10, ఏప్రిల్ 2026, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 57 (విశ్వాత్మ - దత్తాత్రేయుడి అవతారాలు)

'ఏం? పెద్దపెద్దవాళ్లకి పిచ్చి రాకూడదా? లేక పిచ్చోళ్ళు పెద్దవాళ్ళు కాకూడదా? నీ ఉద్దేశం ఏంటి?' అడిగాను.

'అలాకాదు, చాలామంది వాళ్ళని నమ్ముతున్నారు కదా !' అన్నాడు

'ఒకప్పుడు ప్రపంచంలో చాలామంది భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. ఈనాటికీ అలా నమ్మే సొసైటీలు కొన్ని ఉన్నాయి. మనం కూడా అదే నమ్మాలిగా నీ లాజిక్ ప్రకారం?' అన్నాను.

తనేమీ మాట్లాడలేదు.

'అందరూ నమ్ముతున్నారని నువ్వు నమ్ముతావా? లేక నీ బుద్ధితో నువ్వు ఆలోచించుకొని నమ్ముతావా? ప్రకృతి నీకు బుద్ధినిచ్చింది ఎందుకు?' అడిగాను.

'పుట్టపర్తిలో నాకొక డివైన్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అందుకని నేను నమ్ముతున్నాను' అన్నాడు శ్రీనివాస్

నవ్వాను.

'అదేంటో నాకూ చెప్పు. విని తరిస్తాను. మనమనుకునే డివైన్ ఎక్స్పీరియెన్స్ లన్నీ చాలావరకూ మన భ్రమలే. మనకు కలిగే విజువల్, ఆడిటరీ, థాట్ లెవల్ ఇల్యూషన్స్ అన్నింటినీ డివైన్ ఎక్స్పీరియన్స్ లుగా అనుకోవడం మనలోని అహంకారానికి సూచన. "నాకంటే గొప్పవాడు ఇకలేడు. నాకు కాకపోతే ఇంకెవరికి ఇవి కలుగుతాయి? నేనొక అవతారపురుషుడిని" అనుకోవడమే ఒక పెద్ద మానసికరోగం' అన్నాను.

'విశ్వాత్మ గారు కూడా సత్యసాయిని నమ్మేవారు' అన్నాడు.

'దానికి నన్నేం చెయ్యమంటావు? చెప్పాగా, పెద్దపెద్దవాళ్ళకి పిచ్చి ఉండకూడదని రూలేమీ లేదని. విశ్వాత్మగారిని కొన్ని విషయాలలో నేను అభిమానిస్తాను. అంతమాత్రంచేత, ఆయన నమ్మేవన్నీ నేనెందుకు నమ్ముతాను?' అన్నాను.

'ఆయన తెలివిలేనివాడా?' అడిగాడు.

'అంతే ! కొన్నివిషయాలలో తెలివి ఉండవచ్చు. అన్నింటిలో ఉండాలని లేదు. అలా ఉండదు కూడా. ఉంటే, 1992 లో హైద్రాబాద్ మీటింగులో పళ్లెం కింద అంటించి ఉన్న బంగారుగొలుసును చేతులోకి తీసుకొని, దానిని తను సృష్టించినట్లు నటిస్తూ, టీవీ కెమెరాలకు బాబా దొరికిపోయిన విషయాన్ని విశ్వాత్మగారు ఎలా సమర్థిస్తారు?' అడిగాను.

మౌనం.

'పోనీ, 1993 లో పుట్టపర్తిలో జరిగిన విద్యార్థుల హత్యకేసును ఎలా సమర్థిస్తాడు? లేదా, బాబామీద ఉన్న హోమోసెక్స్ ఆరోపణలను ఎలా సమర్థిస్తాడు?' అడిగాను.

'అవేవీ రుజువు కాలేదుగా?' అన్నాడు.

'ఆధారాలన్నింటినీ మాయం చేస్తుంటే ఎలా అవుతాయి?' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'అవును. రూంలో దాక్కుని ఉన్న నలుగురు స్టూడెంట్స్ నీ కాల్చి చంపకుండా, పట్టుకొని ఉంటే నిజాలు బయటకొచ్చేవి. వాళ్ళ రూంకి బయట తాళంపెట్టిన తర్వాతనే కదా భక్తులు పోలీసులను పిలిచారు? వాళ్ళను షూట్ చేయవలసిన పనేముంది? ఇది ఆధారాలను మాయం చేయడమే కదా. అతీతశక్తులున్న బాబా, మెట్లదారి గుండా పై రూంకి పారిపోయి దాక్కోవలసిన పనేముంది?' అన్నాను.

మౌనం.

'పిచ్చివాడా ! నీకింకా చాలా విషయాలు తెలీవు. నా ప్రశ్నకు నువ్వెలా జవాబు చెప్పాలో కూడా నేనే చెబుతా విను.  "కాలయవనుడు తరుముతుంటే కృష్ణుడు కూడా పారిపోయి ముచికుందుని గుహలో దూరాడు కదా? పారిపోవడం కూడా ఒక లీలే" అని నువ్వు సమర్ధించుకోవాలి. ఇది కూడా తెలీదా? ఎప్పుడు ఎదుగుతార్రా మీరు?' అన్నాను నవ్వుతూ.

వింటున్నాడు.

'అసలు విశ్వాత్మగారి పేరు విశ్వాత్మేనా?'  అన్నాను.

నేను ఏ సెన్స్ లో అన్నానో అతనికి అర్ధం  కాలేదు. నిజంగా "విశ్వాత్మ" అయితే ఇలా ఎలా బొక్కబోర్లా పడతాడనేది నా ప్రశ్న.

'కాదు. ఆయన పేరు విశ్వాత్మ దిగంబర అవధూత' అన్నాడు.

'మరి ఆయన బట్టలు కట్టుకునేవాడుగా? మాతో కలిసి విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ కి కూడా వచ్చాడు' అడిగాను నవ్వుతూ.

'ఆయన గదిలో విప్పేసే ఉండేవాడు' అన్నాడు.

'ఓహో ! దిగంబర అవధూత అంటే, తన గదిలోనో, బెడ్రూంలోనో, బాత్రూంలోనో మాత్రమే విప్పుకునేవాడా? అలా అయితే, లోకంలో అందరూ దిగంబర అవధూతలేగా. అక్కడిదాకా ఎందుకు? 2008-10 మధ్యలో నేను గుంతకల్లు రైల్వేక్వార్టర్స్ లో ఒక్కడినే ఉన్నాను. ఇంట్లో ఉన్నపుడు నేనుకూడా దిగంబరంగానే తిరిగేవాడిని. ఆఫీసుకెళ్లేటప్పుడు మాత్రం బట్టలేసుకుని వెళ్ళేవాడిని. మరి నేనూ అదేగా?' అన్నాను.

మౌనం.

'ఆయనది ఏ సాంప్రదాయం?' అడిగాను.

'దత్తసాంప్రదాయమే అనుకుంటా. ఆయన కడపలో అవధూతదీక్ష తీసుకున్నారు' అన్నాడు.

ఈసారి ఇంకా పెద్దగా నవ్వొచ్చింది.

'అవధూత దీక్షలా? అవేమైనా అయ్యప్పదీక్షలా నెలకొకసారి వేసుకొని, ఇంకోనెలకు విప్పెయ్యడానికి? వాటినసలు ఇచ్చేవాళ్లున్నారా? అలా తీసుకుంటే అవధూతలు   అయిపోతారా?' అడిగాను.

తను పుస్తకాలు బాగా చదివాడు. కానీ అన్వయం దొరకడం లేదు. అయితే, నేను చెబుతున్నదానిని కనీసం అర్ధం చేసుకోగలుగుతున్నాడు.

'దత్తాత్రేయులకు ఒక సాంప్రదాయము. అవతారాలు ఉన్నాయా అసలు?' అడిగాను.

'ఎందుకు లేవు? మహారాష్ట్రలో ఆయన అవతారాలు చాలామంది ఉన్నారు. షిరిడీబాబా కూడా ఆ అవతారాలలో ఒకరే' అన్నాడు.

'ఇది నీ అనుభవమా? లేక బల్లపరుపు బ్యాచ్ ఎక్కించిన వైరసా?' అడిగాను.

'భరద్వాజ గారికి కూడా షిరిడీలో అనుభవం అయిన తర్వాతనే మారిపోయారు' అన్నాడు.

'చెప్పాగా, మన అనుభవాలన్నీ మన భ్రమలే అని' అన్నాను.

'మరి ఆయన అనుభవం అబద్దమా?' అడిగాడు.

'అని అనడానికి నేనెవర్ని? ఎవరి అనుభవం వారిదే. కానీ అది సత్యానుభవం కావాలని రూలేమీ లేదనే నేనంటున్నాను. ఆరోజున్న గ్రహస్తితులను బట్టి సెన్సిటివ్ మనుషులకు ఏవేవో అనిపిస్తాయి. వాటిని నువ్వు డివైన్ ఎక్స్పీరియన్స్ అని పేరు పెట్టుకుంటే నేనేం చేసేది? భరద్వాజగారి జాతకం చూడు. దానిలో బలమైన గురుదోషం ఉంది. అందుకే ఆయన సాంప్రదాయ వైష్ణవకుటుంబంలో పుట్టికూడా, ముస్లిం ఫకీరైన షిరిడీసాయి భక్తుడయ్యాడు. ఇది నా అవగాహన' అన్నాను.

'సాయిలిద్దరినీ అమ్మ కూడా ఒప్పుకున్నారు. "వాళ్ళూ నా పిల్లలే" అని అమ్మ అన్నారు' అన్నాడు.

'అమ్మ ఎవర్ని కాదన్నది? 'తల్లికి తప్పే కనిపించదు' అనిన మహాతల్లి ఆమె. అమ్మ పిల్లలు కానివారెవరు? నువ్వూ నేనూ కూడా అమ్మ పిల్లలమే. మరి నేను చెబుతున్నది నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు?' అన్నాను.

'భరద్వాజగారు సివిల్స్ పాసయ్యారు. మహా తెలివైనవాడు' అన్నాడు.

'కావచ్చు. సివిల్స్ నేనూ పాసయ్యాను. ఒక తెలివైన వ్యక్తి, ఆర్నెల్లు కష్టపడితే సివిల్స్ క్లియర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. స్వానుభవంతో నేనీమాట చెబుతున్నాను. ఆయన కూడా అదే ప్రూవ్ చేశాడు. నిజానికి వేదవ్యాస విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి ఆయన ఆ పనిని చేశాడుగాని, సివిల్స్ పాసవ్వాలని ఆయనకేమీ లేదు' అన్నాను.

మౌనం.

'అకాడెమిక్ తెలివికి, ఆధ్యాత్మికతెలివికీ సంబంధం లేదు. ముందే చెప్పాగదా, పెద్దవాళ్ళకి పిచ్చి ఉండకూడదని రూలేమీ లేదని. అందుకే, పెద్దపెద్ద బ్యూరోక్రాట్లు, మేధావులు, సయింటిష్టులు, దేశాధినేతలు కూడా చిన్న బూడిదట్రిక్కుకు పడిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళ తెలివేమైంది మరి?' అన్నాను.

'ఇంతకీ దత్తాత్రేయుడికి అవతారాలు లేవా?' అడిగాడు.

'ఖచ్చితంగా లేవు' అన్నాను.

'ఈ మాట ఎవరు చెప్పారు?' అన్నాడు.

'నేనే చెబుతున్నాను' అన్నాను.

'మీరు చెబితే ఎలా సరిపోతుంది?' అన్నాడు.

'మరి ఎవరు చెబితే సరిపోతుంది?' అడిగాను.

'ఉన్నాయని అందరూ అంటున్నారు' అన్నాడు.

'కధ మళ్ళీ మొదటికొచ్చింది' అన్నాను.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 57 (విశ్వాత్మ - దత్తాత్రేయుడి అవతారాలు) "

విజయపత్ సింఘానియా జాతకం - గురుదోషం

విజయపత్ సింఘానియా 4 అక్టోబర్ 1938 న కాన్పూర్ లో  పుట్టాడు. రేమాండ్స్ సంస్థ అధినేతగా బిజినెస్ సర్కిల్స్ లో ఈయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఈయన మార్చి 28 న ఒక అద్దెఇంటిలో చనిపోయాడు. వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయినప్పటికీ చివరకు ఈయన జీవితం విషాదాంతం అయింది.  దానికి కారణం గురుదోషం. ఈయన జాతకాన్ని చూద్దాం.

అయితే, ఈయన జననసమయం దొరకడం లేదు. కనుక సవరణ చేద్దాం. దీనిని చాలా తేలికగా చేయవచ్చు. 

ఈయన తండ్రి L. K. సింఘానియా చాలా ధనవంతుడు మరియు వ్యాపారవేత్త. కనుక 3.01 pm తర్వాత ఇతను పుట్టి ఉండాలి. అప్పుడు మకరలగ్నం మేషనవాంశ అవుతుంది. 4.00 లోపు మేషంనుండి కన్యవరకూ నవాంశలు నడుస్తాయి. వీటిలో మేషనవాంశ అయినప్పుడే జీవిత సంఘటనలు సరిపోతున్నాయి. అందులోనూ 3. 01 pm అయితేనే ఇవన్నీ సరిపోతాయి.

కొన్ని ముఖ్య సంఘటనలను చూద్దాం.

1980 - రేమాండ్స్ గ్రూపుకు చైర్మన్ అయ్యాడు. అప్పుడు గురు రాహుదశ నడిచింది. రాహుకేతువులు నవాంశచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని చూడవచ్చు.

2000 - ఈ సంవత్సరంలో రేమాండ్స్ సంస్థ పగ్గాలను మూడవ సంతానమైన గౌతమ్ సింఘానియాకు అప్పగించాడు. బుధ బుధ దశ నడిచింది. 9 వ భావమైన కన్యలో 8 వ భావాధిపతి సూర్యునితో కలసి ఉచ్చ బుధుఁడున్నాడు. కనుక అధికారమూ సంపదా రెండూ తనచేతినుంచి జారిపోయాయి. భావాద్భావ సూత్రాన్ని బట్టి 9 వ స్థానం కూడా సంతానభావమే.

20 మార్చి 2006 - పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ముంబాయి మేయర్ అయ్యాడు. బుధ రవి కేతు దశ నడిచింది. ఉచ్ఛస్థితిలో ఉన్న బుధునితో రవి కలసి నవమస్థానంలో ఉన్నాడు. కేతువు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.

2015 లో రేమాండ్స్ సంస్థలో తన వాటా (37%) ను కూడా కొడుక్కి ఇచ్చేశాడు. అక్కడే లీగల్ గొడవలు మొదలైపోయాయి. అప్పుడు బుధ శని కుజ దశ నడిచింది. ఈ దశలో మానసికచింత, గొడవలు సహజమే.

87 ఏళ్ల వయసులో 28 మార్ఛి 2026 న చనిపోయాడు. ఆ రోజున శుక్ర రవి రాహు గురుదశ నడిచింది. పెద్దవయసులో వచ్చేవి తప్ప చెప్పుకోదగ్గ జబ్బులేమీ లేవు. దశలు సరిపోతున్నాయి. కనుక, ఇదే ఈయన జననసమయంగా అనుకోవచ్చు.

ఈయన జాతకంలో ఉన్న బలమైన గురుదోషం వల్ల కొడుకులతో, వారి పిల్లలతో, గొడవలు, కోర్టుకేసులు, మనోవ్యధ కలిగాయి. తన ఇంటినుండి గెంటివేయబడ్డాడు. ఏ ముంబాయికైతే తను మేయర్ గా పనిచేశాడో, ఎక్కడైతే ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడో, అదే ముంబాయిలో ఒక అద్దెఇంటిలో ఉంటూ చనిపోయాడు. An Incomplete Life అనే ఆత్మకథను పుస్తకంగా వ్రాసి అసంతృప్తితో కన్నుమూశాడు.

12,000 కోట్లు సంపాదించి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కూడా చివరకు అసంతృప్తితో కుటుంబపు గొడవలతో చనిపోయాడంటే, ఇతని జాతకంలో గురుదోషం ఎంత బలంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

దీనికంతటికీ కారణం, మూడవకొడుకు గౌతమ్ సింఘానియాతో ఉన్న ఆస్తిగొడవలు. మూడవ కొడుకును సూచించే 9 వ భావంలో ఉచ్చబుధుడు, రవి ఉన్నారు. రాహుకుజులతో శనికేతువులతో ఆర్గళంలో ఉంటూ, చాలా తెలివైన సంతానాన్ని, అదేసమయంలో బలమైన సంతానదోషాన్ని సూచిస్తున్నారు.అందుకే, ఆస్తిని కంపెనీని అన్నింటినీ మూడవకొడుకుకు రాసిచ్చేయగానే ఈయన రోడ్డున పడ్డాడు. పద్మభూషణ్ అవార్డును అందుకుని, అంతర్జాతీయస్థాయిలో ఒక వెలుగు వెలిగిన రేమాండ్స్ దిగ్గజం చివరకు అద్దెఇంటిలో దిక్కులేకుండా చనిపోయాడు.

గురుదోషం అంటే ఇలా ఉంటుంది !

మరి అన్నిదోషాలనూ పిచ్చిపిచ్చి హోమాలతో, పిచ్చిపిచ్చి రెమెడీలతో బాగుచేస్తామని డప్పు కొట్టుకునే జ్యోతిష్కులు పాపం ఈయనకు అందుబాటులో లేరా? ఉన్నా, ఈ గురుదోషాన్ని తొలగించడం వారివల్ల కాలేదా? లేక ఈయన దగ్గరున్న పన్నెండువేలకోట్లు ఆ దోషాన్ని పోగొట్టడానికి సరిపోలేదా?

దీనివల్ల రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా?

ఒకటి - జాతకదోషాలు అంత తేలికగా పోవు. మామూలు జ్యోతిష్కులకు అర్ధంకాని లోతులు దీనివెనుక ఉంటాయి.

రెండు - డబ్బులు పారేసి చేసే రెమెడీలతో అవి అస్సలు లొంగవు. మీ అవినీతిసొమ్ము జ్యోతిష్కుడికి చేరడం తప్ప దీనివల్ల జరిగేది ఇంకేమీ ఉండదు.

జాతకదోషాలను పోగొడతాని, పోగొట్టగలనని, ఏ జ్యోతిష్కుడైనా డప్పు కొట్టుకుంటుంటే, ఆ మాటలు నమ్మారంటే, మీరు మోసపోతున్నట్లే. జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులు అతనికి తెలీకనైనా ఉండాలి. లేదా మిమ్మల్ని అతను మోసం చేస్తూనైనా ఉండాలి. రెండూ కూడా కావచ్చు.

మీరు పెట్టుకునే ఉంగరాలవల్ల, చేసే దొంగపూజలవల్ల, తిరిగే గుళ్ళవల్ల మీ జాతకదోషాలు ఎక్కడికీ పోవు. మీరు దేనినైనా మోసం చేయవచ్చుగాని, మీ కర్మను మోసం చేయలేరు. 

ఈ జాతకం చూచాక కూడా అర్ధం కాలేదా?

అయితే మీ కర్మ !

read more " విజయపత్ సింఘానియా జాతకం - గురుదోషం "

9, ఏప్రిల్ 2026, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 56 (రీల్స్ చెయ్యండి)

మూడురోజులు జిల్లెళ్ళమూడిలో ఉండి నిన్ననే ఆశ్రమానికి తిరిగి వచ్చాము. అప్పుడప్పుడూ అక్కడకెళ్లి ఇంటిని చూసుకోకపోతే అది దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. అందుకని ఇష్టం లేకపోయినా అలా వెళ్లి రావడం తప్పనిసరి అవుతోంది.

చీకటిపడ్డాక ఆశ్రమంలోనూ, ఊళ్లోనూ తిరుగుతూ ఉండటం ఒక అలవాటు గనుక, మొదటిరోజు సాయంత్రం ఏడుగంటల సమయంలో సంచారానికి బయలుదేరాను. ఎదురౌతున్న వింతజీవులను చూస్తూ అమ్మ గుడికెళ్ళి వెనక్కు వస్తూ ఉండగా, ఒక పాతవ్యక్తి కనిపించాడు. పేరు శ్రీనివాస్ కాకపోయినా, అసలు పేరు చెప్పడం బాగోదు గనుక, అలా అనుకుందాం కాసేపు.

సంభ్రమంగా నమస్కారం పెడుతూ, 'చాలా రోజుల తర్వాత చూశాను మిమ్మల్ని' అన్నాడు.

మాట్లాడే పరిస్థితిలో లేను గనుక, మౌనంగా తలూపాను.

'మౌనంలో ఉన్నారా?' అన్నాడు అనుమానంగా.

'కాదు' అంటే బాగుండదని 'అవును' అన్నాను.

ఎలా అన్నా మౌనం చెదిరిపోతుందిగా ! 

'మాట్లాడు. మళ్ళీ వస్తా' అంటూ అది చక్కాపోయింది.

నవ్వుకుంటూ, సంభాషణను పొడిగించకుండా నా దారిన నేనొచ్చేశాను.

తరువాత, ఇంటికిపోయే దారిలో ఒక చెట్టుకింద నిలబడి ఉండగా స్కూటర్లో వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్నాడు.

'మీకోసం వెతుకుతున్నాను. అక్కడ గుళ్లో ఎందుకులే అని ఎక్కువగా మాట్లాడించలేదు' అన్నాడు.

'ఏంటి?' అన్నట్లు చూశాను.

'మీరింతకు ముందు బ్లాగు బాగా వ్రాసేవారు. ఇప్పుడు వ్రాయడం లేదు. నేను మీ వీరాభిమానిని' అన్నాడు.

పాపం కనిపించిన ప్రతిసారీ ఇదే మాట చెబుతూ ఉంటాడు.

'సరే' అన్నాను.

'పదహారేళ్ళ నించి, అంటే దాదాపు 2008 నుంచీ మీరు వ్రాసినవన్నీ చదివేవాడిని. నాకు బాగా నచ్చేవి. నేనపుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. 'మీ వ్రాతలలో ఒక వెలుగుంది' అని మీకు మెయిలిచ్చాను. దానికేమో మీరు 'నీలో వెలుగుంది కాబట్టి దానిని గుర్తించగలిగావు' అని రిప్లై ఇచ్చారు', అన్నాడు.

'అవునా' అన్నాను.

'తర్వాత, మీరు విశ్వాత్మ గారి గురించి వ్రాశాక, నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను. ఆయన నాతో చాలా చనువుగా ఉండేవారు' అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు.

'మీరు వ్రాస్తుంటే, ఒక కధ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కలిసిన సినిమా ఎదురుగా చూస్తున్నట్లు ఉంటుంది. పాతకాలం సినిమాలలో, హీరోయిన్ లెటర్ చదువుతుంటే అందులో హీరో కనిపిస్తూ, అదే మేటర్ చెబుతూ ఉన్నట్టు చూపించేవారు. అలా ఉంటుంది.  అందుకే మీ శైలి నాకు నచ్చుతుంది' అన్నాడు.

'సరే' అన్నాను.

'ఎందుకని వ్రాయడం తగ్గించారు?' అడిగాడు.

'అవసరం లేదనిపించింది' అన్నాను.

'ఎందుకలా అనుకుంటున్నారు? మీ అభిమానులు వేలల్లో ఉన్నారు. మీరలా ఆపేస్తే ఎలా?' అన్నాడు.

'చదివేవాళ్ళు వేలల్లో ఉండవచ్చు. అంతేనా? ఊరకే చదివి వదిలెయ్యడానికి ఇది న్యూస్ పేపర్ కాదు. నా వ్రాతల విలువ ఒక న్యూస్ పేపరే అయితే, ఆ విలువ నాకక్కర్లేదు. నన్ను వదలకుండా అనుసరించేవారు ఒక వందమంది ఉన్నారు. వారికి కావలసినది చెబుతున్నాను. వారు అందుకుంటున్నారు. చాలుగా' అన్నాను.

'అలా అయితే మిగిలిన వారి పరిస్థితేంటి మరి? మీరలా ఆపకండి. ఇది నా రిక్వెస్ట్' అన్నాడు.

'అనిపిస్తే రాస్తాలే' అన్నాను.

' ఇంకొక మాట. మీరేమీ అనుకోకపోతే ' అన్నాడు.

' మర్యాదలొద్దు. సూటిగా చెప్పు ' అన్నాను.

' బ్లాగు కంటే రీల్స్ మంచివి. ఆడియో విజువల్ మాధ్యమానికున్న శక్తి మీకు తెలీనిది కాదు. రీల్స్ ఎక్కినంత బాగా బ్లాగు పోస్టులు ఎక్కవు. అందుకని మీరు రీల్స్ చేస్తే బాగుంటుంది' అన్నాడు.

'నాకెందుకా గోల?' అన్నాను.

' మీలాంటి జ్ఞానులు మౌనంగా ఉండకూడదు. జ్ఞాని మౌనం ప్రపంచానికి మంచిది కాదు' అన్నాడు.

' జ్ఞాని ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అజ్ఞాని నిర్ణయిస్తాడా?' అడిగాను.

నవ్వేశాడు.

' కాదనుకోండి. కానీ ప్రస్తుతట్రెండ్ ను బట్టి, ఇలా చేస్తే ఎంతోమందికి సరియైనదారిని చూపించినవారౌతారు' అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు.

'మీకు అందరు మహనీయుల గురించీ క్షుణ్ణంగా  తెలుసు కదా. ఉదాహరణకు ఒక రామకృష్ణులో, అమ్మగారో, రమణులో, షిరిడీబాబానో, సత్యసాయిబాబానో, ఒక టాపిక్ మీద ఏం చెప్పారు? అన్న విషయం చిన్నచిన్న వాక్యాలలో మీరు రీల్స్ చేస్తే ఎంతోమందికి ఎంతో దిశానిర్దేశంగా ఉంటుంది కదా?' అన్నాడు.

'ఆగాగు. ఏమన్నావ్?' అన్నాను.

'నేనేమన్నాను?' అన్నట్టు అయోమయంగా చూశాడు.

'మిగతావాళ్ల విషయం అలా ఉంచు. షిరిడీబాబా, సత్యసాయిబాబా అసలు మహనీయులెలా అవుతారు? వాళ్ళు ప్రత్యేకంగా చెప్పినదేముంది? చేసినదేముంది? వాళ్ళ గురించి మళ్ళీ నేను రీల్స్ చెయ్యడమేంటి? తలకాయ ఉండి మాట్లాడుతున్నావా?' అన్నాను సీరియస్ గా.

ఖంగు తిన్నాడు.

'అదేంటి అలా అన్నారు?' అన్నాడు.

'చూశావా నేను నిజం మాట్లాడితే నీకే నచ్చలేదు. మళ్ళీ పాతికేళ్ళనుంచీ నా అభిమానినంటున్నావు. ఇక బయటివాళ్ళకెలా నచ్చుతుంది? నిజాలు లోకానికి నచ్చవు కాబట్టే నేను మునుపటిలాగా మాట్లాడటం లేదు' అన్నాను.

'లోకం అంతా నమ్ముతున్నది కదా. నమ్మేవాళ్ళలో చాలా పెద్దపెద్ద వాళ్ళున్నారు కదా. మరి, వాళ్ళందరూ పిచ్చోళ్లా?' అడిగాడు.

విషయం పాకాన పడుతోందనిపించి గొంతు సవరించుకున్నాను.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 56 (రీల్స్ చెయ్యండి) "

3, ఏప్రిల్ 2026, శుక్రవారం

World Autism Awareness Day



నిన్న ఏప్రిల్ 2 వ తేదీ World Autism Awareness Day.

ఆటిజం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఇవాళా రేపూ పుడుతున్న పిల్లలలో చాలామంది ఆటిజం లక్షణాలతోనే పుడుతున్నారు. అమెరికాలో చూస్తే, గతంలో ప్రతి 45 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో పుట్టేవారు. తరువాత అది 36 కి ఒకటిగా పెరిగింది. ఆ తరువాత 31 కి ఒకటిగా ఇంకా పెరిగింది. నేడు ప్రతి వందమంది పిల్లలలో నలుగురు ఆటిజంతో బాధపడుతున్నారు. అంటే, ప్రతి 25 మందిలో ఒక అటిజం పేషంటున్నాడు. అంటే ప్రతి ఏడాదీ అటిజం పేషంట్లు పెరుగుతున్నారు. 

ఇండియాలో అయితే లెక్కలు సరిగ్గా లేవు. కాకపోతే, ప్రతి 65 మందిలో ఒకరు ఆటిజం పిల్లవాడని ప్రస్తుతపు కాకిలెక్కలు చెబుతున్నాయి.

ప్రపంచజనాభాలో చూస్తే, ప్రతి వందమందిలో ఒకరు అటిజం పేషంటని లెక్కలున్నాయి. ప్రస్తుత ప్రపంచజనాభా 8.3 బిలియన్లు (830 కోట్లు) దాటింది.  

అంటే 8 కోట్లమంది అటిజం పేషంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నమాట !

విచ్చలవిడిగా వేస్తున్న టీకాల వల్ల, అనవసరంగా వాడబడుతున్న యాంటీ బయాటిక్స్ మరియు స్టెరాయిడ్స్ వల్ల ఈ ఖర్మ మానవాళికి పట్టుకున్నదని హోమియోపతి వైద్యశాస్త్రం అంటుంది. చాలామంది ఈ మాటను నమ్మడం లేదు. మనం నమ్మినా నమ్మకపోయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కదా మరి !

అన్నీ సక్రమంగా ఉన్న మనిషికే ఈ ప్రపంచంలో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉన్న రోజులివి. ఇక బుద్ధిమాంద్యం ఉంటే, అటువంటి పిల్లల పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే ఎంతో బాధ కలుగుతుంది. వారిని చూచుకునేవారు ఉంటే పరవాలేదు. చూచుకునేవారు ఎవరూ లేకపోతే, అటువంటి పిల్లలు ఈ దుర్మార్గపు ప్రపంచంలో ఏమైపోతారో ఊహించడానికే సాధ్యం కాదు.

కుంగ్ ఫూ సూపర్ స్టార్ జెట్ లీ, ఇదే సబ్జెక్ట్ పైన 2009 లోనే చైనాభాషలో ఒక సినిమా తీశాడు.  దాని ఇతివృత్తం మార్షల్ ఆర్ట్స్ కాదు. ఆ సినిమా పేరు Ocean Heaven. దాని కధ చాలా హృదయవిదారకంగా ఉంటుంది.

ఒక తండ్రికి లివర్ కేన్సర్ ఉంటుంది. భార్య చనిపోయి ఉంటుంది. తనుకూడా త్వరలోనే చనిపోతానని అతనికి తెలుసు. అతనికి ఒక ఆటిజం పిల్లవాడుంటాడు. అతనికి 22 ఏళ్ళు. తాను పోయాక, ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆ పిల్లవాడికి ఆ తండ్రి నేర్పిస్తూ ఉంటాడు. ఇదీ కధ.

ఈ స్క్రిప్ట్ ను చదువుతున్నప్పుడే ఎన్నోసార్లు ఏడ్చేశానని జెట్ లీ 'So Be It' అనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సినిమా పెద్ద హిట్టయింది. ఎంతోమందికి అటిజం గురించి అవగాహనను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది ఆటిజం కేర్ సెంటర్లు పుట్టడానికి కారణమైంది.

మార్షల్ ఆర్ట్స్  అభ్యాసం చేసేవారు రౌడీలై ఉంటారని, దురుసుగా ఉంటారని, వారిలో మానవత్వం ఉండదని చాలామంది పొరపాటుగా అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు భావన.

ఈ సినిమాను చూడండి. కాస్తంత మంచితనం మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే కదిలిపోతారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ సమస్యను తీర్చడానికి మనవంతుగా ఏం చేయాలా అని ఆలోచిస్తారు.

జెట్ లీ ఒక కుంగ్ ఫూ సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఒక మనసున్న మంచిమనిషి కూడా అని  ఈ సినిమా చూచాక మీరంటారు.

This film is dedicated to all the ordinary heroes among our parents అంటూ సినిమాను ముగించిన తీరు ఎంతో బాగుంది. హీరోలనేవాళ్లు సినిమాలలో చూపించినట్లుగా ఉండరు. మన చుట్టూనే ఎందరో ఉంటారు. తమ కష్టాలను నవ్వుతూ భరిస్తూ, ఏది చేయాలో దానిని మౌనంగా పబ్లిసిటీ లేకుండా చేసే ప్రతివారూ హీరోలే.

అసలు, మన తెలుగురాష్ట్రాలను చెడగొట్టినవి మన సినిమాలే అని నా గట్టినమ్మకం. తెలుగు సినిమాలంటేనే చవకబారుగా, లేకిగా, పిల్లికూతలు, కోతిగంతులు, వెకిలిపాటలు హింసలతో, ఒక చక్కని కథంటూ లేకుండా, వాస్తవాలకు దూరంగా చీప్ గా ఉంటాయి. ఒక సందేశం అంటూ లేకుండా కేవలం డబ్బుకోసం మాత్రమే సినిమాలు తీసినందువల్ల, మూడు నాలుగుతరాలు వరుసగా పాడైపోయాయి. ఇది మన కర్మ.

ఈ సినిమాను చూసి, మంచి సినిమాలంటే ఎలా ఉంటాయో కనీసం తెలుసుకోండి.
read more " World Autism Awareness Day "

చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి?

ప్రపంచ ప్రఖ్యాత కరాటే ఛాంపియన్ చక్ నారిస్ గురించి తెలియనివారు మార్షల్ ఆర్ట్స్ సర్కిల్లో ఉండరు. The Way Of The Dragon అనే సినిమాలో బ్రూస్ లీ తో ఇతను చేసిన ఫైట్ చాలా పాపులర్ అయింది. ఈ సినిమా పేరును తరువాత Return Of The Dragon గా మార్చారు.

ఇతను మొన్న మార్చి 19 న అమెరికాలో చనిపోయాడు. ఆ సమయానికి ఇతనికి 86 ఏళ్ళు. చివరిక్షణాలలో ఇతని హెల్త్ గురించి ఏ విధమైన సమాచారమూ మీడియాలో అందటం లేదు. గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

ఇతను 10 మార్చి 1940 న ఒక్లహామా లోని ర్యాన్ అనేచోట పుట్టాడు. సమయం ఉదయం 3 గంటలు. ఇతని జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు.

మార్చి 19 వ తేదీన ఇతని జాతకంలో రాహు శుక్ర బుధ బుధ బుధ దశ నడిచింది. రాహువు ఉచ్ఛబుధుని సూచిస్తున్నాడు. ఈ జాతకానికి బుధశుక్రులు మారకులు. బుధునికి వచ్చిన 4/7 భావాధిపత్యాల వల్ల ఇది గుండె సంబంధిత సమస్య అని అర్ధమౌతున్నది.

బుధుడు నీచస్థితిలో గ్రహయుద్ధంలో వక్రించి ఉన్నాడు. వక్రతవల్ల కుంభంలో ఉన్న సూర్యుడిని కలుస్తాడు. ఇదికూడా గుండెసంబంధిత సమస్యకు సూచికయే. పైగా, ప్రస్తుతం ఇతనికి ఏలినాటిశని మధ్యభాగం నడుస్తున్నది.

గతంలో 2017 లో జూలై 16, 17 తేదీలలో ఇతనికి రెండు హార్ట్ ఎటాక్స్ వచ్చాయని ఒక పుకారుంది. ఇతను ప్రపంచ సెలబ్రిటీ గనుక, ఇతనికున్న ఇమేజి దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచారు. ఆ రోజులలో ఏం జరిగిందో, గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

ఆ రోజులలో ఇతనికి రాహు గురు శుక్ర శుక్ర శుక్ర దశ నడిచింది.

బుధశుక్రుల ప్రభావం మళ్ళీ స్పష్టంగా కనిపిస్తున్నది. అంతర్దశలో లగ్న, చంద్రలగ్నాలకు అధిపతి అయిన గురువున్నప్పటికీ, నవాంశలో నీచస్థితిలో ఉండటంతో ఇతనికి గురుదోషం ఉన్నది. కనుక ఆ రోజునకూడా ఇతనికి హార్ట్ ఎటాక్స్ వచ్చినది నిజమే అని తెలుస్తున్నది. గురువు పాత్ర వల్ల పార్టీలు,  వేళతప్పి  ఎక్కువగా తినడం మొదలైన పొరపాట్లు జరిగి ఉండవచ్చు.

సూర్యునిపైన రాహుకేతువుల ప్రతికూల దృష్టులు, మరియు యురేనస్ యొక్క అనుకూలదృష్టి ఉన్నాయి. కనుక, గుండెసంబంధిత సమస్యకు గురైనప్పటికీ, సమయానికి సరియైన వైద్యసహాయం అందటంతో బ్రతికి బయటపడ్డాడు. పైగా ఆనాడు గోచారశని 9 వ భావమైన తులలో వక్రించి, 8వ భావం ఆయుష్యస్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకని బ్రతికించాడు. ఇప్పుడు ఏలినాటిశని గనుక తీసుకుపోయాడు.

మీడియాలో లీక్ చేయకపోయినా, ఇతను చనిపోయినది గుండె సంబంధిత సమస్యతోనే అని దీనిని బట్టి అర్ధమౌతున్నది.

read more " చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి? "