“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, సెప్టెంబర్ 2012, శనివారం

కర్మయోగి మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) జాతకం

లోకంలో ఒక విచిత్రం మనకు ప్రతిరోజూ కనిపిస్తుంది. చాలామంది యోగం గురించి సనాతనధర్మం గురించి లెక్చర్లు ఇస్తారు.కాని వాటిని నిత్యజీవితంలో ఆచరించేవారు బహుతక్కువ   ఉంటారు.ఎందుకంటే వాటిని గురించి చెప్పడం చాలా తేలిక.ఆచరించడం మాత్రం బహుకష్టం. అందులో కర్మయోగం మరీ కష్టం.లోకంలో ఉంటూ,సమాజంతో మెలుగుతూ నిత్యజీవితంలో అనుక్షణం యోగస్తితిలో నిలిచి ఉండటమే  కర్మయోగం.స్వార్ధంతో నిండిన మనుషుల మధ్య నిస్వార్ధంగా జీవించడమే కర్మయోగం.దీనిని అనుష్టించిన వారు పురాణకథల్లో మాత్రమె మనకు కనిపిస్తారు.అలాంటివాళ్ళు ప్రస్తుతం మన మధ్యన ఉంటారా?అనుకుంటాం.ఉన్నారు.నవీనకాలంలో ఈ కుళ్ళుసమాజపు మధ్యన నివసిస్తూ కూడా ఆదర్శమయమైన జీవితాన్ని గడపి కర్మయోగాన్ని నిత్యజీవితంలో అనుష్టించిన మహనీయుల్లో ఒకరు మాధవసదాశివ గోల్వాల్కర్.రాష్ట్రీయ స్వయంసేవకసంఘ్ కు ఒక దిశనూ దశనూ కల్పించిన మహనీయుడు గురూజీ.

ఈయనను 'గురూజీ' అంటూ గౌరవంతో అభిమానంతో ప్రతి ఒక్క RSS కార్యకర్తా పిలుచుకుంటాడు. మనమూ అలాగే పిలుద్దాం. ఆ పేరుకు ఆయన నూటికి నూరుపాళ్ళూ అర్హుడు. చాలామందికి RSS అనగానే అదేదో మత సంస్థ అని అనిపిస్తుంది. ఆ సంస్థ యొక్క ముఖ్యనాయకుల గురించి వారి దేశభక్తిపూరిత జీవితాల గురించి మనకు అవగాహన లేక అలాంటి భావనలు కలుగుతాయి. అందుకే గురూజీ వంటి మహనీయుల జీవితాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన యొక్క విశిష్ట జాతకాన్నీ, ఉత్తేజకర జీవితాన్నీ పరిశీలిద్దాం.


19-2-1906 ఉదయం 4.30 గంటలకు  నాగపూర్ లో గురూజీ జన్మించారు. ఆయన జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు. విశిష్టవ్యక్తుల జాతకాలు విశిష్టంగానే ఉంటాయి.ఒక తపోమయుడైన కర్మయోగి యొక్క జాతకంలో ఉండే గ్రహస్తితులు ఇందులో మనకు కనిపిస్తున్నాయి.

లగ్నం ధనుస్సుకూ మకరానికీ మధ్య లగ్నసంధిలో పడింది. సహజ నవమస్తానానికీ కర్మస్తానానికీ మధ్యలో పడటంతో ఒక ప్రబలమైన సంకేతం వెలువడింది. కర్మరంగంలో ఉంటూ ధార్మికమైన బలంతో జీవించే వ్యక్తి జాతకం ఇక్కడ కనిపిస్తున్నది. 

కుటుంబస్థానంలోని సన్యాసయోగం వల్ల ఈయనకు సంసారపు ఖర్మ లేదని అర్ధమౌతున్నది. సప్తమాధిపతి చంద్రుడు ద్వాదశంలో చేరడం కూడా దీనికి బలం చేకూరుస్తున్నది. సుఖస్థానాధిపతి కుజుడు దానికి ద్వాదశంలో చేరడం కూడా ఇదే సూచిస్తున్నది. సప్తమంలో రాహువు యొక్క స్తితికూడా దీనినే సూచిస్తున్నది.మకరంలోని లగ్నకేతువువల్ల వైరాగ్యంతో కూడిన ఆధ్యాత్మికత సూచింపబడుతున్నది.

మంత్రస్థానంలో గురువుయొక్క స్తితితో ఉత్తమగురువువద్ద మంత్రోపదేశం పొందగలడు అని సూచన ఉన్నది.గురూజీ స్వయానా అఖండానందస్వామికి ప్రియశిష్యుడు మాత్రమేగాక స్వామియొక్క చివరిరోజులలో ఆయన దగ్గర ఉండి నిరంతరమూ ఆయనకు సేవచేసిన పవిత్రాత్ముడు.ఆయన వద్ద మంత్రోపదేశాన్ని పొందిన అదృష్టవంతుడు.  

అఖండానందస్వామి శ్రీరామకృష్ణుల ప్రధాన శిష్యులలో ఒకరని,శ్రీరామకృష్ణ సంప్రదాయపు తృతీయఅధ్యక్షుడని, ఆత్మజ్ఞానాన్ని పొందిన సద్గురువని చాలామందికి తెలియదు.అత్యున్నత బ్రహ్మానుభూతిలో నిరంతరం నిమగ్నమైన తన వైరాగ్యపూరిత మనస్సును, సోదరుడైన వివేకానందస్వామి ఆజ్ఞమేరకు కిందకు దించి, 'శివభావే జీవసేవ' అన్న మహత్తరమైన రామకృష్ణుని ఉపదేశం మేరకు తన జీవితాన్ని భరతదేశ సమాజోద్ధరణకు సమిధలా అర్పించిన మహనీయుడు అఖండానందస్వామి.ఆయన శిష్యుడవడం వల్ల గురూజీకూడా రామకృష్ణ సంప్రదాయ పరంపరలోని మహనీయుడయ్యాడు. శ్రీరామకృష్ణుని అనుగ్రహాన్ని పొందిన ధన్యుడయ్యాడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తానువాడే కమండలాన్ని తన అంత్యసమయంలో ఆశీర్వాదపూర్వకంగా గురూజీ కిచ్చారు అఖండానందస్వామి.అది చివరివరకూ గురూజీవద్ద ఉండేది. అఖండానందస్వామి గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ చూడవచ్చు.తర్వాతి పోస్ట్ లో స్వామి యొక్క మహత్తరమైన జీవితాన్ని స్పర్శిద్దాం.

గురూజీ జాతకంలో పంచమంలో ఉన్న గురువు నవమాన్నీ లగ్నాన్నీ తన ప్రత్యెక ద్రుష్టులతో వీక్షించడమే కాక, సప్తమ దృష్టితో సహజాష్టమమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు. ఈ వీక్షణ కూడా గురూజీ యొక్క నిగూఢమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తున్నది.

యువకునిగా ఉన్నపుడే తీవ్రవైరాగ్యభావాలతో నిండి రామకృష్ణమఠంలో చేరుదామని గురూజీ తలపోశారు. కాని అఖండానందుల దివ్యదృష్టికి గురూజీ భవిష్యత్తు విభిన్నంగా స్పష్టంగా గోచరించింది.భారతదేశ సమాజోద్ధరణకు తన జీవితాన్ని సమర్పించమనీ, సౌశీల్యపూరిత జీవనాన్ని గడుపుతూ,దేశభక్తిని భారతపౌరులలో నింపుతూ,ఉన్నతమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా మార్గనిర్దేశనం చేస్తూ ఒక కర్మయోగిగా జీవించమనీ ఆయన ఆదేశాన్నిచ్చారు. ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా తన జీవితమంతా గురూజీ పాటించారు.వివాహం చేసుకోకుండా ఉండిపోయి అత్యున్నత సన్యాసధర్మాలకు అనుగుణంగా ఒక కర్మయోగిగా ప్రపంచంలో జీవించారు.గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు.

లగ్నారూడం అయిన మీనంలో నవమాదిపతి అయిన కుజుని స్థితీ, పంచమంలో రాహువుయొక్క స్తితీ ఈయనకున్న ఆధ్యాత్మికస్థాయిని సూచిస్తున్నాయి.ధార్మికమైన బలాన్ని పునాదిగా ఇచ్చి,అదేసమయంలో మాతృదేశ పునరుద్ధరణకోసం బహుముఖమైన ప్రణాళికలో   జీవితమంతా విశ్రాంతిలేని కర్మరంగంలో ఆయన్ను నడిపించింది ఈ గ్రహయోగం.

శనిబుధుల కలయిక వల్ల గురూజీ జాతకంలో వైరాగ్యపూరితభావాలు దర్శనమిస్తున్నాయి.చంద్రగురువుల షష్టాష్టకంవల్ల తన జీవితమంతా అతినిరాడంబర జీవితాన్ని గడుపుతాడు అన్న సూచన కనిపిస్తున్నది. ఆయనయొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని  కళ్ళకు కట్టినట్లు చూపించే ముఖ్య ఘట్టాలనూ, గురువైన అఖండానందస్వామి యొక్క భావాలు ఆయనకు ఎలా మార్గనిర్దేశనం చేశాయో వివరించే ప్రయత్నాన్ని వచ్చే పోస్ట్ లో చేస్తాను.

(సశేషం)  
read more " కర్మయోగి మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) జాతకం "

27, సెప్టెంబర్ 2012, గురువారం

కాలజ్ఞానం -14

రచ్చరచ్చ చేస్తుంది రాబోయే పౌర్ణమి
కుతంత్రాల కుమ్ములాటలతో   
మోగుతుంది హింసధ్వని 
చవితి నుంచి సప్తమి లోపు 

అందరికీ స్వార్ధమే పరమార్ధం 
ఎవరిక్కావాలి దేశసంక్షేమం 
దుశ్శాసన పర్వంలో 
ప్రధమ సమిధ న్యాయం

ప్రమాదాల పరంపరలు 
వెల్లువెత్తే అగ్నికీలలు 
కల్లోలం అనివార్యం 
అంతా ఘోరకలిప్రభావం 
read more " కాలజ్ఞానం -14 "

23, సెప్టెంబర్ 2012, ఆదివారం

కాలజ్ఞానం-13

ధర్మం వికటంగా మారుతుంది 
అతివల గతి సంకటమౌతుంది 
ఒక ముసలం తలెత్తుతుంది 
సంకటస్తితిని సృష్టిస్తుంది 

ఈశానుని శాసనం 
ఇక్కట్లను పెంచుతుంది 
విషకూపపు ఉచ్చులో 
విలాసాలు ముగుస్తాయి 
read more " కాలజ్ఞానం-13 "

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఒమర్ ఖయ్యాం జాతకం -6 ( అంతర్వీక్షణం- ఆఖరిభాగం)

ఇంతకీ తన పద్యాలద్వారా ఖయ్యాం చెప్పదలుచుకున్నదేమిటి? రుబాయత్ ద్వారా లోకానికి ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి? అన్న ప్రశ్నలు ఈ పోస్ట్ లు చదివినవారి మనసులో తలెత్తుతాయి. వాటి సంగతి ఇప్పుడు చూద్దాం.

ఖయ్యాం లోకానికి ఏ సందేశమూ ఇవ్వాలని ఆశించలేదు. లోకులకు సందేశాలు అక్కర్లేదని తెలీనంత అమాయకుడు కాదు ఖయ్యాం. ప్రతి జ్ఞానికీ తాత్వికునికీ ఇది తెలుసు. మరి ఎందుకని వారు లోకానికి ఏదో చెప్పాలని చూస్తారు? అంటే, వెయ్యి విత్తనాలు వెదజల్లితే కనీసం ఒక విత్తనం అయినా మొలకెత్తకపోతుందా అని వారు ఆలోచిస్తారు. ఆ ఒక్కరికోసమే ఇదంతా చెప్తారు.

అసలు ఖయ్యాం ఇన్ని పద్యాలలో ఏమి చెప్పాడు?

తన హృదయావేదనను ఖయ్యాం తన పద్యాలలో వెల్లడించాడు. తన అంతరంగమధనాన్ని కవితల రూపంలో ఆవిష్కరించాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు. సాకీని ప్రశ్నించాడు. సాకీ ఏమి చెప్పగలదు? తానే అయోమయంలో ఉంది. కనుక ఏమీ చెప్పలేదు. దైవాన్ని ప్రశ్నించాడు. దైవం ఉలకడు. పలకడు. కనుక ప్రశ్నించీ ప్రశ్నించీ విసిగి వేసారిపోయాడు. ఎన్నో ప్రశ్నలు అతన్ని చుట్టుముట్టాయి. కాని దేనికీ అతనికి జవాబు దొరకలేదు. చివరికి అన్నీ ప్రశ్నలే మిగిలాయి. 'అంతా మిధ్య' అని చివరకు గ్రహించాడు. 'ధూళి జనియించితి గాలి దేలిపోదు' 'మట్టిలోనుంచి వచ్చాను గాలిలో కలసిపోతాను' -- ఇంతే జీవితం అన్న నిశ్చయానికి వస్తాడు. జీవితం మొత్తం 'మట్టి - గాలి' ఇంతే అని గ్రహిస్తాడు. ఇది అందరికీ కనిపిస్త్తున్న నిత్యసత్యమే.

మనిషికి భోగానుభవం మిగిలి ఉన్నంతవరకూ సత్యజ్ఞానం కలుగదు. కర్మశేషం మిగిలి ఉన్నంతవరకూ ఈ ఊబిలోనుంచి మోక్షం దొరకదు. కనుక ఖయ్యాం సత్యాన్ని తెలుసుకోలేక నిస్పృహతోనే జీవితాన్ని చాలించాడని నా ఉద్దేశ్యం. ఎందుకంటే, ప్రపంచంతో సంబంధం పెట్టుకున్న ప్రతివాడూ అలా మరణించవలసిందే. మనుషులతో పెట్టుకున్నవాడు చివరకు నిరాశ చెందక తప్పదు. ఇదొక తిరుగులేని నియమం. దీనికి ఉల్లంఘన లేనేలేదు.

అంతా అనిత్యమే అని ఖయ్యాం తెలుసుకున్నాడు. కాని ఆధ్యాత్మికపధంలో అది మొదటిమెట్టు మాత్రమే. ఆ తర్వాతి మెట్లను అతడు ఎక్కినట్లు కనిపించదు. తనకు తెలిసిన అనిత్యంలోనే నిత్యాన్ని వెతుక్కుంటూ అతను నిష్క్రమించాడు. తర్వాతి జన్మలో మరింత ముందుకు సాగి ఉంటాడు. కాని ఆ జన్మలో మాత్రం అంతవరకే పురోగమించాడనిపిస్తుంది. లేనిదాన్ని ఉన్నట్లు అతను నటించలేదు. నిజాయితీగా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పాడు. తనకు మోహం ఉంటే ఉన్నది అని చెప్పాడు.అది అతనిలోని ఉత్తమ లక్షణం.

అయితే, 'అంతా అనిత్యం' అని నిజంగా తెలుసుకున్నవాడు అనిత్యాన్ని వదలి నిత్యాన్ని వెదకాలి.ఆ మార్గాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే, ఆ దారిలో నడిచినవారిని అన్వేషించాలి. వారిని సేవించి వారినుంచి ఆ వివరాలు స్వీకరించాలి. తరువాత ఆ దారిలో తానూ నడవాలి. అప్పుడు మాత్రమే తానాశిస్తున్న నిత్యాన్ని చేరుకోగలుగుతాడు. అలా కాకుండా ఊహల్లో పడి మధ్యలో ఆగిపోతే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేడు. ఈలోపల జీవితం కాస్తా అయిపోతుంది. తన అనిత్యమే తనతో మిగులుతుంది. చివరికి మరణం పిలిచినప్పుడు ఈ అనిత్యం కూడా తననే వెక్కిరిస్తుంది.

అయితే అలా దారి చూపగలిగేవారు అందరికీ దొరుకుతారా? అంటే అది మన అన్వేషణలోని తీవ్రత పైన ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన విషయాలను మనం వాయిదా వేస్తూ పోతున్నంతవరకూ వారు దొరకరు. మిగిలిన ఎన్నో పనులలో ఆధ్యాత్మికత కూడా ఒకపనిగా ఉన్నంతవరకూ వారు దొరకరు. మనకు ఏమీ తోచనపుడు కాలక్షేపం కోసం ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తూ ఉన్నంతవరకూ ఆ మార్గంలో దారి దొరకదు. అందులో చాలా నిజాయితీ అవసరం.

తర్కాన్ని ఉపయోగించి మనిషి సృష్టి రహస్యాలన్నీ తెలుసుకోవడం జరగని పని. తర్కానికి ఆవల చాలా సీమలున్నాయి. మన తర్కాలు పనిచెయ్యని భూములున్నాయి. వాటి నియమాలు వేరుగా ఉంటాయి. ఆ ప్రదేశాల రహస్యాలు తెలియాలంటే ఆ నియమాలను పాటించాలి. మన పరిధులలో మనం ఉంటూ వాటి రహస్యాలు తెలియాలని ఆశించడం పొరపాటు అవుతుంది. మన పరిధులను దాటి మనం పోగలగాలి. అలా దాటలేకపోతే ఆ సీమలు చిక్కవు. అప్పుడు ఉన్నచోటే ఆనందాన్ని వెదుక్కోవలసి ఉంటుంది. అది అనిత్యమని తెలిసినా సరే. బహుశా ఖయ్యాం అదే చేశాడేమో?

ఖయాం జాతకంలో గురువు నీచలో ఉన్నాడు. గురువు నీచలో ఉన్నపుడు ఆ జాతకుని ప్రయాణం ఈ జన్మలో ముగింపుకు రాదు. దానికి తోడూ పంచమంలో రాహువు ఉన్నాడు. దీనివల్ల బహుముఖ ప్రజ్ఞ వస్తుంది గాని, ఆత్మజ్ఞానం కలగడం కష్టం అనే చెప్పాలి. ఇలాంటి జాతకులకు మానసికమైన చంచలత్వం చివరివరకూ సమసిపోదు. సౌందర్యతృష్ణ చల్లారదు. దీనికి తోడుగా,నవమంలోని గురుశనుల కలయికవల్ల ఈ జన్మలో పరమమైన సత్యజ్ఞానం కలుగలేదు అని తెలుస్తుంది. అందుకే ఒక ఆత్మజ్ఞాని కన్నుమూసినట్లు పరమతృప్తితో, ముఖం మీద వెలుగుతున్న నవ్వుతో  అతడు కన్నుమూయలేదు. ఇంకా వెతుకులాటలోనే, అసంతృప్తిలోనే అతడు కన్నుమూశాడు. దానికి కారణం మధ్యలోనే దారితప్పిన పయనం. వీడని చిక్కుముడి లాంటి జననమరణ రహస్యం. అంతుపట్టని అంతరిక సమస్యల వలయం.

ఒక మనిషికి పాండిత్యం ఉండవచ్చు. శాస్త్రజ్ఞానం ఉండవచ్చు. వీటి సాయంతో అతడు లోకంలో ఎంతో సాధించవచ్చు. కాని ఆధ్యాత్మికజ్ఞానం వీటివల్ల రాదు. వెలుగుదారిలో నడిస్తేనే అది వస్తుంది. ఆ దారి అందరికీ దొరికేది కాదు. దానికోసం మిగిలిన అన్నీ వదులుకోగలిగిన వాడికే అది దక్కుతుంది. కనుక అంత సాహసం చెయ్యలేని పండితులూ తాత్వికులూ కూడా చివరికి ఏమీ తెలుసుకోలేక అజ్ఞానంతోనే కన్నుమూయక తప్పదు. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న చరిత్ర.

ఇకముందు జరిగే చరిత్ర కూడా ఇదే.

దైవాన్ని చేరే మార్గాలు ఖయ్యాంకు బౌద్ధికంగా తెలుసు. తాను వ్రాసిన గ్రంధాలలో ఆ మార్గాలను ఉటంకించాడు. వాటిలో, ఆత్మసంయమనం ద్వారా, అంతరికసాధన ద్వారా దైవాన్ని చేరే 'సూఫీమార్గం' శ్రేష్టమైనదని ఆయన అన్నాడు. కాని దానిని ఎంతవరకూ తాను పాటించాడు? అంటే మనకు తెలీదు. తానుకూడా ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. కొన్ని రహస్య సూఫీగ్రూపులతో ఆయనకు సంబంధాలు ఉండి ఉండవచ్చు. కాని దానిని ఎక్కడా తేటతెల్లంగా బహిర్గతం చెయ్యలేదు. తీవ్రవాదులతో ఆయనకున్న శత్రుత్వం బహుశా దీనికి అడ్డుపడి ఉండవచ్చు. అందుకేనేమో మార్మికమైన పద్యాలలో తన భావాలను అర్ధమయ్యీ కాకుండా చెప్పాడు.

'కోరికలన్నీ సుఖాన్ని మాత్రమే ఇవ్వవు' అని కూడా ఖయాంకి తెలుసు. మధువుతో చేదురుచి కలసి ఉన్నట్లే, గులాబితో ముళ్ళు కలసి ఉన్నట్లే, ప్రతి సుఖంతోనూ ఒక దుఖం కూడా కలిసి ఉంటుంది అని ఆయనకు తెలుసు. కాని అంతమాత్రాన ఆ కోరికను ఎందుకు చంపుకోవాలి? అంటాడు. "తాను అనేక చీలికలై రంపపుకోతను పడితేనే కదా ప్రేయసి యొక్క సుగంధమయమైన  ముంగురులలో జాలువారే అదృష్టానికి  దువ్వెన  నోచుకున్నది?" అని ప్రశ్నిస్తాడు. 'రంపకోతలన్ జీరికలౌట దువ్వెనయున్ జేకొను జవ్వని తావి ముంగురుల్' అని తలుస్తాడు.

భౌతిక జీవితంలో ఒక సుఖాన్ని దక్కించుకోవాలంటే ఎన్నో బాధలు పడాలి. ప్రేయసి మది గెలవాలంటే మనసుకి ఎంతో బాధ తప్పనిసరి. ఇక, ప్రేయసి అంటే భగవంతుడు అన్న అర్ధాన్ని తీసుకున్నా అంతే. ఆయనను చేరుకోవాలంటే కూడా మనిషి అంతరాంతరాలలో ఎంతో పరిపక్వత సాధించాలి. ఇదికూడా రంపపు కోతయే.ఈ విధంగా ఖయాం వ్రాసిన ఒకే పద్యం భౌతికమైన అర్ధాన్నీ ఆద్యాత్మికమైన అర్ధాన్నీ ఒకే సమయంలో ఇస్తుంది. ప్రేయసి తల దువ్వుకుంటుంటే చూచిన ఖయాంకు ఆధ్యాత్మిక రహస్యాలు అవగతం అవుతాయి.

రుబాయత్ పద్యాలకు రెండు రకాలైన అర్ధాలు కనిపిస్తాయి. ఒకటి భౌతికార్ధం ఇంకొకటి మార్మికార్ధం. మొదటి కోణంలో చూస్తే ఖయ్యాం ఒక విచారణాపరుడైన సున్నిత సౌందర్య ప్రేమికునిగా మనకు కనిపిస్తాడు. అంతా అనిత్యమే అని తెలుసుకున్నాడు. చేసేదేమీ లేదని కూడా తెలిసింది.ఇక ఇతరులను బాధించకుండా ఉన్నంతలో ఆనందాన్ని ఆస్వాదించు. దీనికంటే నీవు ఏమీ చెయ్యలేవు అంటాడు. ఈ కోణంలో ఇది సరైనదే. ఎవరైనా ఈలోకంలో ఇంతకంటే చేసేదేమీ లేదు. చేస్తున్నది కూడా లేదు. సామాన్యుడు ఇంతకంటే ఏమీ చెయ్యలేడు. ఇక్కడ సామాన్యుడు అంటే ధనం లేనివాడు అని అర్ధం కాదు.ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అందుకోలేని ప్రతి మానవుడూ, లౌకికంగా అతడు అమిత సంపన్నుడైనప్పటికీ, నిజానికి సామాన్యుడే.

ఇక రెండవకోణంలో చూస్తే అతనిలో ఒక ద్రష్ట కనిపిస్తాడు. సాకీ అంటే మనసనీ,మధువు అంటే ధ్యానంలో కలిగే ఆనందమనీ అర్ధం తీసుకుంటే, అతనిలో ఒక మార్మికయోగి కనిపిస్తాడు. కాని అన్ని పద్యాలనూ ఈ కోణంలో గ్రహించలేము. కొన్ని పూర్తిగా భౌతికార్ధాన్ని సూచించే పద్యాలు కూడా వీటిలో ఉన్నాయి. చివరికి జననమరణరహస్యాన్ని తాను తెలుసుకోలేకపోయాననే బాధ ఆయన పద్యాలలో కనిపిస్తుంది. కనుక మార్మికకోణం నిజానికి ఆయనవద్ద లేదేమో, ఇది మన ఊహ మాత్రమేనేమో అని ఒక ఆలోచన ఒక్కొక్కసారి కలుగుతుంది.

ఈ విధంగా ఎటూ చెప్పలేని స్తితిలో మనం ఉండిపోతాము. అలాటి స్తితిలో మనల్ని ఒదిలి ఖయాం తనదారిన తాను వెళ్ళిపోతాడు. అందుకే అతను పూర్తిగా అర్ధం కాడు. అలా అర్ధంకాకపోవడం లోనే అతనియొక్క నిజమైన ఆకర్షణ ఉన్నదేమో అనిపిస్తుంది. అందుకే అతని కవితలు ఇన్ని వందల ఏళ్ళ తర్వాతకూడా ఆలోచనాపరులను వెంటాడుతూనే ఉన్నాయి.

ఎందరు లేరు జోస్యులు; మరెందరు నీవలె హేతువాదులై
మ్రందిరి? వారి పుట్టువులమాటయే లోకమెరుంగబోదు;నీ 
నందన వాటికన్ గరికపట్టుల బూబోదరిండ్ల నీడ మా 
కందరకున్ రసార్ద్ర కవితాసవమిచ్చితి వాసదీరగన్

ఆ రోజుల్లో ఖయాం మంచి శాస్త్రవేత్తయే గాక మంచి జ్యోతిష్కుడు కూడా. ఆ కాలంలో ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ రెండూ కలిసి ఒకటిగా ఉండేవి. గ్రహస్తితులనీ భూమ్మీద వాటి ప్రభావాన్నీ కూడా కలిపి గ్రహించేవారు. గ్రహాలంటే జీవం లేని మట్టిముద్దలన్న నేటి భావన ఆ రోజుల్లో లేదు. ఒకసారి మహారాజు వేటకు పోదలచి ఖయాంను ముహూర్తం పెట్టమన్నాడు. ఖయాం ఒకరోజును సూచించాడు. ఆరోజున మహారాజు వేటకు బయలుదేరుతుండగా కారుమబ్బులు కమ్మి హోరువాన వచ్చె సూచనలు కనిపించాయి. అందరూ ఖయాంను ఎగతాళి చేశారు. కాని ఖయాం 'రాజా.మీరు నమ్మకంగా బయలుదేరండి. మబ్బులు కొద్దిసేపటిలో విరిసిపోతాయి. అయిదురోజుల వరకూ ఒక్క చుక్క కూడా వర్షం పడదు.నా మాట నమ్మండి' అని చెప్పాడు. చూస్తూ ఉండగానే మబ్బులు విరిసిపోయి ఎండ వచ్చింది. రాజు వేట నిర్విఘ్నంగా సాగింది. ఖయాం చెప్పినట్లే అయిదురోజుల తర్వాతే వర్షం పడింది. ఇది రికార్డ్ చేయబడిన సంఘటన !

లోకంలో ఎంతమంది అటువంటి జ్యోతిష్కులు లేరు? ఎందరు శాస్త్రవేత్తలూ పండితులూ లేరు? కాని వారికీ నీకూ తేడా చెప్పమంటావా? వారు ధనదాసులు. నీవు ప్రేమదాసుడవు. వారు ధనానికి దాసోహం అంటారు. నిన్నో? ప్రేమతప్ప ఇంకేదీ లొంగదీయలేదు.నీవలె మమ్మల్ని నందనవనంలో పూలపోదరిండ్ల నీడన కూచుండబెట్టి  మంచి కవితలనే మధువును ఇచ్చి మధుర భావలహరిలో తేల్చినవారు వారిలో ఎవరున్నారు? కనుక నిన్ను మెచ్చుకోక తప్పదయ్యా ఖయ్యమా !

ఖయాం 'రుబాయత్' లో అతని అసలు పద్యాలతో పాటు అనేక ఇతరులు వ్రాసిన పద్యాలు కూడా కాలక్రమేణా కలిసిపోయాయని పండితుల భావన. ఇదే గతి మన పురాణాలకూ పట్టింది. చివరికి వేమన పద్యాలు, బ్రహ్మంగారి తత్వాలు కూడా కల్తీ అయ్యాయి. కొంచం పాండిత్యం ఉన్న ప్రతివాడూ కొన్ని పద్యాలు వ్రాసి వాటిని గ్రందాలలోకి జోప్పించారు.మహాభారతంలో ఈ విధంగా అనేక కట్టుకధలూ పిట్టకధలూ చేరాయనీ అసలైన పాత మహాభారతం ఇంత విస్తీర్ణమైనది కాదనీ పండితులంటారు. అలాగే రుబాయత్ కూడా అనేక ఇతర పద్యాలు కలిసి కలగూరగంపలా తయారైంది. బహుశా రుబాయత్ లో అక్కడక్కడా కనిపించే భావవైరూప్యతకు కారణం ఇలాంటి ప్రక్షిప్తపద్యాలే కావచ్చు.

రుబాయత్ మొత్తాన్నీ జల్లెడ పడితే రెండుభావాలే చివరకు తేలి కనిపిస్తాయి. జగత్తు అశాశ్వతం గనుక ఏకాంతవాటికలో దైవధ్యానంలో మునిగి యోగసమాధి ఇచ్చే దివ్యానందం ఆస్వాదిస్తూ మైమరచి ఉండు. అది చెయ్యలేకపోతే కనీసం నీ ప్రేయసి చేతిమీదుగా ఇచ్చే మధువును త్రాగి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ రసాస్వాదనలో మైమరచి ఉండు. చేతనైతే మొదటి పని చెయ్యి. లేదా రెండవది స్వీకరించు. ప్రపంచంలో ఈ రెండే ముఖ్యమైన పనులు. మిగతావన్నీ ఉత్తపనికిమాలిన వ్యవహారాలు. ధనమూ, అధికారమూ, పేరుప్రఖ్యాతులూ, ఇంకా ఏవేవో పొందాలని చేసే ప్రయత్నాలు ఎందుకూ కొరగానివాళ్ళు చేసే పనులు. వాళ్ళంతా అజ్ఞానులు. తెలీక భ్రమల్లో ఉండి ఆ పనులు చేస్తున్నారు. నిజానికి ఇవి రెండే ఈ నశ్వరలోకంలో సారభూతమైన విషయాలు. తెలివైనవాడు తన స్థాయిని బట్టి ఈ రెంటిలో ఏదో ఒకటి స్వీకరిస్తాడు. ఎవరైనా సరే ఈ రెండూ దాటి అవతలకి పోలేడు.

ఈ విషయాన్ని ఇన్ని మధురపద్యాలలో హృదయరంజకంగా చెప్పబట్టే నీవు మాకు చిరస్మరణీయుడవయ్యావు ఖయ్యమా ! నీ పాండిత్యమూ జ్ఞానమూ మాకనవసరం. రసఝరిలో మమ్ము ఓలలాడించగల నీ మధుర కవితలున్నాయి చూచావూ అవే మాకు చాలు.

పంచాంగమును సంస్కరించు గణిత ప్రావీణ్యమున్నన్ సలా
మంచున్ సంజరుశాహి ప్రీతి మెయి నీ కర్దాసనంబిచ్చి మ
న్నించగల్గియు, గ్రీకు శాస్త్రముల పాండిత్యంబు నార్జించియుం
గాంచగల్గుదే నేటి కీర్తి కవివే గాకుండినన్ ఖయ్యమా?

ఆరోజులలో పంచాంగసంస్కరణ కమిటీకి ఖయ్యాం అధ్యక్షుడయి గ్రహగణితాలను లెక్కించే విధానాలను నిబద్దీకరించాడు. స్వయానా చక్రవర్తే ఈ భారాన్ని ఆయన మీద ఉంచాడు.ఆ రోజులలో ఇరాన్ దేశాన్నేలిన  'సంజర్ షా' అనే చక్రవర్తి ఖయ్యాం యొక్క పాండిత్యానికీ జ్ఞానానికీ ముగ్దుడై తన సింహాసనంమీద తనతో కూచోబెట్టి 'అర్ధసింహాసన' గౌరవాన్నిచ్చి ఖయ్యాంను తన గురువుగా ఆదరించాడు. కానీ వీటివల్ల నీకు చరితార్ధత కలుగలేదు. నీ కవిత్వమున్నది చూచావూ దానివల్ల నీ పేరు లోకంలో చిరస్థాయిగా నిలిచింది.

నీ తత్వంబులు మాకు పూజ్యమ్బులు కానీ; కాకపోనీ; మరే
మీ;తత్వాలకు నేమిగాని; మధురస్మేరాస్యయౌ సాఖి ద్రు
క్పాతం బైహిక జీవితార్తి పరితప్త స్వాంతులౌ వారికిన్ 
జేత:ప్రీతి నొసంగు; మాకదియే యాశీర్వాద మిప్పట్టునన్

సరే ! నీ భావాలూ, తాత్వికధోరణీ మాకు నచ్చినా నచ్చకపోయినా అలా ఉంచుదాం. కానీ, లౌకిక జీవితంలోని బాధల పాలబడి తపిస్తున్నవారికి సాకి యొక్క మధురమైన చిరునవ్వుతో కూడిన కనుచూపు మాత్రం తప్పక శాంతిని ప్రసాదిస్తుంది. మాకదే చాలు. లోకానికి నీవిచ్చిన ఈ బహుమతి చాలు.

బ్రతుకనే ఎడారిలో దారిదప్పి దప్పికతో డస్సి మరణావస్తకు చేరిన ఒక నికృష్టజీవికి చల్లని సెలయేరు ఎదురుపడితే ఎలా ఉంటుందో, అలాంటి భావనను మాకందిస్తున్నది నీ సుమధుర కవితాఝరి. నీ ఇతర పాండిత్యాలు, జ్ఞానాలూ   అలా ఉంచితే, ఈ ఒక్కటి చాలునయ్యా నిన్ను లోకం ఎల్లప్పుడూ స్మరించి రుణపడి ఉండటానికి.

'కొందరు దేవకన్యకల కూటమి పండుగ యంద్రు గాని నేనందున్ మధూళిపానంబె ప్రియంబని' అని భావించే ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలని తాపత్రయం మనకెందుకు? 'నిరతము ప్రియాంగనా మధురాధరామృతమానుటో యాసవమానుటో' తప్ప వేరే పని ఏమీ తెలియని ఖయాంను తన లోకంలో వదిలేసి మన రాచకార్యాలు మనం చూచుకుందాం. ఆయన తప్పుదారిలో పోతున్నాడని మనం భ్రమిస్తే జవాబు సిద్ధంగా ఉన్నది.

గురువ, సలాము, దైవమునకున్ మము వీడుము, మీకు మౌనమే 
పరమ హితంబు; అజ్నతను బల్కక యుండినను జాలు;మేము గ్రు
మ్మరునది సత్పధంబు గనుమా; నయనార్తుండ వౌట దారి వ 
క్కరముగ దోచు; కన్నులకు కాటుక బెట్టుము చూపు మేలగున్ 

'నేను తప్పుదారిలో పోతున్నానని అనుకుంటున్నారా? అది మీ తెలివితక్కువతనం. గురువుల్లారా మౌనం వహించండి. నేను సత్పధంలో నడుస్తున్నాను. మీ దృష్టిదోషం చేత నా దారి మీకు వంకరగా తోస్తున్నది. మీ కళ్ళకు కాటుక పెట్టుకోండి. అప్పుడు మీ చూపు బాగై దారి సరిగా కనిపిస్తుంది' అని పండితులకు బోధిస్తాడు.

సాధనాబలంలేని ఉత్తపండితులకంటే, మనకు నిత్యం కనిపించే దొంగగురువులకంటే ఖయ్యాం చాలా ఉత్తముడు. 'మాయవేషముల్ భావములోని కల్మషమున్ బాపునె?' అని ప్రశ్నిస్తాడు. 'చిరిగిన బొంతలన్ దొడిగి సిద్ధుల మంచవివేకలోకమున్ మొరగి చరించు దుర్జనుల మోసము కంటెను మేలుగాదే యో గురువర, కామినీ ప్రణయగోష్టుల నాసవసేవ?' అని గురువునే ప్రశ్నిస్తాడు.

'చచ్చిన నెవ్వరికెవ్వరో? వృధాపలుకు లింకేల భూతలము స్వర్గమొనర్పుము సాఖి పాత్రికన్' అంటూ ఈ భూలోకాన్నే స్వర్గధామంగా మారుద్దాం రమ్మని ఆహ్వానిస్తాడు. ఖయాం చాలా నిజాయితీపరుడు. నిరంతరం అనేక భయాలలో, ఇతరులేమనుకుంటారో అన్న సందేహాలలో, మానసిక సంఘర్షణలలో చిక్కుకొని బయటపడలేని మనకు ఖయ్యాం అర్ధం కాడు. అందుకే ఖయాం మార్గం నిగూఢమైనది. నిశితంగా పరిశీలిస్తే అందులో తంత్రయోగమూ, పూర్ణయోగమూ మనకు కనిపిస్తాయి. వీటిని సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అతి కష్టం.
  
ఇంతకీ ఖయ్యాం ఎవరు? తెలివైన వ్యసనపరుడా? ఒక పండితుడా? ఒక జ్యోతిష్కుడా? ఒక విజ్ఞానఖనియా? ఒక సున్నితహృదయుడా? ఒక ప్రేమపిపాసియా? ఒక విరక్తయోగియా? ఒక మదిరాతపస్వియా? ఒక విలాసపురుషుడా? ఒక అవిశ్రాంత అన్వేషకుడా? ఒక భగ్నచిత్తుడా? ఒక ఉన్మత్త ప్రేమికుడా? నిరంతరం భావనా ప్రపంచంలో విహరించే తాత్వికుడా?దారి తప్పిన బాటసారియా? గమ్యం ఎరుగని పాంధుడా? లేక తన చివరి మజిలీని చేరుకున్న రహస్యయాత్రికుడా? 

ఏమో!! మనకు తెలియదు. అసలు అన్నీ మనకెందుకు తెలియాలి? అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం మనకెందుకు? కొన్నికొన్ని ఎప్పటికీ రహస్యాలు గానే ఉండాలి. అలా ఉంటేనే వాటిలోని మాధుర్యం ఎల్లకాలం అలా ఉండిపోతుంది. సృష్టిలోని విలువైనవన్నీ అలా రహస్యంగానే ఉండాలి. అలా ఉంటేనే వాటికి విలువ. ఖయ్యాం కూడా అలాంటివాడే. అందుకే అతను ఎప్పటికీ అలా అర్ధమయ్యీ కానట్టుగానే ఉండాలి. ఆయన్ని అలాగే ఉండనిద్దాం. ప్రకృతి ఒడిలో సెలయేళ్ళ ఒడ్డున తన ప్రేయసి సాకీ ఇచ్చే మధువును ఆస్వాదిస్తూ ప్రేమభారంతో వాలిపోయే ఆమె కళ్ళలోకి చూస్తూ ఈ పాడులోకాన్ని మరచిన ఖయ్యాంను అలాగే ఉండనిద్దాం.

ఆయన్ను మనం ఎలాగూ అనుసరించలేము. కనీసం ఆయన కవితలలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ రసలోకంలో విహరించగలిగితే మనకు చాలు. ఆపని చేద్దామా మరి?
read more " ఒమర్ ఖయ్యాం జాతకం -6 ( అంతర్వీక్షణం- ఆఖరిభాగం) "

17, సెప్టెంబర్ 2012, సోమవారం

పాకలపాటి గురువుగారి జాతకం - కొన్ని విశేషాలు

ఎక్కిరాల భరద్వాజగారి పుస్తకం చదివినవారికి పాకలపాటి గురువుగారు సుపరిచితులే. ఆయన జాతకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే, తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నట్లు, చూస్తే మహనీయుల జాతకాలే చూడాలి. వారున్నా సరే, లేకున్నా సరే. మామూలు మనుషుల జాతకాలు చూస్తే వాటిలో స్వార్ధం నీచత్వం తప్ప ఔన్నత్యం ఏముంటుంది?

పాకలపాటి గురువుగారి  అసలుపేరు దామరాజు వెంకట్రామయ్యగారు. పాకలపాటివారికి చాలా పేర్లున్నాయి. నర్శీపట్నం ఏజన్సీ ప్రాంతాలలోని కోయవాళ్ళు ఆయన్ను అనేక పేర్లతో  పిలిచేవారు. వాటన్నిటిలో 'రామయోగి' అనే పేరుతో ఆయన్ను పిలవడం నాకిష్టం. అందుకే ఈ వ్యాసంలో ఆయన్ను అదే పేరుతో పిలుస్తాను.

ఆయన గుంటూరుజిల్లా బ్రాహ్మణులు.శ్రీవత్స గోత్రోద్భవులు. దామరాజువారు ఇప్పటికీ గుంటూరు ఒంగోలు చుట్టుపక్కల ఉన్నారు. వారిలో ఎవరికైనా ఇటువంటి మహర్షి ఒకాయన వారివంశంలో పుట్టాడని తెలుసో లేదో మరి. రామయోగి జన్మతేదీ  11-6-1911. ఆరోజున జ్యేష్ట పౌర్ణమి. ఏలూరు దగ్గరలోని ఒక గ్రామంలో ఆయన జన్మించారు. జనన సమయం మనకు సరిగ్గా తెలియదు. కాని వారి ముఖవర్చస్సును బట్టి, ఎప్పుడూ నలగని బట్టలువేసే వారి అలవాటును బట్టి, తులా లగ్నం అయి ఉండవచ్చు అని ఊహిస్తున్నాను. అష్టమ బుధుడివల్ల కూడా ఈ ఊహ బలపడుతున్నది. ఏదేమైనా ఈ వ్యాసం ఉద్దేశ్యం వారి జననకాల సంస్కరణ కాదు గాబట్టి లగ్నాన్ని అంతగా లెక్కించపనిలేదు.

చంద్రలగ్నం వృశ్చికం అయింది. ఈరాశి చంద్రునికి నీచరాశి అని మనకు తెలుసు. ఆత్మకారకుడు సూర్యుడయ్యాడు. కనుక ఈ రెంటినుంచి స్థూలంగా జాతకాన్ని పరిశీలిద్దాం. నాడీశాస్త్ర రీత్యా చూస్తే, ఆరవనెలలో తేలుకుట్టి వీరి తల్లి మరణించడమూ, తొమ్మిదవ ఏట తండ్రి  మరణించడమూ ఖచ్చితంగా సరిపోతున్నాయి. చాలామంది వృశ్చికరాశి జాతకులకు తల్లి చిన్నతనంలోనే మరణిస్తుంది. దీనివెనుక ఒక నిగూఢమైన కర్మరహస్యం దాగిఉన్నది. కుటుంబస్థానాధిపతి గురువు వక్రించి శత్రుస్థానంలో కేతుగ్రస్తుడై ఉండటమూ, సుఖస్థానాధిపతి నీచలో రాహుగ్రస్తుడవటమూ వల్ల  వివాహం లేకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. గురువు పంచమాదిపతి కూడా అవడం వల్ల, ఇదే యోగం సంతానం లేకుండా చేసింది. 

రామయోగి జాతకంలో గురువు వక్రించి ఉండటం చూడొచ్చు. అందువల్ల వారికి ప్రత్యేకంగా శిష్యులంటూ ఎవరూ లేరు. వారి విధానం వారితోనే అంతరించిందని ఊహించవచ్చు. వారివల్ల లోకానికి, ముఖ్యంగా కొండ కోనల్లో నివసించే కోయప్రజలకు ఎంతో మేలు చేకూరినప్పటికీ ఆధ్యాత్మికంగా వారి సాధనా విధానం పరంపరగా ఇతరులకు సంక్రమించడం జరగలేదనిపిస్తుంది. దీనికి కారణం వారి జాతకంలోని గురువక్రత. 

శని నీచలో ఉండటం వీరి జాతకంలో ఇంకొక విశేషం. అందువల్ల వీరికి ఈలోకంలో కర్మానుబంధం బలంగా ఉందని సూచిస్తోంది. అందుకే జీవితమంతా అడవులలో గడిపి కొండ కోయజాతులకు మార్గదర్శకుడయ్యాడు. శేషకర్మను సూచించే రాహువు శనితో కలసి ఉండటం దీనినే సూచిస్తున్నది. వీరిద్దరూ మేషరాశిలో కలవడం వల్ల ఇంకొక కర్మ రహస్యం ప్రకటితం అయింది. మేషం కొండ కోనల్లో తిరుగుతుంది. ఎక్కడో కొండల పైకెక్కి మేత మేస్తుంది. అలాగే ఈయన కూడా ఎక్కువగా కొండకోనల్లోనే సంచరించాడు. ఈయన కర్మస్థానం కూడా కొండకోనలే అయ్యాయి.

వక్ర గురువు, కేతువుతో కలవడం వల్ల వీరిది నిగూఢమైన ఆధ్యాత్మిక సిద్ధి అని సూచన ఉన్నది. అంటే ఆ సిద్ది యొక్క ఫలితాలు మాత్రమె జనులకు దర్శనమిస్తాయిగాని ఆ సిద్ధి ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. వారి జీవితం అలాగే గడిచింది. పదమూడేళ్ళ వయసులో జ్ఞానాన్వేషణలో  ఇల్లువదలి వెళ్ళిన ఆ పిల్లవాడు ఏ గురువుల వద్ద ఏఏ విద్యలు అభ్యసించాడో, ఏఏ సాధనలు చేశాడో ఎవరికీ తెలియదు.కొన్నేళ్ళ తర్వాత ఒక సిద్ధపురుషునిగా సమాజానికి దర్శనం ఇచ్చినపుడే వారిగురించి అందరికీ తెలిసింది. దేశంలో వారు తిరగని అడవీ, ఎక్కని పర్వతమూ, దర్శించని సిద్ధపురుషులూ లేరు అంటే అతిశయోక్తి కాదు. కాని, వారి సిద్ధి వారితోనే అంతరించింది.

చంద్రుని నుంచి మంత్రస్థానంలో కుజుడు ఉండటంవల్లా, ఆయన తన అష్టమదృష్టితో గురుకేతువులను వీక్షిస్తూ ఉండటం వల్లా రామయోగి యొక్క సాధన మనకు దర్శనం ఇస్తున్నది. ఈయనకు ప్రబలమైన నిగూఢమైన మంత్రసిద్ధి ఉన్నది అన్నవిషయం దీనివల్ల తెలుస్తున్నది. అంతేగాక నీచచంద్రునివల్లా, పంచమకుజునివల్లా, నవమశుక్రునివల్లా  ఇది తీక్ష్ణమైన స్త్రీ దేవతా మంత్రసిద్ధి అన్నవిషయం తెలుస్తున్నది.

జలతత్వరాశులు సమృద్ధికి సూచన.చంద్రకుజశుక్రులు ఒకరికొకరు కోణస్తితిలో జలతత్వరాశులలో స్తితులై ఉండటం వల్ల ఈయనకు అక్షయసిద్ధి ఉన్నది అన్న విషయం సూచితం. ఈయన సంకల్పిస్తే నలుగురికి వండిన వంట నాలుగొందలమందికి సరిపోయి ఇంకా మిగిలేది. ఇదొక అద్భుతమైన సిద్ధి. గాయత్రీ దివ్యశక్తిలో గల సమృద్ధిబీజాక్షరాలు ఈయనకు సిద్ధించాయి. కారకాంశ నుంచి ద్వాదశాదిపతి రవి అవడము ఆయనకు గల గాయత్రీ సిద్ధిని సూచిస్తున్నది. సింహరాశి మీదగల రాహుశనుల దృష్టివల్ల అందులోని ప్రచండమైన బీజాక్షరాలు కొన్ని ఆయనకు సిద్ధించినట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. అవేమిటో కూడా మనం ఇంకొంత విశ్లేషణతో గ్రహించవచ్చు. కాని దానిని బహిర్గతం చెయ్యటం సబబు కాదు.ఈ సిద్ధివల్లనే  ఎక్కడెక్కడినుంచో తెలియకుండా అనుకున్న సమయానికి ఆయనకు అన్నీ సమకూడేవి.  

ఆత్మకారకుడైన సూర్యునినుంచి చూచినపుడు, పంచమాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండటమూ, నవమాదిపతీ యోగకారకుడూ అయిన శని నీచలో రాహువుతో కలసి ద్వాదశస్తితుడై ఉండటమూ ఇదే భావాన్ని బలపరుస్తున్నాయి. కనుక ఈయనకు కొండమంత్రాలూ కోయమంత్రాలూ మొదలైన రహస్యక్షుద్రమంత్రాలు కూడా తెలుసన్న విషయం ద్రువపడుతున్నది. అంతేగాక ఈ క్షుద్రమంత్రాలు తెలిసిన కోయవారిని ఆయన ఎదుర్కొనవలసి వస్తుంది అనికూడా సూచన ఉన్నది. చంద్రలగ్నాత్ షష్ఠమంలో శనిరాహువుల స్తితికూడా ఇదే సూచిస్తున్నది.

ఇవన్నీ ఆయన జీవితంలో జరిగాయి.'మర్లపులి' అన్న క్షుద్రవిద్యను రామయోగి తన జీవితంలో ఎదుర్కొని,దానిని ప్రయోగించిన కోయమంత్రగాళ్లను తన శక్తితో నిర్వీర్యులను చేశాడు. 'మర్లపులి' అనేది పగలు మనిషిలా అడివిలో తిరుగుతూ రాత్రిళ్ళు పులిగా మారి మనుషులను చంపుతూ ఉండే క్షుద్రశక్తి. కోయలలోని కొందరు మహామంత్రగాళ్ళు దీనిని ప్రయోగించడంలో సిద్ధహస్తులు. పంచమంలో కుజుడు శని నక్షత్రంలో ఉండటం,ఆ శని నీచలో రాహువుతో కలసి శత్రుస్థానంలో ఉండటం వల్ల ఇటువంటి క్షుద్రశక్తులతో ఆయన డీల్ చెయ్యవలసి వస్తుంది అని సూచన ఉన్నది.

నవాంశచక్రంలో శని ఉచ్ఛస్త్తితికి వచ్చి ఉన్నాడు. గురువు నీచస్తితిలోకి పోయాడు. జాతకంలో గురువు నీచస్తితిలో ఉన్న గురువులవల్ల లోకానికి ఉపదేశపరంగా ఏమీ మేలు జరగదు. వారివల్ల భౌతికమైన ఇతర ప్రయోజనాలు కలుగుతాయిగాని సాధనాపరంగా వారినుంచి శిష్యులకు ఏమీ దొరకదు. సత్యసాయి జాతకంలో కూడా గురువు నీచస్తితిలో ఉన్న విషయం గమనార్హం. అందుకే ఆయనవల్ల కూడా లోకానికి మేలు జరిగిందిగాని ఆయన సాధనా విధానం ఏమిటి అన్న విషయం గుప్తంగా ఉండిపోయింది. అది పరంపరగా ఉపదేశపూర్వకంగా తర్వాతి తరాలకు అందదు. రామయోగి జాతకంలో కూడా అదే జరిగింది.

రామయోగి వల్ల అనేక వందల కోయగూడేలకు ఎంతో మేలు జరిగింది. ఉత్త మాటలు చెప్పే నేటి నాయకులకంటే ఆయన తన మౌనమైన జీవితంద్వారా, నిస్వార్ధమైన సేవద్వారా ఎన్నో వందల కోయ, చెంచు, గూడేలకు మనం ఊహించలేనంత మేలు చేశాడు. కాని ఆయన సాధన తర్వాతితరాలకు అందలేదు. దానికి కారణం,అర్హతగల తగిన శిష్యులు ఆయనకు లభించకపోవడమే అని నా ఊహ. లోకుల బుద్ధిహీనత వల్ల చాలామంది గురువులకు ఇదే గతి పడుతూ ఉంటుంది. అందుకే ఈ నాగరికలోకంతో విసిగి ఆయన జీవితమంతా పట్నాలవాసన సోకని అడవుల్లో కోయవారితోనే ఉండిపోయాడు.చివరకి అక్కడే మరణించాడు.

పాతకాలంలోని రుష్యాశ్రమాలు అందుకే కొండకోనల్లో ఉండేవి, సిటీల మధ్యలో ఉండేవి కావు. మనుషుల మధ్యన ఉండే పెంపుడుజంతువులకు మనుషులకొచ్చే రోగాలు వచ్చేటట్లే, సమాజం మధ్యలో ఉండే ఆశ్రమవాసులకు కాలక్రమేణా వారికి తెలీకుండానే నిమ్నస్థాయి పోకడలు కలుగుతాయి.అందుకనే అడవుల్లో ఉండే సాధువులకూ సిటీలలో ఉండే సాధువులకూ చాలా తేడా ఉంటుంది. ప్రతి సాధువూ హిమాలయాలకు పోవాలని ఆశించేది కూడా మానవసమూహంలోని స్వార్ధపరత్వాన్ని భరించలేకే. అడవిప్రజలు అమాయకులు. మనంత స్వార్ధం వారికుండదు. అందుకే, కల్లాకపటం ఎరుగని ఆ అడవుల్లోని కోయవారిది 'రుషికులం' అని ఆయనన్నాడు.

'అర్హత గలవారు లభిస్తే మేము మరణం తర్వాతగూడా ఉపదేశించగలం' అన్న ఆయన మాటలు అక్షరసత్యాలు. అవెప్పుడూ నా చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి. మానవుల అజ్ఞానాన్ని చూచి అటువంటివారు పడే వేదన దుర్భరంగా ఉంటుంది.కాని వారాశించే స్థాయి శిష్యులు వారికి దొరకరు.'నాదగ్గరకోచ్చిన ఇన్నివేలమందిలో ఒక్కడుగూడా శిష్యుడన్నవాడు నాకు కనిపించలేదు'అని షిర్డీసాయిబాబా కూడా అంటారు.అందుకే చాలామంది సద్గురువులు నిరాశతో మరణిస్తారు.ఇది తప్పదు. ఆధ్యాత్మిక లోకంలో అందుకే ఇద్దరే అదృష్టవంతులు ఉంటారు.సద్గురువు దొరికిన శిష్యుడూ,సచ్చిష్యుడు దొరికిన గురువూ వీరిద్దరే అదృష్టవంతులు.అదలా ఉంచి, రామయోగికున్న అద్భుతమంత్రశక్తుల కోణంలో  ఆయన జనన సమయాన్ని కొంచం పరిశీలిద్దాం.

మధ్యాన్నం ఒంటిగంటన్నర లోపుగనక ఆయన జననం జరిగి ఉంటే, కారకాంశ సింహం అవుతుంది. ఆ తర్వాత అయితే కన్య అవుతుంది. ఇటువంటి జాతకాల్లో జైమినిసూత్రాల సహాయం తీసుకోవాలి. ఒక జాతకంలో ఉండే మంత్రసిద్ధియోగాలను గురించి వివరిస్తూ జైమినిమహర్షి 'శుభేzనుగ్రాహక:' అంటారు. కారకాంశనుంచి పంచమనవమాల మీద శుభగ్రహదృష్టి గనుక ఉంటే ఆ జాతకుడు మంత్రవేత్త అవడమే గాక, తన శక్తులతో లోకానికి ఉపకారం చేస్తాడు. రామయోగి అదే చేశాడు.తన జీవితంలో ఎన్ని వేలమందికి ఆయన నిస్వార్ధంగా ఉపకారం చేశారో లెక్కే లేదు. సింహ కారకాంశ అయితే ఇది జరుగదు. కనుక కన్యా కారకాంశ మాత్రమే సరైనది. అపుడు మాత్రమే, మకరం మీద శుక్రదృష్టీ, వృషభంలోని రవిబుధులమీద పూర్ణచంద్రదృష్టీ ఉంటుంది. కనుక ఆయన కారకాంశ కన్య అనేది నిశ్చితం. అంటే ఆయన పుట్టినది మధ్యాన్నం 1.30 తర్వాత అయి ఉండాలి. అందులో కూడా 2.30 నుంచి 4.30 లోపు అయి ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలోనే తులా లగ్నం నడిచింది. ఈ విధంగా ఇంకా సూక్ష్మ గణనం చేసి ఆయన జనన సమయాన్ని రాబట్టవచ్చు. కాని ప్రస్తుతం అంతటి సూక్ష్మ పరిశీలన అవసరం లేదు. 

'సమే శుభ దృగ్యోగాద్ధర్మ నిత్యసత్యవాదీ గురుభక్తశ్చ' అన్న సూత్రం కూడా కన్యా కారకాంశకే సరిగ్గా సరిపోవడం చూడవచ్చు. పైగా కారకాంశ సింహం అయితే శునకములవల్ల భయం ఉంటుంది.రామయోగి అడవిలోని పులులూ సింహాలతో ఆటలాడుకున్న అమిత ధైర్యవంతుడు.ఆయన చెయ్యెత్తి ఆగమంటే పులి ఆగిపోయేది. ఎవరైనా గూడెం ప్రజలోచ్చి 'అయ్యా! పులొచ్చి మా పశువుల్ని ఎత్తుకుపోతున్నదయ్యా' అని మొరపెట్టుకుంటే ఆ దిక్కుకు చూచి 'ఇకరాదులే పో' అనేవాడు. ఆ గ్రామం చాయలకు మళ్లీ పులి వచ్చేది కాదు.అటువంటి శక్తి సంపన్నుడ్ని శునకములేమి చేయగలవు? కనుక ఆయనది సింహ కారకాంశ కాదు,కన్యాంశ మాత్రమే  అని తెలుస్తున్నది.

పై గణితాన్ని బట్టి ఆయన లగ్నం తులాలగ్నమని తేలింది.కనుక మొదట్లో ఆయన ముఖవర్చస్సును బట్టి మనం ఊహించిన తులాలగ్నం సరియైనదే. అప్పుడు ఆరూఢలగ్నం మకరం అవుతుంది. అక్కణ్ణించి పంచమంలో రవిబుధులు వారిపైన పూర్ణచంద్రుని దృష్టి ఉండటం చూడవచ్చు. దీనినిబట్టి   ఈయన మంత్రసిద్ధి కల్గిన మహానుభావుడని, ఆ శక్తితో లోకానికి నిస్వార్ధమైన మేలు చేసిన యోగియని తెలుస్తున్నది. ఇటువంటి మహానుభావులు ఈనాటికీ మన దేశంలో పుడుతూ ఉండటంవల్లే ఈదేశం పుణ్యభూమి అనిపించుకోగలుగుతున్నదన్నమాట వాస్తవం.


ఇకపోతే, ఆయన 6-3-1970 శివరాత్రి రోజున మహాసమాధి చెందారు. ఆ సమయానికి గురువూ శనీ జననకాల స్థానాలలోకి వచ్చి ఉన్నారు. ఎందుకంటే అప్పటికి  ఆయనకు 60 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఎవరికైనా షష్టిపూర్తికి ఈ గ్రహస్తితి వస్తుంది. అది వింత కాదు. కానీ ఆ సమయానికి గోచార గురువు 12 డిగ్రీల పైకి వచ్చి, జననకాల గురువు పైన సంచరించాడు. జననకాల గురువు కూడా 12 డిగ్రీలమీదే ఉన్నాడన్న విషయం గుర్తిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మరణ కాలానికి మళ్లీ గురువు వక్రించి ఉన్నాడు. ఖచ్చితంగా జననకాల స్తితిలోకి వచ్చి ఉన్నాడు. ఇదొక నిగూఢ కర్మరహస్యం. ఆయన పొందిన సిద్ధికి ఇదొక సంకేతం.దాని వివరం ఏమిటో నేను బ్లాగుముఖంగా  వివరించదలచుకోలేదు.అది మనకు అప్రస్తుతం కూడా.

అతీతసిద్దులున్న మహర్షులూ, జ్ఞానసంపన్నులైన మహానుభావులూ పురాణాల కట్టుకథలని, కల్పితాలని మనం అనుకుంటాం. అలాంటి వారు అసలు పుడతారా?అనుకుంటాం.వారు పుట్టినది నిజమే.మన మధ్యన తిరిగినదీ నిజమే. వారు వస్తారు వెడతారు. మనం మాత్రం ఇలాగే ఉంటాం. అలాంటివారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మన దేశంలో ఉంటూనే ఉంటారు. ఇదే మన దేశపు నిజమైన అదృష్టం.
read more " పాకలపాటి గురువుగారి జాతకం - కొన్ని విశేషాలు "

10, సెప్టెంబర్ 2012, సోమవారం

ఒమర్ ఖయ్యాం జాతకం -5 (తాత్విక చింతన)

తాత్వికులనూ,యోగులనూ అర్ధం చేసుకోవడం కష్టం. ఎందుకంటే వారి ఆలోచనాస్థాయి వేరుగా ఉంటుంది. ఒక విషయాన్ని వారు చూచేవిధానం, మామూలు మనుషులు చూచే విధానానికి భిన్నంగా ఉంటుంది. లోకం దృష్టిలో ఎంతో విలువైనది వారి దృష్టిలో చెత్తగా ఉంటుంది. లోకం దృష్టిలో పనికిరానిది వారికి ఎంతో విలువైనదిగా కనిపిస్తుంది.వారివారి దృక్పధాలలోని తేడాలవల్ల ఒకే విషయం వారికి అలా వేర్వేరుగా అనిపిస్తుంది.

ఖయ్యాం ఎంతసేపూ భోగానుభవం గురించే చెప్పలేదు.గహనమైన తాత్విక విషయాలు కూడా అతను చర్చించాడు. అవేమిటో ఈ పోస్ట్ లో చూద్దాం.

మనిషి జీవితమంతా అనవసర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లోనే గడిచిపోతుంది. నిజంగా అవసరమైన విషయాలంటే ప్రతిమనిషికి ఎంతో భయం. అందుకే వాటిని మూసిపెట్టి ఉంచుతాడు. తెలీనట్లు నటిస్తాడు. ఉష్ట్రపక్షి ఇసుకలో తలదూర్చి తనకే ప్రమాదమూ లేదని అనుకుంటుంది. అలాగే మనిషి లోకవ్యవహారాల్లో మునిగి తాను శాశ్వతంగా ఇక్కడే ఉంటానన్న భ్రమలో ఉంటాడు. కానీ అతని నాటకానికి ఉన్నట్టుండి ఒకరోజు తెరపడిపోతుంది.

తనచుట్టూ అందరూ పోతున్నాకూడా తానుమాత్రం పోను అనుకోవడమే ప్రపంచంలో కెల్లా పెద్దవింత అని ధర్మరాజు ఒక యక్షప్రశ్నకు సమాధానంగా చెబుతాడు. తన బతుకు అనిత్యం అని ఏ మనిషీ ఒప్పుకోలేడు. కానీ,అలా గుర్తించడమే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. దీనిని ఒప్పుకోలేరు కనుకనే జనం ఆధ్యాత్మికతను అందుకోలేరు. అంతరిక జీవితంలో మొదటి అడుగును కూడా అందుకే ఎప్పటికీ వెయ్యలేరు. అసలు,మనిషి బ్రతుకే ఒక దొంగనాటకం.ఈ లోకంలో ప్రతివాడూ ఒక దొంగే.కొందరు కనిపిస్తారు.కొందరు కనిపించరు. అంతే తేడా.

ఖయ్యాం తన కవితలలో జీవితపు అనిత్యత్వాన్ని మళ్ళీమళ్ళీ నొక్కి చెబుతాడు.జీవితపు అనిత్యత్వం అనేది అతని రుబాయత్ లో అంతస్సూత్రంగా కనిపిస్తుంది. అంతా మట్టే అని ఎన్నోసార్లు ఉదాహరణలతో నిరూపిస్తాడు. పూవు రాలినట్లు జీవితం కూడా ఒకనాడు రాలిపోతుంది అని చెబుతాడు.మనిషి నిత్యసహచరుడు మరణమే అన్న సత్యాన్ని వక్కాణిస్తాడు. ఎందుకంటే స్నేహితులు బంధువులు నమ్మినవారు ఎవరేవరు తనను అర్ధాంతరంగా వదిలిపెట్టిపోయినా, మనిషిని వదలకుండా నీడలా వెన్నంటి చివరివరకూ ఉండేది మరణం ఒక్కటే. అందుకే దానిని మించిన స్నేహితుడు మనిషికి లేడు. యోగుల నిత్యస్నేహితుడు మరణమే. ఎట్టి స్తితిలోనూ అతడు మనలను వదలిపోడు. ఇదే మాట ఖయ్యాం కూడా చెబుతాడు.

అయయో ఎందరి మానవోత్తముల కంటాంకురముల్ ద్రుంచె ని
ర్దయమౌ కాలము, యౌవనంబు, తను సౌందర్యంబు లావణ్య మ
వ్యయమై నిల్చునె? ఎన్ని ఎన్ని కసుగాయల్ రాలేనీ నేల; నా
రయలేదో  విరబూయకే యురలి వ్యర్ధంబైన లేమొగ్గలన్

ఎంతమంది కుత్తుకలను ఈ కాలమనేది ఉత్తరించిందో కదా? అందము యౌవనము, లావణ్యము ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? సాధ్యమేనా? ఎన్నెన్ని లేతమొగ్గలు విరియకుండానే నేలరాలిపోయాయో నీకు తెలుసా? అని ప్రశ్నిస్తాడు.

కాలానికి దయలేదు. సమయం వచ్చినపుడు రాజనీ పేదనీ అది దయతలచదు.దేనికోసమూ ఆగదు.తుఫానులా వచ్చి మనిషిని తీసుకుపోతుంది. మనుషులు వేటిని చూచుకుని విర్రవీగుతూ ఉంటారో ఆ అందమూ, యవ్వనమూ ఇవేవీ శాశ్వతం కావు.మహామహాసుందరీమణులే కాలక్రమేణా ముసలివగ్గులై అనాకారులయ్యారు. అంతెందుకు. యవ్వనాన్ని అందుకోకుండానే పసిమొగ్గలు ఎందరు పరలోక ప్రయాణం కట్టారో నీకు తెలుసా? మరెందుకు ఈరోజుండి రేపు పోయేవాటిని చూచుకొని నీకు ఈ గర్వం? ఇది తెలివితక్కువతనం కాదా?   

ఖయాం అతి సున్నితహృదయుడు. పచ్చికమీద కూడా గట్టిగా కాలు పెట్టలేడు.ఎందుకంటే, గతించిన అనేకమంది అప్సరసలు ఆ పచ్చికలో అతనికి కనిపిస్తారు. తన కాలికి గుచ్చుకొన్న ముల్లులో కూడా ప్రేయసి ముంగురులను అతడు తిలకిస్తాడు. పువ్వును అతడు కోయలేడు. ఎందుకటే అందులో ప్రేయసి మోమును అతడు వీక్షిస్తాడు. అది నేలరాలితే అతడు కన్నీటి పర్యంతం అవుతాడు.

'నడుస్తున్నపుడు నీ కాలికి గుచ్చుకొన్న ముళ్ళు, ఒకప్పటి నీ ప్రేయసి మోమున అలవోకగా ఎగిరిన ముంగురులేమో? ఆ లేత పచ్చిక మీద మోటుగా కాలు పెట్టకు. అది ఒకప్పటి సుందరి మట్టిలో కలిసిన తర్వాత అక్కడ చిగిరించిన పచ్చిక కాదా? జాగ్రత్తగా చూడు' అంటాడు. లోకంలోని ప్రతిదీ అతనికి అద్భుతంగా తోస్తుంది. సౌందర్య రసాస్వాదనలో అతడు మైమరచి ముగ్దుడౌతాడు.పసిపిల్లవానివలె ప్రతిదాన్నీ వింతగా వీక్షిస్తాడు.

జల జల మంజులార్భటుల జాల్కోను నీ సెలఏటి కోనలన్
మొలచిన లేత పచ్చికల మోటుగ కాలిడబోకు దేవదూ 
తల రుచిరాధర ప్రక్రుతిన్ దాల్చేనో సుందర మందగామినీ
లలిత శరీర మృత్కణములన్ జిగిరించేనో యేమొ కోమలీ 

ఖయ్యాం యొక్క నిశితదృష్టికి తోటలో పూచిన ఎర్రని పూలరంగు 'పూర్వ నృపాలుర రక్తకణాల నుండి' వచ్చినట్లు తోస్తుంది. పూలరేమ్మలలో అక్కడక్కడ కనిపించే నల్లని రంగులో 'చెలియ నిగారపు తళుకు చెక్కులనేలిన పుట్టుమచ్చ' కనిపిస్తుంది. ప్రకృతిమొత్తం జీవంతో నిండి తొణికిసలాడుతూ అతనికి దర్శనమిస్తుంది.

ఖయ్యాం మంచి భావుకుడు. ప్రకృతి ఒడిలో ప్రేయసి కౌగిలిలో కరిగి శూన్యంలో లీనమై తన అస్తిత్వాన్ని కోల్పోవాలని కోరుకుంటాడు. అదే అతని ధ్యానం. అదే అతని యోగం. యోగులు అందుకునే సమాధిని ఈ విధంగా అతనూ అందుకోవాలని చూస్తాడు. ఈ క్రింది పద్యంలో అలాంటి ఒక చక్కని భావాన్ని పలికిస్తాడు.

తారా శుక్తులు రాల్చినట్టి జిగి ముత్యాలట్లు పూరేకులన్ 
జారె సన్నని మంచు తుంపురులు; వాసంతోదయ శ్రీకి గాం
తారత్నం బనువైన నేచ్చేలిగ నుద్యానంబునం దోచె మి
త్రా, రారమ్ము సుఖింపు, మీయదను వ్యర్ధంబైన రాదెన్నడున్

'నక్షత్రాలనుంచి రాలిపడిన ముత్యాలలాగా పూరేకులలోనుండి సన్నని మంచుతుంపురులు జాలువారుతున్నాయి.వసంతంతో పులకిస్తున్న ప్రకృతికి అనువైన నేచ్చేలిగా నా ప్రేయసి కనిపిస్తున్నది. ఆలస్యం చేయకు. సుఖాన్ని ఆస్వాదించు. తప్పులేదు ' అన్న భావం ఒక భావుకుడైన వానికే హృదయంలో పెల్లుబుకుతుంది. ఇలాంటి సున్నిత భావప్రపంచంలో విహరిస్తూ అతడు తన కాలాన్ని వెళ్ళబుచ్చుతాడు.
    
కాని, ఎంతటి సున్నిత మనస్కులనైనా కాలం ఎల్లకాలం దయతలచదు. వారి మురిపెం కూడా మూన్నాళ్ళే. తర్వాత వారు కూడా కాలం చేతిలో చెంపదెబ్బలు తినవలసిందే. కన్నీరు పెట్టవలసిందే. ఈ లోకంలో ఏదో కారణాన ఏడవని వారెవ్వరు? క్రమేణా ఖయ్యాంకి కూడా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అతన్ని అభిమానించిన స్నేహితులు, ఆదరించిన రాజులూ ఒక్కొక్కరే గతించసాగారు. 'మనమున కేక్కినట్టి యభిమానులు మిత్రులు జేల్లినారు' అంటూ బాధపడతాడు. జీవితం నిస్సారంగా తోస్తుంది. ఈ బ్రతుకు వృధా అని తలుస్తాడు. 'జీవితంబను సరకంబునందు నడుగంటె మధూళియు' అని విలపిస్తాడు.  

'ఇలను రాకపోకల నాకు స్వేచ్చయున్న రాకయుందును వచ్చిన బోకయుందు' అనుకుంటాడు. అసలు ఈ ప్రపంచంలోకి రావడమెందుకు? సరే వచ్చాను. మళ్ళీ పోవడమెందుకు? ఏమిటీ వృధా ప్రయాస? అని తనను తానే ప్రశ్నించుకుంటాడు. 

'ఇలాంటి సృష్టిని ఈ దేవుడు ఎందుకు చేసినట్లు? ఎక్కడో నిద్రలో ఉన్న నన్ను నిద్రలేపి నాకొక రూపాన్నిచ్చి అతిసుందరమైన ఈ లోకంలోకి ఎందుకు తెచ్చినట్లు? స్పందించే హృదయాన్ని ఎందుకు నాకు ఇచ్చినట్లు? మంచి ఆనందాస్వాదనలో ఉండగా హటాత్తుగా తెరవేసి ఇక్కణ్ణించి ఎక్కడికో తెలియనిచోటికి లాక్కుపోవడం ఎందుకు? ఏమిటీ నాటకం? అసలెందుకిదంతా?' అని బాధపడతాడు.

'వీలుపడునేని ఈ పాడునేలయండు ఉనికి పుట్టువు చావు లేకున్న మేలు.' అన్న పద్యపాదంలో ఒక నిగూఢమైన యోగార్ధాన్ని ప్రతిపాదిస్త్తాడు. 'అస్థితి నుండి స్థితిలోకి రానేకూడదు. ఆ తర్వాత ఈ లోకంలోకి అసలే రాకూడదు. సరే ఒకసారి వచ్చాక ఇక పోకూడదు. ఇదేంటి ఈ అనవసరపు గోల?' అని ఒక నిత్యసిద్దునివలె ప్రశ్నిస్త్తాడు.

మును నే నస్తితి నిద్రనుండ నిలకుం బోద్రోలి దుఃఖంబులం 
దను సౌఖ్యమ్బుల నందజేసి మరలం దర్జింతు వౌరౌర పా
పిని శిక్షింతు నటంచు నీ చతురతన్ వేనోళ్ళ గీర్తింతు రీ 
వినయార్తుల్; మరి శిక్ష కర్హుడవు నీవే కావే లోకేశ్వరా?

'నేనేక్కడనుంచి వచ్చానో నాకు తెలియదు. ఎక్కడో నిద్రలో ఉన్న నన్ను తెచ్చి ఈలోకంలో పడవేశావు. దుఖాలనూ సుఖాలనూ అందజేశావు. అనుభవిస్తున్నాను. సుఖాలిచ్చేదీ నీవే, అనుభవిస్తుంటే 'పాపివి నీకు శిక్ష తప్పదు' అనేదీ నీవే. ఇదెక్కడి న్యాయమయ్యా? నీ దొంగభక్తులు నీకు స్తోత్రాలు చేస్తుంటారు. నేనలా చెయ్యను.నికార్సైన నా అభిప్రాయం చెప్పమంటావా? అసలు శిక్ష అంటూ వేస్తె నీకే వెయ్యాలి. ఎందుకంటే ఈ నాటకానికి కర్తవు నీవే కదా మరి?' అంటాడు.

అంతరంగ భక్తులైనవారు దైవంతోనే పోట్లాడతారు.ఆయనమీద అలుగుతారు. విసుక్కుంటారు. ఆయన్ను విమర్శిస్తారు. మామూలు భక్తులకు ఇదంతా అపరాధంగా పాపంగా తోస్తుంది.కాని దైవానికి ఇదే ఇష్టం. తనతో అలా చనువుగా మెసలే భక్తులంటేనే ఆయనకు మహాప్రీతి. తనతో దేబ్బలాడే వారంటేనే ఆయనకు ప్రేమ. ప్రేమ ఉన్నచోటే చనువు ఉంటుంది. చనువు ఉన్నచోట మర్యాదలు దూరాలు మాయమౌతాయి. పోట్లాట తప్పనపుడు చెత్తమనుషులతో ఎందుకు? దైవంతోనే పోట్లాడటం మంచిది. బలహీనుడితో పోరాడి గెలిస్తే మజా ఏముంటుంది? 

ఈలోకంలో ఎవడూ ఏ తప్పూ చేయకుండా జీవనం ఎలా సాగించగలడు? 'అవ్వలబాపి వీడనుచు అక్రమశిక్ష విధింతువయ్య' అక్రమంగా నన్ను పాపి అని ముద్ర వేసి శిక్షించాలని చూస్తున్నావు కదా.'ఈ రవ్వయు రచ్చ ఏల అపరాదుల మిద్దరమౌట' సరే ఈ గొడవంతా ఎందుకు. మనిద్దరమూ అపరాధులమే సుమా.ఎలా అంటావా చెబుతాను విను, సుందరమైన లోకాన్ని సృష్టించినందుకు నీకు,దానిని చూచి మోహించినందుకు నాకు,శిక్ష వేస్తె నీకూ నాకూ ఇద్దరికీ విధించు. అదే అసలైన న్యాయం. దానికి తక్కువ అయిన న్యాయం నేను ఒప్పుకోను.' అని దేవునితో వాదిస్తాడు.

'నన్ను పాపి అని ముద్ర వేస్తున్నావు. బాగానే ఉంది. అసలు ఇదంతా చేసింది నీవు కాదా?
ఇంత సౌందర్యాన్ని సృష్టించి, మానవ హృదయంలో ఆకర్షణను సృష్టించి, ఆ పైన ఆకర్షిపబడితే 'తప్పు' అనడం నీకే చెల్లింది. ఇదేమి న్యాయమో నీవే చెప్పు?' అని దైవాన్ని అడుగుతాడు.

ఖయ్యాం ఇంకొక విచిత్రమైన తర్కాన్ని లేవదీస్తాడు.'నేను తప్పు చెయ్యకపోతే నీవు ఎవరిని క్షమిస్తావు? కరుణామయుడని నీకు బిరుదున్నది కదా. దానిని నిలబెట్టుకో. నీ బిరుదును నిల్పడానికే నేను ఇన్ని పాపాలు చేస్తున్నాను. నేనే గనుక అన్నీ మానేసి వైరాగ్యాన్ని పూనితే నీవు కృప జూపడానికి పాత్రులెవరున్నారు?' అంటాడు. 'లోకంలో పాపులు ఉండాలి.అప్పుడే కరుణామయుడు అన్న బిరుదు నీకు దక్కుతుంది. ఇందుకేనా పాపాన్ని నీ సృష్టిలో అనుమతిస్తున్నావు?' అని అడుగుతాడు.

'నీ బిరుదున్ నిల్పుటకె నోనర్చితిని నిర్భీతిన్ సమస్తాఘముల్ సరకంబంటక యున్న వీలగునే పశ్చాత్తాపమున్ బొందగన్' పాపాలు చెయ్యకపోతే పశ్చాత్తాపం ఎలా పొందగలను? పశ్చాత్తాపం పొందకపోతే నీ కృపకు పాత్రున్ని ఎలా కాగలను? కనుక నేను పాపాలు చెయ్యడం సమంజసమే. కాదా? నీవే చెప్పు?' అంటాడు.

'భక్తులం గావగ వత్తువేని కృప గాదది' అంటూ నీ భక్తులను నీవు కాపాడితే గొప్ప ఏముందయ్యా? ఆ పని ఎవరైనా చేస్తారు.పాపాత్ములను కాపాడితేనే నీవు కరుణామయుడన్నది నిజమౌతుంది. అవునా కాదా ఇదికూడా చెప్పు' అంటూ దేవుని నిలదీస్తాడు.

ఇదే తర్కాన్ని ఇంకొంచం ముందుకు తీసుకెళ్ళి ఇంకొక అద్భుతమైన పద్యాన్ని చెబుతాడు.

అంబరు ముంగురుల్ నొసటి యంచున వేలగ జూచినంత మో 
హం బెసకోల్పు కోమల లతాంగిని గల్పన జేసి నీకు న్యా
యంబె మరేవ్వరున్ మొగము నారయరాదని యాజ్నపెట్ట;బూ
పంబును జేతికిచ్చి తినవద్దని చెప్పుట ఏల దైవమా?

'నొసట వ్రాలుతున్న ముంగురులతో చూడగనే మోహం పుట్టించే కోమలసుందరీమణిని సృష్టించేదీ నీవే. మళ్ళీ ఆ ముఖాన్ని చూడవద్దని ఆంక్ష పెట్టేదీ నీవే. బూరెను చేతికిస్తావు. తినవద్దని కట్టడి చేస్తావు. ఇదేమి న్యాయమో చెప్పు? అసలెందుకు ఇలా చేస్తున్నావు. నీకేమైనా సరదానా?' అని దైవాన్నే నిలదీస్తాడు.

మనుజుని వారుణిం బ్రణయ మాధురి సుందరిం జేసి భూమినం 
దనమున కంపినాడవు; మనంబగు బ్రేరక మెల్లకర్మకున్;
వెనుక నదేల మాలను వేసేద వీ యుపదూరు? నీవే శా
సన మపరాధియున్ మరి విచారణ కర్తయుం; జిత్రమీశ్వరా      

'మనిషిని సృష్టించావు. మధువును సృష్టించావు. మధురప్రణయమూర్తి అయిన ప్రేయసిని సృష్టించావు. నందనవనం లాంటి భూలోకాన్ని  సృష్టించావు. వీటన్నిటినీ ఒక్కచోట చేర్చావు. కాని, అనుభవం తప్పు అంటావు. భలే చిత్రంగా ఉందయ్యా. నీవే శాసనానివి. నీవే అపరాదివి. నీవే న్యాయాదిపతివి. ఏమిటీ వింత ఆట? మనిషి హృదయంలో ప్రేమను సృష్టించేదీ నీవే. మళ్ళీ ప్రేమించవద్దని ఆంక్షలు విధించేదీ నీవే. ఏంటయ్యా నీ లీల? ' అని ప్రశ్నిస్తాడు.

'ఏ ప్రయోజనమూ లేకుండా నన్ను ఈ లోకానికి ఎందుకు తెచ్చాడో దేవుడు? సరే తెచ్చాడు. మళ్ళీ నన్ను చంపితే ఆయనకు గౌరవం ఏమైనా హేచ్చుతుందా? మరి ఎందుకు నన్ను ఎక్కడికో తీసుకుపోతాడు? అసలు జీవితాన్ని ఎందుకిస్తున్నాడు? మరణాన్ని ఎందుకు పంపకం చేస్తున్నాడు? ఏమిటీ వింత ఆట?' అని ఆలోచించి విసుగు చెంది 'దైవలీలా మహిమోన్నతిం మది దలంప నసాధ్యము; రాకపోకలేలా; మన జీవితంబుకు లాభము జీవితంబెకా?' అన్న నిశ్చయానికి వస్తాడు. ' జీవితానికి పరమార్ధం వేరే ఏమీ లేదు. జీవించడమే జీవితానికి పరమార్ధం' అని ఒక అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించి మన కళ్ళముందు ఉంచుతాడు. ఈ క్రమంలో ఒక తాత్వికుడు ఆయనలో మనకు దర్శనం ఇస్తాడు.

'ఒక చక్కని బొమ్మను తయారు చేసిన శిల్పి తన బొమ్మను తానే ఎన్నటికీ ధ్వంసం చెయ్యడు. మరి ప్రాణం లేని బొమ్మ విషయంలోనే ఇలా ఉంటే, ఇక ప్రాణం ఉన్న మనిషిని సృష్టించి, ఆమె పెదవులలో మధువును నింపి, హృదయంలో అనురాగమనే అమృతాన్ని నింపిన దేవుడు ఆమెకు మరణాన్ని ఎందుకు ఇస్తున్నాడు? తన సృష్టిని తానే ఎందుకు ఇలా ఉన్మత్తునివలె కూల్చుకుంటున్నాడు?' అని అర్ధం కాక చింతిస్తాడు. 

తన చేచేత నోనర్చినట్టి యొక పాత్రన్ భగ్నము చేయ నే
మనుజుం డైనన్ దలంప; డంగములు నిరమాణంబు గావించి మో 
హన రూపంబులు, మోవిదేనె యెదలో నత్యంత రాగంబు గూ 
ర్చిన దేవుండు మరేల ఇట్లు నిజ సృష్టి గూల్చు నున్మత్తుడై?   

ఇదంతా చూచి ఆయన్ను ఒక తత్వవేత్తగా మనం భావించామా? మనం పప్పులో కాలేసినట్లే. మళ్ళీ దానినీ ఒప్పుకోడు. తాను తత్వవేత్తను కాను అంటాడు. ఎందుకంటే తాత్వికులు ఊహల్లో విహరిస్తారు. ఖయాం అనుభవాన్ని అందులోని ఆనందాన్ని కోరుకుంటాడు. కనుక ఖయాం అనుభవవాది. తత్వవేత్త కాదు.

నేనొక తత్వవేత్త నని నిందయొనర్చిరి కానివారు; నా 
మానస వృత్తి వారలణుమాత్ర మెరింగిన నట్టులందురే
కాని, మరేమి; దేవు డెరుంగడే మనంబు; వ్యధా కులాయమౌ 
ఈ నిలయంబు జేరితి; గ్రహింప నసాధ్యము జన్మమర్మముల్

'లోకం నన్నొక తత్వవేత్త అంటే, నిందించినట్లు నాకు వినవస్తుంది. నా మనసు అణుమాత్రం కూడా వారెరుగలేరు. అందుకే అలా అంటున్నారు. పోనీలే లోకులేమనుకుంటే నాకేమి? దేవునికి తెలియదా నా మనస్సు? అనవసరంగా బాధామయమైన ఈ చెత్తలోకానికి వచ్చిపడ్డాను. ఈ జన్మలలోని మర్మం ఏమిటో తెలుసుకోవడం అసాధ్యం కదా?' అని తలుస్త్తాడు.

కానీ భారతీయ యోగులవలె ఖయాం జీవిత గమ్యాన్ని చేరాడా? అంటే సందేహమే అని చెప్పాలి. అలా చేరినట్లు అతని పద్యాలలో దాఖలాలు ఎక్కడా కనిపించవు. జ్ఞాని అయినవాడు ఎక్కడో ఒకచోట సూక్ష్మంగా అయినా తన స్తితిని వెల్లడిస్తాడు. అది అందరికీ అర్ధంకాకపోయినా, కొందరికైనా అర్ధం అవుతుంది. ఖయ్యాం చివరి పద్యాలలో ఆ పరిపక్వత కనిపించదు. అందుకే సత్యజ్ఞానాన్ని అతడు పొందగలిగాడా అంటే, సందేహమే అని చెప్పాలి.

ఆదిమధ్యాంత రహితమై అలరుచుండు 
కాలయవనిక భేదించగలమే మనము?
ఇలకు నెందుండి వచ్చె నింకేటకు బోవు
బ్రాణి యను ప్రశ్న కెవ్వడు బదులు సెప్పు?

ఈ కాలానికి మొదలూ మధ్యా తుదీ లేవు. దీనిని మనం ఎలా భేదిన్చగలం? ఒక జీవుడు ఎక్కడనుంచి ఈ లోకంలోకి వస్తున్నాడు? మళ్ళీ ఎక్కడికి పోతున్నాడు? అన్న ప్రశ్నకు ఎవడైనా జవాబు చెప్పగలడా? అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పగల సత్యజ్ఞానం కల్గిన యోగులూ జ్ఞానులూ ఖయ్యాంకు దొరకలేదని దీనివల్ల అర్ధమౌతుంది. ఆ అదృష్టం అందరికీ దక్కదు. దక్కినా అందరూ ఉపయోగించుకోలేరు.

'కానలేము కర్మపు మర్మమేను నీవు, ఆ జిలుగు వ్రాత చదువ సాధ్యంబే మనకు' కాలం యొక్క మర్మాన్ని నీవూ నేనూ తెలుసుకోగలమా? బ్రహ్మ వ్రాసిన జిలుగు రాత చదువగలమా? అని ప్రశ్నిస్తాడు. సామాన్యుడే కాదు తత్వవేత్త కూడా కర్మరహస్యాన్ని తెలుసుకోలేడు. ఇంద్రియాతీతుడై జ్ఞాని అయినవాడే ఆ రహస్యాన్ని చూడగలడు. ఇతరులు వారెంతటి పండితులైనా ఆ రహస్యజ్ఞానాన్ని పొందలేరు. ఇది సత్యం.

ఖయ్యాం కూడా అనేకమంది గురువుల వద్ద శుశ్రూష చేశాడు. కానీ వారెవరూ అతనికి సత్యజ్ఞానాన్ని బోదింపలేకపోయారని తానే వాపోతాడు. ఎందుకంటే వారందరూ గ్రంధపండితులే గాని అనుభవజ్ఞానులు కారు. కనుక వారికీ సత్యం తెలియదు. వారిది వినికిడిజ్ఞానమే గాని అనుభవజ్ఞానం గాదు. 

అనుజునై ఎగిరితి రహస్యామ్బరమున 
పిన్న పెద్దల శుశ్రూష వేత్త నైతి 
గాని, లోగుట్టు దెలుపు నొక్కని గనను
మరలి వచ్చితి పోయిన మార్గమందే

'ఎందఱో గురువుల పాదాలవద్ద కూచున్నాను. కాని ఒక్కరూ లోగుట్టు తెలుపరు. విసుగు చెంది, పోయిన దారినే మరలి వచ్చాను' అని వాపోతాడు. పాపం అతనికి అనుభవగురుల సాంగత్యం దొరకలేదు. అపరావిద్యలు  నేర్పించే గురువులు చాలామంది దొరికారు. కాని పరావిద్యను ఆయనకు బోధించేవారు ఒక్కరూ కనిపించనట్టు తోస్తుంది. దానికి గల జ్యోతిష్య కారణాలు వచ్చె పోస్ట్ లో చూద్దాం.

సతము తత్వ విచారంబు సలిపి సలిపి
మూలసూత్రంబు నెవరైన ముట్టినారే 
నేడు నిన్నట్లు రేపును నేటియట్లు
అందని ఫలంబు చేచాచ నందుటేట్లు?

వాదవివాదాలలో తత్వ విచారాలలో ఎవరైనా సత్యాన్ని గ్రహించగలరా? నేడు నిన్న రేపు అని వాదాలే గాని, నిజానికి ఈ మూడూ ఒకటేగా? మన ద్రుష్టివల్లె అలా కనిపిస్తున్నాయి గాని వాటిమధ్యన నిజానికి భేదం ఉందా? ఇదే విధంగా,  ఇంత తత్వవిచారం ఎందుకు? ఉన్న సత్యాన్ని ఉన్నట్లు సరళంగా చూడవచ్చు కదా? అంటాడు. 'ఆ పండు అందేది కాదు. పొందేదీ కాదు. చెయ్యి ఊడోచ్చేలాగు చాస్తే మాత్రం అందుతుందా?' అని ప్రశ్నిస్తాడు.

మనకు ముందేగినట్టి యా మాన్యులేల్ల 
ప్రబల గర్వాంధ నిద్రానిబద్దులైరి 
నెలత, మధువాని నావల్ల నిజము వినుము
వారు చెప్పిన చదువెల్ల వట్టి కల్ల       

'ప్రేయసీ. ప్రాచీనులందరూ గొప్ప జ్ఞానులని అనుకోకు. వారూ నీవంటి అజ్నానులే. ఈ మధువు త్రాగి నేను చెప్పే పరమసత్యాన్ని విను. వారు చెప్పినదంతా ఒట్టి అబద్దం. వారికే సత్యజ్ఞానం లేదు. ఇక నీకెలా దానిని ఉపదేశించగలరు?' అంటాడు.

జీవితంబెల్ల బహుశాస్త్ర సేవలందు 
గడపితి, రహస్యములు చాల గ్రాహ్యమయ్యే
నిప్పుడు వివేక నేత్రంబు విప్పి చూడ 
తెలిసికొంటి నాకేమి తెలియదనుచు 

'నా జీవితమంతా ఎన్నో శాస్త్రాలను నేర్చుకోవడంలో గడిపాను. చాల రహస్యాలు తెలిశాయి కూడా. కాని ఇప్పుడు చివరిదశలో వివేకనేత్రంతో చూస్తే ఒక్క సంగతి బాగా అర్ధమైంది. నాకేమీ తెలియదు,నేనొక అజ్ఞానిని. ఈ విషయం మాత్రం బాగా అర్ధమైంది.' అంటాడు. సోక్రటీస్ కూడా ఇదే అంటాడు. పాశ్చాత్యతాత్వికులకూ భారతీయజ్ఞానులకూ ఇదే మౌలికమైన భేదం. తాత్వికులు జ్ఞానాన్ని పొందటం కష్టం.పూసుకున్నవాడు తాత్వికుడౌతాడు. వదుల్చుకున్నవాడు జ్ఞాని అవుతాడు.పూసుకుంటూ వదుల్చుకోవడమూ, వదుల్చుకుంటూ పూసుకోవడమూ తెలిసినవాడు విజ్ఞాని అవుతాడు.  

మానవుడు ఎన్ని తెలుసుకున్నా మృత్యురహస్యాన్ని భేదించనిదే అతని  తెలివి ఎందుకూ కోరగానిదే అవుతుంది. అది ఒక్క యోగులు మాత్రమె చెయ్యగలరు. ఆ రహస్యజ్ఞానం వారి సొంతం. ఇక్కడే ఉత్త పండితులకూ యోగులకూ తేడా ఉంటుంది. మనిషి ఎన్నో శాస్త్త్రాలు చదవవచ్చు. ఎంతో పుస్తక జ్ఞానాన్ని పొందవచ్చు. కాని సమాధిస్తితిలో మునిగి జననమరణ రహస్యాన్ని చేదించనిదే అతనిజన్మ సఫలం కాదు. అతని జ్ఞానం పరిపూర్ణమూ కాదు.

ధారుణి నుండి యుచ్చ శని దాక గలట్టి కడింది చిక్కులన్ 
బూరితీగా సడల్చితిని; మోసపు టక్కుల బందేగాను; దు
ర్వార నిరోధముల్ గడచి వచ్చితి; నయ్యును,శాయశక్తులం 
బోరి వదల్చకే విసిగిపోయితి; మృత్యు రహస్య బంధముల్ 

అనే పద్యంలో తన మనసులోని మాటను వెల్లడిస్తాడు. ఖయ్యాం ఆ కాలంలో గొప్ప జ్యోతిష్కుడు. తన ఖగోళజ్ఞానంతో గ్రహగణితంతో విశ్వ రహస్యాలను ఆలోకించాడు. భూమినుంచి శనిగ్రహ కక్ష్య వరకూ ఉన్న గ్రహాల పరిభ్రమనాన్ని వాటి స్తితులను లెక్కించాడు.ఎన్నో శాస్త్రాలు చదివాడు.కాని ఎంత ప్రయత్నించినా మృత్యురహస్యాన్ని మాత్రం భేదించలేకపోయాను కదా అని బాధపడతాడు. కనుక అతను జీవితపరమగమ్యాన్ని చేరలేకపోయాడని మనం అనుకోవచ్చు.

(సశేషం)
read more " ఒమర్ ఖయ్యాం జాతకం -5 (తాత్విక చింతన) "

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

కాలజ్ఞానం -12

శుద్ధ ఏకాదశి వరకూ 
తప్పవు యమబాధలు 
జరుగుతాయి ఎన్నో 
అంతిమ యాత్రలు 

కర్మ ఒక స్థాయి దాటితే 
అక్కరకు రాదు ధనం
మారకపోతే జనం 
తప్పదు నిత్యప్రళయం 

కృష్ణ చవితి తప్పక 
సృష్టిస్తుందొక వెలితి 
కళాకారులు సాహితీవేత్తలు 
కడతారిక ప్రయాణాలు 

భీభత్సం ప్రత్యక్షం 
భయోత్పాతం సహజం 
అధర్మం మితిమీరితే 
ఎక్కడికక్కడే పుడుతుంది 
వినాశనకారి ముసలం
read more " కాలజ్ఞానం -12 "

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఒమర్ ఖయ్యాం జాతకం -4 (మధుసేవ-సాకీసాంగత్యం)

ఖయ్యాం పద్యాలలో మధువూ సాకీ ఈ రెండూ తప్పకుండా ప్రతి పద్యంలోనూ దర్శనమిస్తాయి. రసహీనమైన ఈ లోకానికి వెలుగును ఇచ్చే  దివ్వెలు ఈ రెండే అని ఖయాం తలపోస్తాడు.

అయితే కొందరనుకునేటట్లు ఖయ్యాం తాగుబోతూ తిరుగుబోతూ కానేకాదు. అతనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి భాషావేత్త మాత్రమె గాక, ఇస్లామిక్ తియాలజీలో మంచి పండితుడు. గ్రీక్ తత్వశాస్త్రం అతనికి కొట్టిన పిండి. అప్పటి సైన్స్ లోనూ, గణిత శాస్త్రంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ మంచి దిట్ట. ఇదిగాక అతనికి సంప్రదాయ ఇస్లాంకు విరుద్ధమైన సూఫీ భావాలు ఉండేవి. ఇవన్నీ గాక అతనొక మార్మిక కవి. అందుకే అతన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అతను ఎన్నో కోణాలున్న జాతివజ్రం లాంటివాడు. ఒక్క కోణంలో చూస్తే అతను అర్ధం కాడు.

మార్మిక భాషలో నిగూఢమైన తత్వాన్ని ప్రతిపాదించడంలో అతను మంచి ప్రజ్ఞ కలిగినవాడని రుబాయత్ పద్యాలే చెబుతాయి. గహనమైన తాత్విక సమస్యలకు అతనిచ్చిన పరిష్కారాలు పైపైన చూస్తే పిచ్చివిగా కనిపిస్తాయి. కాని ఆ సమస్యలకు అవి ఎంత చక్కగా సరిపోతాయంటే, వాటిని మనం వెంటనే కాదనలేం. అవి మనల్ని ఆలోచింపచేస్తాయి. వాటికి మార్మికమైన గూడార్ధాలు ఉన్నమాట వాస్తవమే. అవి అలా ఉంచితే ఒక సామాన్యుడు మాత్రం ఖయ్యాం చెప్పిన దానికంటే ఈలోకంలో ఇంకేమీ చెయ్యలేడు. నైతికులు ఖయ్యాం ను ద్వేషించవచ్చు. కాని లోపల్లోపల వారుకూడా అతని శిష్యులే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, వారు అతని శిష్యులు కావాలంటే ప్రస్తుతపు వారి నేలబారు ఇంద్రియభోగలాలసా స్థితినుంచి చాలా ఎదగాల్సి ఉంటుంది. ఖయ్యాం వారనుకున్నంత నేలబారు మనిషి కానేకాదు.

రుబాయత్ లో అంతర్లీనంగా ప్రవహించే ఒక భావన మధువు. దానికి తోడుగా సాకీ ఉండనే ఉంటుంది. ఈ రెండు కలిసి, జ్వలిస్తున్న అతని ఆత్మను శాంతింప చేస్తాయి. తత్వశాస్త్రం పరిష్కరించలేని నిగూఢ సమస్యలను ఈ రెండూ అతి సులభంగా పరిష్కరిస్తాయి. అతన్ని సేద దీరుస్తాయి. ఎంత విచిత్రం? తత్వశాస్త్రం పరిష్కరించలేని గహనమైన చిక్కు ముళ్ళను మధువూ సాకీ చిటికెలో పరిష్కరించగలవు. భగవంతుని సృష్టి ఎంత గొప్పది? కొండ ఒక్క అంగుళం కూడా కదలలేదు. కాని చిన్న చీమ మహాపర్వతశిఖరాగ్రాన్ని చేరగలుగుతుంది. ఎంత అద్భుతం !!

సరసశృంగారపూరిత మధుపానమత్తమైన జీవితమెదురుగా ఉండగా, దానిముందు మహారాజుల వైభవం మాత్రం ఎందుకు దండగ? అని ఖయ్యాం తలపోస్తాడు. నిండుగా ఉన్న మధుపాత్ర, ఆమిష ఖండమూ, వెన్నరొట్టె, వీణ వాయించగల ప్రియురాలు, ఏకాంత మనోహర వనవాటిక - ఇవి దొరికే అదృష్టం ఉంటే ఏ మూర్ఖుడైనా వీటిని వద్దని దాని బదులు సుల్తాన్ పదవిని, రాజ భోగాలను కోరుకుంటాడా? అని ప్రశ్నిస్తాడు.   

ఆసవపూర్ణమౌ కలశ మామిషఖండము వెన్నరొట్టె ది
వ్యాసమరూప గుణాలయ వీణియ మీటుచున్ దివా
యాసముల దీర్ప నిర్జన వనాంతర సీమల నబ్బెనేని వ
హ్వా, సుల్తాను భోగ విభవంబుల గోరెడి మూఢుడుండునే ?

మనుషులకే గనుక తెలివి అనేది ఏమాత్రం అయినా ఉంటే, వాళ్ళు గుళ్ళూ గోపురాలూ మసీదులు అంటూ పిచ్చిపిచ్చి ఆధ్యాత్మికబంధాలలో చిక్కుకుంటారా? చక్కని పచ్చబయళ్ళూ, అప్సరవంటి నెచ్చెలి, మధువు, రసస్ఫూర్తినిచ్చే కవితా ఉంటే,వాటిని చక్కగా ఆస్వాదిస్తూ అప్పుడే ముక్తిని పొందేవారు కదా? అని తలపోస్తాడు. ముక్తి ఇక్కడే దొరుకుతుంటే ఆధ్యాత్మికత అంటూ గుళ్ళూ గోపురాలూ తిరుగుతారెందుకు మనుషులు? అని అడుగుతాడు. ఇదేలాంటి ముక్తో మాకు తెలుసులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఖయ్యాం చెప్పే ఆనందం అందరికీ తెలిసిన నేలబారు ఆనందం కాదు.

పచ్చ బయళ్ళు నేటి దరిపట్టులు, నొక్క క్షణంబు శ్రాన్తియున్ 
అచ్చర వంటి నెచ్చెలి రసాంకిత కావ్యము గెంపుపానకం
బిచ్చగ నామనిన్ దొరకేనేని మసీదులు గుళ్ళ దాస్యమున్    
మెచ్చక ముక్తులై సుఖము మీరం జరింతురు జాగరూకులున్ 

అల్లసాని పెద్దనకూడా ఇదేభావాన్ని'నిరుపహతి స్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడెము' అంటూ ఇంకో రకంగా చెబుతాడు. మంచి కవిత, కవి లోపలనుంచి పెల్లుబికి రావడానికి అనుకూల పరిస్థితులను పెద్దన వర్ణించాడు.అల్లసాని పెద్దనలాగా ఖయ్యాం కవిత్వాన్ని చెప్పాలని కోరుకోలేదు. అలాంటి రమణీయ వాతావరణంలోని ఆనందాన్ని ఆస్వాదించడాన్ని మాత్రమె అతను కోరుకున్నాడు.

ఉన్నతభావ సంప్రేరితులైన కవులు, నేలబారు మనుషుల సన్నిహితత్వాన్ని భరించలేరు.మోటుభావాలు సున్నితమైన కవిహృదయానికి  జుగుప్సను కలిగిస్తాయి. హంస మానససరోవరం లోనే విహరిస్తుంది గాని బురద గుంతలో క్షణమైనా ఉండలేదు.బురదగుంతలో పంది మాత్రమే ఉంటుంది.ఒమర్ ఖయ్యాం ఎప్పుడూ సరససల్లాప మాధుర్యంతో కూడిన మనోహర కవితా వ్యాసంగాన్నే కోరుకున్నాడు. మధువు ఎలాగూ పక్కనే ఉంటుంది. దానిని అందించడానికి నెచ్చెలి సాకీ ఉండే తీరాలి. చక్కని సంగీతం వీనులవిందు చేస్తూ ఉండాలి. చల్లని గాలి చెట్లమీదనుంచి వీస్తూ ఉండాలి. ఏకాంతమైన వనవాటిక వసంతశోభలో కనువిందు చేస్తూ ఉండాలి. అలాంటి మనోహరమైన వాతావరణంలో ఆనందామృత సేవనం ద్వారా ప్రపంచపు బాధలకు అతీతుడవు కమ్మని అతను బోధిస్తాడు. తద్వారా ప్రపంచంలో అంతర్లీనంగా ఉన్న అనిత్యత్వాన్ని దాటిపోమ్మని అతను అంటాడు.అంతేగాని బాద్యతలు మరచిన వెకిలి తాగుబోతుతనాన్ని అతను ఆశించలేదు. ఈ కోణంలో చూస్తే అతనిలో ఒక తాంత్రికుడు కనిపిస్తాడు.ఒక గొప్ప సౌందర్యారాధకుడు కనిపిస్తాడు.

'వాదులు మాని నా సరస వారుణి నానుము' అంటూ, వాదనలు మాని మధువును సేవించు, దానితో సుల్తాన్ యొక్క సమస్త రాజ్యభోగమూ సాటిరాదు అని హెచ్చరిస్తాడు. 'నేటి సమ్మదము నోడకు రేపను జూదపాటలో' అన్న పాదంలో, 'రేపు చూదాంలె అని రసాస్వాదనను వాయిదా వెయ్యకు ప్రేయసీ, రేపనేది ఎన్నటికీ రాదు. గ్రహించు. ఈ జూదంలో నీవు ఓడిపోకు' అని గతంలోనుంచి వర్తమానంలోనికి మేల్కొలుపుతాడు.

'తనువు నశించి దుమ్మగుట తధ్యము, నీవు పసిడి ముద్దవా, జనులోకసారి పూడ్చి మరుసారి నినున్ బెకలించి ఎత్తగన్' నీ తనువు దుమ్ములో కలవడం తధ్యం సుమా. ఒకసారి భూమిలో పూడ్చిన తరువాత మళ్ళీ బయటకు తీసి ఉపయోగించుకోవడానికి నీవు బంగారుముద్దవు కావు. ఒకవేళ తీసినా నీవు బంగారంలాగా చెక్కు చెదరకుండా అట్లే ఉండవు కదా. ఇది గ్రహించు' -- అంటాడు.

'ప్రేయసీ, మధువును త్రాగి సుఖించమని నా నుదుటా, హృదయం తెగి పారుతున్న ప్రేమరసపానీయాన్ని గిన్నెలో నింపి అందివ్వమని నీ నొసటా లిఖించి ఉంటాడేమో ఆ సృష్టికర్త? నీవూ మధుకలశమూ చిరకాలం వర్ధిల్లండి' అని దీవిస్తూ ఒక గొప్ప కమనీయ భావాన్ని మన కళ్ళముందు ఉంచుతాడు. సాకి గిన్నెలో పోస్తున్నది ఉత్త మధువును కాదు. తన గుండెలలోనుంచి  పొంగి పొర్లుతున్న ప్రేమరసాన్ని ఆ పాత్రలో నింపుతున్నది --అని భావిస్తాడు. ఆ ప్రేమ మత్తులో తన్మయుడౌతాడు.  

చెలియరో నిన్ను నన్ను విరచించిన యప్పుడు సృష్టికర్త ముం 
దల లిఖియించేనేమో సురంద్రావి సుఖింపగనాకు, హృత్తటం
బులు దెగిపారు ప్రేమరసపూరము గిన్నెల నింప నీకు నా 
శలు ఫలియింప మద్య కలశంబును నీవు చిరంబు వెల్గుతన్

'ఓ నెచ్చెలీ, జీవితము పాదరసం లాంటిది. అది పట్టుకుందామంటే చిక్కదు. త్వరగా పరిగెత్తి పోతున్నది. నా చిత్తమేమో అనుతాపంతో మండుతోంది. కళ్ళు తెరిచి, లేచివచ్చి, ద్రాక్షారసాన్ని నా చేతికి అందించు'-- అని సాకీని పిలుస్తాడు.ఏం తను గ్లాసులో పోసుకోలేడా అని అనుమానం రావచ్చు.తను పోసుకుని త్రాగితే ఆ మాధుర్యం రాదు.ప్రేయసి చేతితో ఇస్తేనే దానికి మాధుర్యం వస్తుంది.ఖయాంకు కావలసింది ఉత్త మధువు కాదు.దానిని అందించే సాకీ ప్రేమ అతనికి కావాలి.ప్రేమ కలసిన మధువు అతనికి కావాలి.

'నా మాట నమ్ము. నేను అబద్దం చెప్పడం లేదు. 'నశ్వరమైన ఈ స్థితిం దెలియుమ ఈ క్షణం బెరవు దెచ్చిన సొమ్మని' ఈ క్షణం అనేది అప్పు తెచ్చిన సొమ్ము. ఇది నీ సొంతం కాదు. సొంతం అనుకుంటున్నావా అది నీ భ్రమ. ఈ భ్రమలోనుంచి లే. కాలం శాశ్వతం కాదు. 'జారబుచ్చినం గలికి మరెప్పుడిట్టి తరి గ్రమ్మర రాదు' అంటూ ' ఈ క్షణాన్ని జారవిడుచుకున్నావా మళ్ళీ ఈ అవకాశం నీకు దొరకదు. తెలివి తెచ్చుకో' అని బోధిస్తాడు.

జీవితంలో ఏ క్షణమూ మళ్ళీ తిరిగిరాదు. అలాగని ఏ అనుభవమూ శాశ్వతమూ కాదు. క్షణక్షణం తరిగిపోతున్న కాలాన్ని ఒడిసి పట్టుకోవాలనే అందరి తాపత్రయమూనూ. కాని ఈ ప్రయాసలో నెగ్గినవారెవరు? ఈ పోరాటంలో కాలాన్ని గెలిచినవారెవరు? కాలం ఎవరి మాటైనా వింటుందా? ఎవరికైనా లొంగుతుందా? అనుభవం ఎవరికైనా శాశ్వతంగా చేతిలో నిలుస్తుందా? ఈ విచిత్రపరిస్థితిలో శాశ్వతసుఖమనే గమ్యాన్ని చేరేవారెవరు? ఈ నశ్వర లోకంలో అసలది సాధ్యమేనా?

ఈ ఆలోచనల్లో మునిగి సాకీ విచారంగా ఉంటే ఆ విచారాన్ని వదలి ఈ క్షణాన్ని ఆస్వాదించమని పిలుస్తాడు. 'తలచెదవేల నిన్నటి వెతల్, మరి ముదంబు గూర్ప రమ్మెలమిని బచ్చబైల సెలయేటి తటాల బచారు సేయగన్' నిన్నటి బాధలు వదలిపెట్టు, నేటి ఆనందాన్ని ఆస్వాదించు, పచ్చిక బయళ్ళలో సెలయేటి ఒడ్డున పచార్లు చేద్దాం రమ్మని' సాకీని ఆహ్వానిస్తాడు.

'ఈ జీవితమనే ఆకసంలో ఇంకొక తార మరుగైపోయింది. మన ఇద్దరి జీవితాలలో మరొక్క రోజు చేజారిపోయింది. ఇక ఆలస్యం చెయ్యకు. కాలం శీఘ్రంగా పరుగెత్తుతున్నది. నిన్న గతించింది. రేపు వస్తుందో లేదో ఎవరికి తెలుసు? నేడు నీ చేతిలో ఉన్నది. ఆ నేటిని నీ చేతిలోనుంచి జారనీయకు. జారనిస్తే తరువాత బాధపడతావు సుమా' -- అన్న చేదు వాస్తవాన్న చేదు పానీయంలా గొంతులో పోస్తాడు.

జీవితం విచిత్రంగా పయనిస్తున్నది. ఈ క్షణభంగురమైన జీవితంలో ఒక్క క్షణమైనా నీ మనసుకు నచ్చినవారితో ఆనందాన్ని పొందితే ఇక అంతకంటే కోరదగినది ఏముంది? ' మధుపాత్రిక నందియిమ్ము సాకీ వివరించెదేల తిలకింపని రేపును రేయి జారెడిన్'. ఒకనాటి రాత్రి ఖయాం,సాకీ సాంగత్యంలో కాలాన్ని మరిచాడు. రేయి అనుక్షణమూ చేజారిపోతున్నది అన్న చింతలో సాకీ అన్యమనస్కంగా ఉన్నది. ఖయాం అది గమనించాడు. 'రేపటి గురించి ఆలోచన ఎందుకు ప్రేయసీ? ఈ క్షణాన్ని ఆస్వాదించు. వర్తమానంలోని అమరత్వాన్ని గుర్తించు.మధుపాత్రను అందివ్వు.వచ్చి నా కౌగిలిలో ఒదిగిపో.' -- అని ఒక జెన్ సాధువులా అంటాడు. వర్తమానాన్ని ఆస్వాదించమని ఉద్బోదించడంలో అతనిలో ఒక జెన్ మాస్టర్ దర్శనమిస్తాడు.

'రేయి ఆగిపోనీ రేపు ఆగిపోనీ' అని ఆనంద తన్మయత్వంలో కలవరించని ప్రేమికులు ఈ లోకంలో ఎవరుంటారు? ఉండరు. కాని వారికోసం రేయి ఆగదు. రేపూ ఆగదు.ఈ ప్రపంచంలో ఏదీ ఎవరికోసమూ ఆగదు. ఇక్కడ ఎంతటి ఆనందమైనా క్షణికమే. అసలు ఆస్వాదనమే క్షణికం. మరి జీవితమో? అనుక్షణికం. ఒకవేళ ఆనందం శాశ్వతంగా నిలిస్తే  తట్టుకుని భరించగలిగే మనిషి ఈ లోకంలో ఉన్నాడా? లేడు. అందుకే ఏ ఆనందమూ శాశ్వతం కాదు. అలాగని క్షణికమూ కాదు. అనుభవం క్షణికం. జ్ఞాపకం నిత్యం. జారిపోయే అనుభవానికీ, మాసిపోని జ్ఞాపకానికీ మధ్య సంఘర్షణే జీవితం. 

ఖయ్యాం పెళ్లి చేసుకోలేదని, అతనికి పిల్లలు లేరని చరిత్ర కారులు వ్రాశారు. దానికి నిదర్శనంగా అతని జాతకంలో కొన్ని రుజువులు మనకు లభిస్తాయి. సప్తమాధిపతి అయిన కుజుడు ద్వాదశంలో ఉండటమూ, శుక్రుడు  వక్రించి  లగ్నంలో ఉండటమూ, పంచమంలో రాహువూ కలిసి ఇది వాస్తవమే అని చెబుతున్నాయి. ఇతనికి రాహుదోషం ఉన్నది. అందుకే సంతానలేమి వచ్చింది. అయితే నిరంతర జ్ఞానపిపాసి, అన్వేషి అయిన ఇతడు పెళ్లి,పిల్లలూ వంటి బంధాలను పెట్టుకోదల్చుకోలేదని కొందరు అభిప్రాయపడ్డారు. జీవితంలోని పరమార్ధాన్ని వేదకాలని అనుకునేవారికి ఇవి బంధాలుగానే తోస్తాయి. ఇది చాలావరకూ నిజం కూడా. మనిషి జీవితంలో సగం, పెళ్లి చేసుకోవాలని కలలు కనడంలోనూ, మిగిలిన సగం ఎందుకు చేసుకున్నానని చింతించడంలోనూ గడుస్తుందని ఒక తాత్వికుడు అంటాడు. వెరసి అతని జీవితం కలల్లో వృధాగా గడచి చివరకు మట్టిలో కలిసిపోతుంది.

'రంభను తలదన్నే వనితలు ఇక్కడే ఉండగా మరణం తర్వాత స్వర్గంలో రంభాదుల పొందును కోరుకుంటావా పిచ్చివాడా' అని ఖయ్యాం ఆక్షేపిస్తాడు. 'చేత వెన్నవిడి నేతికి బోదురు మూఢమానవుల్' -- 'చేతిలో వెన్న ఉంచుకొని నేతికోసం ఎక్కడో తిరుగుతావెందుకు మూర్ఖుడా' అంటాడు. అన్ని మతాల గమ్యమూ మరణం తర్వాత స్వర్గలోకంలో అప్సరసల సాంగత్యంలో భోగాలు అనుభవించడమే. ఇస్లాంలో అయితే ఈ పిచ్చి మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి ఎడారి దేశాలలో పచ్చబయళ్ళు ఉండవు. నదులు ఉండవు. జలపాతాలు ఉండవు. ద్రాక్షతోటలు ఉండవు. ముసుగులు కప్పుకోకుండా అందాన్ని చూపించే మదవతులూ ఉండరు. 

కనుక ఇవన్నీ బాగా ఎక్కువగా దొరికే స్వర్గాన్ని వారు ఊహించుకున్నారు. ఈలోకంలో ఎవడికి ఏది దుర్లభమో దానిని స్వర్గంలో ఊహించుకోవడం మనిషి బలహీనత. బతికి ఉన్నప్పుడు ఖురాన్ లో చెప్పినట్లు నడుచుకుంటే చచ్చిన తర్వాత స్వర్గం ఖాయం అన్న పిచ్చి నమ్మకాలు వారికున్నాయి. స్వర్గంలో ఏముంటుంది? అక్కడంతా ఫ్రీ సర్వీసే. అక్కడ డబ్బు అనేది ఉండదు,ముసలితనం రాదు,చావు రాదు.చల్లని ఎయిర్ కండిషన్ వాతావరణంలో, పార్కులూ, బార్లూ, రోగాలు లేని దేహాలూ,అన్ని సుఖాలను అడిగినప్పుడల్లా సమకూర్చడానికి, ఒక్కొక్కరికి  74 మంది అప్సరసలు చొప్పున వీరి సేవలకై వేచి ఉంటారు. భూమ్మీద దొరకని సమస్తసుఖాలూ అక్కడ అందుబాటులో ఉంటాయి.మనిషి ఊహలు ఇలా ఉంటాయి. మనిషి అత్యాశకు ప్రతిరూపమే స్వర్గం. భయానికి ప్రతిరూపం నరకం.

నాకొక ముస్లిం శిష్యురాలు ఉంది. ఆ అమ్మాయితో ఒకసారి వాళ్ళ స్వర్గం గురించి నరకం గురించి చర్చిస్తూ ఇదే చెప్పాను. మీ మతంలో ఆడవాళ్లకు 'ఆత్మ' ఉండదు. మీ మతం ప్రకారం ఆ టేబిల్ ఎంతో ఒక ఆడదీ అంతే. స్త్రీ ఒక వస్తువుతో సమానం. కనుక మీకు స్వర్గమూ నరకమూ ఉండవు. మతాన్ని  తూచా తప్పక పాటించిన మీ మగవారికి మాత్రమె స్వర్గం వస్తుంది. వారికి మాత్రం ఒక్కొక్కరికి 74 మంది అమ్మాయిలు అక్కడ సిద్ధంగా ఉంటారు అని చెప్పాను. 'మరి చచ్చిన తర్వాత మేము ఏమౌతాము? మాకు స్వర్గం ఉండదా?' అని ఆ అమ్మాయి అడిగింది. 'నాకు తెలీదు. బహుశా మీరంతా ఆ అమ్మాయిల గుంపులలో కలుస్తారేమో' అని జవాబిచ్చాను.

ప్రతి మతంలోనూ మగవాడు చచ్చి స్వర్గానికి పోవడమూ అక్కడ ఆడది అతనికి సేవలు చెయ్యడానికి సిద్ధంగా ఉండటమూ ఇదే వరస. భూమ్మీద చేసే సేవలు చాలక ఇంకా స్వర్గంలో కూడా ఆడదే మగవాడికి ఊడిగం చెయ్యాలి. పైగా ఒకటి సరిపోక 74 మంది కావాలి. మగవాళ్ళు ఊహించే స్వర్గం ఇలాగే ఉంటుంది గామోసు. అదే ఆడవారు పురాణాలు వ్రాస్తే వాళ్ళ స్వర్గాలు ఖచ్చితంగా వేరేగా ఉంటాయి. సరే ఆ సంగతి అలా ఉంచుదాం.

అతి నియమనిష్టలు పాటిస్తూ మహాభక్తులలాగా నటించేవారిని చూచి ఖయాం నవ్వుతాడు. 'మీ నియమనిష్టలన్నీ 'రంభ' కోసమేగా? ఆ రంభలు ఈ లోకంలోనే ఉన్నారు. వారిని వదిలి ఎప్పుడో దొరికే రంభకోసం ఇప్పుడు ఉపవాసాలు ఉండి ప్రార్ధనలు చేస్తావెందుకు పిచ్చివాడా?' అని నవ్వుతాడు. నిజమైన యోగికి రంభతో పనిలేదు. 'యోగికేల రంభ యోగహర్షంబుండ' అని వేమన అంటాడు.నిజానికి,కామచక్రమైన స్వాధిష్ఠాన చక్రాన్ని జయించగలిగి నప్పుడు యోగికి తన శరీరంలో కలిగే 'ధ్రిల్' ముందు ఎంతమంది రంభల పొందూ సరిపోదు. 

కాని ఒమర్ మాత్రం 'సురన్ ద్రావి సుందరీమణుల పొందున సుఖము నొందుమో సరసుడ భయమిసుమంతయున్ లేదు, దైవంబు కడు కరుణాంతరంగుడా బాపములెల్లను దుమ్ముజేయు నొక్కనిమేష మాత్రమున్'-అని ధైర్యాన్ని నూరిపోస్తాడు.'దేవుడు కరుణామయుడు.నువ్వు చేసే పాపాలన్నీ ఒక్క క్షణంలో భస్మం చెయ్యగలడు. ఏం పరవాలేదు. నీవు సుఖించు.' అని చెబుతాడు.

'మీరు నాకు తాగుబోతు అని ముద్రవేశారు. సరే ఒప్పుకుంటాను. కాని మీ స్వర్గంలో ఏమి జరుగుతుందో కాస్త చెప్పండి. అక్కడ ఉండేది ఇదేగా? కాదా?' అని ప్రశ్నిస్తాడు. వారేమి చెప్పగలరు? వారి మతగ్రంధాల ప్రకారం ఖయాం చెబుతున్నది వాస్తవమే. తాగితే నరకం ప్రాప్తిస్తుందని నన్ను భయపెట్టకండి. మీ స్వర్గంలో అందరూ చేసే పని ఇదేగా? మరి వారికి నరకం రాదా? అని ఎదురు ప్రశ్నిస్తాడు. 'త్రావిన నిరయము దప్పదన్న మరిమీ సురలోకము పాడుగాదోకో?' అన్న ప్రశ్నకు ఎవరు జవాబు ఇవ్వగలరు? 

సురాపానాన్ని అనేక రకాలుగా ఖయ్యాం సమర్దిస్తాడు. 'మానవ సంఘ రక్తమున్ ద్రావెదవీవు ద్రాక్షఫల రక్తము నింపగు మాకు నెన్నగన్' అంటూ 'ఒరే దుర్మార్గుల్లారా, సమాజపు రక్తాన్ని జలగల్లాగా పీలుస్తున్న మీరా నాకు నీతులు చెప్పేవారు? మీకు మనిషి రక్తం అంటే ఇష్టం. నాకు అంత ఆశ లేదు. ద్రాక్షఫలరక్తంతో నేను సరిపెట్టుకుంటాను. మీరు రక్తపిశాచాలు. నేను మీలాంటి కసాయిని కాను.' అంటూ చమత్కరిస్తాడు.

త్రాగడం తప్పు అని నీతులు చెప్పే దొంగభక్తులకు ఖయాం చక్కని జవాబిస్తాడు. 'మధువు సైతాన్ యొక్క రక్తం. దాని జోలికి పోకూడదు'- అని వారు చెబుతారు. దానికి ఖయాం ' అందుకే వాడి రక్తాన్ని తాగుతున్నాను. శత్రువును చంపి అతని రక్తాన్ని తాగడం వీరధర్మం కదా? సైతాన్ని చంపి వాడి రక్తాన్ని తాగడం ద్వారా నేను దైవానికి దగ్గరౌతున్నాను' అని వారిని నిరుత్తరులను చేస్తాడు. 'ధర్మశత్రుసంహారము శాస్త్రసమ్మత మౌనని చెప్పరె పండితోత్తముల్" అంటూ, ద్రాక్షపండ్ల మీద 'జిహాద్' ప్రకటించమంటాడు.  

పూలను చూచి మురియని మానవుడుండడు. జీవితాన్ని పూలతో పోల్చుతాడు ఖయ్యాం.' ఓ సాకీ ! సుమముల వలె మన జీవితాలు కూడా ఒకటి రెండు నాళ్ళే ఉంటాయి. కనుక వాటివలె ఉన్నన్ని రోజులు ఆనందంగా నవ్వుతూ ఉందాం. తర్వాత ఏమౌతుందొ ఎవరికీ తెలుసు? ' ఎవరైనను వచ్చినారె మున్ను దివి కేగిన పూర్వయాత్రికుల్' అంటూ ఇంతకుముందు గతించిన వారు ఒక్కరైనా తిరిగి రావడం నీవు చూచావా? లేదుకదా. ఇక ఇతర చింతలెందుకు? 'బంగరు సరకంబునన్ మదిర గమ్మగ నానుము నిర్విచారతన్' బంగారు పాత్రలో మధువును నిశ్చింతగా గ్రోలి ఆనందంగా ఉండు. ఇంతకంటే నీవు చెయ్యగలిగింది ఈ లోకంలో ఏమీ లేదు. అంటాడు.

మనిషి జీవితం కూడా పువ్వు వంటిదే. విరబూసి కొన్నాళ్ళు పిల్లగాలులలో నవ్వుతూ తలూపుతుంది. తర్వాత రాలి మట్టిలో కలిసిపోతుంది. కనుక ఉన్నన్నాళ్ళు పూలలాగా ఆటపాటల్లో ఆనందంగా కాలం గడుపు 'మన ప్రియజీవితంబు కుసుమంబుల పోలికం చంచలంబు గావున బువులట్లు కాలము బుత్తము నాటపాటలన్' అంటాడు.

'పూలు రాలినట్లే మన జీవితాలు కూడా నేలరాలక పూర్వమే రసానందఝరిలో మైమరచి సుఖించు' అంటూ ఉద్బోదిస్తాడు. 'పిల్లగాలుల కౌగిలిలో పులకించి గులాబి ఎలా సువాసనను చిమ్ముతున్నదో చూడు. బుల్బుల్ పిట్ట నవ్వుతున్న పూలలోని మకరందాన్ని గ్రోలి మైమరుస్తున్నది. ప్రకృతిని చూచి ఏమి నేర్చుకున్నావు నీవు? మనిద్దరమూ నేలరాలక పూర్వమే వచ్చి పాత్రను నింపి అందిమ్మని తన కౌగిలిలోకి ఆహ్వానిస్తాడు. ఒక అద్భుతమైన పద్యాన్ని మనకు అందిస్తాడు.

కమ్మని పిల్ల తెమ్మెరల కౌగిళులం బులకించి వాసనల్ 
చిమ్ము గులాబి; బుల్బులి హసించు సుమంబుల రామణీయకం 
బిమ్ముగ గ్రోలి మైమరచు; నేల విలంబము? పాత్ర నింప రా
రమ్ము లతాంగి, ఇద్దరము రాలక పూర్వమె పూలపోలికన్
    
ప్రేయసి ఒకని కోసం వనంలో వేచి ఉన్నది. ఇతడేమో ప్రార్ధనలో ఉన్నాడు. ఖయ్యాంకు కోపం వస్తుంది. అతన్ని తిడతాడు.' సుందరి హృదయానుసారిణి వనంబున నీకయి వేచియుండ నీ తరుణంబునన్ సుఖింపక వృధా పరచింతనలేల మర్త్యుడా?' అని ప్రశ్నిస్తాడు.'ఓరే మూర్ఖుడా ! నీవు ఇక్కడ శాశ్వతం కాదు. ఎంతగా ప్రార్ధించినా ఎంతగా పరచింతనలో మునిగినా నీవు ఇక్కడ ఎల్లకాలం ఉండవు. నీవు వెతుకుతున్న అమరత్వం నీకు దొరకదు. దేవుడు నీకు కనిపించడు. అసలు నీ ప్రార్ధన వింటున్నాడో లేడో కూడా తెలియదు. కనుక ఎందుకు నీ సమయాన్ని ధ్యానంలో వృధా చేసుకుంటావు. నీ ప్రేయసి నీకోసం వనంలో వేచి ఉన్నది. పోయి ఆమెతో సుఖించు. నీ అశాశ్వత జీవితానికి ఇది చాలులే. ఇక నీ ప్రార్ధనలు చాలించు. కనిపించని దైవం కంటే కనిపించే నీ ప్రేయసి మిన్న కాదా?' -- అంటాడు.

'విరక్తిభావాలు నావద్ద చెప్పకు. అవి రసహీనములు. మూడునాళ్ళ ముచ్చట అయిన ఈ జీవితంలో విరక్తి మాటలెందుకు?  ప్రకృతి అంతా నిండుగా తయారై మధురమైన పూర్ణత్వాన్ని, ఆనందాన్ని వ్యక్తీకరిస్తుంటే నీవు నీరసంగా విరక్తి భావాలలో ఎలా కాలం వెళ్ళబుచ్చగలవు? నీవు ప్రకృతి కంటే తెలివైనవాడవా? లేక ప్రకృతి తెలివిలేనిదా?' అని ప్రశ్నిస్తాడు. 'ఈ ప్రకృతి వన్యపధంబుల బూలపండువుం జులుప నుపక్రమించె, విరసంబగు శుష్క విరక్తి మార్గముల్ పలుకకు. మూడునాళ్ళ ముచ్చట గదా మన మురిపెంబు' అంటాడు.

చెలి కనిపించక విరహతప్తుడై 'చెలియ, మనోహర ప్రణయశీతలతన్ సుఖియించు నామనం బలమటతో దపించు నకటా భవదీయ వియోగ కీలలన్' చల్లని నీ ప్రణయంలో సుఖంగా ఉన్న నా మనస్సును ప్రస్తుతపు నీ వియోగమనే అగ్నిజ్వాల కాలుస్తున్నది. 'ప్రాణముల్ త్వదంఘ్రుల విడిపింతు రమ్ము బ్రతుకున్ నిలబెట్టేద నిట్టి యాసలన్' నిన్ను ఒక్కసారి చూచి నా ప్రాణాలను నీ పాదాల దగ్గర వదలాలనే కోరికతోనే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. అంటూ చమత్కరిస్తాడు మధుర ప్రేమికుడైన ఖయ్యాం.     

వలపుల దివ్వె నీమృదుల పాదలతాంతము ముద్దు గొందు, న
న్యల మధురాధరంబులయినం దులతూగవు దానితోడ, రా
త్రుల సహవాసకామినయి రోసియు నిన్ గనలేక భగ్నవాం
చలం జివురించు లజ్జ పెలుచం బవలెల్లను బుత్తు దీనతన్.     

'నీ మృదువైన పాదమనే లతను ముద్దిడాలని నా కోరిక. నీ సుకుమార పాదాలతో ఇతర భామినుల పెదవులు కూడా సాటిరావు. రాత్రులు నీకోసం వేచిఉండటంతో సరిపోతున్నది. కాని నీవు కనిపించవు. రాత్రంతా నీకోసం ఎదురుచూచి, చెదరిపోయిన భగ్నవాంఛలనుంచి పుట్టిన సిగ్గుతో పగలంతా దీనుడనై కాలం గడుపుతున్నాను.నీకు తెలియటంలేదా?' అని బాధపడతాడు.

ఖయ్యాం కామాతురుడు కాదు. అతనొక సున్నిత మధురప్రేమికుడు. లలితమైన ఆ భావాన్నే ఈ పద్యంలో ప్రకటిస్తాడు.

అయితే తాగడాన్నీ, ప్రియురాళ్ళతో తిరగడాన్నీ ఖయ్యాం సమర్ధించాడా? ఇదేమి తత్వచింతన? ఇదేమైనా గొప్ప ఫిలాసఫీనా? ప్రతి వెధవా చేసే పని ఇదే కదా? అన్న అనుమానం చాలామందికి వస్తుంది. ఖయాం యొక్క బహుముఖ ప్రతిభ తెలియకపోతే ఇలాంటి అనుమానాలు వస్తాయి. అందుకే అతని బ్యాక్ గ్రౌండ్ మనకు ముందుగా తెలియాలి. అతను ఏ కోణంలో దేని గురించి మాటలాడుతున్నాడో తెలియాలి.అప్పుడే అతను సరిగ్గా అర్ధమౌతాడు. 

అతని మీద ప్రాచీన గ్రీక్ తత్వవేత్త 'ఎపిక్యూరస్' భావాలున్నాయని కొందరు అన్నారు. కాని వారనుకున్నట్లు అతను నాస్తికవాది కాదు. లోకాయత చార్వాకుల లాగా 'ఈ లోకమే సత్యం, పరలోకం లేదు, ఏదో రకంగా భోగాలు అనుభవించు' అని చెప్పిన నాస్తికుడూ కాదు. అందుకే ఇతన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.

ఖురాన్ లో అతను మంచిపండితుడు, రాజులకు సలహాదారు, వారి మత సమస్యలనూ అనుమానాలనూ తీర్చిన మౌల్వీ. దానికి తోడూ సైన్స్ పరిజ్ఞానం ఉన్న మంచి దార్శనికుడు. గ్రీక్ తత్వశాస్త్రాలే కాక, ఆల్జీబ్రా జ్యామెట్రీ, ఆస్ట్రానమీ లలో మంచి దిట్ట. అతను వయసులో ఉన్నపుడు మంచిమంచి గురువుల దగ్గర విద్యనభ్యసించాడు. 'ఉత్తమోత్తమ గురుల శిష్యుండనైతి, గురువునైతిని సచ్చిష్య కోటులకును' అంటూ తనగురించి తానె చెప్పుకున్నాడు. అటువంటి పండితుడూ తాత్వికుడూ చవకబారుగా తాగుడునూ తిరుగుడునూ సమర్దిస్తాడా? అసంభవం. అలాంటి భావాన్ని  అసలు ఊహించలేము. కనుక అతను చెబుతున్న దానిలో ఏదో మార్మికార్ధం ఉన్నది అన్న సంగతి వెంటనే స్ఫురిస్తుంది.

మధ్యయుగపు జ్ఞానులందరూ మార్మికభాషలో మాటలాడినవారే. ఎందుకంటే ఉన్నతమైన భావాలను వచనంలో చెప్పలేము.దానికి కవిత్వధోరణి అవసరం. జ్ఞాని, కవి కూడా అయినప్పుడే అతడు తన అనుభూతిని మాటల్లోకి కొంతైనా తేగలడు.లేకుంటే అతడేమీ చెప్పలేడు.మౌనంగా ఉండిపోతాడు. అయితే కవికీ జ్ఞానికీ భేదం లేదా? అంటే ఉన్నది అనే చెప్పాలి.కవి ఇంద్రియాల పరిధిలో అనుభవించి, తన అనుభవాన్ని మాటల్లోకి తెస్తాడు. అయితే అతను సామాన్యజనం కంటే కొంత ఉదాత్తస్తితిని అందుకోగలడు.మామూలు మనుషులు రోడ్డుమీద నడిచేవారు. కవి ఒక అయిదు అంతస్తుల భవనం ఎక్కగలడు. కాని జ్ఞాని, మేఘాలు దాటి శూన్యాకాశంలోకి దూసుకుపోగలడు. అదీ తేడా. జ్ఞాని ఇంద్రియపరిధిని దాటి పోగలడు. అక్కడ ఏముందో దానిని కిందకు దించే ప్రయత్నం చెయ్యగలడు. కవి ఆ పని చెయ్యలేడు. అందుకే కవికూడా జ్ఞాని పాదాలవద్ద మోకరిల్లవలసిందే.

ఆ కాలంలోని సూఫీ సంప్రదాయాలలో, 'మధువు' అనేది దైవానుభూతి వల్ల కలిగే ఆనందానికి సూచన. 'సాకీ' అనేది సాధకుని మనస్సు. సాకీ సాంగత్యంలో మధువును తాగి మైమరచి పోవడం అంటే, ఏకాంతంలో మనస్సును అంతర్ముఖం చేసి దైవానుభూతిలో సొక్కి ఆనంద తన్మయత్వంలో మునిగి ఉండటం అని అర్ధం. ఇది సమాధి స్తితికి సంకేతం. మన తంత్రసాధనలో కూడా మద్యమూ మైధునమూ విడతీయరాని భాగాలే. ఈకోణంలో నుంచి చూస్తే అతని పద్యాలన్నీ ఒక గొప్ప ఆధ్యాత్మిక సౌరభాన్ని సంతరించుకుంటాయి. అతనిలోని సూఫీ అప్పుడు మనకు దర్శనమిస్తాడు. మార్మికులు ఇలాగే మాట్లాడతారు. వారు దేనినీ సూటిగా చెప్పరు. ఒక వేమన అయినా ఒక వీరబ్రహ్మం అయినా ఒక బసవేస్వరుడైనా  లేక తాంత్రికయోగులైనా ఎవరైనా సరే నిగూఢమైన భాషలోనే సత్యాన్ని చెబుతారు. మచ్చుకి వేమన పద్యం ఒకటి చూద్దామా.

కుక్క దిన్నవాడు గురులింగ జంగంబు 
పంది దిన్నవాడు పరమగురుడు 
ఏన్గు దిన్నవాడు ఎంత సుజ్ఞానిరా 
విశ్వదాభిరామ వినురవేమ 

ఇది చదవడంతోనే - ఏమిటీ చండాలం? ఇదా వేమన చెబుతున్నది? అనిపిస్తుంది. కాని దీనిలో గొప్ప యోగార్ధం ఇమిడి ఉంది. అసలు యోగులు దేనినైనా ఇలా మార్మికంగా ఎందుకు చెబుతారు?సూటిగా ఎందుకు చెప్పరు? అంటే, సూటిగా ఎందుకు చెప్పాలి అని ఎదురు ప్రశ్న ఉదయిస్తుంది. అన్నీ అందరికీ ఎందుకు చెప్పాలి?  మీ డబ్బును మీరు రోడ్డుమీద ఎందుకు పారబోసుకోవడం లేదు? ఇంట్లో ఎందుకు దాచుకుంటున్నారు? అని వారు ఎదురు ప్రశ్నిస్తారు. మామూలు డబ్బుకే మనిషి ఇంత విలువ ఇస్తుంటే, ఇక అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను రోడ్డుమీద ఎలా పారబోస్తాం? అది జరగని పని. 

ఆధ్యాత్మికత అందరికోసం కాదు. అది చాలా కొద్దిమంది కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ప్రపంచంలో అమూల్యమైనవి అందరికీ దక్కవు. అవి కొందరి దగ్గరే ఉంటాయి. అలాగే ఉండాలి కూడా. అందుకే అర్హత ఉన్నవారికి మాత్రమె అర్ధంకావడం కోసం యోగులు అలా మార్మికభాషలో చెప్తారు. తపన ఉన్నవాడు దానిని అర్ధం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. వాడికి అర్ధమౌతుంది. ఆ తపన లేనివాడు వారి మాటలు చదివి 'ఇదేదో సోదిలే' అని ఒదిలేస్తాడు.అలాంటి వారు యోగులకు అక్కర్లేదు.వారికి అర్ధం కాకపోవడమే యోగులకు కావాలి. కనుక అలాంటివారిని వదిలించుకోవడం కోసం సత్యాలను కావాలని మార్మికభాషలో చెప్తారు.

(సశేషం)
read more " ఒమర్ ఖయ్యాం జాతకం -4 (మధుసేవ-సాకీసాంగత్యం) "