“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, సెప్టెంబర్ 2019, బుధవారం

శుక్రుని నీచస్థితి - సెక్స్ కుంభకోణాలు - అర్ధాంతర మరణాలు

ప్రతి ఏడాదీ సెప్టెంబర్ లో శుక్రుడు నీచస్థితిలోకి (కన్యారాశిలోకి) వస్తూ ఉంటాడు. ఈ స్థితిలో ఆయన ఒక నెలపాటు ఉంటాడు. అదేచోట బుధుడు ఉఛ్చస్థితిలో ఉంటాడు. కన్యారాశి మూడోపాదంలో ఉన్నపుడు నవాంశలో వీరిద్దరి స్థితులు రివర్స్ అవుతాయి. అంటే బుధుడు నీచస్థితిలోకి, శుక్రుడు ఉఛ్చస్థితిలోకి పోతారు. రాశి నవాంశలలో వ్యతిరేక స్థితులలో వీరుండటం సమాజంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇవి, సెక్స్ కుంభకోణాలు, అసహజమైన మానవసంబంధాలు బయటపడటం, జలప్రమాదాలు జరగడం, శుక్రసంబంధమైన రోగాలతో మనుషులు చనిపోవడం మొదలైన రూపాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్నేళ్లపాటు సెప్టెంబర్ అక్టోబర్ లలో వార్తలను గమనిస్తే, నేను చెప్పిన ఈ ట్రెండ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. మనుషుల మీద గ్రహప్రభావం ఖఛ్చితంగా ఉంది అనడానికి ఇదొక ఉదాహరణ. 

ఈ నెల 15 తేదీన శుక్రుడు నవాంశలో ఉఛ్చస్థితికి వచ్చాడు.  కానీ రాశిలో నీచస్థితిలో ఉన్నాడు. సరిగ్గా ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 14 తేదీన స్వామి చిన్మయానంద్ తనను రేప్ చేశాడంటూ ఒకమ్మాయి ఫిర్యాదు చెయ్యడమే కాక, దానికి సంబంధించిన 43 వీడియో క్లిప్స్ ఉన్న పెన్ డ్రైవ్ ను సిట్ టీమ్ కి సమర్పించింది. ఈ వీడియో క్లిప్స్ ఇప్పుడు చాలామంది దగ్గర ఉన్నాయి. మా ఫ్రెండ్ ఒకడి మొబైల్లో కూడా ఉన్నాయి. చూస్తావా అని ఫ్రెండ్ గాడు నన్నడిగాడు. నాకు అక్కర్లేదని చెప్పాను. ఈ కేసు ఇంకా తేలలేదు. విచారణ జరుగుతూనే ఉంది.

సెప్టెంబర్ 16 న గోదావరిలో లాంచీ మునిగి దాదాపు 40 మంది చనిపోయారు. ఇది కూడా శుక్రుని నీచ/ఉఛ్చస్థితుల ప్రభావమే. చంద్రునితోబాటు శుక్రుడు కూడా నీటికి, వరదలకు, జలప్రమాదాలకు కారకుడని గుర్తుండాలి.

సెప్టెంబర్ 17 న రాజస్థాన్ లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాల వల్ల జలమయం అయ్యాయి. ఇది కూడా శుక్రుని జలకారకత్వపు విపరీత పరిణామమే.

సెప్టెంబర్ 23 న సౌత్ ఢిల్లీలోని ఒక బార్ లో రాత్రి పదిన్నర సమయంలో , కొందరు యువకులు తమను వేధించారంటూ కొందరు యువతులు కేసు పెట్టారు. ఆ సమయంలో అమ్మాయిలు బార్లో ఉండి త్రాగడం ఏమిటని మాత్రం ఎవరూ అడగడం లేదు.

వానలకు అమీర్ పేట మెట్రో స్టేషన్ సీలింగ్ పెచ్చు ఊడి తలమీద పడి 26 ఏళ్ల యువతి మొన్న చనిపోయింది. వానలు, యువతీ, రెండూ శుక్రుని కారకత్వం లోనివే.  

నిన్నటినుండీ ఆంధ్రా తెలంగాణాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న హైదరాబాద్లో పడిన వానకు అనేక రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. జనం నానా అవస్థలు పడ్డారు. స్కూటర్లు మునిగిపోయేంత నీరు పారడం హైదరాబాద్లో నేను స్వయంగా చూచాను. ఇదీ శుక్రుని జలకారకత్వ పరిధిలోదే.

ఇవిగాక ప్రతిరోజూ చిన్నాచితకా సెక్స్ కుంభకోణాలు, వెర్రిపోకడలు మన దేశంలో బయటపడుతూనే ఉన్నాయి. ఇక భూమ్మీది మిగతా దేశాలలోని వార్తల గురించి నేను వ్రాయబోవడం లేదు. మీరే చూసుకోండి.

ఇవి గాక, ఇదే సమయంలో కోడెల శివప్రసాద్ బలవన్మరణమూ (ఇది బుధుని స్థితివల్ల జరిగింది. దీనివల్ల తీవ్రమైన మానసిక అలజడి అశాంతి పుట్టుకొస్తాయి), నేడు సినీనటుడు వేణుమాధవ్ చనిపోవడమూ కూడా శుక్రుని నీచస్థితి పరిణామమే. వేణుమాధవ్ ఏదో నయంకాని రోగంతో బాధపడుతున్నాడని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అందులో నిజం ఉంటే, ఇదీ శుక్రుని కారకత్వమే.

జాగ్రత్తగా గమనిస్తే, గ్రహస్థితులకూ మన చుట్టూ జరిగే సంఘటనలకూ ఈ విధమైన సూక్షసంబంధాలను మనం తెలుసుకోవచ్చు. 
read more " శుక్రుని నీచస్థితి - సెక్స్ కుంభకోణాలు - అర్ధాంతర మరణాలు "

24, సెప్టెంబర్ 2019, మంగళవారం

షిరిడీ సాయిబాబా శిష్యుడు దాసగణు మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను







ఉద్యోగపనులలో భాగంగా మహారాష్ట్రలోని ఉమ్రీ స్టేషన్ తనిఖీకి వెళ్ళవలసి వచ్చింది. ఈ స్టేషన్ నాందేడ్ కు 30 కి. మీ దూరంలో ఉంటుంది. పని అయిపోయాక యధాలాపంగా చూస్తే, సాయిబాబా ముఖ్యశిష్యుడైన దాసగణు మహారాజ్ ఆశ్రమం అక్కడకు దగ్గర్లోనే గోరఠీ గ్రామంలో ఉందని తెలిసింది.

నేనా  బోర్డు వైపు చూడటం గమనించి, స్టేషన్ మాస్టర్ ఇలా అన్నాడు - 'ఆశ్రమం బాగుంటుంది సార్. వెళ్ళిరండి.  చాలా దగ్గర. రెండు కి.మీ లోపే ఉంటుంది'. అక్కడి స్టాఫ్ అందరూ సాయిభక్తుల లాగా ఉన్నారు. ఆశ్రమం గురించి గొప్పగా చెప్పారు. దగ్గరే కదా చూద్దామని బయలుదేరాము. 'మధ్యాన్నం ఒంటిగంట దాటింది. ఆశ్రమం మూసేసి ఉంటారు. సాయంత్రం వెళ్ళండి' అని కొంతమంది అన్నారు. వాళ్లకు  ఒక చిరునవ్వును బహుమతిగా ఇచ్చి 'చలో, దర్శన్ కర్కే ఆయేంగే' అన్నాను. 'ప్రత్యేక పూజ చేయిద్దాం' అన్నారు మా స్టాఫ్. ప్రత్యేక పూజ కాదు, అసలుపూజ కూడా వద్దు. నా గురించి మీరేదో గొప్పగా వారికి చెప్పకూడదు. సామాన్య భక్తులలాగా హడావుడి లేకుండా వెళ్లి వద్దాం. నో స్పెషల్ ట్రీట్మెంట్ ప్లీజ్' అని మావాళ్లకు ఖరాఖండిగా చెప్పాను.

కాసేపట్లోనే గోరఠీ గ్రామంలోని ఆశ్రమానికి చేరుకున్నాం. గోరఠీ అనేది చాలా చిన్న ఊరు. ఆ ఊళ్లోకి అడుగుపెడుతూనే ఒక 100 ఏళ్ళు వెనక్కు వెళ్లినట్లు అనిపించింది. అంత కుగ్రామం. ఊరి చుట్టూ పచ్చటి పొలాలు, సమృద్ధిగా నీళ్లు. కోనసీమలోని గ్రామంలాగా అనిపించింది.  గ్రామం మొదట్లోనే ఒక చిన్న గుట్టమీద పెద్ద భవనం కనిపించింది. ఆశ్రమం అదేనేమో అనుకున్నాను. నా సంశయాన్ని గమనించి బైక్ నడుపుతున్న స్టేషన్ మాస్టర్ ఇలా అన్నాడు. 'అది ఆశ్రమం కాదు. ఎమ్మెల్యే ఇల్లు'.  నాకు నవ్వొచ్చింది. అంత కుగ్రామంలో ఎమ్మెల్యే కి అంత రాజభవనమా? మన దేశంలో ప్రజాధనం దోపిడీ ఇంతేనేమో అనిపించింది.

కొంచం దూరంలోనే, వినమ్రంగా ఉన్నా, ఆధ్యాత్మిక తరంగాలను వెదజల్లుతున్న ఆశ్రమం ఉంది. ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంది. కమిటీ మెంబర్లు కొంతమంది, బాంబే నుంచి వఛ్చిన భక్తులు కొంతమంది తప్ప  అందులో ఎవరూ లేరు. ముందువైపున దాసగణు మహారాజ్ సమాధి ఉంది. లోపలగా ఆ ఆశ్రమం స్థాపించిన స్వామి వరదానంద భారతి గారు ఉన్న గది ఉన్నది. ఆ కమిటీ వారికి మా స్టాఫ్ నన్ను పరిచయం చెయ్యబోతుంటే సున్నితంగా వారించాను. స్టాఫ్ అంతా ఇక్కడివారేనని నేనుమాత్రం హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాను.

దాసగణు గారు 1962 లో చనిపోయారు. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన వరదానంద భారతి గారు 2002 లో ఉత్తరకాశీలో చనిపోయారట. స్వామీజీ గారి గదిలో ఒక ఫోటో చూశాము. కొండల మధ్యన ఒక రాతిమీద కూర్చుని ఉన్న చతుర్భుజ మహావిష్ణువు చిత్రం అది. మామూలుగా మనం ప్రతిచోటా చూచే చిత్రం కాదది. నేను దానివైపు తదేకంగా చూడటం గమనించి ఆశ్రమాన్ని మాకు చూపిస్తున్న పదహారేళ్ళ పూజారి ఇలా అన్నాడు. ' భగవంతుడు స్వామీజీకి అలా దర్శనం ఇచ్చారు. ఆయన చెప్పినట్లు ఆ చిత్రం గీశారు.'

స్వామీజీ గదిలో ఆయన నిలువెత్తు చిత్రం ఉన్నది. పక్కన ఉన్న గదిలో రాక్స్ నిండా ప్రాచీన గ్రంధాలున్నాయి. వివేకానందస్వామి, శంకరాచార్య, తుకారాం, విఠోబా చిత్రాలున్నాయి. ఆ గదిలోనే స్వామీజీ నివసించారని చెప్పారు. అక్కడ మంచి శక్తివంతమైన వేదాంత భావనా తరంగాలుండటం గమనించాను. స్వామీజీ డెబ్భైకి పైగా పుస్తకాలు వ్రాశారని పూజారి పిల్లవాడు చెప్పాడు.

దాసగణు మహారాజ్ పోలీసు ఉద్యోగిగా పనిచేసేవాడు. ఎస్సై కావాలని ఆయనకు గట్టి కోరిక ఉండేది. సాయిబాబా మీద అనేక పాటలు పద్యాలు వ్రాసేవాడు. చదువు అబ్బకపోయినా, పెద్దల నుంచి వఛ్చిన జీన్స్ ప్రభావమో ఏమోగాని 'తమాషా' అనే పల్లెపదాలలో అలవోకగా ఆశుకవితలు చెప్పేవాడు. సాయిబాబాను విష్ణువు, శివుడు, అని తన పాటల్లో పొగిడినా, ఆయనంటే గట్టి నమ్మకం లోలోపల ఉండేది కాదు. ఆ సంగతి సాయిబాబాకూ తెలుసు. సాయిబాబా ఒక ముస్లిం అని, తాను శుద్ధ బ్రాహ్మణవంశంలో పుట్టానని కొంచం తిరస్కార భావం ఆయనకు లోలోపల ఉండేది.

దాసగణు జీవితంలో సాయిబాబా అనేక అద్భుతాలు చేశాడు. ఎన్నోసార్లు అతని ప్రాణాలను రక్షించాడు. ఉద్యోగం పోయే పరిస్థితుల నుంచి రక్షించాడు. 'పోలీసు ఉద్యోగం మానుకో' అని సాయిబాబా అనేకసార్లు దాసగణుకు చెప్పాడు. దాసగణు వినేవాడు కాదు. 'ఫౌజుదార్ (ఎస్సై) అయ్యాక ఉద్యోగం వదిలేస్తా' అని దాసగణు, సాయిబాబాకు చెప్పేవాడు. కొన్నాళ్ళపాటు ఆ అధికారమూ హోదా చెలాయించాలని ఆయనకు కోరిక ఉండేది. చివరకు ఒక కేసులో ఇరికించబడి 32 రూపాయల కోసం  ఉద్యోగం మానుకోవలసిన పరిస్థితి వచ్చింది. మానుకున్నాడు. 'మంచిగా చెబితే నువ్వు వినడం లేదు. ముల్లుతో గుచ్చితే గాని వినవన్నమాట' అని సాయిబాబా ఈయనతో అన్నాడు.

బాసర దగ్గర గోదావరి ఉంది. నాందేడ్ లో కూడా ఉంది. గోదావరి అంటే దాసగణుకు భక్తి. గంగామాయి అని గోదావరిని పిలిచేవాడు. 'గోదావరిలో స్నానం చేసి వస్తానని' ఒకరోజున సాయిబాబాతో అన్నాడు దాసగణు. 'గోదావరి కోసం ఎక్కడికో పోవడం ఎందుకు. అది ఇక్కడ లేదా?' అన్నాడు బాబా. అలా అంటూ తన పాదాలనుండి గోదావరి నీటిధారను పుట్టించాడు. దాసగణు ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు. సాయిబాబా మౌనంగా ఊరుకున్నాడు. కానీ సాయిబాబా గతించిన కొన్నేళ్ళకు దాసగణు ఇంకొక మహాత్ముడిని కలిశాడు. ఆయన ఇలా అన్నాడు 'నీవు సాయిబాబా భక్తుడివి, ఆయన దేవుడంటూ నువ్వు పాటలు వ్రాశావు. కానీ నీకు ఆయనంటే నిజమైన భక్తి లేదు'. దాసగణు బిత్తరపోయాడు. ఆ మహాత్ముడు కొనసాగించాడు. 'నీకోసం సాయిబాబా తన పాదాలనుండి గోదావరిని సృష్టించాడు. నీవా నీటిని నెత్తిన చల్లుకున్నావే గాని, లోపలకు త్రాగలేదు. సాయిబాబా ఒక ముస్లిం అని నీకు లోలోపల కొంత తిరస్కార భావం ఉంది. అందుకే నువ్వా నీటిని తీర్థంగా తీసుకోలేకపోయావు'. సాయిబాబా గతించిన అనేక సంవత్సరాల తర్వాత, ఆ విధంగా తాను చేసిన తప్పు దాసగణుకు అర్ధమైంది.

ఇలాంటి సంఘటనలు దాసగణు జీవితంలో చాలా జరిగాయి. దాసగణు, నానాసాహెబ్ చందోర్కర్ ఇద్దరూ సాయిబాబా ముఖ్యభక్తులు. దాసగణు మహరాజ్ యొక్క వస్త్ర సమాధి ఇక్కడ గోరఠీ గ్రామంలో ఉంది. 'వస్త్ర సమాధి' అంటే ఏమిటి? అని అక్కడివాళ్లను అడిగాను. ఆయన శరీరాన్ని సాంప్రదాయ బద్దంగా దహనం చేశారు. ఆయన వస్త్రాన్ని మాత్రం ఇక్కడ ఉంచి సమాధి కట్టారు అని అక్కడి పూజారి చెప్పాడు.

దాసగణు ఒక హరికథా భాగవతార్ వంటి కళాకారుడు. ఆశువుగా ఎన్నో పాటలు పద్యాలు పాడుతూ ఏడెనిమిది గంటల పాటు శ్రోతలను ఆయన రంజింపజెయ్యగలిగేవాడు. తాను అలా ఇఛ్చిన అనేక ప్రోగ్రాములలో, స్టేజిమీద ఒకవైపున సాయిబాబా ఫొటో ఉంచి, ఆయన మహిమలు. లీలలు, దైవత్వం గురించి చెప్పేవాడు. అవి విని వేలాదిమంది సాయిబాబా దర్శనార్ధం వచ్చేవారు. ఆ విధంగా సాయిబాబాను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో ప్రముఖ పాత్ర వహించాడు దాసగణు. విజయదశమి నాడు షిరిడీలో జరిగే ఉత్సవంలో మొదటి నివేదనగా ఈ ఊరిలోని దాసగణు ఆశ్రమం నుండి వెళ్లిన నివేదననే సమర్పిస్తారని అక్కడి వారు నాకు చెప్పారు. బాంబే నుంచి వచ్చిన కొందరు మహిళా భక్తులు అక్కడ కనిపించారు. మౌనంగా  వచ్చేస్తున్న మమ్మల్ని ఆగమని చెప్పి, డైమండ్ కోవా శ్వీట్ ను మాకు ప్రసాదంగా ఇచ్చారు. బాబా ఆశీస్సులుగా భావించాం.

కాసేపు అక్కడ కూర్చుని తిరిగి ఉమ్రీ స్టేషన్ కు చేరుకున్నాం. సాయంత్రం వరకు వెళ్లిన పని ముగించుకుని, తిరుగు రైలెక్కి మల్కాజిగిరి స్టేషన్లో దిగాను. ఆ విధంగా సాయిబాబా ముఖ్య భక్తుడైన దాసగణు సమాధిని అనుకోకుండా సందర్శించాను. 'అనుకోకుండా జరిగేదే అనుగ్రహం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అనలేదా మరి?
read more " షిరిడీ సాయిబాబా శిష్యుడు దాసగణు మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను "

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

సెప్టెంబర్ 2019 పౌర్ణమి ప్రభావం ఇలా చూపించింది

మనుషుల పైన చంద్రుని ప్రభావం తప్పకుండా ఉంటుందనే విషయం గత పదేళ్లుగా నా పోస్టులు చదువుతున్న వాళ్లకు స్పష్టంగా తెలిసే ఉంటుంది. అందులోనూ, పౌర్ణమి అమావాస్య ప్రభావాలు ఎలా ఉంటాయో అనేక ఉదాహరణల ద్వారా నేను వ్రాసిన గత పోస్టులలో ఇంకా స్పష్టంగా మీరు చూడవచ్చు.

ఈ నెల పౌర్ణమి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రభావాలు చూపించింది. వీటిల్లో, మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన రెండు ముఖ్యమైన చెడు సంఘటనలు - గోదావరిలో లాంచీ మునిగి జనం చనిపోవడం, ఉరివేసుకుని కోడెల శివప్రసాద్ మరణించడం.

వీటికీ చంద్రుని స్థితిగతులకూ ఏమిటి సంబంధం? అని అనకండి. ఒక్కసారి నా గత పోస్టులు చదవండి. సంబంధం ఏమిటో అర్ధమౌతుంది. లాంచీ విషయం ప్రస్తుతం పక్కన ఉంచి, కోడెల ఉదంతం పరిశీలిద్దాం.

మానసికంగా కృంగిపోయి ఉన్నవారు ఇలాంటి సమయాలలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం గతంలో ఉదయకిరణ్ విషయంలో గాని, జియాఖాన్ విషయంలో గాని, ఇంకా కొంతమంది మామూలు మనుషుల ఆత్మహత్యల విషయాలలో గాని, స్పష్టంగా నేను విశ్లేషించాను. కావలసినవారు ఆ పోస్టులు వెతికి చదవవచ్చు. వీరందరూ కూడా పౌర్ణమి అమావాస్య సమయాలలోనే ఆయా అఘాయిత్యాలకు పాల్పడ్డారు.

పౌర్ణమి అమావాస్య సమయాలలో పిచ్చివాళ్లకు పిచ్చి ఎక్కువౌతుందనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన వాస్తవం. అలాగే, మానసిక రోగులు కూడా, సమత్వాన్ని ఇంకా ఎక్కువగా కోల్పోయి ఈ సమయాలలో విపరీతంగా ప్రవర్తిస్తారనేది కూడా రుజువైన వాస్తవమే. ముఖ్యంగా ఆడవాళ్ళ ప్రవర్తనలో చాలా స్పష్టమైన ఊగిసలాటలను ఈ సమయాల్లో గమనించవచ్చు. ఎందుకంటే వాళ్ళు cycle based జీవులు. ఆడవారి మీద చంద్రుని ప్రభావం చాలా  అధికంగా ఉంటుంది.

అదలా ఉంచితే, డిప్రెషన్ లో ఉన్నవార్లు ఈ సమయంలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తారనేది కూడా ఎన్నోసార్లు రుజువైంది. కనుక, అలాంటి స్థితిలో ఉన్నవారిని కుటుంబ సభ్యులు ఒంటరిగా వదలిపెట్టి ఉండకూడదని, వాళ్లకు మానసికంగా ఆసరా ఇస్తూ, 24 గంటలూ వెన్నంటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని, ఉదయకిరణ్ జాతకవిశ్లేషణలో నేను వ్రాశాను. ఇప్పుడు మళ్ళీ కోడెల విషయంలో కూడా ఇటువంటి డిప్రెషనే ఈ దుర్ఘటనకు కారణమైంది.

రాజులైనా, రాజ్యం ఏలినవారైనా, మహా ధనికులైనా, ఎవరూ కర్మకు అతీతులు కారు. సమయం వచ్చినపుడు ఈ ప్రపంచంలో ఎవరి కర్మను వారు అనుభవించక తప్పదు. ఆయా కర్మఫలితాలు, సూర్యచంద్రుల గతులను బట్టి మనుషులకు కలుగుతూ ఉంటాయి. డబ్బున్నవాడు పెద్ద ఆస్పత్రి లో పోతే, డబ్బు లేనివాడు వాడి ఇంట్లోనే పోతాడు. అంతే తేడా ! అయితే, డబ్బూ అధికారమూ ఎంతో ఎక్కువగా చూసినవాళ్లు చివరిలో ఇలా దుర్మరణం పాలు కావడం చేసుకున్న కర్మ  కాక మరేమిటి?

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన చివరిరోజులలో చాలా మానసిక క్షోభను అనుభవించాడు. తనవారు, తన అనుచరులు, తన నీడలు అనుకున్నవారి నుండి ఆయనకు చివరి క్షణాలలో ఎలాంటి ఆసరా కూడా దక్కలేదు. చివరి రోజులలో ఆయన పడిన క్షోభ ఈరోజున తెలుగుదేశం పార్టీ లీడర్లను ఇలా వెంటాడుతోందా? అందుకే తెలుగుదేశం నాయకులు చాలామంది రోడ్డు ప్రమాదాల లోనో, ఇతర కారణాల వల్లనో దుర్మరణం పాలౌతున్నారా? వారికి మానసికంగా శాంతి లేకుండా పోతున్నది ఇందుకేనా? ఉసురంటే ఇదేనా? ఏమో? మనకు తెలీదు. కాలమే నిర్ణయించాలి.
read more " సెప్టెంబర్ 2019 పౌర్ణమి ప్రభావం ఇలా చూపించింది "

7, సెప్టెంబర్ 2019, శనివారం

చంద్రయాన్ - 2 ఎందుకు విఫలమైంది? జ్యోతిష్య కారణాలు

ఈ పోస్టు రాద్దామని కూచోగానే కర్ణపిశాచి నవ్వు వినిపించింది. 

'ఏంటీ చాలా రోజులనించీ కనిపించడం వినిపించడం మానేశావ్? - అడిగా కాస్త కోపంగా.

'నువ్వీ మధ్యన controversial posts ఏవీ వ్రాయడం లేదు కదా? ఉన్నట్టుండి చాలా మంచివాడివై పోయావ్. అందుకని' - అందది.

'హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే పనుల్లో ఉండి వ్రాతలు తగ్గించాలే. టైం సరిపోవడం లేదు. జర పరేశాన్లున్న. అదట్లుంచు గాని, ఏంది భై గట్ల సకిలించినవ్? ' - అడిగా.

'నీ విమర్శకులు ఈ టైటిల్ చూడగానే ఏమనుకుంటారో అర్ధమై అలా నవ్వాలే. గింజుకోకు' - అందది.

'ఏమనుకుంటారు?' - తెలిసినా తెలీనట్టు అడిగా.

'ఏమనుకుంటారా? అన్నీ అయిపోయాక జ్యోతిష్యం భలే  చెప్తారు గురువుగారు. ముందు మాత్రం ఏవీ చెప్పరు అనుకుంటారు' అంది.

'పోన్లే అనుకోనీ. వాళ్ళ ఆలోచనలు ఆపడానికి నేనెవర్ని? అదీగాక, శుభమా అని మనవాళ్ళు ఒక పెద్దపని పెట్టుకుంటే, ఇది చివర్లో ఫెయిల్ అవుతుంది అని శకునపక్షిలా చెప్పడానికి నాకేం పని? నేను చెప్పినా ఎవరు వింటారు? ఆపుతారు?' అన్నాను.

'అంటే, నీకు ముందే తెలుసా?' - అడిగింది

'సుబ్బరంగా తెలుసు. అందుకే అందరూ నిన్న రాత్రి టీవీల ముందు కూచుని జాగారం చేస్తే, నేనుమాత్రం హాయిగా నిద్రపోయి పొద్దున్నే లేచా. ఎలా తెలుసో కావాలంటే నీక్కూడా చెప్తా విను చాలా సింపుల్' - అని చెప్పడం సాగించా.

'చెప్పు చెప్పు' అందది నా పక్కనే మంచం మీద కూచొని ల్యాప్ టాప్ లోకి తొంగి చూస్తూ.

చంద్రయాన్ రాకెట్, 22-7-2019 మధ్యాన్నం 2.43 కి శ్రీహరి కోట నుంచి లాంచ్ చెయ్యబడింది. ఆ సమయానికి వేసిన గ్రహచక్రమూ ఆయా గ్రహాల స్థితులూ పక్కనే చూడవచ్చు.

వక్ర గురువుతో కూడిన వృశ్చికలగ్నం ఉదయిస్తోంది. అంటే, గురుబలం సరిగా లేదని అర్ధం. కానీ గురువు ఈ లగ్నానికి మంచివాడు గనుక లాంచ్ వరకూ బాగానే జరిగింది. మొదటి సారి లాంచ్ వాయిదా పడి రెండో సారి జరిగిందని గుర్తుంటే, గురువు ఎందుకు వక్రించి లగ్నంలో ఉన్నాడో అర్ధమౌతుంది.

ప్రయాణాలకు చరలగ్నం ఉండాలి. కానీ ఇక్కడ ముహూర్తం ఎవరు పెట్టారో గాని, స్థిరలగ్నం పెట్టారు. ఇదొక దోషం. మిడిమిడిజ్ఞానపు జ్యోతిష్కులు, పురోహితులు ఇలాగే చేస్తుంటారు. గురువు లగ్నంలో ఉంటె లక్షదోషాలు పరిహరిస్తాడు, సూర్యుడు ఏకాదశంలో ఉంటె కోటిదోషాలు పోతాయి అని శ్లోకాలు వల్లిస్తారు. ఇవన్నీ నాటకాలు. అలా ఏమీ జరగదు. ఏ దోషమూ అంత తేలికగా పోదు. ఈ విషయం ఇక్కడ కూడా రుజువైంది కదా !

దూర ప్రయాణాలను నవమం సూచిస్తుంది. నవమంలో మూడు గ్రహాలున్నాయి. అవి సూర్యుడు బుధుడు నీచ కుజుడు. వీరిలో బుధుడు అస్తంగతుడయ్యాడు. కుజుడు నీచస్థితిలో ఉండి దూరప్రాంతంలో (చివరి నిముషంలో) అపజయాన్ని సూచిస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ కు సూచకుడు. అతని అస్తంగత్వం, చివరి నిముషంలో కమ్యూనికేషన్ విఫలం అవుతుంది అని సూచిస్తోంది. అదేగా జరిగింది మరి !

లాంచ్ సమయంలో శని - శని - రాహు - సూర్య - బుధదశ నడుస్తున్నది.  ఇది ఖచ్చితమైన శపితయోగ దశ. సూక్ష్మదశా ప్రాణదశానాదులైన సూర్య బుధులు నవమంలో ఉండగా బుధుడు అస్తంగతుడై, కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ వల్ల మిషన్ విఫలం అవుతుంది అని ఖచ్చితంగా సూచిస్తున్నారు.

లగ్నాధిపతి కుజుడు నవమంలో నీచలో ఉండటం, పెట్టుకున్న పని దూరప్రయాణ తీరంలో ఫెయిల్ అవుతుంది అని చూపిస్తున్నది. దశమాధిపతి సూర్యుడు, అష్టమాదిపతి బుదునితో కలసి పనిలో ఫెయిల్యూర్ ని సూచిస్తున్నాడు.  

నిన్న శని - శని - గురు - గురు - రాహు దశ నడుస్తున్నది. ఇది శపితయోగం, గురుచండాల యోగం కలసిన పరమ దరిద్రమైన దశ. ఈ సమయంలో లాండర్ చంద్రునిమీద దిగబోయింది. ఇంతగాక ఇంకేం జరుగుతుంది మరి?

ఇది అర్ధం కావడానికి పెద్ద జ్యోతిష్య పాండిత్యం అక్కర్లేదు. ఈ శాస్త్రం కొద్దిగా తెలిసినా ఇది అర్ధమౌతుంది. మరి ముహూర్తం పెట్టిన ఘనాపాటిలకు ఎందుకు తెలియలేదో మరి?

'రాకెట్ లాంచ్ కి కూడా ముహూర్తం పెడతారా?' - అని సందేహపడకండి. మనదేశంలో అలాంటివి కూడా జరుగుతాయి. కాకపోతే, ఎవరు పెడతారో ఎవరికీ తెలియనివ్వరు అంతే. అంతేకాదు, రాకెట్ పార్ట్లు కొన్ని రహస్యంగా తెచ్చి, తిరుమలలో స్వామి పాదాలకు తాకించి మరీ తీసుకుపోతారని వినికిడి. మరి స్వామి అనుగ్రహం ఏమైందో ఇప్పుడు? లేదా ఇలా విఫలం అవడమే స్వామి అనుగ్రహం అని సరిపెట్టుకోవాలా?

ఇంకోటి ఏంటంటే, ద్వారకా శంకరాచార్య కూడా, తన వేదిక్ మాధ్స్ పరిజ్ఞానంతో  ISRO వాళ్లకు సహాయం చేశాడు. ఆయన అందులో దిట్ట ఇందులో దిట్ట అని కొందరు నెట్లో ఊదరగొట్టారు. మరి ఇప్పుడేమైంది వేదిక్ మాత్స్? చెప్పండి ! అయినా, భూమికి చంద్రుడికి మధ్యన ఎన్ని యోజనాల దూరం ఉందొ పురాణాలు చూసి మనం తెలుసుకోవలసిన పని లేనేలేదు. శంకరాచార్య గారిని అడగవలసిన పని అసలే లేదు. సైన్స్ ప్రకారం ఆ దూరం ఎంతో ఇప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు. దానికి ఆయన సహాయం తీసుకోవలసిన పని ఇస్రో కు ఏముంది?

పైగా ఇంకొకటి. అసలే మన దేశానికి శత్రుపీడ చాలా ఎక్కువగా ఉంది. అన్ని దేశాలూ మనల్ని చూచి ఏడుస్తున్నాయి. అలాంటప్పుడు చైనా లాగా, సైలెంట్ గా మన పని మనం చేసుకోవాలి గాని, పెద్ద టాంటాం చెయ్యడమూ, అందర్నీ పిలిచి షో చెయ్యడమూ అవసరమా? మన విజయమే మన గురించి మాట్లాడాలి గాని, మనం డప్పు కొట్టుకోవలసిన పని లేదు. 

ఇప్పుడేమైంది? మోడీగారు పెద్ద మనసుతో ఇస్రో చైర్మన్ ని ఓదార్చారు. 'మళ్ళీ ప్రయత్నించండి నేనున్నాను. ధైర్యాన్ని కోల్పోకండి' అని చెప్పారు. అది బాగానే ఉంది. కానీ జరిగింది వైఫల్యమే కదా ! ఎవరెన్ని చెప్పినా, ఇస్రో ఫెయిల్ ఐన మాట వాస్తవం. దాన్ని మనం ఏ విధంగానూ కప్పి పుచ్చలేం.

దిష్టి (దృష్టి) అనేది వాస్తవమే. మనల్ని చూచి ఎన్ని దేశాలు ఏడుస్తున్నాయో గుర్తుంటే ఇంత అనవసరపు పబ్లిసిటీ ఇచ్చుకునే వాళ్ళం కాము. ఇలా ఫెయిల్ అయ్యేవాళ్ళమూ కాము.

ఈసారైనా మరింత జాగ్రత్తగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ, ఇంతవరకైనా సాధించినందుకు ఇస్రో కు మన శుభాకాంక్షలు తెలియజేద్దాం.

జై భారత్ !
read more " చంద్రయాన్ - 2 ఎందుకు విఫలమైంది? జ్యోతిష్య కారణాలు "