“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జనవరి 2021, శుక్రవారం

మదనపల్లి మర్డర్స్ - లోకం నేర్చుకోవాల్సింది ఏమిటి?

మదనపల్లి మర్డర్స్ నుంచి లోకం నేర్చుకోవాల్సింది ఏమిటి?

అసలెందుకు నేర్చుకోవాలి? అనుకోకండి. నేటి సమాజంలో, పొద్దున్న లేచిన దగ్గరనుండి, వారికిష్టమున్నా లేకున్నా, పిల్లలు పెద్దలు అనేక ప్రభావాలకు లోనైపోతున్నారు. ఈరోజున వీరికిలా జరిగింది. రేపు ఇంకోచోట ఇంకొకరికి ఇంకొకలా జరగొచ్చు. కనుక వీటినుంచి నేర్చుకోవాలి. జాగ్రత్తపడాలి.

ఈ క్రింది విషయాలను గమనించండి.

1. టీవీలలో, యూట్యూబులలో చూచి, పుస్తకాలు చదివి. ఎవరిని బడితే వారిని గురువుగా నమ్మకండి. స్వీకరించకండి.

2. పుస్తకాలు చదివి సాధనలు చెయ్యకండి. అవి నెర్వస్ సిస్టం ను దెబ్బతీస్తాయి. సరియైన గురువు పర్యవేక్షణ లేకుండా ప్రాణాయామాలు, ధ్యానాలు చేస్తే పిచ్చెక్కుతుందని పదేళ్లనుంచీ నేను చెబుతున్నాను.

3. డబ్బులు గుంజే జ్యోతిష్కులను, పూజారులను నమ్మకండి. హోమాలు చేయిస్తామని, పనులు అవుతాయని చెప్పేవారిని ఆమడదూరం ఉంచండి. 

4. యూట్యూబు చూచి సమస్యలకు పరిష్కారాలు వెదకకండి. మాకు తెలిసిన ఒకమ్మాయి ఇలా చేసింది. భర్త ఉరిపోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే, వాళ్ళనీ వీళ్ళనీ పిలిచి ముందు సీలింగ్ నుంచి అతన్ని దించాల్సింది పోయి, తీరిగ్గా యూట్యూబ్ ఓపెన్ చేసి 'How to save a hanging person?' అని వెదికింది.

ఇంకొంతమంది how to meditate, how to rise Kundalini, మొదలైన సెర్చ్ లు చేసి అక్కడ కనిపించిన వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైన పనులని తెలుసుకోండి. ఆ అభ్యాసాల వల్ల నెర్వస్ సిస్టం డామేజ్ అవుతుంది. పిచ్చెక్కుతుంది. తర్వాత ఏమనుకున్నా ఉపయోగం ఉండదు.

5. ఒక శుద్ధమైన గురువును ఎంచుకుని అతన్ని త్రికరణశుద్ధిగా అనురించండి. అంతేగాని, అనేక పడవలమీద ఒకేసారి ప్రయాణం చెయ్యకండి. అన్నిటికీ చెడిపోతారు.

6.  నిజమైన ఆధ్యాత్మికతనేది మనిషిని హింసకు దూరంగా తీసుకుపోతుంది. మూఢనమ్మకాలకు దూరంగా తీసుకుపోతుంది. ద్వేషానికి దూరం చేస్తుంది. అలాకాకుండా, హింస, ద్వేషం, అహంభావం, మూఢనమ్మకాలు ఒకమనిషిలో ఎక్కువౌతుంటే అది అసలైన ఆధ్యాత్మికత కాదని తెలుసుకోండి.

7. మతాలు మారమని చేసే ప్రచారాలకు లోబడకండి. ఎవరూ ఏ మతమూ  మారక్కరలేదు. ఉన్నదాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని ఆచరిస్తే చాలు.

8. పూజలలో, తంతులలో, ప్రార్థనలలో ఆధ్యాత్మికత ఉంది. కానీ అది ఎల్కేజీ లెవల్ ఆధ్యాత్మికత  మాత్రమే. అంతకంటే గొప్పది నిత్యజీవితంలో ఆధ్యాత్మికత.  అది నీ జీవితంలో అనుక్షణం ప్రతిఫలించాలి. నీ కుటుంబంతో, స్నేహితులతో, నీ చుట్టూ ఉన్నవారితో నువ్వు ప్రవర్తించే తీరులో అది కనిపించాలి గాని  ఉత్త పూజామందిరానికే పరిమితం కాకూడదు.

9. వర్చువల్ వరల్డ్ నుంచి బయటకొచ్చి రియల్ వరల్డ్ ఎలా ఉందో చూడండి. ఎంతసేపూ మొబైల్, కంప్యూటర్, టీవీ ఇవే జీవితం కాదు. అదొక పెద్ద భ్రమ.  వాటి అవసరం ఎంతవరకో అంతవరకే. వాటికి బానిసలు కాకండి.

10. పిల్లలు ఏం చేస్తున్నారో, ఎటు పోతున్నారో గమనిస్తూ ఉండండి. ఏదైనా చెడుదారి పడుతుంటే, మొదట్లోనే దారిమళ్లించండి. లేకపోతే కొంతకాలం తర్వాత అది అసాధ్యం కావచ్చు.

11. మీలోగాని మీ పిల్లలలో గాని మీ కుటుంబసభ్యులతో గాని - 'మేం చాలా గొప్పవాళ్ళం, ఉన్నతులం, ఆధ్యాత్మికులం, మిగతా అందరూ  అజ్ఞానులు,ఏమీ తెలియనివాళ్ళు, వాళ్లకు మనం చెబుదాం, నేర్పిద్దాం, ఉద్ధరిద్దాం' - ఇలాంటి పోకడలు కన్పిస్తుంటే, వెంటనే మానసికవైద్యులను కలసి మందులు వాడండి. ఇది పిచ్చిలో ఒక రకమైన 'రెలిజియస్ మానియా' అని గ్రహించండి.

12. ఆత్మలు, పునర్జన్మలు, శక్తులు, మంత్రాలు, తాయెత్తులు, హోమాలు, దయ్యాలు, భూతాలు, ప్రార్థనలతో రోగాలు తగ్గించడాలు, సైతాన్ని వదిలించడాలు మొదలైన వాటి జోలికి పోకండి. వీటివల్ల మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అలాంటివారికి, వాళ్ళు ఏమతం వారైనా సరే, దూరం ఉండండి.

పై విషయాలను పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, జీవితాలు  నాశనం కాకుండా జాగ్రత్తపడవచ్చు.

కానీ, చెప్పడంవరకూ చెప్తాము. ఎవరు వింటారు? ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? లోకంలో ఎవరి ఖర్మ వారిది. మంచి చెబితే ఎవరూ వినరు. అనుభవిస్తున్నపుడు మాత్రం గొల్లుమని ఏడుస్తారు. ఈ లోకం ఇంతే !
read more " మదనపల్లి మర్డర్స్ - లోకం నేర్చుకోవాల్సింది ఏమిటి? "

26, జనవరి 2021, మంగళవారం

మదనపల్లి జంట హత్యలు - ఇదా హిందూధర్మం?

పౌర్ణమి ఛాయ !

ఆదివారం సాయంత్రం మదనపల్లిలో, ఎదిగిన తన ఇద్దరు కూతుళ్ళని, తల్లే హత్య చేసిందిట. తండ్రి చూస్తూ ఉన్నాట్ట. ఆ చంపడం కూడా ఒకమ్మాయిని శూలంతో పొడిచి, ఇంకొకమ్మాయిని డంబెల్ లో కొట్టి చంపేసిందట ఆ తల్లి. 

ఆమెకి పిచ్చెక్కిందో? లేక దయ్యం పట్టిందో?  అమ్మాయిలకు 27, 22 ఏళ్ళు. ఇద్దరూ బాగా చదువుకుంటున్నవాళ్ళే. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయవృత్తిలో పిల్లలకు పాఠాలు చెబుతున్న వాళ్ళే. తండ్రయితే ఏకంగా ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అట. ఇదేంటో మరి !

ఇంట్లో వాతావరణం చూస్తే క్షుద్రపూజలు చేస్తున్నట్లుగా ఉందని పోలీసులన్నారు. తల్లిదండ్రుల కొలీగ్సు, చుట్టుపక్కలవాళ్ళు మాత్రం ఈ కుటుంబం మంచిదని, గొడవలకు పోరని, చదువుకున్న వారని మంచిగానే చెబుతున్నారు. తల్లీ తండ్రీ ఎంతో బాలెన్స్ గా ఉంటారని, అందరికీ సలహాలిస్తారని కూడా చెబుతున్నారు.

అయితే, వీళ్ళకు మతపిచ్చి ఉందని కొంతమంది యూట్యూబ్ లో అంటున్నారు. వీళ్ళు షిరిడీ సాయిబాబా భక్తులట. తరచూ షిరిడీ వెళ్తారట. మెహర్ బాబా, ఓషో పుస్తకాలు చదువుతారట. జగ్గీ వాసుదేవ్ కి వీరభక్తులట. ఇదంతా కొలీగ్స్ చెబుతున్నారు.

అంతేకాదు, మూడ్రోజులుగా బయటి మనుషులెవరో వచ్చి రాత్రీపగళ్ళూ పూజలు చేస్తున్నారట. నగ్నపూజలు కూడా చేశారట. 'మా అమ్మాయిలను కదిలించకండి. వాళ్ళు రేపు బ్రతుకుతారు. ఈ రోజు రాత్రితో కలియుగం అయిపోతుంది. రేపట్నించీ సత్యయుగం వస్తుంది. అది రాగానే వాళ్ళు బ్రతుకుతారు. చంపమని మాకు దేవుడు చెప్పాడు' ఈ విధంగా పిచ్చిపిచ్చిగా ఆ తల్లీతండ్రీ మాట్లాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

'మీరెందుకు మధ్యలో వచ్చి ప్రాసెస్ చెడగొట్టారు?  మీరు మధ్యలో రాబట్టే మా కూతుళ్లు బ్రతకలేదు. ఈ ఒక్కరోజు శవాలని కదల్చకుండా అలాగే ఉంచండి. వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు' అని పద్మజ (తల్లి), పోలీసు అధికారులతో వాదిస్తున్న వీడియో చూస్తే ఏమనిపిస్తోంది? హిస్టీరియా పరాకాష్ట కనిపించడం లేదూ?

సరే, పోలీస్ విచారణ జరుగుతోంది గనుక, నిజానిజాలు బయటపడతాయని ఆశిద్దాం. ప్రస్తుతానికి మతకోణం ఏముందో కొంచం చూద్దాం.

సమాజంలో ఎక్కడచూచినా, దొంగజ్యోతిష్కులు, సిద్ధాంతులు, దొంగ స్వామీజీలు, దొంగ గురువులు సందుకొకడు, గొందికొకడు తయారయ్యారు. ఏదేదో చెప్పి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. విద్యావంతులై, ఉపాధ్యాయులైన వీళ్ళే ఇన్ని మూఢనమ్మకాలతో కూరుకుపోతే, ఇక పల్లెటూరి ప్రజలు ఎంత ఆటబొమ్మలైపోతారో ఆలోచించండి.

ఇది అసలైన హిందూమతం కాదు, కాదు, కాదు.

షిరిడీసాయి భక్తులలో స్వార్ధం పాళ్ళు చాలా ఎక్కువని, వాళ్ళు చాలా చవకబారుగా ఉంటారని, అహంకారులని,  నేను పదేళ్లనుంచీ చెబుతున్నాను. నా చిన్నప్పటినుంచీ నేను గమనిస్తూ వస్తున్న నిజం ఇది. మొక్కులు మొక్కుకోవడం, కోరికలు కోరుకోవడం, తేరగా పనులు కావడం, అప్పనంగా వరాలు రావడమే వీరికి ప్రధానంగాని, అసలైన ఆధ్యాత్మికత వీరికి తెలియదు. సాయిబాబాను నేనేమీ అనడం లేదు. ఆయన్ను అలా తయారుచేసి కూచోబెట్టిన దొంగగురువులను దొంగభక్తులను అంటున్నాను.

వీళ్ళు మెహర్ బాబా ఆశ్రమానికి వెళ్ళొచ్చామని చెప్పుకోవడం సిగ్గుమాలిన పని. ఆయనది శుద్ధమైన ప్రేమతత్వం. ఆచారాలు, పూజలు వీటిని ఆయన ఒప్పుకోలేదు. శుద్ధమైన భగవత్ప్రేమకు ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. సాటిమనిషిలో, జంతువులలో, పక్షులలో, అన్ని జీవులలో దైవాన్ని చూస్తూ వాటిని ప్రేమిస్తూ సేవచెయ్యమని ఆయన బోధించాడు. Mastery in Servitude అన్నది ఆయన సిద్ధాంతం. వీళ్ళు మెహర్ బాబా భక్తులా? ఆయన పేరును ఉఛ్చరించడానికి కూడా వీరికి అర్హత లేదు.

ఓషో పుస్తకాలను కూడా వీళ్ళు బాగా చదువుతారని కొందరంటున్నారు. ఓషోను అనుసరించేవారిలో నిజంగా ఆధ్యాత్మికంగా ఎదిగినవారిని ఒక్కరంటే ఒక్కరిని గత నలభై ఏళ్లలో నేను చూడలేదు.  నా దృష్టిలో ఓషో ఒక కంప్లీట్ ఫెయిల్యూర్. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈయన వల్ల జరిగిన నష్టం ఇంతాఅంతా కాదు. ఈయన తానూ బాగుపడలేదు. తనను నమ్మినవారినీ ఉద్ధరించలేదు. రెంటికి చెడ్డ రేవడి అంటే ఈయనే.

ఇకపోతే మిగిలింది ఓషోకి కాపీక్యాట్ అయిన జగ్గీ వాసుదేవ్. లోకంలోని ప్రతి విషయంపైనా మంచి ఇంగిలీషులో లాజికల్గా మాట్లాడతాడని ఈయనకు పేరుంది. కానీ ఆయనైనా సరే, ఇలాంటి క్షుద్రపూజలను, హింసను ఒప్పుకుంటాడంటే నేను నమ్మలేను. ఆయనే కాదు, నిజమైన ఏ గురువూ ఇవి ఒప్పుకోడు. బోధించడు. ఇలాంటివి బోధిస్తే వాడసలు గురువే కాదు. కానీ ఈయన శిష్యులలో ఇలాంటి పోకడలు కొన్నున్నాయి. వాటిని నేను చూచాను.

మా మిత్రులలో ఈయన వీరశిష్యులు కొంతమందున్నారు. వారిలో ఒకరింటికి గతంలో నేను వెళ్లాను. ఆయన ఇచ్చిన 'లింగభైరవి' అనే ఒక విగ్రహాన్ని వాళ్ళింట్లో చూచాను. అదొక గ్రానైట్ బండలో చెక్కబడిన యంత్రం+విగ్రహం. చాలా బరువుంది. అప్పట్లోనే దాని వెల 5 లక్షలని చెప్పారు. లారీలో దానిని ఆయన ఛిష్యులే తెచ్చి వీళ్ళింట్లో దించి ప్రతిష్టించి వెళ్లారట. దానికి నన్ను నమస్కారం చెయ్యమన్నారు. నాకేమీ ఆ వైబ్రేషన్స్ రుచించలేదు. అందుకని నేను నమస్కారం  చెయ్యలేదు.

'మీకు కుండలిని లేచిందా?' అని ఆ మిత్రుడు నన్నడిగాడు.

'లేచి మళ్ళీ పడుకుంది' అని సీరియస్ గా సమాధానం చెప్పాను.

'అదేంటి? మా గురువుగారు నెత్తిన చెయ్యి పెడితే కుండలిని వెంటనే లేస్తుంది. ఇక పడుకోదు' అని మిత్రుడన్నాడు.

'అలా అయితే చాలా కష్టం కదా ! మరి దానిని పడుకోబెట్టాలంటే ఏం చెయ్యాలి?' అనడిగాను.

'అందుకే 'లింగభైరవి' విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తుంటే లేచిన కుండలిని మళ్ళీ పడుకుంటుంది' అన్నాడు మిత్రుడు.

'నా దగ్గర అన్ని డబ్బుల్లేవు. 5 లక్షలిచ్చి గ్రానైట్ బండను కొనుక్కునేంత స్తోమత నాకొద్దు. అసలు దాన్ని లేపడం ఎందుకు? మళ్ళీ పడుకోబెట్టడం ఎందుకు?' అని నేనడిగాను.

'లేకపోతే మీకు మోక్షం రాదు కదా' అన్నాడు మిత్రుడు.

'ఏం రాకపోతే? అలా డబ్బులిచ్చి కొనుక్కునే మోక్షం నాకొద్దులే' అని నేను జవాబిచ్చాను. అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెప్పినా వినేటట్లు ఆ మిత్రుడు లేడు. ఏదో పూనకంలో ఉన్నట్లు మాట్లాడాడు. నేనూ వదిలేశాను.

ఆ ప్రహసనం అంతటితో ముగిసింది. ఇలాంటి పోకడలు ఈయన శిష్యులలో కొన్ని ఉన్నాయన్నది నిజమే.

అప్పుడు, జిల్లెళ్ళమూడి అమ్మగారి జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది.

ఒక బుద్ధిలేని పెద్దమనిషి అమ్మను ఇలా అడిగాడు.

'అమ్మా ! మీకు కుండలిని నిద్ర లేచిందా?'

దానికి అమ్మ చమత్కారంగా ఇలా అన్నారు.

'నీకు నిద్రలేస్తే ఈ ప్రశ్నను నువ్వడగవు'

ఆ ప్రబుద్ధుడికి  అమ్మమాట అర్ధం కాలేదని వేరే చెప్పనవసరం లేదుకదా !

'నీకు యవ్వనం వచ్చిందా?' అని ఒకరిని అడగవలసిన అవసరముందా? మనకు కళ్ళు సరిగ్గా ఉంటే, మనకే కన్పిస్తుంది ఎదుటిమనిషికి యవ్వనం వచ్చిందో లేదో. అడుగుతున్నామంటే మనకు కళ్ళు కనపడటం లేదని అర్ధం. అలా ఉంటుంది వీళ్ళ గోల!

ఏదేమైనప్పటికీ మదనపల్లి సంఘటన చాలా బాధాకరం. ఇది పిచ్చి, మానసికరోగాలు, క్షుద్రపూజల ప్రభావమేనా? లేక ఇందులో ఆస్తి తగాదాలు, పరువుహత్య మొదలైన ఇతర కోణాలున్నాయేమో పోలీసులు తేలుస్తారు.

కానీ తల్లిని చూస్తే పిచ్చిదానిలాగే  ఉన్నది. ఆమె తండ్రి కూడా ఈ మధ్యనే మానసికరోగంతో చనిపోయాడట. ఆమె మేనత్తకో ఎవరికో ఇదే మానసికపరిస్థితి ఉన్నదట. ఈమె ముఖమూ, వాగుడూ చూస్తే మెంటల్లీ రిటార్డెడ్ లాగా కనిపిస్తోంది. పిచ్చికి తోడు భక్తిపిచ్చి ముదిరిందన్నమాట.

మనం చాలామందిని చూస్తూ ఉంటాం. 'నాకు అమ్మవారు కనిపించారు. నాకు ఇలా జరుగుతుందని ముందే చెప్పారు. నాకు శివుడు కలలో దర్శనమిచ్చాడు. ఒళ్ళంతా బురదపూసుకుని మట్టిలో దొర్లమన్నాడు. నువ్విది చెయ్యి నీకు మంచి జరుగుతుంది. అది చెయ్యి నీకు పెళ్లవుతుంది. పిల్లలు పుడతారు' - ఇలాంటి సొల్లు చెప్పేవాళ్ళు చాలామంది మన సొసైటీలో ఉన్నారు. వీళ్లంతా సైకియాట్రీ వార్డుల్లో ఉండాల్సిన పిచ్చోళ్ళు, హిస్టీరియా పేషంట్లు. ఈ పోకడ పిచ్చిలో మొదటిస్టేజి. ముందుముందు ఇలాంటివాళ్లకు ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది.

చాలామంది నాలుగు  పుస్తకాలు చదివేసి అదే ఆధ్యాత్మికం అనుకుంటారు. అదొక పిచ్చి భ్రమ. పుస్తకాలు చదివితే ఆధ్యాత్మికం రాదు. పూజలు చేస్తే రాదు. అదొక దారి. ఆ దారిలో త్రికరణశుద్ధిగా నడవాలి. ఆ పనిని నూటికో కోటికో ఒకరు మాత్రమే చేయగలుగుతారు. మిగతా అందరూ పుస్తకాలు చదువుతూ, పూజలు చేసుకుంటూ, ఎవరెవరో గురువులను ఫాలో అవుతూ, ఎదుటివారికి మాటలు చెబుతూ, అదే ఆధ్యాత్మికమన్న భ్రమల్లో కూరుకుపోయి ఉంటారు. అది సత్యమైన ఆధ్యాత్మికమార్గం కాదు.

సామాన్యంగా, అమాయకులు, పిచ్చివాళ్ళు, మంచివాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంలోకి అడుగుపెడతారు. మోసగాళ్లు, దుర్మార్గులు ఇందులోకి రాలేరు. వచ్చినా ఎక్కువరోజులు ఉండలేరు. పై కేటగిరీ లో, పిచ్చివాళ్లను నార్మల్ మనుషులుగా మార్చవలసిన పని ఆ గురువుకు ఉంటుంది. ఆ గురువే మోసగాడైతే, వీళ్ళను పట్టించుకోడు. ఆ కుహనా ఆధ్యాత్మిక పిచ్చిలో పడి ఈ పిచ్చివాళ్ళు మరీ పిచ్చివాళ్లవుతారు. అప్పుడు వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలీకుండా పోతుంది. అదే ఈమె కేసులో, ఈమె కుటుంబం కేసులో జరిగింది.

ఒకమనిషి ఎప్పుడూకూడా తలుపులేసుకుని రోజుల తరబడి ఒంటరిగా ఉండకూడదు. మనుషులలో కలుస్తూ తిరుగుతూ ఉండాలి. హెల్తీ కంపెనీ ఉండాలి. లేకపోతే ఇలాగే పిచ్చి ముదురుతుంది. చాలామంది డిప్రెషన్లో పడి, ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ధ్యానశక్తి ఉన్న యోగులు మాత్రమే నెలలతరబడి ఒంటరిగా ఉన్నప్పటికీ శారీరక, మానసిక సమతుల్యతతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మామూలు మనుషులు అలా ఉండలేరు. వాళ్లకు పిచ్చెక్కుతుంది. కరోనా వచ్చి ఇదే విధంగా చాలామందిని పిచ్చోళ్లను చేసిందన్నది నిజం. లాక్ డౌన్ ఎఫెక్ట్ కూడా ఇందులో ఉంది.

మంగోలిజం, OCD, ADHD, Autism మొదలైన రోగాలు జన్యువులలో పిల్లలకు కూడా వస్తాయి. పుట్టుకతోనే అందరికీ రాకపోవచ్చు. కొన్నాళ్ళు పోయాక, సరియైన పరిస్థితులు వచ్చినపుడు అవి బయటపడతాయి. అదే విధంగా ఈమె కూతుళ్ళకు కూడా మానసికపరిస్థితి సరిగ్గా లేదు. ఉంటె, అలాంటి అనవసరమైన భయాలు, పిచ్చి నమ్మకాలు, వాళ్లలో ఎందుకుంటాయి?       

భక్తి వేరు. అక్కల్ట్ వేరు. లిమిట్ లో ఉన్నంతవరకూ భక్తి మంచిదే. లిమిట్ దాటితే భక్తికూడా మంచిది కాదు. కానీ అక్కల్ట్ మొదలుకే మంచిది కాదు. అక్కల్ట్ చాలావరకూ మోసమే. ఒకవేళ మోసం కాకపోయినా అది ప్రమాదకరమైన లోకం. రహస్యపూజలు, దయ్యాలు, భూతాలూ, ఆత్మలు, మంత్రతంత్రాలు, దేవతలు, శక్తులు, ఇలాంటివాటి జోలికి పోవడం అస్సలు మంచిది కాదు. దాని ఫలితాలు ఇలాగే ఉంటాయి.

సరే ఆ తల్లిదండ్రులకు  బుద్ధి లేదు. వాళ్ళు అలా చంపుతుంటే, ఎదిగిన ఆ కూతుళ్లు ఎలా చంపించుకున్నారో? ఎదురు తిరిగి వాళ్లనే ఏదైనా చేసి ఉన్నా సెల్ఫ్ డిఫెన్స్ పరంగా తప్పుండేది కాదు. కానీ ఎదురు తిరగలేదంటే, వాళ్ళూ ఈ రిచువల్ లో పాత్రధారులే అన్నది అర్థమౌతోంది. అదే రోజున ఇంస్టాగ్రామ్ లో అలేఖ్య అనే పెద్దకూతురు (చనిపోయినవారిలో ఒకమ్మాయి), "Shiva will come, Work is done" అని మెసేజి పెట్టింది. జగ్గీ వాసుదేవ్ ది "శివా కల్ట్" అన్నది అందరికీ తెలుసు. 'ఆదియోగి శివా' అంటూ కోయంబత్తూరు కొండల్లో ఆయన పెద్ద విగ్రహమే పెట్టాడు. బహుశా జగ్గీ కల్ట్ లోనే ఈ మూఢనమ్మకాల బురదను వీళ్ళు అంటించుకుని ఉండవచ్చు. అవకాశాలు బలంగా ఉన్నాయి.

'అయామ్ శివా ! కరోనాను నేనే నానుంచి పుట్టించి లోకాన్ని నాశనం చెయ్యమని వదిలాను. నాకే టెస్టు అవసరం లేదు' అంటూ అరుస్తున్న ఆ తల్లిని చూస్తుంటే, పిచ్చి స్పష్టంగా కనిపిస్తోంది.

షిరిడీసాయిబాబా భక్తులు క్షుద్రపూజల జోలికి పోరు. వారు బాబాను అంతగా నమ్ముతారు. ఇక మెహర్ బాబా తత్త్వం అణుమాత్రం అర్థమైనా వీళ్ళిలాంటి పనులు చెయ్యరు. ఓషో పిచ్చి బాగా తలకెక్కి పెగా తయారయ్యారు. ఇకపోతే మిగిలింది జగ్గీ. ఆయన ఆశ్రమంలో ఇలాంటి అక్కల్ట్ పోకడలు కొన్ని ఉన్నాయి గనుక అనుమానం అటే చూపిస్తోంది. లేదా లోకల్ మంత్రగాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్లచేత ఇలాంటి పూజలు చేయించి ఉండవచ్చు. అదే నిజమైతే, షిరిడీసాయిబాబాను వీళ్ళు సరిగ్గా నమ్మలేదన్నది చక్కగా రుజువౌతుంది. వీళ్ళింటికి పెద్దపెద్ద అక్షరాలతో 'షిరిడీసాయి నిలయం' అని బోర్డు పెట్టించుకుని, ఇంట్లోనేమో మంత్రగాళ్ళని పిలిచి క్షుద్రపూజలేమిటో మరి? బాబా ఉన్నపుడు మంత్రగాళ్ళెందుకు?

చిత్తూరు జిల్లాలో కమ్మవారిని నాయుళ్లంటారు. అక్కడ, వారు చాలా బలమైన రాజకీయ వర్గమన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా వీరు చాలా ధనవంతులు. జగ్గీకి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కులమూ, ధనమూ, రాజకీయబలమూ అన్నీ ఉన్నపుడు 'మేమే ఈ హత్యలు చేశామ్' అంటూ కోర్టులో ఎలుగెత్తి అరిచినా కూడా, వీళ్లకు ఎలాంటి శిక్షా పడదని గట్టిగా చెప్పవచ్చు.

వీళ్లకు శిక్ష  పడితే న్యాయం గెలుస్తుంది. అయినా ఉపయోగం ఏమీ లేదు. జరగాల్సిన అన్యాయం ఇప్పటికే జరిగిపోయింది. ఒకవేళ మానసికకారణాలతో వీరికి శిక్ష పడకపోతే, ఆ భక్తి మత్తులోనుంచి బయటకు వచ్చాక, మిగతా జీవితం నరకమౌతుంది. ఎలాచూసినా వీళ్ళ జీవితాలు ఆల్రెడీ సర్వనాశనం  అయిపోయాయి.

95% సోకాల్డ్ ఆధ్యాత్మికులకు కావలసింది సైకియాట్రీ ట్రీట్మెంట్ మాత్రమే. వీరిలో ఒక్క 5% మాత్రమే నిజమైన సాధకులు, జిజ్ఞాసువులు ఉంటారు. మిగతావాళ్లందరూ ఏదో ఒక రకంగా మానసిక రోగులన్నది నిజం !

శ్రీరామకృష్ణులు,వివేకానందస్వామి, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన శుద్ధమైన మహాత్ములను వదలిపెట్టి, పూజారులు, జ్యోతిష్కులు, దొంగగురువులు, వాస్తుసిద్ధాంతులు, మంత్రగాళ్ళు, ఇలాంటివాళ్ళ మాయలో పడితే ఇలాగే జరుగుతుంది మరి !

ఇలాంటి పిచ్చివాళ్లకు సరియైన దారిని చూపాల్సిన అవసరం ఉందా లేదా? వీరి వెనుక ఉండి, వీరిచేత ఈ పనిని చేయించిన వాళ్ళను, ప్రోత్సహించిన వాళ్ళను గాలికి వదిలెయ్యడం సరియైన పనేనా? వీరికి శిక్ష పడుతుంది సరే, వీరిని తప్పుదారి పట్టించిన గురువులకు ఏ శిక్ష పడాలో?

ఇదా హిందూధర్మం?

read more " మదనపల్లి జంట హత్యలు - ఇదా హిందూధర్మం? "

25, జనవరి 2021, సోమవారం

Master CVV జాతక విశ్లేషణ - 6 (సృష్టి పరిణామక్రమం - మోక్షం)

1920 ప్రాంతాలలో అనుకుంటా ఒకరోజున మాస్టర్ సీవీవీ గారి భక్తులందరూ కుటుంబాలతో సహా కుంభకోణానికి వచ్చారు. ఆ రోజున ఆయనలోకి బ్రహ్మం ( దేవుడు, దైవం, పరమాత్మ లేదా పరబ్రహ్మము) దిగివస్తుందని ప్రచారం కాబడింది. ఆయనకారోజున బొందితో పరిపూర్ణదివ్యత్వం వచ్చేస్తుందని అందరూ భావించారు. ఆంధ్రా నుంచి కూడా బోలెడుమంది అక్కడికి చేరుకున్నారు. ఆ రోజు వచ్చింది, పోయింది. వాళ్ళు ఎదురుచూచిన అద్భుతం మాత్రం జరగలేదు. బొందితో దివ్యత్వం ఆయనకు రాలేదు. ఈ విషయం శకుంతలమ్మగారు (సీవీవీగారిని చూచిన ఆయన భక్తురాలు) చెప్పిన ఆడియోలో ఉంది వినండి.

దాదాపుగా అదే సమయంలో, అంటే 24-11-1926 న అరవిందులలోకి కృష్ణుని చైతన్యం దిగి వచ్చిందని ఆయనభక్తులు నమ్ముతూ ఈ నాటికీ దానిని 'సిద్ధిదినం' గా పండుగ చేసుకుంటున్నారు. అయితే, అది పరిపూర్ణసిద్ధి కాదని, ఆ దిశగా ఒక ముందడుగు మాత్రమేనని అరవిందులు మెల్లిగా చెప్పారు. భక్తులు చాలా నిరుత్సాహపడ్డారు. ఆ తరువాత అరవిందులు 1950 లో పోయేవరకూ ఇంకా కొన్ని రోజులు ఇలాంటివే వచ్చాయి. అప్పుడు కూడా వీళ్ళు ఆశించిన అద్భుతాలేవీ జరగలేదు. బొందితో దివ్యత్వం ఆయనకూ రాలేదు. కాకుంటే ఆ దిశగా కొన్ని అడుగులు మాత్రం పడ్డాయి.

వీరిద్దరూ భౌతికఅమరత్వ దిశగా  సాధన చేసినప్పటికీ, ఇద్దరిలోకీ అరవిందుల సాధన చాలా పరిపూర్ణమైనదని నేను విశ్వసిస్తాను. సీవీవీగారి విధానమంతా ప్రాణమయకోశంలో మాత్రమే జరుగుతుంది. మానసిక, అతిమానసిక స్థాయిలతో వారికి పరిచయం లేదు. వెంకమ్మగారు తన సూక్ష్మశరీరంలో నిరాకారలోకానికి వెళ్లి, అక్కడున్న తెల్లని దేవతను అడిగినది 'సీవీవీగారు తనను పంపించారని, ఆయనకు అంతులేని ప్రాణశక్తి కావాలని' మాత్రమే. ఇచ్చానని ఆ దేవత అన్నాడట. కనుక, మౌలికంగా వీరి శిష్యులలో ప్రాణమయకోశంలో మాత్రమే సాధన జరుగుతుంది. అంతకంటే ఈ మార్గం ముందుకు పోదు.

దీనికి భిన్నంగా అరవిందుల సాధన పరిపూర్ణమైనది. అది భౌతికం నుంచి సూపర్ మైండ్ వరకూ అనేక స్థాయిలలో జరుగుతుంది. అందుకే తన యోగాన్ని పూర్ణయోగమని అరవిందులన్నారు. సీవీవీగారి భక్తులు కూడా అరవిందుల ఫిలాసఫీతో ప్రభావితులయ్యారు. అరవిందుల 'సావిత్రి' గ్రంధాన్ని కొత్త రామకోటయ్యగారు అనువాదం చెయ్యడమే దీనికి ఉదాహరణ !

నిజాలిలా ఉంటే, ఇక శిష్యులు ఏమేమి కధలు కల్పిస్తున్నారో చూస్తే భలే నవ్వొస్తుంది. మచ్చుకి కొన్ని కధలను చెప్పుకుందాం.

అరవిందులు 1910 లో పాండిచ్చేరికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన గురువు విష్ణుబాస్కర్ లీలే అనే ఒక మరాఠీ. సీవీవీగారిని కలవమని అరవిందులకు ఆయన చెప్పారని ఒక కథను ప్రచారం చేస్తున్నారు సీవీవీగారి భక్తులలో ఒక వర్గంవారు. అరవిందుల జీవితాన్ని నేను క్షుణ్ణంగా చదివాను. ఇప్పుడుకాదు, 1990 లోనే అరవిందులపైన, ఆయన పూర్ణయోగంపైనా నేనొక సాధికారిక వ్యాసాన్ని వ్రాశాను. అరవిందుల జీవితంలో, నాకెక్కడా అలాంటి సంఘటన కనిపించలేదు. వారెక్కడ చూచారో మరి? అరవిందులు మాత్రం ఏనాడూ సీవీవీగారిని కలవాలని ప్రయత్నం చెయ్యలేదు.

ఇంతేకాదు. ఇలాంటి అబద్దాలను మరికొన్నింటిని చాలామంది సోకాల్డ్ గురువులు ప్రచారం చేస్తున్నారు. నిజాలు తెలియని అమాయకులు అవే నిజాలని నమ్ముతున్నారు.

ఒక గురువు ఇలా చెబుతున్నాడు.

'రామకృష్ణులు తర్వాతి జన్మలో గాయత్రీపరివార్ శ్రీరామశర్మ ఆచార్యగా పుట్టారు. దేవతలకు ఆహారం లేక అల్లాడుతుంటే హోమాలద్వారా వారికి ఆహారం ఇవ్వడానికి ఆయన ఇలా జన్మ ఎత్తారు'. 

ఇంతకంటే పచ్చిఅబద్దం ఇంకెక్కడా ఉండదు. నేను దీనిని చదివినప్పుడు భలే నవ్వొచ్చింది. బ్రహ్మానందం కామెడీ చూస్తే కూడా అంత నవ్వురాదు !

శ్రీ రామశర్మగారు 1911 లో పుట్టారు. రామకృష్ణులు 1886 లో పోయారు. నూరేళ్ళ తర్వాత మళ్ళీ తాను పుడతానని ఆయనన్నట్లు మహేంద్రనాధ గుప్తాగారు 'గాస్పెల్ ఆఫ్  శ్రీరామకృష్ణ' గ్రంధంలో వ్రాశారు. అంటే 1986 తర్వాత అవుతుంది.  మరి 1911 లో పుట్టిన శ్రీరామశర్మగారు శ్రీరామకృష్ణుల అవతారమెలా అవుతారు? ఒకవేళ శ్రీరామకృష్ణులు మళ్ళీ పుడుతుంటే బేలూర్ మఠం వారికి తెలియకుండా పోతుందా? నిరంతరం ఆయన్ను పూజిస్తున్న ఆయన మహాభక్తులకు, ఆయన కోసం వాళ్ళ జీవితాలనే అర్పించిన మహామహులైన స్వామి బ్రహ్మానంద, స్వామి శివానంద మొదలైన ఆయన ప్రత్యక్షశిష్యులు అప్పటికి బ్రతికే ఉన్నారు. అక్కడిదాకా ఎందుకు? సాక్షాత్తూ శారదామాత అప్పటికి బ్రతికే ఉన్నారు. వారికెవరికీ ఈ విషయం తెలియదా? ఆయన భార్యకే తెలియకుండా ఆయన మరోచోట పుట్టాడా? ఎందుకీ అబద్దాలు?

ఇంకా భయంకరమైన అబద్ధాలను కొంతమంది స్వామీజీలే చెబుతున్నారు.

'ఒకానొక గతజన్మలో రామకృష్ణుడు మా ఆశ్రమానికి వచ్చి, నా దగ్గర ఉపదేశం పొందాడు. నేనే అతనికి కాళీసాధనను నేర్పించాను' అంటూ చెబుతున్నాడు ఒక ప్రబుద్ధానందస్వామి. ఈయన స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడో, మరేంటో తెలీదు. రామకృష్ణుల కాలిగోటికి అంటుకున్న మట్టిలో ఒక కణానికి చాలడు ఈ క్షుద్రస్వామి. చెప్పే మాటలు మాత్రం అలా చెబుతున్నాడు !

అవతారపురుషుల గతజన్మలతో సహా అన్నీ మాకు తెలుసంటున్న ఈ ప్రబుద్ధులకు వీరి ప్రస్తుతజన్మలే వీరికి తెలీవు. అదీ విచిత్రం ! వారి ఆశ్రమాలలో ఉన్న గొడవలు, లుకలుకలు, పవర్ ఫైట్స్ ను మాత్రం వీళ్లేమీ తీర్చలేరు. మార్చలేరు. ఏవేవో కాకమ్మకబుర్లు మాత్రం చెబుతూ ఉంటారు ! స్వార్థపరులైన వీళ్ళ భక్తులు విని మోసపోతూ ఉంటారు !

భవిష్యత్తును గురించి అవతార్ మెహర్ బాబా ఏమన్నారో వినండి !

మెహర్ బాబా చెప్పిన వరల్డ్ ప్రిడిక్షన్స్ చాలా జరిగాయి. మన దేశం రెండు దేశాలుగా విడిపోతుందని, మనకు స్వాతంత్రం రావడానికి దాదాపు 30 ఏళ్ల ముందుగా ఆయన ఎప్పుడో అన్నాడు. ఆ తర్వాత 1947 లో దేశం రెండు ముక్కలుగా విడిపోయి స్వతంత్రాన్ని తెచ్చుకుంది. ఒకసారి సింధ్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నపుడు ఒకచోట నేలమీద పొడుగ్గా గీతను గీస్తూ 'ఇదే రెండు దేశాలకు సరిహద్దు అవుతుంది' అని ఆయనన్నాడు. ప్రస్తుతం మనకూ పాకిస్తాన్ కూ ఉన్న సరిహద్దురేఖ ఆ దగ్గర్లోనే ఏర్పడింది.

అదే విధంగా యూరప్ లో పర్యటిస్తున్న సందర్భంలో- " స్విట్జర్లాండ్ చుట్టూ నేనొక వలయాన్ని గీచాను. యుద్ధం దానిని తాకదు" అని ఆయనన్నాడు. ఆశ్చర్యకరంగా, రెండో ప్రపంచయుద్ధంలో  ఎన్నో దేశాలు పాల్గొన్నప్పటికీ, ఆ దేశం మాత్రం పాల్గొనలేదు. ఈ విధంగా ఆయన చెప్పిన వరల్డ్ ప్రిడిక్షన్స్ చాలా జరుగుతూ వచ్చాయి.

ఆయనిలా అన్నాడు 'నేను పోయిన తర్వాత నూరేళ్ళవరకూ పరిపూర్ణ సిద్ధపురుషుడెవడూ ఈ భూమిపైన పుట్టడు'. ఆయన 1969 లో పోయారు. అంటే 2069 వరకూ అలాంటివాళ్ళు పుట్టరనేగా అర్ధం. మరి ఈ కాకమ్మకబుర్లు చెబుతున్న స్వామీజీలు, సద్గురువులూ,  సిద్ధపురుషులూ వీళ్ళందరూ ఎవరు? మీరే ఆలోచించుకోండి !

మెహర్ బాబా ఇంకా ఇలా అన్నారు - 'నేను మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత వస్తాను. అప్పటికి మానవనాగరికత ఒక శిఖరాన్ని అందుకుని, కుప్పకూలి, పతనమై, అతిదీనావస్థలో ఉంటుంది. అలాంటి సమయంలో నేను మళ్ళీ వస్తాను'.

అంటే ఏమిటి? రాబోయే 700 ఏళ్లలో సైన్స్ అనేది ఒక పీక్ స్టేజికి వస్తుంది. నేను గత పోస్ట్ లో వ్రాసినవన్నీ నిజాలవుతాయి. కానీ మళ్ళీ అంతా సర్వనాశనమౌతుంది. సైన్స్ ఎక్కువైపోయిన అట్లాంటిస్ ద్వీపం లాగా మానవజాతి తననుతానే నాశనం చేసుకుంటుంది. దిక్కుతోచని స్థితిలో పడుతుంది.  అలాంటి పరిస్థితిలో ఒక మహాపురుషుని అవతరణ జరుగుతుంది.

భూమి నిన్నగాక మొన్న పుట్టలేదు. భూమి వయసు 4.5 బిలియన్ సంవత్సరాలు. మనకేమో బీసీ 8,000 నుంచి మాత్రమే చరిత్ర లభిస్తున్నది అది కూడా కొద్ది దేశాలలో మాత్రమే. మన సైన్సు గత 300 ఏళ్ల నుంచి మాత్రమే విపరీతంగా పెరిగింది. మరి ఇన్ని బిలియన్ సంవత్సరాలుగా ఏమీ జరగలేదా? ఒక్క మూడొందల ఏళ్లలోనే ఇదంతా జరిగిందా?

నిజమేంటంటే, ఇలాంటి సైన్సూ, ఇలాంటి నాగరికతలూ భూమ్మీద ఎన్నోసార్లు వచ్చాయి. మనిషికున్న స్వార్ధంవల్లా, కోరికలవల్లా, దోపిడీ చేసే బుద్ధి వల్లా  అవన్నీ సర్వనాశనం అయ్యాయి. ఆటవిక జీవితం నుంచి అత్యుత్తమ సైన్స్ వరకూ ఎదగడం, సర్వనాశనం కావడం, మళ్ళీ అడవిమనుషుల లాగా జీవితాలు మొదలవ్వడం ఇలా ఎన్నో సార్లు ఈ భూమిపైన జరిగింది. మధ్యమధ్యలో జలప్రళయాలొచ్చాయి, మంచుతుపాన్ లొచ్చాయి. అంతకు ముందున్న ఆధారాలన్నీ కప్పుపడిపోయాయి. భూమిపైన అనేక దేశాలలో ప్రాంతాలలో ఇప్పటికీ లభిస్తున్న అనేక అంతుచిక్కని వింతలే నా మాటకు రుజువులు ! 

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే భౌతిక అమరత్వం ఎప్పటికీ రాదని చెప్పడానికే. అలా వచ్చేపనైతే ఇన్ని బిలియన్ల సంవత్సరాలలో అది ఎన్నోసార్లు వచ్చి ఉండాలి. కానీ అమరులెవరూ మనమధ్యన లేరు. ఈనాటికీ  మనిషి చనిపోతూనే ఉన్నాడు.

సరే అదంతా అలా ఉంచుదాం. సైన్స్  ఇదే విధంగా పెరిగిపోతూ ఉంటే, ముందు ముందు ఏమౌతుంది? ఇప్పుడున్న సోకాల్డ్ ఆధ్యాత్మికసంస్థలు, ఆయా సాధనామార్గాలు ఏమౌతాయి? మహనీయుల శిష్యులందరూ ఏమౌతారు?

ఏమీకారు. అందరూ ఉంటారు. కాకపోతే పప్పు మాయమౌతుంది. పొట్టు ఎక్కువౌతుంది. ఆధ్యాత్మికలోకంలో భ్రమలు ఎక్కువౌతాయి. దొంగగురువులు ఎక్కువౌతారు. వాళ్ళని నమ్మే స్వార్ధపరులూ ఎక్కువౌతారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు, పెరిగి పెరిగి ఒక్కసారిగా కుప్పకూలుతుంది. అంతే !

ఆధ్యాత్మికసాధనంటే కళ్ళుమూసుకుని ఏవేవో అనుభవాలను పొందటం కాదు. అనుభవిగా మిగలడం. అది కూడా దాని పైనున్నదానిలో విలీనమై, తానే లేకుండా పోవడం. అంతేగాని, హెడ్ ఫోన్స్ తగిలించుకుని మ్యూజిక్ వింటూ అదే ధ్యానమని భ్రమించడం కాదు. రిలాక్స్ అవుతూ, నిద్రపోతూ, దానినే సమాధి అనుకోవడం కాదు. పగటికలలు కంటూ అవేవో దర్శనాలని, గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలని మాయలో పడిపోవడం కాదు. పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ టైములో రాత్రి వచ్చిన కలలను ఒకరికొకరు చెప్పుకుంటూ వాటి ఆధ్యాత్మిక అర్దాలేమిటి అంటూ చర్చించడం కాదు. ఇదంతా బూటకపు ఆధ్యాత్మికత !

మోక్షం అనే  పదం మనగ్రంధాలలో చాలా  విస్తారంగా వాడబడింది. దానిని మనవాళ్ళు కూడా ఎలా పడితే అలా వాడేస్తూ  ఉంటారు. దానర్ధం ఏంటంటే - పరిపూర్ణ స్వాతంత్య్రమని. అంటే, ఈ భూమికే కాదు, విశ్వంలోని ఏ లోకానికైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాక-పోక రెండూ చెయ్యగల సమర్ధత. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవడం చెయ్యగల సమర్ధత. పరిపూర్ణస్వేచ్ఛతో ఈ విశ్వంలో సంచరిస్తూ ఏ శక్తికీ లోబడకుండా ఉండే స్థితినే మోక్షం అంటారు. మన హిందూమతం యొక్క అంతిమగమ్యం ఇదిగాని, రకరకాల ఆధ్యాత్మిక అనుభవాలు, మత్తుమందు భ్రమలవంటి దర్శనాలు, పగటికలలు, ఈగో ట్రిప్స్, మాయమాటలు, అబద్దాలు - ఇవి కాదు.

సీవీవీగారు కానీ, అరవిందులు కానీ చెబుతున్న భౌతిక అమరత్వం వచ్చిందనే అనుకుందాం. అప్పుడేమౌతుంది? ఏమౌతుందో ఇంతకుముందు పోస్టులలో వివరించాను. ఇంకా కొంచం ఇప్పుడు చెబుతాను.

నీ దేహంపైనా, నీ ఇంద్రియాలపైనా, ప్రాణంపైనా, మనస్సుపైనా, అహంభావం పైనా నీకు పూర్తి అదుపు రావాలి. త్రిగుణాల పట్టునుంచి నువ్వు బయటపడాలి. అవిద్యా, అజ్ఞానమూ నీలో అంతం కావాలి. ఇది జరుగుతూ నీకు సమాధిస్థితిగాని ఇంకేదైనాగాని వస్తే అది సరియైన మార్గం. ఇవేవీ రాకుండా నువ్వెంత ధ్యానం చేసినా, ఎన్ని అనుభవాలు పొందినా అవన్నీ ఉత్త దండగమారి పనులు.  నువ్వు ఆధ్యాత్మికంగా ఏమీ ఎదగడం లేదు. దిగజారుతున్నావని అర్ధం. 

సైన్స్ ద్వారా సమాధి అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుంది? నీ ఇంద్రియాలు, నీ ప్రాణం, నీ మనస్సు, నీ బుద్ధి, నీ అహంభావం ఇవేవీ నీ అదుపులో ఉండవు. డబ్బుతో కొనుక్కునే బ్రెయిన్ స్టిములేషన్ మాత్రం ఉంటుంది. డ్రగ్స్ కీ దానికీ ఏమీ భేదం ఉండదు. అప్పుడేమౌతుంది?

ఆ టెక్నాలజీని ఎవరు కంట్రోల్ చేస్తారో, వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. వాళ్ళు రాజులౌతారు. మిగతావాళ్లంతా బంట్లు అవుతారు. మళ్ళీ పాత కధే ! కుట్రలు, కుతంత్రాలు, విప్లవాలు, యుద్ధాలు, రాజ్యాలు కూలడాలు, అసమానతలు, దొంగతనాలు, దోపిడీలు, రేపులు, హత్యలు, మోసాలు, అన్నీవస్తాయి. దానివల్ల ఉపయోగం ఏముంటుంది?

మనిషిలో దైవికమైన మార్పు రాకుండా, ఊరకే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మనిషి రాక్షసుడౌతాడు. మనిషి జీవితం నేటికంటే ఇంకా దుర్భరమౌతుంది. కొత్త కొత్త మోసాలు ఎక్కువౌతాయి. మైండ్ తెఫ్ట్, సోల్ తెఫ్ట్, ఈగో కిడ్నాప్ మొదలైన పదాలు సర్వసాధారణమౌతాయి. షడ్వర్గాలు కొత్త రూపాలను ధరిస్తాయి. అంతే తప్ప ఇంకేమీ జరగదు.

ఇలాంటి పరిస్థితి వస్తుందనేనేమో మెహర్ బాబా చెప్పింది? అన్ని మతాల గ్రంధాలూ చెప్పిందికూడా అదేనేమో? ధర్మం క్షీణించడమంటే అదేనేమో?  కనుక అప్పుడు మళ్ళీ ఒక అవతారం రావలసిన  అవసరం ఏర్పడవచ్చు. బహుశా కల్కి అవతారం అదే కావచ్చు. గుర్రం కత్తీ అనేవి సింబాలిక్ గా చెప్పిన విషయాలే కావచ్చు. లేదా, అప్పటికి ఆటంబాంబుల ధాటికి అంతా సర్వనాశనమై మళ్ళీ గుర్రాలు కత్తుల రోజులు రావచ్చు. దానికింకా 700 ఏళ్ళు పడుతుందన్నమాట. ఈ లోపల, తను పెంచుకున్న టెక్నాలజీయే మనిషికి ప్రాణాంతకమవుతుందన్న మాట !

ఇప్పటికే - మొబైల్ గనక కాసేపు లేకపోతే పిచ్చెక్కుతోంది అందరికీ. అంతగా టెక్నాలజీకి మనిషి బానిసైపోయాడు. మనిషి స్వతంత్ర దేశంలో ఉంటూ ఉండవచ్చు. స్వతంత్రంగా బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ స్వతంత్రుడు కాడు. టెక్నాలజీ అనే ప్రభువుకు అతడు కట్టుబానిసై పోయాడు. ఇప్పుడే ఇలా ఉంటె, ముందుముందు ఇంకెలా ఉంటుందో మరి !

అసలూ - స్వాతంత్య్రం లేని ఎటర్నిటీ ఎంత నరకంగా ఉంటుందో?     

సపోజ్ స్వర్గమే ఉందనుకుందాం. మనం స్వర్గంలో ఉన్నాం. ఇంద్రసభ జరుగుతోంది. రంభో ఊర్వశో ఇంకో దిక్కుమాలినదో డాన్స్ చేస్తోంది. మన సినిమాలలో అలాంటి డాన్సులు ఇప్పటికే చాలా చూశాము గనుక మనకేమీ గొప్పగా అనిపించదు. మనమేమో అర్జంటుగా బాత్రూం కెళ్ళాలి. డాన్స్ మధ్యలో లేస్తే ఇంద్రుడు ఊరుకోడు. ఏ వజ్రాయుధాన్నో మనపైన వదులుతాడు. అందుకని చచ్చినట్లు బిగపట్టుకుని కూచుంటాం. అది స్వర్గమా? నరకమా? స్వర్గంలో నరకం !

ఇంతలో ఇంకో అప్సరస వచ్చి సురా గాబ్లెట్  అందిస్తుంది.

'ఇది నా బ్రాండ్ కాదు తల్లీ, నాది ఫలానా' అంటాం మనం.

'అది భూలోకంలో దొరుకుతుంది. ఇక్కడ దొరకదు. చచ్చినట్టు త్రాగు' అంటుంది అప్సరస.

'చచ్ఛేగా ఇక్కడకొచ్చింది. చావకపోతే అక్కడే ఉండేవాడిని కదా నా బ్రాండేదో నేను త్రాగుతూ' అంటాం మనం.

కోపంగా చూసి అప్సరస వెళ్ళిపోతుంది.

అది స్వర్గమా నరకమా?

సరే డాన్సయ్యాక బోయనాల కార్యక్రమం మొదలౌతుంది. మనమేమో వెజిటేరియన్ అయిపాయె ! స్వర్గంలో అంతా నాన్ వెజ్జే. ఏం తినాలి? ఎలా తినాలి?

'ఏంటమ్మా ఇది?' అని అక్కడ ఇంచార్జ్ ని అడిగితే,

'బతికినన్నాళ్ళూ ఆ చప్పిడికూడే తిని చచ్చావుగా ! ఇక్కడైనా మాంచి మసాలా మాంసం కూరలు తిని చావు' అంటుంది ఆమె.

అదొక నరకం. చివరకు రెండప్పడాలూ నాలుగు వడియాలూ తిని ఈసురోమంటూ మన డార్మిటరీకి దారితియ్యాలి.

అది స్వర్గమా నరకమా?

పోనీ మనకు స్వర్గమెలాగూ రాదు. మనం చేసిన పాపాలకు మనల్ని నరకంలో ఒక బాండీలో పడేసి కాగుతున్న కల్తీనూనెలో బజ్జీలాగా వేయిస్తున్నారని అనుకుందాం. తట్టుకోలేనప్పుడు ఆ  బాండీ లోనుంచి పాక్కుంటూ బయటకొచ్చి ఒంటికి కాస్త బర్నాలో, కాలెండులా ఆయింట్ మెంటో ఏదో ఒకటి పూసుకునే అవకాశం ఉందనుకుందాం కాసేపు. అది నరకమౌతుందా స్వర్గమౌతుందా? నరకంలో స్వర్గం !

'ఒరేయ్ ! ఆ నూనె ఎన్ని యుగాలనుంచీ వాడుతున్నార్రా మార్చకుండా? ఇప్పటికెన్ని కోటానుకోట్లమందిని వేయించారో అందులో. కంపు కొడుతోంది. కనీసం నూనె మార్చండిరా' అని మనం అడిగామనుకో. 

'అబ్బా ! నూనె మార్చాలా? మా బాబే ! నోర్మూసుకుని దూకు బాండీలోకి' అని యమభటుడు గద్దిస్తే అది నరకంలో మరీ నరకం.  శిక్షకు తోడు అవమానం మరీ నరకం కదా !

'పోన్లే పాపం, ఏదో అడుగుతున్నావు కదా. సరే మారుస్తాలే' అని పాతనూనె తీసేసి, న్యూ బ్రాండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ బాండీలో పోస్తే అది కొంతలో కొంత సుఖం ! 

అంటే ఏమిటి? నరకమైనా స్వర్గమైనా, మనకంటూ స్వాతంత్య్రం ఉంటే అదే స్వర్గం. స్వాతంత్య్రం లేకపోతే ఏదైనా నరకమే. అర్థమైందా? అదే మోక్షమంటే. ఎందుకంటే మన హిందూధర్మంలో అత్యున్నతమైన ఆదర్శమూ గమ్యమూ "స్వాతంత్య్రం" మాత్రమే. దానికే మరోపేరు మోక్షం.

అసలిదే శరీరంతో ఎల్లకాలం ఇక్కడే ఉండాలన్న దురాశ ఎందుకు మీకు? ఒకవేళ అలా ఉంటే, జీవితమెంత బోరు కొడుతుందో అర్థమైందా? ఒక 60, 70  ఏళ్లకే లైఫ్ మహాబోరు కొడుతోంది. రోజూ ఇదేపని, ఇదే గర్ల్ ఫ్రెండ్స్, ఇదే పెళ్ళాం, ఇదే పెళ్లి, ఇదే పిల్లలు, ఇదే గోల, ఇలాగే '10 టు 6' ఉద్యోగం చెయ్యడం, అదే  తిండి, అవే గిన్నెలు కడుక్కోవడం, అవే దిక్కుమాలిన సినిమాలు, అవే షికార్లు, అవే పిక్నిక్కులు, అవే టీవీ ప్రోగ్రాములు, అవే సొల్లుమాటలు, అవే హెచ్చులు, అవే మోసాలు, అదే నాటకపు బ్రతుకు - ఒక్క లైఫే ఇంత విసుగ్గా ఉంటె, ఇదే విధంగా ఎటర్నిటీనా? దానంత పెద్ద నరకం ఇంకెక్కడా ఉండదు.

ఇలాంటి ఎటర్నిటీ కంటే నేను చెప్పిన పరిపూర్ణస్వేచ్ఛతో కూడిన మోక్షం అత్యుత్తమం కాదూ? ఈ శరీరం పోతే ఏమౌతుంది? ఇంకో శరీరం ధరిస్తాను. నా ఇష్టం వచ్చినపుడు ఈ భూమికి వస్తాను. విసుగుపుడితే ఇంకో లోకానికి పోతాను. ఎటువంటి బంధమూ నాకు లేదు. ఎటువంటి బాధా నాకు లేదు. ఏ శక్తీ నన్ను ఆపలేదు. ఏ కర్మకూ నేను బద్ధుడిని కాను. జననము మరణమూ నన్ను బంధించలేవు. అంతా ఆటే. అంతా సరదానే. అలాంటి మోక్షం కావాలిగాని దిక్కుమాలిన ఈ భౌతికదేహంతో ఎటర్నిటీ ఎందుకసలు? దానిలో సుఖమూ లేదు శాంతీ లేదు సంతోషమూ లేదు ఆనందమూ లేదు.

ఇదే దేహంతో ఇదే లోకంలో ఉండాలన్నది భారతీయ వేదాంతభావం కాదు. ఇదసలు మన భారతీయభావనే కాదు. ఇక్కడే ఎల్లకాలం ఉంటూ సుఖాలను అనుభవించాలన్నది పాశ్చాత్య భావన. తెల్లవాళ్ళకే సుఖాలమీద మోజెక్కువ. మనకు అది లేదు.

అరవిందులూ సీవీవీగారూ ఇద్దరూ ఈ పాశ్చాత్య భావనతో ప్రభావితులయ్యారు. అరవిందులేమో ఇంగ్లాండ్ లో చదువుకున్నారు. అక్కడే చాలా ఏళ్లున్నారు. అప్పటి వెస్టర్న్ ఫిలాసఫర్స్ మరియు డార్విన్ పరిణామ సిద్ధాంతం ఆయనకు బాగా తెలుసు. కనుక దానినీ మన యోగాన్నీ కలపాలని ఆయన ప్రయత్నించారు. ఇక సీవీవీగారేమో బ్లావట్స్కి భావాలకు ప్రభావితులయ్యారు. ఆమెదొక సాంబారు. కనుక ఈయనకూడా హిమాలయన్ మాస్టర్స్ అని, లోకాలని, సూక్షశరీరమని, మహిమలని, రోగాలు తగ్గించడమని ఇలా ఏదేదో ప్రయత్నాలు చేశారు.

ఇదంతా పాశ్చాత్య భావమహిమేగాని మన వేదాంత - యోగ - విధానం ఇది కాదు.  మార్పనేది ప్రకృతిలో ఇన్ బిల్ట్ గా ఉన్నది. మనమేమో మార్పులేకుండా శిలావిగ్రహంలాగా ఉండాలంటే అది వికృతం అవుతుందిగాని సుకృతం అవదు. ఈ ప్రకృతీ ఈ భూమీ నాకొద్దు అంటే ఇక్కడనుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడో హాయిగా ఉండాలి. అంతేగాని ప్రకృతిని దైవీకరించాలంటే అది జరిగే పని కాదు.  

కనుక భౌతికఅమరత్వమనేది ఒక భ్రమ. అది  కుదరని పని. పెద్దపెద్ద మాటలు చెప్పవచ్చు. కానీ ఇప్పటివరకూ అది సాధ్యం కాలేదు. ఇక ముందు కూడా కాదు. ఈ నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. మోక్షం కోసం ప్రయత్నించడం మంచిది.

సిద్ధసంప్రదాయ గ్రంధమైన 'సిద్ధసిద్ధాంత పద్ధతి' అనేదానికి నేను వ్రాసిన వ్యాఖ్యానం చదవండి. అసలైన స్వేచ్చంటే ఏమిటో, అసలైన మోక్షమంటే ఏమిటో, అసలైన విముక్తి అంటే ఏమిటో, అసలైన మానవజీవితగమ్యమేమిటో అర్ధమౌతుంది.

'శ్రీవిద్యారహస్యం' పుస్తకంలో 'గుణాతీత జీవన్ముక్తస్థితి' అనే అధ్యాయంలో జీవన్ముక్తుని లక్షణాలను వివరించాను. అవి చదవండి. అర్ధమౌతుంది.

పుట్టాలి, పోవాలి, కానీ ఈ రెండూ మన చేతిలో ఉండాలి. కర్మ చేతిలో మన ఖర్మ ఉండటం కాదు. కర్మకు అతీతులమై మనం ఉండాలి. చేయాలనుకున్నది చేసే స్వాతంత్రమే కాదు, వద్దనుకున్నపుడు ఆగగలిగే స్వతంత్రం కూడా ఉండాలి. మన పుట్టుకా, మన చావూ, మన బ్రతుకూ, మన పునర్జన్మా అన్నీ పూర్తిగా మన అదుపులో ఉండాలి. అదే మోక్షంగాని, ఇదే దేహంతో ఎల్లకాలం ఇక్కడే అఘోరిస్తూ ఉండటం కాదు. అలాంటి ఎటర్నిటీ ఎందుకసలు? 

(అయిపోయింది) 

read more " Master CVV జాతక విశ్లేషణ - 6 (సృష్టి పరిణామక్రమం - మోక్షం) "

24, జనవరి 2021, ఆదివారం

Master CVV జాతక విశ్లేషణ - 5 (భౌతిక నిత్యత్వం ఎలా రావచ్చు?)

రామలింగయోగి ఏమయ్యేడో మనకు తెలియదు కానీ ఆ తరువాత, సీవీవీగారు, అరవిందులు చాలాకాలం జీవించి ఉన్నారు. వీరిద్దరూ భౌతిక అమరత్వాన్ని సాధించాలని ప్రయత్నించారు. కానీ మధ్యలోనే ఈ లోకంనుంచి నిష్క్రమించారు. అంతవరకే నిజం. ఆ తర్వాత వారి అనుయాయులు చెబుతున్నది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే అవి వారి ఊహలు మాత్రమే.  నిజానిజాలు ఎవరికీ తెలియవు.

భౌతిక అమరత్వాన్ని సాధించే పనిలో వీరిద్దరూ ఎక్కడో విఫలులయ్యారు. అదేమీ అనుకున్నంత తేలికైన పనేమీ కాదు. దీనిలో ఒక్క జన్మలోనే విజయాన్ని సాధించడం ఎవరివల్లా కాదు. అదే వీరికీ జరిగింది. అయితే, భక్తిపిచ్చి బాగా తలకెక్కిన వీరి భక్తులు మాత్రం, ఏవేవో నమ్మకాలతో మునిగితేలుతూ సత్యానికి దూరంగా పోతున్నారు.

సీవీవీగారు సూక్ష్మశరీరంలో హిమాలయాలలో ఉన్నారని, ఇప్పుడు చనిపోతున్న ఆయన భక్తులందరూ అక్కడకు చేరుకొని అక్కడ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని, ఆయన పుట్టేటప్పుడు వీళ్ళుకూడా ఆయనతో బాటుగా మళ్ళీ అవే ఆకారాలతో, అవే శరీరాలతో పుడతారని వీరు నమ్ముతున్నారు. క్రీస్తు మళ్ళీ వస్తాడని రెండువేల ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రైస్తవుల భ్రమలాంటిదే ఇదికూడా. అది జరిగేపని కాదు.

అదేవిధంగా, సూక్ష్మలోకాలలో అరవిందులు వేచిఉన్నారని భూమి సిద్ధమైనప్పుడు అతిమానసదేహంతో ఆయన భూమిపైన అవతరిస్తారని నమ్ముతున్నారు ఆయన భక్తులు. ఇదికూడా పైన చెప్పిన  నమ్మకం లాంటి ఉత్తనమ్మకమేగాని ఇందులో నిజమెంతో ఎవరూ చెప్పలేరు.

వీరిద్దరూ భౌతికఅమరత్వసాధన చేసినది నిజమే. అర్ధాంతరంగా పోయినది నిజమే. అంతవరకే నిజం. ఆ తరువాతది అంతా  ఊహా, నమ్మకమూ మాత్రమే.

మరి భౌతికఅమరత్వం ఎప్పటికీ రాదా? అంటే  వస్తుందనే నేనంటాను. ఎప్పుడొస్తుంది ఎలా వస్తుంది అనేవి చూద్దాం.

వస్తే గిస్తే ఇది సైన్స్ ద్వారానే రావాలిగాని ఆధ్యాత్మికంగా చూస్తే మాత్రం, రాబోయే 10,000 ఏళ్లలో సాధ్యం కాదని నా విశ్వాసం. ఎలాగో చెప్తా వినండి.

ఈజిప్టు లోనూ చైనా లోను మానవజాతి చరిత్రను క్రీ పూ 8000 ఏళ్ల నుంచీ రికార్డ్ చేసి ఉంచారు. అంటే పదివేల ఏళ్ల చరిత్ర మనకు లభ్యమౌతున్నది. ఇన్నేళ్ల నాగరికత తర్వాత ఇప్పుడు మనమున్న స్థితిలో ఉన్నాం. ఇంకో పదివేల ఏళ్లకు ఇంకా ఎంతో ప్రగతి సాధించవచ్చు. సైన్స్ బాగా ఎక్కువైపోయి అట్లాంటిస్ ద్వీపం లాగా సర్వనాశనం కావచ్చు. మళ్ళీ అడవిమనుషుల స్టేజి నుంచి చరిత్ర మొదలు కావచ్చు. ఈ విధంగా గతంలో చాలాసార్లు జరిగింది. అంతేగాని, భౌతికంగా అమరత్వం మాత్రం అంత తొందరగా వచ్చేపని కాదు.

కొన్నివందల ఏళ్ళక్రితం దూరశ్రవణం దూరదర్శనం అనేవి యోగసిద్ధులకు మాత్రమే ఉండే శక్తులు. ఇప్పుడో, డబ్బులున్న ప్రతివాడికీ ఆ శక్తులున్నాయి. అంతర్జాతీయ ఆడియోకాల్సేమో దూరశ్రవణం. వీడియోకాల్సేమో దూరదర్శనం.  విమానప్రయాణమేమో ఆకాశయానం. ఇంకొన్నాళ్ళు పోతే సూక్ష్మదేహంతో దూరప్రయాణం కూడా వస్తుంది. అంటే ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం కావడం. కాకపోతే, సైన్స్ పరంగా వచ్చే దూరప్రయాణం (టెలి పోర్టేషన్) లో ఇక్కడ మాయం కావడం ఉండదు. ఇక్కడే ఉంటూ ఎక్కడ కావాలంటే అక్కడ 3-D హోలోగ్రాం లాగా ప్రత్యక్షమై మాట్లాడే టెక్నాలజీ త్వరలోనే వస్తుంది. ఇది ఎంతోదూరంలో లేదు.

1900 ప్రాంతంలో మనిషి సగటు ఆయుష్షు 35-40 మధ్యలో ఉండేది. చాలామంది  యవ్వనాన్ని చూడకుండానే కన్నుమూస్తుండేవారు. దానికి ముఖ్యమైన కారణాలు - సరియైన మందులు లేకపోవడం, యూరప్ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి అనేక రోగాలు మనకు సరఫరా కావడం. 1950 ప్రాంతానికి 50-60 మధ్యలో ఉన్న మనిషియొక్క సగటు ఆయుప్రమాణం 2000 నాటికి 70-75 మధ్యకు పెరిగింది. ఇప్పుడు 80-85 వరకూ చాలామంది జీవిస్తున్నారు. ఇదే విధంగా పోతే 2050 నాటికి మనిషి హాయిగా 100 ఏళ్ళు బ్రతుకుతాడు. ఆఫ్కోర్స్ రోగాలుంటాయి, మందులూ ఉంటాయి. మందులు మింగుతూ బ్రతుకుతూ ఉంటాడు.

జీవరసాయన శాస్త్రంలో, వైద్యశాస్త్రంలో నేడు జరుగుతున్న పరిశోధనలు మీలో చాలామందికి తెలియవు. అవేంటో వింటే మీరు ఆశ్చర్యపోతారు.

హ్యూమన్ సెల్ లెవల్ లో బ్రహ్మాండమైన రీసెర్చి నేడు జరుగుతోంది. హ్యూమన్ సెల్ అనేది కాలంతో అసలెందుకు బలహీనమౌతుంది? ఆయుష్షును నియంత్రించే జీన్ ఏమిటి? వయసుతో బాటు సెల్ అనేది ఎందుకు క్షీణిస్తుంది? సెల్ క్షీణించకుండా, బలహీనపడకుండా, మరణించకుండా ఆపడం ఎలా? జీన్ కోడ్ ను ఎలా మార్చాలి? మొదలైన రంగాలలో సామాన్యుడు ఊహించలేని రీసెర్చి రహస్యంగా జరుగుతోంది. దీనిమీద కోట్లాది డాలర్ల పెట్టుబడి పెట్టబడింది. ఈ రీసెర్చి గనుక సక్సెస్ అయితే, హ్యూమన్ సెల్ జీవితకాలాన్ని ఎంతవరకైనా పొడిగిస్తూ పోవచ్చు.. సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్లు, సిం కార్డు బాలెన్స్ అయిపోతే మళ్ళీ వేసుకున్నట్లు, హ్యూమన్ సెల్ లెవల్లో రీఛార్జ్ చేసుకునే టెక్నాలజీ ఎంతో దూరంలో లేదు. కనీసం ఇంకో మూడొందల ఏళ్లలో ఇది అందుబాటులోకి రావచ్చు. అదే విధంగా ఆర్టిఫీషియల్ ఆర్గాన్ ఉత్పత్తి, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మొదలైన రంగాలలో మనం ఊహించలేనంత రీసెర్చి జరుగుతోంది.

కొన్నాళ్ళు పోయాక పెట్రోల్ బంకుల్లాగా, రీఛార్జ్ షాపులలాగా, ఆయుష్షు రీచార్జి సెంటర్స్ రావచ్చు. ఒకడి ఆయుస్సు అయిపోతుంటే, సిగ్నల్ వస్తుంది. వెంటనే షాపుకెళ్లి, తనదగ్గరున్న డబ్బులని బట్టి పదేళ్ళో ఇరవై ఏళ్ళో ఆయుష్షు రీచార్జి చేసుకొవచ్చు.

ఏం నమ్మడానికి కష్టంగా ఉందా?

నేడు మనం వాడుతున్న టెక్నాలజీ ఒక నూరేళ్లక్రితం ఊహించడానికి కూడా అసాధ్యమే. అలా ఊహించి పుస్తకాలు వ్రాసినవారిని సైన్స్ ఫిక్షన్ రచయితలన్నారు. ఇప్పుడవన్నీ నిజాలవుతున్నాయి. నేడు మనం మొబైల్ ఫోన్ తో చేస్తున్న అద్భుతాలు, యాప్స్ తో జరుగుతున్న పనులు, ఒక రెండొందల ఏళ్ల క్రితం ఎవరైనా వ్రాసి ఉన్నట్లయితే వాడిని సైతాన్ భక్తుడని ముద్రవేసి సజీవదహనం చేసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడవన్నీ మనం చేస్తున్నాం. అలాగే నేను వ్రాసిన 'సెల్ లెవల్ రీచార్జ్' అనేది కూడా భవిష్యత్తులో నిజం అవుతుంది. అప్పుడు మనిషి ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్ళు ఇదే దేహంతో బ్రతుకుతాడు. సైన్స్ మాత్రమే దీనిని  సామాజికంగా సామూహికంగా సుసాధ్యం చేస్తుందిగాని ఏ యోగమూ చెయ్యలేదు.

యోగమనేది వ్యక్తిగతం. మహా అయితే ఒక గ్రూపు వరకూ పరిమితం. గతంలో వచ్చిన ఏ మహాపురుషుడైనా తాను పొందినదానిని ఒక పదిమంది వరకూ పంచగలిగాడు. అంతే ! మిగతావాళ్ళు ఆయనపోయిన తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంతేగాని, మందికందరికీ తాను పొందిన సిద్ధిని ఏ మహాత్ముడూ పంచలేకపోయాడు. అదసలు జరిగే పని కాదు.

కనుక యోగంద్వారా భౌతిక అమరత్వం రావాలంటే చాలా కష్టం. ఇంకో పదివేల ఏళ్లకు కూడా ఇది సాధ్యం కాకపోవచ్చు.. కానీ సైన్స్ ద్వారా ఇంకో 500 ఏళ్లలో ఇది సాధ్యం అవుతుంది.

నేను ఊహించి చెప్పడం లేదు. ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయాలు చెబుతున్నా. వినండి !

మొన్నీ మధ్యన నా అమెరికా శిష్యుడొకాయన ఇంటర్నేషనల్ టెక్నాలజీ కాన్ఫరెన్స్  ఒకదానికి ఆహ్వానితునిగా వెళ్ళాడు. అందులో దాదాపు 1200 MNC లు వివిధరంగాలలో తాము చేస్తున్న రీసెర్చిని ఒకరితో ఒకరు పంచుకున్నాయి. అందులో కొన్నింటి గురించి చెబుతాను. నోరెళ్లబెట్టకండి !

మనకు వచ్ఛే అనారోగ్యాలన్నీ మనం  ఊపిరిని పీల్చే విధానాన్ని బట్టి వస్తాయనేది ఒక నమ్మలేని నిజం. ప్రపంచ జనాభాలోని  750 కోట్లమంది 750 కోట్ల విధాలుగా ఊపిరిపీల్చి వదులుతూ ఉంటారు. ఫింగర్ ప్రింట్స్ లాగా ఇందులోకూడా ఎవరి ప్రత్యేకత వారిదే. కనుక ఎవరి రోగం వాడిదే. ఎవరి ఆయుష్షు వాడిదే. ఈ రహస్యాన్ని వేలాది ఏళ్ళనాడే గ్రహించిన యోగులు ప్రాణాయామవిద్యను కనిపెట్టి, దానిలో రీసెర్చి చేసి, కోడిఫై చేసి, మనకు బోధించారు. కానీ దీనిని అందరూ చెయ్యలేరు. సరియైన గురువులు దొరకరు. దొరికినా మన బద్ధకం మనల్ని  వదలదు. సాధనను స్థిరంగా సక్రమంగా చేయనివ్వదు. కనుక ప్రాణాయామమనేది కొన్ని వేల ఏళ్లుగా మనకు తెలిసినా , నేటికీ దానిని శ్రద్ధగా చేస్తున్నది 0.05 శాతం మనుషులు మాత్రమే. కనుక కష్టపడటం, సుఖాలను వదులుకోవడం, సాధన చెయ్యడం, ఎవరికీ ఇష్టం ఉండదు. కడుపులో చల్లకదలకుండా ఎవడైనా మనబదులు ఆ సాధనలో గట్రాలో చేసి ఫలితం మనకు ధారపోస్తే అప్పుడు తీసుకుంటాం ! ఈలోపల వాడి ధార ఆగిపోతుందనుకోండి. అది వేరే విషయం ! అయినా మనకనవసరం ! మనకోసం ఆహుతి కావడానికి కాకపోతే వాడసలు గురువని బోర్డు పెట్టుకున్నది ఎందుకంటా?

ఇప్పుడొక MNC, ఒక యాప్ ను తయారుచేస్తోంది. దానికి మనం కనెక్ట్ అయితే, మనం ఊపిరిని సరిగ్గా పీల్చి వదులుతున్నామా లేదా అది అనుక్షణం కనిపెట్టి చూస్తూ మనకు సలహాలిస్తూ, మన శ్వాసను మానిటర్ చేస్తూ ఉంటుంది.  సరిగ్గా పీల్చకపోతే గదుముతుంది. సరిగా వదలకపోతే హెచ్చరిస్తుంది. ఆ విధంగా మనచేత ప్రాణాయామం చేయించి మన ఆరోగ్యాన్ని మంచి కండిషన్ లో ఉంచుతుంది. మరి ఆ యాప్ కొనుక్కోవాలన్నా, కనెక్ట్ అవ్వాలన్నా డబ్బులు వదుల్తాయి. ఒక్కసారిగా కాదు. జీవితాంతం నెలకింతని ఆ కంపెనీకి మనం డబ్బులు కడుతూ ఉండాలి. నో ఫ్రీ సర్వీస్ ప్లీజ్ !

ఆశ్చర్యపోతున్నారా ! అంత పోకండి ! దీని బాబులాంటిది ఇంకోటుంది దానిసంగతి వినండి !

ఇంకో MNC ఇంకో దిమ్మతిరిగిపోయే రీసెర్చి చేస్తోంది. అది సెంట్రల్ నెర్వస్ సిస్టం, బ్రెయిన్ల గురించి. మన అనుభూతులన్నింటినీ ఈ రెండే నియంత్రిస్తాయన్నది ఏ సైన్స్ స్టూడెంట్ కైనా తెలుస్తుంది. మనకు కోపమొచ్చినా, తాపమొచ్చినా, కామక్రోధాది ఆరింటిలో ఏదొచ్చినా మన బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి. ఒక్కొక్క ఆలోచనా, ఒక్కొక్క ఎమోషనూ ఒక్కొక్క విధమైన బ్రెయిన్ వేవ్ ను సృష్టిస్తాయి. ఏ ఎమోషన్ కలిగినప్పుడు బ్రెయిన్ ఏ తరంగాలను వెదజల్లుతోందో వీళ్ళు ముందుగా రికార్డ్ చేశారు. దీనికోసం కొన్నివేలమందిమీద  పిల్లలు, పెద్దలు, ఆడా, మగా ఇలా రకరకాల గ్రూపులమీద రీసెర్చి చేసి ఇదంతా రికార్డ్ చేసేశారు. ఇప్పుడు బ్రెయిన్ కి సెన్సార్లు అమర్చి, అవే బ్రెయిన్ సెంటర్స్ ని కృత్రిమంగా మైల్డ్ ఎలక్ట్రిక్ సప్లైద్వారా యాక్టివేట్ చేస్తే, అవే అనుభూతులు ఆ మనిషికి కలుగుతాయి.

ఏ అనుభూతిని కావాలంటే ఆ అనుభూతిని అనుకున్న క్షణంలో పొందటం ధ్యానికి సాధ్యమౌతుందని ధమ్మపదంలో బుద్ధుడన్నాడు. అంటే, తన ఎదురుగా ఒక వస్తువుగాని మనిషిగాని లేకపోయినా, అవి బ్రెయిన్లో ఏయే సెంటర్స్ ని కదిలిస్తాయో, వాటిని ధ్యానియైనవాడు తన ధ్యానశక్తితో కదిలిస్తాడు. అప్పుడా అనుభూతులను తన లోలోపల ధ్యానంలో పొందుతాడు. ఇది యోగులకు తెలిసిన విద్యే. అంటే, అనుభూతులపరంగా రివర్స్ ఇంజనీరింగ్ అన్నమాట ! సైన్స్ పరంగా ఇది త్వరలో సక్సెస్ అవబోతోంది. అప్పుడేమౌతుందో తెలుసా ?

ఒకసారి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మానవజీవితం మొత్తం తారుమారై పోతుంది. వెధవ మొబైల్ ఫోన్ వచ్చి మన జీవితాల్ని ఎంత సుఖంగా, ఎంత దరిద్రంగా మార్చిందో మనం చూస్తున్నాము.  ఇక, నేను చెబుతున్న టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తే ఏమౌతుందో చెబుతా వినండి !

ఆకర్షణలు, డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, సహజీవనాలు ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. అమ్మాయికి అబ్బాయీ అవసరం లేదు. అబ్బాయికి అమ్మాయీ అవసరం లేదు. ఎవరికివారు యాప్ కి కనెక్ట్ అయిపోవడం, సెన్సార్లున్న హెడ్ ఫోన్స్ తగిలించుకోవడం, రిమోట్ చేతులో పట్టుకుని దుప్పటి ముసుగేసుకుంటే చాలు. పార్ట్ నర్ తో సంబంధం లేకుండా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆర్గాజం పొందవచ్చు.. అంతా రిమోట్ చేస్తుంది. ఇక ఒకరితో ఒకరికి పనేముంటుంది? ఎవరి ముఖం ఎవరు చూస్తారు?

అలకలు, తృప్తి లేదంటూ విసుక్కోడాలు, చాలలేదని విడాకులు కోరడాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్లు, స్పెషలిస్టుల చుట్టూ తిరగటాలు, ఇవేవీ ఉండవు.

బ్యూటీ ప్రాడక్ట్స్ అన్నీ మూతపడతాయి. జిమ్ములు మూతపడతాయి. యాఫ్రో డీసియాక్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలుతుంది. ఎవరూ యోగా చేయనవసరం లేదు. ఎవరెలా ఉన్నా ఎవరికీ అవసరం ఉండదు. ఎవరి ముఖమూ ఎవరూ చూడరు. లవ్వులూ కొవ్వులూ అన్నీ మాయమౌతాయి. అసలు పెళ్లే అవసరం లేదు. యాప్ ఉంటె చాలు. దానితో కనెక్ట్ అయితే చాలు. కావలసినన్ని డబ్బులుంటే చాలు.  

'పిల్లలకోసమైనా పెళ్లి కావాలికదా' అంటారేమో? అసలు పిల్లలెందుకు? వాళ్ళని  పెంచడం,చదివించడం,పెళ్లిళ్లు చెయ్యడం, వాళ్ళ తిట్లూ చీదరింపులూ భరించడం, చివర్లో ఏడుస్తూ ఓల్డేజి హోములో చేరడం, ఆ గోలలూ గొడవలూ ఎందుకిదంతా? అసలు పెళ్ళెందుకు? 'సోలో లైఫే సో బెటర్' అనే ఫిలాసఫీ ఇప్పటికే మనమధ్యకు వచ్చేసింది. ఈ మాట ఇప్పటికే కొన్ని వేలమంది అంటున్నారు. మొన్నీ మధ్యన ఒక రీసెర్చిలో ఏమ్ తేల్చారంటే, 'మాకసలు పెళ్ళొద్దు' అనే అమ్మాయిలూ అబ్బాయిలూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలలో ఉన్నారట ! ఇలాంటి యాప్స్ వచ్చేస్తే ఇక సొసైటీ ఏమౌతుందో ఆలోచించండి ! ఇప్పటివరకూ మనిషికి తెలిసిన వ్యసనాలైన త్రాగుడు, డ్రగ్స్ మొదలైనవి దీనిముందు ఎందుకూ పనికిరావు. అదంత వ్యసనమై కూచుంటుంది. ఆ యాప్ కోసం మనిషి ఏం చెయ్యమన్నా చెయ్యడానికి సిద్ధమౌతాడు. 

ఏంటండీ ఏదో ఆధ్యాత్మికం చెబుతారనుకుంటే ఇంకేదో చెబుతున్నారు?  ఏంటీ బూతుపురాణం? అంటారేమో, కాస్తాగండి. వినండి !

ఇదే రీసెర్చిని ఇంకొంచం ముందుకు తీసుకెళ్తే ఏం జరుగుతుందో చెప్తా వినండి.

ధ్యానంలో, సమాధిస్థితులలో ఉన్నపుడు బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయో మ్యాపింగ్ చెయ్యడం ఇప్పటికే అయిపొయింది. ధ్యానసమాధి స్థితులలో ఒక యోగి ఉన్నపుడు అతని బ్రెయిన్ వేవ్స్, ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా, గామా స్పెక్ట్రంలో ఎంతెంత ఫ్రీక్వెన్సీ లో ఉంటాయో రికార్డ్ చెయ్యడం ఇప్పటికే అయిపొయింది. ఆయా సమాధిస్థితులలో బ్రెయిన్ లోని ఏయే కేంద్రాలు యాక్టివేట్ అవుతున్నాయో రికార్డ్ చేసి పెట్టడం ఇప్పటికే జరిగిపోయింది. ఆర్టిఫీషియల్ స్టిములేషన్ ద్వారా, అవే బ్రెయిన్ సెంటర్స్ ను యాక్టివేట్ చేస్తే, అవే తరంగాలను పుట్టించేలా బ్రెయిన్ ను ఆజ్ఞాపిస్తే, ఆయా సమాధిస్థితులు ఎవరికైనా వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తాయి. కాకపోతే, చేతుల్లో కావలసినంత డబ్బులుంటే చాలు.

అంటే సైన్స్ దెబ్బకు సాధనంతా అరచేతి రిమోట్ లోకి వచ్చి నిలుస్తుందన్న మాట !

అప్పుడేం జరుగుతుంది?

ఆశ్రమాలన్నీ మూతపడతాయి. స్వామీజీలకు పనే ఉండదు. వాళ్ళ స్పీచులు ఎవరూ వినరు. వాళ్ళను ప్రోమోట్ చేస్తున్న టీవీ ఛానల్సన్నీ మూతపడతాయి. ప్రజలు స్వామీజీల చుట్టూ తిరగడం మానేస్తారు. రాజకీయనాయకులు స్వామీజీల చుట్టూ తిరగడం మానేస్తారు. స్వాముల శిష్యులందరూ వాళ్ళనొదిలేసి హాయిగా హెడ్ ఫోన్స్ కొనుక్కుని యాప్ కు కనెక్ట్ అయిపోయి పద్మాసనంలో కూచుని ఏ సమాధి కావాలంటే ఆ సమాధిలోకి తేలికగా వెళ్ళిపోతారు. కొండొకచో, రీఛార్జ్ సెంటర్లో స్వామీజీ ఆయన శిష్యుడూ ఒకే క్యూలో ఒకరికొకరు ఎదురైనా  ఆశ్చర్యపోనవసరం లేదు.

లేదా ఆ కంపెనీకి కాల్ చేస్తే ఒకమ్మాయి గొంతు కులుక్కుంటూ ఇలా వినిపిస్తుంది.

"సవికల్పసమాధి కావాలంటే ఒకటి నొక్కండి. నిర్వికల్పసమాధి కావాలంటే రెండు నొక్కండి. జీవన్ముక్తి కావాలంటే మూడు నొక్కండి. నిర్వాణా కావాలంటే నాలుగు నొక్కండి. లేదా భౌతికఅమరత్వం కావాలంటే మీ శరీరపు సెల్స్  రీఛార్జికోసం మీ దగ్గర్లో ఉన్న రీచార్జి సెంటర్ కు రండి !"

ఇదంతా అతి త్వరలో జరుగబోతోంది. నేను చెబుతున్నది నిజం. మీరే చూస్తారు! ఒకవేళ మీరు కాకపోయినా మీ మనవళ్ళో, మునిమనవళ్ళో ఖచ్చితంగా చూస్తారు !

నేను చెప్పినది ఉత్త రెండు యాప్స్ గురించి మాత్రమే ! ఇలాంటివి 1200 పైన రీసెర్చులు జరుగుతున్నాయి. అవన్నీ వస్తే మనిషి బ్రతుకు ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించండి ! తల గిర్రున తిరుగుతుందా? పక్కన దేన్నైనా పట్టుకోండి లేదంటే క్రింద పడతారు !

(ఇంకా ఉంది)

read more " Master CVV జాతక విశ్లేషణ - 5 (భౌతిక నిత్యత్వం ఎలా రావచ్చు?) "

కొందరు

భయంతో కొందరు బాధతో కొందరు 

కుళ్లుతో కొందరు కుట్రతో కొందరు 

నన్ననుసరించేవారే అందరూ 

ప్రేమతో కొందరు పెంకితనంతో కొందరు


విప్పారిన కళ్ళతో కొందరు

విరబూసిన మనసుతో కొందరు

నను చూస్తూనే ఉంటారందరూ 

విసుగుతో కొందరు విరక్తితో కొందరు


వాదనతో కొందరు వేధిస్తూ కొందరు

సాధిస్తూ కొందరు రోదిస్తూ కొందరు

నాతోనే ఉంటారందరూ

మౌనంగా కొందరు మమేకమై కొందరు


కయ్యాలతో కొందరు కలహాలతో కొందరు

నెయ్యంతో కొందరు నేర్పరులై కొందరు

నాతో జీవించేవారే అందరూ 

నవ్వుతూ కొందరు నాటకాలతో కొందరు


కుతూహలంతో కొందరు కుళ్ళుమనసుతో కొందరు

నేర్చుకోవాలని కొందరు నేర్పించాలని కొందరు

నాతో నడిచేవారే అందరూ

వెనుకగా కొందరు  వెన్నుపోట్లతో కొందరు


అహంతో కొందరు అతిశయంతో కొందరు 

అమాయకంగా కొందరు ఆడంబరంగా కొందరు

నను  చేరవచ్చేవారే అందరూ

నవ్వుతూ కొందరు నటిస్తూ కొందరు


అలిగేవారు కొందరు అల్లాడేవారు కొందరు

ఆట్లాడేవారు కొందరు పోట్లాడేవారు కొందరు

నాతోనే ఆడుకుంటారందరూ

మానవుల్లా కొందరు మరోరకంగా కొందరు


దగ్గరగా కొందరు దూరంగా కొందరు

మనసులో కొందరు మాటల్లో కొందరు

నను వీడిపోలేరెవ్వరూ

పోషిస్తూ కొందరు ద్వేషిస్తూ కొందరు...

read more " కొందరు "

18, జనవరి 2021, సోమవారం

Master CVV జాతక విశ్లేషణ - 4 ( అసలిదంతా ఎలా మొదలైంది? - బ్లావట్స్కి జాతకం )

కొత్త మతాలను, పంధాలను సృష్టించాలన్న ప్రయత్నాలు చాలా పాతకాలం నుంచీ భూమిపైన ఉన్నాయి.  అయితే, అవి ఆయా ఋషుల, మునుల, సిద్ధుల అనుభవాల ఆధారంగా పుట్టాయి. నమ్మకాల ఆధారంగా కాదు. అవి కూడా నేడు మనం చూస్తున్న మతాలలాగా లేవు. ఇలాంటివి కావు కూడా.

'నేనీ దారిలో నడిచాను. ఈ అనుభవం పొందాను. మీరూ నడవండి. ఇదే అనుభవం మీకూ కలుగుతుంది' అనిన దారిలో పాతకాలపు మతాలు ఉండేవి. అంతేగాని, 'దీనిని నమ్మండి. నమ్మకపోతే మిమ్మల్ని చంపుతాను' అని బెదిరించో, లేదా 'దీనిని నమ్మితే  డబ్బులిస్తాను.  మా మతాన్ని నమ్మితే, ఈ లౌకిక లాభాలు మీకొస్తాయి' అని లంచాలు ఆశచూపో పాతకాలంలో మతాలు వ్యాపించబడలేదు.

'సాధన - దానిద్వారా కలిగిన సిద్ధి' ఇవే పాతకాలపు మతాలకు ప్రాతిపదికలుగా ఉండేవిగాని, బలప్రయోగం, డబ్బు ఆశచూపించడం, లేదా ద్వేషాలు రెచ్చగొట్టడం ఇవి ప్రాతిపదికలుగా ఉండేవి కావు. కనుక, పాతకాలపు మతాలలో అంతర్గతమైన బలం ఉండేది.  నేటి మతాల లాగా అవి వ్యాపారాలు కావు.

ఏ మతానికైనా, ఆ మతాన్ని ప్రారంభించిన వ్యక్తి యొక్క అనుభవమే ఆధారంగా ఉండేది. అయితే, మధ్యయుగాలనుండీ ఒక క్రొత్త పోకడ ప్రబలింది. అదేంటంటే, ఇప్పటిదాకా ఉన్న మతాలన్నింటినీ కలగలిపి సాంబారు చేసి ఒక క్రొత్త మతాన్ని స్థాపించాలన్న ప్రయత్నం. రాజకీయబలం ఉంటే, ఈ పని చెయ్యడం సులభమౌతుంది. నవీనకాలంలో క్రైస్తవమూ, ఇస్లామూ రాజకీయబలంతోనూ, ఆర్ధికబలంతోనూ మాత్రమే ఇన్ని దేశాలలో వ్యాపించాయిగాని వాటికున్న సైద్ధాంతిక బలంతోనూ, ఆధ్యాత్మిక బలంతోనూ కాదు.

మధ్యయుగాలలో అక్బర్ పాదుషా ఇలాంటి ప్రయత్నాన్ని చేశాడు. యూదు, క్రైస్తవ, ఇస్లాం, జొరాష్ట్రియన్, హిందూ, బౌద్ధ మతాలను కలిపి 'దీన్ ఇలాహి' అనే క్రొత్త మతాన్ని ప్రారంభించే ప్రయత్నాలను ఆయన చేశాడు. అప్పటివరకూ రాజు, మతగురువు అనే రెండు పవర్ సెంటర్స్ ఉండేవి. ఏ దేశాన్నైనా రాజ్యాన్నయినా ఇవే నడిపేవి. చాలాసార్లు వీళ్ళిద్దరి మధ్యనా ఘర్షణ ఉండేది. ఈ గొడవంతా లేకుండా చేసి, రెంటినీ ఒకే పవర్ సెంటర్ గా మార్చి 'రాజు+గురువు' అనే ఒకే అధికారకేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని అక్బర్ ప్రయత్నించాడు. కానీ దానికి కావలసిన ఆధ్యాత్మికశక్తి ఆయనకు లేకపోవడంతో అది ముందుకు సాగలేదు.

ధనాశ చూపో, బెదిరించో వ్యాప్తి చేసే మతాలు కాలగమనంలో నిలబడలేవు. దానిలో నిజమైన తాత్వికతా, ఆధ్యాత్మిక బలమూ ఉంటేనే ఏ మతమైనా కాలప్రభావాన్ని తట్టుకుని కలకాలం నిలబడగలుగుతుంది.

హిందూమతాన్ని అణగద్రొక్కాలని ఎంతోమంది కొన్ని వేల ఏళ్లుగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. వారిలో ఔరంగజేబు వంటి రాక్షసచక్రవర్తులున్నారు. కానీ వారందరూ కాలగర్భంలో కలసిపోయారు. హిందూమతం మాత్రం ఈనాటికీ సజీవంగా నిలిచి ఉంది. ఎందుకంటే, దాని పునాదులు చాలాగట్టివి. నిజమైన ఆధ్యాత్మికత అనే పునాదిపైన అది  నిలబడి ఉన్నది. ఈనాడు తెల్లవాళ్ళ దేశాలలో యోగా, మెడిటేషన్ పేర్లతో హిందూమతం శరవేగంతో వ్యాపిస్తున్నది. చర్చిలన్నీ గొడౌన్లుగా మారుతున్నాయి. కారణమేమిటి? మౌలికమైన స్వచ్ఛతా, ఆధ్యాత్మికబలమూ మాత్రమే ఆ కారణాలు.

నవీనకాలంలో ఇలా క్రొత్త మతాన్ని మొదలుపెడదామన్న ప్రయత్నాన్ని చేసినవారిలో ముఖ్యురాలు హెలెనా బ్లావట్స్కి అనబడే రష్యన్ మహిళ. ఈమెకు ఎలాంటి సాధనా సిద్దీ ఏమీ లేకపోయినప్పటికీ, తనకున్న మేధాశక్తితో, దూకుడుతో, మాటకారితనంతో,  వ్రాసే నేర్పుతో, రాజకీయంగా తనకున్న పలుకుబడితో 'ధియసాఫికల్ సొసైటీ' ని మొదలుపెట్టింది. ఇదికూడా యూదు, క్రైస్తవ, ఇస్లాం, హిందూ, బౌద్ధ మతాల కలగూరగంప  మాత్రమేగాని ఇందులో ఒరిజినాలిటీ ఏమీ లేదు. దీనివెనుక సాధనా బలమూ లేదు.

ఒక క్రొత్త మతాన్ని ప్రారంభించాలంటే, ఏదో ఒక పీ.హెచ్.డీ చేసినట్లుగా, పది పుస్తకాలు చదివి ఒక పుస్తకం వ్రాసి పట్టా  పొందటం కాదు. దానికి సాధనాబలం ఉండాలి. అనుభవజ్ఞానం ఉండాలి. నిజమైన సిద్ధి ఉండాలి. ఇవేవీ లేకుండా, అన్ని మతగ్రంధాలనూ చదివేసి మేధోపరంగా వాటిని అర్ధం చేసుకుని 'ఇదుగో ఇవన్నీ సాంబార్ చేసి నేనొక క్రొత్త మతాన్ని మొదలుపెడుతున్నా' అంటే అది కుదరదు, నిలబడదు. కొంతకాలం క్రొత్తమోజుతో తాటాకుమంటలాగా వెలగవచ్చు గాని స్థిరంగా నిలబడదు, కొనసాగదు. ఒకవేళ కొనసాగినా, నిజమైన జ్ఞానులు అందులోనుంచి ఉద్భవించరు. అంతిమంగా లక్షలాదిమంది దానివల్ల మోసపోవడం జరుగుతుంది. బ్లావట్స్కి మొదలుపెట్టిన మతానికి కూడా  అదే గతి పట్టింది.

హెలెనా బ్లావట్స్కి 12-8-1831 న నేటి ఉక్రెయిన్ లోని ఏకాతెరినోస్లాప్ అనే ఊరిలో రాత్రి 2. 17 కి పుట్టింది. ఆమె జాతకాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

అష్టమంలోని బాధకనీచగురువు వల్ల ఈమె ఆధ్యాత్మికంగా ఏమీ సిద్ధిని పొందలేదని చూడటంతోనే తెలుస్తున్నది. ఇది భయంకరమైన గురుదోషం ఉన్న జాతకం. కనుక, తనకు నిజమైన అనుభవమూ శక్తీ లేనప్పటికీ ఉన్నట్లుగా జనాన్ని లోకాన్ని నమ్మించిందని, ఈ క్రమంలో చాలా చెడుకర్మను మూటగట్టుకున్నదని ఈమె జాతకం చాలా స్పష్టంగా   చెబుతున్నది. సత్యసాయిబాబా జాతకంలో కూడా గురువు నీచలోనే ఉండటం గమనార్హం.

పైగా మంత్రస్థానాధిపతి అయిన శుక్రుడు దానికి ద్వాదశంలో, మనస్సును సూచించే చతుర్దంలో నీచస్థితిలో ఉండటం కూడా, 'సరుకులేకుండా సోకుచేసుకున్న చందం' అన్నట్లు ఇదే విషయాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నది. ఈమె శిష్యులూ అనుచరులూ ఎలాంటివాళ్ళో చతుర్ధ నీచశుక్రుని యోగం చెబుతున్నది. ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైనా ఇంతే జరుగుతుంది. 'యధా గురు తధా శిష్య:' అనేదే దాని సూత్రం.

ఈమె జాతకంలో 3-9 ఇరుసులో రాహుకేతువులు సూర్య - శనులను సూచిస్తూ సున్నా డిగ్రీలలో రాశిసంధిలో ఉండటం, ఆధ్యాత్మికరంగంలో ఈమె ఒక బలమైన ముద్రను వేస్తుందని, కానీ అదంతా బూటకమని, ఈమెకు నిజమైన  ఆధ్యాత్మిక శక్తి లేదని తెలుపుతున్నది.

ఈమెకు విక్రమస్థానంలో  రాహు, శని, బుధ, కుజులు సన్యాసయోగంలో ఉన్నారు. రాహువు సున్నా డిగ్రీలో ఉన్నాడు. కుజ శనులు 11 వ డిగ్రీ మీద ఖచ్చితమైన కంజంక్షన్ లో ఉన్నారు. ఇది చాలా గట్టి విస్ఫొటనాయోగం. అందుకే ఈమె మాట మాట్లాడితే బాంబు పేల్చినట్లు, కొట్టినట్లు, కరుకుగా, వల్గర్ గా, ఎగతాళిగా మాట్లాడేది. విఫలమైన ఈమె వివాహజీవితం వల్ల ఏర్పడిన కసి, బహుశా దీనికి కారణం కావచ్చు.

ఈమెకు 17 ఏళ్ల వయసున్నపుడు 42 ఏళ్ల నీకిఫర్ బ్లావట్స్కి అనే ఒక గవర్నర్ ను  వివాహం చేసుకుని, కొద్ది వారాల తర్వాత అతన్ని విడచి పారిపోయి, మిగతా జీవితమంతా దేశాలు తిరుగుతూ, ఉపన్యాసాలిస్తూ, పుస్తకాలు రాస్తూ గడిపింది. ఎందుకు అతన్ని వదలి పారిపోయిందో ఎవరికీ తెలియదు. ఈమె వివాహం 7-7-1848 న జరిగింది. అప్పుడామెకు రాహు - శని - బుధదశ నడిచింది. ఇది శపితదశ మనకు  తెలుసు. నా వ్రాతలు చదివేవారికి శపితదశ పరిచయమే. కనుక ఆ సమయంలో జరిగిన పెళ్లి, కొద్దిరోజులకే చెడిపోయింది. విదశానాధుడైన బుధుడు తృతీయంలో శపిత, సన్యాస, దుర్ఘటనా యోగాలలో చిక్కుకుని ఉన్నాడు. ఇన్ని చెడుయోగాలున్నపుడు పెళ్లి పెటాకులవ్వక ఇంకేం జరుగుతుంది?

అలా దేశాలు పట్టుకుని తిరుగుతూ అమెరికా చేరిన ఆమె, 1875 లో కల్నల్ ఆల్కాట్ ను కలుసుకుంది. ఇద్దరూ కలసి, తామేదో ప్రవక్తలైనట్లుగా భావించుకుంటూ థియోసాఫికల్ సొసైటీని స్థాపించారు. జన్మలకు జన్మలు తపస్సు చేసినవారికే ఇక్కడ దిక్కులేదు. ఊరకే దేశాలు పట్టుకుని తిరిగి నాలుగు పుస్తకాలు చదివితే సిద్ధి కలుగుతుందా? ప్రవక్తలైపోతారా? మరీ విడ్డూరం కాకపోతే?

ఈ సమయంలో ఆమెకు రాహు - గురుదశ నడిచింది. ఇది గురుఛండాలదశ. అంటే, ఆధ్యాత్మికంగా ఎటువంటి సిద్ధి లేకపోయినా ఉన్నట్లుగా లోకాన్ని నమ్మింపజేసే ప్రయత్నాలు చేసే దశ. అదేగా మరి జరిగింది? దీనికి తోడుగా అదే సమయంలో కల్నల్ ఆల్కాట్ ఈమెకు తోడయ్యాడు. ఆయా దశలు వచ్చినపుడు మనకు తోడుబోయినవాళ్లు మనల్ని కలవడం, ఆ తర్వాత విడిపోవడం జీవితంలో ఎన్నోసార్లు జరుగుతుంది. ఈమె జీవితంలో కూడా ఇదే జరిగింది.

అయితే బ్లావట్స్కి కంటే ఆల్కాట్ కొంత ఉపయోగకారములైన పనులు చేశాడు. శ్రీలంకలో కొనఊపిరితో ఉన్న బౌద్ధాన్ని పునరుజ్జీవింపజెయ్యడంలో అతను చురుకుగా పనిచేశాడు. ఈనాటికీ సింహళ బౌద్ధులు ఆయన్ని గౌరవిస్తారు. బ్లావట్స్కి, ఆల్కాట్ ఇద్దరూ బౌద్ధమతాన్ని స్వీకరించారు. బ్లావట్స్కి అక్కల్ట్ మీద ఎక్కువ వ్రాస్తే, ఆల్కాట్ బౌద్ధం యొక్క మూలసూత్రాలమీద ఎక్కువగా వ్రాశాడు. ఇందుకనే, బ్లావట్స్కి కి బౌద్ధం అర్ధం కాలేదని మాక్స్ ముల్లర్ అన్నాడు. బుద్ధుడు చెప్పినదాంట్లో రహస్యబోధనలు ఏమీ లేవని, రహస్య బోధనలుంటే అది బౌద్ధం కాదని ఆయనన్నాడు. రహస్యబోధనలంటే - సూక్ష్మశరీరం, లోకాలు, ఆత్మలు, మహాత్ములు, దర్శనాలు, జన్మలు మొదలైన మార్మికవిషయాలు. కనుక ఆమె పుస్తకాలను అప్పట్లోనే మేధావులు ఒప్పుకోలేదు.

బ్లావట్స్కి రచనలలో తాంత్రిక బౌద్ధపు ఆనవాళ్లు దండిగా గోచరిస్తాయి. కానీ థేరావాద బౌద్ధులు టిబెట్లో ఉన్న తాంత్రికబౌద్ధాన్ని ఒప్పుకోరు. అది అసలైన బౌద్ధం కాదని వారి వాదన. ఇందులో నిజం లేకపోలేదు.

1876 నవంబర్ లో ఈమెకు శనిమహర్దశ మొదలైంది. 1877 లో Isis Unveiled అనే పుస్తకాన్నీ, 1878 లో ఈమెకు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన The Secret Doctrine అనే పుస్తకాన్నీ వ్రాసింది. శని నవమాధిపతి అనీ, నవమంలో కేతువున్నాడనీ, ఆ శని పుస్తకాలను వ్రాయించే తృతీయంలో ఉన్నాడని గమనిస్తే  ఈ ఉద్గ్రంథాలను ఆమె ఎలా వ్రాసిందో, శనిదశ మొదలైన వెంటనే ఎందుకు వ్రాసిందో అర్ధమౌతుంది. 

ఈ గ్రంధాలకు ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. అదేంటంటే - ఈ నాటికైనా సరే, ఎవరికైనా నిద్రపట్టక అల్లాడుతుంటే, ఈ పుస్తకాలలో రెండు పేజీలు చదివితే చాలు, క్రానిక్ ఇన్సోమ్నియా పేషంట్లయినా సరే, కుంభకర్ణుల్లాగా గుర్రు పెడుతూ నిద్రపోతారు. కనీసం మూడ్రోజులదాకా నిద్రే లేవలేరు. అంతటి శక్తి ఈ పుస్తకాలలో దాగుంది. బాబూరావ్ పటేల్, ఈ పుస్తకాలనూ అరవిందుల 'లెక్చర్స్ ఆన్ ది గీతా' పుస్తకాన్నీ నిద్రపట్టని వారికి మందుగా సూచించేవాడు. 

సీవీవీగారి భక్తులేమో బ్లావట్స్కి ఇంగ్లాండ్ లో చనిపోయి ఇండియాలో ఆయన రెండవభార్య అయిన వెంకమ్మగా పుట్టిందని నమ్ముతూ, మనల్ని కూడా నమ్మమంటారు. నమ్మకపోతే అపచారమని బెదిరిస్తారు కూడా. కానీ నేనేమో, ఈమె చనిపోయి, 'హ్యారీ పాటర్' పుస్తకాలు వ్రాసిన జేకే. రౌలింగ్ గా పుట్టిందని నమ్ముతాను. ఎందుకంటే ఆమె పుస్తకాలూ ఈమె పుస్తకాలూ ఒకే రకంగా ఉంటాయి గనుక. సరదాగా అంటున్నాలే నిజం అనుకోకండి ! బెనిఫిట్ ఆఫ్ డౌట్ ను భక్తులకే ఇచ్చేద్దాం.

అలా దేశాలు తిరిగీ తిరిగీ చివరకు వీళ్ళిద్దరూ (బ్లావట్స్కి, ఆల్కాట్) హాయిగా ఇండియాకు వచ్చి స్థిరపడిపోయారు. ఇండియా నేల అంత సారవంతమైనది మరి ! ఎలాంటి విత్తనం వేసినా ఇక్కడ మహావృక్షంగా పెరుగుతుంది. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి 'నేనే దేవుడి క్రొత్త అవతారాన్ని' అని అరిస్తే, నమ్మేవాళ్ళూ, అనుసరించేవాళ్లూ వేలాదిగా ఈ దేశంలో లభిస్తారు. కానీ మిగతా దేశాలలో, ముఖ్యంగా ఇస్లానిక్ తీవ్రవాద దేశాలలో అయితే వెంటనే వాడిని చంపి అదే కూడలిలో పాతేస్తారు. కనుక మతపరమైన ఏ మోసం చెయ్యాలన్నా దానికి ఇండియా చాలా చక్కని అనువైన ప్రదేశంగా ఉంటూ వచ్చింది. మన దేశంలో అతిప్రాచీనకాలం నుంచీ కుప్పతెప్పలుగా పుట్టిన అనేక మతాలే నా మాటకు రుజువు. ఆ విధంగా మద్రాస్ అడయార్ లో వీరి  సొసైటీ స్థిరపడింది.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, సీవీవీ గారు కూడా మొదట్లో ఈ సొసైటీ సభ్యుడే. అంతేగాక దీని ఇన్నర్ సర్కిల్ మెంబర్ కూడా. దీనినుంచే ఈయన హిమాలయన్ మాస్టర్స్ అని, మహాత్మాస్ అని లేనిపోని పిచ్చి నమ్మకాలను ఎక్కించుకున్నాడు. ఈయన వాడిన భాష, చేసిన సాధన అంతాకూడా థియాసఫీ పంథాలోనే సాగింది. ఆయనమీద థియాసఫీ ముద్రా, బ్లావట్స్కి ముద్రా చాలా గట్టిగా ఉన్నాయన్నది వాస్తవం.

అయితే, బ్లావట్స్కి 8-5-1891 తేదీన న్యుమోనియాతో లండన్లో చనిపోయింది.  అప్పుడామెకు శని - రాహు - శనిదశ జరుగుతున్నది. ఇది భయంకరమైన శపితదశ అన్న విషయం మనకు తెలుసు. తృతీయం ఊపిరితిత్తులకు సూచిక అన్నది అర్ధమైతే తృతీయంలో ఉన్న చెడుయోగాలు అర్ధమైతే, ఆమె రాహు - శనుల శపితదశలో న్యుమోనియాతో ఎందుకు చనిపోయిందో అర్ధమౌతుంది. ఈమెకు బుద్ధిపరంగా సాధనావిధానం అర్ధమైనప్పటికీ ఆచరణలో సాధనాబలం లేనందున, నిజమైన సిద్ధి లేనందున, అయినప్పటికీ లోకాన్ని నమ్మిస్తూ చేసిన ప్రచారం వల్ల, మూటగట్టుకున్న చెడుకర్మ ఆమె మరణానికి ఆ విధంగా  కారణమైంది.

ఈ సందర్భంలో జిల్లెళ్ళమూడి అమ్మగారి వాక్కు ఒకటి గుర్తుకొస్తుంది.

ఒకసారి అమ్మను ఇలా అడిగారు.

'అమ్మా ! ఫలానా వారు మహనీయులమంటూ ప్రచారం చేయించుకుంటూ కాళ్లకు దండాలు పెట్టించుకుంటున్నారమ్మా? వారికేమౌతుంది?'

అమ్మ ఇలా అన్నారు.

'పెట్టినవాడికి కష్టం ఉండదు. పెట్టించుకున్నవాడికి నష్టం తప్పదు'. 

అమ్మ మిగతా మాటలలాగే ఇది కూడా ఎంతో లోతైనమాట ! ఇందులో కర్మసిద్ధాంతమూ, దైవన్యాయమూ, ఆధ్యాత్మికజీవన రహస్యమూ అన్నీ దాగున్నాయి.

ఆ భక్తుడి నమ్మకమే అతడిని రక్షిస్తుంది. కనుక ఆ మహనీయుడిలో శక్తి లేకపోయినప్పటికీ, తన విశ్వాసబలంతోనే ఆ భక్తుడికి కష్టం తప్పుతుంది. కానీ ఈ సోకాల్డ్ మహనీయుడికి తన సంగతేమిటో తనకు తెలుసు. లోకాన్ని ఎంత మోసం చేసినా తన సంగతి తనకు తెలుసును కదా ! కనుక అతడు ఇహానికీ పరానికీ రెంటికీ చెడిపోతాడు. అతడికి నష్టం తప్పదు. నేటి సోకాల్డ్ గురువులూ మహనీయులూ ఇలాంటి వారే.

సీవీవీ గారి సాధన 1910 లో హేలీ తోకచుక్క కనిపించినప్పుడు పుంజుకుందని అంటారుగాని, అంతకుముందే 1900 ప్రాంతాలలోనే ఆయన సాధన చేస్తూ ఉండేవాడనడానికి నిదర్శనాలున్నాయి. అప్పట్లోనే కావేరీతీరంలో ఉన్న ఒక చెట్టుక్రింద కూచుని ఆయన  రాత్రంతా ధ్యానం చేస్తూ ఉండేవాడు. అంతకు 9 ఏళ్ల  ముందే బ్లావట్స్కి చనిపోయింది. సీవీవీగారిని పెళ్ళిచేసుకునే నాటికి వెంకమ్మగారికి 12 ఏళ్ళు, ఈయనకు 38 ఏళ్ళు. ఈ సంఘటన 1906 లో జరిగింది. అంటే 1894 లో వెంకమ్మగారు జన్మించి ఉండాలి. 1891 లో బ్లావట్స్కి చనిపోయింది గనుక 1894 లో వెంకమ్మగా ఆమె మళ్ళీ పుట్టి, తన యోగసాధనను కొనసాగించడానికి, సీవీవీగారి రెండవభార్యగా వచ్చిందని ఆయన భక్తులలో ఒకవర్గంవారు అంటారు. ఇందులో ఎంత నిజముందో మనకు తెలియదు. జ్యోతిష్యశాస్త్ర సహాయం తీసుకుందాం.

సీవీవీగారిది కన్యాలగ్నం బ్లావేట్స్కి గారిది  మిధునలగ్నం. ఇద్దరికీ వివాహజీవితం చెడిపోయింది. ఇద్దరికీ లగ్నాధిపతి బుధుడే అయినప్పటికీ, మిధునలగ్నం వారు  ఉపన్యాసాలివ్వడం, పుస్తకాలు వ్రాయడాలు, దేశాలు తిరగడాలు చేస్తారు. కనుక బ్లావేట్స్కి అలా చేసింది. కన్యాలగ్నం వారు అలిగి ఒకచోట కూచుని  పనిచేస్తూ ఉంటారు. కనుక సీవీవీగారు ధియాసఫీ మీద అలిగి, విడిపోయి, తన సాధన తాను చేసుకున్నాడు. ఇద్దరికీ సప్తమాధిపతి గురువే. బ్లావేట్స్కి కి అష్టమంలో నీచలో ఉన్నాడు. సీవీవీగారికి సప్తమంలో వక్రించి శత్రుస్థానంలోకి వచ్చి ఉన్నాడు. కనుక ఇద్దరికీ  వివాహభావం చెడిపోయింది.

బ్లావేట్స్కిగారి భవిష్యజన్మ తులాలగ్నం అవుతుంది. ఇది సీవీవీగారి కుటుంబస్థానం. సీవీవీగారి  రెండవభార్య  మేషమౌతుంది. ఇది తులకు సమసప్తకమైంది  గనుక బ్లావేట్స్కి సీవీవీగారి రెండవభార్య అయిన వెంకమ్మగారుగా పుట్టి ఉండటానికి అవకాశాలున్నాయి. కానీ బ్లావేట్స్కి  కున్న బహుముఖప్రజ్ఞ వెంకమ్మగారికి లేదు. ఇక్కడ కొంత అనుమానం వచ్చే ఆస్కారం ఉన్నది.   ఏదేమైనప్పటికీ, ఇది సీవీవీగారి భక్తులలో ఒకవర్గం వారి నమ్మకానికి  సంబంధించిన విషయం గనుక  ఎక్కువగా తరచి చూడబోవడం లేదు.

మహాత్మాస్ అనేవాళ్ళు హిమాలయాలలో ఉన్నారని, వారిలో మోరియా, కూతుమి అనే ఇద్దరిని తాను కలుసుకున్నానని వాళ్ళే తనను నడిపిస్తున్నారని బ్లావేట్స్కి అనేది. కల్నల్ ఆల్కాట్ కూడా దీనిని సమర్ధించేవాడు. దానినే అనీబిసెంట్ లెడ్ బీటర్లు కూడా ప్రచారం చేశారు. కానీ దియాసఫీలో చిన్నప్పటినుంచీ నలిగిన జిడ్డు కృష్ణమూర్తి మాత్రం అలాంటి మాస్టర్లు మహాత్మాలు ఎవరూ లేరని అదంతా అబద్దమని కుండబద్దలు కొట్టాడు. అక్కడే  వారితో ఆయన విడిపోయాడు. తన తమ్ముడు నిత్యానంద చనిపోయినప్పుడు ఆ మాస్టర్లు మహాత్మాలు ఎందుకు పలకలేదని, 'నిత్యానందకు ఏమీ కాదు, బ్రతుకుతాడు' అని వాళ్ళు చెప్పినప్పుడు అతనెందుకు చనిపోయాడు? అని ఆయన అడిగాడు. సరియైన సమాధానం ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించాడు. దానికి అనీబెసంట్ నుంచి గాని, ఇంకెవరి నుంచిగాని ఆయనకు సరియైన జవాబులు రాలేదు. ఈ మాస్టర్లు మహత్మలు మామూలప్పుడు ఎన్నో మెసేజిలు ఇస్తూ ఉంటారు, సోది చెబుతూ ఉంటారు. కానీ నిజంగా అవసరం వచ్చినపుడు ఉలకరు పలకరు. ఇదేంటి అని జిడ్డు ప్రశ్నించాడు. అసలు వాళ్లంటూ ఉంటేకదా జవాబు చెప్పడానికి? అందుకని ఆయనకేమీ జవాబు రాలేదు.

సీవీవీగారికి కూడా ఇదే జరిగింది. ఎన్నోసార్లు ఆయన బ్రతుకుతాడని చెప్పినవాళ్లు చనిపోయారు. లేదా రోగాలు తగ్గలేదు. అనుకున్నవి జరగలేదు. ఇదేంటి అని శిష్యులు ప్రశ్నించినపుడు ఆయన MTA ను అడిగేవాడు. ఆ MTA పలికేవాడు కాదు. సీవీవీగారికి ఇదెంటో అర్ధమయ్యేది కాదు. చివరకు తను చనిపోయేరోజున కూడా, చనిపోతానని ఆయన అనుకోలేదు. భౌతిక అమరత్వాన్ని సాధించి తాను ఎల్లకాలం బ్రతుకుతాననే చివరిక్షణం వరకూ ఆయన అనుకున్నాడు. కానీ అది జరగలేదు. యధాప్రకారం MTA ముఖం చాటేశాడు.

ఈ MTA అనేవాడు, అతనికి  ఇంకా పైనుంచి మెసేజిలిచ్చే మహాత్మా అనేవాడు వీళ్ళిద్దరూ బ్రాహ్మణఋషులని సీవీవీ అనేవారు. ఒకవేళ అదే నిజమైతే వారికి మన భారతదేశపు పేర్లుండాలిగాని MTA, One Point, Mahatma ఇలాంటి పేర్లెందుకు ఉంటాయి? కనుక ఇదంతా సీవీవీగారి అంతఃచేతన ఆడించిన మాయ అని అర్ధం కావడం లేదూ? ధియాసఫీలో ఉన్నపుడు నేర్చుకున్న పదజాలాలు, భావజాలాలు, తనవైన బ్రాహ్మణమూలాలతో, తనదైన ప్రత్యేకసాధనతో కలగలసి ఆయనచేత ఈ మాటలన్నీ మాట్లాడించాయి.

బ్లావట్స్కి, ఆల్కాట్ లను ఆయన ఎర్రగొర్రె, తెల్లమేకలన్నాడు. 'దేహంలోనూ హృదయంలోనూ పవిత్రులైన బ్రాహ్మణులకే ఎటర్నిటీ వస్తుందిగాని ఎర్రగొఱ్ఱెలకు తెల్లమేకలకు రాదు' అని ఆయన డైరీలో వ్రాసుకున్నాడు. బ్లావట్స్కి రష్యన్ గనుక ఎర్రగా ఉండేది. ఆమెను ఎర్రగొర్రె అన్నాడు. ఆల్కాట్ అమెరికన్ గనుక తెల్లగా ఉండేవాడు అతన్ని తెల్లమేక అన్నాడు. వారంటే ఆయనకున్న అభిప్రాయమేంటో దీనివల్ల మనం గ్రహించవచ్చు.

కానీ ఆయన చెప్పిన విషయమూ, ఆయన భావమూ నిజమైనదే. మాంసం తింటూ, మద్యపానం, ధూమపానం చేస్తూ ఒక పద్ధతీ పాడూ లేకుండా ఉండేవారి దేహధాతువులు కలుషితములౌతాయి. ఒక వంశంలో ఎన్నో తరాలుగా ఇలా చేస్తూ ఉంటే, వారు తలక్రిందులుగా తపస్సు చేసినా వారికి యోగసిద్ధి లభించదు. ఒకవేళ వారిలోకి దివ్యశక్తి దిగివచ్చి 'వర్కింగ్' మొదలైనా, ఆ ప్రాసెస్ వారికి చాలా బాధాకరంగా ఉంటుంది. వారిలో క్లిన్ చెయ్యవలసిన జన్యుదోషాలు చాలా చాలా ఎక్కువస్థాయిలో ఉంటాయి గనుక, ఆ దివ్యశక్తి వాటిని క్లిన్ చేసే సమయంలో వారికి ప్రాణాలు పోయినంత బాధ కలుగుతుంది.

బ్రాహ్మణ కుటుంబాలలో తరతరాలుగా శుద్ధమైన జీవనం సహజంగా ఉంటుందిగనుక వారికి యోగసాధన తేలికగా వస్తుంది. వారి దేహాలలో వర్కింగ్ జరిగేటప్పుడు వారికి పెద్దగా బాధలుండవు. కొంతమందికి సీవీవీ గారు చెప్పిన 'ఫినామినా' (సూచకక్రియలు) అనేది అసలు కనిపించను కూడా కనిపించదు. మన దేహం, మన హృదయాలు ఎంత శుద్ధంగా ఉంటె సాధన అంత తేలికగా సుఖంగా జరుగుతుంది. ఇది వాస్తవమే. ఒకవేళ వారు కూడా దారితప్పి ఇలాంటి అలవాట్లు నేర్చుకుంటే వారి దేహధాతువులు కూడా దోషభూయిష్టములుగా మారిపోతాయి గనుక బ్రాహ్మణకుటుంబాలలో పుట్టినా సరే, వారికి కూడా యోగసిద్ధి లభించదు.

ఇక్కడేదో నేను కులపక్షపాతినని అనుకోకండి. నేను గుణపక్షపాతిని. మంచితనానికి మానవత్వానికే నేను పెద్దపీట వేస్తానుగాని కులానికి కాదు. కానీ యోగసాధనాపరంగా చూచినప్పుడు బ్రాహ్మణులుగా పుట్టి, శుద్ధమైన జీవితం గడుపుతూ ఉన్నవారికి ఉన్న సౌలభ్యాలను కాదనలేం. దానికి కారణం తరతరాలుగా వారి శుద్ధమైన అలవాట్లు, జీవనవిధానం, నడవడికలే. అందువల్ల వారి జీన్స్ శుద్ధంగా ఉంటాయి. ఇతర కులాలవారైనా సరే, సద్బ్రాహ్మణుల లాగా జీవించడం మొదలుపెడితే వారు కూడా బ్రాహ్మణులే అవుతారు. బ్రాహ్మణత్వం అనేది కులంతో వచ్చినప్పటికీ అదొక జీవనవిధానమనేది సత్యం. ఆ కులంలో పుట్టినప్పటికీ దానిని పోగొట్టుకోవచ్చు. అలా పుట్టకపోయినా దానిని సంపాదించుకోవచ్చు. ఆ విధంగా బ్రతకాలి అంతే !. పుట్టుకతో బ్రాహ్మణులు కాకపోయినా తమ జీవనవిధానం వల్ల రుషులైన వాళ్ళు వేదకాలంలో ఎందరో ఉన్నారు. 

'మీ శిష్యులలో చాలామంది నాన్ బ్రాహ్మిన్సే ఉన్నారేంటి?' అని ఒక కరుడుగట్టిన చాదస్తపు బ్రాహ్మణుడు నన్నడిగాడు.

'వాళ్లందరికీ నేనే బ్రాహ్మణత్వాన్నిచ్చాను. అంతేకాదు ఋషిత్వాన్ని కూడా ఇవ్వబోతున్నాను' అని అతనికి సమాధానం చెప్పాను. నాకు చాలా పొగరని అతననుకున్నాడు. అది సత్యమని నేనంటున్నాను.  

బ్లావట్స్కి  చెయిన్ స్మోకర్ అని అందరికీ తెలుసు. అదీగాక నోరుముయ్యకుండా ఎప్పుడూ పెద్దగొంతుతో వాగుతూనే ఉండేది. తెల్లామె గనుక ఆల్కహాల్ అలవాటు కూడా ఆమెకు ఉండే ఉంటుంది. అమెరికావాడైన కల్నల్ ఆల్కాట్ కు కూడా ఈ అలవాట్లు ఉండే ఉంటాయి. అలాంటివారికి యోగసిద్ధి ఉందని ఎలా నమ్మాలని సీవీవీగారు ప్రశ్నించేవారు. ఇది సరియైన ప్రశ్నే. ఆయన చెప్పినది నిజమే.

ఆయన శిష్యులు చాలామంది 'మీరు మాకు కలలో కనిపించారు. దర్శనాలలో కన్పించారు. ఇలా  చెప్పారు. అలా చెప్పారు' అని ఆయనతో చెప్పేవారు. వారితో ఆయనిలా అన్నారు.

'నేను కన్పించినా, ఇంకెవరు కన్పించి ఏమేమి  చెప్పినా సరే, అవి జరిగితేనే నిజాలని నమ్మండి. జరగకపోతే మాయాశక్తి ఆడుతున్న నాటకమని తెలుసుకోండి'.

ఇదే తర్కాన్ని ఉపయోగించి చూచినప్పుడు MTA చెప్పినవి ఎన్నో జరగలేదు కదా? మరి MTA అనేవాడు నిజమనుకోవాలా? మాయ అనుకోవాలా? ఆయన సీవీవీ గారికిచ్చిన ఒప్పందాలలో ఏదీ నిజం కాలేదు. మరి MTA ఉన్నట్లా లేక అది సీవీవీగారి భ్రమ అనుకోవాలా?

ధియాసఫీ మూలాలేమిటో, దానిని మొదలుపెట్టిన వారెవరో, వారికున్న శక్తి ఏపాటిదో, వారి ఉద్దేశ్యాలేమిటో పైన వివరించాను. అలాంటి మూలాలనుంచి వచ్చిన చెట్టు నిజమైన ఫలాలనెలా కాస్తుంది? వివేకానందస్వామి అమెరికాలో యూరప్లో తన వేదాంత ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన్ను ఎదుర్కొని అడ్డంకులు కల్పించి ఆయనపైనే విషప్రచారం చేసినవారిలో ధియాసఫిస్టులు మొదటిస్థానంలో ఉన్నారు. వారు నిజంగా సిద్ధపురుషుల చేతులలో పనిముట్లయితే నవీనకాలపు ఋషి అయిన వివేకానందస్వామిని వారెందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఆయనపైనే బురద చల్లాలని చూచారు? కనుక ఈ మాస్టర్స్, మహాత్మాస్, హిమాలయన్ గురూస్ అనేవాళ్ళందరూ అబద్దమని రుజువు కావడం లేదూ?

యూజీగారు కూడా ఈ ధియోసఫీ మాయలో పడి చాలా ఏళ్ళు ఈతకొట్టి, జిడ్డుతో విభేదించి, చివరకు దానిలోనుంచి బయటపడి, మూడేళ్లపాటు యూరప్లో దిక్కులేకుండా తిరిగి చివరకు శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో కుండలినీ జాగృతిని పొంది, జీవన్ముక్తిని అందుకున్నాడు.

భౌతిక అమరత్వాన్ని తన శిష్యులకు ప్రామిస్ చేసిన రామలింగయోగి తనే ఏమైపోయాడో తెలీకుండా మాయమయ్యాడు. అమరత్వం నవ్వింది.

అదే భౌతిక అమరత్వాన్ని త్తన శిష్యులకు బోధించిన అరవిందయోగి పాండిచ్చేరిలో సమాధి అయ్యాడు. అమరత్వం మళ్ళీ నవ్వింది.

అదే భౌతిక అమరత్వాన్ని తన శిష్యులకు కూడా ప్రామిస్ చేసిన మాస్టర్ సీవీవీ గారు 1922 లో ఒకరోజున చనిపోయారు. అమరత్వం ఈసారి పగలబడి నవ్వింది.

1910 ప్రాంతంలో హిందూపత్రికలో ఆయనిచ్చిన ప్రకటన ఇలా ఉంది 'చావకుండా ఉండాలనుకునేవారు నన్ను సంప్రదించండి'. ఈ ప్రకటనను చూచి ఎందరో ప్రముఖులు ఆయన్ను సంప్రదించారు. ఆయన మార్గంలో యోగసాధన చెయ్యడం మొదలుపెట్టారు. అలా అలా ఆయనకు వెయ్యిమంది శిష్యులు చేరారు. కొన్నేళ్ళకు ఆయన పోయారు. ఆ వెయ్యిమంది శిష్యులూ పోయారు.

హిందూ దినపత్రికలో ఆయనిచ్చిన అమరత్వ సాధనా ప్రకటన మాత్రం మనల్ని వెక్కిరిస్తూ అలాగే ఉండిపోయింది. సీవీవీ గారి శిష్యులు ఆయన్ను ఆయన పద్ధతిని వదిలేసి, వారికి నచ్చినవారిని మాస్టర్లుగా పిలుచుకుంటూ వారికి పూజలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

అమరత్వం తన పనిని తాను చూచుకుంటోంది. మనుషులు మాత్రం యధాప్రకారం చనిపోతూనే ఉన్నారు. 

(ఇంకా ఉంది)

read more " Master CVV జాతక విశ్లేషణ - 4 ( అసలిదంతా ఎలా మొదలైంది? - బ్లావట్స్కి జాతకం ) "

15, జనవరి 2021, శుక్రవారం

Master CVV జాతక విశ్లేషణ - 3 ( భౌతిక నిత్యత్వం అసలు అవసరమా? )

సుఖం కోసం వెదుకులాట అనేది ఈ భూమిమీద జీవం పుట్టినప్పటినుంచీ మొదలైంది. ప్రతిజీవీ దుఃఖాన్ని తప్పించుకుని సుఖంగా బ్రతకాలని అనుకుంటుంది. సుఖం దొరికాక అది శాశ్వతంగా అలాగే ఉండిపోవాలనుకుంటుంది. కానీ ఈ లోకంలో అది సాధ్యం కానిపని. కారణం? శాశ్వత సుఖమనేదానికి భూమిపైన ఉన్న ప్రకృతి అమరిక సహకరించదు. మనిషి తయారు కాబడిన తీరూ, అతని దేహపు తీరూ, అతని మనస్సు యొక్క నిర్మాణమూ దానిని నిలబెట్టే పరిస్థితిలో లేవు.

ఆడామగా అనే తేడా పెట్టడంలోనే జీవక్రియల పరంగాను, దేహధర్మాల పరంగాను, వారివారి పనులేమిటి? అన్నవాటిని ప్రకృతి చాలావరకూ నిర్ణయించేసింది. మగవాడు వేటాడో ఇంకేదో పనిచేసో సంపాదించి తీసుకురావడం, ఆడది ఇంట్లో ఉండి ఇల్లు చక్కబెట్టుకుని వండిపెట్టడం అనేవి ఆటవికకాలం నుంచీ ఉన్నాయి. ఆ తరువాత శారీరకంగా కలవడం పిల్లలని కనడం అనేది ప్రకృతిలో అంతర్భాగంగా ఉంది. ఆ  రకంగా ఆ కుటుంబం లేదా వంశం పెరుగుతూ వచ్చేది.

ఆలోచన లేని ఆటవికదశలో మానవుడు ఉన్నంతలో తిండి, బట్ట, గూడు దొరికితే అదే సుఖం అనుకున్నాడు.  ఆ తరువాత పక్కవాడిమీద ఆధిపత్యం చెలాయిస్తే అదే సుఖమనుకున్నాడు. ఆ తర్వాత ఎక్కువమంది ఆడవాళ్ళని భార్యలుగా చేర్చుకుంటే సుఖం అనుకున్నాడు. ఆ విధంగా గుంపులు మొదలయ్యాయి. బలం ఉన్నవాడు నాయకుడుగా, బలం లేనివాడు అనుచరుడుగా ఉండిపోవడం మొదలైంది. గూడెములు, జనపదాలు, నగరాలు, రాజ్యాలు మొదలయ్యాయి. యుద్ధాలు మొదలయ్యాయి. దోపిడీ మొదలైంది. దాచుకోవడం మొదలైంది. అసమానతలు మొదలయ్యాయి. నాగరికత పెరుగుతూ వచ్చింది.

ఎన్ని జరిగినా మనిషికి శాశ్వత సుఖమనేది అందటం లేదు. ఎన్ని సంపాదించినా, ఎంత దోచుకున్నా, ఎంత దాచుకున్నా, ఎన్ని అనుభవించినా శాశ్వతసుఖమనేది మిగలడంలేదు.  ఈ పరిస్థితిలోనుంచి ఆలోచన పుట్టింది. తత్త్వచింతన పుట్టింది. అనుభవిస్తే కలిగే ఆనందం తాత్కాలికం. అనుభవించకుండా నిగ్రహించుకుంటే కలిగే ఆనందం దానికంటే గొప్పదన్న విషయం తెలిసింది. తానొక్కడే అనుభవిస్తే కలిగే ఆనందం కంటే తనకున్నదాన్ని నలుగురితో పంచుకుంటే కలిగే ఆనందం విశాలమైనదన్న స్పృహ ఏర్పడింది. దౌర్జన్యంగా దోచుకుంటే కలిగే ఆనందం కంటే ప్రేమతో జయిస్త్తే కలిగే ఆనందం ఉత్తమమైనదన్న విషయం అర్ధమౌతూ వచ్చింది.

దీనిలోనుంచి తపస్సు మొదలైంది. యోగం మొదలైంది.  సాధన మొదలైంది.

దేవుడికి ఎవరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని మతాలు ఏర్పడినా, ఈ ప్రాసెస్ మాత్రం అన్నిచోట్లా ఇదే విధంగా ఉన్నది. మొదట్లో గాలినీ నీళ్ళనూ ఎండనూ చలినీ భూమినీ ఆకాశాన్నీ అగ్నిని పూజించిన మనిషి, తర్వాత్తర్వాత వీటిని సృష్టించినవాడో, అదో, ఏదో ఒకటి ఉండాలనుకుని దానికి తన భాషను బట్టి పేర్లు పెట్టుకుని ఆకారాలు కల్పించి పూజించడం మొదలుపెట్టాడు.  దాని కరుణ ఉంటె అన్నీ కలసి వస్తాయన్న  భ్రమను పెంచుకున్నాడు. దేవుడికి తాను పెట్టిన పేరును, తాను ఊహించిన రూపాన్ని ఇతరుల మీద రుద్దుతూ, వాళ్ళు వినకపోతే వాళ్ళను చంపుతూ వచ్చాడు. ఇలా చేస్తే తాను చనిపోయాక స్వర్గానికి పోతానని, మిగతా వాళ్ళందరూ నరకానికి పోతారని భ్రమలు పెంచుకున్నాడు. 

కొన్నాళ్ళు ఇలా గడిచాక, చనిపోయాక స్వర్గం వస్తే  ఉపయోగమేముంది, ఇప్పుడే ఇక్కడే రావాలన్న భావన మొదలైంది. వెరసి, ఆనందం కోసం బయట వెదికితే ఉపయోగం లేదు. లోపల వెదకాలి అన్న విషయం అర్ధమైంది. బయట లోకంలో ఆనందాన్ని వెదికేది సైన్స్ అయింది. లోపల వెదికేది ఆధ్యాత్మికత అయింది. ఈ క్రమంలో ఆధ్యాత్మికులు భౌతికాన్ని వదిలిపెట్టి తమలోలోపలకు వెళ్లడం ఎక్కువైంది.  సమాజానికి దూరంగా పోయి తపస్సులో ఉండటం మొదలైంది.

ఈ పోకడ బాగా ముదిరిన తర్వాత వారిలో  కొందరిలో ఇంకొక ఆలోచన మొదలైంది. అదేంటంటే, లోపల తాము పొందిన ఆనందాన్ని బయటకు ఎందుకు తేకూడదు? భూమిని వదిలి పైపైకి లోలోపల పోయి స్వర్గాన్ని అందుకున్నాం సరే. ఆ స్వర్గాన్ని ఇదే భూమిపైకి ఎందుకు దించకూడదు? అనే ప్రయత్నాలు మొదలయ్యాయి. సమాజాన్ని వదిలిపెట్టి కొండల్లో అడవులలో ఉంటూ తపస్సు చేసి పొందినదాన్ని సమాజంలోకి ఎందుకు తేకూడదు? తనకు తెలిసినదానిని నలుగురికీ ఎందుకు చెప్పకూడదు? వారికెందుకు దారి చూపకూడదు? అనిన ప్రయత్నాలు మొదలయ్యాయి.

బొందితో స్వర్గం కాదు, బొందిలోకే స్వర్గాన్ని దించాలన్న ఊహ  కలిగింది. దీనికి మార్గం నశించిపోయే ఈ శరీరాన్ని దైవత్వంతో నింపి నశింపు లేనిదానిగా శాశ్వతమైనదానిగా చెయ్యాలన్న భావన బలపడుతూ వచ్చింది. ఒక్కరైనా అలా చెయ్యగలిగితే, మిగతా అందరూ చెయ్యడానికి దారి ఏర్పడుతుంది.  అప్పుడు భూమి అంతా అలాంటి దివ్యమానవులతో నిండిపోతుంది. స్వర్గంగా మారుతుంది.

ఆ స్వర్గంలో ఉండే లక్షణాలేమిటి? ప్రస్తుతం మానవుడిని బాధపెడుతున్నవేవీ దానిలో ఉండకూడదు.  ఏమిటవి?

మొదటిది ఆకలి. ఆకలి ఉండటం వల్లనే మనిషి ఇన్ని పనులు చేస్తున్నాడు. చదువుకుంటున్నాడు. ఉద్యోగాలు చేస్తున్నాడు. వ్యాపారాలు చేస్తున్నాడు. యుద్ధాలు చేస్తున్నాడు. దోచుకుంటున్నాడు. మంచి, చెడు ఎన్నెన్నో పనులను చేస్తున్నాడు. ఆకలే లేకపోతే? మన జీవితం ఎంత హాయిగా ఉంటుంది? ఈ పోటీ ఉండదు. ఈ  ఉరుకులు పరుగులు ఉండవు. ఎక్కడెక్కడికో పోయి ఉద్యోగాలు చేయాల్సిన పని ఉండదు. భూమికోసం యుద్ధాలుండవు. ఆ భూమిపైన పంటలు పండించడం, దానికోసం నీళ్లయుద్దాలు ఏవీ ఉండవు. ఆ తర్వాత ఆ పంటలు దాచిపెట్టడం, దానితో వ్యాపారం చెయ్యడం ఇవేవీ ఉండవు. గొప్పా బీదా తారతమ్యాలుండవు. దొంగతనాలు దోపిడీలు ఉండవు. అసమానతలేవీ ఉండవు. ఏ గొడవా ఉండదు. ఆకలిలో భాగమే దప్పిక. అదికూడా లేకపోతే మనిషి జీవితం ఇంకా ఎంతో హాయిగా ఉంటుంది.

రెండవది రోగం. చిన్నాపెద్దా ఎన్నో రోగాలు మనకు కాలక్రమంలో వస్తుంటాయి. వాటికోసం మందులు కనుక్కోవాలి. రీసెర్చి చెయ్యాలి. ఒక రోగానికి మందు కనుక్కుంటే ఇంకొక రోగం పుట్ట్టుకొస్తుంది. ఆ మందులను కొనుక్కోవాలంటే డబ్బులుండాలి. దానికోసం మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి. ఇదంతా పెద్ద విషవలయం. మనిషి జీవితాన్ని రోగమనే దొంగ దోచుకుంటోంది. కనుక ఇది లేకుండా పోవాలి.

మూడవది ముసలితనం. ఇదొస్తున్నదంటే ప్రతివాడికీ పెద్ద చింత మొదలౌతుంది. దానిని రాకుండా చేసుకోడానికి మందులు మాకులు మ్రింగడం, ఇంకా ఎన్నెన్నో తంటాలు పడాలి. అయినా అది రాకుండా ఉండదు. దానితో అనేక శారీరక మానసిక బాధలు వస్తాయి. ఇంకొకరిపైన ఆధారపడవలసి వస్తుంది.  మాటలు పడవలసి వస్తుంది. మంచాన పడవలసి వస్తుంది. కనుక ఇదికూడా లేకుండా పోవాలి.

నాలుగవది చావు. దీనిని కూడా ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. ఆ తర్వాత ఏమౌతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందరూ ఊహించి చెప్పేవారే గాని, చూచి చెప్పినవారు లేరు. కనుక దీనిని కూడా జయించాలి.

ఇవన్నీ భౌతికమైనవి. వీటిని జయిస్తే సరిపోదు. ఇవన్నీ లేకపోయినా మనిషిని నిరంతరం బాధపెట్టేది ఇంకొకటుంది. అదే మనసు. దానికున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.

దానికీ ఆకలి దప్పికలున్నాయి. ఆశే దాని ఆకలి. దానికీ రోగం ఉంది. కోపం తాపం మొదలైన మానసికరోగాలే అవి. దానికీ ముసలితనం ఉంది. శక్తి తగ్గిపోయి క్షీణించడమే దాని ముసలితనం. దానికీ చావుంది. భౌతికమైన చావు తర్వాత అదేమైతున్నదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కనుక ఇవన్నీ లేకుండా పోవాలి. అంటే మనసుని కూడా జయించాలి.

ఈ గమ్యాలను సాధించిననాడు మనిషికి ఆకలి, దప్పిక, రోగం, ముసలితనం, మరణం, ఆశ, కోరిక, భయం, అసూయ, కోపం, గర్వం, స్వార్ధం ఇవేవీ ఉండవు. అంటే మనిషి దేవతగా మారుతాడు. ఈ స్థితిని పొందాలని భౌతికశాశ్వతసాధనా వాదులు భావించారు. ప్రయత్నించారు. వారిలో రామలింగయోగి, అరవిందులు, సీవీవీగారు ఉన్నారు. సాధనైతే మొదలుపెట్టారు, సాహిత్యం రాశారు, అనుచరులు కూడారు, కుంపట్లు పెట్టారుగాని, ఈ గమ్యాలను వీరుగాని, వీరి అనుచరులు గాని ఎవరూ అందుకోలేకపోయారు. వీరేకాదు ఈ భూమిమీద ఎవరూ ఇప్పటిదాకా ఈ గమ్యాలను అందుకోలేకపోయారు.

అది జరుగుతుందన్న ఆశతో వారి భక్తులు బ్రతుకుతున్నారు. నేనూ కాదనడం లేదు. జరగదని అనడం లేదు. కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సరియైన దారిలో ప్రయత్నం చెయ్యమనే నేనూ చెబుతున్నాను. ఎందుకంటే నా మార్గమూ అదే. నాదేకాదు ఏ ధ్యానిదైనా, యోగిదైనా అంతిమగమ్యం అదే, అవి వారికి తెలిసినా తెలియకపోయినా !

అయితే ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు ఎదురౌతాయి. ఈ ప్రశ్నలు నేను సంధిస్తున్నానని, వీటికి జవాబులు నాకు తెలియవనుకోకండి. తెలుసు. ఆయా మహనీయుల ఘనశిష్యులలో కొంత ఆలోచన రేకెత్తిద్దామన్న సదుద్దేశ్యంతోనే నేనీ ప్రశ్నలు సంధిస్తున్నాను. ఆలోచించండి. మీకు జవాబులు దొరికితే మంచిదే, దొరకకపోతే అప్పుడు నన్నడగండి. చెబుతాను.

ప్రస్తుతం ఒక్క  ప్రశ్నకు మాత్రం జవాబు చెబుతాను. ఇది మీలో ఒకాయన అడిగినదే. గత రెండుపోస్టులు చదివిన సీవీవీ గారి శిష్యుడొకాయన నిన్న రాత్రి ఈ విధంగా మెయిల్ ఇచ్చాడు.

'మీరు రాస్తున్నది బాగానే ఉంది. కానీ మీరు మా లైను కాదు కదా? మా విధానం మీకెలా తెలుసు? నేను ఈ సాధన గత 30 ఏళ్ళనుంచీ చేస్తున్నాను. మాకే ఇంకా కొన్ని కొన్ని అర్ధం కావడం లేదు. మీకెలా తెలిశాయి?'

ఇంత బిజీలో కూడా ఆయనకు ఇలా జవాబిచ్చాను.

'ఒకటి సరిగ్గా తెలిస్తే అన్నీ తెలుస్తాయి. అసలిన్ని యోగాలు ఇన్ని మార్గాలు లేవు. ఉన్నదొకటే దారి. దారి సరిగ్గా తెలిస్తే అన్నీ తెలుస్తాయి. మీ ప్రశ్నలోనే మీ జవాబుంది. 30 ఏళ్లుగా అందులో ఉన్నా మీకు తెలియలేదు. 30 నిముషాలలో నాకు  తెలియకూడదని రూలు లేదుగా? అదెట్లా జరిగిందో ఇది కూడా  అట్లాగే జరిగింది. దానికేది కారణమో దీనికీ అదే కారణం'.

సరే ఇప్పుడు నా ప్రశ్నలు వినండి మరి !

------------------------------------------------

1. మీరనుకున్నట్లుగా ఎటర్నిటీ లేదా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ లేదా భౌతిక అమరత్వం వచ్చిందనే అనుకుందాం. అది అందరికీ వస్తుందా లేక కొందరికే వస్తుందా?

అందరికీ వచ్చేపనైతే అప్పుడందరూ ఏమౌతారు? భూమ్మీద పనులన్నీ అప్పుడు  స్తంభించి పోతాయి కదా ! ఆకలిదప్పికలు, రోగాలు, ముసలితనం, చావు, శారీరక, మానసిక, ప్రాణిక సమస్యలేవీ లేనప్పుడు మనిషి ఎలా బ్రతకాలి? ఏం చెయ్యాలి? వాడికెలా తోస్తుంది? చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు ఏవీ ఉండవు. వాటి అవసరమూ ఉండదు. అప్పుడు మనిషి జీవితం ఎంత దుర్భరం అవుతుందో ఆలోచించారా? కొన్నాళ్ళకు ఆ జీవితం మొహంమొత్తుతుంది. అప్పుడు చావుకోసం మనిషి ప్రయత్నాలు మొదలుపెడతాడు. దానికొసం రీసెర్చి చేస్తాడు. ఆకలికోసం, దప్పిక కోసం, రోగం కోసం, ముసలితనం కోసం రీసెర్చి చేస్తాడు. ఎలా చనిపోవాలా అని మార్గాలు వెదుకుతాడు. సీనంతా అప్పుడు రివర్స్ అవుతుంది. ఇందుకా మీ సాధన?

అలాకాకుండా కొందరికే వచ్చేపనైతే, అప్పుడు మిగిలినవాళ్లంతా ఏమౌతారు? సపోజ్ ఒక పదిమందికి భౌతిక అమరత్వం  వచ్చిందని అనుకుందాం. వాళ్ళు చావరు. మిగతా 750 కోట్లమంది చనిపోతారు. వాళ్ళ గతేంటి? వాళ్ళు మళ్ళీ పుడతారా? వాళ్లంతా పుట్టి పోతూ ఉంటే, వీళ్ళుమాత్రం గుండ్రాళ్లలాగా ఇక్కడే ఉంటారా? పైగా, ఆ పుట్టేది ఎవరికి పుడతారు? మామూలు మనుషులకు పుడతారా లేక అమరులకు కూడా పుడతారా? ఇంకో విధంగా  చెప్పాలంటే అమరులకు సెక్స్  ఉంటుందా ఉండదా?

కరోనా లాంటి ఏ ఎపిడెమికో వచ్చి మిగతా వాళ్లంతా పోయి ఈ పదిమంది మిగిలితే అప్పుడేమౌతుంది? ఈ పదిమంది ఈసురోమంటూ ఏడుస్తూ ఇంత భూమ్మీదా ఏం చేస్తారు? చెయ్యడానికి ఏముంది గనుక? ఆ చనిపోయినవాళ్లు మళ్ళీ పుట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే అమరులకు సెక్స్ తో అవసరం లేదు గనుక. ఆ చనిపోయినవాళ్ల జీవులన్నీ ఏమౌతాయప్పుడు? ఈ మిగిలిన పదిమందీ ఏమౌతారప్పుడు? చావురాదు. చెయ్యటానికి ఏమీ లేదు. ఎంతకాలం అలా? ఆ పరిస్థితి అమరత్వమా నరకమా?

పోనీ, అలా ఉండీ ఉండీ, చివరకు అందరూ అమరులైపోయారనుకుందాం. అప్పుడు భూమి మీద ఇన్నికోట్లమంది ఉండి ఏం  చేస్తారు? ఊరకే రాళ్లు రప్పలలాగా ఉంటూ ఉంటారా? లేక వాళ్లకు పనేమైనా ఉంటుందా? పనికి ప్రేరకాలైన  ఆకలిదప్పికలే లేనప్పుడు ఇక వాళ్లకేం పని ఉంటుంది? ఉన్నా వాళ్లేందుకు చేస్తారు? చెయ్యవలసిన అవసరం ఏముంటుంది? ఊరకే జొంబీ ల్లాగా భూమ్మీద తిరుగుతూ ఉంటారా? అది స్వర్గం అవుతుందా నరకం అవుతుందా?

2. ఇలా అమరులైనవారికి పిల్లలు పుడతారా పుట్టరా?

ఒకవేళ పుడతారని అనుకుంటే - అలా పుట్టేవాళ్ళు మామూలు మనుషులుగా పుడతారా, లేక, అమరులుగా పుడతారా? అలా ఎంతమంది పుడతారు? ఒకవేళ అమరులుగా పుడుతూ ఉంటె, కొన్నాళ్ళకు భూమ్మీద  నిలబడటానికే చోటు లేకుండా పోతుంది. ఎందుకంటే అందరూ పుడుతూనే ఉంటారు గాని, ఎవ్వరూ చావరు గనుక. అప్పుడు  భూమినిండా మనుషులే ఉంటారు బెల్లానికి పట్టిన చీమలలాగా. ఆ తర్వాత పుట్టేవాళ్ళు ఎక్కడికి పోవాలి?

ఒకవేళ మామూలు మనుషులుగా పుడితే, వాళ్ళు మళ్ళీ సాధనతో అమరులు కావాలా? ఒకవేళ ఆ జన్మలో కాలేకపోతే మళ్ళీ మళ్ళీ అలా పుడుతూ ఉంటారా?  అంటే, అమరులకు ఆకలిదప్పికలుండవు గాని  పిల్లల్ని కనేపని ఉంటుందా? అదేం అమరత్వం? ఇదే అమరత్వమైతే, అలాంటి అమరత్వం అసలెందుకు? అందులో ఏం ఆనందం ఉందసలు?

లేదా, ఏ విధమైన ఆశా, అవసరమూ, స్పందనా లేకుండా రాళ్ళలా పడుండేపనైతే కూడా అసలా అమరత్వమెందుకు? అంగారకుడు మొదలైన గ్రహాలలో రాళ్ళూ రప్పలూ మాత్రమే ఉన్నాయి. భూమ్మీద కూడా అలాంటి మనుషులే వుంటారన్నమాట ! ఇలాంటి అమరత్వం కోసం ఇంత కష్టపడి ప్రయత్నం చెయ్యాలా? అవసరమా అసలు?

3. ప్రతి మతంలోనూ వారి ప్రవక్తో, దేవుడో ఆకాశం నుంచి ఊడిపడి భూమిని స్వర్గం చేస్తాడని నమ్మకాలున్నాయి. క్రైస్తవులేమో జీసస్ రెండవ రాకడ అంటారు. రెండువేల  ఏళ్ళనుంచి ఈ అబద్దాన్ని చెబుతూ  ఊదరగొడుతూనే ఉన్నారుగాని ఆ జీసస్ అడ్రస్ ఎక్కడా  కనిపించడం లేదు. షియా ముస్లిములేమో పన్నెండో ఇమామ్  వస్తున్నాడని వెయ్యేళ్ళనుంచీ ఎదురు చూస్తూనే ఉన్నారుగాని ఆయన వస్తున్న జాడా జవాబు ఏమీ కనిపించడం లేదు. ఈ ఎదురు చూస్తున్నవాళ్లంతా  చనిపోతున్నారుగాని వాళ్ళేమీ రావడం లేదు. బౌద్ధులేమో మైత్రేయబుద్ధుడు వస్తాడంటారు. జిడ్డు కృష్ణమూర్తిని మైత్రేయ అన్నారు ఆయన భక్తులు. ఆయనేమో ఒకప్రక్కన భక్తి వద్దంటాడు. ఇంకోపక్క ఆయన భక్తులు ఆయన్నే మైత్రేయ అంటారు. ఈలోపల ఓషో భక్తులొచ్చి ఈయనే మైత్రేయ అంటున్నారు. షీలానడిగితే ఇంకో రకంగా చెబుతోంది. హిందువులేమో కల్కి అవతారం గుర్రమెక్కి వస్తుంది అంటారు. గుర్రాలకాలం పోయి వందలఏళ్ళు అవుతోంది. ఆయనెప్పుడొస్తాడో, గుర్రంతో కత్తితో వచ్చి ఈ రాకెట్ యుగంలో ఇప్పుడేం చేస్తాడో ఎవడికీ తెలీదు. ఈలోపల ఎవడు పడితే వాడు నేనే కల్కి అవతారమంటూ మత్తుమందు కలిపిన తీర్ధం పోస్తూ ఎవడి బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు.

ఆ ప్రవక్తో దేవుడో దిగి వచ్చినపుడు ఈ చచ్చిన పీనుగులని మళ్ళీ బ్రతికిస్తాడని మూర్ఖంగా నమ్ముతూ చనిపోయినవాళ్లను పాతేస్తారు గాని దహనం చెయ్యరు. ఇది జరగదన్న సంగతి వాళ్లకు అర్ధం కాదు. కానీ ఈ లోపల వేలాది ఏళ్లుగా పాతిపెట్టిన పీనుగులతో భూగోళం మొత్తం ఒక శవాల కుప్ప అవుతోంది. సమాధులతో నిండి పోతోంది.

ఇప్పుడు లేటెస్ట్ గా రామలింగయోగీ, అరవిందులూ, సీవీవీ గారూ మళ్ళీ వస్తారని వారివారి భక్తులు ఎదురుచూస్తూ ప్రార్ధనలు చేస్తున్నారు. నా ప్రశ్నేంటంటే జీససూ, ఇమామూ, మైత్రేయా, కల్కీ, రామలింగమూ, అరవిందులూ, సీవీవీగారూ అందరూ కలసి  ఒకేసారి కట్టగట్టుకుని వస్తారా లేక విడివిడిగా వస్తారా? గ్రూప్ ఫోటోనా సింగిల్ ఫోటోనా అన్నది నా ప్రశ్న? లేదా, పాతమతాలు చెబుతున్న అబద్దాలనే మీరూ ఇంకో కొత్తరకంగా చెబుతున్నారా? కొత్త సీసాలో పాతసారానా? ఇప్పటిదాకా పాతవాళ్లే రాలేదు. ఇప్పుడు కొత్తగా ఈ ముగ్గురూనా?

అలా వచ్చినపుడు ఎవరి భక్తుల్ని మాత్రమే వాళ్ళు  ఉద్ధరించి స్వర్గాన్ని వారికిస్తారా లేక అందరినీ కరుణిస్తారా? ఒకవేళ వాళ్ళలా కరుణించినా ఈ కరుడుగట్టిన భక్తులు దానిని ఒప్పుకుంటారా? మా ప్రవక్త వేషంలోనే మాకు కనిపించమని గోల చేస్తారా?

అసలు వీళ్ళందరూ ఒకటేనా లేక వేర్వేరా? ఒకడే అయి, ఒకడే వస్తే, వాడు ఏ రూపంలో వస్తాడు? అందరికీ ఒకే రూపంలో  కనిపిస్తాడా లేక ఎవరికి వారి ప్రవక్తలాగా  కనిపిస్తాడా? బ్రతికున్నపుడు వీళ్లందరి ఫిలాసఫీలూ వేర్వేరు కదా? మరి చనిపోయాక అందరూ ఒకే ఆత్మగా ఒకే శక్తిగా ఎలా అవుతారు? ఏం జరగబోతోందసలు?

అసలివన్నీ నిజాలేనా లేక అందరూ నిద్దట్లో కలలు కంటూ కలవరిస్తున్నారా? చీకటిలోనుంచి వెలుగులోకి పోతున్నామని భ్రమపడుతూ ఇంకా కటిక చీకట్లోకి పోతున్నారా?  

(ఇంకా ఉంది)

read more " Master CVV జాతక విశ్లేషణ - 3 ( భౌతిక నిత్యత్వం అసలు అవసరమా? ) "