ప్రముఖుల జాతకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రముఖుల జాతకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జులై 2026, శనివారం

O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2

"తెలియనంతవరకూ బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య" అన్నట్లు, లోతుపాతులు తెలియనంతవరకూ జ్యోతిషశాస్త్రం గందరగోళంగా ఉంటుంది. ఒకసారి దానిలో పట్టుచిక్కితే మాత్రం, ఆపైన నల్లేరుమీద నడకే అవుతుంది. అప్పుడు ఒక జాతకాన్ని గానీ, జీవితాన్ని గానీ చదవడం మంచినీళ్లు త్రాగినంత సులభమౌతుంది. 

నయ్యర్ జాతకంలో - సుఖస్థానమైన మకరంలో సన్యాసయోగముంది. అందులోనే నీచగురువున్నాడు. కనుక తీవ్రమైన గురుదోషం కూడా ఉంది. దానికి తోడుగా, వృశ్చికంలో విధ్వంసయోగముంది. కళలను, ప్రేమలను, భావుకతను, సృజనాత్మకతను సూచించే శుక్రుడు బుద్ధిస్థానంలో శనిక్షేత్రంలో ఉన్నాడు. శనిదృష్టి సన్యాసయోగంపైన ఉంది. కుజదృష్టి శుక్రునిపైన ఉన్నది. ధనుస్సుకు, మకరానికి అర్గళం పట్టింది. రాహువు ఏకాకిగ్రహమయ్యాడు. 

అయిపోయింది. మొత్తం జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి ఇవి చాలు. ఒక మనిషిని అర్ధం చేసుకోవడానికి, అయిదునిముషాలు సరిపోయినట్లే, ఒక జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా అయిదే నిముషాలు చాలు. 

ఈయన జీవితాన్ని మొత్తాన్నీ శాసించినవి ఈ గ్రహస్థితులే.

అయితే, రాశిచక్రాన్ని ఒక్కదాన్ని చూచి, మనకంతా అర్థమైందని అనుకోకూడదు. నవాంశను, ఇతర వర్గచక్రాలను సరిదిద్దాలి. షష్ట్యంశ వరకూ సరిచేయాలి. అప్పుడు మాత్రమే ఆ జాతకం సరియైనదౌతుంది. లేదంటే తప్పుదారి పట్టిస్తుంది. ఇదంతా చేయాలంటే, జననకాలసంస్కరణ ఎలా చేయాలో  తెలియాలి. దానికి స్ఫురణశక్తి (ఇంట్యూషన్) ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడే ఒక జాతకాన్ని స్పష్టంగా చదవగలుగుతాము. అప్పుడే కర్మరహస్యాలు అర్ధమౌతాయి. జన్మజన్మాంతరాలలో ఆ జీవి యొక్క నడకా అర్ధమౌతుంది.

థియరీని పక్కనపెట్టి, జాతకంలోకొద్దాం.

నయ్యర్ జననసమయం ఎక్కడా దొరకడంలేదు. కొందరు వృషభలగ్నమని, కొందరు తులాలగ్నమని అంటున్నారు. ఇంకొందరేమో ఏకంగా, జననసంవత్సరం 1926 కాదు, 1927 అంటున్నారు. ఉదయం 2 గంటలని కొన్నిచోట్ల ఉన్నది. కానీ ఏదీ ఖచ్చితంగా లేదు.

ఈ గందరగోళాన్నంతా సరిదిద్ది, ఈయన జననసమయాన్ని నేను సంస్కరించాను. అంటే, రెక్టిఫై చేశాను. అది 16-1-1926 ఉదయం గం. 1.23 అయింది. ఎలాచేశానో అడక్కండి. చెప్పను. ఆ సమయానికి షష్ట్యంశచక్రం ఇలా ఉంది.

రాశిలో నీచస్థితిలో ఉన్న గురువు, ఇక్కడ ఉచ్ఛస్థితిలోకి పోయాడు. కానీ, నీచకేతుశుక్రుల అర్గళంలో చిక్కుకున్నాడు. ఇదే అర్గళం శనిచంద్రులకు కూడా వర్తిస్తుంది. నీచకేతువును రవిగురుల అర్గళం బంధించింది. రాహుకేతువులు నీచస్థితులలో ఉన్నారు. శనిచంద్రయోగం ఉన్నది. నీచబుధ, కుజయోగం ఉన్నది. సూర్యుడు బలంగా ఉన్నాడు. శుక్రుడు లగ్నంలోకి వచ్చాడు. ఇప్పుడు, రాశిచక్రంతో షష్ట్యంశను అన్వయించుకుంటే, ఈయన జాతకం అద్దంలో చూచినంత స్పష్టంగా ఉన్నది.

సింహావలోకనం

శనికుజులవల్ల నోటిదురుసూ, కోపం, స్నేహితుల నుంచి మోసపోవడం, పైల్స్ మొదలైన రోగాలు కనిపిస్తాయి. శుక్రునివల్ల ప్రేమవ్యవహారాలు, కళాతృష్ణ, గొప్పదైన టాలెంట్,  సినిమారంగంలో పేరు, సృజనాత్మకత వస్తాయి. సన్యాసయోగంవల్ల వృత్తికి, కుటుంబానికి దూరంకావడం, ఒంటరిగా జీవించడం, అలాగే మరణించడం మొదలైనవి కలుగుతాయి. బుధునివల్ల వాయిద్యాలతో నేర్పరితనం, రాగాలను పాటలను సృష్టించడం వస్తుంది. అయితే, ఈయన దుర్మార్గుడు కాదని, సంసారం దెబ్బతింటుందని, తప్పులను చేశానని గ్రహించి, వాటిని దిద్దుకునే క్రమంలో ఒంటరిజీవితాన్ని గడిపి, అనామకంగా కన్నుమూస్తాడని షష్ట్యంశచక్రం చూపిస్తోంది.

జననకాలదశ
 
నా విధానంలో జననకాలదశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమంటే, అది జీవితం మొత్తాన్నీ ఒక ముద్దలో పెట్టి చూపిస్తుంది. జననకాలదశ అయిన కుజ రాహు రాహు గురు శుక్రదశ - దూకుడు ప్రవర్తన, స్నేహితులతో మోసపోవడం, అక్రమసంబంధాలు, సినిమాజీవితం, గురుదోషం వల్ల చిన్నాభిన్నమై జీవితం, కళారంగంలో పేరుప్రఖ్యాతులను స్పష్టంగా చూపిస్తోంది.

కుజదశ

ధనిష్టానక్షత్రం ఒకటోపాదం కాబట్టి, జననసమయానికి 6 ఏళ్ల 6 నెలల 26 రోజుల కుజమహర్దశ మిగిలి ఉన్నది. ఆరేళ్లతర్వాత 18 ఏళ్ల రాహుమహాదశ నడిచింది. దానికి తగినట్లుగానే, ఈయనకు చదువుపైన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దానిబదులు సంగీతమూ, సౌందర్యపోషణా ఈయన మనసును ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఆయనే బాహాటంగా చెప్పాడు.

"Woman, I am of woman, by woman, for woman. Women are my inspiration.' అని  తన తర్వాతి జీవితంలో ఆయన చాలాసార్లు అంటూ ఉండేవాడు.

వీరిది సంగీతకుటుంబం కాదు. తండ్రి, మెడికల్ స్టోర్స్ లో సూపర్నెంటుగా పనిచేసేవాడు. నయ్యర్ మాత్రం చిన్నప్పటినుంచే సంగీతమంటే చెవికోసుకునేవాడు. దానికి కారణం, గర్భవతిగా ఉన్న సమయంలో ఈయన తల్లిగారు, హార్మనీ ముందేసుకుని స్వరాలను అభ్యాసం చేస్తూ ఉండటం కావచ్చు. అంతకంటే వేరే కారణమేదీ కనిపించదు.

ఈయనపైన ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య ఉన్నారు.  అక్కయ్య తప్ప మిగిలిన అన్నలందరూ, డాక్టర్లే. వారిలో ఒకన్నయ్య హైద్రాబాద్ లోనే మిలిటరీ డాక్టర్ గా ఉండేవాడు. సంగీతరంగంలో అడుగుపెట్టినప్పటికీ, చివరకు ఈయనకూడా హోమియోపతి డాక్టరే అయ్యాడు. ఇది, కుటుంబంలో ఎప్పటినుండో ఉన్న మెడికల్ జీన్స్ ను చూపిస్తోంది. ఇదెలా వచ్చిందో చూడటం మన సబ్జెక్టు కాదు కాబట్టి దానిని వివరించడం లేదు.

రాహుదశ

ఏడేళ్లవయసులో రాహుదశ మొదలైంది. నయ్యర్ సంగీతాన్ని నేర్చుకోవడం తండ్రికి ఇష్టముండేది కాదు. ఆ రంగం అంత మంచిది కాదని, అప్పట్లో అనుకునే చాలామంది సాంప్రదాయకుటుంబాలలాగే ఆయనకూడా అనుకుని, 'సంగీతం నేర్చుకుని ఏం చేస్తావ్? రోడ్లమీద పాటలు పాడుతూ అడుక్కుతింటావా?' అంటూ నయ్యర్ ను తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. కానీ నయ్యర్ మనసంతా సంగీతం పైనే  ఉండేది. తండ్రిమాటను వినలేదు. కానీ చివరకు తండ్రిమాటే చాలావరకూ నిజమైంది. జీవితం ఆఖరిలో ఇతరులపైననే ఆధారపడి అనామకంగా జీవించి, చనిపోయాడు.

అయితే సంగీతాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. సొంతంగా రహస్యంగా అభ్యాసం చేసి పియానో, ధోలక్, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. ఇలా దేనినైనా సొంతంగా నేర్చుకునే ప్రజ్ఞ ఆయనలో ఉండేది. దీని సాయంతోనే, పెద్దయ్యాక, హోమియోపతిని, జ్యోతిషాన్ని కూడా స్వయం-అధ్యయనంతో నేర్చుకున్నాడు. దీనికి కారణం దశమంలోని రాహువు. ఇలాంటి జాతకులు సంప్రదాయానికి భిన్నంగా నడుస్తారు. ఒకవిధమైన మొండిగా, విప్లవాత్మకంగా ఉంటారు. నయ్యర్ కూడా అలాగే తయారయ్యాడు.

చిన్నవయసులోనే లాహోర్ ఆల్ ఇండియా రేడియోలో సింగర్ గా పనిచేస్తున్న సమయంలో, సరోజ్ అరోరా అనే డాన్సర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె రచయిత్రి కూడా. ఈమె వ్రాసిన 'ప్రీతమ్ ఆన్ మిలో' అనే పాటను 19 ఏళ్ల నయ్యర్ స్వరపరచగా, Ch. Atma పాడాడు. ప్రయివేట్ ఆల్బమ్ అయినప్పటికీ, ఈ పాట పాన్ ఇండియా హిట్ అయింది. ఈ సంఘటన 1945 లో జరిగింది. అప్పుడు నయ్యర్ కు  రాహు-శుక్రదశ నడుస్తున్నది. వయసు 19 ఏళ్ళు. ఈ దశ ఏం చేస్తుందో జ్యోతిషవిద్యార్థులకు తెలిసినదే కదా !  ఈయనకు సరోజ్ అరోరాకు ప్రేమ మొదలైంది.

ఈలోపల 1947 లో దేశం మూడుముక్కలైంది. అప్పుడీయనకు రాహు-చంద్ర-రాహు గ్రహణదశ నడిచింది. వీరి కుటుంబం ఇండియాలోని అమృత్ సర్ కు మారింది. పాటియాలాలో ఉంటూ, ఒక స్కూల్లో మ్యూజిక్  టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు. 

19-5-1951 తేదీన, నయ్యర్, సరోజ్ అరోరాల పెళ్లిజరిగింది. అప్పటికి నయ్యర్ కు 25 ఏళ్ళు. సరోజ్ కు కూడా అటూఇటుగా అంతే ఉండవచ్చు. అయితే, నయ్యర్ చాలా ముక్కుసూటి మనిషి. 'నేను పక్కా స్త్రీలోలుడిని. నా జీవితంలో, అనేకమంది స్త్రీలతో నేను సంబంధాలను పెట్టుకోవచ్చు. ముందే చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం' అని పెళ్ళికి ముందే సరోజ్ తో  ఖండితంగా చెప్పేశాడు. 

దానికి ఒప్పుకున్న సరోజ్ 'సరే నీ ఇష్టం. కానీ ఇంకో పెళ్ళిమాత్రం చేసుకోకు' అని షరతు పెట్టింది. దానికి నయ్యర్ ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందాలతో వీరి పెళ్లి జరిగింది. అప్పట్లోనే ఇంత విశాలదృక్పథాలతో కూడిన పెళ్లిళ్లు జరిగేవన్నమాట !

ఆనాడు నయ్యర్ జాతకంలో గురు గురు చంద్ర రాహు శుక్రదశ నడుస్తోంది. ఇందులో వ్యామోహమే ఎక్కువగా కనిపిస్తోంది. గజకేసరీయోగాన్ని కాస్తా గురువుయొక్క నీచత్వం మ్రింగేసింది. దానికింకొక కారణం గోచారశని. ఈయన కన్యలో ఉంటూ వక్రించి సింహంలోకి వస్తున్నాడు.  అంటే,అష్టమశని దశ జరుగుతోంది. అందుకే ఈ పెళ్లి చివరకు పెటాకులై పోయింది.

గురుమహర్దశ

గురుదశ నవంబర్ 1949 లో మొదలైంది. ఇది ఈయన జీవితాన్ని అనేక మలుపులు త్రిప్పింది. గురుదశలోనే గురుదత్ తో పరిచయం ఏర్పడింది. తను తీసిన సినిమాలన్నింటిలో నయ్యర్ కు ఛాన్సిచ్చాడు గురుదత్. అంతేగాక, నయ్యర్ కూడా గీతాదత్ చేత  తన పాటలన్నింటినీ పాడించేవాడు. 

1949 లోనే  బాంబేకు మకాం మార్చి 'కనీజ్' అనే సినిమాకు నేపధ్యసంగీతాన్ని అందించాడు. 1952 లో 'ఆస్మాన్' అనే సినిమాకు మొదటిసారి సంగీతదర్శకత్వాన్ని వహించాడు.

కెరీర్ ప్రారంభ దశ

ఈయన కెరీర్ లో 1949-52 మధ్య సమయాన్ని ప్రారంభదశగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో గురు-గురు, గురు-శని దశలు నడిచాయి. గోచారగురువు మకరం నీచస్థితినుండి వృషభం వరకూ సంచరించాడు. గోచారశని సింహ, కన్యలలో సంచరించాడు. అది అర్ధాష్టమశని దశ. కనుక మొదటి మూడుసినిమాలు సంగీతపరంగా అంత బాగా ఆడలేదు.

గీతాదత్ దశ

1953-56 మధ్యదశను గీతాదత్ దశగా చెప్పుకోవచ్చు.

1954 లో తన 'ఆర్ పార్' సినిమాకు గురుదత్ ఈయనను సంగీతదర్శకుడిగా ఎన్నుకున్నాడు. ఆ సమయంలో గోచారశని దశమంలో ఉచ్ఛస్థితికి వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్  అయింది. 

దానితర్వాత 1955, 56 లలో వరుసగా గురుదత్ తీసిన మిస్టర్ అండ్ మిసెస్ - 55, సిఐడీ సినిమాలు ఘనవిజయాలను సాధించాయి. గోచారశని దశమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకే అలా జరిగింది.

అయితే, గోచారశని వృశ్చికంలోకి మారి, జననకాల శనికుజులపైకి రాగానే,  ఈయన జీవితాన్ని ధ్వంసం చేసిన ఆశాభోంస్లే పరిచయం అయింది. ఆ సమయంలో ఈయనకు గురు-బుధదశ మొదలైంది. బుధుడు నవమాధిపతి, చంద్రలగ్నాత్ కూడా 6-9 ఆధిపత్యం ఉన్నది. కనుక బలమైన గతకర్మానుసారంగా, ఈ పరిచయం ప్రేమగా మారింది.

ఆమెను తన టీమ్ లోకి తీసుకున్నాడు. అప్పటివరకూ అక్క లతా నీడలో దాగి, క్లబ్బు పాటలను పాడుకుంటున్న ఆమెను ఒక ముఖ్యగాయనిగా తీర్చిదిద్దాడు. అప్పటివరకూ తన పాటలను పాడుతున్న షంషాద్ బేగం, గీతాదత్ లను పక్కనపెట్టి ఈమెకు ఛాన్సులివ్వడం మొదలుపెట్టాడు. ఇది తన జీవితంలో చేసిన పొరపాట్లలో ఒకటని తర్వాతి కాలంలో ఒప్పుకున్నాడు.

ఆశాభోంస్లే దశ

1957-68 ను ఆశాభోంస్లే దశగా చెప్పుకోవచ్చు.  ఈ సమయంలో 20 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. వాటిల్లో అన్నీ హిట్ పాటలే. 

1957 లో బీ.ఆర్.చోప్రా తీసిన  'నయా దౌర్' తో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫెర్ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. వృశ్చికశని వక్రించి తులాశని ఫలితాన్నిచ్చాడు.

1958 లో వీరిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. పంచమశుక్రుడు మళ్ళీ ప్రేమలో పడవేశాడు. అప్పుడు మొదలైన వీరి ప్రేమాయణం 14 ఏళ్లపాటు సాగి, 1972 లో ముగిసింది. 

Ek Musafir Ek Hasina (1962), Phir Wohi Dil Laya Hoon (1963), Kashmir Ki Kali (1964) ల  వరుసవిజయాలతో ప్రసిద్ధ రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. ఆ సమయంలో రాహుకేతువులు మిధున-ధనుస్సులలో ఉచ్ఛస్థితులలో ఉన్నారు.

అక్టోబర్ 1964 లో గురుదత్ అర్ధాంతరంగా చనిపోవడం నయ్యర్ ను దెబ్బకొట్టింది. అది గురు-రాహు దశ. దీనిని ఛిద్రదశ అంటారు. ఇది  జీవితాలను చిదిమేస్తుంది. గురుదత్ మరణంతో నయ్యర్ కు కష్టకాలం మొదలైంది. ఆ సమయంలో నయ్యర్ కు ఏలినాటిశని రెండవపాదం నడుస్తోంది. శని కుంభంలో వక్రించి  ఉన్నాడు. గురువు వృషభంలో వక్రించాడు. కనుక, అదృష్టం వక్రించింది.

శనిమహర్దశ

1965 లో మొదలైన శనిదశతో ఈయనకు అవకాశాలు సన్నగిల్లడం మొదలైంది. దానికి కారణాలు అనేకం.  జ్యోతిషకారణం మాత్రం, శని బాధకస్థానంలో, శత్రువైన కుజునితో కలసి ఉండటం. అది దుర్ఘటనాయోగం కావడం.

ఈయనకు PR చేతకాదు. తనదగ్గరకు వచ్చిన నిర్మాతలకు మాత్రం మ్యూజిక్ చేసిపెట్టేవాడు. కానీ, పరిచయాలు పెంచుకొని, స్నేహాలు కలుపుకొని, పార్టీలిచ్చి, ఛాన్సులను సంపాదించడం ఈయనకు రాదు. పైగా, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. దానికితోడు అతి డిసిప్లిన్ ఈయనతో ఉండేది. 

ఒక రికార్డింగ్ కు రెండుసార్లు పిలిచినా లతామంగేష్కర్ రాలేదని, ఆమెతో ఎప్పటికీ పనిచెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. ఆమేమో, హీరోయిన్లకు తప్ప వేరే పాత్రలకు తను పాడనంటుంది. క్రమేణా ఆమెకూడా ఈయనపైన పగబట్టి, తన చేతిలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన అనిల్ బిశ్వాస్ ద్వారా పావులు కదిపి ఈయనకు అవకాశాలు రాకుండా చేసింది. 

సమయపాలన లేకపోతే ఎంతటివాడినైనా అందరిముందూ తిట్టేసేవాడు. రఫీ, ఆశాల డ్యూయెట్స్ ను ప్రోత్సహించి, రఫీని బాగా సపోర్ట్ చేసింది ఈయనే. అలాంటిది, ఒకరోజున శంకర్ జైకిషన్ రికార్డింగ్ లో లేటై, తన రికార్డింగ్ కు ఆలస్యంగా వచ్ఛాడని మహమ్మద్ రఫీని తిట్టి పంపేసి, రెండేళ్లపాటు పాటలివ్వకుండా బహిష్కరించాడు. 

ప్రముఖ వేణువిద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాను కూడా ఇదే కారణంతో వెనక్కు పంపించేశాడు.

తలత్ మహమూద్ మంచి గాయకుడు. కానీ, మన పీబీ శ్రీనివాస్ లాగా, ఆయనది సాఫ్ట్ మేల్ వాయిస్. గొంతును కొంచెం బొంగురుగా చేసుకోవడానికి అప్పట్లో కొంతమంది గాయకులు సిగరెట్ త్రాగేవారు. రికార్డింగ్ గ్యాప్ లో తలత్ మెహమూద్ సిగిరెట్ త్రాగుతుండటం నయ్యర్ చూచాడు. కోపంతో అతన్ని తిట్టి పంపించేశాడు. ఆ తర్వాత అతనికి  ఛాన్సులివ్వలేదు.

ఈ విధంగా, ఆర్టిస్టుల దగ్గర క్రమశిక్షణ లేకపోతే ఊరుకునేవాడు కాదు. ఆత్మాభిమానం, కోపాలు ఎక్కువ. పట్టూవిడుపూ లేకపోతే సినిమారంగంలో నెగ్గడం కష్టం. ముఖంమీద ఉమ్మేసినా తుడుచుకొని పోయేవారికే అక్కడ రాణింపు  ఉంటుంది. అది ఈయనకు చేతకాదు.

ఇలాఉండగా, ఈయన మార్కు సంగీతం క్రమేణా పాతబడిపోయింది. వెస్ట్రన్ బీట్స్ కలిసిన మ్యూజిక్ పాపులర్ అయింది. ఆర్దీ బర్మన్ వంటి క్రొత్తతరం ముందుకొచ్చింది.

ఈయన ఆశాభోంస్లే ను అమితంగా ప్రేమించాడు. కానీ ఆశా, తన అవకాశాలను, కెరీర్ ను మాత్రమే ప్రేమించింది. నయ్యర్ కు క్రమేణా ఛాన్సులు తగ్గాయి. పైగా ఈయన బాగా పొసెసివ్ గా ఉండేవాడు. ఆశా ఏ పాటను పాడాలో ఏదివద్దో ఈయనే నిర్ణయించేవాడు. ఏ సినిమా ఒప్పుకోవాలో ఏది వద్దో తనే చెప్పేవాడు. ఇదంతా అనవసరమైన నసగా ఆశాకు అనిపించింది. నయ్యర్  తన కెరీర్ కు అడ్డుగా మారాడని ఆశా భావించింది. ప్రతిదానికీ గొడవలు మొదలయ్యాయి. క్రమేణా ఈయనకు దూరమై, ఆర్దీబర్మన్ కు దగ్గరైంది. 

ఒకరోజున ఏదో చిన్నతప్పు చేసిందని, ఆశా కూతురు వర్షాభోంస్లేను అరిచి, చెయ్యెత్తి కొట్టబోయాడు. దానికి ఆశా అడ్డొచ్చింది. ఇద్దరికీ గొడవైంది. కోపంతో ఆమెను వదలి బయటకు వచ్చేశాడు.

ఆ విధంగా 5-8-1972 న ఆశాభోంస్లే తో విడిపోయాడు. అప్పటికి ఆమెతో 324 పాటలను పాడించాడు. కానీ ఆశా ఈయనను వదిలేసి ముందుకెళ్ళిపోయింది. ఈయన ఒక పిచ్చివాడిలాగా మిగిలిపోయాడు.

ఆ సమయంలో, ఈయన జాతకంలో శని-శుక్ర-రవి దశ నడిచింది. రవికేతువులు గ్రహయుద్ధంలో ఒకే డిగ్రీమీదున్నారు. పదకొండో అధిపతిగా రవి, పేరు ప్రఖ్యాతులున్న ఆశాను సూచిస్తున్నాడు. కనుక ఆ సమయంలో వీరిద్దరికీ గొడవై, విడిపోయారు. తిరిగి జీవితంలో కలుసుకోలేదు.

1972-79 కష్టాలు మొదలు

ఆశాతో విడిపోయాక, నయ్యర్ కెరీర్ బాగా తగ్గడం మొదలైంది. లతాతో పాటలు చెయ్యడానికి ఒప్పుకోడు. రఫీని దూరం పెట్టాడు. అందరితో సత్సంబంధాలు లేవు. PR లేదు. ఇక ఛాన్సులెలా వస్తాయి?

చివరకొకనాడు, తగ్గి, తనే రఫీ ఇంటికి వెళ్లి మాట్లాడాడు. రఫీ మెత్తబడ్డాడు. మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారు. కానీ ఆశా దూరమైంది. ఆమె స్థానంలో వాణీజయరాం, దిల్రాజ్ కౌర్, కృష్ణా కల్లే, పుష్పా పగ్దరే, కవితాకృష్ణమూర్తి మొదలైన అప్పుడప్పుడే పైకొస్తున్న సింగర్స్ కు ఛాన్సులిచ్చి, వారిచేత పాడించాడు. కానీ వారెవరూ, ఆశా భోంస్లే మ్యాజిక్ ముందు తూగలేకపోయారు.

రఫీ మాత్రం నయ్యర్ ను బాగా సపోర్ట్ చేశాడు. కానీ మారిన సంగీతపు ట్రెండ్ లో, నయ్యర్ సంగీతం జనానికి నచ్చడం తగ్గింది. 1979 కల్లా ఛాన్సులు బాగా తగ్గిపోయాయి.

మాధురీ జోగ్లేకర్ దశ

అది శని - చంద్రదశ. 1976-77 ప్రాంతాలలో మాధురీ జోగ్లేకర్ అనే మరొక సింగర్ ఈయనకు పరిచయమైంది. ఈ దశను బట్టి వీరిది అందరూ అనుకునేటట్లుగా శృంగారసంబంధం కాదని అనిపిస్తుంది. శృంగారం కంటే ఎక్కువగా, అభిరుచులు, భావుకత, ఫిలాసఫీ మొదలైన హృదయసంబంధమైన విషయాలలో వీరికి శృతి కలిసి ఉండాలి.  ఇదే నిజమని తన తర్వాతి ఇంటర్వ్యూలలో మాధురీ చెప్పింది.

మొదట్లో, ఈయన మ్యూజిక్ ట్రూపులో కోరస్ సింగర్ గా ఈమె చేరింది.  అప్పటికే ఆమె మ్యూజిక్ లో MA చేసి ఉన్నది. ఈమెలో టాలెంట్ ను చూచిన నయ్యర్ ఈమెను దగ్గరకు తీశాడు. చర్చ్ గేట్ ఏరియాలో ఉన్న నయ్యర్ ఇంటికి ఈమె రోజూ వస్తూ ఉండేది. అప్పటికే నయ్యర్ హోమియోపతి, జ్యోతిష్యాలను బాగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వాటిలో కూడా ఈమె సాయం చేస్తూ ఉండేది. చాలావరకు ఈయనకు సెక్రటరీగా పనిచేసేది. ఈయనకూడా 1976 నుంచే, బాంబే శివార్లలో వీరార్లో ఉన్న ఈమె ఇంటిలోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు.

1974 లో (అంటే 22 ఏళ్ల వయసులోనే) ఈమె UPSC పరీక్షను క్లియర్ చేసి FCI లో ఆఫీసర్ గా చేరింది. అయినా సరే, సంగీతంపైన ఉన్న మక్కువతో, ఒకవైపు ఉద్యోగం చేస్తూ కూడా, నయ్యర్ కు సాయపడుతూ ఉండేది. క్రమేణా వీరిమధ్య రొమాంటిక్ సంబంధం ఏర్పడింది. ఈమె నయ్యర్ కంటే 26 ఏళ్ళు చిన్నది. అప్పటికి నయ్యర్ కు 50 ఏళ్ళు, ఈమెకు 24 ఏళ్ళు.

అప్పటివరకూ నయ్యర్ ప్రేమాయణాలను ఓపికగా భరిస్తూ వచ్చిన భార్యాపిల్లలు దీనికి అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు. నయ్యర్ పిల్లలుకూడా పాతికేళ్ళవయసులోకి వచ్చారు. ఎన్నాళ్ళని ఈయన వేషాలను భరిస్తారు? వాళ్ళనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేసరికి నయ్యర్ కోపం తెచ్చుకున్నాడు. ఒకవైపు ఛాన్సులు తగ్గిపోయాయి. ఇంకోవైపు తను అమితంగా ప్రేమించిన సంగీతరంగం వెక్కిరిస్తోంది. ఆశా ఇచ్చిన షాకు చాలా గట్టిగా తగిలింది. ఇప్పుడు కుటుంబసభ్యులు ఎదిరించేసరికి తట్టుకోలేక, వారిని ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మని గద్దించాడు. గట్టిగా నిలబడిన వాళ్ళు, ఆస్తిలో వాటాకోసం కోర్టులో కేసువేశారు. తెగేవరకూ లాగవద్దని, కోర్టుబయట ఒప్పందమే మంచిదని లీగల్ నిపుణులు ఈయనకు సలహా ఇచ్చారు. ఇంటిని, ఆస్తిని వారికి రాసేసి, నయ్యర్ కట్టుబట్టలతో ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఇదంతా 1979 లో జరిగింది.

తనవైపునుండి తాను కరెక్ట్ కావచ్చు. కానీ ఎదుటివారినుండి, అందులోనూ కుటుంబసభ్యులనుండి కూడా ఆలోచించాలి. భౌతికసంబంధాలు లేకుండా, గాలికి ఎగిరిపోతూ, భావప్రపంచాల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉండే ఇటువంటి కళాత్మకమనస్తత్వాలు, జీవితవిధానాలు ఉన్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోకూడదు.

'నేనింతే' అని పెళ్ళికి ముందే చెప్పాడు కాబట్టి నయ్యర్ కరెక్టే అనడమే అసలు కరెక్ట్ కాదు. 'నేనింతే, నేను పెళ్ళికి పనికిరాను. మన పెళ్లి ఒద్దు. నాతో నువ్వు సుఖపడలేవు. నువ్వేకాదు, నాతో ఎవ్వరూ సుఖపడలేరు. నా దారి వేరు.' అని చెప్పాలి. అలా చెప్పకపోవడం నయ్యర్ చేసిన తప్పు. నయ్యర్ చెప్పినప్పటికీ సరోజ్ ఒప్పుకోవడం ఆమె తప్పు. వెరసి ఇద్దరిఖర్మా అలా ఉంది. పాపం, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? 

ఆ విధంగా, 1979 లో కుటుంబంతో విడిపోయి  విలాసవంతమైన తన చర్చ్ గేట్ ఇల్లును వదిలిపెట్టాడు. ఆ సమయంలో శని-రాహుదశ నడిచింది. ఇది శపితదశ అని గతంలో ఎన్నో జాతకాలలో నిరూపించాను. ఈ దశ ఏం చేస్తుందో కూడా వందలాది జాతకాలలో వివరించాను. ఈయన్ని కూడా ఈ దశ చావుదెబ్బ కొట్టింది.

ఇంటినుండి బయటకు వచ్చి, కుటుంబంతో తెగతెంపులు చేసుకుని, బాంబే శివార్లలో ఉన్న వీరార్ లో మాధురీతో కలసి ఆమె ఇంటిలో ఉండటం మొదలుపెట్టాడు. వీరి సహజీవనం 1976 నుండి 1996 వరకూ 20  ఏళ్లపాటు సాగింది. అయినా సరే, మధ్యమధ్యలో అప్పుడపుడు కొన్ని సినిమాలకు సంగీతాన్నిస్తూ ఉండేవాడు.

(ఇంకా ఉంది)

read more " O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2 "

15, జులై 2026, బుధవారం

O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1

పాతతరం హిందీ మధురగీతాలను ఇష్టపడేవారిలో ఓపీ నయ్యర్ పేరును తెలియనివారు ఉండరు. ఈయన అభిమానులందరూ తమను తాము OPiums అని పిలుచుకుంటారు.

ఈయన పూర్తిపేరు ఓంకార్ ప్రసాద్ నయ్యర్.  ఈయనపుట్టి ఇప్పటికి నూరేళ్లు దాటింది. అయినా సరే, నేటికీ ఈయన స్వరపరచిన పాటలను ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు.  

ఈయన తెలుగులో కూడా 'నీరాజనం' అని ఒక సినిమాను చేశారు. అది 1989 లో విడుదలైంది. అందులోని పాటలు కూడా ఆపాతమధురాలే. ఈయన ట్యూన్స్ ను తెలుగులోకి కూడా కాపీ కొట్టారు. ఉదాహరణకు "ఒ లేకే పెహలా పెహలా ప్యార్"  అనే పాటరాగాన్ని తెలుగులో "ఓహో బస్తీ దొరసానీ" అనే పాటకు తీసుకున్నారు.

అయితే, పాతతరం హిందీసినిమా దర్శకులలో అత్యధిక మొత్తాన్ని ఫీజుగా తీసుకున్న ఈయన, తన జీవితం రెండవభాగంలో సంగీతంవైపూ, సినీఫీల్డ్ వైపూ తిరిగి చూడకుండా, వాటిని పూర్తిగా వదిలేసి, ఒక హోమియోపతి వైద్యునిగా, ఒక జ్యోతిష్కునిగా మంచిప్రజ్ఞను సంపాదించి, పదేళ్లపైగా బాంబే స్లం ఏరియాలలోని పేదవారికి నిస్వార్థమైన సేవలందించి, చివరకు తన కుటుంబానికి దూరంగా, ఒంటరిగా కన్నుమూశాడు.

తన కుటుంబసభ్యులు కానీ, సినిమాజీవులుకానీ, విలేఖరులుగానీ, టీవీ జనాలు గానీ,  ఎవరూ తన అంత్యక్రియలకు రాకూడదని, కనీసం తన శవాన్ని తాకడానికి కూడా వీల్లేదని విల్లు వ్రాసిపెట్టి మరీ కన్నుమూశాడు. తన అంత్యక్రియలు కూడా అతినిరాడంబరంగా జరగాలని, ఆ తరువాత సంస్మరణసభలు పెట్టకూడదని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు.

ఈయన సంగీతాన్ని నేర్చుకోలేదు. కానీ సంగీతదర్శకుడయ్యాడు. నూరేళ్ళతర్వాత కూడా ప్రపంచం మరచిపోలేని స్వరాలందించాడు. కేవలం 19 ఏళ్ల వయసులో "ప్రీతమ్ ఆన్ మిలో" అనే  సూపర్ హిట్ పాటను స్వరపరచాడు. దీనిని ఈయన స్నేహితుడైన Ch. ఆత్మా పాడాడు. 80 ఏళ్ల తర్వాత ఈనాటికి కూడా ఈ పాట ఆపాతమధురమే.

ఈయన వైద్యశాస్త్రాన్ని చదవలేదు. కానీ, ముంబాయికి చెందిన ప్రముఖ హోమియోవైద్యుడు డా. ఎస్సార్ పాఠక్ దగ్గర హోమియోపతిని నేర్చుకుని, వైద్యుడయ్యాడు. వేలాదిమంది పేదరోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేశాడు. ముంబాయ్, కలకత్తా, హైదరాబాద్ లలో ఉచితహోమియో క్లినిక్స్ నడిపాడు. అలా పేదవారికి సేవను చేయడంలో ఆనందాన్ని పొందాడు. 

జ్యోతిషాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. కానీ, సొంతంగా దానిని నేర్చుకుని దానిలో మంచిప్రజ్ఞను సంపాదించాడు. ఎంతోమంది సినీ ప్రముఖులకు, ఇతరులకు జోస్యాన్ని కరెక్ట్ గా చెప్పాడు. తను పుట్టిననెలలోనే మధుబాల చనిపోతుందని చెప్పాడు. ఆమె అలాగే చనిపోయింది. చివరకు తన మరణాన్ని కూడా తనే కరెక్టుగా జోస్యం చెప్పుకున్నాడు. అదేవిధంగా చనిపోయాడు. 

ఎన్ని చేసినా తన 81 ఏళ్ల సుదీర్ఘజీవితంలో ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. జీవితపు ప్రతిమలుపులోనూ తలెత్తుకునే బ్రతికాడు. అత్యంతవిలాసాలనూ, సాధారణజీవితాన్నీ రెండింటినీ చూశాడు. చివరలో ఒక ఋషిలా బ్రతికి, ఒక అనామకుడుగా చనిపోయాడు.

ఈయనలో ఒక కళాతపస్వి, ఒక ప్రేమపిపాసి, ఒక భావుకుడు, ఒక తాత్వికుడు, ఒక క్రమశిక్షణను కలిగిన రూల్ మాస్టర్, ఒక మొండివాడు, ఒక నోటిదురుసు మనిషి, ఒక నిస్వార్ధహృదయుడు, ఒక నిరాడంబరజీవి  అందరూ కలిసి ఉన్నారు.

ఈయన 16-1-1926 న లాహోర్ లో ఒక బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. 2007 లో 81 ఏళ్లవయసులో గుండెపోటుతో థానేలో  చనిపోయాడు. 1957 లోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. అప్పట్లోనే బాంబే మొత్తమ్మీద 'కాడిలాక్' కార్లున్న ఇద్దరిలో ఈయనొకడు. కానీ విలాసవంతమైన అటువంటి జీవితాన్ని వదిలిపెట్టి బాంబే స్లంలో ఒక చిన్నగదిలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంతో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడు.చివరకు అక్కడే కన్నుమూశాడు.

తన కెరీర్ మొత్తంలో 500 పైన పాటలను సృష్టించినా, లతామంగేష్కర్ తో ఒక్కపాటను కూడా పాడించలేదు. వాళ్లిద్దరి మధ్యా గొడవలుండేవి. కానీ 1950-60 మధ్యలో హిందీసినిమా సంగీతాన్ని ఏలాడు. 'రిథమ్ కింగ్' అనే బిరుదును సంపాదించాడు. 

1990 లో తనకు డబ్బు ఇబ్బందులున్న రోజులలో కూడా, లతామంగేష్కర్ అవార్డు క్రింద లక్షరూపాయలను తనకు ఇస్తామంటే, ' ఆమెపేరుతో పెట్టిన అవార్డు నాకేంటి? నాన్సెన్స్ !' అని దానిని తిరస్కరించాడు. అలాంటి మొండివాడు. ఆత్మాభిమాని.

అందుకే ఈయనది చాలా విచిత్రమైన జీవితమని అంటాను.  ఈయన జాతకాన్ని చూద్దాం ! 

అంతకుముందుగా,  ఈయన స్వరపరచిన 500+ పాటలనుంచి కొన్ని ప్రముఖపాటలు :

1. ప్రీతమ్ ఆన్ మిలో - ప్రయివేట్ ఆల్బమ్ - 1945

2. మాంగ్ కె సాత్ తుమారా -  నయా దౌర్ -1957

3. బాబూజీ ధీరే చల్నా - ఆర్ పార్ -1954

4. ఆవో హుజూర్ తుమ్కో - కిస్మత్ -1968

5. పుకార్తా చలా హు మై - మేరే సనమ్ -1965

6. యే దిల్ హై ముషికిల్  జీనా యహా - CID 1956

7. దీవానా హువా బాదల్ - కశ్మీర్ కీ కలీ -1964

8. లేకే పెహలా పెహలా ప్యార్ - CID 1956

9. కజరా మొహబ్బత్ వాలా - కిస్మత్ 1968

10. ఇషారో ఇషారో మె - కశ్మీర్ కీ కలీ -1964

11. జాయియే ఆప్ కహా జాయేంగే - మేరె సనమ్ -1965

12. తారీఫ్ కరూ క్యా ఉస్కీ - కశ్మీర్ కీ కలీ -1964

13. జానే కహా మేరా జిగర్ గయా జీ - Mr Mrs 55 - 1955

14. ఆయియే మెహర్ బాన్ - హౌరా బ్రిడ్జ్ - 1958

15. జరా హౌలే హౌలే చలో మేరే సాజ్నా - సావన్ కీ ఘటా -1966

16. ఆఖో హి ఆఖో మే ఇషారా హోగయా - CID -1956

17. యూ తో హంనే లాఖ్ హసీ దేఖే హై - తుంసా నహీ దేఖా - 1957

18. తుం జో హుయే మేరే హంసఫర్ - (12 O'Clock) - 1958

19. యే హై రేష్మీ జ్యూల్పోన్ క అంధేరా - మేరె సనమ్ - 1965

20. ఆప్ యూహీ అగర్ హం సే మిల్తే రహే - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962 

21. చైన్ సే హంకో కభీ - ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే - 1974

22. ఉడే జబ్ జబ్ జుల్పే తేరీ - నయా దౌర్ -1957

23  మేరా నామ్ చిన్ చిన్ చిన్ - హౌరా బ్రిడ్జ్ -1958

24. ఏక్ పరదేశి మేరా దిల్ లేగయా - ఫాగున్ - 1958

25. కభీ ఆర్ కభీ పార్ - ఆర్ పార్ - 1953

26. సున్ సున్ సున్ జాలిమా - ఆర్ పార్ -1953

27. పియా పియా పియా మేరా జియా పుకారే - బాప్ రే బాప్ -1955

28. సర్ పర్ టోపీ లాల్ దుపట్టా - తుంసా నహి దేఖా -1957

29. తూ ప్యార్ కా సాగర్ హై - సీమా -1955

30. దిల్ కి ఆవాజ్ భి సున్ - హం సాయా -1968

31. రేష్మి సల్వార్ కుర్తా జాలీ కా - నయా దౌర్ - 1957

32. మై ప్యార్ కా రాహీ హూ - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962

33. లాఖో హై నిగాహ్ మే - ఫిర్  ఓహీ దిల్ లాయా హు. - 1963  

(ఇంకా ఉంది )
read more " O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1 "

10, జూన్ 2026, బుధవారం

రాజ్ కిరణ్ కు ఏమయ్యింది? జననకాల సంస్కరణ - ప్రశ్నజాతక నిర్ధారణ !


ఇతను 5-2-1949 న ముంబై లో జన్మించాడు. ఆరోజు శనివారం. అశ్వని 3-4 పాదాలు, భరణీ నక్షత్రం-1 పాదం ఆరోజు నడిచాయి. సమయం తెలియదు గనుక లగ్నం తెలియదు. జననకాల సంస్కరణ చేద్దాం.

ఇతను సినిమానటుడు గనుక, వృత్తివల్లనే ఇతనికి పేరుప్రఖ్యాతులు వచ్చాయి గనుక, ఈ విశ్లేషణలో దశాంశకు ప్రాధాన్యత ఉంటుంది.

దశాంశలో ఆ రోజున మిధునంనుండి కన్యవరకు నాలుగు నవాంశలు నడుస్తాయి. ఇతని ఆకారాన్ని బట్టి, నిండైన ముఖాన్ని బట్టి, కర్కాటకరాశి సరిపోతుంది. అప్పుడు 10  లో ఉచ్ఛసూర్యుడు, 4 లో ఉచ్చ శని, 11 లో శుక్రక్షేత్రంలో ఉచ్చరాహువులతో సినిమా కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుంది.  కనుక,ఇతని దశాంశచంద్రుడు కర్కాటకంలో ఉండాలి. అలాంటపుడు, జననసమయం, 7. 22 am - 12. 18 pm మధ్యలో ఉంటుంది.

ఇతని కెరీర్ 1970 - 1980 మధ్యలో బ్రహ్మాండంగా నడిచింది. అప్పుడు ఇతనికి చంద్ర మహర్దశ జరిగింది. దశమంలో ఉన్న ఉచ్చసూర్యుడు, చతుర్దంలో ఉన్న ఉచ్ఛశని, లాభస్థానంలో ఉన్న ఉచ్చరాహువుల వల్ల ఇతను పట్టుకున్నది ఆ టైములో బంగారం అయింది.  ఇతని సినిమాలు ఈ క్రింది తేదీలలో విడుదల అయ్యాయి. ఈ తేదీలను, ఇతని జీవితపు  ఇతర ముఖ్యఘట్టాలను ఆధారాలుగా తీసుకొని సంస్కరణ చేయగా, ఇతని జననసమయం మధ్యాన్నం 12. 18 గా తేలుతున్నది.

1-1-1975 న ఇతని మొదటి సినిమా 'కాగజ్ కె నావ్' విడుదల అయింది. ఆ రోజున ఇతనికి చంద్ర-చంద్ర-చంద్ర దశ నడిచింది. అంటే, అప్పుడే చంద్రదశ మొదలైంది. దశాంశను పరిశీలిస్తే ఇది ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది. చంద్రుని నుండి 10-4 ఇరుసులో ఉచ్చ శని సూర్యులు, లాభంలో ఉచ్ఛరాహువు కారకులు. 

11 -6- 1980 న, బాక్సాఫీసును బ్రద్దలు కొట్టిన 'కర్జ్' సినిమా విడుదలైంది. ఆ రోజున చంద్ర-శని-రాహు దశ నడిచింది. శనిరాహువులు దశాంశ చక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించాలి.

3-12-1982 న, మరపురాని కథతో, సంగీతంతో, సందేశంతో తీయబడిన 'అర్ద్' సినిమా విడుదల అయింది. మహేష్ భట్ తీసిన చిత్రాలన్నింటిలోకీ ఇది మరపురాని చిత్రంగా  ఈనాటికి కూడా నిలిచిపోయింది. ఆ రోజున ఇతని జాతకంలో చంద్ర-శుక్ర-రవి దశ నడిచింది. చతుర్థంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడిని దశమంనుండి  ఉచ్చ రవి వీక్షిస్తూ ఉండటం గమనించండి.

కానీ 1984 లో కుజ మహర్ధశ మొదలు కావడం తోనే ఇతనికి చెడుకాలం మొదలైంది. దీనికి కారణం కుజుడు అష్టమంలో శత్రుస్థానంలో పడిపోవడమే. రాశిచక్రంలో చూస్తే, లగ్నాధిపతిగా కుజుడు లాభంలో ఉన్నప్పటికీ, అది శత్రుక్షేత్రం కావడం, సింహంనుండి బాధకుడైన వక్ర శనియొక్క దృష్టికి లోనవ్వడం వల్ల ఆ దశ కలిసిరాలేదు.   ఆ సమయంలో క్రమేణా ఇతనికి సినిమాలు తగ్గిపోయాయి. అదే సమయంలో కుటుంబసమస్యలు కూడా ఎక్కువయ్యాయి.

1991 లో మొదలైన రాహుదశ ఇతన్ని నానా బాధలు పెట్టింది. కెరీర్ దెబ్బతినడం, కుటుంబసమస్యలు ఇతన్ని డిప్రెషన్ లో పడేశాయి. మందులు వాడుతూనే ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇతని ఖర్మకాలి సత్యసాయికి భక్తుడయ్యాడు. ఇతని వింశాంశ చక్రాన్ని గమనిస్తే, సరియైన ఆధ్యాత్మిక మార్గం దొరకాలంటే కూడా జాతకంలో పుణ్యబలం ఉండాలని నేను ఎప్పుడూ చెబుతున్న విషయం ఎంత కరెక్టో తెలుస్తుంది.

ఇతని వింశాంశచక్రంలో చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. బుధుడు వక్రించి నీచస్థితిలో ఉన్నాడు. అక్కడనుండి పంచమమైన కర్కాటకంలో ఐదుగ్రహాలు ఉన్నాయి. కనుక మతిభ్రమించడం, భ్రమలతో కూడిన ధ్యానాలు మొదలైనవి కనిపిస్తున్నాయి. కుజుని ఉచ్ఛత్వం కూడా మొండితనాన్ని, పిచ్చిని సూచిస్తున్నది. ఉఛ్చ కుజునికి, నీచ చంద్రునికి మధ్యలో చిక్కుకుపోయిన గురువు, తన సంస్థకు తానే బందీ అయిపోయిన సత్యసాయిబాబాను స్పష్టంగా సూచిస్తున్నాడు. ఈ కర్మసంబంధం వల్లనే ఇతను సత్యసాయికి భక్తుడయ్యాడు. కానీ ఆయన వల్ల ఇతనికేమీ మేలు జరుగకపోగా, దాడికి గురై, జైల్లో పెట్టబడ్డాడు. పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది.

అదే సమయంలో ఫిబ్రవరి 16, 1996 న ఇతనికి ఏలినాటి శని మొదలైంది. ఆరోజునుంచీ ఇతని జీవితంలో నిజమైన కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో గురుఛండాలదశ ఇతని జాతకంలో వచ్చింది. ఇక అలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు కదా?

ఈ సమయంలోనే ఇతని జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది.

అది 5, జూన్ 1996. ఇతని జాతకంలో రాహు-గురు-రాహుదశ నడుస్తున్నది. ఇది గురుఛండాలదశ. ఆ రోజున ఇతను పుట్టపర్తిలో ఉన్నాడు. అంతకుముందు కొన్ని రోజులనుంచీ అక్కడ ఉంటూ, ధ్యానంలో కాలం గడిపేవాడు. గంటలు గంటలు ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. ఆ రోజున ధ్యానంలో అతనికేం అనిపించిందో తెలియదు. 

"సాయిబాబా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు, నేనాయనను ఎలాగైనా కలవాలి, ఆయనను కాపాడాలి" అంటూ లోపలికి పోబోయాడు. సెక్యూరిటీవాళ్ళు అడ్డుకున్నారు.

అసలు, ప్రతివాడూ ధ్యానం చెయ్యకూడదు. అందులోనూ, డిప్రెషన్, పిచ్చిధోరణి మొదలైనవి ఉన్నవాళ్ళు దానిజోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే, ధ్యానం వికటిస్తే, మామూలు మనిషికే పిచ్చెక్కుతుంది. ఇక పిచ్చోడికి ఏమౌతుంది? అందుకే, నేటి ఆశ్రమాలలో మామూలు మనుషులకంటే పిచ్చోళ్ళే మనకు ఎక్కువగా   కనిపిస్తారు.

మనమేమో వాళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటాం. వాళ్ళేమో, చూసేవాళ్ళకే పిచ్చని అనుకుంటారు. ఈ పిచ్సిగోలలో, ఎవరికి పిచ్చో, ఎవరికి కాదో ఏ పిచ్చివాడు తేల్చాలి?

సరే, సాయంత్రం వరకూ ఏదోవిధంగా ఆగిన అతను, చీకటి పడుతున్న సమయంలో ఎవరిదో ట్రాక్టర్ మాట్లాడుకుని, ప్రహారీగోడ పక్కగా దానిని ఉంచి, దానిపైన ఒక నిచ్చెన వేసుకుని గోడ ఎక్కి ప్రశాంతినిలయంలోకి దూకబోయాడు. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. సత్యసాయిని చంపడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అందరూ నమ్మేశారు. అతన్ని కొట్టారో లేదో మనకు తెలియదు.  అక్కడున్నదంతా పూనకపు మూర్ఖభక్తులే గనుక ఇతనిపైన దాడి  చేసే ఉంటారని మనం అనుకోవాలి.

ఇతన్ని అరెస్టు చేసి లోకల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తరువాత బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతని తండ్రి బాంబే నుండి వచ్చి, కొడుకును విడిపించుకుని, ఆస్పత్రిలో చేర్చడము, తర్వాత బాంబేకు తీసుకువెళ్లి అక్కడ బైకుల్లా లోని మసీనా ఆస్పత్రిలో చేర్చడము జరిగిపోయాయి.

అదే సమయంలో, అంటే 10 జూన్ 1996 న ఇతనికి రాహు - శనిదశ మొదలైంది. ఇది శపితదశ. ఇక అక్కడినుంచి అసలైన కష్టాలు మొదలయ్యాయి. 

ఇతను మసీనా ఆస్పత్రిలో ఉన్నపుడే, విషయం తెలిసిన మహేష్ భట్ వెళ్లి పలకరించి  వచ్చాడు. అప్పటికే బాగా పిచ్చిలో ఉన్న రాజ్ కిరణ్ తనతో పెద్దగా మాట్లాడలేదని ఆయనన్నాడు.

గురుఛండాలదశ, శపితదశ, ఏలినాటిశనులు కలసి ఈ విధంగా ఇతని జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి.

మరింత మంచివైద్యం చేయించడం కోసం, అక్కడనుండి, ఇతని అన్నయ్య ఇతనిని అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడ న్యూయార్క్ సిటీలో ఉంటూ, పిచ్చికి వైద్యం తీసుకుంటూ ఉండేవాడు. కొన్నినెలల తర్వాత ఉన్నట్టుండి ఆ ఇంటినుండి ఎక్కడికో మాయమైపోయాడు. ఆ సమయంలో రాహు-శని-కేతుదశ నడిచింది. ఆ తరువాత ఇప్పటివరకూ ఇతనెక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు.

సరిగ్గా ఇప్పుడు జ్యోతిశ్శాస్త్రం రంగప్రవేశం చేస్తున్నది !

ఇతని ఆయుష్షును లెక్కించి చూద్దాం.

ఆయుర్దాయవిధానాలు స్థూలంగా మూడున్నాయి. ఒకటి నైసర్గిక ఆయుర్దాయం, రెండు పిండాయుర్దాయం, మూడు అంశాయుర్దాయం. ఇవిగాక, జైమినిపద్ధతిలో మరొక విలక్షణమైన విధానం ఉన్నది. వీటిలో అంశాయువు, జైమినివిధానాలే చాలావరకు సరియైన ఫలితాలనిస్తాయని పండితులంటారు. అనుభవం కూడా ఇదే చెబుతోంది.

జైమినిపద్ధతి ప్రకారం చూడగా,

లగ్నాధిపతి+అష్టమాధిపతి, లగ్నము+చంద్రలగ్నము, లగ్నము+హోరాలగ్నము ఈ మూడు జతలూ చర, స్థిర, ద్విస్వభావరాశులలో ఉండేదాన్ని బట్టి ఆ జాతకుడు పూర్ణాయుష్కుడా (99-66 మధ్య), మధ్యాయుష్కుడా (66-33 మధ్య), అల్పాయుష్కుడా (33-8 మధ్య) అనేది  తెలుస్తుంది.  

లగ్నాధిపతి, అష్టమాధిపతి ఇద్దరూ కుజుడే అయ్యాడు. ఇతడు స్థిరరాశిలో ఉన్నాడు గనుక పూర్ణాయువైంది. లగ్న, చంద్రులిద్దరూ మేషంలోనే ఉన్నారు, అది చరరాశి గనుక మళ్ళీ పూర్ణాయువైంది. లగ్నమైన మేషం చరరాశి, హోరాలగ్నమైన మిధునం ద్విస్వభావరాశి గనుక అల్పాయువైంది. రెండు పూర్ణాయువులు, ఒకటి అల్పాయువు వచ్చింది గనుక సరాసరిగా మధ్యాయువౌతుంది. అంటే 33 - 66 ఏళ్ల మధ్యలో ఇతను మరణిస్తాడు.  

అంశాయుర్దాయ విధానాన్ని బట్టి లెక్కించగా ఇతనికి  47 ఏళ్ల ఆయుష్షు వస్తున్నది.  ఇతను పుట్టింది 1949 లో గనుక 47 కలిపితే 1996 అవుతుంది. సరిగ్గా ఇదే సంవత్సరంలో పుట్టపర్తి సంఘటన, బెంగుళూరు జైలు, బాంబే పిచ్చాసుపత్రి, అమెరికా వెళ్లడం ఇవన్నీ జరిగాయని ఇతని జీవితం చెబుతోంది. కనుక, అమెరికా వెళ్లిన కొద్దినెలలకు ఇతను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత, ఏదో ఒక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పవలసి వస్తున్నది. 

పోనీ 66 వరకూ ఇతని ఆయుష్షు ఉందేమో అని పరిశీలించగా, మార్చి 1999 తో రాహు-శనిదశ అయిపోయింది. రాహు-బుధదశ 1999-2001 మధ్యలో నడిచింది. బుధుని వక్రత్వం వల్ల, ఆర్గలదోషాలవల్ల ఆ సమయంలో పిచ్చి బాగా ముదిరి ఉండాలి. వెంటనే వచ్చిన రాహు-కేతుదశ 2001-2002 మధ్యలో నడిచింది. అప్పుడుగాని, ఆ తరువాత వచ్చిన రాహు-శుక్ర దశ (2002-2005) లో గాని, ఎక్కువలో ఎక్కువగా ఇతను చనిపోయి ఉండాలి. ఏమంటే, శుక్రుడు ఈ లగ్నానికి మారకుడు.

ఇప్పుడు ప్రశ్నవిధానాన్ని ఉపయోగించి చూద్దాం.

ఈ ప్రశ్నజాతకం నిన్న ఉదయం 9 గంటలకు వేసినది. లగ్నాధిపతి చంద్రుడు 9 వ భావంలో, రాహుకుజులతో ఆర్గళానికి లోనై, మారకుడైన శనితో కలసి ఉంటూ, ఈ జాతకుడు దూరదేశంలో ఒక దుర్ఘటనలో మరణించాడని చెబుతున్నాడు. 

ప్రశ్నదశ గురు రాహు బుధదశ వచ్చింది. ఇది గురుదోషంవల్ల మతిభ్రమించడాన్ని సూచిస్తుంది. ఉచ్చగురువు 9 వ అధిపతిగా దూరదేశాన్ని, 6 వ అధిపతిగా తీవ్రమైన గురుదోషాన్ని సూచిస్తున్నాడు. బాధకుడైన శుక్రునితో కలసి ఉన్నాడు. ఇది భార్యతో గొడవలను సూచిస్తున్నది. కుటుంబస్థానంలోని కేతువు కుటుంబసభ్యులతో వియోగాన్ని సూచిస్తున్నాడు. ప్రశ్నజాతకం కాలగ్రస్తయోగంలో చిక్కుకుని ఉంటూ, తీవ్రమైన గతకర్మను సూచిస్తున్నది.

కనుక, రాహు-బుధ దశలో (1999-2001) ఇతను చనిపోయి ఉండాలి.

కనుక, రిషికపూర్ చెప్పినది, దీప్తి నావల్ చెప్పినది రెండూ కరెక్ట్ కావు. సోమీ అలీ వంటి కొందరు, రాజ్ కిరణ్ కోసం ఈనాటికీ వెదుకుతూ ఉండటం వృధాప్రయాస అని, ఇతను చనిపోయి చాలాకాలమైనదని నేను చెబుతున్నాను.

అమెరికా అన్నికోణాలలోనూ అంతమంచి దేశమేమీ కాదు. మొన్నటికి మొన్న మాయమైన నాన్సీ గుత్రీనే ఇంతవరకూ ఏమైందో అమెరికా పోలీసులే  పట్టుకోలేకపోయారు. ఇక దేశంగాని దేశంలో, అదికూడా 30 ఏళ్ల క్రితం తప్పిపోయిన మనిషిని ఇండియానుండి ఎవరు పట్టుకోగలుగుతారు? అది జరిగే పని కాదు.

అతను మంచివాడే కావచ్చు. వేసిన పాత్రలు కూడా మంచిపాత్రలే కావచ్చు. అతనిని ఎరిగిన మనుషులు అతన్నింకా మర్చిపోలేకపోతూ ఉండవచ్చు కూడా. కానీ కర్మను ఎవరూ తప్పించలేరు. ఇప్పటి మంచితనానికీ, గతకర్మకూ సంబంధం లేదు. అతనిని వెదకడం అనవసరం !

ఇది జ్యోతిషశాస్త్రపు తీర్పు !

డబ్బు చేతిలో ఉండి సుఖంగా కాలం గడుస్తూ ఉంటే అంతా బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దశ మారిందంటే ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. జాతకం సరిగ్గా లేకపోతే జీవితం మొత్తం తల్లక్రిందులు కావడానికి ఒక్క రోజు చాలు.

అందుకే, ఈరోజు మన చేతిలో డబ్బు ఉందని విర్రవీగటం ఎప్పుడూ కరెక్ట్ కాదు.ఎందుకంటే రేపు ఏమౌతుందో ఎవరికీ తెలియదు.విధి వక్రిస్తే, మన విర్రవీగుడు మొత్తం మాయం కావడానికి ఒక్క క్షణం చాలు.

పెద్దవయసులో ఏ విధమైన కష్టమూ లేకుండా మనల్ని చక్కగా చూచుకునేవారు ఉండటమే అసలైన అదృష్టం.వయసులో ఉన్నపుడూ చేతిలో డబ్బు ఉన్నపుడూ అందరూ వెంటబడతారు ప్రేమలు కురిపిస్తారు. అది నిజం కాదు పెద్ద భ్రమ.వయసు మళ్ళి, చేతిలో డబ్బు లేనప్పుడే మేమున్నామని మనల్ని చూచుకునేవారు ఉండాలి. అదే అసలైన వరం.

వయసులో ఉన్నపుడు ఎన్ని సుఖాలు అనుభవించినా, చివరకు పెద్దవయసులో పడ్డప్పుడు ఎవరూ తోడులేని దిక్కులేని జీవితం గడపడం కంటే దుర్భరం ఇంకోటి ఉండదు మరి.

పెద్ద స్టార్ గా ఒక వెలుగు వెలిగి వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అదృష్టవంతులకు ఇలాంటి దుస్థితి పట్టడం, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని గతి పట్టడం, ఖర్మ కాకపోతే ఇంకేమిటి మరి?

2017 లో వ్రాసిన ఈ జాతకవిశ్లేషణ మొదటిభాగాన్ని ఇక్కడ చూడండి.
read more " రాజ్ కిరణ్ కు ఏమయ్యింది? జననకాల సంస్కరణ - ప్రశ్నజాతక నిర్ధారణ ! "

4, మే 2022, బుధవారం

Elon Musk Astro Chart - Terrific Dhana Yogas

'ఎంతసేపూ యాక్సిడెంట్లు, చావులు, యుద్ధాలు, ప్రకృతి దుర్ఘటనలు ఇలాంటివి విశ్లేషణ చేయడమేనా? కాస్త మంచిమాటలు కూడా అప్పుడప్పుడు వ్రాయవచ్చు కదా?' అంటూ నిన్నరాత్రి కర్ణపిశాచి కల్లోకొచ్చి మరీ అడిగింది.

'సరే ఏం రాయమంటావో కోరుకో' అన్నాను.

'ఎలాన్ మస్క్ జాతకం రాయి. అంత డబ్బు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుంది' అంటూ ముచ్చటపడింది.

'దానికి జాతకం ఎందుకు? గతజన్మలలో ఎన్నో దానధర్మాలు లెక్కలేనన్ని చేసుంటే అలాంటి జన్మ వస్తుంది' అన్నాను.

'కాదు చూడవా ప్లీజ్' అంటూ తెగ బ్రతిమిలాడింది.

'సరే పో' అని దానిని కలలోనుంచి పంపించేశా.

ఈ పోస్ట్ అలా మొదలైందన్నమాట !

ఎంతోమంది సెలబ్రిటీస్ జాతకాల లాగా ఇతనికి కూడా జనన సమయం ఎవరికీ తెలియదు.  జననప్రదేశం మాత్రం ప్రిటోరియా సౌతాఫ్రికా. పుట్టింది 28 జూన్ 1971. కర్ణపిశాచినడిగితే సాయంత్రం 6. 50 అని చెప్పింది. ఆ సమయానికి వేసిన జాతకచక్రం ఇది.   

సరే మకరలగ్న జాతకమైంది. ఇక ధనయోగాలు చూద్దాం.

భయంకర ధనయోగాలు

లాభాధిపతి అయిన కుజుడు ఉచ్ఛస్థితిలో లగ్నంలో ఉండటం భయంకర ధనయోగం.    కుజుడు చతుర్ధాతిపతి కూడా. అంటే, మనస్సును సూచిస్తాడు. కనుక ఇతను ఒక ప్లాన్ వేశాడంటే అది కనకవర్షాన్ని కురిపించాల్సిందే. ఈ జాతకంలో ఇదొక సక్సెస్ యోగం.

రాహువు లగ్నంలో ఉండటం వల్ల దూరాలోచన దురాలోచన రెండూ ఉంటాయి. శనిని సూచిస్తున్నందువలన చాపకింద నీరులాంటి భయంకరమైన ప్లానింగ్ ఉంటుంది. పైగా పట్టుదలకు మారుపేరైన మకరలగ్నం. మహామొండివాడైన కుజుని ఉచ్ఛస్థితి. ఇంతకంటే 'సక్సెస్ మంత్ర' ఇంకేముంటుంది?

లాభస్తానంలోని గురువువల్ల అమితమైన పుణ్యబలం కనిపిస్తున్నది. అందుకే ఏది పట్టుకున్నా బంగారమౌతుంది. గురువు వక్రతవల్ల ద్వాదశాధిపత్యం మంచిదౌతుంది. పరాయిదేశంలో లాభాలపంటను పండిస్తుంది. ఇదే కారణం చేత, గురువు దశమమైన తులలోకి పోతాడు. దశమంలో గురువు వల్ల పట్టిందల్లా బంగారమౌతుంది.

సుఖవిలాస యోగం

బుద్ధిస్థానమై, భౌతికసుఖాలకు ఆలవాలమైన వృషభంలో కలిగిన శనిశుక్రుల యోగం భయంకరమైన విలాస, సుఖయోగం. ఇతను తలపెట్టే ప్రతి ప్రాజెక్టునూ సక్సెస్ చేసే గ్రహానుగ్రహం ఇదే.

బుధాదిత్యయోగం

ద్వితీయ వృత్తిస్థానమై,  అమెరికాను సూచిస్తున్న మిధునంలో ఉన్న బుధాదిత్యయోగం వల్ల, మంచి తెలివితేటలూ, సౌతాఫ్రికాలో పుట్టినప్పటికీ అమెరికాలో స్థిరపడి భయంకరమైన సక్సెస్ ను సాధించడం జరిగింది. చిన్నవయసులోనే కంప్యూటర్ ప్రొగ్రామింగ్ లో విపరీతమైన తెలివి ఇందుకే కలిగింది.

రోగ యోగం

అయితే, ఇది రోగస్థానం కూడా కావడం వల్ల ఇతనికి  యాస్పర్జర్ సిండ్రోమ్ అనే రోగం దాపురించింది. ఇది ఒకరకమైన ఆటిజమే. ఈరోగం ఉన్నవాళ్లు చేసిందే చేస్తూ, పర్ఫెక్షనిస్ట్ లుగా,  ఒక విధమైన మొండి మనుషులుగా ఉంటారు. జాతకంలో ఇతర అదృష్టయోగాలు కలిస్తే, ఈ పోకడ భయంకరమైన అదృష్టాన్నిస్తుంది. లేకపోతే దురదృష్టాలతో జీవితాంతం బాధపడే మెంటల్ పేషంట్ ని చేస్తుంది. జాతకంలో ఇలాంటి సూక్ష్మమైన తేడాలుంటాయి. 

సాధారణంగా, ఉండవలసిన దానికంటే తెలివితేటలు ఎక్కువైతే, కొంచెం పిచ్చిదోరణి తప్పకుండా ఉంటుంది. లేదా నరాల సంబంధిత జబ్బు ఉంటుంది. అయిన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లు దీనికి ఉదాహరణలు.

ఇతని ముఖంలో కొంచం ఆటిజం కవళికలున్నట్లు గమనించవచ్చు.

మొండి అధికారి

లగ్నసప్తమాలైన మకర కర్కాటకాలలో ఉన్న రాహుకేతువులవల్ల, తనమాట ఎదుటివారు వినడమేగాని, ఎదుటివారిమాటను తను ఎట్టిపరిస్థితిలోనూ వినని భయంకరమైన ఎడ్మినిస్ట్రేటర్ కనిపిస్తున్నాడు. అంటే మొండి సీతయ్యన్నమాట.

ఎదురులేని యోగం

సప్తమాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో పడటంవల్ల ప్రత్యర్థుల మాట చెల్లకపోవడం, ఇతనికి ఎదురు ఎవరూ నిలవలేకపోవడం, అయితే అదే సమయంలో వివాహజీవితం చెడిపోవడం కనిపిస్తున్నాయి.

గోచారం

ప్రస్తుతం ఇతనికి సప్తమశని మొదలైంది. అందుకే ట్విట్టర్ ఉద్యోగులతో మనస్పర్థలు మొదలయ్యాయి. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నప్పటికీ, ఇంకొక రెండున్నరేళ్ల తర్వాత రాబోతున్న అష్టమశని సమయంలో మాత్రం తీవ్రమైన ఒడుదుడుకులు తప్పవని అనిపిస్తున్నది.

ఏ మనిషికైనా జీవితమంతా మొదటినుంచీ చివరిదాకా ఒకేలాగా ఉండదుకదా మరి !

read more " Elon Musk Astro Chart - Terrific Dhana Yogas "

4, సెప్టెంబర్ 2021, శనివారం

ప్రత్యూష బెనర్జీది హత్యా ఆత్మహత్యా?

సిద్ధార్ధ అనే హిందీ నటుడిది జాతకం వేశాక, 'ఇతనితో బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) అనే సీరియల్లో నటించిన ప్రత్యూష బెనర్జీ అనే అమ్మాయి కూడా చనిపోయిందని, అదికూడా 2016 లో నని  కొందరు నాతో చెప్పారు. నేనీ సీరియల్సూ, చెత్తా చెదారమూ, చూడను గనుక, అసలు మా ఇంటికి టీవీ కనెక్షన్ పీకించేశాను గనుక, నాకీ విషయాలు తెలియవు. ఈలోపల, ఆ అమ్మాయిది హత్యో ఆత్మహత్యో చూడమని, కర్ణపిశాచి నా ఎడమచెవిలో సవాల్ విసిరింది. మనుషులు చూడమని అడిగితే మనం చూడం కదా, సర్లే పాపం పిశాచి అడిగిందని చూస్తున్నా ! మనుషులకంటే అవే నయం మరి !

ఈ అమ్మాయి 10-8-1991 న ఉదయం 4. 20 కి జంషెడ్ పూర్లో పుట్టిందని వివరాలు దొరికాయి. నిజమో కాదో దేవుడికెరుక. అయినా జాతకం చూద్దాం.

తెలుగులో కూడా ఒక ప్రత్యూష అనే నటి ఉండేదని, ఆమె కూడా ఇలాగే చంపబడిందని, ఆమెను రేప్ చేసిన నీచులు హాయిగా తప్పించుకుని, ప్రస్తుతం అమెరికాలో హ్యాపీగా తిరుగుతున్నారని నాతో కొందరన్నారు. ప్రకృతి న్యాయస్థానంలో వాళ్లకు భయంకరమైన శిక్ష తప్పదని వారితో అన్నాను. సరే ఆ విషయమలా ఉంచి, ఈ చార్ట్ లోకొద్దాం.

ఈ అమ్మాయి అమావాస్య రోజున పుట్టింది. అది లగ్నంలోనే ఉంది. కనుక ఈమెది చీకటిజీవితమే. అయితే గురువు కూడా ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. గతకర్మ కొంత మంచిది. అందువల్ల అదృష్టం కలసి వస్తుంది. అయితే, ఇది కాలసర్పయోగజాతకం. శత్రుస్థానంలో శపితయోగం కూడా ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని, శత్రుస్థానంలో శపితయోగంలో ఉండటం వల్ల, ప్రియుడు లేదా భర్త ఈమె చావుకు కారకుడౌతాడని సూచన స్పష్టంగా ఉన్నది. వక్రులైన బుధశుక్రులు కూడా లగ్నంలోకి వస్తారు. లగ్నం తీవ్రమైన పాపార్గళానికి గురయ్యింది. ఈ కారణాలచేత, ఈ అమ్మాయి చాలా మంచిదని, అమాయకురాలని, తేలికగా మోసపోతుందని, క్రిమినల్స్ నుంచి ఎంతో వత్తిడికి గురవుతుందని, చివరకు విషాదాంతమని చెప్పవచ్చు.

కర్కాటక లగ్నానికి బుధశుక్రశనులు మంచిని చెయ్యరు. వీరిలో బుధశుక్రులు డిగ్రీ కంజంక్షన్ మీదున్నారు. వీరితో పంచమాధిపతి కుజుడు కలిసున్నాడు. వీరందరూ మారకస్థానంలో ఉన్నారు. పైగా, నీచకేతువు నక్షత్రంలో ఉన్నారు. స్నేహాలు, ప్రేమవ్యవహారాలే ఈమె బలవంతపు చావుకు కారణమౌతాయని ఇవి చెబుతున్నాయి.

ఈ అమ్మాయి 1-4-2016 న ఉరేసుకుని చనిపోయినట్లు లోకాన్ని నమ్మించారు. ఆ రోజున, ఈమె జాతకంలో శుక్ర-రాహు-రాహు-కేతుదశ నడిచింది. రాహువు శత్రుస్థానంలో నీచస్థితిలో ఉంటూ శనితో కలసి శపితయోగంలో ఉన్నాడు. శుక్రుని సంగతి పైన చెప్పాను. కేతువు నీచబుధుడిని సూచిస్తూ ద్వాదశంలో ఉంటూ రహస్యాలను, కుట్రలను, బలవంతపు చావును సూచిస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో లగ్నాధిపతి అయిన చంద్రుని పాత్ర లేదు. కనుక ఈమెది ఆత్మహత్య కాదు.

1-4-2016 న  ముంబాయి లో గ్రహస్థితి ఇలా ఉంది.

మారకస్థానంలో గురురాహువులు సంచరిస్తూ గురుఛండాలయోగాన్నిస్తున్నారు.  అంటే, బాంబే సినీ ఫీల్డ్ లోని మాఫియా పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. పంచమంలో దుర్ఘటనాయోగం స్పష్టంగా ఉంటూ తీవ్రమైన షాక్ ను సూచిస్తున్నది. నవమంలో నీచబుధుడు, ఉచ్ఛశుక్రుడు ఉంటూ, ఆయుష్య స్థానాన్ని చూస్తున్నారు. సినీ పెద్దలనుంచి  సెక్స్ పరమైన ట్రాప్ లు, కుట్రలు, వాటిల్లో ఇరుక్కోవడం క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే రోజున ఈ అమ్మాయి చంపబడింది.

ఉరిచావులలో రుజువయ్యే జైమినీమహర్షి సూత్రం ఈ జాతకంలో లేదు. గమనించండి. దీనిగురించి గతంలో కొన్ని జాతకాలలో వ్రాశాను, చూసుకోండి.

కనుక ఈ అమ్మాయిది హత్యేగాని, ఆత్మహత్య కాదని చెబుతున్నాను. ఈ అమ్మాయి సినీమాఫియా ఉచ్చులో ఇరుక్కుంది. మోసపోయింది. బయటకు రాలేకపోయింది.  హత్యకు గురయ్యింది. ఇందులో ప్రియుడిపాత్ర ఖచ్చితంగా ఉంది. లోకాన్ని నమ్మించవచ్చు, నేరస్థులు తప్పించుకుని తిరుగవచ్చు. కానీ వారికి శిక్ష తప్పదు. అదెలా పడుతుందో  మానవమాత్రులకర్ధం కాదు. నాకర్ధమైనా బయటకు చెప్పను, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు నష్టం లేదు.

సరేనా పిశాచీ ! ఇంకెప్పుడూ ఇలాంటి జాతకాలు చూడమని అడక్కు.

read more " ప్రత్యూష బెనర్జీది హత్యా ఆత్మహత్యా? "

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

కండలున్నంత మాత్రాన ఆరోగ్యం కాదు - సిద్ధార్ధ శుక్లా జాతకం ఏమంటోంది?

సెలబ్రిటీ నటుడు సిద్ధార్ధ శుక్లా, గుండెపోటుతో చనిపోయాడు. ఇతనికి 40 ఏళ్ళు మాత్రమే. జాతకాన్ని గమనిద్దాం.

మీకు గుర్తుందో లేదో? గతంలో ఒక పోస్టులో, 'నేటి నటీనటులు కండలు పెంచడం మీద ఉన్న శ్రద్ధను ఆరోగ్యం మీద చూపడం లేదు. జిమ్ములు చేసి సిక్స్ ప్యాక్ పెంచినంతమాత్రాన ఆరోగ్యంగా  ఉన్నట్లు కాదు' అని వ్రాశాను. అది నిజమైంది చూడండి. అందులోనూ, నటులకు సూచకుడైన శుక్రుడు గోచారంలో నీచస్థితిలో ఉండగా !

సిద్ధార్ధ శుక్లా, 12-12-1980 న ఉదయం 10. 20 కి ముంబాయిలో పుట్టాడని వివరాలు లభిస్తున్నాయి. ఇతని జాతకాన్ని ప్రక్కనే ఇచ్చాను చూడండి. 1980 జాతకాలలో ఒక భయంకరమైన దోషం ఉన్నది. అదే, శనిగురువుల డిగ్రీ సంయోగం. 1980 ప్రాంతాలలో పుట్టినవారికి జీవితమూ, సంసారజీవితమూ రెండూ సరిగ్గా ఉండవు. దీనిని చాలా జాతకాలలో గమనించాను. ఇతనిది మకరలగ్న జాతకం. మకరరాశి కూడా. కనుక కన్య ఇతనికి భాగ్యస్థానమైంది. శని లగ్నాధిపతి కావడంతో యోగమిచ్చింది. కానీ ఇది అవయోగం కూడా. పైగా ఇది కాలగ్రస్తయోగ జాతకం. దశమంలో శుక్రుని స్వక్షేత్రస్థితి వల్ల బుల్లితెరమీద వెలిగాడు. అంతా బాగున్నట్లు భ్రమ కల్పించింది లగ్నాన్ని కొట్టిన రాహుకేతువులు ఇరుసు.

ఇతని నవాంశ చక్రం ఏమీ బాగా లేదు. రాశిచక్రం కంటే అంశచక్రాలు బలమైనవి. నవాంశలో రాహుకేతువులు నీచస్థితిలో ఉన్నారు. శనిగురుయోగం లగ్నంలోనే ఉన్నది. గమనించండి. లగ్నాధిపతి శుక్రుడు మారకస్థానంలో నీచకేతువుతో కలసి ఉంటూ సినిమా రంగమూ, హైఫై జీవితమూ ఇతని చావుకు కారణాలౌతాయని స్పష్టంగా చూపిస్తున్నాడు.

చాలామంది బాలీవుడ్ నటులలాగే ఇతనూ ఫిట్నెస్ ఫ్రీకే, కండలు బాగా పెంచాడు. కానీ గుండెను చూచుకోలేదు. కారణాలు అనేకం. హైఫై సొసైటీ అలవాట్లు, సిగరెట్లు, త్రాగుడు, పిచ్చిపిచ్చి డైటింగులు చెయ్యడం, ఆహారవిహారాలలో నియమం లేకపోవడం, మితిమీరిన ఇంగిలీషు మందులవాడకం, బలం అంటూ విటమిన్ సప్లిమెంట్లు వాడటం, బరువులెత్తి బాడీని పెంచడం - ఇవే కారణాలు. మాకు ట్రెయినర్లు ఉన్నారని అనుకుంటారు. ట్రెయినర్లకు తెలిసింది ఎంత? అన్నది మర్చిపోతారు. కొంపలు మునుగుతాయి.

నటులకు కావలసింది టాలెంట్, అంతేగాని కండలు కావు. పాతతరం నటులు ఫిట్నెస్ చూసుకునేవారు. అంతేగాని, పెద్ద పెద్ద నటులెవరూ కండలు పెంచలేదు.  ఇది నేటి తరానికి పట్టిన దరిద్రం మాత్రమే. అసలైన టాలెంట్ లేనప్పుడు ఒళ్ళు చూపించుకోవడమే కదా వీళ్ళు చెయ్యగలిగింది? కండలతో అమ్మాయిలను మెప్పించవచ్చని చాలామంది నటులు అనుకోవడం పిచ్చిభ్రమ. నీ దగ్గర డబ్బుల్లేనప్పుడు, ఉత్తకండలకు ఏ అమ్మాయీ ఇంప్రెస్ కాదు. పైగా, నేటి తెలుగు నటులలో చాలామందికి స్పష్టమైన ఉచ్చారణ లేదు. తెలుగు మాట్లాడటం రాదు. ఒత్తులు పలకవు. అతివేషాలు తప్ప అసలైన నటన ఎవరిలోనూ లేదు. వీళ్ళను చూచి కుర్రకారు వెర్రెక్కి పోవడం ! ఎంత దరిద్రమో? 

ఇవి కనిపించే కారణాలు. బైటకు కనిపించనివి, మామూలు మనుషులకు అర్ధంకానివి, అయిన కారణాలు జాతకంలో దాగి ఉంటాయి. అవేమిటో చూద్దాం.

శ్లో || అష్టమమ్ ఆయుషష్ఠానమష్టమాదష్టమమ్ తథా
తయోరపి వ్యయస్థానం మారకస్థానముచ్యతే || 

అంటుంది జాతకచంద్రిక. 

దీనినిబట్టి అష్టమం, తృతీయం ఆయుష్యస్థానాలు. వీటికి వ్యయాలైన సప్తమం, ద్వితీయాలు మారకస్థానాలని అర్ధం. మకరరాశికి అష్టమాధిపతి సూర్యుడు. సూర్యుడు గుండెజబ్బులను సూచిస్తాడు. మకరలగ్నజాతకులు చాలావరకూ గుండెజబ్బుతో చనిపోవడం కొన్ని వేల జాతకాలలో కనిపించిన వాస్తవం. సూర్యుడీ జాతకంలో నెప్ట్యూన్ తోనూ, షష్టాధిపతి అయిన బుధునితోనూ కలసి, త్రాగుడు, మత్తుపదార్ధాలు ఇతని ఆరోగ్యాన్ని చెడగొట్టి గుండెను పాడుచేస్తాయని స్పష్టంగా చెబుతున్నాడు. తృతీయాధిపతి గురువు నవమంలో శత్రుస్థానంలో ఉంటూ ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం ఆయుష్షు రెండూ పాడవడం సూచిస్తున్నాడు. ఈ ఇద్దరూ ఒకరు స్థిరరాశిలోనూ, మరొకరు ద్విస్వభావరాశిలోనూ ఉంటూ,  ఈ జాతకుడు మధ్యాయుష్కుడని చెబుతున్నారు. అంటే 33-66 ఏళ్ల మధ్యలో పోతాడని అర్ధం. అదేగా జరిగింది మరి !

సత్యాచార్యుని అంశాయుర్దాయగణనం చేస్తే ఒక మనిషి ఆయుష్షు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ విధానం గతంలో చాలా జాతకాలలో వివరించి ఉన్నాను గనుక మళ్ళీ  అవసరం లేదు.

22వ ద్రేక్కాణం, 64 వ నవాంశలు మరణాన్ని స్పష్టంగా చూపుతాయన్నది కొన్ని వేల జాతకాలలో రుజువైన ప్రాచీన జ్యోతిశాస్త్ర సూత్రం. ఈ జాతకంలో దీనిని గమనిద్దాం.

లగ్నం ద్వితీయ ద్రేక్కాణమైంది. అష్టమం నుంచి ద్వితీయ ద్రేక్కాణాధిపతి గురువు. ఆ గురుదశ చివరలో ఛిద్రసమయంలోనే ఇతను చనిపోయాడు గమనించండి.

లగ్నం అయిదవ నవాంశ అయింది. 64 వ నవాంశ సింహంలో ఉంటుంది. సరిగ్గా ఇదే నవాంశ మీద సెప్టెంబర్ 1 న సూర్యుడు సంచరించాడు. సెప్టెంబర్ 2 న ఇతను చనిపోయాడు. గమనించండి.

చంద్రుడు మూడవ ద్రేక్కాణంలో ఉన్నాడు. సింహం నుంచి మూడవద్రేక్కాణం మేషమౌతుంది. ప్రస్తుతం మేషరాశి తీవ్రమైన అర్గలదోషంలో చిక్కుకుని ఉన్నది.  ఇది, స్నేహితులు, పని ఒత్తిడి, టెన్షన్లు, మొదలైన అనేక ప్రభావాలకు సూచిక.

చంద్రుడు ఏడవ నవాంశలో ఉన్నాడు. సింహంనుంచి ఇది తుల అవుతుంది. దీని అధిపతి శుక్రుడు ప్రస్తుతం నీచస్థితిలో ఉంటూ ఆయుష్యస్థానాన్ని చూస్తున్నాడు గమనించండి.

సరిపోయిందా లేదా?

ప్రస్తుతం ఇతనికి గురు - రాహు - శనిదశ జరుగుతున్నది. ఇది ఛిద్రదశలో శపితయోగదశ. గోచారంలో ఏలినాటిశని మంచి పట్టులో ఉన్నది. లగ్నంలో నీచగురువుంటూ గురుదోషాన్ని అనుభవింపజేస్తున్నాడు. గోచార నీచశుక్రుడు, ఉచ్చ బుధుడు, జననకాల శనిగురువులపైన సంచరిస్తున్నారు. జననకాల దోషాన్ని నిద్రలేపుతున్నారు. వీరందరూ కలసి ఆయుష్యస్థానాన్ని చూస్తున్నారు. ఇవి ఏం చేస్తాయో నేను చెప్పనక్కర్లేదు. ఏం జరిగిందో చూచారుగా మరి?

జాతకాలను, గ్రహాలను, తక్కువగా తేలికగా ఎప్పుడూ తీసుకోకూడదు. అవి మన జీవితాలను నడిపే అదృశ్యశక్తులు. జిమ్ము చేసి కండలు పెంచినంత మాత్రాన ఆరోగ్యమనీ భ్రమించకూడదు. మితిమీరిన ఉపవాసాలెంత ప్రమాదమో, మితిమీరిన కీటో డైటూ అంతే ప్రమాదం. మితిమీరిన వెయిట్ లిఫ్టింగ్ చెయ్యడం గుండెకు చెరుపు చేస్తుందన్నది వాస్తవం. ఎంతోమంది బాడీబిల్డర్స్, బాక్సర్స్, వెయిట్ లిఫ్టర్స్ జాతకాలలో ఇది రుజువైంది. తిండి తగ్గించి మితిమీరి పనిచేస్తే, అది గుండెను నాశనం చేస్తుంది. స్మోకింగ్ అలవాటుంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సిగరెట్లు త్రాగేవాళ్లకు గుండెపోటు ఖచ్చితంగా వస్తుంది. తిండి, వ్యాయామం, ఆహారపు అలవాట్లు - వీటిమధ్యన చాలా సున్నితమైన బేలన్స్ ఉంటుంది. దీనిని గమనించుకుంటూ వీటిని చెయ్యాలి. అందరికీ అన్ని వ్యాయామాలూ సరిపోవు. అందరికీ అన్ని తిండ్లూ సరిపోవు. ఎవరో చేశారని మనం చేస్తే ఒళ్ళు గుల్ల అవుతుంది,

50 ఏళ్ల క్రితం బ్రూస్లీ చావుకూ అతిగా చేసిన వ్యాయామాలే కారణం. నిన్న సిద్ధార్ధ శుక్లా చావుకూ అవే కారణం.

డియర్ యూత్ ! ఒళ్ళూ మనసూ జాగ్రత్త మరి !
read more " కండలున్నంత మాత్రాన ఆరోగ్యం కాదు - సిద్ధార్ధ శుక్లా జాతకం ఏమంటోంది? "

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

బాలసుబ్రమణ్యం జాతకంలో రాహుకేతువుల పాత్ర

సుమధురగాయకుడు బాల సుబ్రమణ్యం 
4-6-1946 న నెల్లూరు దగ్గరలో పుట్టాడు. ఆయన గురించి అందరికీ తెలుసు. అదంతా మళ్ళీ నేను వ్రాయవలసిన పని లేదు. ఆయన జాతకంలోని కొన్ని ముఖ్యమైన యోగాలను మాత్రం చెప్తాను.

నీచ కుజుడు, చంద్రుడు ఇద్దరూ బుధనక్షత్రంలో ఉండటం వల్ల మహాపట్టుదల ఉన్న మొండిమనిషని అర్ధం అవుతోంది. బుధుడు తృతీయాధిపతి కావడం వల్ల పాటలు పాడుతూ, డబ్బింగ్ చెప్పే కళాకారుడని తెలుస్తున్నది. గురువు వక్రత్వం వల్ల శాస్త్రీయసంగీతంలో లోతైన ప్రజ్ఞ లేదన్న విషయం స్ఫురిస్తున్నది.

చూడటానికి ఇది కాలగ్రస్తయోగ జాతకంలాగా కన్పిస్తుంది గాని సూర్యుడు బుధుడు రాహుకేతువుల పట్టులో లేరు గనుక ఆ యోగం లేదు. జననసమయం మనకు తెలియదు గనుక ఇతర పద్ధతుల ద్వారా చూద్దాం.

వృత్తికారకుడు, ఆత్మకారకుడైన శని, సినిమారంగానికి కారకుడైన శుక్రునితో కలసి, సాహిత్యానికి సంగీతానికి కళలకు నెలవైన మిధునంలో ఉండటం సినిమారంగంతో సంబంధమున్న వృత్తిని, పేరు ప్రఖ్యాతులను ఇచ్చింది. అయితే, పంచమంలో ఉచ్చకేతువున్నప్పటికీ పంచమాధిపతి కుజుని నీచత్వస్థితివల్ల, చంద్రునితో కలయిక వల్ల- సంతానమూలకంగా మనోవ్యధ, నష్టమూ తప్పవని, సంపాదించినది మిగిలే అదృష్టం లేదన్న సూచన స్పష్టంగా ఉన్నది. నవమాధిపతి అయిన గురువు వక్రిగా ఉంటూ దీనిని బలపరుస్తున్నాడు.

రాహువు ఉచ్చశుక్రుడిని సూచిస్తున్నందు వల్ల, సూర్యునితో బుధునితో కలసి ఉన్నందువల్ల సినిమారంగంలో విజయాన్నిచ్చాడు.

రాహుకేతువులు ఆయన పుట్టినపుడు ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు అదే స్థానాలకు వచ్చారు. అంటే, 4 ఆవృత్తులు పూర్తిచేశారు. కనుక ఆయనకు 72+ ఏళ్లు నిండాయి. జాతకంలో రాహుకేతువుల ఉచ్చస్థితి చాలా మంచిసూచన. ఈ జాతకులు బిచ్చగాడి స్థితినుంచి మహారాజస్థితికి ఎదుగుతారు. బాలూగారు అలాగే, సున్నా నుంచి ఈ స్థాయికి ఎదిగాడు. అనేక భాషలలో పాడటమూ, రకరకాల గొంతులు పెట్టి ప్రయోగాలు చేయడమూ, మిమిక్రీ చేయడమూ, అనేక దేశాలు తిరిగి ప్రదర్శనలివ్వడమూ ఇదంతా శుక్రుడిని సూచిస్తున్న ఉచ్చరాహువు అనుగ్రహమే.

కానీ రాహుకేతువులు ఇస్తున్న యోగం నాలుగో ఆవృత్తితో అయిపోయింది. కనుక రాహువు వృషభంలోకి ప్రవేశించగానే మరణం కూడా ఆయన జీవితంలో ప్రవేశించింది. ఎన్ని ఆవృత్తులకు రాహుకేతువుల యోగం అయిపోతుంది అని మాత్రం ఆడక్కండి. ఆ రహస్యాలు చెప్పను.

రాహువు 23 న వృషభం లోకి వచ్చాడు. బాలూగారు 25 న చనిపోయాడు. అంతకు ముందు ఆగస్ట్ 5 న కరోనా లక్షణాలతో ఆయన ఆస్పత్రిలో చేరాడు. అప్పుడు రాహువు మిథునం మొదటి నవాంశలో ఉన్నాడు. అప్పటికే వృషభం మీద రాహువు యొక్క ఆచ్చాదన మొదలైంది. అందుకే ఆస్పత్రిలో పడేశాడు. ఆ నవాంశ అయిపోయేవరకూ అంటే, సెప్టెంబర్ 23 వరకూ ఆస్పత్రిలోనే ఉన్నాడు. రాహువు రాశి మారి వృషభం లోకి రాగానే తీసుకుపోయాడు.

కరోనా అనేది రాహువు కన్నెర్ర చేయడం వల్ల లోకానికి మూడిన రోగమే !

బాలూగారి జాతకం మీద రాహుకేతువుల ఉచ్చస్థితి ప్రభావం స్పష్టంగా కన్పిస్తున్నది.

read more " బాలసుబ్రమణ్యం జాతకంలో రాహుకేతువుల పాత్ర "

14, సెప్టెంబర్ 2020, సోమవారం

నిత్యానంద జాతకంలో గోచార గ్రహాల పాత్ర - కొన్ని ప్రశ్నలు

గత పోస్టు చదివిన తర్వాత నేను నిత్యానందను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. ఆ ప్రమాదం మీకు లేకుండా చెయ్యడానికే ఈ పోస్ట్. అదీగాక, గత  పోస్ట్ లో గోచారగ్రహాల పాత్రను నేను చెప్పలేదు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి కదా ! 

అందుకని, ఇప్పుడు చదవండి.

ఏలినాటి శని

పుట్టినపుడు ఎవరికైతే శనిచంద్రులు కలసి ఉంటారో వారు ఏలినాటి శని రెండవ ఘట్టంలో పుట్టినట్లు లెక్క. ఆ జాతకానికి శని యోగకారకుడైనా సరే, ఇలాంటి యోగం జాతకంలో ఉన్నపుడు ఆ జాతకుడిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు. ఇది జాతకుడి జన్మంతా తప్పని ఒక చెడుయోగం. నిత్యానంద జాతకంలో ఈ యోగం ఉన్నట్లు మనం చూడవచ్చు. పైగా ఈ లగ్నానికి శని అర్ధపాపి. చంద్రలగ్నానికి పూర్ణపాపి. కనుక, ఈ యోగం ఒక విధమైన ఆధ్యాత్మికజీవితాన్ని ఇచ్చినప్పటికీ, ఏదో రకమైన వేధింపులు మాత్రం ఇతనికి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

పన్నెండేళ్ళ వయసులో 360 డిగ్రీల దృష్టి

అంటే అది 1990 వ సంవత్సరం. ఆ సమయంలో గోచారశని పంచమంలోను, గురువు ద్వాదశంలో ఉచ్చస్థితిలోనూ ఉన్నారు. ఇది ఆధ్యాత్మికంగా అనుభవాలను కలిగించే గోచారమే గనుక ఒక క్షణికమైన అనుభవాన్ని కలిగించి ఉండవచ్చు. కానీ ఒక విషయాన్నీ గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక అనుభవాలు ఎల్లకాలం నిలబడి ఉండవు. ఆ కాసేపు ఉంటాయి. తరువాత పోతాయి. అందుకే వాటిని లెక్కపెట్టకూడదని యూజీగారు అనేవారు. జిల్లెళ్ళమూడి అమ్మగారు మహిమలను కొట్టి పారేసేవారు. 

శ్రీ రామకృష్ణులు, వారి భక్తులు కూడా మహిమలను మహత్యాలను లెక్కచెయ్యరు.  వారూ ఇదే అంటారు. అనుభవాలు శాశ్వతం కాదు. అనుభవి శాశ్వతం. ఇంకొక మెట్టు పైకెక్కితే అనుభవి కూడా లేడు. యోగి గమ్యం అది కావాలి గాని ఈ క్షణం ఉండి మరుక్షణం మాయమయ్యే చిన్నచిన్న అనుభవాలకోసం అతడు అర్రులు చాచకూడదు. సాధనామార్గంలో వేలాదిగా అలాంటి అనుభవాలు కలుగుతాయి. కానీ మనం పట్టించుకోకూడదు.

ఒకవేళ ఆ సిద్ధి అలాగే నిలబడి ఉన్నది అనుకుంటే, రంజిత వీడియో సమయంలో తన గదిలో సీక్రెట్ కెమెరా ఉన్నదన్న విషయం 360 డిగ్రీల దృష్టి ఉన్నవాడికి ఎందుకు తెలియలేదు? మూడోకన్ను అప్పుడెందుకు పని చెయ్యలేదు? రంజిత సమక్షంలో అన్ని శక్తులూ నీరుగారిపోయాయా? దీనికి సమాధానం ఉండదు. కనుక ఈ సిద్ధి ఆయనకు శాశ్వతంగా ఉన్నట్టి సిద్ధి కాదని అర్ధం కావడం లేదా?

ఇదే సంఘటనకు సమాంతర సంఘటనలు మిగతా గురువుల జీవితాలలో కూడా జరిగాయి.

ఆరిగాన్ లో తన ఇంటిని, తన గదిని షీలా వైర్ ట్యాపింగ్ చేయించినప్పుడు ఓషో తెలుసుకోలేకపోయాడు. తర్వాత, అమెరికన్ మీడియా ఆయన్ను అడిగింది - 'నువ్వు జ్ఞానివైతే నీ గదిలో జరుగుతున్నది నీకు తెలీలేదా?' అని. దానికి ఓషో ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పాడు. నవ్వుల పాలయ్యాడు.

ఎన్నో శక్తులున్నాయని చెప్పుకునే అరబిందో కూడా ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. మనకు స్వతంత్రం వచ్చిన రోజున, పాండిచేరి అరబిందో ఆశ్రమాన్ని నాస్తికులు ఎటాక్ చేసారు. అరబిందో వ్యక్తిగత అనుచరుడు ఆ కొట్లాటలో స్పాట్ లో చనిపోయాడు. దీనిని అరబిందో ముందుగా తెలుసుకోలేక పోయాడు. ఆపలేక పోయాడు. దీనికి ఆయన భక్తులు ఇప్పటిదాకా తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ప్రత్యక్షమై ఆపరేషన్లు కూడా చేశాడని ప్రచారం చేయించుకున్న సత్యసాయిబాబా, స్టూడెంట్స్ మర్డర్ నాటి రాత్రి, తన గదిలోకి పారిపోయి లోపలనుంచి గడియ బిగించుకుని దాక్కున్నాడు. పెద్దవయసులో ఆరోగ్యంతో పాటు శక్తులూ తగ్గిపోయాయా?  ఏంటిదంతా?

జరిగే ప్రచారాలేమిటి? జరుగుతున్న వాస్తవాలేమిటి? ఎక్కడైనా పొంతన ఉందా అసలు? పిచ్చిలోకం పిచ్చి గోల?

కనుక, ప్రతి సాధకుడికీ, గురువుకూ,  కొద్దో గొప్పో శక్తులు ఉంటాయి. కానీ ప్రచారం మాత్రం గోరంతలు కొండంతలు చేసుకుంటారు. ఇది తప్పు. ఇక్కడే ప్రతి గురువూ అతని శిష్యులూ  తప్పు చేస్తున్నారు. శిష్యుల అతిప్రచారం వల్లనే గురువులు పతనం అవుతారు. ఉన్నవీ లేనివీ ప్రచారాలు చేసి జనాన్ని మోసం చేస్తే, సమయం వచ్చినపుడు శనిభగవానుడి చేతిలో శిక్ష తప్పదు. అందుకే, గొప్పలు ఎచ్చులు పనికిరావు.

14 ఏళ్ళ వయసులో పరమశివానుభవం

అప్పుడు 1992 వ సంవత్సరం. ఆ సమయంలో గోచార శని వక్రస్థితిలో మకరంలో ఉన్నాడు. ఇది గోచారానికి షష్ఠమస్థితి, మంచిదే. పోనీ, వక్రత్వం వల్ల పంచమం లోకి వచ్చాడని అనుకుంటే ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగే అవకాశం ఉన్నది. కానీ గురువు ద్వితీయంలో కన్యలో ఉన్నాడు. కనుక ఏ విధమైన అనుభవమూ కలిగే అవకాశం లేదు. కనుక ఈ సంఘటన జరగడానికి సూచన లేదు.

1995 - 1996

సప్తమ శని, తృతీయ గురువు. ఆ సమయంలో మద్రాస్, బేలూర్ మఠాలలో బ్రహ్మచారిగా ఉన్నాడు. గురువు నవమాన్ని చూస్తూ ఒక నిజమైన ఆధ్యాత్మికసంస్థలో ప్రవేశాన్నిచ్చాడు. కానీ 1996 లో బేలూర్ మఠాన్ని వదిలేసి, హిమాలయాలకు పయనం సాగించాడు. దానికి కారణం అప్పుడే మొదలైన అష్టమశని ప్రభావం.  గురువు కూడా పంచమంలో ధనుస్సులోకి వచ్చాడు. కనుక మంత్రతంత్రాల పైకి శక్తుల పైకి మనస్సు మళ్ళింది. అందుకే, శుద్ధమైన ఆధ్యాత్మికమార్గాన్ని ప్రబోధించే రామకృష్ణమఠంలో ఇమడలేక బయటకు వచ్చాడు. సిద్ధులు శక్తుల కోసం ప్రయత్నాలు చేశాడు.

2000 సంవత్సరం ప్రాంతంలో తన తిరుగుడును ఆపి తమిళనాడులో స్థిరపడ్డాడు. అప్పటికి శని గురువులు వృషభంలో కలిశారు. అది ఈయనకు వృత్తి స్థానమైన దశమం అయింది. కనుక తన ఆశ్రమాలు, ప్రచారాలు, శిష్యులను పోగేసుకోవడం మొదలు పెట్టాడు.

ఏలినాటి శని మళ్ళీ మొదలు

2004 లో ఇతనికి మళ్ళీ ఏలినాటి శని మొదలైంది. ఇక అక్కడనుంచి ఇతనికి చెడుకాలం మొదలైంది. సినిమా యాక్టర్లు అమ్మాయిలూ చుట్టూ చేరడం మొదలు పెట్టారు. 2006 మధ్యవరకూ ఏలినాటి శని మొదటి ఘట్టం జరిగింది. తరువాత 2009 వరకూ రెండవ ఘట్టం జరిగింది. ఆ సమయంలోనే, అంటే 2008 డిసెంబర్ లోనే ఇతని జన్మనక్షత్రం అయిన ఉత్తర మీదకు శనిసంచారం జరిగింది. తరువాత కొంతకాలం వక్రించి మళ్ళీ ఆగస్ట్ 2009 లో పూర్తిగా ఆ నక్షత్రం మీదకు శని వచ్చాడు.  అక్కడనుంచీ ఇతని పతనం ప్రారంభమైనది.

ఏ మనిషికైనా ఇది జరుగుతుంది. మీరు కావాలంటే మీమీ జాతకాలలో పరిశీలించి చూసుకొండి. మీ జన్మనక్షత్రం మీదకు గాని, అనుజన్మ నక్షత్రాలమీదకు గాని శనిసంచారం జరిగినప్పుడు మీరు నానాబాధలు పడి ఉంటారు. దీనిని ఎవరూ తప్పుకోలేరు. ఇతనిది ఉత్తరానక్షత్రం. కరెక్ట్ గా ఉత్తరానక్షత్రం మీద  శని సంచరిస్తున్నపుడే రంజిత ఉదంతం జరిగింది. అక్కడనుంచి ఇతని జీవితం కష్టాలపాలు కావడం మొదలైంది. నాటకాలాడితే ఎవరైనా క్షమిస్తారేమో గాని శని భగవానుడు మాత్రం క్షమించడు.

2012, 2013 లలో శని తులారాశిలో ఇతని తృతీయంలో ఉచ్చస్థితిలో సంచారం సాగించాడు. అందుకే అన్ని బిరుదులు పదవులు వరించాయి. శని భగవానుడు ఇంతే, ఇచ్చేటప్పుడు గొప్పగా ఇస్తాడు. కోసేటపుడు దయాదాక్షిణ్యం లేకుండా కోసేస్తాడు.

ఎవరి జీవితమైనా సరే, గ్రహప్రభావం ప్రకారం ఖచ్చితంగా జరుగుతుంది. గీచిన గీత దాటదు. అర్ధం చేసుకుంటే అంతా అర్ధమౌతుంది.

ఆ తరువాత 2014 లో మొదలైన అర్దాష్టమశని అనేక వక్రత్వాల వల్ల 2017 ఫిబ్రవరి వరకూ సాగింది. ఇది ఇతనిని నానా బాధలూ పెట్టింది. కోర్టు కేసులు వెంటాడాయి. మీడియా వెంటాడింది. సమాజం ఛీ కొట్టింది. ఇదంతా మళ్ళీ శని ప్రభావమే.

ఆ తరువాత 2019 వరకూ ధనుస్సులో పంచమంలో శని సంచరించాడు. పంచమం బుద్ధిస్థానం. అప్పుడు ఇతని మనస్సు బాగా క్రుంగిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఎటు చూచినా అన్నీ సమస్యలు అడ్డంకులు కనిపిస్తున్నాయి. నిస్సహాయ స్థితిలో పడ్డాడు.

2020 ప్రారంభ్డంలో శని మకరరాశిలోకి షష్ఠరాశిలోకి ప్రవేశించాడు. గోచారశని 3, 6, 11 లలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు. కనుక 2022 వరకూ ఇతనికి మంచిసమయం జరుగుతున్నది. అందుకే ఇండియా నుంచి పారిపోయి ఎక్కడో తన ద్వీపంలో తానున్నాడు. రాజ్యం ఏలుతున్నాడు.

2022 ఏప్రిల్ నుంచీ ఇతనికి కష్టాలు మళ్ళీ మొదలౌతాయి. ఎందుకంటే అప్పుడు గోచారశని ఇతనికి సప్తమంలోకి వస్తాడు. మళ్ళీ వేధింపులు మొదలౌతాయి. ఇప్పుడు తానున్న చోటనుండి మళ్ళీ ఇంకొక చోటకు పోవలసి రావచ్చు. లేదా అరెస్ట్ కావచ్చు.

2025 లో శని మీనరాశిలో, ఇతనికి అష్టమం లోకి రావడం తోనే, ఇతని పరిస్థితి మళ్ళీ గందరగోళంలో పడుతుంది. ఆ పైన మూడేళ్ళు ఇతనికి చాలా కష్టకాలమే. మళ్ళీ నానా బాధలు పడతాడు.

ఈ విధంగా గోచారశని ఇతనిని ఎన్ని బాధలు పెట్టాడో మనం చూడవచ్చు. ఈ బాధలు తప్పాలంటే ఈ క్రింది సూచనలను ఇతను పాటించాలి.

1 . తను అవతార పురుషుడనని గప్పాలు కొట్టడం మానుకోవాలి. ఇదస్సలు నిజం కాదు.

2 . తనకు లేని శక్తులు ఉన్నట్టు చెప్పుకోవడం మానుకోవాలి. ఉన్నవి ఉన్నట్టు చెప్పాలి, నిజాలు మాట్లాడాలి.  మహిమలు మహత్యాల పేరిట చిన్నపిల్లలకు చీప్ ట్రిక్స్ నేర్పించి డబ్బులు చేసుకునే దరిద్రపు అలవాటు మానుకోవాలి. 

3 . అమ్మాయిల నుంచి దూరం ఉండాలి. లేదంటే వాళ్ళవల్లనే చివరకు ఈ సంస్థ మూతబడే ప్రమాదం ఉన్నది. పెద్దపెద్ద సంస్థలన్నీ 'డబ్బు - అమ్మాయిలు' ఈ రెంటివల్లనే దెబ్బ తిన్నాయన్న విషయం మరచిపోకూడదు.

4. అపవాదులు ఎక్కడ వచ్చే అవకాశం ఉన్నదో అక్కడ జాగ్రత్తపడాలి. జనం లోకి ఎక్కువగా చొచ్చుకుపోవడం మానుకోవాలి. లోకులతో ఎక్కువగా పెట్టుకుంటే పతనమే అన్న విషయం గ్రహించాలి. లోకాన్ని లోకులను ఏకమొత్తంగా ఎవ్వరూ ఉద్ధరించలేరన్న విషయం తెలుసుకోవాలి. ఈ పని అవతారపురుషుల వల్లనే కాలేదు. ఇక మామూలు సాధకుల వల్ల, స్వాముల వల్ల ఏమౌతుంది?

5. సాధనాశక్తి తగ్గకుండా చూసుకోవాలి. డబ్బు, పేరు ప్రతిష్టలు, అమ్మాయిలు, బంగారం ఇవన్నీ చుట్టూ చేరితే సాధన భ్రష్టు పడుతుంది. అది పోతే అన్నీ పోతాయి. కనుక ఈ విషయంలో ముఖ్యంగా ఇతను చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ సూచనలు పాటిస్తే, ఈ తరానికి ఇతను ఒక గురువు అవుతాడు. లేకుంటే పతనం తప్పదు.

తస్మాత్ జాగ్రత తమ్ముడూ !
read more " నిత్యానంద జాతకంలో గోచార గ్రహాల పాత్ర - కొన్ని ప్రశ్నలు "