“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మార్చి 2022, గురువారం

శూన్యసింహాసనం

ఆకాశంలో వాకిళ్ళకోసం

అల్లాడతావెందుకు నేస్తం?

నీ మనసు వాకిళ్లు

మాయమౌతుంటే !


సుదూర తారలకోసం

చూస్తున్నావెందుకు నేస్తం?

సితారనాదం లోలో

చిగురిస్తూ ఉంటే !


వినిపించుకోని వారికోసం

విలపిస్తావెందుకు నేస్తం?

జీవితం విసుగెత్తేవరకూ

ఎవ్వరూ వినరంతే !


నింగిలో దారులకోసం

నిలుచున్నావెందుకు నేస్తం?

నిత్యజీవితంలో ప్రతిదీ

రహదారే అయితే !


నడిబజారులో నిన్ను

అమ్ముకుంటావెందుకు నేస్తం"

హృదయాలలో  నీకెందరో

గుడికట్టుకుంటే !


ఎడారిలో బికారిలా

నడుస్తావెందుకు నేస్తం?

శూన్యసింహాసనం నీకు 

సిద్ధమౌతుంటే...

read more " శూన్యసింహాసనం "

27, మార్చి 2022, ఆదివారం

బుజ్జిపాప తత్వాలు - 7 (ఇదే ఆధ్యాత్మికం)

అందరికీ స్పీచులివ్వడం

ఆచరణ మాత్రం  లేకపోవడం

అంతా మాయేననడం

ఆకు రాలితే అల్లాడిపోవడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


తెలిసినవాడూ తెలియనివాడూ

అన్నీ తమకే తెలుసనుకోవడం

ఎదుటివాడి స్థితి తెలియకుండా

ఏదేదో వాగబోవడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


అరువు తెచ్చుకున్న గేనాన్ని

అందరికీ పంచడం

అన్యుల సొమ్మంతా తనదేనని

అరుస్తూ ఊరేగడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


అందరికీ ప్రవచనాలిస్తూ

ఆరిందాలా మాట్లాడటం

దొంగబ్రతుకు బ్రతుకుతూ

దొరికిపోతామని భయపడటం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


అహంకారంతో అలమటిస్తూ

ఆత్మజ్ఞానిననుకోవడం

అందితే జుట్టు లేకపోతే కాళ్ళు

అవసరార్ధం పట్టుకోవడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


ఆత్మా పరమాత్మా అంటూ

ఆశను దాటలేకపోవడం

అచలం అచలం అంటూ

ఎప్పుడూ చలిస్తూనే ఉండటం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


అరువు సమాచారంతో

తలంతా ఉబ్బిపోవడం

అడుగేసే శక్తంటూ లేక

ఒళ్ళంతా పుల్ల కావడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


ఆధ్యాత్మికపు అంగడి తెరిచి

అరువు బేరాలు సాగించడం

అష్టకష్టాలు చుట్టుముడితే

అయ్యో అంటూ గుక్కపెట్టడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !

read more " బుజ్జిపాప తత్వాలు - 7 (ఇదే ఆధ్యాత్మికం) "

22, మార్చి 2022, మంగళవారం

పద్మశ్రీ జన్మ ధన్యమైంది

https://www.youtube.com/watch?v=OF2VZ_eLB0E

125 ఏళ్ల స్వామి శివానందగారికి పద్మశ్రీ అవార్డు లభించింది. ఆ అవార్డు తీసుకోవడానికి వచ్చిన ఆయన, ప్రధాని మోడీ గారికి, రాష్ట్రపతి కోవింద్ గారికి మోకాటి తండా వేసి మరీ ప్రణామం చేశారు. ప్రధాని మోడీగారు, వంగి నేలను తాకి, ఆయనకు ప్రతినమస్కారం చేశారు. రాష్ట్రపతిగారు ముందుకొచ్చి ఆయనను లేపి, సాదరంగా అవార్డును చేతికందించారు.

పద్మశ్రీ అవార్డు జన్మ ధన్యమైంది.

ఈ సంఘటన కొన్ని విషయాలను మన కళ్ళముందు తేటతెల్లం చేస్తున్నది.

మొదటిది - యోగాభ్యాసానికున్న మహత్యం

యోగాభ్యాసమనేది ఒక జీవనశైలి. ఆహారవిహారాలను పాటిస్తూ, నియమంతో యోగాభ్యాసం చేస్తే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకడం సాధ్యమేనని యోగశాస్త్రం అంటుంది. నూరేళ్ళే కాదు, ఇంకా ఎక్కువకూడా బ్రతకడం సాధ్యమేనని ఎందరో ప్రాచీనయోగులు నిరూపించారు. నేడు కూడా అలాంటివి సాధ్యమేనా అని సందేహించే వారికి సజీవసాక్ష్యమే స్వామిశివానంద వంటివారు. ఎందరో గురువుల కృషి ఫలితంగా నేడు 'యోగా' అనేది ప్రపంచవ్యాప్తంగా సాధన చేయబడుతున్నది. యోగాను ముందుకు తేవడంలో ప్రధాని మోడీగారి కృషి మరువలేనిది. అంతర్జాతీయ యోగా దినం గా జూన్ 21 ని నియమించడం ఆయన చలువే.

యోగాభ్యాసానికున్న మహత్యాన్ని స్వామి శివానందవంటివారు ఈ రోజులలో కూడా సత్యమేనని నిరూపిస్తున్నారు.

రెండవది - ప్రాచీన భారతదేశపు మర్యాద.

మన దేశంలో ఉండే విలువలు, మర్యాదలు, పెద్దవాళ్ళను గౌరవించే విధానాలు ఎంత అద్భుతమైనవో ఈ అవార్డు ఫంక్షన్ మరొక్కసారి చూపిస్తున్నది. 125 ఏళ్ల  స్వామీజీ, దేశప్రధానికి, రాష్ట్రపతికి ప్రణామం చెయ్యలేదు. వారి రూపంలో ఉన్న మన దేశానికి, వేలాది ఏండ్ల దేశఘనసంస్కృతికి ప్రణామం చేశాడు.

ఈ దేశసింహాసనం మామూలుది కాదు. ప్రపంచానికే ధర్మభిక్ష, జ్ఞానభిక్ష, యోగభిక్ష పెట్టిన  దేశం మనది. అలాంటి దేశసింహాసనాన్ని అధిష్టించిన వ్యక్తి ఆ ప్రాచీనపరంపరకంతటికీ ఒక ప్రతీకలాంటి వాడు. ప్రాచీనకాలపు మహారాజులు, ఋషులు, జ్ఞానులకు ఆ సింహాసనం ఒక ప్రతీక. ఈ ప్రణామం ద్వారా శివానందస్వామి వారందరికీ ప్రణామం చేశారు. ఆయన భక్తిని చూస్తే అదే అనిపించింది. దీనిని గమనించాలి.   

మూడవది - అహంకారరాహిత్యం

అంత జీవితాన్ని చూచినా, అంతకాలం జీవించినా, ఆయనలో గర్వంగాని అహంకారం గాని లేదు.  బహుశా ప్రపంచం మొత్తానికీ వయసులో పెద్ద వ్యక్తి ఈయనే కావచ్చు. అలాంటి వ్యక్తిలో కూడా పిసరంత కూడా గర్వం లేకపోవడం ఎంత గొప్ప విషయం ! దీనిని కూడా గమనించాలి.

నేడు నాలుగు డబ్బులు జేబులో ఉంటే చాలు, ఎవరికీ కన్నూ మిన్నూ కనపడటం లేదు. మరి వారంతా స్వామి శివానందగారిని చూచి నేర్చుకోవాలా లేదా? 

నాల్గవది - ప్రధాని మోడీగారి ఉన్నత వ్యక్తిత్వం

మోడీగారు కూడా కుర్చీలోనుంచి లేచి, నేలను తాకి ఆయన నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారు. అది మోడీగారిలోని ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నది. ప్రధానినన్న గర్వం ఆయనలో ఏమాత్రమూ లేదు. ఒక సామాన్య సాధువుకు ఆ విధంగా ఆయన  ప్రతినమస్కారం చేయడం ఎంత గొప్ప విషయం !

దీనిని చూచి మన నేటి యువత ఎంత నేర్చుకోవాలో ఆలోచించండి !

అయిదవది - రాష్ట్రపతిగారి హుందా ప్రవర్తన

రాష్ట్రపతిగారైన రామ్ నాధ్ కోవింద్ గారు కూడా ఎంతో హుందాగా ప్రవర్తించారు. ఒక రాష్ట్రపతిగా, ఆయన ఎవరికీ వంగి ప్రణామం చేయకూడదు. ఆ నియమాన్ని ఆయన ఎంతో హుందాగా పాటించారు. స్వామి శివానంద గారిని సాదరంగా లేపి అవార్డు చేతికిచ్చాడు. ఈ మొత్తం ఘట్టంలో ఎవరిలోనూ ఎక్కడా కృత్రిమత్వం లేదు. తెచ్చిపెట్టుకున్న వినయం లేదు. మొత్తం అంతా ఎంతో సహజంగా ఉంది. ఇది కూడా ఎంతో గొప్ప విషయం.

గతంలో ఎందరికో పద్మశ్రీ అవార్డు వచ్చింది. వారిలో అర్హులూ ఉన్నారు. అనర్హులూ ఉన్నారు.  రాజకీయ పైరవీలు చేసి, రికెమెండ్ చేయించుకుని మరీ అవార్డులు తెచ్చుకోవడాలు నాకు తెలుసు. అందుకే ఈ అవార్డులన్నా, ఫంక్షన్లన్నా నాకు అసహ్యం. వీటిని నేను చూడను. కానీ ఈ ఫంక్షన్ క్లిప్ చూచాను. నచ్చింది.

అందుకే అంటున్నాను.

ఇన్నాళ్ళకి పద్మశ్రీ అవార్డు జన్మ ధన్యమైంది.

read more " పద్మశ్రీ జన్మ ధన్యమైంది "

చైనా విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ

విమానయాన చరిత్రలో మరొక ఘోరప్రమాదం నిన్న ఉదయం 10.45 IST కి జరిగింది. దక్షిణ చైనాలో ఒక బోయింగ్ విమానం కూలిపోయింది. దీనిలో 123 మంది ప్రయాణీకులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ చనిపోయారు. 

ఇది జరగడానికి నాలుగు గంటల ముందు, ఈ విమానం ప్రయాణిస్తున్న దారిలో తీవ్రమైన గాలులు ఉన్నాయన్న హెచ్చరికను ఉజౌ వెదర్ సర్వీస్ వెలువరించింది. కానీ విమానం కూలిపోయిన తీరు చూస్తే విచిత్రంగా ఉంది. దాదాపుగా 30,000 అడుగుల ఎత్తునుంచి 3,000 అడుగుల ఎత్తులోకి కేవలం 3 నిముషాలలో విమానం నిట్టనిలువుగా దిగిపోయింది. ఈ విధంగా కూలిపోవడమనేది, విమానాన్ని నడుపుతున్న పైలట్, దానిని కావాలని కూల్చేస్తే తప్ప జరుగదు. లేదా ఇద్దరు పైలట్లనూ ఎవరో కాల్చేస్తే తప్ప జరుగదు. విమానం రెక్కలు బాగుంటే, గ్లైడింగ్ మోడ్ లో చాలాదూరం దానిని క్షేమంగా తీసుకెళ్లవచ్చు. ఇలా కూలిపోవడం వింతగానే ఉంది.

కనుక ఈ ప్రమాదంలో కుట్రకోణాన్ని కాదనలేము. చైనా విమానం గనుక, ఒకవేళ ఏదైనా కుట్ర ఉన్నప్పటికీ అది బయటకు రాకపోవచ్చు. ఇతర దేశాల సహాయాన్ని చైనా తీసుకోదు. నిజాలు బయటపెట్టదు. కాకపోతే, తైవాన్ దగ్గరగా ఇది జరిగింది గనుక, ఆ రెండుదేశాలకూ మద్యన చాలాకాలంగా నిప్పు రాజుకుంటోంది గనుక, ఆ దేశపరంగా ఏదైనా కుట్ర ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మిస్టరీ విడిపోయే అవకాశం మాత్రం లేదు.

జ్యోతిష్యపరంగా చూద్దాం.

  • నిన్న మార్చ్ 21 ఈక్వినాక్టియల్ డే. అంటే, ప్రపంచవ్యాప్తంగా పగలూ రాత్రీ సమానంగా ఉండే రోజు. ఇలాంటి మరొక రోజు సెప్టెంబర్  23 న వస్తుంది.
  • లగ్నం సరిగ్గా రాహుకేతువుల ఇరుసులో పడింది. లగ్నంలో రాహువు వల్ల కుట్రకోణం స్పష్టంగా కనిపిస్తున్నది.
  • కుజుడు 17 డిగ్రీ మీద, శుక్రుడు 19 డిగ్రీ మీద చాలా దగ్గరగా ఉన్నారు. కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. మేషంలో ఉన్న యురేనస్ 18 డిగ్రీలో ఉంటూ వీరిని చాలా దగ్గరి కేంద్రదృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి విద్రోహుల కుట్రను, విప్లవచర్యలను సూచిస్తున్నది.
  • ఈ చక్రంలో చెప్పుకోవలసిన మరొక్క ముఖ్యమైన గ్రహస్థితి బుధ గురుల డిగ్రీయుతి. వీరిద్దరూ ఖచ్చితంగా కుంభం 24 వ డిగ్రీ మీద కలిసున్నారు. కుంభరాశికి అర్గళం పట్టింది.
  • బుధుడు పంచమాధిపతిగా, పైలట్ బుద్ధికి సూచకుడు, గురువు అష్టమాధిపతిగా వినాశాన్ని సూచిస్తున్నాడు. దశమకేంద్రంలో వీరిద్దరి కలయికతో, క్రూ మెంబర్స్ లో బుద్ధి లోపించి, ఊగిసలాట, బలమైన సూయిసైడల్ పోకడలు కనపడుతున్నాయి. ఇదినిజమే కావచ్చు. లేదంటే, విమానం అంత నిట్టనిలువుగా మూడు నిముషాలలో 27 వేల అడుగులు దూకినట్లుగా  క్రిందకు పడిపోదు.
  • ప్రమాదసమయంలో రాహు - బుధ - శుక్ర జరుగుతున్నది. రాహువు లగ్నంలో ఉంటూ ఉచ్చశుక్రుడిని సూచిస్తున్నాడు. శుక్రుడిని ఆరవ ఆధిపత్యం కూడా ఉండటంతో, పైలట్ తనకు తానే శత్రువైనట్లు కనపడుతున్నది. బుధుడు బుద్ధిని తారుమారు చేశాడని పైన చెప్పాను. విదశలో కూడా శుక్రుడే మళ్ళీ కనిపిస్తూ, నవమ బాధకస్థానంలో ఉఛ్చకుజ శనులతో కూడి బలమైన దుర్ఘటనాయోగం (accident yoga) లో ఉన్నాడు. ఈ యోగం గురించి గతంలో ఎన్నో సార్లు వ్రాశాను. గమనించండి.

రాహుకేతువుల వీడ్కోలు బహుమతి

రాహుకేతువులు మరికొద్ది రోజులలో రాశులు మారబోతున్నారు. దీని గురించి మొన్న పోస్టులో హెచ్చరించాను. దీనిని వీరి వీడ్కోలు బహుమతి (parting gift) అనుకోవచ్చు. కేతువు, చైనాను సూచించే వృశ్చికంలో ఉన్నాడు. ఖవేదాంశ చక్రంలో రాహుకేతువులు చైనాను సూచించే వృశ్చికంలో ఉంటూ, చైనాలో జరుగబోతున్న ఘోరప్రమాదాన్ని స్పష్టంగా సూచిస్తున్నారు. 

మనుషుల అతి ప్రవర్తన

మీరు గమనించారా? నిన్న ఇన్ని గ్రహస్థితులు కూడి వచ్చాయి గనుకనే, చాలామంది మనుషులు మానసికంగా అల్లకల్లోలానికి గురయ్యారు. మీరు గమనించుకుంటే, నిన్న చాలామంది మనుషులు చాలా అతిగా మాట్లాడినట్లు, అతిగా ప్రవర్తించినట్లు గ్రహిస్తారు. అదంతా ఈ గ్రహప్రభావమే.

న్యూమరాలజీ కోణం

విమానం నంబర్ 5735. సంఖ్యాశాస్త్రంలో నేను వాడే పద్ధతి ప్రకారం, ఇది బుధుడు, శుక్రుడు, గురువు, బుధులను సూచిస్తుంది. బుధుడు, గురువు డిగ్రీ కంజంక్షన్ లో ఉన్నారన్న విషయాన్ని పైన చెప్పాను. శుక్రుని పరిస్థితిని పైన వివరించాను.  రూట్ నంబర్ 2 అవుతున్నది. ఇది రాహువుకు సూచిక. రాహువు పాత్రను కూడా పైన వివరించాను.

ప్రయాణీకులు 123 మంది ఉన్నారు. అంటే, సూర్యుడు, రాహువు, గురువు. సూర్యుడు, మరణాన్ని సూచించే ప్లూటో (యమగ్రహం) తో  రెండు డిగ్రీల అతిదగ్గరి లాభదృష్టిలో ఉన్నాడు. రాహువు, గురువుల పరిస్థితిని పైన వివరించాను. సిబ్బంది 9 మంది ఉన్నారు. అంటే, నవగ్రహాలు. మొత్తం 132 మంది అవుతారు. 123 అయినా 132 అయినా రూట్ నంబర్ 6 అవుతుంది. ఇది కుజునికి సూచిక. కుజుడు ఉచ్చస్థితిలో ఉంటూ దుర్ఘటనాయోగంలో ఉన్నాడు. లెక్క సరిపోయింది. 

ఈ విధంగా గ్రహప్రభావాలు మనమీద పనిచేస్తూ ఉంటాయి !

read more " చైనా విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ "

20, మార్చి 2022, ఆదివారం

పద్యాలతో పరిపుష్ఠమైన ఆత్మబోధ

ఈ మధ్యనే విడుదలైన మా 'ఆత్మబోధ' గ్రంధం అద్వైతాభిమానులైన మేధావుల ప్రశంసలను పొందుతున్నది.

దాని తర్వాత ప్రస్తుతం ఆదిశంకరుల 'అపరోక్షానుభూతి'  అనే మరో గ్రంధం నా వ్యాఖ్యానంతో శరవేగంతో రూపుదిద్దుకుంటోంది. దానికోసం 175 తెలుగు పద్యాలను  వ్రాశాను. వాటిని వ్రాస్తూ ఉండగా, ఇప్పటికే విడుదలైన 'ఆత్మబోధ' గ్రంధానికి కూడా పద్యాలను వ్రాస్తే బాగుంటుందన్న సంకల్పం తలఎత్తింది.  సంకల్పం కలిగినతోడనే, అమ్మ అనుగ్రహంతో, మరొక 70 పద్యాలు ఆశువుగా ప్రవహించాయి. వాటిని 'ఆత్మబోధ' శ్లోకాలకు  జత చేశాను. ఈ విధంగా 'ఆత్మబోధ' కూడా తెలుగుపద్యాలతో పరిపుష్టమై, క్రొత్త సౌందర్యాన్ని సంతరించుకుంది.

మచ్చుకు కొన్ని పద్యాలు.


శ్లో|| ఉపాధిస్థోపి తద్ధర్మైరలిప్తో వ్యోమవన్మునిః

సర్వవిన్మూఢవత్తిష్ఠేదసక్తో వాయువచ్చరేత్ ||


ఆ || ఆశ్రయముల నున్న నాసక్తి గనబోడు

ఆకసమ్ము రీతి యమరు మౌని

మూఢు పగిది జూచు ముల్లోకముల దాను

గాలియంటనట్లు గదలిపోవు


శ్లో|| అనణ్వస్థూలమహ్రస్వమదీర్ఘమజమవ్యయమ్

అరూపగుణవర్ణాఖ్యం తద్బ్రహ్మేత్యవధారయేత్ ||


ఆ || చిన్నపెద్ద గాదు చింతించగా రాదు

పొట్టి పొడుగు గాదు పుట్టబోదు

రూప గుణములెల్ల రూఢిగా లేనట్టి

దాని బ్రహ్మమనుచు దలచవలయు


శ్లో|| జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణోన్యన్న కిఞ్చన

బ్రహ్మాన్యద్భాతి చేన్మిథ్యా యథా మరుమరీచికా ||


కం || బ్రహ్మము జగతికి వేరౌ

బ్రహ్మంబున కన్యతమము భాసించదుగా

బ్రహ్మంబున కన్యమైన

బ్రహ్మాండమ్మెండమావి; భ్రమయౌ గాదే !


శ్లో|| దృశ్యతే శ్రూయతే యద్యద్బ్రహ్మణోన్యన్న తద్భవేత్

తత్త్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానన్దమద్వయమ్ ||


ఆ || చూడ వినగ వచ్చు చోద్యమ్ము బ్రహ్మంబు

దానికన్యమైన దవ్వులేదు

జ్ఞానగరిమ సత్య మానంద మేకమ్ము

చిత్స్వరూపమనుచు జీరవలయు 

సొగసైన ఈ పద్యాలతో కలిపి మరీ ఆత్మబోధ యొక్క అద్వైతపు గుబాళింపును ఆనందించండి మరి ! 

read more " పద్యాలతో పరిపుష్ఠమైన ఆత్మబోధ "

అర్ధమైన ఆట

కులం మతం కుంపట్లు

రాజుకుంటు ఉన్నాయి

స్థలం దేశం వేర్పాట్లు

తగ్గబోమన్నాయి


అహం ఇహం ఎచ్చులన్ని

అరుస్తూనే ఉన్నాయి

మత్తు మదం  మంటలన్ని

ఎక్కువౌతున్నాయి


లేని గమ్యాలకోసం 

సాగిలపడుతున్నాయి

కాని సౌఖ్యాలకోసం

కాట్లకుక్కలయ్యాయి


కాలగతిన జీవితాలు

కాలిపోతున్నాయి

కోరికోరి కష్టాలను

కొనుక్కుంటున్నాయి


ఎటు పోవాలో తెలియని

ఎన్నెన్నో జీవితాలు

ఏమి రాయాలో తెలియని

ఎర్రపూల కాగితాలు


కాలం చెల్లిన బ్రతుకులు

కాటికి పోతున్నాయి 

మిగిలిఉన్న జీవితాలు

బిక్కుబిక్కుమన్నాయి


ఎవ్వరి కోసం ఆగని

కాలం ముందుకే పోతోంది

నవ్వుల మధ్యన దాగిన

మౌనం ఎందుకు నవ్వంది


ఆలోచిస్తే బ్రదుకున

అర్ధం ఏముంటుంది?

అర్ధమైన ఆటలోన

ఆత్రం ఏముంటుంది?

read more " అర్ధమైన ఆట "

19, మార్చి 2022, శనివారం

ఏప్రిల్ 13 న రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు

వచ్చే నెల 13 తేదీన రాహుకేతువులు రాశులు మారుతున్నారు. వీరు ఒకటిన్నర ఏళ్ళుగా, వృషభ-వృశ్చిక రాశులలో ఉన్నారు. ఇప్పుడు రాహువు వృషభం నుంచి మేషానికి, కేతువు వృశ్చికం నుంచి తులకు మారుతున్నారు. ఈ రాశులలో ఏదాదిన్నరపాటు ఉండబోతున్నారు.

ఈ మార్పులవల్ల ప్రపంచజనాభా అయిన 760 కోట్లమంది జీవితాలలో అనేక మార్పులు రాబోతున్నాయి. అవేమిటో చూద్దాం.

మేషరాశి 

వీరి కుటుంబజీవితం ప్రభావితమౌతుంది. దూకుడు ఎక్కువౌతుంది. దానివల్ల ఆరోగ్యంలో బీపీ లాంటి తేడాలొస్తాయి. భార్య లేదా భర్తను ఇబ్బంది పెడతారు. బాధ్యతలు, మానసికచింతలు పెరుగుతాయి. జీవిత భాగస్వాములలో ఒకరివల్ల మరొకరికి ఇబ్బందులు పెరుగుతాయి. 

వృషభరాశి

వీరికి, వీరి జీవిత భాగస్వామికి జీవితంలో హటాత్ మార్పులు కలుగుతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరవ్యాధి తలఎత్తవచ్చు. ఆస్పత్రి సందర్శనం జరుగుతుంది. దీర్ఘరోగాలు నిద్రలేస్తాయి. క్రొత్త పరిచయాలు, విలాసాలు, విందులు పెరుగుతాయి. వాటివల్ల రోగాలు కలుగుతాయి. శత్రువులు బలహీనమౌతారు.

మిధునరాశి

సంతానభావం నిద్రలేస్తుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతారు. అకస్మాత్తు లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. సంతానానికి విలాసజీవితం మొదలౌతుంది. కానీ దానివల్ల మంచి జరగదు. మానసికంగా చెదిరిపోతారు. మొండిధైర్యమూ, ఆధ్యాత్మికచింతనా పెరుగుతాయి. రహస్యలాభాలు కలుగుతాయి.

కర్కాటకరాశి

ఇల్లు, ఆఫీసు ఈ రెండింటి మీదా గ్రహదృష్టి పడుతుంది. దూరప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు హటాత్తుగా ఇంటికి చేరుకుంటారు. ఆఫీసులో పరపతి పెరుగుతుంది. మాట చెల్లుబాటు అవుతుంది. వీరి ఇంటి వాతావరణాన్ని, ఆఫీసుపని అదుపు చేస్తుంది. ఈ ఒకటిన్నరేళ్ల కాలంలో ఈ రాశి వ్యక్తులు చాలామంది రిటైరౌతారు. అయినవాళ్లు దూరమౌతారు.

సింహరాశి

వీరికి ఈ రాహుకేతువుల మార్పు మంచిని చేస్తుంది. ధైర్యం పెరుగుతుంది. దూకుడు, చొరవలు కలుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. లేదా దూరప్రాంతాలకు నివాసాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్యారాశి

ఈ గ్రహమార్పు వీరికి మంచిది కాదు. ఇంట్లో, కుటుంబపరంగా చికాకులు గొడవలు పెరుగుతాయి. అనుకోని హటాత్ గొడవలు, మాటామాటా అనుకోవడాల వల్ల నష్టపోతారు. ఆర్ధికంగా నష్టాలుంటాయి. దీర్ఘరోగాలు నిద్రలేస్తాయి. యాక్సిడెంట్ కావచ్చు. కొంతమందికి కాలం చెల్లుతుంది కూడా. 

తులారాశి

జీవిత భాగస్వామి నుండి హింస ఎక్కువౌతుంది. ఇంట్లో గొడవలు, కలతలు, మాటపట్టింపులు ఎక్కువౌతాయి. వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోతారు. జీవితంలో సమతుల్యత లోపిస్తుంది. సుఖానికి దూరమౌతారు.

వృశ్చికరాశి

వీరికి ధైర్యమూ దూకుడూ పెరుగుతాయి. దానివల్ల బీపీ మొదలైన రోగాలు తలెత్తుతాయి. శత్రుబాధ పెరుగుతుంది. వీరికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతాయి. దురదృష్టం మొదలౌతుంది. విందులు వినోదాలు రహస్యస్నేహాలు  ఎక్కువౌతాయి. అకస్మాత్తుగా ఆస్పత్రి పాలౌతారు. 

ధనూరాశి

అనుకోని లాభాలు ఎదురౌతాయి. సంతానానికి ధైర్యం పెరుగుతుంది. వారికి మంచికాలం మొదలౌతుంది. రెండేళ్లుగా పడుతున్న కష్టాలు పోతాయి. కలిసొస్తుంది. పాతస్నేహితులు విడిపోతారు. క్రొత్తస్నేహాలు మొదలౌతాయి.

మకరరాశి

ఇంట్లో చికాకులు, గొడవలు, మాటపట్టింపులు మొదలౌతాయి. ఇల్లు, ఆఫీసు ఈ రెండు భావాలూ నిద్రలేస్తాయి. బీపీ వస్తుంది. కిడ్నీ సంబంధ రోగాలు తలెత్తవచ్చు. వీరి ఉద్యోగాన్ని, ఇంటి వాతావరణం అదుపు చేస్తుంది. వృత్తిలో పెనుమార్పులుంటాయి. ఈ ఒకటిన్నరేళ్ల కాలంలో ఈ రాశి వ్యక్తులు చాలామంది రిటైరౌతారు.

కుంభరాశి

వీరికి ఈ గ్రహమార్పు మంచిని చేస్తుంది. ధైర్యం పెరుగుతుంది. ఉల్లాసంగా, చొరవగా దూసుకుపోతారు. ఆధ్యాత్మికచింతన ఎక్కువౌతుంది. పరిచయాలు, విహారయాత్రలు, విలాసాలు, విందులు జరుగుతాయి. దూరప్రాంతాలకు నివాసాన్ని మారుస్తారు.

మీనరాశి

వీరికి ఈ గ్రహమార్పు మంచిది కాదు. కుటుంబంలో గొడవలు కలతలు మొదలౌతాయి. మాటపట్టింపులు ఎక్కువౌతాయి. దురుసుమాటలవల్ల నష్టపోతారు. ఆర్ధికనష్టాలను చవిచూస్తారు. దీర్ఘరోగాలు పెరుగుతాయి. మందులకు లొంగవు.

ఇవి స్థూలమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగతజాతకాన్ని, జరుగుతున్న దశను పరిశీలిస్తూ, ఈ గోచారాన్ని కూడా కలుపుకుని చూచుకోవాలి. అప్పుడు మిగతా అన్ని ఫలితాలు బాగా సరిపోతాయి. ఆయా లగ్నాలవారు కూడా ఇవే ఫలితాలను చూచుకోవాలి.

జాగ్రత్తలు తీసుకోండి మరి !

read more " ఏప్రిల్ 13 న రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు "

మనసుకి మాస్కు

నిన్నొక శిష్యురాలితో హైద్రాబాద్ మెట్రోలో  ప్రయాణిస్తున్నా. వాళ్ళీ మధ్యనే అమెరికానుంచి ఇండియాకు కాపురం మార్చేశారు. మెట్రోలో  ప్రయాణం తనకు అలవాటు లేకపోతే, అమీర్ పేట దాకా ఎదురెళ్లా. అక్కడ మెట్రో  మారి ఇంటికొస్తున్నాం.

జనం బాగానే ఉన్నారు. కొంతమంది మాస్క్ లు వేసుకున్నారు. కొంతమంది వేసుకోలేదు. ఉన్నట్టుండి శిష్యురాలికి ఒక అనుమానం తలెత్తింది.

'అసలీ మాస్క్ గోలేంటి? ఈ రోగం ఎందుకొచ్చిందో మనుషులకి?' మాస్క్ వేసుకునే అడిగింది. 

మాస్కు తియ్యకుండా లోలోపలే నవ్వాను. 

'విను మరి. ఏ రోగమైనా లోపలి స్థితిని బట్టే బయటొస్తుంది. మనుషుల మనసులకి మాస్కులు పెరిగాయి.  లోపలొకటి బైటకొకటి. మాస్కు లేకుండా  ఉన్నదున్నట్టు స్వచ్ఛంగా మాట్లాడేవాళ్ళని నీ జీవితంలో నువ్వసలు  చూశావా ఇప్పటిదాకా?' అడిగా.

కాసేపు ఆలోచించి, 'లేనట్టే ఉంది' అంది.

'అందరూ మనసులకి మాస్కులేసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి, ముఖాలకు కూడా  మాస్కులొచ్చాయి. నువ్వెలా ఉంటే ప్రకృతి కూడా నీకదే ఇస్తుంది. వెరీ సింపుల్'  అన్నా.

శిష్యురాలు తెలివైంది.

'మరైతే, ఇంత గోలలో కూడా కొంతమందికి కరోనా సోకలేదు. వాళ్ళు వాక్సిన్ కూడా వేసుకోలేదు. మరి వాళ్ళ మనసులకి మాస్కులు లేనట్టేగా?' అంది.

'అంతేగా. దానికి నేనేగా పెద్ద ఉదాహరణ?' అన్నా సీరియస్ గా.

'సరేలే. నీకున్నన్ని మాస్కులు ఇంకెవరికీ ఉండవేమో లోకంలో?' అంది తను.

'అవును. స్వార్ధంతో  అందరూ మాస్కులు వేసుకుంటే, నిస్వార్ధంగా మీకోసం నేను వేసుకుంటాను. అంతే తేడా' అన్నా.

శిష్యురాలికి నాతో చనువెక్కువ.

'అబ్బో. ఇది నీ మాస్కా?' అంది.

'అంతేగా మరి' అన్నా అస్సలు నవ్వకుండా.

'ఇదంతా నిజమేనా అసలు?' అంది అనుమానంగా చూస్తూ.

'నా మాస్కంత నిజం, మెట్టుగూడ వచ్చింది. దిగు' అంటూ డోర్ వైపు నడిచా.

తనేం చేస్తుంది పాపం? తిట్టుకుంటూ నాతోబాటు రైలు దిగింది. 

read more " మనసుకి మాస్కు "

బుజ్జిపాప తత్త్వాలు - 6 ( బంగ్లాదేశ్ ఫైల్స్)

ఇస్కాన్ టెంపుల్ మళ్ళీ

విధ్వంసం పాలైంది

ఇస్లామిక్ రాక్షసత్వం

ఇంకోసారి లేచింది

ఓ బుజ్జిపాపా !


రాధాకృష్ణ విగ్రహాలు

రౌడీల పాలయ్యాయి

అడ్డొచ్చిన హిందువులకు 

అరవబాదుడెదురైంది

ఓ బుజ్జిపాపా !


శాంతి శాంతి అనే మతం

అసలు రంగు వెల్లడైంది

నాటకాల తురకమతం

నల్లరంగు పులుముకుంది

ఓ బుజ్జిపాపా !


హింసకు హింసే ప్రతిగా

హిందూత్వం మేల్కొనాలి

వీధికొక్క శివాజీలు

వెల్లువగా రావాలి

ఓ బుజ్జిపాపా !


ఇండియాకు వచ్చేసి

ఇక్కడే ఉంటున్న

లక్షలాది బంగ్లాలను

బయటకు తోసెయ్యాలి

ఓ బుజ్జిపాపా !


ఒరిస్సా బెంగాలు

బీహారు హైడ్రాబాదు

అన్నిచోట్ల స్థిరపడిన

బంగ్లా రోహింగ్యాలను

ఏరిపారవెయ్యాలి 

ఓ బుజ్జిపాపా !

లేకపోతే..ముందుముందు...


బంగ్లాదేశ్ ఫైల్సంటూ

ఇంకో సినిమా తీసుకోని

దాన్ని చూసి ఏడుస్తూ

నవ్వుకుంటు ఉండాలి

ఓ బుజ్జిపాపా !

read more " బుజ్జిపాప తత్త్వాలు - 6 ( బంగ్లాదేశ్ ఫైల్స్) "

17, మార్చి 2022, గురువారం

బుజ్జిపాప తత్త్వాలు - 5 ( హిజాబ్ గొడవ)

మతం గురించి మాట్లాడే

హక్కు కోర్టుకెక్కడిది?

మా చట్టం మాకుంది

అది ఎడారిలో పుట్టింది

ఓ బుజ్జిపాపా !


రాయితీలు బొక్కుతాము

రాజ్యాంగపు హక్కంటాము

ఈ దేశపు ఆత్మతోటి

ఎప్పటికీ కలువబోము

ఓ బుజ్జిపాపా !


యూనిఫాము వేసుకోము

జాతీయగీతం పాడబోము

కోర్టు తీర్పు పాటించము

మేమెడారి మనుషులం

ఓ బుజ్జిపాపా !


ఆడదాన్ని బ్రతకనీము

బ్రతికినా ఎదగనీము

పిల్లలయంత్రం లాగా

పవిత్రంగ చూస్తాము

ఓ బుజ్జిపాపా !

read more " బుజ్జిపాప తత్త్వాలు - 5 ( హిజాబ్ గొడవ) "

బుజ్జిపాప తత్త్వాలు - 4 ( కాశ్మీర్ ఫైల్స్)

కాశ్మీరు ఫైల్సన్నీ

పండిట్ల ఏడుపులే

కనుక బ్యాన్ చెయ్యాలి

ఓ బుజ్జిపాపా !


మావాళ్లు రాక్షసులే

మావన్నీ దౌష్ట్యాలే

కానీ వాటిని దాచాలి

ఓ బుజ్జిపాపా !


ఈ  దేశంలో ఉంటూ

ఇక్కడి తిండే తింటూ

పాకిస్తాన్ని పొగడాలి

ఓ బుజ్జిపాపా !


రాజ్యాంగం చాటుగాను

రంజుగా దాక్కుంటాం

డెమోక్రసీ పేరుమీద

డెవిల్ పనులు చేస్తుంటాం

ఓ బుజ్జిపాపా !


పండిట్లను చంపేస్తాం

పాకిస్తాన్ జై అంటాం

ఎవడో సినిమా తీస్తే

మైనారిటీ రైట్సంటాం

ఓ బుజ్జిపాపా !


ప్రత్యేకపు హోదాతో

ఫండ్సన్నీ వాడుకోని

పండిట్లను చంపేస్తూ

పాక్ పోయి వస్తుంటాం

ఓ బుజ్జిపాపా !


ప్రజలందరు ఎన్నుకున్న

పండంటి ప్రభుత్వాన్ని

కూల్చాలని చూస్తుంటాం

కుట్రలెన్నొ చేస్తుంటాం

ఓ బుజ్జిపాపా !

read more " బుజ్జిపాప తత్త్వాలు - 4 ( కాశ్మీర్ ఫైల్స్) "

14, మార్చి 2022, సోమవారం

బుజ్జిపాప తత్త్వాలు - 3 (మోడ్రన్ జీవితాలు)

పగలంతా టెలిగ్రాము

రాత్రంతా ఇంస్టాగ్రాము

పెరుగుతుంది కిలోగ్రాము

ఓ బుజ్జిపాపా !


పగలూ రాత్రీ సోషల్ మీడియాలో కాలం గడుపుతూ ఉంటే, ఒంటికి తగినంత వ్యాయామం లేక ఊబకాయం వస్తుంది. రోగాలు పెరుగుతాయి. 


ఎన్నారై నడమంత్రులు

పేరెంట్సే హనుమంతులు

పిల్లలేమొ పనిమంతులు

ఓ బుజ్జిపాపా !


ఇండియాలో మధ్యతరగతి నుండి అమెరికాకు వెళ్లి ఎన్నారైలయిన వాళ్లకు నడమంత్రపు సిరి వస్తుంది. గర్వం పెరుగుతుంది. వారికి బేబీ సిట్టింగ్ చేయడానికి వారి తల్లిదండ్రులు హనుమంతునిలాగా సముద్రాలు దాటి పోయి వస్తుంటారు. వారు సంపాదించిన డబ్బంతా వారి పిల్లలు బాధ్యతారహితంగా ఖర్చుచేస్తారు.

ఆన్లైన్లో ఆర్దర్లు

మనుషులలో బోర్డర్లు

మానవత్వ మర్దర్లు

ఓ బుజ్జిపాపా !


ప్రతి ఇంట్లోనూ ఆన్లైన్ లో ఆహారం ఆర్డర్ చేసి తెప్పించుకొని తినడం ఎక్కువైంది. ఎవరి ఫోన్ లో వారు కాలం గడుపుతూ కుటుంబ సభ్యుల మధ్యన దూరాలు పెరుగుతున్నాయి. ఫలితంగా, మానవత్వం మంటగలిసిపోతున్నది.


ఇంటివంట కరువాయె

తెగహోటలు బిల్లాయె

పిల్లలు వస్తాదులాయె 

ఓ బుజ్జిపాపా !


ఎక్కువమంది ఆడాళ్ళు ఇంట్లో వంటలు చేయడం లేదు. హోటలు బిల్లు విపరీతం అవుతున్నది.  జంక్ ఫుడ్ ఎక్కువై, చిన్నపిల్లలు కూడా ఊబకాయులై పహిల్వాన్ల మాదిరి ఊరిపోతున్నారు.


సెల్లు ఫుల్లు బిజీ ఆయె 

సొల్లు వాగి సొలసిపోయె 

కుళ్ళుబ్రతుకు కుంపటాయె 

ఓ బుజ్జిపాపా !


ఎవరి మొబైల్ చూచినా ఇప్పుడు బిజీగా ఉంటోంది. పోనీ మాట్లాడేది ఏమైనా ముఖ్యమైన విషయమా అంటే అదీ ఉండదు. అంతా సొల్లే. ఈ కుట్రలు  కుతంత్రాలతో జీవితం కుళ్లిపోతున్నది.


వెల్తు కార్డు హెచ్చిపోయె 

హెల్తు కార్డు పుచ్చిపోయె

మార్క్స్ కార్డు మంటలాయె

ఓ బుజ్జిపాపా !


అందరిదగ్గరా డబ్బు బాగానే మూలుగుతున్నది. ఆరోగ్యాలు మాత్రం పుచ్చిపోతున్నాయి. ప్రతి ఆస్పత్రీ కిటకిటలాడుతోంది. మనిషి జీవితానికి పడే మార్కులు మాత్రం  నానాటికీ తగ్గిపోతున్నాయి.

read more " బుజ్జిపాప తత్త్వాలు - 3 (మోడ్రన్ జీవితాలు) "

13, మార్చి 2022, ఆదివారం

బుజ్జిపాప తత్త్వాలు - 2 ( కరోనా బ్రతుకులు)

మొన్నేమో డెల్టా అంట

నిన్న ఒమిక్రానంట

రేపు డెల్టాక్రానంట

ఓ  బుజ్జిపాపా !


మొదట్లో డెల్టా అన్నారు. తర్వాత ఓమైక్రాన్ అన్నారు. రేపు డెల్టాక్రాన్ వస్తుందంట.


వాక్సిన్ వద్దన్నవారు

చచ్చి శవాలయ్యారు

వాక్సిన్ ఇమ్మన్నవారు

జీవచ్ఛవాలయ్యారు

ఓ బుజ్జిపాపా !


మాకు వాక్సిన్ వద్దన్నవారిలో చాలామంది (ఇతరరోగాలుంటే) చనిపోయారు. శవాలై కాటికి తరలిపోయారు. మూడు వాక్సిన్లూ వేయించుకుని హాయిగా ఉన్నామని అనుకుంటున్న వారిది భ్రమ మాత్రమే. జాగ్రత్తగా గమనించుకుంటే వాక్సిన్ సైడ్ ఎఫెక్టులు ఎవరికి  వారికే కనిపిస్తాయి. వాక్సిన్ పడినవారు బ్రతికున్నారు గాని, జీవచ్ఛవాల మాదిరి బ్రతికున్నారు. ఏదైనా శవమే, ఒకటి చచ్చినది, ఒకటి బ్రతికినది. అంతే !


రోజుకొక్క వేరియంటు

లాక్ డౌనుల కోవనెంటు

తినడానికి చొప్పదంటు

ఓ బుజ్జిపాపా !


మాటమాటకీ ఏదో ఒక వేరియంట్ రావడం, లాక్ డౌన్ అనడం. ఈ గోలలో పడి ఎన్నో వ్యాపారాలు, జీవితాలు తారుమారయ్యాయి. ప్రభుత్వానిదీ తప్పుకాదు. ప్రజలదీ తప్పుకాదు. తప్పంతా గ్లోబల్ కర్మది. 


రోజుకొక్క మాస్కువేయు

టాస్కును భరియించలేక

మాస్కు విసరిపారవేసి

మందుగొట్టె సామాన్యుడు

ఓ బుజ్జిపాపా !


భయపడుతున్న మధ్యతరగతి వారే ఇంకా మాస్కు వాడుతున్నారు. 'ఎన్నాళ్లీ మాస్కు' అంటూ సామాన్యుడు మాత్రం దాన్ని తీసిపారేసి జల్సాగా మందుకొడుతూ హాయిగా ఉంటున్నాడు.


ప్రతిరోజూ న్యూసుచూసి

భయపడుతూ చావలేక

మాస్కు విసరిపారవేసి

రోడ్డుకెక్కె సామాన్యుడు

ఓ బుజ్జిపాపా !


ప్రతిరోజూ చావుకన్న

ఒక్కరోజు చావుమేలు

కరోనాలు గిరోనాలు 

జానే దేవ్ అంటున్నాడు

ఓ బుజ్జిపాపా !


'భయంతో రోజూ చావడమెందుకు? కరోనా వస్తే చద్దాంలే. పోయేదేముంది?' అనుకుంటూ ప్రస్తుతం చాలామంది దానిని లెక్కచేయడం లేదు. లోకం తీరు ఇలా తయారైంది.

read more " బుజ్జిపాప తత్త్వాలు - 2 ( కరోనా బ్రతుకులు) "

12, మార్చి 2022, శనివారం

బుజ్జిపాప తత్త్వాలు - 1 ( దేవుడు చేసిన మనుషులు)

శివుడొక్కడె దేవుడంటె 

చింతబరిక తియ్యాలి

విష్ణువొకడే దేవుడంటే

వీపు సాఫు చెయ్యాలి

ఓ బుజ్జిపాపా !


అమ్మవారి పూజ చేస్తూ

ఆడదాన్ని హింసపెడితే

అట్లకాడ కాల్చాలి

పొద్దుగాల పూజలంటూ

హద్దుమీరి తిరుగుతుంటే

మొద్దు తిరగవెయ్యాలి

ఓ బుజ్జిపాపా 


మీ మతం చెడ్డదంటూ

మతం మారిపొమ్మంటే

మత్తు దింపి చూపాలి

మాటకొస్తే నీతి చెబుతూ

మానవత్వం మాయమైతే

మాడు అంటి పంపాలి

ఓ బుజ్జిపాపా

read more " బుజ్జిపాప తత్త్వాలు - 1 ( దేవుడు చేసిన మనుషులు) "

9, మార్చి 2022, బుధవారం

రాజమండ్రి స్మృతులు - 3

వచ్చిన పని అయిపోయాక, సాయంత్రం పూట రామకృష్ణా మఠానికి బయలుదేరాము.  దారిలో, ఒకప్పుడు మేమున్న ఇంటిని గుర్తుపట్టలేకపోయాము. అంతగా అక్కడంతా మారిపోయింది. అన్నీ షాపులు వచ్చేశాయి. గోదారి గట్టుమీదుగా వెళుతుంటే, 'ఇక్కడ రేవులు బాగుంటాయి. సాయంత్రం పూట జనం వచ్చి కూచుంటారు. క్రమేణా దీనినొక టూరిస్ట్ సిటీగా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి' అన్నాడు జానకిరామ్.

'నా చిన్నపుడు ఈ గోదారి ఒడ్డున చాలా తిరిగేవాడిని. ఇప్పుడేవేవో ఆశ్రమాలు చాలా కనిపిస్తున్నాయి' అన్నాను. 

'అవును. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ బాగుంటుంది. కొన్ని ఇతర ఆశ్రమాలు కూడా ఉన్నాయి. చివరకు ఇక్కడ కట్టిన శ్మశానం కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. ఈ శ్మశానాన్ని చాలా మోడ్రన్ గా కట్టింది కార్పొరేషన్' అన్నాడు జానకిరామ్.

దాని ఎదురుగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు చాలా కనిపించాయి. 'మరి వాటిల్లో మనుషులు పొద్దున్నే లేచి తలుపులు తీస్తే, శవాలు తగలబడటం కన్పిస్తుంది కదా. అది వాళ్లకు నచ్చుతుందా?' అడిగాను.

'అందుకేనేమో, ప్రస్తుతం ఆ కాంప్లెక్స్ ని షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చేశారు' అన్నాడు.

నవ్వొచ్చింది. 'అంతేలే. శవం తగలబడేలోపు బంధువులు షాపింగ్ చేసుకోవచ్చు. ఒక పనైపోతుంది. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది' అన్నా.

గోదారి ఒడ్డున ఉన్న రామకృష్ణా మిషన్ బిల్డింగ్ దాటుకుని కారు పోతోంది. చిన్నపిల్లాడిగా అక్కడికొచ్చిన జ్ఞాపకాలు తిరిగొచ్చాయి. అలా ప్రయాణించిన కారు చివరకు మఠం ప్రాంగణాన్ని చేరుకుంది.

మొదటిసారిగా, 1974 లో నేను రామకృష్ణామఠానికి మా అమ్మగారితో కలసి వచ్చాను. అప్పుడు నాకు 11 ఏళ్ళు. అప్పట్లో శ్రీ నందానందస్వామివారు మఠాధ్యక్షులుగా ఉండేవారు. 'బాలల వివేకానందుడు' అనే పుస్తకాన్ని ఆయన నాకిచ్చారు. అప్పట్లో మఠం ఇక్కడుండేది కాదు. వీరభద్రపురంలో ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత, ఎన్నోసార్లు రాజమండ్రి స్టేషన్ దగ్గర మేమున్న ఇంటినుండి దాదాపు 5 కి. మీ దూరం నడుచుకుంటూ పాతమఠానికి వచ్చి, ఆరతి అయిపోయేదాకా ఉండి, స్వామీజీని దర్శించి, నమస్కారం చేసుకుని మళ్ళీ నడుచుకుంటూ వెనక్కు వెళ్ళేవాడిని. ఈ పది కి.మీ నడకలోనూ జపం చేస్తూనే నడిచేవాడిని. ఆ చిన్నవయసులో అలాంటి సాధనకు ప్రేరణ స్వామీజీ యొక్క అనుగ్రహమే.

ఆయన నన్నెంతో అభిమానించేవారు. కారణాంతరాలవల్ల మఠంలో బ్రహ్మచారిగా చేరలేకపోయాను. సంసారినయ్యాను. అయినా సరే, ఎంతో తరువాతి కాలంలో నాకు 35 ఏళ్ల వయసులో ఆయన దేహత్యాగం చేసేవరకూ, అనేక సందర్భాలలో అనేక విషయాలలో ఆయన నాకు మార్గదర్శనం చేశారు. మారుమూల గ్రామం పూనూరులో జరిగిన నా ఉపనయనానికి ఆయన నడిచి వచ్చారు. విజయవాడలో, ఆదోనిలో మా ఇంటికి వచ్చారు. మంత్రాలయం ఆయనతో కలసి వెళ్ళాను.  1992 లో జరిగిన గోదావరి పుష్కరాలలో ఆయన్ను ఇదే రాజమండ్రిలో కలుసుకున్నాను. నా సాధనామార్గంలో ఒక గురువైన ఆయనకు ప్రతిరోజూ నమస్కరిస్తూనే ఉంటాను. ఎన్నో సాధనాపరమైన విషయాలను ఆయన దగ్గర నేర్చుకున్నాను.  నా 'శ్రీవిద్యా రహస్యం' గ్రంధంలో ఆయా అనుభవాలను కొన్నింటిని వ్రాశాను. అవన్నీ గుర్తొచ్చాయి.

వారిమీద భక్తితోనే, ఈ రోజువరకూ నేను వ్రాసిన ప్రతి పుస్తకాన్నీ మా అమ్మగారికీ, స్వామివారికీ అంకితం చేస్తూ వస్తున్నాను. ఈ జ్ఞానసంపదంతా వారు పెట్టిన భిక్షే.

చాలాకాలం తర్వాత మళ్ళీ ఇక్కడకొచ్చాను. క్రొత్త మఠాన్ని దర్శించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న వినిశ్చలానంద స్వామివారు గుంటూరు వాస్తవ్యులే గాక, యువకునిగా ఉన్నప్పటినుండీ నాకు పరిచయస్తులే. మా ఇద్దరిదీ ఒకే వయసు కావడంతో దాదాపు స్నేహితులలాగా మేము మాట్లాడుకుంటాం. గుంటూరులో మా ఇంటికి కూడా ఆయనొచ్చారు. దాదాపు 20 ఏళ్ల క్రితం, 'శ్రీ రామకృష్ణ పుంథి' అనే బెంగాలీ గ్రంధం కోసం నేనాయనను సంప్రదిస్తే, దాని ఇంగ్లీషు అనువాదం A Portrait of Sri Ramakrishna అనే పుస్తకాన్ని ఆయన నాకు ఇచ్చారు. అప్పట్లో ఢిల్లీ వెళ్లే పని పడింది. దాదాపు 700 పేజీలున్న ఆ పుస్తకాన్ని ఆ ప్రయాణంలో ఏకబిగిన చదివేశాను. ఎలా ఢిల్లీ వెళ్లానో, ఎలా వచ్చానో గుర్తులేదు. అంతగా దానిలో లీనమయ్యాను.

రంగనాథానందస్వామివారు హైద్రాబాద్ మఠం అధ్యక్షులుగా ఉన్న రోజులలో, వినిశ్చలానంద స్వామివారు ఆయన దగ్గర సేవకునిగా ఉన్నారు. ఆయన శిక్షణలో నిగ్గుతేలిన వ్యక్తి ఈయన.

మఠంలోని రామకృష్ణాలయం, మన దక్షిణాది ఆలయగోపుర విధానంలో కట్టబడి చాలా బాగుంది.  ఆఫీసులో వాకబు చేస్తే స్వామీజీ ప్రస్తుతం మఠంలో లేరని, రంపచోడవరం మెడికల్ క్యాంప్ లో ఉన్నారని తెలిసింది. ఒక మొబైల్ వ్యాన్ లో అక్కడి ఏజన్సీ ఏరియాలోని గిరిజనులకు మెడికల్ సహాయాన్ని అందించే కార్యక్రమంలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. వ్యక్తిగత జీవితమనేది ఏమీ లేకుండా, ఒక్క పైసా బ్యాంక్ బేలన్స్ లేకుండా, తమదంటూ ఏ విధమైన స్వార్ధమూ లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, భగవంతుని ధ్యానంలో ఉంటూ, జీవులకు భగవద్భావంతో సేవను చేస్తున్న వీరు కదా అసలైన దేవతలంటే అని ఒళ్ళు పులకరించింది. మనస్సులోనే నమస్కారం చేసుకున్నాను.

ఆయనతో ఫోన్లో మాట్లాడాను. గుంటూరు విషయాలను, మద్రాస్ మఠంలో ఆయన బ్రహ్మచారిగా ఉన్నపుడు 1982 లో ఆయన్ను మొదటిసారి కలిసిన విషయం, గుంటూరు బ్రాడీపేటలోని వారింటికి ఆయనతో కలసి నేను వెళ్ళిన విషయం - అవన్నీ గుర్తు చేశాను. ఆయనకవన్నీ గుర్తున్నాయి. చాలా సంతోషపడ్డారు. తాను టూర్లో ఉన్నానని, ఇంకోసారి తనున్నపుడు వచ్చి మఠంలో తమ అతిధిగా  కొన్నాళ్ళు ఉండాలని ఆయనన్నారు. తప్పకుండా వస్తానని చెప్పాను. మఠమంతా తిప్పి చూపించమని స్టాఫ్ కు పురమాయించారు. ఆయనకిద్దామని తెచ్చిన నా పుస్తకాలను కొన్నింటిని మఠం ఆఫీసులో ఇచ్చాను.

ఆయన ఆదేశానుసారం, స్టాఫ్ వచ్చి మఠం ఆవరణ అంతా మాకు చూపించారు. విద్యార్థులకు జరుగుతున్న కంప్యూటర్ క్లాసులు, ఇతర సబ్జెక్టుల బోధన, మఠంలో రకరకాల మొక్కల పెంపకం. పెంపుడు తాబేళ్లు, ధ్యానమందిరం, గెస్టులకోసం కట్టిన 'స్వామి నందానంద భవనం' లను చూచాము. స్వామీజీ ఆఫీస్ రూములో, గత అరవై ఏళ్లలో అక్కడ పనిచేసిన ఆరేడుగురు అధ్యక్షస్వామీజీల ఫొటోలున్నాయి. వాటిలో స్వామి నందానందగారి ఫోటోను చూచినప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి. 1972 నుండి 1979 వరకూ ఆయనక్కడ ఉన్నారు.

ఆ తర్వాత అక్కడనుండి బయలుదేరి గోదారి తీరంలో ఉన్న రామకృష్ణా మిషన్ భవనాలకు చేరుకున్నాం. మఠంలో సాధువులు ఉంటారు. జపధ్యానాది సాధనలు జరుగుతాయి. మిషన్ కేంద్రంలో సేవాకార్యక్రమాలు జరుగుతాయి. ఆ విధంగా వివేకానందస్వామి ఏర్పాటు చేశారు. స్టాఫ్ కూడా మాతో అక్కడకు వచ్చారు. అది పూర్తిగా మెడికల్ సెంటర్. మల్టీ మెడికల్ హాస్పిటల్. మధ్యాన్నం 1 గంట వరకూ సేవలందిస్తుంది. సిటీలోని అందరు స్పెషలిస్టులు అక్కడకొచ్చి ఒక గంట సేపు సేవలందించి వెళతారు. చీకటి పడటంతో మూసేసి ఉంది. కానీ మాకోసం తలుపులు తెరిపించి మరీ అన్ని విభాగాలను చూపించారు.

అవన్నీ చూచి, వారినుంచి సెలవు తీసుకుని, వెనక్కు బయలుదేరాము. గోదావరి గట్టున కొద్దిసేపు కూర్చుని వెళదామని అన్నాను. ఒక మనుషులు లేని రేవులో కూర్చుందామని చూస్తే, అక్కడ అంత శుభ్రంగా లేదు. అందుకని ఇస్కాన్ ఘాట్ లో బాగుంటుందని అక్కడకు తీసుకెళ్లారు. అక్కడ ఘాట్ కు వెళ్ళేదారిలో నాలుగైదు మఠాలు కనిపించాయి. అన్నీ చాలావరకూ నిర్మానుష్యంగా ఉన్నాయి. కొన్ని నకిలీ స్వాముల ఆశ్రమాలలో మాత్రం జనాలున్నారు. గోదారి ఒడ్డున మెట్లమీద కాసేపు కూచున్నాము. అక్కడి మనుషుల ఎచ్చులు, వేషాలు కాసేపు చూచాక అక్కడుండాలనిపించలేదు.  పవిత్రమైన స్థలాలను తమ చీప్ ప్రవర్తనలతో అపవిత్రం చెయ్యడం ఎంత బాగా వచ్చో మనుషులకి? అని అసహ్యం చేసింది. గోదావరి జిల్లాలలోని సగటుమనుషులలో అతిప్రవర్తనలు, అతివాగుడులు చాలా ఎక్కువ. డీసెంట్ బిహేవియర్ ఆశించేవారికి అవి వెగటు పుట్టిస్తాయి.

ఇక అక్కడనుంచి లేచి, వెనక్కు వస్తుంటే, ఆ ఆశ్రమాల మధ్యలో మళయాళస్వాములవారి వ్యాసాశ్రమభవనం కనిపించింది. సత్యమైన ఋష్యాశ్రమాలు ఎలా ఉంటాయో, అలాగే నిర్మానుష్యంగా ఉంది. వెంటనే ఆగి, బయటనుంచి ఆయన ఫొటోకు నమస్కారం చేసుకున్నాను. ఆయన నిజమైన తపస్వి, వేదాంతి, జ్ఞాని. నందానందస్వామివారు ఆయన్ను ఎంతో గౌరవించేవారు. ప్రస్తుతపు ఎందరో నకిలీస్వాముల మధ్యనున్న సత్యమైన సాధువులలో, బ్రహ్మజ్ఞానులలో ఆయనొకరు. ఆయన శిష్యపరంపర కూడా నిజమైన జ్ఞానుల పరంపరయే.

ఆయన ఆశ్రమం ముందు ఆగి, నమస్కారం చేసుకుని, బయలుదేరుతుంటే, నాతో ఉన్నవారు ఇలా అన్నారు, 'మిగతా ఆశ్రమాలలోకి వెళ్ళరా?' అని.

'వెళ్ళను' అని అన్నాను.

అడిగినవారి ముఖాలలో ప్రశ్నార్ధకాలను చూచి, 'వాటిల్లోకి వెళితే ఈ గోదారి చాలదు. ఆ బురదను కడుక్కోడానికి కాశీకెళ్లి గంగలో మునగవలసి వస్తుంది' అన్నా నవ్వుతూ.

'మరి వాటిల్లో కొన్నింటిలో జనాలు బాగానే ఉన్నారు కదా?' అని వారన్నారు.

'ఉంటారు. జనగొఱ్ఱెలకు అసలుకంటే నకిలీనే ఎక్కువగా నచ్చుతుంది. అదే కలిమహత్యం. లోకంలో మీరు చూస్తున్నదంతా నిజమనుకోకండి. రండి పోదాం. ' అంటూ కారు దగ్గరకు దారితీశాను.

గెస్ట్ హౌస్ ఖాళీ చేసి, రైలెక్కాము. 

'త్వరలో మళ్ళీ ఇంకోసారి రాజమండ్రి వెళ్ళాలి. రామకృష్ణ మఠంలో మా ఫ్రెండ్ స్వామీజీ గారితో ఒకటి రెండు రోజులు గడపాలి. నందానందస్వాములవారి గతస్మృతులను మళ్ళీ నెమరు వేసుకోవాలి' అని ఆలోచిస్తూ మర్నాడు పొద్దునకు హైద్రాబాద్ చేరుకున్నాము. 

(అయిపోయింది)

read more " రాజమండ్రి స్మృతులు - 3 "

7, మార్చి 2022, సోమవారం

రాజమండ్రి స్మృతులు - 2

రాజమండ్రిలో పని ముగించుకుని కడియం కు బయలుదేరాము. ఆ దారిలో పోతుంటే చిన్నప్పటి సంగతులు మరికొన్ని గుర్తొచ్చాయి.

మొదటిసారి నేను సత్యసాయిబాబాను గురించి విన్నది రాజమండ్రిలోనే. ఇదే దారిలోనే ఉన్న ఒక స్కూల్ లో ఆయన దిగారు. అందరూ తండోపతండాలుగా పోయి చూస్తున్నారు. నేనూ ఇంకా నలుగురు పిల్లలమూ కలసి ఆయన్ను చూద్దామని వెళ్ళాము. ఆ స్కూలు బిల్డింగు లోపలెక్కడో ఆయనున్నారు. మామూలుగా వెళ్లి, అందరినీ చూచినట్లు చూడటమే అని అమాయకంగా అనుకున్నా. అక్కడ పరిస్థితి అలా లేదు. కాసేపు చూచి విసుగుపుట్టి అక్కడనుంచి వచ్చేశాము. తర్వాతకాలంలో అఫీషియల్ డ్యూటీ మీద ధర్మవరం వెళ్ళినపుడు చాలాసార్లు ఆయన్ను చూచాను. చివరాఖరికి అలా పోయాడు పాపం !

అక్కడే ఆయన బొమ్మలున్న ఉంగరాలు, గొలుసులు అమ్ముతున్నారు. వాటిని కాసేపు చూచి, అక్కణ్ణించి బయలుదేరి వస్తూ పక్కనే ఉన్న చెరుకుతోటలలోకి వెళ్ళాము. ఎక్కడనుంచో బెల్లం వాసన వస్తుంటే, దానిని వెదుక్కుంటూ ఆ చెరుకుతోట మధ్యలోకి వెళ్లి చూచాము. ఒక పెద్దగుంటలో చెరుకురసాన్ని పోసి, కాస్తున్నారు. అప్పట్లో మనుషులలో మంచితనం ఇంకా బ్రతికి ఉండేది. నడుచుకుంటూ పల్లెలు దాటి పోతుంటే, ఎక్కడికి పోతున్నారని వివరాలు కనుక్కుని మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడన్నిటినీ ఖరీదు కడుతున్నారు. ఆ చెరుకుతోటలో ఉన్న రైతు ఎవరోగాని, ఉడుకుతున్న చెరుకురసాన్ని మాకు తలాకాస్తా గ్లాసులో పోసి ఇచ్చాడు త్రాగమని. భలే రుచిగా ఉంది చెరుకుపానకం..

ఈ విషయం చెబుతుంటే వింటున్న జానకిరామ్, 'ఈ ఊర్లలో పెద్దవాళ్ళు ఇప్పటికీ అదే తింటారు.  దిబ్బరొట్టి, బెల్లంపాకం కలిపి తింటారు. అదే వాళ్ళ ఆహారం' అన్నాడు.

మా కారు డ్రైవరేమో, 'మనం వెళ్లే చోటకు దగ్గరలోనే రావులపాలెం అనే ఊరిలో RK Hotel అని ఉంటుంది.  అందులో దిబ్బరొట్టి, బెల్లంపాకం దొరుకుతాయి. టేస్ట్ చూస్తారా?' అన్నాడు.

'ఆ బెల్లం పాకాన్ని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చా?' అడిగాను నేను.

నవ్వాడతను.

'కుదరదండి. చెరుకురసాన్ని తీగపాకంలాగా కాయాలి. దానికొక పద్దతుంటుంది. అలా చేస్తేనే అది వస్తుంది. అలాంటి తిండ్లు మా గోదారి జిల్లాల్లో చాలా ఉన్నాయి. పనస ఆకుల్లో  ఇడ్లీ ఉడకబెట్టి చేస్తారు. రెండిడ్లీ తిన్నారంటే మధ్యాన్నం దాకా మీకు ఆకలి వెయ్యమన్నా వెయ్యదు. పనసఆకులోని ప్రోటీన్ అంతా ఇడ్లీలోకి దిగి, ఇడ్లీ రంగు పసుపు పచ్చగా మారిపోతుంది. చాలా బాగుంటుంది' అన్నాడు.

అవన్నీ వింటుంటేనే నోరూరేలాగా ఉంది గోదారిజిల్లా యాసలో అతను చెప్పిన వర్ణన.

మెహర్ బాబా గారిని గురించి కూడా మొదటిసారిగా రాజమండ్రిలోనే విన్నాను. మేమక్కడున్నపుడే ఆయన రాజమండ్రికి వచ్చారు. మాకు దగ్గర్లోనే ఉన్నారు కూడా. కానీ, ఆయన గురించి పెద్దగా తెలియకపోవడం, నేను బాగా చిన్నపిల్లాడిని కావడాల వల్ల ఆయన్ను చూడలేకపోయాను. కొంచం పెద్దయిన తర్వాత, ఆయన సాహిత్యం చదివాక ఈ విషయంపైన చాలా బాధపడ్డాను కూడా. కానీ, సాధనలో నలిగిన తర్వాత, ఆ బాధ పోయింది. 

అప్పట్లో శ్యామలా టాకీసులో సినిమాకెళితే ఇంటర్వెల్ లో స్లైడ్స్ వేసేవాళ్ళు. వాటిలో మెహర్ బాబా స్లైడ్ కూడా ఉండేది. Dont worry Be happy అని దానిమీదుండేది. అది చూచి అమ్మను అడిగాను, 'ఆయనున్న చోటకెళ్లి చూద్దామా?' అని. అమ్మకు స్వతంత్రం లేదు. నవ్వి ఊరుకుంది పాపం. ఆ విధంగా మెహర్ బాబా గారిని దేహంతో చూడలేకపోయాను.

కడియంలో పని ముగించుకుని వెనక్కు వస్తుంటే, దారిలో అనేక మొక్కల నర్సరీలు కనిపించాయి. 'మన ఆశ్రమానికి కావలసిన మొక్కలన్నీ ఇక్కడనుంచి తీసుకోవచ్చు, మనకు కనీసం రెండులారీల మొక్కలు కావలసివస్తాయి. కొన్ని వేలరకాల మొక్కలు ఇక్కడుంటాయి' అని వాళ్ళన్నారు. అలాగే చేద్దామని, మళ్ళీ ఒకసారి పర్సనల్ గా వచ్చినపుడు, ఆ నర్సరీలన్నీ నిదానంగా చూచి, మన ఆశ్రమానికి కావలసిన మొక్కలను కొందామని నిర్ణయించాము.

మీ ఊరికి వెళ్ళొచ్చామని ఒక శిష్యునితో అంటే, 'మీకెలా అనిపించింది?' అనడిగాడు.

'బానే ఉంది. గోదారి జిల్లాలంటే నాకు ఇష్టమే' అని అన్నాను.

'మనుషులెలా అనిపించారు?' అన్నాడు నవ్వుతూ.

'బాగుంటుందని ప్రకృతిని గురించి నేనన్నాను. నీళ్లు, పచ్చదనం ఎక్కడ చూచినా ఉంటాయి. అవి నాకు నచ్చుతాయి. అదే మనుషులలో అయితే, కావలసినన్ని అవలక్షణాలు అగుపించాయి. మగాళ్లలో అయితే అత్యాశ, అనుమానం, భయం, డబ్బుయావలు బాగా ఎక్కువ. ఆడాళ్ళలో అయితే ఓవర్ పొసెసివ్ నెస్, భయం, జెలసీలు ఎక్కువ. అన్ని ప్రాంతాలలో అన్నీ ఉంటాయి గాని, కొన్ని చోట్ల కొన్ని ఎక్కువగా ఉంటాయి. గోదారిజిల్లాలలో ఇవి ఎక్కువ' అని చెప్పాను. 

రకరకాలైన వంటలకు, మంచితిండికి గోదావరిజిల్లాలు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే కోస్తాజిల్లాలన్నీ మంచి తిండిపుష్టి ఉన్నవే. విశాఖనుంచీ నెల్లూరు వరకూ ఏ ప్రాంతపు తిండి ఆ ప్రాంతానికుంది. కానీ దారిలో చాలాచోట్ల హైద్రాబాద్ బిర్యానీ అని హోటళ్లు చాలా కనిపించాయి.  అదేంటి అనడిగితే, 'ఇప్పుడెక్కడ చూసినా ఇదెక్కువైంది' అని వాళ్ళు చెప్పారు. నిజమే అనిపించింది. నాన్ వెజ్ తిండి ఇప్పుడు బాహాటం అయిపోయింది. పాతకాలంలో అయితే, ఎక్కడో మిలటరీ హోటల్ అని ఒక్కటి ఉండేది. ఇప్పుడు శాకాహారహోటల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. నేను నిజామాబాద్ వెళ్ళినపుడు అదే జరిగింది. ఒక వెజ్ హోటల్ కోసం గంటపాటు ఆటోలో వెతుక్కుంటూ తిరిగాం. ఎక్కడచూచినా సిగ్గులేకుండా రోడ్లమీద పెట్టి, ఫ్లెక్షీలలో బొమ్మలు పెట్టి, మరీ మాంసాహారం అమ్ముతున్నారు. సమాజంలో పేట్రేగిపోతున్న విచ్చలవిడితనానికి, నీతీనియమాలు లోపించడానికి, పెడపోకడలు, క్రైమ్ రేట్లు పెరగడానికి, విపరీతమైన ఈ మాంసాహారపు వాడకం కూడా ఒక కారణమని నా ఊహ.

అదే విధంగా, త్రాగటం కూడా ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఒకప్పుడు భయం భయంగా దాక్కొని త్రాగేవాళ్ళు. ఇప్పుడు బాహాటంగా త్రాగుతున్నారు. కాలేజి అమ్మాయిలు అబ్బాయిలు త్రాగుతున్నారు. దిగజారుతున్న సమాజానికి ఇది నిదర్శనం.

ప్రస్తుతం అందరిదగ్గరా డబ్బులు ఎక్కువయ్యాయి. కానీ నీతీ నియమాలు తగ్గిపోయాయి. కదిలిస్తే అందరూ నీతులు చెబుతున్నారు. కానీ పాటిస్తున్నవాళ్ళు ఎక్కడా లేరు. అందరికీ ఈగోలు ఎక్కువయ్యాయి. ఇది మంచికి కాదు. కరోనా అందుకే వచ్చి ఒక దులుపుడు దులిపింది. అయినా మనుషులలో మార్పు రావడం లేదు. అందుకే, ముందు ముందు దీని బాబులాంటిది ఇంకోటి రాబోతోంది.

ఆలోచనలలో పడ్డాను. అందరూ మౌనంగా ఉన్నారు. కారు ముందుకు దూసుకుపోతోంది.

వెళ్ళినపని చూచుకొని, రాజమండ్రికి తిరిగివచ్చి లంచ్ చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకున్నాము. సాయంత్రం ఖాళీ దొరికితే, రామకృష్ణమఠానికి వెళ్లాలని ప్లాన్.

(ఇంకా ఉంది)

read more " రాజమండ్రి స్మృతులు - 2 "

4, మార్చి 2022, శుక్రవారం

ఆశ్రమం పనులు - వీడియోలు - ఫోటోలు

ఈ రోజు శ్రీరామకృష్ణులవారి 187 వ జయంతి.

ఈ రోజునుండీ మా ఆశ్రమం పనులు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. దానిలో భాగంగా, ఇప్పటివరకూ ఉన్న మొక్కలను తొలగించడం, ఆశ్రమస్థలాన్ని దున్నించడం, స్థలహద్దులను గుర్తించడం, బోరింగ్ పాయింట్ ను జియాలజిస్ట్ సహాయంతో గుర్తించడం మొదలైన ప్రాధమిక పనులను మొదలు పెట్టాం.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలను వీడియోలను ఇక్కడ చూడండి.









read more " ఆశ్రమం పనులు - వీడియోలు - ఫోటోలు "

మా ఫేస్ బుక్ పేజీ ఈ రోజునుండీ లైవ్

ఈ రోజు శ్రీరామకృష్ణులవారి 187 వ జయంతి. 

ఈ శుభదినాన,, మా 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ఆశ్రమం పనులు మొదలయ్యాయి. ఈ రోజునుంచీ మా ఫేస్ బుక్ పేజీ కూడా లైవ్ అవుతున్నది. మా ఇండియా, అమెరికా వెబ్ సైట్లతో బాటు, ఫేస్ బుక్ పేజీలో కూడా ఇకనుంచీ మా కార్యక్రమాలు అప్ డేట్ అవుతాయి.

ఈ క్రింది వెబ్ అడ్రస్ లో మా ఫేస్ బుక్ పేజీని మీరు సందర్శించవచ్చు. మా కార్యక్రమాలను, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మా సంస్థ గురించిన మీ అభిప్రాయాలను, భావాలను మాతో పంచుకోవచ్చు. మా ప్రయాణంలో మాతో కలసి నడువవచ్చు. తద్వారా వేదాంత - యోగ - తంత్ర - జ్యోతిష్యరహస్యాలతో కూడిన సాధనామార్గంలో ఉన్నత అంతస్తులను అందుకోవచ్చు.

మాతో అనుసంధానం అవడానికి ఇదే మీకు ఆహ్వానం.

https://www.facebook.com/Panchawati-Spiritual-Foundation-110864981474679/

read more " మా ఫేస్ బుక్ పేజీ ఈ రోజునుండీ లైవ్ "

మా క్రొత్త 'ఈ బుక్' శంకరాచార్యులవారి "ఆత్మబోధ" విడుదలైంది

ఈ రోజు శ్రీరామకృష్ణులవారి 187 వ జయంతి. ఈ సందర్భంగా 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్'  నుండి ఒక క్రొత్త పుస్తకం విడుదలౌతున్నది. అది, ఆదిశంకరుల వారి 'ఆత్మబోధ. కేవలం 68 శ్లోకములతో కూడిన చిన్నపుస్తకమే అయినప్పటికీ, ఇందులో వివరింపబడిన అద్వైతవేదాంతపు లోతులను బట్టి చూస్తే చాలా పెద్ద పుస్తకమని చెప్పాలి. ఇప్పటివరకూ విడుదలైన మా గ్రంధాలలో ఇది 38 వ గ్రంధం. యధావిధిగా ఇదికూడా గూగుల్ బుక్స్ నుండి లభిస్తుంది.

శ్రీరామకృష్ణులవారి బోధనలు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములను సమన్వయపరుస్తూ, అతిసరళమైన విధానంలో జీవితానికి అన్వయించుకునే విధంగా ఉంటాయి. అసలైన సత్యంకూడా అదే. వేదములకు, ఉపనిషత్తులకు కేవలం ద్వైతపరంగానో, విశిష్టాద్వైతపరంగానో, అద్వైతపరంగానో భాష్యాన్ని చెప్పడము, వీటిలో ఏదో ఒకటే సరియైనదంటూ, మిగిలినవి తప్పులని ఖండించడమే అసలైన పెద్దతప్పు. ఇలా అనడం సాహసమైనప్పటికీ, త్రిమతాచార్యులు చేసిన తప్పు అదేనని చెప్పక తప్పదు. దానినే వారి అనుయాయులు నేటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ  చీకటియుగాన్ని దాటి చాలా ముందుకొచ్చిన మనకు, అవే విభేదాలను 'శైవం, వైష్ణవం, శాక్తేయం' అంటూ మళ్ళీ కొందరు ఆచార్యులు నూరిపోస్తున్నారు. శివుడే దేవుడని, విష్ణువే దేవుడని, ప్రజలను మళ్ళీ వర్గాలుగా చీలుస్తూ విభేదాలను సృష్టిస్తున్నారు. సమాజాన్ని చీకటియుగాలలోకి మళ్ళీ తీసుకుపోతున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఈ తప్పును సరిదిద్దవలసిన బాధ్యత నిజమైన ఆధ్యాత్మిక గురువులపైన ఉన్నది.

సత్యమేమిటంటే, అసలైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ మూడుమతాలూ మూడుమెట్లు మాత్రమే. ఒకే సత్యాన్ని మూడు భిన్నములైన కోణాలలోనుంచి చూచినప్పుడు అది మూడు విధాలుగా కనిపిస్తుంది. కానీ ఏ ఒక్క కోణమూ పరిపూర్ణసత్యం కాదు.  అన్ని కోణాలనుంచీ ఒక విషయాన్ని చూచి, దానిని సమగ్రంగా అర్ధం చేసుకోవడమే పరిపూర్ణ సత్యమౌతుంది. శ్రీ రామకృష్ణులవారు చెప్పినది ఇదే. వివేకానందులవారు బోధించిందీ ఇదే. ఆ తరువాత రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగార్లు చెప్పినది కూడా ఇదే.

నా మార్గం కూడా ఇదే. నా ' శ్రీవిద్యా రహస్యం'  గ్రంధంలో దీనినే వివరించాను.

త్వరలో  రాబోతున్న నా సంచలనాత్మక గ్రంధం, 'త్రిమత సమన్వయము' కు ముందస్తుగా కొన్ని శంకర,  రామానుజ, మధ్వ సాంప్రదాయాలకు చెందిన గ్రంధములను విడుదల చేయాలన్నది నా ఆలోచన. ఆ ఒరవడిలో ఒక ప్రయత్నమే శంకరాచార్యులవారు రచించిన ఈ 'ఆత్మబోధ' పుస్తకం. 

ఎంతోమంది పండితులు, జ్ఞానులు ఇప్పటికే ఈ గ్రంధానికి వ్యాఖ్యానాలను వ్రాశారు. నా చింతనాధోరణిలో ఇప్పుడు నేనూ దీనిని వ్యాఖ్యానించాను. అద్వైతాభిమానులకు నా వ్యాఖ్యానం తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను.

దానికి తోడుగా, ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉన్నది.

ఈరోజున మా ఒంగోలు ఆశ్రమం పనులు మొదలయ్యాయి. ఆశ్రమస్థలాన్ని దున్నించడం, స్థలం హద్దులను సరిచూడడం, బోరింగ్ పాయింట్ ను గుర్తించడం మొదలైన ప్రాధమికపనులను ఈరోజున చేస్తున్నాము. అందుకని, నా శిష్యులందరి కోరికననుసరించి, మా ఆశ్రమస్థలంనుంచే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాను. ఈ విధంగా, మా ఆశ్రమస్థలం నుండి విడుదలౌతున్న మొదటి పుస్తకం -- శంకరుల 'ఆత్మబోధ' అవుతున్నది.

రాబోయే రెండునెలలలో ఆశ్రమపనులను చురుకుగా కొనసాగిస్తూ, కనీసం రెండు స్పిరిట్యువల్ రిట్రీట్స్ ను మా శిష్యులందరితో కలసి మా ఆశ్రమస్థలంలో జరుపబోతున్నాము. నిజమైన ఆధ్యాత్మికసాధకులకు ఇక పండుగరోజులు మొదలు కాబోతున్నాయి. నలభై అయిదేళ్లుగా సాగిన నా సాధనామార్గంలో నేను అవగతం చేసుకున్న అనేక నిగూఢమైన జ్యోతిష, యోగ, తంత్రరహస్యాలను, ఇన్నాళ్లూ నమ్మకంగా నన్ను అనుసరిస్తూ వస్తున్న శిష్యులకు దగ్గరుండి నేర్పించబోతున్నాను. వారిని యోగ-తంత్ర సాధనాపూర్వకమైన ధ్యానమార్గంలో ప్రాక్టికల్ గా నడిపించబోతున్నాను.

నేనిన్నాళ్ళూ చెబుతూ వస్తున్నది ఇప్పుడు సాకారం అవుతున్నది. గమనించండి !

ఈ ప్రయాణానికి తొలి అడుగుగా, మా ఆశ్రమస్థలం నుండి 'ఆత్మబోధ' ను ఈరోజు విడుదల చేస్తున్నాను. నా సాధనామార్గంలో నడవాలని ఆశించేవారికి ఈరోజు సుదినం. ఆధ్యాత్మిక జీవితపు అనుభవాలను ప్రాక్టికల్ గా పొందాలని ఆశించేవారికి ఇది నూతనాధ్యాయం !

ఇక, ఆనందపు వెల్లువలతో కూడిన నిరంతర అంతరిక ప్రయాణానికి సిద్ధం కండి  !

read more " మా క్రొత్త 'ఈ బుక్' శంకరాచార్యులవారి "ఆత్మబోధ" విడుదలైంది "

3, మార్చి 2022, గురువారం

రాజమండ్రి స్మృతులు - 1

మొన్నీ మధ్యన 
ఇనస్పెక్షన్ల కోసం రాజమండ్రి, కడియం వెళ్ళటం జరిగింది. ఉదయాన్నే రైలు దిగాము. స్టేషన్ మేనేజరు, ఇనస్పెక్టర్లు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. స్టేషన్ బయటే ఉన్న గెస్ట్ హౌస్ లో బస. ఈలోపు శిష్యుడు జానకిరామ్ వచ్చి కలిశాడు. ఫ్రెష్ అయ్యి, ఎదురుగా ఉన్న కన్నమ్మతల్లి గుళ్ళోకి వెళ్లి నమస్కారం చేసుకున్నాం. ప్రక్కనే ఉంటుంది, AMH School. అందులోనే నేను ఆరునుంచి ఎనిమిది మధ్య వరకూ చదూకున్నాను. అది దాదాపు ఏభై ఏళ్ల క్రితం.

1973 వ సంవత్సరంలో నేనీ స్కూల్లో ఆరోతరగతిలో చేరాను. అప్పట్లో కార్పొరేట్ స్కూళ్ళు లేవు. కనీసం ట్యుటోరియల్ కాలేజీలు కూడా లేవు. అప్పట్లో ఈ స్కూల్ ని, 'ఆల్కట్ గార్డెన్స్ మునిసిపల్ స్కూల్' అని పిలిచేవారు. ఇప్పుడు 'శ్రీనివాస రామానుజం కార్పొరేషన్ స్కూల్' అని పిలుస్తున్నారు. కల్నల్ ఆల్కాట్ పేరు మీద అప్పట్లో అలా పిలిచేవారనుకుంటా.

ఆరోజుల్లో, నిక్కరూ చొక్కా వేసుకుని పుస్తకాలను భుజం మీద పెట్టుకుని నడుచుకుంటూ స్కూల్ కెళ్ళేవాడిని. దారిలో కన్నమ్మతల్లి గుడిలో దణ్ణం పెట్టుకుని, బొట్టు పెట్టుకుని బడికెళ్ళడం అలవాటు. అప్పట్లోనే డౌటు, 'అమ్మవారేంటి ఇంత భయంకరంగా ఉంది? ఎందుకిలా భయపెడుతుంది? అని'. 

మొదటిసారిగా మేకను అమ్మవారికి బలివ్వడం అక్కడే చూశా. ఆ తిరణాలకోసం మూగిన జనాన్ని చూచి, ఏదో అనుకుని లోపలకు దూరి చూస్తే, కనిపించిన సీన్ చూచి, అప్పట్లో ఎంత భయమూ అసహ్యమూ వేసిందో చెప్పలేను. ఒక మేక మెడలో దండ వేసి ఉంది. దానికి బొట్టు పెట్టి ఉంది. అందరూ డప్పులు వాయిస్తూ దానిచుట్టూ  ఎగురుతున్నారు. అదేమో భయంతో బిక్కచచ్చిపోయి ఉంది. దాన్నేం చేస్తున్నారని ఆ గుంపులో ఒకడ్ని అడిగా. బలిస్తారన్నాడు. బలంటే ఏంటని అడిగా. దానిని చంపుతారని చెప్పాడు. నేను బిగుసుకుపోయా.

ఇలాంటి బలులు స్వీకరించవద్దని, మేక ప్రాణాన్ని కాపాడమని కన్నమ్మతల్లిని ఎంతో దణ్ణం పెట్టుకున్నా.  కానీ నా మొరను తల్లి వినలేదు. లేదా, జనం వినలేదేమో? ఏదైతేనేం, బలి అయిపోయింది. అసలీ బలులేంటి? అమ్మవారు నిజంగా ఇలాంటి జంతుబలులు కోరుతుందా? అనే ఆలోచన నాలో ఆరోజున మొదలైంది. అప్పుడు నాకు 10 ఏళ్ళు. అదంతా గుర్తొచ్చి నవ్వొచ్చింది.

అప్పట్లో అమ్మవారి విగ్రహం చాలా భీకరంగా ఉండేది. గుడికూడా డౌన్లో ఉండేది.  రోడ్డుకోసం గుడిని పైకి లేపారల్లే ఉంది. క్రొత్త విగ్రహం లో అంత కళా లేదు, అంత భీకరత్వమూ లేదు. గుడి కూడా మోడరన్ గా ఉంది.

అదే సందులో గోదారి గట్టు దగ్గరగా మేం ఉండేవాళ్ళం. అప్పుడు మేమున్న ఇంటి స్థలమంతా ప్రస్తుతం ఖాళీగా ఉంది.  ఆ జాగా అమ్ముతామని ఒక బోర్డు పెట్టి ఉంది. గోదారి గట్టు అప్పట్లో ఎర్రమట్టి రోడ్డుగా, దరిద్రంగా ఉండేది. జనమంతా దానిని బహిర్భూమిగా వాడేవాళ్లు. ఇప్పుడు సిమెంట్ రోడ్డు పడింది. నీట్ గా ఉంది.

ఆ ఇంట్లో ఉన్నపుడే, సాయంత్రాలలో గోదారిగట్టు చివరలో ఉన్న పంప్ హౌసు దగ్గర కెళ్ళి, ఊరకే ఆకాశంలోకి నీళ్ళలోకి చూస్తూ చాలాసేపు కూచునేవాడిని. గోదారి తీరమంటే ఏదో తెలియని ఆకర్షణ ఆ వయసులోనే మొదటిసారిగా నాకు కలిగింది.  అదిప్పటికీ అలాగే ఉంది.  గోదారిగట్టుమీద కూచుని, గోదాట్లోకి చూస్తూ ఎన్ని గంటలైనా అలా ఉండిపోవచ్చు. గోదారిలో ఏదో తెలియని మహత్యం ఉంది.

ఏ సాధనా చేయకముందే, 10 ఏళ్ల వయసులో నాకు కలిగిన మొదటి ఆధ్యాత్మిక అనుభవాలు ఈ గోదారి గట్టుమీదే కలిగాయి. అవిప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. అయితే, అవి ఆధ్యాత్మిక అనుభవాలన్న విషయం అప్పట్లో తెలీదు.

అప్పట్లో స్కూల్ నుంచి సరాసరి ఇంటికెళ్ళకుండా, గోదాట్లో దిగి ఈతలు కొట్టి, ఒంటికి మట్టి పూసుకుని ఇంటికెళ్లినా, అమ్మ కనిపెట్టి వీపు వాయించిన రోజులు గుర్తొచ్చాయి. అదంతా శ్రీమతికి, జానకిరామ్ కి చెప్పాను. అందరం నవ్వుకున్నాం.

అదే వీధిలో సినీహీరో రంగనాధ్ తన ఫెమిలీతో ఉండేవారు. ఆయనా, మా నాన్నా స్నేహితులు కావడంతో, అప్పుడప్పుడూ నేను వాళ్ళింటికి వెళుతూ ఉండేవాడిని. అత్తయ్య, మామయ్య అని వాళ్ళను పిలిచేవాడిని. ఆ ఇంటిని మా వాళ్లకు చూపించాను.

నన్ను ఆరో తరగతిలో చేర్పించింది రంగనాధ్ మామయ్యే. ఆరోజున మా నాన్నకు ఆఫీసు పనుండి రాలేకపోతే, మామయ్యే నన్ను రిక్షాలో ఎక్కించుకుని వెళ్లి, స్కూల్లో చేర్పించాడు. ఆ సంగతి ఇంకా నాకు బాగా గుర్తుంది. ఆ సందులు గొందులన్నీ నేను తిరిగి ఆడుకున్నవే.

మొదటిసారిగా లతామంగేష్కర్ పాడిన, 'ఎ దిల్ ఔర్ ఉన్కి, నిగాహొంకే సాయే, బనాకే క్యో బిగాడా రే' మొదలైన  సోలో పాటలను అక్కడే విన్నాను. వేరే లోకానికి తీసుకుపోయేవి ఆ పాటలు. సంగీతమంటే అభిమానం అక్కడే మొదలైంది.

ఆ వయసులోనే ఒక వీధి డ్రామాలో ఒక చిన్నపిల్లాడి వేషం వేశాను. శివరాత్రిపూట జాగారం చేస్తూ ఆ వీధిడ్రామా వేశాం. ఆ రకంగా, స్టేజిమీద నటించడానికి కూడా రాజమండ్రిలోనే మనకు అక్షరాభ్యాసం ! రాజమండ్రి నాకు అనేక విషయాలలో ఓనమాలను దిద్దించింది.

గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చి, ఉపాహారం సేవిస్తుండగా, ఇంకా కొన్ని విషయాలు మా వాళ్ళతో చెప్పాను.

'AMH స్కూలు ఈ గెస్ట్ హౌస్ ముందే ఉంటుంది. లీజర్లో, ఇదే గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ గోడల మీదెక్కి, అక్కడనుంచి అందే చింతచెట్టు కొమ్మల్ని పట్టుకుని ఊగేవాళ్ళం. వాచ్ మేన్ అరిచేవాడు. ఇప్పుడు, అదే గెస్ట్ హౌస్ లో నేను  అధికారిక హోదాలో దిగాను. ఏభై ఏళ్ల క్రితం నిక్కర్లు వేసుకుని తిరిగే రోజుల్లో, స్టేషన్ మేనేజర్ని చూస్తే భయం. ఇప్పుడదే స్టేషన్ మేనేజర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని ప్రొటోకాల్ ఇచ్చాడు. కాలప్రభావం ఇలా ఉంటుంది !

కొన్నాళ్ళు ఈ సందులో ఉన్న తర్వాత, మెయిన్ రోడ్డు మీదగా శ్యామలా టాకీస్ కి వెళ్లే దారిలో ఒక ఇంటికి మారాం. ఆ దారిలోనే నేను చిన్నప్పుడు చేరిన వ్యాయామశాల ఉండేది. అప్పట్లో గౌతమీ వ్యాయామశాల బయట నిలబడి, ఆంజనేయస్వామి విగ్రహాన్ని సంభ్రమంగా చూసేవాడిని. ఒకసారి, భయం భయంగా అక్కడ గేట్లో ఉన్న అతన్ని అడిగి లోపలికెళ్ళి, లోపల మనుషులు ఎలా వ్యాయామాలు చేస్తున్నారా? అని చూశాను. గదుల్లో అద్దాలున్నాయి. వాటిముందు నిలబడి కండలు చూచుకుంటూ డంబెల్స్, బార్ బెల్స్ చేస్తున్నారు. అప్పట్లో వాటి పేర్లు కూడా నాకు తెలీవు. వాళ్లేంటి రాక్షసుల మాదిరి ఉన్నారని వాళ్ళను చూసినా భయమే !

ఆంజనేయపాత్రధారి ఆర్జా జనార్దనరావు అక్కడ శిక్షణ పొందినవాడే. అక్కడున్న ఒకాయన్ని నాకూ వ్యాయామాలు నేర్పమని అడిగితే, 'చిన్నపిల్లాడివి. నీకెందుకు? ఇంకా నాలుగేళ్లు ఆగి రా. అప్పుడు చూద్దాం' అన్నాడు. పైగా, ఫీజు ఉంటుందని చెప్పాడు. అప్పట్లో మనదగ్గర డబ్బులెక్కడివి? పుస్తకాలు కొనుక్కోడానికే డబ్బుల్లేవు. అందుకని, మా ఫ్రెండ్ వాళ్ళన్నయ్య నడిపే ఒక గోదాకెళ్ళాను, అక్కడ కుస్తీలు పట్టేవాళ్ళు. సాముగరిడీలు  చేసేవాళ్ళు. వాళ్ళే నాకు మొదటిసారిగా దండీలు, బస్కీలు ఎలా తియ్యాలో నేర్పించారు. 'మరీ పీలగా గాలికి ఎగిరిపోయేలా ఉన్నావు, కోడిగుడ్లు తిను. బలమొస్తుంది' అని చెప్పింది వాళ్ళే. కోడిగుడ్లను తింటారని మొదట్లో అక్కడే విన్నాను. పదేళ్ళోచ్చేవరకూ మనకా విషయం తెలీదు ! కోడి గుడ్డును పెడుతుందని, దానిని తింటారని తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యమూ, అసహ్యమూ వేసిందో ! అప్పట్లో అంత తెలివితేటలుండేవి మరి !

ఆ తర్వాత, రాజమండ్రి వదిలెయ్యడమూ, పూనూరు, నర్సరావుపేటలకు మారడమూ, కరాటే నేర్చుకోవడమూ, 21 ఏళ్లకు మొదటి బ్లాక్ బెల్ట్ సాధించడమూ అన్నీ జరిగాయి. ఆ విధంగా, కోడిగుడ్డును తినకుండానే బ్లాక్ బెల్ట్ వచ్చింది.

ఇవన్నీ చెబుతుంటే వింటున్న మా ఇనస్పెక్టర్ ఒకాయన ఇలా అడిగాడు, ' కరాటే వస్తే కయ్యానికి కాలు దువ్వాలి కదా ! మీరేంటి శాంతమూర్తిగా ఉన్నారు మరి?' అని.

నవ్వాను. అతనికి మనలోని ఆధ్యాత్మిక కోణం తెలియదు.

'అదే పొరపాటు ! అది మీ ఊహ మాత్రమే. మార్షల్ ఆర్ట్స్ బాగా వచ్చినవాళ్లు కయ్యానికి ఎట్టి పరిస్థితిలోనూ కాలు దువ్వరు. ఒకవేళ ఎవరైనా అలా దువ్వుతుంటే, వారికి మార్షల్ ఆర్ట్ లోతుపాతులింకా అర్ధం కానట్లే. అవసరమైతే వారొక దెబ్బ తింటారు గాని, కొట్టరు, ఎందుకంటే, కొడితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. వారి స్కిల్ వారికి తెలుసు. మేము కొట్టే దెబ్బలు ఆషామాషీగా ఉండవు. ఆయువుపట్ల మీద తగులుతాయి. అవతలివాడు చచ్చాడంటే అదొక కేసౌతుంది. అందుకే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మీకు నిగ్రహం పెరుగుతుంది. దూకుడు తగ్గుతుంది. సినిమాలలో చూచేది నిజమనుకోకండి'.

మాటల్లో ఉండగానే ఉపాహారం ముగించాము. వచ్చిన పని చూచుకోవాలి గనుక, ఇనస్పెక్షన్ పనిమీద బయలుదేరాము.

(ఇంకా ఉంది)
read more " రాజమండ్రి స్మృతులు - 1 "