“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, ఆగస్టు 2014, ఆదివారం

శ్రీకృష్ణుని జన్మ కుండలి-తీర్పు

మనకు ప్రస్తుతం నాలుగు జాతకాలు ఫైనల్ రౌండ్ లో మిగిలాయి.వాటిని తులనాత్మక పరిశీలన చెయ్యబోయే ముందు కొన్ని విషయాలను పరిశీలిద్దాం.

జ్యోతిశ్శాస్త్రం అనేది ఎంత లోతైన సబ్జెక్టో అర్ధం చేసుకోవాలంటే ఈ విషయాలను తెలుసుకోవడం అవసరం.

గ్రహములు నిత్య చలన శీలములు.సూర్యుని చుట్టూ వాటి కక్ష్యలూ ఆ కక్ష్యలలో వాటి పరిభ్రమణ వేగములూ కూడా వేర్వేరుగా ఉంటాయి.కనుక ఒకసారికి ఉన్న గ్రహస్థితులు మళ్ళీ తిరిగి రావాలంటే ఆయా గ్రహాలను బట్టి ఒకనెలనుంచీ కొన్ని వేల సంవత్సరాల వరకూ పట్టవచ్చు.

ఉదాహరణకు చంద్రుడు ప్రతినెలా రాశిచక్రంలో అదే ప్రదేశానికి వస్తాడు.అదే సూర్యుడయితే ఏడాది కొకసారి మాత్రమే ఇంతకు ముందు తానున్న చోటకు వస్తాడు.మిగతా గ్రహాలూ కూడా వారి వారి పరిభ్రమణ వేగాలను బట్టి రకరకాలుగా వస్తారు.అందరిలోకీ శని 30 ఏళ్ళ కొకసారి మాత్రమే రాశిచక్రంలో ఒక ప్రదేశాన్ని రెండోసారి తాకుతాడు.యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లయితే ఇక చెప్పనక్కరలేదు.వారివి ఇంకా దీర్ఘకక్ష్యలు.

శని గురువులను ఉదాహరణగా తీసుకుంటే వారిద్దరూ ఖగోళంలో ఒకసారి ఉన్న పరస్పరస్థితి(relative position) నుంచి మళ్ళీ అదే స్థితికి రావడానికి 60 ఏళ్ళు పడుతుంది.అదే వీరికి రాహువును కూడా కలిపితే వీరు ముగ్గురి పరస్పర స్థితి మళ్ళీ తిరిగి ఖగోళంలో దర్శనం ఇవ్వడానికి 180 ఏళ్ళు పడుతుంది.అప్పుడు కూడా వారు ఖచ్చితంగా అదే స్థితిలో కలవరు.గ్రహవక్రత్వం (retrogression) వల్లా ఇంకా అనేక భ్రమజనిత కారకాలవల్లా (illusory factors) ఇంకా చాలా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు.

అదే విధంగా అయిదు లేదా ఆరు గ్రహాలను మనం తీసుకుంటే వారందరూ ఉచ్చస్థానాలలో గాని లేదా ఒకసారి ఉన్న ఆయా స్థానాలకు దగ్గరగా గాని మళ్ళీ రావడానికి కొన్ని వేల ఏళ్ళు పడుతుంది.

అనేక మంది పరిశోధకులు వారి వారి పరిశోధన ప్రకారం చెప్పినది గమనించగా శ్రీకృష్ణుని జననతేదీలు 3000 BC నుండి 3300 BC వరకూ ఉన్నాయి.మహాభారత యుద్ధసమయంలో వర్ణించబడిన గ్రహస్థితులు కూడా ఆ సమయంలోనే ఖగోళంలో ఉన్నాయి.

డా||వర్తక్ వంటి కొందరి ప్రకారం ఈ తేదీ 5000 BC లోకి వెళ్ళిపోయింది.కానీ అప్పటి గ్రహస్థితులను లెక్కించే సాఫ్ట్ వేర్లు మనవద్ద లేవు.వర్తక్ గారు వేసిన లెక్కలు మాన్యువల్ గా వేసినవి గనుక అవి ఖచ్చితంగా ఉంటాయని భరోసా లేదు.

మనం ఇప్పుడు అనుసరిస్తున్న జ్యోతిష్యశాస్త్రం వేదములలో పురాణములలో లేదు.అప్పట్లో నక్షత్రమండల పరిజ్ఞానం ఉన్నది.గ్రహ పరిజ్ఞానం ఉన్నది.గ్రహములను వారు టెలిస్కోప్ సహాయం లేకుండా కళ్ళతోనే చూడగలిగేవారు.నూరేళ్ళు వచ్చినా వారి కళ్ళూ పళ్ళూ గట్టిగానే ఉండేవి.మన కంటే వారి ఇంద్రియశక్తులు చాలా ఎక్కువగా బలంగా ఉండేవి.వారికి కంప్యూటర్లూ లేవు కళ్ళజోళ్ళూ లేవు.ఈ రెంటి అవసరం వారికి లేదు.లెక్కలన్నీ మనసులోనే వేసేవారు.ఎంతదూరాన్న ఉన్న వస్తువునైనా చక్కగా స్పష్టంగా కళ్ళతోనే చూడగలిగేవారు.

ఏ పరికరం సహాయం లేకుండా వేల ఏళ్ళ నాడే విషువచ్చలనం (precision of equinoxes) ను వారు కొలవగలిగారంటే, ఈ విషయం ఒక్కటి చాలు వారి మేధస్సు ఎలాంటిదో గుర్తించడానికి.వారిని విమర్శించే మనకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా కనీసం 'గ్రహం' అనే పదానికి అర్ధం తెలియదు.

లేని రాహుకేతువులు గ్రహాలెలా అవుతాయి,చంద్రుడు గ్రహం ఎలా అవుతాడు?ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వేస్తూ అవేవో గొప్ప తెలివితేటలన్నట్లుగా మన అజ్ఞానాన్ని బహిర్గతం చేసుకుంటూ ఉంటాం.ఇంత అధ్వాన్నస్థితిలో ఉన్న మనకు ప్రాచీన జ్యోతిష్యశాస్త్రాన్ని విమర్శించే అర్హత ఎంతవరకూ ఉంటుందో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అర్ధమౌతుంది (వారికి ఆత్మ అనేది ఒకటి ఉంటే).

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న జ్యోతిష్య విధానం వేదకాలం తర్వాత ఎన్నో రకాలైన మార్పులకూ చేర్పులకూ లోనైన విధానం.కనుక దీనిని వేదిక్ అస్ట్రాలజీ అనడం సరికాదు.హిందూ ఆస్ట్రాలజీ లేదా ఇండియన్ ఆస్ట్రాలజీ అంటే బాగుంటుంది.లేదా భారతీయ జ్యోతిష్యం అంటే ఇంకా బాగుంటుంది.

వేదకాలంలో మనం ఇప్పుడు చూస్తున్నట్లు లగ్నం లేదు.ప్రాచీన నాడీ జ్యోతిష్యంలో కూడా లగ్నం లేదు.లగ్నం అనేది యవనజాతక విధానం.

రామాయణ భారతాది కాలాలలో నక్షత్ర మండలాలలో గ్రహాల సంచారమే ముఖ్యంగా చూచేవారు.కొన్నికొన్ని నక్షత్రాలలో కొన్ని గ్రహాలు సంచరించినప్పుడు కొన్ని ఖచ్చితమైన ఫలితాలూ ప్రభావాలూ భూమి మీద ఉంటున్నాయన్నది కనీసం 10,000 ఏళ్ళ నుంచీ మనకు తెలుసు.

రామాయణ భారతాలలో దీనికి ఎన్నో ఋజువులున్నాయి.

నక్షత్ర మండలాలకు మనవాళ్ళు చాలా విలువనిచ్చారు.ఎంత విలువంటే, నక్షత్రాలే భగవంతుని రూపం అని వారు దర్శించారు.

'అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమ్ అశ్వినౌ వ్యాత్తమ్' అనే పురుషసూక్త మంత్రమే దీనికి ప్రమాణం.

"యో వై నక్షత్ర్యం ప్రజాపతిం వేద ఉభాయోరేనం లోకయోర్విదు:"

"నక్షత్ర మండలముల రూపంలో ప్రజాపతి(భగవంతుడు,సృష్టికర్త) నిలచి ఉన్నాడన్న జ్ఞానమును కలిగినవాడు,ఈలోకమును పరలోకమును కూడా చక్కగా తెలిసికొంటున్నాడు" అంటుంది యజుర్వేద బ్రాహ్మణంలోని ప్రధమ అష్టకం.

జ్యోతిష్యశాస్త్రం దైవానికీ దైవజ్ఞానానికీ విరుద్ధం అని భావించేవారు పరమ మూర్ఖులు మరియు అజ్ఞానస్వరూపాలు.వారికి సత్యజ్ఞానం లేదు.ఎవరో పనికిమాలిన పాశ్చాత్య పండితుల అభిప్రాయాలనో లేక కలగూర గంప లాంటి తియోసఫీ భావాలనో ఆధారం చేసుకొని వారికి ఏమాత్రమూ తెలియని సబ్జెక్ట్ మీద వారికి తోచిన అవాకులూ చెవాకులూ వ్రాస్తుంటారు.

అలాంటివారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏమంటే--జ్యోతిష్యశాస్త్రం వేదాంగములలో ఒకటి అనీ,అదొక రహస్య విజ్ఞానమనీ,నక్షత్ర గ్రహ మండలములు అన్నీ దైవస్వరూపమే అనీ వాటిని సరిగ్గా అర్ధం చేసుకుంటే మానవుని విధి(fate,destiny) ఏమిటి అన్నది తెలిసిపోతుందనీ,మానవుని జీవితాన్నీ అతని పూర్వకర్మనూ చదవాలంటే దీనిని మించిన రహస్యశాస్త్రం లేదన్న విషయాన్నీ వారు మొదటగా గ్రహించాలి.

నక్షత్ర మండలాలలో దాగియున్న రహస్యాలను నేటి సైన్స్ ఇంకా గుర్తించలేక పోతున్నది.కానీ ఈ రహస్యాలు వేదములలో చాలా నిగూఢమైన భాషలో చెప్పబడినాయి.వృద్ధగర్గుడనే మహర్షి నక్షత్ర మండలాలలో దాగి ఉన్న రహస్యాలను పరిశోధన చేసి వాటిని ఆమూలాగ్రమూ గ్రహించిన వేత్త.

ఏయే నక్షత్ర మండలం నుంచి ఏయే స్పందనలు (వైబ్రేషన్స్) వస్తున్నాయి. వాటిలోని భేదాలు ఏంటి?వాటి ప్రభావాలు మానవుల మీదా భూమిమీదా ఎలా ఉంటాయి అన్న విషయాలను ఆయన ఇప్పటికి దాదాపు 9000 సంవత్సరాల నాడే పరిశోధన చేసి రికార్డ్ చేసి పెట్టినాడు.వేదములలో ఉన్న 'నక్షత్రేష్టి' 'నక్షత్రశాంతి' మంత్రములలో ఆ రహస్యాలు దాగి ఉన్నాయి.

నవీన సైన్స్ దీనిని కొంతవరకూ గ్రహించింది.ఉదాహరణకు,నక్షత్ర మండలాలు అన్నీ ఒకే రకమైన స్పందనలను వెలువరించడం లేదన్న విషయం అది గుర్తించింది.వాటి తరంగాలలో తేడాలున్నాయి.కొన్నింటి నుండి రేడియో వేవ్స్ వస్తున్నాయి.కొన్ని ఎక్స్ రేలను వెదజల్లుతున్నాయి.కొన్ని గామా కిరణాలను వెదజల్లుతున్నాయి.వీటన్నిటి పౌన:పున్యములు (frequencies) వేర్వేరుగా ఉన్నాయి.ఆయా తరంగాల ప్రభావాలూ వేర్వేరుగానే ఉన్నాయి.ఇంతవరకూ నేటి సైన్స్ గ్రహించగలిగింది.

కానీ వృద్ధగర్గ మహర్షి వంటి మహనీయులు ఎన్నొ వేల సంవత్సరాల క్రితం ఈ విషయాలు గ్రహించడమే గాక,ఆయా నక్షత్రస్పందనల ప్రభావం మానవ జీవితం మీద ఎలా ఉంటున్నదో దర్శించి,ఆయా నక్షత్ర శక్తులను ఎలా కంట్రోల్ చెయ్యవచ్చో మంత్రముల రూపంలో రహస్య విజ్ఞానాన్ని వేదంలో నిక్షిప్తం చేసి ఉంచారు.

ఆ నక్షత్ర మండలం నుంచి వెలువడుతున్న స్పందనలతో మనలను అనుసంధానం చేసేదే నక్షత్రమంత్రం.ఎందుకంటే రెండూ శబ్దశక్తులే.ఒక శబ్దాన్ని సరిగ్గా జపించడం ద్వారా ఇంకొక శబ్దపు అదే ఫ్రీక్వెన్సీని అందుకోవచ్చు.దానితో అనుసంధానం గావచ్చు.ఇది శాస్త్రీయ విధానమే.నక్షత్ర శక్తిని స్వీకరించి దానితో మన 'కర్మ' ను మనకు అనుకూలంగా మార్చుకునే మంత్రప్రక్రియలు వేదంలో ఉన్నాయి.అదొక రహస్యసాధనా విధానం.వృద్ధ గర్గమహర్షి దీనికి ద్రష్ట.అంటే ఈ విధానాన్ని కూలంకషంగా పరిశోధించి దానిని codify చేసిపెట్టిన ఋషి.ఇదంతా ఒక అద్భుతమైన సీక్రెట్ సైన్స్.

రెండువేల సంవత్సరాల నాటి వరాహమిహిరుడు తన గ్రంధాలలో వృద్ధగర్గమహర్షిని స్మరించినాడంటే ఆయన అంతకుముందు ఇంకా పూర్వం వాడే అయి ఉంటాడు కదా.రామాయణకాలంలో (7000 BC) దశరధుడు నక్షత్ర మండలాలలో గ్రహసంచారాన్ని స్మరించినాడంటే అప్పటికే ఈ విజ్ఞానం అందుబాటులో ఉన్నట్లే కదా.

జ్యోతిశ్శాస్త్రం యొక్క ప్రాచీనతను గురించీ దాని బహుముఖ విస్తృతిని గురించీ ఈ మాత్రం ప్రాధమిక అవగాహన ఉంటే చాలు.

ప్రస్తుతానికి దానిని అలా ఉంచి విషయంలోకి వద్దాం.

ఇప్పుడు మనకు లభించిన నాలుగు జన్మకుండలులను తులనాత్మక పరిశీలన చేద్దాం.

మొదటిది-23-5-5626 BC(డా||వర్తక్ గారి పరిశోధన)

రెండవది-18-7-3228 BC(డా||రామన్ గారి పరిశోధన)
మూడవది-24-6-3132(డా||నరహరి ఆచార్ పరిశోధనలో విషయం)
నాలుగవది-1-7-3111 BC(డా రాఘవన్,సంపత్ అయ్యంగార్ పరిశోధన)

మొదటిది

ఈయన వేసిన లెక్కలు మాన్యువల్ గా వేసినవి.ఈ లెక్కలు అప్పటి పరిస్థితులతో సరిగ్గా సరిపోతాయో లేదో మనకు తెలియదు.ఖచ్చితమైన ఖగోళ సాఫ్ట్వేర్ ఉంటే తప్ప అప్పటి గ్రహస్థితులు లెక్కించడం కష్టం.

పైగా,ఈ జాతకంలో అవతార పురుషుని లక్షణాలు లేవు.సంఘటనలు కూడా పేలవంగా సరిపోతున్నాయిగాని పరిపూర్ణ సంతృప్తిని ఇవ్వడం లేదు.

కనుక ఈ జాతకం మన పరీక్షకు నిలబడటం లేదు.

రెండవది


ఈ జాతకంలో ఏ గ్రహమూ ఉచ్చస్థితిలో లేదు.ఒక అవతార పురుషుని జాతక లక్షణాలు ఈ జాతకానికి లేవు.

పైగా కుజుడు నీచస్థితిలో ఉన్నాడు.చంద్రుని లగ్నస్థితి వల్ల నీచభంగం అయినప్పటికీ రాహు కుజ శుక్రుల యోగం వల్ల ఇదేదో రాక్షస జాతకం లాగా కనిపిస్తున్నది గాని ఒక దివ్యపురుషుని జాతకంగా అనిపించడం లేదు.

సంఘటనలు కూడా దశలతో సంతృప్తికరంగా సరిపోలేదు.

మూడవది


ఈ జాతకం కూడా చాలావరకూ సరిపోయినట్లు పైపైన కనిపిస్తున్నప్పటికీ దీనిలో రాహుకేతువులు తప్ప ఇతర ఉచ్చగ్రహాలు లేవు.ఒక అవతార పురుషుని లక్షణాలు ఈ జాతకానికి లేవు.

పదింట శని వక్రిగా ఉన్నందున వృత్తిలో పరాజయాలుండాలి.కృష్ణునికి అలాంటిదేమీ లేదు గనుక ఈ జాతకం సరిపోలేదని  చెప్పవలసి వస్తుంది.


నాలుగవది

ఈ జాతకం ఒక అవతార పురుషుని జాతకానికి చాలా వరకూ దగ్గరగా ఉన్నది.దాదాపు ఏడు గ్రహాలు ఉచ్చస్థితిలో గాని దగ్గరగా గాని ఉన్నాయి. ఈజాతకంతో కృష్ణుని జీవితంలో సంఘటనలు కూడా స్పష్టంగా సరిపోతున్నాయి.కనుక ఇది కృష్ణుని జాతకం అని మనం నమ్మవచ్చు.అయితే దీనివల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి.ఏమంటే మిగతా పరిశోధకుల అభిప్రాయాలతోనూ వారు కనుక్కున వివరాలతోనూ పురాణాలలోని ఇతర వివరాలతోనూ ఈ జాతకం సరిపోకపోవచ్చు.ఈ జాతకాన్ని మనం ఒప్పుకుంటే ఈ క్రింది సమస్యలు వస్తాయి.
  • మహాభారత యుద్ధ సమయానికి కృష్ణునకు 45 ఏళ్ళ వయస్సు మాత్రమే ఉంటుంది.
  • కృష్ణ జననం జరిగిన పదేళ్లకు కలియుగం ప్రవేశించి ఉండాలి.
  • కృష్ణ నిర్యాణం 3011-3010 ప్రాంతంలో జరిగి ఉండాలి.
మరి వీటిని ఆయా పరిశోధకులు ఎంతవరకు ఒప్పుకుంటారో అనుమానమే. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా,మనకు లభిస్తున్న తేదీలలో ఇంతకంటే మంచి తేదీ దొరకడం లేదు.

శ్రీ రామకృష్ణుని జాతకాన్ని మనం పరిశీలిస్తే,అందులో శని గురువు కుజుడు ముగ్గురూ ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు చూడవచ్చు.రాహు కేతువులు కూడా ఉన్నారు.వారిని కొంచం సేపు పక్కన ఉంచుదాం.అందులో ఒక విచిత్రం ఉన్నది.

శని ఉచ్చస్థితిలో ఉన్నపుడు గురువు మిధునంలో ఉంటేనే తన పంచమ దృష్టితో శనిని వీక్షించగలుగుతాడు.అలాగే కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నపుడు సహజరాశిచక్రంలో ప్రధమగృహమైన మేషరాశిని తన చతుర్ధదృష్టితో వీక్షించగలడు.అలాగే సహజ చతుర్ధాన్ని తన సప్తమ దృష్టితో చూడగలడు.సహజ పంచమాన్ని తన అష్టమ దృష్టితో చూడగలడు.ఈ మూడూ ఒక అవతార పురుషుని జాతకానికి చాలా అవసరం.

గురువుకు పంచమ దృష్టీ కుజునికి చతుర్ధ దృష్టీ మంచివి.ఎందుకంటే అవి వారివారి స్వభావానికి సహజసూచికలు.గురువు మంత్రాధిపతి అనీ కుజుడు ధరాధిపతి అనీ గుర్తుంచుకుంటే ఈ దృష్టుల ప్రత్యేకతలేమిటో తెలుస్తాయి.

3000 BC నుంచి 3300 BC వరకూ ఉన్న కాలవ్యవధిలో శని గురుకుజుల ఉచ్చస్థితి ఉన్న సంవత్సరాల కోసం నేను ప్రతి ఏడాదికీ ఉన్న గ్రహస్థితులను జల్లెడపడుతూ వెదికాను.రాశిచక్రంలో వీరి ముగ్గురి పరస్పర స్థితులు (relative positions) దాదాపు 237-240 సంవత్సరాల కొకసారి ఒకేవిధంగా ఉంటున్నాయి.అప్పుడు కూడా పూర్తిగా ఒకే విధంగా ఉండటం లేదు.దాదాపుగా మాత్రమే అంతకు ముందరి స్థితికి దగ్గరగా ఉంటున్నాయి.

3111 BC తర్వాత 3348 BC లో మాత్రమే మళ్ళీ ఇలాంటి గ్రహస్తితి ఉన్నది.కానీ అప్పటికి మహాభారతయుద్ధం చాలా దూరానికి వెళ్ళిపోతుంది. అప్పుడు గనుక కృష్ణుడు పుట్టినట్లు మనం అనుకుంటే,మహాభారత యుద్ధ సమయానికి ఆయనకు 281 ఏళ్ళు ఉన్నట్లు అవుతుంది.ఇది అసంభవం గనుక ఆ సంవత్సరాన్ని స్వీకరించలేము.పైగా 3348 BC జాతకంలో కూడా మిగిలిన గ్రహాల పరిస్తితి మళ్ళీ అవతార పురుషుని జాతకాన్ని సూచించే విధంగా లేదు.

పోనీ వెనక్కు వద్దామా అంటే, 2874 BC నాటికి మాత్రమే మళ్ళీ కుజ గురు శనుల గ్రహస్థితి వారి వారి ఉచ్ఛస్థితులకు దగ్గరగా ఉంటున్నది.ఈ ఏడాది కూడా భారతయుద్ధానికి బాగా దూరం అయిపోతుంది.కనుక ఇదీ పనికి రాదు.

మహాభారత యుద్ధం గనుక 3067 BC లో జరిగినది నిజమే అయితే(నిజమే అని చాలామంది ఖగోళ పరిశోధకులు అంటున్నారు,ఒక్క వర్తక్ గారు తప్ప),అప్పుడు దాని దగ్గరలో ఒక అవతార పురుషుని జాతకంలో ఉండవలసిన పరిస్థితిని ప్రతిబింబించే సంవత్సరం ఒక్క 3111 BC మాత్రమే కనిపిస్తున్నది.ఆ దరిదాపుల్లో 480 సంవత్సరాల పరిధిలో అలాంటి గ్రహస్థితులు మళ్ళీ లేవు.

కాబట్టి ఇంతకంటే ఇంకొక మంచితేదీ ఇంకొకరి పరిశోధనలో కనిపించేవరకూ 1-7-3111 BC భాద్రపద బహుళ అష్టమిని శ్రీకృష్ణ జననతేదీగా ప్రస్తుతానికి స్వీకరించవచ్చు.

ఇది జ్యోతిష్య శాస్త్రపు తీర్పు.

(అయిపోయింది)
read more " శ్రీకృష్ణుని జన్మ కుండలి-తీర్పు "

30, ఆగస్టు 2014, శనివారం

Wise Bucket Challenge

ALS(Amyotrophic Lateral Sclerosis) అనే రోగానికి సంబంధించిన ఎరుక సమాజంలో పెరగడానికీ దాని నివారణకోసం రీసెర్చ్ కి తోడ్పడటానికీ ఐస్ బకెట్ చాలెంజ్ అనేది అమెరికాలో మొదలైంది.ఇందులో ఒక బకెట్ లో నీళ్ళూ ఐస్ ముక్కలూ వేసి వాటిని తలమీద పోసుకుని కొంతమందిని నామినేట్ చేస్తారు.వారు కూడా దీనిని చేసి ఇంకొంతమందిని నామినేట్ చెయ్యాలి. అందరూ కలసి కొంత డబ్బును ఆ రీసెర్చి ఫౌండేషన్ కి దానం చెయ్యాలి.

చాలామంది అమెరికన్లూ దీనిని చేస్తున్నారు.అక్కడ ఉన్న మనవాళ్ళూ చేస్తున్నారు.ఆ రోగానికి సంబంధించిన ఎవేర్ నెస్ పెంచుతున్నారు.బాగానే ఉంది.

పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు, దీనిని చూచి మన దేశంలో "రైస్ బకెట్ చాలెంజ్" అనేదొకటి మొదలైంది.మన దేశంలో పేదరికం అధికం కనుక మనకు కావలసింది ఐస్ బకెట్ చాలెంజ్ కాదు, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ఒక బకెట్ లో బియ్యాన్ని నింపి దానిని ఎవరైనా పేదవారికి దానం ఇవ్వడం కొందరు మొదలు పెట్టారు.

ఇచ్చేవాళ్ళు ఇస్తుంటే మన దేశంలో తీసుకునే వారికి కొదవేముంది?మనదేశంలో కోటీశ్వరులకు కూడా తెల్లకార్డులుంటాయి కదా.ఒక బకెట్ రైస్ వస్తున్నది తీసుకుంటే పోలా అని బెంజీ,  బీ ఎం డబ్లూ, కార్లలో పోయేవారు కూడా ఆగి ఒక బియ్యం బకెట్ ను డిక్కీలో వేసుకుని పోతున్నారు. 

మన దేశంలో ప్రస్తుతం పేదవారు అనేవారు అసలున్నారా? అని నాకొక పెద్ద అనుమానం గత కొన్నేళ్ళ నుంచీ ఉంది.ప్రతి పేదవాడి ఇంట్లోనూ నేడు కలర్ టీవీ ఉంది.ఒకవేళ లేకపోతే ప్రభుత్వమే ఇస్తోంది.ఇంటింటికి కేబుల్ నెట్ వర్క్ ఉన్నది.ఇంటర్ నెట్ కనెక్షన్ ఉన్నది.ఇంటికి నాలుగు చొప్పున సెల్ ఫోన్లూ ఉన్నాయి.మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త మొబైల్నూ కొని పాతదాన్ని నెలకొకసారి మార్చిపారేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ నేడు ఒక మొబైల్ షాపు పెట్టడానికి సరిపోయినన్ని పాత సెల్ ఫోనులు పడున్నాయి.ఇంటికి నాలుగు టూ వీలర్లూ రెండు కార్లూ ఉంటున్నాయి.

ఇకపోతే ఇప్పటికీ మంచినీళ్ళు దొరకని పల్లెటూళ్ళు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి.కాని సారాయి కొట్టులేని ఊరు మాత్రం ఎక్కడా లేదు. ఒకవేళ లేకపోతే,ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలే వాటిని అమర్చిపెట్టి పోయాయి.అన్ని సారాయి షాపులూ సాయంత్రానికి కిటకిట లాడుతున్నాయి.జనంతో కళకళ లాడుతున్నాయి.కొన్ని ఊర్లలో అయితే పొద్దు పొద్దున్నే కూడా అవి జనంతో సందడిగా కనిపిస్తున్నాయి.కాలేజీ ఆడపిల్లల దగ్గరనుంచీ అందరూ నేడు సారాయిని (ఏదో ఒకరూపంలో) చక్కగా తాగుతున్నారు. సారాయి అని చీప్ గా అన్నందుకు మళ్ళీ అది తాగేవారికి కోపం రావచ్చు. పేరు ఏదైనా పదార్ధం అదేగా.

మన దేశంలో 'వైన్ బకెట్ చాలెంజ్'(Wine Bucket Challenge) మాత్రం ఎప్పటినుంచో నడుస్తోంది.దానికి ఎవరి ప్రోత్సాహమూ ఆహ్వానమూ అక్కర్లేదు.ఎవరికి వారే స్వచ్చందంగా పరమోత్సాహంతో దీనిలో పాల్గొంటున్నారు.

ఇలాంటి ప్రజలకు రైస్ బకెట్ నిజంగా అవసరమా? అంటే లేదనే సమాధానం వస్తుంది.ఎవరికో దురదపుట్టి ఇస్తున్నారు గనుక తీసుకునేవారు తీసుకుంటున్నారు గాని నిజంగా మన దేశంలో పేదవాడు ప్రస్తుతం ఎక్కడా లేడు.అందరి దగ్గరా డబ్బులు బాగానే ఉన్నాయి.

ఆ మధ్యన అమెరికానుంచి చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చిన ఒక మిత్రుడు ఇలా అన్నాడు.

'నేను నాలుగేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాను.ప్రస్తుతం ఇండియాను చూస్తుంటే అమెరికాలో ఉన్న మేమే మీకంటే పేదవాళ్ళమని అనిపిస్తున్నది.'

ఐస్ బకెట్టూ, రైస్ బకెట్టూ మన దేశానికి అవసరం అవునో కాదో నేను చెప్పను గాని ప్రపంచం మొత్తానికీ అవసరం అయిన చాలెంజ్ ఒకటి మాత్రం నేను చెప్పదలచుకున్నాను.

అదే వైస్ బకెట్ చాలెంజ్ Wise Bucket Challenge

అంటే మనం వైస్ గా జ్ఞానంతో బ్రతకడం,ఇతరులలో దానిని పెంపొందించే పనిని చెయ్యడం అన్నమాట.ఒక్కమాటలో చెప్పాలంటే నిజమైన సనాతనమైన భారతీయ ఆధ్యాత్మికతను నిత్యజీవితంలో ఆచరిస్తూ ఇతరులను కూడా దానిని ఆచరించేలా ఉత్తెజపరచడమే Wise Bucket Challenge.వారూ వీరూ అన్న భేదం లేకుండా ప్రపంచంలోని మనుష్యులకందరికీ ఇది నేటి కాలంలో అత్యంత అవసరం.

అయితే ఆధ్యాత్మికతకీ బకెట్ కీ ఏంటి సంబంధం? అని అనుమానం రావచ్చు.

ఇంగ్లీషులో 'కికింగ్ ద బకెట్' అనే మాట ఉన్నది.అంటే బాల్చీ తన్నెయ్యడం అన్నమాట.

పుట్టిన ప్రతి మనిషీ ఏదోరోజున పోక తప్పదు.ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ ఆ పోయే సమయానికి కర్మ బ్యాలెన్స్ ను పూర్తిగా ఖాళీ చేసుకుని పోవడమే నేను చెప్పే 'వైస్ బకెట్ చాలెంజ్'.

జ్ఞానంతో జీవిస్తేనే ఇది సాధ్యమౌతుంది.జ్ఞానంతో కర్మ చేస్తూ బ్రతికితేనే ఇది సాధ్యమౌతుంది.అప్పుడే మన ఎకౌంట్లో ఉన్న కర్మ తగ్గుతూ వస్తుంది.దానికి విరుద్ధంగా అజ్ఞానంలో బ్రతికి తదనుగుణమైన కర్మలు చేస్తూ ఉంటే అది రోజురోజుకూ పెరుగుతుంది.అప్పుడు బాల్చీ తన్నేసే సమయానికి తలకు మించిన భారంతో పోవలసి వస్తుంది.ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనకున్న కర్మ బ్యాలెన్స్ ను ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ చేసుకుని పోవలసి వస్తుంది. అది అభిలషణీయం కాదు.

మనం ఈలోకంలోకి వచ్చేటప్పుడే ఒక పెద్దబకెట్ నిండా కర్మతో వచ్చాం. జ్ఞానహీనులమై ఇష్టం వచ్చినట్లు బ్రతికితే,బకెట్ తన్నేసే సమయానికి ఒక పెద్ద కర్మగంగాళాన్ని మోసుకుని పోవలసి వస్తుంది. ఆ గంగాళం బరువుతో అప్పుడెక్కడికి పోతామో,ఏ జన్మ ఎత్తుతామో మనకు తెలియదు. 

అలా కాకుండా,చేతిలో ఉన్న బకెట్ ని ఖాళీచేసి అవతలపారేసి హాయిగా చేతులూపుకుంటూ పోవాలంటే,నిత్యజీవితంలో కర్మను యోగంగా మార్చుకుని జీవితాన్ని నడిపినప్పుడే ఈ వైస్ బకెట్ చాలెంజ్ లో మనిషి నెగ్గగలుగుతాడు.

దీనికి ఇంకొకరిని నామినేట్ చెయ్యనవసరం లేదు.అలా నామినేట్ చెయ్యడం కుదరదు కూడా.ఇది ఎవరికి వారికి లోనుండి రావలసిన చాలెంజ్.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకునే చాలెంజ్ కాదు.

ఐస్ బకెట్ చాలెంజ్ వల్ల ALS అనే వ్యాధి నిర్మూలనానికి దోహదం అవుతుంది.

వైస్ బకెట్ చాలెంజ్ వల్ల కూడా ALS అనే వ్యాధి పోతుంది.అయితే ఈ వ్యాధి వేరు.దీనిని నేను 'అజ్ఞాన లంపటం సిండ్రోం' (ALS) అని పిలుస్తాను.వైస్ బకెట్ చాలెంజ్ చెయ్యగలిగిన వాడికి అజ్ఞానమూ పోతుంది.ప్రపంచ లంపటమూ పోతుంది.

ఆత్మారామత్వమూ ఆనందస్వరూపమూ వాడికి మిగులుతాయి.

ఐస్ బకెట్, రైస్ బకెట్ల వల్ల ఏవేవి పోతాయో నేను చెప్పలేను గాని వైస్ బకెట్ వల్ల మాత్రం మూలవ్యాధి (fundamental disease) అయిన అజ్ఞానం నశించిపోతుందని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు.భగవంతుడే దీనిని గురించి చెప్పినాడు.

శ్లో||తేషామేవానుకంపార్ధ మహమజ్ఞానజం తమ:
నాశాయామ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వతా

(భగవద్గీత 10:11)

(వారి మీద కరుణతో వారి హృదయాలలో నేనే నిలిచి ఉండి,జ్ఞాన తేజస్సుతో వాటిని నింపి,అజ్ఞాన జనితమైన అక్కడి చీకటిని నాశనం చేస్తున్నాను)

అంటూ భగవంతుడే ఈ ఛాలెంజ్ స్వీకరించేవారికి అభయప్రదానం గావిస్తున్నాడు.ఇంక భయమేముంది?

ఈ ఛాలెంజ్ ని మనం స్వీకరించకుండా అడ్డుపడే తమస్సు అంటే ఏమిటో కూడా భగవంతుడే చెప్పాడు.

శ్లో|| తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత

(భగవద్గీత 14:8)

నిర్లక్ష్యమూ,ఆలస్యమూ,బద్ధకమూ -- ఈ మూడూ అజ్ఞానం నుంచి పుట్టినవి.ఇవే సమస్త జీవులనూ మోహంలో ముంచి జ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి.

ప్రమాదం (నిర్లక్ష్యం) అంటే - మనకిప్పుడే ఆధ్యాత్మికత ఎందుకులే అన్న నిర్లక్ష్య ధోరణి.

ఆలస్యం అంటే - రేపు చేద్దాంలే అని ఏరోజుకారోజుకి సాధనను వాయిదా వెయ్యడం.


నిద్ర అంటే - సాధనలో బద్ధకాన్ని వదిలించుకోలేని అశక్తత.


తమస్సు అంటే ఈ మూడు లక్షణాలే.


అంతేకాదు, Wise Bucket Challenge (WBC) అనే ఈ ఛాలెంజ్ ని స్వీకరించే వాడికి అంతర్గత WBC (White Blood Corpuscles) కౌంట్ తగినంతగా పెరిగి అజ్ఞానం అనే మహమ్మారిని అడ్డుకునే వ్యాధినిరోధక శక్తి అతనిలో విపరీతంగా పెరుగుతుందని నేను చెబుతున్నాను.

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని సాక్షాత్తూ భగవంతుడే విసుగనేది లేకుండా ఎప్పటినుంచో మనలను పిలుస్తున్నాడు.కానీ ఆయన మాట ఎవరూ వినడం లేదు.

శ్లో||తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసి నాత్మనః
ఛిత్వైనం సంశయం యోగమాత్తిష్టోత్తిష్ట భారత

(భగవద్గీత 4:42)

(ఓ భారతపుత్రా! అజ్ఞానం నుండి పుట్టి నీ హృదయంలో తిష్ట వేసి ఉన్నట్టి సంశయములను జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించు.యోగమును ఆధారంగా చేసుకొని నీ జీవనసమరాన్ని నడిపించు)

ఇదే వైస్ బకెట్ ఛాలెంజ్

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని మన సనాతన ధర్మమూ మన మహర్షులూ కూడా కొన్నివేల ఏళ్ళ నుంచీ మనలను ఆహ్వానిస్తూనే ఉన్నారు.

కానీ ఈ ఛాలెంజ్ ని మనస్ఫూర్తిగా స్వీకరించేవారు ఎందరున్నారు?అందరూ పనికిమాలిన ఐస్ బకెట్ ఛాలెంజ్,రైస్ బకెట్ ఛాలెంజ్ లను స్వీకరించేవారేగాని అసలైన వైస్ బకెట్ ఛాలెంజ్ ని స్వీకరించేవారు ఎవరున్నారు?

కనీసం ఒక్కరన్నా ఉన్నారా???
read more " Wise Bucket Challenge "

29, ఆగస్టు 2014, శుక్రవారం

శ్రీకృష్ణుని జన్మకుండలి -9 (3011 BC శ్రావణ బహుళ అష్టమి)

ఇదే సంవత్సరంలో ఒక నెల ముందుగా శ్రావణ బహుళ అష్టమి నాడు ఉన్న గ్రహస్థితి ఏమిటో చూద్దాం.

సామాన్యంగా చూస్తే,ఒక నెలలో గ్రహాలు వాటివాటి స్థానాలను పెద్దగా మారవు (చాలాసార్లు).బృహద్గ్రహాలు అసలే మారవు.ఈ కుండలిలో కూడా సూర్యుడు శుక్రుడు మాత్రమే మారినారు.బుధుడు కుజుడు వక్రస్థితిలోకి పోయినారు.కానీ ఈమాత్రం మార్పులే జాతకాన్ని మొత్తం మార్చివేస్తాయి.

3-6-3011 BC న రాత్రిపూట రోహిణీ నక్షత్రం వస్తున్నది.కానీ ఆరాత్రికి తిధి అష్టమి లేదు నవమి వచ్చేసింది. కనుక ఆనాడు శ్రావణ బహుళ నవమి అవుతున్నది. అయినా సరే,విష్ణుపురాణ వచనం ప్రకారం నవమి రోజుకూడా సరిపోతుంది గనుక ఈ తేదీని కూడా పరిశీలిద్దాం.

శ్రావణ బహుళ నవమి గురువారం రాత్రి రోహిణి రెండవ పాదం అయ్యింది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉన్నది.

ఆ రోజు రాత్రి 00.45 వరకూ మధురా నగరిలో మేషలగ్నం ఉన్నది.వృషభ లగ్నం ఆ తర్వాత ఉదయించింది.అభిజిత్ ముహూర్తం అని విష్ణుపురాణం స్పష్టంగా చెబుతున్నది గనుక ముందు అభిజిత్ ముహూర్తాన్ని లెక్కిస్తే ఆ సమయానికి ఏ లగ్నం ఉన్నదో చూస్తే సరిపోతుంది.

అభిజిత్ ముహూర్త గణనం

సూర్యాస్తమయం :18.58
మర్నాడు సూర్యోదయం:5.18
రాత్రికాలం:10 గం 20 ని =620 ని.
ఒక ఘడియ కాలం =620/15=41 ని 18 సె.
ఏడు ఘడియల కాలం=7x41 ని 18 సె
=289 ని 6 సె
=4 గం.49 ని.
కనుక అభిజిత్ ముహూర్తం
18.58+4.49
=23.47 నుంచి 00.29 వరకు ఉన్నది.

అంటే విష్ణు పురాణంలో చెప్పబడినట్లు సరిగ్గా అర్ధరాత్రి సమయానికి అభిజిత్ ముహూర్తమే నడుస్తున్నది.

కానీ మధురా నగరిలో ఆరోజు రాత్రి 00.45 వరకూ మేషలగ్నమే ఉన్నది. కనుక అభిజిత్ ముహూర్త సమయానికి మేషలగ్నమే ఉదయిస్తున్నది. మేషలగ్నాన్ని గనుక మనం లెక్కిస్తే జీవిత సంఘటనలకు సంబంధించిన లెక్కలన్నీ తారుమారు అయిపోతాయి.

అప్పుడు జనన సమయానికి చంద్ర/గురు/గురుదశ నడుస్తుంది.మేనమామ గండం ఎక్కడా కనిపించడం లేదు.చెరసాలలో జననం కూడా సూచితం కావడం లేదు.కనుక మేషలగ్నం పనికిరాదు.

పైగా మేషలగ్నం అనుకుంటే జననం ఒక్కటే కాదు.మిగిలిన సంఘటనలు ఏవీ సరిపోవు.ఒకవేళ 00.45 కి వృషభలగ్నం వచ్చాక జననం జరిగింది అనుకుంటే అప్పుడు అభిజిత్ ముహూర్తం తప్పిపోతుంది.వృషభ లగ్నం కావాలనుకుంటే అభిజిత్ ముహూర్తం ఉండదు.అభిజిత్ ముహూర్తం కావాలనుకుంటే వృషభ లగ్నం ఉండదు.వృషభలగ్నం కాకపోతే భావాధిపత్యాలు మారిపోయి జాతకం మొత్తం మారిపోతుంది.

కనుక ఈ తేదీ సరియైనది కాదని తోస్తున్నది.

పోనీ సంశయోపయోగం (benefit of doubt) ఇస్తూ జననసమయం రాత్రి ఒంటిగంటకు అనుకుందాం.అలా అనుకుని కొంత పరిశీలన చేసి చూద్దాం.

అప్పుడు వృషభలగ్నమే అవుతుంది.కానీ శుక్రుడు చతుర్దంలోకి వచ్చినందు వల్ల తల్లితండ్రులతో శత్రుత్వం కనిపిస్తున్నది.కృష్ణుని జాతకంలో అలాంటిది ఏమీ లేదు.తల్లికి అనేక కష్టాలు కనిపిస్తాయి.కృష్ణుడు పుట్టకమునుపు అవి ఉన్నాయేమో గాని పుట్టిన తర్వాత వారికీ కష్టాలే లేవు.కనుక ఇదీ సరియైన సూచన కాదు.

కుజ/శుక్రదశ జరిగే సమయానికి ఈ జాతకునికి 11 ఏళ్ళు ఉంటాయి.కానీ కుజ శుక్రుల షష్టాష్టక స్థితిని బట్టి రాసలీల వంటి మధుర సన్నివేశం ఆ సమయంలో జరిగే అవకాశం లేదు.

ఇకపోతే మహాభారత యుద్ధ సమయానికి ఈ జాతకంలో గురు/చంద్ర/శుక్ర/కుజ/శని దశ జరిగింది.ఇది అంత ఘోరమైన యుద్ధాన్ని సూచించే దశ కాదు.

3010-11 సమయానికి శుక్ర/రాహు దశ జరిగింది.ఇది స్వమరణాన్ని చాలా మసకగా సూచిస్తున్నది గాని బలమైన సూచన లేదు.ముసలం పుట్టడాన్ని యాదవ వంశ నాశనాన్నీ కూడా ఈ దశ అంత బలంగా సూచించడం లేదు.

కనుక ఈ తేదీని తిరస్కరించవలసి వస్తున్నది.

ఈరకంగా ఇప్పటివరకూ జల్లెడ పట్టగా మనకు మిగిలిన నాలుగు జాతకాల తులనాత్మక పరిశీలనను వచ్చే పోస్ట్ లో చూద్దాం.

(ఇంకా ఉన్నది)
read more " శ్రీకృష్ణుని జన్మకుండలి -9 (3011 BC శ్రావణ బహుళ అష్టమి) "

28, ఆగస్టు 2014, గురువారం

శ్రీ కృష్ణుని జన్మకుండలి -8(డా||రాఘవన్ & డా||సంపత్ అయ్యంగార్ వర్గం)

శ్రీ కృష్ణ జనన తేదీమీద పరిశోధన చేసినవారు ఇంకా చాలామంది ఉన్నారు.డా||GS Sampath Iyengar and డా||రాఘవన్ గార్లు వారి పరిశోధనలో తేల్చిన విషయాన్ని బట్టి 27-7-3112 BC అనేది శ్రీకృష్ణుని జనన తేదీ.

ఈ తేదీకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇది జూలియన్ కేలండర్ తేదీ గనుక దీనిని గ్రెగేరియన్ కాలెండర్ లోనికి మార్చగా 1-7-3111 BC అవుతుంది.ఆ సమయానికి కుండలి ఏమంటున్నదో చూద్దాం.

శుక్ల నామ సంవత్సరం భాద్రపద బహుళ అష్టమి గురువారం రోహిణీ నక్షత్రం నాలుగో పాదం అయింది.

యధావిధిగా చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.గురువు ఉచ్ఛస్థితికి దగ్గరగా ఉన్నాడు.శ్రీ రామకృష్ణుని జాతకంలో కూడా గురువు మిధునంలోనే ఉన్న విషయం గమనించాలి.శుక్రుడు నీచలో ఉన్నాడు గాని తద్రాశినాధుడైన బుధుని చతుర్ధ కేంద్రస్థితివల్ల నీచభంగం అయింది.శని ఉచ్చస్థితిలో ఉన్నాడు.కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.రాహుకేతువులు కూడా ఉచ్ఛస్థితికి దగ్గరలో ఉన్నారు.కనుక దాదాపు ఏడుగ్రహాలు తమ తమ ఉచ్చస్థితిలో గాని దానికి దగ్గరగా గాని ఉన్నట్లు లెక్క.

ఈ గ్రహస్థితి అవతార పురుషుని జాతకానికి చాలా దగ్గరగా ఉన్నది. భగవంతుని అవతారం అయిన వ్యక్తి యొక్క జాతకం ఎలా ఉంటుందో శ్రీరామకృష్ణుని జాతకమే మనకు మోడల్ జాతకం  అని ఇంతకు ముందే చెప్పాను.ప్రస్తుత జాతకం శ్రీరామకృష్ణుని జాతకానికి చాలా పోలికలతో దగ్గరగా ఉండటం గమనించవచ్చు.

జనన సమయంలో ఈ జాతకునికి చంద్ర/శుక్ర/బుధదశ జరుగుతున్నది. శుక్రుడు షష్టాధిపతిగా మేనమామను సూచిస్తున్నాడు. అంతేగాక గండాన్ని సూచిస్తున్నాడు.పంచమంలో నీచలో ఉంటూ కుట్రను సూచిస్తున్నాడు. బుధుడు చతుర్దంలో చతుర్దాతిపతితో కలసి ఉంటూ మాతృవర్గాన్ని సూచిస్తున్నాడు.వెరసి జనన సమయంలో మేనమామ వల్ల వచ్చిన ప్రాణగండం స్పష్టంగా కనిపిస్తున్నది.

లగ్నానికి పట్టిన గ్రహార్గళం వల్ల ఇతని జననం ఒక చెరసాలలో జరిగిందన్న సూచన ఉన్నది.

చతుర్దంలో రెండుగ్రహాల వల్ల ఇద్దరు తల్లులున్న విషయం తెలుస్తున్నది. పంచమంలో నీచశుక్రునివల్ల ప్రేమవ్యవహారాలు కనిపిస్తున్నాయి.నవమంలో ఉచ్ఛ కుజుని వల్ల అనేక వివాహాలూ, ద్వాదశం లోని రాహువుపైన కుజదృష్టి వల్ల జ్ఞాతిపోరూ సూచితం అవుతున్నది. నవమాధిపతి షష్ఠమంలో కేతువుతో కూడిన ఉచ్చస్థితి వల్ల జ్ఞానస్వరూపుడూ జగద్గురువూ అవతారమూర్తీ అని తెలుస్తున్నది.ధర్మస్థాపన కోసం అవతరించాడని అర్ధమౌతున్నది.

అయితే ఈ ధర్మస్థాపన ఉత్త బోధనాపరంగా కాకుండా ఒక మహాయుద్ధం ద్వారా భూభారం తగ్గించే పని జరుగుతుందన్న విషయం షష్ఠంలోని శని కేతువుల వల్ల తెలుస్తున్నది. తృతీయం మీద ఉచ్చకుజుని దృష్టి వల్ల మహాపరాక్రమశాలి అని తెలుస్తున్నది.ధర్మస్థానం నుంచి ఉచ్ఛకుజుని దృష్టి చతుర్దంలో ఉన్న దారాకారకుడూ పంచమాధిపతీ అయిన బుధునిపైన పడుతూ ఆధ్యాత్మిక పరమోత్కృష్ట ఘట్టమైన రాసలీలను సూచిస్తున్నది.

ఈ జాతకునికి కుజదశ తన 8 వ ఏట అయిపోతుంది.రాసలీల జరిగినప్పుడు కృష్ణునికి దాదాపు అంతే వయస్సు ఉంటుంది.అందరూ అనుకున్నట్లు అది కామకేళి కాదు.అది సామాన్య మానవుల మనస్సులు ఊహించలేని అత్యంత మధురమైన దివ్యఘట్టం.నిమ్నమైన మనోభూమికలలో విహరించడానికి అలవాటు పడిన సామాన్యులు రాసలీలను ఎన్నటికీ అర్ధం చేసుకోలేరు.

రాసలీల గురించి ఒక సందర్భంలో శ్రీ రామకృష్ణులు ఇలా అన్నట్లుగా 'గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ' గ్రంధకర్త మహేంద్రనాధ గుప్త రికార్డ్ చేశారు. 

"రాసలీలా సమయంలో గోపికలందరూ సమాధిస్థితిలో అత్యంత దివ్య పారవశ్యస్థితిలో ఉన్నారు.వారికి దేహస్పృహ ఏ మాత్రమూ లేదు.కృష్ణుని దివ్యసన్నిధిలో అప్రయత్నంగా వారి కుండలిని సహస్రారచక్రానికి అధిరోహించగా అందరూ మాటలకందని పరమ పారవశ్య సమాధిస్థితిలో లీనమై ఉన్నారు.వారి ఆత్మలన్నీ శ్రీకృష్ణునిలో లయించాయి. దేహస్పృహను దాటిన పరమానంద స్థితిలో వారు ఆ రాత్రంతా మునిగి ఉన్నారు."

ఒక సందర్భంలో 'రాసలీల' గురించి మాట్లాడుతూ వివేకానంద స్వామి ఇలా అన్నారు.

"మనస్సులో కామం లేశమాత్రమైనా మిగిలి ఉన్నంతవరకూ ఏ మానవుడూ రాసలీల యొక్క పరమోత్క్రుష్టమైన స్థాయిని కనీసం ఊహించను కూడా ఊహించలేడు."

కనుక ఎనిమిదేళ్ళ లోపు వయస్సులో జరిగిన రాసలీలను కూడా ఈ జాతకం స్పష్టంగా సూచిస్తున్నది.ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ సంఘటన 3104-3105 BC మధ్యలో జరిగి ఉండాలి.ఎందుకంటే,ఆ సమయంలో ఈ జాతకంలో కుజ/శుక్రదశ నడిచింది.అప్పటికి కృష్ణునకు ఆరు లేదా ఏడు సంవత్సరాల వయస్సు ఉంటుంది.ఆ వయస్సులో ఆయన ఎంత ముద్దుగా ఉండేవాడో ఊహిస్తే ఆ చిన్నికృష్ణుని సమక్షంలో గోపికల దివ్యపారవశ్య స్థితి ఏమిటో- రాసలీల అంటే ఏదేదో అనుకునే మన మట్టిబుర్రలకు లీలగా చూచాయగా అయినా అందుతుంది.

మన ఎదురుగా కనిపిస్తున్న మనుషులనే మనం సరిగ్గా అర్ధం చేసుకోలేం. ఇక ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఒక మహోన్నతమైన దివ్యసంఘటనను మన మురికి బట్టిన మనస్సులతో ఎలా అర్ధం చేసుకోగలం?భగవంతుని లీలను మన ఊహతో ఎలా కొలవగలం?అది జరిగే పని కాదు.అందుకే రాసలీల అంటే ఏమిటో ఇప్పటికీ ఎవరూ సక్రమంగా అర్ధం చేసుకోలేరు.మనుష్యుల నీచ మానసిక స్థితులను గమనిస్తే అలా అర్ధం చేసుకోలేకపోవడం సహజమే అనిపిస్తుంది.

హిమాలయాలలో వేల అడుగుల ఎత్తులో ఉన్న మానససరోవర తీరంలో ఉండే మనోహర వాతావరణం,మన ఊరిలోని బురదగుంటలో పొర్లే పందికి ఎలా అర్ధమౌతుంది? అసాధ్యం!!

ద్వితీయం నుంచి గురుదృష్టి శనికేతువుల మీద పడుతూ తన చతుర సంభాషణలతో ఎంతటి శత్రువునైనా లొంగదీసుకోగల ధార్మికతనూ చతురతనూ సూచిస్తున్నది.

అష్టమంమీద ఉన్న రాహు,గురు,శని,కేతు,రవి బుధుల దృష్టుల వల్ల ఒక మహోన్నతమైన,నిగూఢమైన,ఊహాతీతమైన రహస్యదైవశక్తి సూచింప బడుతున్నది.దాని పరిధి ఎల్లలు లేకుండా ఉన్నదనీ అది సర్వతోముఖంగా వ్యాపించి ఉన్నదనీ,దాని లోతులు కొలవడం మనకు అసాధ్యం అన్న విషయం రహస్యస్థానం అయిన అష్టమంమీద ఉన్న ఇన్ని గ్రహాల శక్తివంతములైన దృష్టుల వల్ల సూచనాప్రాయంగా మనకు తెలుస్తున్నది.

ఇది స్పష్టంగా కనిపిస్తున్న అవతార లక్షణం.

అవతార పురుషుడు భూమిమీద జీవించి ఉన్న సమయంలో ఎవరికీ అంతుబట్టడు.తర్వాత కాలం గడిచేకొద్దీ మాత్రమే ఆయనను లోకం గుర్తించడం ఆరాధించడం మొదలుపెడుతుంది.లోకంలో ఇది సర్వసాధారణం. దైవం యొక్క అవతారాన్ని అందరూ గుర్తించలేరు.అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే అలా చెయ్యగలరు.ఎందుకంటే,లోకం మొత్తం ఆయన్ను గుర్తిస్తే ఆయన ఎందుకోసం వచ్చాడో ఆ పని నెరవేరదు.ఇక జనుల క్షుద్రమైన కోరికల చిట్టాను తీర్చడమే ఆయనకు నిత్యకృత్యం అయిపోతుంది.

శ్రీ రామకృష్ణులు కూడా తన చివరి దశలో ఇలా అనేవారు.

'నన్ను ప్రజలు గుర్తించడం మొదలు పెట్టిన మరుక్షణం నేనిక్కడ ఉండను.ఈ శరీరాన్ని వదలివేస్తాను.'

అలాగే శ్రీకృష్ణుడు జీవించి ఉన్నసమయంలో కూడా ఆయన దేవుడని,అతి కొద్దిమందికి తప్ప, మిగతా ఎవ్వరికీ తెలియదు. 

అందరూ ఆయనొక తెలివైన మాయలమారి అనీ స్త్రీలోలుడనీ అత్యంత సమ్మోహనా శక్తి కలిగిన మంత్రగాడనీ మాత్రమే అనుకున్నారు గాని ఆయనలోని దైవాంశను గుర్తించిన వారు చాలా తక్కువ. అదికూడా ఆయన యొక్క యోగమాయా ప్రభావమే.ఇదంతా అష్టమం మీద ఉన్న ఈ గ్రహాల దృష్టుల వల్ల సూచింపబడుతున్నది.

నవమంలో ఉన్న ఉచ్ఛకుజుని మీద ఉన్న గురుని నవమదృష్టి వల్ల ఒక మహోన్నత ధార్మిక శక్తిస్వరూపం మన కళ్ళ ముందు ప్రత్యక్షమౌతున్నది.

ఇప్పుడు మిగతా సంఘటనలు చూద్దాం.

'వర్షాణామ్ అధికం శతం' అన్న పదానికి 'నూరేళ్ళు దాటి' అనిన అర్ధాన్ని స్వీకరిస్తే,జనన సంవత్సరం 3111 గనుక దేహత్యాగం 3011-3010 ప్రాంతంలో కొంచం అటూ ఇటూగా జరిగి ఉండాలి.ఆ సమయంలో ఏ దశ జరిగిందో చూద్దాం.

3011-3010 BC ప్రాంతంలో ఈ జాతకునికి శుక్ర/శనిదశ జరిగింది.ఈ దశా ప్రభావాన్ని కాళిదాసు ఎలా వర్ణించాడో ఇంతకు ముందే చెప్పి ఉన్నాను.కనుక మళ్ళీ వివరించనవసరం లేదు.కాకపోతే శుక్రునికి షష్టాదిపత్యం రావడమూ శని షష్ఠంలో ఉండటమూ ఆ సమయంలో భయంకర దుర్దశనూ ముసలాన్నీ సూచిస్తున్నాయి.కనుక ఇది కూడా సరిగ్గా సరిపోయింది.

ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగిన సమయం చూద్దాం.డా||రాఘవన్,డా||సంపత్ అయ్యంగార్ డా||నరహరి ఆచార్ గార్ల పరిశోధన ప్రకారం మహాభారత యుద్ధం ఖచ్చితంగా 22-11-3067 BC న మొదలైంది.

ఆ సమయానికి ఈ జాతకంలో శని/శనిదశ జరిగింది.శని ఖచ్చితంగా యుద్ధాన్ని సూచించే షష్ఠం లో ఉండటం కనిపిస్తున్నది.వీరి లెక్క ప్రకారం తేదీకూడా ఇచ్చారు గనుక దశ/అంతర్దశ/విదశ/సూక్ష్మదశ/ప్రాణదశ వరకూ పరిశీలించి చూద్దాం.

అద్భుతం!!!

22-11-3067 తేదీన ఖచ్చితంగా మహాభారత యుద్ధం మొదలయ్యే సమయానికి ఈ జాతకునికి శని/శని/కుజ/శని/రాహుదశ జరిగింది.అంటే శపితయోగం స్పష్టాతిస్పష్టంగా దర్శనమిస్తున్నది.

శని షష్ఠంలో ఉంటూ యుద్ధాన్ని సూచిస్తున్నాడు.కుజుడు సప్తమ ద్వాదశాధిపతిగా వినాశనానికి కారకుడు.రాహువు ద్వాదశం లోనే ఉన్నాడు.కుజుణ్ణి సూచిస్తున్నాడు.శని/కుజ/రాహువుల కలయిక ఖచ్చితంగా కనిపిస్తున్నది !!!

ఇప్పుడు ఇంకొక సంఘటనను పరిశీలిద్దాం.

వీరి పరిశోధన ప్రకారం భీష్మనిర్యాణం 17-1-3066 BC రోజున జరిగింది. అంపశయ్య మీద ఉండి భీష్ముడే విష్ణుసహస్రనామాన్ని ధర్మరాజుకు చెప్పినట్లు మనకు తెలుసు.ఈ సంఘటన సరిపోతున్నదో లేదో చూద్దాం.

17-1-3066 న ఈ జాతకంలో శని/బుధ/బుధ/చంద్ర/కుజ దశ జరిగింది.శని నవమాధిపతిగా ఉచ్ఛస్థితిలో సహజ మోక్షకారకుడైన కేతువుతో కలసి ఉంటూ ఒక ధార్మిక మహాసంఘటనను సూచిస్తున్నాడు.బుధుడు పంచమాధిపతిగా సూర్యునితో కలసి బుధాదిత్య యోగంలో ఉంటూ ఒక మహోన్నత సాహిత్య అవతరణాన్ని సూచిస్తున్నాడు. చంద్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు.కుజుడు నవమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.కనుక ఆ సమయంలో విష్ణు సహస్రనామం ఉద్భవించడానికి సరిపోయే దశలు ఖచ్చితంగా జరుగుతున్నాయి.

కృష్ణుని జీవితంలో మనకు తెలిసిన అన్ని పెద్ద సంఘటనలూ ఈ జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కనుక ఇప్పటివరకూ విశ్లేషించిన జాతకాలన్నింటిలో ఈ జాతకానికి ప్రధమస్థానం ఇస్తున్నాను.నరహరి ఆచార్ గారి వర్గానికి రెండవస్థానం ఇచ్చాను.వర్తక్ గారి పరిశోధనకు మూడవస్థానం ఇచ్చాను.

కాకపోతే ఇందులో ఒక చిన్న చిక్కు ఉన్నది.

ఈ జాతకుడు పుట్టినది భాద్రపద బహుళ అష్టమి.శ్రావణ బహుళ అష్టమి కాదు.కనుక ఈ సంవత్సరంలో శ్రావణ బహుళ అష్టమి జాతకం ఏమంటున్నదో కూడా మనం పరిశీలించాలి.అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు.ఆ జాతకాన్ని కూడా పరిశీలించిన తరువాత మాత్రమే మనం ఒక నిశ్చితాభిప్రాయానికి రాగలం.

ఆ పని వచ్చే పోస్ట్ లో చేద్దాం.

(ఇంకా ఉన్నది)
read more " శ్రీ కృష్ణుని జన్మకుండలి -8(డా||రాఘవన్ & డా||సంపత్ అయ్యంగార్ వర్గం) "

27, ఆగస్టు 2014, బుధవారం

స్వామివారి అపాయింట్ మెంట్ కావాలి

మొన్నొక రోజున పొద్దున్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది.

ఏదో కొత్త నంబర్.

సామాన్యంగా కొత్త నంబర్లకు నేను పలకను.

'సరే చూద్దాంలే పొద్దున్నే ఎవరో' అనుకుని 'హలో' అన్నా.

'స్వామిగారున్నారా?' అవతలనుంచి ఒక గొంతు వినిపించింది.

'నేను స్వామినెప్పుడయ్యానా?' అని నాకే అనుమానం వచ్చింది.

ఏమిటో చూద్దామని -'ఏ స్వామివారు?' అని అడిగాను.

'అదే... గుళ్ళో స్వామిగారు ఉంటారట కదా?' అన్నాడు ఆ వ్యక్తి.

'గుళ్ళో స్వామి ఫోన్లో ఎలా మాట్లాడతాడు?' అడిగాను.

'అదికాదు.ఆయన అపాయింట్ మెంట్ కావాలి.'

పొద్దున్నే ఏమిటో ఈ హాస్యప్రభంజనం అనుకుని-'గుళ్ళో స్వామి అపాయింట్ మెంట్ మీక్కావాలా?' అడిగాను.

'అవును'

'మీ వయసెంత?' అడిగాను.

'నలభై'

'అప్పుడే అంత తొందర ఎందుకు? ఇంకా కొన్నాళ్ళు ఉండండి.' అన్నాను.

నేను చెబుతున్నది అవతల ఎక్కడం లేదు.

'అలా కాదు.నేను చాలా ట్రబుల్స్ లో ఉన్నాను.స్వామిగారిని అర్జెంట్ గా కలవాలి' అన్నాడు.

'స్వామిగారు కూడా ప్రస్తుతం చాలా ట్రబుల్స్ లో ఉన్నారు.ఆయన ఎవర్ని కలవాలో ఆలోచిస్తూ ధ్యానంలో ఉన్నారు.' అన్నాను.

వినిపించుకునే పరిస్థితిలో అవతల వ్యక్తి లేడు.

'ధ్యానం లోనుంచి లేచాక,ఆయనతో మాట్లాడి అపాయింట్ మెంట్ ఇప్పించండి.ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తాం.' అన్నాడు.

'వీలుకాదు.ధ్యానం తర్వాత ఆయన ప్రియశిష్యురాలితో ఏకాంతసేవలో ఉంటారు.మధ్యాన్నం మూడువరకూ బయటకు రారు.ఈలోపల కదిలిస్తే ఆయనకు మహాకోపం వస్తుంది.'అన్నాను సీరియస్ గా.

అవతలి వ్యక్తి పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు.

'పోనీ ఈలోపల ఏదైనా రెమెడీ మీరు చెప్పినా పరవాలేదు." అన్నాడు.

మధ్యాన్నం మూడువరకూ కూడా ఆగలేడట!!వెంటనే పనిచేసే రెమెడీ ఈలోపల నేను చెప్పాలట!!! ఇదేమైనా తలనొప్పి మాత్రా వేసుకున్న పదినిముషాలలో నొప్పి మాయం అవడానికి??

టీవీ జ్యోతిష్కుల పుణ్యమా అని 'రెమేడీ'అనేది ఒక పెద్ద ఫార్స్ అయిపోయింది.ఒక లెక్కా ఏమీ లేకుండా ఎవరి నోటికోచ్చినవి వారు చెబుతున్నారు.చేసేవారు చేస్తున్నారు.ఇది కర్మతో చెలగాటం అనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఈ ఫోన్ కాల్ ఎవరికో చెయ్యబోయి నాకు చేశాడని అర్ధమైపోయింది.

'అలాంటి రెమెడీలు నాకు తెలియవు.నా రెమెడీలు మీరు ఆచరిస్తే మీ సమస్యలు పోవుగాని ఏ సమస్య వచ్చినా చెదరకుండా మీరు ఉండగలుగుతారు.కానీ అలాంటివి ఫోన్లో చెప్పను.' అన్నాను.

'అందుకే సార్.వచ్చి కలుస్తాం.' అన్నాడు.

'మీరెలాంటి రేమేడీలు ఆశిస్తున్నారు?' అడిగాను.

'స్వామిగారు హోమాలు చేయిస్తారట కదా?అన్ని ప్రాబ్లెమ్స్ పోతాయట కదా?' అన్నాడు.

ఆ స్వామివారెవరో ఈ గోలేమిటో విషయం వెంటనే అర్ధమై పోయింది.

'స్వామివారి డైరీలో ఇంకో అయిదేళ్ళ వరకూ కాల్షీట్లు ఖాళీలు లేవు. అపాయింట్ మెంట్లు ముందే ఫిక్స్ అయిపోయాయి.' అన్నాను.

'అలా అంటే ఎలా సార్?పోనీ మీరైనా ఏదైనా రేమేడీ చెప్పండి.' అన్నాడు.

నేను స్వామివారి అసిస్టెంట్ ను అనుకుంటున్నాడని నాకర్ధమైంది.

'అసలు మీ ప్రాబ్లెం ఏమిటి?' అడిగాను.

'రెండు కోట్లు బ్లాక్ అయిపోయాయి.అవతలి పార్టీ మోసం చేసాడు.వాడు నా ఫ్రెండే.ఆ డబ్బు వచ్చే మార్గం చెప్పాలి' అన్నాడు.

ఇక ఇతనికి ఉపదేశం అవసరం అనుకున్నా.

'చూడండి.అత్యాశ మంచిది కాదు.ఉన్నంతలో బ్రతకడం నేర్చుకోండి. దురాశకు పోయి నానా పాడుపనులూ చేసి డబ్బు సంపాదించకండి.ఎంత సంపాదించినా వెంట తీసుకుపొయ్యేది ఏమీ లేదు.సుఖాలకు అంతూ పొంతూ కూడా లేదు.మానవ జీవితగమ్యం డబ్బు సంపాదన ఒక్కటే కాదు. అమూల్యమైన మానవజీవితాన్ని అనవసరమైన విషయాలలో వృధా చేసుకోకండి.ధర్మంగా బ్రతకండి.ఒకవేళ అధర్మం అయితే మీకు నష్టం కలిగినా సరే ఆ పనిని ఒదిలెయ్యండి.' అన్నా.

అవతలవైపు నుంచి భయంకరమైన నిశ్శబ్దం వినిపించింది.

ఫోన్ పెట్టేశా.

ఆయన ఫోన్ చేసిన స్వామివారు ఎవరో నాకు తెలుసు.ఆ స్వామివారే ప్రస్తుతం పీకల్లోతు లౌకిక సమస్యలలో కూరుకుని పోయి ఉన్నారు.పోనీ ఆధ్యాత్మిక జ్ఞానమన్నా ఆయనకు ఎక్కువైపోయిందా అంటే అదీ లేదు.అలాంటి స్థితిలో ఉండి వారు ఇతరులకు సలహాలిస్తున్నారు.వీరు స్వీకరిస్తున్నారు.

ఏమిటో ఈ మాయ!!

ఆశ అనేది చాలా గొప్ప శక్తి.దురాశ అనేది ఇంకా గొప్ప శక్తి.ఇవి రెండూ మనిషిని పట్టుకుని పీడిస్తూ ఉన్నంతవరకూ ఇలాంటి స్వాముల చేతులలో చిక్కి బలికాక తప్పదు.ఇలాంటి అనైతిక పనులకు సలహాలిచ్చే వీరు 'స్వామి' అన్న పదానికి అర్హులేనా అని నా ప్రాచీన అనుమానం.చివరకు 'నేటి స్వాములు' హవాలా కార్యకలాపాలకు బ్రోకర్లుగా మారుతున్నారు. ఇంతకంటే చండాలం ఇంకొకటి ఉండదు.

తప్పుదారిన పోతున్నవారికి 'ఇదితప్పు' అనిచెప్పి దారి మళ్ళించి మంచిదారిలో పెట్టేపనిని వారు చెయ్యాలి.అంతేగాని,ఆయా పనులకు సహకరిస్తూ,అవి తేలికగా అయ్యే మార్గాలు చెబుతున్న వీరు 'స్వామి' అన్న పదం తగిలించుకుని దానిని భ్రష్టు పట్టిస్తున్నారు.

దశనామీ సంప్రదాయాన్ని సృష్టించిన ఆదిశంకరుల వంటి మహనీయులు ఇలాంటి స్వాములను పైనుంచి చూచి ఎంతగా బాధపడుతున్నారో అనిపించింది.

దేవుడా!! ఎంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించావయ్యా!! ఎలాంటి లీలను నడిపిస్తున్నావయ్యా !! అని దైవానికి మనస్సులో నమస్కారం చేసుకుని నా పనిమీద నేను బయలుదేరాను.
read more " స్వామివారి అపాయింట్ మెంట్ కావాలి "

26, ఆగస్టు 2014, మంగళవారం

శ్రీకృష్ణుని జన్మకుండలి-7

భగవంతుడైన విష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించిన సమయానికి ఉన్న గ్రహస్థితులను వ్యాసమహర్షి శ్రీమద్భాగవతంలో పెద్దగా వర్ణించలేదు. సూచనాప్రాయంగా మాత్రమే చెప్పినాడు.

ఎందుకంటే అప్పటివరకూ ఆయన ఒక గ్రంధకర్తగానే మిగతా పురాణాలన్నీ వ్రాసుకుంటూ వచ్చాడు.కానీ భాగవతం వ్రాసే సమయానికి ఆయనలోని భక్తి పరాకాష్టకు చేరుకున్నది.కనుకనే భాగవత రచన చేసిన తదుపరి మాత్రమే ఆయనకు పరమశాంతి లభించింది.ఈ మార్పు దేవర్షి అయిన నారదమహర్షి ఉపదేశం వల్లనే ఆయనకు కలిగింది.

అదే,మహాభారతం వ్రాసే సమయానికి గనుక మనం చూస్తే,ఆయన ఒక్క భక్తినే ఆశ్రయించలేదు.అసలా కధకు భక్తితో ఏమాత్రం సంబంధం లేదు.అది మానవావేశాలనూ ఈర్ష్యాద్వేషాలనూ మాయామోహాలనూ ధర్మాధర్మాలనూ కుట్రలనూ కుతంత్రాలనూ సమస్తాన్నీ ప్రతిబింబించే ఒక జరిగిన కథ.రాజ్యం కోసం భూమికోసం రాజుల మధ్యన జరిగిన యుద్ధం.

కానీ భాగవతం అలా కాదు.అది భక్తిరస సామ్రాజ్యం.అందులో భౌతిక వివరాలకు పెద్దగా తావు లేదు.ఆ సీమలో భౌతికపరిధి అతిక్రమించబడి అతీతలోకాల స్పర్శ మనకు అందుతుంది.దివ్యాత్మసామ్రాజ్యపు ప్రేమరసమే అందులో సర్వే సర్వత్రా నిండి తొణికిసలాడుతూ ఉంటుంది.హృదయం భక్తిలో కరగిపోయి శ్రీకృష్ణసన్నిధిలో అన్నీ మరచి ఆనందంలో ఓలలాడుతూ ఉండిపోతుంది.

కనుకనే భౌతికపరమైన చిన్నచిన్న వివరాలు భాగవతంలో మనకు పెద్దగా దొరకవు.భక్తి పరాకాష్ఠకు చేరుకున్న స్థితిలో భౌతిక వివరాలతో పని ఏమాత్రమూ ఉండదు కదా.

ఉదాహరణకు చూద్దాం.

శ్రీకృష్ణ జనన సమయంలో ఉన్న పరిస్థితిని వ్యాసమహర్షి ఎలా వర్ణించారో గమనిద్దాం.

శ్లో||అధ: సర్వగుణోపేత: కాల:పరమశోభన:
యర్హ్యే వాజన జన్మర్క్షం శాంతర్క్ష గ్రహతారకమ్
దిశ: ప్రసేదుర్గగనం నిర్మలోడుగణోదయం
మహీ మంగళభూయిష్ఠ పురగ్రామ వ్రజాకరా

(సంస్కృత శ్రీమద్భాగవతం 10-3-1,2)

"యర్హ్యేవాజన జన్మర్క్షం శాంతర్క్ష గ్రహతారకమ్" అనిన శ్లోకపాదంలో -'అజన నక్షత్రం నడుస్తున్న విషయమూ అన్ని గ్ర్హహములూ  నక్షత్రములూ శాంతస్థితిలో" ఉన్న విషయాన్నీ మాత్రమే వ్యాసమహర్షి చెప్పినారు గాని,అది ఏ మాసం ఏ వారం ఏ లగ్నం మిగతా గ్రహాలన్నీ ఏయే పరిస్థితిలో ఉన్నాయి అనిన వివరాలేమీ ఆయన చెప్పలేదు.నక్షత్రం విషయం మాత్రం ఇక్కడ తెలుస్తున్నది.ఇతరగ్రహాల పరిస్థితి ఏమీ తెలియడం లేదు.

'అజన జన్మర్క్షం' అనే పదానికి అర్ధాన్ని తీసుకుంటూ అనేకులు 'ప్రజాపతి నక్షత్రమైన రోహిణి' అనిన అర్ధాన్ని గ్రహించారు.కానీ ఈ అర్ధం ఇదే కావాలన్న నియమం ఏమీ లేదు.దీనికి కొంత విరుద్ధంగా ఉండే శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి.

హరివంశ పురాణం,విష్ణుపురాణం వంటి ఇతర గ్రంధాలలో కొన్ని ఇతర వివరాలున్నాయి.అవేమంటున్నాయో దృష్టి సారిద్దాం.

శ్లో||ముహూర్తే అభిజిత్ ప్రాప్తే సార్ధరాత్రే విభూషితే
సాగరా సమకంపంత చేలుశ్చ ధరణీధరః
జజ్వలుశ్చాగ్నయా శాంతా జాయమానే జనార్దనే
శివాశ్చ ప్రవవుర్వాతా:ప్రశాంతమభవద్రజ:
జ్యోతింష్యతివ్యకాశంత జాయమానే జనార్దన:
అభిజిన్నామ నక్షత్రం జయంతీ నామ శర్వరీ
ముహూర్తో విజయో నామ యత్ర జాతో జనార్దన:

(హరివంశ పురాణం 2:4:14-17)

ముఖ్యంగా ఈ శ్లోకం చివరిపాదం లో ఉన్న "అభిజిన్నామ నక్షత్రం జయంతీ నామ శర్వరీ ముహూర్తో విజయో నామ యత్ర జాతో జనార్దన:" అనే శ్లోకాన్ని గనుక తీసుకుంటే,శ్రీకృష్ణ జనన సమయంలో అభిజిత్ నక్షత్రం ఉన్నదన్న విషయం కనిపిస్తుంది.

అయితే మరి శ్రీకృష్ణ జనన సమయంలో ఉన్నది రోహిణీ నక్షత్రమా? లేక అభిజిత్ నక్షత్రమా?పోనీ ఈ రెండూ పక్కపక్కన లేవు ఏదో పొరపాటయిందిలే అనుకోవడానికి.ఈ రెంటికీ మధ్యన పది నక్షత్రాల తేడా ఉన్నది.

అభిజిత్ నక్షత్రం ఒకప్పుడు మన నక్షత్ర గణనంలో ఉండేది.ఇది మహా ప్రకాశవంతమైన నక్షత్రం.దానితో కలిపి 28 నక్షత్రాలను మనం పూర్వకాలంలో లెక్కించే వాళ్ళం.ప్రస్తుతం దానిని తీసివేసి 27 నక్షత్రాలను మాత్రమే లేక్కిస్తున్నాం.అది నక్షత్రపధంలోనుంచి మాయం కావడమో పక్కకు తప్పుకోవడమో జరిగింది.అప్పటి నుంచి దానిని లెక్కించడం మానివేశాము.

కృష్ణునికి ముందున్న అనేక అవతారాలు అభిజిత్ నక్షత్రంలో వచ్చాయి. చివరకు ధర్మరాజు కూడా ఈ నక్షత్రం లోనే పుట్టాడు.కానీ ఆ తర్వాత ఆ నక్షత్రం ఆకాశంలో కనుమరుగు అయ్యింది.ప్రస్తుతం దానిని ఉత్తరాషాఢ-శ్రవణా నక్షత్రాల మధ్యన ఉన్నట్లుగా మనం భావిస్తున్నాం.

ఇక్కడ ఒక అనుమానం తలెత్తుతుంది.శ్రీకృష్ణనిర్యాణ సమయంలోనే ఈ నక్షత్రం మాయమైందా?మహాపురుషుల నిర్యాణ సమయాలలో తోకచుక్కలు కనిపించడం చుక్కలు కళావిహీనంగా మారడం వంటి సంఘటనలను అతి ప్రాచీన కాలం నుంచి మనం గమనిస్తున్నాం.

శ్రీకృష్ణుడు అవతారాలలో పరిపూర్ణుడని మనం భావిస్తాం.కనుక అలాటి పరిపూర్ణ దైవావతారం భూమిని వదలి పోయేటప్పుడు అలాంటి ప్రకాశవంతమైన నక్షత్రం మాయం కావడం జరగవచ్చు.ఇది ఊహాతీతమేమీ కాబోదు.కాకుంటే ఋజువులు లభించాలి.

మన ఖర్మేమిటంటే ఉన్న గ్రంధాలన్నీ అగ్నికి ఆహుతి అయిపోగా అదృష్ట వశాత్తూ మిగిలి ఉన్న కొన్నికొన్ని గ్రంధాలలో అక్కడక్కడా మనకు లభిస్తున్న సమాచారాన్ని బట్టి మనం మన చరిత్రను వెతుక్కోవలసిన పరిస్థితి పట్టింది.ఇలాంటి పరస్పర విరుద్ధమైన శ్లోకాలు మన పురాణాలలో చాలా ఉన్నాయి.

ఉదాహరణకు విష్ణుపురాణం లోనే ఉన్న ఇంకొక శ్లోకాన్ని బట్టి -'నేను బహుళ అష్టమి రోజు రాత్రి నవమితిధిలో జన్మిస్తాను' అని విష్ణువే స్వయంగా చెప్పినట్లు ఉన్నది.కనుక ఆయన జన్మించినది అష్టమిరోజునా లేక నవమిరోజునా లేక రెండూ కలిసి ఉన్న రోజునా అనేది కూడా సందేహమే.

శ్లో|| నిద్రే గచ్ఛ మమాదేశాత్ పాతాళ తల సంశ్రయాన్
ఏకైకత్వేన షడ్ గర్భాన్ దేవకీ జఠరం నయ
హతేషు తేషు కంసేన శేషాఖ్యోంశస్తతో మయ
అంశాంశేనోదరే తస్యాస్సప్తమ: సంభవిష్యతి
గోకులే వసుదేవస్య భార్యాన్యా రోహిణీ స్థితా
తస్యాస్స సంభూతి సమం దేవి నేయస్త్వయోదరమ్
సప్తమో భోజరాజస్య భయాద్రోధో పరోధతః
దేవక్యా పతితో గర్భం ఇతి లోకో వదిష్యతి
గర్భ సంకర్షణాత్సోధ లోకే సంకర్షణేతి వై
సంజ్ఞా మవాప్స్యతే వీరశ్శ్వేతాద్రి శిఖరోపమ:
తతోహం సంభవిష్యామి దేవకీ జఠరే శుభే
గర్భం త్వయా యశోదాయ గన్తవ్యమవిలంబితం
ప్రావృట్కాలే చ నభసి కృష్ణాష్టమ్యాం నిశి
ఉత్పత్స్యామి నవమ్యాంతు ప్రసూతిం త్వమవాప్స్యసి

(విష్ణు పురాణం 5:1:62-68)

విష్ణువు మానవుడు కాదు.ఆయన దేవదేవుడు.సర్వోత్క్రుష్టుడైన భగవంతుడు.ఇదీ అని ఊహించసాధ్యం కాని మహాతేజ:స్వరూపుడు.ఈ సన్నివేశంలో దేవతలు ఆయనవద్దకు పోయి ఆయన తత్త్వాన్నీ గుణగణాలనూ బ్రహ్మముఖంగా స్తుతించగా సంతుష్టుడై ఆయన వారికి సమాధానం ఇచ్చినట్లు ఉన్నది.అప్పుడు కూడా ఆయన సరాసరి తన నిజరూప దర్శనం ఇవ్వలేదు.దేవతలకే ఆయన దర్శనం కాలేదంటే,ఇక ఆయన చెబుతుంటే ఆయన మాటలను రికార్డ్ చేసినది ఎవరు?

కనుక ఇది ప్రక్షిప్తం అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది.

ఇకపోతే ఇంతకంటే పెద్దది ఇంకొక చిక్కుముడి ఉన్నది.అసలు కృష్ణుడు పుట్టినది శ్రావణమాసంలో కాదు భాద్రపద మాసంలో అని కొంతమంది వాదిస్తారు.దానికి వారి రుజువులు వారూ బాగానే చూపిస్తారు.వారి వాదనను సమర్ధించే శ్లోకాలు కూడా మన పురాణాల లోనే  ఉన్నాయి.

మాసం తెలీకుండా,నక్షత్రం తెలీకుండా,సంవత్సరం తెలీకుండా వేల సంవత్సరాల నిడివిలో ఒక్కరోజును ఎలా కనుక్కోవడం?

అసలు మన పురాణాలలో ఉన్న శ్లోకాలలో అసలైనవి ఏవి? తర్వాత చేర్చబడినవి ఏవి? అనేది ఇంకొక చిక్కు ప్రశ్న.దీనిని ఎక్కడా సమాధానం లేదు.

సంస్కృతం వచ్చిన ప్రతివాడూ వాడి ఇష్టం వచ్చినట్లు కొన్ని శ్లోకాలు వ్రాసి పురాణాలలో ఎక్కడ బడితే అక్కడ పిట్టకధలుగా పిల్లకధలుగా చేర్చి పారేశాడు.దానితో అసలు గ్రంధం రూపురేఖలే మారిపోయే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడింది.అసలైన గ్రంధంలో ఉన్న కొన్ని శ్లోకాలకు పూర్తి భేదంగా ఉండే శ్లోకాలు కూడా ఇందువల్లే మనకు అనేక పురాణాలలో కనిపిస్తాయి.

ఉదాహరణకు మొదట 10,000 శ్లోకాలతో వ్రాయబడిన మహాభారతం ఇప్పుడు లక్ష శ్లోకాలకు చేరుకున్నది అంటే మిగతా 90,000 శ్లోకాలను వ్రాసినది ఎవరు?వ్యాసుని శిష్యులు కొందరు ఆ పని చేశారని అంటారు.కనుక ఏయే శ్లోకాలు నిజాలో ఏవి ప్రక్షిప్తాలో చెప్పలేని పరిస్థితి పురాణాలలో ఉన్నది.కొంతమంది సబ్జెక్ట్ కంటిన్యూటీని బట్టి అందులో వచ్చిన బ్రేక్ ని బట్టి అక్కడ ప్రక్షిప్త శ్లోకాలున్నాయని భావిస్తారు.కానీ ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు.తెలివైన పండితుడు ఎవరైనా సరే ఆ గ్రంధంలోని సబ్జెక్ట్ బ్రేక్ కాకుండానే,అసలు గ్రంధపు శైలి మారకుండానే,ప్రక్షిప్త శ్లోకాలను కావాలనుకున్న ప్రతిచోటా చొప్పించడానికి ఏమీ అడ్డు లేదు.అది అసాధ్యం కూడా కాదు.

ఏతా వాతా చెప్పేదేమంటే,ఇలాంటి పరస్పర విరుద్ధమైన శ్లోకాల ఆధారంతో మనం చరిత్రను పునర్నిర్మించాలని చూస్తె అది అసాధ్యమైన విషయంగా తోస్తుంది.

కనుక చివరకు మళ్ళీ ఖగోళమూ జ్యోతిష్యమే మనకు దిక్కు అవుతుంది. పురాణాలనుంచి కొన్ని సూచనలు మాత్రమె మనం స్వీకరించి ఆ తర్వాత మన పరిశోధన సాగించాలి.అది తప్ప వేరే మార్గం లేదు.

పరిశోధకులు ఏ తేదీనైనా సరే సూచించవచ్చు.వారి వారి పరిశోధనల ప్రకారం ఆ తేదీని సమర్ధించుకోవచ్చు.కానీ ఆ సమయానికి ఉన్న గ్రహస్థితులు ఒక అవతార పురుషుని జాతకాన్ని అందులోనూ పరిపూర్ణ అవతార పురుషుని జాతకాన్ని ప్రతిబింబించాలి.అలా కాకపోతే,అది ఎంతటి గొప్ప పరిశోధనైనా సరే, ఆ తేదీ తప్పే అని మనం అనుకోక తప్పదు.

(ఇంకా ఉన్నది)

read more " శ్రీకృష్ణుని జన్మకుండలి-7 "

25, ఆగస్టు 2014, సోమవారం

శ్రీకృష్ణుని జన్మ కుండలి -6(డా||వర్తక్ గారి పరిశోధన)

డా||వర్తక్ గారు ఇచ్చిన వివరాల ప్రకారం శ్రీకృష్ణజననం 23-5-5626 BC తేదీన జరిగింది.అంత దూరంగా ఉన్న గ్రహస్థితులను లెక్కించే సాఫ్ట్ వేర్ నా వద్ద లేదు.

కనుక డా|| వర్తక్ గారు ఇచ్చిన గ్రహడిగ్రీలనే మనం స్వీకరిద్దాం.

* అనేది 'డిగ్రీ' కి గుర్తుగా చదువరులు గమనించాలి.

Sun-132* =Simha 12*
Moon -48* =Vrishabha 18*
Mars -337*=Mina 7*
Mercury-Kanya.
Jupiter-100*=Karkataka 10*
Venus-82*=Mithuna 22*
Saturn-64*=Mithuna 4*
Rahu-93*=Karkataka 3*
Ketu-273*=Makara 3*
Uranus-15* Mesha
Neptune-178*=Kanya 28*
Pluto-296*=Makara 26*
Lagna -Vrishabha.

ఇప్పుడు చదువరుల ఊహాశక్తికి పదును పెట్టే మానసిక వ్యాయామం ఇవ్వబోతున్నాను.ఇక్కడ జాతకచక్రం లేదు గనుక జాతకచక్రాన్ని కళ్ళ ముందు చూస్తూ ఈ లెక్కలు అర్ధం చేసుకోవాలి.


లగ్నం యధావిధిగా వృషభం అయింది.
చంద్రుడు లగ్నంలోనే ఉన్నాడు.
రెండింట శుక్ర శనులు
మూడింట గురురాహువులు
నాలుగింట రవి
అయిదింట బుధుడు
తొమ్మిదిలో కేతువు
పదకొండులో కుజుడు

చంద్రుడు 48 డిగ్రీలు అంటే, చంద్రదశా శేషం 4 సంవత్సరాలు ఉంటుంది.జనన సమయానికి చంద్ర/శని/గురుదశ జరుగుతున్నది.శని పిత్రువర్గాదిపతి. శుక్రునితో కలయిక వల్లా కుటుంబస్థానంలో ఉన్నందువల్లా తన బంధువులతో అందులోనూ మేనమామతో శత్రుత్వాన్ని సూచిస్తున్నాడు. గురువు అష్టమాదిపతి గనుక గండాన్ని సూచిస్తున్నాడు.తృతీయంలో రాహువుతో కూడినందువల్ల కుట్రపూరితమైన ప్రాణగండం సూచన ఉన్నది.

చరకారకులను లెక్కిస్తే,గురువు మాతృకారకుడవుతున్నాడు.వర్తక్ గారు బుధుని డిగ్రీలు ఇవ్వలేదు.కనుక బుధునికి ఏమి కారకత్వం వస్తుందో చెప్పలేము.ప్రస్తుతం ఉన్న లెక్కలప్రకారం గురువుకు మాతృకారకత్వం వస్తే,అప్పుడు జననకాల దశా ప్రకారం మేనమామ నుంచి ప్రాణగండం సరిగ్గా సరిపోతున్నది.

23-5-5626 BC నుంచి 5616 లోపు చంద్ర కుజ దశలు అయిపోతాయి.కుజుడు సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు.పంచమం నుంచి ఉచ్ఛ బుధునితో చూడబడుతూ ఉన్నాడు.కనుక ప్రేమ వ్యవహారాలూ సూచితమే.అనేకమంది భార్యలూ సూచితమే.

కానీ నాలుగింట ఉన్న ఒకేఒక గ్రహమైన రవి ఇద్దరు తల్లులను సూచించడం లేదు.

తృతీయ ఉచ్ఛగురువుకు రాహుస్పర్శ మంచిది కాదు.ఇది అవతార పురుషుని జాతకసూచనగా అనిపించడం లేదు.ఒక బోగస్ గురువు యొక్క జాతకంలో ఇలా ఉంటుందేమో గాని ఒక అవతారపురుషుని జాతకంలో గురువుకు రాహుస్పర్శ అనేది జీర్ణించుకోలేని విషయం.


16-10-5561 న మహాభారత యుద్ధం మొదలైందని వర్తక్ గారి అభిప్రాయం. దీనికి ఒక బలమైన లాజిక్ ఆయనకున్నది.ఆయన రీసెర్చి మెటీరియల్ చదివితే అది గట్టి లాజిక్ తో ఉన్నట్లే అనిపిస్తుంది.

మనం ఖగోళ వివరాలలోనికి పోకుండా ఉత్త జ్యోతిష్యపరంగా మాత్రమే చూద్దామని అనుకున్నాం కదా.కనుక కృష్ణునికి 65 ఏళ్ళ వయస్సు ఉన్నపుడు మహాభారత యుద్ధం జరిగి ఉండాలని పై తేదీలను బట్టి డా||వర్తక్ గారి పరిశోధన కూడా సూచిస్తున్నది.

ఇప్పుడు,దశలను పరిశీలిస్తే,5561 BC లో ఈ జాతకానికి బుధ/బుధ/శుక్రదశ జరిగినట్లుగా కనిపిస్తున్నది.సప్తమాధిపతి కుజుడి దృష్టి బుధుని మీద ఉన్నందునా,శుక్ర విదశ ఉన్నందునా,యుద్ధసూచనా,పుత్రవర్గ నాశనమూ సూచింపబడుతున్నది.కానీ బలమైన సూచన కాదు.

ఇకపోతే 5524 BC లో ఈ జాతకానికి,శుక్ర/శని/శుక్ర దశ జరిగింది.శుక్రుడు ఆత్మకారకుడు,శని నక్షత్రంలో ఈ జాతకానికి మారకుడైన కుజుడున్నాడు.పైగా పదకొండులో కుజుని వల్ల కాలికి గాయం అవడం ద్వారా మరణం కలుగుతున్నదని సూచన ఉన్నది.ఈ సంగతి ఆయన కూడా వ్రాశారు.

ఇంతవరకూ బాగానే ఉందికానీ ఈ సమయంలో ముసలంవల్ల యాదవవంశ నాశనాన్ని ఈ దశలు చూపడం లేదు.శుక్రునికీ శనికీ కూడా రాహుస్పర్శ లేదు.కనుక స్పష్టత లేదు.

డా|| నరహరి ఆచార్ గారి విధానంలో వచ్చినంత స్పష్టత ఈ జాతకంలో లేదు.కనుక దానికంటే దీనికి తక్కువ మార్కులే వచ్చాయని చెప్పవచ్చు.

(ఇంకా ఉన్నది)
read more " శ్రీకృష్ణుని జన్మ కుండలి -6(డా||వర్తక్ గారి పరిశోధన) "

24, ఆగస్టు 2014, ఆదివారం

శ్రీకృష్ణుని జన్మకుండలి-5 (డా|| నరహరి ఆచార్ వర్గం)

ఇప్పుడు మిగిలిన రెండవ జాతకాన్ని పరిశీలిద్దాం.

24-6-3151 BC

విరోధి నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
బుధవారం రోహిణి నాలుగో పాదం
కుజ హోర






జనన సమయానికి ఈ జాతకంలో చంద్ర/శుక్ర/గురుదశ జరిగింది.చంద్ర శుక్రుల గురించి ఇంతకు ముందే అనుకున్నాం.ఇకపోతే గురువు అష్టమాధిపతి గనుక మేనమామ గండం వచ్చింది అనుకోవచ్చు.అయితే ఇది కొంచం దూరాలోచనే అవుతుంది.ఎందుకంటే నవమంలో ఉంటూ గురువు పితృపక్షాన్ని సూచిస్తున్నాడు గాని మాతృవర్గాన్ని సూచించడం లేదు.కనుక తల్లివైపు నుంచి వచ్చిన ప్రమాదం సూచన లేదు.

కుజుని సప్తమాదిపత్యం వల్ల ప్రత్యర్ధులకు సూచకుడవుతున్నాడు.శుక్రునితో కలసి పంచమంలో ఉన్నందువల్ల శత్రువుల ప్లాన్ ను సూచిస్తున్నాడు.ఇది కూడా బాగానే ఉన్నది.కాకపోతే లగ్నానికి ఇది పంచమం కావడంవల్ల ఇది దుష్ట పన్నాగాన్నీ దానివల్ల ఈయనకు వచ్చిన ప్రాణగండాన్నీ సూచించదు. కనుక ఈ జాతకంలో జననకాల గండం అనేది ఒక wild guess మాత్రమే గాని స్పష్టత లేదు.

పంచమంలో ద్విస్వభావ రాశిలో కుజశుక్రులు ఉండటం శనిచేత చూడబడటం అతికామ యోగం.ఈ జాతకునికి ఎన్నో ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని సూచన ఉన్నది.ప్రేమస్వరూపునికి ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది?ప్రేమ అనే పాయింట్ నిజమే అయినప్పటికీ,కీచక రావణాదులకు ఉన్నట్లుగా శ్రీకృష్ణునికి అతికామం ఉన్నట్లు ఎక్కడా ఋజువు లేదు.కనుక ఈ యోగాన్ని సంశయించవలసిన అవసరం ఉన్నది.

ఇకపోతే 3067 BC భారతయుద్ధ సమయంలో ఈ జాతకునికి కేతు/గురు దశ జరిగింది.ఇది ఒకరకమైన నాశనాన్నే సూచిస్తున్నది కాని డైరెక్ట్ గా యుద్ధ సూచన లేదు.గురువు ఈ జాతకానికి అమాత్య కారకుడు.పైగా చంద్రుని శ్రవణా నక్షత్రంలో ఉన్నాడు.కనుక తన తమ్ములూ స్నేహితులను సూచిస్తున్నాడు. వాళ్ళు నాశనం అయ్యే సూచన ఇక్కడ ఉన్నది.యుద్ధంలో తన సైన్యం కౌరవుల పక్షాల పోరాడింది.వారిలో కూడా చాలామంది చనిపోయారు.పిత్రుపక్ష నాశనం సూచింపబడుతూ ఉన్నది.కనుక పైపైన సరిపోయినట్లు అనుకోవచ్చు.కొంత సరిపోయినట్లూ కొంత సరిపోనట్లూ ఉన్నది.స్పష్టత లేదు.

ఇకపోతే,శ్రీకృష్ణ నిర్యాణ సమయానికి 3031 BC లో ఈ జాతకానికి చంద్ర/శుక్ర/గురుదశ జరిగింది.ఈ దశలో పుత్రనాశనం సూచితం అవుతున్నప్పటికీ ఇంతకు ముందు కుండలిలో ఉన్నంత బలంగా లేదు.పైగా చంద్ర/గురు దశలో అంత విధ్వంసం జరగదు.చంద్ర శుక్ర గురువులలో ఎవరికీ రాహుస్పర్శ లేదు.కనుక యాదవులు మదించి త్రాగి ఆ మత్తులో ఒకరినొకరు కొట్టుకుని చావడం స్పష్టంగా సూచింపబడటం లేదు.

పైగా,పంచమంలో శుక్రకుజుల వల్ల ఈయనకు తన పుత్రులతో విరోధం ఉన్నట్లు సూచన ఉన్నది.కానీ అలా జరగలేదు.కృష్ణుని పుత్రులు చాలా మంచివాళ్ళు.వాళ్ళు ఆయనకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు సరిగదా తమకు సంబంధమే లేని యుద్దానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే నోర్మూసుకుని వెళ్లి కౌరవుల పక్షాన యుద్ధం చేశారు.

పైగా అవతార పురుషుని జాతకంలో గురువు నీచలో ఉండటం అందులోనూ ధర్మస్థానంలో అలా ఉండటం అసంభవం.ఒకవేళ గురువుకు నీచభంగం అయిందా అంటే అదీ కాలేదు.గురువు యొక్క వక్రస్థితీ శనికి సమసప్తకంలో ఉండటమూ అవతార పురుషుల జాతకాల్లో ఉండే యోగం కాదు.విపరీతమైన చెడుకర్మ ఉన్న మామూలు మనుషుల జాతకాల్లో ఈ యోగం ఉంటుంది.

ఈ జాతకంలో అన్ని పాయింట్లూ పూర్తి బలంతో సరిపోలేదు.ఏదో కలిసీ కలవనట్లుగా ఉన్నాయి.కనుక ఈ జాతకం అంత కరెక్ట్ గా సరిపోవడం లేదు.కనుక దీనిని తిరస్కరించక తప్పడం లేదు.

డా||నరహరి ఆచార్ గారి ఖగోళ పరిశోధనా కోణాన్ని ఇప్పటిదాకా జ్యోతిష్య దుర్భిణిలో నుంచి చూచాము గనుక ఇప్పుడు డా|| వర్తక్ గారి పరిశోధన ఏమిటో జ్యోతిష్యపరంగా చూద్దాం.

(ఇంకా ఉన్నది)
read more " శ్రీకృష్ణుని జన్మకుండలి-5 (డా|| నరహరి ఆచార్ వర్గం) "

23, ఆగస్టు 2014, శనివారం

శ్రీకృష్ణుని జన్మకుండలి-4 (డా|| నరహరి ఆచార్ వర్గం)

25-6-3143
హేవిళంబి నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
ఆదివారం రోహిణి మూడవ పాదం






7-7-3144 BC
దుర్ముఖ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
మంగళవారం రోహిణి రెండవ పాదం
చంద్రుడు ఉచ్ఛస్తితి
కుజ శుక్రులు నీచస్థితి




18-6-3145
మన్మథ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
గురువారం రోహిణి మూడవ పాదం






1-6-3146 BC
జయనామ సంవత్సరం
శ్రావణ బహుళ దశమి
ఆదివారం రోహిణి నాలుగో పాదం






11-6-3147 BC
విజయ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
మంగళవారం రోహిణి మూడో పాదం






21-6-3148 BC
నందన నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
గురువారం రోహిణి మూడో పాదం






5-6-3149 BC
ఖర నామ సంవత్సరం
శ్రావణ బహుళ దశమి
ఆదివారం రోహిణి నాలుగో పాదం






14-6-3150 BC
వికృతి నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
రోహిణి రెండవ పాదం






24-6-3151 BC
విరోధి నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
బుధవారం రోహిణి నాలుగో పాదం






6-6-3152 BC
సర్వధారి నామ సంవత్సరం
శ్రావణ బహుళ దశమి
శుక్రవారం రోహిణి మూడవ పాదం
తిధి+నక్షత్రాలు సరిపోలేదు





16-6-3153 BC
సర్వజిత్ నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
రోహిణి ఒకటో పాదం
శనివారం





26-6-3154 BC
వ్యయ నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
సోమవారం
రోహిణి రెండవ పాదం 
9-6-3155 BC
పార్ధివ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
గురువారంరోహిణి మూడవ పాదం





19-6-3156 BC
తారణ నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
శనివారం
రోహిణి రెండవ పాదం





ఇప్పుడు మనకు 25 ఏండ్లకూ 25 జాతకాలు వచ్చాయి.

వీటిని పరిశీలిద్దాం.కొన్ని సరళములైన సూత్రాలను ఉపయోగించి వీటిని జల్లెడ పట్టి చూద్దాం.

మొదటగా తిధి నక్షత్రాలు కలవని కుండలులను తొలగించగా,ఈ క్రింది పదకొండు సంవత్సరాలు మాత్రమే మిగిలినవి.

3132,3134,3135,3140,3142,3143,3148,3151,3153,3154,3156.

ఇప్పుడు కొన్ని ఇతర పారామీటర్స్ ఉపయోగించి ఇంకా జల్లెడ పట్టాలి.

అవేమిటి?

సాధారణంగా అవతార పురుషుల జాతకాలో రాహుకేతువులు ఉచ్చలో ఉంటారు.లేదా ఆ స్థానాలకు దగ్గరగా ఉంటారు.ఇదొక రహస్యం.అలా ఎందుకు ఉంటుంది అనేది నేనిప్పుడు వివరించను.

ఈ సూత్రాన్ని ఉపయోగించగా ఈ పదకొండు జాతకాల్లో  మళ్ళీ 3132,3151 అనే రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలాయి.

ఇప్పుడు ఈ జాతక చక్రాలను వరుసగా పరిశీలిద్దాం.

3132 BC Chart

 ఆరోజు అర్ధరాత్రికి ఈ జాతకంలో చంద్ర/కేతు/శుక్ర దశ జరిగింది.సరే, రోహిణీ నక్షత్రంలో పుట్టినవారికి జనన సమయానికి చంద్రదశే జరుగుతుంది.కేతువు అష్టమంలో ఉండి అకస్మాత్తు గండాలను సూచిస్తున్నాడు.చంద్రుడు మాతృకారకుడు గనుక తల్లివైపునుంచి(మేనమామ అయిన కంసుని నుంచి) వచ్చిన గండాలు సూచింప బడుతున్నాయి.విదశా నాధుడైన శుక్రుడు షష్టాధిపతిగా మేనమామకు సూచకుడు.మేనమామతో ఉన్న శత్రుత్వానికీ సూచకుడు.పైగా తల్లిని సూచించే చతుర్దంలో మాతృ కారకుడైన సూర్యునితో కలసి ఉన్నాడు.కనుక ఈ జాతకుడు పుట్టినపుడు మేనమామ ద్వారా ముంచుకొచ్చిన ప్రాణగండాన్ని జననకాల దశ ఖచ్చితంగా సూచిస్తున్నది.

చతుర్దంలో మూడు గ్రహాలున్నాయి.వాటిలో ఒకటి వక్రించి ఉన్నది.కనుక ఈయనకు ఇద్దరు తల్లులున్నట్లు సూచన ఉన్నది.జరిగింది అదేగా??పుట్టినది దేవకీదేవికి అయినా పెంచినది యశోదాదేవి.కనుక లెక్క సరిపోయింది.

ఇకపోతే మహాభారత యుద్ధ సమయం సరిగ్గా సరిపోతుందో లేదో చూద్దాం.

3067 BCలో ఈ జాతకానికి బుధ/బుధ దశ జరిగింది.బుధుడు శత్రుస్థానాధిపతి అయిన శుక్రునితో కలసి ఉన్నాడు.కనుక యుద్ధాన్ని సూచిస్తున్నాడు.వక్రీకరణ వల్ల తృతీయంలో ఉన్నట్లు తీసుకుంటే దగ్గర బంధువులతో యుద్ధాన్ని సూచిస్తున్నాడు.అయితే ఇదే వక్రీకరణ వల్ల ఈయన తానుగా యుద్ధం చెయ్యలేదు.సారధిగా ఉన్నాడు.ఈజాతకానికి బుధుడే ఆత్మకారకుడని గ్రహించాలి.కనుక ఆత్మకారకుని వక్రస్థితి వల్ల యుద్ధం తానూ చెయ్యకుండా ఊరకే సారధిగా ఉండి నడిపించాడని అనడం కరెక్ట్ గా సరిపోయింది.

ఇక్కడ ఇంకొక్క విషయం చూద్దాం.

ఈ యుద్ధానికీ కృష్ణునకూ సరాసరి సంబంధం లేదు.ఈ యుద్ధానికి కృష్ణుడు డైరెక్ట్ పార్టీ కాదు.బంధువుల మధ్య యుద్ధంలో తానూ ఒక పాత్ర పోషించాడు. అందుకనే ఆ సమయానికి డైరెక్ట్ గా యుద్ధాన్ని సూచించే శుక్రదశ ఈయన జాతకంలో జరగలేదు.ఇన్ డైరెక్ట్ గా సూచించే బుధ దశ మాత్రమే జరిగింది.

అయితే ఇక్కడ ఇంకొక చిక్కు వస్తుంది.

ఈ లెక్క ప్రకారం యుద్ధ సమయానికి ఆయన వయస్సు 65 మాత్రమే ఉంటుంది.కొందరు అనుకునేటట్లు 89 లేదా 90 కాదని తేలుతున్నది.దీనివల్ల ఇంకొక్క విషయం కూడా స్పష్టం అవుతున్నది.

నూట పది ఏండ్లు ఆయన బ్రతికి ఉంటే 'వర్షాణామ్ అధికం శతం' అన్నమాటను వ్యాసమహర్షి వాడడు.నూట పది అన్న మాటనే వాడి ఉండేవాడు.ఒకవేళ నూట పది దాటి నూట ఇరవై మధ్యలో ఆయన బ్రతికి ఉంటే 'నూట పది దాటి' అన్న మాట వాడి ఉండేవాడు.నూట ఇరవై దాటి ఇరవై అయిదు మధ్యలో అయితే 'నూట ఇరవై దాటి' అన్న మాట వాడి ఉండేవాడు.కానీ ఆయన అలా వాడలేదు గనుక 'వర్షాణామ్ అధికం శతం' అంటే అసలైన అర్ధం 'నూరేళ్ళు దాటి కొన్ని' అని మాత్రమే.అంటే నూరు ఇప్పుడే దాటాయి అని అనుకోవచ్చు లేదా నూరేళ్ళు దాటి ఒకటి రెండేళ్లు అయ్యాయని అనుకోవచ్చు.కనుక అందరూ అనుకునేటట్లు కృష్ణుడు నూట పాతిక ఏళ్ళు ఈ భూమ్మీద ఉండలేదన్న విషయం తెలుస్తున్నది.

కనుక కృష్ణుడు ఈ భూమి మీద జీవించినది 102 ఏళ్ళు మాత్రమే అన్న విషయాన్ని ఈ జాతకం నిర్దారిస్తున్నది.అందుకనే వ్యాసమహర్షి 'వర్షాణామ్ అధికం శతం' అన్న మాట వాడినాడు.

శ్లో||దేవైశ్చ ప్రహితో వాయు: ప్రణిపత్యాహ:కేశవమ్
రహస్యేవమహం దూత: ప్రహితో భగవన్ సురై:
వస్వస్విమరుదాదిత్యరుద్రసాధ్యాధి భిస్సః
విజ్ఞాపయతి శక్రస్త్వాం తదిదం శ్రూయతాం విభో
భారావతరణార్దాయ వర్షాణామధికం శతమ్
భగవానవతీర్ణోవ త్రిదశైస్యః చోదిత:
దుర్వృత్తా నిహతా దైత్యా భారోవతారిత:
త్వయా సనాధాస్త్రిదశా భవంతు త్రిదివే సదా
తదతీతం జగన్నాధ వర్షాణామధికం శతమ్
ఇదానీం గమ్యతాం స్వర్గో భవతా యది రోచతే
దేవైర్విజ్ఞాప్యతే దేవ తధాత్రైవ రతిస్తవ
తత్స్థీయతాం యధాకాలమాస్తేయ మనుజీవిమి:
  
(విష్ణు పురాణమ్ 5.37.16-21)   

ఇప్పుడు ఇంకొక సంఘటనను పరిశీలిద్దాం.కృష్ణ నిర్యాణం జరిగినది 3031 BC లో గనుక అప్పుడే ముసలం పుట్టి యాదవ వంశమూ నశించింది గనుక ఈ సంఘటన ఈ జాతక ప్రకారం సరిపోతున్నదో లేదో చూద్దాం.

అష్టమాధిపతి గురువు పంచమంలో ఉంటూ గురుశాపం వల్ల పుత్రనాశనాన్ని స్పష్టంగా సూచిస్తున్నాడు.

3031 BC లో ఈ జాతకానికి శుక్ర/శని దశ నడిచింది.అందులో మళ్ళీ బుధ,కేతు,శుక్ర విదశలు నడచినాయి.

వృషభ లగ్నజాతకం గనుక ఈ జాతకానికి శుక్ర శనులు ఇద్దరూ శుభులే.కనుక కాళిదాసు తన ఉత్తరకాలామృతంలో చెప్పినట్లు ఈ దశలో ఈ గ్రహప్రభావం వల్ల మహారాజు కూడా బిచ్చగాడుగా మారుతాడు.అంటే మహారాజును కూడా రోడ్లమీద అడుక్కునేటట్లు చేసేటంత దరిద్రపు దశ అన్నమాట.

కృష్ణుని జాతకంలో అదేగా జరిగింది??

తన కళ్ళెదురుగానే తన కొడుకులూ పరివారమూ అందరూ త్రాగి కొట్టుకుని చస్తుంటే చూస్తూ నిలబడ్డాడు.అంతేకాదు సాత్యకినీ ప్రద్యుమ్నుడినీ ఇంకా తన కొడుకులనూ తనవారే తన కళ్ళెదురుగానే చంపుతుంటే కూడా నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న మహానగరాన్ని తన కనుల ఎదురుగానే సముద్రం వచ్చి ముంచేస్తుంటే చూస్తూ ఉండవలసిన స్థితి పట్టింది.

ఆ తరువాత తానూ ఒక అడివిలో చెట్టుకింద పడుకుని దిక్కులేనివాడిలా ఒక బోయవాడి బాణానికి బలైపోయాడు.అంటే ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు పక్కన చనిపోయినట్లే.జీవితం అంతా అలా మహారాజ భోగాలు అనుభవించి,ఎక్కడో రాజభవనంలో హంసతూలికా తల్పాలమీద పవళించి పరిచారికలు వీవనలు వీస్తుంటే సుగంధ పరిమళాలు ఆస్వాదిస్తూ ఆనందించవలసిన వాడు చివరకు అలా రోడ్డుపక్కన చనిపోవడం ఏమిటి?

ఈ మాట అన్నందుకు కృష్ణభక్తులకు కోపం రావచ్చు.నేనూ కృష్ణభక్తుడినే.కానీ జరిగినది జరిగినట్లు మనం చూడక తప్పదు.మనం ఈ ఘట్టాన్ని ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా కూడా,జరిగిన విషయం మాత్రం అదే.ఈ సంఘటనవల్ల కృష్ణుని అవతారతత్వానికి ఏమీ భంగం లేదు.రాదు.శ్రీ రామకృష్ణులు గొంతు కేన్సర్ తో చనిపోయారు.అంతమాత్రాన ఆయన దైవం యొక్క అవతారం కాకుండా ఎలా పోతారు?

శుక్రుడు పితృకారకుడు.చతుర్దంలో రవితో ఉండి పితృ వర్గాన్నీ బంధువర్గాన్నీ సూచిస్తున్నాడు.శని నవమాధిపతి.వంశాన్ని సూచిస్తున్నాడు.ఇక పోతే విదశా నాధులైన బుధుడు సుతులనూ,కేతువు నాశనాన్నీ,శుక్రుడు యుద్ధాన్నీ సూచిస్తున్నారు.

అంటే,ముసలం పుట్టి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని  యాదవవంశం మొత్తం సర్వనాశనం అవ్వడాన్నీ,అవతార పురుషుడూ మహారాజూ అయిన శ్రీకృష్ణుడు కూడా ఋషిశాపం వల్ల నిస్సహాయస్థితిలో పడిపోయిన దుస్థితినీ ఈ దశ స్పష్టంగా చూపిస్తున్నది.

నవమాధిపతి అయిన శని వక్రించి ఉండి,పైగా ఆరింట ఉన్న కుజ నక్షత్రంలో ఉండి,శపితయోగాన్నీ,ఋషి శాపాన్నీ స్పష్టంగా సూచిస్తున్నాడు.

అంతే కాదు.ఇంకొక్క విచిత్రమైన విషయం కూడా ఇక్కడ ఉన్నది.యాదవ వంశనాశనానికి ఋషి శాపం ఒక్కటే కారణం కాదు.మహాపతివ్రత అయిన గాంధారి శాపం కూడా దానికి కారణమే.

"నీవు ఆపగలిగి ఉండి కూడా భారతయుద్ధాన్ని ఆపకుండా,నా పుత్రులందరూ నాశనం కావడానికి కారకుడవయ్యావు.అలాగే నీ పుత్రులూ నీ బంధుజనమూ అంతా కూడా నీ కళ్ళముందే నాశనం అవుతారు గాక.అలా వారు నాశనం అవుతూ ఉంటె నీవు కూడా నాలాగే నిస్సహాయస్థితిలో పడి చూస్తూ ఉండటం తప్ప ఇంకేమీ చెయ్యలేక పోతావుగాక.ఇదే నా శాపం" అని గాంధారి కృష్ణుడిని శపించింది.

గాంధారి కృష్ణుడికి అత్త అవుతుంది.అంటే ద్వాదశభావంతో సూచింప బడుతుంది.ఈ జాతకంలో కుజుడు ఆ భావాదిపతి అయ్యాడు.ఆ కుజ నక్షత్రంలో ఉన్న శని అంతర్దశలో శనికుజుల కలయికతో ఏర్పడే శపితయోగంలో ఈ ఖర్మను అనుభవింప చేశాడు.కుజుడు ఈ జాతకంలో రాహు నక్షత్రమైన స్వాతిలో ఉన్నాడన్న వాస్తవాన్ని గమనిస్తే శని కుజ రాహువుల సంబంధం ఏమిటో అర్ధమౌతుంది.గాంధారి శాపమూ ఋషి శాపమూ కలసి ఒకే సమయానికి శుక్ర/శని దశలో యాదవవంశ నాశనాన్ని ఎలా కొనితెచ్చాయో అర్ధమౌతుంది.

చూచారా ఈ శపితయోగం అనేది ఎంత సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలో కూడా ఖచ్చితంగా సరిపోయిందో?

గ్రహములు ఎవ్వరినీ వదలవు.కర్మ ఎవరినీ వదలదు.ఎవరి సమయం వచ్చినపుడు వారు చచ్చినట్లు కర్మను అనుభవించవలసిందే అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు.

భగవంతుని అవతారానికే కర్మ తప్పలేదంటే ఇంక మనమెంత?

కనుక కాళిదాసు చెప్పిన జ్య్తోతిష్య సూత్రం ఇక్కడ అక్షరాలా జరిగినట్లు మన కళ్ళెదురుగానే కనిపిస్తున్నది.ఇన్ని రకాలైన సంఘటనలు ఖచ్చితంగా సరిపోతున్నాయి గనుక ఈ 3132 BC సంవత్సరాన్ని కృష్ణజనన సంవత్సరంగా తీసుకోవచ్చు.

ఇప్పుడు మిగిలిన 3151 BC జాతకాన్ని పరిశీలించవలసిన అవసరం ఉన్నది.

(ఇంకా ఉన్నది)
read more " శ్రీకృష్ణుని జన్మకుండలి-4 (డా|| నరహరి ఆచార్ వర్గం) "