“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, సెప్టెంబర్ 2012, శనివారం

కర్మయోగి మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) జాతకం

లోకంలో ఒక విచిత్రం మనకు ప్రతిరోజూ కనిపిస్తుంది. చాలామంది యోగం గురించి సనాతనధర్మం గురించి లెక్చర్లు ఇస్తారు.కాని వాటిని నిత్యజీవితంలో ఆచరించేవారు బహుతక్కువ   ఉంటారు.ఎందుకంటే వాటిని గురించి చెప్పడం చాలా తేలిక.ఆచరించడం మాత్రం బహుకష్టం. అందులో కర్మయోగం మరీ కష్టం.లోకంలో ఉంటూ,సమాజంతో మెలుగుతూ నిత్యజీవితంలో అనుక్షణం యోగస్తితిలో నిలిచి ఉండటమే  కర్మయోగం.స్వార్ధంతో నిండిన మనుషుల మధ్య నిస్వార్ధంగా జీవించడమే కర్మయోగం.దీనిని అనుష్టించిన వారు పురాణకథల్లో మాత్రమె మనకు కనిపిస్తారు.అలాంటివాళ్ళు ప్రస్తుతం మన మధ్యన ఉంటారా?అనుకుంటాం.ఉన్నారు.నవీనకాలంలో ఈ కుళ్ళుసమాజపు మధ్యన నివసిస్తూ కూడా ఆదర్శమయమైన జీవితాన్ని గడపి కర్మయోగాన్ని నిత్యజీవితంలో అనుష్టించిన మహనీయుల్లో ఒకరు మాధవసదాశివ గోల్వాల్కర్.రాష్ట్రీయ స్వయంసేవకసంఘ్ కు ఒక దిశనూ దశనూ కల్పించిన మహనీయుడు గురూజీ.

ఈయనను 'గురూజీ' అంటూ గౌరవంతో అభిమానంతో ప్రతి ఒక్క RSS కార్యకర్తా పిలుచుకుంటాడు. మనమూ అలాగే పిలుద్దాం. ఆ పేరుకు ఆయన నూటికి నూరుపాళ్ళూ అర్హుడు. చాలామందికి RSS అనగానే అదేదో మత సంస్థ అని అనిపిస్తుంది. ఆ సంస్థ యొక్క ముఖ్యనాయకుల గురించి వారి దేశభక్తిపూరిత జీవితాల గురించి మనకు అవగాహన లేక అలాంటి భావనలు కలుగుతాయి. అందుకే గురూజీ వంటి మహనీయుల జీవితాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన యొక్క విశిష్ట జాతకాన్నీ, ఉత్తేజకర జీవితాన్నీ పరిశీలిద్దాం.


19-2-1906 ఉదయం 4.30 గంటలకు  నాగపూర్ లో గురూజీ జన్మించారు. ఆయన జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు. విశిష్టవ్యక్తుల జాతకాలు విశిష్టంగానే ఉంటాయి.ఒక తపోమయుడైన కర్మయోగి యొక్క జాతకంలో ఉండే గ్రహస్తితులు ఇందులో మనకు కనిపిస్తున్నాయి.

లగ్నం ధనుస్సుకూ మకరానికీ మధ్య లగ్నసంధిలో పడింది. సహజ నవమస్తానానికీ కర్మస్తానానికీ మధ్యలో పడటంతో ఒక ప్రబలమైన సంకేతం వెలువడింది. కర్మరంగంలో ఉంటూ ధార్మికమైన బలంతో జీవించే వ్యక్తి జాతకం ఇక్కడ కనిపిస్తున్నది. 

కుటుంబస్థానంలోని సన్యాసయోగం వల్ల ఈయనకు సంసారపు ఖర్మ లేదని అర్ధమౌతున్నది. సప్తమాధిపతి చంద్రుడు ద్వాదశంలో చేరడం కూడా దీనికి బలం చేకూరుస్తున్నది. సుఖస్థానాధిపతి కుజుడు దానికి ద్వాదశంలో చేరడం కూడా ఇదే సూచిస్తున్నది. సప్తమంలో రాహువు యొక్క స్తితికూడా దీనినే సూచిస్తున్నది.మకరంలోని లగ్నకేతువువల్ల వైరాగ్యంతో కూడిన ఆధ్యాత్మికత సూచింపబడుతున్నది.

మంత్రస్థానంలో గురువుయొక్క స్తితితో ఉత్తమగురువువద్ద మంత్రోపదేశం పొందగలడు అని సూచన ఉన్నది.గురూజీ స్వయానా అఖండానందస్వామికి ప్రియశిష్యుడు మాత్రమేగాక స్వామియొక్క చివరిరోజులలో ఆయన దగ్గర ఉండి నిరంతరమూ ఆయనకు సేవచేసిన పవిత్రాత్ముడు.ఆయన వద్ద మంత్రోపదేశాన్ని పొందిన అదృష్టవంతుడు.  

అఖండానందస్వామి శ్రీరామకృష్ణుల ప్రధాన శిష్యులలో ఒకరని,శ్రీరామకృష్ణ సంప్రదాయపు తృతీయఅధ్యక్షుడని, ఆత్మజ్ఞానాన్ని పొందిన సద్గురువని చాలామందికి తెలియదు.అత్యున్నత బ్రహ్మానుభూతిలో నిరంతరం నిమగ్నమైన తన వైరాగ్యపూరిత మనస్సును, సోదరుడైన వివేకానందస్వామి ఆజ్ఞమేరకు కిందకు దించి, 'శివభావే జీవసేవ' అన్న మహత్తరమైన రామకృష్ణుని ఉపదేశం మేరకు తన జీవితాన్ని భరతదేశ సమాజోద్ధరణకు సమిధలా అర్పించిన మహనీయుడు అఖండానందస్వామి.ఆయన శిష్యుడవడం వల్ల గురూజీకూడా రామకృష్ణ సంప్రదాయ పరంపరలోని మహనీయుడయ్యాడు. శ్రీరామకృష్ణుని అనుగ్రహాన్ని పొందిన ధన్యుడయ్యాడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తానువాడే కమండలాన్ని తన అంత్యసమయంలో ఆశీర్వాదపూర్వకంగా గురూజీ కిచ్చారు అఖండానందస్వామి.అది చివరివరకూ గురూజీవద్ద ఉండేది. అఖండానందస్వామి గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ చూడవచ్చు.తర్వాతి పోస్ట్ లో స్వామి యొక్క మహత్తరమైన జీవితాన్ని స్పర్శిద్దాం.

గురూజీ జాతకంలో పంచమంలో ఉన్న గురువు నవమాన్నీ లగ్నాన్నీ తన ప్రత్యెక ద్రుష్టులతో వీక్షించడమే కాక, సప్తమ దృష్టితో సహజాష్టమమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు. ఈ వీక్షణ కూడా గురూజీ యొక్క నిగూఢమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తున్నది.

యువకునిగా ఉన్నపుడే తీవ్రవైరాగ్యభావాలతో నిండి రామకృష్ణమఠంలో చేరుదామని గురూజీ తలపోశారు. కాని అఖండానందుల దివ్యదృష్టికి గురూజీ భవిష్యత్తు విభిన్నంగా స్పష్టంగా గోచరించింది.భారతదేశ సమాజోద్ధరణకు తన జీవితాన్ని సమర్పించమనీ, సౌశీల్యపూరిత జీవనాన్ని గడుపుతూ,దేశభక్తిని భారతపౌరులలో నింపుతూ,ఉన్నతమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా మార్గనిర్దేశనం చేస్తూ ఒక కర్మయోగిగా జీవించమనీ ఆయన ఆదేశాన్నిచ్చారు. ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా తన జీవితమంతా గురూజీ పాటించారు.వివాహం చేసుకోకుండా ఉండిపోయి అత్యున్నత సన్యాసధర్మాలకు అనుగుణంగా ఒక కర్మయోగిగా ప్రపంచంలో జీవించారు.గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు.

లగ్నారూడం అయిన మీనంలో నవమాదిపతి అయిన కుజుని స్థితీ, పంచమంలో రాహువుయొక్క స్తితీ ఈయనకున్న ఆధ్యాత్మికస్థాయిని సూచిస్తున్నాయి.ధార్మికమైన బలాన్ని పునాదిగా ఇచ్చి,అదేసమయంలో మాతృదేశ పునరుద్ధరణకోసం బహుముఖమైన ప్రణాళికలో   జీవితమంతా విశ్రాంతిలేని కర్మరంగంలో ఆయన్ను నడిపించింది ఈ గ్రహయోగం.

శనిబుధుల కలయిక వల్ల గురూజీ జాతకంలో వైరాగ్యపూరితభావాలు దర్శనమిస్తున్నాయి.చంద్రగురువుల షష్టాష్టకంవల్ల తన జీవితమంతా అతినిరాడంబర జీవితాన్ని గడుపుతాడు అన్న సూచన కనిపిస్తున్నది. ఆయనయొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని  కళ్ళకు కట్టినట్లు చూపించే ముఖ్య ఘట్టాలనూ, గురువైన అఖండానందస్వామి యొక్క భావాలు ఆయనకు ఎలా మార్గనిర్దేశనం చేశాయో వివరించే ప్రయత్నాన్ని వచ్చే పోస్ట్ లో చేస్తాను.

(సశేషం)