“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, జులై 2020, శుక్రవారం

"ఆరు యోగోపనిషత్తులు 'ఈ-బుక్' విడుదలైంది


'పంచవటి పబ్లికేషన్సు' నుండి 'ఆరు యోగోపనిషత్తులు' అనే ఇంకొక మహత్తరమైన గ్రంధమును 'ఈ- బుక్' గా నేడు విడుదల చేస్తున్నాము.  ఇందులో హంసోపనిషత్, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్ అనబడే ఆరు యోగోపనిషత్తులకు నా వ్యాఖ్యానమును మీరు చదువవచ్చు. వీటిలో హంసోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్తులు శుక్లయజుర్వేదమునకు  చెందినవి కాగా, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్తులు కృష్ణయజుర్వేదమునకు చెందినవి
.

యధావిధిగా వీటన్నిటిలో అనేక రకములైన వైదికసాంప్రదాయబద్ధమైన యోగసాధనావిధానములు చెప్పబడినవి. మంత్ర, లయ, హఠ, రాజయోగములు, సృష్టిక్రమము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, జీవన్ముక్తస్థితి మొదలైన సంగతులు వివరించబడినవి.

ఈ పుస్తకంతో యోగోపనిషత్తుల వ్యాఖ్యాన పరంపర అయిపోతున్నది. ఇప్పటివరకూ 15 యోగోపనిషత్తులపైన నా వ్యాఖ్యానమును ప్రచురించాను. 30 ఏళ్ల క్రితం నా గురువులలో ఒకరైన నందానందస్వామివారు ఆదోనిలో నాతో అనిన మాటను నిజం చేశాను.

ఇకపైన రాబోయే మా గ్రంధములలో, యోగసాంప్రదాయమునకే చెందిన ఇతర ప్రాచీన ప్రామాణికగ్రంధములకు నా అనువాదమును వ్యాఖ్యానమును మీరు చదువవచ్చు. మా తరువాత పుస్తకంగా 'యోగయాజ్ఞవల్క్యము' రాబోతున్నదని చెప్పడానికి సంతోషిస్తూ ఈ లోపల ఈ ఆరు యోగోపనిషత్తులను చదివి వేదోపనిషత్తులలో యోగమును గురించి ఏమి చెప్పబడిందో గ్రహించి ఆనందించని ముముక్షువులైన చదువరులను కోరుతున్నాను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో ఎంతో సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు అఖిల, లలితలకు, పుస్తకంలోని బొమ్మలను వేసి ఇచ్చిన చిత్రకారిణి డా || నిఖిలకు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ కు, నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా త్వరలో ఇంగ్లీషు, తెలుగులలో  ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
read more " "ఆరు యోగోపనిషత్తులు 'ఈ-బుక్' విడుదలైంది "

28, జులై 2020, మంగళవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 2 (నిజమైన మహనీయులు - కుహనాగురువులు)

తెలుగువారికి ఉన్న అనేక దరిద్రాలలో ఒక పెద్ద దరిద్రమేమంటే, వారిలో పుట్టిన నిజమైన మహనీయులను వారస్సలు గుర్తించరు. ఎంతసేపూ ప్రక్కవారినో, లేదా ఎక్కడో పుట్టినవారినో తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. లేదా, దొంగ గురువులను, బూడిదబాబాలను, రాజకీయ బ్లాక్ మనీ స్వామీజీలను, మాయమాటలు చెప్పి మోసాలు చేసే కుహనాగురువులను కొలుస్తారు. అంతేగాని, నిజమైన యోగులను, మహానీయులను వారు ఎప్పటికీ అర్ధం చేసుకోలేరు. ఇది తెలుగుజాతికున్న పెద్ద శాపం.

మనం ఎన్నో పుస్తకాలను చదువుతాం. ఎన్నో లెక్చర్లిస్తాం. ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి, జీవన్ముక్తి గురించి, అవధూత స్థితి గురించి, కుండలిని గురించి ఊకదంపుడుగా ఎన్నో ఉపన్యాసాలిస్తాం. ఇండియాలో ఎవరిని కదిలించినా వేదాంతమే చెబుతారు. అన్నీ మన దగ్గరే ఉన్నాయంటారు. మనకు తెలియనిది ఏమీ లేదంటారు. కానీ, నిజంగా కుండలినీ జాగృతి కలిగినవాడు గాని, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు గానీ, జీవన్ముక్తుడైనవాడు గానీ మన ఎదురుగా వస్తే, ఛస్తే వాడిని ఒప్పుకోము. ఇది పరమసత్యం. దీనికి ఉదాహరణలుగా చరిత్రనుంచి ఎందరినో చూపించవచ్చు.

వేమనయోగి పొందిన జీవన్ముక్తస్థితి ఎవరికీ అక్కర్లేదు. ఆయనకు తెలిసిన బంగారం చేసే విద్య మాత్రం కావాలి. రమణ మహర్షి పొందిన జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు. ఆయన సమక్షంలో దొరికే శాంతి మాత్రం అప్పనంగా కావాలి, అదికూడా కాసేపు మాత్రమే. 'అదే శాంతి ఎల్లప్పుడూ నీతో ఉంటుందం'టే, బాబోయ్ నాకొద్దంటూ పారిపోతాం. శ్రీరామకృష్ణులు అవతారమని కొద్దిమందే నమ్ముతారు. ఎందుకంటే, ఆయన మనం కోరే గొంతెమ్మ కోరికలను వరాలుగా ఎప్పుడూ ఇవ్వడు గనుక. జిల్లెళ్ళమూడి అమ్మగారు పాపులర్ కాకపోవడానికి కారణం 'దురదృష్టం కూడా దైవానుగ్రహమే' అనిన సత్యాన్ని నిక్కచ్చిగా చెప్పడమే. అరవిందుల యోగాన్ని ఎవరూ పాటించకపోవడానికి కారణం కూడా అదే. ఆయన సూచించిన సాధనాస్థాయి కలలోకూడా ఎవరికీ అందదు గనుక, ఆయన భక్తులు కూడా ఆయన ఫోటోలకు దండాలు పెట్టి వరాలు కోరుకోవడం తప్ప ఆయన చెప్పిన సాధన మాత్రం ఎవ్వరూ చెయ్యడం లేదు.

నా దృష్టిలో సోకాల్డ్ ఆధ్యాత్మిక ప్రపంచమంతా మోసమే. అంతా దొంగలమయమే. భక్తులూ దొంగలే, వారి చవకబారు భక్తిని తమ స్వలాభంకోసం ప్రోత్సహిస్తున్న సోకాల్డ్ స్వామీజీలూ, గురువులూ అందరూ దొంగలే. మనకు గాల్లోంచి బూడిద తీసే బాబాలూ, హోమాలూ యజ్ఞాలూ వ్రతాలూ చేయించే దొంగస్వాములూ, 'ఈ మంత్రం జపించు ఈ కోరిక తీరుతుంది' అని చెప్పే కుహనా గురువులూ, తాయెత్తులు మొలత్రాళ్లు కట్టేవాళ్లూ, నెత్తిన చెయ్యిపెట్టి, వారికే లేని శక్తిని మీకు పాతం చేస్తామని డబ్బులు తీసుకునేవాళ్లూ, అవతారాలమని చెబుతూ డప్పు కొట్టుకునేవాళ్లూ, బ్రతికుండగానే పిరమిడ్లో పడుకోబెట్టి లేని పూర్వజన్మలను గుర్తుచేసేవాళ్ళూ  - ఇలాంటివాళ్లే నచ్చుతారు. మనం చవకబారు మనుషులం గనుక చవకబారు గురువులే మనకు నచ్చుతారు, దొరుకుతారు కూడా. తప్పేం లేదు. మనకు తగినవాళ్ళే మనకు దొరకడం ప్రకృతి నియమమే.

అసలు ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకేం కావాలో మనకే తెలియదు. దురాశతో, అడ్డమైన వరాలను కనిపించిన ప్రతివాడిదగ్గరా అప్పనంగా అడుక్కోవడం మాత్రమే మనకు తెలిసింది. భక్తులు అడుక్కుంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే అడుక్కోవడమే భక్తుల లక్షణం. కానీ ఈ సోకాల్డ్ స్వామీజీలూ గురువులూ అందరూ చేసే పనులు చూస్తుంటే చీదరాతిచీదర పుడుతోంది. వీళ్లంతా 'అడుక్కుండేవాడి దగ్గర గీక్కుండే రకాలు'. ఉన్న సత్యాన్ని ఉన్నట్లు చెప్పకుండా, భక్తుల చవకబారు కోరికలను, చవకబారు మనస్తత్వాలను పోషిస్తూ, కాకమ్మ కధలు చెబుతూ, పబ్బం గడుపుకుంటున్న నేటి గురువుల కంటే ఓషో లాంటి వాళ్లే బెటర్ అని నాకనిపిస్తుంది.

ఆధ్యాత్మికాన్ని కూడా లౌకికానికి ఉపయోగించుకునే నీచపుబుద్ధి పోనంతవరకూ, దేవుడిని అడ్డం పెట్టుకుని సాటి మానవుడిని మోసం చేసే దరిద్రపు బుద్ధి పోనంతవరకూ, మానవజాతికి ఈ దౌర్భాగ్యం తప్పదు. అంతవరకూ మనకు మొక్కుబడిపూజలూ, సామూహిక పారాయణాలూ, షిరిడీయాత్రలూ, అయ్యప్పదీక్షలే గతి. నిజమైన ఆధ్యాత్మికత మనకు ఎప్పటికీ అందదు గాక అందదు. ఈ డ్రామా అంతా ఎప్పటికీ ఇలాగే నడుస్తూ ఉంటుంది !

సరే, ఈ అరణ్యరోదన ఎప్పుడూ ఉండేదేలే  గాని, మన సబ్జెక్ట్ లోకి వద్దాం.

కుండలినీయోగం మీద వేలాది పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడబడితే అక్కడ ప్రతివాడూ కుండలినీ యోగం గురించి మాట్లాడేవాడే. చక్రాల గురించి, కుండలిని గురించి, యోగం గురించి దారినపోయే దానయ్య కూడా మాట్లాడే నీచస్థితి నేడు మన దేశంలోనే గాక ఇతరదేశాలలో కూడా ఉంది. కానీ, వీరిలో ఎవడికీ కూడా కుండలిని అంటే ప్రత్యక్షమైన అనుభవం లేదు. కానీ ఉందంటారు. అదే అసలైన వింత. కుండలిని గురించి పుస్తకాలలో ఉన్నదంతా నకిలీ సమాచారమేగాని నిజం కాదు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనే అక్కర్లేదు. ఆన్లైన్ క్లాసులు కోకొల్లలు. ఇంతా చేస్తే, చెప్పేవాడికీ అది తెలీదు, చేసేవాడికీ తెలీదు. ఇలాంటి పనికిమాలిన గోల చూచేనేమో, లైబ్రరీలకు లైబ్రరీలనే తగలబెట్టించాడు మాలిక్ కాఫర్.

ప్రపంచచరిత్రలో మనకు తెలిసి కుండలిని నిజంగా జాగృతమైన వాళ్ళు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. బయటకు రాకుండా అజ్ఞాతంగా ఉన్నవాళ్లు ఇంకా ఉండవచ్చు గాని, బయటకు వచ్చి సమాజానికి తెలిసింది అతి కొద్దిమందే.  వారు - శ్రీరామకృష్ణులు, వాసిష్ఠ గణపతిముని, పండిట్ గోపీకృష్ణ, యూజీ మాత్రమే. ఎందుకంటే వారి అనుభవాలు సత్యమైనవి. పుస్తకాలను చూచి వాళ్ళు, మాటలు చెప్పలేదు. ముందుగా అనుభవాలను పొంది, తరువాత వాటిని పుస్తకాలలో ఉన్న సమాచారంతో సరిపోల్చుకుని నిజమే అని గ్రహించారు. మిగిలిన లోకమంతా ఎవరో వ్రాసిన పుస్తకాలు చదువుకుంటూ, వాటిలో ఉన్నదానిని ప్రచారం చేసి సాటి మనుషులతో వ్యాపారం చేస్తూ, సమాజాన్ని మోసం చేస్తూ బ్రతుకుతున్నది. అదే నిజమైన యోగులకూ, మోసగాళ్ళకూ ఉన్న భేదం. 

విచిత్రమేమంటే, ఈ నలుగురూ ఇప్పటికీ అనామకంగానే మిగిలిపోయారు. వారి దారిని నిజంగా అనుసరిస్తున్న వారు లేరు. శ్రీరామకృష్ణులకు కోట్లాదిమంది భక్తులు ఉండవచ్చు. కానీ ఆయన నడచిన దారిలో నడిచినవారు ఇంకొకరు లేరు. మిగిలిన ముగ్గురికీ అయితే అనుచరులు కూడా లేరు. నిజమైన జ్ఞానుల, సిద్ధుల, యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారిని అనుసరించేవారంటూ ఎక్కడా ఉండరు. వారిది చవకబారు లోకులకు అందే స్థాయీ కాదు, వాళ్ళు అబద్ధాలు చెప్పి బ్రతకనూ బ్రతకరు. అందుకే జనం వారిని అర్ధం చేసుకోలేరు, అనుసరించలేరు. అదంతే !

యూజీ గారికి కుండలినీ జాగృతి కలిగినమాట వాస్తవం. ఆయన ఆత్మజ్ఞాని యన్నదీ వాస్తవమే. కానీ ఆయన ఆ పదాలను ఒప్పుకోలేదు. ఆత్మజ్ఞానికి తాను ఆత్మజ్ఞానినన్నది తెలియదు. తెలుస్తున్నంతవరకూ అతడు ఆత్మజ్ఞాని కాడు. అలాగే జీవన్ముక్తునికి తాను జీవన్ముక్తుడనని తెలియదు. తెలుస్తుంటే అతడింకా ఆ స్థితికి రాలేదని అర్ధం.

యూజీ వంటి గొప్ప యోగి తెలుగునేలలో పుట్టినా తెలుగువారికి నేటికీ ఆయనెవరో తెలీకపోవడం, ఆయన ఎక్కడో ఇటలీలో చనిపోవడం, అనామకంగా అలాంటి జీవన్ముక్తునికి అంతిమ సంస్కారం జరగడం, అదికూడా హిందీవాడైన మహేష్ భట్ చేతులమీదుగా జరగడం, 90 ఏళ్లపాటు ఈ నేలమీద మనందరి మధ్యనే ఆయన బ్రతికినప్పటికీ, ఈనాటికీ ఆయనేం చెప్పాడో, ఆయనకేం జరిగిందో మనకెవరికీ తెలీకపోవడం తెలుగుజాతి దౌర్భాగ్యం కాదూ మరి ?

అందుకేనేమో, 'I don't want even to fly over Andhra (ఆంధ్రా మీదనుంచి విమానంలో పోవడం కూడా నాకిష్టం లేదు) ' అనేవారు యూజీ. తెలుగువాడైన ఒక నిజమైన యోగి తెలుగువారిని అంతగా అసహ్యించుకున్నాడంటే అర్ధం చేసుకోండి, మన తెలుగువారి  ఆధ్యాత్మిక స్థాయి ఎంతటిదో?

(ఇంకా ఉంది)
read more " U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 2 (నిజమైన మహనీయులు - కుహనాగురువులు) "

12, జులై 2020, ఆదివారం

' యోగ కుండలినీ ఉపనిషత్ ' ప్రింట్ పుస్తకం విడుదలైంది






ఈరోజు నా 57 వ పుట్టినరోజు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ఇప్పటివరకూ నేను వ్రాసిన 'ఈ - బుక్స్' ప్రింట్ చేసే పని మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా మొదటగా ' యోగ కుండలినీ ఉపనిషత్ '  ప్రింట్ పుస్తకం ఈరోజు విడుదలైంది. లాక్ డౌన్ తర్వాత పంచవటి నుండి విడుదలౌతున్న మా మొదటి ప్రింట్ పుస్తకం ఇదే. హైదరాబాద్ లో మా ఇంటిలో అతి కొద్దిమంది సమక్షంలో ఈ పుస్తకాన్ని నిరాడంబరంగా విడుదల చేస్తున్నాం.

మిమ్మల్ని కూడా ఆహ్వానించలేదని నిరాశ చెందవద్దని నా మిగతా శిష్యులను కోరుతున్నాను. కరోనా జాగ్రత్తలలో భాగంగా ఈ ఫంక్షన్ పెద్దగా చేయడంలేదు. లాక్ డౌన్ అయిపోయాక మళ్ళీ మన రిట్రీట్స్ యధావిధిగా జరుగుతాయి. అంతవరకు ఓపికపట్టండి.

ఇకమీద, లాక్ డౌన్ సమయంలో నేను వ్రాసిన మిగతా పుస్తకాలన్నీ ప్రింట్ బుక్స్ గా వరుసగా లభిస్తాయి. లభించేది google play books నుంచే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా !
read more " ' యోగ కుండలినీ ఉపనిషత్ ' ప్రింట్ పుస్తకం విడుదలైంది "

11, జులై 2020, శనివారం

మీ మీటింగులో ఏం మాట్లాడుకుంటారు?

'ప్రతివారం మీరు పెట్టుకునే ఆన్లైన్ మీటింగులలో ఏం మాట్లాడుకుంటారు? అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి?' అని ఒక శిష్యురాలు ఈ మధ్యనే అడిగింది.

'చాలా సింపుల్. కాసేపు మా గురువుగారు ఏడుస్తారు. తరువాత మేమేడుస్తాం. అప్పుడాయన నవ్వుతాడు. అదిచూచి మేమూ నవ్వుతాం. అందరం అలా కాసేపు నవ్వుకుని మీటింగ్ ముగిస్తాం. అని చెప్పు' అన్నాను.

'అదేంటి? అలా చెప్పనా నిజంగా?' అడిగింది.

'అవును. అలాగే చెప్పు. జరిగేది అదేగా?' అన్నాను.

'బాగోదేమో?' అంది.

'ఆ అడిగేవారికి తెలిసిన ప్రపంచంలో మాత్రం ఆ రెండుగాక ఇంకేమున్నాయి గనుక?' అని ముగించాను.
read more " మీ మీటింగులో ఏం మాట్లాడుకుంటారు? "

9, జులై 2020, గురువారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis ( A real Jnani)

ప్రపంచం మొత్తానికీ ఎదురు తిరిగి 'గో టు హెల్' అని అనగలిగిన తెలుగువాళ్ళు నాకు తెలిసి ఇప్పటివరకూ చరిత్రలో ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు గుడిపాటి వెంకటచలం. మరొకరు - ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి అనబడే యూజి. వీరిలో చలం గురించి ఇంతకుముందు వ్రాశాను. ఆయనొక కవి, స్వప్నికుడు, ప్రేమికుడు, డబ్బుకు, కుహనా మానవ సంబంధాలకు, సమాజపు కట్టుబాట్లకు, సంకెళ్లకు లొంగని తీవ్రవాది. యూజీ ఏమో 'అసలు మనసే లేదు', 'నువ్వు లేకుండా పోతేగాని నువ్వుండవు' పొమ్మన్న తీవ్రజ్ఞాని. చలం గురించి తెలుగువాళ్ళకు తప్ప వేరెవరికీ పెద్దగా తెలీదు. యూజీ గురించి ప్రపంచమంతా తెలుసు. ఆఫ్ కోర్స్, ఉన్నతమైన ఆలోచనలంటే ఏమిటో తెలియని నేటి చవకబారు యూత్ కి  వీరిద్దరూ తెలీదనుకోండి. అది వేరే సంగతి !

ఇద్దరూ తెలుగువాళ్లవడం ఒక వింతయితే, ఇద్దరూ కృష్ణాజిల్లా బ్రాహ్మలే కావడం ఇంకొక విచిత్రం. చలం వల్లూరిపాలెంలో పుడితే, యూజీ బందర్లో పుట్టాడు. ఇద్దరికీ రమణమహర్షితో సంబంధం ఉండటం, ఇద్దరూ జ్ఞానమార్గంలో ప్రయాణించడం
ఇంకొక విచిత్రం. అయితే, చలం జ్ఞానసిద్ధిని పొందలేక పోయాడు. యూజీ పొందాడని అంటారు.

చలం 1894 లో పుట్టి 1979 లో అరుణాచలంలో పోతే, యూజీ 1918 లో పుట్టి 2007 లో ఇటలీలో పోయాడు. ఇద్దరికీ సినిమారంగంతో సంబంధాలున్నాయి. చలం స్వయంగా 'మాలపిల్ల' సినిమాకు మాటలు రాస్తే, సినిమా ప్రముఖులైన మహేష్ భట్, పర్వీన్ బాబీలు యూజీకి వీరశిష్యులు. చలమూ, యూజీ ఇద్దరూ చివరకు అనామకంగానే పోయారు. ఇద్దరివీ ఆధ్యాత్మికపరంగా చాలా తీవ్రమైన భావాలు, కాకపోతే, చలం ఇంకా ఒక అన్వేషకునిగానే మరణించాడు. యూజీ జ్ఞానసిద్ధిని పొంది తనువు చాలించాడు. వీరిద్దరి జాతకాలలో ఈ సూచనలు చాలా స్పష్టంగా గోచరిస్తాయి.

నిన్నటినుంచీ ఎందుకో యూజీని ఎక్కువగా చదువుతున్నా. ఈ రోజు ఆయన జాతకం వేద్దామని చూస్తే, ఈరోజే ఆయన పుట్టినరోజని తెలిసింది. ఇలాంటి కాకతాళీయ సంఘటనలు నా జీవితంలో మామూలే కావడంతో పెద్దగా ఆశ్చర్యమేమీ కలగలేదు గాని, మైండులేని యూజీగారితో నాకేంటి ట్యూనింగ్? అని మాత్రం ఆశ్చర్యం కలిగింది. ఆయనంత హైలెవల్ పిచ్చి మనకు లేకపోయినా, కొద్దో గొప్పో మనకూ ఉందిగా పిచ్చి అని నాకు నేనే సర్దుకున్నా.

రమణమహర్షి, రజనీష్, జిడ్డు, యూజీ - వీళ్ళ మార్గం అటూ ఇటూగా ఒకటే. కాకపోతే, ప్రస్తుతానికి రమణమహర్షిని కాసేపు ప్రక్కన ఉంచుదాం. ఎందుకంటే, ఆయనలో వివాదాస్పదమైన అంశాలు ఏవీ లేవు. వివాదాలకు ఆయన అతీతుడు. పోతే, మిగిలిన ముగ్గురిలో నేను యూజీకే ఉన్నతస్థానాన్నిస్తాను. దానికి కొన్ని కారణాలున్నాయి.

రజనీష్ లోకాన్ని మోసం చేసినట్లు యూజీ చెయ్యలేదు. రజనీష్ మనుషుల్ని వాడుకున్నట్లు  యూజీ వాడుకోలేదు. రజనీష్ బోధించినట్లుగా తనకు అనుభవంలో లేనివాటిని యూజీ బోధించలేదు. ఒక ఇంటర్వ్యూలో రజనీష్ గురించి మాట్లాడుతూ యూజీ ఇలా అన్నాడు - 'రజనీష్ ఒక పింప్. అబ్బాయిల్ని అమ్మాయిల్ని హాయిగా ఎంజాయ్ చెయ్యమని రజనీష్ చెప్పేవాడు. దానికి తాంత్రికసెక్స్ అని పేరుపెట్టాడు. ఇద్దరిదగ్గరా డబ్బులు మాత్రం తను తీసుకునేవాడు. అలాంటివాడిని ఇంకేమనాలి?'

ఈ వీడియో యూట్యూబ్ లో ఉంది చూడండి.

'సత్యసాయిబాబా గురించి మీ అభిప్రాయం ఏమిటి?' అని యూజీ ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు.

'అతనొక క్రిమినల్' అని యూజీ జవాబిచ్చాడు.

ఈ వీడియో కూడా యూట్యూబులో ఉంది చూడండి. 

జిడ్డు కృష్ణమూర్తిని చాలాకాలంపాటు యూజీ అనుసరించాడు. కానీ తరువాత జిడ్డును వదిలేశాడు. దానికి చాలా కారణాలున్నాయి. తన స్నేహితుడైన రాజగోపాల్ భార్య రోసలిన్ తో జిడ్డు రాసలీలలు నడిపాడని యూజీ అన్నాడు. జిడ్డుతో చాలా దగ్గరగా ఎన్నోఏళ్ళు ఉన్నాడు గనుక యూజీకి ఇంసైడ్ స్టోరీలు తెలుసు. విషయం తెలిసికూడా రాజగోపాల్ నోర్మూసుకోవడానికి కారణం, ఆ సంస్థకున్న వందల కోట్లాదిరూపాయల విలువైన రియల్ ఎస్టేటూ, ఆస్తులూ కారణాలని కూడా ఆయనన్నాడు.

అదే జిడ్డు, సెక్స్ కు వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చేవాడు. ఒక సందర్భంలో అమెరికాలోని యూత్ తో మాట్లాడుతూ జిడ్డు' అసలు మీరెందుకు సెక్స్ ను కోరుకుంటారు? మీ స్నేహితురాలి చేతిని ఊరకే అలా పట్టుకుని శాంతంగా ఉండలేరా మీరు?' అన్నాడని యూజీ అనేవాడు. ఇది నిజమే. జిడ్డు చెప్పిన 'చాయిస్ లెస్ అవేర్ నెస్' అనేది పెద్ద 'బుల్ షిట్' అని, యూజీ అనేవాడు.

ఈ వీడియో కూడా  యూట్యూబ్ లో ఉంది చూడండి.

ఏమీ చెయ్యనక్కర్లేదని ఒకపక్కన చెబుతూ ఇంకోపక్కన యోగాసనాలను జిడ్డు అభ్యసించేవాడు. తన చర్మం మృదువుగా కనిపించడానికి కేరళనుంచి ప్రతినెలా తెప్పించే నూనెతో మసాజ్ చేయించుకునేవాడని యూజీ చెప్పాడు. ఇలాంటి హిపొక్రసీలు జిడ్డులో చాలా ఉన్నాయి.

జిడ్డులోని ఇలాంటి హిపోక్రసీని భరించలేని యూజీ క్రమేణా జిడ్డుకు దూరంగా జరిగాడు. తరువాత, యూజీకి హఠాత్తుగా 'కెలామిటి' అనే ఒక గడ్డుకాలం ఎదురైంది. ఆ సమయంలో ఆయన మనస్సు పూర్తిగా ధ్వంసమైపోయిందని, అప్పటినుంచీ ఆయన గాలిపటంలాగా దేశాలు తిరుగుతూ, తనను చూడటానికి వచ్చినవారితో మాట్లాడుతూ, హిపోక్రసీ ఏమాత్రం లేని ఒక సహజమానవుని లాగా బ్రతికాడని  అంటారు. ఈ 'కెలామిటి' అన్న స్థితినే మనోనాశమని అంటారు. ఒక మనిషి ప్రపంచాన్ని చూచే తీరును, ప్రపంచంతో వ్యవహరించే తీరును మనోనాశమనేది పూర్తిగా మార్చిపారేస్తుంది. ఆ స్థితినుండి బయటపడిన మనిషి జ్ఞానిగా రూపొందుతాడు. అటువంటి జ్ఞానం యూజీకి కలిగిందని ఆయన అనుచరులు నమ్ముతారు.

ఎవరి అనుచరులైనా, వారి గురువు చాలా గొప్పవాడనే అంటారు. కానీ, ఊరకే అలా అంటే సరిపోదు. దానికి రుజువులు ఆ గురువుల జీవితాలలో కనిపించాలి. ఈ కోణంలో చూచినప్పుడు, రజనీష్, జిడ్డుల జీవితాలతో పోల్చుకుంటే యూజీ జీవితం చాలా స్వచ్చంగానే గడిచింది. ఆయనతో చాలాకాలం క్లోస్ గా తిరిగిన ఒకప్పటి బాలీవుడ్ గ్లామర్ డాల్ పర్వీన్ బాబీ ఇలా అంటుంది.

'నా జీవితంలో ఎంతోమందిని నేను చూచాను. కానీ ఎదుటి మనిషిని తన స్వార్ధానికి ఏమాత్రమూ వాడుకోకుండా ఉన్న మనిషిని ఒక్క యూజీని తప్ప ఇంకెవరినీ చూడలేదు. అంత మంచిమనిషిని కూడా చూడలేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, నాతో ఎడ్వాంటేజ్ తీసుకోవడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు'.

యూజీలో కాంప్రమైజ్ అనేది లేదు. ఉన్న సత్యాన్ని ముఖం పగలగొట్టినట్లు చెబుతాడు. 'నీకు చేతనైతే ఆచరించు. లేదా చావు' అంటాడు. యూజీ జీవితంలో రహస్య కోణాలు కూడా లేవు. అంత ఓపెన్ గా బ్రతికిన మనిషిని ఇంతవరకూ తాము చూడలేదని ఎంతోమంది అన్నారు.

'లోకానికి మీరిచ్చే సందేశం ఏమిటి?' అని ఒక సమయంలో యూజీని అడిగారు.

దానికాయన ఇలా అన్నాడు.

'ఏమీలేదు. లోకం ఎలా పోతే నాకెందుకు? నా భావాలను లోకం అనుసరించకపోతేనే మేలు. లోకం చావనీ, నాకు సంబంధం లేదు'.

మహేష్ భట్ ఇలా అంటాడు.

'నేను మానసికంగా ఎంతో నలిగిపోయినస్థితిలో రజనీష్ దగ్గరకు వెళ్లాను. 'నాకు చాలా భయం వేస్తోంది. దేవుడున్నాడో లేడో నాకు తెలియడం లేదు. నాకు ఆసరాగా ఎవరున్నారు?'. అనడిగాను.

దానికి రజనీష్ ఇలా అన్నాడు. ' జీసస్ కూడా తన చివరిక్షణాలలో దేవుని ఉనికిని సంశయించాడు. సిలువమీద ఉన్నపుడు 'దేవా ! నా చెయ్యిని ఎందుకు వదిలేశావు? అని అరిచాడు. వెంటనే దేవుడిని తన పక్కనే చూచాడు. అదేవిధమైన స్థితిలో నీవున్నావు. ఇప్పుడు నిన్ను రక్షించడానికి నీ ప్రక్కన నేనున్నాను.'   

మనుషులకు ఏది కావాలో అది రజనీష్ ఇచ్చేవాడు. నీకు కేకు కావాలంటే ఆయన కేకునిచ్చేవాడు. అలా ఇస్తూ ఇస్తూ తన ట్రాప్ లోకి మనుషులను లాక్కునేవాడు. మనుషుల బలహీనతలతో రజనీష్ ఆడుకున్నాడు.  కానీ యూజీ అలా కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా సత్యాన్ని ఉన్నదున్నట్లుగా ఆయన చెప్పేవాడు. తరువాతి కాలంలో, నేను యూజీని కలసినప్పుడు గురువు గురించి చెబుతూ ఆయనిలా అన్నాడు.

'నిజమైన గురువనేవాడు ఎక్కడైనా ఉంటే, తన నుంచి కూడా నిన్ను విముక్తుడిని చేస్తాడు'.

నా దృష్టిలో యూజీ ఒక గొప్ప జ్ఞాని. మైండ్ లెస్ స్థితిని యోగంలో అమనస్కస్థితి అంటారు. అది జ్ఞానసిద్ధికి సూచిక. యూజీ అలాంటి స్థితిని పొందాడని నా ఊహ. అయితే, అందరు నిజమైన జ్ఞానులలాగానే ఆయనకూడా పెద్దగా లోకగౌరవాన్ని పొందకుండానే మరణించాడు. అయితే, అలాంటి మనుషులు గౌరవాన్ని అగౌరవాన్ని పెద్దగా లెక్కచెయ్యరనుకోండి. ఆయన జాతకాన్ని, జీవితాన్ని వచ్చే పోస్ట్ లలో చూద్దాం.

( ఇంకా ఉంది )
read more " U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis ( A real Jnani) "