“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, ఆగస్టు 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 12 (అమెరికన్ తాంత్రికుడు - అసలైన భక్తి)

పరాశక్తి ఆలయంలో ఒక విచిత్రమైన మనిషి కనిపించాడు. అతనొక అమెరికన్ యువకుడు. కానీ అర్ధనారీశ్వర వేషంలో ఉన్నాడు. పైన ఒక వలలాంటి జాకెట్టు వేసుకున్నాడు. క్రిందేమో ఒక కాలికి ప్యాంటు, ఒక కాలికి చీర ఉన్న డ్రస్సు వేసుకున్నాడు. దానిపైన ఒక లంగా లాంటిది కట్టుకున్నాడు. తలకొక బ్యాండ్. దానిలో నెమలి ఈకలు, కోడి ఈకలు, ఇంకా ఏవేవో పిట్టల ఈకలు పెట్టుకున్నాడు. చేతికి జోలెసంచి. మొలకు ఏవో చిన్నచిన్న సంచులు వేలాడుతున్నాయి. కళ్ళజోడు పెట్టుకుని, రెండు జుట్టుపీచులు కళ్ళమీదుగా వేలాడేసుకున్నాడు.  అథ్లెటిక్ బాడీతో మంచి ఫిట్  గా  ఉన్నాడు.

హఠాత్తుగా చూసి అతనొక అమ్మాయేమో అనుకున్నాను. కానీ కాదు అబ్బాయే. అలాంటి విచిత్రవేషంలో ఉన్నాడు. అక్కడకు దగ్గరలోనే ఉంటాడు లాగా ఉంది,  కార్యక్రమం అయిపోయాక రోడ్డుపక్కనే నడుచుకుంటూ తన ఇంటికి పోతూ కనిపించాడు.

అందరూ అతన్ని విచిత్రంగా చూస్తున్నారు. కానీ అతనేమీ పట్టించుకోవడం లేదు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. అమ్మవారంటే చాలా భక్తి ఉంది. చేతులు జోడించి ధ్యానంలో ఉంటాడు. అప్పుడప్పుడూ భుజానికున్న సంచిలో ఏదో ఇంగ్లిష్ పుస్తకం ఉంది. దానిని చదువుకుంటూ, పెన్నుతో అందులో ఏదో వ్రాసుకుంటూ ఉంటాడు. లేదా, ఒకచోట కూర్చుని, తన మొలకు వేలాడుతున్న చిన్న సంచిలోనుంచి ఏవో గోళీలు, క్రిస్టల్స్ లాంటివి తీసి చేతులో పెట్టుకుని వాటిని చూస్తూ ఉంటాడు. లేదా వాటితో ఆడుతూ, కళ్ళుమూసుకుని ఏవేవో చదువుతూ ఊగిపోతూ ఉంటాడు. ఎవరి జోలికి రాడు.

పంచెలు కట్టుకున్న సాంప్రదాయ ఇండియన్స్, పట్టుచీరలు కట్టుకున్న ఆడాళ్ళు, గోల చేస్తున్న పిల్లలు అతడినొక పిచ్చివాడిలాగా చూస్తున్నారు. ఇదంతా శనివారం నాడు జరిగింది.

ఆదివారం నాడు, మేము వెళ్లేసరికి ఒక దృశ్యం కనిపించింది. ఈ అమెరికన్ అర్ధ నారీశ్వరుడు అప్పటికే అక్కడ ఉన్నాడు.  అదే వేషంలో ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా?

మన సోకాల్డ్ సాంప్రదాయ  ఇండియన్స్ విచక్షణ లేకుండా పారేస్తున్న ప్లాస్టిక్ పేపర్లు, చెత్త కాగితాలు, టిఫిన్ బాక్సుల మూతలు, టీ గ్లాసులు ఇవన్నీ ఏరుకుంటూ తిరుగుతున్నాడు. చివరకు  అవన్నీ తెచ్చి ఒక డస్ట్ బిన్ లో పడేసి, మళ్ళీ తన దారిన తను గుడిలో ఒకచోట కూర్చుని తనలోకంలో తనున్నాడు. 'బయట మనిషిని చూచి మోసపోకు' అనే సామెత నాకు గుర్తొచ్చింది.

యాగశాలలోకొస్తాడు. భక్తిగా దణ్ణం పెట్టుకుంటాడు. ఆలయంలోకి వెళతాడు. అమ్మవారి విగ్రహానికి  సాష్టాంగ ప్రణామం చేస్తాడు. కూర్చుని ఏదేదో జపం చేసుకుంటాడు. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరుగుతూనే ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడడు.

సాయంత్రం ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు, 'కెన్ ఐ హావ్ ఏ ఫోటో విత్ యు?' అనడిగాను.

'ఓ యా' అన్నాడు.

అతనితో కలసి ఒక ఫోటో దిగాను. అక్కడికొచ్చిన  అందరిలోకీ, పిచ్చోడిలాగా వేషం వేసుకున్న అతనే నార్మల్ మనిషిలాగా నాకు కనిపించాడు.

అక్కడున్న మహాభక్తులలో ఎవరికీ కూడా, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ లేదు. ఒక రూములో చెప్పుల కోసం ర్యాక్స్ ఉంచారు దేవాలయ కమిటీవారు. అందరూ ఆ రూము బయటే చెల్లా చెదురుగా చెప్పులు వదిలేశారు గాని, అతి కొద్దిమంది మాత్రం లోపల ర్యాక్స్ లో వదిలారు. మేము లోపలే వదిలాము కాబట్టి మాకీ విషయం తెలిసింది. అదే విధంగా, దేవాలయంలో మౌనంగా ఉండాలన్న స్పృహ ఎవరికీ లేదు. అక్కడే అరుపులు, గోల, పిల్లల ఆటలు, పెద్దల ముచ్చట్లతో ఇండియాలో గుడి వాతావరణాన్ని ఇక్కడ కూడా సృష్టించారు.

'అంతా మన ఇండియాలో లాగే ఉంది కదూ?' అని ఎవరో నాతో అన్నారు.

'అవును. అంతా అదే. ఏమీ తేడా లేదు' అన్నాను విరక్తిగా నవ్వుతూ.

వీళ్ళందరూ బయటకు పంచెలు, చీరలు, వేషాలు. పోజులు. ఈ అమెరికన్ ఏమో విచిత్రమైన వేషంలో ఉన్నాడు.  కానీ అందరూ పారేసిన చెత్తను ఎత్తేస్తున్నాడు. నాకైతే అతనికి దణ్ణం పెట్టాలని అనిపించింది. మనవాళ్ళు అసలైన ఆధ్యాత్మికతను ఎన్ని జన్మల తర్వాత నేర్చుకుంటారో మరి?

మనవాళ్ళు చెడ్డవాళ్ళని నేననడం లేదు. వారిలో కూడా ఇతర కోణాలలో చాలా మంచితనం ఉంది. కానీ పరిసరాల పట్ల, పక్కవాడిపట్ల, పర్యావరణం పట్ల  బాధ్యత మాత్రం లేదు. పరిసరాల పట్ల బాధ్యత లేని వ్యక్తులకు దైవంపట్ల భక్తి ఎలా వస్తుంది?

సాటిమనిషిని మనిషిగా చూడలేనివారికి దైవమంటే అవగాహన ఎలా వస్తుంది? ఏంటీ పిచ్చి జనం? పిచ్చి లోకం? ప్రకృతిలో దైవాన్ని చూడలేనివాడు ఇంకెక్కడ చూస్తాడు?

దేవుడా కనీసం నువ్వైనా ఈ గొర్రెలను బాగుచేయగలవా?

read more " మూడవ అమెరికా యాత్ర - 12 (అమెరికన్ తాంత్రికుడు - అసలైన భక్తి) "

మూడవ అమెరికా యాత్ర - 11 ( అడగకుండానే అమ్మ ఇచ్చిన వరాలు)





'నువ్వు అడిగితే అడిగినదే ఇస్తాను. అడగకపోతే, నీకు అవసరమైనది ఇస్తాను' అన్నది జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కులలో ఒకటి. ఈ సత్యం ఎన్నోసార్లు నా జీవితంలో రుజువౌతూ వచ్చింది. ఎవరి జీవితంలోనైనా ఇంతే. కాకపోతే దానిని గుర్తించే ఓపికా నిలకడా చాలామందిలో ఉండవు అంతే !

అయిదేళ్ల తర్వాత, మొన్న శనివారం నాడు, పరాశక్తి అమ్మవారి ఆలయానికి వచ్చాను. అమ్మవారి నూతన విగ్రహం, కుంభాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయమంతా కోలాహలంగా ఉంది. ఎవరి పనుల్లో, ఏర్పాట్లలో వారున్నారు.

ఈ కార్యక్రమం కోసం ఇండియా నుండి పెద్ద పెద్ద పూజారులు వచ్చి ఉన్నారు. చిదంబరం ఆలయ ప్రధాన పూజారి తంగ భట్టర్ అని 93 ఏళ్ల వృద్ధుడు. ఆయనొచ్చాడు. ఇండియాలో గతంలో జరిగిన ఒకానొక విమాన ప్రమాదంలో దాదాపు 75 మంది చనిపోయారు. 15 మంది మాత్రమే ఏమీ కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఈయనొకరు. అదే విధంగా, మధుర మీనాక్షి ఆలయ ప్రధానపూజారి ఇంకొకరు. ఆయన కూడా ఈ తంతులలో పాల్గొంటున్నారు. అటువంటి ఘనాపాఠీ లందరూ ఇక్కడ ఉన్నారు. 

మేమక్కడ మౌనంగా ఒక మూలకు కూర్చుని ఉన్నాం. దిలీప్ గారని ఒకాయన ఆటుపోతూ మమ్మల్ని చూచి ఆగాడు. ఆయన ఆలయ కమిటీలో ఒకరు. నన్ను గుర్తుపట్టి, 'మీరు అయిదేళ్ల క్రితం ఇక్కడ ఉపన్యాసం ఇచ్చారు. అప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడిగాను. మీరు జవాబులిచ్చారు. గుర్తుందా?' అన్నాడు.

నాకు లీలగా గుర్తుంది. అవునన్నట్లు తలాడించాను.

'ఇటు రండి' అంటూ నన్ను సరాసరి గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసికెళ్ళాడు. ఆదిపరాశక్తి, వారాహి, రాజమాతంగి, భువనేశ్వరీ అమ్మవార్ల విగ్రహాలకు,గణపతి, కుమారస్వాముల విగ్రహాలకు నూనె పట్టించి ఉంచారు. రేపు ఆదివారం నాడు వాటికి యాగశాలలో ఉంచిన కలశాల పవిత్రజలంతో అభిషేకం చేసి వాటిని శుభ్రం చేసి ప్రాణప్రతిష్ట చేస్తారు. నాకు, శ్రీమతికి చేతులలో నూనె పోసి, విగ్రహాలకు వ్రాయమని చెప్పారు. ఆ కార్యక్రమం అయిపోయిందని, ప్రస్తుతం ఎవరినీ విగ్రహాలను తాకనివ్వడం లేదని అక్కడివారన్నారు.  దిలీప్ గారు వినిపించుకోకుండా మా చేతులలో నూనె పోయించి అమ్మవార్ల విగ్రహాలకు పూయించారు

నేను పంచెకట్టుకుని సాంప్రదాయ దుస్తులలో లేను. టీ షర్టు, పాంటు వేసుకుని మామూలు భక్తునిగా వెళ్ళాను.సామాన్యంగా ఆ వేషంలో ఉన్న వ్యక్తిని గర్భగుడిలోని విగ్రహాలను తాకనివ్వరు. కానీ గర్భగుడిలోకి తీసుకెళ్లి మరీ నా చేత  ఈ పనిని చేయించారు.

అమ్మ ఇచ్చిన ఊహించని అనుగ్రహాలలో ఇదొకటి.

అదలా ఉంటే, నిన్న ఆదివారం అసలైన కార్యక్రమం. కుంభాభిషేకం, విగ్రహాలకు ప్రాణప్రతిష్ట. నిన్నకూడా ఆలయానికి వెళ్ళాము. నూట ఎనిమిది కలశాలతో అమ్మవార్ల విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నారు.  ఒక కలశాన్ని నాకూ ఇచ్చి యాగశాలనుండి ఆలయానికి తీసుకెళ్లమని, నా పేరుమీద కూడా ఒక కలశాన్ని ముందే ఏర్పాటు చేశామని ఆనంద్ చెప్పారు. ఆ విధంగా నూట ఎనిమిది కలశాలలో ఒక కలశాన్ని నేనూ మోశాను. అప్పుడు కూడా పంచె కట్టుకుని ఆ పనికోసం సిద్ధపడి నేను అక్కడకు వెళ్ళలేదు. మళ్ళీ టీ షర్టు పాంటులో వెళ్ళాను. కానీ అనుకోకుండా కలశాన్ని మోశాను.

ఇది రెండవ అదృష్టం.

ఎక్కడ ఇండియాలోని హైద్రాబాద్?, ఎక్కడ డెట్రాయిట్ లో పరాశక్తి ఆలయ ఉత్సవాలు?. అనుకోకుండా నేను ఇక్కడకు రావడం ఏమిటి? మూలవిరాట్ విగ్రహాలను తాకి, తైలాన్ని వ్రాయడం, అభిషేకజలాన్ని మోసి తీసుకెళ్లి దానితో విగ్రహాలకు అభిషేకం జరగడం- ఇదంతా ఏమిటి ? వీటికోసం నేనేమీ ముందే ఏర్పాట్లు చేసుకోలేదు. కానీ వాటంతట అవి జరిగాయి.

ఇది అమ్మ అనుగ్రహం కాకపోతే మరేమిటి? సమస్త సృష్టీ అమ్మ చేసినదే అయినప్పుడు దేశాలతో ప్రాంతాలలో పని ఏముంది? ఇలాంటి మిరకిల్స్, పరాశక్తి ఆలయంలో జరగడం చాలా గమనించాను. ఇది గతంలోనూ చూచాను, ఇప్పుడూ చూచాను. దైవశక్తి జాగృతమై ఉన్న ఆలయాలలో ఇలాంటి మిరకిల్స్ జరుగుతాయి. ఇలాంటి అనుకోని మిరకిల్స్, తిరుమలలోను, జిల్లెళ్ళమూడిలోను, దక్షిణేశ్వరం కాళీ ఆలయంలోను, శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూరు లోను జరగడం ఎన్నో సార్లు గమనించాను.

ఈ కార్యక్రమానికి వేలాదిమంది వచ్చి ఉన్నారు. ఎన్నెన్నో దేశాలనుండి వచ్చారు. ఏర్పాట్లు చేసుకుని మరీ వచ్చారు. నేనేమీ ముందుగా ఏర్పాట్లు చేసుకుని రాలేదు. అనుకోకుండా వచ్చాను. కానీ వారిలో ఎంతోమందికి రాని అవకాశం నాకొచ్చింది. 'వచ్చింది' అనడం కంటే, 'అమ్మ ఇచ్చింది' అనడం కరెక్ట్ అవుతుంది.

ఇదేదో నా గొప్పకోసం చెప్పడం లేదు. ఇలాంటి గొప్పలు నాకేమీ అవసరం లేదు. వీటిమీద నా దృష్టి ఉండదు కూడా. కానీ జరిగాయి. జరుగుతున్నాయి.

నువ్వు అహంకారం లేకుండా, వినయంతో ఉంటే, ఏదీ కోరుకోకుండా ఉంటే, నీకేది ఇవ్వాలో అమ్మే ఇస్తుంది. ఇది తిరుగులేని నిజం. ఎన్నోసార్లు నా జీవితంలో రుజువైంది. ఇప్పుడూ అయింది.

 'నువ్వు అడిగితే అడిగినదే ఇస్తాను. అడగకపోతే, నీకు అవసరమైనది ఇస్తాను'

నిజమా కాదా?

read more " మూడవ అమెరికా యాత్ర - 11 ( అడగకుండానే అమ్మ ఇచ్చిన వరాలు) "

మూడవ అమెరికా యాత్ర - 10 (పరాశక్తి ఆలయ సందర్శన)












డెట్రాయిట్ పరాశక్తి ఆలయంతో నాకు ఆరేళ్ళ అనుబంధం ఉంది. 2016 లో మొదటసారి ఇక్కడ 'శ్రీవిద్య - శక్తి ఆరాధన' పైన ఉపన్యాసం ఇచ్చాను. మళ్ళీ 2017 లో వచ్చినపుడు లలితా సహస్రనామాలపైన మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడొచ్చాను.

'మీ ఉపన్యాసం మళ్ళీ ఇవ్వండి. ఏర్పాట్లు చేస్తాం' అని పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ USA ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ అన్నారు.

'వద్దు. ఆ ఆలోచన ప్రస్తుతం లేదు' అని చెప్పాను.

'ఎందుకు?' అన్నట్లుగా ఆయన చూచాడు.

'లోకంతో ఇంటరాక్ట్ కావడానికి, మన భావజాలాన్ని లోకంలో వెదజల్లడానికి, సోషల్ మీడియా ఉంది. మన వెబ్ సైట్లున్నాయి. మన పుస్తకాలున్నాయి. ఉపన్యాసాలకు మన యూట్యూబ్ ఛానల్  ఉంది. కనుక, ప్రస్తుతం ఆ ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం వ్యక్తులతో వ్యక్తిగత స్థాయిలో అనుసంధానం కావడం, వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడం, సాధకుల సందేహాలు, వ్యక్తిగత సమస్యలు తీర్చడమంటే నాకిష్టంగా ఉంది. వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం ప్రస్తుతం మన పనికాదు. దానికి పురాణ పండితులు చాలామందున్నారు. ఆ పని నాకెందుకు?'. అని ఆయనతో చెప్పాను.

ఈ ట్రిప్పులో ఇద్దరు జిజ్ఞాసువులను కలిశాను. వాళ్ళు, విష్ణు ప్రవీణ్, స్టీఫెన్ స్టేసీ.

విష్ణు నా బ్లాగ్ చదివి నాతో కాంటాక్ట్ లోకి వచ్చాడు. తను కేలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాడు. పరాశక్తి అమ్మవారి వీరభక్తుడు. ప్రస్తుతం అమ్మవారి నూతన విగ్రహం ప్రతిష్టాపన, ఆలయ కుంభాభిషేకాలు జరుగుతున్నాయి. వాటిలో వాలంటీర్ గా పనిచేయడానికి లీవు పెట్టుకుని తన కుటుంబంతో కలసి డెట్రాయిట్ వచ్చాడు. నేనూ ఇక్కడే ఉన్నాను గనుక అతన్ని కలవడం జరిగింది. మొన్న శనివారం నాడు పరాశక్తి ఆలయంలో నన్ను చూస్తూనే కదిలిపోయి పట్టుకుని ఏడ్చేశాడు. మా అబ్బాయి వయసుంటుంది. చిన్నవాడే గాని ఆధ్యాత్మికంగా ఉన్నతమైన సంస్కారాలు, ప్రవర్తనలు ఉన్నవాడు. డబ్బు తప్ప ఏమీ పట్టించుకోని నేటి అమెరికా యువతాలోకంలో, వారంరోజులు లీవు పెట్టుకుని, బే ఏరియా నుంచి ఇక్కడికొచ్చి, ఆలయంలో అన్నిపనులూ చేస్తూ వాలంటీర్ గా ఉన్నాడు. సామాన్యమైన విషయం కాదు. చాలా ముచ్చటేసింది.

ఇకపోతే, స్టీఫెన్ స్టేసీ, ఒక అమెరికన్ సాధకుడు. ఫ్లోరిడాలో ఉంటాడు. ఈయనకు 75 ఏళ్ళు. పుట్టుకతో క్రైస్తవుడైనా, పక్కా హిందూమతాభిమాని. 40 ఏళ్ళనుంచీ దేవీ ఉపాసకుడు. నేను వ్రాసిన Secret of Sri Vidya, Hidden meanings of Lalita Sahasra Nama పుస్తకాలను చదివి నన్ను కాంటాక్ట్ చేశాడు. 1975 ప్రాంతాలలోనే బాంబే వచ్చి సిద్ధయోగ గురువు స్వామి ముక్తానందను కలిశాడు. శ్రీరామకృష్ణులంటే ఎంతో భక్తి. అమెరికాలో వివేకానంద స్వామి స్థాపించిన  వేదాంత సొసైటీస్ అన్నీ తిరిగాడు.

2020 లో అమెరికా రావాలని నాకొక ప్లాన్ ఉండేది. అప్పుడు నన్ను కలవాలనుకున్నాడు. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. ఇప్పుడు రాగలిగాను. ఎలాగూ అమ్మవారి ఆలయం కుంభాభిషేకం జరుగుతోంది గనుక, తనూ లీవు పెట్టుకుని వచ్చి, అవన్నీ చూస్తూ ఇక్కడే ఉన్నాడు. శనివారంనాడు గుడికెళ్ళినపుడు వెదుక్కుంటూ వచ్చి నన్ను కలిశాడు. నిన్నా ఈ రోజూ మాతోనే ఉండి, తనను వేధిస్తున్న ఆధ్యాత్మిక సందేహాలను నన్నడిగి తీర్చుకున్నాడు. ఒంగోలు ఆశ్రమానికి వస్తానని, వీలైతే అక్కడే ఉండిపోతానని అన్నాడు. సరేనన్నాను.

ఈ విధంగా పరాశక్తి ఆలయం మా ఆధ్యాత్మిక సంభాషణలకు వేదికగా మారింది. ఎప్పటినుంచో నన్ను చూడాలని, కలుసుకోవాలని ఎదురు చూస్తున్న ఇద్దరు మంచిమనుషులను, జిజ్ఞాసువులను ఆదిపరాశక్తి దయవల్ల అమెరికాలో కలుసుకోగలిగాను. వారి సందేహాలను తీర్చగలిగాను.

read more " మూడవ అమెరికా యాత్ర - 10 (పరాశక్తి ఆలయ సందర్శన) "

24, ఆగస్టు 2022, బుధవారం

మా 51 వ పుస్తకం 'ముక్తికోపనిషత్' అమెరికా నుంచి విడుదల

మా క్రొత్త పుస్తకం 'ముక్తికోపనిషత్' నేడు అమెరికా నుంచి విడుదల అయింది. ఈ సందర్భంగా చేసిన యూట్యూబ్ వీడియోను ఇక్కడ చూడండి.

ఇది నా కలం నుండి వెలువడుతున్న 51 వ పుస్తకం. నూరు పుస్తకాలు వ్రాయాలన్నది నా సంకల్పమని గతంలో అన్నాను. ఈ ఏభై తెలుగు పుస్తకాలను ఇంగ్లిష్ అనువాదం చేస్తే ఇప్పటికే నూరు పుస్తకాలయ్యాయి. తెలుగులోనే నూరు పుస్తకాలు వ్రాస్తానని నేడు చెబుతున్నాను. అప్పుడు ఇంగ్లిష్ అనువాదంతో కలిపి రెండువందల పుస్తకాలౌతాయి. తరువాతి టార్గెట్ ఏమిటనేది ఆ తరువాత చెబుతాను.

భక్తి, జ్ఞాన, యోగమార్గాలను సమన్వయము చేస్తూ, శ్రీరామచంద్రులవారిచే హనుమంతునకు ఉపదేశింపబడిన ఈ గ్రంధం ఎంతో చిక్కని వేదాంతమును అతి సులభమైన బాణీలో తనలో కలిగియున్నది.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకు ఎంతో సహాయం చేసిన సరళాదేవి, అఖిల, ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. కానీ చెబుతున్నాను. వీరు లేనిదే ఈ పుస్తకాలు వెలుగు చూడవు. వ్రాసింది నేనే. కానీ అంతకంత పనిని వారూ చేశారు. వారికి నా కృతజ్ఞతలు. ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.

మన హిందూమత ప్రాచీన విజ్ఞానాన్ని చదవండి. అర్ధం చేసుకోండి. సాధన చేయండి. ధన్యులు కండి.

read more " మా 51 వ పుస్తకం 'ముక్తికోపనిషత్' అమెరికా నుంచి విడుదల "

మూడవ అమెరికా యాత్ర - 9 (మళ్ళీ UG)

ఇక్కడికొచ్చాక చదివిన మంచి పుస్తకం, మహేష్ భట్ వ్రాసిన U.G. Krishnamurti, A Life. ఇది మా అబ్బాయి లైబ్రరీలో ఉంది. తనే నాకిచ్చి, 'నాన్నా ఈ పుస్తకం చదివావా?' అన్నాడు.

'గతంలో చంద్రశేఖర్ గారు అన్నారు "మహేష్ చాలా మంచిపుస్తకం వ్రాశాడ"ని. వీలైతే చదవాలనుకున్నాను. ఇప్పుడు చదువుతాను' అన్నాను.

ఇలాంటి పుస్తకం దొరికితే మనకు విందుభోజనమే కదా! ఇంక వేరే తిండి అక్కర్లేదు. చదివేశాను. అందులో చాలా భాగాలు మిగతాచోట్ల ఇప్పటిదాకా చదివినవే. కానీ మహేష్ భట్ వాడే ఇంగ్లీష్ భాష చాలా బాగుంటుంది. మంచి ఇంగ్లిష్ ఒకటి, పుస్తకం సబ్జెక్ట్ మరొకటి. రెండూ కలిస్తే ఇక విందుభోజనం కాక మరేముంది?

UG గారు సహజసమాధిని అందుకున జీవన్ముక్తుడు. జిడ్డు, ఓషో, పరమహంస యోగానంద మొదలైన వారికంటే ఉన్నతస్థితిని పొందినవాడు. అంతేకాదు, నిజమైన కుండలినీ జాగృతిని పొంది, ప్రయాణం చివరివరకూ నడిచినవాడు. అమనస్కస్థితిని పొందినవాడు. 
వీళ్లందరినీ కూలంకషంగా చదివినమీదట, వీరి మార్గాలు క్షుణ్ణంగా తెలుసుకున్న మీదట, ఈ మాటను నేను చెబుతున్నాను.

అయితే, మన ఆంధ్రా పిచ్చి జనానికి అసలైన రత్నాలు అక్కర్లేదు కదా ! వీళ్లకు గులకరాళ్లే కావాలి. అందుకే అవే వాళ్లకు దొరుకుతున్నాయి. ఏం చేస్తాం? ఎవరి ఖర్మ వారిది.

కోరికలు తీరడం, పనులు కావడం మొదలైన చీప్ జిమ్మిక్స్ కోసం సాయిబాబాను, అయ్యప్పను పూజిస్తూ, నలభైరోజుల పిచ్చిదీక్షలు చేసే మన తెలుగుజనాలకు, రెండు ఆసనాలు, మూడు ప్రాణాయామాలు నేర్చుకుని యోగంలో తీరాలు దాటామని విర్రవీగే సోకాల్డ్ యోగా కల్ట్ మనుషులకు UG ఎప్పటికి అర్ధమయ్యేను?

అమెరికా కొచ్చాక, UG గారు నా మనసులో నిరంతరం తిరుగుతున్నారు ఎందుకో తెలీదు. ఇంతలో ఆయన పుస్తకమొచ్చింది. చదవడం అయిపోయింది. ఈ పుస్తకం చదివాక, మహేష్ భట్ అంటే నాకు గౌరవం పెరిగింది. బాంబే సినీ ఫీల్డులో అన్ని ఏళ్ళనుండీ ఒక కదారచయితగా, దర్శకుడిగా ఉంటూ, టాప్ హీరోయిన్లతో తిరుగుతూ, గ్లామర్ ప్రపంచంలో బ్రతుకుతూ, అంత లోతైన భావజాలం కలిగి ఉండటం అనూహ్యం. అటువంటి పుస్తకాన్ని మన తెలుగు సినీపక్షులలో ఎవ్వరూ వ్రాయలేరని ఘంటాపధంగా చెప్పవచ్చు. అలాంటి పుస్తకాన్ని వ్రాయాలంటే జీవితమంటే లోతైన చింతన ఉండాలి. అలాంటి చింతన, బాంబే గ్లామర్ సినీ ఫీల్డ్ లో గత నలభై అయిదేళ్లుగా తలమునకలుగా ఉన్న మహేష్ భట్ వంటి వ్యక్తికి ఉండటం వింతల్లో వింత !

చంద్రశేఖర్ గారు నాతో చెప్పింది నిజమే.

'మహేష్ పెరిగిన ప్రపంచం వేరు. అది సినీ గ్లామర్ ప్రపంచం. UG గారితో ఆయన కలిసున్నది కూడా తక్కువే. కానీ ఆ కొద్దికాలంలోనే ఆయన్ను చాలావరకూ అర్ధం చేసుకుని, తన పుస్తకంలో చాలా కరెక్ట్ గా ఆయనను ప్రెజెంట్ చెయ్యడంలో మహేష్ కృతకృత్యుడయ్యాడు' అన్నారు చంద్రశేఖర్ గారు నాతో.

ఈ పుస్తకం చదివాక అది నిజమే అనిపించింది. UG గారున్న స్థితిని అర్ధం చేసుకోలేకపోయినా, కనీసం ఆయన్ను చెడగొట్టకుండా, ఉన్నదున్నట్లు ప్రెజెంట్ చేశాడు మహేష్ భట్. దానికి ఆయన్ను అభినందించాలి. కరోనా తగ్గాక బాంబే వెళదామని, మహేష్ భట్ ని కలిపిస్తానని చంద్రశేఖర్ గారు గతంలో అన్నారు. ఇండియా వచ్చాక బాంబే వెళ్లినపుడు, మహేష్ భట్ ని కలిసి అభినందించాలని నిశ్చయించుకున్నాను.

UG వంటి వ్యక్తి తెలుగునేలమీద పుట్టడం ఆ నేల చేసుకున్న అదృష్టం. ఆయన్ను గుర్తించలేకపోవడం, అది చేసుకున్న ఘోరమైన దురదృష్టం.

ఇంతకంటే ఏం చెప్పగలం?
read more " మూడవ అమెరికా యాత్ర - 9 (మళ్ళీ UG) "

20, ఆగస్టు 2022, శనివారం

యూట్యూబ్ వీడియో - 1 (మేం భారతీయులం కానీ, జాతీయ జెండాకు వందనం చెయ్యం)

చాలా ఏళ్ళనుంచీ స్తబ్దుగా ఉన్న మా యూట్యూబ్ ఛానల్ నిద్రలేచింది.

చాలాకాలం తర్వాత నా మొదటి వీడియోను అమెరికానుండి నేడు చేశాను.

సబ్జెక్ట్ ఏంటో పైన ఇచ్చాను కదా !

నేను చేస్తానని గతంలో చెప్పినవాటిని ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నాను.

గమనించండి.

ఆ వీడియోను ఇక్కడ చూడండి.

ఇక మా యూట్యూబ్ ఛానల్ నుండి ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, మార్షల్ ఆర్ట్స్, జెనరల్ టాపిక్స్ పై వీడియోల వరదను వీక్షించండి.
read more " యూట్యూబ్ వీడియో - 1 (మేం భారతీయులం కానీ, జాతీయ జెండాకు వందనం చెయ్యం) "

18, ఆగస్టు 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 8 (ప్రేతాత్మతో మూడేళ్లు)

2019 సెప్టెంబర్ లో నేను మెట్టుగూడలోని రైల్వే ఆఫీసర్స్ క్వార్టర్స్ లో చేరాను. అనేక క్వార్తర్స్ చూచినమీదట ఒక పాతకాలం నాటి బంగళాను నేను ఎంచుకున్నాను. దానికి కారణం పిల్లల పెళ్లిళ్లు అక్కడైతే సౌకర్యంగా చేయవచ్చన్న ఒక్క ఉద్దేశ్యమే.

అది బంగాళా నంబర్ 100 ప్రక్కనే ఉంటుంది. 2003 లో, బంగళా నంబర్ 100 లో సామూహిక హత్యలు జరిగాయి. B.R.Seth అనే రైల్వే చీఫ్ ఇంజినీర్ కుటుంబాన్ని వాళ బంగళా ప్యూన్ దారుణంగా చంపేశాడు. అదంతా అప్పుడు పేపర్లో కూడా వచ్చింది. టీవీలో తెగ చూపించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చి ఈ హత్యాస్థలాన్ని చూచివెళ్ళాడు. ఆ క్వార్టర్స్ ప్రక్కనే నేను దిగిన బంగళా ఉంది.

నెట్లో చూడండి. ఆ వార్తలు ఇంకా ఉన్నాయి. వివరాలు మీకు లభిస్తాయి.

నేను సెలక్ట్ చేసుకున్న బంగళా  దాదాపు 80 ఏళ్ళనాడు కట్టిన పాతబంగళా. ఎవడో బ్రిటిష్ ఇంజనీర్ తన మందీమార్బలంతో అందులో ఉండేవాడు. అయన నాటిన ఒక ముసలి చింతచెట్టు ఆ బంగళా ఆవరణలో ఉంది. రెండు  రావిచెట్లున్నాయి. పెద్ద ఉసిరిచెట్టు ఉంది.  అప్పటివే  నాలుగు  మామిడిచెట్లున్నాయి. వేపచెట్లయితే ఒక పది ఉంటాయి. సీతాఫలం చెట్లు, సపోటాచెట్లు ఉన్నాయి. దాదాపు ఎకరంన్నరలో ఆ బంగళా ఉంటుంది. ఎంట్రన్స్ గేట్ నుండి ఇంటి ముఖద్వారం దాదాపు 200 మీటర్ల దూరం చెట్లలో నడుచుకుంటూ పోవాలి. తోటమధ్యలో ఒక ఉయ్యాల ఉంది. రాత్రిపూట చూస్తే అచ్చం ఒక భూత్ బంగళా లాగే ఉంటుంది.  ఒక హర్రర్ మూవీకి మంచి సెట్టింగ్.

బంగళా లోపల కూడా పెద్దపెద్ద గదులు. నాలుగు బెడ్ రూమ్స్, ఒక గదిలో నుంచి పిలిస్తే ప్రక్కగదికే వినిపించదు, అంత పెద్ద గదులతో ఒక మహల్ లాగా ఉంటుంది. ఉండబోయేది ఇద్దరం.

ఈ బంగళాలో నేను దిగబోతుండగా నా కొలీగ్ ఆఫీసర్ రమేష్ ఇలా అన్నాడు, 'ఆ  క్వార్టర్ ఎంచుకున్నారా? అందులో ఒక పెద్ద....' అని మధ్యలో ఆగిపోయాడు.

నేనేమీ రెట్టించలేదు. 80 ఏళ్ల బంగళాలో ఏవో కధలు లేకుండా ఎలా ఉంటాయి? అని నాలో అనుకున్నాను.

'త్రి బెడ్ రూమ్ మోడ్రన్ క్వార్ట్రర్ లో నేను ఉండవచ్చు. కానీ, ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేయాలి. అందుకోసం ఈ బంగళా అయితే బాగుంటుందని దీనిని సెలక్ట్ చేసుకున్నాను' అని రమేష్ తో అన్నాను.

తను నవ్వి ఊరుకున్నాడు.

ఈ బంగళాకి మారిన కొద్దిరోజులకు కొన్ని సంఘటనలను గమనించడం మొదలుపెట్టాను. మనం ఒక గదిలో ఉంటే, ప్రక్క గదిలో ఎవరో నడుస్తున్న చప్పుడు వినపడేది. ఒక గదినుంచి ఇంకో గదికి ఎవరో టక్కున వెళ్లినట్లు నీడలు కదిలేవి. చూస్తే ఎవరూ ఉండేవారు కారు. మనతోబాటు ఇంకా ఎవరో ఇంట్లో ఉన్నట్లు, మనల్ని చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేది. తలుపులు వాటంతట అవే తెరుచుకునేవి.మూసుకునేవి.నవ్వుకుని ఊరుకునేవాడిని.

ఒకరోజున రాత్రిపూట సరదాగా గార్డెన్లో చెట్లల్లో నడుస్తున్నా. మంటల్లో కాలిపోతూ ఒక పాతికా ముప్పై ఏళ్ల అమ్మాయి, సర్వెంట్ క్వార్ట్రర్స్ నుండి మా బంగళా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి మాయమైపోయింది. సడన్ గా ఈ దృశ్యాన్ని చూచాను. ఆ సమయంలో నేను  మహావిద్యా మంత్రజపం చేస్తూ గార్డెన్లో నడుస్తున్నాను. ఉన్నట్టుండి ఈ దృశ్యం కనిపించింది. గతంలో అక్కడేదో జరిగిందని అర్ధమైంది. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా మామూలుగా నా పనులు చేసుకుంటూ ఉన్నాను.

ఆ బంగళాలో నైరృతి మూలన ఒక బెడ్రూమ్ ఉంటుంది. అందులో పడుకున్నవారికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. పీడకలలు వచ్చేవి. నేనూ ఒకరోజున అందులో పడుకున్నా. ఉన్నట్టుండి కప్పుకున్న దుప్పటి లేచి ప్రక్కన పడటం, ప్రక్కమీద ఎవరో కూర్చున్నట్టు అనిపించడం, ఎవరో మనల్ని తాకినట్టు అనిపించడం ఇవన్నీ నేను గమనించాను. చూసీ చూసీ ఒకరోజున 'ఎవరితో ఆటలాడుతున్నావ్ నువ్వు? తమాషాలుగా ఉందా?' అని గద్దించాను. ఆ తరువాత అలాంటి కోతిచేష్టలు ఆగిపోయాయి.

ప్రతి అమావాస్యకూ పితృతర్పణాలు చేసే సమయంలో ఆఖర్న అనాధప్రేతాలకు కూడా తర్పణం విడిచేవాడిని. ఒకరోజున అలా విడుస్తుండగా, గార్డెన్లోని చింతచెట్టు పెద్దకొమ్మ ఒకటి ఫెళ్ళున విరిగి పడిపోయింది. అప్పుడే నాకర్ధమైంది ఆ బంగళాలో ప్రేతాత్మలున్నాయని.

పూజామందిరంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించి నిత్యమూ మా శ్రీమతి యధావిధిగా అర్చన చేస్తూ ఉండేది. తనకెప్పుడూ ఈ విషయాలను నేను చెప్పలేదు. కానీ ఒకసారి మూడురోజుల పాటు క్యాంప్ కెళ్ళాల్సి వచ్చింది. అంతపెద్ద కొంపలో శ్రీమతి ఒక్కతే ఉండాలి. అందుకని తనతో జాగ్రత్తలు చెబుతూ, ఏవైనా కనిపిస్తే కంగారుపడకు. అవి మనల్నేమీ చెయ్యవు' అని సూచనప్రాయంగా చెప్పాను. దానికి తను చెప్పిన సమాధానానికి నేను నిర్ఘాంతపోయాను.

'భయపడటానికి ఏముంది? ఒకమ్మాయి ఉంది. ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది. పూజామందిరం దాపులకు మాత్రం రాదు. నేను చాలాసార్లు చూశాను. నాకేమీ భయం లేదు. మీరు దైర్యంగా క్యాంప్ కెళ్ళి రండి' అంది.

'చూచావా?' అన్నాను నేను ఆశ్చర్యంగా.

'అవును. తోటలో దాదాపు నాలుగైదు పిల్లులు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. దొడ్డివైపున చెట్లలో పాములున్నాయి. అవీ కనిపిస్తుంటాయి. అలాగే ఈ అమ్మాయి కూడా ఉంది. వాటిమానాన అవి బ్రతుకుతాయి. మన మానాన మనం ఉంటాం. భయమేముంది?' అంది శ్రీమతి. 

తన ధైర్యానికి నేను చాలా ఆశ్చర్యపోయి, మనసులోనే తనని మెచ్చుకున్నాను.

క్యాంప్ కెళ్ళి వచ్చాను. 'ఏమైనా అసౌకర్యంగా ఉందా?' అని శ్రీమతిని అడిగాను.

'ఏమీ లేదు. పిల్లులు, పాములు, ఆత్మలు అన్నీ ఉన్నాయి. వాటిపని వాటిది, నా పని నాది' అంది శ్రీమతి కూల్ గా.

తరువాత ఒకరోజున శ్రీమతి గార్డెన్లో దండేనికి ఉతికిన బట్టలు ఆరేస్తోంది. పదడుగుల ఎత్తున్న ప్రహరీగోడ మొత్తం హఠాత్తుగా కూలిపోయి తనకు మూడడుగుల దూరంలో రాళ్లు రప్పలు అన్నీ పడ్డాయి. పెద్ద ప్రమాదం తనకు తృటిలో తప్పింది.

తోటలో ఒకచోట ఉడెన్ డమ్మీని పాతి, వింగ్ చున్ కుంగ్ ఫూ అభ్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. మస్కిటో కుంగ్ ఫూ అంటూ ఒక వీడియో కూడా పెట్టాను గతంలో. ఒకరోజున రాత్రిపూట వచ్చిన సుడిగాలికి ఒక పెద్దచెట్టు కూకటివేళ్ళతో సహా లేచిపోయి ఆ డమ్మీ మీద వచ్చి పడింది. పగటిపూట నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అది పడినట్లైతే సరిగ్గా నా తలమీద పడి ఉండేది. ఏమయ్యేదో చెప్పనవసరం లేదు కదా !

ఇలాంటి సంఘటనలను చాలా చూచినమీదట, ఆ ఆత్మనుద్దేశించి ఇలా చెప్పాను.

'చూడు. నీ మానాన నువ్వుండు. మా జోలికి రాకు. మాకు హాని చేయాలని చూడకు. ఎంత పాపం చేశావో ఈ స్థితిలో తిరుగుతున్నావు. ఇంకా పాపాన్ని ఎక్కువ చేసుకోకు. నీకు సహాయం చేసే స్థితిలో మేమున్నామని గుర్తించు. నీ కోతిచేష్టలు మా దగ్గర ప్రదర్శించకు'

ఆ తర్వాతనుంచీ ఆ సంఘటనలు ఆగిపోయాయి. కానీ ఆ అమ్మాయి నాక్కూడా కనిపించడం మొదలుపెట్టింది. మంటల్లో కాలిపోయినట్లుగా ఉంటుంది. ఎప్పుడూ భయపెట్టలేదు గాని, ఏడుస్తూ దిగాలుగా ఉండేది. ఒక గదినుంచి మరో గదికి తిరుగుతూ కనిపించేది. మూడోనెల గర్భవతిలాగా ఉన్నట్లు కనిపించేది.

రాత్రిపూట అప్పుడప్పుడూ హర్రర్ సినిమాలు చూడటం నాకలవాటు. అంతపెద్ద బంగళాలో లంకంత హాల్లో ఒక్కడినే కూచుని అర్ధరాత్రి సమయంలో ఇంగ్లిష్ హర్రర్ సినిమా చూస్తున్నా ఒకరోజున, ఉన్నట్టుండి ఎదురు సోఫాలో తనుకూడా కూచుని సినిమా చూస్తోంది. ఆ వాతావరణం, ఆ సమయం, దెయ్యంతో కలసి హర్రర్ సినిమా చూడటం, ఇవన్నీ భలే నవ్వు పుట్టించాయి. ఇదంతా కామెడీగా తీసుకుని నేను నవ్వడం చూచి ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మాయమైపోయింది.

తోటలో ఉన్న ఉయ్యాల, గాలిలేకపోయినా చాలాసార్లు ఊగుతూ కనిపించేది. కొన్నిసార్లు ఆ అమ్మాయి  ఉయ్యాలమీద కనిపించేది. కొన్నిసార్లు ఉత్త ఉయ్యాల ఊగేది. ఆ ఉయ్యాల మా బెడ్ రూము  బయటే రావిచెట్టు క్రింద ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో ఉయ్యాల ఊగడం మా బెడ్ రూమ్ కిటికీ లోనుంచి స్పష్టంగా కనిపించేది.

ఒకసారి మా కొలీగ్ ఆఫీసర్ రవి సతీసమేతంగా మా ఇంటికొచ్చాడు. తనొచ్చేసరికి ఆ ఉయ్యాల ఊగుతోంది. తాను చూచి ఆశ్చర్యంగా 'ఆ ... ' అన్నాడు. 'గాలికి అలా ఊగుతుందిలే' అని నేను నచ్చచెప్పాను.

రాత్రి పదకొండు దాటాక గజ్జెలచప్పుడు తరచుగా ఆ ఇంట్లో వినేవాళ్ళం. మేమేకాక, మమ్మల్ని చూడటానికి వచ్చిన శిష్యులు కూడా ఈ గజ్జెలచప్పుడు చాలాసార్లు  విన్నారు. ఎవరో గజ్జెలు కట్టుకుని ఒక గదిలోనుంచి ఇంకో గదిలోకి నడుస్తున్నట్లు వినిపించేది. కొన్నిసార్లు  మంచం ప్రక్కనే వినిపించేది, కొన్నిసార్లు దూరంగా వినిపించేది.

'అది కీచురాళ్ళ ధ్వని, తోటలో చాలా పురుగులుంటాయి. అవి అలా అరుస్తాయి. భయపడకండి' అని ఇంటికొచ్చినవారికి నచ్చచెప్పేవాడిని.

కానీ వారిలో ఒక తెలివైన శిష్యురాలు మాత్రం పట్టేసింది.  'కీచురాళ్లకూ, గజ్జెలచప్పుడుకూ మాకు తేడా తెలియదని మీరనుకుంటున్నారా?' అని నన్నడిగింది. నేను నవ్వేసి ఊరుకున్నాను.

అమావాస్య అర్ధరాత్రిపూట అదే తోటలోని చింతచెట్టు క్రింద నేను కూచుని కాళీమహామంత్రాన్ని జపించేవాడిని. మహావిద్యా పారాయణం చేసేవాడిని. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఆ చింతచెట్టు క్రింద నేను చేసుకున్నాను. తోటలో దోమలు విపరీతంగా ఉండేవి. అందుకని ఒక దోమతెరను ఆ చెట్టుక్రింద కట్టి దానిలో కూచుని రాత్రిళ్ళు జపం చేసేవాడిని. జపసమయంలో తంత్రోక్తమైన అష్టదిగ్బంధనం ఉంటుంది గనుక, ఏ దుష్టశక్తీ దానినిదాటి లోపలకు రాలేదు సరికదా, మనవైపు తేరిపార చూడను కూడా చూడలేదు. 

ఈ విధంగా అనేక అనుభవాలతో మూడేళ్లపాటు ఆ బంగళాలో ఉన్నాము. చివరిరోజున, అంటే గతనెల జూలై 16 న బంగళాను ఖాళీ చేసి KPHB కాలనీకి మారాము. ఆ రోజు రాత్రి సామానులన్నీ వెళ్ళిపోయాక నేనక్కడే ఉన్నాను. ఆ రాత్రి కూడా బెడ్రూమ్ తలుపు దగ్గర నిలబడి కనిపించింది. ఎప్పటిలాగే దిగాలుగా చూస్తోంది.

ఉదయం నాలుగుకు నిద్రలేచి, స్నానం కానిచ్చి, ఆ ఇంటికి తాళం వేసి KPHB కాలనీకి బయల్దేరాను. అయిదింటికి స్కూటర్ తీస్తుంటే ఉయ్యాలమీద కూచుని తను కనిపించింది. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని, 'ప్రభూ ! నీకిష్టమైతే, ఈ దీనాత్మకు విముక్తిని ప్రసాదించు' అని నా ఇష్టదైవాన్ని ప్రార్ధించాను. కళ్ళు తెరిచి చూస్తే ఉయ్యాల ఖాళీగా ఉంది.

తలుపు తాళం వేసి నా దారిన నేను బయల్దేరి, ఉదయం ఆరింటి కల్లా KPHB కాలనీకి చేరుకున్నాను.

జూలై 27 న ఆఫీసు నుండి ఇంటికి బయల్దేరాను. ఆఫీసులో అదే నా ఆఖరిరోజని ఊహించలేదు. నాతోబాటు క్రిందదాకా నా ప్యూన్ బాలస్వామి వచ్చాడు. తను క్రిస్టియన్, కానీ విశాలభావాలు కలిగినవాడు. చాలా మంచివాడు. సికింద్రాబాద్ లోనే గత  20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. నడుస్తూ ఉండగా తననొక మాట అడిగాను.

'బాలస్వామి ! మా బంగళాకు ఏమైనా చరిత్ర ఉన్నదా? నువ్విక్కడ గత 20 ఏళ్లుగా ఉన్నావు కదా? అందులో ఒకమ్మాయి తిరుగుతూ ఉంది. నేను చూచాను. మా శ్రీమతి కూడా చూచింది. నీకేమైనా తెలిస్తే వివరాలు చెప్పు'

నడుస్తున్న బాలస్వామి హఠాత్తుగా ఆగిపోయాడు. చేతులు జోడించాడు.

'సార్ ! మీరు భక్తిపరులు కాబట్టి బ్రతికి బయటపడ్డారు. ఆ అమ్మాయి ఎవరో కాదు. మా ఫ్రెండ్ కృష్ణ కూతురే. మీ బంగళా అవుట్ హౌస్ లో వాళ్ళుండేవారు. ఆ అమ్మాయికి పెళ్లయింది.  భర్తతో ఏవో గొడవలతో కాల్చుకుని చనిపోయింది. మీ బంగళా ఆవరణలోనే ఇది జరిగింది. తెలిసి తెలిసి ఎవరూ ఆ బంగళాలో దిగరు. దేవుని ఆశీస్సులతోనే మీరు క్షేమంగా మూడేళ్లు అందులో ఉండి బయటపడ్డారు, అమ్మగారి పూజలే మిమ్మల్ని రక్షించాయి' అన్నాడు.

'చనిపోయేటప్పటికీ ఆ అమ్మాయి గర్భవతా?' అడిగాను.

'అదేమో నాకు తెలీదు సార్. కానీ భార్యాభర్తల మధ్య గొడవలతో కాల్చుకుని చనిపోయింది. ఆమె తండ్రి నా ఫ్రెండ్. అతనే నాకీ విషయం చెప్పాడు' అన్నాడు బాలస్వామి.

తనకు నా ఆధ్యాత్మిక కోణం గురించి తెలీదు. తనకే కాదు, మా ఆఫీసులో గాని, నా ఫ్రెండ్స్ సర్కిల్లో గాని ఎవరికీ తెలీదు. అంత లోప్రొఫైల్లో నేనుండేవాడిని. అస్సలు బయటపడేవాడిని కాదు. ఎవరైనా నా దగ్గర జ్యోతిష్యమని, ఆధ్యాత్మికమని మాట్లాడినా కూడా ఏమీ తెలీనివాడి లాగా వినేవాడినిగాని ఏమీ చర్చించేవాడిని కాదు. ఈ విధంగా 40 ఏళ్లపాటు చాలా లోప్రోఫైల్లో నేను జీవించాను.

నవ్వుకుని, 'అంతే బాలస్వామి. నా జీవితంలో నేనెవరికీ హాని చెయ్యలేదు. చేతనైతే సహాయం చేశాను గాని, కీడు చెయ్యలేదు. దేవుడు మనల్ని కాపాడతాడు కదా' అన్నాను. అవునన్నట్లు అతను తలాడించాడు.

మెట్రో  రైలెక్కి JNTU College స్టాప్ లో దిగాను. ఇంటికి చేరాను.      

ఇంతకీ ఆ ఆత్మకు విముక్తి లభించిందా లేదా అనే కదా మీ సందేహం !

వెల్ ! అన్నీ చెప్పేస్తే ఇక నా ప్రత్యేకత ఏముంటుంది మరి !

మీకంతగా తెలుసుకోవాలని బాగా దుగ్దగా ఉంటే, ఆ బంగాళా అక్కడే ఉంది. మెట్టుగూడ మీదుగా తార్నాక వెళ్లే మెయిన్ రోడ్డులో రోడ్డుప్రక్కనే రాత్రిపూట టిఫిన్ బండ్లు పెడతారు. ఆ ప్రక్కనే నేను మూడేళ్లపాటు నివసించిన బంగళా ఉంటుంది. ఒకరాత్రి పూట వెళ్లి అక్కడ నిద్రించి చూడండి.  మీకే ప్రత్యక్షంగా తెలుస్తుంది !

read more " మూడవ అమెరికా యాత్ర - 8 (ప్రేతాత్మతో మూడేళ్లు) "

16, ఆగస్టు 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 7 (స్నానానికి ముందే సంధ్యావందనం)


స్నానానికి ముందే సంధ్యావందనమా? ఇదేంటి? అని మళ్ళీ గుక్క పెట్టకండి. చదవండి.

స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలని, గాయత్రిని జపించాలని చిన్నప్పుడు నేర్చుకున్నా. కానీ ఇప్పుడది పూర్తిగా రివర్స్ అయింది. స్నానంతో పనిలేకుండా గాయత్రి నడుస్తోంది. సంధ్య అనుక్షణం దర్శనమిస్తోంది.

డెట్రాయిట్ కొచ్చాక నాకు బాగా నచ్చిన అనుదినచర్యలలో ఒకటి -- మార్నింగ్ వాక్. ఇక్కడ సూర్యోదయం ఉదయం ఆరున్నరకు అవుతోంది. అస్తమయం రాత్రి తొమ్మిదిన్నరకు అవుతోంది. సూర్యోదయానికంటే రెండుగంటల ముందే నిద్రలేస్తున్నాం గనుక, ధ్యానసాధనలన్నీ సూర్యోదయం  కంటే ముందే అయిపోతాయి. సూర్యుడు ఉదయించే సమయానికి  మార్నింగ్ వాక్ లో ఉంటాను. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తాను.

సూర్యోదయం ఇండియాలో కూడా జరుగుతుంది. కానీ అది జనారణ్యం. దుమ్ము, గోల, విశాలమైన పరిసరాలు లేకపోవడం, ట్రాఫిక్ గోల, అరుపులు, డిస్టర్బెన్స్ లు, ఇవన్నీ ఆ ఆస్వాదనకు అడ్డుపడతాయి. ఇక్కడా బాధ లేదు. రోజుమొత్తం మీద ఒక్కొక్కసారి మనుషులే కనిపించరు. విశాలమైన పచ్చిక బయళ్లు, చెట్లు, ప్రకృతి ఇవన్నీ కలసి సృష్టిమధ్యన మనం ఒక్కళ్ళమే ఉన్న ఫీలింగ్ వస్తుంది. అది ధ్యానస్థితిని అప్రయత్నంగా కలిగిస్తుంది.

నిన్న ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నా. సూర్యుడు ఉదయిస్తున్నాడు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లను బట్టి సూర్యకాంతిలో తేడాలుంటాయి. ఇవి ధ్యానులకు స్పష్టంగా తెలుస్తాయి. ఇక్కడి సూర్యుడు బంగారుకాంతిలో ఉదయిస్తాడు. అద్భుతమైన వెలుగు కిరణాలు నలుదెసలా పరుచుకుంటూ గోచరిస్తాయి. అనంతమైన ఆకాశంలో అద్భుతమైన మేఘాలు. ఆ మేఘాలనుండి తూర్పుదిక్కున బంగారుకాంతిలో సూర్యోదయం. ఈ దృశ్యాన్ని నిన్న చూచాను. అప్రతిభుడినై అలాగే నిలబడిపోయాను. వెంటనే ఈ ఋగ్వేదమంత్రం మనసులో అలలలాగా ధ్వనించింది.

|| ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితా రథేన ఆ దేవో యాతి భువనా విపశ్యన్ ||

'సత్యస్వరూపమైన తన తేజస్సుతో ప్రతిదినమూ మానవులను దేవతలను ఉత్తేజపరుస్తూ తన బంగారురధంలో సమస్తలోకాలనూ వీక్షిస్తూ ఈ దేవదేవుడు ఉదయిస్తున్నాడు. మానవులారా చూడండి !' అంటూ వేదఋషులు పలికిన మంత్రధ్వనులు నా చెవులలో అలలలాగా తేలియాడుతూ  ప్రతిధ్వనించాయి.

ఆలోచనలు ఆగిపోయాయి. అనంతమైన బంగారుకాంతిలో లీనమై స్థాణువులాగా దారిలోనే నిలచిపోయాను. ఎక్కడున్నానో తెలియదు. కాలం ఆగిపోయింది.

సంకల్పానికి సంకల్పానికి మధ్య అగాధమైన శూన్యంలో సంధ్యాదేవి తన దేదీప్యమైన కాంతిలో నిత్యమూ దర్శనమిస్తోంది. ఇక ప్రత్యేకంగా సంధ్యావందనమెందుకు? స్నానం అవసరమేముంది?

సమస్తదేవతలూ సూర్యకాంతిలోనే ఉన్నారు. చూడగలిగే చూపుంటే వారిని దర్శించవచ్చు. ఈ స్థితిలో ఉన్నపుడు ఇక ప్రత్యేకమైన గాయత్రీజపం ఎందుకు? దానిలోనే మనస్సు నిత్యమూ నిలబడిపోతుంటే ఇక దేనిని జపించాలి?

వేదఋషులతో శ్రుతిగలుపుతూ నేనూ ఇదే చెబుతున్నాను.

మానవులారా ! మీ చెత్త జీవితాల ఊబిలోనుంచి బయటపడండి. ఈ స్థితులను అందుకోండి. మీ జీవితాలకు ధన్యత్వాన్ని అద్దుకోండి.

ఉత్తమమైన మానవజన్మ లభించి కూడా, ఈ సత్యాలను ప్రత్యక్షంగా దర్శించలేకపోతే, ఇంద్రియాల ఊబిలోనే ఉంటుంటే, గాసిప్ తో జీవితాన్ని నింపుకుంటుంటే, ఇక మానవజన్మకు అర్ధమూ పరమార్థమూ ఏముంటాయి?

read more " మూడవ అమెరికా యాత్ర - 7 (స్నానానికి ముందే సంధ్యావందనం) "

15, ఆగస్టు 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 6 (జీసస్ కే దిక్కులేదు నేనెంత?)

నిన్న 'ఆ' ఇంటికి లంచ్ కెళ్ళాము. 'ఆ' పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ (అమెరికా) కు అద్యక్షుడు. డెట్రాయిట్ లోని ప్రముఖులలో ఒకడు. అమెరికా ప్రెసిడెంట్ తో ఏడాదికి కనీసం రెండుసార్లు డిన్నర్ చేస్తాడు. ఇండియా నుంచి సెంట్రల్ మినిస్టర్స్ గాని, ప్రముఖులు గాని డెట్రాయిట్ కి వస్తే వీళ్ళ అతిధులుగా ఉంటారు. ఆ స్థాయి మనిషి. ఈయన నా శిష్యుడే గాక, నేనంటే ఎంతో ప్రేమా గౌరవమూ ఉన్న వ్యక్తి. ఆయన సతీమణి కూడా అంతే. డెట్రాయిట్ లోని ఒక పోష్ లొకాలిటీలో రెండెకరాల స్థలంలో  వీళ్ళ బంగళా ఉంటుంది. అక్కడకు నిన్న లంచ్ కి వెళ్లడం జరిగింది. మన ఇండియా వంటకాలను ఎంతో శ్రద్ధతో చేసి, ప్రేమతో వడ్డించారు ఆ దంపతులు.

ఎత్తైన పైన్ వృక్షాల మధ్య, బాక్ యార్డ్ డెక్ మీద లంచ్ చేసి తీరికగా కూర్చున్న తర్వాత, 'ఆ' ఇలా అడిగాడు.

'గురూజీ ! మీరు 'ప' ఇంటికి ఎందుకెళ్ళారు? మీకలాంటి అవమానం జరిగితే మేము భరించలేము. మీకోసం రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇవ్వడానికి ఎంతో మందిమి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. మీరు ఒకసారి మా ఇంటికి వస్తే చాలని ఎదురుచూచేవాళ్ళం ఎంతోమందిమి ఉన్నాము. మీరెందుకు వెదుక్కుంటూ అక్కడకు వెళ్లి, ఆ అవమానాన్ని స్వీకరించారు? ఇది మాకెంతో బాధగా ఉంది'

తనతో ఇలా చెప్పాను.

'మీరు 'ప' కోసం వెదుకవద్దని నాతో గతంలో చెప్పారు. కానీ మీ మాటను వినకుండా 'ప' ఇంటికి వెతుక్కుంటూ వెళ్లినందుకు ముందుగా మీకు సారీ చెబుతున్నాను. అక్కడకు వెళ్లకుండా ఉంటే నాకు గిలిగా ఉండేది.  ఒక్క అవకాశం తనకు ఇచ్చి ఉంటే బాగుండేదేమో, తను మళ్ళీ మంచిమార్గంలోకి వచ్చేదేమో? అని ఒక ఆలోచన నాలో మిగిలిపోయి ఉండేది. ఇప్పుడా గిలి లేదు. చివరి అవకాశం నేనిచ్చాను, కానీ తను ఉపయోగించుకోలేకపోయింది. అది తన ఖర్మ. నావైపు నుండి నేను క్లిన్ హార్ట్ తో ఉన్నాను. ఈ కోణంలో చూచినప్పుడు, నేను వెళ్లడం వల్ల మంచే జరిగిందని  అనుకుంటున్నాను'

అర్ధం అయిందన్నట్లు 'ఆ' నవ్వాడు.

నేనింకా ఇలా చెప్పాను.

'చూడండి. Knock and it shall be opened unto you అని జీసస్ బైబిల్లో అంటాడు. I am standing at your door and knocking. Will you open the door?' అన్నట్లు కూడా బైబిల్లో మాటలుంటాయి. నేనూ అదే చేశాను. డోర్ దగ్గర నిలబడి తలుపు కొడుతుంటే జీసస్ కే అక్కడ దిక్కూ మొక్కూ లేదు.  ఇక ఆఫ్టరాల్ నేనెంత చెప్పండి? రెండువేల ఏళ్ళనుంచీ ఇంటింటికీ తిరుగుతూ జీసస్ తలుపులు కొడుతూనే ఉన్నాడు. చాలామంది ఇప్పటికీ తలుపులు తెరవడం లేదు. ఇక నాకెవరు తెరుస్తారు? కనుక ఆ విషయం గురించి మీరు బాధపడకండి.  నేను దానిని అవమానంగా తీసుకోవడం లేదు. గౌరవాన్ని ఆశించి నేనక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ నిన్న జరిగినది అవమానమైనప్పటికీ, నేడు మీ ఇంట్లో ఇంతటి గౌరవాన్ని పొందాను. నిన్న జరిగినది అవమానం అనుకుంటే, నేడు ఒక సెలబ్రిటీ ఇంట్లో అద్భుతమైన రెడ్ కార్పెట్ వెల్కమ్ మరియు ఆదరణ, గౌరవాలను పొందాను. మానావమానాలను సమంగా తీసుకునేవాడే నాకిష్టుడని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడన్నాడు. వెలుగూ చీకట్లలాగా, పగలూ రాత్రులలాగా, సుఖదుఃఖాలలాగా అవమానాలు గౌరవాలు కూడా జీవితంలో సహజమే.  నాకేమీ బాధ లేదు. మీరు కూడా వర్రీ అవకండి. నేను చేయవలసింది చేశాను. ఫలితం నాకనవసరం. బాధపడకండి' అని చెప్పాను.

శ్లో || సమః శత్రౌచ మిత్రేచ తథా మానావమానయోః 

శీతోష్ణ సుఖదుఃఖేషు సమః సంగ వివర్జితః ||

శ్లో || తుల్యనిందా స్తుతిర్మౌనీ సంతుష్టో ఏనకేనచిత్

అనికేతః స్థిరమతి: భక్తిమాన్యే ప్రియా నరః || భగవద్గీత 12-- 18, 19 || 

శత్రువులను మిత్రులను సమానంగా చూస్తూ, గౌరవాన్ని అవమానాన్ని సమంగా స్వీకరిస్తూ, చలిని వేడిని, సుఖదుఃఖాలను సమానములుగా చూస్తూ, సంగమును వదలిపెట్టినవాడై, నిందనూ స్తుతినీ సమంగా తీసుకుంటూ, ఏది లభించినా దానితోనే సంతోషపడుతూ, ఒక ఆధారమంటూ లేనివాడై, స్థిరమైన మనస్సుతో, భక్తిపరుడై ఉన్నవాడే నాకు ప్రీతిపాత్రుడు.

అని సాక్షాత్తు భగవంతుడే చెప్పలేదా మరి?


డెక్ మీద


బ్యాక్ యార్డ్ లోని బుద్ధా పాండ్ దగ్గర ధ్యానస్థితిలో


'ఆ' ఇంటి పరిసరాలు

read more " మూడవ అమెరికా యాత్ర - 6 (జీసస్ కే దిక్కులేదు నేనెంత?) "

మూడవ అమెరికా యాత్ర - 5 (కోవిడ్ తో ఆడుకున్నాం)

ఏంటి టైటిల్ తప్పు పెట్టినట్టున్నారు? 

'ప్రస్తుతం గురువుగారు అమెరికాలో ఉన్నారు కదా. కాబట్టి డేవిడ్ తో ఆడుకున్నాం అనాలి కదా?' అన్న అనుమానం వచ్చిందా? డేవిడ్ కాదు కోవిడే. సాక్షాత్తు కోవిడ్ తోనే సరదా ఆటను ఆడుకున్నాం.

ఆ కథను వినండి.

నా రిటైర్మెంట్ చాలా విచిత్రంగా జరిగింది. జూలై నెలలో 30, 31 శని ఆదివారాలయ్యాయి గనుక 29 నాకు లాస్ట్ వర్కింగ్ డే అయింది. అందుకని 27 న రైల్ నిలయంలోని మా ఆఫీసులో లంచ్ పార్టీ ఇచ్చాను. ఆ సమయంలోనే నాకు కోవిడ్ ఎటాక్ అయింది.

గత నాలుగు నెలలక్రితం వరకూ నేను కోవిడ్ వాక్సిన్ వేసుకోలేదు. కానీ గత రెండేళ్లుగా వందలాదిమందితో కలసి తిరుగుతూ పని చేసుకుంటూనే ఉన్నాను. నా చుట్టుప్రక్కల ఎంతోమంది కోవిడ్ తో చనిపోయారు.  కానీ గత రెండేళ్లుగా నాకు కోవిడ్ ఎటాక్ కాలేదు. మా ఆఫీసు మొత్తానికీ నేనొక్కడినే వాక్సిన్ వేసుకోనివాడిని.  నాకవసరం లేదని వారికి చెప్పేవాడిని. వాక్సిన్ వేసుకోని వారి లిస్ట్ GM గారికి ప్రతినెలా వెళుతూ ఉండేది. అందులో  నా పేరు మాటిమాటికీ కనిపిస్తూ ఉండేది. ప్రతివారూ అడుగుతూ ఉండేవారు, 'ఏంటి సార్ మీరింకా వాక్సిన్ వేసుకోలేదా? ఫ్రీనే. మన కార్లో వెళ్లి లాలాగూడ హాస్పటల్లో వేయించుకుని రండి' అని పోరు పెట్టేవారు. అదీగాక, నాలుగు నెలలలో అమెరికా వెళ్ళాలి.  వాక్సిన్ సర్టిఫికెట్ లేనిదే విమానం ఎక్కనివ్వరు గనుక నాలుగు నెలలక్రితం, నాకవసరం లేదని తెలిసినా, చచ్చినట్టు వాక్సిన్ వేయించుకున్నాను. ఆ తర్వాత పదిరోజుల క్రితం నాకు కోవిడ్ సోకింది. నాకేకాదు, నా నుంచి నా కుటుంబం అందరికీ సోకింది.

సడన్ గా చలి, ఒళ్ళు నొప్పులు, నడుం నొప్పి, జ్వరం, దగ్గు మొదలయ్యాయి. కోవిడ్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది.  తీవ్రమైన నడుం నొప్పితో ప్రక్కమీద పడుకుని ఉండి, జస్ట్ పక్కకు దొర్లడం కూడా నరకం లాగా ఉండేది.  లేచి కూర్చోవడం అంటే ఇక గగనమే. టాయిలెట్ కు వెళ్లాలంటే నరకం కనిపించేది. ఈ విధంగా రెండు రోజులు బాధపడ్డాను. 

కోవిడ్ మీద హోమియో ఎలా పనిచేస్తుందో నా బాడీలోనే సరదాగా చూద్దామని అనుకున్నాను.  లక్షణాలు గమనించాను. మందులు ఇండికేట్ అయ్యాయి. ఈలోపల మా అమ్మాయికి, మా శ్రీమతికి కూడా నానుంచి కోవిడ్ సోకింది. వాళ్ళూ జ్వరంతో, ఒళ్లునొప్పులతో, ఇతరలక్షణాలతో అడ్డం పడ్డారు. అందరికీ మందులేసుకుంటూ, నాలుగు రోజుల్లో కోవిడ్ ను తరిమికొట్టాము.

బ్రయోనియా, జెల్సిమియం, నేట్రంమూర్ ఇవే మేము వాడిన మందులు. కోవిడ్ పారిపోయింది. ఏ ఆస్పత్రికీ మేము వెళ్ళలేదు. ఏ ఇంగ్లీషు మందులూ మింగలేదు. కోవిడ్ తో ఆడుకున్నాం. జయించాం.

మేము ముగ్గురమూ కోవిడ్ తో అడ్డం పడి వారం రోజులున్నాము. అదే ఇంట్లో మాకు సేవలు చేస్తూ ఇంకో ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్ళు మూర్తి, సంధ్య. వాళ్ళు కూడా నాలాగే వాక్సిన్ వేయించుకోలేదు. నేనంటే అమెరికా వెళ్ళాలి కాబట్టి కొద్దినెలలక్రిత్రం వాక్సిన్ వేయించుకున్నాను. కానీ వాళ్ళు ఈనాటికీ వాక్సిన్ వేయించుకోలేదు.  కోవిడ్ విలయతాండవం చేసిన గుంటూరు దగ్గర ఒక ఊరిలో వారుంటారు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది కోవిడ్ తో గత రెండేళ్లతో చనిపోయారు. కానీ కోవిడ్ వాళ్ళను ఈనాటికీ తాకలేదు. అదికాదు అసలు సంగతి. 

వాళ్ళు మాతోనే మా ఇంట్లోనే నెలరోజులున్నారు. కోవిడ్ తో అడ్డంపడిన మాకు సేవలు చేశారు. అందరం ఒకే హాల్లో నిద్రించేవాళ్ళం.  ఇంటికి పెద్దగా వెంటిలేషన్ లేదు. అవే బాత్రూములు, ఆదే కిచెన్, అదే వస్తువులు వాళ్ళూ వాడారు, ముగ్గురు కోవిడ్ పేషంట్లతో ఒకే ఇంట్లో రెండువారాలున్నారు. కానీ వాళ్లకు కోవిడ్ సోకలేదు. మాకు కోవిడ్ వచ్చింది, తగ్గింది. వాళ్లకు మాత్రం సోకలేదు. అచంచలమైన గురుభక్తితో కోవిడ్ ను దరిదాపులక్కూడా రాకుండా తరిమికొట్టారు మూర్తి సంధ్య దంపతులు.  ఈ సంఘటన ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో జరగలేదు. కేవలం పదిరోజులక్రితమే హైద్రాబాద్  KPHB కాలనీలో జరిగింది.

ఏవో సాయిబాబా పుస్తకాలలో మహిమలను చదివి చెక్కభజనలు చెయ్యడం కాదు, అద్భుతాలు మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి. చూచే చూపుంటే చూడండి.

read more " మూడవ అమెరికా యాత్ర - 5 (కోవిడ్ తో ఆడుకున్నాం) "

14, ఆగస్టు 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 4 (జీవిత రహస్యాలు - భవిష్యజ్ఞానం)

నేను సర్వీస్ లో ఉండగా నాకు చాలా పరిమితులుండేవి. బాధ్యతలు కలిగిన ఒక ఉన్నతాధికారిగా వాటి పరిధిలోనే నేను సోషల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకుండేది. కానీ నేనిప్పుడు ఫ్రీబర్ద్ ని. ఆఫ్ కోర్స్, ఇప్పుడు కూడా సోషల్ మీడియా పరిమితులున్నాయి. కానీ అవి అఫీషియల్ పరిమితులకంటే కొంచం విశాలమైనవి. కనుక, ఫ్రీగా అన్ని విషయాలను నా అభిమానులతో శిష్యులతో పంచుకునే అవకాశం నాకు ఇప్పుడొచ్చింది. అందుకే, మునుపటికంటే లోతైన విషయాలను మీతో చెబుతున్నాను.

ఇప్పటిదాకా అయితే, ఇలాంటి విషయాలను నా గ్రూప్ లో మాత్రమే, నా శిష్యులతో మాత్రమే  మాట్లాడేవాడిని. కానీ అమెరికా సీరీస్ వ్రాస్తున్నందువలన ఇలాంటి లోతైన విషయాలను కూడా బ్లాగులో వ్రాస్తున్నాను. అది చదువరుల అదృష్టం. ఇది నామాట కాదు, నా బ్లాగు చదివి ఎన్నో క్రొత్త విషయాలను గ్రహిస్తున్నామని, జీవితాలకు జీవితాలే మంచిదారిలో పడుతున్నాయని నాకు వచ్చే ఎన్నో మెయిల్సే ఈ మాటలు అంటున్నాయి.

భవిష్యత్తును తెలుసుకోవడం అనేది మనిషికి అనాదినుంచీ ఉన్న ఒక ఉత్సుకత. అది సాధ్యమేనని నేనూ అంటాను. అదేమీ గొప్ప విషయం కాదని కూడా నేనంటాను. భవిష్యత్తును ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దానిని మార్చవచ్చు కూడా. ఇది తన విషయంలోనూ, ఇతరుల విషయంలోనూ కూడా చెయ్యవచ్చు. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, యోగదృష్టి, సాధనాబలం. రెండు, జ్యోతిష్యజ్ఞానం. మొదటిది ఉన్నవారికి రెండవది అవసరం లేకపోయినప్పటికీ, ధ్యానశక్తి ఉన్న యోగులు కూడా డబల్ చెక్ కింద జ్యోతిష్యజ్ఞానాన్ని వాడుకోవచ్చు. సాంప్రదాయ యోగులు ఇలా చేస్తూ ఉంటారు. 

ఇదంతా పుస్తకాలనుంచి కాదుగాని, నా అనుభవం నుంచి చెబుతున్నానని గ్రహించండి.

నా బ్లాగులో నా పర్సనల్ విషయాలను కూడా అతి సాధారణంగా వ్రాస్తూ ఉంటానని మీకు తెలుసు.  దానిక్కారణం నా జీవితం ఒక ఓపెన్ బుక్ కావడమే. ఇదే విధంగా నాతో సంబంధం ఉన్న ఇతరుల గురించి కూడా వ్రాస్తూ ఉంటాను. దానికి వాళ్ళు అఫెండ్ అవుతూ ఉంటారు.  అది వాళ్ళ ఖర్మ. కొంతైనా విశాలదృక్పధం లేనిదే నాతో ఎవరూ కలసి నడవలేరు. అది అసంభవం. ప్రతిదాన్నీ అంత  దాచిపెట్టుకుని దొంగలలాగా బ్రతకవలసిన ఖర్మ ఎందుకు మీకు? అని నేనడుగుతూ ఉంటాను.

ప్రస్తుతం విషయంలోకొస్తాను.

ఏడాదిలో సీజన్స్ ఉన్నట్లుగా, మన జీవితాలలో కూడా కొన్ని పాటర్న్స్ ఉంటాయి. లోతుగా పరిశీలించే శక్తి ఉంటే అవి అర్ధమౌతాయి.  యోగదృష్టి ఉన్నపుడు వాటి మూలాలు తెలుస్తాయి. ఆ మూలాలు గతజన్మలలోకి కూడా మనల్ని తీసుకెళతాయి. డబల్ చెక్ గా జ్యోతిష్యజ్ఞానాన్ని ఉపయోగించి నిర్ధారణగా వాటిని గ్రహించవచ్చు. ఇది నా సాధనామార్గంలో నడిచే నా శిష్యులకు నేను నేర్పించే ఒక సాధన. దీనివల్ల మీ జీవితపు లోతుపాతులు, జరుగుతున్న సంఘటనల మూలాలు, వాటి కారణాలు, అన్నీ మీకర్ధమౌతాయి.

2016 లో నేను మొదటిసారి అమెరికా వచ్చాను. అప్పుడు మా సతీమణి పెదనాన్న ఇండియాలో చనిపోయాడు.  అంటే నాకు మామయ్య వరస అవుతాడు. 2017 లో మళ్ళీ అమెరికా వచ్చాను. అప్పుడు మా మేనమామ ఇండియాలో చనిపోయాడు. ఇప్పుడు అయిదేళ్ల తర్వాత మళ్ళీ అమెరికా వచ్చాము. రాబోయే ముందు మా సతీమణితో ఇలా అన్నాను.

'మనం అమెరికాలో అడుగు పెట్టగానే మా మేనమామ భార్య చనిపోతుంది. ఈ వార్తను మనం అమెరికా గడ్డమీద వింటాము. కానీ ఆమెను చూడటానికి మనం పోలేము'.

గతంలో నేను చెప్పిన ఎన్నో సంఘటనలు జరగడం ప్రత్యక్షంగా చూచిన ఆమె మౌనంగా విని ఊరుకుంది. 

సాయంత్రం 5 గంటలకు మేము డెట్రాయిట్ లో అడుగుపెట్టాము. 6 గంటలకు మెసేజి వచ్చింది. ఆమె చనిపోయిందని. నేనేమీ ఆశ్చర్యపోలేదు. సతీమణి కూడా ఆశ్చర్యపోలేదు. 'ఈ విధంగా అమెరికా వచ్చాము, కార్యక్రమానికి రాలేమ'ని వారికి మెసేజి పెట్టాము. భవిష్యత్ జ్ఞానం వల్ల ఇలాంటి బేలెన్స్ వస్తుంది.

ఇదెలా సాధ్యమౌతుంది.?

అమెరికాలో అడుగుపెడుతున్నపుడే నాకు తెలిసిపోయింది. ఇండియాలో ఆమె మరణవేదన పడుతున్నదని. ఎలా తెలుస్తుంది? అని అడగకండి. అది నేను వివరించినా మీకర్ధం కాదు. ఎక్కడో ఇండియాలో ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజి ఇస్తే అమెరికాలో ఎలా తెలుస్తున్నది? ఇదీ అంతే. దానికి చాలా రహస్యాలుంటాయి. వాటిని ఇంతవరకే చెప్పగలను గాని ఇంతకు మించి చెప్పలేను. నాకు యోగదృష్టితో తెలిసినది నిజమే అని నిర్ధారిస్తూ, కొద్దిసేపటిలోనే మెసేజి వచ్చింది ఆమె పోయిందని.

ఎవరి జాతకంలో అయితే, నవమభావానికి అష్టమభావానికి షష్ఠభావానికి సంబంధాలుంటాయో, వారు దూరదేశాలకు వెళితే, వారి మేనమామ గాని, మేనమామ సంబంధిత బంధువులు గాని  చనిపోతారు. ఇది ఒక జ్యోతిష్యసూత్రం. ఈ యోగం నా జాతకంలో స్పష్టంగా ఉంది. ఈ విషయం నాకు తెలుసు గనుక యోగదృష్టి ద్వారా నాకు తెలిసిన విషయాలను జ్యోతిష్యజ్ఞానంతో డబల్ చెకప్ చేసుకుని నిర్ధారణ చేసుకున్నాను. ఈ జ్ఞానంతోనే మా సతీమణికి  మూడునెలల ముందు చెప్పాను,'మా అత్తయ్యకు రోజులు దగ్గర పడుతున్నాయి.  మనం అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే ఆమె చనిపోతుంది' అని. ఖచ్చితంగా అదే ఇప్పుడు జరిగింది. 

 ఇలాంటి యోగదృష్టి ఎలా వస్తుంది? అని మీకు సందేహం రావచ్చు.

ఎన్నో ఏండ్ల సాధనతో ఇది వస్తుంది. యోగసూత్రాలలోని 'సిద్ధిపాదం' అనే అధ్యాయంలో పతంజలిమహర్షి ఇటువంటి సిద్ధులను ఉదాహరించారు. ఈ సిద్ధిని ఆయన 'కాలగతి జ్ఞానం' అన్నారు. ఇది నిజమే అని నా జీవితంలో ఎన్నో అనుభవాలద్వారా నేను స్పష్టంగా గ్రహించాను.

'అయితే, భవిష్యత్తును తెలుసుకుని ఏం చెయ్యాలి, మార్చలేము కదా?' అని మీకు సందేహం రావచ్చు.  అది కరెక్ట్ కాదు. భవిష్యత్తును మార్చడం కూడా సాధ్యమే. అయితే, అది అందరూ చేసుకోలేరు.  అంతటి అర్హతలు అందరికీ ఉండవు. మేము కూడా అందరికీ దీనిని చెయ్యము. అతి కొద్దిమందికి మాత్రమే ఇటువంటి సహాయాన్ని చేస్తాము. అలా సహాయాన్ని పొందటానికి వారికి ఎన్నో ఉత్తమ అర్హతలుండాలి.  అటువంటి మనుషులకే ఆ సహాయం చేస్తాము గాని ఊరకే పరిచయం ఉన్న అందరికీ చెయ్యము.

నా వ్రాతలలో స్పష్టమైన తేడాను గమనించారా? ఇన్నాళ్లు ఇన్ డైరెక్ట్ గా వ్రాసేవాడిని, ఇప్పుడు బయటపడి, డైరెక్ట్ గా నేనేంటో చెబుతున్నాను.

ఇదే  మరి 'న్యూ లైఫ్' ప్రభావమంటే! మీ అదృష్టం వల్లే మీరు నా వ్రాతలను చదువగలుగుతున్నారు. ఇంత అధికారికంగా ప్రాక్టికల్ గా విషయాలను నిరూపిస్తూ చెప్పేవారు మీకెక్కడ దొరుకుతారు?

ఇది మీ అదృష్టమా కాదా మరి?

read more " మూడవ అమెరికా యాత్ర - 4 (జీవిత రహస్యాలు - భవిష్యజ్ఞానం) "

13, ఆగస్టు 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర -3 (మరో చీకటి శుక్రవారం)

శుక్రవారం నాడు శుక్రాచార్యుని శిష్యులకు పిచ్చి లేస్తుందనేది జగమెరిగిన సత్యం. ఈ సత్యం గతంలో ఎన్నోసార్లు రుజువౌతూ వస్తున్నది. దానికి కారణం, హింసను హత్యలను ప్రబోధించే వారి శాంతి గ్రంధం. అందులో మతపరమైన హత్యలను సమర్ధించడమే గాక, అలాంటి హత్యలు చేసినవాడికి  స్వర్గంలో సీటు కూడా ఫ్రీగా దక్కుతుందన్న ఆశ చూపించబడింది. ప్రతిశుక్రవారమూ శాంతియుత ప్రార్ధనలలో రెచ్చగొట్టబడే రాక్షసులు ఏం  చేస్తున్నారో గతచరిత్రనుండి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. నిన్న కూడా అలాంటి శుక్రవారమే. అయితే ఈసారి జరిగిన ఘోరం ఏదో రాక్షస ఇస్లామిక్ దేశంలో జరగలేదు, చింతనా స్వేచ్ఛకూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకూ ఆటపట్టైన అమెరికాలో జరిగింది.

న్యూయార్క్ దగ్గరలోని ఒక ఊరిలో సల్మాన్ రష్దీ దాడికి గురయ్యాడు. చటకా అనే ఒక సాహిత్యసంస్థలో ఉపన్యాసం ఇవ్వడానికి రష్దీ వచ్చాడు. ఆయన్ను సభికులకు పరిచయం చేస్తున్న సందర్భంలో హది మాటర్ అనే ఒక 24 ఏళ్ల అమెరికన్ యువకుడు స్టేజీమీదకు దూసుకొచ్చి రష్దీ ని పొడిచేశాడు. అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీదున్నాడు. ప్రాణభయం లేదు గాని, ఒక కన్ను పోతుందని, చెయ్యి పనిచేయకపోవచ్చని అంటున్నారు. హది మాటర్ అనే ఈ హంతక రాక్షసుడి సోషల్ మీడియా పేజీలనుంచి, అతను షియా ఉగ్రవాదాన్ని అనుసరిస్తాడని పోలీసులు గ్రహించారు. కధంతా స్పష్టంగా ఉంది.

మరోప్రక్కన ఇరాన్ లో అతన్ని మెచ్చుకుంటూ పొగడ్తలు వెల్లువెత్తాయి. ఎందుకని? 1988 లో సల్మాన్ రష్దీ satanic verses అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఖురాన్నే ఆ విధంగా అన్నాడని ఆరోపించి, అతనికి మరణశిక్ష విధించాడు ఇరాన్ ప్రెసిడెంట్ ఆయతోల్లా ఖొమైనీ. 33 ఏళ్ల తర్వాత  కూడా ఈ ఫత్వా ఇంకా సజీవంగానే ఉంది. అప్పటికి హదీ మాటర్ పుట్టనేలేదు. ఆ ఫత్వా తర్వాత, 10 ఏళ్లకు అతను కాలిఫోర్నియాలో పుట్టాడు. ఈరోజున ఈ ఘోరాన్ని చేశాడు.

ఇస్లాం అనేది రక్తంతో వ్రాయబడిన మతమని నేనెన్నో సార్లు వ్రాశాను. అందులో శాంతి అనేది, నేతిబీరకాయలో నెయ్యి లాంటిదే. అందరూ హతమయ్యాక స్మశానంలో ఉండే శాంతిలాంటిదే దాని శాంతి.  అంతేగాని, మేధావులైన మనుషులు నివసించే సమాజంలో వెల్లివిరిసే శాంతి కాదు. ఇండియాలో గత వెయ్యేళ్ళుగా ఇస్లాం చేసిన అరాచకాలు చెప్పలేనన్ని ఉన్నాయి. నా దృష్టిలో అదొక మతమే కాదు. ఒక నేరపూరిత మాఫియా గుంపు మాత్రమే.

సల్మాన్ రష్దీ 19-6-1947 న 2.30 కి ముంబాయిలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు. అతనొక మేధావి, ఆలోచనాపరుడు, రచయిత, ఉపన్యాసకుడు. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు పొందాడు.  ఉదారవాద ఆలోచనాపరునిగా ఈయనకు ప్రపంచదేశాలతో మంచి పేరుంది. ప్రస్తుతం ఈయనకు  75 ఏళ్ళు. ఈ సమయంలో, అందులోనూ స్వేచ్చకు పేరెన్నికగన్న అమెరికాలో ఇతను దాడికి గురయ్యాడు. ఇతని జాతకాన్ని గమనిద్దాం.


మేషలగ్నం, మిధునరాశి అయింది. అమావాస్య మరుసటిరోజున ఇతను పుట్టాడు. పౌర్ణమి మర్నాడు అమెరికాలో దాడికి గురయ్యాడు. సూర్యుడు చంద్రుడు 3 వ డిగ్రీమీద కలిసున్నారు. స్పష్టమైన అమావాస్యయోగం. వారితో కలిసి ఉన్న బుధుడు, రచయితనూ, ఉపన్యాసకుడినీ, దానితో వచ్చే గొడవలనూ సూచిస్తున్నాడు. రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో ఉంటూ పేరుప్రఖ్యాతులను సక్సెస్ నూ సూచిస్తున్నారు. చతుర్దంలోని శని, లోకనిందనూ, దాక్కోవడాన్నీ, భయంతో కూడిన జీవితాన్ని సూచిస్తున్నాడు. ఆరింట ఉన్న గురువు, మతపరమైన శతృత్వాలను సూచిస్తున్నాడు. లగ్నకుజుడు మొండిధైర్యాన్ని ఇస్తున్నాడు. బుధాదిత్యయోగం ఒక మేధావిని చింతనాపరుడినీ సూచిస్తున్నది. జాతకం స్పష్టంగానే ఉంది.

ప్రస్తుతం ఇతని జాతకంలో కేతు రాహు శుక్ర రాహుదశ నడుస్తున్నది. కేతువు అష్టమంలో ఉంటూ ప్రాణగండాన్ని హానిని సూచిస్తున్నాడు. రాహువు మారకస్థానంలో ఉచ్చలో ఉన్నాడు. శుక్రుడు మారకుడు. దశలు సరిపోయాయి. గోచారరీత్యా, అష్టమశని జరుగుతున్నది. ఇది మంచి సమయం కాదు. 

జననకాల కుజునిపైన గోచార రాహువు, జననకాల రాహువుపైన గోచారకుజుడు ప్రస్తుతం సంచరిస్తున్నారు. జీవకారకుడైన జననకాల గురువుపైన గోచారకేతువు సంచరించాడు. ఇది ఖచ్చితంగా ప్రాణగండం జరిగే సమయమే.

ఈ సంఘటనను ఎక్కడో అమెరికాలో ఎవరి పైననో జరిగిన దాడిగా తీసుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రపంచంలో, ముఖ్యంగా ఇండియాలో అయితే, ఇలాంటి సంఘటనలలో ఏమైనా జరుగవచ్చు. అమెరికాలోనే దిక్కు లేకపోతే, ఇక ఇండియాలాంటి దేశాలలో దిక్కూ దివాణమూ ఎక్కడుంటాయి?

ఈ సంఘటన, ప్రపంచానికి ఇస్లాం వల్ల పొంచిఉన్న ముప్పును సూచిస్తున్నది. అమెరికా వంటి దేశాల్లో కూడా చాపక్రింద నీరులాగా పెరుగుతున్న ఇస్లామిక్ రాక్షసత్వాన్ని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. ఇది అమెరికన్ సమాజానికి మంచిశకునం కాదు. 'ఇస్లాం ను నమ్మనివాడిని, ప్రశ్నించినవాడిని చంపండి' అనే ఖురాన్ బోధన చాలా ఆటవికమైనది, నాగరిక సమాజానికి పనికిరానిది. ఇది రాక్షసబోధయే గాని, మానవత్వం ఉన్న బోధ కాదు. దైవత్వం అసలే కాదు.

షియాలూ, సున్నీలూ, సూఫీలూ అందరూ హింసావాదులే. అసహనపరులే. అశాంతిదూతలే, విధ్వంసకారులే, హంతకులే అన్నది నేడు మళ్ళీమళ్ళీ రుజువౌతున్నది.

ఉన్నాయో లేవో తెలియని స్వర్గనరకాలను ఎరగా చూపించి, 'నేను చెప్పిన దేవుడినే నువ్వు నమ్మాలి లేకపోతే నిన్ను చంపుతాను' అని బెదిరించే ఖురాన్ ను ప్రపంచవ్యాప్తంగా వెంటనే బ్యాన్ చేయాలి. ఇది మానవజాతికి పనికొచ్చే పుస్తకం ఎంతమాత్రం కాదు.

ఈ విధంగా చూస్తే, తస్లీమా నస్రీన్ కూ రక్షణ లేదు, నూపుర్ శర్మకూ రక్షణ లేదు. ఎవరికీ లేదు. సులేమాన్ అనేవాడిని చంపినందుకు ఇరాన్ లీడర్స్ డైరెక్ట్ గా ట్రంప్ నూ, అప్పటి అమెరికా రక్షణమంత్రినీ హెచ్చరిస్తున్నారు. ఎప్పటికైనా పగతీర్చుకుంటామని బెదిరిస్తున్నారు. హదీ మాటర్ అనేవాడిని 'సరిహద్దురహిత ఇస్లామిక్ సైన్యం' లో ఒక సైనికుడిగా పొగుడుతున్నారు. ఇదేం  ఉన్మాదమో మరి?

శాంతియుత సాటానిక్ వర్సెస్ పుస్తకాన్ని శుక్రవారం నాడు చదివితే ఇలాగే తయారౌతారేమో మరి ! ఎంత గొప్ప దైవగ్రంధమో?

ప్రపంచవినాశనం ఇరాన్ నుండి పాకిస్తాన్ వరకూ ఉన్న ఇస్లామిక్ దేశాలనుంచే పొంచి ఉంది. భూగోళం నాశనం కావడానికి ఈ దేశాలే కారణమౌతాయి. భవిష్యత్తులో ఇది నిజం కావడాన్ని ముందుతరాలు చూస్తాయి. ఇది సత్యం.

read more " మూడవ అమెరికా యాత్ర -3 (మరో చీకటి శుక్రవారం) "

12, ఆగస్టు 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర -2 (నిజమైన గురులక్షణం)

పదేళ్లనాడు నాకొక శిష్యురాలుండేది. ఆమె పేరు 'ప'. చాలా చంచల మనస్కురాలు. అన్నీ తనకు తెలుసనుకుంటుంది. దూకుడు నిర్ణయాలు తీసుకుంటుంది. నేటి అనేకమంది లాగా, నెట్ లో నాలుగు సైట్లు చూసేసి అదే ji ఆధ్యాత్మికత అనుకునేవారిలాగా తనుకూడా ఉండేది. తన దూకుడు నిర్ణయాలవల్ల జీవితంలో చాలా నష్టపోతూ ఉంటుంది. కానీ తెలివి తెచ్చుకోదు. ప్రతిసారీ ఇదేవిధంగా చేస్తూ ఉండేది. ఇవన్నీ కరెక్ట్ కాదని నేను చెప్పేవాడిని. నీ పధ్ధతి మార్చుకోవాలని చెబుతూ ఉండేవాడిని.

ఈమె తల్లిగారు బ్రహ్మకుమారి సంస్థలో చాలా సీనియర్ సభ్యురాలు. అసలు 'ప' ఆధ్యాత్మికజీవితం దారితప్పి ఎటో వెళ్లిపోవడానికి ఈ తల్లే కారణం. ఆధ్యాత్మికజీవితం వేరు, లౌకిక జీవితం వేరు అని నేను ఎప్పుడూ చెప్పను. ఉన్నది ఒకటే జీవితం. కానీ మాటవరసకు ఈ పదాన్ని వాడాను. తన తల్లివల్ల ఈ అమ్మాయి లౌకికజీవితం కూడా నాశనమైపోయింది. కొంతమంది తల్లిదండ్రులు ఇంతే. పిల్లల జీవితాలను వాళ్ళే నాశనం చేస్తారు. ప్రస్తుతం సమాజంలో ఈ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది.

బ్రహ్మకుమారి సంస్థలో చేరి వాళ్ళ బోధలు తలకెక్కితే మనుషులు ఒక విధమైన పిచ్చిలోకి వెళ్ళిపోతారు. చాలా పెడగా తయారౌతారు. ఛాందసపు బ్రాహ్మలలాగా, పిడివాద క్రైస్తవుల లాగా, ఇంకా చెప్పాలంటే చిన్నసైజు తీవ్రవాద ముస్లిములలాగా తయారౌతారు. కూతుర్ని బ్రెయిన్ వాష్ చెయ్యాలని తల్లి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉండేది. 'ప' నా బోధలలో  పడటం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆఫ్ కోర్స్, నా బోధలను 'ప' ఎప్పుడూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. తాను ఎక్కడెక్కడో నేర్చుకున్నవీ, నెట్లో వెదికి పట్టుకున్నవీ, యూట్యూబులో చూసినవీ అన్నీ కలగలిపి ఆచరిస్తూ ఉండేది. ఊరకే నా బోధలు వినేది కానీ ఏదీ తలకెక్కించుకునేది కాదు. ఇది సరైనదారి కాదని నేను చాలా చెప్పేవాడిని. కానీ తను వినేది కాదు. దీనికి కారణం తన జాతకంలో పంచమంలో ఉన్న నీచ శనియోగం. 

పాతకాలంలో ఒక వ్యక్తిని శిష్యునిగా అంగీకరించాలంటే, అసలైన గురువులు అతని జాతకాన్ని తప్పకుండా పరిశీలించేవారు. ఆ జాతకంలో ఉన్న యోగాలను బట్టి, అతను ఆధ్యాత్మిక సాధనామార్గంలో నిలబడగలడా, నడవగలడా, లేదా, వారికి వెంటనే తెలిసిపోయేది. ఆ తరువాతే అతడిని శిష్యునిగా తీసుకునేవారు. జాతకం మంచిది కాకపోతే, అతని గతకర్మ బలీయంగా ఉంటే, అవసరార్ధం ఆ సమయానికి అతడెంత మంచిగా మాట్లాడినప్పటికీ, అతడిని తిరస్కరించేవారు. ప్రాచీన సాంప్రదాయ గురువులలో ఇది ఒక ఆచారంగా ఉంటూ ఉండేది. ఈ నాటికీ ఉంది.

నేనీ అమ్మాయి జాతకాన్ని చూచినప్పటికీ, అందులోని చెడు యోగాలను చూచినప్పటికీ, పోనీలే పాపమని తనను  కొన్నేళ్ళపాటు భరించాను. ప్రతివారికీ ఒక అవకాశం ఇచ్చిచూడటం నా విధానం. మనం కాదంటే వాళ్ళు తప్పుదారిలో పడిపోతారని నాకు బాగా తెలుసు. అందుకని, జాతకం బాగాలేకపోయినా, వారికి సాయం చేద్దామని, వారి చెడుకర్మను క్షాళనం చేద్దామని  భావిస్తాను. ఈ అమ్మాయి విషయంలో కూడా అలాగే భావించాను. 

నిజమైన గురులక్షణం ఇదే.

పంచమంలో నీచశని ఉన్న జాతకులు, సంతానం ద్వారా చాలా నష్టపోతారు. వారి జీవితమంతా  సంతానం కోసమే ఖర్చయిపోతుంది. వారి జీవితాన్ని పిల్లలే శాసిస్తారు. ఎంతగా అంటే,  వారికింక పర్సనల్ జీవితం ఏమాత్రమూ ఉండనంతగా ఈ బంధం ఉంటుంది. వీరి జీవితాలకు సంతానమే శాపం అవుతుంది. వీరికి మనసు కూడా  చాలా ఊగిసలాటగా ఉంటుంది. పఞ్చమం బుద్ధిస్థానం గనుక, దాదాపుగా స్కిజోప్రినియా లక్షణాలు వీరిలో ఉంటాయి. అమావాస్యకూ పౌర్ణమికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు.  ఇవన్నీ ఈమెలో ఉన్నాయి. కానీ ఈమెకు సరియైనదారిని  చూపిద్దామని, తన కర్మను జయింపజేద్దామని నేను భావించాను. కానీ ఈమె గతకర్మ చాలా బలీయంగా ఉంది. 

గత అయిదేళ్లుగా ఈమె నాతో టచ్ లో లేదు. దూరమైంది. సొంతనిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకెళుతోంది.  'మంచిదే' అని నేనూ ఊరుకున్నాను. ప్రస్తుతం అమెరికాలో అడుగుపెట్టాను గనుక, ఒకసారి తనను పలకరిద్దామని భావించాను. అందుకే నిన్న సాయంత్రం ఈమె ఇల్లు వెతుక్కుంటూ మరీ వెళ్ళాము. తాను ఇంట్లో లేదు. లేదా, ఉండికూడా, కావాలనే తలుపు తియ్యలేదో తెలియదు. రెండుసార్లు కాలింగ్ బెల్ కొట్టి చూచాము. పలకలేదు. వెనక్కు వచ్చేశాము.

మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఎవరు గేట్  ముందుకొచ్చి కాలింగ్ బెల్ కొట్టారో, మనం  ఎక్కడున్నప్పటికీ, మన  ఫోన్ లోనుంచి చూచుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ ఇక్కడ ఉంది. ఆ విధంగా ఆమె చూచింది.  కాల్ చేసింది.

'నేను వేరే దారిలో ముందుకెళ్లాను. వేరే గురువుల దగ్గర దీక్షలు తీసుకున్నాను. నా పిల్లలకు, మా కుటుంబసభ్యులకు, నేను మీ మార్గంలో నడవడం ఇష్టం లేదు. ఇప్పుడిప్పుడే నా సంసారం దారినపడుతోంది. నా పిల్లలతో నా సంబంధాలు బాగుపడుతున్నాయి. కనుక దయచేసి నన్ను కాంటాక్ట్ చెయ్యాలని ప్రయత్నించకండి' అనేది ఆమె మాటల సారాంశం.

నవ్వుకున్నాను. తనమీద జాలి కలిగింది. సంసారం వద్దని నేనెప్పుడూ చెప్పలేదు. భర్తతో విడిపోతానని తాను గొడవ చేసిన ప్రతిసారీ ఒద్దని ఎంతో నచ్చచెప్పాను. కానీ ఆమె వినలేదు. చిన్నప్పుడే సన్యాసాన్ని త్యాగం చేసిన నేను, సంసారం చెడగొట్టుకోమని ఇతరులకు ఎందుకు చెబుతాను? సక్రమంగా జీవించమని, ఆధ్యాత్మికం, లౌకికం అంటూ రెండు లేవని, ఉన్నది ఒకటే జీవితమని, అర్ధం చేసుకుని, నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ బ్రతకమని, ధర్మంగా జీవించమనే నేనెప్పుడూ  నా  శిష్యులకు చెబుతాను. 

ఈమె ఇంటినుండి వెనుకకు తిరిగి వచ్చేస్తుంటే, మహాభారతం నుండి ఒక సన్నివేశం గుర్తొచ్చింది.

రాయబారం కోసం శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళినపుడు అందరి ఇళ్లకూ వెళ్ళాడు. దుర్యోధనుడి ఇంటికీ వెళ్ళాడు, విదురుడి ఇంటికీ వెళ్ళాడు, కుంతీదేవి ఇంటికీ వెళ్ళాడు. ఒక్కొక్కచోట ఒక్కొక్క విధమైన మర్యాదలు ఆయనకు జరిగాయి. కొన్నిచోట్ల అవమానాలు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల తలుపులే తెరుచుకోలేదు. సత్కారమైనా, ఛీత్కారమైనా, పరమాన్నమైనా, పరాభవమైనా అన్నింటినీ సమంగా స్వీకరించాడు శ్రీకృష్ణుడు. నవ్వుకున్నాడు. వెనక్కు వెళ్ళిపోయాడు. ఆయనకేం తక్కువైంది?

సాక్షాత్తు భగవంతుడే ఇంటిముందుకొచ్చి నిలబడ్డాడు. తలుపు తీసి లోపలకు అహ్వానించే అదృష్టం వారికి లేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ఆయనను అవమానించారు. అవసరార్ధం ఆయనతో నటించారు. ఫలితాన్ని అనుభవించారు. కానీ, విదురుడు, కుంతి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. భక్తితో సేవించారు. ధన్యాత్ములయ్యారు.

మనం అర్ధం చేసుకున్నా, అర్ధం చేసుకోకపోయినా, ఆహ్వానించినా, తిరస్కరించినా,  పూజించినా, అవమానించినా, ఏం చేసినా ఆయనకేం తక్కువౌతుంది? మన కర్మను బట్టి మన ఖర్మ తయారౌతుంది. అంతే !

అదే విధంగా, ఈ అమ్మాయి ఇంటిని వెదుక్కుంటూ నేను అమెరికాలో వెళ్ళడానికి వెనుక ఉద్దేశ్యం ఏముంది? ఏమీ లేదు. ఎవరినుంచీ నేనేదీ ఆశించను. అలా, మంది డబ్బుల మీద బ్రతికేవాడినైతే, నలభై ఏళ్ళపాటు ఉద్యోగం చెయ్యను. 1982 లోనే ఒక గురువుగా మారి, డొనేషన్లు దండుకుని,  ఈ పాటికి నేటి గురువులకు అందనంత లౌకికస్థాయిలో ఉండేవాడిని. ఇతరుల సొమ్మును తాకను గనుకనే, నలభైఏళ్ళపాటు ఒక కుళ్ళు వ్యవస్థలో ఉద్యోగం చేసినప్పటికీ, దానిని అంటించుకోకుండా, స్వచ్ఛంగా బ్రతికాను.

నలభైఏళ్ళనాడు తనదగ్గర బ్రహ్మచారిగా చేరమని మహాతపస్వి శ్రీమత్ నందానందస్వామి నన్ను కోరినప్పుడు, నేను తిరస్కరించడానికి ఒకే ఒక్క కారణం, 'ఇతరుల డొనేషన్ల మీద ఆధారపడే స్వామీజీగా బ్రతకడం నాకిష్టం లేకపోవడమే'. 

'లౌకికంగా ఉంటూనే ఆధ్యాత్మికమార్గంలో నేను నడుస్తాను. నా సంపాదన మీదే నేను బ్రతుకుతాను. దీనికోసం, మీ ఆజ్ఞను పాటించలేకపోతున్నాను. సన్యాసం స్వీకరించలేను. నన్ను క్షమించండి' అని ఆయన కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాను. ఈ సంఘటన 1982 లో జరిగింది.

వారి హృదయాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి నేను దగ్గరౌతాను గాని ఏదో ఆశించి కాదు. అవి ప్రస్తుతం వారిలో లేకపోయినా కూడా, ఎప్పుడో వారు చేసిన ఒక చిన్నపనిని, సేవను, నా పట్ల చూపించిన చిన్నపాటి ప్రేమను గుర్తుంచుకుని వారిని మళ్ళీ పలకరిస్తాను. నేనే వారిని వెదుక్కుంటూ వెళతాను.

ఇదంతా చెయ్యడంలో నాదొక్కటే ఉద్దేశం. అసలైన వెలుగుదారిని వారికి చూపించాలన్న, ఒకేఒక్క సంకల్పంతో నేను మనుషులకు దగ్గరౌతాను. మరొక్క అవకాశాన్ని వారికి మళ్ళీ ఇచ్చి చూస్తాను. ఇది తప్ప, ఎవరికైనా సరే దగ్గరవ్వాల్సిన పని నాకేముంది? మనుషులతో నాకెందుకు?

శ్రీ రామకృష్ణులు, గురువులను మూడు రకాల వైద్యులతో పోల్చారు.

మొదటి రకం గురువు, సాధారణ వైద్యునివంటి వాడు. మందిచ్చి వెళ్ళిపోతాడు. పట్టించుకోడు. శిష్యుని పురోగతిని గురించి వాకబు చెయ్యడు.రోగి యొక్క రోగం తగ్గిందా లేదా పట్టించుకోడు.

రెండవరకం గురువు, అప్పుడప్పడూ రోగి క్షేమసమాచారాలు కనుక్కుంటూ ఉండే మధ్యరకం వైద్యునివంటి వాడు.  తనకు వీలున్నప్పుడు శిష్యుని ఆధ్యాత్మిక పురోగతిని గురించి పైపైన కనుక్కుంటాడు.

మూడవరకం గురువు,  ఉత్తమ వైద్యుని వంటి వాడు. మందు వేసుకోనని మొండికేస్తున్న రోగిని, నేలపైన పడేసి, అతని ఛాతీమీద తన మోకాలితో అదిమిపట్టి, నోరు పగలదీసి, చేదుమందును బలవంతాన మింగిస్తాడు. అంత బాధ్యతను అతను ఫీలౌతాడు. కారణం? నేటికాలపు సెల్ఫిష్ డాక్టర్లలాగా రోగిని దోపిడీ చేద్దామని కాదు. ఆ రోగం ఎలాగైనా తగ్గించాలన్నదే అతని సంకల్పం గనుక ఈ విధంగా ప్రవర్తిస్తాడు.

ఉత్తమగురువులను ఈ మూడవరకపు వైద్యులతో పోల్చారు శ్రీ రామకృష్ణులవారు. అటువంటి గురువు, తన శిష్యుని ఎన్నటికీ మర్చిపోడు. శిష్యుడు మర్చిపోయినా అతను మర్చిపోడు. కారణం? అలాంటి గురువులో స్వార్ధపరమైన ఆలోచనలేవీ ఉండవు.  కోరికలూ ఉండవు. శిష్యుని ఆధ్యాత్మిక పురోగతి ఒక్కటే అతను కోరుకుంటాడు. అలాంటివాడు ఉత్తమగురువు.

గతపు పాపఖర్మ వదలనిదే ఎవ్వరూ వెలుగుదారులలో నడవలేరు. తప్పును చేస్తూ ఒప్పుగా అనుకోవడం, తప్పుగా భ్రమించి ఒప్పును చెయ్యకపోవడం  -- ఇంతేగా సామాన్యుని జీవితం !

read more " మూడవ అమెరికా యాత్ర -2 (నిజమైన గురులక్షణం) "

11, ఆగస్టు 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర -1(డెట్రాయిట్ చేరుకున్నాం)

రిటైర్డ్ స్వేచ్ఛాజీవితంలో మొదటిమెట్టుగా మూడవసారి అమెరికా వచ్చేశాను. 

9 వ తేదీ రాత్రి 8.30 కి హైద్రాబాద్ లో బయల్దేరి రాత్రి పదకొండుకు ఢిల్లీ చేరుకున్నాం. తెల్లవారుఝామున 2 గంటలకు ఢిల్లీలో విమానం ఎక్కి, 14 గంటల ప్రయాణం తర్వాత చికాగో ఒహెర్ ఎయిర్ పోర్టులో దిగాం. అప్పటికక్కడ ఉదయం 7 అయింది. అక్కడకు రెండు గంటల ప్రయాణదూరంలో ఉన్న శ్రీనివాస్ దంపతులు ఇడ్లీలు, పులిహోర, పెరుగన్నాలు తీసుకుని అప్పటికే అక్కడకు చేరుకొని మాకోసం వేచిచూస్తున్నారు. పన్నెండువేల మైళ్ళ దూరంలో, దేశం కాని దేశంలో, మా కోసం పొద్దున్నే లేచి అవన్నీ చేసుకుని రెండుగంటలు డ్రైవింగ్ చేసి చికాగో ఎయిర్ పోర్ట్ కొచ్చి అవన్నీ తినిపిద్దామని మాకోసం వెయిట్  చేస్తున్నారు శ్రీనివాస్ దంపతులు. జగన్మాతను మనస్సులోనే స్మరించి నమస్కరించుకున్నాము 

చికాగో ఎయిర్ పోర్ట్ లో వారి ఆతిధ్యం స్వీకరించి, మధ్యాన్నం 1.40 కి అక్కడ ఇంకో విమానం ఎక్కి సాయంత్రం నాలుగు గంటలకు డెట్రాయిట్ చేరుకున్నాం.

'చికాగో నుంచి డెట్రాయిట్ వెళ్లకుండా మా ఇంటికి రండి. ఒక వారం మాతో ఉండి అప్పుడు డెట్రాయిట్ వెళ్ళవచ్చు, మిమ్మల్ని ఇట్నుంచి ఇటే కిడ్నాప్ చేద్దామనుకుంటున్నాం' అని శ్రీనివాస్ దంపతులు పట్టుబట్టారు. కానీ డెట్రాయిట్ వారు మాకోసం వెయిట్ చేస్తూ ఉంటారు గనుక వారి అభ్యర్ధనను సున్నితంగా కాదని చెప్పాము. 'వచ్చే నెలలో మీ ఊరికి వస్తాను. మిమ్మల్ని కలుసుకుంటాం. అప్పుడు మీ దగ్గర ఒక వారం ఉంటామ'ని చెప్పాను.

ఈసారి లీవు బాధ లేదు. ఉద్యోగపరంగా పరిమితులు, కట్టుబాట్లు లేవు. కొన్ని సబ్జెక్ట్ లే వ్రాయాలి మిగతావి వ్రాయకూడదు అనే గొడవలు లేవు. కాబట్టి అమెరికా ఉండనిచ్చినన్ని రోజులు ఇక్కడ ఉంటాను. పాతమిత్రులను, శిష్యులను కలుసుకుంటాను. నా టైంటేబుల్ ప్రకారం నా జీవితాన్ని గడుపుతాను. నా టైంటేబుల్ ఏంటో తెలుసుకుందామని ఉందా? చాలా సింపుల్ వినండి.

ప్రతిరోజూ యోగాభ్యాసం, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం, జపధ్యానాలు, చాలాకాలంగా వాయిదా వేసిన కొన్ని మంత్ర-తంత్ర సాధనలు, బోధన, పుస్తకాలు వ్రాయడం, శిష్యులకు మార్గదర్శనం, యూట్యూబ్ వీడియో ఛానల్ ప్రారంభం, వీడియోలు చెయ్యడం, షార్ట్ ఫిలిం లు తియ్యడం, పాటలు పాడటం ఇవన్నీ చేస్తూ రోజులు గడుపుతాను.

ఈ జీవితానికి 'న్యూ లైఫ్' అని పేరుపెట్టాను. ఈ పేరును మెహర్ బాబా జీవితం నుంచి తీసుకున్నాను.

న్యూ లైఫ్ ఆల్రెడీ మొదలైపోయింది.


At Ohare International airport Chicago
At Chicago Ohare International Airport

With Srinivas and Family at Chicago airport

In Metro train from International airport to domestic airport in Chicago

At Detroit McNamara Airport

Morning walk in Detroit

Morning walk

Our living place in Troy, Michigan


Relaxing at home today morning

read more " మూడవ అమెరికా యాత్ర -1(డెట్రాయిట్ చేరుకున్నాం) "