“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

31-8-2012 పౌర్ణమి ప్రభావం

అమావాస్యా పౌర్ణమీ మనుష్యులను అమితంగా ప్రభావితం చేసేమాట అక్షరాలా నిజం. కారణమేమంటే, మానవ లోకాన్ని శాసించే రెండు ముఖ్య గ్రహాలు సూర్యుడు చంద్రుల మధ్యన ఒక ప్రత్యెక అమరిక ఆ సమయంలో ఏర్పడుతుంది. అమావాస్య నాడు వారిద్దరి కంజంక్షన్ (కలయిక), పౌర్ణమి నాడు వారిద్దరి ఆపోజిషన్(సమసప్తకం) జరుగుతాయి.కనుక ఆ రెండురోజులూ చాలా విధాలుగా మనుష్యులు ప్రభావితం అవుతారు. గమనిస్తే ఇది అక్షర సత్యం అని తేలుతుంది.

ముఖ్యంగా వీటి ప్రభావం మూడో రోజున చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి ముందు మూడు రోజులూ తర్వాత మూడు రోజులూ, ఆరోజుతో కలిపి మొత్తం అయిదు రోజులు గమనిస్తే భలే విచిత్రాలు కనిపిస్తాయి. అంతా తన చేతిలోనే ఉందని విర్రవీగే మనిషి, నిజానికి కనిపించని శక్తుల చేతిలో ఒక కీలుబొమ్మ అని, ప్రకృతి ఎలా ఆడిస్తే అలా ఆడే ఒక తోలుబొమ్మ అనీ అర్ధమౌతుంది.

మొన్న 31-8-2012 శుక్రవారం రోజున పౌర్ణమి. దానికి ఒకరోజు ముందు గుజరాత్ లో రెండు IAF హేలీకాప్టర్లు గాలిలో గుద్దుకొని 9 మంది హరీమన్నారు. మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ను రోడ్డుమీదే ఎవరూ పాటించరు. ఇక గాలిలో మాత్రం ఎందుకు పాటించాలి అనుకున్నారో ఏమో? రూల్స్ పాటించకపోవడం అనేది భారతీయ మనస్తత్వంలో ఒక భాగంగా మారినట్లుంది.

అదలా ఉంటే, వాయుయానప్రమాదాలలో వాయుతత్వరాశులు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అలాగే వాయుతత్వగ్రహం అయిన శని తన ప్రభావాన్ని అమితంగా చూపిస్తుంది. యంత్రాలకు కారకుడైన కుజుడు తన పాత్రను పోషిస్తాడు. పౌర్ణమి కనుక చంద్రసూర్యుల ప్రభావం ఎలాగూ ఉంటుంది. ప్రస్తుత ప్రమాదానికి వెనుక ఉన్న గ్రహస్తితులను గమనిద్దాం.

మిధునం,తులా,కుంభం ఈ మూడూ వాయుతత్వరాశులు. ప్రస్తుతం శుక్రుడు మిధునంలో ఉంటూ విలాస వాయువాహనాలను సూచిస్తున్నాడు. అంటే విమానాలు అని సూచన. హెలికాప్టర్ కూడా విలాస వాయువాహనమే. 

శని ఉచ్చస్తితిలో బలంగా ఉండి, ఇంకొక వాయుతత్వరాశి అయిన తులలో ఉన్నాడు. అదీగాక తన బద్ధశత్రువైన కుజునితో కలిసి ఉన్నాడు. కనుక వాయుయాన ప్రమాదాలు సూచితం.

చంద్రుడు ఈరోజున మరో వాయుతత్వరాశి అయిన కుంభంలో ప్రవేశించి అక్కడే ఉన్న నెప్ట్యూన్ తో ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లోకి వచ్చాడు. అంతేగాక తులలో ఉన్న శనితో కోణద్రుష్టిలోకి వచ్చాడు. అగ్నితత్వగ్రహమైన సూర్యుడు అగ్నితత్వరాశి అయిన సింహంలో ఉంటూ ఈ చంద్రునికి నెప్ట్యూన్ కు ఎదురుగా ఉన్నాడు.

అందుకే వాయువులో ప్రయాణం చేసే వాహనాలు (హెలికాప్టర్లు) గుద్దుకొని నేలకూలి మంటలు రేగి వాటిలో ఉన్న అందరూ సజీవ దహనం అయ్యారు. ఎయిర్ ఫోర్స్ వాహనాలకు కుజుని కారకత్వం పనిచేసింది. శనికుజుల కలయిక వల్ల ప్రేలుడు సంభవించింది.

శుక్రుడూ,శనికుజులూ,చంద్ర నెప్త్యూన్లూ ఒకరినొకరు కోణదృష్టిలో వీక్షిస్తున్నారు. దీనికి తోడు పౌర్ణమి ప్రభావం అగ్నికి ఆజ్యం పోసింది.   

ఈ గ్రహప్రభావం అనేకమంది వ్యక్తిగతజీవితాలలో కూడా పనిచేసింది.నిన్నరాత్రి దీనివల్లే నా ఆధ్యాత్మికమిత్రుడు ఒకాయన గుంటూరులో మరణించాడు. ఆయన మాస్టర్ సి.వీ.వీ. కల్ట్ కు చెందినవాడు. మాస్టర్ ఈ.కే. గారి శిష్యుడు. ఆయన ఆత్మ శాంతించుగాక అని ప్రార్ధిస్తున్నాను.

నిత్యజీవితంలో జరిగే అనేక సంఘటనలకు ఈ విధంగా గ్రహప్రభావం కారణంగా పనిచేస్తుంది.