“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, ఆగస్టు 2011, ఆదివారం

ప్రజా ఉద్యమాలు -- శనిగ్రహ ప్రభావం

జ్యోతిర్విజ్ఞానంలో శనిగ్రహ పాత్ర చాలా గొప్పది. అందరూ శనిని తిట్టుకుంటారు. కాని శనిగ్రహం భగవంతుని ధర్మ స్వరూపం అన్న విషయం తెలుసుకోలేరు. ధర్మానికి తనా మనా అన్న భేదం లేదు. ఎవరైనా సరే ధర్మం తప్పితే దానికి తగ్గ శిక్ష విధించడమే ఈ సృష్టిలో శనిగ్రహం యొక్క పాత్ర. 

మనుషులు శనిగ్రహాన్ని తిట్టుకోవడం మానాలి. గ్రహాలు దేవతా స్వరూపాలు. వాళ్ళను వాడు వీడు అని సంబోధించడం, " శనిగాడు" లాంటి మాటలు వాడటం వల్లకూడా చెడుకర్మ మెడకు పాములా  చుట్టుకుంటుందని మర్చిపోరాదు. తాము గతంలో చేసిన తప్పులకే ఇప్పుడు శిక్షారూపంలో బాధలు పడుతున్నామన్న సత్యాన్ని జనులు గ్రహించాలి. అంతేకాదు శనికి తైలాభిషేకాలూ  పూజలూ చేస్తూ నిత్యజీవితంలో మాత్రం  మళ్ళీ అవే తప్పుడుపనులు చేస్తున్న రాజకీయులూ వ్యాపారులూ అవినీతిఅధికారులూ తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.మీ దొంగపూజలవల్ల గ్రహాలు ఏమాత్రం లొంగవు. మీరు భూమ్మీద ఉన్న ఏ న్యాయవ్యవస్థ కళ్ళైనా కప్పవచ్చు.కాని ధర్మంకళ్ళు కప్పలేరన్న విషయం గుర్తుంచుకోవాలి. ధర్మస్వరూపం అయిన శనిగ్రహం ఎవరినీ ఒదిలిపెట్టదు. ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో శనిభగవానునికి తెలిసినట్లు ఎవరికీ తెలియదు. 

గ్రహాలు సృష్టిని నడిపించే దైవీశక్తులు. మన నిత్యజీవితంలో నడవడికలో ధర్మాన్ని అనుసరించకుండా చేసే దొంగపూజలవల్ల ఏమీ ఉపయోగంలేదన్న విషయం ముఖ్యంగా మనం మర్చిపోరాదు. అధర్మపరులకూ అవినీతిపరులకూ తాత్కాలికంగా అంతా  బ్రహ్మాండంగా సాగుతున్నట్లు కనపడవచ్చు. కాని వారిసమయం వచ్చినపుడు వారుపడే బాధలు పరమభయంకరంగా ఉంటాయి. గ్రహాలు పూజలకు లొంగవన్న విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మన నిత్యజీవితంలో మార్పురాని ఉత్తపూజలవల్ల ప్రయోజనంలేదనీ మనం అర్ధం చేసుకోవాలి.

శని భగవానుడు సామాన్య ప్రజలకు కారకుడు. సహజరాశిచక్రంలో శని బలాన్ని పుంజుకున్న ప్రతిసారీ ప్రజా ఉద్యమాలు జరగటం ప్రత్యక్ష సత్యం. ఇది ఎలా జరుగుతుందో కొన్ని ఉదాహరణలద్వారా బాగా అర్ధం చేసుకోవచ్చు.

నవంబర్ 2011 లో శని భగవానుడు తులారాశిలో ప్రవేశించి ఉచ్చస్తితిలోకి రాబోతున్నాడు. అంటే బలాన్ని పుంజుకుంటున్నాడు. ప్రస్తుతం కొన్నినెలలుగా అనేక ప్రజాఉద్యమాలు చూస్తున్నాం. లిబ్యాలో ఈజిప్టులో  ఉద్యమాలు దీనిఫలితమే. అంతేకాదు, నేడు అవినీతికి వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్న " అన్నా ఉద్యమమూ " దీని ఫలితమే. వీటన్నిటిలో సామాన్యపౌరులే ప్రముఖపాత్ర పోషిస్తున్నారన్న విషయం గమనిస్తే మామూలుమనుషుల ప్రతినిధి అయిన శనిగ్రహపాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఉపవాసం ఉండటమూ, ఒకచోట బంధింపబడటమూ ( అది ఐచ్చికంగా కూడా కావచ్చు), ధర్మంకోసం పోరాటమూ, వృద్ధునిదీక్షా, వైద్యపరీక్షలూ  ఇవన్నీ శనిగ్రహ కారకత్వాలేనన్న విషయం "అన్నాహజారే"  సత్యాగ్రహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నాదీక్ష వల్ల, ప్రజాభిప్రాయం విజయం సాధించడంవెనుక బలం పుంజుకుంటున్న శనిగ్రహం కనిపిస్తుంది.

ప్రజావిజయాలలో విప్లవాలలో శనిగ్రహపాత్ర కొంచం చూద్దాం. ప్రతి 30 ఏళ్లకొకసారి రాశిచక్రాన్ని చుట్టివచ్చి తులారాశిలో ఉచ్చస్తితికి శనిభగవానుడు వస్తాడని, అందులో రెండున్నరేళ్ళు ఉంటాడనీ మనకు తెలుసు. గతంలో శనిభగవానుడు తులారాశిలో ఉచ్చస్తితిలో ఉన్న సంవత్సరాలు అప్పుడు జరిగిన సంఘటనలు ఇక్కడ చూద్దాం.


2011 -- విజయవంతమైన అన్నాదీక్షతో ప్రజాగ్రహానికి తలొగ్గిన భారతప్రభుత్వం ఆయన డిమాండ్లను  ఆమోదించింది. 2012 లో శని పూర్తిగా ఉచ్చస్తితికి వచ్చినపుడు జనలోక్ పాల్  బిల్లుకు పూర్తివిజయం లభిస్తుంది అనడానికి ఇదొక సంకేతం.

1982 -- విసిగిపోయిన ప్రజలకోసం ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశంపార్టీ స్థాపన జరిగింది. తర్వాత ఎన్నికల్లో ఘనవిజయంతో ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరధం పట్టారు. ఆ తరువాత ఆ పార్టీలోనూ అవినీతి ప్రవేశించి తన పూర్వవైభవాన్ని కోల్పోయి పార్టీ పతనమైంది. అది వేరేసంగతి.

1952 -- భారత దేశపు మొదటి ఎన్నికలు జరిగాయి. దేశమంతటా స్వేచ్చ కోసం నవజీవనం కోసం ప్రజల ఎదురుచూపులు, ఎల్లెడలా ప్రజల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

సింగపూర్ లో CPIB (Corrupt Practices Investigation Bureau) మొదలు పెట్టబడింది. ఈరోజు ప్రపంచంలోనే అతితక్కువ అవినీతి ఉన్న దేశాలలో ఒకటిగా సింగపూర్ ( మిగతావి డెన్మార్క్, న్యుజీలాండ్) ఎదిగింది. Transparency International ఇచ్చిన కితాబులే అందుకు నిదర్శనం.

1919 -- జలియన్ వాలాబాగ్ మారణకాండలో వందలాది సామాన్యజనం హత్య చేయబడ్డారు. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాగ్రహజ్వాల ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ( ఈ సమయానికి శని తులారాశిలోకి ప్రవేశించలేదు. కాని దగ్గరగా ఉన్నాడు.)

1923 --జనాకర్షణ కలిగిన రంగస్తలనటుడు, నాయకుడూ అయిన NTR , గాయకుడు ముకేష్, నటుడు దేవానంద్, సామాన్యజనానికి యోగాన్ని చేరువ చేసిన "బీహార్ స్కూల్ ఆఫ్ యోగా" వ్యవస్థాపకుడు స్వామి సత్యానందసరస్వతి మొదలైనవారి జననం జరిగింది. వీరందరూ సామాన్యునికి చేరువ అయినవారే అన్నది గమనించదగ్గ అంశం.

1893 -- ప్రపంచ వ్యాప్తంగా భారతీయవేదాంతం యొక్క మహత్యాన్ని ఎలుగెత్తి చాటి " India is the Guru of the world " అని నిరూపించిన వివేకానందుని ప్రధమప్రసంగం చికాగో పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో ఇవ్వబడింది. భారతదేశపు సనాతనధర్మానికి స్వామి తెచ్చిన గుర్తింపుతో భారతదేశపు ప్రజలందరిలో ఆత్మవిశ్వాసమూ ధైర్యమూ గర్వమూ కలిగాయి. అంతేకాదు, భారతదేశపు మహత్తర యోగవిజ్ఞానమైన క్రియాయోగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహనీయుడు "పరమహంస యోగానంద" ఈ సంవత్సరంలోనే జన్మించారు. ఈనాడు సామాన్యునికి కూడా యోగా గురించీ మన హిందూధర్మం గురించీ ఎంతోకొంత తెలుసంటే వీరే దానికి కారకులు.

1863 -- భారతదేశ పునరుజ్జీవనానికి ఆద్యుడైన శ్రీరామకృష్ణుని ప్రత్యక్షశిష్యులు స్వామివివేకానంద, స్వామిబ్రహ్మానంద, స్వామితురీయానంద, స్వామి రామక్రిష్ణానంద మొదలైన 16 గురు మహాసిద్ధుల జననం జరిగింది. ఈ మహనీయుల పుట్టుకతో ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మపునరుజ్జీవనం ప్రారంభమైంది. వీరిలో ఒకరైన స్వామి అఖండానంద శిష్యుడే-- RSS రెండవనేత అయిన "పూజ్యగురూజీ" మాధవసదాశివ గోల్వాల్కర్ అని చాలామందికి తెలియదు. ఇదే సంవత్సరంలో అమెరికాలో సివిల్ వార్ జరిగింది. ఆ సందర్భంగా బానిసలకు స్వేచ్చనిస్తూ అబ్రహాం లింకన్ " Emancipation Proclamation " ఇవ్వడం జరిగింది. ఇదీ ప్రజావిజయమే.

1833 -- Government of India Act, Abolition of slavery Act అనే ముఖ్యమైన చట్టాలు బ్రిటిష్ పార్లమెంట్ లో చేయబడ్డాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వల్ల Governor General of India పోస్ట్ సృష్టించబడింది. Abolition of slavery Act వల్ల బ్రిటిష్ రాజ్యం ఉన్న అన్ని దేశాల్లో బానిసత్వం నిర్మూలిస్తూ చట్టం చెయ్యబడింది. అదే సమయంలో మనదేశంలో భయంకరమైన క్షామం తాండవించింది. కలరా కరాళనృత్యం చేసింది. గుంటూరు లో ఈ ఏడాదివచ్చిన దారుణమైన కరువువల్ల కొన్ని వేలమంది తుడిచిపెట్టుకుపోయారని చెబుతారు. దీనినే "డొక్కల కరువు" అంటారు. దీని ప్రభావంవల్ల ఒంగోలునుంచి మచిలీపట్నం వరకూ, ఆకలితో, కలరాతో చచ్చిపోయిన వారి శవాలు ఎక్కడచూసినా గుట్టలుగా పేరుకుపోయాయి అంటారు. 

1835 -- "లార్డ్ మెకాలే మినిట్స్" వల్ల దేశచరిత్రనూ, విద్యారంగాన్నీ, జనుల జీవనవిధానాన్నీ తీవ్రంగా ప్రభావితంచేసిన ఇంగ్లీష్ విద్య మన దేశంలో కాలుమోపింది. లింక్ లాగ్వేజ్ అయిన సంస్కృతం మరుగునపడింది. ఇంగ్లీష్ వల్లే ఈనాడు మనం చైనా వంటి ఇతరదేశాలకంటే కొన్నిరంగాల్లో ముందున్నాం. కాని సంస్కృతం మరచిపోవడంవల్ల మన ధార్మికమూలగ్రంధాలను చదువలేకపోతున్నాం.

ఇలా వ్రాస్తూపోతే మనదేశంలోనూ ఇతరదేశాల్లోనూ  ఎన్నో ఎన్నెన్నో ఉదంతాలున్నాయి. ఒక్కటిమాత్రం స్పష్టం. భూమ్మీద జరుగుతున్న ప్రతిసంఘటన వెనుకా మనకు కనిపించని కారణాలూ శక్తులూ పాత్రపోషణ చేస్తున్నాయన్నది వాస్తవం. ఇందులో శనిభగవానుని పాత్రవరకూ కొద్దిగా మనం చూడగలిగాం. ఇలాగే మిగతాగ్రహాల పాత్రనుకూడా అర్ధం చేసుకోగలిగితే, ప్రపంచమనే స్టేజీ మీద జరుగుతున్న నాటకం మొత్తం అర్ధం అవుతుంది. పగళ్ళూ, రాత్రులూ, ఋతువులూ, ఎలా వరుసగా రిపీట్ అవుతున్నాయో అలాగే ప్రజాజీవితంలోనూ కొన్ని రిథమ్స్ ఉన్నాయి. నిర్దిష్టమైన కొన్నేళ్ళకు అవేఅవే  సంఘటనలు రకరకాల రూపాల్లో జరుగుతాయి. ప్రతిసారీ అవేసంఘటనలు జరుగకపోయినా, వాటి వెనుకనున్న theme మాత్రం అదేఉంటుంది.  అవి తెలుసుకుంటే భవిష్యత్తును స్తూలంగా దర్శించడం సాధ్యమే. బహుశా ఇలాగేనేమో బ్రహ్మంగారూ, నోస్త్రాడేమాస్ మొదలైనవారు భవిష్యత్తును చూడగలిగారు.

పై సంఘటనలను చదివినవారికి కొన్ని అనుమానాలు రావచ్చు. ఆ సంఘటనల్లో ప్రతిసారీ ప్రజలకు మంచి జరగలేదు. కొన్నిసార్లు చెడుకూడా జరిగింది. పైగా వాటిల్లో మతమూ ఉంది, రాజకీయాలూ ఉన్నాయి, ప్రజాజీవితమూ ఉంది, పరిపాలనా ఉంది, ప్రజాక్షయమూ ఉంది. శనిప్రభావం ఇన్నిరకాలుగా ఉంటుందా?  అన్న సందేహం రావచ్చు. దానికి ఒకటే సమాధానం. శనిప్రభావం రకరకాలుగా ఉంటుంది. ఆయన ప్రభావంవల్ల  ధర్మం అనేది అన్ని రంగాల్లోనూ స్తాపించబడుతుంది. అది మతం విషయంలో ఒకరకంగా జరుగుతుంది. రాజకీయాల్లో ఒకరకంగా జరుగుతుంది. ప్రజాజీవితంలో ఇంకొకరకంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. 

కరువుకాటకాల్లో వేలమంది చనిపోవడం ప్రజలకు మంచి ఎలా అవుతుంది? అనికూడా అనుమానం రావచ్చు. చెడు అనేది సమాజంలో భరించలేనంత స్థాయికి చేరినప్పుడు ప్రజానిర్మూలనం తప్పదు. అప్పుడు ప్రకృతిభీభత్సాలు జరుగుతాయి. మనిషి చెయ్యి దాటిపోయినప్పుడు ప్రకృతే స్టీరింగ్ తీసుకుంటుంది. అప్పుడు అవసరమైతే వేలలక్షల సంఖ్యలో జనాన్ని నిర్మూలనం చెయ్యడంద్వారా తిరిగి సమతుల్యత స్తాపించబడుతుంది. మానవులకు తెలివిఉంటే అంతవరకూ తెచ్చుకోకుండా ఉండాలి. ప్రక్రుతి మనల్ని క్షమించే లిమిట్ లో మనం ఉన్నంతవరకూ పరవాలేదు. అది దాటితేమాత్రం జరిగే ఘోరాలు దారుణంగా ఉంటాయి. మానవుడు రాక్షసస్థాయికి దిగజారినప్పుడు ప్రకృతే మహిషాసురమర్ధినిగా మారి  అతన్ని ముక్కలు చేస్తుంది.  ఈ మధ్యలో జరిగిన ఒకనాయకుని ఉదంతమే అందుకు నిదర్శనం.

విశ్వప్రణాళిక బహుసూక్ష్మంగా విచిత్రంగా ఉంటుంది. శనిభగవానుని ధర్మస్థాపనా విధానాలుకూడా బహుచిత్రంగా ఉంటాయి. ఆయా సమయాలకు ఆయన మీదఉన్న గురువు, రాహువు, కుజుడు ఇత్యాది మిగతా ముఖ్యగ్రహాల ప్రభావాన్నిబట్టి అప్పటి సంఘటనలు జరుగుతాయి. వీటినుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మన అధికారమూ, హోదాలూ, డబ్బూ, పలుకుబడీ ఏవీ ఆ సమయానికి రక్షించవు.

ఏదేమైనా, శని భగవానుడు మంచిబలంగా ఉండబోయే వచ్చే మూడేళ్ళలో ప్రజాజీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే సంఘటనలు దండిగా జరుగబోతున్నాయని చెప్పవచ్చు.
read more " ప్రజా ఉద్యమాలు -- శనిగ్రహ ప్రభావం "

22, ఆగస్టు 2011, సోమవారం

కృష్ణస్తు భగవాన్ స్వయం

భగవంతుని  అవతారాలలో  కెల్లా నీకిష్టమైన అవతారం ఏది? అని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే తడుముకోకుండా వెంటనే నేను సమాధానం చెప్పగలను-- కృష్ణావతారం -- అని. నా జవాబు వెనుక కొన్ని కారణాలున్నాయి. 

పుణ్యభూమి అయిన మన దేశంలో అనేక మంది మహనీయులూ సిద్దులూ యోగులూ ప్రతి తరంలోనూ జన్మించారు. జన్మిస్తూనే ఉంటారు. అంతే గాక భగవంతుని అవతారాలు కూడా అనేకం మన దేశంలో వచ్చాయి. ఎన్ని భగవద్విభూతులు అవతారాలుగా వచ్చినప్పటికీ కృష్ణావతారం వంటి అవతారం మాత్రం ఇంకొకటి రాలేదు, రాబోదు అని మనం విశ్వసిస్తాం. మిగిలిన అవతారాలు అన్నీ అంశావతారాలు అనీ, కృష్ణుడొక్కడే పూర్ణావతారం అనీ మన  పురాణాలు చెబుతున్నాయి. 

శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.

శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం
ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి  యుగేయుగే  [1.3.28 ]

[ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే. కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే. ధర్మ  విరోదులచేత లోకం వ్యాకులం చెందినపుడు రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు]

కొన్ని అవతారాలలో  పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా  భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది. 

కృష్ణావతారం ప్రత్యేకతలు ఏమిటీ అంటే :--

1 .ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో లీలా వినోదంగా జీవితాన్నిగడుపుతూ ధర్మసంస్థాపన చెయ్యడం.

2.అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్లు లీలా నాటకాన్ని నడపడం. 

3.అన్నీ ఆచరిస్తున్నప్పటికీ దేనికీ అంటకుండా దేన్నీ అంటించుకోకుండా  ఉండటం.

4.భౌతిక స్తాయిలో పూర్తిగా నిమగ్నమైనా కూడా తనదైన అతీత దివ్యస్వరూపంలో నిత్యమూ స్తితుడై ఉండటం.

5.దేనినీ అసహ్యించుకోకుండా దేనికీ లొంగకుండా ఉండటం.

6.తన చిలిపిపనులతో అల్లరిచేష్టలతో అందరి హృదయాలనూ కొల్లగొట్టడం.

"భౌతికంలోకి దివ్యత్వం దిగిరావాలి" అన్న అరవిందుల ఆకాంక్ష కృష్ణావతారంలో నిజమైనట్లు అనిపిస్తుంది. కాకపొతే కృష్ణుడు భగవంతుని అవతారం. అరవిందులు ఆశించినది మానవ పరిణామక్రమసాధనలో పరిపూర్ణత. అరవిందుల పూర్ణయోగాన్ని అందులోని స్తాయిలనూ భూమికలనూ శ్రీకృష్ణుడే ఆయనకు దర్శనమిచ్చి  స్వయంగా బోధించాడని తన "Synthesis of Yoga" అన్న గ్రంధంలో అరవిందులు చెప్పారు.

భగవద్గీత కూడా అప్పటివరకూ ఉన్న రకరకాలైన వేదాంత మార్గాలను సాధనా విధానాలను క్రోడీకరించడానికి చేసిన ప్రయత్నం లాగా మనకు కనిపిస్తుంది. యుద్ధ రంగంలో కొన్నిగంటల వ్యవధిలో పద్దెనిమిది అధ్యాయాలుగల గీతను కృష్ణుడు అర్జునునికి నిజంగా బోధించాడా? ఇది నిజమేనా? అన్న అనుమానాలూ దీనిమీద చర్చలూ అనవసరమైన విషయాలు. యుద్ధమధ్యంలో వేదాంతచర్చ జరిగి ఉండవచ్చు ఉండక పోవచ్చు. కాని అప్పటివరకూ అందుబాటులో ఉన్న వివిధ వేదాంతసాంప్రదాయాలను ఒకచోట క్రోడీకరించాలన్న వ్యాసభగవానుని ప్రయత్నం చాలా ఉన్నతమైనది. అప్పటినుంచీ ఇప్పటిదాకా భగవద్గీత ఎన్ని లక్షలమందికి ఆత్మోన్నతిని ఇచ్చిందో మనం ఊహిస్తే, ఒకవేళ యుద్ధరంగంలో వేదాంతచర్చ అసంబద్ధం అనుకున్నప్పటికీ, భగవద్గీతా రూపంలో జరిగినది ఎంత గొప్ప ప్రయత్నమో ఎంత నావెల్ ఐడియానో మనకు తెలుస్తుంది.

శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు ఒనగూడాయి అని నా భావన. 

ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన  అద్భుతమైన జీవితం ద్వారా నిరూపించడం. దేవుడు మానవునిగా దిగివచ్చిన అన్ని అవతారాలలోనూ బాధలు పడ్డాడు. విలపించాడు. మానవునిలాగే ఆవేశ కావేశాలకు లోనైనాడు. శరీరంలో ఉన్నంతవరకూ శరీర తాదాత్మ్యాన్ని అనుభవించాడు. శ్రీరాముడు కూడా " ఆత్మానం మానుషం మన్యే రామం దశరధాత్మజం" అంటూ తాను మానవుణ్ణి, దశరధుని కుమారుణ్ణి అని మాత్రమే తాను తలుస్తున్నట్లుగా అంటాడు. కాని శ్రీ కృష్ణావతారంలో మాత్రం, శరీరధర్మానుసారం . ఎన్ని బాధలు పడినప్పటికీ, ఎన్ని  యుద్ధాలు చేసినప్పటికీ, ఎంత మంత్రాంగం నడిపినప్పటికీ, తాను భగవంతుణ్ణి అన్న స్పృహ మాత్రం ఆయనను ఎప్పుడూ వీడనట్లు కనిపిస్తుంది. కనుకనే " అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే (నేనే అంతటికీ ప్రభువును అంతా నన్ను అనుసరించే నడుస్తున్నది)" ,"అహమాత్మా గుడాకేశా  సర్వభూతాశయ స్తితః , అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ (సర్వభూతములలో ఉన్న ఆత్మను నేనే. సర్వభూతముల ఆది, మధ్య, అంతం అన్నీ నేనే)" అని గీతలో చెప్పగలిగాడు. ఇటువంటి మాటలు గీతలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇలా చెప్పగలగడం సామాన్య విషయం కాదు.అందుకే ఆయన  మాయామానుషవిగ్రహుడయ్యాడు. లీలానాటకసూత్రధారి అనిపించుకున్నాడు. ప్రపంచం ఒక లీల అన్న విషయం తెలిసినవాడు గనుక చిరునవ్వుతో అన్నింటినీ చక్కబెట్టాడు. శత్రువులకూ మోక్షాన్నిచ్చాడు.

రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే. ప్రేమానందంలో మునిగి మత్తులైన ధన్యాత్ములు అద్వైతప్రతిపాదిత మోక్షాన్ని కూడా నిరసించారు. భక్తి మార్గ ప్రవర్తకులైన మధ్వ, రామానుజ,చైతన్య, నింబార్క, వల్లభాదులు, మీరా, సూరదాస్, మొదలైన మహాభక్తులు అద్వైతమోక్షం అనేది ప్రేమభక్తి కంటే ఎక్కువ ఏమీ కాదన్నారు. శ్రీ రామకృష్ణులు కూడా ఒక పాటను ఎప్పుడూ ఆలపించేవారు " నేను మోక్షాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడను. కాని నిర్మలమైన ప్రేమభక్తిని మాత్రం అంత త్వరగా ఎవరికీ ఇవ్వను." అంటూ ఆ గీతం సాగుతుంది. ముల్లోకాలలో ఎంత గొప్పసంపద అయినా అది ప్రేమభక్తికి సాటిరాదు. ప్రేమభక్తి ఉన్నవానికి భగవంతుడు కట్టుబడతాడు. అట్టి భక్తుణ్ణి వదిలి భగవంతుడు ఎక్కడికీ పోలేడు. అటువంటి భక్తిమార్గం కృష్ణావతారం ద్వారా లోకానికి ఇవ్వబడింది.

మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది. దానికి వ్యాఖ్యానం వ్రాయగలిగితే సమస్త వేదాలనూ స్ప్రుశించినట్లు అవుతుంది అని వారందరూ భావించారు. గీతలు ఎన్నున్నా భగవద్గీత ఒక్కటే సమస్త  వేదవేదాంత సారంగా వెలుగుతూ వచ్చింది. హిందూ ధర్మాన్ని అధ్యయనం చెయ్యాలనుకునేవారు ఏ గ్రంధం చదివినా చదవకపోయినా భగవద్గీత చదివి అర్ధం చేసుకుంటే చాలు, హిందూధర్మం మొత్తం అర్ధం అవుతుంది. ఇది కూడా లోకానికి కృష్ణ ప్రసాదమే.

కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతాం.

కృష్ణుడు పిల్లలలో పిల్లవాడు, యువకులలో యువకుడు, జ్ఞానవృద్ధులలో వృద్ధుడు, రాజులకురాజు, వీరులలో వీరుడు, వేదాన్తులలో వేదాంతి, ఆదర్శవంతుడైన కుమారుడు, స్నేహితుడు, సోదరుడు, ప్రేమికుడు, భర్తా, రాజూ, సేవకుడూ, యోగీ, శిష్యుడూ, గురువూ అన్నీ తానే. ఒక్క వ్యక్తిలో ఇన్ని పరిపూర్ణతలు ఆవిర్భవించడం పరమాద్భుతం. ఒక్క భగవంతుడు మాత్రమే ఇన్నికోణాలలో పరిపూర్ణతను ప్రకటించగలడు. ఇది ప్రపంచంలో ఏ మానవునికీ సాధ్యమయ్యే విషయం కాదు. చిన్నబాలునిగా తన ముద్దుమాటలతో, అల్లరి చేష్టలతో గోకులాన్ని కట్టిపడేశాడు. ప్రేమికునిగా గోపికలకూ రాధకూ మహత్తర ప్రేమభక్తిని చవిచూపించాడు. వీరునిగా యుద్ధాల్లో పాల్గొన్నాడు. సోదరునిగా అన్నకు అండగా నిలబడ్డాడు. రాజుగా ధర్మాన్ని నిలబెట్టాడు, సేవకునిగా సారధ్యం వహించాడు, కుమారునిగా తండ్రి ఋణం తీర్చుకున్నాడు, స్నేహితునిగా కుచేలునీ, బంధువుగా పాండవులనూ ఆదరించాడు, ఉత్తమశిష్యునిగా సాందీపని ఆచార్యుని ఋణం తీర్చుకున్నాడు. ఉత్తమ గురువుగా అర్జునునీ ఉద్దవునీ ఉద్దరించాడు. తననే నమ్మిన రుక్మిణికి, అష్టమహిషులకూ, పదహారువేలమంది భార్యలకూ న్యాయం చేశాడు. ధర్మయుద్ధాన్ని నడిపించాడు. ఒక్కడే పాశ్చాత్యరాజుల దాడులను, కుట్రలనూ ఎదుర్కొన్నాడు. దుర్మార్గులను అంతం చేసాడు. చివరిగా తనవారు తన ఎదురుగానే కొట్టుకుని చచ్చిపోతుంటే నిర్వికారంగా చూస్తూ మౌనంగా ఉన్నాడు. తాను వచ్చినపని అయిపోయిన అనంతరం ఎవరికీ చెప్పకుండా, ఏ విధమైన మోహాలూ లేకుండా, అందర్నీ వదిలి,  దేహాన్ని వదిలి తన స్వధామాన్ని చేరుకున్నాడు. అందుకే "కృష్ణస్తు భగవాన్ స్వయం" అన్న మాట అక్షరాలా నిజం. 

కృష్ణునిలోని ఇన్ని కోణాలనూ చక్కగా అర్ధం చేసుకున్నప్పుడే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అని మహనీయులు ఎందుకు అన్నారో మనకు కొద్దిగానైనా అర్ధం అవుతుంది.
read more " కృష్ణస్తు భగవాన్ స్వయం "

20, ఆగస్టు 2011, శనివారం

బ్రూస్ లీ జాతకం - 2

బ్రూస్ లీ జాతకం మొదటిభాగం ఇక్కడ చూడవచ్చు. ఇతను ఒక రకమైన కారణ జన్ముడే అని చెప్పాలి. ఎందుకంటే చైనీస్ కుంగ్ ఫూ విద్యను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసి తద్వారా ప్రపంచం మొత్తం మీదా మార్షల్ ఆర్ట్స్ రివైవల్ తీసుకు రావడం అనే సంఘటన ఇతని ద్వారా జరిగింది. ఆ పని చెయ్యడానికి విధి ద్వారా ఎన్నుకోబడ్డాడు కనుక ఇతను కారణజన్ముడే.

కానీ, విచిత్రం ఏంటంటే ఇతనికి చైనీస్ కుంగ్ ఫూ పూర్తిగా రాదు. కుంగ్ ఫూ లోని అనేక స్టైల్స్ లో ఒకటైన వింగ్ చున్ స్టైల్ ను మాత్రం కొంత కాలం నేర్చుకుని మధ్యలోనే వదలిపెట్టాడు. అందుకే దానిలోని లోతైన రహస్యాలు ఇతనికి తెలీవు. ఆ రహస్యాలు నేర్చుకునేటంత కాలంవరకూ గురుశుశ్రూష ఇతను చెయ్యలేదు. పూర్తిగా నమ్మిన శిష్యునికి కాని గురువులు ఈ రహస్యాలు చెప్పరు. అదికూడా కొన్నేళ్ళ నమ్మకమైన సేవ తర్వాతనే ఆ ఉన్నత స్థాయి రహస్యాలు నేర్పిస్తారు. బ్రూస్ లీ అన్నేళ్ల పాటు గురు శుశ్రూష చెయ్యలేదు. అందుకే యిప్ మాన్ నుంచి వింగ్ చున్ విద్యలోని అన్ని రహస్యాలనూ ఇతను నేర్చుకోలేక పోయాడు. 

దానికి కారణం లగ్నారూడం లో ఉన్న రాహువు ప్రభావం. రాహువు దేన్నీ పూర్తిగా నేర్చుకోనివ్వడు. దేన్నీ పూర్తిగా సాధించనివ్వడు  అతని దృష్టి ఎప్పుడూ ఉన్నదాని మీద కాక ఇంకా దేనిమీదో ఉంటుంది. ఎప్పుడూ కొత్తవాటి వెంట పరిగెత్తేటట్లు చేస్తాడు. అన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఇంకొక అధ్యాయం మొదలౌతుంది. కనుక రాహు ఆధిపత్యం లో ఉన్నవారి జీవితాలు అర్ధాంతరంగానే ముగుస్తాయి. రాహువు కూడా అర్ధాంతరంగా విష్ణు చక్రానికి బలి అయ్యాడన్న విషయం మనం అర్ధం చేసుకోవాలి. 

రాహువు అమృతం తాగీతాగక ముందే విష్ణుచక్రం చేత ఖండింపబడ్డాడు. అలాగే కొందరు జీవితంలో సక్సెస్ సాధించీ సాధించక ముందే హటాత్తుగా  చనిపోతుంటారు. అలాటివాళ్ళ మీద రాహువు యొక్క ప్రభావం అమితంగా ఉంటుంది. వాళ్ళ జీవితాలు చూస్తె ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుంది. బ్రూస్ లీ కూడా అటువంటి వాడే. అందుకే అతని జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కాని, లోకానికి తెలియకుండా  మరుగున పడిపోయిన వీరవిద్యల పునరుజ్జీవనానికి ఒక ఉపకరణంగా విధిచేత ఎంచుకోబడ్డాడు.

నిజమైన వీరవిద్యలో ఫిలాసఫీ మిళితమై ఉంటుంది. యోగానికీ నిజమైన వీరవిద్యలకూ భేదం లేదు. అందులోనూ చైనీస్, జపనీస్ వీరవిద్యలలో జెన్ సిద్ధాంతాలు కలిసిమెలసి ఉంటాయి. అందుకే ధ్యానాభ్యాసం వీరులకు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే, ధ్యానం అనేది పిరికివాళ్ళ కోసం ఉద్దేశించబడినది కాదు. పిరికివాళ్ళు భక్తులు అవుతారు. కాని  జ్ఞానులు కాలేరు. 

వీరుడైనవాడు మాత్రమె ధ్యానాన్ని చెయ్యగలడు. వీరుడే జ్ఞాని కాగలడు. కారణం? వీరుడికి తెగింపు ఉంటుంది. ప్రాణాన్ని లెక్క చెయ్యని ధైర్యం ఉంటుంది. ఈ లక్షణం ధ్యానంలో చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతె ఉన్నతస్తాయికి చెందిన నిజమైన ధ్యానం సాధ్యం కాదు. 

ఉన్నత స్థాయికి చెందిన ధ్యానం అంటే మాటలు కాదు. ప్రపంచంలో అతి కష్టమైన పని ఇదొక్కటే అని నేనంటాను. కారణం ఏమంటే, ఈ స్థాయిలో తనదైన  సర్వస్వాన్నీ అర్పణం చెయ్యవలసి ఉంటుంది. తనకంటూ ఒక ఆధారం లేకుండా నిరాధారంగా శూన్యంలో నిలబడవలసి ఉంటుంది. తన భావాలనూ, అలవాట్లనూ, ఆలోచనలనూ, పద్ధతులనూ, పాము కుబుసం వదిలినట్లు వదిలి, కొత్త శరీరంతో నిలబడవలసి  ఉంటుంది. చివరకు తన అయిదుశరీరాలనూ వదిలి తాను శూన్యంలో కలవవలసి ఉంటుంది. తానే లేకుండా అదృశ్యం కావలసి ఉంటుంది. కనుక, తన ప్రాణాలను పణంగా పెట్టగలిగినవాడే నిజమైన ధ్యాని కాగలడు. ఈ పని అందరూ చెయ్యలేరు. అందుకనే నిజమైన ధ్యానం కూడా అందరూ చెయ్యలేరు.

ఉజ్జయిని కాళికాలయంలో ఒక శాసనం ఉంటుంది. అందులో ఇలా వ్రాసి ఉంటుంది. "తన తలను నరికి కాళికి సమర్పించగలవానికే మాత కటాక్షం లభిస్తుంది." ఇదే ధ్యానంలోకూడా విధించబడిన షరతు. తాను లేకుండా మాయం కాగలిగినవానికే ధ్యానపు లోతులు అందుతాయి. అటువంటి వానికే దైవశక్తి అనుభవం లోకి వస్తుంది.  ఇదే అసలైన ధ్యానం. అంతేకాని, మన అలవాట్లు, మన పద్దతులు మార్చుకోకుండా "నేను ధ్యానమార్గంలో ఉన్నాను" అనుకోటం భ్రమ మాత్రమే. అందుకే నేటి యోగా స్కూల్స్ లో నేర్పిస్తున్న ధ్యానాలు అన్నీ పిల్లచేష్టలని నేనంటాను.నేటి యోగాగురువులకు ఎవరికీ నిజమైన ధ్యానం తెలియదు.ఒకవేళ తెలిసినా దానిని ఎవరికీ నేర్పరు. నేర్పినా అందరూ దానిని చెయ్యలేరు.కనుక, నేటి ధ్యానాలు అన్నీ వ్యాపార కిటుకులు మాత్రమే.అందుకే ఎవరైనా - 'నేను మెడిటేషన్ చేస్తున్నాను' - అని చెబితే నేను లోలోపల నవ్వుకుంటాను. 

ఇంకొక ముఖ్య లక్షణం ఏమంటే వీరుడైనవాడు ప్రపంచంలో తన స్వశక్తిని తప్ప ఇక దేనినీ నమ్మడు. జ్ఞాని కూడా అంతే. కాని భక్తుడైనవాడు ఇంకొక శక్తి పైన ఆధారపడతాడు. భక్తుడు సెంటిమెంటల్ గా తయారౌతాడు. చిన్న కష్టాన్ని కూడా భరించలేడు. చలించిపోతాడు. కనుక భక్తుడు ఎప్పటికీ వీరుడు కాలేడు. జ్ఞాని దేనికీ చలించని కొండలా ఉండగలడు. కనుక వీరుడే జ్ఞాని కాగలడు. కనుకనే నిజమైన మార్షల్ ఆర్టిస్ట్ యోగిగా, జ్ఞానిగా మారవలసి ఉంటుంది. లేకుంటే అతని విద్యకు పరిపూర్ణత ఎప్పటికీ రాదు. ఏ వీరవిద్య అయినా అంతిమంగా యోగవిద్యగా రూపాంతరం చెందవలసి ఉంటుంది. మార్షల్ ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పటికైనా ప్రాణవిద్యా రహస్యాలను అవగతం చేసుకోవాలి. దీనినే కలారిపాయత్ లో మర్మ విద్య అంటారు. ఇతర వీర విద్యలలో  "డిం మాక్" అనీ "డెత్ టచ్" అనే పేరుతోనూ పిలుస్తారు.

వీరవిద్యలకున్న ఫిలాసఫీ పునాదిని అలా ఉంచితే, తరతరాలుగా వెంటాడుతున్న శాప ప్రభావం వల్ల బ్రూస్ లీ అటు వీరవిద్యనూ పూర్తిగా నేర్చుకోకుండా ఇటు ధ్యానాన్నీ అందుకోలేకుండా రెంటికీ చెడ్డ రేవడిగా తయారయ్యాడు.  ఈ శాపం వల్లనే ఇతని కుమారుడు బ్రాండన్ లీ కూడా పాతికేళ్ళ వయసులో అకస్మాత్తుగా మరణించాడు. " ద క్రో" అన్న సినిమా షూటింగ్ సమయంలో ఇది జరిగింది. కాకి శనీశ్వరుని వాహనం అన్న విషయమూ, ఇతని జాతకంలో శని గురువుల వక్రీకరణ షష్ఠస్థానంలో ఉందన్న విషయమూ గమనిస్తే ఈ శాపానికి మూలం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి వీరి వంశంలో ఉన్న శాపం విషయం అలా ఉంచితే, వీరవిద్యా ప్రపంచంలో తనపేరు మాత్రం చిరస్థాయిగా నిలిచే అదృష్టం బ్రూస్ లీకి దక్కింది. హాన్షి యమగుచి, మాసుతత్సు ఒయామా, గిచిన్ ఫునకోషి, కార్యో హిగాషియోనా, చోజన్ మియాగి, జు బాంగ్ లీ, చోటోకు క్యాన్, యసుహిరో కోనిషి, యిప్ మాన్, మొదలైన గ్రాండ్ మాస్టర్ల పేర్లు తెలియని వారికి కూడా బ్రూస్  లీ పేరు తెలుసు. అదే అతని అదృష్టం.

రహస్యంగా చైనీస్ కుటుంబాలలో తరతరాలుగా వారసత్వంగా నేర్పించబడుతున్న కుంగ్ ఫూ విద్యను, ఇతర వీరవిద్యలనూ ప్రపంచ వ్యాప్తంగా నేడు కోట్లాదిమంది అభ్యాసం చేస్తున్నారంటే దానిలో బ్రూస్ లీ పాత్ర ఎంతో ఉంది. బ్రూస్ లీ ని మించిన మాస్టర్లు ఎందఱో ఉన్నప్పటికీ ఆ ఖ్యాతి అతనికే దక్కడానికి కారణాలు, అతని జాతక విశ్లేషణ వచ్చే పోస్ట్ లో చూద్దాం.
read more " బ్రూస్ లీ జాతకం - 2 "

15, ఆగస్టు 2011, సోమవారం

హిందూ మతోద్దారకులు

మొన్నీ మధ్య ఒక ప్రయాణంలో ఉండగా ఇద్దరు హిందూ మతోద్దారకులను కలిశాను. వాళ్ళిద్దరూ ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ అయిన ఒక హిందూ సంస్థకు చెందినవారు. ఈ సంస్థ సభ్యులతో నాకు ఇంతకూ ముందే కొంత పరిచయం ఉంది. వీళ్ళలో ఆవేశంపాళ్ళు ఎక్కువ జ్ఞానంపాళ్ళు తక్కువ. హిందూ మతంలో వీళ్ళకు తెలిసిన వ్యక్తి ఒక్క శివాజీ మాత్రమే.

వాళ్ళంతట వాళ్ళు మాటలు కల్పించుకుని హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి, క్రైస్తవ మత ప్రచారకుల దురంతాల గురించీ లెక్చరు మొదలు పెట్టారు. చాలాసేపు నేను మౌనంగా వింటున్నాను. ఇంతలో ఒకాయన నన్ను పలకరించి " సార్ మీరు హిందువే కదా" అన్నాడు.


"అవును" అని జవాబిచ్చాను.


" మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు " అన్నాడు. అదేదో నేరం అయినట్లు.


" బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? " అని అడిగాను నేను.


" అది మన హిందూమత దర్మం" అన్నాడు ఒకాయన.


" ఏ బొట్టు పెట్టుకోమంటారు. అడ్డ బొట్టా, నిలువు బొట్టా, చుక్క బొట్టా, వీభూతా, కుంకుమా, చందనమా?" అడిగాను.


"ఏదైనా ఒకటే. ఏది పెట్టుకున్నా హిందూ మతంలో ఉన్నట్లే." అని ఒకాయన అన్నాడు.


"అలాంటప్పుడు ఏ బొట్టూ పెట్టుకోకున్నా హిందువు కావడానికి అభ్యంతరం ఏముంది? అదీ గాక వేదకాలంలో ఎవరూ బొట్టు పెట్టుకున్న దాఖలాలు లేవే?" అడిగాను.


సమాధానం తెలియక వాళ్లకు చిర్రెత్తింది.


వారిలో ఒకడు కొంచం శ్రుత పాండిత్యంగాడున్నాడు. " అదికాదు. కనుబొమల మధ్యన ఆగ్నేయ చక్రం ఉంటుంది. బొట్టు పెట్టుకుంటే ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుంది." అన్నాడు.


"ఆగ్నేయ చక్రం ఉంటుందా? ఆ పేరు ఎక్కడా వినలేదే?" అన్నాను నేను.


"ఉంది సార్. యోగాకోర్సు చేస్తే మీకు తెలుస్తుంది." అన్నాడు.


"యోగాకోర్స్ సంగతి తర్వాత చూద్దాంలేగాని ఆగ్నేయచక్రం అన్నమాట రామకృష్ణ పాడింది కదా,  N.T.R బ్రహ్మంగారిచరిత్ర కాసేట్టులో విన్నావా నాయనా?" లోలోపల నవ్వుకుంటూ అడిగాను.   


"అవును సార్"


"అంతేలే. మన హిందూమతం కాసెట్లలోనూ సీడీలలోనేగా చివరికి మిగిలింది. సరే గాని. ఆగ్నేయచక్రం యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది? " యాక్టివేట్" అన్న పదం కాస్త వత్తి పలుకుతూ అన్నాను.

"జ్ఞానం వస్తుంది. జరగబోయేది తెలుస్తుంది." అన్నాడు.


"మరి ఇన్నివేల సంవత్సరాలుగా ఎంతో మంది బొట్టు పెట్టుకుంటున్నారు. వాళ్లకు జ్ఞానం కలిగిందా? అంతెందుకు నీవూ బొట్టు పెట్టుకునే ఉన్నావుగా. నీకు ఆగ్నేయచక్రం యాక్టివేట్ అయిందా?" అడిగాను.

"సార్. మీరు వితండవాదం చేస్తే మేమేమీ చెప్పలేము" అన్నాడు.


"ఇందులో వితండవాదం ఏముంది నాయనా. నీవు చెప్పినదానికే నా సందేహం అడిగాను. నీకు జవాబు తెలీకపొతే పరవాలేదులే ఒదిలెయ్ ". అన్నాను.


వాళ్ళ అహం దెబ్బ తింది.


"అసలు హిందూమతం అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్". అన్నారు.


"చెప్తా గాని. మీ కులం ఏమిటి నాయనా". అడిగాను.


వారిలో ఒకాయన బ్రాహ్మణుడు. ఒకాయన నాయుడుగారు.


"మీ గోత్రం ఏమిటి ?" బ్రాహ్మణున్ని అడిగాను.


"భారద్వాజ గోత్రం " గర్వంగా చెప్పాడు.


"అబ్బా. అలాగా. సరే కాస్త మీ ప్రవర చెప్పు నాయనా వింటాను?"
 

చెప్పలేక నీళ్ళు నములుతున్నాడు. 

"పవరా అదేంటి ? " అడిగాడు నాయుడు గారు.

"నువ్వు కాసేపుండు నాయనా. నీ దగ్గరికి కూడా వస్తా. పోనీ మీరు ఏ వేదానికి చెందినవారు? ఆ వేదంలో మీ శాఖ ఏమిటి? మీ వేదశాఖలోని ఉపనిషత్తు ఏమిటి? ఆ ఉపనిషత్తు యొక్క ద్రష్ట లెవరు?" అడిగాను.

వెర్రి మొఖం వేసుకుని చూస్తున్నాడు.

 

"పోనీ షడ్దర్శనాలు అంటే ఏమిటి? వాటి కర్తలెవరో కాస్తచెప్పు నాయనా" అడిగాను.

సమాధానం లేదు.

"న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంసల పేర్లు ఎప్పుడైనా విన్నావా? అడిగాను.

వాళ్లకు ఏదో అనుమానం వచ్చింది. మనం దొరికిపోయాం అన్న అనుమానం చూపులలో కనిపించింది. 


"పోనీ నాస్తిక దర్శనాలైన చార్వాక, బౌద్ధ, జైనాల గురించి తెలుసా?" అడిగాను.

"బౌద్ధం, జైనం గురించి తెలుసు" అన్నారు.

"ఏం తెలుసో కాస్త చెప్పు నాయనా వింటాను. '

"బుద్దుడూ జైనుడూ అహింసను బోధించారు" అన్నాడు నాయుడుగారు.

జైనుడు కాదు నాయనా ఆయన పేరు వర్ధమాన మహావీరుడు. సరే ఇద్దరూ అహింసనే బోధిస్తే మరి ఇద్దరి బోధలలో తేడాలేమిటి? అడిగాను

మళ్ళీ మౌనమే శరణ్యం.

"చూడు నాయనా. నీకు వేదాల గురించి తెలియదు. ఉపనిషత్తుల గురించి తెలియదు. దర్శనాల గురించి తెలియదు. వేదం యొక్క షడంగాలు తెలియదు. మీ గోత్ర రుషులేవరో నీకు తెలియదు. వాళ్ళ చరిత్రలు అసలే తెలియవు. పోనీ ఇతర మతాల గురించీ తెలియదు.  మన మతానికీ ఇతర మతాలకీ ఉన్న తేడాలు తెలియవు. మరి ఇవేమీ తెలియని మీరు హిందూ మతాన్ని ఉద్దరిస్తారా? ఎలా ఉద్దరిస్తారో మీరే ఆలోచించండి. మీకు తెలిసిందల్లా బొట్టు పెట్టుకోడం ఒక్కటే. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందూత్వం రాదు. నార్త్ ఇండియాలో చాలామంది  హిందువులు బొట్టు పెట్టుకోరు. అంతమాత్రం చేత వాళ్ళు హిందువులు కారంటారా?" అడిగాను

జవాబు లేదు.

"ప్రస్తుతం మీరు చెయ్యవలసింది హిందూ మత ఉద్దరణ కాదు. ముందు మిమ్మల్ని మీరు ఉద్దరించుకొండి. అంటే ఏదో పెద్ద ఘనకార్యం చెయ్యనక్కరలేదు. నేను అడిగిన విషయాల గురించి కూలంకషంగా తెలుసుకోండి. ఆ తర్వాత వాటిని మీ జీవితంలో ఆచరణలోకి తీసుకురండి. అప్పుడు మీకు హిందూమతం అంటే ఏమిటో, దాని గొప్పతనం ఏమిటో అర్ధం అవుతుంది. హిందూమతం ఒకరి చేత ఉద్దరించబడేంత దుస్థితిలో లేదు. మీ మతమేంటో తెలియని దుస్థితిలో మీరున్నారు. మీకు కావలసింది ఆత్మోద్దరణ. రాజకీయ పార్టీలలో చేరి రైళ్ళలో ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన మతం ఉద్దరింప బడదు. సీడీలు విని హిందూ మతాన్ని తెలుసుకోవడం కాదు. మూల గ్రంధాలు చదవండి. అర్ధం కాకపోతే భాష్యాలు చదవండి. సంస్కృతం నేర్చుకోడానికి ప్రయత్నం చెయ్యండి. అప్పుడు మీకు ఆగ్నేయచక్రానికీ ఆజ్ఞాచక్రానికీ భేదం తెలుస్తుంది. 

హిందూమతాన్ని గురించి బాకా ఊదటం కాదు.  ముందుగా అదేమిటో తెలుసుకోండి. తరువాత మీ జీవితాలలో దాన్ని ఆచరించి చూపండి. హిందూమతం అంటే సనాతనధర్మం. అదెప్పటికీ నిలిచి ఉంటుంది. విశ్వం నిలబడటానికి మూలాలేవో అవే దాని సిద్ధాంతాలు. కనుక సనాతన ధర్మం ఎప్పటికీ నశించదు. దానిని మీ జీవితంలో ఆచరించాలి. అదే దాన్ని ఉద్దరించడానికి సరియైన మార్గం. అంతే గాని ఇతరులకు తెలిసీ తెలియని లెక్చర్లు ఇవ్వడం కాదు." అన్నాను.

వాళ్ళ ముఖాలలో కళ తప్పింది.

"మీకు నిజమైన హిందూమతాన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటె ఇదిగో నా కార్డ్" -- అని నా విజిటింగ్ కార్డ్ వాళ్ళ చేతిలో పెట్టాను. ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. దిగి నా దారిన నేను చక్కా వచ్చాను.

నా ప్రశ్నలకు సమాధానం తెలిసిన హిందువులు మీలో ఎందరున్నారో మీరూ ఆలోచించుకోండి మరి.
read more " హిందూ మతోద్దారకులు "

9, ఆగస్టు 2011, మంగళవారం

అభినవగుప్తుని అద్భుతజీవితం

అభినవగుప్తుడు పదవ శతాబ్దంలో కాశ్మీరదేశంలో నివశించినట్లు ఆధారాలున్నాయి.జీవించి ఉన్న కాలంలో ఆయనను పరమేశ్వరుని అవతారంగా భావించి అనేకమంది శిష్యులు పూజించారు.వేదాంత,తంత్ర శాస్త్రములలో మహాపాండిత్యమూ,అద్భుతమైన యోగ శక్తులకుతోడు అమేయమైన శివాద్వైత అనుభవజ్ఞానం ఆయన సొంతం.

ఇవిగాక నాట్య సంగీత వ్యాకరణాది విద్యలలో ఆయన జ్ఞానసంపన్నుడు. "కాశ్మీర శంకరాచార్య" అని ఆయన్ను అనేకమంది నవీన పండితులు పిలిచారు. కాశ్మీర శైవాద్వైతాన్ని ఆయన పరిపుష్టం చేసినట్లు ఇంకెవ్వరూ చెయ్యలేకపోయారు. వెయ్యిసంవత్సరాల క్రితమే కులాన్ని నిరసించి జ్ఞాన తృష్ణకే ప్రాధాన్యతనిచ్చి, అద్వైతశివానుభావం అందరికీ సాధ్యమే అన్నమాట చెప్పడమేగాక సమస్త కులాలకూ చెందిన ముముక్షువులను కరుణతో చేరదీసి వారికి ఈశ్వరాద్వైతానుభావానికి సరియైన మార్గాన్ని చూపిన కారణజన్ముడు అభినవగుప్తుడు. స్త్రీలకూ సాధనా మార్గంలో సమాన స్థానాన్ని ఇచ్చిన మహనీయుడు.నాట్య సంగీతాది విద్యలలో ప్రతిభా సంపన్నుడు మాత్రమే గాక,కాశ్మీర శైవ తంత్రశాస్త్రంలో అనుభవ జ్ఞాని.

ఎలాగైతే వేదాలలో దాగిఉండి జనులకు అర్ధంకాకుండా ఉన్న వేదాంత తత్వాన్ని తన అద్వైతసిద్ధాంతం ద్వారా శంకర భగవత్పాదులు జనులకు తేటతెల్లం చేసారో,అదే విధంగా శైవాగమశాస్త్రాలలో నిగూడంగా ఉన్న శివాద్వైత తత్వాన్ని తన గ్రంధాలద్వారా అభినవగుప్తుడు లోకానికి వివరించాడు.

ఆయన వివిధ సాధనామార్గాలలోనూ, మతాలలోనూ    మహాపండితుడేగాక, అతిరహస్యమైన తంత్రజ్ఞానం తెలిసినవాడు, భరతముని యొక్క  నాట్యశాస్త్రానికి  వ్యాఖ్యానం వ్రాశిన  నాట్యశాస్త్రకోవిదుడు, సంగీతనిధి, అష్ట సిద్దులనూ అరచేతిలో ఉంచుకున్న మహాయోగి, దాదాపు ఏభైకి పైగా సునిశితతర్క పూరితములైన, మహోన్నత సిద్ధాంత ప్రతిపాదితములైన, ఉత్తమగ్రంధాలను సంస్కృతంలో  రచించిన మహాకవి, వ్యాకరణవేత్త,శంకరుని అద్వైతంలోనూ, బుద్ధుని అనాత్మవాదంలోనూ ఉన్న లోపాలను సవరించిన ధీశాలి. 

ఆయన జీవితం ఒక అద్భుతం. ఒక సంప్రదాయపరులైన బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. తండ్రిగారైన నరసింహగుప్తుడు మళ్ళీ వివాహం చేసుకోకుండా మహేశ్వరభక్తుడై అంతరిక జ్ఞాన సాధనకు అంకితుడైనాడు. తననుగురించి వ్రాసుకుంటూ "యోగినీభూ" అన్న పదాన్ని అభినవగుప్తుడు వాడాడు. అంటే, తల్లి దండ్రులు యోగావస్థలో ఉన్నప్పుడు కలిగిన సంయోగం వల్ల జన్మించిన శిశువు అని  అర్ధం. ప్రాచీన కాలంలో ఇటువంటి ప్రక్రియలు ఉండేవి. ఉత్తమ సంతానాన్ని కనాలని సంకల్పించిన భార్యాభర్తలు నిష్టాపరులుగా యోగతత్పరులుగా ఉంటూ తత్ఫలంగా ఉద్భవించిన ఓజోశక్తితో కలిగిన భైరవస్తితిలో ఒక శిశువుకు జన్మనిస్తే ఆ శిశువు ఉత్తమసంస్కారాలతో జన్మించి, కాలాంతరంలో అత్యంత మేధాసంపన్నునిగా అత్యంత మహానీయునిగా రూపుదిద్దుకునేవాడు. అభినవగుప్తుడు పుట్టుకతోనే అట్టి యోగశిశువుగా జన్మించాడు.

బాల్యంనుంచి జ్వలిస్తున్న జ్ఞానతృష్ణతో అనేకమంది మహాగురువుల వద్ద శిష్యరికం చేసాడు. కనీసం 15 మంది మహనీయులైన గురువుల వద్ద ఈయన శిష్యరికం చేసినట్లు మనకు ఆధారాలు లభిస్తున్నాయి. వీరిలో సిద్దులైన శైవసంప్రదాయ గురువులే గాక వైష్ణవ, బౌద్ధ, జైన గురువులున్నారు.

ఆధ్యాత్మికతృష్ణ అనేది ఒకని ముసలితనంలో వస్తే అది సరియైన తృష్ణ కాదు. నిజమైన ఆధ్యాత్మిక తపన అనేది చాలా చిన్నవయసులోనే ఎవరికైతే జ్వలిస్తుందో వారే ధన్యులు.వారే జీవిత పరమగమ్యాన్ని చేరుకోగలరు. ఇతరులకు అది అసాధ్యం.

ముఖ్యంగా త్రిక సిద్ధాంతమైన కాశ్మీరశైవాన్ని, తంత్రమార్గమైన కౌలాన్నీ ఈయన నిష్ఠగా అధ్యయనం చేశాడు. వసుగుప్తుడనే సిద్ధగురువుచేత 8 శతాబ్దంలో క్రోడీకరించబడినదే త్రికసిద్ధాంతం.సృష్టి స్తితి లయములు మూడు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు మూడు,సత్వ రజో తమో గుణములు మూడు, జీవుడు, శక్తి, శివుడు మూడు. ఈ విధంగా మనకు కనిపిస్తున్న చరాచర సృష్టి మొత్తాన్నీ మూడు స్థాయిలలో సంపూర్ణంగా వివరించగలిగిన సిద్ధాంతమే త్రికసిద్ధాంతం.

దీనిలో నిశితతర్కమయమైన సిద్ధాంతభాగమే గాక ఆధ్యాత్మికంగా అత్యున్నతికి తీసుకెళ్లగల ఆచరణాత్మక తంత్రమార్గం నిగూఢంగా దాగి ఉన్నది.అభినవగుప్తుడు ఈ రెంటిలోనూ అత్యంత ప్రతిభాపూర్వక అభ్యున్నతిని పొందాడు.ఈ రెంటినీ సమర్ధవంతంగా బోధించగల సద్గురువులు ఆయనకు లభించారు. అదే ఆయన అదృష్టం.

తన గురువులందరిలోనూ సోమానందుని, శంభునాధుని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నాడు. సోమానందుడు ఆయనకు క్రమ, త్రిక, ప్రత్యభిజ్న సిద్ధాంతాలను బోధించాడు. శంభునాధుని వద్ద తాంత్రికపధమైన కౌలాచారాన్ని ఈయన ఔపోసన పట్టాడు. శంభునాధుని పత్ని(తన గురుపత్ని)నుంచి అభినవగుప్తుడు శక్తిపాతాన్ని పొందాడు అన్నదాన్ని బట్టి వెయ్యేళ్ళ క్రితమే స్త్రీలు తంత్రమార్గంలో గురుత్వాన్ని వహించగల శక్తి స్వరూపిణులుగా విరాజిల్లేవారని మనకు తెలుస్తుంది.నిజం చెప్పాలంటే ఒక తాంత్రిక గురువుగా స్త్రీ రాణించినట్లు పురుషుడు రాణించలేడు.దానికి చాలా మార్మిక కారణాలున్నాయి.అందుకనేనేమో శ్రీరామక్రిష్ణులు కూడా భైరవీ బ్రాహ్మణినే తన తంత్రసాధనా గురువుగా ఎన్నుకున్నారు.

తన గురువులలో అందరిలోకీ శంభునాధుని ఈయన ఎక్కువగా అభిమానించాడు. ఈయన కరుణ వల్లనే తాను పూర్ణజ్ఞానాన్ని పొందానని చెప్పుకున్నాడు. శైవాద్వైతాన్నీ తంత్రమార్గాన్నీ అప్పటి వరకూ ఉన్న సాధనా మార్గాలనూ సమన్వయము చేస్తూ ఒక సంపూర్ణ అద్భుతగ్రంధాన్ని వ్రాసే బృహత్కార్యాన్ని తలపెట్టమని శంభునాధుడే ఈయనకు ప్రేరణ కలిగించాడు. ఈ ప్రేరణ నుంచి ఉద్భవించినదే " తంత్రాలోక " మనే అద్భుత  గ్రంథరాజం. మాలినీ విజయతంత్రమనే ప్రాచీన గ్రంధరాజాన్ని దీనికి ఆధారంగా తీసుకున్నాడు.

ఇది 37 అధ్యాయాలతో విరాజిల్లే అద్భుతగ్రంధం. అప్పటివరకూ ఉన్న సమస్త తంత్ర సాధనలనూ క్రోడీకరించి దానికి తన అనుభవాన్ని రంగరించి అభినవగుప్తుడు ఈ గ్రంధాన్ని వ్రాశాడు. దీనిని అర్ధం చేసుకోలేని మంద బుద్ధులకోసం దీని యొక్క సంక్షిప్తరూపంగా తంత్రసారమనే ఇంకొక గ్రంధరాజాన్ని కూడా ఆయన లోకం కోసం వ్రాశాడు.

శ్లో|| వితత స్తంత్రాలోకో విగాహితుం నైవ శక్యతే సర్వైహి 
ఋజువచనవిరచితమిదం తు తంత్రసారం తతః శృణుత ఇతి ||

"తంత్రాలోకమనే గ్రంధము అతి విస్తారమైనది అగుటచే దానిని అందరూ  చదివి అర్ధం చేసుకోలేరు గనుక, ఈ తంత్రసారమనే గ్రంధాన్ని తేలిక భాషలో అందరికీ అర్ధమయ్యే లాగున వ్రాస్తున్నాను." అంటూ తంత్రసారమనే గ్రంధాన్ని ప్రారంభిస్తాడు.

 శ్లో||అజ్ఞానం కిల బంధహేతురుదితః శాస్త్రై మలం తత్స్మృతం
పూర్ణజ్ఞాన కళోదయే తదఖిలం నిర్మూలతాం గచ్చతి 
ధ్వస్తాశేషమలాత్మ సంవిదుదయే మోక్షశ్చ తేనామునా  
శాస్త్రేణ ప్రకటీకరోమి నిఖిలం యత్జ్నేయ తత్త్వం భవేత్ ||  
   
"సమస్త బంధాలకూ కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని శాస్త్రాలు "మలం" అన్నాయి. "నేనే పరమాత్మను" అన్న పూర్ణజ్ఞానం ఉదయించడం వల్ల ఈ అజ్ఞానమలం సమస్తమూ నిర్మూలనం అవుతుంది. ఈ విధంగా అజ్ఞాన ధ్వంసం కావడమూ సంవిత్ జ్ఞానోదయం కావడమే మోక్షం అనబడుతుంది. అట్టి మోక్షాన్ని పొందే మార్గాన్ని ఈ శాస్త్రంలో నేను వివరిస్తున్నాను." అని ఈ గ్రంధంలో అంటాడు.

శ్లో|| ఇద్దం షడర్ధ క్రమసంప్రదాయం 
స ప్రత్యయాప్రత్యయ భిన్నమాప్య 
శ్రీ శంభునాధ కరుణారసేన 
స్వయం ప్రసన్నాదనపేక్ష్య వృత్త్యా ||

నా గురువైన శంభునాధుని కరుణవల్లనూ, నాయొక్క నిర్మలమైన భావనచేతనూ నేను గ్రహించిన -- తెలియబడునది తెలుసుకోనేవాడు అన్న భేదం లేని (అద్వైత) స్థితిని కలిగించు -- షడర్ధ (త్రిక) సాంప్రదాయాన్ని  ఇక్కడ  వివరిస్తున్నాను." అంటాడు.


శ్లో|| కాష్మీరికోభినవగుప్త పదాభిదానః 
శ్రీతంత్రసార మకరోద్రుజునా క్రమేణ 
యత్తెన సర్వజన ఏష శివం ప్రయాతు
లోకోత్తర ప్రసర శాంభవతంత్రసారం ||

"సమస్తజనులకూ శుభాన్నీ శివాద్వైత స్థితినీ కలిగించగలదీ సమస్త తంత్రములయొక్క సారమూ అయినట్టి ఈ శాంభవతంత్రం లోకోపకారం కోసం కాశ్మీరవాసియైన అభినవగుప్తునిచే వివరంగా చెప్పబడినది." అని ఈ గ్రంధంలో ఉన్నది.

ఈ మహనీయుడు వ్రాశిన 25 గ్రంధాలవరకూ ప్రస్తుతం లభిస్తున్నాయి.కానీ దాదాపు అంతకంటే ఎక్కువ గ్రంధాలు మన ఖర్మకొద్దీ నశించిపోయాయి. వీటన్నిటిలోకీ తలమానికమైన "తంత్రాలోక"మనే గ్రంధం ప్రస్తుతం మనకు లభిస్తున్నది అంతవరకూ మనం అదృష్టవంతులమే అనుకోవాలి. ఈ తంత్రాలోకమనే గ్రంధాన్ని "రనేరో నోలి" అనేవాడు  సంస్కృతంనుంచి ఇటాలియన్ భాషలోకి అనువాదం చేశాడు ఈ అద్భుతగ్రంధాన్ని చదవాలనే ఆశతో జ్ఞాన తృష్ణతో ఎంతోమంది  యూరోపియన్, అమెరికన్ స్కాలర్స్ ఇప్పుడు ఇటాలియన్ నేర్చుకుంటున్నారు.

కానీ భారతీయులమైన మనకు మాత్రం అభినవగుప్తుని గురించీ లోకంకోసం ఆయన వ్రాసిన అద్భుతమైన గ్రంధాల గురించీ, వాటిలోని విషయాల గురించీ ఏమాత్రం తెలియదు. కనీసం తెలుసుకుందామన్న  ప్రయత్నమూ మనకు లేదు.అదీ మన మహర్షులకు మనమిచ్చే గౌరవం.
read more " అభినవగుప్తుని అద్భుతజీవితం "

5, ఆగస్టు 2011, శుక్రవారం

జెన్ కథలు - ఖాళీ టీ కప్పు

"A cup of Tea" జెన్ కథను చదివి బాగా ప్రభావితుడైన ఒక వ్యక్తి దాన్ని తనకు తెలిసిన స్నేహితునిమీద ప్రయోగిద్దామని అనుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్యనా అప్పుడప్పుడూ వేదాంత చర్చలు జరిగేవి. 

ఒకరోజు సాయంత్రం తన స్నేహితుని " టీ తీసుకుందాం రమ్మని" పిలిచాడు మనవాడు. పిలిచిన సమయానికి  స్నేహితుడు వచ్చి కూర్చున్నాడు. ఆమాటా ఈమాటా అయిన తర్వాత ముందే అనుకున్నట్లుగా టీ కప్పును సాసర్లో ఉంచి కేటిల్ లోనుంచి దాంట్లోకి టీ పొయ్యడం ప్రారంబించాడు మన కధానాయకుడు. టీ  పోర్లిపోతున్నా కూడా అలాగే పోస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు కధలో జెన్ సాధువు అదే చేసాడు కదా. 

ఇతను ఊహించినట్లుగానే " పోర్లిపోతున్నా పోస్తున్నావ్. ఉపయోగం ఏముంది?" అని అన్నాడు స్నేహితుడు. 

దీనికోసమే వేచి చూస్తున్న మనవాడు " నీ కప్పు నిండుగా ఉంటె ఇక నేను పోస్తున్న టీ ఎలా నిలబడుతుంది ?" అని అన్నాడు. 

దానికి స్నేహితుడు చిరునవ్వుతో "నీవు చదివిన జెన్ కధ నాకూ తెలుసు. కానీ నా కప్పు ఖాళీగా ఉంటె ఇక నీ టీతో పనేముంది?" అని జవాబిచ్చాడు.

------------------------------------------------------

మొదటి జెన్ కథ చైనాలోనో జపాన్ లోనో జరిగింది. కానీ ఈ రెండవ కధ మన దేశంలోనే, అందులోనూ ఆంధ్రాలోనే జరిగింది. చాలామంది ఆధ్యాత్మికులు ఇలాగే ప్రవర్తిస్తారు. పుస్తకాలు చదివి అందులో ఉన్నదంతా తమ అనుభవం లాగా ఎదుటివారికి చెప్పబోతారు. ఇటువంటి వారి మాటలకు, తెలియనివారు బోర్లా పడిపోతారు. కాని తెలిసినవారికి వీరి వ్యవహారం వెంటనే అర్ధం అవుతుంది. విపరీతమైన నవ్వు పుట్టిస్తుంది. 

రజనీష్ సాహిత్యాన్నీ, రమణ మహర్షి సాహిత్యాన్నీ, జిడ్డు సాహిత్యాన్నీ చదివి తమని తాము వారిలాగా భావించుకుంటూ ఇతరులకు బోధించేవారు  చాలామంది మనకు కనిపిస్తారు. కానీ వారు గమనించవలసిన విషయం ఒకటుంది. రజనీష్ గానీ, జిడ్డు గానీ, రమణ మహర్షి గానీ ఆ స్థాయికి చేరకముందు చాలా ఏళ్ళు సాధన చేశారు. ఆ సాధన సమయంలో వారు పెద్దగా మాట్లాడలేదు. తరువాత తరువాత వారి అనుభవాన్ని బట్టి లోకులతో మాట్లాడారు. కానీ వారి పుస్తకాలు చదివినవారు మాత్రం ఈ విషయం పెద్దగా పట్టించుకోరు. వారు చేసిన సాధన వీరు చెయ్యరు. కాని వారి మాటలు మాత్రం చిలక పలుకులు పలుకుతారు. సాధనా మార్గంలో ముందుకు వెళ్ళినవారి వద్ద వీరు అడ్డంగా దొరికిపోతారు.

అనుభవంతో మాట్లాడేవారి మాటలకూ, పుస్తకాలు చదివి మాట్లాడేవారికీ ఇదే భేదం. పుస్తకం నుంచి అనుభవం ఎన్నటికీ రాదు. కాని అనుభవం నుంచి ఎన్నో పుస్తకాలు పుట్టుకొస్తాయి. పుస్తకాలలో లేని కొత్తకోణాలు అనేకం అనుభవంలో దర్శనమిస్తాయి. పుస్తకాలు చదివి అర్ధం చేసుకునే వారికి వ్యాకరణార్ధం తెలియవచ్చు. కాని అది అనుభవం లోకి రాదు. మెదడుకు అర్ధమైన దాన్ని హృదయగతమైన  అనుభవంగా మార్చుకోవాలంటే సాధన చెయ్యాలి. పండితులకూ సాధకులకూ ఉన్న తేడా ఇదే.

అందుకే జిల్లెళ్ళమూడి అమ్మగారు "పుస్తకం అనుభవాన్నివ్వదు  నాన్నా, అనుభవం పుస్తకాన్నిస్తుంది " అని చాలాసార్లు అనేవారు. అనుభవ జ్ఞానం ముందు పుస్తక జ్ఞానం వెలవెలా పోతుంది. ఎందుకంటే అనుభవం నిత్యనవీనం. పుస్తక జ్ఞానం జడం.

ఈ కధలోని వ్యక్తి జెన్ కధలు చదివి బాగా ప్రభావితుడైనాడు. కాని ఎదుటి వ్యక్తి స్థాయి ఇతనికి తెలియదు. చెప్పేవాడికి వినేవాడు లోకువ కదా. అందుకే మౌనంగా ఉన్న తన స్నేహితుడి ముందు తన జ్ఞాన ప్రదర్శన చేద్దామని చూసి బోర్లా పడ్డాడు. స్నేహితుడు ఈ కధలన్నీ తెలిసినవాడే. అంతేగాక సాధనానుభావం ఉన్నవాడు కావటంతో ఒకడుగు ముందుకేసి సమాధానం చెప్పగలిగాడు. మొదటి జెన్ కథలో ప్రొఫెసర్, జెన్ సాధువు వద్దకు వెళతాడు. కాని అప్పటికే అతని తలనిండా అంతకుముందే చదివిన తత్వశాస్త్రపు బరువు నిండి ఉండటంతో తానూ చెప్పబోయే జెన్ విధానం అతనికి ఎక్కదని పోర్లిపోతున్న టీ కప్పు ద్వారా  జెన్ సాధువు మార్మికంగా సూచిస్తాడు. అదే సంఘటనను ఇక్కడా రిహార్సల్ చెయ్యబోయి మనవాడు భంగపడ్డాడు. 

సినిమాలు చూసి అందులోని హీరో తో ఐడెంటిఫై అయ్యే అర్భకులు చాలామంది ఉంటారు. వాళ్ళు సినిమా చూచి హాల్ బయటకొచ్చి అచ్చు ఆ హీరోలా ప్రవర్తించబోయి భంగ పడుతూ ఉంటారు. ఇదీ అలాటిదే. ఆ హీరోలా మనం ఉండాల్సిన పనిలేదు. మనం మనలా ఉంటె చాలు. సినిమా పాత్ర ఊహాలోకంలోది. దానిని అనుకరిస్తూ  ఊహల్లో విహరించేవాడు వాస్తవంలో భంగపడక తప్పదు.

జీవితం నిత్యనూతనం. ప్రతి క్షణమూ ఒక కొత్త సుగంధాన్ని మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ఒకసారి జరిగిన ఘటనలో మళ్ళీ మళ్ళీ కొత్తదనం ఉండదు. అక్కడ ప్రొఫెసర్ కూ ఇక్కడి స్నేహితునికీ పోలిక లేదు. ఇద్దరూ భిన్నమైన వ్యక్తులు. ప్రొఫెసర్ ఎన్నో గ్రంధాలు చదివిన తత్వవేత్త. కాని సాధన లేనివాడు. ఈ కధలోని స్నేహితుడు గ్రంధ పాండిత్యమూ సాధనా బలమూ రెండూ ఉన్నవాడు. అందుకే చక్కని సమాధానం చెప్పాడు. 

అతను అడిగిన ప్రశ్నలో మంచి అర్ధం ఉంది. "నా కప్పు ఖాళీగా ఉంటే ఇక నీవు టీ పోయ్యవలసిన అవసరం ఏముంది? " అంటూ ఇతనికి తెలియని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. మామూలుగా టీ తాగడమే ఇక్కడి విషయమైతే ఇంత చర్చ అవసరం లేదు. ఇద్దరూ టీ తాగి ఎవరి దారిన వారు పోవచ్చు. అలాంటప్పుడు ఖాళీగా ఉన్న కప్పులోనే టీ పోయ్యగలం. తాగగలం కూడా. కానీ, ఇక్కడ విషయం అది కాదు. కప్పు ఖాళీగా ఉండటం అంటే భావశూన్యస్థితిని పొందటం. అలా శూన్య స్థితిని పొందిన వ్యక్తికి ఇక బయటిజ్ఞానం యొక్క అవసరం లేదు. శూన్యమూ పూర్ణమూ ఒకటే. లోపల నిరంతరం ఊట ఊరుతున్న వాడికి బయటినుంచి ఏదీ సరఫరా చెయ్యవలసిన అవసరం ఉండదు. శ్రీ రామకృష్ణులు ఇదే అనేవారు. ధాన్యపుకొట్టులో గుట్టగా నిలువఉన్న ధాన్యాన్ని లాగుతున్నకొద్దీ, వెనుకనున్న ధాన్యం నిరంతరమూ ముందుకొస్తూనే  ఉంటుంది. అలాగే నిత్యనూతనమైన భావ పరంపరను జగన్మాత ఎప్పుడూ సరఫరా చేస్తూనే ఉంటుంది. విశ్వ చైతన్యంతో అనుసంధానం కాగలిగినవారికి భావాల లోటు ఎప్పటికీ ఉండదు. ఈ విషయాన్నే స్నేహితుడు సున్నితంగా సూచించాడు.

జెన్ సాధువును ఇమిటేట్ చేద్దామని మనవాడు అనుకున్నాడు. కాని ఆధ్యాత్మిక జీవితంలో అనుకరణకు విలువలేదు. చివరకు గురువును కూడా అనుకరించడం పనికిరాదు. ఇక్కడ మన అనుభవాన్ని బట్టి మనం ప్రవర్తించవలసి ఉంటుంది. మన కాళ్ళమీద మనం నిలబడవలసి ఉంటుంది. అప్పుడే మన ప్రవర్తనలో స్వచ్చత ఉంటుంది. ఇక్కడ జరిగిన సంఘటన అదే. కాకపొతే మొదటి జెన్ కథలో జరిగింది స్వచ్చందంగా జరిగిన సంఘటన. ఇది నకిలీ. ఈ నకిలీ ఘటనలో కూడా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ద్వారా నూతనత్వాన్ని తేగలిగాడు స్నేహితుడు. జీవితం నిత్యనవీనం. ధ్యాని కూడా నిత్యనవీనమైన స్తితిలోనే నిత్యమూ ఉండాలి. అప్పుడే భూతకాలపు నీడలు అతన్ని దరిచేరకుండా ఉంటాయి.

పుస్తకాలు చదివి ఇతరులకు చెప్పేవారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. ప్రస్తుతపు కార్పోరేట్ గురువులందరూ మన ప్రాచీన సాహిత్యాన్ని కాపీ కొడుతున్నవారే. కాకపోతే ఎవరూ కూడా మూలాన్ని ఉదాహరించరు. అదే విచిత్రం. పుస్తకం చదివి ఇతరులకు చెప్పడం గొప్ప కాదు. అది చాలా తేలిక. కాని, చదివినదానిని తన అనుభవంగా తెచ్చుకోవడానికి చాలా కష్టపడి సాధన చెయ్యవలసి ఉంటుంది. అలా చేసేవారు తక్కువగా ఉంటారు. ముందు సాధన, తరువాత 'అవసరమైతే' బోధన. అవసరం లేకపోతే మౌన నిష్క్రమణ. ఆధ్యాత్మిక మార్గంలో ఇదే సరియైన విధానం. 

ఆధ్యాత్మిక లోకంలో పాండిత్య ప్రదర్శనకు దమ్మిడీ విలువలేదన్న విషయమూ, సాధనాపరులవద్ద వినయమే శోభిస్తుంది కాని పాండిత్యం భంగపడుతుందన్న విషయమూ   మనం గ్రహించాలి.
read more " జెన్ కథలు - ఖాళీ టీ కప్పు "

3, ఆగస్టు 2011, బుధవారం

అభినవగుప్తుని కాశ్మీరశైవం - పరాద్వైతం

మన హిందువుల్లో చాలామందికి హిందూమతం గురించి ఏమీ తెలియదు అంటే వినడానికి విచిత్రంగా ఉండొచ్చు. కాని ఇది చేదువాస్తవం. పాపులర్ హిందూయిజం అంటే ఏదో ఒక గుడికెళ్ళి రావడం, మొక్కులు మొక్కుకోవడం ఏదో ఒక బాబాకో స్వామికో అనుయాయులుగా ఉండటం అని చాలా మంది అనుకుంటారు అలాగే అనుసరిస్తారు కూడా.

కాని అసలైన హిందూమతం ఇది కాదు. హిందూమతాన్ని పూర్తిగా అర్ధం చేసుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలూ అతితేలికగా అర్ధమౌతాయి. అంతేకాదు ప్రపంచ తాత్వికచింతన అంతా కూలంకషంగా అర్ధం అవుతుంది. ఎంతమంది మహనీయులు మన మతాన్ని తరతరాలుగా పరిపుష్టం చేశారో అధ్యయనం చేస్తే, 'అసలు మతమంటే ఏమిటి?' అన్నవిషయం పైన  అద్భుతమైన అవగాహన కలుగుతుంది.

కాని చాలామంది ఆ దిశగా ప్రయత్నం చెయ్యరు. మన మతం గురించి మనకే పూర్తి అవగాహన లేనప్పుడు ఎవరు ఏది చెప్పినా నమ్మవలసి వస్తుంది. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నది అదే. తెలుసుకుందామని తృష్ణ ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాని సరిగా చెప్పేవారే లేరు. ఉన్న కొద్దిమంది స్వాములూ వారివారి సొంత వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు. అంతేగాని సనాతన హిందూమతాన్ని గురించి సరియైన అవగాహన ప్రజలకు కలిగిద్దామని వారిలో ఎవరికీ లేదు.

నిజానికి ప్రతి మతంలోనూ రెండు రకాల మనుషులుంటారు.

ఒకటి -- మతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా, తమకు తోచినదాన్నే సరియైనదిగా భావిస్తూ, తాము ఆ మతాన్ని సరిగానే అనుసరిస్తున్నాం అనుకుంటూ ఉండేవారు.

రెండు -- మతాన్ని లోతుగా స్టడీ చేసి దానిలోని వివిధ సాంప్రదాయాలను ఆకళింపు చేసుకుని వాటిని ఆచరణలో పెట్టేవారు.

ఏ మతం లోనైనా ఎక్కువశాతం మొదటి రకమే ఉంటారు. వీళ్ళ మధ్యనే గొడవలూ కొట్టుకు చావడమూ ఉంటాయి. రెండో రకం వారితో ఏ రకమైన ఇబ్బందీ ఉండదు. వారు ఎవరితోనూ గొడవ పడరు.

అదలా ఉంచితే, మన మతంలోని అనేకమంది మహనీయుల పేర్లే మనకు తెలియవు అంటే ఇంకా వింతగా ఉంటుంది. కాని ఇది కూడా వాస్తవమే. త్రిమతాచార్యులైన  మధ్వ, రామానుజ, శంకరుల పేర్లు విన్నవారికి కూడా వారి వారి భావాల్లోని లోతుపాతులు తెలియవు. ఇక దక్షిణదేశపు సిద్ధ సాంప్రదాయమూ, ఉత్తరదేశపు నాధ సాంప్రదాయమూ, కాశ్మీరదేశపు పరాద్వైతమూ గురించి కనీసం విననివారు కూడా ఎందఱో హిందూమతంలో ఉన్నారు.

ఉదాహరణకు, కాశ్మీరశైవంలో అత్యంత ప్రతిభాశాలీ, మహానీయుడూ ప్రవక్తా అయిన అభినవగుప్తుని పేరు మనలో చాలామందికి తెలియదు. ఆయన వ్రాసిన గ్రంధాలూ, వాటిల్లో ఆయన చర్చించిన అద్భుతమైన విషయాలూ అసలే తెలియవు. శంకరుని సిద్దాన్తంలోనూ, బుద్ధుని సిద్ధాంతం లోనూ ఉన్న లోటుపాట్లను సవరించిన మేధాశాలి అభినవగుప్తుడు.  మహాపాండిత్యానికి తోడు అష్టసిద్దులనూ అరచేతులో ఉంచుకున్న యోగశక్తి ఈయన సొంతం. ఈయన జీవితం ఒక అద్భుతం. మనకున్న ఋషిఋణం తీరాలంటే ఇటువంటి మహనీయుల జీవితాలను మనం తెలుసుకోవాలి.

అభినవగుప్తుని జీవితాన్నీ భావాలనూ వచ్చే పోస్ట్ లో చూద్దాం.
read more " అభినవగుప్తుని కాశ్మీరశైవం - పరాద్వైతం "