“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2014, బుధవారం

బ్రతుకు కల

నీ వాకిట నిలుచుని ఉన్నా
నా భుజం మీదనుంచే ఎక్కడో చూస్తున్నావు
నాకోసం

నీ తలుపు తడుతూ ఉన్నా
తలుపు తీయకుండా వేచి ఉన్నావు 
నా కోసం

నీ ఎదురుగా నేనుంటే
ఇల్లంతా తిరుగుతున్నావు
నాకోసం

నీ ఊపిరిలో చలనంగా నేనున్నా
ఆ సవ్వడి ఎక్కడిదా అని వెతుకుతున్నావు
నాకోసం

నీ నీడగా నేనొస్తుంటే
తలతిప్పి నావైపు చూడటానికి
నీకెందుకో ఇంత భయం?

అనుక్షణం అందిస్తున్న
స్నేహహస్తాన్ని అందుకోవడానికి
నీకెందుకో ఇంత సంకోచం?

అమృతం ఎదురుగా ఉంటే
అగాధాలలో జలం కోసం వెదుకుతున్నావు
ముంగిట నేనే నిలుచుని ఉంటే
ముల్లోకాలూ నాకోసం గాలిస్తున్నావు

నాకోసం తిరుగుతూ
నన్నే నమ్మలేకున్నావు
అసలు నీకేం కావాలో
నీవే తెలుసుకోలేకున్నావు

నీ భయాలను వీడక పోతే
కాలం కళ్ళముందే మరుగౌతుంది
నీ అహాన్ని వదలకపోతే
జీవితం నీడలవెంట పరుగౌతుంది

ఎదురుచూపులా ఆపలేవు
ఎదుట నిలిస్తే తాకలేవు
నిన్ను నీవెప్పటికీ గెలవలేవు
నన్ను నన్నుగానేమో కలవలేవు

నువ్వు నువ్వుగానే ఉంటే
నన్ను కలుసుకోలేవు
నిన్ను నీవు వదలకుంటే
నన్ను గెలుచుకోలేవు

నిన్ను నీవు గెలవనిదే
అనుసరించలేవు నన్నెప్పటికీ
నన్ను అనుసరించనిదే
తెలుసుకోలేవు నిన్నెప్పటికీ

సముద్రంలో కరగకపోతే
అల అలగానే మిగులుతుంది
సమత్వంలో నిలవకపోతే
బ్రతుకు కలగానే ముగుస్తుంది
read more " బ్రతుకు కల "

28, ఏప్రిల్ 2014, సోమవారం

అసమర్ధుని ఆధ్యాత్మిక యాత్ర

ఉన్న జీవితం మీద అసంతృప్తి
ఇంకేదో పొందాలన్న అమితాసక్తి
అంతులేని సంఘర్షణలో 
అనుక్షణం కరిగిపోతుంది కాలం

కళ్ళతో పిలుస్తాయి సుదూర తీరాలు
కాళ్ళను కట్టేస్తాయి మాయామోహాలు
రేవును వదలకుండా 
నావ పయనం ఎలాసాధ్యం?
పూవు వికసించకుండా
సుగంధపు పరిమళం ఎలాసాధ్యం?

వదలనంటుంది వెలిసిన ప్రస్తుతం
అందనంటుంది వెలుపలి ఆశయం
ఎటూ తేల్చుకోలేని ఎదురుచూపులలో
ఎగశ్వాసగా మిగులుతుంది 
ఎల్లలెరుగని శూన్యం

అడుగును వెయ్యాలంటే అమిత భయం
ఆశను చంపుకోవాలంటే తగని అహం
ముందూ వెనుకల ముసుగులాటలో
అంతులేని ద్వైదీభావంలో
ఆవిరై పోతుంది జీవితం

సత్యాన్ని ఒప్పుకోవాలంటే సంకోచం
అసత్యాల నీడలతో వీడని సహవాసం
నిత్యకృత్యంగా మారిన అసహనం
తెరుచుకోని ముత్యపు చిప్పకెందుకో 
ప్రవాళసృష్టిపై ఇంతటి ఆరాటం?

నీడలోని చీకటిని వీడలేని అశక్తత
ఎండవెలుగుకు తాళలేని అసమర్ధత
సందిగ్దపు సమరంలో నిరంతర పోరాటం
చీకటి వెలుగుల సంధ్యలలో 
చిరకాలపు ఒంటరి ప్రయాణం

నీలాకాశంలో మేఘంగా ఎగరాలని ఆవేశం
కాళ్ళకంటిన బురదను కడుక్కోలేని ఆక్రోశం
అలసిపోయి సొలసిపోయి
దిగంతాల తీరాలకు
ఎగిరిపోయే ఆత్మవిహంగం

లోని సంకెళ్ళను తెంచుకోకుంటే
సహవాసపు రుచి దక్కదు నేస్తం
మనసు వాకిళ్ళను మూసుకునే ఉంటె
ఇహలోకపు గతి తప్పదు నేస్తం

కళ్ళూ చెవులూ నోరూ పనిచేస్తూనే ఉంటే
ఆధ్యాత్మికమెలా దక్కుతుంది?
ఒళ్ళు మరచి నీ బైటకి నీవు దూకకుంటే
ఆత్మాశ్రయమెలా చిక్కుతుంది?

లోకంలో సమర్ధుడవైతే ఉపయోగం లేదోయ్
శోకాన్ని దాటే మార్గం తెలీనంతవరకు
కూపమే మహాసంద్రమని అనిపిస్తుందోయ్
లోకపు కోటను వీడి పోనంతవరకు

నాటకాలు కట్టిపెట్టి నాణ్యంగా నడవవోయ్
పూటకొక్క వేషమేస్తే పుట్టగతులు కష్టమోయ్
మోసాన్నే వీడనంటె మోక్షం లభియించదోయ్
మోహాలను గెలవకుంటె మోదం వికసించదోయ్

అంతులేని పయనంలో అడుగడుగూ కష్టమోయ్
వింతదైన లోకంలో పడిలేవడమెందుకోయ్
నిన్ను నీవు నమ్ముకుంటె నీవే గుదిబండవోయ్ 
నిన్ను నీవు నమ్మకుంటె ముందడుగే కుదరదోయ్  

అసమర్ధుని ఆధ్యాత్మిక యాత్రలో
అనుక్షణమూ నరకమోయ్
ఆశ వలకు లోబడితే
అగచాట్ల విలాపమోయ్

తన్ను తాను గెలవకుంటే తాత్పర్యం దక్కదోయ్
మిన్ను వైపు కెగరకుంటే మిత్తి నిన్ను వదలదోయ్
కన్ను మూసి తెరుచులోపు కాలం కబళించునోయ్
నిన్ను నీవు పొందకుంటే నీ బ్రతుకే శూన్యమోయ్
read more " అసమర్ధుని ఆధ్యాత్మిక యాత్ర "

27, ఏప్రిల్ 2014, ఆదివారం

కాలజ్ఞానం 22-వైశాఖమాసం(మే -2014) ఫలితాలు


వైశాఖమాసం ఏప్రియల్ 30 నుంచి మొదలౌతున్నది.హైదరాబాద్ నగరానికి ఏప్రియల్ 29 న 11.44 నిముషాలకు వేసిన కుండలిని ఇక్కడ చూడవచ్చు.

దీనిని విశ్లేషించి మే నెలలో ఏయే సంఘటనలు జరుగబోతున్నాయో గమనిద్దాం.

దేశంలో జరుగబోతున్న ప్రస్తుత సాధారణ ఎన్నికలదృష్ట్యా ఈనెల చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది.

ఈ కుండలిలో కర్కాటకలగ్నం ఉదయిస్తూ ఈ నెలలో దేశ రాజకీయ పరిస్థితిలో రాబోతున్న విపరీతమైన ఆటుపోట్లను సూచిస్తున్నది.దశమంలో చరరాశిలో ఉన్న చతుర్గ్రహ కూటమి త్వరలో జరుగబోతున్న అధికార మార్పిడిని స్పష్టంగా సూచిస్తున్నది.

లగ్నంలోని మాందీ గుళికులు ప్రజాజీవితంలో రాబోతున్న మార్పులను సూచిస్తున్నారు.

అక్కడే ఉన్న ఘటీలగ్నం వల్ల అంతర్జాతీయంగా మన దేశప్రతిష్టలో రాబోతున్న మంచిమార్పు సూచితం అవుతున్నది.ఇన్నాళ్ళూ పనికిమాలిన దేశంగా,అవినీతి దేశంగా ముద్రపడిన మన దేశంకూడా తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ముందుముందు ఉంటాయని,భారతదేశప్రజలు అభివృద్ధిని కోరుకుంటారనీ,అదే దిశగా ఓటేస్తారనీ,నాయకులకున్నంత అవినీతి ప్రజలలో లేదనీ,అంతర్జాతీయ సమాజం అర్ధం చేసుకుంటుందన్న సూచనను ఘటీలగ్నం ఇస్తున్నది.

చతుర్ధంలోని రాహుశనులు ప్రజాజీవితంలో రాబోతున్న కల్లోలాన్ని (ఆంధ్రరాష్ట్ర విభజనపరంగా) సూచిస్తున్నారు.

ఈ నెలప్రారంభంలోనే కొందరు నాయకులమీద చీకటి కమ్ముకుంటుంది. వారు చేసిన పాపాలకు శిక్షలు పడటం మొదలౌతుంది.

ఇప్పటివరకూ అధికారంలో ఉన్నవారికి ఈ నెలలో రాజ్యాధికారం గల్లంతౌతుంది.దోచుకున్నది చాల్లే ఇక ఆపండి అంటూ రాజ్యలక్ష్మి వారిని వీడిపోతుంది.ఇన్నాళ్ళూ అధికార దుర్వినియోగానికి పాల్పడినవారికి ముందుముందు ఏమౌతుందో అన్న భయమూ మానసికచింతా పట్టి పీడించడం మొదలౌతుంది.

ఈ పరిస్థితి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఉంటుంది.

మతపార్టీగా పొరపాటుగా ముద్రపడిన ఒక పార్టీ,మిత్రుల సహకారంతో మంచి మెజారిటీని సాధిస్తుంది.ప్రజలు సమర్ధవంతమైన క్రొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూడడం ప్రారంభిస్తారు.

ప్రజలలో ఉన్న దుష్టశక్తులనూ వర్గాలనూ కనిపించని దైవశక్తి నిగ్రహిస్తుంది.

యువకులలోనూ ఆశావహులైన ప్రజలలోనూ కష్టించి పనిచేసేవారిలోనూ క్రొత్త ఉత్సాహం నిండుతుంది.నిజమైన మేధావులలోనూ దేశభక్తుల లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది.

ఆంధ్ర రాజకీయాలలో రెండు స్పష్టమైన అధికార కేంద్రాలు మొదలౌతాయి. ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలు విడిపోయే ప్రక్రియలో గందరగోళాలు ఉంటాయి.ఇవి మే 6,7 తేదీలలో జరుగుతాయి.

అదే తేదీలలో వాహన ప్రమాదాలూ రహదారి మరణాలూ ఉంటాయి.

మే 16,17,18 తేదీలలో కొన్ని చోట్ల ఉత్సవాలూ కొన్ని చోట్ల మతపరమైన అల్లర్లు జరుగుతాయి.బీసీ నేతలు గద్దెనెక్కుతారు.నిమ్న వర్గాలకు అధికారం అందుబాటులోకి వస్తుంది.వారిలో ఆనందం కలుగుతుంది.

కొందరు నేతల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.

విదేశాలలో మన మహిళల మీద ఉన్న కేసులు ఒక కొలిక్కి వస్తాయి. కొందరు భారతీయ మహిళలు విదేశాలలో మంచి పేరు ప్రతిష్టలూ ఆదరణా పొందుతారు.

మే 20,21,22 తేదీలలో అధికారపరమైన మార్పులు ప్రారంభం అవుతాయి. అదే సమయంలో అనేకమంది అధికారులకు పదవీగండం,కొందరు నేతలకు ఆరోగ్యభంగం,మరికొందరికి పరలోక ప్రయాణ సూచనలున్నాయి.
read more " కాలజ్ఞానం 22-వైశాఖమాసం(మే -2014) ఫలితాలు "

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

దేనికైనా రెడీ


గుంటూరు డివిజన్ రైల్వే వీక్ వారోత్సవాలలో భాగంగా ఒక మంచిడ్రామా వేద్దామని అనుకున్నాం.ఒక సమకాలీన సమస్యకు హాస్యాన్ని రంగరించి డ్రామాను వ్రాసుకుంటే బాగుంటుందని భావించి --ఆడపిల్లల భ్రూణహత్యల వల్ల సమాజంలో ఆడామగా నిష్పత్తిలో తేడా రావడమూ.దానివల్ల ఆడపిల్లలు తగ్గిపోయి,మగపిల్లలు ఎక్కువై పోయి,మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాక,కన్యాశుల్కం ఇచ్చుకుని అమ్మాయిలను పెళ్ళిచేసుకునే రోజులు సమాజంలో మళ్ళీ వస్తున్న డేంజర్ సిగ్నల్స్ ను దృష్టిలో ఉంచుకుని--ఒక డ్రామాను వ్రాసుకున్నాము.

దానిపేరే 'దేనికైనా రెడీ'.

మొదట్లో ఈ నాటిక పేరు 'బంధాలు-సంబంధాలు' అనుకున్నాం.కాని ఈ పేరు మరీ పాతచింతకాయ పచ్చడిలా ఉన్నదని భావించి ఇలా మార్చాం. 

ఈ డ్రామా వ్రాసింది మిత్రుడు ప్రసాద్.ఐడియాలు అందించింది మిత్రుడు వెంకట్రామ శాస్త్రి.రిహాల్సల్స్ సందర్భంగా స్క్రిప్ట్ ను రకరకాల మార్పులు చేసి దానిని ఒక పరిపూర్ణత్వాన్ని తెచ్చింది నేను,సహోద్యోగులు వెంకటరామశాస్త్రి, సత్యగోపాల్,ఉమామహేశ్వర్ మొదలైనవారు.

ఇందులో అయిదు పాత్రలుంటాయి.

ఈశ్వర్రావ్
ఇతను రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్.మొదటి సంతానంగా అమ్మాయి పుట్టాక ఇక పిల్లలు చాలనుకుని ఆమెను చక్కగా పెంచి పెద్దచేసి పెళ్ళిచేసి రిటైరై హాయిగా జీవితం గడుపుతూ ఉన్న వ్యక్తి.మంచి కామెడీ డైలాగులతో డ్రామాను నడిపిస్తూ చివరలో సమాజానికి సందేశాన్ని ఇచ్చే పాత్ర.ఈ పాత్రను నేను ధరించాను.

గిరిధర్
ఇతను ఈశ్వర్రావ్ మిత్రుడు.పెద్ద సివిల్ కాంట్రాక్టర్.తన ఇద్దరు అబ్బాయిలకూ పెళ్ళిళ్ళు చెయ్యాలని నానా ప్రయత్నాలూ చేస్తూ కుదరక ఏదైనా సంబంధాలు ఉన్నాయేమో అని వెదుకుతూ మిత్రుడు ఈశ్వర్రావ్ వద్దకు వస్తాడు.డ్రామా రచయిత ప్రసాద్ ఈ వేషం ధరించాడు.

గోపాలం
ఇతను ఈశ్వర్రావ్ మేనల్లుడు.చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. ప్రభుత్వోద్యోగం కావడం వల్ల ఏ అమ్మాయీ ఇతన్ని పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.అమ్మాయిలందరూ సాఫ్ట్ వేర్ అబ్బాయిలే కావాలని అంటున్నారు.కనుక వయస్సు మీదపడుతూ పెళ్ళికాని ప్రసాద్ గా మిగిలిపోతున్న స్థితిలో ఉన్నాడు.మేనమామ ఈశ్వర్రావ్ ఇతనికి సంబంధాలు చూస్తున్నాడు.బాగా కామెడీ పండించడానికి అవకాశం ఉన్న పాత్ర ఇది.ఈ పాత్రను మిత్రుడు సత్యగోపాల్ ధరించాడు.ఏ సంబంధం ఒచ్చినా చేసుకోడానికి రెడీ అయ్యే పాత్ర ఇది.నాటిక టైటిల్ ఇదే.

బ్రోకర్ భుజంగం
ఇతను ఒక పెళ్ళిళ్ళ పేరయ్య.ఇప్పటి భాషలో మేరేజి బ్యూరో నడుపుతున్న వ్యక్తి.ఇతని దగ్గరికి పెళ్ళి సంబంధాల కోసం మిగిలిన పాత్రలు అందరూ వస్తారు. ఇది కూడా బాగా కామెడీ పండించే పాత్రే.దీనిని మిత్రుడు వెంకటరామశాస్త్రి ధరించాడు.

ప్రసాద రావ్
ఇతని పెద్ద కూతురుకి ఒక సంబంధాన్ని బ్రోకర్ భుజంగం కుదురుస్తాడు. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద CEO అని చెప్పి పెళ్ళి చేస్తాడు.కాని పెళ్ళైన ఆర్నెల్లు తిరగకుండా ఆ పెళ్ళికొడుకు పెద్ద వ్యసనపరుడనీ,ఇప్పటికే అక్కడ ఇంకా కొంతమందితో సంబంధాలు ఉన్నాయనీ తెలుస్తుంది.కట్నం చాలక ఇంకా 25 లక్షలు తెమ్మని అమ్మాయిని హింసిస్తూ ఉంటాడు.ఈ పరిస్తితిలో బ్రోకర్ భుజంగంతో గొడవ పెట్టుకోవడానికి అతని ఆఫీస్ కి వస్తాడు ప్రసాదరావ్.పాత్ర నిడివి చిన్నదైనా మంచి ఆవేశమైన డైలాగ్స్ ఉన్న పాత్ర.దీనిని మిత్రుడు ఉమామహేశ్వర్ ధరించాడు. విఫలమౌతున్న విదేశీ సాఫ్ట్ వేర్ సంబంధాలను ఎత్తిచూపే పాత్ర ఇది.

పుట్టింది అమ్మాయైనా అబ్బాయైనా వారిని సమభావంతో పెంచి పెద్దచేసి, మంచి విద్యాబుద్ధులు నేర్పి,ఉన్నత స్థానానికి వారు ఎదిగేలా చెయ్యాలనీ, వివక్ష పనికిరాదనీ,కడుపులో ఉన్నది అమ్మాయని తెలిసి ఎబార్షన్ చేయించడం చాలా ఘోరమైన తప్పనీ,నేరమనీ,అత్తగారింట్లో అమ్మాయిని హింసించడం తగదనీ,భార్యాభర్తల సంబంధం కలకాలం చల్లగా ఉండాలంటే ముఖ్యంగా కావలసింది వారిమధ్యన అవగాహన అనీ,చదువుకున్న అమ్మాయిలకు అహంకారం పనికిరాదనీ దానివల్ల ఈగో సమస్యలు తలెత్తి వివాహాలు విడాకులకు దారి తీస్తున్నాయనీ,వివాహానికి ముఖ్యంగా కావలసింది డబ్బూ స్టేటస్సులు కాదనీ.ఒకరినొకరు అర్ధం చేసుకునే మనస్తత్వం ప్రధానమనీ,ప్రతివారూ సమాజం మారాలి అంటారుగాని ఆ మార్పు అనేది ముందుగా తమనుంచి మొదలుకావాలన్న సందేశంతో నాటిక ముగుస్తుంది.

డ్రామా బాగా రక్తి కట్టింది.ప్రేక్షకులలో నవ్వుల పువ్వులు విపరీతంగా పూయించింది.చివరిలో ఈశ్వర్రావ్ పాత్ర ఇచ్చిన సందేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని వారిని ఆలోచింపజేసింది.

ఇదే నాటికను సికింద్రాబాద్ లో ఏప్రియల్ 15 న జరిగిన జోనల్ రైల్వే వీక్ ఉత్సవాలలో కూడా ప్రదర్శించడం జరిగింది.తీసుకున్నది బర్నింగ్ టాపిక్ కావడంతో అక్కడ కూడా ఈ నాటిక విజయవంతమై ప్రేక్షకుల ప్రశంసలను పొందగలిగింది.

ప్రస్తుత సమాజానికి మంచి సందేశాత్మకమైన ఈ నాటికను ఎవరైనా ఔత్సాహికులు ప్రదర్శించాలని భావిస్తే వారికి స్క్రిప్ట్ పంపించడానికీ,డైరెక్షన్ మొదలైన ఇతర సహాయం అందించడానికీ మేము సిద్ధంగా ఉన్నాము.
read more " దేనికైనా రెడీ "

24, ఏప్రిల్ 2014, గురువారం

కృతజ్ఞత-దైవత్వానికి తొలిమెట్టు

మనం ఎవరినుంచైనా ఒక సహాయం పొందితే 'ధాంక్స్' అని వారికి చెప్పాలని ఒక పధ్ధతి మనం పాటిస్తాం.మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం.కాని ఆ 'ధాంక్స్' అనేది పెదవులనుంచి కాకుండా హృదయపు లోతుల లోనుంచి రావాలన్న విషయాన్ని మాత్రం విస్మరిస్తుంటాం.అసలు హృదయం అనేది ఒకటున్నదనీ దానికి స్పందన అనేది ఒకటి ఉంటుందనీ నవీన నాగరికతా ప్రభావంతో,మితిమీరిన స్వార్ధపరతతో, మనం పూర్తిగా మర్చిపోయాం.

'ధాంక్స్' చెప్పడం అనేది ఒక మొక్కుబడిగా,ఒక జీవరహితమైన తంతుగా మనకు అలవాటైంది.హృదయపూర్వకంగా కృతజ్ఞతను వెల్లడించడం అనేదాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం.మన హృదయాలు జీవరహితములుగా తయారవ్వడమే దీనికి కారణం.

అతి ప్రాచీనకాలంలో మానవుడు ఇలా ఉండేవాడు కాడు.అతడు ప్రాధమికంగా కృతజ్ఞతతో నిండి ఉండేవాడు.ఎందుకంటే అతను ఈ లోకంలోకి ఒక ఒంటరి యాత్రీకుడిగా వచ్చాడు.ప్రకృతిలోని నీరూ గాలీ భూమీ ఆకాశమూ సూర్యుని వెలుగూ అతన్ని రక్షిస్తున్నాయని అతనికి స్పృహ ఉండేది.వాటి ఆధారంతోనే తాను బ్రతుకుతున్నాననీ మనుగడ సాగిస్తున్నాననీ అతను గ్రహించాడు.ఇందులో తన గొప్పా అహమూ ఏమీ లేవన్న సత్యాన్ని అతను గ్రహించాడు.కనుక వాటికి కృతజ్ఞుడై ఉండేవాడు.వాటిని ఆరాధనాభావంతో దర్శించేవాడు.

వేదకాలంలో ఉద్భవించిన మంత్రాలూ సూక్తాలూ అతను పొందిన ఈ సత్యమైన భావనకూ అతని ఈ అనుభవానికీ తద్వారా అతని హృదయంలో ఉప్పొంగిన కృతజ్ఞతకూ ప్రతిరూపాలే.

ఉదాహరణకు వేదంలోని 'భూసూక్తం' విషయాన్ని చూద్దాం. భూమినుంచే మనకు అవసరమైన సమస్తమూ వస్తున్నది.మనం తినే తిండిని భూమే మనకు ఇస్తున్నది.మనకు ఆధారంగా మన ఇళ్ళకు ఆధారంగా భూమే మనలను మోస్తున్నది.మనం విసర్జించిన మలమూత్రాలను అన్నింటినీ భరిస్తున్నది.మనకు అనేక ఖనిజాలనూ ఔషధాలనూ ఇస్తున్నది.చివరకు మనం పోతే మనల్ని తనలో కలుపుకుంటున్నది.మనల్నే కాదు మనలను కన్నతల్లులనూ వారి తల్లులనూ కూడా ఈ భూమే వారు బ్రతికున్నన్ని రోజులూ పోషించింది.చివరకు తనలోనే వారికి  విశ్రాంతినిచ్చింది.

మరి అటువంటి భూమిని దేవతగా భావిస్తే తప్పేమిటి?తల్లిగా పూజిస్తే తప్పేమిటి?పూజిస్తే తప్పుకాదు.పూజించకపోవడం ఘోరమైన తప్పు. జీవితాంతం ఒక ఉపయోగాన్ని ఒకరినుంచి పొంది వారిపట్ల కనీస కృతజ్ఞత లేకుండా ఉంటే ఆ మనిషిని ఏమనాలి?అసలు మానవుడు అన్న పదానికి అతను అర్హుడేనా?ఖచ్చితంగా అతన్ని మానవుడు అని పిలవలేం.

ఈ ఉదాత్తమైన భావన నుంచే వేదంలోని భూసూక్తం ఉద్భవించింది. భూసూక్తం ఒక్కటే కాదు.సమస్త వేదం అంతా ఇలాంటి ఉదాత్తమైన ఉన్నతమైన భావనల మంత్రపూరిత సమాహారమే.

ప్రాచీన మానవుడు పంచభూతాలలో దైవాన్ని దర్శించాడు.పుట్టిన క్షణం నుంచీ పోయేవరకూ తనను పోషిస్తున్న ఆ పంచభూతాలలో దైవశక్తిని దర్శించిన అతని హృదయంలో నుంచి ఉప్పొంగిన కృతజ్ఞతా భావాలే ఈ సూక్తాలు.ఎందుకంటే ప్రకృతి తనకిస్తున్న ఈ సౌకర్యాలను తన స్వశక్తితో తాను సంపాదించలేదని అతనికి తెలుసు.అవి దైవంనుంచి తనకు నిష్కారణంగా వచ్చిన వరాలని అతనికి తెలుసు.తనకు అర్హత లేకపోయినా దైవం వాటిని తనకు ఇచ్చిందనీ,వాటి రూపంలో దైవమే తనను పోషిస్తున్నదనీ అతనికి స్పృహ ఉన్నది. దైవప్రేమకు ఇదే సూచన అనీ అతనికి అర్ధమైంది.కనుకనే ఆ శక్తులను దైవంగా అతను ఆరాధించేవాడు.

నవీన మానవుడిలో ఈ హృదయ స్పందన లోపించింది.దానికి కారణాలు అనేకం.నవీన జీవనవిధానం ఒక కారణమైతే,మితిమీరిపోతున్న స్వార్ధపరత ఇంకొక కారణం.ఎంతసేపూ ఎదుటివాడిని ఎలా వాడుకోవాలి?ప్రకృతిని ఎలా వాడుకోవాలి?మనుషులను ఎలా వాడుకోవాలి?మన అవసరానికీ స్వార్ధానికీ ఎదుటివారు ఎలా ఉపయోగపడతారు?ఎంతవరకూ ఉపయోగపడతారు?ఆ తర్వాత వారిని ఎలా వదిలించుకోవాలి?అన్న భావజాలం నరనరానా జీర్ణించుకుపోవడమూ,నవీన నాగరికసమాజం కూడా అలాంటివారినే 'సక్సెస్ ఫుల్ వ్యక్తులు'గా గుర్తించి గౌరవించడమూ వల్ల ఇదే భావజాలం సమాజంలో అందరిలో పాతుకుపోతున్నది.దీనివల్లనే అంతా సర్వనాశనం అవుతున్నది.

దేనినైనా సరే 'వాడుకోవడం-వదిలెయ్యడం' మాత్రమే నవీన మానవుడు నేర్చుకుంటున్న విద్య.దీనినే 'మేనేజిమెంట్ టెక్నిక్' అని భావిస్తూ ఉద్యోగులకూ భావి ఉద్యోగులకూ వ్యాపారవేత్తలకూ కూడా ఇదే భావజాలాన్ని కాలేజీలు పెట్టి మరీ నూరిపోస్తున్నారు.ఈ క్రమంలో మానవుడు 'కృతజ్ఞత' అనే భావానికి దూరమై చివరికి పూర్తిగా పశువుగా మారిపోతున్నాడు.

నవీన కాలంలో గురుశిష్యుల బంధాలూ దీనివల్లనే కలుషితం అవుతున్నాయి. సోకాల్డ్ మోడరన్ గురువులూ తమ శిష్యులను ఏదో విధంగా వాడుకోవాలని చూస్తున్నారు.శిష్యులు కూడా తమతమ స్వార్ధపూరిత కోరికలు తీరడం కోసమే ఆయా గురువులను దగ్గరౌతున్నారు.తమ కోరికలు తీర్చే మార్గాలు చెప్పినంతసేపూ ఆ గురువుకు భజన చెయ్యడం,అలా కుదరని మరుక్షణం అతన్ని వదిలేసి ఇంకొ గురువువెంట పరిగెట్టడం సర్వసాధారణంగా మనం ఈనాడు చూస్తున్నాం.కనీసం కృతజ్ఞతాభావం కూడా నేటి సోకాల్డ్ శిష్యులలో ఉండటం లేదు.అందుకే నిజమైన గురువులూ శిష్యులూ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.స్వార్ధం అనే బంధంతో ముడిపడిన ఉపన్యాసకులూ శ్రోతలూ మాత్రం ప్రతిచోటా గుంపులుగా దర్శనమిస్తున్నారు.

మనిషి ఎంతో మేధావినని భావిస్తాడు.ఎంతో ఆలోచనా శక్తీ పరిశీలనా శక్తీ ఉన్నవాడినని విర్రవీగుతాడు.కాని తనను పోషిస్తున్న నేలపట్లా, గాలిపట్లా, నీరుపట్లా,ఆకాశం పట్లా,సూర్యుని పట్లా,చంద్రుని పట్లా,నక్షత్రసమూహాల పట్లా కృతజ్ఞత కలిగి ఉండాలని అతనికి తోచదు.ఒకవేళ ఎవరైనా ఈ భావాన్ని చెప్పినా అతన్ని ఒక వెర్రివాడిలా చూస్తాడు.

కనిపించని దైవం పట్ల విశ్వాసం ఉండకపోతే కొంత అర్ధం చేసుకోగలం.కాని అనునిత్యమూ మన చుట్టూ కనిపిస్తూ మనల్ని రక్షిస్తున్న శక్తులపట్ల కనీస కృతజ్ఞత లేనివారిని మానవులని పిలవాలో పశువులని పిలవాలో అర్ధంకాదు.తనకు అన్నం పెట్టిన వ్యక్తిపైన పశువుకైనా కొంత కృతజ్ఞత ఉంటుంది.నవీన మానవుడికి అది కూడా లోపించింది.

ఈ సున్నితత్వాన్ని మానవుడు కోల్పోవడానికి ప్రధానమైన కారణాలు ఏమంటే అహంకారమూ స్వార్ధమూ మాత్రమె. ఏది జరిగినా తన గొప్ప వల్లనే జరుగుతున్నాయన్న అహంభావమే మానవుని వినాశనానికి ప్రధానమైన కారణం.ప్రతిదానినీ తన స్వార్ధానికి వాడుకోవాలని చూడటమే మానవుని పతనానికి మూలకారణం.ఇక్కడే మానవుడు దైవశక్తిని విస్మరిస్తున్నాడు. అహానికి బానిసగా మిగిలిపోతున్నాడు.చివరకు ఒక వికృతజీవిగా తేలుతున్నాడు.

కృతజ్ఞత మాట అలా ఉంచి,అందరికోసం సృష్టించబడిన పంచభూతాలను ఒక్కరో లేక కొందరో పూర్తిగా స్వంతం చేసుకోవాలని చూడటమూ దానిమీద వ్యాపారాలు చెయ్యాలని చూడటమూ ప్రకృతిదృష్టిలో మహా ఘోరమైన అపరాధాలు.అటువంటి మనుషులనే 'రాక్షసులు' అని పూర్వకాలంలో అనేవారు.పూర్వకాలంలో రాక్షసులు కూడా తపస్సు చేసేవారు.దైవారాధన చేసేవారు.ఈరోజులలో కూడా భూబకాసురులూ,దేశ సంపదను కొల్లగొట్టే హిరణ్యాక్షులూ,తమ స్థాయిని ఉపయోగించుకుని కనిపించిన ప్రతివారినీ చెరిచే రావణాసురులూ కోకొల్లలుగా ఉన్నారు.వీరంతా దైవద్రోహులు. కృతఘ్నులు.వీరే నవీనకాలపు రాక్షసులు.మళ్ళీ వీరందరూ వారివారి దైవాలకు మహాభక్తులే.అదే వింతల్లో వింత.రాక్షసులు కూడా దైవభక్తులు అవడమంటే ఇదే.

నా పూర్వజన్మ సుకృతంవల్ల నా చిన్నప్పుడు నేనొక మహనీయుని దర్శించాను.ఆయన నేటి స్వామీజీలవలె 'కాపీ క్యాట్' కాదు.ఫైవ్ స్టార్ హోటళ్ళలో యోగాక్లాసులు పెట్టి ఉపన్యాసాలిచ్చే వ్యాపారసాధువు కాదు.శక్తి లేకపోయినా శక్తిపాతం చేస్తానని ప్రగల్భాలు పలికే అశక్తుడూ కాదు.నలభై రోజుల్లో దైవాన్ని చూపిస్తామంటూ నేడు ప్రచారం చేసుకునే దొంగస్వామీజీల వంటి స్వామీ కాదు.రాజకీయాలనూ,అధికారపు అహంకారాలనూ, ధనమదాన్నీ,ఆడంబరపు కుళ్ళునీ,ప్రపంచపు వ్యామోహాలనూ ఆయన అసహ్యించుకునేవారు.

ఆజన్మ బ్రహ్మచారిగా,తాను బ్రతికిన 86 ఏళ్ళూ నిస్వార్ధంగా నిరాడంబరంగా జీవిస్తూ నిరంతర దైవధ్యానంలో తపస్సులో జీవించిన ధన్యాత్ముడాయన. మానవ జీవితపు పాపపంకిలం సోకని పవిత్రజీవితం ఆయనది.

ఒకరోజు,ఎవరూ లేని సమయంలో ఆయన ఒక్కరే కూర్చుని మౌనంగా ప్రకృతిని వీక్షిస్తూ కన్నీరు కార్చడం నేను చూచాను.అటువంటి సున్నితమైన అంశాలను ప్రశ్నించడమూ,'ఏమైంది?ఎందుకు ఏడుస్తున్నారు?'అని అడగటమూ సభ్యత కాదు గనుక నేనేమీ మాట్లాడకుండా మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్నాను.

కొద్దిసేపటి మౌనం తర్వాత ఆయనే మెల్లిగా ఇలా అన్నారు.

'చూడు.మనకు ఏమాత్రం అర్హత లేకున్నా దైవం ఎన్ని వరాలను మనకిచ్చిందో?పీల్చడానికి గాలినిచ్చింది.గాలే లేకుంటే రెండు నిముషాలకంటే మనం బ్రతకం.త్రాగటానికి నీటినిచ్చింది.తినడానికి తిండినిచ్చింది.కానీ మనం ఈ భూమికి ఎందుకొచ్చామో మనం మరచిపోయాం.భోగలాలసతకు అలవాటు పడ్డాం.అయినా సరే,దైవం నొచ్చుకోకుండా మన తప్పులను ప్రతిరోజూ క్షమిస్తూనే ఉన్నది.ఈ వరాలను కొనసాగిస్తూనే ఉన్నది.అసలు బ్రతకడానికీ ఊపిరి పీల్చడానికీ మనకేమి అర్హత ఉన్నది?ఇన్ని వరాలను పొందటానికి మనకేమి అర్హత ఉన్నది?దైవం యొక్క ఈ నిష్కారణమైన కరుణను స్మరించినప్పుడు నా గుండెలో కదిలిన కృతజ్ఞత ఇలా కన్నీటి రూపంలో పొంగి ఆయన పాదాలను అభిషేకిస్తూ ఉంటుంది'

ఎంతటి స్వచ్చమైన మనసు?ఎంతటి నిస్వార్ధమైన మనసు?ఎంత సున్నితమైన పసిమనసు?

నా కళ్ళలోనూ గిర్రున నీళ్ళు తిరిగాయి.అప్రయత్నంగా వంగి ఆ వృద్ధుని పాదాలను స్పర్శించకుండా నేను ఉండలేకపోయాను.నిజమైన దైవత్వం అంటే ఏమిటో నేను ఆరోజు అర్ధం చేసుకున్నాను.

అదీ అసలైన దైవత్వం!!

గుడులూ గోపురాలూ తిరగటం దైవత్వం కాదు.పూజలూ పునస్కారాలూ చెయ్యడం దైవత్వం కాదు.జపాలూ ధ్యానాలూ చెయ్యడం దైవత్వం కాదు.స్వచ్చమైన నిష్కల్మషమైన నిస్వార్ధమైన కృతజ్ఞతాపూర్వకమైన పసిమనసు కలిగి ఉండటమే నిజమైన దైవత్వం.

నిష్కారణంగా దైవం మనపైన కురిపిస్తున్న వరాలను గ్రహించి కృతజ్ఞతతో హృదయం ఉప్పొంగడమే నిజమైన దైవత్వం.అలాటి వారి హృదయంలో దైవం నిత్యం కొలువై ఉంటుంది.వారు పిలిస్తే దైవం పలుకుతుంది.అలా పలకడం నేనెన్నో సార్లు ప్రత్యక్షంగా దర్శించాను.

మనం కోరిన పనులు జరిగినప్పుడు మొక్కులు చెల్లించడం ఆస్తికత్వం కాదు.'నేనడిగింది ఇస్తే నీకిది ఇస్తాను' అంటూ దేవుడితో అనైతిక వ్యాపారం చెయ్యడం భక్తీ కాదు.

ఏపనీ జరగనప్పుడు కూడా,జీవితంలో అన్నీ నీకు ఎదురు తిరుగుతున్నపుడు కూడా,నీ జీవితమే నీకు అగమ్యగోచరం అయినప్పుడు కూడా,దైవంపట్ల కృతజ్ఞతతో నీ హృదయం నిండి ఉప్పొంగిపోవడమే నిజమైన ఆస్తికత్వం.

గుళ్ళోని విగ్రహంలో మాత్రమె కాకుండా నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా దైవాన్ని దర్శించగలగడమే నిజమైన ఆస్తికత్వం.ప్రకృతిపట్లా,దైవం పట్లా నిష్కారణమైన కృతజ్ఞతా స్పందన నీ గుండెలోతులలో నిరంతరమూ కదలాడటమే నిజమైన ఆస్తికత్వం.

అదే నిజమైన దైవత్వానికి తొలిమెట్టు.
read more " కృతజ్ఞత-దైవత్వానికి తొలిమెట్టు "

20, ఏప్రిల్ 2014, ఆదివారం

జ్యోతిష్య శాస్త్రం-పరిహార క్రియలు (రెమెడీలు)

జ్యోతిష్యశాస్త్రం ఒక అద్భుతమైన శాస్త్రం.మనిషికి తెలిసిన అన్ని విద్యలలోకి ఇదే గొప్పదని నేనంటాను.నేనలా అనడానికి అనేక కారణాలున్నాయి.

ఎందుకంటే మనిషికి తెలిసిన ఏ శాస్త్రమూ అతని భవిష్యత్ రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో చెప్పలేదు.అతని గతం ఏమిటో చెప్పలేదు.గత జన్మలేమిటో చెప్పలేదు.గతంలో ఏ చెడుకర్మ చేసుకోవడం వల్ల ఈజన్మ ఇలా అఘోరిస్తున్నదో చెప్పలేదు.ఆ కర్మ ఫలితాలు పోవాలంటే,ప్రస్తుత జీవితం బాగుపడాలంటే ఏమి చెయ్యాలో చెప్పలేదు.అసలు మనిషనేవాడు ప్రప్రధమంగా తెలుసుకోవలసిన విషయాలు ఇవే.

వీటిని ఒదిలేసి మనిషి అనేక ఇతర విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. అనేక అనవసర విషయాల వెంట పరుగెత్తుతూ ఉంటాడు.ఆ క్రమంలో జీవితం వృధా చేసుకుంటూ ఉంటాడు.ఇది ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జీవితాలలో జరుగుతూ ఉంటుంది.

ఇకపోతే,జ్యోతిష్యాన్ని నమ్మేవారూ రెమేడీలు చేద్దామని అనుకునేవారూ కూడా చాలామంది సరియైన మార్గాన్ని అనుసరించలేరు.దానికి కారణం ఏమంటే వారి పూర్వకర్మ ఆ పనిని అంత సులభంగా చెయ్యనివ్వదు.అలా చెయ్యలేకపోవడానికి విచిత్రమైన లాజిక్కులు వారికుంటాయి.అనేక కారణాలతో పూర్వకర్మ వారి చేతులను విచిత్రంగా కట్టివేస్తుంది.

జనులలో కర్మ తొలగకపోవడానికి ప్రధానంగా ఈ క్రింది కారణాలుంటాయి:
  • జ్యోతిష్యం బూటకం అనే నిరాధార నమ్మకం ముఖ్యమైనది.చాలామంది ఈ నమ్మకాన్ని కులపరంగా,అంటే బ్రాహ్మణులంటే ఉన్న ద్వేషం కారణంగా ఏర్పరచుకుంటారు.ఈ ద్వేషం కారణంగా ఒక గొప్ప సైన్స్ యొక్క సహాయాన్ని వారు అందుకోలేక పోతున్నారన్నది వారికి తోచదు.అలా తోచకుండా వారి పూర్వకర్మ అడ్డుపడుతుంది. ఎక్కువమందిలో ఈ కారణం బలంగా పనిచేస్తుంది.
  • ఇంకొంతమంది,జ్యోతిష్యవిద్యనూ డబ్బుతో కొనవచ్చన్న భ్రమలో ఉంటారు.ఇలాంటివారికీ సరియైన రెమేడీలు అందవు.
  • ఇంకొంతమంది ఈ శాస్త్రం అంటే చులకన భావంతో ఉంటారు.ఆ చులకన భావమే వారికి అడ్డుగోడ అవుతుంది.
  • జ్యోతిష్యం నమ్మేవారిలో కూడా అనేకులు సరియైన రెమేడీలు చెయ్యలేరు.దానికి మళ్ళీ రకరకాల కారణాలుంటాయి.
అవేమిటంటే--
  • జ్యోతిష్యశాస్త్రాన్ని తేలికగా చులకనగా తీసుకోవడం.
  • ఏదో సరదాగా అడిగితే జ్యోతిష్కుడు ఏదో ఒకటి చెబుతాడులే కాసేపు కాలక్షేపానికి పనికొస్తుంది చూద్దాం అనే నిర్లక్ష్య ధోరణి.
  • విషయాన్ని కేజువల్ గా తీసుకోవడం.
  • 'రెమేడీలు చెప్పండి చేస్తాం' అని సరదాగా అడగడం.
  • పరీక్షించడానికి ప్రశ్నించడం.
  • జాతకం చెప్పించుకోడానికి వచ్చి,జ్యోతిష్కుడు జాతకాన్ని పరిశీలిస్తున్నపుడు,మౌనంగా శ్రద్ధగా ఉండకుండా అనవసరమైన సంభాషణలు చెయ్యడం.
  • ఎగతాళి మాటలు మాట్లాడటం.
  • ఇతర జ్యోతిష్కులను మనముందు తిట్టడం(ఇలాంటివారు ఇతరులవద్ద మనల్ని కూడా విమర్శిస్తారన్న సంగతి గ్రహించాలి)
  • అనవసరమైన వాగుడు.
  • మనసులో ఒకటి ఉంచుకుని డొంకతిరుగుడుగా ఇంకొకటి అడగటం.
ఇటువంటి చర్యలవల్ల,సరియైన ఫలితాలు రాకపోగా,రెమేడీలు పనిచెయ్యని స్థితి కూడా కల్పించబడుతుంది.ఇలాంటి ధోరణులు అడిగేవారిలో కనిపించినప్పుడు వారి పూర్వపాపకర్మ బలంగా ఉన్నదని,అటువంటి వారికి జ్యోతిష్యం చెప్పడం వల్ల ఫలితం లేదనీ జ్యోతిష్కుడు గ్రహించాలి.ఇటువంటి సూచనలు తాంత్రిక జ్యోతిష్యమైన కేరళశాస్త్రంలో ఇవ్వబడ్డాయి. 

జ్యోతిష్యం అంతా గణితం అని కొందరు భ్రమలో ఉంటారు.అది నిజం కాదు.జ్యోతిష్యం అంటే ఉత్త గణితమే కాదు.దానిని మించి ఇంకా చాలా ఉంటుంది.జ్యోతిష్యంలో స్ఫురణశక్తి(Intution) అనేదానికి చాలా ముఖ్యమైన స్థానం ఉన్నది.ఈ స్ఫురణశక్తి అనేది ఉపాసనాబలం వల్లనే వస్తుంది.ప్రతి జ్యోతిష్యవిద్యార్ధికీ శాస్త్రవేత్తకూ మంత్రోపాసనా,నియమయుతమైన జీవితమూ తప్పనిసరిగా ఉండాలి.అప్పుడే అతనిలో స్ఫురణశక్తి మేలుకొంటుంది.

అంతేగాక జ్యోతిష్కునిలో ఇతరుల బాధలను చూచి స్పందించే గుణమూ ఉండాలి.డబ్బుకోసం అతను జ్యోతిష్యాన్ని చెప్పరాదు.డబ్బు తీసుకోవచ్చు కాని దురాశతో అదే ధ్యేయంగా మాత్రం జ్యోతిష్యవిద్యను దుర్వినియోగం చెయ్యకూడదు.అలా చేస్తే,కొన్నాళ్ళకు అతని విద్య మొత్తం మాయం అవుతుంది.అంతేగాక అతనిదగ్గర రెమేడీలు చెప్పించుకున్నవారి పాపఖర్మను అతను అనుభవించవలసి వస్తుంది.అందుకే జ్యోతిష్కులలో చాలామంది జీవితాలు చివరకు దుర్భరంగా ముగుస్తాయి.

ఏతావాతా నేను చెప్పేదేమంటే,జ్యోతిష్యం చెప్పేవారికీ,అడిగేవారికీ కూడా దాని సీరియస్ నెస్ అనేది అర్ధం కావడంలేదు.ఒకవ్యక్తి గతంలో అనేక పాపాలు చేసి ఉంటాడు.దాని ఫలితంగా ఇప్పుడు అనేక బాధలు పడుతూ ఉంటాడు.ఆ బాధలు ఆరోగ్యపరంగా ఉండవచ్చు, వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉండవచ్చు,కుటుంబపరంగా ఉండవచ్చు, సంతానపరంగా ఉండవచ్చు. లేదా ఇంకా ఎన్నో రకాలుగా ఉండవచ్చు.అందరూ బాగున్నారు నేనెందుకు ఇలా ఉన్నాను?నా జీవితం ఒక్కటే ఎందుకు ఇలా ఉన్నది? అని అనుకోవచ్చు.

దానికి కారణం ఒక్కటే.గతంలో నీవు చేసిన పాపమే ఇప్పుడు నిన్ను వెంటాడుతున్నది.నిన్ను బాధ పెడుతున్నది.ఆ పాపం పోవాలంటే, జాతకానుసారంగా సరియైన రెమేడీలు చేసుకోవాలి.అవేమిటో తెలుసుకోవాలంటే,వినయపూర్వకంగా ఒక నిజమైన జ్యోతిష్కుని కలిసి సంప్రదించి ఆ విషయాలు చర్చించి తెలుసుకోవాలి.ఆ తరువాత ఆ రేమేడీలను శ్రద్ధగా ఆచరించాలి.అంతేకాదు ఇంతకుముందు నీవు చేసిన తప్పులను ఇప్పుడు చెయ్యకుండా ఉండాలి.అప్పుడే గతకర్మ తొలగుతుంది. ప్రస్తుతజీవితంలో కూడా ఆశించిన మార్పు కనబడుతుంది.

చాలామంది నన్ను రెమేడీలు అడుగుతూ ఉంటారు.అందరికీ నేను వాటిని చెప్పను.వారి జాతకాల్లో నిజాయితీ,మంచికర్మా కనిపిస్తేనే ఆ రేమెడీలను నేను సూచిస్తాను.కానీ అలా చెప్పించుకున్న వారిలో కూడా చాలామంది వాటిని చెయ్యలేక మధ్యలో వదిలివేయ్యడం నేను గమనించాను.వారి పూర్వకర్మ బలవత్తరంగా ఉన్నపుడు వారు రెమేడీలు చెయ్యలేరు.ఇది సత్యం.

కానీ అలాంటప్పుడే మనిషి ఇంకా పట్టుదలతో ప్రయత్నించాలి.కాని చాలామంది ఇక్కడే జారిపోతుంటారు.ఇంకొంతమంది,వారు అడిగిన రెమేడీలు చెప్పలేదని జ్యోతిష్కులను తిడుతూ ఉంటారు.అలా తిట్టడంవల్ల వారి పాపకర్మ ఇంకా పెరుగుతుందని వారు గ్రహించలేరు.నన్ను కూడా చాలామంది తిడుతూ మెయిల్స్ ఇస్తూ ఉంటారు.అలాంటివారిని చూచి నేను నవ్వుకొని ఊరుకుంటాను.

అలా ఉక్రోషంతో తిట్టడంవల్ల వారి కర్మబరువును వారు ఇంకా పెంచుకుంటున్నారు.వారి కర్మ తీరడానికి ఇంకా ఎన్నోఏళ్ళు పట్టవచ్చు. లేదా ఈజన్మలో అది తీరకపోవచ్చు.ముందు జన్మలో మాత్రమె వారు అనుకున్నవి జరిగే పరిస్తితులుంటాయి.కొంతమంది జాతకాలను బాగుచేయ్యలేం.అంతటి చెడుకర్మ వారికుంటుంది.అదంతా వారివారి జాతక చక్రాలలో ప్రతిఫలిస్తూనే ఉంటుంది.

కొందరు జ్యోతిష్కులు కూడా ఈ శాస్త్రాన్ని సరదాగా తీసుకుంటూ ఉంటారు.ఇది పూర్తిగా తప్పు భావన.జ్యోతిష్య శాస్త్రం ఒక అక్కల్ట్ విద్య.అంటే ఒక మార్మికమైన శాస్త్రం.ఇది దైవికమైన శక్తులతో ఆట.దీనిని సరదాగా తీసుకున్నవారికి మాడు పగలడం ఖాయం.ఈ విషయం వెంటనే తెలియకపోయినా కొన్నేళ్ళతర్వాత అయినా తెలుస్తుంది.దీనిని సరదాగా ఆషామాషీగా తీసుకుని ఎవరికీ బడితే వారికి ఎక్కడబడితే అక్కడ సమయం సందర్భం లేకుండా రెమేడీలు చెప్పడం జాతక విశ్లేషణలు చెయ్యడం చేసినవారు ఎంత ఘోరంగా వారి జీవితాలలో దెబ్బలు తిన్నారో నేను స్వయంగా చూచాను.

ఇంకొంతమంది పురోహితులూ జ్యోతిష్కులూ మహా దురహంకారులుగా ఉంటారు.ఇలాంటివారిని నేను చాలామందిని చూచాను.'మేము ప్రతిరోజూ సహస్ర గాయత్రి చేస్తాం.గొప్ప ఉపాసనాపరులం.ఫలానా మంత్రాన్ని ఇప్పటికి అక్షరలక్షలు జపం చేశాం.మేమేది చెబితే అదే జరగటం ఖాయం' అన్న దురహంకారంతో ఉన్నవారిని నేను చూచాను.

ఇలాంటివారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది.సహస్రగాయత్రి కాదు రోజుకు లక్షగాయత్రి చేసినా ఏమీ ఉపయోగం ఉండదు.దానిని చేసేవిధంగా చెయ్యాలి.అంతేగాని చెయ్యకూడని విధంగా చేస్తే ఎన్ని లక్షలు కోట్లు జపం చేసినా అంతా వృధా అవుతుంది.ఈ సత్యం చాలామందికి తెలియదు.రాయి యుగాల తరబడి గంగానదిలో పడి ఉంటుంది కాని ఒక్క నీటిబొట్టును కూడా అది లోపలికి పీల్చుకోలేదు.వీరంతా ఆ రాళ్ళ వంటివారు.

జ్యోతిష్యాన్ని చెప్పేవారూ చెప్పించుకునే వారూ కూడా విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి.సరదాగా అడగడం,ఆషామాషీగా తీసుకోవడం, కాలక్షేపానికి ఈ విద్యను చర్చించడం వాడటం పనికిరాదు.ఇది కర్మతో చెలగాటం అన్న విషయాన్ని ఉభయులూ గుర్తిస్తే చాలా మంచిది.
read more " జ్యోతిష్య శాస్త్రం-పరిహార క్రియలు (రెమెడీలు) "

19, ఏప్రిల్ 2014, శనివారం

తెలుగుదేశం పార్టీపై శనిగ్రహ ప్రభావం

సామాన్య ప్రజల ఆకాంక్షలకూ శనిగ్రహానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. అనేక వందల సంవత్సరాల పాటు సునిశిత పరిశీలన చేసి ప్రాచీనులు ఈ నిర్ధారణకు వచ్చారు.రాశిచక్రంలో శనిగ్రహ సంచారాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాఉద్యమాలూ,విప్లవాలూ జరిగాయి.గత చరిత్రను ఒక్కసారి తిరగేస్తే ఈ విషయం స్పష్టంగా చూడవచ్చు.

ఇంతకుమునుపు మూడేళ్ళక్రితం నేను వాసిన ఒక వ్యాసంలో దీనిని వివరించాను.ఆ వ్యాసం కోసం ఇక్కడ చూడండి.

మన రాష్ట్రంలో ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల విషయంలో చూస్తే, తెలుగుదేశంపార్టీ విజయం తధ్యం అని తెలిసిపోతున్నది.

జ్యోతిష్య పరంగా కొంత పరిశీలన చేద్దాం.

1982 లో ఎన్టీ ఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు శని భగవానుడు వక్రించిన స్థితిలో చిత్తానక్షత్రం 2 పాదంలో  ఉన్నాడు.సామాన్య ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ స్థాపించిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చింది.1982 జూన్ 19 న వక్రస్తితిని శని భగవానుడు వదలి తన ఉచ్చరాశి అయిన తులవైపు వేగంగా ప్రయాణం మొదలుపెట్టడం తోనే తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచడం మొదలైంది. ఎన్టీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్లి గ్రామగ్రామానా తిరిగి ప్రచారం చేసి సమస్యలను ఎత్తిచూపి ప్రజాభిమానాన్ని సంపాదించాడు.అక్టోబర్ 6 న శనిభగవానుడు తులారాశిలో ప్రవేశించి ఉచ్చస్థితిలోకి వచ్చాడు.ఇక అప్పటికే తెలుగుదేశం పార్టీ విజయం తధ్యం అని తేలిపోయింది.

మళ్ళీ ఇప్పుడు సరిగ్గా 30 ఏళ్ళ తర్వాత శనిభగవానుడు రాశిచక్రాన్ని చుట్టి వచ్చి  మళ్ళీ దాదాపు గత రెండేళ్లుగా తులారాశిలో స్తితుడై ఉన్నాడు.ప్రజా ఉద్యమాలు మళ్ళీ ముమ్మరం అవుతున్నాయి.అయితే మధ్యలో ఆ పార్టీ తన వైభవాన్ని కోల్పోవడానికి జ్యోతిష్య కారణాలు ఏమిటన్నది ఇంకొక వ్యాసం లో విశదీకరిస్తాను.దానికి మూలకారణం ఒక్కటే--ఏ సామాన్య ప్రజలూ ఉద్యోగులూ రైతులూ అయితే తనను గెలిపించారో ఆ సామాన్య ప్రజలనూ ఉద్యోగులనూ రైతులనూ ఆ పార్టీ దూరం చేసుకోవడమే దానికి ప్రధాన కారణం.అంటే ఆ రకంగా ఆ పార్టీ శనిభగవానుని అనుగ్రహానికి దూరమై ఆగ్రహానికి దగ్గరైంది.కనుక అధికారం కోల్పోయింది.

ఇప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయం తెలుగుదేశం పార్టీ వైపే స్పష్టంగా కనిపిస్తున్నది.దానికి కారణం ప్రజల్లోని అసంతృప్తే.అయితే ప్రస్తుతం శనిభగవానుడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు.పోయినసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ఆయన రాహువుదైన స్వాతినక్షత్రంలో ఉన్నాడు.ఈ తేడాను గమనించాలి.

పోయినసారి ఆవేశం,దూకుడులతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. సమాజానికి ఎంతో మంచి చేసినా కొన్ని అపరిపక్వ నిర్ణయాలవల్ల దెబ్బతిని పరాజయం చవిచూచింది.పార్టీలో ఎన్నో లుకలుకలూ గొడవలూ జరిగాయి. ఇదంతా రాహు నక్షత్ర ప్రభావమే.ఇప్పుడు అలా కాదు.గురు నక్షత్రంలో శని ప్రస్తుతం కొలువై ఉన్నాడు.గురువు గారి రంగు పసుపు.తెలుగుదేశం పార్టీ రంగు కూడా పసుపే.

కనుక ఈ సారి రాహు లక్షణాలైన ఆవేశం దూకుడు కాకుండా గురువుగారి లక్షణాలైన ఆలోచన,పరిపక్వత,స్థిరచిత్తంతో తీసుకునే మంచినిర్ణయాలు ఆ పార్టీని నడిపిస్తాయని ఆశించవచ్చు.ఆ పునాదుల పైన గనుక ఈసారి తెలుగుదేశం పార్టీ నడుస్తూ అన్ని వర్గాలకు న్యాయం చెయ్యగలిగితే పోయినసారి కంటే ఎక్కువ ఏళ్ళు తప్పకుండా అధికారంలో ఉంటుంది.

అధికారం వల్ల వచ్చే నిర్లక్ష్యాన్నీ అహంకారాన్నీ దగ్గరకు చేరనివ్వకుండా ఎప్పటికప్పుడు నిత్యజాగరూకతతో ఉండటమే ఏ పార్టీకైనా శ్రీరామరక్ష. ఇచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చెయ్యడమూ,మనస్ఫూర్తిగా ప్రజల క్షేమాన్ని కోరుకోవడమూ,వర్గ కులముద్రలు పడకుండా పారదర్శకమైన విధానాలతో దేశాన్ని ముందుకు నడిపించగలిగితే ఈసారి తెలుగుదేశానికి ఓటమి అంటూ ఉండదు.

అయితే తిరిగి అధికారం వచ్చాక దరిచేరే చెడుప్రభావాలకు ఆ పార్టీ ఎంతవరకు దూరంగా ఉండగలదు? తాను ఇచ్చిన ఇస్తున్న వాగ్దానాలను ఆ పార్టీ ఎంతవరకూ నేరవేర్చగలదు? ఎంతవరకూ అవినీతికి దూరంగా ఉండగలదు?ఎంతవరకూ అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం చెయ్యగలదు?అన్నవిషయాలమీదే అంతా ఆధారపడి ఉంటుంది.
read more " తెలుగుదేశం పార్టీపై శనిగ్రహ ప్రభావం "

13, ఏప్రిల్ 2014, ఆదివారం

మేషమాసం -(April-May) 2014-ఫలితములు

సూర్యుని మేష సంక్రమణం(+పౌర్ణమి ముగింపు) ఏప్రిల్ 15 వ తేదీన మధ్యాహ్నం 1.14 నిముషాలకు హైదరాబాద్ లో జరుగుతుంది.దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

లగ్నాధిపతి చంద్రుడు చతుర్దంలో రాహుగ్రస్తుడవడం వల్ల ప్రజాభిమానం కోల్పోతామేమో అని అనేకమంది గుండెల్లో గుర్రాలు పరిగెత్తుతాయి.అది నిజంగా జరుగుతుంది కూడా.

దానికి తగినట్లే ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా మారిపోతుంది.ప్రజలు అభివృద్ధికే ఓటు వేస్తారు.ఆశపోతు నాయకుల మాయమాటలు నమ్మరు.

సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు గనుక దాని ప్రభావం ఉండదు అని అనుకున్నా కూడా,సూర్యచంద్రులు కేతురాహువుల నోట చిక్కడం వల్ల అదికూడా చతుర్ధ దశమ స్థానాలలో జరగడం వల్ల తప్పకుండా విపరీత పరిణామాలు ఉంటాయి.

ఆ పరిణామాలు ప్రజాజీవితంలోనూ అధికారపరంగానూ ఉంటాయి.కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి.ప్రజలకు మంచిచేసి,అభివృద్ధి చేసేవారినే ప్రజలు ఎన్నుకుంటారు.ప్రజాజీవితంలో అనేక మార్పులు అతివేగంగా చోటుచేసుకుంటాయి.ఊహించని అనేక పరిణామాలు వేగంగా జరిగిపోతాయి.

ఇప్పటికే అధికారంలో ఉండి,అది పోతున్నదే అని బాధపడేవారు కుట్రలు కుతంత్రాలు మొదలుపెడతారు.విధ్వంసాలకు రహస్య వ్యూహరచన చేస్తారు. కాని అవి పెద్దగా ఫలించవు.ఇప్పటికే జరిగిన నష్టాన్ని గ్రహించిన ప్రజల ముందు ఈ కుట్రలు ఏమీ పనిచెయ్యవు.

పార్టీలు ఒకదాని మీద ఒకటి బాగా దుష్ప్రచారం సాగిస్తాయి.దుమ్మెత్తి పోసుకుంటాయి.పరుష పదజాలం వాడబడుతుంది.ప్రజాభిప్రాయం ఆటుపోట్లకు గురౌతుంది.కుహనా మేధావులు కులాన్నీ మతాన్నీ రెచ్చగొట్టే ప్రయత్నాలు గావిస్తారు.

పత్రికలూ మీడియా ఈ రెండూ కూడా ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని కలిగించడంలోనూ ఉన్న విషయాన్ని ఉన్నట్లు ప్రజలకు వెల్లడించడంలోనూ చాలా చురుకైన పాత్రను పోషిస్తాయి.కొన్ని పత్రికలు నిజాలను దాచిపెట్టి విషప్రచారం కూడా సాగిస్తాయి.

సామాన్యంగా గ్రహణ ఫలితాలు మూడు నెలలలోపు వరకూ ఉంటూనే ఉంటాయి.కనుక నేటినుంచి మూడునెలల లోపు కొందరు ప్రముఖ రాజకీయ వృద్ధనేతల,మరియు ప్రముఖుల మరణం సంభవిస్తుంది.అది ఇంకా త్వరగా కూడా జరగవచ్చు.

మరోపక్క,కల్తీ కుంభకోణాలు కొన్ని బయటపడతాయి.రవాణా రంగంలో ప్రమాదాలు మళ్ళీ జరుగుతాయి.కొన్ని ఉగ్రవాదదాడులూ జరుగుతాయి. ఆడపిల్లల మీద దుశ్చర్యలు జరుగుతూనే ఉంటాయి.

ప్రజాజీవితం లోనూ,అధికార రంగంలోనూ రాబోతున్న పెనుమార్పులను ఈ సూర్య సంక్రమణం+పౌర్ణమి స్పష్టంగా చూపిస్తున్నది.
read more " మేషమాసం -(April-May) 2014-ఫలితములు "

8, ఏప్రిల్ 2014, మంగళవారం

శ్రీరామ నవమి

ఈ రోజు శ్రీరామనవమి.

మనలో చాలామందికి చాలా పవిత్రమైన రోజు.

శ్రీరామకధ మన దేశపు ఎల్లలు దాటి చాలా దేశాలకు పయనించింది.

స్వయానా దానిని వ్రాసిన వాల్మీకే--"సూర్య చంద్రులూ నక్షత్రాలూ ఉన్నంతవరకూ ఈ కధ నిలిచి ఉంటుంది" అన్నాడు.

పాతకాలంలో చూస్తే మన దేశంలో రామాలయం లేని ఊరు ఉండేది కాదు.శ్రీరాముని పూజించని ఇల్లూ ఉండేది కాదు.

కాని నేటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం.

నేడు--

అసలు శ్రీరాముడు పుట్టనే లేదని మనం వాదిస్తాం.

రామాయణం కల్పితకధ అని ఎగతాళి చేసే ఇతర మతస్తులను మనం నెత్తిన పెట్టుకుని గౌరవిస్తాం.వారి హక్కులను చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తాం.

శ్రీరాముడు ఆడదైన తాటకిని చంపడం ఎంత తప్పు? అని విమర్శిస్తాం.

వాలిని చెట్టు చాటునుంచి చంపడం ఎంతటి తప్పు? అనీ విమర్శిస్తాం.

తండ్రి ఏదో ఆవేశంలో అన్నమాటకు శ్రీరాముడు అంత విలువ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అని కూడా వాదిస్తాం.

ఆ మాటను పట్టుకుని తన భార్యనూ తమ్ముడినీ కూడా తనతోబాటు అడవులలో తిప్పి అన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎంతవరకు సరియైన పని? అని కూడా వాదిస్తాం.

చివరిలో సీతను అగ్నిప్రవేశం చెయ్యమని ఆజ్ఞాపించడం ఎంతవరకు కరెక్ట్? అని కూడా విమర్శిస్తాం.

వివాదాస్పదమైన ఉత్తరరామచరితం లోని శంబుకవధనూ మనం తూర్పారబడతాం.

కాని,ఇదంతా వాగే ముందు, వాల్మీకి అనే ఆయన రామాయణంలో అసలేమి వ్రాశాడో మనం చదవం.ఆయా సంఘటనల వెనుక ఉన్న నిజాలను మనం విస్మరిస్తాం.అలా చదివి వాటిని సరిగ్గా అర్ధం చేసుకోడానికి మనకు సంస్కృతం రాదు.దానిని ఎప్పుడో అటకెక్కించాం.

అనాగరికుడూ బోయవాడూ అయిన వాల్మీకి సంస్కృతంలో రామాయణం వ్రాశాడు.ఉన్నత చదువులు చదివి పీ హెచ్ డీలు సంపాదించిన మనకు దానిని చదవడం రాదు.భలే ఉంది కదూ?

మనకు తెలిసిన రామాయణం ఏదంటే--నాటకాలలో సినిమాలలో త్రాగుబోతు నటులు చూపించిన రామాయణం మాత్రమే.శ్రీరామవేషాలు వేసిన అనేకమంది నటులు నిత్యజీవితంలో అనేకపత్నీవ్రతులే అన్నది నగ్నసత్యం. కాని మనకు వాళ్ళే దేవుళ్ళు.అసలు రాముడు ఎవరో మనకి తెలియదు.

పోనీ ఆ సంగతి అలా ఉంచుదాం.

శ్రీరాముని ఊరకే పూజిస్తే సరిపోతుందా?

ఆయన పాటించిన విలువలు నిత్యజీవితంలో మనమూ పాటించవద్దూ? ఆపని మాత్రం చస్తే చెయ్యం.

అహంకారం అనే రావణుడూ,బద్ధకం అనే కుంభకర్ణుడూ,పొగరు అనే మేఘనాధుడూ,అతి తెలివి అనే మారీచుడూ మన లోలోపలే తిష్ఠ వేసుకుని కూచుని ఉన్నారు.ఇక మనం చేసే శ్రీరామపూజ ఎందుకు పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది?

శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడై ఉండాలి.కాని మనం మాత్రం ఎందరితో నైనా తిరగవచ్చు.తిరగాలి.అలా తిరగకపోతే మొగపుటక పుట్టి చేతగానితనం అవుతుంది మరి.

మొన్నీ మధ్యన ఒక విషయం విని నిర్ఘాంతపోయాను.

ఒక పవర్ ఫుల్ పోస్ట్ లో పనిచేసిన ఒకానొక గవర్నమెంట్ ఆఫీసర్ తాను రిటైర్ కాబోయే ముందు ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు.ఎందుకయ్యా ఈ పార్టీ అంటే ఒక బిత్తరపోయే నిజం తెలిసింది.తాను సర్వీస్ లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకూ "వెయ్యిమంది" ఆడవాళ్ళను ఎంజాయ్ చేసి టార్గెట్ పూర్తి చేసిన సందర్భంగా ఈ పార్టీ ఇస్తున్నానని ఆయనే ఘనంగా ఆ సందర్భంగా ప్రకటించాడు.ఆ పార్టీలో పాల్గొన్నవారంతా జయజయ ధ్వానాలు పలుకుతూ హర్షం వెలిబుచ్చారు.ఆ వెయ్యిమందిలో చాలామంది ఆడవాళ్ళు కూడా ఆనందంగా ఆ పార్టీలో పాల్గొన్నారు.చిన్నప్పుడు చదివిన 'సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి' కథ నాకు గుర్తొచ్చింది.

ఇవీ మనం పాటించే విలువలు !!

మనం ఎంతవరకూ నిత్యజీవితంలో నీతినీ ధర్మాన్నీ పాటిస్తున్నాం? అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే -- ప్రస్తుత ఎన్నికలలో ఏరులై ప్రవహిస్తున్న మద్యమూ డబ్బు సంచులూ.ఇంతకంటే మనం ఎంత నీతిపరులమో చెప్పడానికి ఇంకేమీ ఉదాహరణలు అవసరం లేదు.

ఈ మధ్యన లోకల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న నా మిత్రుడిని అడిగాను.

'నీవు ప్రతి ఏడాదీ శ్రీరామనవమి పందిళ్ళు వేయించి ఘనంగా పూజలు చేయిస్తావు కదా? మరి ఎన్నికలలో ఇంత డబ్బు ఎందుకు పంచుతున్నావు? ఇది తప్పు కాదా?ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు దీనిని మెచ్చుకుంటాడని నీవు భావిస్తున్నావా?'

'అది వేరు.ఇది వేరు.నేడు డబ్బు పంచకపోతే ఎన్నికలలో గెలిచే పరిస్తితి ఎవరికీ లేదు.' అని అతను జవాబిచ్చాడు.

'మరి గెలిచాక నీవు మళ్ళీ అవినీతి చేసి ఈ డబ్బంతా వెనక్కు రాబడతావు కదా? ఇలాగే కదా దేశం భ్రష్టు పడుతున్నది?' అడిగాను.

'పెద్దవాళ్ళు చేసినంత అవినీతి నేను చెయ్యను.నేనంత వెధవను కాను. చేతనైనంతలో నీతిగానే ఉంటాను.కాకపోతే పూర్తిగా మడి కట్టుకుంటే రాజకీయాలలో రాణించలేం' అని అతను అన్నాడు.

'అంటే శ్రీరాముడైనా ఈరోజులలో రావణుడిగా ఉండకపోతే బ్రతకలేడంటావు. అంతేనా?' అన్నాను.

అతను ఇబ్బందిగా నవ్వుతూ 'పూర్తిగా కాదుగాని.దాదాపుగా అంతే' అని ఒప్పుకున్నాడు.

ఈ ఒక్కరోజువరకూ శ్రీరాముని ఊరకే పూజిస్తే చాలదు.ఆయన ధర్మస్వరూపుడని వేదికలెక్కి మనం ఉపన్యాసాలిస్తే చాలదు.ఆయన ధర్మస్వరూపుడైతే మనకు ఒరిగేది ఏమీ లేదు.మనమేమిటి అన్నదే అసలైన ప్రశ్న.మనం నిలువెల్లా అధర్మంతో నిండి ఉండి,శ్రీరాముడు ధర్మస్వరూపుడు అని పొగిడితే ఉపయోగం ఏముంది?

మన నిత్యజీవితంలో వేసే ప్రతి అడుగులో ధర్మం కనిపించాలి. మన నడతలో శ్రీరాముడు ప్రత్యక్షమవ్వాలి.మనం పీల్చి వదిలే ప్రతి ఊపిరిలో రామతత్వం ప్రతిధ్వనించాలి.అదీ నిజమైన రామభక్తి.

రామాయణం గురించి వేదికలెక్కి గొప్పగా ఉపన్యాసాలిచ్చే ఒక వక్త గుంటూరులో ఉన్నాడు.ఆయన కాలేజీ రోజులలో ఎన్ని వేషాలేశాడో ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడో అందరికీ తెలియకపోయినా కొందరికైనా తెలుసు.ఆ కొందరిలో కొందరు నాకు తెలుసు.వాళ్ళే నాకీ విషయం చెప్పారు.ఆయనకి 'ఆ' వీక్నెస్ కొంచం ఎక్కువే అని వాకబు చేస్తే తెలిసింది.అదీ విషయం!! 

జీవితంలోకి ఇంకని ఇలాంటి ఉపన్యాసభక్తి వల్ల ఏమీ ఉపయోగం లేదు.నీ వ్యక్తిత్వంలో సమూలమైన మార్పు రాకుండా,రామతత్వం నీ అణువణువులో ప్రవేశించకుండా ఎన్ని శ్రీరామ నవములు చేసినా,ఎన్నెన్ని ఉత్సవాలు చేసినా,ఎన్నెన్ని ప్రసాదాలు మెక్కినా,ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా విన్నా ఏమీ ఉపయోగం లేదు.

"షో" కోసం చేసే భక్తి అసలు భక్తే కాదు.ఆ పేరుకు అదేమాత్రమూ తగదు.

ఈరోజు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అన్ని రకాల అవలక్షణాలకూ, దరిద్రాలకూ,జాడ్యాలకూ,రోగాలకూ,పిచ్చివేషాలకూ ఒక్కటే కారణం.మనం శ్రీరామునీ సీతాదేవినీ మనస్ఫూర్తిగా మరచిపోవడమే.

శ్రీరాముని ధర్మాచరణా,సీతామాత యొక్క పవిత్రతా పాతివ్రత్యమూ ఎక్కడా ఎవరిలోనూ నేడు కనిపించక పోవడమే ప్రస్తుత జాడ్యాలన్నిటికీ అసలైన కారణాలు.వారు ఆచరించి చూపిన విలువలను పూర్తిగా విస్మరించడమే మనం చేస్తున్న అసలైన తప్పు.

శ్రీరాముని గుడిలో మాత్రమే ఉంచి,రావణుడినీ అతని సైన్యాన్నీ గుండెల్లో ఉంచుకోవడమే అన్ని అనర్దాలకూ కారణం.

పూజల వరకూ శ్రీరాముడు,ఆచరణలో రావణుడుగా ఉండటమే సర్వ అనర్దాలకూ కారణం.

ఈ ఒక్క విషయం చక్కగా గ్రహించి,మనల్ని మనం నిజంగా మార్చుకున్ననాడు మాత్రమే మనం నిజమైన రామభక్తులం అవ్వగలం. అప్పుడే మనం ధర్మాన్ని నిజంగా అనుసరిస్తున్నట్లు లెక్క.

అప్పుడే ధర్మమూ మనల్ని కాపాడుతుంది.ధర్మ స్వరూపుడైన శ్రీరాముడూ అప్పుడే మన గుండెల్లో కొలువై ఉంటాడు.

పూజారికి డబ్బులు పారేసి ఏదో కాసేపు పూజలు చెయ్యడం కాదు. డబ్బులు పడేసి సీతమ్మవారికి చీరలు సమర్పించడం కాదు.నిత్యజీవితంలో శ్రీరాముని ప్రతిష్టించుకోవాలి.మన అడుగడుగులో రామతత్వం ప్రతిఫలించాలి.మన జీవితాలు శ్రీరామమయములు కావాలి.మనలో ఉన్న రాక్షసత్వాన్ని ప్రయత్నపూర్వకంగా మనం నిర్మూలించాలి.దాని స్థానే,దివ్యస్వరూపుడైన శ్రీరాముని మన గుండెల్లో నిలుపుకోవాలి.

ఆరోజే నిజమైన శ్రీరామనవమి.

అలా మనం అందరం ఉండగలిగిన రోజున మాత్రమే మన దేశం నిజమైన రామరాజ్యం అవుతుంది.అంతవరకూ మనకు గానీ మన దేశానికి గానీ నిష్కృతి లేదు.
read more " శ్రీరామ నవమి "

3, ఏప్రిల్ 2014, గురువారం

అనగనగా ఒక దేశం

అనగనగా ఒక దేశం.

ఆ దేశంలో ఎవరికీ దేశాభిమానం లేదు.ఉన్న కొద్దిమంది మాటా ఎవరూ వినరు.

ఆ దేశంలో అందరూ బానిసలే.కొందరు నిజంగా బానిసలైతే,ఇంకొందరు భావజాల బానిసలు.అందరూ నీతులు చెబుతారు.కాని ఎవ్వరూ వాటిని పాటించరు.

తమ దేశాన్ని ఇతరులకు తాకట్టు పెట్టమన్నా పెడతారుగాని సుపరిపాలన మాత్రం కోరుకోరు.

పరాయివాడి పల్లకీ మోస్తారు గాని,తనవాడికి కనీస మర్యాద ఇవ్వరు. అసలు 'తన' అనే పదానికి అర్ధమే వారిలో చాలామందికి తెలియదు.

అలాంటి బానిసలకు ఉన్నట్టుండి ఒకరోజున స్వాతంత్ర్యం వచ్చింది.

ఇంకేముంది ఎవరిష్టం వచ్చినట్లు వారు దోపిడీ మొదలుపెట్టారు.అప్పటిదాకా కష్టపడిన నాయకులు-'ఇప్పటిదాకా కష్టపడింది చాల్లే.ఇంకెన్నాళ్ళు ఈ గోల'- అనుకుంటూ హాయిగా సుఖపడటం మొదలుపెట్టారు.

కొన్నాళ్ళపాటు ఏం జరుగుతుందో పిచ్చిప్రజలకి అర్ధం కాలేదు.అర్ధమైన తర్వాత 'మేమేం తక్కువ తిన్నామా?' అంటూ వాళ్ళూ దోపిడీ మొదలు పెట్టారు.

ప్రపంచంలోని అన్ని న్యాయశాస్త్రాలూ అక్కడ ఉన్నాయి.కాని ఎవరూ వాటిని పాటించరు.వాటికి చిక్కకుండా ఎలా తప్పుకోవాలో అక్కడ పుట్టిన కూనకు కూడా తెలుసు.

ప్రపంచంలోని అన్ని మతాలూ అక్కడున్నాయి.కాని వాటిని ఇతరులను ద్వేషించడానికీ,మనిషికీ మనిషికీ మధ్యన అడ్డుగోడలు సృష్టించడానికీ మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటారు.

ఆ దేశంలో ఆడదేవతలని పూజిస్తారు.కాని ఆడది ఒంటరిగా దొరికితే రేప్ చెయ్యకుండా ఎవరూ ఊరుకోరు.

ఆ దేశంలో చాలామంది, స్త్రీని పిలవడం వరకూ 'అమ్మా' అనే పిలుస్తారు.కాని చూపులు మాత్రం అదో రకంగా చూస్తుంటారు.

అక్కడ ప్రతి ఇంట్లోనూ పవిత్ర గ్రంధాలుంటాయి.అవి చాలామందికి కంఠస్థం వచ్చుకూడా.కాని వాటిలో ఉన్నవాటిని మాత్రం ఎవడూ పాటించడు.

ప్రతి అవకాశాన్నీ దేశసంపదను దోపిడీ చెయ్యడానికే ఆ దేశప్రజలు ఉపయోగించుకుంటారు.కదిలిస్తే మాత్రం భలే నీతులు చెబుతారు.

అక్కడ ఎవరికీ స్థిరమైన నీతులు ఉండవు.ఉన్న ఒక్క నీతీ 'డబ్బు' మాత్రమే.

'ఎలా సంపాదించావు?' అని ఎవ్వడూ అడగడు.'ఎంత సంపాదించావు?' అని అడుగుతారు.'ఇంత తక్కువ సంపాదించావేంటి చేతకాదా?' అనికూడా అడుగుతారు.

అక్కడ ప్రతి ఐదేళ్లకూ ఒకసారి ఎన్నికలనే ప్రహసనాలు జరుగుతాయి. రాబోయే అయిదేళ్ళవరకూ రాజ్యాంగబద్ధంగా దోచుకునేవారిని వాటిలో ఎన్నుకుంటారు.

అవకాశం వచ్చినవారు ఇక విజ్రుంభిస్తారు.అవకాశం రానివారు వచ్చిన వారిపైన బురద చల్లుతూ ఆ అయిదేళ్ళు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు.

అవినీతి అన్న పదానికి ఆ దేశంలో అర్ధమే లేదు.ఎందుకంటే అది తప్ప ఎక్కడ చూచినా ఆదేశంలో ఇంకేమీ కనిపించదు కాబట్టి.

నీతి అన్న మాటకు అక్కడ విలువే లేదు.ఎందుకంటే దానిని ఆ ప్రజలు ఎప్పుడో మరచిపోయారు గాబట్టి.

ఆ దేశానికి భలే సహనం ఉంది.ఎందుకంటే వేల ఏళ్ల నుంచీ దానిని ఎందరు దోచుకుంటున్నా కిమ్మనకుండా అలా భరిస్తూనే ఉంది నేటివరకూ.ఆ దోచుకునేవారు పరాయివారైనా తనవారైనా ఆ దేశానికి ఏమాత్రమూ భేదం లేదు.

దోపిడీకి యుగయుగాలుగా అలవాటు పడిపోయి,చివరికి ఎవ్వరూ తనను దోచుకోకపోతే తనకు ఏమీతోచని స్థితికి చేరుకుంది ఆ దేశం. 'ప్లీజ్ నన్ను దోచుకోరా?' అని అడుగుతూ ప్రతివారి వెంటా పడుతుంది.

కాస్త తెలివైన ప్రతివారూ ఆ దేశాన్ని వదిలిపోతున్నారు.తెలివి ఎక్కువైనవారు అక్కడే ఉండి దాన్ని దోచుకుంటున్నారు.లేదా దోపిడీ దారులకు సహకరిస్తున్నారు.లేదా ఏమీ చెయ్యలేక ఏడుస్తూ బ్రతుకుతున్నారు.

కొద్దో గొప్పో దేశభక్తి ఉన్నవాళ్ళు ఏదో మంచి మార్పు రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.ఎదురుచూస్తున్నారు గానీ వాళ్ళ ఆశమీద వాళ్ళకే నమ్మకం లేదు.ఎందుకంటే ఎవరిని ఎన్నుకోవాలో వారికే అర్ధం కావడం లేదు.

ఎక్కువ శాతం దొంగలే ఉన్న ఆ దేశంలో,దొరల పాలన ఎవ్వరికీ ఇష్టం లేదు.దొరలే వస్తే అందరి దొంగతనాలూ బయటపడతాయని వాళ్ళ భయం. అదే సమయంలో,తాము దొంగలమని ఒప్పుకోడానికి అక్కడి గజదొంగలతో సహా ఎవ్వరూ సిద్ధంగా లేరు.అక్కడ దొంగలందరూ ఎదుటివారినే 'దొంగ దొంగ' అని వేలెత్తి చూపిస్తారు.

పాపం ఆ పిచ్చిదేశాన్ని ఎవ్వరూ రక్షించలేరు.ఒక్క దేవుడే ఆ దేశాన్ని రక్షించాలి--ఆ దేశ ప్రజలనుండి.
read more " అనగనగా ఒక దేశం "