“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, అక్టోబర్ 2013, శుక్రవారం

మన్నాడే

నాకు నచ్చిన గాయకులలో మొదటి వరుసలో మొదటిస్థానం మన్నాడే దే.ఆయన నిన్న బెంగుళూర్లో తన 94వ ఏట మరణించాడు. వీరవిద్య లైన మల్లయుద్ధమూ, బాక్సింగులలో ఛాంపియన్ కావాలని కలలుగని కంటిచూపు సహకరించని కారణంగా గాయకుడైన విచిత్ర జీవితం ఈయనది.సహజంగా తనకు దైవమిచ్చిన వరం అయిన మంచి స్వరమూ దానికితోడు మేనమామ కృష్ణచంద్ర డే  గురుత్వమూ,సంగీత కుటుంబంలో జన్మించడమూ ఇవన్నీ కలసి ఈయన్ను అమరగాయకుడిని చేశాయి.

ఈయన గురువు కృష్ణచంద్రడే(కేసీ.డే) పాతతరం వారికి సుపరిచితుడు.ఈయనకు చాలా చిన్నతనంలోనే కంటిచూపు పోయింది. అయినప్పటికీ వందలాది పాటలు పాడడమూ,బాణీలు కట్టడమే గాక 1935 ప్రాంతాలలో సినిమా సంగీతానికి బాణీలు కట్టేవాడు.SD Burman కు ఈయన సంగీతగురువు అంటే ఈయన స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. మన్నాడేవంటి గాయకుడు ఈనాడు మనకు లభించాడంటే అది ఈయన పుణ్యమే.కుస్తీ,బాక్సింగ్ వంటి క్రీడలలో తలమునకలుగా ఉన్న ప్రబోధచంద్ర డే(మన్నాడే)ను సంగీతం వైపు తీసుకొచ్చింది ఈయనే.

మన్నాడే జాతకాన్ని మొత్తం స్పృశించడం నా ఉద్దేశ్యం కాదు.ఇందులో రెండు విషయాలు మాత్రం జ్యోతిష్యపరంగా చూద్దాం.

వీరవిద్యల మీద అంత అభిమానం ఉండటానికీ,కంటిచూపు క్షీణిస్తూ రావడం వల్ల కెరీర్ మార్చుకొని సంగీతంలో ప్రవేశించి నేడు ఇన్ని కోట్లమంది గుండెలలో స్థానం సంపాదించుకోవడానికీ కొన్ని కారణాలు ఉండాలి. అవేమిటో మాత్రమె నేను చెప్పదలుచుకున్నాను.

1.వీరవిద్యలకు కారకుడైన అంగారకుడు బలీయమైన ఉచ్ఛస్థితిలో ఉన్న సూర్యునితో కలిసి స్వక్షేత్రంలో ఉండటం దీనికి కారణం.కుజుని బలంవల్ల సాహస క్రీడలన్నా,వీరవిద్యలన్నా జాతకునికి అమితమైన ప్రేమ ఉంటుంది.మన్నాడే జాతకంలో కూడా అదే జరిగింది.వీరిద్దరూ యముని భరణీ నక్షత్రంలో చాలా దగ్గరగా ఉండటం వల్ల హింసతో కూడిన ప్రాణాంతక విద్యలంటే ఇష్టం ఉంటుంది.అయితే వీరిపైన గల శనిదృష్టి వల్ల ఈయోగం భంగమైపోయింది. మాతృకారకుడైన చంద్రుని క్షేత్రం నుంచి శని దృష్టి ఉన్నందువలన తల్లివైపు నుంచి వచ్చిన దోషం ఈయనను కుస్తీలు బాక్సింగ్ వైపు పోకుండా ఆపి కెరీర్ ను మలుపు తిప్పింది.అయితే ఇదే ఈయనకు వరంగా మారింది.ధర్మస్వరూపుడైన శని భగవానుడు ఇచ్చే వరాలు ఇలాగే ఉంటాయి.

2.ఈయన మేనమామా,సంగీతాచార్య బిరుదాంకితుడూ, మంచి విద్వత్తు కలిగిన సంగీతజ్ఞుడూ అయిన కేసీ డే కూడా తన చిన్నతనం లోనే కంటి చూపును కోల్పోయాడు.మన్నాడే కు కూడా మంచి వయస్సులో ఉన్నప్పుడే కంటిచూపు తగ్గుతూ వచ్చింది.కనుక ఈ లక్షణం వీరి జీన్స్ లో వీరి తల్లిగారి వైపునుంచి సంక్రమించిందని చెప్పవచ్చు.దీనికి సూచనగా శని కర్కాటక రాశిలో దర్శనమిస్తాడు.

దీనికి ఇంకొక రుజువుగా చంద్రుడు ఈయన జాతకంలో కేతువుతో మ్రింగబడ్డాడు.తల్లివైపు నుంచి జీన్స్ లో వచ్చిన దృష్టిదోషం జాతకంలో ఇక్కడ కనిపిస్తుంది.

ఈయన ఒకసారి కళ్ళజోడు పెట్టుకుని కుస్తీపోటీలో పాల్గొంటూ ఉన్నప్పుడు అది విరిగి దాని వెండితుంపులు కంటికింద గుచ్చుకున్నాయిట.శుక్రుడు వెండికీ,చంద్రుడు కంటిచూపుకీ, కేతువు హటాత్తుగా జరిగే ప్రమాదాలకూ కారకులన్న విషయం గుర్తుంటే శుక్ర,చంద్ర,కేతువులు కలసి సహజరాశి చక్రంలో కళ్ళకు సూచిన అయిన వృషభంలో ఉన్న యోగపు ఫలితం ఎంత ఖచ్చితంగా జరిగిందో అర్ధమై ఆశ్చర్యం కలుగుతుంది.

బలీయమైన ఇదే శుక్రచంద్రుల యోగంవల్ల ఈయనకు ఇద్దరూ ఆడపిల్లలే జన్మించారన్నదీ వింతగొలిపే వాస్తవమే.

యధావిధిగా సరియైన జన్మసమయం దొరకనందున జాతకాన్ని క్షుణ్ణంగా చూడలేము. ఈయన జాతకంలో చంద్రుడు గాని శనిగాని ఆత్మకారకులౌతారు.కాని ఈయనకు చంద్ర లక్షణాలు లేవు. శని భగవానుని లక్షణాలు గట్టిగా ఉన్నాయి.ఒకవేళ చంద్రుడు ఆత్మకారకుడే అయితే కారకాంశ ధనుస్సో మకరమో అవుతుంది. అప్పుడు కూడా తృతీయంలో ఉన్న నీచబుధుని వల్ల గొప్ప సంగీతం పట్టుబడదు. కనుక ఈయన ఆత్మకారకుడు శనియే అని తేలుతుంది.

అప్పుడు కారకాంశ మీనం అవుతుంది.అక్కడనుంచి తృతీయంలో శుక్రచంద్రకేతుయోగం వల్ల సంగీత ప్రపంచంలో ధ్రువతారగా వెలిగే యోగం దక్కింది.చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నవిషయం గమనించాలి.కేతువు శుక్రుడిని సూచిస్తున్నాడు.కనుక ఇదొక గొప్పయోగం అయింది.అయితే కేతువువల్ల ఈయనకు దక్కవలసిన గౌరవం దక్కకుండా జారిపోయింది. ఈ అద్భుతమైన స్వరాన్ని బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదనే నాకనిపిస్తుంది. ఈయన కెరీర్ చివరలో వెకిలిపాటలకూ హాస్యగాళ్ళ పాటలకూ ఈయనను పాడమనడంతో ఈయనకు విసుగుపుట్టి సినిమాసంగీతం నుంచి పూర్తిగా విరమించుకున్నాడు.1940 లలో కేసీ.డే కూడా ఇదేపని చేశాడు.అప్పటికే బాలీవుడ్లో దిగజారుతున్న సంగీతవిలువలను భరించలేక ఆయన తప్పుకున్నాడు.వీరందరూ విలువలున్న కళాకారులు,అంతేగాని నేటి కొందరిలాగా చచ్చేవరకూ ఇదే చెత్తనటన నటిస్తూ ఉంటాను.ఇవే చెత్తపాటలు పాడుతూ ఉంటాను అనలేదు.

గౌరవించవలసిన వారిని సరిగ్గా గౌరవించలేకపోవడం మన భారతీయుల జీన్స్ లో ఉన్న అనేక దౌర్భాగ్యాలలో ఒకటి.

ఈయన జాతకంలో ఏకాకిగ్రహం(లోన్లీ ప్లానెట్) రాహువు అవ్వడం వలన,తన జన్మస్థలమైన బెంగాలునూ,కర్మస్థలమైన ముంబాయినీ వదిలి ప్రేమవివాహం చేసుకొని దూరంగా బెంగుళూరులో స్థిరపడ్డాడు.రాహువు ప్రేమవివాహాన్ని ఇస్తాడనీ,దూరప్రాంతాలకు తీసుకుని పోతాడని జ్యోతిష్యవేత్తలకు తెలుసును.రాహువు నైరుతిదిక్కునూ,కుజకారకత్వం వల్ల దక్షిణాన్నీ సూచిస్తున్నాడు.కనుక మన్నాడే దక్షిణాదిన స్థిరపడ్డాడు.

సినిమాపాటలను అలా ఉంచితే,రవీంద్రసంగీత్ లో ఈయన పాడిన పాటలు వినినవారికీ,ఈయన పాడిన ఘజళ్ళూ,కీర్తనలూ వినినవారికీ ఈయన స్వరమాధుర్యం ఏమిటో తెలుస్తుంది.పాడేపాటలో పూర్తిగా లీనమై ఆపాట యొక్క భావాన్ని సంపూర్తిగా ఆస్వాదిస్తూ ఏస్థాయిలో అయినా ఎలాంటి మెలికనైనా సులభంగా తిప్పుతూ సహజంగా పాడటం ఈయన ప్రత్యేకత. లోతైన ధ్యానశక్తి లేనిదే ఇది సాధ్యంకాదు.భారతీయ సంగీతంలోని మనోధర్మం అదే.

చాలామంది కళాకారులు తర్వాతి జన్మలలో గొప్ప యోగులౌతారు. ఎందుకంటే వారికీ వీరికీ కొన్ని సామ్యాలుంటాయి.భావంలో లీనం కావడం ఇద్దరికీ సమంగానే ఉంటుంది.అయితే కళాకారులకు వైరాగ్యం ఉండదు. యోగులకు అది ఉంటుంది.వైరాగ్యాన్ని పొందగలిగిన కళాకారుడు తర్వాతి జన్మలలో యోగి అవుతాడు.అందుకే చాలామంది యోగులలో కూడా కళాభినివేశం ఉండటం చూడవచ్చు.అది వారి పూర్వజన్మ సంస్కారం.

ఘంటసాలకు మంచిపేరు తెచ్చిపెట్టిన కొన్నిపాటలు హిందీలో మన్నాడే పాడిన ట్యూన్లకు కాపీలే.ఎక్కువగా వీటిని పెండ్యాల కాపీచేశాడు. ఉదాహరణకు 'రసికరాజ తగువారము కామా','శివశంకరీ శివానందలహరి' పాటల ట్యూన్లు మన్నాడే పాడిన 'ఛంఛం బాజేరే పాయలియా','ఝనక్ ఝనక్ తొరి బాజే పాయలియా'  పాటలకు చక్కని కాపీలు.ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి.మన తెలుగుసినిమా సంగీతదర్శకులు చాలామంది కాపీరాయుళ్ళే.మొత్తం ట్యూన్లో లేకుంటే తమకు కావలసినంతవరకూ అక్కడక్కడానో హిందీ పాటలనుంచి చక్కగా కాపీ ఎత్తేసేవారు.అవి తెలుగులో మంచి హిట్స్ అయ్యేవి.హిందీపాటల్ని కాపీ చెయ్యడంలో స్పెషలిస్టని సంగీతదర్శకుడు సత్యాన్ని అందరూ అనేవారుగాని కాపీకొట్టని తెలుగు సంగీతదర్శకులు చాలా అరుదు.

ఒక రాగాన్ని ఆధారంగా తీసుకుని పాట ట్యూన్ కట్టినపుడు,అదే రాగం ఆధారంగా తీసుకున్న ఇతరపాటలలోకూడా ఇదే ట్యూన్ చాయలు కనిపిస్తాయి.ఇది సహజం.కాని మొత్తం పాటనే చాలావరకూ కాపీ చెయ్యడం అనేది అంత మంచిదికాదు.అయితే ఆ పాటను బాగా ఇష్టపడే  సంగీత దర్శకులు కొందరు దానినే మొత్తం ఇంకోభాషలో దింపుకునే వారు.దానిని తప్పు అనికూడా అనలేము.ఆపాటమీద వారికున్న ఇష్టంగా దానిని తీసుకుంటే సరిపోతుంది.

కొత్తగా పాటలు నేర్చుకునేవారు మన్నాడే పాతపాటలు సరిగ్గా పాడగలిగితే చాలావరకూ వారికి పాటలు పాడటం వచ్చినట్లే లెక్క.వాటిలో అంతటి లోతూ స్వరవిస్తారమూ ఉంటాయి.ఇప్పట్లో సినిమాలలో పాటలు పాడుతున్న కోతిగాయకులు మన్నాడే దరిదాపుల్లోకి కూడా వచ్చి పాడలేరు అన్నది నగ్నసత్యం.

గాయకునికి టెక్నికల్ నాలెడ్జి ముఖ్యమే.కాని భావంలో లగ్నం కావడం అంతకంటే ప్రధానమైన విషయం.టెక్నికల్ నాలెడ్జి శరీరం వంటిదైతే, భావనిమగ్నత ప్రాణం వంటిది.ఆ నిమగ్నత లేకుండా పాడితే ఘంటసాల పాడిన భక్తిగీతాలకీ తర్వాతతరం గాయకులు పాడుతున్న భక్తిగీతాలకీ మధ్యన ఉన్న తేడాలాగా ఉంటుంది.

మన్నాడే స్వరంలో ఒక మాయ ఉన్నది.అది వినేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది.వేరేలోకాలకు అలవోకగా తీసుకుపోతుంది.ఆయన పాడుతుంటే ఒక యోగి ధ్యానస్థితిలో ఉండి భావంలో తదేకంగా లీనమై పాడుతున్నట్లు అనిపిస్తుంది.ఒక తాన్సేనో ఒక బైజూబావరానో పాడుతున్నట్లు అనిపిస్తుంది.

మహమ్మద్ రఫీ ఎంతమంచి వెర్సటైల్ సింగరో అందరికీ తెలుసు.మన్నాడే గురించి మహమ్మద్ రఫీ అనిన మాటను ఇప్పటికీ పాతతరం మరచిపోలేదు. రఫీ ఒకసారి ఇలా అన్నాడు -'మీరందరూ నా పాటలు వింటారు. నేను మన్నాడే పాటలు వింటాను'.

ఆ మహాగాయకునికి అంజలి ఘటిద్దాం.
read more " మన్నాడే "

16, అక్టోబర్ 2013, బుధవారం

దేవరగట్టు-మక్కా

ఈ లోకంలో మానవులు అసలైన ఆధ్యాత్మికతను వదలి ఏవేవో వారికి తోచిన తంతులలో కాలం వెళ్ళబుచ్చుతూ అవే దైవానికి చేర్చే మార్గాలని భ్రమిస్తూ ఉంటారు.కళ్ళు తెరచి చూస్తే,మన చుట్టూఉన్న ప్రపంచంలో దీనికి నిదర్శనాలు ఎన్నైనా కనిపిస్తాయి.

ప్రస్తుతం భూమ్మీద రెండుచోట్ల రెండురకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఒకటి - మక్కాలో సైతాన్ అంటూ రాతిస్తంభాన్ని లక్షలాదిమంది 'సాంప్రదాయబద్ధంగా' రాళ్ళతో కొట్ట్డడం.ఆతర్వాత లక్షలాది జంతువులను 'సాంప్రదాయబద్ధంగా' దేవుడికి బలివ్వడం.

రెండు - కర్నూల్ జిల్లా దేవరగట్టు గ్రామంలో దేవుడి ఊరేగింపు సందర్భంగా రెండు గ్రామాల ప్రజలు 'సాంప్రదాయబద్ధంగా' కర్రలతో తలలు పగలగొట్టుకోవడం.

నా దృష్టిలో ఈ రెండూకూడా మానవునిలోని సాంప్రదాయబద్ధమైన అజ్ఞానానికి సూచికలే.

ఎందుకని?

దైవానికి జంతువుల బలి ఎంతమాత్రం అవసరం లేదు.ఎందుకంటే అవికూడా దైవసృష్టిలో సృష్టించబడిన జీవాలే గనుక.మానవునికి మిగిలిన జంతువుల కంటె కొంచం తెలివి ఉన్నంతమాత్రాన వాటిని చంపే హక్కు అతనికి లేదు.'నీకోసమే వాటిని సృష్టించాను. వాటిని చంపి భుజించు' అంటూ దేవుడు చెప్పినట్లు కొన్ని మతగ్రంధాలలో ఉన్న మాటలకు వాస్తవికత లేదు.ఇవి జిహ్వచాపల్యాన్ని జయించలేని కొందరు మనుషులు వ్రాసిన మాటలేగాని దైవం చెప్పిన సూక్తులు కానేకావు.ఎందుకంటే దైవంనోట అలాంటి పక్షపాతంతో కూడిన మాటలు ఎన్నటికీ రావు.

సైతాన్ అనేది రాతిస్తంభంలో లేదు.అది మన చుట్టూ ఉన్నది.మన హృదయాలలో ఉన్నది.ఒక పక్క దేవుణ్ణి పూజిస్తున్నాం అని చెబుతూ ఇంకోపక్క సాటి మనుషులను చంపాలని ప్లానులు వేసే మనుషుల గుండెల్లో సైతాన్ ఉన్నది.ఆ సైతాన్ని చంపాలంటే మనమే చెక్కిన రాతిస్తంభాన్ని మనమే రాళ్ళతో కొట్టడం కాదు,మనల్ని మనమే రాళ్ళతో కొట్టుకోవాలి.

ఒక పక్కన ఉన్నతమైన భావనతో నిరాకార తేజోస్వరూపంగా దైవాన్ని కొలిచే ముస్లిములు ఇంకోపక్కన ఇలాంటి అనాగరిక ఆటవిక తంతులను ఎలా ఆచరిస్తారో నాకెప్పటికీ అర్ధం కాదు.

ఇక దేవరగట్టు విషయానికొస్తే,ఇది కూడా మక్కాలొ జరిగే తంతులాంటి అనాగరిక ఆచారమే.ఒక వర్గం దేవుణ్ణి ఊరేగిస్తుంటే ఇంకొక వర్గం దానిని అడ్డుకోవడం ఏమిటి?దానికోసం యుద్ధం ఏమిటి?కర్రలతో తలలు పగలగొట్టుకొని ఆనందించడం ఏమిటి?పైశాచికత్వం కాకపోతే దీనిని ఏమనాలి?

ఎప్పుడో కాలగతిలో ఏదో ఒక సందర్భంలో ఆయా ఘట్టాలు జరిగి ఉండవచ్చు. వాటిని శిలాశాసనాలుగా తీసుకొని తరతరాలుగా వాటిని గుడ్డిగా ఆచరించడానికి అవేమీ అంత ఆదర్శ సంఘటనలు కావు.వాటిలో ఉన్నత తాత్త్వికసత్యాలూ లేవు.

ఈ రెంటినీ విమర్శిస్తే ఆయా అనుయాయులకు పిచ్చికోపం వస్తుంది.ఈ రెంటినే కాదు.'సత్యం ఇదిరా బాబూ' అని చెప్పే ప్రతివాడిమీదా లోకానికి పిచ్చి కోపం వస్తూనే ఉంటుంది.ఎందుకంటే తరతరాలుగా తాము ఆచరిస్తున్న తర్కరహిత ఆచారాలలో సత్యం ఎంత? అని ప్రశ్నించుకోవడానికి చాలా గుండెధైర్యమూ సత్యనిష్ఠా ఉండాలి.దురదృష్టవశాత్తూ అవి మానవులలో ఎక్కడోకాని కనిపించవు.

దేవరగట్టులో జరుగుతున్న ఈ అనాగరిక తంతును ఆపడానికి వెళ్ళిన పోలీసులపై గ్రామస్తులు ఎదురుదాడి చెయ్యడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అనుకోవచ్చు.పైపెచ్చు,ఈ అనాగరిక ఆచారం ఆపితే దేవుడికి కోపం వస్తుందనీ,ఆయా గ్రామాలకు ఏదో చెడు జరుగుతుందనీ గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతారు.రోదసీయుగంలో కూడా అడవి మనుషులలాగా బ్రతుకుతామంటే ఎవరేం చెయ్యగలరు?

అలాగే, మక్కా వెళ్ళి సైతానంటూ రాతి స్తంభాన్ని రాళ్ళతో కొట్టి జంతువులను బలిచ్చి ఆనందంగా తిరిగివచ్చె సాధారణ ముస్లిం, తాను తిరిగివచ్చిన తర్వాత తనచుట్టూ ఉన్న సాటిమానవులనూ వారు పాటించే ఇతర మతాలనూ ద్వేషిస్తూ గుండెలనిండా కోపాన్ని కలిగిఉంటే దాని ప్రయోజనం ఏమిటి?సైతాన్ని అతడు ఏరకంగా చంపినట్లు?తాను ద్వేషించే సైతాన్ని తన గుండెల్లోనే పెట్టుకుని తిరిగివచ్చినట్లు కాదా?

ప్రతి మతంలోనూ ఇలాంటి పిచ్చిపిచ్చి ఆచారాలు చాలా కనిపిస్తాయి. అత్యున్నతములైన సత్యాలూ,అజ్ఞానపూరిత ఆచరణలూ ఒకేసారి రెండూ పక్కపక్కనే కనిపిస్తాయి.అసలైన సత్యాన్ని ఉన్నదున్నట్లు చెప్పిన బౌద్ధమూ అద్వైతమూ వంటి మతాలుమాత్రం కాలగర్భంలో కలసి ఎక్కడో నామమాత్రంగా మిణుకు మిణుకుమంటూ ఉండిపోతాయి.అవెవరికీ పట్టవు.

మనుష్యులు బయటకు ఎన్ని మాటలు చెప్పినా వారిస్వార్దాన్నీ,అజ్ఞానాన్నీ, హింసాప్రవృత్తినీ పెంచిపోషించే మతాచరణలే వారికి నచ్చుతాయి.లేదా ఆయా మతాలలో ఇలాటివాటిని ప్రేరేపించే తంతులనే వారు స్వీకరించి ఆచరిస్తూ ఉంటారు.మిగిలిన సత్యాలను వారు స్వీకరించరు.ఆచరించరు.అలాగే,సత్యాన్ని ఉన్నదున్నట్లుగా చెబితే కూడా ఎవరికీ ఎక్కదు.సాటి మానవులనూ సాటి జీవులనూ ప్రేమించలేనివారికి దైవత్వం ఎలా వస్తుందో నాకైతే ఎప్పటికీ అర్ధం కాదు.

మనుషులకు అసలైన మతమూ దైవాన్ని చేరే అసలైన మార్గమూ అక్కరలేదు.వీరికి కావలసినది అనవసరమైన తంతులూ,అజ్ఞానపూరిత ఆచారాలూ,వారి స్వార్ధాన్నీ భయాన్నీ అహంకారాన్నీ సంతృప్తిపరచే డొల్ల కార్యక్రమాలూ మాత్రమే.మనుషుల అజ్ఞానాన్నీ మొండితనాన్నీ ఆ దేవుడు కూడా మార్చలేడు.ఈ లోకం ఖర్మ ఇంతే.
read more " దేవరగట్టు-మక్కా "

10, అక్టోబర్ 2013, గురువారం

ప్రస్తుత పరిస్తితులమీదా? ఏం వ్రాయాలి?

ఇంతకు ముందు మీరు సామాజిక పరిస్తితులపైన పోస్టులు వ్రాసేవారు. ప్రస్తుతం అవేవీ వ్రాయడం లేదు.పూర్తిగా ఆధ్యాత్మికం మీదే వ్రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్న గొడవలు రాజకీయ ప్రజాసంక్షోభాల మీద జ్యోతిష్యపరంగా వ్రాయండి అని కొందరు నన్ను అడుగుతున్నారు.వారికోసం ఈ పోస్ట్.

ప్రజలూ దొంగలే
పాలకులూ దొంగలే
ప్రతి దొంగా ఎదుటివాడిని దొంగ అంటూ
దొంగలూ దొంగలూ కలసి
దేశాన్ని దోచుకుంటుంటే
ప్రజలు దద్దమ్మలై దానికి వంతపాడుతుంటే
ఏం వ్రాయగలం? ఏం చెప్పగలం?

ప్రస్తుత పరిస్తితుల పైన ఏమని వ్రాయాలి?
శపితయోగం గురించి గతంలో చాలా వ్రాసినాను. 
ప్రస్తుతం ఏమీ వ్రాయడం ఇష్టం లేకనే మిన్నకున్నాను.
సామూహిక కర్మ ప్రభావం.
అంతే.
read more " ప్రస్తుత పరిస్తితులమీదా? ఏం వ్రాయాలి? "