You cannot cure Cancer with Zandu Balm

12, మే 2025, సోమవారం

మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల

నేడు బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి పండుగరోజు. అందుకని, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీస్వామివారు రచించిన  'ఆత్మవిద్యా విలాసము' అనే గ్రంధమునకు నా వ్యాఖ్యానమును మా 72 వ పుస్తకంగా ఈ పవిత్రదినాన విడుదల చేస్తున్నాము.

యోగీంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు వ్రాసిన 'సదాశివేంద్ర స్తవము' ను కూడా ఇందులో పొందుపరచాము.

స్వామివారి గురించి  ఇంతకుముందు వ్రాసిన 'శివయోగ దీపిక' పోస్టులో వివరించాను. ఆయన వ్రాసిన గ్రంధములలో ముఖ్యమైనది 'ఆత్మవిద్యా విలాసము'. ఇది 64 శ్లోకములతో కూడిన చిన్న పుస్తకమే. కానీ భావగాంభీర్యతలో చాలా గొప్పది. ఈ శ్లోకములకు అర్థమును వివరిస్తూ, ఆటవెలది, కందము, ఉత్పలమాల ఛందస్సులలో పద్యములుగా తెనిగించాను. ఈ పద్యములను కేవలం రెండు రోజులలో వ్రాశాను.

'సదాశివేంద్ర స్తవము' లో 45 శ్లోకములున్నాయి. చాలావరకు 'ఆత్మవిద్యావిలాసము'లో ఇవ్వబడిన భావములనే స్వీకరించి, సదాశివేంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు ఈ శ్లోకాలను రచించారు. కనుక మొదటి 64 శ్లోకములలో వాడబడిన ఛందస్సులను మళ్ళీ వాడటం ఎందుకనిపించింది. అందుకని, ఒక క్రొత్త ఒరవడిలో, 'వృషభగతి రగడ' అనే ఛందస్సులో ఈ 45 పద్యములను రచించాను. కొన్ని పద్యములు, దీనికి దగ్గరి ఛందమైన 'మత్తకోకిల' లో వచ్చినాయి. 

రగడలలో 20 దాకా రకాలున్నాయి. ఇవి, లయ-తాళ ప్రధానమైన ఛందోరీతులు. 'సదాశివేంద్రస్తవము'లో నేను వ్రాసిన పద్యములు పూర్తిగా ఛందోబద్ధములుగా లేవు. ఏమంటే, యతిప్రాసల చట్రంలో ఇముడ్చబడినపుడు, భావవ్యక్తీకరణలో స్వేచ్ఛాసౌందర్యం కుంటుపడుతుంది. కనుక, లయకు నడకకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఈ పద్యములను వ్రాశాను. చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, రాగబద్ధంగా పాడుకోవటానికి రగడలు దరువులు చాలా తేలికగా హాయిగా ఉంటాయి.

శృంగేరీ పీఠాధిపతులందరూ ఈ 'ఆత్మవిద్యావిలాసము' ను వేదంతో సమానంగా స్వీకరించారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీస్వామి వారైతే, తన చివరిక్షణం వరకూ ఈ పుస్తకమును దగ్గర ఉంచుకుని, దీని శ్లోకములను వింటూ దేహత్యాగం చేశారు.

ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి.

అవధూతోపనిషత్ మరియు అవధూతగీతలలో ఉన్న భావజాలమే దీనిలో ఇంకొకవిధంగా చెప్పబడింది. అవధూతోపనిషత్ అనేది కృష్ణయజుర్వేదమునకు చెందిన సన్యాసోపనిషత్తు. అంటే, సన్యాససాంప్రదాయమును ఉగ్గడించే శ్లోకములను కలిగి ఉంటుంది. ఇటువంటివి నాలుగువేదములలో కలిపి 19 ఉపనిషత్తులున్నాయి. ఇవి లౌకికజీవితమును పూర్తిగా త్యజించి, ఆధ్యాత్మికజీవితాన్ని గడపడం పైన దృష్టిని ఉంచుతాయి. ఈ గ్రంథంలో చెప్పబడిన అవధూతస్థితి కూడా దీనినే వర్ణిస్తున్నది.

అవధూతస్థితిని గురించి అనుకోవాలంటే  దత్తాత్రేయుల తరువాత సదాశివేంద్రులనే చెప్పుకోవాలి. ఈయన మన తెలుగువాడు మాత్రమే కాదు, మూడువందల ఏళ్ల క్రితం మనకు దగ్గరగా తమిళనాడులో నడయాడిన మహోన్నతుడు. మనమేమో ఇటువంటి మహనీయులను మర్చిపోయి, పీర్లను, ఫకీర్లను ఆరాధిస్తూ, దర్గాలలో తాయెత్తులు కట్టించుకుంటూ, మన మూలాలను మర్చిపోయి మతాలు మారిపోతూ, 'అందరూ దేవుళ్ళే కదండీ' అని నంగినంగి మాటలు మాట్లాడుకుంటూ, హిందూమతానికి ద్రోహులుగా, దరిద్రులుగా తయారై ఉన్నాము. ఇదీ మన పరిస్థితి !

యధావిధిగా ఈ గ్రంధమును వ్రాయడంలోనూ, విడుదల చేయడంలోనూ నాకు తోడునీడలుగా ఉన్న సరళాదేవి, అఖిల, లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

ప్రస్తుతానికి ఇది E Book గా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, తెలుగుపద్యముల అభిమానులకు ఈ గ్రంధం మహదానందాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను.

read more " మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల "

7, మే 2025, బుధవారం

Operation Sindoor

నిర్దిష్టమైన ప్లానింగ్ తరువాత ఆపరేషన్ సిందూర్ జరిగింది.

ఆలస్యమైందని కొంతమంది ఆక్రోశించారు. కానీ, ఇటువంటి చర్యలకు ముందు చాలా ప్లానింగ్ అవసరమౌతుంది. దౌత్యపరంగా ముందు పాకిస్తాన్ ను దిగ్బంధం చేయాలి. అందుకే ఈ ఆలస్యం. నిజానికి ఇది ఆలస్యం కాదు, అవసరం.

ఉత్తరభారతంలో, సిందూరమంటే పాపటి కుంకుమ. పెళ్ళైన ఆడవాళ్లు ధరిస్తారు. మొన్న జరిగిన పహల్ గావ్ దాడిలో ఎంతోమంది సిందూరాలు చెరిగిపోయాయి. అందుకే ఈ పేరును పెట్టారులాగుంది. సరైన పేరు !

విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా చాలా బాగుంది. ఇద్దరు మహిళలు రక్షణదళాల ఆఫీసర్స్. విక్రమ్ మిశ్రీ యేమో కాశ్మీర్ పండితుల వంశానికి చెందినవాడు. ఆడవాళ్లకు కాశ్మీర్ గడ్డపైన జరిగిన అన్యాయానికి ప్రతీకారచర్యగా ఈ ముగ్గురితో ప్రెస్ మీట్ పెట్టించడం పాకిస్తాన్ ను చెప్పుతో కొట్టినట్లుగా ఉంది.

అంతేకాదు. షరియా అమలులో ఉన్న పాకిస్తాన్ వంటి ఉగ్రవాద ఇస్లామిక్ దేశాలలో ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. బురఖా తీసి కాలేజీకి వెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. ఆడపిల్లలకు ప్రాధమిక స్కూల్ కూడా అందుబాటులో ఉండదు. అలాంటిది మనదేశంలో ముస్లిం మహిళలు ఎంతగా ఎదగగలరు అనడానికి కల్నల్ సోఫియా ఖురేషి ఒక ఋజువు. 'ఇండియాలో ముస్లిములకు భద్రత లేదు' అని వాదించే దొంగలు ఈమెను చూచి బుద్ధితెచ్చుకోవాలి.

మొన్న వాఘా బార్డర్ దగ్గర పాకిస్తాన్ కు పంపించబడుతున్న పాక్ పౌరులైన ఆడవాళ్ళు గోడుగోడున ఏడుస్తున్నారు. ఎందుకు? ఇండియాలో ముస్లిములకు రక్షణ లేదుకదా? మరి మీ దేశమైన పాకిస్తాన్ కు వెళ్ళడానికి అంత ఏడుపెందుకు? ఇవన్నీ దొంగనాటకాలు కావా?

అదలా ఉంటే, పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ తీవ్రవాదుల శిబిరాలున్నాయో మన ఇంటెలిజెన్స్  వర్గాలు చాలా సరిగ్గా కనిపెట్టి వాటిని బ్లాస్ట్ చేశాయి. మంచిదే. కానీ మన దేశంలోనే ఉన్న అంతర్గత శత్రువులను కూడా అదేపని చేస్తే బాగుంటుంది. మొన్న కాశ్మీరులో జరిగింది ఏమిటి? యాపిల్ అమ్ముకునేవాడినుంచి, గుర్రాలు నడుపుకుంటూ బ్రతికేవాడివరకూ అందరూ పాకిస్తాన్ కు (OGW) ఓవర్ గ్రౌండ్ వర్కర్సే. అసలైన ప్రమాదం వీళ్ళతో ఉన్నది.

మనదేశంలో పాకిస్తానీయులు బంగ్లాదేశీయులు కోట్లల్లో ఉన్నారని ఒక అంచనా. ముందు వీళ్ళను ఏరిపారేసే పనిని ప్రభుత్వం చేపట్టాలి. వీరెవరికీ దేశభక్తి ఉండదు. ఏ దేశం తిండి తింటున్నారో ఆ దేశానికే వెన్నుపోటు పొడిచే ఇలాంటి విశ్వాసం లేనివాళ్లను ముందుగా గుర్తించి వారి పని పట్టాలి. అప్పుడే ముందుముందు దేశానికి, దేశప్రజలకు రక్షణ ఉంటుంది.

ఓట్లకోసం కోట్లాదిమంది పాకిస్తాన్ బంగ్లాదేశీయులను మన దేశంలోకి రానిస్తూ, వారిని ఇండియాలో సెటిల్ కానిస్తున్న రాష్ట్రాల సంగతి ముందు చూడాలి. 'అమెరికా ఫస్ట్' అని ట్రంప్ అన్నట్లు, మనకు 'ఇండియా ఫస్ట్' అన్నదే నినాదం కావాలి. అలాంటి నేషనల్ ఫీలింగ్స్ ఉన్న నేతలనే మనం ఎన్నుకోవాలి. దేశద్రోహులను ఎన్నుకోకూడదు.

ఆపరేషన్ సిందూర్ తో వ్యవహారం అయిపోదు. ఇప్పుడే మొదలైంది. యుద్ధాన్ని మొదలుపెట్టడం తేలికే. ఆపడమే కష్టం. టర్కీ, చైనాల సహాయంతో పాకిస్తాన్ తప్పకుండా తిరుగుదాడి చేస్తుంది. ఈ యుద్ధంలో మన దేశం గెలవాలని ప్రార్ధిద్దాం. న్యూక్లియర్ వార్ గా మారకూడదని కోరుకుందాం.

టర్కీలో ప్రకృతి విలయాలు జరిగినపుడు మనదేశం ఎంతో సహాయం చేసింది. ఆహారపదార్ధాలు, మందులు, సహాయకబృందాలు అన్నింటినీ పంపి మానవత్వాన్ని చూపించాం మనం. కానీ అదే టర్కీ ఈనాడు మనకు వెన్నుపోటు పొడుస్తోంది. ముస్లిం దేశాలనుండి స్నేహాన్ని, మంచితనాన్ని ఆశించడం పొరపాటని దీనిని బట్టి అర్ధమౌతుంది. మతం ముందుకొచ్చేసరికి వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది.

మోదీగారి ప్రభుత్వాన్ని నూటికి సూరు శాతం బలపరుద్దాం. అప్పుడే మన దేశానికి భద్రతా భవిష్యత్తూ రెండూ ఉంటాయి.

read more " Operation Sindoor "

2, మే 2025, శుక్రవారం

మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల

నేడు వైశాఖ శుక్లపంచమి.  ఆదిశంకరులవారి పవిత్ర జన్మదినం.43 ఏళ్ల క్రితం, మా గురువర్యులైన స్వామి నందానందగారి సమక్షంలో సరిగ్గా  ఈనాడే నాకు ఉపనయనం జరిగింది. ఆ విధంగా, పంచవటి శిష్యులకు ఈ రోజు రెండువిధాలుగా ముఖ్యమైన రోజు అవుతున్నది.

'శంకరశ్శంకరస్సాక్షాత్' (శంకరులు సాక్షాత్తు ఈశ్వరుడే) అనిపించుకున్న మహనీయుడు పుట్టిన పవిత్రమైన రోజు ఇది. వేదములలో దాగి ఉన్న అద్వైతమునకు ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి, లోకానికి బోధించిన ఘనుడాయన. అమానుషములైన ఎన్నో పనులను కేవలం 32 ఏళ్ల చిన్న జీవితంలో సాధించిన మహనీయుడాయన.

తన పొట్ట, తన సుఖం మాత్రమే చూచుకునే అల్పులు, కోట్లాదిమంది పురుగులలాగా ఈ లోకంలో పుట్టి పోతుంటారు. కానీ ఇటువంటి దివ్యాత్ములు ఎప్పుడో ఒకసారి మాత్రమే పుడతారు. భారతజాతికి, సనాతనధర్మానికి ఒక దిశను కల్పించిన మహనీయుడాయన. వేలాది ఏళ్లకు ఒకసారి మాత్రమే అటువంటి మహనీయుల జననం జరుగుతుంది. వారి చరిత్రను నేను వ్రాసిన 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' అనే గ్రంధంలో వివరంగా చర్చించాను.

ఇటువంటి పవిత్రమైన ఈ రోజున, మా 'పంచవటి' నుండి వెలువడుతున్న 71 వ పుస్తకంగా 'గీతా కంద మరందము' అనే గ్రంధాన్ని విడుదల చేస్తున్నాము.

ఇప్పటివరకూ మా సంస్థనుండి వచ్చిన పుస్తకాలకూ దీనికీ భేదం ఉన్నది. ఇప్పటివరకూ వచ్చిన 70 పుస్తకాలు నేను వ్రాసినవి. వాటిలో కొన్నింటిని నా శిష్యులు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదాలు చేశారు. ఈ పుస్తకం మాత్రం నా శిష్యురాలైన శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి వ్రాసినది. మార్చి నెలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మికసమ్మేళనం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది నేడు E-Book గా విడుదల అవుతున్నది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఉత్తమగ్రంధాలను నేను వ్రాయడం కాదు, నా శిష్యులు కూడా వ్రాస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పనికి శ్రీకారం చుట్టింది శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. అయితే, నా శిష్యురాలైన తర్వాత ఈమె కవయిత్రి కాలేదు. ముందునుంచీ ఈమెలో రచనాశక్తి, కవిత్వశక్తి ఉన్నాయి. వీరి తాతముత్తాతలు, మేనమామలు అందరూ మంచి కవులే. వెంకటేశ్వరస్వామివారిపైన పద్యములను, శతకములను ఈమె రచించింది. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి (న.ర.సం) ఉపాధ్యక్షురాలు. ప్రస్తుతం ఈ గ్రంధమును రచనచేసి, నాకు అంకితమిచ్చింది. ఇది ఈమె యొక్క నిష్కల్మషమైన మనస్సుకు, గురుభక్తికి నిదర్శనం.

ఘంటసాల వెంకటేశ్వరరావుగారు మధురంగా ఆలపించిన 108 గీతా శ్లోకములకు మరికొన్ని శ్లోకములను చేర్చి మొత్తము 150 కంద పద్యములలో రచయిత్రి ఈ పుస్తకమును వ్రాశారు. అందుకే 'కంద మరందము' అని పేరు పెట్టారు. మకరందము అనినా, మరందము అనినా, అర్ధం ఒకటే.

అచ్చ తెలుగు కందపద్యముల నడకలో ఉన్న అందము, గీతాశ్లోకములలో ఉన్న భావగాంభీర్యతలు కలసి పాలలో తేనె కలిపినట్లుగా వీరి రచన వచ్చింది. తెలుగుపద్యముల అభిమానులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఈ గ్రంధము అమృతతుల్యముగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు.

వీరి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామివారి కటాక్షం ఈమెపైన స్థిరంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి.

భగవద్గీతకు సమగ్రమైన వ్యాఖ్యానమును వ్రాయడం నా ముందున్న లక్ష్యాలలో ఒకటి. దీనికి రెండు కారణాలున్నాయి.

ఒకటి - మహనీయులైనవారందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. అప్పుడుగాని వారి రచనావ్యాసంగానికి పరిపూర్ణత రాలేదు. గీతకు సమగ్రమైన వ్యాఖ్యానాన్ని మొట్టమొదటగా వ్రాసినది ఆదిశంకరులు. ఈ పనిని చేయడం ద్వారా, మహాభారతంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన అమృతభాండాన్ని బయటకు తీసి, ఆ అమృతాన్ని లోకానికి పంచిపెట్టాడాయన. ఈ పనిని ఆయన 2500 ఏళ్ల క్రితం చేశారు. 

అయితే,  ఈనాటికీ మన హిందువులలో గీతను పూర్తిగా చదవనివారు కోట్లల్లో ఉన్నారు. ప్రపంచం నేడు గీతకు ఎంతో ఉన్నతమైన స్థానాన్నిస్తున్నది. విదేశీ విశ్వవిద్యాలయాలలో భగవద్గీతను బోధిస్తున్నారు. అన్ని మతగ్రంధాల కంటే దీనిలో అత్యంత ఉత్తమమైన భావాలున్నాయని ప్రపంచ మేధావులే ఒప్పుకుంటున్నారు. అయితే మనకు మాత్రం గీతలో ఏముందో తెలియదు. కనీసం ఒకటి రెండు శ్లోకాలు కూడా మనకు రావు. వచ్చినా అర్ధాలు తెలియవు. తెలిసినా ఆచరణలోకి రావు. ఇది మన హిందువులకు పట్టిన అనేక దరిద్రాలలో ఒకటి. దీనిని పోగొట్టాలంటే, గీతకు సమగ్రమైన నిస్పాక్షికమైన వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. దానిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలి.

రెండు - వేదముల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. కనుక, గీతకు సరియైన వ్యాఖ్యానాన్ని చేయగల్గితే అది వేదోపనిషత్తులను వ్యాఖ్యానించినట్లే అవుతుంది. ఇంతకంటే మానవజన్మకు సార్ధకత ఇంకేముంటుంది?

ఈ రెండు కారణాల వల్ల ఈ ఉత్తమలక్ష్యాన్ని నా ముందు ఉంచుకున్నాను.

ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యానకర్తలందరూ, వారివారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కోణాలలో మాత్రమే గీతను వ్యాఖ్యానించారు గాని, నిష్పక్షపాతంగా, ఉన్నదున్నట్లుగా గీతార్ధములను వ్రాయలేదు. కొద్దో గొప్పో చలం గారు ఆ పనిని చేశారు. కానీ ఆయనకు శాస్త్రపాండిత్యం లేదు. వేదాంత-యోగపరమైన సాధనలలో లోతుపాతులూ ఆయనకు తెలియవు.

బహుశా నా సంకల్పం 2026 లో సాకారం కావచ్చు. ఈలోపల నా శిష్యురాలు ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఒక చిన్నపాటి గీతను పూర్తి చేసింది. త్వరలో రాబోతున్న నా గీతావ్యాఖ్యానానికి పల్లవి (prologue) లాంటిదిగా  ఈ పుస్తకమును అనుకోవచ్చు.

కలకండను బస్తాడు తిననక్కరలేదు. ఒక చిన్నముక్కను తినినా తీపిగానే ఉంటుంది. అదేవిధంగా, అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, మన జన్మలు ధన్యం కావడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలైనా చాలు. సంక్షిప్తగీత కూడా విక్షేపాలను అంతం చేసే నిక్షేపంలాంటి దైవమార్గంలోనే నడిపిస్తుంది, సరిగా అర్ధం చేసుకోగలిగితే.

యధావిధిగా, ఈ పుస్తకం కవర్ పేజీని అద్భుతంగా తయారుచేసిన ప్రవీణ్ కు, టైప్ సెట్టింగ్ మరియు ప్రూఫ్ రీడింగ్ పనులను చూచుకున్న అఖిలకు, పబ్లిషింగ్ ని చూచుకున్న శ్రీనివాస్ చావలికి ఆశీస్సులు. వీరంతా మా పంచవటి పబ్లికేషన్ టీమ్ రధసారధులు.

కవితారసికులు, గీతాశాస్త్రాధ్యయన తత్పరులు అయిన తెలుగుపాఠకులు ఈ గ్రంధమును ఇతోధికంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

 ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల "

1, మే 2025, గురువారం

నీడల వెంట పరుగులు

చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకున్నవారిని గతంలో ఎంతోమందిని మనం చూశాము. కానీ, సోషల్ మీడియాలో తన ఫాలోయర్స్ తగ్గిపోతున్నారని ఆత్మహత్య చేసుకున్నవారికి ఇప్పుడు చూస్తున్నాం. మిషా అగర్వాల్ కేసు వాటిలో ఒకటి. 

వారం క్రితం ఏప్రియల్ 24 న ఈమె చనిపోయింది. అప్పటికి ఆమెకు 24 ఏళ్ళు. రెండురోజులలో 25 ఏళ్ళు వస్తాయి. కాస్మెటిక్స్ రంగంలో ఎదగడం ఈమె కల. లా గ్రాడ్యుయేట్ అయిన ఈమె జ్యుడిషియల్ పరీక్షలకు తయారౌతున్నది.

పదిలక్షలమంది ఫాలోయర్స్ తన ఇంస్టాగ్రామ్ లో ఉండాలని ఈమె తీవ్రంగా కలలు కనేది. అంతమంది రాకపోగా, ఉన్నవారు కూడా క్రమేణా తగ్గిపోతూ ఉండటంతో, డిప్రెషన్ లో పడిపోయి, ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

'మనుషులను సోషల్  మీడియా పిచ్చి ఎంత దూరం తీసుకుపోతుంది?' అనడానికి ఈ అమ్మాయి ఒక నిదర్శనంగా మిగిలిపోయింది.

కామెంట్లు, లైకులు చూసుకోవడం. వ్యూయర్లు, ఫాలోయర్లు వ్రాసే 'ఆహా ఓహోలు' నిజాలనుకుని ఉబ్బిపోవడం. గ్రూపులు, గొడవలు, ఇవన్నీ బ్లాగులు వ్రాసే కొత్తలోనే, అంటే 2010 ప్రాంతాలలోనే నేను గమనించాను. ఇదొక వ్యసనమని, ఒక రొచ్చు ప్రపంచమని నాకప్పుడే అర్ధమైంది. అందుకే, వ్యూయర్స్ టాబ్ ను, ఫాలోయర్స్ టాబ్ ను, కామెంట్స్ సెక్షన్ ను నా బ్లాగ్ నుండి అప్పుడే తీసేశాను. ప్రతివారితోనూ మాట్లాడటం, వాళ్ళ కామెంట్లకు జవాబులివ్వడం, ముచ్చట్లు పెంచుకోవడం అన్నీ అప్పుడే మానేశాను.

సోషల్ మీడియా ఫాలోయర్స్ నిజంగా మనల్ని ఫాలో అవుతారని అనుకోవడం పెద్ద భ్రమ. ఆ భ్రమమైకంలో బ్రతకడం ఒక మానసికరోగం. అటూ ఇటూ అయితే ఈ రోగం తీవ్రమైన డిప్రెషన్ కు దారితీస్తుంది. ఈ అమ్మాయి కేసులో అదే జరిగింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు వాళ్లకు తోచక చేస్తుంటారు. చదివేవాళ్ళు కూడా ఏమీ తోచకనే చదువుతుంటారు. ఇది ఉత్త కాలక్షేపం మాత్రమే. దీని విలువ అంతవరకే. కొంతమంది తమ మానవసంబంధాలను మెరుగుపరుచుకోవడానికి దీనిని ఉపయోగిస్తే, మరికొంతమంది మోసాలు చెయ్యడానికి వాడుకుంటారు. వాస్తవప్రపంచంలో లాగే దీనిలో కూడా అన్ని రకాల మనుషులూ ఉంటారు. వాస్తవప్రపంచంలో కృంగుబాటుకు ఎంత ఆస్కారం ఉందో, ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. ప్రాక్టికల్ గా లేకపోతే రెండిట్లోనూ దెబ్బ తినక తప్పదు.

బిజినెస్ ప్రొమోషన్ కు సోషల్ మీడియాను వాడుకోవచ్చు. తప్పులేదు. కానీ చేసేపనిలో నిజాయితీ ఉండాలి. దురాశ పనికిరాదు. సోషల్ మీడియా మీద లక్షలు కోట్లు సంపాదిద్దామని భావించి, దురాశకు పోతే, చివరకు డిప్రెషన్ మిగులుతుంది. లేదా అంతు తెలియని ఈ పరుగుపందెంలో పడి హార్ట్ ఎటాక్ లు తెచ్చుకుంటారు. లేదా క్రైమ్ లో ఇరుక్కుంటారు.

కలల్లో బ్రతకడం, ఐడెంటిటీ క్రైసిస్, ఇతరుల కంటే తానేదో గొప్ప అన్న భ్రమలో ఉండటం, ఫాలోయర్స్ కౌంటు చూసుకుంటూ మురిసిపోతూ కలల్లో తేలిపోవడం - ఇవన్నీ మానసిక రోగలక్షణాలు. మిషా అగర్వాల్ వంటి అభాగ్యులు వీటికి బలౌతూ ఉంటారు.

ఈ అమ్మాయి 26-4-2000 న పుట్టింది. ఆనాటి జాతకంలో డిప్రెషన్ లక్షణాలు, జీవితంలో ఫెయిల్ అయ్యే పోకడలు, ఆత్మహత్య చేసుకునే యోగాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంతకు ముందైతే వాటన్నిటినీ వివరించి పెద్ద పోస్ట్ వ్రాసి ఉండేవాడిని. చాలామంది సూయిసైడ్ చేసుకున్న సెలబ్రిటీస్ జాతకాలు అలా వ్రాశాను కూడా. ఇప్పుడు రూటు మార్చాను. దగ్గరివారికి కొందరికి మాత్రమే ఆ జ్యోతిష్యకోణాలను వివరిస్తున్నాను.

సోషల్ మీడియా యొక్క కృత్రిమప్రపంచంలో నీడల వెంట పరిగెత్తడం చివరకు ఎక్కడకు తీసుకుపోతుందో ఈ అమ్మాయి కేసులో రుజువైంది. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు AI విప్లవం వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో? ప్రపంచజనాభాలో సగంమంది పిచ్చోళ్ళు అయ్యే అవకాశం మాత్రం గట్టిగా కనిపిస్తున్నది.

సోషల్ మీడియా అనేది జీవితంలో ఒక చిన్నభాగంగా ఉండాలి. అంతేగాని అదే ప్రపంచమై పోయి, చివరకు వాస్తవప్రపంచాన్ని మర్చిపోయే స్థితికి మనల్ని తీసుకుపోకూడదు.

అదే జరిగితే, చివరకు ఇలాగే అవుతుంది.

read more " నీడల వెంట పరుగులు "