“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, ఫిబ్రవరి 2020, శనివారం

Siddhi Day (29-2-1956)

అరవిందుల యోగమార్గంలో ఫిబ్రవరి 29 కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ తేదీ నాలుగేళ్ళకు ఒకసారి లీప్ ఇయర్ లో మాత్రమే వస్తుంది. అరవిందులు, మదర్ ఇద్దరూ అంతకుముందు దాదాపు 40 ఏళ్ళనుంచీ సాధించాలని ప్రయత్నించిన Supramental Descent అనేది 1956 వ సంవత్సరంలో ఇదేరోజున జరిగిందని వారి భక్తులు, అరవిందుల యోగావలంబులు నమ్ముతారు. జరిగిందో లేదో ఎవరికీ తెలీదు. కానీ మదర్ చెప్పారని అందరూ నమ్ముతున్నారు. అంతే !

Super Mind అనేది నేలమీదకు దిగి వస్తే ఏం జరుగుతుంది? అసలు Super Mind అంటే ఏమిటి? అంటే - అరవింద సాహిత్యంలో దీనికి చాలా వివరణలున్నాయి. అరవిందులు, మదర్ ఇద్దరూ దీనిమీద చాలా మాట్లాడారు. వ్రాశారు.

Super Mind అంటే, చీకటితో నిండిన మనిషి మనసుకీ, వెలుగుతో నిండిన దైవానికీ మధ్యలో ఉండే దివ్యమనస్సు. అదికూడా వెలుగుతో నిండి ఉంటుంది. సత్యస్వరూపమైన దైవం భూమిమీదకు దిగి రావాలంటే ముందుగా వెలుగుతో కూడిన ఈ సూపర్ మైండ్ అనేది ఇక్కడకు రావాలి. అప్పుడు దైవం రావడానికి సరియైన పునాది ఈ భూమ్మీద పడుతుందని వారు అనేవారు. దానికోసం వారిద్దరూ వారి జీవితమంతా ప్రయత్నించారు.

ఇది భూవాతావరణంలోకి దిగి వస్తే, మనిషి జీవితం పశుస్థాయి నుంచి దివ్యత్వస్థాయికి అతిత్వరగా ఎదుగుతుంది. అప్పుడు భూమిమీద పేదరికం, అసమానత్వం, దుఖం, బాధలు, ఏడుపులు, లేమి, రోగం, మరణం అన్నీ మాయమైపోతాయని వారు భావించారు. అవన్నీ అదేరోజున మాయం కాకపోయినా, Supramental descent ప్రభావం వల్ల క్రమేణా ఇవన్నీ భూమినుంచి తుడిచిపెట్టుకుని పోతాయనీ, కొన్నాళ్ళకు భూమి స్వర్గంగా మారుతుందనీ, ఎక్కడా ఎవరికీ ఏ బాధలూ ఉండవనీ, వారు భావించారు. అయితే ఇది పూర్తిగా జరగడానికి ఎన్నేళ్ళు పడుతుందో మాత్రం వారు ఖచ్చితంగా చెప్పలేదు. కొంతమంది అంతరంగ శిష్యులు చెప్పినదాని ప్రకారం, ఇది జరగడానికి దాదాపుగా 300 ఏళ్ళు పడుతుందని వారన్నారు.

ఒక సందర్భంలో M. P. Pandit గారు తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు.

'ఒకరోజున మదర్ ఇలా అడిగారు.

'సూపర్ మైండ్ భూమికి దిగి వచ్చిన తర్వాత భూమి మొత్తం దివ్యత్వంతో నింపబడటానికి ఎంతకాలం పట్టవచ్చు?'

దానికి అరవిందులు ఇలా అన్నారు.

'బహుశా 300 ఏళ్ళు పట్టవచ్చు'

భూవాతావరణంలోకి దానిని దించే ముందుగా, తమతమ శరీరాలలోకి దీనిని దించాలని వారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో, తన మనస్సులోకి దీనిని దించడంలో అరవిందులు సఫలమైనా, శరీరకణాల స్థాయికి దీన్ని తేవడంలో ఆయన విఫలమయ్యారు. ఈ ప్రక్రియను మదర్ కొంతవరకూ సాధించారని అంటారు. శరీరకణాలను కూడా దైవీకరించే ప్రక్రియలో ఆమె చాలావరకూ విజయం సాధించారని, కాంతి శరీరాన్ని ఆమె కొంతవరకూ పొందారని, వారి భక్తులు భావిస్తారు. ఆమె వేసుకున్న సాక్స్ ను తొలగిస్తే ఆమెకు పాదాలు లేవనీ వాటి స్థానంలో కాంతి మాత్రమే ఉందనీ ఆమెను చివరిదశలో చూచినవారు చెప్పారని మొన్న పాండిచేరిలో మూర్తిగారు నాతో అన్నారు. ఇందులో నిజానిజాలు మనకు తెలియదు. ఎందుకంటే, గోరంతలను కొండంతలు చెయ్యడం భక్తులకు చాలా సరదాగా ఉంటుంది. "అదుగో పులి అంటే, ఇదుగో తోక" అంటారు భక్తులు. ఎవరి భక్తులైనా ఇంతే. కానీ అందులో ఎంత నిజం ఉందో మనం చెప్పలేం.

నిండునూరేళ్ళు దాటినా మదర్ బ్రతుకుతారనీ, భూమ్మీద స్వర్గాన్ని ఆవిష్కరిస్తారనీ అందరూ నమ్మారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ మదర్ 94 ఏళ్ళ వరకూ బ్రతికారు. ఇంకేముంది ఆరేళ్ళే కదా, నూరేళ్ళను పూర్తి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారి ఆశలను మధ్యలోనే త్రుంచేస్తూ మదర్ 1973 లో తన 94 వ ఏట చనిపోయారు. Supramental Descent అనేది నిజంగా జరిగిందో లేదో ఎవరికీ తెలీని మిస్టరీగా మిగిలిపోయింది.

నూరేళ్ళు బ్రతకడం అనేది దివ్యత్వానికి కొలబద్ద కాదు. నూరేళ్ళు బ్రతికిన వాళ్ళు ఎందఱో ఈ భూమ్మీద ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి మంచి జీన్స్ వస్తే, మనం జాగ్రత్తగా ఆహారనియమాలు పాటిస్తూ ఉంటె, నూరేళ్ళు బ్రతకవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ శరీరం మొత్తం దివ్యత్వంతో నిండటం, భౌతిక శరీరకణాలు కూడా కాంతితో శక్తిలో ఆనందంతో నింపబడటం అనే ప్రక్రియను వారు సాధించాలని చూచారు. దానికి Supramental Descent అవసరం అని వారన్నారు. అది భూవాతావరణంలో 29-2-1956 న జరిగిందని మదర్ అన్నారు.

వారు చెప్పినట్టుగా 1956 లోనే ఈ అద్భుతం జరిగి ఉన్నట్లయితే, మరి అప్పటికీ నేటికి, 64 ఏళ్ళు గడిచాయి. ఈనాటికీ మనిషి జీవితంలో అప్పటికంటే పెద్దగా మార్పేమీ రాలేదు. ఇంకా చెప్పాలంటే, అప్పటికంటే ఇప్పుడు నేరాలు పెరిగాయి, ఘోరాలు పెరిగాయి, అవినీతి పెరిగింది, నల్లధనం పెరిగింది, మోసాలు పెరిగాయి, తాగుళ్లు, తందనాలు, రేపులు, హత్యలు పెరిగాయి, మనిషికీ మనిషికీ అంతరం పెరిగింది. అసమానతలు విపరీతంగా పెరిగాయి, మతాల మధ్యన ద్వేషం పెరిగింది. అసహనం పెరిగింది. రోగాలు పెరిగాయి. చెడు అనేది అన్ని రకాలుగా విపరీతంగా పెరిగింది. మరి Super Mind భూమిమీదకు వచ్చినట్లా? రానట్లా? అని నన్నడిగితే రాలేదనే అంటాను. వచ్చినా అది మనలో ఇంకలేదనీ అంటాను.

మరి సూపర్ మైండ్ రాకపోతే, మదర్ 29-2-1956 న ఎందుకలా చెప్పారు? అది అబద్దమా? ఆమె అబద్దం ఎందుకు చెబుతారు? ఆ అవసరం ఆమెకు ఏముంది? లేక అదంతా ఆమె భ్రమా? అంటే, ఆమె భ్రమలకు అతీతురాలు కాలేదా? కాకపోతే ఆమెను అవతారంగా ఎందుకు పూజిస్తున్నారు? ఏమో? ఎవ్వరికీ తెలీదు. ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలే. ఏదేమైనప్పటికీ అరవిందులు, మదర్ చెప్పిన "మానవశరీరం దైవీకరించబడటం" అనే ప్రక్రియ మాత్రం ఇంతవరకూ ఎవ్వరిలోనూ జరగలేదు. ఇకముందు జరుగుతుందో లేదో ఎవరికీ తెలీదు. ఎవరికి తోచిన వివరణలు వారిస్తున్నారు. దానిని రకరకాలుగా సమర్ధించుకుంటున్నారు. కానీ, అందరినీ అయోమయంలో వదిలేసి వాళ్ళిద్దరూ మాత్రం వెళ్ళిపోయారు. వారి భక్తులు మాత్రం వారిని అవతారాలని పూజిస్తున్నారు. ప్రపంచం యధావిధిగా నడుస్తోంది !

కానీ ఈ 64 ఏళ్ళలో చాలా మార్పులు జరిగాయి. మొదట్లో టెలిగ్రాఫ్ ఉండేది, తర్వాత టెలిఫోన్ వచ్చింది, ఆ తర్వాత టెలివిజన్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, మొబైల్ వచ్చింది, సోషల్ నెట్ వర్క్ వచ్చింది. ప్రపంచం ఒక చిన్న ఊరై పోయింది. చైనా తుమ్మితే భూమి మొత్తానికీ జలుబు చేస్తోంది. ఇండియాలో టెంపరేచర్ పెరిగితే భూమి మొత్తానికీ జ్వరం వస్తోంది. దేశాల మధ్యనా, మనుషుల మధ్యనా దూరాలు తగ్గిపోయాయి. కానీ ఒకే ఇంట్లో ఉండే మనుషుల మధ్యన దూరాలు పెరిగిపోయాయి. ఇండియాలో కూచుని అమెరికాలో ఉన్నవాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు, కానీ ఇండియాలో అదే ఇంట్లో ఒకరితో ఇంకొకరు మాట్లాడుకోవడం లేదు. వేరేవేరే రూముల్లో కూచుని ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటున్నారు.

ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే పక్కమీద పడుకుని ఉన్న భార్యాభర్తలు వారివారి ఫోన్స్ లో వేరేవేరే వారితో వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు గాని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు.

అంటే, సైన్స్ పెరిగింది, విలాసాలు పెరిగాయి, సరదాలు పెరిగాయి, సుఖాలు పెరిగాయి, భౌతికంగా దూరాలు తగ్గాయి, కానీ మానసికంగా దూరాలు పెరిగాయి. మనుషులు ఇంకాఇంకా దిగజారుతున్నారు, మనసులు ఇంకాఇంకా దిగజారుతున్నాయి. మరి మనిషిని దైవత్వానికి దగ్గర చేసే సూపర్ మైండ్ మన మధ్యకు వచ్చినట్లా రానట్లా?

అసలా రోజున గ్రహాల పరంగా ఏం జరిగిందో చూద్దాం.

ఆ రోజుకు ఉన్న గ్రహస్థితి ఇది. ఇది భూమి మొత్తానికీ వర్తించే సంఘటన గనుక లగ్నాన్ని లెక్కలోకి తీసుకోనక్కరలేదు. గ్రహాల స్థితులను మాత్రమే గమనిద్దాం.

శుక్రుడు, గురువు ఉచ్చస్థితిలో ఉన్నారు. వీరిలో శుక్రుడు డైరెక్ట్ గా ఉంటే, వక్రత్వం వల్ల గురువు కూడా ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. వారిద్దరి మధ్యనా కోణదృష్టి ఉన్నది. రాహుకేతువులు నీచస్థితిలో ఉన్నారు. నీచరాహువుతో కూడిన శపితయోగం కనిపిస్తోంది. నవాంశలో కూడా రాహుకేతువులు నీచలోనే ఉన్నారు. అయితే రాశులు మారారు. శుక్రుడు నవాంశలో కూడా ఉచ్చస్థితిలోనే ఉన్నాడు. వక్రగురువు స్వస్థానంలోకి వచ్చి శుక్రునితో కలిశాడు. శనిచంద్రులు కన్యారాశిలో కలిశారు. అయితే, రాహుకేతువులకిద్దరికీ నీచభంగం అయింది. ఎలా? వృశ్చికరాశినాధుడైన కుజుడు చంద్రుని నుంచి చతుర్ధకేంద్రంలో ఉన్నాడు. అలా రాహువుకి నీచత్వం పోయింది. వృషభరాశినాధుడైన శుక్రుడు చంద్రుని నుంచి సప్తమకేంద్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అలా శుక్రునికి నీచత్వం పోయింది.

ఇకపోతే, ఈ గ్రహాల పరిస్థితి మొత్తంలో ఒక విచిత్రమైన అమరిక ఉన్నది. అదేంటంటే - ఉచ్చగురుదృష్టి రాహుశనుల మీద ఉంది. వారి దృష్టి ఉచ్చశుక్రునిమీద ఉంది. ఆ శుక్రునిదృష్టి మళ్ళీ గురువుమీద ఉంది. అంతేకాకుండా, ఉచ్చగురువు, నీచరాహువు, ఉచ్చశుక్రుల దృష్టి చంద్రునిమీద ఉంది. ఈ గ్రహాలన్నీ ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటూ ఒక energy field ని సృష్టిస్తున్నాయి. అంటే ఆ రోజున ఒక అతీతమైన వెలుగు, శక్తి మానవమనస్సు మీద ప్రతిఫలించాయని అర్ధం. బహుశా మదర్ చెప్పిన సూపర్ మైండ్ అవతరణ అంటే ఇదేనేమో !

అయితే మరి, భూవాతావరణం ఎందుకు బాగవలేదు? భూమి స్వర్గంగా ఎందుకు మారలేదు? అంటే, మనం ఇలా అనుకోవచ్చు. భూమి దివ్యత్వాన్ని సంతరించుకునే ప్రాసెస్ ఆ రోజున మొదలైంది. అంతేగాని, తెల్లారేసరికి మనుషులందరూ దేవతలుగా మారిపోరు. కనీసం అలా మారాలని ప్రయత్నించేవారికి ఒక చానల్ ఆరోజు నుంచీ అందుబాటులోకి వచ్చింది. ఎంతవరకు ఆ వెలుగును మనం అందుకుంటాం? అన్నదాన్ని బట్టి మనం దేవతలుగా మారుతామా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. మన ప్రయత్నం లేకుండా దానంతట ఏదీ భౌతికప్రపంచంలోనే జరగదు. ఇక ఆధ్యాత్మిక లోకంలో ఎలా జరుగుతుంది?

ఈ భావనని సూచిస్తూ, రాహుకేతువుల నీచస్థితీ, శపితయోగమూ ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అంటే, మనిష్టప్రకారం మనం అన్ని వెధవపనులూ చేస్తూ కూచుంటే, సూపర్ మైండ్ వచ్చి మనకన్నీ చేసిపెట్టదు. దానిని అందుకోవడానికీ, మనల్ని భౌతికపరిధిలో పట్టి ఉంచుతున్న రాహుకేతువులు + శనీశ్వరుల శాపాన్ని తొలగించుకోవడానికి మనం చాలా కష్టపడాలి. అప్పుడే ఈ నీచత్వం పోతుంది. దేవగురువైన బృహస్పతీ, రాక్షసగురువైన శుక్రుడూ తమతమ ఉచ్చస్థితులలో కలసి, ఈ శాపాన్ని మార్చి, మానవమనస్సుపైన తమ శక్తిని ప్రసరింపజేసినప్పుడే ఈ అద్భుతం జరుగుతుందన్న సూచన ఈ గ్రహాల అమరికలో దాగుంది.

కనుక మదర్ చెప్పినది నిజమే కావచ్చు. సూపర్ మైండ్ అనేది ఆ రోజున భూమిమీదకు దిగి ఉండవచ్చు. దానిని అందుకోవడం మన వంతు. ఎంతగా మనం దానిని స్వీకరించి మనలో ఒక భాగంగా దానిని మార్చుకోగలిగితే అంతగా మనలో దివ్యత్వం వికసిస్తుంది. అందుకు సాధన అవసరం.

మనం దేవతలుగా మారాలా లేదా రాక్షసులుగా దిగజారాలా అన్నది మన చేతిలో ఉంది. ఏం చెయ్యాలి అన్నది మనిష్టం ! కానీ దేవతలుగా మారాలంటే మాత్రం, దానికి కావలసిన దారి ఆరోజున ప్రకృతిలో ఏర్పడింది. అది ఇప్పటికీ మన ఎదురుగా సిద్ధంగానే ఉంది. అందుకోవడం మన వంతు !

పోయినసారి ఈ తేదీ 29-2-2016 న వచ్చింది. మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడొచ్చింది. అయితే, తిధుల ప్రకారం చూస్తె, ఈరోజు మాఘ బహుళ చతుర్ధి అయింది. అది ఫిబ్రవరి 12 నే అయిపోయింది. తేదీల ప్రకారమైనా, తిధుల ప్రకారమైనా, మొత్తమ్మీద ఇదొక ప్రత్యేకమైన రోజు అనేది మాత్రం నిస్సందేహం !

ఆ సూపర్ మైండ్ ను అందుకోవడానికి, ఆ వెలుగుదారిలో నడవడానికి మనంకూడా ప్రయత్నిద్దాం ! అంతకంటే మనం మాత్రం ఏం చెయ్యగలం గనుక??
read more " Siddhi Day (29-2-1956) "

28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

ఇండియా శాపం

షష్ఠగ్రహ కూటమి + సూర్యగ్రహణం వల్ల కరోనా వైరస్ పుట్టి అన్నిదేశాలనూ గడగడలాడిస్తోంది అని గతంలో వ్రాశాను. అది జ్యోతిష్యపరంగా ఇచ్చిన వివరణ మాత్రమే. అది అంతిమం కాదు. జ్యోతిష్యమూ, గ్రహాలూ మన కర్మను మోసుకొచ్చి మనకు అందించే ఏజంట్లు మాత్రమే. అవి కర్మను సృష్టించలేవు. మన జీవితాలను నిర్దేశించే అంతిమశక్తి మనం చేసుకున్న కర్మే. దానిని మనం అనుభవించక తప్పదు.

ఆర్ధికరంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా నేడు భయంతో గడగడా ఒణికిపోతూ ఉందంటే దానికి కారణం కరోనా వైరస్ కాదు. ఏ వైరసూ అనవసరంగా పుట్టదు. ఏ రోగమూ ఏ దురదృష్టమూ ఎవరికీ అనవసరంగా రాదు. దాని వెనకాల కర్మ లింకులుంటాయి. ఆద్యాత్మికదృష్టితో చూస్తె అవేంటో స్పష్టంగా కనిపిస్తాయి.

ప్రస్తుతం చైనా అనుభవిస్తున్న శాపానికి కారణం ఏమిటో తెలుసా? పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తూ, ఇండియాకు వ్యతిరేకంగా పనిచెయ్యడమే ఈ శాపానికి గల కారణం. నవ్వొస్తోందా? నవ్వుకోండి. కానీ ఇది నిజం.

అది మనిషి కావచ్చు, దేశం కావచ్చు - అమాయకులని హింస పెడితే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది. నేను ఇంతకు ముందు ఎన్నో పోస్టులలో వ్రాశాను. మనిషి అతి చేస్తే, ప్రకృతి దెబ్బ కొడుతుంది. తప్పదు అని. దానినే ఇప్పుడు చైనాలో చూస్తున్నాం మనమంతా !

అంతేకాదు, ముందు ముందు సినిమా ఇంకా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు లక్ష బాతులను పంపిస్తోంది చైనా. ఎందుకు? పాకిస్తాన్లో పంటలను మిడుతలు పాడుచేస్తున్నాయట. ఆ మిడతలను తినే బాతులను చైనా సరఫరా చేస్తుందట. అవి మిడతలనే తింటాయో, ఇంకేం చేస్తాయో, వాటినుంఛి ఏ రోగం పాకిస్తాన్ కు పాకి, పాకీ దేశాన్ని ఏం చేస్తుందో ముందు ముందు చూద్దాం. అసలే బాతుమాంసం అంటే పాకీగాళ్ళకు చాలా ఇష్టమని విన్నాను ! మిడతల్ని బాతులు తినేలోపు ముందు బాతులు మిగలాలిగా ! 

పాకిస్తాన్ అనే దేశం టెర్రరిస్ట్ దేశం అనీ, దానికొక పద్ధతీ పాడూ లేదనీ, ఒక ప్లాన్ తొ కూడిన డెవలప్ మెంట్ లేదనీ ప్రపంచం మొత్తానికీ తెలుసు. దానికున్న ఏకైన అజెండా - ఇండియాతో శత్రుత్వం. కానీ ఆ దేశం ఎక్కడనుంచి పుట్టింది? ఇండియానుంచే పుట్టింది. ఆ విశ్వాసం దానికుందా? లేదు. పాలు త్రాగిన రొమ్మునే గుద్దడం అంటే ఇదే మరి ! అలాంటి నీచబుద్ధి ఉన్న దేశానికి ప్రకృతి ఏం శిక్ష విదిస్తుందో మనకింకా తెలీదు గాని, ప్రస్తుతానికి ఆ దేశానికి సాయం చేస్తున్న చైనాకు మాత్రం చావుదెబ్బ కొట్టింది ప్రకృతి !

ఇంతేనా ! ఇంకా ఉంది. వినండి.

రెండువందల ఏళ్ళ పాటు మనల్ని ఇష్టారాజ్యంగా దోచుకుంది బ్రిటన్. ఇప్పుడేమైంది? బ్రెగ్జిట్ అంటూ యూరోపియన్ దేశాలలో ఏకాకి అయి కూచుంది. ఒకపక్క స్కాట్ లాండూ, ఇంకో పక్క అయిర్లాండూ మేము విడిపోతాం ఎప్పటినుంచో అంటున్నాయి. బహుళజాతుల సమస్యలతో సతమతమౌతూ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతున్నదో తెలుసా? రెండువందల ఏళ్ళ పాటు ఇండియాను దోచుకుని అన్యాయం చేసిన ఫలితమే !

మనిషి జీవితంలో కర్మకు ప్రతికర్మ ఎలాగైతే ఉంటుందో, దేశాలకు కూడా అలాగే ఉంటుంది. అయితే, తప్పులు చేసేటప్పుడు మనిషికి ఎలాగైతే అర్ధం కాదో, పడేటప్పుడు మాత్రం ఏడుస్తాడో, దేశాలకు కూడా అంతే జరుగుతుంది. అదే ఇప్పుడు చైనాకు జరుగుతోంది. దాని ప్రభావంతో అన్ని దేశాలకూ వాత పడుతోంది.

అమెరికాలో ఆటోమొబైల్ పరిశ్రమ కుంటుపడింది. మొబైల్ పరిశ్రమ కుంటు పడింది. ఇన్ డైరెక్ట్ గా అన్ని పరిశ్రమలూ నెగటివ్ గా ప్రభావితం అయ్యాయి. ఎందుకంటే, ఆ స్పేర్ పార్టులు అన్నీ చైనానుంచి రావాలి. కరోనా దెబ్బకు అన్నీ మూతపడుతున్నాయి. ఇంకో వింత చెప్పనా ! కరోనా దెబ్బకు హైదరాబాద్ లో బార్బర్ షాపులకు పనిలేకుండా పోయింది.

ఈ మధ్యన కుర్రకారందరూ రాక్షసుల మాదిరి వికృతమైన హెయిర్ స్టైల్స్, గడ్డం స్టైల్స్ పెంచుతున్నారు. పాతకాలంలో విఠలాచార్య జానపద చిత్రాలలో రాక్షసులకు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఉండేవి. ఆ వెర్రి పోకడ ఇప్పటి కుర్రకారులో కనిపిస్తోంది. సరే అది వాళ్ళ ఖర్మ అనుకుందాం. అలాంటి గడ్డాలు పెంచితే కరోనా వైరస్ సోకే ప్రమాదం మామూలుకంటే కొన్నిరెట్లు ఎక్కువగా ఉంటుందట. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో, కుర్రకారందరూ రాక్షసిగడ్డాలు తీసేస్తున్నారు. అంటే, చైనాలో వచ్చిన వైరస్ దెబ్బకి, హైదరాబాద్ లో మంగలి షాపులకు పనిలేకుండా పోయింది. ఎంత విచిత్రం? కరోనా దెబ్బ, కర్మ దెబ్బ ఎలా ఉన్నాయో చూడండి మరి !

మొన్న ఒక డిన్నర్ కి వెళ్లాను. విచిత్రంగా అందులో చికెన్ అయిటంస్ లేవు. అందుకని అవి తినే ఫ్రెండ్స్ కొందరు చాలా బాధపడ్డారు. 'ఎందుకయ్యా చికెన్ లేదూ?' అంటే, కరోనా దెబ్బకి హైదరాబాద్ లో చికెన్ తినేవాళ్ళు తగ్గిపోయారని చెప్పారు. అదీ సంగతి ! వారానికి ఏడురోజులు చికెన్ తినే హైదరాబాద్ లో చికెన్ మాట దేవుడెరుగు, చివరకు ఎగ్స్ తినాలంటే కూడా భయపడుతున్నారు. అంటే, చావుకి ముడిపెడితేగాని మనిషి చెప్పినమాట వినడన్నమాట ! అందుకే అంటారు, భయంలాంటిది కాదు భక్తి అని. భక్తి చెయ్యలేని పనిని భయం చాలా తేలికగా చేస్తుంది. మంచిగా చెబితే విననప్పుడు కాల్చి వాత పెడితే చచ్చినట్టు వింటారు. అదీ సంగతి !

ఇదే కర్మవలయం అంటే ! అర్ధం చేసుకుంటే అంతా అర్ధం అవుతుంది. ఏం లేదని మన ఇష్టానుసారం చేస్తుంటే చివరకు వాత పడుతుంది. మనిషైనా అంతే, దేశాలైనా అంతే, ఇండియాకు ద్రోహం చేస్తున్న దేశాలకు ముందుముందు ఎలాంటి వాతలు పడతాయో మనమే చూస్తాం ! ఎందుకంటే మనమెప్పుడూ ఏ దేశాన్నీ దోచుకోలేదు. మన బ్రతుకేదో మనం బ్రతికాం. చేతనైతే మంచి చేశాం. లేకపోతే ఊరుకున్నాం. ప్రపంచానికి అత్యున్నతమైన ఆధ్యాత్మికతను ఇచ్చాం. కానీ మనల్ని మాత్రం అనేక దేశాలు దురాక్రమణ చేశాయి. దోచుకున్నాయి. దోచుకున్నది చాలక, ఇంకా ఇంకా నాశనం చెయ్యాలని చూస్తున్నాయి. ఒక్కొక్కదానికీ చక్కటి గుణపాఠం ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపు. కొంచం ఓపిక పట్టండి మరి !
read more " ఇండియా శాపం "

26, ఫిబ్రవరి 2020, బుధవారం

Three LInes

ఫిట్నెస్ చాలెంజ్ మీద పోస్టులు చదివిన కొందరు 'మీ యవ్వనరహస్యం ఏమిటి?' అని అడుగుతున్నారు. ఎంత చెప్పినా ఇంకా డౌట్స్ అడిగితే ఎలా? అంత అర్ధం కాకుండా ఏముంది నా పోస్టులలో? అయినా అడుగుతున్నారు కాబట్టి, అలాంటివారికోసం ఈ పోస్ట్.

నా రహస్యం అంతా మూడు గీతలలో దాగుంది, అంటే త్రీ లైన్స్ అన్నమాట. అవి నొసటి గీతలు కావు. బ్రహ్మ వ్రాసిన గీతలూ కావు. వీటిలో రెండు మనం వ్రాసుకునే గీతలు. మూడోది దానంతట అదే వస్తుంది. అవే - pipeline, waistline, lifeline.

Pipeline ని అదుపులో పెడితే Waist line అదుపులో ఉంటుంది. Waist line ని అదుపులో పెడితే Lifeline పెరుగుతుంది. ఇదే నా సూత్రం. అయితే, ఇక్కడ కొంచం వివరణ అవసరం.

Pipeline అంటే నోరు. అంటే, నోరు, పేగులు, జీర్ణాశయం, విసర్జన వ్యవస్థ ఇదంతా ఒక pipeline గా మనలో ఉంటుంది. దీనిని అదుపులో పెట్టడం అంటే, తిండిని కంట్రోల్ చెయ్యడం. ఇష్టం వచ్చినట్లు నానా చెత్తా మెక్కుతూ నా ఆరోగ్యం బాగుండాలంటే కుదరదు. కనుక ముందుగా తిండిని కంట్రోల్ చెయ్యాలి. కంట్రోల్ చెయ్యడం అంటే, ఉపవాసాలు ఉండటం కాదు. మితంగా, అన్నీ ఉన్న సమతుల ఆహారం తీసుకోవడం. అంటే, మనం రోజూ తినే తిండిలో ఆకుకూరలు ఉండాలి, పచ్చి కూరగాయలు ఉండాలి, పండ్లు ఉండాలి, నట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. అయితే అతిగా వేటినీ తినకూడదు. మితంగా తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఎక్కువగా నూనెలు, నాన్ వెజ్, జంక్ ఫుడ్ ను పూర్తిగా దూరం ఉంచాలి.

దీనిని కంట్రోల్లో పెడితే waistline అదుపులోకి వస్తుంది. అంటే, పొట్ట పెరగదు. మనిషికి వచ్చే రోగం పొట్ట+నడుము పెరగడంతోనే మొదలౌతుంది. అందుకే నేను సరదాగా ఒక మాట చెబుతూ ఉంటాను. "మధ్యప్రదేశ్ బాగుంటే ఇండియాలో అన్ని రాష్ట్రాలూ బాగుంటాయి" అని. అర్ధమైంది కదూ?

పొట్టని అదుపులో పెట్టడం అంటే, ఒక్క తిండిని కంట్రోల్ చెయ్యడం మాత్రమే కాదు. నీ ఒంటికి సరిపోయిన వ్యాయామం ప్రతిరోజూ చెయ్యాలి. అందరికీ అన్ని వ్యాయామాలూ సరిపోవు. మీ ఒంటికి ఏవి సరిపోతాయో చూచుకుని వాటిని మాత్రమే చెయ్యాలి. అంటే, శరీరంలోని అన్ని భాగాలకూ తగినంత వ్యాయామం ప్రతిరోజూ ఇవ్వాలి. ఈ వ్యాయామానికి నా అనుభవంతో నేను డిజైన్ చేసిన Yoga & Martial arts schedule అనేది అత్యుత్తమమైనది. నా శిష్యులు దీనిని అనుసరిస్తారు. అయితే, దీనిని చేసేవాళ్ళు కూడా వారానికి ఒకరోజు బాడీకి రెస్ట్ ఇవ్వచ్చు. కానీ ఆ రోజున కూడా మినిమం వాకింగ్ చెయ్యాలి. వాకింగ్ అనేది ప్రధానమైన వ్యాయామం కాదు. ఒక సహాయకారి మాత్రమే. దీనిని మర్చిపోకూడదు. Waistline అనేది ఒంట్లోని అన్ని భాగాలకూ ఒక ప్రతిబింబం అన్నమాట. అలా తీసుకోవాలి ఆ పదాన్ని !

ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో అప్పుడు waistline కంట్రోల్లో ఉంటుంది. అంటే, ఒళ్లంతా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే అది కంట్రోల్లో ఉందో, అప్పుడు lifeline పెరుగుతుంది. అంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నిజమో కాదో మీకు మీరే ప్రత్యక్షంగా చూసుకోవచ్చు.

లైఫ్ లైన్ తగ్గడానికి ప్రధానమైన కారణం పైప్ లైన్ మీద అదుపు లేకపోవడం, ఆ ఫలితంగా వెయిస్ట్ లైన్ పెరగడం. కనుక రెండు లైన్స్ కంట్రోల్లో ఉంటే ఆరోగ్యమూ ఉంటుంది. ఫిట్నెస్ కూడా ఉంటుంది. అప్పుడు వయసు పెరగడం ఆగిపోతుంది.

కనుక Pipeline-Waistline-Lifeline అనేదే నా సూత్రం. చూశారా ఎంత సులభమో? మరి ఈరోజు నుంచీ చెయ్యడం మొదలుపెట్టండి ! ఫలితాలు మీరే చూడండి !
read more " Three LInes "

23, ఫిబ్రవరి 2020, ఆదివారం

Fitness Challenge - 2 (Balance)

ఫిట్నెస్ లో అనేక స్థాయిలున్నాయి. కండలు పెంచడం ఒక్కటే ఫిట్నెస్ కాదు. యోగాభ్యాసంలో కండలకు విలువ లేదు. నీ ప్రాణశక్తి మంచిస్థితిలో ఉండాలి. యోగాభ్యాసంలో అదే ముఖ్యం. దానికొక కొలబద్ద బేలన్స్. అది శరీరానికీ అవసరమే, మనస్సుకీ అవసరమే.

శారీరిక యోగాభ్యాసంలో, బేలన్స్ ను ఇచ్చే ఆసనాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. ఏ సపోర్ట్ లేకుండా శీర్షాసనం చెయ్యడం ఒక ఎత్తైతే, దానిలో కొన్ని విన్యాసాలు చెయ్యడం, వాటిలో కాసేపలాగే ఉండగలగడం ఇంకో ఎత్తు. ఈ అభ్యాసం వల్ల శరీరానికి, మెడ, చేతులు, భుజాల కీళ్ళకు మంచి శక్తి, బేలన్స్ రెండూ వస్తాయి. అయితే, బద్దకాన్ని వదుల్చుకుని ఒళ్ళు వంచి కష్టపడాలి. అపుడే ఈ బేలన్స్ వస్తుంది. ఈరోజు ఉదయం యోగాభ్యాస సమయంలో తీసిన ఫోటోలలో ఇవి కొన్ని.



read more " Fitness Challenge - 2 (Balance) "

22, ఫిబ్రవరి 2020, శనివారం

ఏంటి బావగారు ఇది??

మా కొలీగ్ ఒకాయన దోమలగూడలో ఒక ఆస్పత్రిలో గత వారంనుంచి అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన్ను చూద్దామని నిన్న సాయంత్రం వెళ్లి పలకరించి వచ్చాను. పక్కనే రామకృష్ణమఠం ఉంటె, అక్కడకు వెళ్లి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసుకుని కాసేపు కూచుని వెనక్కు వస్తుండగా, దారిలో ముషీరాబాద్ చౌరస్తాలో అరబిందో భవన్ కనిపించింది. ఒకసారి లోపలకు వెళ్ళివద్దామని వెళ్ళాము.

లోపలకు వెళ్ళాక తెలిసింది ఫిబ్రవరి 21 మదర్ జన్మదినం అని. "సరే మంచిరోజున వచ్చాంలే" అనుకున్నా. కాసేపట్లోనే ఉత్సాహం చల్లారిపోయి తీవ్ర ఆశాభంగం కలిగింది. ఎందుకంటే, అక్కడ ఉన్న భక్తులవల్ల. పట్టుమని పదిమంది కూడా లేరు అక్కడ. వాళ్ళు కొద్దిమందే ఉండటం కాదు నా ఆశాభంగానికి కారణం !

సమాధి బాగా అలంకరించి ఉన్నది. ధ్యానహాలు కూడా అలంకరణ బాగుంది. అంతా బాగానే ఉంది. కానీ అక్కడున్న భక్తులే నిరాశ పరిచారు. వారిలో ఒక్కరిలోకూడా అరవిందులు మదర్ ఆశించిన స్థాయి నాకు కనిపించలేదు.

ఎంట్రన్స్ లోనే నాకు తీవ్ర ఆశాభంగం కలిగింది. చెప్పుల స్టాండ్ ఒక మూలగా ఉంది. కానీ దానిలో ఎవ్వరూ చెప్పులు విడవడం లేదు. వాకిట్లోనే చెదురుమదురుగా విడుస్తున్నారు. అక్కడే నాకు కాలింది. "వీళ్ళా అరవిందుల పూర్ణయోగాన్ని సాధించాలని ప్రయత్నించే భక్తులు?" అనిపించింది. ఇక్కడే కాదు. మొన్న పాండిచేరి వెళ్ళినపుడు చూచాను. అక్కడా ఇదే తీరు. అక్కడున్న ఫారినర్స్ మాత్రం చక్కగా క్యూలో నిలబడి మరీ చెప్పులస్టాండ్ లోనే విడుస్తున్నారు చెప్పులను. మనవాళ్ళేమో ఎక్కడబడితే అక్కడ ఆదరాబాదరాగా వదిలేసి పరిగెత్తుతున్నారు ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు ! ఇలాంటి చిన్నచిన్న విషయాలలోనే మనిషి వ్యక్తిత్వమూ, ఆధ్యాత్మికస్థాయీ బయటపడుతూ ఉంటాయి !

ధ్యానహాలులో Keep Silence అని బోర్డుంది. కానీ అక్కడే ఒక అయిదారుగురు కూచుని ఏవేవో లౌకిక విషయాలు మాట్లాడుకుంటూ కనిపించారు. కనీసం మనం ఎక్కడున్నాం? ఎలా ఉండాలి? అన్న స్పృహ కూడా వారిలో కనిపించలేదు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ధ్యానం చెయ్యడం లేదు.

కళ్ళు తెరిచే ధ్యానం చెయ్యడం మదర్ కు ఇష్టమని నాకు తెలుసు. నాకు రెండూ వచ్చు. కళ్ళు తెరిచీ నేను ధ్యానం చెయ్యగలను, మూసీ చెయ్యగలను. మాట్లాడుతున్నపుడు కూడా అదేస్థితిలో ఉండగలను. కానీ అక్కడున్నవాళ్ళు ఎవరూ 'ధ్యానస్థితి' లో లేరు. కనీసం అక్కడ ఉన్న కాసేపైనా మౌనంగా ఉండాలని కూడా వారికి తోచడం లేదు. లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అదీ నేను చెబుతున్నది !

పక్కనే ఉన్న లైబ్రరీ కం బుక్ స్టాల్ కు దారి తీశాను. అక్కడా అలాంటి బోర్డే ఉంది. కానీ అక్కడ కూడా కొంతమంది నిలబడి ఏదేదో మాట్లాడుతూ కనిపించారు. మా చెడ్డ చిరాకేసింది.

'ఏంటి బావగారు ఇది?' అనుకుంటూ స్టేజిమీద ఉన్న అరవిందులు, మదర్ల ఫోటోల కేసి చూశాను. అరవిందులను నేను "బావగారు" అని సంబోధిస్తాను. ఎందుకంటే ఆయన భార్య మృణాలినిదేవి, శ్రీ శారదామాత శిష్యురాలు. ఆమెను తన కన్నబిడ్డలా ప్రేమించేవారు శారదామాత. కనుక శ్రీ రామకృష్ణులకు అరవిందులు అల్లుడౌతారు. కనుక నాకు బావగారౌతారు. అందుకనే నేనాయన్ని చనువుగా 'బావగారు' అంటూ సంబోధిస్తాను.

మనదేశంలో ఎక్కడ చూచినా 'క్యూలో నిలబడండి' అని ప్రతిచోటా బోర్డులుంటాయి. కానీ ఎవరూ క్యూలో నిలబడరు. 'నో పార్కింగ్' అని బోర్డు ఉంటుంది. కానీ అక్కడే పార్కింగ్ చేస్తుంటారు. 'ఇక్కడ చెత్త వేయరాదు' అని బోర్డు ఉంటుంది. కానీ దానిపక్కనే చెత్త వేస్తూ ఉంటారు. అది పెద్దగుట్ట అయి ఉంటుంది. 'ఇక్కడ ఉచ్చ పోయరాదు' అని బోర్డు ఉంటుంది. కానీ అక్కడే పోస్తుంటారు. ఈ దృశ్యాలు సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మామూలు మనుషులు అలా చండాలంగా ప్రవర్తిస్తే అర్ధం చేసుకోవచ్చు, వాళ్ళు సంస్కారహీనులులే అని. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, అందులోనూ అరవిందులు, మదర్ల Integral Yoga అనుసరించేవారు అలా కనీసపు Civic Sense లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటె, చాలా బాధనిపించింది. అసలు ఎక్కడున్నారు వీరంతా? అని.

"నేనడిగినదానికి జవాబు చెప్పలేదేంటి బావగారు? మీ అనుచరులు కూడా ఇలా ఉన్నారేంటి?" అనుకుంటూ మళ్ళీ ఫోటోల కేసి చూచాను,

'ఏం చేస్తాం మా ఖర్మ. ఇలాంటి మనుషులను ఉద్ధరించి ఏదో Supramental descent ను భూమిపైకి తెద్దామని మేము అనవసరంగా ప్రయత్నించాం. పొరపాటు చేశాం. ఈ లోకం ఇంతే, ఈ మనుషులూ ఇంతే. మా ఖర్మా ఇంతే. ఇక్కడున్న అందరూ నా మార్గంలో పండిపోయామని అనుకుంటున్నారు. వీళ్ళకు శ్రోతలు కావాలి. వినేవాళ్ళకోసం ఎదురుచూస్తున్నారు. నీ పనిచూసుకుని ఇంటికి పో. మేము చేసిన పొరపాటును నువ్వూ చెయ్యకు. లోకుల్ని ఉద్దరించాలని ప్రయత్నించకు.' అని అరవిందులు, మదర్ ఇద్దరూ అన్నట్లు నాకు తోచింది.

నా observation ప్రతిచోటా మళ్ళీ మళ్ళీ రుజువౌతూ వస్తోంది. మహనీయుల భక్తులే ఆ మహనీయులు చెప్పినది పాటించడం లేదు. మళ్ళీ ' మేము పలానా వాళ్ళ భక్తులం, ఆయన మార్గంలో నడుస్తున్నాం' అని డప్పు మాత్రం మానరు ! లోకంలో ఎక్కడ చూచినా ఇదే గోల !

"వీళ్ళు ఆశించిన Supramental descent అనేది ఈ భూమ్మీదికి రావాలంటే ఇంకో వెయ్యేళ్ళు పట్టేలా ఉందిరా దేవుడా !" అనుకుంటూ మౌనంగా బయటకొచ్చి బైక్ తీసుకుని ఇంటికి బయల్దేరాము.
read more " ఏంటి బావగారు ఇది?? "

20, ఫిబ్రవరి 2020, గురువారం

Chart of Sri Aurobindo - Astro analysis - 4 (తండ్రి కృష్ణధన్ ఘోష్ జాతకం)

ఒకవంశంలో మహనీయులు జన్మించాలంటే వారి తాతముత్తాతలలో కొంతమందిలో కాకపోతే కొంతమందిలోనైనా ఆ పోకడలుండాలి. లేకుంటే ఆ వంశంలో ఈ అద్భుతం సాధ్యం కాదు. ఇది తండ్రివైపు కంటే, తల్లివైపు ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది ఎక్కువగా తల్లివైపు నుంచే మనిషికి వస్తుంది. ఈ పోకడ ఎలా వచ్చిందో గత పోస్టులలో వివరించాను. ఇప్పుడు అరవిందుల తండ్రిగారి జాతకం పరిశీలిద్దాం.

అరవిందుల నాన్నగారైన కృష్ణధన్ ఘోష్ ది కాయస్థ కుటుంబం. అంటే క్షత్రియులన్నమాట. అయితే, వారి పూర్వీకులు పశువులు మేపుకునే కులంవారని రుజువులున్నాయి. అంటే గొల్లరాజులన్నమాట. కృష్ణుని తండ్రిగారి పేరుకూడా నందఘోష్ అంటారు. అశ్వఘోషుడు, నందఘోషుడు, విమలఘోషుడు మొదలైన పేర్లన్నీ ఈ ఘోష్ అనే వంశానికి చెందినవే.

కృష్ణధన్ ఘోష్ 21-11-1844 న బీహార్ లోని పాట్నాలో పుట్టాడు. జననసమయం తెలీనందున లగ్నాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. 'మా నాన్నగారు పెద్ద నాస్తికుడు' అని అరవిందులు అనేవారు. ఇంగ్లీషు చదువుల వల్ల ఆయన అలా తయారైనాడు గాని, సహజంగా ఆయనా భక్తిపరుడే. జగన్మాత కాళిని కీర్తిస్తూ ఆయన వ్రాసుకున్న కొన్ని పద్యాలు ఆయన పోయాక కొన్ని పాతకాగితాలలో దొరికాయని అరవిందుల తమ్ముడైన బరీన్ వ్రాస్తారు. కనుక ఆయన పూర్తిగా నాస్తికుడని మనం నమ్మలేం. మనస్సును సూచించే చంద్రుడు స్వస్థానంలో ఉన్న గురువుతో కలసిన జాతకుడు నాస్తికుడెలా అవుతాడు? అందులోనూ రేవతీ నక్షత్ర జాతకుడు?

ఈయన వంశంలో చాలామంది శ్రీరామకృష్ణుల భక్తులు, ఆ సంప్రదాయంలో సన్యాసులు ఉన్నారు. తన సాధనకు పునాదులు వేసినది కూడా శ్రీ రామకృష్ణులు, వివేకానందులే అని అరవిందులు చాలాసార్లు అనేవారు. ఆ వివరాలు ఇంకొక పోస్టులో వ్రాస్తాను.

అరవిందుల తండ్రిగారిది రేవతీ నక్షత్రం. ఈ జాతకంలో ముఖ్యమైన యోగాలు - మీనంలో గజకేసరియోగం, మకరంలో శని, కన్యలో కుజ నీచశుక్రులు, రాహుకేతువులు నీచలో ఉండటం, వారితో రవిబుదులు కలసి ఉండటం.

ఏ మనిషి జాతకంలో నైనా, ఒకరి రెండు యోగాలే ఆ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషీ తన జాతకం ఏదో గొప్ప జాతకం అనుకుంటూ ఉంటాడు. అదేమీ ఉండదు. గొప్ప జాతకాలు అక్కడక్కడా మాత్రమే ఉంటాయి. మామూలు మనుషుల జాతకాలు సాదాసీదాగా ఉంటాయి. లేదా దురదృష్టయోగాలు ఉంటాయి. కాకపోతే మనుషులు అహంకారంతో, తమవి చాలా గొప్ప జాతకాలని అనుకుంటూ ఉంటారు. అంతే !

గజకేసరి యోగం అనేది జీవితంలో సక్సెస్ ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరునిస్తుంది. రేవతీనక్షత్రం మంచి మనసునిస్తుంది. నీచశుక్ర కుజుల కలయిక అతికామయోగం. రాహుకేతువుల నీచత్వం అనేది ఒక శాపం. పైగా, వాళ్ళు నవాంశలో కూడా నీచలోనే ఉన్నారు. ఇది మామూలు శాపం కాదు, బలమైన శాపం. అలాంటివారికి కాలం సులభంగా కలసిరాదు. ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించిన తర్వాతనే అది ఆ జాతకుని మీద తన పట్టును వదులుతుంది. వీరికి అనుభవించే ఖర్మ చాలా గట్టిగా ఉందని అర్ధం.

కృష్ణధన్ ఘోష్ జీవితం అలాగే గడిచింది. జీవితంలో ఆయన చూడని సక్సెస్ లేదు. అలాగే, చూడని విషాదమూ లేదు. పేదరికం నుంచి వచ్చిన తను, స్కాలర్ షిప్ తో చదువుకుని, కలకత్తా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో M.D చేశాడు. కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. తన పిల్లలను కూడా అలాగే ఉన్నతస్థానాలలో చూడాలని కలలు కన్నాడు.కానీ, పై చదువులు చదువుకుని పైకొస్తారని భావించిన పిల్లలు అలా ఎక్కిరాలేదు. అందాన్ని చూచి మోజుపడి చేసుకున్న భార్య రోగిష్టిదై కూచుంది. ఇంగ్లాండులో ఉంచి చదివిస్తే, ముగ్గురు పిల్లలలో ఒక్కరూ పైకి రాలేదు. జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ మిగలలేదు. భార్య ఒకచోట, తనొక చోట, పిల్లలు ఒకచోట ఇలా దిక్కుకొకరు అయిపోయారు. తను ఆశించినవి ఏవీ జరగలేదు. ఈ మానసిక వేదనతో ఆయన త్రాగుడుకు అలవాటుపడ్డాడు. ఇది నీచశుక్రుని ప్రభావం. చివరకు అరవిందులు ఇండియాకు వస్తున్న ఓడ మునిగిపోయిందని వార్త వచ్చింది. ఈ షాక్ ను ఆయన తట్టుకోలేక పోయాడు. హార్ట్ ఎటాక్ తో కుప్పకూలి చనిపోయాడు. క్లుప్తంగా ఇదీ ఆయన జీవితం ! పైన ఉదాహరించిన గ్రహయోగాలు ఆయన జీవితాన్ని అలా నడిపించాయి.

తల్లిదండ్రుల జాతకాలలో ఉన్న గ్రహస్థితులు యోగాలు పిల్లల జాతకాలలో ప్రతిఫలిస్తాయి. అవి మంచి యోగాలైనా, చెడు యోగాలైనా ఖచ్చితంగా పిల్లలకు సంక్రమిస్తాయి. వంశపారంపర్యంగా వస్తున్న శాపాలైతే మాత్రం ఖచ్చితంగా పిల్లల జాతకాలలోకి సరఫరా అవుతాయి. దీనినే జెనెటిక్ ఆస్ట్రాలజీ అంటారు. జ్యోతిశ్శాస్త్రంలో నా రీసెర్చి సబ్జెక్ట్ ఇదే ! ఎందుకంటే, ఇది మాత్రమే, ఆ వంశంలో వస్తున్న కర్మమ్యాప్ ను ఖచ్చితంగా చూపగలుగుతుంది. వంశంలో ఏయే శాపాలున్నాయో చూపిస్తుంది. అవెక్కడ మొదలయ్యాయో చూపిస్తుంది. ఎందుకు అవి పట్టుకున్నాయో చూపిస్తుంది. ఆ చెడుకర్మను ఎలా ప్రక్షాళన చేసుకోవాలో చూపిస్తుంది. ఆధ్యాత్మికసాధనకు దారి చూపించే జ్యోతిష్యకోణం ఇదే ! అందుకే జ్యోతిష్యశాస్త్రంలోని ఈ కోణం అంటే నాకు చాలా ఇష్టం !

దారాకారకుడైన గురువు మంచి యోగంలో ఉన్నప్పటికీ రెండు డిగ్రీలలో ఉండటం వల్ల బాల్యావస్థలో బలహీనుడుగా ఉన్నాడు. కనుక గజకేసరి యోగం అంత బలంగా లేదు. కానీ నవాంశలో గురువు బలంగా ఉన్నాడు. సంతాన కారకుడు బలంగా ఉన్నందువల్ల, తన సంతానం అందరూ గొప్పవాళ్ళు కాలేకపోయినా, అరవిందుల వంటి ఆణిముత్యం తనకు బిడ్డగా పుట్టాడు. అరవిందుల జాతకంలో కూడా గురువు ఉచ్చస్థితిలో ఉండటం చూడవచ్చు. ఈ యోగం ఈయనకు తండ్రిగారి నుంచి సంక్రమించింది.

అరవిందుల భార్య మృణాళినిది కూడా విషాదజీవితమే. అర్ధాంతరంగానే ఆమె జీవితమూ ముగిసింది. భార్య విషయంలో దురదృష్టం అనేది తండ్రి జాతకం నుంచే అరవిందులకు సరఫరా అయింది. ఈ విధంగా కొన్ని కొన్ని ట్రెండ్స్ ఆయా కుటుంబాలలో తరతరాలుగా నడుస్తూ ఉంటాయి. అర్ధం చేసుకుంటే 'వంశపారంపర్య కర్మ' అనేది అక్కడే కనిపిస్తుంది.

అలాగే, కుజుడు నీచశుక్రునితో కలసి ఉండటం కృష్ణధన్ గారి జాతకంలో మనం చూడవచ్చు. ఈ యోగం - అరవిందుల జాతకంలో కొచ్చేసరికి - నీచకుజునిగా మారిపోయింది. ఇది కూడా తండ్రి జాతక ప్రభావమే. ఇవే, వంశపారంపర్యంగా సంక్రమించే ధోరణులు. వీటినే వంశసంస్కారాలంటారు.

కృష్ణధన్ గారి జాతకంలో ఇంకొక దోషం నవాంశలో శనీశ్వరుని నీచస్థితి. ఇది కూడా శాపమే. దీనివల్ల ఎంత గొప్ప వృత్తిలో ఉన్నప్పటికీ ఆ జాతకునికి మానసికంగా శాంతి అనేది ఉండదు. ఆ జాతకంలో శని ఏ భావాన్ని సూచిస్తున్నాడో ఆ భావపరంగా ఘోరమైన అశాంతి, వైఫల్యాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది జరిగినట్లు మనం గమనించవచ్చు.

150 ఏళ్ళ క్రితం ఇంగ్లాండ్ లో M.D చేసి వచ్చి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసిన కృష్ణ ధన్ ఘోష్ మానసిక వేదనతో త్రాగుడుకు బానిసై, నిరాశకు లోనై, చివరకు హార్ట్ ఎటాక్ తొ చనిపోవడం, జాతకంలోని ఖర్మ కాకపోతే మరేమిటి? ఏమంటారు దీన్ని?

నీచరాహువుతో రవి కలసి ఉండటం వల్ల, ఈ పోకడ వీళ్ళ వంశంలో ఇంకా పైనుంచి వస్తున్నదన్న సత్యం మనకు స్పురిస్తున్నది. ఇదే నీడ అరవిందులను కూడా సోకింది. ఆయన ఎంత మహాయోగిగా రూపుదిద్దుకున్నప్పటికీ ఈ నీడ ఆయన్ను వెంటాడకుండా పోలేదు.

తన పిల్లలను ఉన్నతస్థానాలలో చూడలేక పోయానని బాధపడుతూ కృష్ణధన్ ఘోష్ కన్నుమూశాడు. ప్రపంచపు అజ్ఞానంలోకి, నిమ్నత్వంలోకి తను అనుకున్న సూపర్ మైండ్ ను దించి తీసుకురాలేకపోయానన్న దిగులుతో అరవిందులు కన్నుమూశారు. రెండూ నిరాశలే ! ఒకటి లౌకికం అయితే, రెండోది అత్యున్నతమైన ఆధ్యాత్మికం అయింది. కానీ ఇద్దరూ హతాశులే. ఇద్దరూ తమతమ ఆశలు భంగమైనవారే.

తన కుటుంబం కోసం కృష్ణధన్ ఘోష్ కన్నుమూస్తే, ప్రపంచం మొత్తాన్నీ ఉద్ధరించాలని ప్రయత్నిస్తూ అరవిందులు కన్నుమూశారు. కానీ ఇద్దరూ తమతమ ప్రయత్నాలలో విఫలులయ్యారు. ఇవే జాతకయోగాలంటే ! వీటిని తప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

ఇదంతా చదువుతుంటే, 'ఏ రాయైతేనేం తల పగలడానికి?' అని మోటు సామెత ఒకటుంది. అది గుర్తుకు రావడం లేదూ ! అందుకే నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, గ్రహప్రభావాన్ని ఎవరూ దాటలేరు. నువ్వు విషం త్రాగక తప్పదు, అది ఏ గిన్నెలో త్రాగుతావో నీ ఇష్టం. అది బంగారుగిన్నె కావచ్చు, వెండిగిన్నె కావచ్చు, ఇత్తడిగిన్నె కావచ్చు, సత్తుగిన్నె కావచ్చు, ఇనుపగిన్నె కావచ్చు, లేదా మట్టిమూకుడు కావచ్చు. నీవు చేసుకున్న కర్మ అనే విషాన్ని మాత్రం నీవు త్రాగక తప్పదు. లేదా అత్యున్నతమైన యోగసాధనను నీవు చేయగలిగితే అది ప్రక్షాళన అవుతుంది. నీ కర్మను అప్పుడు మాత్రమే దాటగలుగుతావు.

ఆ తర్వాత కూడా, లోకం కర్మను నీ నెత్తిని వేసుకుని మొయ్యాలనీ, లోకాన్ని ఉద్ధరించాలనీ చూస్తే మాత్రం, మళ్ళీ అదే విషం నీ ఎదురుగా ఇంతా పెద్ద మోతాదులో ఇంకా పెద్ద గిన్నెలో సిద్ధంగా ఉంటుంది. దాన్ని నువ్వు త్రాగకా తప్పదు. ఆ రకంగా నీ ఖర్మను నువ్వు తిరిగి అనుభవించకా తప్పదు. ఇంకా చెప్పాలంటే, అప్పుడు నీ ఖర్మనే కాదు, లోకుల ఖర్మను కూడా నువ్వే అనుభవించవలసి వస్తుంది. లోకంతో పెట్టుకునే మహనీయులకు పట్టే గతే ఇది !

అరవిందుల విషయంలో సరిగ్గా అదే జరిగింది !
(ఇంకా ఉంది)
read more " Chart of Sri Aurobindo - Astro analysis - 4 (తండ్రి కృష్ణధన్ ఘోష్ జాతకం) "

19, ఫిబ్రవరి 2020, బుధవారం

Chart of Sri Aurobindo - Astro analysis - 3 (తల్లిదండ్రులు - కుటుంబం)

అరవిందులు 1872 లో కలకత్తాలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు డా || కృష్ణధన్ ఘోష్, స్వర్ణలతాదేవి. నాన్నగారు ప్రభుత్వంలో సివిల్ సర్జన్ గా ఉండేవారు. అమ్మగారు హౌస్ వైఫ్. కృష్ణధన్ ఘోష్ ఇంగ్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో మెడిసిన్ చదివారు. అప్పట్లో డార్విన్ ప్రతిపాదించిన Theory of evolution అనేది యూరప్ అంతటా మారుమోగిపోతూ ఉండేది. దాని దెబ్బకు సైన్స్ పునాదులు, సమాజపు పునాదులు, అప్పటివరకూ జనం నమ్ముతున్న నమ్మకాలు అన్నీ సమూలంగా కదిలిపోతూ ఉన్న రోజులవి. అరవిందుల నాన్నగారు ఈ థియరీని నమ్మేవారు. అరవిందులు కూడా తన ఇంగ్లీషువిద్యవల్ల ఇదే భావాన్ని బాగా నమ్మాడు. అందుకే ఆయన ప్రతిపాదించిన పూర్ణయోగంలో కూడా ఇదే evolutionary భావన అంతర్లీనంగా కనిపిస్తుంది.

అరవిందులకు పైన ఇద్దరు అన్నయ్యలున్నారు. క్రింద ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడి పేరు బరీంద్ర. తరువాతి కాలంలో అరవిందులు తన తమ్ముడు బారీన్ కు వ్రాసిన ఉత్తరాలలో అనేక విషయాలను ఆయన ముచ్చటించారు. అవి అరవిందాశ్రమం ఆర్కైవ్స్ లో ఉన్నాయి.

జాతకంలో అన్నలను అక్కలను సూచించేది పదకొండో ఇల్లు. అరవిందుల జాతకంలో అది వృషభం అయింది. అందులో ఉచ్చరాహువున్నాడు. వక్రశని వృశ్చికంలోకి రావడం వల్ల, అక్కడనుంచి తన సప్తమదృష్టితో రాహువును చూస్తున్నాడు. కనుక ఏకాదశస్థానంలో రెండు గ్రహాలున్నట్లు అయింది. కనుక అరవిందులకు ఇద్దరు అన్నయ్యలున్నారు.

తనకంటే చిన్నవారిని మూడో ఇల్లు సూచిస్తుంది. అది కన్య అయింది. దానిమీద రాహువు యొక్క పంచమ దృష్టి ఉంది. అది శనీశ్వరుని ప్రభావాన్ని మోసుకొస్తోంది. కనుక మళ్ళీ తనకంటే చిన్నవారు ఇద్దరున్నారు - ఒక తమ్ముడు, ఒక చెల్లెలు.

జాతకంలో రవి స్థానాన్ని బట్టి తండ్రిగారి స్థితి తెలుస్తుంది. ఈ జాతకంలో రవి, బుధుడు, శుక్రులతో కలసి స్వస్థానమైన సింహంలో బలంగా ఉన్నాడు. సింహరాశి నాయకులకు సూచిక, సూర్యుడు డాక్టర్లను సూచిస్తాడు. కనుక తండ్రిగారైన కృష్ణధన్ ఘోష్ అప్పట్లోనే ఇంగ్లాండ్ లో మెడిసిన్ చదివి వచ్చి, ఇండియాలో సివిల్ సర్జన్ గా ఉన్నాడు. అరవిందుల జాతకంలోని సూర్యునితో బుధ శుక్రుల కలయిక, తండ్రిగారికి సమాజంలో ఉన్న మంచి పేరును పలుకుబడిని సూచిస్తోంది. కానీ వీరిపైన ఉన్న శనిచంద్రుల కోణ దృష్టి అంతా పాడు చేసింది. పైగా వీరిలో శని వక్రించి ఉన్నాడు. ఇదే అరవిందుల జాతకంలోని శాపం.

ఏ జాతకంలో అయితే శనిచంద్రుల కలయిక ఉంటుందో ఆ జాతకుని తల్లి దురదృష్టవంతురాలౌతుంది. దీర్ఘరోగాలకు గురౌతుంది. అనేక బాధలతో తీసుకుంటూ మరణిస్తుంది. ఎన్నో వందల జాతకాలలో ఈ సూత్రం రుజువైంది. కానీ ఆ జాతకునికి గొప్ప ఆధ్యాత్మిక పోకడలుంటాయి. బహుశా జీవితంలో అనేక బాధలను చూచి ఉండటం వల్లనే ఈ ఆధ్యాత్మిక ధోరణి ఒకరికి కలుగుతుందేమో?


కానీ ఒకరి జాతకంలో శనిచంద్రయోగం ఉన్నంత మాత్రాన అతనికి ఆధ్యాత్మికత కలుగదు. దానికి తోడ్పడే ఇతర యోగాలుండాలి. దశానుకూలత ఉండాలి. అంటే, ఆయా దశలు అతనికి సరియైన సమయంలో రావాలి. అప్పుడే అతనికి ఆధ్యాత్మికత ఒంటబడుతుంది. లేకుంటే, ఇదే యోగం డిప్రెషన్ నూ, మజ్జుతనాన్నీ కూడా ఇస్తుంది. ఇలాంటి సూక్ష్మమైన తేడాలను జాతకంలో గమనించాలి. 

కనుక అరవిందుల తండ్రిగారు మంచి జాతకుడే అయినప్పటికీ, తల్లిగారి దురదృష్ట యోగాలు ఆయన జాతకాన్ని పాడు చేశాయి. అన్నీ ఉండికూడా, చివరకు వారి జీవితం నిరాశా నిస్పృహలతో ముగిసింది.

ఇంగ్లాండ్ లో చదువుకుని రావడం వల్ల, మన సొసైటీ కంటే ఇంగ్లీష్ సొసైటీ గొప్పది అన్న భావాలు కృష్ణధన్ ఘోష్ లో ఉండేవి. అందుకని తన పిల్లలను చిన్నప్పటి నుంచే ఇంగ్లీషువారిలాగా పెంచాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే అరవిందులను, ఆయన ఇద్దరు అన్నయ్యలను డార్జిలింగ్ లో ఐరిష్ వనితలు నడుపుతున్న బోర్డింగ్ స్కూల్ లో పడేశాడు.

అరవిందులు కేతుదశలో జన్మించారని ఇంతకు ముందు వ్రాశాను. ఆ కేతువు ఆయన జాతకంలో పంచమస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. పంచమం విద్యాస్థానం. కనుక ఆయనకు చిన్నప్పటి నుంచే యూరోపియన్స్ నడుపుతున్న బోర్డింగ్ స్కూల్లో విద్యాభ్యాసం సాగింది. ఆ తరువాత ఇంగ్లాండ్ లో ఉండి చదువుకున్నాడు.

అరవిందుల అమ్మగారు స్వర్ణలతగారికి మొదటి కాన్పు తర్వాత కొంచం పిచ్చి మొదలైంది. పిల్లలను ఆమెకు దూరంగా ఉంచుదామన్న ఉద్దేశంతో కూడా వారిని డార్జిలింగ్ లో ఉంచాడు కృష్ణధన్ ఘోష్. అరవిందుల జాతకంలో వక్రశని, చంద్రుల కలయిక కూడా ఆయన తల్లికి పిచ్చి ఉందని సూచిస్తున్నది.

కృష్ణధన్ ఘోష్, స్వర్ణలతా ఇద్దరూ బ్రహ్మసమాజభావాలు బాగా తలకెక్కినవారు. స్వర్ణలత తండ్రిగారైన రాజనారాయణ్ బోస్ కూడా బ్రహ్మసమాజంలో మంచి పేరున్న నాయకుడు. ఆయన సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న వాడే. కానీ ఆయన వంశంలో ఏదో దీర్ఘరోగం ఉండేది. ఆయన కొడుకుకి పిచ్చి ఉండేది. దానితోనే అతను చనిపోయాడు. ఇద్దరు కూతుళ్ళలో స్వర్ణలత ఒకరు. ఆమెకు ఆమె చెల్లెలికీ కూడా చిన్నప్పటినుంచీ మూర్చరోగం (Fits) ఉండేది. స్వర్ణలత మంచి అందగత్తె. కనుక ఆమెను చూచిన కృష్ణధన్ ఘోష్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లోనే డాక్టరైన క్రిష్ణధన్ కు తన కూతుర్ని ఇవ్వడంలో ఏమీ అభ్యంతరం కనిపించలేదు రాజనారాయణ్ బోస్ కు.

చంద్రుని నుంచి దశమం మాతామహులను సూచిస్తుంది. అది కన్య అయింది. దానిమీద శనిచంద్రుల దశమదృష్టి ఉంది. ఇది వారి వంశంలో ఉన్న మానసికరోగాన్ని సూచిస్తోంది. వారి వంశాన్ని తుల సూచిస్తుంది. దానిమీద నీచకుజుని చతుర్ధదృష్టి ఉంది. ఇది మంచిది కాదు. కనుక తల్లివైపు నుంచి మనస్సుకు నరాలకు సంబంధించిన బలహీనత అరవిందులకు సరఫరా అయింది.

కృష్ణధన్ ఘోష్ కు అప్పట్లో ఇండియాలో పనిచేస్తున్న బ్రిటిష్ సివిల్ సర్వంట్లు కొందరు స్నేహితులు ఉండేవారు. వారిలా తన పిల్లలు కూడా ఇండియన్ సివిల్ సర్వీస్ పాసై ఉన్నత స్థానాలలో ఉండాలని ఆయన కలలు కనేవాడు. అందుకని తన మొదటి ముగ్గురు పిల్లలనూ చదువుల కోసం ఇంగ్లాండ్ పంపించాడు. ఇండియాలో తనకున్న బ్రిటిష్ స్నేహితులకు తెలిసిన బ్రిటిషువారి సంరక్షణలో ఇంగ్లాండ్ లో వారిని ఉంచాడు. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్, ఫ్రెంచ్, గ్రీక్, లాటిన్, భాషలు నేర్చుకోవడమే గాక, గణితం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం మొదలైనవి చదివారు.

కానీ ఈ ముగ్గురిలో అరవిందులు ఒక్కరే ఇండియన్ సివిల్ సర్వీస్ కి మొగ్గు చూపారు. పెద్దన్నయ్య కు ICS ఇష్టం లేదు. చిన్నన్నయ్య దానికి క్వాలిఫై కాలేదు. అరవిందులు కూడా ICS పరీక్ష పాసయ్యారు, కానీ గుర్రపు స్వారీ పరీక్షకు లేటుగా వచ్చి అబద్దాలు చెప్పినందుకు ఆయనను ఫెయిల్ చేశారు. ఆయన యూరినరీ ఆర్గాన్స్ లో ఏదో లోపం ఉండటం వల్ల ఆ పరీక్ష తప్పారని కూడా పుకార్లున్నాయి. ఈ విషయాన్ని పీటర్ హీస్ తన Lives of Sri Aurobindo అనే పుస్తకంలో వ్రాశారు. దానిమీద పెద్ద గాలిదుమారం రేగింది. ఈ పుస్తకం ఇండియాలో బ్యాన్ అయింది. కానీ నెట్లో దొరుకుతోంది. కావలసిన వారు చదవండి.

అరవిందులు తన 78 వ ఏట కిడ్నీ ఫెయిల్యూర్ తోనే చనిపోయారు. దానికంటే ముందు ఆయనకు ప్రోస్టేట్ గ్రంధి వాపు వచ్చింది. అది కిడ్నీలను పాడు చేసింది. అయితే, ఆయనకు మొదటినుంచీ యూరిన్ సమస్య ఉందా అంటే అనుమానమే. కాకపోతే, చిన్నప్పుడు ఆయనలో యూరినరీ ఆర్గాన్స్ ఎదుగుదల సరిగా ఉందో లేదో మనకు తెలియదు. లేకపోతే, ఆ సమస్య వల్లనే ఆయన ICS పరీక్షలో disqualify అయ్యాడన్న మాట అసలెందుకు వస్తుంది?

సహజరాశి చక్రంలో అష్టమం అయిన వృశ్చికరాశికి అధిపతి అయిన కుజుడు ఈయన జాతకంలో నీచలో ఉంటూ లగ్నంలోకి రావడం, ఈ కోణంలో కొన్ని అనుమానాలకు తావిస్తూనే ఉంది. ఏదేమైనా ఇది అంతగా పరిశీలించవలసిన విషయం కాదు.


అసలు విషయం ఇది కాదని కొందరు పరిశోధకులు అంటారు. అరవిందులు కేంబ్రిడ్జ్ లో చదువుకుంటున్నపుడు అక్కడి Indian Congregation అనే సంస్థతో ఆయన చురుకుగా పనిచేసేవాడు. ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటున్న అనేకమంది విద్యార్ధులు అందులో సభ్యులుగా ఉండేవారు. వారందరూ అక్కడ సమావేశామౌతూ, ఇండియాలో ఉన్న పరిస్థితుల గురించి బ్రిటిష్ వారి నిరంకుశపాలన గురించి చర్చిస్తూ ఉండేవారు. కృష్ణధన్ ఘోష్ ఇండియా నుంచి బెంగాలీ న్యూస్ పేపర్లను పంపిస్తూ ఉండేవాడు. బ్రిటిష్ వారు ఇండియన్స్ మీద ఇండియాలో జరుపుతున్న దౌర్జన్యాలు వాటిల్లో కళ్ళకు కట్టినట్లు వ్రాయబడుతూ ఉండేవి. అవన్నీ చదివిన ఈ విద్యార్ధులు కోపంతో రగిలిపోతూ ఉండేవారు. ఆ కోపాన్ని వ్యక్తీకరిస్తూ వారు అనేక ఉపన్యాసాలు ఈ సమావేశాలలో ఇచ్చేవారు. అరవిందులు కూడా అలాంటి ఉపన్యాసాలు అనేకం ఇచ్చాడు. ఈ విషయాలన్నీ confidential గా తెలుసుకున్న ICS Commissioner అరవిందులు ICS పరీక్ష పాసైనా సరే, అతను anti-British గనుక ఆయన్ను సెలక్ట్ చెయ్యలేదని పరిశోధకుల అభిప్రాయం. ఎందుకంటే, గుర్రపు స్వారీ పరీక్షకు లేటుగా వచ్చాడన్నది ఒక కుంటిసాకు మాత్రమేననీ, అలా వచ్చిన వారిని అనేకమందిని పాస్ చెయ్యడం జరిగిందనీ, పరీక్షలో అంత మంచిర్యాంక్ తెచ్చుకున్న ఒక చురుకైన విద్యార్ధిని ఇంత చిన్న కుంటిసాకుతో ఫెయిల్ చెయ్యడం తెల్లవాళ్ళ పక్షపాతధోరణి మాత్రమేననీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇందులో చాలా నిజం ఉన్నది కూడా !

1879 నుంచి 1893 వరకూ అరవిందులు ఇంగ్లాండ్ లో ఉన్నారు. ICS పరీక్షలో ఆయన తప్పి కూచోడంతో తండ్రిగారైన కృష్ణధన్ ఘోష్ కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ సమయంలో బరోడా మహారాజు సాయాజీరావ్ గయక్వాడ్ ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్నాడు. తెలిసినవారి సిఫారసుతో అరవిండులకు బరోడా రాజుగారి దగ్గర ఉద్యోగం దొరికింది. అందుకని ఆయన ఇండియాకు తిరిగి వచ్చేశాడు.

కానీ ఆ సమయంలో ఒక దురదృష్టకరమైన సన్నివేశం జరిగింది. ఆయన వస్తున్న ఓడ ఫసిఫిక్ సముద్రంలో మునిగిపోయిందని Shipping company ఏజంట్లు కృష్ణధన్ ఘోష్ కు తప్పుడు సమాచారం అందించారు. అప్పుడాయన ఖుల్నాలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా ఉన్నాడు. అది విన్న కృష్ణధన్ ఘోష్, తన కలలన్నీ కల్లలయ్యాయన్న షాక్ తో హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలి చనిపోయాడు.

జాతకంలో సూర్యునినుంచి నవమస్థానాన్ని బట్టి తండ్రిగారి విషయాలు తెలుస్తాయని పరాశరహోర, ఫలదీపిక మొదలైన ప్రామాణిక గ్రందాలంటాయి. అనుభవంలో అయితే, ఇది దశమస్థానంతో కూడా బాగా సరిపోతుంది. ఎందుకంటే, నా పద్ధతిలో నవమస్థానం కంటే, దశమస్థానమే తండ్రిగారిని ఎక్కువగా సూచిస్తుంది. సాయనవిధానంలో కూడా దశమమే తండ్రిస్థానం.

ఈ కోణంలో చూచినప్పుడు, సూర్యుడున్న సింహం నుంచి, దశమమైన వృషభంలో ఉచ్చరాహువున్నాడు. కనుక కొన్నేళ్ళు తండ్రిగారి జీవితం అంతా బాగానే జరిగింది. కానీ వక్రశని వృశ్చికంలోకి వచ్చి రాహువును చూస్తున్నాడు. ఇది శపితయోగం అనబడుతుంది. కనుక చివరకు తండ్రిగారి జీవితం నిరాశతో ముగుస్తుందని విషాదాంతం అవుతుందని తెలుస్తున్నది. ఖచ్చితంగా అదే జరిగింది !


ఇదే ట్రెండ్ ను అరవిందుల జాతకంలో కూడా చూడవచ్చు. తన సాధన ఫలించలేదన్న నిరాశతోనే ఆయన చివరకు చనిపోయాడు. నిరాశతో చనిపోవడం అనే విషయంలో అరవిందులలో ఆయన తండ్రిగారి పోలిక కనిపిస్తుంది. కొంచం కాకపోతే, కొంచంగానైనా, ఉన్నవీ లేనివీ ఊహించుకుని (ఉదాహరణకు పాండిచేరిలో కూచున ఉన్న తను, మీరారిచర్డ్ అనబడే మదర్ ఇద్దరూ కలసి మొదటి ప్రపంచయుద్ధపు తీరునూ, ముగింపునూ నిర్దేశించామని భావించడం) అవే నిజాలని అనుకోవడంలో తల్లిగారి పిచ్చిపోకడ గోచరిస్తుంది. ఈ విధంగా తల్లిదండ్రుల పోకడలు పిల్లలలో కనిపిస్తాయి.

ఆ విధంగా, అరవిందులు బొంబాయిలో అడుగు మోపేసరికి తండ్రిగారు గతించారు. ఆయన జీవితం గొప్పదిగా మొదలైనా, చివరకు నిరాశలో ముగిసింది. దానికి కారణం భార్య స్వర్ణలతగారి జాతకమూ దానినుంచి ఈయనకు సోకిన శపితయోగమూ  అని నా అభిప్రాయం.

ఆమెకు మొదటి కాన్పులోనే పిచ్చి మొదలైంది. అదే పిచ్చి అరవిందులకు కూడా కొంచం సోకిందని ఆయన శిష్యులు కొందరు అభిప్రాయపడ్డారు. ఒకానొక సమయంలో ఎవరో ఏదో చిన్న తప్పు చేస్తే, దానికి అతన్ని అరవిందులు తిట్టిన తీరు చూస్తే కొంచం 'అతిగా' అనిపించిందని, అంత చిన్న విషయానికి అంతగా రియాక్ట్ కావలసిన పని లేదని, వారు వ్రాశారు. కనుక తల్లినుంచి కొంచం పిచ్చిధోరణి అరవిందులకు సోకి ఉండవచ్చు. ఆయన జాతకంలో ఈ పోకడ కనిపిస్తున్నది కూడా. పిచ్చంటే పిచ్చే కానక్కరలేదు, కొంచం eccentric behaviour కూడా ఒక రకమైన పిచ్చిలక్షణమే. అదేవిధంగా గంటలుగంటలు కళ్ళుమూసుకుని కూచోవడమూ, రోజులు నెలలు సంవత్సరాల తరబడి ఒక గదిలో ఉంటూ బయటకు రాకుండా ఉండటమూ కూడా దాదాపుగా అవే లక్షణాలు. యోగులకూ పిచ్చివారికీ కొన్ని లక్షణాలు సమానంగానే ఉంటాయి. వీరిద్దరూ నార్మల్ మనుషులు కారు. కనుక వీరిలో ఉండే abnormal లక్షణాలు, ముఖ్యంగా, బయటనుంచి చూచేవారికి ఒకేరకంగా కనిపిస్తాయి.

మనస్సును సూచించే చంద్రుడు లగ్నాదిపతిగా ఉంటూ, రోగాలను సూచించే అరవ ఇంట్లో, దీర్ఘరోగాలను సూచించే అష్టమాదిపతి అయిన వక్రశనితొ కలసి ఉండటమూ, రోగాదిపతి అయిన గురువు ఉచ్చస్థితిలో లగ్నంలోకొచ్చి ఉండటమూ నా భావాన్ని బలపరుస్తున్నాయి.

చంద్రుని నుంచి నాలుగో ఇల్లు తల్లిగారిని సూచిస్తుందని ప్రాచీన జ్యోతిష్య గ్రందాలంటాయి. అరవిందుల జాతకంలో, ధనుస్సు నుంచి నాలుగో ఇల్లు మీనం అయింది. దానిపైన ఉచ్చ కేతువు దృష్టి ఉంది. అంతేగాక, దాని అధిపతి అయిన గురువు చంద్రాత్ అష్టమంలో నీచకుజునితో కలసి ఉండటమూ, ఆ కుజునికి పంచమ ద్వాదశాదిపత్యాలు పట్టి ఉండటమూ చూస్తే, తల్లికి మానసిక అనారోగ్యం తీవ్రంగా ఉందని, అంతేగాక ఆమెకు శాపం ఉందనీ తెలుస్తున్నది. ఇదే పోకడ అరవిందులకు కూడా తల్లినుంచి సోకి ఉంటుంది.

పీటర్ హీస్ కూడా ఇదే మాటను వ్రాసీ వ్రాయనట్లు సూచనాప్రాయంగా వ్రాశాడు. దానిమీద అరవిందుల భక్తులు మండిపడి గందరగోళం చేశారు. దీనిమీద ఒరిస్సాలో కోర్టు కేసులయ్యాయి. ఇదంతా 2010 ప్రాంతంలో Lives of Sri Aurobindo పుస్తకం విడుదలయ్యాక జరిగింది.

కానీ అరవిందుల జాతకంలో ఎక్కడైతే నీచకుజుని దృష్టి సోకిందో అక్కడే ఉచ్చగురువు దృష్టి కూడా సోకింది. అందుకే, మొదట్లో చెడు చేసిన యోగాలు చివరకు ఆధ్యాత్మిక పరంగా మంచియోగాలుగా మారాయి. తల్లిగారి పూర్వీకుల నుండి వచ్చిన మానసికవైకల్యం అనేది ఈయనలో యోగసాధనాపరంగా మారి, ఉన్నతమైన భూమికలను ఈయనకు అందించింది.

(ఇంకా ఉంది)
read more " Chart of Sri Aurobindo - Astro analysis - 3 (తల్లిదండ్రులు - కుటుంబం) "

18, ఫిబ్రవరి 2020, మంగళవారం

Astro - Homoeo Retreat - Feb 2020






















































ఈ సంవత్సరానికి మొదటి జ్యోతిష్య - హోమియో సమ్మేళనం 16th Feb 2020 న హైదరాబాద్ లో జరిగింది. దీనికి పంచవటి సభ్యులు నలభైమంది హాజరయ్యారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరువరకూ ఏకధాటిగా ఈ కార్యక్రమం జరిగింది.

9 నుంచి మధ్యాన్నం రెండువరకూ జరిగిన జ్యోతిష్యసమ్మేళనంలో మొదటి రెండుగంటలు జ్యోతిష్యశాస్త్ర పునాదులను మళ్ళీ ఒకసారి త్వరగా నేర్పించాను. ఇంతకుముందు మేము చేసిన Astro workshops లో అవన్నీ చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పవలసినది గనుక ఒకసారి మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి నేర్పించాను. కానీ, సోది లేకుండా, నా పద్ధతిలో విశ్లేషణ ఎలా చెయ్యాలో, దానికి ఏయే ప్రాధమిక అంశాలు అవసరమో అంతవరకే నేర్పించాను. దానికే మొదటి రెండు గంటలు పట్టింది.

2000 సంవత్సరంలో తెలుగువిశ్వవిద్యాయం నుంచి నేను జ్యోతిష్యం MA చేశాను. అంటే నేటికి 20 ఏళ్లయింది. అంతకు ముందు 5 ఏళ్ళనుంచీ నేను జ్యోతిష్యం నేర్చుకుంటూనే ఉన్నాను. అయితే, ఈ  కోర్సుకు అది మొదటి బ్యాచ్. అప్పటినుంచీ నేను చేస్తున్న రీసెర్చి వల్ల అనేక కొత్త టెక్నిక్స్ దానిలో కనుక్కున్నాను. ఇవి పుస్తకాలలో ఎక్కడా మీకు దొరకవు. ఆ టెక్నిక్స్ ను నా శిష్యులకు నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఈ రిట్రీట్స్ పెడుతున్నాను. అంటే, నా 25 ఏళ్ళ పరిశోధనా ఫలితాలను వారికి పంచిపెడుతున్నాను.

11 గంటలనుంచి 2 గంటలవరకూ, జ్యోతిష్యశాస్త్రంలో నేను ఉపయోగించే కిటుకులు, సూత్రాలను కొన్నింటిని వారికి నేర్పించడమే గాక, కొన్ని జాతకాలను వారిచేతనే విశ్లేషణ చేయించాను. మిగతా సూత్రాలను తరువాత జరిగే సమ్మేళనాలలో వివరిస్తాను.

జ్యోతిష్యం కోసం మేమిన్నాళ్ళు "జగన్నాధహోర" ఫ్రీ సాఫ్ట్ వేర్ వాడుతున్నాము. అందులో మాకు కావలసిన దానికంటే చాలా ఎక్కువ లెక్కడొక్కలు ఉన్నాయి. అన్ని మాకు అవసరం లేదు. మాది చాలా simple and straight approach. కనుక మాదంటూ ఒక జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ను మేమే డెవలప్ చేస్తున్నాము. త్వరలో మా "పంచవటి" సంస్థ నుంచి దానిని విడుదల చెయ్యడం జరుగుతుంది. అది Windows, Mac, Mobile అన్ని ప్లాట్ ఫాం ల మీదా పనిచేస్తుంది. ఆ విధంగా దానిని తయారు చేస్తున్నాము. దానిపేరు Satya Jyotish (SJ) అని నిర్ణయించడం జరిగింది. 

చివరగా వారికొక విషయం చెప్పాను.

"డబ్బుకోసం జ్యోతిష్యశాస్త్రాన్ని ఎప్పుడూ వాడకండి. దురాశకు లోనుకాకండి. దీనిని ఎగతాళిగా, సరదాగా తీసుకోకండి. ఇది చాలా పవర్ ఫుల్ సైన్స్. జాగ్రత్తగా దీనిని డీల్ చెయ్యకపోతే, మీ చేతులు కాలిపోతాయి. నా సాధనామార్గంలో నడిస్తేనే మీరు దీనిని సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతారు, చెయ్యగలుగుతారు. Ordinary astrology ని వదలి, Spiritual astrology ని అర్ధం చేసుకోండి. మీమీ జీవితాలలో అన్వయించుకోండి. ఆచరించండి. మీమీ కుటుంబాలను బాగు చేసుకోండి, మీమీ ఆరోగ్యాలను బాగు చేసుకోండి. నేను చూపుతున్న ఆధ్యాత్మికమార్గంలో నడచి, సాధనామార్గంలో ఎదగండి. లోకంలో ఉన్న అజ్ఞానపు చీకట్లను పోగొట్టే దీపాలుగా మారండి" అని నా శిష్యులకు చెప్పాను.

ఈ విధంగా ఉదయంపూట జ్యోతిషశాస్త్ర సమ్మేళనం ముగిసింది.

లంచ్ తరువాత జరిగిన హోమియో సమ్మేళనంలో  ఈ క్రింది విషయాలను వారికి వివరించాను.

1. హోమియోపతి ఎలా పుట్టింది? దాని ప్రాముఖ్యత ఏమిటి? డా || హన్నేమాన్ జీవితం. 
2. రోగం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? ఎలా వస్తుంది ?
3. ప్రాణశక్తి అంటే ఏంటి? రోగాన్ని అది ఎలా నయం చేస్తుంది?
4. పొటెన్సీ  అంటే ఏమిటి? అందులో ఎన్ని స్కేల్స్ ఉన్నాయి? వాటినిఎలా తయారు చేస్తారు? వాటిని ఎలా ఎప్పుడు వాడాలి? 
5. హోమియోపతిలో - Plant, Mineral, Animal, Poisonous, Disease products - ఇలా ఎన్ని రకాలైన ఔషధాలున్నాయి? అవి ఎలా పని చేస్తాయి ? వేటిని ఎప్పుడు వాడాలి?
6. ఇంగ్లీషు వైద్యానికి హోమియో వైద్యానికి ఉన్న తేడాలేమిటి? రోగం తగ్గడం అంటే ఏమిటి? దానికి మనమేమేం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?
7. ఎక్యూట్ మరియు క్రానిక్ రోగాలలో హోమియో మందులు ఎలా వాడాలి? పోటేన్సీలు ఎలా వాడాలి? రిపీట్ ఎలా చెయ్యాలి?

ఆ తర్వాత, మా అమ్మాయి డా || శ్రీభార్గవి MD (Homoeo), హోమియోపతి మీద క్లాసు తీసుకుంది. దానిలో First Aid Remedies - Homoeopathy గురించి దాదాపు 20 రకాలైన ఔషధాలను వివరిస్తూ, నిత్యజీవితంలో ప్రతివారికీ వచ్చే అనేక బాధలకు ఆ మందులను ఎలా వాడాలో తను చక్కగా వివరించింది.

ఆధ్యాత్మికం అనేది మా జీవితాలలో అన్ని విషయాలలోనూ అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది గనుక - జ్యోతిష్యాన్ని, హోమియోపతిని కూడా ఆధ్యాత్మికసాధనతో మేళవిస్తూ, నిత్యజీవితంలో వాటిని ఎలా ఉపయోగించుకోవాలో  చెప్పడం జరిగింది.

ఇన్నేళ్ళుగా నేను రిట్రీట్స్  జరుపుతూ ఉన్నప్పటికీ Advanced level లో Subject ను చెప్పడం ఇదే మొదటిసారి. ఏడాదికి కనీసం నాలుగు రిట్రీట్స్ ఇకపైన జరపాలన్న సంకల్పాన్ని అందరూ వ్యక్తం చేశారు. అలాగే చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఈ పునాదులనుంచి మొదలుపెట్టి, ముందుముందు క్లాసులలో ఈ సైన్సులలోని Advanced topics కూలంకషంగా నేర్పించడం జరుగుతుంది.

ప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసులు T.P. Chakrapani గారు, వారి శిష్యురాలు కుమారి నవ్య గార్ల సాంప్రదాయ కీర్తనలతో సమావేశం జయప్రదంగా ముగిసింది.

జ్యోతిష్యశాస్త్రం, హోమియోపతి, ఆధ్యాత్మికసాధనల గురించి ఎన్నో క్రొత్త విషయాలను, ఇంకెన్నో క్రొత్త Insights ను మనసులలో నింపుకుని, "మళ్ళీ త్వరలో అందరం కలుసుకుందాం" అన్న మంచిసంకల్పంతో అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు.
read more " Astro - Homoeo Retreat - Feb 2020 "