“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, ఫిబ్రవరి 2013, గురువారం

త్యాగయ్య నాదోపాసన-3(నారద స్తుతి)

నారద మౌని త్రిలోక సంచారి. త్రిలోక గురువు. ఆయన సాక్షాత్తు భగవంతుని ప్రతినిధి.పరమ కరుణామూర్తి.దీనులకు,దారితప్పిన సాధకులకు దిక్కుతోచని ఆర్తులకు ఆయన పెన్నిధి.అటువంటి ఆర్తులకు ఎందరికో  ఆయన కనిపించి కనికరించి వారికి భగవత్సాక్షాత్కారము కలిగే మార్గమును ఉపదేశించినట్లు అనేక నిదర్శనములు కలవు.ఈనాటికీ ధన్యాత్ములైన సాధకులకు ఆయన దర్శనము సులభసాధ్యమే. అది భక్తుల యెడ ఆయనకున్నట్టి అపార వాత్సల్యమే గాని మన గొప్పగాదు.

భగవంతుని దర్శనము అతి కష్టము.కాని నారదమునీన్ద్రుని దర్శనము సులభసాధ్యము.కర్మ పరిపాకమున గాని నారాయణుడు కరుణించడు.కాని మహర్షి అటులగాదు.ప్రేమతో భక్తులకు కనిపించి వారికి కర్మక్షాళణా  ఉపాయమును బోధించుటలో ఆయన ఆసక్తుడు.హృదయపూర్వకమైన ఆర్తితో ఆయనను పిలచినచో చాలు.ఆయన నిత్యముక్తుడు.ఆయనకు ముల్లోకములలో చెయ్యవలసిన కర్మ లేనేలేదు.నిత్య స్వతంత్రుడు.కనుక ఆర్తితో అలమటిస్తున్న జీవులకు దారిచూపడమే ఆయనకు మిగిలిన కర్తవ్యము.నిరంతర నారాయణ నామస్మరణారతుడై ఆనందానుభూతిలో తేలుతూ ఉండటము,నిజమైన సాధకులకు మార్గనిర్దేశనం చేయడం - ఈ రెండే ఆయన పనులు.గురువులకే గురువు నారద మహర్షి.

పరమ భాగవతోత్తముడైన నారదమునీంద్రుని త్యాగయ్య అనేక కీర్తనలలో సందర్భానుసారంగా స్తుతించాడు. త్యాగయ్యకు తారకరామ మంత్రోపదేశం గావించిన రామకృష్ణ యతీంద్రులు నారదులే యని ఒక నానుడి గలదు. త్యాగయ్య మొదట కొన్నేళ్ళపాటు నారద మంత్రోపాసన గావించినాడనీ తత్ఫలితముగా ఆయనకు నారద మహర్షి ప్రత్యక్షమై 'స్వరార్ణవం' అనే సంగీత గ్రంధాన్ని ఇచ్చి దానిలోని సంగీత రహస్యాలను అవగతం చేసుకునే సూక్ష్మ చేతస్సును అనుగ్రహించినాడనీ ఒక గాధ. ఆ తరువాతనే ఆయనకు ఇంతకు ముందు అర్ధం కాని రాగ రహస్యాలు అర్దమయ్యాయనీ, ఆ తదుపరి నారదులు ఉపదేశించిన రామతారక మంత్రోపాసన ప్రారంభం చేశాడనీ కూడా చెబుతారు.నారదులను తన సద్గురువుగా అనేక చోట్ల త్యాగయ్య ప్రస్తుతించాడు.

నారదుడు అనే పదమే గొప్ప అర్ధాన్ని కలిగి ఉన్నది. 'నార' అనే సంస్కృత పదానికి ఉన్న అనేకానేక అర్ధములలో 'జ్ఞానము' అనేది కూడా ఒకటి.నారదుడు అనగా 'జ్ఞానమును ప్రసాదించగలవాడు' అని అర్ధం.నారద మహర్షి అట్టి శక్తి సంపన్నుడు.మహిమాన్వితుడైనట్టి ప్రాతఃస్మరణీయుడు.

నారద మహర్షి రూపమేట్టిదో ఒక్కసారి చూద్దాము.

కం|| తెల్లని దేహముతో గర
పల్లవమున వీణె మెరయ పరమాత్ముని దా
నుల్లమున దలచి సొక్కుచు
సల్లాపముతోడ మౌని సరగున వెడలెన్
 
పంతువరాళి రాగంలో పాడిన "నారదముని వెడలిన సుగుణాతిశయమును వినరే" అనే కీర్తనలో నారదముని రూప లావణ్యమునే గాక ఆయన యొక్క సుగుణాతిశయమును కూడా త్యాగయ్య వివరిస్తాడు.

'సారెకు శ్రీహరి పదసారసముల ధ్యానించుచు నారాయణ నామములను పారాయణ మొనరించుచు'- నిరంతరమూ శ్రీహరి పాదపద్మములను ధ్యానించుచూ ఆయన నామములను నిత్యపారాయణము చేయుచూ ఆయన విరాజిల్లుతూ ఉంటాడు.భేదాభేదములు లేనట్టి వేదాంత రసభరితుడు.

'కడుతెల్ల దేహమున పసిడి వీణె మెరయగ దా నెడ బాయని ప్రేమతో నడుగడుగుకు వాయించుచు' - నారదముని స్పటికము వలె తెల్లని దేహచ్చాయ గలవాడు.ఆ తెల్లని మేనిపైన ఆయన యొక్క బంగారు వీణె యగు 'మహతి'మెరయుచూ ఉండగా దానిని నిరంతరమూ మీటుతూ భక్తిచే తన్మయుడై నారాయణుని గాన,స్మరణ,ధ్యానములతో పరమ పవిత్రుడైన మహితాత్ముడు నారదమునీంద్రుడు.

దర్బారు రాగంలో పాడిన 'నారద గురుసామీ ఇకనైన నన్నాదరించవేమి ఈ కరవేమి' అనే కీర్తనలో నారదమహర్షి పై త్యాగయ్యకు గల భక్తి పొంగి ప్రవహించినది. ఆ కీర్తనలో 'సారెకు సంగీతయోగ నైగమ పారంగతుడైన పరమపావనా' అని మహర్షిని సంబోధిస్తాడు.'వేద ప్రతిపాదితమైన సంగీతయోగమున పారము దెలిసిన పావనాత్మా' అని ఆయనను భక్తిపూర్వకముగా పిలుస్తాడు.

'ఇతిహాస పురాణాగమ చరితము లెవరి వల్ల కలిగె, ద్యుతి జితశరదభ్ర నినువినా మునియతుల కెవరు సలిగె క్షితిని త్యాగరాజ వినుత నమ్మితి చిన్తదీర్చి ప్రహ్లాదుని బ్రోచిన నారద గురుసామీ' -- ఈ లోకానికి ఇతిహాసాలు పురాణాలు ఆగమాది శాస్త్రాలు నారద మహర్షి వల్లనే కలిగాయి.ఆయన త్రిలోక సంచారి మాత్రమె కాదు. త్రిలోక గురువు కూడా. ఆయన మేనిచాయ మాత్రమె తెల్లనిది కాదు. ఆయన హృదయము కూడా స్పటికము వలె రాగద్వేషాది వికారములకు అతీతమై దివ్యమైన తెల్లని కాంతిని వెదజల్లుతూ ఉంటుంది.అట్టి వినిర్మల హృదయంలో భగవంతుని దివ్యతేజస్సు నిరంతరమూ నెలకొని ఉంటుంది.నిరంతరమూ భగవద్ధ్యానం వల్ల ఆయనకు మూడులోకాలలో అడ్డు లేకుండా సంచరించగలిగే నిరంకుశ స్వాతంత్ర్యం ప్రాప్తించింది. 

త్యాగయ్య శ్రీరాముని 'నారద గానలోలా' అని పిలుస్తాడు.నారదుని గానానికి దైవాన్ని కదిలించగల శక్తి ఉన్నది.నిష్కల్మషము,భక్తిమయము,అయిన హృదయం నుంచి ఆర్తితో వచ్చిన గానానికి భగవంతుడు వెంటనే స్పందిస్తాడు.నారదుని కంటే స్వచ్చమైన హృదయం కలవారు ఇంకెవరున్నారు?కనుక భగవంతుడైన నారాయణుడు నారదగాన లోలుడయ్యాడు. తలచిన తడవున సర్వేశ్వరుడగు భగవంతుని కలసి ఆయనతో సల్లాపములాడగల శక్తి సంపన్నుడు నారద మహర్షి.

కానడ రాగంలో పాడిన 'శ్రీ నారద, నాద సరసీరుహ భ్రుంగ, శుభాంగ' అనే కీర్తన అద్భుతమైనది.

శ్రీ నారద నాద సరసీరుహ భ్రుంగ శుభాంగ 
దీనమాన రక్షక జగదీశ భేశ సంకాశ 

వేదజనిత వరవీణా వాదన తత్వజ్ఞ
భేదకర త్రితాప రహిత ఖేచర వినుత 
యాదవకులజాప్త సదా మోదహృదయ మునివర్య 
శ్రీద త్యాగరాజ వినుత శ్రీకర మాంపాలయ 

మన వేదములు ఆగమములు పురాణములు ఇతిహాసములలో నారదమహర్షి పాత్ర బహుముఖములుగా ఉన్నది.ఈ కీర్తనలో మహర్షిని త్యాగయ్య 'నాద సరసీరుహ భ్రుంగ' అని గొప్పగా భావిస్తాడు.అంటే 'నాదమనే పద్మములో నిరంతరమూ అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద' వంటి వాడని భావం.ఇది నాదోపాసనలో మత్తిల్లిన చిత్తానికి సంకేతం.మహత్తరమైన యోగసిద్దికి తార్కాణం.'శుభాంగా' అన్న సంబోధనలో నారద మహర్షి యొక్క స్పటికనిభ సంకాశమైన శుభంకరమైన వర్చస్సు గోచరిస్తున్నది. ఆయన శరీరము భౌతికమైనట్టిది కాదు. భౌతికమే అయితే త్రిలోకములలో సంచరించలేదు.భౌతిక శరీరము ఈ భూమి వరకే ఉపయోగపడుతుంది.కాని మహర్షి త్రిలోక సంచారి.ఆయనది చిదాకాశము వంటి దివ్యదేహము గనుక ధ్యానించు వారికి శుభప్రదమైనది.

'భేశ సంకాశ' అన్న పదం అద్భుతమైనది.భేశ అనగా నక్షత్రములకు ఈశుడు అనగా చంద్రుడు కనుక చంద్రకాంతి వంటి చల్లని తెల్లని వన్నె కల్గినది మహర్షి దేహచ్చాయ.ఆయన దర్శనం దీనులను కాపాడునట్టిది.ధ్రువ ప్రహ్లాదాది పరమ భక్తులకు,వ్యాసవాల్మీకాది మహర్షులకు సంకట సమయంలో కరుణించి దారిచూపినట్టి పరమ గురువరేణ్యుడు నారద మునీంద్రుడు.

ఆయన 'వేదజనిత వరవీణా వాదన తత్వజ్ఞుడు'- వేదములలో ఉద్భవించిన వీణావాదన రహస్యములను ఎరిగినవాడు.వీణానాదమును అంతరిక సాధనలో మేరుదండమనబడిన వెన్నెముకలో గల సప్త చక్రములలో మ్రోగించుచు బ్రహ్మానంద రసాస్వాదన చేయగల విద్య మహాయోగులకు విదితమే.అట్టి విద్యకు నారదుడు పరమ గురువు.

ఆయన యాదవ కులజాప్తుడు.శ్రీకృష్ణునికి ఆయన పరమ సన్నిహితుడు.కృష్ణుని లీలా నాటకమున ముఖ్య పాత్రధారి నారదుడు.సదా సరసమయమైన సంతోషహృదయుడు నారదుడు.ఆయనలో విచారమన్నది లేనేలేదు.ఆయన ఆకలి,దప్పిక,ముసలితనము,మరణాలకు అతీతుడు. నిర్వికారుడై చిరునవ్వుతో సృష్టిలీలను ఆలోకిస్తూ ఉండే చిరజీవి.సమస్త లోకాలనూ భగవద్విభూతిగా ఆలోకించుచూ నిరంతర భగవన్నామ స్మరణతో యధేచ్చగా సంచరించుచూ ఉన్నట్టి పరమపావనుడా ముని వర్యుడు.ఆయన శ్రీకరుడు,అనగా దర్శనమాత్రం చేత శుభాన్ని కలిగించ గలవాడు.మహామహిమాన్వితుడు.త్రితాప రహితుడు.దేవతలచేత కూడా నిత్యమూ కీర్తించబడే దివ్యరూపుడు. సాక్షాత్తు పరమాత్మునికి అత్యంత సన్నిహితుడు.తనను కాపాడమంటూ 'మాంపాలయ' అంటూ అటువంటి మహిమాన్వితుని కీర్తిస్తాడు త్యాగయ్య.

ఇంతగా ప్రార్ధించిన భక్తునికి దర్శనమివ్వకుండా ఆగగలడా మహర్షి? తన దివ్యమైన తేజస్సుతో వెలుగుతూ త్యాగయ్య కనుల ముందు నిలిచాడు.మహర్షి దర్శనం కలిగే ముందుగా మధురమైన వీణానాదం యోగులకు వినిపిస్తుంది.శుభంకరుడైన ఆయన దర్శనం కలుగబోతున్న దనడానికి అదొక కొండగుర్తు. ఆ దర్శనాన్ని పొంది ఆనంద పరవశుడై త్యాగయ్య భైరవి రాగంలో 'శ్రీ నారద ముని గురురాయ గంటి, మేనాటి తపమో గురురాయ గంటి ' అంటూ గానం చేస్తాడు.

మనసార గోరితి గురురాయ నేడు 
కనులార కనుగొంటి గురురాయ  
మీ సేవ దొరకెను గురురాయ 
భవ పాశము తొలగెను గురురాయ 

నీవే సుజ్ఞానము గురురాయ 
నీవే అజ్ఞానశిఖి గురురాయ 
రాజిల్లు వీణె గల గురురాయ 
త్యాగరాజుని బ్రోచిన సద్గురురాయ 

'మనసారా నిన్ను చూడాలని ఎన్నాళ్లగానో తపించాను. ఏనాటి తపఫలమో నిన్ను కనులార చూడగల్గితిని. నీ సేవ చేయగల్గితిని.దానిచేత జన్మ సంసారబంధములు తొలగి సుజ్ఞానము ప్రాప్తించినది.ఎందుకనగా అజ్ఞానమును దహించు శిఖి(అగ్ని)వి నీవే కదా గురురాయా' అంటూ నారద మునీంద్రుని తన కీర్తనలలో గౌరవిస్తూ స్తుతిస్తాడు త్యాగయ్య.

విజయశ్రీ రాగంలో పాడిన 'వరనారద నారాయణ' అనే కీర్తనలో కూడా నారదుని యెడల తనకున్న భక్తిని ప్రదర్శిస్తాడు త్యాగయ్య.

వర నారద నారాయణ - స్మరణా నందానుభవము కల 
శరదిందు నిభాపఘనానఘ - సారముగాను బ్రోవుమిక 

సకలలోకములకు సద్గురువనుచు - సదా నేనతడనుచు హరియు 
ప్రకటంబుగ కీర్తి నొసంగెనే - భావుక త్యాగరాజనుత 

ఈ కీర్తనలో నారదునికి నారాయణునికి అభేదమని త్యాగయ్య సూచిస్తాడు.ఎందుకనగా భ్రమరకీట న్యాయము చేత కీటకము గూడా భ్రమరమైన రీతిని నిరంతరమూ నారాయణ నామ గాన ధ్యాన తత్పరుడైన నారదుడు నారాయణ రూపుడై భాసిస్తున్నాడు.కనుక పరిపూర్ణము పరిపక్వము అయిన భగవదానందానుభవము నారదునికే చెల్లు అని త్యాగయ్య భావము.

ఈ మాట వేరెవరో చెప్పినది కాదు. సాక్షాత్తు శ్రీహరియే ఈ మాట చెప్పినాడట.'నీవు సకల లోకములకు గురువవు.నీవే నేను నేనే నీవు అని సాక్షాతూ భగవంతుడే చెప్పి నీకు కీర్తిని ఇచ్చాడయా మహానుభావా' అంటూ నారద మహర్షిని భక్తితో స్మరిస్తాడు సద్గురు త్యాగరాజు.

నారదమహర్షుల ఘనమహిమ త్యాగయ్య వంటి సద్భక్త వరేణ్యులకే భావింపనగునుగాని, కామకాంచనాసక్తులై సంసారలంపటులై  అహంకార సర్పదష్టులైన మనవంటి అల్పబుద్ధిగల సామాన్యులకు  గోచరమగునా?
read more " త్యాగయ్య నాదోపాసన-3(నారద స్తుతి) "

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

హైదరాబాద్ లో పాతపేలుళ్లు - జ్యోతిష పరిశీలన

సక్రమమైన పరిశోధన వల్ల నూతనసత్యాలు ఆవిష్కరింపబడటానికి ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది.జ్యోతిష్య శాస్త్రం కూడా దీనికి మినహాయింపు కాదు.జరిగిపోయిన సంఘటనలలో దండలో దారంలా ఉన్న సూత్రాలను గ్రహయోగాలను మనం కనుక్కోగలిగితే వాటిని భవిష్యత్తులోకి ప్రొజెక్ట్ చెయ్యడం ద్వారా జరుగబోయే సంఘటనలను అంచనా వెయ్యవచ్చు. స్టాటిస్టికల్ విధానంలో వినియోగించే ఒక సూత్రం ఇదే.ఆ కోణంలో ఒక్కసారి గతంలో హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్లను జ్యోతిష్య రీత్యా పరిశీలించి ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం.

ఈ మధ్యనే 21-2-2013 న జరిగిన పేలుడు రోజున ఉన్న గ్రహస్తితిని పోయిన పోస్ట్ లో విశ్లేషించాను గనుక మళ్ళీ అక్కర్లేదు. ఆ రోజున ఉన్న ముఖ్యమైన గ్రహస్తితులు మాత్రం ఇక్కడ క్రోడీకరిద్దాం.
  • సూర్య నెప్త్యూన్ల డిగ్రీసంయోగం 
  • ఈ కలయిక రాహునక్షత్రంలో జరగడం.
  • వీరితో బుధ,శుక్ర,కుజులు కలవడం
  • శుక్ల ఏకాదశి గనుక ఆ రోజు పౌర్ణమి పరిధిలో ఉన్నది.
  • చంద్రహోరా సమయంలో పేలుడు జరిగింది.చంద్రునిపైన రాహుదృష్టి ఉన్నది.నవాంశలో చంద్రుడు శనితో కలసి ఉన్నాడు.
  • శపితయోగ ప్రభావం నడుస్తున్నది
ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన పేలుళ్లను వరుసగా పరిశీలిద్దాం.


18-5-2007 న 13.15 గంటల సమయంలో హైదరాబాద్లో మక్కా మసీదులో బాంబు పేలి 10 మంది చనిపోయారు.50 మంది గాయపడ్డారు. ఆ సమయంలో గ్రహస్తితి ఇలా ఉంది. 
  • సింహ లగ్నం కేతువుతో డిగ్రీ సంయోగంలో ఉన్నది.
  • ఆరోజు శుక్ల ద్వితీయ కనుక తిధి అమావాస్య పరిధిలో ఉన్నది.
  • అదేరోజున గురువు వక్రస్తితి మొదలైంది.
  • అదేరోజున నవాంశలో గురువు నీచస్తితిలోకి ప్రవేశం జరిగింది. 
  • లగ్నాధిపతిగా సూర్యుడు ప్లూటో తో షష్టాష్టక డిగ్రీ దృష్టిలో ఉన్నాడు
  • శనిగురువుల మధ్యన డిగ్రీ కొణద్రుష్టి ఉన్నది.
  • రాహు బుధుల మధ్య డిగ్రీ కేంద్రదృష్టి ఉన్నది.
  • యురేనస్ శనుల మధ్యన డిగ్రీ షష్టాష్టక దృష్టి ఉన్నది.
  • ఆరోజు శుక్రవారం.శుక్రుడు ఆర్ద్రా (రాహు) నక్షత్రంలో ఉన్నాడు.అంతేగాక రాహువుతో చూడబడుతున్నాడు.పాపార్గళంలో చిక్కిఉన్నాడు.
  • పేలుడు సమయంలో శుక్రహోర నడుస్తున్నది.


25-8-2007 న లుంబిని పార్కులో 19.45 గంటలకు, ఆ తర్వాత గోకుల్ చాట్లో 19.50 గంటలకు జరిగిన బాంబు పేలుళ్ళలో 44 మంది చనిపోయారు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో గ్రహసితి ఇలా ఉన్నది.


  • మీనలగ్నం సున్నా డిగ్రీలలో ఉన్నది.
  • తిథి శుక్ల ద్వాదశి గనుక పౌర్ణమి పరిధిలో ఉన్నది.
  • నెప్ట్యూన్ మకరం 26 డిగ్రీలలో ఉండి కుజుని ధనిష్టా నక్షత్రంలో ఉన్నాడు. 
  • కుజుడు భారతదేశ లగ్నమైన వృషభంలో ఉన్నాడు.
  • వక్రశుక్రుడు కర్కాటకం 26 డిగ్రీలలో నెప్ట్యూన్ తో సమసప్తక డిగ్రీదృష్టిలో ఉన్నాడు.
  • గుళిక మేషం 26 డిగ్రీలలో ఉంటూ ఒకవైపు నెప్ట్యూన్ తోనూ ఇంకోవైపు శుక్రునితోనూ కేంద్ర దృష్టిలో ఉన్నాడు 
  • శని రాహువుల సమసప్తక దృష్టి వల్ల శపితయోగం అమలులో ఉన్నది.
  • ఆరోజు శనివారం.శని అస్తంగతుడై ఉన్నాడు.
  •  ఆ సమయానికి చంద్రహోర జరిగింది.చంద్రుడు నెప్ట్యూన్ తో కలిసి శని రాశిలో ఉన్నాడు. నవాంశలో చంద్ర రాహువులు కలిసి మకరంలో ఉన్నారు.


7-5-2006 న 22.30 గంటలకు ఓడియన్ థియేటర్ లో బాంబ్ పేలింది. ఎవరూ చనిపోలేదు.ఆ రోజున గ్రహస్తితి ఇలా ఉన్నది.


  • కుజుడు 19 డిగ్రీలలో మిథున రాశిలో ఆర్ద్రా(రాహు) నక్షత్రంలో ఉన్నాడు.
  • చంద్రుడు 19 డిగ్రీలలో సింహ రాశిలో పూర్వఫల్గుణి (శుక్ర) నక్షత్రంలో ఉన్నాడు.
  • వక్ర గురువు 19 డిగ్రీలలో తులా రాశిలో స్వాతి(రాహు) నక్షత్రంలో ఉన్నాడు.
  • యురేనస్ 20 డిగ్రీలలో కుంభ రాశిలో పూర్వాభాద్ర(గురు) నక్షత్రంలో ఉన్నాడు.
  • యురేనస్ నుంచి చూస్తె వీరందరూ కోణ/త్రిపాద/త్రిపాద/కోణ దృష్టితో ఒకరికొకరు బంధితులై ఉండటం చూడవచ్చు.
  • తిధి శుక్ల దశమిగా పౌర్ణమి పరిధిలో ఉండటం చూడవచ్చు.
  • మే 5 న ఇంకా ఖచ్చితమైన దృష్టులు ఉండటం గమనిస్తే, ఆ రోజునే ప్రయత్నాలు జరిగాయనీ ఎందువల్లనో అవి సఫలం కాలేదనీ తర్వాత ఏడో తేదీన పేలుడు జరిగిందనీ అర్ధమౌతుంది.  
  • ఆరోజు ఆదివారం.రవి రాశిచక్రంలో ఉచ్చస్తితిలోనూ నవాంశలో నీచస్తితిలోనూ ఉన్నాడు.
  • నవాంశలో రాహు చంద్రులు కలిసి కన్యారాశిలో ఉన్నారు.మీనంలో ఉన్న కుజునిచేత,వక్ర గురువు చేత చూడబడుతూ ఉన్నారు.
  •  ఆ సమయంలో బుధ హోర జరిగింది. బుధుడు ధనూరాశిలో ఉన్న మాందీ గ్రహంతో డిగ్రీ కోణదృష్టిలో ఉన్నాడు.
  • శని మీద గల రాహు దృష్టి వల్ల శపితయోగం నడుస్తున్నది. 


12-10-2005 న టాస్క్ ఫోర్స్ కమీషనర్ ఆఫీస్ లో జరిగిన పేలుడులో ఒకరు  చనిపోయారు.ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.ఆ రోజున గ్రహస్తితి ఇలా ఉంది.


  • ఇది పోలీస్ శాఖతో సంబంధం ఉన్న సంఘటన గనుక కుజునికి సంబంధం ఉండాలి.
  • ఆశ్చర్యకరంగా,వక్ర కుజుడు 28 డిగ్రీ మేషరాశిలో కృత్తికా(సూర్య) నక్షత్రంలో ఉన్నాడు.
  • ప్లూటో 28 డిగ్రీ వృశ్చికరాశిలో జ్యేష్టా(బుధ) నక్షత్రంలో ఉంటూ కుజునితో షష్టాష్టక డిగ్రీ దృష్టిలో ఉన్నది.
  • ఆ రోజు బుధవారం.బుధుడు యురేనస్ తో కోణదృష్టిలో ఉన్నాడు.
  • ఆరోజుకూడా శుక్ల దశమిగా పౌర్ణమి పరిధిలో ఉన్నది.
  • అన్నింటినీ మించి,లగ్నం 13 డిగ్రీలలో స్వాతి (రాహు) నక్షత్రంలో ఉండి కుంభరాశిలో 13 డిగ్రీలలో శతభిష (రాహు) నక్షత్రంలో ఉన్న యురేనస్ తో డిగ్రీ కోణ దృష్టి కలిగి ఉన్నది.
  • శపిత యోగం ఇంకా నడుస్తున్నది.
  • ఆరోజు బుధవారం.బుధుడు స్వాతీ నక్షత్రంలో రాహు ప్రభావంలో ఉన్నాడు.
  • చంద్రుడు నెప్ట్యూన్ తో కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నాడు.
  • నవాంశలో చంద్రునిపైన రాహుద్రుష్టి ఉన్నది.
  • బలమైన శపిత యోగమూ,బుధుని మీద రాహు ప్రభావమూ,కుజుని పాత్రా,యురేనస్ ప్లూటో ల పాత్రా గమనార్హం.ఈ దాడి బంగ్లాదేశ్ కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యునితో జరిగిందన్నదీ గమనార్హమే. 

21-11-2002 న సాయిబాబా గుడిలో పేలుడు జరిగి 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆరోజు గ్రహస్తితి ఇలా ఉంది.


  • వక్ర శని వృషభం లో ఉన్నట్లు తీసుకుంటే రాహువుతో కలయికవల్ల శపితయోగ ప్రభావం అప్పుడు కూడా ఉన్నది.
  •  చంద్రుడు మృగశిరా (కుజ) నక్షత్రంలోనూ గురువు ఆశ్లేషా (బుధ) నక్షత్రంలోనూ 23 డిగ్రీలలో ఉండి ఖచ్చితమైన త్రిపాదదృష్టిని కలిగి ఉన్నారు. చంద్ర గురుల యోగం వల్ల సద్గురువైన సాయిబాబా గుడిలో ఈ బాంబు పేలుడు జరిగింది. 
  • కుజ బుధ నక్షత్రాల ప్రభావం వల్ల మొండి తర్కంతో కూడిన విధ్వంస ప్రవృత్తి సూచితం అవుతుంది.తీవ్రవాదులకు మూర్ఖపు తర్కం ఉంటుంది.నవాంశలో కూడా కుజుడు ఉచ్ఛ బుదునితో కలిసి ఉండటం చూడవచ్చు.
  • లగ్నాధిపతి శత్రు స్థానంలో ఉండి,చతుర్దంలో(మాతృదేశం) ఉన్న మాంది గ్రహంతో డిగ్రీ త్రిపాద దృష్టిలో ఉన్నాడు.అంటే అదే ఊరికి చెందిన తీవ్రవాదుల పన్నాగం వల్ల జరిగింది అని తెలుస్తున్నది. 
  • చంద్రుడు రాహువు కలిసి ఉండటం ఉగ్రవాదుల విధ్వంసాన్ని సూచిస్తుంది.
  • ఆరోజు గురువారం.బహుశా బాబా గుడిలో బాగా రష్ ఉంటుందని ఆరోజును ఉగ్రవాదులు ఎంచుకొని ఉండవచ్చు.సమయం కూడా గురుహోర నడుస్తున్నది.గురువు ఆశ్లేషా(బుధ) నక్షత్రంలో సర్ప ప్రభావంలో ఉన్నాడు.ఆశ్లేష సహజంగా బుధుడు మరియు రాహువు కలిసిఉన్న నక్షత్రం.దీనిపైన వీరిద్దరి ప్రభావం ఉంటుంది.
  • నవాంశలో బుధుడు ఉచ్ఛ స్తితిలో కుజునితో కలిసి ఉన్నాడు.రాహువు చేత చూడబడుతున్నాడు.
  • ఆరోజు తిధి కృష్ణ ద్వితీయగా పౌర్ణమి పరిధిలో ఉన్నది.
వీటన్నిటిలో ప్రతి సంఘటనలోనూ మనకు కొన్ని గ్రహయోగాలు స్పష్టంగా మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి.అవేమిటో క్రోడీకరిద్దాం.
  • పౌర్ణమి అమావాస్యల దగ్గరలో సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రెంటిలో పౌర్ణమికే ఎక్కువ బలం కనిపిస్తున్నది.
  • చంద్ర బుధులపైన రాహువు యొక్క ప్రభావం ఉన్నది.అంటే మనస్సు బుద్ధి పైన రాహువు ప్రభావం వల్ల విధ్వంసకర ప్రవృత్తి ఈ సమయంలో మనుషులలో ఎక్కువ అవుతున్నది.
  • శపిత యోగ (శని రాహువుల) ప్రభావం ఏదో రకంగా (అంటే, గ్రహ యుతి,దృష్టి,నక్షత్ర స్థాయిలలో ఏదో ఒకటి) ఉంటున్నది. అంటే చేసిన పాపాలకు ఈ సమయంలో శిక్షలు పడుతున్నాయి.
  • యురేనస్,నెప్ట్యూన్,ప్లూటో ల ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తున్నది. వీటిలో నెప్ట్యూన్ పాత్ర ఎక్కువగా ఉన్నది.యురేనస్ పాత్ర ఉన్నపుడు కొత్త రకపు బాంబులను వాడటం గాని,విభిన్న తీరులో పేలుళ్లు ప్లాన్ చెయ్యడం గానీ జరిగింది.నెప్ట్యూన్ పాత్ర చాలా తరచుగా కనిపించింది.ప్లూటో పాత్ర ఉన్నపుడు విదేశీ విద్వంసకారుల సూటి ప్రమేయం ఆయా దాడులలో కనపడింది.సూర్యమండలంలో బాగా బయటగా దూరంగా ఉన్న గ్రహాలు కనుక బయటి వారి ప్రమేయం సూచింపబడుతుంది. 
  • విధ్వంసం జరిగిన తీరు తెన్నులను బట్టి శని,రాహు,కుజుల పాత్ర చాలా స్పష్టంగా ఉంటున్నది. ఇవి మూడూ విధ్వంసకర పోకడలను పెంచే గ్రహాలని మనకు తెలుసు.

పై సూచికల ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి గ్రహస్తితులు తలెత్తినప్పుడు ప్రమాదం ముంచుకొస్తున్నదని ఊహించవచ్చు. తీసుకోగలిగితే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా,ఎంత చర్చించినా, తీవ్రవాదులు గనుక విధ్వంసం సృష్టించాలి అనుకుంటే, ఏదో ఒకరోజున ఏదో ఒకచోట చెయ్యక మానరు.అందులోనూ జనసాంద్రత ఎక్కువగా ఉన్న మన నగరాలలో,పోలీస్ వ్యవస్థ బలహీనంగా ఉన్న ప్రాంతాలలో,అందునా మనలాంటి జాగరూకతా రహిత డొల్ల ప్రజాస్వామ్య దేశంలో అలా చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. తీవ్రవాదులకున్న ధనసరఫరా, అందదండలూ, వారి నెట్ వర్కూ,డబ్బుకు అమ్ముడయ్యేవారు అడుగడుక్కీ మన సమాజంలో ఉండటమూ,మన వ్యవస్థలో ఉన్న తీవ్రమైన లోపాలూ వీటన్నిటి కోణంలో ఆలోచిస్తే ఇలాంటి దాడులను ఆపడం ఎవరికైనా ప్రాక్టికల్ గా చాలా కష్టమే అని తోస్తుంది.మరి సామాన్య పౌరుడికి ఏమిటి దారి?

వ్యవస్థాపరంగా మన దేశంలో మంచి మార్పులు రావడం అసాధ్యం కాదుగాని చాలా కష్టం. మనం ప్రతిదాన్నీ తేలికగా తీసుకుంటూ, కళ్ళుమూసుకుని ఎవరి స్వార్ధం వారు చూసుకుంటూ ఉన్నంతకాలం,నాయకుల దృష్టిలో ప్రజల ప్రాణాలకు విలువ లేనంతకాలం,ఓటు బ్యాంకు రాజకీయాలు పోనంతకాలం ఈ విధ్వంసం తప్పదు.ఇవన్నీ ఎప్పుడు పోతాయో,మన సమాజం ఆదర్శ సమాజంగా ఎప్పుడు మారుతుందో ఎవరూ చెప్పలేరు.అంతవరకు దైవం మీద భారం వేసి, రాసిపెట్టి ఉన్నంతకాలం బ్రతకడమే సామాన్యుడు చెయ్య గలిగింది.పోయిన తర్వాత ఇక చేసేదేమీ లేదు, బతికున్నవారి కుట్రలకు ఒక సమిధలా ఉపయోగ పడటం తప్ప.

ఉదాహరణకు, డిల్లీ రేప్ కేస్ ఏమైంది? నాలుగురోజులు అందరూ గోల చేశారు.ఇప్పుడు అనుకునేవాడే లేడు.పోనీ దాని తర్వాత అలాంటి సంఘటనలు ఇంకెక్కడా దేశంలో జరగలేదా? అంతకంటే ఎక్కువ ఘోరాలు చాలా చోట్ల జరిగాయి.ఇప్పటికీ జరుగుతున్నాయి.ఈరోజుకీ పేపర్లలో టీవీలలో వచ్చేవి 5 శాతం మాత్రమే.మనది సిగ్గులేని దేశం అనడానికి ఇంకా నిదర్శనాలు అవసరమా?

అసలు విషయం ఏమిటంటే,నవీన సమాజంలో సామూహిక చెడుకర్మ విపరీతంగా పోగవుతున్నది. అది ఎలా పోగవుతున్నదో చెప్పినా కూడా వినే స్తితిలో ఎవ్వరూ లేరు.పైగా చెప్పిన వారిని ఎగతాళి చేసే పరిస్తితి సమాజంలో ఉన్నది.మనుషులలో దైవం అన్నా ధర్మం అన్నా భయమూ భక్తీ రెండూ చాలా తగ్గిపోయాయి.స్వార్ధమూ,విచ్చలవిడి ప్రవర్తనా నిత్యకృత్యాలు అయ్యాయి.మాటల్లో చెబుతున్న నీతులు చేతల్లో కనిపించడం లేదు.కనుక నిత్య ప్రళయాలు జరగడం మామూలై పోతున్నది.వ్యవస్థా స్థాయిలో చూచినప్పుడు దీనికి పరిష్కారాలు అంటూ ప్రస్తుతానికి లేవు.వ్యక్తిగత స్థాయిలో ఉన్నాయి.మనుషులలో మంచిమార్పు రావాలి. ఆ మార్పు ఉత్త మాటలు చెప్పడంలో కాకుండా చేతల్లో కనపడాలి.అలా రాకపోతే ఇంకా పెద్దపెద్ద విధ్వంసాలు ప్రకృతి పరంగా జరిగే రోజులు కూడా ముందు ముందు వస్తాయి.మనిషి ప్రకృతినీ దైవాన్నీ ఎక్కువరోజులు మోసం చెయ్యలేడు. కనుక దైవబలాన్ని తనకు కవచంలా ఉంచుకుని జీవించడం తప్ప ప్రస్తుత భారత సమాజంలో సామాన్యుడు చేసేదీ,చెయ్యగలిగిందీ ఏమీ లేదు.

నేనెన్నోసార్లు చెప్పినట్లు ప్రస్తుత కుళ్ళు సమాజంలో అదొక్కటే సామాన్యుడికి శ్రీరామరక్ష. 'దిక్కులేనివారికి దేవుడే దిక్కు' అని పెద్దలు ఏనాడో చెప్పారు కదా.
read more " హైదరాబాద్ లో పాతపేలుళ్లు - జ్యోతిష పరిశీలన "

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

హైదరాబాద్ బాంబు పేలుళ్లు - ఖగోళ సూచికలు

నిన్న జరిగిన పేలుళ్ళ నేపధ్యంలో ఇవీ నాయకుల స్టేట్మెంట్లకు సామాన్యుని మనోగతాలు.

ఇది పిరికిపందల చర్య
వారిని నియంత్రించలేకపోవడం మన చేతగానితనపు చర్య కాదా?
ఈ విద్రోహ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఇప్పటికే జనాలు తీవ్రంగానే ఖండింపబడ్డారు ఇక మనం కూడా తీవ్రంగా ఖండించేదేముంది? 
బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియచెస్తున్నాం
ఇది ఫ్రీ గనుక ఎన్ని టన్నులైనా కుమ్మరించొచ్చు 
దోషులను త్వరలో పట్టేస్తాం.తీవ్రమైన శిక్షలు విధిస్తాం 
మొదటిది ప్రశ్నార్ధకమే.ఒకవేళ వారి ఖర్మ కాలి వారంతట వారు పట్టుబడితే తర్వాత ఒక దశాబ్దం పాటు వారిని రాజభోగాలతో మేపడం మాత్రం ఖాయం.
రాష్ట్రమంతటా రెడ్ ఎలర్ట్ ప్రకటిస్తున్నాం 
ఇప్పుడెందుకు? అమాయక పౌరులను ఇబ్బందుల పాల్జేయడానికా? 
అంతటా తనిఖీలు గస్తీలు ముమ్మరం చేస్తాం 
నాలుగు రోజులపాటా? ఆ తర్వాత?
మతానికీ ఉగ్రవాదానికీ ముడిపెట్టొద్దు
మేం కొత్తగా ముడిపెట్టేదేముంది? ఇప్పటికే పడిన చిక్కుముళ్ళను మీరు విప్పండి చాలు.

సరే ఇవన్నీ ఎన్నాళ్ళు మాట్లాడుకున్నా జవాబుల్లేని ప్రశ్నలు, పేపర్లవారికీ, టీవీవారికీ ఒక రెండు రోజులపాటు మళ్ళీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చేదాకా ఊకదంపుడు చర్చలకు పనికొచ్చే విషయాలూ గనుక అవి వారికొదిలేసి మన ఇంటి డాబామీదికెక్కి ఒకసారి ఖగోళం లోకి దృష్టి సారించి అసలు నిన్న ఎటువంటి గ్రహ స్తితులున్నాయో పరికిద్దాం.నిన్నటి గ్రహస్తితులు ఇవాళ ఎలా కనిపిస్తాయి అని మాత్రం నన్నడక్కండి.వాటిని ఆకాశం చూపదు కాని సాఫ్ట్ వేర్ చూపిస్తుంది.

అసలు నన్నడిగితే మనుషులకంటే గ్రహాలే మంచివి అంటాను.గ్రహాలు పాపం అమాయకులు.అవి మనలాగా వక్రబుద్ధి ఉన్నవి కావు.మన నాయకుల లాగా ఈరోజొక మాటా రేపొక మాటా చెప్పేవి కూడా కావు.కనుక ఎప్పుడడిగినా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూపుతాయి.వాటికి పక్షపాతం కూడా లేదు.ఋజుస్వభావులు.అందుకే నిన్నటి గురించి అవేమంటు న్నాయో ఒక్కసారి చూద్దాం.

నిన్న సాయంత్రం 6.50 కి హైదరాబాద్ లో ఉన్న గ్రహస్తితి ఇది.మొన్న శనీశ్వరుడు వక్రస్తితిలోకి వచ్చిన నేపధ్యంలో నిన్న ఈ గ్రహస్తితి ఉన్నది.ఇందులో చూడగానే కనిపించేది కుంభరాశిలో అయిదు గ్రహాల కూడిక.వీటిలో సూర్యుడు నిన్నటి రోజున నెప్ట్యూన్ తో డిగ్రీయుతి లోకి వచ్చి ఉన్నాడు.ఈ సంయోగం రాహునక్షత్రమైన శతభిషం లో జరిగింది.నవాంశలో రవి నెప్త్యూన్లు ధనూరాశిలోకి వస్తారు.ధనుస్సు మన దేశ లగ్నం అయిన వృషభానికి అష్టమంలో ఉంటుంది.అంటే 'నాశనం' అన్నమాట.రాహుస్పర్శ వీరికి ఉంది అంటేనే శపితయోగం పని మొదలు పెట్టింది అని అర్ధం.శపితయోగ ప్రభావాలు ఎలా ఉంటాయో ఇంతకు ముందే వివరంగా చర్చించాను.కనుక మళ్ళీ చెప్పవలసిన పనిలేదు.కనుక శపితయోగ ప్రభావంతో ప్రజానాశనం సూచితం అయ్యింది.  

ఈ సంఘటన వెనుక ఉన్న ముఖ్య ప్రభావం నెప్ట్యూన్ గ్రహానిది.నెప్ట్యూన్ రాహు నక్షత్రంలో ఉండటం వల్ల రాహు ప్రభావానికి లోనై నెగటివ్ లక్షణాలు సంతరించుకుంటుంది. ఆ నెగటివ్ లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

  • Illusion,creates confusion,deceit and trickery,irrational and dreamy.
సరిగ్గా ఈ లక్షణాలనే ఉగ్రవాదులు కలిగి ఉంటారని వేరే చెప్పనవసరం లేదు కదా.ఇలాంటి లక్షణాలున్న నెప్ట్యూన్ తో ప్రస్తుతం రవి,బుధ,శుక్ర,కుజులు కలిశారు.అప్పుడు ఎలాంటి ఫలితాలు రావచ్చో చూద్దాం.
  • సూర్యునితో నెప్ట్యూన్ యొక్క డిగ్రీ కలయిక ప్రస్తుతం మనం చూడవలసిన అతి ముఖ్యమైన యోగం.దీనివల్ల ప్రభుత్వంతో విరోధం,మోసంచెయ్యడం,కుట్ర సూచింపబడుతుంది.ఇదే సూర్యుడు భారతదేశ కుండలిలో చతుర్దాదిపతిగా  ప్రజలను సూచిస్తాడు అన్న విషయం మనకు తెలుసు.కనుక ఈ దేశప్రజలంటే ద్వేషం ఉన్నవారే ఈపని చేశారు అని తెలుస్తుంది.మన దేశపు ప్రభుత్వం అంటేనూ ప్రజలంటేనూ పడనివారెవరు? వారెవరో అందరికీ తెలుసు నేను చెప్పవలసిన పని లేదు.
  • కుజునితో కలయిక వల్ల కుట్రపూరిత విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది.
  • శుక్రుని సున్నా డిగ్రీల స్తితివల్ల దేశలగ్నాదిపతి అయిన శుక్రుడు పూర్తి  బలహీన స్తితిలో నిన్న ఉన్నాడు.కనుక రక్షణదళాలు మోసగింప బడ్డాయి.వాళ్ళ కళ్ళను నేరస్తులు తేలికగా కప్పగలిగారు.
  • బుధునితో కలయిక వల్ల సవ్యంగా ఆలోచించే బుద్ధి వారిలో లోపిస్తుంది.కనుక ఈ ఘోరానికి పాల్పడ్డారు.అధికారులలో కూడా ఇదే లోపంవల్ల సక్రమమైన చర్యలు చేపట్టలేక పోయారు.
  • వీటికితోడు నాలుగు రోజుల్లో పౌర్ణమి రానే రాబోతున్నది.
  • అయితే ఇంకొక అనుమానం రావచ్చు.ఇందులో శనీశ్వరుని పాత్ర ఏముంది? అని.నిన్న సాయంత్రం పేలుళ్లు జరిగిన సమయంలో చంద్రహోర జరుగుతున్నది. చంద్రుడు రాహుశనులచేత చూడబడు తున్నాడు.నవాంశలో శనితో కలిసి ఉన్నాడు.కనుక ఆ గంట సమయమూ శనిరాహువుల ఆధీనంలోనే ఉన్నది.అంటే శపిత యోగ ప్రభావం హోరా నాధుని ద్వారా పనిచేసిందన్న మాట.

పైన గ్రహాలు ఇచ్చిన సూచనలు గమనిస్తే ఏమి జరగాలో ఏమి జరిగిందో స్పష్టంగా కనిపిస్తుంది.అంతే కాదు.పై గ్రహస్తితివల్ల ఇది ఎవరు చేసారో కూడా తెలుస్తుంది.కాని మనం బయటకు చెప్పరాదు.ప్రభుత్వానికీ తెలుసు.వారూ అప్పుడే చెప్పరు.ప్రజలకూ తెలుసు.వారిలో వారు చర్చించుకుంటారు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అసలు మన దేశంలో ఒక మంచి మార్పు వస్తుందని ఊహించడం కూడా తప్పే అని రోజురోజుకూ నమ్మకం నాకైతే బలపడుతోంది.

అదలా ఉంచితే,ఇప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.ఈ ఘోరం ఇండియాలోనే ఎందుకు జరగాలి? అందులోనూ హైదరాబాద్ లోనే ఎందుకు జరగాలి? దీనికి జవాబేమిటంటే, ప్రస్తుత గురుసంచారం భారతదేశ లగ్నంలో జరుగుతున్నది కనుక ఇటువంటి ముఖ్య ఘటనలు మనదేశంలోనే జరుగుతాయి. హైదరాబాద్ co-ordinates కూ ప్రస్తుత గ్రహస్తితికీ ఉన్న సంబంధాన్ని Astro-Cartography mapping చేసి పరిశీలించాలి.అప్పుడు ఆ సంబంధం తెలియవచ్చు.

మొత్తమ్మీద సూర్య నెప్త్యూన్ల డిగ్రీ కంజంక్షన్ కుజపరిధిలో రాహునక్షత్రంలో జరగడం ఈ ఘోరాన్ని ట్రిగ్గర్ చేసింది అని చెప్పవచ్చు.ఇప్పుడు చాలామంది చాలా రోజులుగా నన్ను అడుగుతున్న ఇంకో ప్రశ్న తలేత్తుతుంది.అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఎనాలిసిస్ చేసి ఏమిటి ఉపయోగం? అని.

కేంద్ర ప్రభుత్వానికీ,రాష్ట్ర ప్రభుత్వానికీ అన్ని వనరులూ చేతిలో ఉన్న ఎన్నో ఇంటలిజెన్స్ ఏజన్సీలకూ అన్నీ తెలిసి వాళ్ళే ఏమీ చెయ్యలేకపోయారు. మనమేం చెయ్యగలం?కాకపోతే ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు వాటి సూచికలు ఖగోళంలో ఖచ్చితంగా కనిపిస్తాయి అన్న విషయాన్ని పరిశీ లించడం వరకే ఈవ్యాసం ఉద్దేశ్యం. పైన ఇచ్చిన జ్యోతిష విశ్లేషణ పరికిస్తే ఇది నిజం అని తెలుస్తుంది.

దేశమంతా టీవీలలో పత్రికలలో నెట్ లో చర్చలు హోరెత్తుతున్నాయి.వాటి ఉపయోగం ఏమిటో నా విశ్లేషణ ఉపయోగం కూడా అదే.మనకు తిన్నదరగదు.అది అరిగేవరకూ మాట్లాడుకొని పనికిమాలిన చర్చలు చేసుకొని మనల్ని మన చేతగాని దద్దమ్మతనాన్నీ తిట్టుకొని అరిగిన తర్వాత మళ్ళీ భోజనం చెయ్యడానికి పోదాం. రాజకీయ నాయకులకు ప్రజల చర్చలు ఏవీ పట్టవు.ఎవరెన్ని చర్చలు చేసుకున్నా ఎంత వాగినా వారు ప్రశాంతంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు.వారి అజెండాలు నిర్ణయాలు వారివి.మన గోడు మనది.

మనం మంచి నాయకుల్ని ఎన్నుకోం.కనుక అలాంటి నాయకులు తీసుకునే నిర్ణయాల ఫలితాల్ని కూడా నవ్వుతూ అనుభవిద్దాం.ఇప్పుడనుకొని ఉపయోగం ఏముంది? 'వినాశకాలే విపరీత బుద్ధి', 'చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా' మొదలైన సామెతలు  ఊరకే రాలేదుకదా.
read more " హైదరాబాద్ బాంబు పేలుళ్లు - ఖగోళ సూచికలు "

20, ఫిబ్రవరి 2013, బుధవారం

త్యాగయ్య నాదోపాసన -2

త్యాగయ్య శ్రీరాముని పరమ భక్తుడు.అనవరతమూ శ్రీరామధ్యానంలో తపించి పరవశించిన మహనీయుడు.ఆయన జపించి ధ్యానించి నిత్యమూ కీర్తించిన రాముడు ఎట్టివాడు?  

రఘువంశ తిలకుడైన శ్రీరాముని త్యాగయ్య ఆరాధించిన మాట నిజమే.కాని త్యాగయ్య ఒక మానవ మహారాజును ఆరాధించినవాడు కాదు.త్యాగయ్య దృష్టిలో శ్రీరాముడు రఘువంశంలో పుట్టిన ఒక రాజు మాత్రమె కాదు. శ్రీరాముడు ఒక సామాన్య రాజే అయితే త్యాగయ్య ఆయన్ను ఆరాదించేవాడే కాదు.త్యాగయ్య దృష్టిలో శ్రీరాముడుత్త మానవమాత్రుడు కాడు. మనోవాగతీతమై,వేద ప్రతిపాదితమైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే దిగివచ్చి రూపుదాల్చి శ్రీరాముని రూపాన్ని ధరించి భక్తులకోరకు సగుణదైవమై భూమిపైన నడయాడిందని త్యాగయ్య నమ్మిక. అది త్యాగయ్య ఒక్కని నమ్మకం మాత్రమే కాదు.ప్రాచీనకాలం నుండి ఎందఱో మహర్షుల, పరమ భక్తుల పవిత్రనమ్మకం అది.అంతేకాదు.ఈగడ్డ మీద జన్మించిన భారతీయుడైన ప్రతివాడి విశ్వాసం కూడా అదే.అది ఉత్త విశ్వాసం మాత్రమె కాదు.పరమ సత్యం కూడా.

త్యాగయ్య నాదోపాసకుడు.ఆయన ఆరాధించిన రాముడు నాదశరీరుడు. ప్రణవస్వరూపుడు.అనేక కీర్తనలలో ఆయన ఇదే విషయాన్ని చూచాయగానూ,కొన్ని చోట్ల చాలా స్పష్టంగానూ చెప్తాడు.పరబ్రహ్మమును ప్రణవనాదముగా ఉపాసించే విధానం మన సాంప్రదాయంలో వేదకాలం నుంచి ఉన్నది. త్యాగయ్య ఆ ప్రాచీన మార్గానికి రామభక్తిని జోడించి తనదైన బాణీలో ఒక నూతన ఒరవడిని ఇచ్చాడు.అయితే ఈ క్రమంలో అనేకమంది ప్రాచీన భక్తయోగుల మార్గాన్నే ఆయన కూడా అనుసరించాడు.

అఠాణ రాగంలో పాడిన 'శ్రీప ప్రియ సంగీతోపాసన చేయవే ఓ మనసా' అనే కృతిలో తాపసజనులకు సాధకులకు ధనమైనట్టిది, ఆద్యాత్మిక అధిభౌతిక అధిదైవికములనబడే త్రితాపములను హరించునట్టిది, అయిన సప్తస్వర నాదమయమైన సంగీతోపాసన చేయమని అట్టి ఉపాసన సర్వాంతర్యామి యగు శ్రీహరికి మిక్కిలి ప్రియమైనదని అంటూ తన మనసుకు నచ్చ చెబుతాడు.

(అఠాణ రాగం)
శ్రీప ప్రియ సంగీతోపాసన చేయవే ఓ మనసా

తాపసజన మానసధనమే 
త్రితాప రహిత సప్తస్వర చారి                                                

రంజింప జేసెడు రాగంబులు
మంగళమగు యవతారములెత్తి 
మంజీరము ఘల్లని నటించు 
మహిమ తెలియు త్యాగరాజ నుతుడగు                              

'రంజింప చేసెడు రాగంబులు మంగళమగు నవతారములెత్తి' అనే పాదంలో మనస్సును రంజింప చేయగలిగిన అనేక రాగములను అనాహత నాదస్వరూపుడగు నారాయణునికి గల అనేక అవతారములుగా భావించి  రసమయమైనట్టి ఒక సాధనారహస్యాన్ని తన మనసుకే గాక మనకు కూడా బోధపరుస్తాడు త్యాగయ్య. అనాహత నాదమును పరబ్రహ్మముగానూ వివిధ రాగములను ఆ పరబ్రహ్మముయొక్క అవతారములుగానూ భావిస్తాడు త్యాగయ్య. నిరాకారుడైన భగవంతుడు సాకారుడై అవతారముగా దిగిరావడం ఎంత వింతయో,అనాహతనాదము (unstruck sound) వివిధ నాదములుగా రాగములుగా మారి దిగివచ్చి మానవకర్ణములకు వినిపించుటకూడా అంతే వింత.ఈ రెంటికి ఉన్న సారూప్యమును మనకు ఈ కీర్తనలో చూపించుతాడు సద్గురు త్యాగరాజు.నిరాకార సాకారస్థాయిలను అనాహత ఆహత నాదములతో పోలిక చెప్పి నిరూపించుట ఒక అద్భుతమైన అనుభవసత్యం.  

నళినకాంతి రాగంలో పాడిన 'మనవ్యాలకించ రాదటే మర్మమెల్ల దెల్పెదనే మనసా' అనే కృతిలో త్యాగయ్య శ్రీరాముని అవతార తత్వాన్ని లోకానికి విశదపరుస్తాడు. అలా విశదపరచడానికి తన మనస్సును ఒక ఉపకరణంగా తీసుకొని తన మనసును తాను విడిగా చూస్తూ దానికి ముద్దుగా నెమ్మదిగా శ్రీరాముని అవతారతత్వాన్ని బోధిస్తాడు. 

అనవసరమైన కర్మకాండ అనే అడవిలో చిక్కుకుని దారితప్పి లోకులు బాధపడుతూ ఉండటం చూచి వారికి సరియైన దారి చూపాలని కరుణించి మానవరూపంలో కనిపించి నడయాడిన దైవమే శ్రీరాముడని వివరిస్తాడు. ఈ భావాన్ని తెలిపే 'కర్మకాండ మతాకృష్టులై భవగహనచారులై గాసి జెందగా కని మానవా-అవతారుడై కనిపించినాడే నడత త్యాగరాజు మనవాలకించరాదటే'అనే చరణం భగవంతుని గహనమైన అవతారతత్వాన్ని తేటతెల్లం చేస్తుంది.

వివిధ కర్మలతో కూడిన సంసారమనే అడవిలో చిక్కుకుని కర్తృత్వ భోక్త్రుత్వాది భ్రమలలో పడి నలిగి అహంకరించి సర్వమునూ అంతర్యామిగా నడిపిస్తున్న భగవత్తత్వమును గ్రహించలేక నానాటికర్మలే సర్వస్వమను కొని క్రమేణా యమాలయానికి దగ్గరౌతున్న జీవులకు సులభమైన తరుణోపాయాన్ని చూపడానికి అఖండఘన సచ్చిదానంద స్వరూపుడైన దైవం మానవరూపంలో శ్రీరామునిగా దిగివచ్చింది గాని ఆతడు మనవంటి మామూలు మానవుడు గాడనే విషయాన్ని తన మనస్సుకు నచ్చజెబుతూ అదే సమయంలో లోకానికి కూడా హితబోధ గావిస్తాడు.   

(నళినకాంతి రాగం) 
మనవ్యాలకించ రాదటే 
మర్మమెల్ల దెల్పెదనే మనసా                                         

ఘనుడైన రామచంద్రుని 
కరుణాంతరంగము దెలసి నా                                        

కర్మకాండ మతాకృష్టులై భవ 
గహనచారులై గాసి జెందగ
కని మానవా-అవతారుడై 
కనిపించినాడే నడత త్యాగరాజు                                      

శ్రీరామభక్తిని నాదోపాసనకు జతగావించి తన ఇష్టదైవమును శుద్ధనాదరూపునిగా సాక్షాత్కరించుకున్నాడు త్యాగయ్య.ఆరభి రాగంలో పాడిన 'నాదసుధా రసంబిలను నరాకృతాయ మనసా' అనే కీర్తనలో శ్రీరాముని దివ్యరూపమును ప్రణవ నాదరూపముగా వర్ణించుతాడు.

(ఆరభి రాగం) 
నాదసుధా రసంబిలను నరాకృతాయ మనసా 
వేదపురాణాగమ శాస్త్రాదుల కాధారమౌ                                     
  
స్వరములు యారొక ఘంటలు వరరాగము కోదండము 
దురనయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరమురా                      

సరస సంగతి సందర్భముగల గిరములురా 
ధరభజనే భాగ్యమురా త్యాగరాజు సేవించు                                   

శ్రీరాముడు అమృతమయమైన ప్రణవస్వరూపుడు.ఆయన ధరించిన కోదండము రాగస్వరూపము.దానికి ఉన్నట్టి ఏడు చిరుఘంటలు ఆరున్నొక్క స్వరములు.దుర,నయ,దేశ్యములనబడేవి వరుసగా ఘనరాగములు, నయరాగములు,దేశ్యరాగములుగా విరాజిల్లుచున్న త్రిగుణములు.మూడు రకములైన ఈరాగముల ముప్పేటతో పేనబడినది రామకోదండమున కున్నట్టి అల్లెత్రాడు.శృతితప్పని స్వరగతి సూటిగ సాగే రామబాణము. గానమున మ్రోగే సందర్భోచిత సరససంగతులు గిరములుగా త్యాగరాజు ఉపాసించుతున్నట్టి నాదస్వరూపమే శ్రీరామునిగా రూపుదాల్చి ఆయన కన్నులకు గోచరించింది.ఆ దివ్యసాక్షాత్కారమును తన మనస్సుకు బోధపరుస్తూ పరమనాద స్వరూపుడైన శ్రీరాముని అంతరిక సాధనతో భజించమనీ అదే పరమానంద దాయకమనీ విశదీకరిస్తాడు త్యాగయ్య. సర్వ శాస్త్రములకు ఆధారమైన నాదామృతరసమే నరాకృతిని దాల్చి శ్రీరామ రూపాన్ని ధరించినదన్న సత్యాన్ని మనకు తేటతెల్లం చేస్తాడు.  

కల్యాణి రాగంలో పాడిన 'భజన సేయవే మనసా' అనే కీర్తనలో బ్రహ్మేంద్ర రుద్రాదులకు సైతము దక్కని రామభజన చెయ్యమని తన మనసుకు హత్తుకునేలాగ ఉపదేశిస్తాడు.

(కల్యాణి రాగం)
భజన సేయవే మనసా - పరమ భక్తితో   
అజరుద్రాదులకు భూసురాదుల కరుదైన రామ                          

నాద ప్రణవ సప్తస్వర - వేదవర్ణ శాస్త్ర పురా 
ణాది చతుష్షష్టి కళల - భేదము గలిగే 
మోదకర శరీర మెత్తి - ముక్తి మార్గమును దెలియక 
వాద తర్కమేల శ్రీమ - దాది త్యాగరాజ నుతుని                         

రామ భజనను పరమ భక్తితో చెయ్యమని త్యాగరాజు ఉవాచ. నాద ప్రణవము నుండి సప్త స్వరములు ఉద్భవించినవి.వానినుండి వేదశాస్త్ర పురాణములు  అరువది నాలుగు కళలు పుట్టినవి.ఇవన్నియు నాదరూపములే,నాదము భక్తుని శరీరమందే యున్నది.కనుక ఇట్టి ఉత్కృష్టమైన మానవ జన్మమును ఎత్తికూడా తనలోనే యున్న సమస్తమును తెలియలేక ఉత్త వృధా వాదములలో చిక్కి కాలము గడపి మోసపోనేల? నాదములు వర్ణములు శబ్దములు స్వరములు తనలో ఎక్కడ దాగి ఉన్నవో గుర్తెరిగి ఆ నాదమునకు ఆధారుడైన ప్రణవ తారకరూపుడగు శ్రీరాముని తనలోనే దర్శించే భజనను (సాధనను) పరమ భక్తితో చెయ్యమని, అదే ఉత్కృష్టమైన మోక్ష సాధనమని త్యాగయ్య ఈ కీర్తనలో తన మనస్సుకు బోధిస్తాడు.

అవతారుడగు శ్రీరాముని దివ్యమంగళ స్వరూపమును శబ్దబ్రహ్మముగా ఉపాసించే విధానమును సూచించడమే గాక తానాచారించి ఆనందాబ్దిలో ఓలలాడిన ఘనుడు త్యాగయ్య. ఆయన యుపాసించిన శ్రీరాముడు ప్రణవ వాచ్యుడగు శబ్దబ్రహ్మమే గాని వేరొకటి గాదు.
read more " త్యాగయ్య నాదోపాసన -2 "

నిన్నటి నుంచి మొదలైన శనీశ్వరుని వక్రత్వ ఫలితాలు

నిన్నటినుంచి శనీశ్వరుడు మళ్ళీ వక్రస్తితిలోనికి ప్రవేశించాడు. ఈ స్తితి జూలై ఏడవ తేదీవరకు అంటే దాదాపు 135 రోజులపాటు కొనసాగుతుంది. ఈ లోపల ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి స్వాతి -4 పాదం నుంచి స్వాతి -2 పాదం వరకూ వెనక్కు ప్రయాణం చేస్తాడు. ఆ క్రమంలో ఎన్నో ఇతర గ్రహాలతో ఆయనకు పరస్పరదృష్టులు స్తితులు ఏర్పడతాయి. తత్ఫలితంగా జనజీవనంలో అనేక మార్పులు కలుగుతాయి. అవి ఎలా ఉంటాయో స్థూలంగా వివరిస్తాను. సూక్ష్మ వివరాలకు వ్యక్తిగత జాతకాలు చూచుకోవలసి ఉంటుంది.

  • సామాన్య ప్రజా ఉద్యమాలు జరుగుతాయి. దానికి తార్కాణంగా ఈరోజు నుంచి రెండురోజుల పాటు జరిగే 'అఖిలభారత కార్మికసమ్మె'ను చెప్పుకోవచ్చు. శనీశ్వరుడు వక్రస్తితిలోకి వచ్చీరాక ముందే ఇది ప్రారంభం అయింది. ఇదే రోజున అదెందుకు జరగాలి?మనంతట మనం చేస్తున్నాం అనుకునే చర్యల వెనుక గ్రహబలం ఎలా పనిచేస్తుందో ఈ సంఘటనతో మనం అర్ధం చేసుకోవచ్చు.
  • కొంతమందికి ఇతరులతో సంబంధాలు దెబ్బ తింటాయి. అనవసరంగా మాటా మాటా పెరిగి ఇబ్బంది కలుగుతుంది.
  • ఇంకొంతమందికి ఎప్పటినుంచో స్తబ్దుగా ఉన్న సంబంధాలు పునరుద్ధరించబడతాయి. ఇది గతం నుంచి ఉన్న కర్మ సంబంధం వల్ల జరుగుతుంది. ఆ సంబంధం ఈ జన్మది కావచ్చు.గత జన్మలనుంచి ఉన్నది కావచ్చు.
  • ఆధ్యాత్మికరంగంలో ఉన్నవారికి నూతన ప్రేరణ మొదలౌతుంది. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న వారి అభ్యాసాలు తిరిగి ఊపందుకుంటాయి.
  • చాలామంది జీవితాలలో ఇది జరుగడం గమనించవచ్చు.కొత్త కొత్త పరిచయాలు కలుగుతాయి.చాలా రోజులనుంచి మాట్లాడని,కనిపించని పాత స్నేహితులు పరిచయస్తులు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తారు. మాట్లాడతారు.అలాంటి పరిస్తితులు అనుకోకుండా కల్పించ బడతాయి.వీళ్ళు మనతో మాట్లాడుతారా అనుకున్నవారు కూడా కలుపుగోలుగా మాట్లాడటం చూడవచ్చు.చాలామంది కొత్త పార్టీలలో ఫంక్షన్ల లో పాల్గొంటారు.
  • దూరంగా ఉండి కలుసుకోలేని స్నేహితులు ఈ సమయంలో (జూలై ఏడవ తేదీలోపు) తిరిగి కలుసుకుంటారు.శనీశ్వరుని బలమైన కర్మ ప్రభావం వల్ల వాళ్ళు ఒకచోటికి లాగబడతారు.
  • గతంలో వ్రాసిన రాహుకేతు పోస్ట్ లో వారి రాశిమార్పు వల్ల వారి దృష్టి బ్రిటన్ మీదకు మళ్ళుతుంది అని వ్రాశాను. తత్ఫలితంగా కొత్త వ్యాధులు విజ్రుంభిస్తాయి అని కూడా వ్రాశాను.ఎందుకంటే రాహుప్రభావం వల్ల ఊహించని కొత్త వ్యాధులు వైరస్ బాక్టీరియా రూపంలో తలెత్తే అవకాశాలు బలంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ జోస్యం శనీశ్వరుని వక్రత్వంతో కలిసిరావడం(coincide కావడం)జరిగింది.ఇంగ్లాండ్లో సరికొత్త ప్రాణాంతక వైరస్ తలెత్తి జనులకు గుబులు పుట్టిస్తూ ఉండటం చూడవచ్చు. ఇది కూడా శనీశ్వరుని వక్రస్తితి మొదలైన సమయంలోనే తలెత్తటం గమనార్హం.
  • అయితే ఈ వక్రత్వంవల్ల కొన్ని మంచి మార్పులు కూడా ఉన్నాయి.కొందరిలో ఇప్పటివరకూ ఉన్న స్తబ్దత తొలగిపోయి నూతనోత్సాహం ఏర్పడుతుంది.ముఖ్యంగా ఎవరి జాతకాలలో అయితే శని వక్ర స్తితిలో ఉన్నాడో వారికి కొత్త ఉత్సాహం వస్తుంది.ఉన్నట్టుండి ఏదో మార్పు వారి జీవితంలో గమనిస్తారు.ఖచ్చితంగా ఇంతకు ముందుకూ ఇప్పటికీ కొంత తేడా వస్తుంది. ఆ తేడాలు వారి వారి జాతకాలలో శనీశ్వరుడు ఉన్న భావాలను బట్టి ఆయా రంగాలలో కనిపిస్తాయి.
  • శనీశ్వరుడు క్రూరగ్రహమై ఉండి వక్రించినపుడు బలం పెరగడం చేత చాలాచెడు చెయ్యగలడు.కాని మకర,కుంభ,వృషభ,తులా లగ్నాలకు అంత చెడు చెయ్యడు. పైగా,ప్రస్తుతం ఆయన ఉచ్ఛ స్త్తితిలో ఉన్నాడు. కనుక వక్రించినప్పుడు ఉచ్చత్వానికి కొంత భంగం ఏర్పడుతుంది.ఈ రీతిగా వివిధ కారణాలవల్ల ఆయా లగ్నాలకు వివిధ రకాలైన మిశ్రమ ఫలితాలు ఇవ్వబడతాయి. 
  • మొత్తం మీద చాలామందిలో మానవ సంబంధాల గురించి, సమాజంతో ఇతరులతో తమకున్న సంబంధాల గురించి పునరాలోచన ఈ సమయంలో తప్పకుండా కలుగుతుంది.ఇంతకు ముందరి తమ ఆలోచనావిధానాన్ని ప్రవర్తనాధోరణిని ఒక్కసారి తిరిగి బేరీజు వేసుకునేటట్లు ఈ గ్రహస్తితి పనిచేస్తుంది.
  • శనీశ్వరుడు కర్మకారకుడు గనుక కర్మరంగంలో (workspot) కూడా  ఈసమయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. 
  • ఆయా గ్రహస్తితులు దృష్టులు జరిగినప్పుడు ఏ ఏ సంఘటనలు తలెత్తు తాయో ముందుముందు చూద్దాం. ప్రస్తుతానికి మీమీ జీవితాలలో పైన చెప్పిన సంఘటనలు ఎలా జరుగుతున్నాయో గమనించి ఆశ్చర్య పోవడమే మీ వంతు.
read more " నిన్నటి నుంచి మొదలైన శనీశ్వరుని వక్రత్వ ఫలితాలు "

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

కాలజ్ఞానం -18

అనుకోని ఘటనలే జరిగేను
అనుకున్న వ్యూహాలు చెదిరేను 
మాటలా జగడాలు పెరిగేను
మనసులే కొన్నింక విరిగేను

లోకులకు శూన్యమే మిగిలేను 
పలాయనమ్ములే పెరిగేను
అనుకున్న కధలన్ని అల్లకల్లోలమై 
అనుకోని మార్పులే జరిగేను 

గ్రహ ప్రభావాలు కల్లలని 
నవ్వుకుండే వారు నాపచేలౌతారు 
ఎందుకిలా జరిగిందని 
వెర్రి ముఖాలతో మిర్రిగా చూస్తారు 

మంచిలోనీ చెడును చెడులోని మంచిని 
కాంచగల్గేవారు కట్టులో ఉంటారు
దుమ్ము సోకిన యెడల దులిపేసుకుంటారు 
దూరదృష్టీ తోడ ధీమంతులౌతారు 

ఆడించు శక్తులను ఆలోకనము చేయు 
నేర్పుగలవారు నవ్వుకుంటుంటారు   
వెలుగు చీకట్ల వింతాటలను చూచి
చిరునవ్వు చిందించి మిన్నకుంటారు
read more " కాలజ్ఞానం -18 "

13, ఫిబ్రవరి 2013, బుధవారం

త్యాగయ్య నాదోపాసన -1 (మనం మరచిపోయిన సత్యమార్గం)

'శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ' అన్నట్లు సంగీత రసానికి స్పందించని జీవి ఉండదంటే అతిశయోక్తి కానేరదు.శిశువులు పశువులు గానానికి ముగ్డులౌతారని మనకు తెలుసు.కాని విషజీవి యగు సర్పము కూడా గానరసానికి దాసోహం అంటుందంటే వింతగా ఉండవచ్చు. నమ్మశక్యం గాకపోవచ్చు.ఇందులోని నిజానిజాలను అలా ఉంచి, పిండితార్ధాన్ని గ్రహిస్తే,చరాచర సమస్త ప్రకృతీ సంగీతానికి స్పందిస్తుందనే భావం ఇందులో కనిపిస్తుంది. ఇది వాస్తవమే.

సంగీతానికి రెండు ప్రయోజనాలున్నవని భారతీయ సాంప్రదాయం చెబుతుంది. ఒకటి శ్రోతల మనస్సును రంజింప చెయ్యడం.రెండు గాయకునికి భగవద్దర్శనాన్ని కలిగించడం. మొదటిది ప్రజ్ఞ. రెండవది సాధన. మొదటిది పాండిత్యం.రెండవది ఉపాసన. సంగీతంలో పాండిత్యం ఉండటం వేరు.సంగీతోపాసన వేరు.సంగీత పండితులందరూ నాదోపాసకులు కాలేరు.గాయకులందరూ త్యాగరాజులూ కాలేరు.అలా అవ్వడానికి సంగీత పాండిత్యంతోబాటుగా సాధనాబలం కూడా తోడవ్వాలి.అమితమైన పాండిత్య ముండి కూడా దానిని లౌకికావసరాలు తీర్చుకోవడం కోసం కాకుండా భగవద్ ప్రీతి కోసం ఉపయోగించి నాదమును భగవద్రూపముగా ఉపాసన గావించి తరించిన మహానుభావుడు త్యాగరాజస్వామి.

సందర్భం వచ్చింది గనుక ఇక్కడ కొన్ని మరుగున పడిన వాస్తవాలు గమనిద్దాము. ఏ జాతి అయినా దానియొక్క మహనీయులను ఆ జాతికి సాంస్కృతిక ధార్మికభిక్ష పెట్టిన మహానుభావులను విస్మరించి ఎగతాళి చేస్తే అది ఆ జాతికి మహాదోషమూ పాపమూ అవుతుంది.ఆ పాపఫలితాలు చాలా సూక్ష్మంగానూ తరతరాల పాటు వెంటాడేవి గానూ ఉంటాయి.మనం కూడా తెలిసో తెలియకో చేస్తున్న అటువంటి పాపం ఒకటి ఉన్నది - అదే దేవర్షియగు నారదముని నింద.

నారదమహర్షి మామూలు ఋషి కాదు.ఆయన దేవఋషి. మానవ ఋషులే వారి శాపానుగ్రహ శక్తితో మనిషి తలరాతను మార్చగల సమర్ధులు.ఇక దేవఋషి అయిన నారదుని మహత్యము చెప్పలేము.ఆయన యొక్క మహత్వమును మన జాతి సరిగా గ్రహించలేదని నా ప్రగాఢమైన నమ్మకము.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన జాతికి భిక్ష పెట్టిన ఇద్దరు మహామహితాత్ములున్నారు.ఒకరు శ్రీమద్రామాయణ కృతికర్త యగు వాల్మీకిమహర్షి.వేరొకరు శ్రీమద్భాగవతమును రచించిన వేదవ్యాసమహర్షి. మన భారతజాతికి వీరే పరమగురువులు.ఒకరు ధర్మ స్వరూపుడైన భగవంతుని చరితమును రామాయణముగా అక్షరబద్ధం గావిస్తే,ఇంకొకరు లీలామానుష విగ్రహుడైన శ్యామసుందరుని కథను భాగవతముగా మనకు అందించారు.ఈ రెండు గ్రంధములున్నంత వరకూ భారత జాతీ,మతమూ సంస్కృతులు నిలిచి ఉంటాయి.కనుక వీరే మనకు పరమ గురువులు.

ఈ పరమ గురువులకు కూడా ఉపదేశమొనర్చి వారు సంకటస్తితిలో ఉన్నప్పుడు మార్గాన్ని చూపి తద్వారా భారతజాతికి ఈ రెండు అమూల్యములైన గ్రంధములను ప్రసాదించిన పరమగురువు నారదమహర్షి. కనుక మనము పొద్దున్న లేవగానే మొదట స్మరించవలసినది గురువులకే గురువైన నారదమహర్షిని మాత్రమె.ఆ నారదుని దివ్యస్తితి ఎట్టిది? ఆయనకు మనవలె లౌకికవాంచలు జంజాటములు లేవు.నిరంతరమూ నారాయణుని దివ్యనామాన్ని గానం చేస్తూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ మూడు లోకాలలోనూ ఎక్కడా అడ్డు లేకుండా సంచరించగల పరమభక్తుడు నారదరుషి.పరమానంద ధామమైన వైకుంఠమునకు కూడా తలచినప్పుడు పోగల శక్తి సంపన్నుడు.సాక్షాత్తు భగవంతుని వద్ద అంతటి చనవు ఉన్నట్టి ప్రేమభక్తి తత్పరుడు.

రామ మంత్రమును తిరుగదిప్పి మూర్ఖుడైన అడివి మనిషికి ఉపదేశం ఇచ్చి వానిని వాల్మీకి మహర్షిగా పరివర్తన చెందించిన సిద్ధసంకల్పుడు నారదమహర్షి.పురాణ ఉపపురాణాదులను రచించినప్పటికీ ఏదో తీరని వేదనతో బాధపడుతున్న వ్యాసమునీంద్రునికి దర్శనం ఇచ్చి ఆయనను ఊరడించి,ఉపాయమును ఉపదేశించి, అమృతోపమానమైన భాగవత సుధను వ్యాసుని ముఖతః లోకానికి ప్రసాదించిన మధుర భక్తాగ్రేసరుడు నారదమౌని.దర్శనమాత్రం చేత సమస్త బాధలనూ పోగొట్టి మానవ హృదయానికి అమితమైన శాంతిని చేకూర్చగల దివ్యరూపుడు నారద మహర్షి.సంగీతశాస్త్రమున ఆయనను మించిన జ్ఞానులు గాని ఆయనను మించిన మధుర గాయకులు గాని ముల్లోకాలలో ఎవ్వరూ లేరు. అటువంటి దేవర్షికి మనం ఇస్తున్న మర్యాద ఏమిటో ఒకసారి చూద్దాం.

మన నాటకాలలో కథలలో సినిమాలలో ఆయనను ఒక జోకర్ గా, తగాదాలు పెట్టె తంపులమారిగా,ఒక వెకిలి మనిషిగా చిత్రీకరిస్తూ ఘోరమైన పాపాన్ని మనం మూటగట్టుకుంటున్నాం.కలహభోజనుడు,మాయలమారి మొదలైన బిరుదులిచ్చి ఆయన్ను అపహాస్యం చేశారు మిడిమిడి జ్ఞాన సంపన్నులైన మన రంగస్థల చలనచిత్ర మూర్ఖ శిఖామణులు.మన ధర్మానికి పరమ గురువైన నారదమహర్షికి,మనం ఇస్తున్న విలువ ఇది. ప్రాతస్మరణీయుడైన ఒక మహాయోగికి మనం ఇస్తున్న మర్యాద ఇది.ఎదో రకంగా డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకే ఉన్నతాదర్శమూ లేని మనలాంటి ఆత్మాభిమానహీన జాతికి ఇంతకంటే ఇంకేమి చేతనవుతుంది? కనుకనే మన దౌర్భాగ్యం ఇలా తగలడింది. 

మన తల్లినీ తండ్రినీ ఎవరైనా ఎగతాళి చేస్తే,నిందిస్తే మనకు ఎంతటి కోపం వస్తుంది? ఒకవేళ మనమే వారిని నిందిస్తే అదెంత తప్పు? అలాంటప్పుడు ఈ జాతికి ధార్మికభిక్ష పెట్టిన ఒక మహర్షిని మనం ఎంతగా గౌరవించాలి? అది చెయ్యడంపోయి,ఆయన్ను ఒక వెకిలిమనిషిగా చిత్రీకరిస్తూ,హీనమైన బిరుదులిచ్చి ఆనందిస్తూ,మనం ఎంత మహాపరాధం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి.ఈ పాపానికి కారణం మన సినిమాలూ,వాటిని నిర్మిస్తున్న క్షుద్రజీవులే.

సంగీతాన్ని కూడా భగవద్దర్శనానికి సాధనామార్గంగా ఉపయోగించవచ్చని ప్రపంచానికి తెలిపినది మన భరతదేశపు భక్తి సంప్రదాయమే.ఇతర మతాలకు సంగీతం యొక్క ఈ మహత్వం తెలియదు.క్రైస్తవం కొంత పరవాలేదు.అందులో కీర్తనలు ఆలాపిస్తూ భగవంతుని వేడుకోవడం ఉంటుంది.అది భక్తిమార్గమే.కాని సాంప్రదాయ ఇస్లాం మాత్రం సంగీతాన్ని నిషేధిస్తుంది.అది సైతాన్ మార్గం అని దాని ఉద్దేశ్యం.మళ్ళీ ఇస్లాంలో సాధనా మార్గాలైన సూఫీ సాంప్రదాయాలలో సంగీతాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఎందఱో సూఫీ మహాత్ములు 'ఖవ్వాలీ'అనే సంగీత ప్రక్త్రియను ఆదరించారు.కాని ఇస్లాంలోని పిడివాదులు సంగీతాన్ని అంగీకరించరు. వారి దృష్టిలో సంగీతం ఒక దైవద్రోహం.

సంగీత సాధనతో భగవంతుని దర్శనాన్ని పొందవచ్చు అని చెప్పడమే గాక దానిని నిరూపించి చూపినది హిందూమతమే.దానికి తార్కాణంగా ఎందఱో మహనీయులు ఈ మార్గంలో నడిచినవారు మన మతంలో కనిపిస్తారు.సిక్కు మతంలో కూడా సంగీతానికి ప్రాధాన్యత ఉన్నది.

సంగీతం మనిషి మనస్సును అలవోకగా ఆకట్టుకుంటుంది.పాడేవారినీ వినేవారినీ కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయేట్లు చేసే శక్తి సంగీతానికి ఉన్నది.అటువంటి సంగీతంతో భగవంతుని కథలనూ గుణగణాలనూ తదేకంగా గానం చేస్తే అది అతిసులభంగా భగవంతుని ధ్యానంగా మారుతుంది.ఆ క్రమంలో చంచలమైన మనస్సు పరమ నిశ్చలతను పొందుతుంది.అటువంటి నిశ్చలమైన భక్తిపూరితమైన మనస్సులో భగవంతుని దర్శనం తప్పకుండా కలుగుతుంది. ఇది నారద మహర్షి ఈ ప్రపంచానికి ఇచ్చిన భిక్ష.దీనికి శరీరాన్ని హింసించే ఉపవాసాలు,ప్రాణాయామాలు,యోగాభ్యాసాది కఠినసాధనలు ఏవీ అవసరంలేదు.ఇవేవీ అవసరం లేకుండా చాలా సులభంగా మనిషి మనస్సును సాధనామార్గంలో ప్రవేశపెట్టే శక్తి సంగీతానికి ఉన్నది.

అటువంటి మహత్తరమైన మార్గాన్ని మనకందించిన నారదమహర్షిని మనం ఒక హాస్యగాడిగా పరిగణిస్తూ,నిత్యమూ ఎగతాళి చేస్తూ మహాపాపాన్ని తలకెత్తుకుంటున్నాం.ఆ పాపఫలితం ఎలా ఉంటుందంటే కళ్ళెదుట కనిపిస్తున్న సులభమైన సత్యమైన దారి మనకు కనపడకుండా చేస్తుంది. ఏవేవో పిచ్చిపిచ్చి దారులలో పరిభ్రమించేలా చేస్తుంది. సత్యమార్గం నుంచి మనలను దూరం చేస్తుంది ఈ పాపం.

నారదమహర్షి చూపిన ఈ సులభమైన సత్యమార్గంలో ప్రయాణించి తరించిన పరమ భాగవతోత్తములు ఎందఱో ఉన్నారు. మధ్యయుగాలలో మహారాష్ట్రలో ఉద్భవించిన భక్తతుకారాం,భక్త కుంభార్,భక్త రవిదాస్,భక్త సూరదాస్ మొదలైన మహానుభావులందరూ నారదప్రోక్తమైన భక్తిసంగీత మార్గంలో నడచిన ఘనులే.సిక్కుల ప్రధమగురువైన గురునానక్ ఈ దారిలో నడచినవాడే.వారందరినీ మన తరం మరచిపోయింది.వారికి ఆదిగురువైన నారదమహర్షినీ మరచిపోయింది.ఇదొక శాపం.మన ప్రాచీన మహర్షులు మహానుభావులను మనం మరచిపోవడం కంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు.ఏ జాతి అయినా తన పూర్వులను విస్మరిస్తే అది చెట్టు తన వేర్లను మరచిపోయినట్లు అవుతుంది.అప్పుడా చెట్టు జీవాన్ని కోల్పోతుంది.ప్రస్తుతం మన పరిస్తితి కూడా అలాగే ఉంది.

'కృష్ణలీలా తరంగిణి' రచించిన పరమ భాగవతోత్తముడు గుంటూరు జిల్లా 'కాజ' గ్రామానికి చెందినవాడు అయిన నారాయణతీర్ధులు, పూర్వులైన మహాభక్తుల సంస్మరణ గావిస్తూ 'ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి' అంటారు.

వీరి కోవలోకి చెందిన మహనీయులే భక్త జయదేవుడు, రామదాసు, అన్నమయ్య,క్షేత్రయ్య,నారాయణ తీర్ధులు,సదాశివ బ్రహ్మేన్ద్రులు. వీరందరూ ప్రాచీనులు. కాని వీరిదారిలో నడచి రాగరాగిణీ విద్యను ఆమూలాగ్రం ఔపోసన పట్టి కర్నాటక సంగీతాన్ని పరిపుష్టం చేసిన నాదోపాసకులు, నాదసిద్ధులు అయిన సంగీతత్రిమూర్తులు త్యాగరాజు,శ్యామశాస్త్రి, ముత్తుస్వామిదీక్షితులు వీరు ముగ్గురూ మొన్నమొన్నటి వారే.మనకు చాలా దగ్గరవారే.వీరే కాక వీరి అనుచరులూ మహనీయులే,ఘనులే. ఉదాహరణకు త్యాగరాజస్వామికి పరమభక్తురాలైన 'బెంగుళూర్ నాగ రత్నమ్మ' పేరును చెప్పుకోవచ్చు.లోకం దృష్టిలో దేవదాసి అయి ఉండి ఒక వేశ్యగా ముద్ర పడినప్పటికీ మహత్తరమైన ఆశయానికి జీవితాన్ని అర్పించి పైన ఉదాహరించిన ప్రాతస్మరణీయులలో ఒకరైన త్యాగరాజు  భక్తురాలిగా మారి ఒక యోగినిస్థాయిని అందుకున్న 'బెంగుళూర్ నాగరత్నమ్మ' వంటి అనర్ఘ రత్నాలు ఉండటంవల్ల ఈ జాతికి సంపన్నత చేకూరింది గాని నీతి నియమాలు గాలికొదిలి దేశాన్ని దోచుకుతింటున్న నేటి ప్రజలూ నాయకుల వల్ల రాలేదు. 

ఇటువంటి భాగవతోత్తములు ఇంకా ఈ భూమిలో పుడుతూ ఉండటం వల్లనే మన దేశం పుణ్యభూమి అనిపించుకోగలుగుతున్నది.అంతేగాని పనికి మాలిన రాజకీయులు,స్వార్ధపరులైన చవకబారు మనస్తత్వం ఉన్న ప్రజలూ ఉన్నందువల్ల ఈ దేశానికి ఘనత రాలేదు.

అటువంటి మహానుభావులలో ఒకరైన త్యాగయ్య సాధనామార్గాన్నీ భావ పరంపరనూ ఆయన వ్రాసిన కీర్తనల నేపధ్యంలో పరిశీలిద్దాం.ఆయన జీవితంలో నారదమహర్షి పాత్రనూ పరిశీలిద్దాం.అలాగే బెంగుళూర్ నాగరత్నమ్మ జాతకాన్నీ జీవితాన్నీ కూడా వచ్చే పోస్ట్ లలో పరిశీలిద్దాం.
read more " త్యాగయ్య నాదోపాసన -1 (మనం మరచిపోయిన సత్యమార్గం) "

11, ఫిబ్రవరి 2013, సోమవారం

జ్యోతిష్కులకు కొన్ని మంచి సూచనలు

నేడు జ్యోతిష్య విద్యమీద అభిరుచి చాలామందికి కలుగుతున్నది.ఇది మంచి పరిణామమే.చాలామంది జ్యోతిష్యరంగంలో పరిశ్రమ చేస్తూ ఇతరులకు జాతకాలు చెబుతూ పరిహార క్రియలు చెబుతూ చేయిస్తూ ఉండటం గమనిస్తున్నాను.ఇదీ మంచిదే.కాని ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.

ఏ రంగంలో నైనా పరిపూర్ణత,పరిపక్వత లేనిదే ఇతరులకు మనం సరియైన సహాయంగాని సేవగాని అందించలేము.మనకే పూర్తిగా విద్యమీద అవగాహన లేనప్పుడు ఇతరులకు ఏదో చెప్పబోవడం చాలా పొరపాటు.ఈ క్రమంలో ఔత్సాహిక జ్యోతిష్కులకు కొన్ని సూచనలు ఇస్తున్నాను గమనించండి.

  • జ్యోతిష్య విద్య ఇతర లౌకిక విద్యలవంటిది కాదు.ఇది దైవికమైన విద్య.కనుక దీనిని వ్యాపారానికి వాడరాదు.అలా వాడితే డబ్బు మీద ఆశ జ్యోతిష్కుని మనస్సును కలుషితం చేస్తుంది.అలాంటి మాలిన్యపూరిత మనస్సులో సత్యజ్ఞానం ప్రతిఫలించదు.కనుక డబ్బు సంపాదన కోసం జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఎప్పటికీ సఫలీకృతులు కాలేరు.ఎందుకంటే వారి ప్రాధమిక ఉద్దేశ్యంలోనే లోపం ఉన్నదికనుక.
  • జీవితమంతా నేర్చుకున్నప్పటికీ ఈ విద్యలో ఇంకా నేర్చుకోవలసింది మిగిలే ఉంటుంది.ఈ విద్యాభ్యాసం ఎన్నటికీ పూర్తి కాదు.కనుక జ్యోతిష్య విద్యార్ధి వినమ్రభావంతో ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉండాలి.విర్రవీగుడు అనేది ఈ రంగంలో ఏమాత్రం పనికిరాదు.
  • ఏదో కొన్ని పుస్తకాలు చదివినంత మాత్రానా,చెప్పిన కొన్ని జోస్యాలు నిజమైనంత మాత్రానా మొత్తం విద్య వచ్చేసినట్లు భావించి విర్రవీగడం చాలా పొరపాటు.ఇలాంటి గర్వం కనుక మనసులో ప్రవేశిస్తే అతని పురోగతికి ఆ రోజే ఆఖరిరోజు అవుతుంది.ఎందుకంటే గర్వము అహంకారము నిండి ఉన్న మనస్సులో సత్యజ్ఞానం నిలువలేదు.
  • తెలిసీ తెలియని రేమేడీలు చెప్పి వచ్చినవారి వద్ద డబ్బు తీసుకుంటే దానికి పదింతలు దోషం జ్యోతిష్కునికి అంటుకుంటుంది.ఒక పరిహారం చెప్పినపుడు ఆ పరిహారం అనేది మన ఊహమీద ఆధారపడి ఉండకుండా దానికి కొంత శాస్త్రీయత ఉండేటట్లు చూచుకోవాలి.మంత్ర శాస్త్రంలో ప్రావీణ్యత ఉండటం పరిహారక్రియలకు తప్పనిసరి.
  • వ్యక్తిగత జీవితంలో నియమనిష్టలు పాటించకుండా జ్యోతిష్య విద్యను గనుక ఇష్టం వచ్చినట్లు వాడితే దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి.ఈ విషయం నేను అనేకమంది జ్యోతిష్కుల జీవితాలలో గమనించాను.నవగ్రహములతో చెలగాటం నిప్పుతో పాముతో చెలగాటం కంటే ప్రమాదకరం.అలా చెలగాటం ఆడి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా నాకు తెలుసు.
  • జ్యోతిష్య విద్యను అభ్యసించేవారు ఎక్కడ బడితే అక్కడ తినకూడదు. ఎవరి చేతితోబడితే వారిచేతితో వండినవి ఇచ్చినవి తినకూడదు. ఎందుకంటే,ఆహారదోషమూ ఆశ్రితదోషమూ తీసుకున్న వారి మనస్సును ప్రభావితం చేస్తాయి. అటువంటి మనస్సులో సత్యజ్ఞానం ప్రతిఫలించదు.  
  • ధూమపానం,మద్యపానం,మాంసాహారం,జూదం,దుస్సాంగత్యం మొద లైనట్టి వ్యసనాలకు జ్యోతిష విద్యార్ధి ఆమడదూరంలో ఉండాలి.
  • ముఖ్యంగా జ్యోతిష్కుడైనవాడు మితవాక్కును పాటించాలి.పది మాటలు అవసరమైన చోట ఒక మాటనే మాట్లాడాలి.ఎందుకంటే అప్పుడు గాని అతనికి వాక్శుద్ధి కలుగదు.అతిగా వాగేవారికి జ్యోతిష్య విద్య ఫలించదు.జ్యోతిష్య విద్యలో వాక్కు ప్రధానం గనుక వాగ్నియమం తప్పనిసరి.అబద్దాలు చెప్పేవారికి జ్యోతిష్యం పట్టుబడదు అని గ్రహించాలి.
  • గర్వం,అహంకారం,కోపం,క్రూరస్వభావం,కుట్రలు చేసే స్వభావం, దురాశ, దూకుడుతనం,విచ్చలవిడితనం,చాడీలు చెప్పడం,ఒకరి చెడును కోరడం  మొదలైన స్వభావాలను ప్రవర్తనలను అన్నింటినీ జ్యోతిష్య విద్యార్ధి వదిలిపెట్టాలి.
  • నిత్యజీవితంలో మితాహారం,బ్రహ్మచర్యం,తపస్సు,మౌన ధ్యానం,దైవ ప్రార్ధనలతో కూడిన ఏకాంత జీవితాన్ని ఎక్కువగా గడపాలి. అప్పుడే అతనికి దైవ సంకల్పాన్ని గ్రహించే శక్తి వృద్ధి అవుతుంది.నియమ యుతమైన జీవితం గడపనివాడు ఎన్నటికీ జ్యోతిష్కుడు కాలేడు.
  • ఇన్ని బాధలు పడి చివరికి డబ్బు సంపాదించక పోతే ఉపయోగం ఏమిటి?అసలు ఇవన్నీ ఎందుకు?అని కొందరికి సందేహం రావచ్చు.ఇది పూర్తిగా పొరపాటు అభిప్రాయం.జీవిత పరమార్ధం ధన సంపాదన ఒక్కటే అయితే ఈ లోకంలో వ్యాపారం తప్ప ఇక తక్కినవి ఉండే అవకాశమే లేదు.జ్యోతిష్యవిద్యను ధనార్జనకు వాడవచ్చు కాని అదే పరమావధి మాత్రం కాకూడదు.అలా వాడటానికి కొన్ని నియమాలు పరిమితులు ఉన్నాయి. వాటికి లోబడి మాత్రమె ధనాన్ని స్వీకరించాలి.దురాశకు పోయి ఏవేవో తెలిసీ తెలియని మాయమాటలు వచ్చినవారికి చెప్పి మోసగిస్తే దారుణమైన కర్మ జ్యోతిష్కుని నెత్తిన తిష్ట వేసుకుని కూచుంటుంది.
  • ఇతరులకు చెడు చెయ్యడానికి ఈ విద్యను వాడరాదు. ఇలాకూడా చెయ్యవచ్చా అని కొందరికి సందేహం వస్తుంది.చెయ్యవచ్చు.ఒకరి జాతక చక్రం మనకు తెలిస్తే ఆ వ్యక్తిని మన చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చు.ఒకరకంగా ఇది చేతబడి లాంటిదే.అయితే అదృష్టవశాత్తూ ఇది చాలా రహస్య విద్య మరియు  అందరికీ అందుబాటులో ఉండని స్థాయి గనుక సరిపోయింది.కానీ అటువంటి చర్యలకు జాతక చక్రాన్ని వాడరాదు.అలా వాడితే ఫలితాలు మళ్ళీ వికటిస్తాయి. ప్రత్యేకించి కొంతమంది జాతకాలు ఇలాటి చర్యలకు చాలా అనుకూలంగా ఉంటాయి.అందుకనే పాతకాలపు జోస్యులలో కొందరు 'నీ చెయ్యి ఎవరికీ చూపించకు,నీ జాతకం ఎవరికీ చూపించకు'మొదలైన సలహాలు ఇచ్చేవారు. ఇప్పటివారికి ఆ రహస్యాలు తెలియవు గనుక ఆ మాటలు ప్రస్తుతం మనం ఎక్కడా వినలేకపోతున్నాము.
  • చాలామంది పురోహితులు జ్యోతిష్కులు ఈ విద్యను చాలా తేలికగా తీసుకోవడం నేను గమనించాను.అది వారి అజ్ఞానానికి సూచన.ఇది తేలికగా తీసుకునే విద్యకాదు.తేలికగా పట్టుబడే విద్య కూడా కాదు.కర్మతో చెలగాటం కనుక ఏదైనా తేడా వస్తే దాని ఫలితం జ్యోతిష్కుడు అనుభవించవలసి వస్తుంది.సాధారణంగా పురోహితులలో అహంకారం,గర్వం బాగా ఎక్కువగా ఉంటాయి.దానికి తోడు వారు పైకి ప్రదర్శించేటంత సాధనాబలం వారి లోపల ఉండదు.కనుక వారి చేతిలోనే ఈ విద్య దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • పురోహితులు మరియు సాధారణజ్యోతిష్కులు ఈ విద్యలో లోతైన పరిశ్రమ చేసినవారు కారు.వారికి ఏవో కొన్ని కొండగుర్తులు తెలిసి ఉంటాయి.వాటితో బండి నడిపిస్తారు గాని,పరిశోధనాత్మకంగా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు పోయే బుద్ధి వారిలో ఉండదు.వారు నిజమైన జ్యోతిష్కులు కాదలుచుకుంటే చాలా పరిశ్రమ చెయ్యవలసి ఉంటుంది. 
నిరంతరమూ నేర్చుకుంటూ,జీవితాన్ని పరిసరాలనూ వ్యక్తులనూ రకరకాల జాతకాలనూ పరిశీలిస్తూ,నియమ నిష్టలతో కూడిన జీవితాన్ని గడుపుతూ గర్వము అహంకారము లేని మనస్సు కలిగిన దైవభక్తులకే జ్యోతిష్యవిద్య యొక్క యదార్ధ స్వరూపం అవగతం అవుతుంది. 

ఈ విద్యను నిజంగా ఔపోసన పట్టాలి అనుకున్నవారు పైన సూచింపబడిన దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలు పొందగలుగుతారు.అలా కాకుండా అహంకారంతో ఏవో స్వల్ప ప్రయోజనాల కోసం ఈవిద్యను స్వార్ధానికి ఉపయోగిస్తే వారు ఒకరోజు కాకున్నా ఇంకొకరోజు ఇబ్బందుల పాలు కావడం తధ్యం.
read more " జ్యోతిష్కులకు కొన్ని మంచి సూచనలు "

9, ఫిబ్రవరి 2013, శనివారం

త్యాగరాజస్వామి జాతక పరిశీలన-2



సద్గురు త్యాగరాజస్వామి జీవితంలో ముఖ్యఘట్టాలు కొన్ని మనకు తెలుసు. కనుక జ్యోతిష సూత్రాలను ఉపయోగించి ఆయన జీవితాన్ని బట్టి అందులోని ముఖ్య సంఘటనలను బట్టి ఆయన జనన సమయం ఏమై ఉండవచ్చో ఊహిద్దాం. ఎప్పుడో చనిపోయినవారి గురించి ఇటువంటి చర్చలు వ్యాసాలు ఎందుకు? అన్న అనుమానాలు వచ్చేవారికి అసలు జవాబే ఇవ్వను. 'వారి స్థాయి అంతే' అని ఒక నమస్కారం వదిలి నా పనికి ఉపక్రమిస్తాను.

త్యాగరాజస్వామి జీవితంలో ముఖ్య ఘట్టములు--
  • 4-5-1767 న తిరువారూర్ లో జననం.
  • 1772 - ఐదవ ఏట తండ్రిచే అష్టాక్షరీ మంత్రోపదేశం.తీవ్రజ్వరంతో ప్రాణగండం.
  • 1774 - ఎనిమిదవ ఏట ఉపనయనం. వేదాధ్యయనం.
  • 1782 - తన పదిహేనవ ఏట మొట్టమొదటి కీర్తనగా 'నమో నమో రాఘవాయ' అనే కీర్తనను సున్నపు రాయితో గోడలమీద వ్రాశారు.
  • 1784 - పద్దెనిమిదవ ఏట వివాహం.అదే ఏడాది రామకృష్ణ యతీన్ద్రులను ఆయన దర్శించారు.శ్రీరామ తారకమంత్రాన్ని ఉపదేశించి 96 కోట్ల మంత్ర జపాన్ని చెయ్యమని యతీంద్రులు త్యాగయ్యను ఆదేశించారు.క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక లక్షాఇరవైఅయిదువేల జపం చేస్తూ 21 సంవత్సరాల కఠోరసాధనలో త్యాగయ్య అట్టి మహాజపయజ్ఞమును పూర్తిగావించారు.ఈ సాధనా,దీక్షా అనితర సాథ్యములు.
  • ఇరువదవ ఏట తండ్రి మరణం.
  • 1789/90 తన 23 ఏట మొదటి భార్య మరణం. 
  • 1802 - శరభోజి మహారాజు త్యాగయ్యను ఆస్థానంలో విద్వాంసునిగా ఉండమని ఉద్యోగమిస్తూ ఆహ్వానించిన సంఘటన జరిగింది.ఆ సందర్భం లోనే 'నిధి చాల సుఖమా' అనే కీర్తన ఉద్భవించింది.అప్పుడు త్యాగయ్యకు 36 ఏండ్లు.దాదాపు ఇదే సమయానికి తన గురువు సూచించిన 96 కోట్ల తారక మంత్రజపాన్ని ఆయన పూర్తి చెయ్యగలిగాడు. 
  • 1804 - అన్న జపేశుడు త్యాగయ్య యొక్క పూజామూర్తులను దొంగిలించి కావేరీ నదిలో పడవేసిన సంఘటన జరిగింది.తల్లి మరణం కూడా ఇదే సమయంలోనే జరిగింది.
  • 1845 - సతీమణి మరణం.
  • 6-1-1847 - దేహత్యాగం చేసి ఇష్టదైవసన్నిధికి చేరుకున్నారు.  
(ఈ వివరములు www.thyagaraja.org అన్న సైట్ నుండి ఇంకా కొన్ని ఇతర పుస్తకముల నుండి గ్రహించబడినవి.వారికి నా ధన్యవాదములు)

బీవీ రామన్ గారి 'నోటబుల్ హోరోస్కోప్స్' ప్రకారం జనన సమయం మిట్ట మధ్యాహ్నం. అంటే కటక లగ్నం అవుతుంది. ఏరాశి అయినా దాదాపుగా రెండుగంటలు ఉంటుందని మనకు తెలుసు. ఈ రెండుగంటలలో స్వామి జన్మ సమయం ఏమిటో,జీవిత సంఘటనలనుంచి,వర్గచక్రాలనుంచి,ఇతర జ్యోతిష్యసూత్రాల నుంచి పరిశీలించి చూద్దాం.

కటక లగ్నం ఆరోజున ఉదయం 10.35 నుంచి 12.45 వరకూ తిరువారూర్ లో నడిచింది.ప్రాధమికమైన ఈ ఆధారం నుంచి మనం ముందుకు వెళ్ళాలి.

త్యాగయ్య రెండు వివాహములు చేసుకున్నాడని మనకు తెలుసును. మొదటి భార్య యగు పార్వతాంబ వివాహము తదుపరి అతి కొద్ది కాలములోనే మరణించగా ఆమె చెల్లెలైన కమలాంబను ఆయన వివాహం చేసుకున్నారు. నవాంశకుండలిని పరిశీలించగా 11.21 నుండి 11.33 వరకూ తులా నవాంశ అవుతుంది. నవాంశలో రెండు రాశులలో మాత్రమె రెండు రెండు గ్రహములు కలసి ఉన్నవి.తులా రాశిలో రవి గురులు, వృశ్చిక రాశిలో కుజ కేతువులు ఉన్నారు.11.34 నుండి 11.46 వరకూ వృశ్చిక నవాంశ అవుతుంది. కనుక జనన సమయం 11.21 నుండి 11.46 లోపే ఉండవచ్చు. సతీమతల్లుల మృదుస్వభావమును,ధార్మిక మనస్తత్వమును గమనించగా రవి గురులు కలసి యున్న తులా రాశియే నవాంశగా సరిపోతున్నది. ఇందులో సూర్యుని నీచ స్తితివల్ల మొదటి భార్య గతించుట సూచింపబడుతున్నది.వక్ర గురువు రాశి కుండలిలో కూడా కుటుంబ స్థానములో ఉండుట గమనింపగా,తద్గ్రహ సూచితురాలైన ద్వితీయ కళత్రము గోచరురాలై తులా నవాంశయే స్థిరమని ద్రువీకరిస్తున్నది. కనుక త్యాగరాజస్వామి జననం 11.21 నుండి 11.33 లోపే అని నవాంశను బట్టి తెలియుచున్నది.

ఇక దశారీత్యా, రెండవ ఘటన అయినట్టి - అయిదవ ఏట ప్రాణగండమును పరిశీలిద్దాము. అప్పుడు శని/శుక్ర/కుజ దశ నడిచినది.శని శుక్రులిరువురూ ఈ లగ్నానికి మంచివారు కారు.శని మారకుడు.శుక్రుడు బాధకుడు. కుజుడొక్కడే యోగకారకుడు. అయినను ద్వాదశరాశి స్తితుడు గనుక తీవ్ర జ్వరముతో ప్రాణగండమును కల్పించిరి.కుజుని పంచమాదిపత్యము వల్ల తండ్రి చేత అష్టాక్షరీ మంత్రోపదేశమునూ ఆ తదుపరి ఇచ్చిరి. ఈ ఘటన సరిపొయినప్పటికీ పన్నెండు నిముషముల నిడివి మాత్రము అటులనే ఉన్నది. కనుక ఇంకను సూక్ష్మ స్థాయిలకు పోవలెను.


విమ్శాంశను పరిశీలించగా ఇటుల గోచరించును. 11.27 వరకు వృశ్చిక లగ్నము తదుపరి 11.33 వరకు ధనుర్లగ్నము అగుచున్నది. వృశ్చికమునకు లగ్నాధిపుడు కుజుడు ద్వాదశమున శుక్ర స్థానమున స్థితుడై ఆధ్యాత్మిక స్థాయిని సూచించుట లేదు. పంచమాదిపతి యగు గురుడు తద్ద్వాదశమున స్థితుడై యుండుట సద్గురుని స్థాయికి సరిగాదు.అదియే ధనుర్లగ్నమైనచో లగ్నాధిపతి మూడింటనుండి నవమస్తానమును చూచుటయు పంచమాదిపతి లాభమునను ఉండుటయే గాక ధర్మాధిపతి సూర్యుడగుచు శ్రీరాముని చూపుచున్నాడు.కనుక ధనుర్లగ్నమే విమ్శాంశ లగ్నమని తెలుచూ తత్కారణమున జనన సమయము 11.28 నుండి 11.33 లోపలే యని తేలుచున్నది.

స్వామి జీవితమునందు మిగిలిన వివరములు తేదీల వారీగా లేనందున ఆయన నిర్యాణ తేదీనే లంగరుగా తీసుకొనవలసి వచ్చుచున్నది. 6-1-1847 తేదీని బట్టి చూడగా 11.33 అనే సమయమే జనన సమయముగా తేలుచున్నది. ఎందుకనగా ఆ రోజున స్వామి జాతకమున కుజ/కేతు/రవి/శని దశ జరిగినది. కుజుడు ఈ లగ్నమునకు యోగకారకుడైనప్పటికీ ద్వాదశ భావ స్థితుడై ఉన్నాడు.కేతువు లగ్నమున ఉండి చంద్రుని సూచించు చున్నాడు.రవి దశమమున ఉచ్ఛ స్థానములో ఉండి శ్రీరామ సాయుజ్యమును సూచిస్తున్నాడు.శని సప్తమమారకాదిపతిగా బాధక స్థానంలో ఉంటున్నాడు.కనుక ఈ సమయాన్ని జనన సమయంగా తీసుకోవచ్చు.పుట్టినది మే నాల్గవ తేదీ కనుక సూర్యోదయము ఆరోజున 5.55 నిముషములకు అగుచున్నది.కనుక 11.33 నిముషములకు సూర్యుడు నడినెత్తికి వచ్చి మిట్టమధ్యాన్నము అవుతుంది. బీవీ రామన్ గారు వ్రాసిన మధ్యాహ్న సమయం ఆ విధంగా సరిపోతుంది.

ఇప్పుడు ఈ సమయరీత్యా ఇతర సంఘటనలు పరిశీలిద్దాము.

అయిదవ ఏట ప్రాణగండము -- మారిన సమయాన్ని బట్టి ఇప్పుడు శని/శుక్ర/రాహు దశ నడిచినట్లు గోచరిస్తుంది.శనిశుక్రుల పాత్ర పైన చర్చించాము.ఇక రాహువు శనిని సూచిస్తూ సప్తమంలో ఉండటం వల్ల ప్రాణ గండాన్నిచ్చాడు. కనుక 11.33 అనేది జనన సమయంగా సరిపోయింది. కాని ఈ సమయంలో తండ్రిచే అష్టాక్షరీ మంత్రోపదేశం మాత్రం కల్పితమని అది జరుగలేదని తోస్తుంది.ఎందుకంటే గ్రహస్తితులు ఏవీ అటువంటి సూచన ఇవ్వడం లేదు.పైగా ఉపనయనాత్పూర్వము చిన్నికూనకు మంత్రోప దేశములు చేయడం ఆచారం కాదు.కనుక ఈ సమయంలో అనారోగ్యం నిజమే అనియూ,మంత్రోపదేశం మాత్రం కల్పన అనియూ తోచుచున్నది.

1774 లో శనిలో సూర్యుని అంతర్దశ జరిగినప్పుడు ఉపనయనం అయింది.సూర్యుడు ఉచ్ఛ స్తితిలో ఉండటం చూడవచ్చు.కనుక ఆ సమయంలో సూర్యోపాసన అయిన బ్రహ్మోపదేశం జరగడం సముచితంగా కనిపిస్తుంది.

తదుపరి 1782 లో పదిహేనవ ఏట మొదటి కీర్తనను రచించారు. అప్పుడు జాతకంలో శని మహర్దశ ముగిసి బుధ మహర్దశ మొదలైంది.ఉచ్ఛరవితో కలసి దశమాన ఉన్న బుధునిదశ గనుక బుధాదిత్య యోగం పనిచేసి కవిత్వశక్తి వికసించింది అని భావించవచ్చు.దశలు మారినప్పుడు జీవిత గమనం కూడా మారడం చాలా జాతకాలలో గమనించవచ్చు.

1784 లో వివాహం - బుధ/బుధ దశలో వివాహం జరిగింది. బుధుడు దారాకారకుడై ద్వితీయాదిపతి యగు సూర్యునితో కలసి వివాహాన్నిచ్చాడు.కాని బుధుడు కేతు నక్షత్రంలో ఉండటమూ, సప్తమాధిపతి స్పర్శ లేకుండటమూ వల్ల ప్రధమకళత్ర నష్టం జరిగింది.

ఇదే సంవత్సరంలో వివాహం కంటే అతిముఖ్యమైన సంఘటన జరిగింది.అదే రామకృష్ణ యతీంద్రుల దర్శనం. మోక్ష పదవిని కరతలామలకం చెయ్యగల తారకమంత్రోపదేశం అదే సమయంలో జరిగింది.ఇక్కడ సూర్యుని ఉచ్ఛ స్తితి బ్రహ్మాండంగా పనిచేసింది. శ్రీరామభక్తుల జాతకాలలోనూ,గాయత్రీ ఉపాసకుల జాతకాలలోనూ సూర్యుని ఉచ్ఛస్తితిని గమనించాలి. సద్గురునకు సచ్చిష్యుడు తోడైతే ఏమి జరుగుతుందో అదే జరిగింది.తన గురువును మళ్ళీ జీవితంలో మరొక్కసారి ఆయన దర్శించలేదు.ఆయనెవరో ఎక్కడ నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎవరికీ కనిపించలేదు.కాని ఆయన ఉపదేశించిన మంత్రాన్ని నియమం తప్పకుండా రోజుకు లక్షా ఇరవై ఐదువేల జపం చొప్పున 21 సంవత్సరాల పాటు జపించి గురువు ఆదేశించిన 96 కోట్ల జపాన్ని 39 ఏళ్ళు వచ్చేసరికి పూర్తి చేశాడు త్యాగరాజస్వామి.ఇటువంటి అసాధ్య కార్యాన్ని అసలెంతమంది చెయ్యగలరో ఆలోచిస్తే వారిని ఈప్రపంచం మొత్తంమీద వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. కనుకనే త్యాగయ్య అంతటి మహానుభావుడైనాడు.అనవరతము రామనామ జపంచేత మంత్రసిద్ధి కలిగిన నోటివెంట వచ్చిన కీర్తనలు గానమూ కనుకనే నేడుకూడా వినినా పాడినా ఆ కీర్తనలు అంతటి ఆనందాన్నీ తన్మయత్వాన్నీ కలిగిస్తాయి.

1787 లో తండ్రి మరణం- ఆ సమయంలో బుధ/శుక్ర/గురు దశ నడిచింది.నవమ స్థానమైన మీనాత్ చూడగా బుధుడు బాధకుడు,శుక్రుడు మారకుడు,గురువు పితృసూచకుడు కనుక ఆ సమయంలో తండ్రి మరణం సరిగ్గా సరిపోయింది.

1792 లో తన గురువైన శొంటి వెంకటరమణయ్య గారి ఆహ్వానం మేరకు ఉగాది ఉత్సవ సభలో త్యాగరాజు గానంచేసి తన సంగీతప్రతిభను ప్రదర్శించాడు. తన సొంత కృతులైన 'జానకి రమణా","దొరకునా ఇటువంటి సేవ" అనే కీర్తనలను ఆలపించి గురువుగారిని ఇతర పండితులను ఆశ్చర్యానంద నిమగ్నులను గావించాడు. ఈ సమయంలో బుధ/రాహు/గురు దశ జరిగింది.బుధాదిత్యయోగ ఫలితంగా, సప్తమ రాహువు(దిగ్బల యుతుడైన శనిసూచకుడు) మరియు ఉచ్ఛగురువుల(నాడీసూత్ర రీత్యా)ప్రభావములు ఆ విధంగా పనిచేసి తన ప్రతిభను పండితుల సమక్షంలో ప్రదర్శించడమూ వారి మెప్పు పొందడమూ జరిగాయి. 

1802 - శరభోజి మహారాజు ఆహ్వానం-తిరస్కరణ- కేతువులో రాహు అంతర్దశలో జరిగింది. రాహు కేతువులేప్పుడూ ఇలాంటి ఏదో ఒక సంకట పరిస్తితిని సృష్టిస్తారు.ఎంతటి మహానుభావులైనా వీరి ప్రభావాన్ని తప్పించుకోలేరు.కనుకనే లౌకిక దృష్టిలో ఒక మహాదృష్టం రాజాహ్వానం రూపంలో వస్తే త్యాగయ్య వైరాగ్యభావనతో దానిని తిరస్కరించాడు. తత్ఫలితంగా అన్నగారైన పంచనదయ్య (జపేశుని) తో గొడవలూ,మేజిస్ట్రేట్ సమక్షంలో తండ్రి ఇచ్చిన ఇంటిని అన్నదమ్ములు రెండుగా పంచుకోవడమూ మొదలైన ఘటనలు జరిగాయి.ఆ సందర్భంలో రాత్రికిరాత్రి అన్నగారు తనను ఇంటినుంచి గెంటివేయగా వీధి అరుగుమీద రాత్రంతా త్యాగయ్య భార్యా కూతుర్లతో తలదాచుకున్నాడు.ఈ సమయంలో త్యాగయ్య స్నేహితుడూ శిష్యుడూ అయిన తంగిరాల రామారావు అనబడే సత్పురుషుడు ఆదుకున్నాడు.మధ్యవర్తిత్వం నెరపి ఆస్తిపంపకాలు జరిపించాడు.ఇవన్నీ రాహుకేతువుల ప్రభావమే అని వేరే చెప్పనక్కరలేదు.  

1804 లో తల్లి మరణించింది.అప్పుడు స్వామి జాతకంలో కేతు/శని దశ జరిగింది.చతుర్దాతిపతి అయిన శుక్రునితో కలసి మారకాదిపతి శని బాధకస్థానంలో ఉండటం చూస్తె ఈ దశలో తల్లి మరణం స్పష్టంగా కనిపిస్తుంది.

1845 భార్య మరణం - అప్పుడు కుజ/శని దశ జరిగింది.కుజుడు ద్వాదశంలో ఉండటమూ శని సప్తమాధిపతి కావడమూ గమనించాలి.

ఇక 1847 లో త్యాగయ్య దేహత్యాగం చేసి తన ఇష్ట దైవమైన శ్రీరాముని చేరుకున్నాడు.ఆయా గ్రహస్థితి వివరములు పైన చర్చించి యున్నాను. కనుక మరలా అవసరము లేదు. ఈ విధముగా త్యాగరాజ స్వామి జీవిత వివరములు మద్యాహ్నం 11.33 గంటలకు సరిపోవుచూ ఆయన జనన సమయం అదే అని నిరూపిస్తున్నవి.

స్వామి సాధనా విశేషములు వచ్చే పోస్ట్ లో పరిశీలిద్దాము.
read more " త్యాగరాజస్వామి జాతక పరిశీలన-2 "

4, ఫిబ్రవరి 2013, సోమవారం

మోహన్ సంతానం గారి కచేరి లింకులు

నిన్నటి పోస్ట్ లో మోహన్ సంతానం గారి కచేరి లింకులు ఇద్దామని ప్రయత్నించినా ఎందుకో అవి పనిచెయ్యలేదు. ఈ లోపల మల్లాది రఘురాం ప్రసాద్ గారు వాటిని 'యూ ట్యూబు'కు ఎక్కించారు. వారికి నా ధన్యవాదాలు. ఆ లింకులు ఇక్కడ చూడండి. కీర్తనల మాధుర్యాన్ని ఆస్వాదించి ఆనందించండి.

గిరిరాజసుత తనయ 

పవనజ స్తుతిపాత్ర పావనచరితా

ఎందఱో మహానుభావులు

నిధి చాల సుఖమా

నెనరుంచినాను

విడజాలదురా నా మనసు

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాతండ్రి

రామరామ నీవారము వేగ రారా

ఆవర్తనం

మంగళం
read more " మోహన్ సంతానం గారి కచేరి లింకులు "