ఉంటారు. చాలామంది, జరిగిపోయిన తర్వాత ఎప్పుడో వెనక్కు తిరిగి చూచుకొని, 'ఆ సమయంలో మేమూ ఉన్నాం' అని సంతోషపడేవాళ్ళుంటారు. చాలామందికి ఇదే జరుగుతుంది. కానీ అతి కొద్దిమంది మాత్రమే, జీవితం జరుగుతున్నప్పుడే దాని విలువను తెలుసుకుని ఆనందించే వాళ్ళుంటారు. వారి సంఖ్య ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. మొదటివారు గుర్తించలేకపోవడానికి కారణం వారి అహంకారం. అది వాళ్ళ కళ్ళకు పొరలను కమ్మిస్తుంది. జరుగుతున్న దానిని సకాలంలో గుర్తించి, దానిని నిలుపుకోగలిగినవాడే లౌకికంలోనైనా, ఆధ్యాత్మికంలోనైనా అసలైన అదృష్టవంతుడు' అన్నాను. 

సంభాషణను కొనసాగిస్తూ, 'ఇందాక దినకర్ గారు అన్నారు చూడు, 'అమ్మ నాతోనే ఇలా అన్నది "డబ్బు వచ్చేసరికి నేనుండను నాన్నా" అని. ఎందుకలా జరుగుతుందో తెలుసా? ఈ లోకంలో, విత్తనం వేసేవాడొకడు, పంటను తినేవాడొకడు, విత్తేవాడు తినడు, తినేవాడు విత్తడు. ఇదింతే, కర్మనియమం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది' అని అంటుండగా ఈ క్రింది పద్యం ఆశువుగా మనసులో ఉద్భవించింది.


ఆ || విత్తువారలొకరు వినియోగమొకరికౌ

పంట నేర్పుగాదె పరమబోధ

కర్మనియమమిద్ది; కనరాదు వినరాదు 

చూచి; తెలియువాఁడె సూక్ష్మజ్ఞాని


అయితే, ఈ పద్యాన్ని బయటకు చెప్పకుండా మనసులోనే ఒక మూలన నిక్షిప్తం చేసి, మాటలను కొనసాగించాను.

'మహనీయులు, వారి కాలానికి చాలా ముందుంటారు. వారు చెప్పేవాటిని సరిగ్గా అర్ధం చేసుకోవడమే వారి కాలపు మనుషులకు వీలు కాదు. ఇక ఆచరించడం మాట దేవుడెరుగు. వాటిని అర్ధం చేసుకునే లోపు, ఆ మహనీయులు మాయమైపోతారు. తరువాతి తరంవారు, వారి ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు. లోకం తీరింతే. ఇదెప్పటికీ మారదు. అందుకే అమ్మగారు ఆ మాటన్నారు.  నిజానికి, అమ్మ ఉన్న కాలంలో డబ్బున్నవాళ్ళు లేరా? బ్లాక్ మనీ కుప్పలు తెప్పలు గా ఉంది. కానీ, ఎవడూ ఇవ్వలేదు. వివేకానందస్వామి ఒక బిచ్చగాడిగా మన దేశంలో పదేళ్లు తిరిగారు. అప్పట్లో 500 పైగా రాజ్యాలున్నాయి, సంస్థానాలున్నాయి. రాజులున్నారు. డబ్బు కోసం ఆయన అమెరికా వెళ్లి వేదాంత ప్రచారం చేయవలసిన ఖర్మ ఏముంది? ఎన్ని కష్టాలు పడ్డారాయన? ఆ విధంగా సంపాదించిన డబ్బుతో బేలూర్ మఠం స్థలాన్ని కొని, మఠాన్ని స్థాపించారాయన. దాని నీడన ఎన్ని లక్షలమంది  సేద తీరుతున్నారిప్పుడు? ఆయన పడిన కష్టమే ఇప్పటివారికి సుఖమైంది. 

అదే విధంగా, జిల్లెళ్ళమూడి అమ్మగారు పోయినప్పుడు, అందరూ ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.  భక్తులందరూ స్వార్ధపరులే కదా ! వేరే వేరే గురువుల పంచన చేరారు. ఎవడి పబ్బం ఎక్కడ గడుస్తుందనుకుంటే అక్కడకు చేరారు. ఇరవై ఏళ్ల పాటు జిల్లెళ్ళమూడి నిర్మానుష్యమైపోయింది. ఆ ఎడారి సమయంలో ఇక్కడే అంటిపెట్టుకుని దినకర్ గారు, వసుంధర గారు మొదలైనవాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు. వాళ్ళు, అసలైన భక్తులు. అలాంటి పరిస్థితిలో కూడా, అమ్మ మీద వాళ్ళ విశ్వాసం ఏమాత్రమూ సడలలేదు. అదీ అసలైన విశ్వాసమంటే ! అదీ అసలైన భక్తంటే ! ఈ ఒక్క కారణం వల్లనే నేను వీరిని గౌరవిస్తాను. వీళ్ళు అమ్మతో కలసి జీవించారని నేను వీళ్ళను గౌరవించను. వీళ్ళ అచంచలమైన విశ్వాసం, నమ్మకం నన్ను కదిలిస్తాయి'

దినకర్ గారు ఇందాక మాట్లాడుతూ ఇంకొక మాటన్నారు. 'అమ్మ ఉన్నపుడు మా దగ్గర డబ్బుల్లేవు. అమ్మ, తన నగలు అమ్మి, అన్నపూర్ణాలయంలో అన్నదానం నడిపింది' అని. అలాంటి తల్లులు ఇప్పుడెవరున్నారు? తన నగలు అమ్మి లోకులకు అన్నం పెట్టింది అమ్మ. ఎంతటి నిస్వార్ధపూరితమైన, ప్రేమమయమైన హృదయం అమ్మది !  అలాంటి మనుషులు అసలుంటారా ఎక్కడైనా? అమ్మ పోయిన తర్వాత ఎన్నో ఏళ్ళు జిల్లెళ్ళమూడి ఆశ్రమం అప్పులలో ఉన్నది. అప్పులు చేసి ఆశ్రమాన్ని నడిపిస్తూ వచ్చారు. తర్వాత దాదాపుగా 36 ఏళ్లకు, ఇప్పుటికి, కొద్దిగా నిలకడ వచ్చింది. ఎందుకలా జరుగుతుంది? నిజంగా మన దగ్గర డబ్బుల్లేవా? ఇండియన్స్ కున్న స్విస్ బ్యాంక్ ఎకౌంట్ల మీద వికీలీక్స్ లిస్టు చూచావా? ఆ లక్షలాది కోట్ల రూపాయల డబ్బంతా ఎవరిదీ? ఎక్కడిదీ? ఎవడి దగ్గర దోచుకున్నదా సొమ్ము? మానవజాతి ఖర్మ ఇంతే. ఇదెప్పటికీ మారేది కాదు.'

'మహనీయులకు మన డబ్బులెందుకు? వారు మనకు వెలుగును చూపడం కోసం వస్తారు. వెళతారు. మన డబ్బులను మనమే తింటాం. వారికక్కర్లేదు. వారి మాటలను తేలికగా తీసుకోకూడదు. వారు చాలా మామూలు మాటలనే  మాట్లాడినట్లు ఉంటారు గాని, వాటిలో చాలా లోతైన గూఢార్ధాలుంటాయి. అమ్మ చెప్పిన మాటకు ఇంకొక అర్ధం కూడా ఉంది. 'డబ్బు' అంటే జ్ఞానం అని అర్ధం. 'ఇక్కడ డబ్బు చేరేసరికి నేనుండను నాన్నా' అంటే, 'మీకందరికీ జ్ఞానం వచ్చేసరికి నేనుండను' అని అసలైన అర్ధం, ఎందుకలా? అమ్మ చెప్పిన అత్యున్నత సత్యాలను, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది, ఎన్నో జన్మలే పట్టవచ్చు.  అది అంతరిక సాధనామార్గం. ఊరకే బుర్రతో అర్ధం చేసుకునే విషయాలు కావివి.  సాధనామార్గంలో నడచి, నలిగి, పరిణతి చెంది, వాటిని అనుభవంలో తెలుసుకోవాలి. దానినే సాక్షాత్కారం అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో కావలసింది 'అర్ధం చేసుకోవడం' కాదు, 'సాక్షాత్కారాన్ని పొందటం'. కొద్దిగా తెలివి తేటలున్నవాడికి కూడా తత్త్వం అర్ధమౌతుంది, విషయం అర్ధమౌతుంది. కానీ అది ఏమూలకూ సరిపోదు. కావలసింది 'సాక్షాత్కారం'.

'ఎప్పుడైనా, ఏ మహనీయుడి భక్తులకైనా ఇదే జరుగుతుంది. ఇది కర్మనియమం. నక్షత్రాల లోకం నుండి  కొందరు ఇక్కడికి వస్తారు. 'అవిగో నక్షత్రాలు' అని మనకు చూపిస్తారు. మనం వాటిని చూస్తూ, 'ఇవేనా నక్షత్రాలు' అని అర్ధం చేసుకునే లోపే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తరువాత, మనం వాటిని చేరుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. అప్పటికి వాళ్ళు మనతో ఉండరు. వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మనతో మిగులుతాయి. భూమి పుట్టిన నాటినుండీ ఇది ఇలాగే జరుగుతూ వస్తున్నది.  రేపు మీకైనా ఇదే జరుగుతుంది. ఇదే కర్మనియమం' అన్నాను.

మాటల్లోనే ఇంటి దగ్గరకు చేరుకున్నాం.

అదే రోజు రాత్రికి అక్కడనుంచి బయల్దేరి మర్నాడు పొద్దున్నకి హైద్రాబాద్ వచ్చేశాను.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 45 (మహనీయుల మాటలలోని గూఢార్ధాలు - కర్మనియమం) "