“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, ఆగస్టు 2020, సోమవారం

'యోగ యాజ్ఞవల్క్యము' E Book నేడు విడుదలైంది




మా 'పంచవటి పబ్లికేషన్స్' నుంచి 'యోగ యాజ్ఞవల్క్యము' అనబడే ఇంకొక మహత్తరమైన యోగశాస్త్రగ్రంధమును ప్రచురిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మొత్తం 504 శ్లోకములలో ప్రాచీన యోగశాస్త్రమును వివరించిన ఈ గ్రంథం దాదాపుగా రెండువేల సంవత్సరముల క్రిందటిది. ప్రాచీనమైన ఈ గ్రంథంలో వైదిక సాంప్రదాయానుసారమైన యోగమార్గం వివరింపబడి గోచరిస్తున్నది. వేదకాలపు మహర్షియైన యాజ్ఞవల్క్యఋషి తన సతీమణియైన బ్రహ్మవాదిని గార్గికి చేసిన బోధగా ఈ గ్రంథం చెప్పబడింది.

యాజ్ఞవల్క్యఋషి మహాతపస్సంపన్నుడు, ద్రష్ట, శాపానుగ్రహ సమర్థత కలిగిన అతిప్రాచీన వైదికఋషులలో ఒకరు. ఈయన బుద్ధునికంటే దాదాపు 400 సంవత్సరములు ముందటివాడని భావిస్తున్నారు. శుక్లయజుర్వేదము, శతపథబ్రాహ్మణము, బృహదారణ్యకోపనిషత్తు వంటి అనేక చోట్ల ఈయన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఉపనిషత్తులలో చెప్పబడిన అద్వైతభావనను అతిప్రాచీనకాలంలో ఈయనే మొదటిసారిగా లోకానికి బోధించినట్లు భావిస్తున్నారు. వైదికసంప్రదాయములను, యోగమార్గముతో మేళవించే ప్రయత్నాన్ని మొదటగా ఈయన చేశారు. ఈయనకు గార్గీ వాచక్నవి, మైత్రేయి అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరూ కూడా మహాసాధ్వులు. భర్తవలెనే తపస్సంపన్నులు. అంత ప్రాచీనకాలంలో కూడా బ్రహ్మవాదినులైన స్త్రీలు శాస్త్రాధ్యయనము మరియు తపస్సులను చేసేవారని, పండితసభలలో, ఋషిసభలలో కూర్చుని గహనములైన వేదాంతసిద్ధాంతములను ఋషులతో తర్కబద్ధంగా వాదించేవారని మనకు వీరి చరిత్రల వల్ల తెలుస్తున్నది.

ఈ గ్రంథం పన్నెండు అధ్యాయములతో నిండి ఉన్నది. వీనిలో, వైదికధర్మమార్గము, దాని విధులతోబాటు, వర్ణాశ్రమధర్మములు, అష్టాంగయోగము మరియు దాని విభాగములైన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, తంత్రసాధనయైన కుండలినీయోగము మొదలైనవి ఒక్కొక్కటి సవివరముగా చెప్పబడినాయి. ఆధ్యాత్మికమార్గంలో జ్ఞాన, కర్మ, యోగముల ప్రాముఖ్యతను వివరించిన యాజ్ఞవల్క్యులు, విధిపూర్వకంగా చేయవలసిన వైదికనిత్యకర్మలను చేస్తూనే, అష్టాంగయోగమును కూడా ఆచరించాలని బోధిస్తారు.


ఈ ప్రాచీనగ్రంథములోని భావములను, విధానములను, తరువాతి కాలమునకు చెందిన యోగోపనిషత్తులు, హఠయోగప్రదీపిక, ఘేరండసంహిత మొదలైన ఇతరగ్రంథములు స్వీకరించాయి. గాయత్రీమహామంత్రముతోను, ఓంకారము తోను చేయబడే వైదికప్రాణాయామము, అశ్వినీదేవతలు చెప్పిన మర్మస్థాన ప్రత్యాహారము, అగస్త్యమహర్షి ప్రణీతమైన ప్రత్యాహారము, సగుణ నిర్గుణ ధ్యానములు ఈ గ్రంథముయొక్క ప్రత్యేకతలు.


వైదికధర్మమార్గమును, అష్టాంగయోగమును, తంత్రమును సమన్వయం చేయాలన్న ప్రయత్నం ఈ గ్రంథం లో మనకు గోచరిస్తుంది. యోగాభిమానులకు ఈ ప్రాచీనగ్రంథం ఎంతో ఉత్తేజాన్ని కలిగించి, వారిని దైవమార్గంలో ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను.


యధావిధిగా ఈ గ్రంధం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

read more " 'యోగ యాజ్ఞవల్క్యము' E Book నేడు విడుదలైంది "

29, ఆగస్టు 2020, శనివారం

సిద్ధసిద్ధాంత పద్ధతి ప్రింట్ పుస్తకం విడుదలైంది


వరుసగా ప్రింట్ అవుతున్న నా పుస్తకాల పరంపరలో భాగంగా ఈరోజున  గోరక్షనాథులు రచించిన 'సిద్ధసిద్ధాంత పద్ధతి' ప్రింట్ పుస్తకాన్ని, హైదరాబాద్ లోని మా ఇంటినుంచి నిరాడంబరంగా విడుదల చేశాము.

ఈ పుస్తకం కూడా యధావిధిగా google play books నుంచి లభిస్తుంది.

read more " సిద్ధసిద్ధాంత పద్ధతి ప్రింట్ పుస్తకం విడుదలైంది "

24, ఆగస్టు 2020, సోమవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 8 ( వెదుకులాట - రమణమహర్షి సందర్శనం )

ప్రతిమనిషి జాతకంలోనూ దానికే ప్రత్యేకమైన కొన్ని గ్రహయోగాలుంటాయి. అవి ఆ మనిషియొక్క పూర్వకర్మను, ఈ జన్మలో అతనిదైన ప్రత్యేక జీవనమార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే  యూజీగారి జాతకంలో కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి కుటుంబస్థానంలో శని, బుధ, చంద్రుల కలయిక.

ఇది తీవ్రమైన ఆధ్యాత్మికయోగాలలో ఒకటి. ఈ యోగం చాలా లోతైన అంతర్ముఖత్వాన్నిస్తుంది. అదీగాక యూజీగారికి సరియైన సమయంలో సరియైన దశలు నడిచాయి. ఆధ్యాత్మిక దశలన్నవి మనిషి జీవితంలో చిన్నప్పుడే రావాలి. అవి ముసలితనంలో వస్తే ఉపయోగం ఉండదు. అప్పటికి అంతా అయిపోయి ఉంటుంది. కనుక అవి ఆ మనిషిపైన బలమైన ప్రభావాన్ని చూపలేవు. విజయవంతమైన ఏ జాతకంలోనైనా, గ్రహానుకూలత, దశానుకూలతలు తప్పకుండా ఉండాలి. అప్పుడే, అవి సూచించేది ఏ రంగమైనా, ఆ జాతకుడు వాటిలో విజయాలను సాధిస్తాడు. ఈ రెండూ లేకపోతే ఆ జీవితం వృధా అవుతుంది. మహనీయులందరికీ, ఆధ్యాత్మికదశలు చిన్ననాడే మొదలైనట్లు మనం వారివారి జీవితాలలో గమనించవచ్చు.

గురుదశ చివరలో పుట్టిన యూజీగారికి చిన్నప్పుడే 19 ఏళ్ల శనిమహర్దశ మొదలైంది. ఇది అంతర్ముఖత్వాన్నిచ్ఛే దశ. దానిననుసరించి 17 ఏళ్ల బుధ మహర్దశ జరిగింది. దాని తరువాత 7 ఏళ్ల కేతుదశ జరిగింది. ఈ విధంగా చిన్నతనం నుంచీ, మొత్తం 43 ఏళ్ల పాటు ఏకధాటిగా ఆయన జీవితంలో ఆధ్యాత్మిక సాధనను,  చింతనను, సిద్ధిని కలిగించే దశలు నడిచాయి. వీటి ఫలితంగా ఆయన 49 వ ఏట ఆయనకు సిద్ధి కలిగింది. దానినాయన 'కెలామిటీ (విపత్తు, మహాప్రమాదం)' అని పిలిచారు. సిద్ధి అనేటటువంటి ఆధ్యాత్మికపరమైన పదాన్ని ఆయన వాడలేదు.

యూజీగారిలో కనిపించే ఒక అద్భుతమైన అంశం ఏమంటే, ఎక్కడా ఆధ్యాత్మికపరమైన వేషంగాని, శ్లోకాలు, గ్రంధాలనుంచి ఉదహరించడం వంటి చేష్టలుగాని లేకుండా, ఒక జ్ఞాని లేదా అవధూతయొక్క సహజస్థితిగా మన గ్రంధాలలో చెప్పబడిన స్థితిలో ఆయన సూటిగా ప్రతిక్షణమూ  జీవించారు. ఆయన మాటలను పైపైన వినడం వల్ల, లేదా ఆయన వేషాన్ని చూడటంవల్ల, లోకులు ఆయనను సరిగ్గా అర్ధం చేసుకోవడం కంటే, మోసపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అందుకే లోకం ఆయన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయింది. ఒక గొప్ప జ్ఞానిని లోకం  పోగొట్టుకుంది.

అయితే, నిజంగా చూస్తే, ఆయనవల్ల మనకేమీ ఉపయోగం లేదు. ఒక జ్ఞాని వల్ల లోకానికి ఏమీ ఉపయోగం ఉండదు. తన దివ్యశక్తిని ఉపయోగించి  ఏ జ్ఞానీ లోకానికి ఎటువంటి మేలునూ చెయ్యడు. మనం 'మేలు' అనుకునేది ఆయనకొక పెద్ద విషయంగా కనిపించదు. మానవజీవిత పరిణామప్రక్రియలో ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకున్న మనిషి ఏ విధంగా ఉంటాడో మాత్రమే ఆయన్ను చూచి మనం గ్రహించవచ్చు. అయితే, దానివల్ల మనకేమీ మేలు జరుగదు. 

'మీలో ఆకలిని నేను కలిగించలేను' అని యూజీ తరచూ అనేవారు. మరెందుకు ఇలాంటివాళ్ళంటే మనకు ఆకర్షణ? అంటే, వాళ్ళు మన భవిష్యత్తుకు సూచికలు. మన భవిష్యత్తును వారిలో చూస్తుంటాం గనుక వారంటే మనం ఆకర్షించబడతాం. విపరీతమైన అంతరిక వెదుకులాట వల్ల యూజీగారు ఒక స్థితిని పొందాడు. దానిని 'సహజస్థితి' అన్నాడు. ఆ స్థితిలోనే తరువాతి జీవితమంతా గడిపాడు. అయితే ఇదంతా, 'కెలామిటీ' గా ఆయన జీవితంలో చెప్పబడే సంఘటన తర్వాత సహజంగా ఆయనకు వచ్చిన స్థితి. దానిగురించి తర్వాత ముచ్చటించుకుందాం.

ప్రస్తుతం కొంచం వెనక్కు వెళదాం.

గుడివాడలో తన విద్యాభ్యాసం తర్వాత ఆయన మద్రాస్ యూనివర్సిటీలో BA Hons (Philosophy&Psychology) కోర్సులో చేరారు. అప్పటికింకా శనిమహర్దశే ఆయన జీవితంలో జరుగుతోంది. చిన్నప్పటినుంచీ దివ్యజ్ఞానసమాజంతో ఉన్న సంబంధాల వల్ల అప్పటి అడయార్ ధియోసఫీకల్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన అరుండేల్ తోనూ, వైస్ ప్రెసిడెంట్ అయిన జినరాజదాసతోనూ ఆయనకు బాగా పరిచయం ఉండేది. వారికి కూడా ఆయనంటే మంచి అభిప్రాయమూ, ఆయన ఆధ్యాత్మిక భవిష్యత్తు మీద ఆశా ఉండేవి. ఆ పరిచయంవల్ల ఆయన అడయార్ సొసైటీలోనే ఉంటూ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉండేవాడు. వేసవికాలం సెలవలలో హిమాలయాలకు పోతూ వస్తూ ఉండేవాడు.

సైకాలజీలో చెప్పబడే 'మనసు' ఎక్కడుందో ఆయనకు అర్ధమయ్యేది కాదు. దేహానికున్న అనుభూతులు (sensations) మాత్రమే ఆయనకు కనిపించేవిగాని మనసనేది ఎక్కడా కనిపించేది కాదు. ఆ విషయాన్నే తన ప్రొఫెసర్ ను ఆయన అడిగాడు. ఆ సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా అదే యూనివర్సిటీలో పనిచేసేవారు. ఇంకొక బెంగాలీ ప్రొఫెసర్ కూడా ఈయనకు ఫిలాసఫీ పాఠాలు చెప్పేవాడు. ఆయన్నే - ''మనసు' అంటే ఏమిటి? మీరు చెప్పే మనసు నాకెక్కడా కనిపించడం లేద' ని యూజీ అడిగారు.

దానికాయన ఇలా అన్నాడు - 'చూడు. నీకు పరీక్ష పాసవ్వాలని ఉంటే, పుస్తకాలలో చదివిన దానిని ముక్కున పెటుకుని పరీక్ష వ్రాయి. డిగ్రీ చేతికొస్తుంది. అంతేగానీ ఇలాంటి ప్రశ్నలడక్కు'. మనసంటే తనకు కూడా తెలీదని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నాడు. ఆయనలోని నిజాయితీ యూజీకి నచ్చింది.

నా చిన్నప్పుడు నా గురువులలో ఒకరిని నేనూ ఇదే మాట అడిగాను. అప్పుడు నాకు 13 ఏళ్ళుంటాయి. అప్పట్లో నేను వేదాంతగ్రంధాలను విపరీతంగా చదువుతూ ఉండేవాడిని, వాటిల్లో చెప్పబడిన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే పదాలు నాకర్ధమయ్యేవి కావు.

'మనసంటే ఏమిటి ?' అని అడిగాను.

'ఆలోచనే మనసు' అని ఆమె చెప్పారు.

కొన్నాళ్ళు దీనిని గమనించాక నాకర్ధమైన దానిని మళ్ళీ ఇలా అడిగాను.

'ఆలోచన ఏముంది? ఉన్నవి అనుభూతులు, జ్ఞాపకాలు, వాటిని మళ్ళీమళ్ళీ కావాలనుకోవడమే కదా? అని నేనడిగాను.

అంటే, ఇవే మాటలను నేను వాడలేదు. ఇంత పెద్ద మాటలు ఆ వయసులో నాకు తెలీవు కూడా.

'ఏదైనా 'ఇట్లా' అని అనిపిస్తుంది. అది నచ్చితే మళ్ళీ అలాగే అవాలనిపిస్తుంది. అది గుర్తుంటుంది. ఇదిగాక మనసంటే ఏమిటి?' అనడిగాను.

'అలా అనుకోవడమే మనసు' అని ఆమె అన్నారు. ఆ సమాధానం నన్ను సంతృప్తి పరచలేదు. కానీ కాదనే ధైర్యం అప్పట్లో లేదు. నిజమేనేమో అని ఊరుకున్నాను. ఆ ఘట్టం అంతటితో ముగిసింది.

ప్రతి ఆధ్యాత్మిక ప్రయాణీకునికీ ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న ఎదురౌతుంది. దానికి జవాబు కొందరికి దొరుకుతుంది. మరికొందరికి దొరకదు. దొరకడానికీ, దొరకకపోవడానికీ భేదం వెదుకులాటలోని తీవ్రతాలోపమేనేమో? కొందరు వారి వెదుకులాటను మధ్యలోనే ఆపేస్తారు. ఇంకొందరు ఆరిపోని తపనతో దానిని చివరివరకూ కొనసాగిస్తారు. కానీ ఏ వెదుకులాటా ఎప్పుడూ అంతం కాదు. కొన్నాళ్ళు ఆరిపోయినట్లు కనిపించినా మళ్ళీ అది రగులుతుంది, వెలుగుతుంది.

దీన్నుంచి మనకొక విషయం అర్ధమవుతుంది. యూజీ గారికి మనసనేది చిన్నప్పటి నుంచే లేదు. లేదా, మిణుకు మిణుకు మంటున్న దీపంలాగా ఉంది. దీనికి సూచనగా ఆయన జాతకంలో చంద్రుడినీ, బుధుడినీ, యముడైన శని మ్రింగేశాడు. మనసుకు కారకుడు చంద్రుడనీ, బుద్ధికి కారకుడు బుధుడనీ మనకు తెలుసు. శనికి యముడని పేరుంది. మరణానికి నాశనానికి శని కారకుడు. కనుక మనస్సూ బుద్ధీ అన్నవి పుట్టుకతోనే యూజీగారిలో చాలా తక్కువస్థాయిలో ఉన్నాయన్న సంగతి ఈ పరిశీలనతో అర్ధమౌతున్నది. గతజన్మలలో ఎంతో సాధన చేసినవారికి మాత్రమే ఇలాంటి స్థితి పుట్టుకతో వస్తుంది. ఇది యోగగ్రంధాలలో చెప్పబడిన అమనస్కస్థితికి కొద్దిగా ముందుండే పరిస్థితి.

చిన్నప్పటినుంచీ తాతగారింట్లో చూచిన అతి ఆచారాలమీద, ఆచరణలో కనిపించని గొప్ప మాటలు సూక్తులమీద, అప్పటికే ఆయనకు అసహ్యం ఏర్పడి ఉన్నది. డివైన్ లైఫ్ సొసైటీ శివానందగారి 'ఆవకాయ' సంఘటనతో గురువుల మీద కూడా నమ్మకం పోయింది. కానీ లోలోపలి తృష్ణ చావకపోగా ఇంకా ఎక్కువైపోయింది. గ్రంధాలూ, మహనీయులూ చెబుతున్న 'మోక్షం' అంటే ఏమిటి? అది నిజంగా ఉందా? ఉంటే ఇంత సాధన చేస్తున్న తనకు అదెందుకు దొరకడం లేదు? అన్న విసుగు, కోపం ఆయనలో బాగా పెరిగిపోయాయి. కానీ, దారి చూపించేవారు కనపడటం లేదు. వెతుకుతున్నది దొరకడం లేదు. ఏం చేయాలి?

హిమాలయాలలో చేసిన సాధనల వల్ల ఆయనకు చాలా రకాల సమాధిస్థితులు కలిగాయని ఆయనే అన్నారు. కానీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఇదొక వింతగా మనకు అనిపిస్తుంది. కానీ ఇది నిజమే.

మనస్సు అన్నది ఉన్నంత వరకూ ఎన్ని రకాలైన సమాధిస్థితులు కలిగినప్పటికీ, మనిషికి అంతిమశాంతి లభించదు. మనోనాశం అనేది కలిగినప్పుడు మాత్రమే 'మోక్షం' లభిస్తుంది. ఈ విషయాన్ని వివేకానందస్వామి జీవితంలో కూడా చూడవచ్చు. శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే ఆయనకు నిర్వికల్పసమాధి కలిగింది. కానీ, ఆయన పోయిన ఎన్నో ఏళ్ళకు, స్వామి తన పరివ్రాజక దశలో దేశమంతా తిరుగుతున్న దశలో, ఎక్కడో రాజస్తాన్ నుంచి కలకత్తాలోని తన సోదరశిష్యులకు వ్రాసిన ఉత్తరంలో ఇలా అంటారు - 'నాకు దైవసాక్షాత్కారం కలగలేదు. నాకు శాంతి లభించలేదు. ఎంతగానో దానికోసం తపిస్తున్నాను. కానీ అది కనుచూపు మేరలో కనపడటం లేదు'.

దీనర్ధం ఏమిటి? నిర్వికల్ప సమాధిని పొందిన వ్యక్తి ఇలా అనడం ఏమిటి? వింతగా ఉంది కదూ ? అదేమరి ! మామూలుగా మనం అనుకువేదీ, నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో జరిగేదీ పూర్తి భిన్నంగా ఉంటుంది. మనం పుస్తకాలలో చదివేది, టీవీ ప్రవచనాలతో వినేది అంతా చాలావరకూ చెత్త మాత్రమే ! అక్కడ జరిగేది ఒకలాగా ఉంటుంది, మనం చెప్పుకునే ముచ్చట్లు మరో రకంగా ఉంటాయి. 

ధ్యానంలో అనుభవాలు, దర్శనాలు, సమాధిస్థితులు  వేరు. కొద్ది సాధనతో అవి చాలా తేలికగానే కలుగుతాయి. కానీ మనోనాశం, అహంకార నిర్మూలనం అనేవి అంత తేలికగా దక్కవు. వాటిని పొందటం టీవీలలో ప్రవచనాలు వినడమంత తేలిక, పుస్తకాలూ చదవడమంత సులభమూ, పురాణకాలక్షేపం వంటి చవకబారు పనీ కాదు. వినేవారికే కాదు, ఆ ప్రవచనాలు చెప్పేవారికి కూడా ఈ స్థితులేవీ అందుబాటులో ఉండవు. దక్కవు కూడా! అంతరికాన్వేషణలో రగిలిపోతూ, చావు అంచులవరకూ పోయి, దాని తర్వాత ఏముందో రుచి చూచినవానికి మాత్రమే అవి లభిస్తాయి. మనోనాశమంటే ఊరకే కబుర్లు చెప్పడం కాదు !

ఆధ్యాత్మిక మార్గం, మిఠాయి అంగళ్లు ఉన్న ఒక బజారు వంటిది. అక్కడ, కొందరు మౌనంగా మిఠాయిలు తింటూ ఉంటారు, కొంతమంది ఆ తింటున్నవారిని చూస్తూ ఉంటారు, మరికొంతమంది ఊరకే వాగుతూ మిఠాయి తింటే ఎలా ఉంటుందో, ఎలా దానిని తినాలో ఇతరులకు వివరిస్తూ ఉంటారు. కానీ, తినేవాడికొక్కడికే దాని రుచి తెలుస్తుంది. చూసేవాడికీ తెలియదు, వాగేవాడికీ తెలియదు. వినేవాడికి అసలే తెలియదు. అనుభవం లేనివాడు వాగుతుంటే, వాడి వాగుడును వినేవాళ్ళు మరీ దద్దమ్మలు. వాళ్ళకసలేమీ తెలియదు, అర్ధంకాదు. లోకమంతా ఇలాంటి వినే  దద్దమ్మలే ఎక్కువగా ఉంటారు. ఇదీ ఆధ్యాత్మిక లోకపు మాయాజాలాల్లో ఒక మాయాజాలం !

శ్రీరామకృష్ణులు దీనినే ఇంకో విధమైన తేలికపదాలలో చెప్పారు.

'కొంతమంది సముద్రాన్ని గురించి విన్నారు. కొంతమంది దానిని దూరం నుంచి చూచారు. మరి కొంతమంది దానిదగ్గరకు వెళ్ళారు. అతి కొద్దిమంది దాని నీటిని రుచి చూచారు. వారిలో మరీ అతి కొద్దిమంది సముద్రంలో అడుగు పెట్టారు.  అలా, అడుగుపెట్టినవారిలో కూడా ఒకరో ఇద్దరో మాత్రమే దానిలో కరగిపోయారు' అన్నారాయన.  సాధనా సారాంశమంతా ఇంతే !

మనసు దేనినైనా ఊహించగలదు. దేనినైనా పొందగలదు. కానీ ఆ ఊహలలో, ఆ దర్శనాలలో అంతిమశాంతి లేదు. నిజంగా చెప్పాలంటే ఎంతటి గొప్ప అనుభవమైనా మన ఊహే ! మనసనేది ఉన్నంతవరకూ, ఇంకా చెప్పాలంటే, నేననేది ఉన్నంతవరకూ మనిషికి శాంతి లేదు. కానీ అదెలా పోతుందో తెలియదు. నేననేది ఎక్కడుంది? అని వెదికితే మాత్రం అదెక్కడా కనపడదు. అది లేదు, కనపడదు, కానీ మనల్ని ఒదిలి పోదు, దానితోనే దాని చుట్టూతానే అంతా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ఇదే అసలైన సమస్య.   

అలాంటి నిస్సహాయస్థితిలో ఉన్నపుడు ఒక స్నేహితుని సలహాతో యూజీ, రమణమహర్షిని దర్శించారు. రమణాశ్రమంలో రమణమహర్షితో జరిగిన భేటీ, ఆయన జీవితాన్ని మరొక మలుపు తిప్పింది.

(ఇంకా ఉంది) 

read more " U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 8 ( వెదుకులాట - రమణమహర్షి సందర్శనం ) "

14, ఆగస్టు 2020, శుక్రవారం

'ఇలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా?' - ప్రశ్నశాస్త్రం

10-8-2020 శనివారం ఉదయం 11. 30 కి ఒక ఫోనొచ్చింది.

'నమస్తే అండి సత్యనారాయణ శర్మగారేనా?' అడిగిందొక మహిళాస్వరం.

'అవును' అన్నా ముక్తసరిగా. ఆడవాళ్ళ ఫోనంటేనే నాకు భయమూ, చిరాకూ రెండూ ఒకేసారి కలుగుతాయి. ఎందుకంటే, వారిలో విషయం ఉండకపోగా అనవసరమైన నస మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే చిరాకు కలిగిస్తుంది. సోది చెప్పకుండా సూటిగా విషయం మాట్లాడే ఆడవాళ్లను చాలా తక్కువమందిని ఇప్పటిదాకా చూచాను. ఆఫ్ కోర్స్ ! వాళ్ళ అవసరం ఉన్నపుడు మాత్రం చాలా సూటిగానే మాట్లాడతారనుకోండి. అది వేరే విషయం !

'నా పేరు హేమలత. ఫలానా వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేశారు' అంది.

'అలాగా. చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు?' అడిగా.

'నేనొక సమస్యలో ఉన్నాను. ప్రశ్న చూస్తారని అడగడానికి ఫోన్ చేశా' అన్నదామె.

రిఫర్ చేసినాయన నా క్లోజ్ ఫ్రెండ్ కనుక వెంటనే ఎదురుగా ఉన్న లాప్ టాప్ తెరిచి ప్రశ్నచక్రం వేశా. తులాలగ్నం అయింది. చంద్రుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని సూటిగా చూస్తున్నాడు.

'మీ వివాహజీవితం గురించి మీరు అడగాలనుకుంటున్నారు' అన్నాను.

'నిజమే. అదే నా సమస్య' అందామె.

సప్తమాధిపతి కుజుడు ఆరో ఇంట్లో ఉన్నవిషయాన్ని, సుఖస్థానంలో శని ఉన్న విషయాన్ని గమనిస్తూ 'మీ ఆయనకు మీకూ గొడవలు. మీకు సంసారసుఖం లేదు' అన్నాను.

'నిజమే. కానీ ఆ గొడవలు ఎందుకో చెబితే మీరు ఆశ్చర్యపోతారు' అందామె.

అంటే, మామూలు సమస్య కాదన్నమాట. అంతగా చెప్పలేని సమస్యలేముంటాయా? అని ఒక్క క్షణకాలం పాటు ఆలోచించాను.

భర్తను సూచించే కుజునినుండి అతని మనస్సుకు సూచిక అయిన నాలుగో ఇంట్లో ఉఛ్చరాహువు శుక్రుడు ఉండటాన్ని గమనించాను. ఈ యోగం ప్రకారం వివాహేతర సంబంధాన్ని మొగుడే ప్రోత్సహిస్తూ ఉండాలి. కానీ ఈ విషయాన్ని ఎలా అడగడం? బాగోదేమో అని సంశయిస్తూ ఉండగా -'తన స్నేహితులతో బెడ్ పంచుకోమని మా ఆయన పోరు పెడుతున్నాడు. ఈ విషయాన్ని చెప్పినా ఎవరూ నమ్మరు' అందామె.

'ఓరి దేవుడో?' అని తెగ ఆశ్చర్యమేసింది. వాళ్ళాయన వృత్తి ఏంటా అని గమనించాను. కుజుని నుండి దశమంలో ఉఛ్చకేతువు గురువు ఉన్నారు. గురువు వక్రీస్తూ వృశ్చికంలోకి పోతున్నాడు. శని వక్రీస్తూ ధనుస్సులోకి వచ్చి కేతువును కలుస్తున్నాడు. దశమాన్ని ఉఛ్చరాహువు శుక్రుడు చూస్తున్నారు. అంటే, పైకి నీతులు చెబుతూ లోలోపల అనైతికపు పనులు చేసే రంగమన్నమాట. అదేమై ఉంటుంది? రాహుశుక్రులు సహజతృతీయమైన మిధునంలో ఉంటూ సినిమా ఫీల్డ్ ని సూచిస్తున్నారు.

'మీ ఆయనది సినిమా ఫీల్డా?' అడిగాను.

'అవును. మా ఆయన ఫలానా' అని చెప్పిందామె.

నాకు మతిపోయినంత పనైంది.

'ఎందుకలా?' అడిగాను ఆమెనోటినుంచి విందామని.

'బిజినెస్ ప్రొమోషన్ కోసం, కొత్త కొత్త సినిమా ఛాన్సులకోసం, తన ఫ్రెండ్స్ దగ్గర, కొంతమంది నిర్మాతల దగ్గర పడుకోమని గొడవ చేస్తున్నాడు. భరించలేక విడాకులు కోరుతున్నాను' అందామె.

'ఆ పనికోసం కాల్ గాళ్స్  చాలామంది ఉంటారు. పెళ్ళాన్ని పడుకోబెట్టాల్సిన పనేముంది?' అడిగాను.

'కాల్ గాళ్స్ వాళ్లకూ తెలుసు. మా ఆయన వాళ్లకు చెప్పక్కర్లేదు. హీరోయిన్స్ కంటే అందంగా పుట్టడం నా ఖర్మ' అందామె.

'మంచిపని, గో ఎహెడ్. మీకు సపోర్ట్ గా పేరెంట్స్ లేరా?' అన్నాను.

'మా నాన్న ఒక ఉన్నతాధికారి. కానీ రెండేళ్లక్రితం చనిపోయారు. అంతేకాదు అప్పటినుంచీ మా మామగారు మా అమ్మను వేధిస్తున్నాడు' అన్నదామె.

నా తల గిర్రున తిరిగింది.

'నేను విన్నది నిజమేనా?' అని అనుమానంగా మళ్ళీ చార్ట్ లోకి తలదూర్చాను.

కుజునినుంచి దశమాధిపతి గురువు, ఈమె భర్త తండ్రిని, అంటే మామగారిని సూచిస్తాడు. శుక్రునినుంచి నాలుగో అధిపతి బుధుడు ఈమె తల్లిని సూచిస్తాడు. గురువు వక్రించి వృశ్చికంలోకి వచ్చి, కోణదృష్టితో బుధుడిని చూస్తున్నాడు. గురువు మీద రాహుశుక్రుల దృష్టి ఉంటూ ఆమె చెబుతున్నది నిజమే అని సూచిస్తున్నది.

'బాబోయ్!' అనుకున్నా.

'మీ మామగారు మీ అమ్మకు వరసకు అన్నయ్య అవుతాడు కదమ్మా?' అడిగాను.

'అవునండి. అమ్మ ఆయనతో అదే అంటే, 'ఈ ఫీల్డ్ లో అలాంటి  వరసలేవీ ఉండవు. మీ అమ్మాయిని మావాడు చెప్పినట్లు వినమను. నువ్వు నేను చెప్పినట్లు విను' అని ఫోర్స్ చేస్తున్నాడు' అందామె.

'మరి మీరేం అనుకుంటున్నారు' అడిగాను.

'ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చేశాను. అమ్మ దగ్గర ఉంటున్నాను. మంచి లాయర్ దగ్గర డైవోర్స్ కి కేస్ ఫైల్ చేశాను. గెలుస్తామా? ఎన్నాళ్ళు పడుతుంది?' అడిగింది.

దశలు గమనించాను. ప్రస్తుతం కేతువు - రాహువు - రవి నడుస్తోంది. ఇప్పుడు పని జరగదు. భవిష్యత్ దశలను గమనిస్తూ "2021 జనవరి - మార్చి మధ్యలో మీ పని జరుగుతుంది, నువ్వు కేసు గెలుస్తావు. ధైర్యంగా ఉండు. పోరాడు." అని చెప్పాను.

'థాంక్స్' అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది.

నాలో ఆలోచనా తరంగాలు మొదలయ్యాయి.

'ఇలాంటి మొగుళ్ళు, ఇలాంటి మామలు కూడా ఉంటారా? ఏమో? భార్యే అలా చెబుతున్నపుడు నమ్మకుండా ఎలా ఉండగలం? అందులోనూ సినిమా ఫీల్డ్ లో ఉన్నంత రొచ్చు ఇంకెక్కడా ఉండదన్నది అందరికీ తెలిసినదే, నిజమే కావచ్చు' అనుకున్నా.

'ఈ భూమ్మీద మనం బ్రతికేది నాలుగురోజులు. ఇక్కడ మన బ్రతుకే శాశ్వతం కాదు. అందులో డబ్బనేది అసలే శాశ్వతం కాదు. వీటికోసం ఇంత దిగజారాలా? పైగా ప్రతిరోజూ కరోనాతో ఎంతోమంది పోతున్నారని వింటున్నాం. మనకు తెలిసినవాళ్ళే చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంత ఛండాలమా?' అనిపించింది.

మనకనిపిస్తే ఏముపయోగం? వాళ్ళకనిపించాలి కదా? వాళ్లకు అవే ముఖ్యంగా కన్పిస్తున్నాయి మరి ! మనమేం చెయ్యగలం? ఈ ప్రపంచంలో ఎవరు చెబితే ఎవరు వింటారు గనుక? ఎవరి ఖర్మ వారిది. అంతే.

ఆలోచన ఆపి నా పనిలో నేను పడ్డాను.

కథకంచికి మనం మన పనిలోకి.

(వ్యక్తిగతకారణాల రీత్యా పేర్లు, కధనం మార్చడం జరిగింది. కధనం మారినా, కధ నిజమైనదే !)

read more " 'ఇలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా?' - ప్రశ్నశాస్త్రం "

8, ఆగస్టు 2020, శనివారం

కోజికోడ్ విమాన ప్రమాదం - జ్యోతిష్య కారణాలు

7-8-2020 న 19.40 నిముషాలకు కేరళలోని కోజికోడ్ (కాలికట్) లోని కరిపూర్ ఎయిర్ పోర్ట్ లో దిగబోతున్న విమానం, రన్వే అవతలున్న పెద్దగుంటలో పడిపోయి చక్కగా రెండుముక్కలుగా చీలిపోయింది. 190 మంది ఉన్న ఈ విమానంలో 18 మంది చనిపోయారని, వారిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారనీ, చాలామందికి సీరియస్ గాయాలయ్యాయని అంటున్నారు. వీళ్లంతా కరోనా వల్ల దుబాయ్ లో ఆగిపోయిన బాధితులు. 'వందే భారత్ మిషన్' లో భాగంగా వీళ్ళను  వెనక్కు తెస్తున్నారు. ఈ లోపల ఇలా జరిగింది. కరోనా నుంచి తప్పించుకుంటే కరిపూర్ ఎయిర్ పోర్ట్ కాటేసింది. ఏ రాయైతేనేం తలకాయ పగలడానికి? 

ఆ సమయానికి వాయుతత్వ రాశి అయిన కుంభం లగ్నంగా ఉదయిస్తూ వాయుప్రమాదాన్ని సూచిస్తున్నది. లగ్నానికి ఒకవైపు శని ఇంకొక వైపు కుజుడూ ఉంటూ పాపార్గళాన్ని కలిగిస్తూ ప్రమాదాన్ని సూచిస్తున్నారు. కుజునితో ఆరవ అధిపతి అయిన చంద్రుడు కలిసి ఉంటూ, అనుభవించవలసి ఖర్మను సూచిస్తున్నాడు.

ఆ సమయానికి శని - బుధ - కుజదశ జరుగుతున్నది. ఇది యాక్సిడెంట్స్ జరిగే దశ అని శని, కుజులను చూస్తే అర్ధమౌతుంది. బుధుడు 8 వ అధిపతిగా 6 వ ఇంట్లో ఉంటూ ఘోరప్రమాదాన్ని సూచిస్తున్నాడు.

కుజుడూ, చంద్రుడూ ఉన్న మీనం జలతత్వ రాశి. అలాగే బుధుఁడున్న కర్కాటకం కూడా జలతత్వ రాశి. కనుక ఈ దుర్ఘటనకు మూలం నీరు. వర్షం పడుతుండటం వల్ల పైలట్లకు రన్ వే సరిగా కనిపించక విమానం లోతైన గుంటలో పడింది. ఈ విధంగా నీరు ఇక్కడ మృత్యుకారకమైంది. చనిపోయిన 18 మందిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.

కుంభలగ్నం  రెండుగంటల పాటు ఉదయిస్తూనే ఉంటుంది కదా, మరి ఆ రెండు గంటలూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయా? అన్న చొప్పదంటు ప్రశ్న మీకొస్తుంది. వినండి.

ప్రమాదం జరిగిన క్షణంలో సూక్ష్మంగా పరిశీలిస్తే గ్రహాల ప్రభావం ఘోరంగా ఉంటుంది. అయితే, దాని కళలు రాశిచక్రంలో కూడా కనిపిస్తాయి. ఆ క్షణాన్ని మాత్రమే నిశితంగా చూడాలంటే, 'నవాంశ - ద్వాదశాంశ' చక్రాన్ని గమనించాలి.  అంటే D-108 అన్నమాట. నిమిషనిమిషానికీ మారిపోయే గ్రహస్థితుల్ని చూడాలంటే D-108 మరియు D-144 ఇంకా పైనున్న అంశచక్రాలను గమనించాలి. వాటిల్లోదే నాడీఅంశ అనబడే D - 150 కూడా.

ఇప్పుడు 'నవాంశ - ద్వాదశాంశ' లేదా 'అష్టోత్తరాంశ' చక్రాన్ని చూద్దాం. లగ్నం మళ్ళీ వాయుతత్వ రాశి అయిన తుల అవుతూ వాయుప్రమాదాన్ని సూచిస్తున్నది. శుక్రుడు ద్వితీయ కర్మస్థానమైన సింహంలో ఉంటూ మళ్ళీ సామూహిక ఖర్మను సూచిస్తున్నాడు. 6 గ్రహాలు 3/9 ఇరుసులో ఉంటూ ప్రయాణీకుల బలమైన పూర్వకర్మను సూచిస్తున్నారు. వారిలో ఉన్న శని, రాహువు, గురువుల సంబంధం దృఢమైన శపితయోగాన్ని, గురుఛండాల యోగాన్ని సూచిస్తున్నది. ఇది ఖచ్చితంగా బలమైన పూర్వకర్మయోగం.

నమ్మించి మోసం చెయ్యడం,  కండకావరంతో సాటిమనుషులను దగాచేసి హింసించడం మొదలైన పాపాలవల్ల ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. సాటి మనుషులు మనల్ని నమ్ముతారు. వారిని నమ్మించి మోసంచేసి అదేదో పెద్ద ఘనకార్యం అయినట్లు పొంగిపోతాం. మన స్వార్థమే గాని ఎదుటిమనిషి పడుతున్న బాధను పట్టించుకోము. మనలో చాలామందికి ఇది అలవాటే. అలాంటి పనులకు ఎలా పెనాల్టీ పడుతుందో తెలుసా? గమ్యం చేరుస్తుందని నమ్మి విమానంగాని ఇంకేదో వాహనంగాని ఎక్కుతారు. కానీ మధ్యలోనే అది కొంప ముంచుతుంది. ప్రాణాలు పోతాయి. అలాంటి కర్మలకు ఇలాంటి ఫలితాలే ఉంటాయి.

ఈ చక్రంలో అంతా వాయుతత్వ ప్రభావమే కనిపిస్తోంది. కానీ ఇక్కడ ప్రమాదానికి ముఖ్యకారణం జలం, అంటే వాన. దానిని చూడాలంటే ఇంకా సూక్ష్మంగా వెళ్ళాలి. ఇప్పుడు 'ద్వాదశాంశ - ద్వాదశాంశ' చక్రాన్ని, అంటే D-144 ను చూద్దాం.

ఇందులో, విషయం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. జలతత్వరాశి అయిన వృశ్చికం లగ్నం అవుతూ, జలభూతమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతోంది. అంతేగాక, రాహుకేతువుల ఉఛ్చఇరుసు లగ్నాన్ని సూటిగా కొడుతూ దృఢకర్మ యోగాన్ని, అనుభవించవలసి కర్మను సూచిస్తున్నది. రాహుశనులు సప్తమం లో ఉంటూ శపితయోగపు దృష్టితో లగ్నాన్ని చూస్తూ ఆ సమయానికి వానపడటం శపితయోగ ఫలితమేనని చెబుతున్నారు. శని నీచస్థితిలోకి పోతూ ప్రయాణీకుల నీచమైన పూర్వకర్మను సూచిస్తున్నాడు. పూర్వకర్మను ఇంకోవిధంగా సూచిస్తున్న 9 వ అధిపతి చంద్రుడు లగ్నంలో నీచస్థితిలో ఉంటూ మళ్ళీ వీరందరి నీచమైన పూర్వకర్మను సూచిస్తున్నాడు. ఇంకా చాలా సూచనలున్నాయి గాని అవన్నీ ప్రస్తుతానికి అవసరం లేదు.

అయితే, జ్యోతిష్యకారణాల వల్లనే ఇదంతా జరిగిందా? అధికారుల నిర్లక్ష్యం లేదా? అని మరొక చొప్పదంటు ప్రశ్న కూడా రావచ్చు. మళ్ళీ వినండి.

గ్రహాలవల్ల ఏదీ జరగదు. వాటికి పక్షపాతం లేదు. అవి మనల్నేమీ చెయ్యవు కూడా. మన కర్మే మన జీవితాలను నడిపిస్తుంది. మన కర్మానుసారం గ్రహాలు నడుస్తాయి. ఫలితాలనిస్తాయి. మన కర్మను మనచేత అనుభవింపజేస్తాయి. అంతే !

చనిపోయిన 18 మంది జాతకాలనూ పరిశీలిస్తే, వాటిల్లో కామన్ గా  ఉన్న పూర్వకర్మ స్పష్టంగా కన్పిస్తుంది. కానీ అవసరం లేదు. స్టాటిస్టికల్ పరిశీలన తప్ప దానివల్ల ఉపయోగమూ లేదు.  

ఇకపోతే, అధికారుల నిర్లక్ష్యం కూడా జనాల పూర్వకర్మ ఫలితమే. దేశంలో ఇంకా ఎన్నో మంచి ఎయిర్ పోర్టులుండగా, దీంట్లోనే వారంతా దిగవలసిరావడం కూడా దాని ఫలితమే. పదేళ్ళక్రితమే ఎయిర్ సేఫ్టీ నిపుణుడు మోహన్ రంగనాధన్ తన రిపోర్టులో ఈ ఎయిర్ పోర్ట్ లో ఉన్న టేబుల్ టాప్ లాండింగ్ చాలా ప్రమాదకరమని చెప్పినా కూడా ప్రభుత్వాలు దానిని పట్టించుకోకపోవడం ఆ ఖర్మ ఫలితమే. ఏడాది క్రితం ఇలాంటిదే ప్రమాదం మంగుళూరులో జరిగినా అధికారులు కళ్ళు తెరవకపోవడమూ ఆ గ్రహప్రభావమే. ఇదేకాదు, పాట్నా, జమ్మూ లలోని ఎయిర్ పోర్ట్ లు కూడా ఇలాంటివే, తరువాత జరగబోయేది అక్కడేనని నిపుణులు చెబుతున్నా అధికారులు చూసీ చూడనట్లు ఉండటం, చివరకు ఎవడో ఒక క్రిందిస్థాయి అధికారిని బలిపశువును చెయ్యడం, మళ్ళీ నిమ్మకు నీరెత్తినట్లు నిద్రపోవడం - ఇవన్నీ కూడా ఆ గ్రహప్రభావాలే.

అన్నివేళలా అన్నిచోట్లా అన్నీ సవ్యంగా ఉంటే, మనుషులు తమ ఖర్మఫలితాలను అనుభవించేదెలా మరి? అలా ఉంటే మనుషులకు పట్టపగ్గాలుంటాయా? ఎవడికెక్కడ ఎలా వాత పడాలో అలా పడాల్సిందే !

read more " కోజికోడ్ విమాన ప్రమాదం - జ్యోతిష్య కారణాలు "

ఇంతేరా జీవితం !

చావలేక బ్రతుకు

బ్రతుకు కోసం తిండి

తిండికోసమేదో ఒక పని

మిగతాదంతా శుద్ధ అబద్దం

ఇంతేరా జీవితం !


ఎందుకొచ్చామో తెలియదు

ఎటు పోతున్నామో అసలే తెలియదు

చివరకు ఏమౌతామో అదీ తెలియదు

అయినా ఈ పరుగు ఆగదు 

ఇంతేరా జీవితం !


పెంచుకునే మోహాలు

కొందరితో ద్వేషాలు

బ్రతుకంతా మోసాలు

పోగయ్యే పాపాలు

ఇంతేరా జీవితం !


లేని అహాన్ని పట్టుకుని

వేలాడటం

ఉన్న క్షణాలను జార్చుకుని

గోలాడటం

పిలుపంటూ రాగానే

బిక్కచచ్చి చావడం

ఇంతేరా జీవితం !

ఇంతేరా, ఇంతేరా, ఇంతేరా జీవితం !

read more " ఇంతేరా జీవితం ! "

7, ఆగస్టు 2020, శుక్రవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 7 ( శనిచంద్రయోగం - సాధనలు)


జాతకంలో నిజమైన ఆధ్యాత్మిక చింతనకు సూచిక - శనిచంద్ర యోగం. ఒకమనిషి జీవితంలో ఇది లేనిదే నిజమైన ఆధ్యాత్మికసాధన జరుగనే జరుగదు. అయితే, ఇదే యోగం  జీవితంలో చాలా బాధలను, వేదనను కూడా ఇస్తుంది. ఇవి లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో నడక  కుదరనే కుదరదు. అదే విచిత్రం మరి !

బాధల చీకటిరాత్రి నుంచే దివ్యత్వపు సూర్యోదయానికి దారి ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి ! ఒకరి జీవితం చిన్నప్పటినుంచీ కులాసాగా, దేనికీ లోటు లేకుండా సాగిపోతుంటే అలాంటివ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడం ఎప్పటికీ సాధ్యం కానేకాదు. అలాంటివారికి కుహనా ఆధ్యాత్మికత, నకిలీ మతవేషాలు, రకరకాల దీక్షలు, సాంప్రదాయాలు, సాధనలు  వంటబట్టచ్చేమోగాని నిజమైన యోగసిద్ధి కలగడం మాత్రం కల్ల. మహనీయుల అందరి జాతకాలలోనూ బాధాపూరితమైన ఈ శనిచంద్రయోగం ఉంటుంది. అయితే, రకరకాల తేడాలతో ఉంటుంది. దాని బలాన్ని బట్టి వారికి కలిగే సిద్ధి కూడా ఉంటుంది.

ఇదే యోగం వల్ల జాతకుని తల్లికి చాలా బాధలు కలుగుతాయి. లేదా తల్లి మరణిస్తుంది. నిజమైన ఆధ్యాత్మికతకు ఇది ఇంకొక సూచన. అయితే, కష్టాలు పడిన ప్రతివారూ, తల్లి చనిపోయిన ప్రతివారూ గొప్ప జ్ఞానులు, సిద్ధులు అవుతారని అర్ధం చేసుకోకూడదు. కడుపులో చల్ల కదలకుండా వేళకు పూజలు చేసుకుంటూ, జపాలు చేసుకుంటూ ఉండేవారు ఆధ్యాత్మికంగా ఉన్నతులని అనుకోకూడదు. వారిలో చాలామంది మహా దురహంకారపూరితులై ఉంటారు. 'మేము చాలా ఆచారపరాయణులం, మహాభక్తులం' అనే అహంకారం పెరగడానికి మాత్రమేగాని ఇతరత్రా అవి ఎందుకూ ఉపయోగపడవు.

జ్ఞానసిద్ధికైనా, దైవసాక్షాత్కారానికైనా ఎంతో అంతరికసంఘర్షణ అవసరమౌతుంది. ఎంతో అంతరికవేదనను పడవలసి వస్తుంది. లోలోపల ఎంతో మారవలసి ఉంటుంది. ఇవేవీ లేకుండా ఊరకే మొక్కుబడిగా పూజలు, జపాలు, ధ్యానాలు చేస్తూ, దేవుడిని కోరికలు కోరుకుంటూ ఉండేవారు ఎన్నేళ్ళైనా అలాగే ఉంటారుగాని వారికి సిద్ధి లభించదని మాత్రమే నేను చెబుతున్నాను.

నేను గుంటూరులో ఉన్న రోజుల్లో, అంటే 1997 ప్రాంతాలలో, నా స్నేహితుడొకడు ఒక శ్రీవిద్యోపాసకుని గురించి తెగ ఊదరగొట్టేవాడు. ఆయన చాలా గొప్ప సాధకుడని, రోజుకు ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు  జపం చేస్తూనే ఉంటాడని చెప్పాడు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ మావాడి పోరు పడలేక ఒకసారి మారుతీనగర్లో ఉన్న ఆయన దగ్గరకు వాడితో కలసి వెళ్ళవలసి వచ్చింది. ఒక్క పది నిముషాలు ఆయనతో మాట్లాడాక 'ఓకే అండి! ఉంటాను మరి' అంటూ ఆయన జవాబుకోసం కూడా ఎదురుచూడకుండా బయటకొచ్చేశాను.

నా వెనుకే హడావుడిగా బయటకొచ్చిన మావాడు 'ఏంటి? అలా వచ్చేశావ్? ఆయన శక్తిని తట్టుకోలేకపోయావా?' అన్నాడు భక్తిగా.

'నీ మొహం ! ఇంకోసారి నీమాట అస్సలు నమ్మను. ఎందుకురా  ఇలాంటివాళ్ల దగ్గరకు నన్ను తీసుకొస్తావ్?' అంటూ ముక్కచీవాట్లు  పెట్టాను వాడికి.

'నా ప్రశ్నకు జవాబు చెప్పు' రెట్టించాడు వాడు.

'ఆచారపరాయణుడే గాని శక్తిహీనుడు. అనుభవశూన్యుడు. నీలాంటి వాళ్లకి బాగా సరిపోతాడు. ఆయన దగ్గర ఉపదేశం తీసుకో. నీ జన్మ ధన్యమౌతుంది' అన్నాను.

ఆ కధ అంతటితో ముగిసింది. ఇలాంటి 'మడికంపు' గాళ్ళను చాలామందిని చూచాను. బయటవేషం తప్ప, ఉత్త పనికిమాలిన తంతులు తప్ప, అంతరిక ఔన్నత్యం ఎక్కడా వీరిలో ఉండదు. వారి నిత్యజీవితంలో అయితే అస్సలు కనపడనే కనపడదు. లోకం ఇలాంటివాళ్ళను చూచి చాలా మోసపోతుంది. లోకం నిండా నకిలీ మనుషులే గనుక, ఇలాంటి నకిలీ మహాత్ములే లోకానికి నచ్చుతారు. సహజమే !

యూజీగారి జాతకంలో కుటుంబస్థానంలో శనిచంద్రయోగం ఉన్నది. ఇది తల్లిగారికి మరణాన్ని కొనితెచ్చింది. అదే విధంగా యూజీగారికి  జీవితమంతా స్థిరత్వం లేకుండా ప్రయాణాలు చెయ్యడాన్నిచ్చింది. మానసికంగా లోతైన సంఘర్షణను అంతర్మధనాన్ని ఇచ్చింది. కుండలినీ జాగృతి కలిగి దేహంలో భరించలేని నరకబాధల్ని పెట్టింది.

యూజీగారు పుట్టినపుడున్న గురుమహర్దశా శేషం 2 సం || 2 నెలలు. అది 1920 ఆగస్టుతో అయిపోయింది. సెప్టెంబర్ నుంచీ 19 సంవత్సరాల శనిమహర్దశ మొదలైంది. ఇది ఆయనకు 21 ఏళ్ళు నిండేవరకూ నడిచింది. ఆ సమయంలోనే ఆయనకు ఆధ్యాత్మిక పునాదులు పడ్డాయి. లేదా, అప్పటిదాకా పెంచుకున్న నమ్మకాలు కూలిపోయాయి. శనిమహర్దశ అనేది మనిషిని మనిషిగా నిలబెడుతుంది.

చాలామంది 'శని' అంటే భయపడతారు. కానీ నా దృష్టిలో శనిని మించిన శుభగ్రహం లేదంటాను. ఎందుకంటే, జీవితమంటే ఏంటో మనిషికి అర్ధమయ్యేది ఆయనవల్లనే. ఆయన దశలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, చికాకులు  తప్పకుండా వస్తాయి. కానీ, అవే మనిషి జీవితానికి పరిపూర్ణతనిస్తాయి. వాటిని చవిచూడకుండా, ఎప్పుడూ సుఖాలలో తేలుతూ ఉండేవాడికి జీవితం అర్ధం కాదు.  ఉన్నతమైన జీవితం అసలే అర్ధం కాదు. మనిషికి కలిగే నిజమైన ఆధ్యాత్మికపురోగతి కూడా శనిదశలోనే కలుగుతుంది.

యూజీగారికి 3 ఏళ్ళనుంచి 8 ఏళ్లవరకూ, అంటే, 1921 నుండి 1926 వరకూ ఆయనకు పురాణాలు, వేదాంతగ్రంధాలు, శాస్త్రాలు పరోక్షంగా నేర్పించబడ్డాయి. ఆయనకిలాంటి శిక్షణ ఇవ్వడం కోసం తాతగారు తన లాయరు ప్రాక్టీస్ మానుకున్నారు. ఎనిమిదేళ్లకే ఆయనకు చాలా శ్లోకాలు కంఠతా వచ్చేశాయి. కానీ, ఆచారపు ఆధ్యాత్మికత అంటే మొహం మొత్తడం మొదలైంది.

ఆధ్యాత్మికంగా ఎదగడమనేది ఎన్నో జన్మలనుంచీ సాగుతున్న ఒక ప్రయాణం. అది సజీవనదిలాగా గలగలా పారుతూ ఉండాలి. అంతేగాని దానిని కృత్రిమంగా తయారుచెయ్యలేం. బోధలద్వారా, ట్రయినింగ్ ఇవ్వడంద్వారా దానిని మనిషికి నేర్పలేం. అది జరిగే పని కాదు. అందుకనే, చిన్నప్పటినుంచీ మతాచారాలు, పూజలు, పద్ధతులు నేర్పించబడిన పిల్లలు, ప్లాస్టిక్ మొక్కలలాగా అందంగా తయారౌతారు గాని వారిలో జీవకళ ఉండదు. చిన్నప్పటినుంచీ నిష్టగా వేదం నేర్చుకున్న  పురోహితులందరూ ఆధ్యాత్మికతకు దూరమైపోయేది  అందుకే. వారికి తంతులొస్తాయి. కానీ సహజంగా లోలోపల సాగవలసిన సాధనాజలం వారిలో ఉండదు. అది మాత్రం ఎండిపోయి ఉంటుంది. జీవితంలో డబ్బొక్కటే పరమావధి అయి కూచుంటుంది. సాంప్రదాయబద్ధమైన మార్గంలో ఉంటూ, నిజమైన సాధన కూడా దానితోపాటు సాగించిన మనిషిని ఇంకా నేను చూడవలసి ఉంది. కొన్ని వందలమందిని ఇప్పటికి చూచాను, కానీ అలాంటివాడు ఒక్కడుకూడా ఇప్పటికి నాకు తారసపడలేదు. అది జరగదని నాకర్ధమైపోయింది.

మతాన్ని బలవంతంగా నేర్పడం ద్వారా, మనిషిని దైవానికి దూరం చేస్తున్నామని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే అది నిజం కాబట్టి !

ఆ సమయంలో యూజీగారికి శని మహర్దశలో శని, బుధ, కేతు అంతర్దశలునడిచాయి. బుధుడు శనితోనే కలసి ఉన్నాడు. కేతువు ద్వాదశంలో ఉన్నాడు. కేతువు ద్వాదశంలో ఉన్నపుడు, అది ఉఛ్చగాని, నీచగానీ అయితే గొప్ప ఆధ్యాత్మిక యోగాన్నిస్తాడు. 'ఆ జాతకుడికి అదే ఆఖరుజన్మ' అని జ్యోతిష్య గ్రంధాలన్నాయి. అయితే, ఉఛ్చకేతువు ఇచ్ఛే యోగం వేరుగా ఉంటుంది, నీచకేతువు ఇచ్ఛే యోగం వేరుగా ఉంటుంది.

ధ్యానంలో ఉన్నపుడు ఏడ్చి విసిగించిందని తన మనవరాలిని తాతగారు చితక్కొట్టడం, తల్లిగారి తద్దినం రోజున తనతోబాటు ఉపవాసం ఉండవలసిన తద్దినం బ్రాహ్మలు చక్కగా వీధిచివరి హోటల్లో భోజనం చేస్తూ యూజీగారికి దొరికిపోవడం, అలవాటు ప్రకారం ఆంజనేయస్వామికి మొక్కుకోకముందే తననుకున్న కోరిక తీరి ఆశ్చర్యానికి గురిచేయడం - లాంటి సంఘటనలన్నీ చిన్నారి యూజీలో ఆలోచనను రేకెత్తించాయి. 'అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి?' అని ప్రశ్నించేటట్లు చేశాయి. మాట్లల్లో తప్ప చేతల్లో కనిపించని ఆచారాలంటే ఆయనకు తీవ్రమైన అసహ్యం కలిగి, తాతగారి ఎదుటనే తన జంధ్యాన్ని తెంపి పారేశాడు. యోగకరమైన శనిదశ అనేది అలాంటి ముక్కుసూటి మనస్తత్వాన్నిస్తుంది.

అంత చిన్నవయసులో కూడా, కులనియమాలను ఆయన పాటించేవాడు కాదు. మానవత్వానికి మాత్రమే పెద్దపీట వేసేవాడు.

1932 లో ఆయనకు 14 ఏళ్ల వయసులో, శివగంగ పీఠాధిపతి తన మందీ మార్బలంతో వారింటికి వచ్చారు. అప్పుడు యూజీగారికి సరిగ్గా శని - చంద్రదశ జరుగుతున్నది. ఆయననుసరించి తానుకూడా సన్యాసం తీసుకుంటానని యూజీగారు తన కోరికను వెలిబుచ్చారు. యూజీగారిది మరీ లేతవయసు కావడంతో ఆ శంకరాచార్యస్వామి, యూజీగారి కోరికను మన్నించలేదు. పోతూ పోతూ ఆయన శివమంత్రాన్ని యూజీగారికి ఉపదేశం చేశారు. ఆ రోజునుంచీ కొన్నేళ్లపాటు ప్రతిరోజూ 3000 సార్లు ఆయన శివమంత్రాన్ని క్రమం తప్పకుండా జపించేవాడు. ఈ విధంగా, శనిచంద్ర దశ ఆయన సాధనకు బీజాలు వేసింది.

అప్పటినుంచీ తనకు 21 ఏళ్ళు వచ్చేవరకూ ప్రతి వేసవికాలపు సెలవలలోనూ యూజీగారు హిమాలయాలకు వెళ్లి స్వామి శివానందగారి ఆశ్రమంలో ఉంటూ తీవ్రమైన సాధన చేశాడు. శివానందగారి దగ్గర యూజీగారు  యోగాసనాలు,ప్రాణాయామం, ధ్యానం మొదలైనవన్నీ నేర్చుకున్నాడు. ఋషీకేశ్ లో యూజీగారికి ఒక గుహ ఉండేది. దానిలో కూచుని రోజుకు పదినుంచి పదిహేడు గంటలపాటు జపం, ధ్యానం చేసేవాడు. ఆ సమయంలో తనకు ఎన్నో సమాధిస్థితులు కలిగాయని తర్వాతి కాలంలో ఆయన చెప్పాడు. 

ఆ సమయంలో ఆయన జాతకంలో శని - రాహుదశ నడిచింది. ఆ విధంగా రోజులతరబడి తిండీనీళ్ళూ మానుకొని  ఉపవాసాలుంటూ, హిమాలయగుహలలో తపస్సు చేశాడు యూజీగారు. కొన్నాళ్ళు పచ్చిగడ్డిని ఆహారంగా తింటూ సాధన చేస్తూ ఉండేవాడు. ఇది శపితదశ అన్న విషయం నా వ్రాతలు చదివేవారికి విదితమే. ఇది మనిషిని నానాబాధలు పెడుతుంది. లేదా, ఆ బాధల్ని మనమే పడాలి. అప్పుడు అది శాంతిస్తుంది. సాధకులైనవాళ్లు వాళ్ళను వాళ్ళే హింసపెట్టుకుంటారు గనుక శపితదశ ప్రత్యేకంగా వారిని ఇంకేదో బాధలకు గురిచేసే పని ఉండదు. సాధనకోసం స్వయంగా వాళ్ళే ఆ బాధలు పడతారు. కనుక శపితదశ సాధకులమీద పనిచేయదు.

కానీ, అందరికీ సాత్వికాహారాన్ని ప్రబోధించే శివానందస్వామి, ఒకరోజున ఆవకాయ కలిపిన అన్నాన్ని ఇష్టంగా తింటూ యూజీగారి కంటబడ్డాడు. ఆ దెబ్బతో ఆయనంటే యూజీగారికి  విరక్తి పుట్టింది. 'మమ్మల్నేమో చప్పిడికూడు తినమని  చెబుతున్నాడు, ఈయనేమో తలుపులేసుకుని ఆవకాయ తింటున్నాడు. ఇది కరెక్ట్ కాదు' అనుకున్నాడు. శివానందాశ్రమాన్ని వదిలేశాడు.

శివానందస్వామి తమిళుడు. పెద్ద పొట్టతో ఉండే ఈయన మంచి భోజనప్రియుడు. ఎన్నో పుస్తకాలు వ్రాసి, ఎంతో వేదాంతప్రచారం చేశాడు. ఇప్పటికీ రిషీకేశ్ లో వాళ్ళ ఆశ్రమం ఉంది. అలాంటి చిన్నవిషయం మీద ఆయనతో యూజీగారి బంధం అలా తెగిపోయింది. ఆవకాయకు కారకుడు రాహువన్నది గుర్తుంటే శని - రాహుదశలో అది యూజీగారి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందో అర్ధమౌతుంది.

యూజీగారు చిన్నప్పటినుంచీ మహా ముక్కుసూటి మనిషి. ఒకటి చెబుతూ ఇంకొకటి చేస్తే ఆయనకు చిర్రెత్తుకొచ్చేది. ఇదే  పాయింట్ మీద జిడ్డు కృష్ణమూర్తితో కూడా ఆయన విభేదించాడు. రోసలిన్ తో జిడ్డుకున్న అక్రమసంబంధం థియోసఫీ సర్కిల్స్ లో అందరికీ తెలిసిన విషయమే. కానీ బయటపడేవారు కాదు. చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేకపోవడంతో జిడ్డును కూడా యూజీ వదిలేశాడు. అయితే ఇది చాలాఏళ్ల  తర్వాత జరిగింది.

14 ఏళ్ళనుంచి 21 ఏళ్ల వయసువరకూ యూజీగారికి శివానందస్వామితోనూ, మద్రాస్ ధియోసఫీ సర్కిల్స్ తోనూ సంబంధాలున్నాయి. అది 1939 సంవత్సరం. అప్పటికి ఆయనకు 21 ఏళ్ళొచ్చాయి. శివానందస్వామితో తెగతెంపులయింది. ఆయన జీవితంలో బుధమహర్దశ మొదలైంది.

(ఇంకా ఉంది)

read more " U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 7 ( శనిచంద్రయోగం - సాధనలు) "

అయోధ్యలో రామాలయ శంకుస్థాపన ముహూర్తం - పరిశీలన


5-8-2020 బుధవారం నాడు మధ్యాన్నం 12. 44 కి అయోధ్యలోని రామాలయానికి శంకుస్థాపన జరిగింది.

ఈ ముహూర్తాన్ని నా విధానం లో  పరిశీలిద్దాం.

శ్రావణ బహుళద్వితీయ,  బుధవారం, శతభిషానక్షత్రం, బుధహోర,అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం జరిగింది.

చరలగ్నమైన తుల ఉదయిస్తున్నది. సాధారణంగా స్థిరలగ్నాన్ని ఇలాంటి పనులకు వాడతారు. కానీ  ఇక్కడ చరలగ్నాన్ని వాడారు. దశమంలో రవిని ఉంచుతూ అభిజిత్ మూహూర్తం  సాధించడం కోసం ఈ లగ్నాన్ని ఎంచుకున్నట్లు తోస్తున్నది. దినాధిపతి, హోరాధిపతి అయిన బుధుడు కూడా దశమంలోనే ఉండటం ఈ ముహూర్తానికి బలాన్నిస్తున్నది.

లగ్నం మీద పరస్పర విరుద్ధములైన గ్రహప్రభావాలున్నాయి. ఉఛ్చ స్థితిలో ఉన్న రాహుకేతువులు నవమ - తృతీయ భావాల ఇరుసులో ఉండటం ఈ ముహూర్తానికి గొప్ప బలం. రాహువు నవమంలో ఉంటూ ఉఛ్చబుధుడిని సూచిస్తున్నాడు. ఇది చాలా మంచిది.

నాలుగింట వక్రశని ఉండటం మంచిది కాదు. దేశంలో కొన్ని వర్గాలనుండి ఈ చర్యకు వ్యతిరేకత ఉంటుందని ఇది సూచిస్తున్నది. వారెవరో ఊహించడానికి పెద్ద జ్యోతిష్యజ్ఞానం  అవసరం లేదు. కానీ శని వక్రతవల్ల, తృతీయకేతువుతో చేరడం వల్ల, వారుకూడా దీనిని ఆమోదించవలసిందే (సుప్రీం కోర్ట్ రూలింగ్ వల్ల)  అని తెలుస్తున్నది.

అయిదు తొమ్మిది భావాలనుండి లగ్నానికి శుభార్గళం కలిగింది. ఇది బలమైన హిందూ సెంటిమెంట్ ను సూచిస్తున్నది.

అయితే, ఈ ముహూర్తానికి కొన్ని చెడుయోగాలున్నాయి. అవి - శత్రుస్థానంలో కుజునిస్థితి, శత్రుస్థానాధిపతి గురువు తృతీయంలో వక్రిగా ఉంటూ ద్వితీయంలోకి రావడం. ముహూర్తభాగంలో ఇవన్నీ చూడకూడదని సాంప్రదాయ జ్యోతిష్కులు అంటారుగాని,  అది తెలిసీతెలియక మాట్లాడే మాట. ఫలితభాగమైనా, ముహూర్త భాగమైనా ఎక్కడైనా జ్యోతిష్యం ఒకటే. జాతకభాగానికి వేరుగా, ముహూర్తభాగానికి వేరుగా సూత్రాలు తయారుచేసి పుస్తకాలు వ్రాసినవాళ్ళే జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టించారు. 

లగ్నం మీద గురువు, కుజుల బలమైన డిగ్రీ దృష్టి ఉన్నది. ఈ ఆలయంమీద ఇప్పటికే ఉన్న శత్రువుల కన్నును ఇది సూచిస్తుంది. రామాలయం కట్టబడినా, గట్టి సెక్యూరిటీ మధ్యలోనే ఇది ఎప్పటికీ ఉండవలసిన అవసరాన్ని ఈ గ్రహయోగాలు సూచిస్తున్నాయి. ఈ సమయానికి ఉన్న రాహు - రాహు - రవి దశ కూడా ఇదే ఫలితాన్ని గట్టిగా సూచిస్తోంది. ఇది గ్రహణదశ కనుక ముస్లిం తీవ్రవాదుల నుంచి ఈ ఆలయాన్ని కాపాడుతూ ఉండవల్సిన అవసరం ఎప్పటికీ ఉంటుంది. వారిని నమ్మడం కష్టం.

నక్షత్రాధిపతి రాహువు ధర్మాన్ని సూచించే నవమంలో లగ్నాధిపతి అయిన శుక్రునితో కలసి ఉఛ్చస్థితిలో ఉండటం, అభిజిత్ ముహూర్తం కావడం, రాహుకేతువులు మంచి స్థానాలలో ఉఛ్చస్థితులలో ఉండటం -- ఈ ముహూర్తానికి బలమైన పునాదులు. ఉన్నంతలో ఇది చాలామంచి ముహూర్తమే.

అనుకున్నట్లుగా ఈ భవ్యమైన ఆలయం మూడేళ్ళలో పూర్తికావాలని మనం కూడా ప్రార్ధిద్దాం.

జై శ్రీరామ్ !

read more " అయోధ్యలో రామాలయ శంకుస్థాపన ముహూర్తం - పరిశీలన "

గాయకులు - సంఖ్యాశాస్త్రం

ఈ లోకంలో ప్రతిమనిషీ ప్రక్కమనిషికంటే విభిన్నుడే. అలాగే ప్రతిజాతకమూ ప్రక్కవారి జాతకం కంటే తేడాగానే ఉంటుంది. కానీ ఒకే రంగంలో ఉన్నవారి జాతకాలలో కొన్నికొన్ని పోలికలుంటాయి. అవి జ్యోతిష్యపరంగానూ కనిపిస్తాయి. అలాగే,  సంఖ్యాశాస్త్రపరంగానూ కనిపిస్తాయి.  నిజానికి,అంకెలన్నీ గ్రహాలే. కనుక సంఖ్యాశాస్త్రం కూడా జ్యోతిషశాస్త్రంలో భాగమే.

గాయకులకు శని మరియు రాహుకేతువులతో గట్టిసంబంధం ఉంటుంది. ఎందుకంటే,  సంగీతం నేర్చుకోవాలంటే చాలా గట్టి పట్టుదల ఉండాలి. అలాగే క్రొత్త క్రొత్త ప్రయోగాలు చెయ్యాలంటే కూడా రాహుకేతువులు సంబంధం ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో రాహువు ప్రభావం లేనిదే అతనికి ఆటా, పాటా, మాటా ఏవీ రావు. కనుక వీరందరికీ 2,,4,8, అంకెలతో  ఖచ్చితమైన సంబంధం ఉంటుంది. నా పద్ధతిలో రాహువును 2 అనీ, కేతువును 4 అనీ భావిస్తాము. పుస్తకాలలో మీరు చూచే సంఖ్యాశాస్త్రానికీ నా విధానం తేడాగా ఉంటుంది. గమనించండి.

ఇప్పుడు ప్రసిద్ధగాయకులు పుట్టినతేదీలను  పరిశీలిద్దాం.

ఈ తేదీలలో శతాబ్దపు సంఖ్యను  లెక్కించవలసిన పనిలేదు. ఎందుకంటే 1900 నుంచి 1999 మధ్యలో పుట్టినవారికి 19 అనేది అందరికీ ఉంటుంది గనుక. అలాగే  ఆ తర్వాత పుట్టినవారికి 20 అనేది అందరికీ కామన్ గా ఉంటుంది గనుక ఆ సంఖ్యలను  పట్టించుకోవలసిన పనిలేదు.

K L Saigal
Born 11-4-1904
2-4-4
రాహువు - కేతువు - కేతువు. పుట్టిన తేదీ 2 అయింది. నెల 4 అయింది. సంవత్సరం కూడా నాలుగే.

సైగల్ మంచి గాయకుడే అయినా త్రాగుడుకు అలవాటుపడి జీవితాన్ని విషాదాంతం చేసుకున్నాడు. రాహుకేతువుల ప్రభావం ఆయనమీద అలా పనిచేసింది. 

Kishore Kumar
Born 4-8-1929
4-8-2
కేతువు - శని - రాహువు
పుట్టినరోజు 4 అయింది.

అమరగాయకుడైన ఇతని జీవితం కూడా బాధామయమే. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా శాంతిలేకుండానే ఈయన చనిపోయాడు.

Died 13-10-1987
4-1-6 = 2
చనిపోయిన రోజు రూట్ నంబర్ కూడా 4 అవడం గమనించాలి.

Mohammad Rafi
Born 24-12-1924
24-12-24

ఇదొక రిథమ్. ఈయన పుట్టినతేదీలోనే ఒక రిథమ్ ఉండటం చూడవచ్చు. 2,4 అంకెలు మళ్ళీ మళ్ళీ వస్తూ రాహుకేతువుల ప్రభావాన్ని సూచిస్తున్నాయి.

Died 31-7-1980
4-7-8
4,8 అంకెలను కేతు, శనుల ప్రభావాన్ని గమనించండి.

Mukesh Madhur
Born 22-7-1923
22-7-23

2 అంకె మూడుసార్లు రావడాన్ని పుట్టిన తేదీ రూట్ నంబర్ 4 అవడాన్ని గమనించండి.


Manna Dey
Born 1-5-1919
1-5-1

ఈయన మీద ఈ గ్రహాల ప్రభావం లేదు. కనుకనే కొన్నాళ్ల తర్వాత సినీరంగానికి దూరమయ్యాడు.

Talat Mahamood
Born 24-2-1924
24-2-24

ఇక్కడ కూడా 2,4 అంకెల ప్రభావాన్ని చూడవచ్చు. ఈయన జననతేదీలో కూడా రిథమ్ ఉన్నది. కొన్నేళ్లు బాగా వెలిగిన ఈయన సినీరంగానికి దూరమై ఘజల్ సింగర్ గా మిగిలాడు.

Bhupender singh
Born 6-2-1940
6-2-4
రాహుకేతువుల ప్రభావం స్పష్టం.

Jagjith singh
Born 8-2-1941
8-2-41
2,4,8 అంకెల ప్రభావం గమనించండి.

Died 10-10-2011
1-1-2 = 4
రాహుకేతువుల ప్రభావం స్పష్టం.


Lata Mangeshkar 
Born 28-9-1929
28-9-29

ఈమె పుట్టిన తేదీలో కూడా రిథమ్ ఉన్నది. 2,8 అంకెల ప్రాబల్యత రాహువు, శనుల ప్రభావాన్ని సూచిస్తున్నది.

Nukala China Satyanarayana
Born 4-8-1923
4-8-5
8
2,4,8 అంకెల ప్రభావం కనిపిస్తోంది. పుట్టినతేదీ 4 అయింది.


Died 11-7-2013
2-7-4
4
మళ్ళీ 2,4 అంకెలు వచ్చాయి. చనిపోయిన తేదీ రూట్ నంబర్ 2 అయింది. మొత్తం తేదీ రూట్ నంబర్ 4 అయింది.

Ghantasala Venkateswara Rao
Born 4-12-1922
4-12-22
2,4 అంకెల సీక్వెన్స్ ను గమనించండి.
పుట్టిన తేదీ మళ్ళీ 4 అయింది.

Died 11-2-1974
2-2-74
2-2-2
ఈ తేదీకూడా మళ్ళీ 2,4 అంకెల పరిధిలోనే ఉన్నది. 

P.Susheela
Born 13-11-1935
4-2-8
అవే అంకెలు మళ్ళీ కనిపిస్తూ రాహు, కేతు, శనుల ప్రభావాన్ని సూచిస్తున్నాయి.

గాయకులు చాలామంది పుట్టిన తేదీ 4  గాని, 13 గాని, 22 గాని, 31 గాని అవుతూ రూట్ నంబర్ 4 అవుతుంది. వారి జననతేదీలో ఉండే మిగతా అంకెల వల్ల వారి జీవితంలో ఆయా మిగతాగ్రహాల పాత్ర ఉంటుంది.

సామాన్యంగా గాయకుల జీవితాలు విషాదాంతం అవుతాయి. కళాకారులకి కూడా అంతే. బయటప్రపంచం వారిని ఆరాధించవచ్చు. కానీ వారి వ్యక్తిగతజీవితాలు చివరకు విఫలమే అవుతాయి. వారి జీవితాలు పూలపాన్పులలాగా ప్రపంచానికి గోచరిస్తాయి. కానీ బయట ప్రపంచానికి కనపడని చీకటి కోణాలు వారి జీవితాలలో ఉంటాయి. దానికి కారణం వారి జీవితంలో ఉన్న రాహు, కేతు, శనుల ప్రభావం. ఎంతమంది గాయకుల జననతేదీలను చూచినా ఇవే సీక్వెన్సులు మీకు కన్పిస్తాయి.
read more " గాయకులు - సంఖ్యాశాస్త్రం "

5, ఆగస్టు 2020, బుధవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 6 (కాలసర్ప యోగం - పుత్రదోషం)

యూజీగారి జాతకంలో కొట్టొచ్చినట్లు కనిపించే ఇంకొక యోగం కాలసర్పయోగం. పైగా రాహుకేతువులు నీచస్థితిలో ఉండటం దీనిలో ఇంకొక మలుపు. ఇలాంటి  జాతకులకు ఈ క్రింది ఫలితాలు జరుగుతాయి.

  • 40 ఏళ్లు వచ్చేవరకూ వీరి జీవితాలలో స్థిరత్వం రాదు.
  • మొదట్లో మంచి సంపన్నులుగా ఉన్నప్పటికీ అదంతా  కోల్పోయి దారిద్య్రాన్ని అనుభవిస్తారు.
  • 40 తర్వాత నిదానంగా వీరి జీవితంలో వెలుగు కనిపిస్తూ వస్తుంది.
  • సామాన్యంగా,  వీరికి కాలం కలసిరాదు. వీరి ప్రణాళికలు ఫలించవు.  అందుకని, వీరు  జీవితం గురించి ఏ విధమైన గొప్పగొప్ప ప్లానులూ వెయ్యకుండా సాధారణజీవితం గడపడం మేలు.
ఇప్పుడు కాలసర్పయోగం యూజీగారి జీవితంలో ఎలా పనిచేసిందో గమనిద్దాం.

తల్లిగారు ఊహించినట్లుగా, నాడీజ్యోతిష్యం చెప్పినట్లుగా యూజీగారు గతజన్మలో ఒక యోగభ్రష్టుడే. యోగభ్రష్టుడనే పదం అమర్యాదపూర్వకమైనదేమీ కాదు. సాధారణంగా, మనుషులకు యోగంలో సిద్ధికంటే భ్రష్టత్వమే ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఈ పదానికి అర్థమేమిటో నిజమైన సాధన చేస్తున్నవారికేగాని మామూలు మనుషులకు, కాలక్షేపం చదువరులకు అస్సలు అర్ధం కాదు. నిజానికి ప్రతిసాధకుడూ, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక స్థాయిలో, యోగభ్రష్టుడే.

అయితే, యోగపరంగా ఈ పదం చివరిజన్మకు ముందుజన్మను మాత్రమే సూచిస్తుంది. జ్ఞానసిద్ధి అనేది కొద్దిలో తప్పిపోయినవాడిని యోగభ్రష్టుడని అంటారు. తరువాతి జన్మలో అతడు జ్ఞాని అవుతాడు, బుద్ధుడౌతాడు, యోగసిద్ధిని అందుకుంటాడు. అదే అతనికి చివరిజన్మ అవుతుంది - అతను మళ్ళీ పుట్టాలనుకోకపోతే !

అయితే, కొందరు ఊహిస్తున్నట్లు యూజీగారు ఒక అవతారపురుషుడు మాత్రం కాదు. అవతారానికి ఉండవలసిన గ్రహయోగాలు ఆయన జాతకంలో లేవు. గతజన్మలో గొప్ప సాధనాపరులైనప్పటికీ, మోక్షం కొద్దిలో తప్పిపోయిన ఇలాంటివాళ్లు తరువాత జన్మలలో ఎలాంటి చోట్ల పుడతారో ఆరవ అధ్యాయంలో భగవద్గీత చెప్పింది.

శ్లో || ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ: సమా:
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ||     (6. 41)

శ్లో || అధవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ 
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||           (6. 42) 

"(తన పుణ్యకర్మవల్ల కలిగిన) పుణ్యలోకాలలో ఎన్నో ఏండ్లు నివసించిన తరువాత, శుచీశుభ్రతా కలిగిన సంపన్న కుటుంబాలలో యోగభ్రష్టుడు పుడతాడు.

లేదా, ధీమంతులైన యోగుల కుటుంబాలలోనైనా పుడతాడు. అయితే, ఇలాంటి జన్మ ఈ లోకంలో అంత తేలికగా లభించేది కాదు".

నూరేళ్లక్రితం యూజీగారి  కుటుంబం చాలా సంపన్నమైనదే. డబ్బుకు ఆయనకెలాంటి లోటూ ఉండేది కాదు. 1940 ప్రాంతాలలోనే ఒక లక్షరూపాయలకు చెక్కు వ్రాసి ఇవ్వగలిగేటంత స్తోమత ఆయనకుండేది. అప్పట్లో లక్ష అంటే ఇన్ఫ్లేషన్ రేటునుబట్టి  ఈరోజు 75 లక్షలు. అప్పట్లోనే ఆయన కోటీశ్వరుల కుటుంబంలో పుట్టాడు. కనుక 'శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే' అనిన గీతావాక్యం ఆయన విషయంలో  అక్షరాలా నిజమైంది.

యూజీగారి తాతగారైన తుమ్మలపల్లి కృష్ణమూర్తిగారు మచిలీపట్నంలో నివసించేవారు. ఆయన సదాచారాన్ని పాటించే సనాతనబ్రాహ్మణుడే అయినా, సాధనాపరంగా అనుభవ జ్ఞానమంటూ లేని తెల్లవాళ్ళచేత విదేశాలలో మొదలుపెట్టబడిన 'దివ్యజ్ఞానసమాజం' ఆంధ్రప్రదేశ్ విభాగంలో ఒక ప్రముఖమైన స్థానంలో ఆయన ఉండేవాడు. యూజీగారి చిన్నపుడే వారింటికి  దివ్యజ్ఞానసమాజపు ప్రముఖులు వస్తూ పోతూ ఉండేవారు.  దివ్యజ్ఞాన సమాజమనేది ఆధ్యాత్మికపథంలో సరియైన పునాదులు లేని అనుభవశూన్యులు తయారుచేసిన ఒక కలగూరగంప అయినప్పటికీ, ఒక విధమైన హైబ్రిడ్ ఆధ్యాత్మికతను యూజీగారు తనయొక్క చిన్నతనంలోనే అందిపుచ్చుకోడానికి, యూజీగారికి జిడ్డు పరిచయం అవడానికీ మాత్రం అది ఉపయోగపడింది.

అంత సంపన్నులైన కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన యూజీగారి ఆస్తంతా ఎలా ఖర్చయిపోయిందో చదివితే మనకు ఎంతో వింతనిపిస్తుంది. పూర్వకర్మ మనిషిని ఎలా వెంటాడుతుందో, జాతకంలోని యోగాల రూపంలో అది మనిషిని ఎంత బాధపెడుతుందో గమనిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది.

జాతకంలోని పంచమం పుత్రభావం. యూజీగారి జాతకంలో పంచమానికి పాపార్గళం పట్టింది. పంచమాధిపతి శుక్రుడు ఖర్చును సూచించే ద్వాదశంలో నీచకేతువుతో కూడి ఉన్నాడు. బాధకుడూ పుత్రకారకుడూ అయిన గురువు పుత్రస్థానాన్ని చూస్తున్నాడు. ఈ యోగం దేనిని సూచిస్తున్నది? సంతానం కోసం ఆస్తంతా ఆవిరైపోవడాన్ని సూచిస్తున్నది. సంతానంకోసం పడరానిపాట్లు పడటాన్ని సూచిస్తున్నది. చంద్రలగ్నం నుంచి చూస్తే పంచమంలో నీచరాహువున్నాడు. ఇది కూడా సంతానదోషమే. సంతానంవల్ల తీవ్రంగా నష్టపోవడాన్ని, తనవల్ల సంతానం బాధలు పడటాన్ని, ఈ యోగం సూచిస్తున్నది. యూజీగారి జాతకంలో ఇదెలా జరిగిందో గమనిద్దాం.

ఇండియాలో ఉన్నపుడు వారికి ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి పుట్టారు. అబ్బాయి వసంత్ కు చిన్నప్పుడే పోలియో సోకింది. దానికి ఇండియాలో ట్రీట్మెంట్ లేదు. అమెరికాలో మాత్రమే ఉంది. దానికి 90,000 డాలర్లు ఖర్చు అవుతుంది. అప్పట్లో డాలర్ విలువ 3 రూపాయలు మాత్రమే. ఆయన ఆస్తంతా కలిపితే అంతే ఉంది. అయినా సరే, దానిని మొత్తం ఖర్చుపెట్టి పిల్లవాడికి కాళ్ళు బాగు చేయించాలని ఆయన సంకల్పించి కుటుంబంతో అమెరికాకు వెళ్ళాడు. చాలా ఖరీదైన ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ చికాగోలో నాలుగైదేళ్ళపాటు  ఉన్నాడు. ఆ విధంగా ఆ డబ్బంతా ఆవిరైపోయింది. చివరకు చేతిలో చిల్లిగవ్వలేని అడుక్కుండే వాడిగా యూరప్ లో మూడేళ్లపాటు రోడ్లమీద తిరగవలసిన పరిస్థితి పట్టించింది. అయితేనేమి? వసంత్ నడవగలిగాడు.

యూజీగారు అమెరికాకు బయల్దేరింది 1955 లో. ఆయనక్కడ 1960 దాకా ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు బుధమహర్దశలో చివరధైన శనిఅంతర్దశ నుంచి కేతుమహర్దశలో రాహుఅంతర్దశ వరకూ దశలు జరిగాయి. బుధుడు లగ్నాధిపతిగా తననే సూచిస్తున్నాడు. శని అష్టమాధిపతిగా నష్టాన్ని, నవమాధిపతిగా దూరదేశనివాసాన్ని సూచిస్తున్నాడు. మరి బుధ-శనిదశలో విదేశాలకు వెళ్లాడంటే వెళ్ళడూ మరి? ఆ రోజులలో కొడుకు ట్రీట్మెంట్ కోసం తన ఆస్తి మొత్తాన్నీ ఆయన ఖర్చుచేశాడంటే, ఆయనదెంత సుతిమెత్తని మనసో మరి? తల్లిదండ్రులు తమ పిల్లలకు గాని, పిల్లలు తమ తల్లిదండ్రులకు గాని, ఖర్చుపెట్టే ప్రతిపైసాకీ లెక్కచూసుకునే నేటి దగుల్బాజీ తరానికి ఈ ప్రేమ అసలెలా అర్ధమౌతుంది?

కుటుంబసభ్యుల విషయంలో కూడా 'ఎవరెలా పోతే నాకెందుకు? నా పొట్ట చల్లగా ఉంటే చాలు' అనుకునే నీచపుమనుషులు ఈనాటికీ కోట్లసంఖ్యలో ఈ భూమ్మీద ఉన్నారు. యూజీగారి మానసికస్థాయి ఇలాంటివాళ్లకు ఎలా అర్ధమౌతుంది? అప్పట్లో 90,000 డాలర్లంటే నేటి లెక్కల్లో దాదాపు 40 కోట్లు. పిల్లవాడికి కాళ్ళు తిరిగిరావడానికి తన ఆస్తంతా ఆ విధంగా ఖర్చుపెట్టాడాయన.

ఆ తరువాత, అమెరికాలో బ్రతకడానికి ఆయన ఒక లెక్చరర్ గా ఉపన్యాసాలిస్తూ పర్యటనలు చెయ్యడమూ, కుకింగ్ క్లాసులు చెప్పడమూ, చివరకు ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉంటే,  భార్యయైన కుసుమకుమారి గారు అమెరికాలో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించడమూ ఇదంతా 1955 నుంచి 1959 మధ్యలో జరిగింది. ఆ తర్వాత ఆమె, పిల్లలను తీసుకుని ఇండియాకు వెళ్లిపోవడమూ, అమెరికానుంచి యూరప్ చేరిన యూజీగారు 1964 వరకూ దిక్కులేనివాడిగా మూడేళ్లపాటు పారిస్, లండన్ వీధులలో తిరగడమూ ఇవన్నీ జరిగాయి. అవన్నీ ఇంకొక పోస్టులో చదువుకుందాం.

చివరగా జెనీవాలో వాలెంటైన్ డి కెర్వాన్ పరిచయంతో ఆయనకొక ఆశ్రయం దొరికి, ఒక స్థిరత్వం ఏర్పడింది. అప్పటికాయనకు 47 ఏళ్ళు వచ్చాయి.

కాలసర్పయోగం ఉన్న జాతకాలలో 40 ఏళ్లవరకూ స్థిరత్వం ఉండదన్నదీ, మొదట్లో బాగా బ్రతికినవాళ్లు కూడా డబ్బులేక ఇబ్బంది పడతారన్నదీ - ఈ జ్యోతిష్యసూత్రాలన్నీ ఈ విధంగా యూజీగారి జాతకంలో కూడా నిజమైనాయి. కాకపోతే ఆయనకు ఒకమాదిరి స్థిరత్వం రావడానికి 47 ఏళ్ళు పట్టింది. కాలసర్పయోగం ఖచ్చితంగా 40 ఏళ్లకే వదలిపోదు. ఆ తరువాత మెల్లిమెల్లిగా వదలడం మొదలౌతుంది. యూజీగారి విషయంలో అయితే, ఉన్న ఆస్తంతా అప్పటికి కరిగిపోయింది. అమిత సంపన్నుడు ఏమీలేని వాడయ్యాడు.

జాతకయోగాలు ఇలా పనిచేస్తాయి మరి !

(ఇంకా ఉంది)
read more " U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 6 (కాలసర్ప యోగం - పుత్రదోషం) "

4, ఆగస్టు 2020, మంగళవారం

'యోగతారావళి', 'శాండిల్యోపనిషత్' ప్రింట్ పుస్తకాలు విడుదలయ్యాయి

కరోనా టైమ్స్ లో నేను వ్రాసిన ఈ బుక్సన్నీ ఒక్కొక్కటిగా ప్రింట్ అవుతున్నాయి.  ఈ  క్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఈరోజున 'యోగతారావళి', 'శాండిల్యోపనిషత్' అనే రెండు ప్రింట్ పుస్తకాలను విడుదల చేశాము. ఇవి రెండూ యధావిధిగా google play books నుంచి లభిస్తాయి.
read more " 'యోగతారావళి', 'శాండిల్యోపనిషత్' ప్రింట్ పుస్తకాలు విడుదలయ్యాయి "

3, ఆగస్టు 2020, సోమవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 5 (చిన్ననాటి బీజాలు)

ఏ మనిషి జీవితమైనా, అతని బాల్యంలోని మొదటి ఏడేళ్ల కొనసాగింపేనని మనస్తత్వశాస్త్రం అంటుంది. మొదటి ఏడేళ్ల జీవితంలో పడిన బీజాలే తరువాతి జీవితాన్ని నిర్మిస్తాయి. చిన్నప్పుడు అణచివేతకు గురైనవాళ్లు వారి తర్వాతి జీవితంలో తిరుగుబాటు దారులౌతారు. చిన్నపుడు భయభ్రాంతులకు  గురైన వాళ్లు పెద్దయ్యాక సాహసకార్యాలు చేస్తారు. చిన్నప్పుడు ప్రేమకు నోచుకోనివాళ్ళు  తరువాతి జీవితంలో ప్రేమకోసం తపిస్తారు, తమకు ఎదురైన అందరిలోనూ  దానిని వెతుక్కుంటారు.

ఆఫ్ కోర్స్ అందరికీ ఇలా జరగాలని రూలేమీ లేదు. కొంతమందికి జన్మంతా బాల్యంగానే నడుస్తుంది. వారి చిన్నప్పటి బీజాలు చివరిదాకా ఉంటాయి. మరికొంతమందిలో మాత్రం ఒక స్థాయినుంచి వాటికి పూర్తి వ్యతిరేకపోకడలు గోచరిస్తాయి. మనం అందరినీ ఒకే గాటన కట్టలేం. ఎవరి తత్త్వం వారిదే. ఈ సృష్టిలో ప్రతి మనిషీ విభిన్నుడే, విలక్షణుడే. కాకపోతే మానవజాతిని కొన్ని కొన్ని గ్రూపులుగా విభజించవచ్చు. అంతే ! మళ్ళీ ఆ గ్రూపులలో కూడా ఎవరి వ్యక్తిగత ప్రయాణం వారిదే. ఎవరి జీవితమైనా ఇంతే ! ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండదు.

మానవజీవితపు మౌలికసమస్యల పరిష్కారానికి లోతైన చింతనతో సమాధానాలు కనుక్కోవాలని ప్రయత్నించే ప్రతి ఆధ్యాత్మికుడూ నా దృష్టిలో ప్రేమకోసం తపించే ఒక ప్రేమికుడే. అతడు బైటకి బండరాయిలాగా కనిపించవచ్చు. కానీ లోలోపల మాత్రం అతి సున్నితమైన హృదయం అతనిలో ఉంటుంది. దానిని తాకగలిగిన వాళ్లకి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అలా తాకగలగాలంటే ముందుగా మనలో అలాంటి హృదయం ఉండాలి. లేకుంటే అలా చెయ్యడం అసంభవమౌతుంది. మనలో లేనిదాన్ని బయట మనమెలా చూడగలం?

యూజీగారు కూడా ప్రేమకోసం జీవితమంతా తపించిన ఒక ఉన్నతమైన ఆత్మ అని నా భావన. ఆయనను బాగా ఎరిగినవారు నా భావాన్ని అర్ధం చేసుకోగలుగుతారు. పైపైన పుస్తకాలు చదివి ఏవేవో భావాలు ఏర్పరచుకున్నవారికి మాత్రం నేను చెబుతున్నది వింతగా అనిపించవచ్చు. కొంచం వివరిస్తే నా భావమేంటో అర్ధం అవుతుంది.

యూజీగారి తల్లి చనిపోయిన వెంటనే తండ్రిగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. యూజీగారిని పట్టించుకోలేదు. యూజీగారు తన తాతయ్య సంరక్షణలో పెరిగారు గనుక ఆయనకు తండ్రిప్రేమ తెలియదు. తను పుట్టిన ఏడవరోజునే తల్లి గతించింది గనుక తల్లిప్రేమా తెలియదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలు పెద్దయ్యాక తిరుగుబాటుదారులుగా తయారౌతారన్నది సత్యం. దీనిని  ఎంతోమంది జీవితాలలో గమనించవచ్చు.

బాల్యంలో బాధలు పడనివారికి నిజమైన ఆధ్యాత్మికత  ఎంతమాత్రమూ అందదనేది  నేనెప్పుడూ చెప్పే మాట ! ఎందుకంటే, అలాంటివాళ్లకే జీవితం పట్ల లోతైన చింతనా, పరిశీలనా కలుగుతాయి. ఇవి రెండూ లేనప్పుడు మతాచారాలు వంటబట్టవచ్చు, పూజలు చెయ్యవచ్చు, కానీ నిజమైన ఆధ్యాత్మికత మాత్రం అందదు. మతాన్ని అనుసరించడానికీ ఆధ్యాత్మికతకూ ఎలాంటి సంబంధమూ లేదు. ఒకవ్యక్తి జీవితమంతా పూజలు పునస్కారాలు సాధనలు చెయ్యవచ్చు. కానీ నిజమైన ఆధ్యాత్మికతను అందుకోలేకపోవచ్చు. ఇంకొకడు ఇవేవీ చేయకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికశిఖరాలను అధిరోహించవచ్చు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, ఇది సాధ్యమే ! ఆసలైతే, చాలాసార్లు ఇలాగే జరుగుతుంది కూడా !

ఇలాంటి బాధాకరమైన స్థితులను చిన్నప్పుడు అనుభవించిన పిల్లలకు ఆధ్యాత్మికచింతన గనుక వారి లోలోపల ఉన్నట్లయితే, పెద్దయ్యాక రెండువిధాలుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఒకటి - పూర్తిగా ఒంటరిగా, ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండే అంతర్ముఖులుగా నైనా అవుతారు. లేదా రెండు - తమచుట్టూ పెద్ద సంస్థలను నిర్మించుకుని ఎంతోమంది అనుయాయులను  చేర్చుకునే  విశ్వమానవులైనా అవుతారు. అంతిమంగా రెండూకూడా,చిన్నప్పుడు తాము పోగొట్టుకున్న ప్రేమను వెదుక్కునే దారులే అవుతాయి. మొదటిదాంట్లో అయితే, తమను తాము తెలుసుకున్న ఆత్మజ్ఞానులై ఆ స్థితిద్వారా విశ్వమంతటికీ మూలమైన చైతన్యంతో మమేకం అవుతారు. రెండవదానిలో అయితే, అన్ని జీవులలోనూ అభివ్యక్తమౌతున్న విశ్వచైతన్యంతొ అనుబంధం ఏర్పరచుకుని అందరికీ తమ ప్రేమను పంచుతారు. యూజీగారిలో ఈ రెండూ విభిన్నమైన పాళ్ళలో జరిగాయని నా నమ్మకం.

అయితే, ఇలాంటి పిల్లలకు వారి జీవితాలలో రెండువిధాలైన సంఘర్షణలుంటాయి. ఒకటి - తాము పోగొట్టుకున్నదాన్ని పట్ల హృదయపు లోతులలో ఉండే బాధ. రెండు - సాటిమనుషుల ప్రవర్తనవల్ల ఇంకా గాయపడే పరిస్థితి. ఇలాంటి పిల్లలు పెరిగే వయసులో, తమ చుట్టూ ఉన్న సమాజంలోని మనుషులు తమను అనే సూటిపోటి మాటలు ఆ పసిమనసులను తీవ్రంగా గాయపరుస్తాయి. వారు చనిపోయేవరకూ మానని గాయాలుగా అవి వారి లోలోపల ఉండిపోతాయి. ఈ రెండురకాలైన బాహ్య, అంతరిక సంఘర్షణలను వారు ఎదుర్కొనే తీరును బట్టి, వాటిని సమన్వయం చేసుకునే తీరునుబట్టి, లోకులతో వారు ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుంది.

మన చెత్త సమాజంలో సూటిపోటి మాటలకు కొదవేమీ ఉండదు. అందులోను నూరేళ్ళక్రితం లోకులకు పనీపాటా ఏముంది గనుక? అరుగుల మీద కూచోని అందరినీ కామెంట్ చెయ్యడం తప్ప అప్పట్లోని దగుల్బాజీ సమాజానికి వేరేది ఏమి చేతనైంది? ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మనుషుల మనస్తత్వాలలో పెద్ద మార్పేమీ లేదనుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అయితే అస్సలు మార్పే లేదు. గాసిప్ అనేది వారిలోనే ఎక్కువ. మానసిక సమస్యలు కూడా వారిలోనే ఎక్కువ.

తమ అసలైన బాధ్యతను తప్పించుకుంటూ, లోకాన్ని మోసం చేస్తున్న నకిలీగురువులలో - చిన్నప్పుడు తనను బాధ్యతారహితంగా గాలికి వదిలేసిన  తన తండ్రిని యూజీగారు చూచారని నా మనస్తత్వ విశ్లేషణ. అందుకే ఆయన గురుద్వేషిగా తయారయ్యారు. చిన్నప్పటినుంచీ తన తండ్రిమీద గూడుకట్టుకున్న కోపం తనకే తెలియకుండా వారిమీద ప్రతిఫలించింది. అందుకే, గురువుల పేరెత్తితే ఆయన అగ్గిమీద గుగ్గిలం అయిపోయేవారు. వారిలోని అనైతికతనూ, బాధ్యతా రాహిత్యాన్నీ కటువైన పదాలతో తూర్పారబట్టేవాడు. ఆ వీడియోలను చూస్తున్నపుడు, ఆయన అనుభవించిన బాధాకరమైన బాల్యం నా కంటికి కనిపించింది.

జ్యోతిష్యశాస్త్రంలో కూడా నవమస్థానమనేది తండ్రికి, గురువులకు ఇద్దరికీ సూచకమౌతుందనేది జ్యోతిష్యశాస్త్రపు ఓనమాలు తెలిసినవారికి విదితమే కదా ! పాశ్చాత్య జ్యోతిష్యశాస్త్రంలో తండ్రిని దశమస్థానం సూచిస్తుంది. గురువును నవమస్థానం సూచిస్తుంది. కానీ భారతీయజ్యోతిష్యశాస్త్రంలో రెండింటినీ నవమస్థానమే సూచిస్తుంది. ఆఫ్ కోర్స్, నన్నడిగితే మాత్రం, తండ్రే గురువై గాయత్రీఉపదేశం చేసే ప్రాచీనకాలంలో అది నిజం కావచ్చునేమో గాని, నేడు మాత్రం పాశ్చాత్యజ్యోతిష్య భావనే సరియైనదని అంటాను. నేటి తండ్రులలో గురుత్వం ఎక్కడుందసలు? అంతా లఘుత్వం తప్ప ! ఇంకా చెప్పాలంటే, చాలామంది తల్లిదండ్రులైతే తమ పిల్లలచేత ఆధ్యాత్మిక పాఠాలు చెప్పించుకునే దురవస్థలో పడి ఉన్నారు. ఇదీ నేటి తల్లితండ్రుల దుస్థితి !

అయితే, మహనీయుల జీవితాలలో ఇలాంటి అవకతవక పరిస్థితులు ఎందుకు కలుగుతాయి? వారి జీవితం వడ్డించిన విస్తరిగా ఎందుకుండదు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ముందే చెప్పినట్లు, సామాన్యుల జీవితమైనా, అసామాన్యుల జీవితమైనా, వారి పూర్వకర్మను బట్టి, పూర్వ సంస్కారాలను బట్టి జరుగుతుంది. ఆ కర్మ ఒకచోటకు పోగుపడి, ఈ జన్మలో వారి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అలాంటి మనిషికి ఇదే ఆఖరు జన్మ అయినప్పుడు, ఈ జన్మలో అతడు మోక్షాన్ని లేదా జ్ఞానసిద్ధిని పొందుతున్నపుడు, ఆ పోగుబడిన పూర్వకర్మయే అతని సాధనా మార్గాన్ని కూడా చిత్రిస్తుంది. ఆ క్రమంలోనే అతడి భావ వ్యక్తీకరణా, లోకంతో అతడు ప్రవర్తించే తీరులు నడుస్తాయి.

యూజీగారికి ఇదే జరిగిందని నా ఊహ.

ఆయన జాతకంలో తండ్రిని సూచిస్తున్న దశమాధిపతి గురువు లగ్నంలోనే ఉన్నాడు. అయితే మిధున లగ్నానికి గురువు బాధకుడు. మంచిని చెయ్యడు. కనుక తండ్రివల్ల ఆయనకేమీ మంచి జరుగలేదు. కానీ గురువుయొక్క లగ్నస్థితివల్ల తండ్రి నీడ ఆయనను జీవితమంతా వెంటాడిందని చెప్పవచ్చు. విక్రమస్థానానికి అధిపతి అవుతూ, మాటతీరును సూచించే సూర్యుడు కూడా గురువుతో కూడి ఉన్నందున యూజీగారి మాట సూటిగా, పదునుగా, మింగుడు పడనట్లుగా ఉండేది. అదే ఆసమయంలో గురువు యొక్క బాధకత్వం వల్ల గురువుల గురించి ప్రస్తావన వస్తే మాత్రం ఆయనలోని రుద్రస్వరూపం బయట పడేది. యూజీగారిలో రుద్రాంశ ఉన్నదని నా నమ్మకం. ఆయన మొదటగా పొందిన ఉపదేశంకూడా శివమంత్రమే కావడం గమనార్హం. 

రవి గురువులకు పట్టిన పాపార్గళమూ, వారిమీద ఉన్న కుజుని కేంద్రదృష్టీ గుర్తుంటే, వాదనలు పెట్టుకుని రెచ్చగొట్టేవారితో యూజీగారి మాటలు అంత కరుకుగా ఎందుకున్నాయో అర్ధమౌతుంది.

యూట్యూబులో మనకు లభిస్తున్న వీడియోలు చూసి ఆయనకు మహాకోపమని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఆయనను రెచ్చగొడితే అలా మాట్లాడేవాడు గాని, మామూలుగా ఉన్నపుడు ఆయన చాలా శాంతమూర్తి అని, అత్యంత మర్యాదస్తుడని, నిజాయితీకి ప్రతిబింబమని ఆయనను ఎరిగినవాళ్లు వ్రాశారు. ఆయనతో ఎన్నో ఏళ్ళు కలసి జీవించిన వాలెంటైన్ అయితే, ఆయనంత మంచిమనిషిని తన జీవితంలో చూడలేదని అన్నది.

ఒక జ్ఞానికి అంత కోపమేంటని ఆ వీడియోలలోనే కొందరు కామెంట్ చేశారు. ఆ కామెంట్ చదివినప్పుడు నాకు నవ్వొచ్చింది. ప్రతిదానినీ అంచనా వేసినట్లు, తీర్పు తీర్చినట్లు, లోకులు జ్ఞానుల పరిస్థితిని కూడా అంచనా వెయ్యబోతారు. వారెలా ఉండాలో వీరు చెప్పబోతారు. ఎంత హాస్యాస్పదం ! జ్ఞానమంటే ఏమిటో, దానిని పొందినవాని పరిస్థితి ఎలా ఉంటుందో, అదంటే ఏమాత్రమూ తెలియని అజ్ఞానులు తీర్పులు తీరుస్తారు. లోకం ఎంత మాయలో ఉందో, ఎంత చవకబారు మనుషులతో నిండి ఉందో, అని నాకెప్పుడూ అనిపించినా, ఇలాంటి లేకిమనుషుల పిచ్చివ్యాఖ్యలు చదివినప్పుడు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. గురువంటే ఇలా ఉండకూడదని అనుకుంటూ నన్ను కూడా చాలామంది వదిలేసిపోయారు. వారి అజ్ఞానానికి నవ్వుకోవడం తప్ప నేనేం చెయ్యగలను మరి !

జ్ఞానులంటే చచ్చిన శవాలలాగా పడుండాలని, అందరినీ ప్రేమించాలని, శాంతమూర్తులుగా ఉండాలని అనేకులు భావిస్తారు. ఈ భావాలన్నీ పుస్తకాలు చదివి, సినిమాలు చూసి, మతబోధకులు చెప్పే కాకమ్మకబుర్లు విని లోకులు ఏర్పరచుకునే గాలి అభిప్రాయాలు మాత్రమే. అవి నిజాలు కావు. మానవులలో ఎన్ని రకాలున్నాయో, జ్ఞానులలో కూడా ఉంటాయి. జ్ఞానులలో స్థాయీభేదం లేదని, వారందరి స్థాయీ ఒక్కటిగానే ఉంటుందని  కొందరంటారు. ఇది కూడా అజ్ఞానపూరితమైన పొరపాటు అభిప్రాయమే.

ఒక యువకునిగా యూజీగారు అడిగినప్పుడు కూడా రమణమహర్షి ఇదే చెబుతూ, జ్ఞానంలో భేదాలు లేవన్నారు. కానీ నా ఉద్దేశ్యం వేరుగా ఉన్నది. రమణమహర్షి చెప్పినది పూర్తినిజం కాదని నా ఉద్దేశ్యం. 'రమణమహర్షి కంటే నీకెక్కువ తెలుసా?' అని మీరు నన్నడిగితే ఏమీ చెప్పలేను గాని, బ్రహ్మవేత్తలలో కూడా 'బ్రహ్మవిద్, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరేణ్య, బ్రహ్మవిద్వరిష్ట' అంటూ నాలుగు భేదాలున్నాయని యోగవాశిష్టాది అద్వైతగ్రంధాలలో చెప్పబడిన విషయాన్ని వారికి గుర్తుచేస్తాను.

'బాలోన్మత్తపిశాచవత్' అంటూ - జ్ఞానియైనవాడు కొన్నిసార్లు బాలునిలా, కొన్నిసార్లు పిచ్చివానిలా, కొన్నిసార్లు పిశాచంలా తిరుగుతూ ఉంటాడని, ప్రవర్తిస్తాడని కూడా మన శాస్త్రాలలో చెప్పబడిందన్న సంగతి వారికి మనవి చేస్తాను.

ఏతావాతా నేను చెప్పేదేమంటే - జ్ఞానులైనా సరే, వారివారి పూర్వ సంస్కారాలను బట్టి, దానికనుగుణంగా ఈ జన్మలో వారి అనుభవాలను బట్టి, ఇంకా మిగిలి ఉన్న వారి కర్మను బట్టే లోకంతో ప్రవర్తిస్తారు. దానిని చూచి వారి జ్ఞానపు స్థాయిని అంచనా వేసే వెర్రి లోకులు  ఘోరంగా మోసపోయి, ఆ జ్ఞానుల నుంచి పొందవలసిన మేలును కోల్పోతూ ఉంటారు. ఇదే మహామాయ ఆడే ఆట !

జ్ఞానియైనవాడి స్థితిని ఎవరుబడితే వారు గుర్తించగలిగితే, వాళ్ళ జన్మలు ధన్యములైపోవూ? అలా ప్రతివాడూ గుర్తిస్తే ఈ సృష్టి ఆట నడిచేదెట్లా మరి ??

(ఇంకా ఉంది)
read more " U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 5 (చిన్ననాటి బీజాలు) "

2, ఆగస్టు 2020, ఆదివారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 4 (గురుద్వేషి)

మనిషి పుట్టిన సమయంలో ఉన్న గ్రహస్థితులు అతని జీవితాన్ని  ప్రతిబింబించినట్లే, ఆ సమయంలో జరుగుతున్న గ్రహదశకూడా అతని జీవితాన్ని సూక్ష్మంగా సూచిస్తుంది. ఆ గ్రహదశలోనే ఆ జాతకుని జీవితం మొత్తం ఒక చిన్న నమూనా 
(capsule) లో నిక్షిప్తం చేయబడి మనకు గోచరిస్తుంది. నా పుస్తకం Medical Astrology Part -1 లో ఈ సూత్రాన్ని విశృంఖలంగా వాడాను. నూరు జాతకాలను విశ్లేషణ చేసిన ఆ పుస్తకంలో ప్రతి జాతకమూ ఈ సూత్రానికి తలొగ్గింది.

యూజీ  గారి జాతకంలో చూస్తే, ఆయన పుట్టినపుడు పునర్వసు నక్షత్రం గనుక గురుమహర్దశ నడుస్తున్నది. అందులోనూ, గురు - రాహు-బుధ - శని దశ నడిచింది. వీటిలో గురు - రాహు సంబంధం గురుఛండాలయోగాన్ని సూచిస్తుంది. అంటే, తీవ్రమైన గురుద్రోహాన్ని చేసినవారు గాని, గురువులతో తీవ్రంగా శత్రుత్వం పెట్టుకునే వారుగాని, గురువుల వల్ల ఘోరంగా మోసపోయేవారు గాని ఈ దశలో పుడతారు.

రాహు-బుధుల యోగం ఎన్నో శాస్త్రాలను తెలుసుకునే అఖండమైన తెలివితేటలను, సాంప్రదాయాన్ని ఏకి పారేసే తిరుగుబాటు ధోరణినీ, కులమతాలకు అతీతమైన  విశాలభావాలనూ  సూచిస్తుంది.

బుధ-శనుల యోగం తల్లికి గండాన్ని, బాధలతో కూడిన దుర్భరజీవితాన్ని, కుమిలిపోయే మనసునూ, అంతర్ముఖత్వాన్నీ సూచిస్తుంది.

గురు-శనుల యోగం దృఢమైన కర్మనూ, తీవ్రమైన కష్టాలతో కూడిన జీవితాన్నీ సూచిస్తుంది.  గురు-బుధయోగం సాంప్రదాయబద్ధమైన నడవడికను సూచిస్తుంది. రాహు-శనుల కలయిక శపితయోగాన్ని సూచిస్తూ, స్థిరమైన ఉద్యోగంగాని, ఆదాయం గాని లేకపోవడాన్ని, ఉన్నదంతా ధ్వంసం కావడాన్ని సూచిస్తుంది.

యూజీగారి జీవితం ఇదిగాక ఇంకేముంది మరి? ఈ విధంగా జననకాలదశను బట్టి ఒకరి జీవితాన్ని క్షుణ్ణంగా ఆ జాతకుడు పుట్టినప్పుడే చెప్పేయవచ్చు. ఇది ప్రాచీనజ్యోతిష్కులకు తెలిసిన అనేక రహస్యాలలో ఒక రహస్యం.

యూజీగారి గతజన్మలలో ఒకదానిలో గురువుల వల్ల ఆయన ఘోరంగా మోసపోయారు. మనస్పూర్తిగా నమ్మిన గురువులు ఆయన కుటుంబాన్ని మోసం చేశారు. వారి అనైతిక ప్రవర్తనవల్ల వారి ఇంటిలో ఘోరమైన పనులు జరిగాయి. వాటిని చూచి ఆయన మనస్సు విరిగిపోయింది. అదే అసహ్యం, గురువులపట్ల కసిగా ఆయన మనస్సులో బలమైన ముద్రగా పడిపోయింది. ఆ సంస్కారం ఈ జన్మకు బదిలీ అయింది. అందుకనే, గురువుల మాటెత్తితే చాలు, ఈ జన్మలో కూడా ఆయన ఉగ్రరూపం దాల్చేవారు.

'ఇదంతా మీకెలా తెలిసింది? ఎలా చెప్పగలుగుతున్నారో ఆయా జ్యోతిష్యసూత్రాలను బహిర్గతం చెయ్యండి' అని మాత్రం నన్నడక్కండి. అన్ని రహస్యాలనూ లోకానికి తెలియజెప్పవలసిన పని నాకులేదు. నమ్మితే నమ్మండి. లేకపోతే మీ ఖర్మ ! నాకు తెలిసినవి బ్లాగులో వ్రాసున్నంతమాత్రాన మిమ్మల్ని నమ్మించవలసిన పని నాకులేదు. ఇప్పటివరకూ నా బ్లాగులో నేను వ్రాసిన జ్యోతిష్యసూత్రాలను కాపీ కొట్టి సమాజాన్ని ఎంతమంది కుహనా కుర్రజ్యోతిష్కులు ఎలా మోసం చేస్తున్నారో, ఎంతెంత డబ్బు సంపాదిస్తున్నారో నాకు బాగా తెలుసు. వారికి ఇంకా కొత్తకొత్త మెటీరియల్ సప్లై చేసి వారి అనైతిక వ్యాపారాన్ని పెంచవలసిన ఖర్మ నాకు లేదు. కనుక ఆ రహస్యాలను వెల్లడించను.

యూజీగారి యూట్యూబ్ వీడియోలను చూస్తే చాలు, గురువులంటే ఆయనకెంత కసి ఉండేదో మీరు అర్ధం చేసుకోవచ్చు. జిడ్డు కృష్ణమూర్తిని పబ్లిగ్గా 'బాస్టర్డ్' అని బహుశా ఇంకెవరూ తిట్టి ఉండరు. ఆయన అలా తిడుతున్న రోజుల్లో ఎందుకు తిడుతున్నాడో తెలీక చాలామంది ' జిడ్డు అంటే ఈయనకు అసూయ. ఆయనలా పేరు సంపాదించ లేకపోయానని ఈయనకు కుళ్ళు. అందుకే అలా తిడుతున్నాడు' అనుకునేవారు. కానీ నిజం అది కాదు. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, శిష్యులు ఇలాంటి చెత్తను యూజీగారు ఎప్పుడూ లెక్కచేయ్యలేదు. ఆయన అచ్చమైన అవధూతగా,  స్వచ్ఛమైన జ్ఞానిగా, ఎక్కడా రాజీపడకుండా ఒక ఆధ్యాత్మికసింహం లాగా బ్రతికాడు. ఆయనగాని సమాజాన్ని మోసం చెయ్యాలని అనుకున్నట్లైతే, ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మికసంస్థకు అధిపతి అయ్యి ఉండేవాడు. ఎందుకంటే, రమణమహర్షికున్న జ్ఞానమూ, వివేకానందునికున్న వాగ్ధాటీ, నిక్కచ్ఛితో కూడిన నిజాయితీ మనస్తత్వమూ,ఒకరిని మోసంచెయ్యని గుణమూ, కుండలినీ జాగృతీ, నిజమైన ఆధ్యాత్మిక సంపదా ఆయనకున్నాయి. వాటిని ఉపయోగిస్తే, లౌకిక సంపదలలో, పేరుప్రఖ్యాతులలో, ఈనాటి సోకాల్డ్ గురువులకంటే ఎక్కడో చుక్కల్లో ఆయన ఉండగలిగేవాడు. కానీ ఆయన అలాంటి ఛండాలపు పనులను చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు.

'రాధా రాజగోపాల్ స్లాస్' వ్రాసిన ' Lives in the shadow with j. Krishnamurti' అనే పుస్తకం చదివాక ప్రపంచానికి అర్ధమైంది యూజీగారు జిడ్డుని 'బాస్టర్డ్' అని ఎందుకు తిట్టేవాడో? తన తల్లియైన రోసలిన్ కీ జిడ్డుకీ ఉన్న అక్రమసంబంధాన్ని ఆ పుస్తకంలో రాధా రాజగోపాల్ చాలా రసవత్తరంగా వర్ణించింది. అంతేగాక, తన తల్లికి జిడ్డు మూడుసార్లు అబార్షన్ చేయించాడని స్పష్టాతిస్పష్టంగా వ్రాసింది. అసలు తను, జిడ్డు కూతుర్నే అని తనకు బాగా అనుమానమని కూడా వ్రాసింది. ఇవన్నీ చదివాక జిడ్డుపైన ఏర్పరచుకున్న భ్రమలన్నీ లోకానికి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. జనాలకి అప్పుడర్ధమైంది యూజీ జిడ్డుని ఎందుకలా తిట్టేవాడో? నన్నడిగితే ఆ పదం చాలా చిన్నదంటాను.

రజనీష్ ని యూజీ 'పింప్' అనేవాడు. రజనీష్ ఆశ్రమంలో జరిగిన విషయాలను దగ్గరనుంచి చూసినవాళ్లకు ఆ మాట చాలా చిన్నపదంగా తోస్తుంది. 1960 లలో తన దగ్గరకు అప్పుడే రావడం మొదలుపెట్టిన తెల్లవాళ్ళను తరచుగా రజనీష్ ఒక మాట అడిగేవాడని ఆ తెల్లవాళ్లే వ్రాశారు అదేంటంటే - 'నువ్వొచ్చి ఇన్నాళ్లయింది. మా ఆశ్రమంలో నీకు నచ్చిన ఎవరైనా అమ్మాయిని తగులుకున్నావా లేదా?'. ఇలాంటి సంబంధాలను రజనీష్ ప్రోత్సహించేవాడు. అంతేకాదు, తన శిష్యులలో డ్రగ్సు స్మగ్లర్లూ, డబ్బుకోసం పడకసుఖం పంచుకునే తెల్లమ్మాయిలూ ఉన్నారన్న విషయం తనకు తెలిసినా వారిని ఏమీ అనేవాడు కాదు. పైగా, జ్ఞానం పొందటానికి నువ్వేం చేసినా తప్పులేదని ఆయా పనులను సమర్ధించేవాడు. చివరకు రజనీష్ ఆశ్రమం ఏమైందో మనకందరికీ తెలుసు. నేను 1998 లో అక్కడ మూడ్రోజులున్నాను. పైపై నటనలు, వేషాలు తప్ప నిజమైన ఆధ్యాత్మికత అక్కడ ఏ కోశానా నాక్కనిపించలేదు. రజనీష్ పుస్తకాలు చదివి, అక్కడ ఏముందో చూద్దామని వెళ్లిన నేను తీవ్ర ఆశాభంగం చెందాను. ఆధ్యాత్మికత తప్ప మిగిలిన చెత్త అంతా నాకక్కడ కనిపించింది. కనుక రజనీష్ ని యూజీ అలా తిట్టడం సబబే అని నా ఉద్దేశ్యం.

సత్యసాయిబాబాను 'క్రిమినల్' అని యూజీ తిట్టేవాడు. ఆయన చనిపోయిన సమయంలో ఆశ్రమంలో నుంచి ఎంత నల్లధనమూ బంగారమూ లారీలకు లారీలు ఎలా తరలించబడిందో అందరికీ తెలుసు. రాజకీయనాయకులు ఎందుకు ఆయన దగ్గరకు పరుగులెత్తేవారో, చివర్లో ఎందుకు అంత గాభరాపడి, ఆశ్రమానికి పరుగులు తీశారో అర్ధం చేసుకోవడానికి పెద్ద తెలివితేటలేమీ  అక్కర్లేదు, ఆశ్రమంలో జరిగిన విద్యార్థుల హత్యలూ, తెల్లమ్మాయిల రేపులూ హత్యలూ బయటకు రాకుండా ఎలా గప్ చుప్ అయ్యేవో అక్కడి స్థానికులకు, అప్పటి పోలీసు అధికారులకూ బాగా తెలుసు. కానీ లోకానికి జరిగే ప్రచారం వేరుగా ఉండేది. కేవలం మార్కెటింగ్ వల్లనే ఆయనొక 'గాడ్ మేన్' అయ్యాడు. ఆయన చేసిన బూడిదమహిమలన్నీ చిల్లర మేజిక్ ట్రిక్కులని వీడియో కెమెరాలు చివరకు పట్టేశాయి. వెరసి ఒక 50 ఏళ్లపాటు అబద్ధప్రచారంతో లోకం ఘోరంగా మోసపోయింది. ఇంటింటా భజనలు జోరుగా సాగాయి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు, మంత్రులు, దేశాధినేతలు అందరూ ఈ బుట్టలో పడ్డారు. అంతెందుకు? మా మేనమామ మద్రాస్ ఐఐటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేసేవాడు. ఆయన సత్యసాయికి వీరభక్తుడు. నేను చాలా చిన్నపిల్లవాడిని. కానీ నాకెందుకో ఆయన మూఢభక్తి నచ్చేది కాదు. తర్వాత్తర్వాత బాబాబండారం బయటపడ్డాక లోకానికి అర్ధమైంది యూజీలాంటి నిజమైన జ్ఞానులు సత్యసాయిని అలా ఎందుకు తిట్టేవారో?

ఈ 'గురుద్వేషం' అనిన విషయాన్ని జ్యోతిష్యకోణంలోనుంచి చూచినప్పుడు యూజీగారు పుట్టిన గురు-రాహుదశ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. దీనినే 'ఛిద్రదశ' అని కూడా జ్యోతిష్యశాస్త్రంలో పిలుస్తారు. అంటే, అన్నింటినీ ధ్వంసం చేసి పగలగొట్టి పారేసే దశ అని అర్ధం. అలాంటి దశలో పుట్టిన వ్యక్తి, అందులోనూ తీవ్ర అంతరిక సంఘర్షణతో జ్ఞానసిద్ధిని పొందిన వ్యక్తి, నకిలీ గురువుల్ని అలా తిట్టాడంటే వింత ఏముంటుంది? తిట్టకపోతే వింతగాని?

(ఇంకా ఉంది)
read more " U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 4 (గురుద్వేషి) "