నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

24, సెప్టెంబర్ 2014, బుధవారం

యుగసిద్ధాంతం-8 (జీవ పరిణామం-అంతరిక కాలసామ్యాలు)

దశావతారాలు - డార్విన్ సిద్ధాంతం
దశావతారాలను డార్విన్ సిద్ధాంతానికి అతుకు పెడుతూ వివరించాలని చాలామంది ప్రయత్నించారు.కానీ ఈ ప్రయత్నం కొంతవరకే సఫలం అయింది.

ఎందుకంటే చేపగా మొదలైన జీవపరిణామం కృష్ణావతారంతో పరిపూర్ణ మానవునిగా రూపుదిద్దుకుని అక్కడితో అంతం అవుతుంది.ఆ తర్వాత బుద్ధ కల్కి అవతారాల ప్రయోజనం ఇకలేదు.

జీవ పరిణామంలో అత్యున్నత ఘట్టం కృష్ణావతారం.దానిని మించిన పరిపూర్ణ అవతారం లేదు.ఆ తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని త్యజించి అడవులకు వెళ్లి తపస్సు చేసే బుద్ధావతారం అవసరం లేదు.ఏ అడవికీ పోకుండానే ఉన్న చోట ఉంటూనే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూనే అంతా సాధించవచ్చనీ అత్యున్నత దివ్యత్వాన్ని పొందవచ్చనీ కృష్ణావతారం నిరూపించింది.ఆ తర్వాత బుద్ధ కల్కి అవతారాల ప్రయోజనం ఏమీ లేదు.కనుక నిజం చెప్పాలంటే పరిణామక్రమం కృష్ణావతారంతో అంతమయింది.

ఏకకణజీవిగా నీటిలో మొదలైన జీవం-- చేపగా రూపాంతరం చెంది,నీటిలోనూ నేలమీదా బ్రతికే తాబేలుగా మారి,అనేక పరిణామాలు చెందుతూ అనేక రూపాలు పొందుతూ చివరకు భూమి మీద బ్రతికే సూకరం మొదలైన జీవులుగా రూపాంతరం చెంది,అక్కడితో ఆగకుండా సగం జంతువూ సగం మానవుడూ అయిన నృసింహంగా మారి అక్కడనుంచి మానవుడిగా మారి వేదజ్ఞానాన్ని పొందిన వామనుడిగా,ధర్మరక్షణ కోసం హింసకు వెనుదియ్యని పౌరుషావతారం అయిన పరశురాముడిగా,ఆ తర్వాత ధర్మస్వరూపుడైన రామునిగా,ఆపైన ధర్మాధర్మాలకు అతీతుడైన దివ్యచైతన్య స్వరూపునిగా కృష్ణావతారంతో--పరిణామక్రియలో పరిపూర్ణమౌతుంది.ఈ వివరణను ఇప్పటికే చాలామంది ఇచ్చారు.

నేను దీనికి సమాంతరమైన ఇంకొక వివరణను ఇస్తాను.ఇది మానసికమైన విషయాలకూ మానవుని మనస్సులో చెలరేగే అరిషడ్వర్గాలకూ సంబంధించిన వివరణ.

దశావతారాలు-అరిషడ్వర్గాలు

వేదాలను దొంగిలించి దాక్కున్న ఒక రాక్షసుడిని సంహరించి వేదజ్ఞానాన్ని ఉద్ధరించడం మత్స్యావతార ప్రయోజనం. అంటే అనంతమైన వేద జ్ఞానరాశిని ఎవరికీ అందకుండా ఒకచోట బంధించి ఉంచాలన్న లోభితనాన్ని తొలగించడమే ఈ అవతార ప్రయోజనం.ఇక్కడ లోభాన్ని అంతం చెయ్యడం మనకు కనిపిస్తుంది.జ్ఞానసంపదను మొత్తాన్నీ తానొక్కడే అనుభవించాలన్న లోభాన్ని దైవం అంతం చేసింది.

ప్రపంచంలోని సంపదను మొత్తం దోచుకోవాలన్న దురాశా ఆత్రమూ మనకు సముద్రమధన ఘట్టంలో కనిపిస్తాయి.ఈ కార్యానికి మళ్ళీ భగవంతుడే సహాయం చేసినట్లు కనిపిస్తుంది.అంటే ఒకటిగా ఉన్న సృష్టి అనేక విధాలుగా పరిణామం చెంది జీవులకోసం పంచబడటానికి మళ్ళీ భగవంతుని శక్తియే తోడ్పాటు నందించింది.సృష్టి నడవడానికి ఇది అవసరమైన ప్రక్రియ.అంత మాత్రాన ఎవరుబడితే వారు అన్నీ దోచుకొమ్మని కాదు.

మళ్ళీ అర్హత లేని రాక్షసులు అమృతాన్ని స్వాహా చెయ్యాలని ప్రయత్నిస్తే విష్ణువే మోహినీ రూపంలో దానిని అర్హులైన దేవతలకు మాత్రమే పంచినట్లు మనం చూస్తాం.అసలు నన్నడిగితే దశావతారాలలో మోహినీ అవతారాన్ని చేర్చాలి అంటాను.గర్వంతో మదించిన అజ్ఞానులకు మోహం రూపంలో ఆవరిస్తూ సత్యాన్ని అందకుండా చేస్తున్నది కూడా భగవంతుడే అని ఈ గాధ స్పష్టం చేస్తున్నది.కామక్రోధాది అరిషడ్వర్గాలు కూడా భగవత్స్వరూపాలే అన్న తంత్రభావనకు మూలాలు ఇక్కడ ఉన్నాయని నా ఉద్దేశ్యం.

భూమి మొత్తాన్నీ స్వాహా చెయ్యాలన్న స్వార్ధాన్ని అంతం చెయ్యడం వరాహావతారంలో కనిపిస్తుంది.అంటే ఇది అసూయనూ స్వార్దాన్నీ అంతం చేసే ప్రక్రియ.ఇక్కడ భౌతికమైన సంపదను ఇంకెవరికీ దక్కకుండా తానొక్కడే దోచుకోవాలన్న స్వార్ధాన్ని దైవం అంతం గావించింది.

భగవత్తత్వాన్ని అందుకోవాలని ప్రయత్నం చేసే భక్తునికి ఎదురయ్యే భయంకర ఆటంకాలనూ ఆపదలనూ తొలగించి అతడిని అనుక్షణమూ రక్షించే దివ్యశక్తి మనకు నృశింహావతారంలో కనిపిస్తుంది.క్రోధము, మోహము,మదముల బారినుంచి సాధకుని రక్షించే భగవత్శక్తి మనకు ఇక్కడ దర్శనమిస్తుంది.

వేదజ్ఞానం తప్ప ఇంకేమీ ఆధారం లేని ఒక వటువు ఆ జ్ఞానసహాయంతో మాయను అతిక్రమించి విశ్వరూపం ధరించి సమస్త విశ్వాన్నీ తానే నిండి ఉన్నట్లుగా 'అహం బ్రహ్మాస్మి' అన్న అనుభవాన్ని పొందిన అద్భుతమైన స్థితి వామనావతారంలో కనిపిస్తుంది.వేదజ్ఞానం యొక్క పరిపూర్ణ మహత్త్వం ఇక్కడ మనకు గోచరిస్తుంది.మాయను అతిక్రమించి విశ్వరూపాన్ని పొందిన వేదజ్ఞానపు మహత్తరమైన శక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది.

గర్వంతోనూ అహంకారంతోనూ నిండి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న పరిపాలకులను ఏకైకవీరునిగా తపశ్శక్తితో కూడిన తన సాహసంతో నిర్మూలించి మళ్ళీ ధర్మస్థాపన గావించిన అద్భుతమైన శక్తిస్వరూపం పరశురామావతారంలో మనకు గోచరిస్తుంది.ఇది గర్వాన్నీ అహంకారాన్నీ మదాన్నీ నిర్మూలించే భగవత్శక్తి.

అపరిమితమైన కామంతో నిండి,కనిపించిన అందరినీ చెరబట్టి,ధన,బల,తపో గర్వాలతో లోకాన్ని హింసించే దుష్టత్వాన్ని ఏకాకిగా ఎదుర్కొని అంతం చేసే మహోజ్జ్వలమైన ధర్మస్వరూపం మనకు రామావతారంలో దర్శనమిస్తుంది. కామాన్నీ,క్రోధాన్నీ,మోహాన్నీ,మదాన్నీ,మాత్సర్యాన్నీ అన్నింటినీ ఈ శక్తి నిర్మూలించగలదు.

బలరామ కృష్ణావతారాలలో అయితే,దేనినీ త్యజించకుండా,దేనినీ వదలకుండా,అన్నింటినీ అనుభవిస్తూ కూడా అత్యున్నతమైన దివ్యత్వాన్ని నిత్యజీవితంలో అనుక్షణమూ నిరూపించి చూపించిన మహోన్నతమైన దివ్యశక్తి మనకు కనిపిస్తుంది.అరిషడ్వర్గాలను శత్రువులుగా భావించి నిర్మూలించడం కాకుండా వాటిని తనకు అనువుగా మార్చుకుని దివ్యమైన శక్తులుగా మార్చగల అతీతమైన భగవత్శక్తి కృష్ణావతారంలో మనకు గోచరిస్తుంది.

ఈ విధంగా యుగచక్ర భ్రమణంలో ఆయా సందర్భాలలో తలెత్తే అధర్మపు ఛాయలను అంతం చేసి మళ్ళీ ధర్మాన్ని స్థాపించే విధంగా ఆయా అవతారాలు వచ్చినట్లు మనం చూడవచ్చు.

ఇదే విషయాన్ని నేను గత పోస్ట్ లలో వివరించాను.ఆ క్రమంలో యుక్తేశ్వర్ గిరిగారి యుగ సిద్దాంతాన్ని కొంచం మార్చవలసి వచ్చింది.

స్వామి యుక్తేశ్వర్ గిరి గారిని నేను చిన్నబుచ్చడం లేదు

స్వామి యుక్తేశ్వర్ గిరిగారు పొరపాటు పడ్డారని నేను వ్రాసినందుకు ఆయన అనుయాయులు కొందరు బాధపడినట్లుగా నా దృష్టికి వచ్చింది.ఇందులో నేను ఆయనను చిన్నబుచ్చినది ఏమీ లేదు.మీరు బాధపడవలసిన అవసరమూ లేదు.

యుగసిద్దాంతాన్ని సవరించే ఆయన ప్రయత్నాన్ని నేను ఇంకా ఫైన్ ట్యూన్ చేశాను.అంతేగాని ఆయన్ను నేనేమీ తక్కువ చెయ్యలేదు.నా ఈ ప్రయత్నం చూచి ఆయన ఇంకా సంతోషపడతాడే గాని బాధపడడు.ఆయన శిష్యులు చెయ్యని పనిని నేను చేశాను.దానివల్ల ఆయనకేమీ కోపం రాదు.ఎందుకంటే మహనీయులైన వారికి మనలాగా ఈగో సమస్యలు ఉండవు.సత్యం వెలుగులోకి రావడమే వారు వాంచిస్తారుగాని మనలాగా క్షుద్రములైన ఫీలింగ్స్ పెట్టుకుని బాధపడరు.

మన సాంప్రదాయాలూ మన స్కూళ్ళూ మన యోగశాఖలూ మన మతాలూ దైవసాన్నిధ్యంలో సత్యసామ్రాజ్యంలో ఏమీ పనిచెయ్యవు.అక్కడ ఈ శాఖలు ఏవీ ఉండవు.ఈ మతాలూ ఉండవు.కనుక ఆయనకేదో తక్కువ జరిగింది అన్న బాధను ఆయన అనుచరులు వదలిపెట్టండి.ఆయన ప్రయత్నానికి ఇంకా పరిపూర్ణ న్యాయం జరిగిందన్న విషయం గ్రహించండి.

ఆయన తీసుకున్న ప్రాధమిక సూత్రాలలో కూడా (Fundamental concepts) ఇంకా కొన్ని లోపాలున్నాయి.వాటిలో ఒకదానిని ఇప్పుడు స్పృశిస్తాను.

12000 సంవత్సరాలలో ఒక సగం యుగచక్రమూ ఇంకొక 12000 సంవత్సరాలలో ఇంకొక సగం యుగచక్రమూ జరిగి మొత్తం 24000 సంవత్సరాలలో ఒక పూర్ణమైన యుగచక్రభ్రమణం పూర్తి అవుతుందని ఆయన ఊహించారు.

కానీ వాస్తవం అలా లేదు.

విషువు యొక్క తిర్యక్చలన గతి (rate of precession of exinoxes) ఏడాదికి 50 సెకండ్లని నేడు మనకు తెలుసు.అలాంటప్పుడు మొత్తం రాశి చక్రాన్ని చుట్టిరావడానికి అయనానికి ఎంత సమయం పడుతుంది?

రాశి చక్రానికి 360 డిగ్రీలు.

ఒక డిగ్రీకి 60 నిముషాలు.

ఒక నిముషానికి 60 సెకండ్లు.

కనుక 360x60x60 సెకండ్ల రాశిచక్ర పరిభ్రమణానికి ఎంత సమయం పడుతుంది?

=360x60x60/50

=25,920 సంవత్సరాలు పడుతుంది.

అంటే గ్రహాలతో కూడిన రాశిచక్రం ఒక పూర్తి పరిభ్రమణాన్ని విశ్వంలో చెయ్యడానికి 25,920 సంవత్సరాలు పడుతుంది.

కానీ స్వామి యుక్తేశ్వర్ గారు దీనిని 24,000 గా తీసుకున్నారు.ఇక్కడ ఒక పెద్ద తప్పు దొర్లింది.1920 సంవత్సరాల తేడా వచ్చింది.ఇలా తీసుకోవడానికి ఆయన మనుస్మృతిని ప్రమాణంగా తీసుకున్నారు.మనుస్మృతి మాత్రమే కాదు.భారత భాగవతాది అనేక పురాణాలలో కూడా ఇది 24000 గానే వ్రాయబడింది.కనుక ఆయన తీసుకున్నది సరియైనదే.మరి వాస్తవం దీనిని భిన్నంగా ఉన్నది కదా.దీనిని సరిదిద్దడం ఎలా?

ఎలాగంటే,విశ్వాంతరాళంలో విషువు యొక్క చలనగతి స్థిరంగా లేదు.అది కూడా కాలగతిలో మారుతూ ఉంటుంది.ఇంకొక విధంగా చెప్పాలంటే విషుచలన గతి సరళరేఖలో లేదు.అది ఒక హైపర్ బోలా వలె ఉంటుంది.ఒక గడియారపు లోలకం మాదిరిగా రెండువైపులా ఒక పరిధిని అందుకొని మళ్ళీ క్రిందకు వస్తూ ఉంటుంది.రెండువైపులా ఉన్న ఈ పరిధుల సరాసరి మాత్రమే 24000 గా ఉంటుంది.కనుక మన గ్రంధాలలో చెప్పబడినది సరాసరి మాత్రమే.స్వామి యుక్తేశ్వర్ గారు కూడా దీనినే స్వీకరించారు.కోట్ల సంవత్సరాల కాలగమనంలో దీనివల్ల వచ్చే దోషభేదం చాలా స్వల్పంగా లెక్కించలేనంత అల్పంగా ఉంటుంది.కనుక దానిని  24000 గా చక్కగా తీసుకోవచ్చు.

దీనివల్ల ఇంకొక విషయం కూడా అర్ధమౌతున్నది.

యుగచక్ర పరిభ్రమణం 24000 సంవత్సరాలుగా ఉండాలంటే, విషుచలన గతి ఎంత ఉండాలి?

=360x60x60/x=24000
x=360x60x60/24000
=54 సెకండ్లు

సూర్యసిద్ధాంతంలో కూడా అయనచలన గతి 54 సెకండ్లు గానే చెప్పబడింది. ఇది ప్రస్తుతం 50.33 సెకండ్లుగా ఉన్నది.కనుక వెనక్కు లెక్కిస్తూ,దీని విలువ 54 సెకండ్లు ఎప్పుడైతే ఉన్నదో ఆ సమయంలో ఈ లెక్కలన్నీ వెయ్యబడినట్లుగా మనం నిర్ధారించవచ్చు.లేదా సిద్ధాంత కర్తలు అయనచలన సరాసరిగా 54 ను తీసుకుని ఉంటారనీ అనుకోవచ్చు.

మన్వంతరం-71+  సంవత్సరాలు-యోగసమన్వయాలు

ఇప్పుడు మన్వంతరాల లెక్కను కొంచం చూద్దాం.

ఒక ఏడాదిలో 50 సెకండ్లు అయనచలనం ఉంటుంది.

72 ఏళ్ళలో ఎంత అవుతుంది?

72x50=3600 సెకండ్లు ఉంటుంది.

=రాశి చక్రంలో ఒక డిగ్రీ

కనుక రాశిచక్రంలో ఒక డిగ్రీ భాగాన్ని అయనచలనం దాటే సమయాన్ని ఒక మన్వంతరం అని అన్నారు.బ్రహ్మదేవుని ఒక పగటి సమయంలో 14 గురు మనువులు ఉంటారని చెప్పారు.అధికభాగాన్ని లెక్కలోకి తీసుకుంటే 15 అనుకోవచ్చు.అంటే రాశి చక్రంలో 15 డిగ్రీల కాలం బ్రహ్మదేవుని ఒక పగలు అన్నమాట.ఇది ఒక హోరతో సమానం.కనుక బ్రహ్మదేవుని ఒక పగలూ రాత్రీ కలసిన దినం 30 డిగ్రీలున్న ఒక రాశితో సమానం.అలాంటి 360 దినములు అంటే రాశిచక్రం 30 సార్లు పరిభ్రమణం గావిస్తే అది ఆయనకు ఒక సంవత్సరంతో సమానం అవుతుంది.3000 సార్లు పరిభ్రమణం జరిగితే అది బ్రహ్మదేవుని జీవిత కాలం అవుతుంది(మానవ ప్రమాణంలో).

15 డిగ్రీలు రాశిచక్రం తిరగడానికి 60 నిముషాలు అంటే ఒక గంట పడుతుంది.కనుక బ్రహ్మదేవుని ఒక పగలు మన ఒక గంట సమయంతో సామ్యానికి వస్తున్నది.

రాశిచక్రం మొత్తానికీ దీనిని అన్వయించి చూద్దాం.

అప్పుడు 360/15=24 అవుతుంది.అంటే రాశిచక్రంలో 24 డిగ్రీల కాలం ఒక మన్వంతరం అన్నమాట.అందుకే రోజులో కూడా 24 గంటలు వస్తాయి.ఇదే దినానికీ సంవత్సరానికీ గల సామ్యం.ఈ సామ్యాన్ని ఇంతకుముందు కూడా ప్రస్తావించాను.

రాశిచక్రాన్ని 24 భాగాలు చేసే ఒక అంశచక్రం మనకు ఉన్నది.దానినే చతుర్విమ్శాంశ అంటాము.పరాశరులు చెప్పిన "విద్యాయాం వేదబాహ్వంశే" అన్న సూత్రాన్ని బట్టి ఇది విద్యను సూచిస్తుందని మన భావన.ఈ విద్య లౌకికం కావచ్చు ఆధ్యాత్మికం కూడా కావచ్చు.ఒకని జాతకంలో చతుర్వింశాంశ చక్రాన్ని చూచి ఆ జాతకుని లౌకిక ఆధ్యాత్మిక విద్యను మనం అర్ధం చేసుకోవచ్చు.

అలాగే పంచదశాంశను లెక్కిస్తే అది ఒక మన్వంతరాన్ని సూచించాలి.కానీ పంచదశాంశ గణనం షోడశ వర్గాలలో లేదు.పరిశోధించి చూడాలి. 

ఇకపోతే బ్రహ్మదేవుని ఒక పగలుకూ మన ఒక పగటి కాలానికీ సామ్యం ఉన్నది గనుక మన ఒక పగటి కాలమైన 12 గంటలను 15 భాగాలు చెయ్యగా మనకూ ఒక మన్వంతరం రావాలి.

దిన మన్వంతరం=12x60 నిముషములు/15
=48 నిముషములు

ఇది రెండు ఘడియల(ఒక ముహూర్త) కాలం.అంటే రెండు 24 నిముషాలు కలసిన కాలవ్యవధి.

అంటే ఒక రోజులో రెండు ఘడియల(ముహూర్త)కాలమే మన్వంతరం అన్నమాట. చూచారా విశ్వగణనానికీ మన మానవ గణనానికీ ఎలా సామ్యాలున్నాయో?

ఇక్కడ ఒక చిన్న రహస్యం చెబుతాను.

ధ్యానాభ్యాసం చేసేవారికి ఇది అనుభవంలో ఉంటుంది.

సామాన్య మానవుడు అలుపు లేకుండా ధ్యానం చెయ్యగల సమయం ఖచ్చితంగా 48 నిమిషాల కాలమే.సాధారణంగా ధ్యానపు ఒక సెషన్ ముగించి సమయాన్ని చూస్తే ఖచ్చితంగా 45 నుంచి 50 నిముషాల మధ్యలోపే ఉంటుంది.కావాలంటే గమనించండి.

అంతేకాదు మీరు ఏదైనా పనిని,ఉదాహరణకు ఆఫీస్ లో ఒక పనిని, ఏకధాటిగా చేస్తూ పోతే 48 నిముషాల తర్వాత మీకు కొంత రెస్ట్ అవసరం అనిపిస్తుంది.ఎందుకంటే సామాన్య మానవుని మెదడు ఈ సమయం తర్వాత కొంత రిలాక్సేషన్ కోరుకుంటుంది.దీనిని కూడా గమనించండి.ఎందుకంటే మెదడులో రెండు సగ భాగాలుంటాయి.ఒక్కొక్క భాగమూ రోజులో ఉన్న 24 గంటలకు సూచికగా 24 నిముషాలు మాత్రమే ధ్యానంలో ఉండగలదు.అలా మెదడులోని రెండు భాగాలూ కలసి 48 నిముషాలు మాత్రమే అలుపు లేకుండా ధ్యానంలో ఉండగలదు.

అంటే సామాన్య మానవుడు ఒక మన్వంతరం పాటు మాత్రమే ధ్యానం చెయ్యగలడు.దానిని దాటి ఇంకొక 48 నిముషాల పాటు చెయ్యగలిగితే ఒక మన్వంతరాన్ని దాటి ఇంకొక మన్వంతరంలో అడుగుపెట్టే శక్తి వస్తుంది. అప్పుడే సాధకుడు సూక్ష్మలోకాలను దర్శించగలుగుతాడు.సూక్ష్మ విషయాలను గ్రహించగలుగుతాడు.అలా చెయ్యాలంటే కనీసం 2x48=96 నిముషాల పాటు ఏకధాటిగా ధ్యానం చేసే శక్తి ఉండాలి.ఇది ధ్యానాభ్యాసంలో మినిమం స్థాయి.అక్కడ నుంచి ఒక్కొక్క మన్వంతరాన్ని దాటుతూ వెళ్ళగలిగితే అప్పుడు విశ్వంలోని ఇంకాఇంకా అతీతములైన విషయాలను గ్రహించే సామర్ధ్యం అతనికి కలుగుతుంది.అంటే 48 నిముషాలను ఒక యూనిట్ గా తీసుకుని ధ్యాన సమయాన్ని పెంచుతూ పోవాలి.

అంతరిక సాధనలో ఇదొక చిన్న రహస్యం.ఇలాంటి రహస్యాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి.కానీ వాటిని ఊరకే బహిర్గతం చెయ్యడం వల్ల ఉపయోగం లేదు.అర్హులకు సాధనాక్రమంలో అన్నీ అవే అర్ధమౌతాయి.ఒక చిన్న విషయాన్ని మాత్రమే ఇక్కడ సూచించాను.

ఈ విధంగా సూర్యచలనానికీ,గ్రహచలనానికీ,అయనచలనానికీ, యుగాలకూ, విశ్వభ్రమణానికీ,అంతరికసాధనకూ అవినాభావ సంబంధాలున్నాయి.

ఇంతవరకు అర్ధమైతే చాలు.

(ఇంకా ఉన్నది)
read more " యుగసిద్ధాంతం-8 (జీవ పరిణామం-అంతరిక కాలసామ్యాలు) "

22, సెప్టెంబర్ 2014, సోమవారం

యుగసిద్ధాంతం-7(వ్యావహారిక యుగములు-ఉపయుగములు)

హిందువులలోని పండితులలో,ముఖ్యంగా తెలుగువారిలో,పండితమ్మన్యత చాలా ఎక్కువ.అంటే పండితాహంకారం అన్నమాట.తమకు తెలియని ఒక కొత్త విషయాన్ని ఎవరైనా పరిశోధనాత్మకంగా కనుక్కొని చెబితే దానిని వారు వెంటనే ఒప్పుకోలేరు.అలా ఒప్పుకోడానికి వారివారి అహంకారాలు చాలా తీవ్రంగా అడ్డొచ్చేస్తాయి.ఎదుటివారు ఏదైనా పరిశోధన చేస్తే దానిలో వారికొచ్చే నష్టమేమిటో నాకెప్పటికీ అర్ధంకాదు.దీనినే పీతపధ్ధతి అంటారు.వారు ఎదగలేరు.ఎదుటివారు ఎదిగితే సహించలేరు.ఇదీ తెలుగువాడి తెగులు.

వారు చెయ్యలేని పనిని ఇంకొకరు చేస్తే దానిని అభినందించే పెద్దమనసు వారిలో ఎక్కడా ఉండదు.వారు పెద్దమాటలు చెబుతారు.కానీ వారి హృదయాలలో పెద్దతనం ఎక్కడా ఉండదు.అక్కడ మాత్రం అసూయే ఉంటుంది.అది వారి మాటలలో అల్పత్వంగా ప్రతిధ్వనిస్తుంది.ఇలాంటి వారిని చూస్తె నాకు చాలా నవ్వొస్తూ ఉంటుంది.

ఇకపోతే పాండిత్యజ్ఞానం లేని తెలుగు సామాన్యులకు ఇంకొక రకమైన హీనమైన ప్రవృత్తులుంటాయి.ప్రతిదానినీ పనున్నా లేకున్నా ఎగతాళి చెయ్యడమే ఆ నీచప్రవృత్తి.ఇలాంటి వారినిచూస్తే వారి హీనత్వానికి నాలో జాలి కలుగుతుంది.ఇలాంటి మెయిల్స్ చూచినప్పుడు అయితే నవ్వు లేకుంటే జాలి-ఈ రెండు భావాలే నాలో కలుగుతాయి.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ప్రస్తుత యుగసిద్దాంతం సీరీస్ వ్రాస్తుంటే ఈ రెండురకాల మనుషులనుంచి నాకు చాలా మెయిల్స్ వస్తున్నాయి. తెలుగువారిలో ఇంతకంటే ఉన్నతమైన మనుషులను ఆశించడమే ఒక పెద్ద పొరపాటు గనుక వారి ఖర్మకు వారిని ఒదిలేస్తున్నాను.

నేను ఈ సీరీస్ వ్రాస్తున్నది సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన ఉన్న ఋజుహృదయుల కోసంగాని పై రెండురకాల మనుషుల కోసం కాదు.ఈ రెండు రకాల మనుషులకు అసలు జవాబు ఇవ్వడమే పెద్ద టైం వేస్టుగా నేను భావిస్తాను.

ఇక ప్రస్తుతం లోకి వద్దాం.

యుగధర్మాలు

యుగధర్మాలు ఎలా ఉంటాయి.మేక్రో మైక్రో యుగాలలో ఇవి ఎలా సర్దుబాటు అవుతాయి?అని కొందరు నన్ను అడుగుతున్నారు.వారికోసం ఈ సమాధానం ఇస్తున్నాను.జ్యోతిష్యశాస్త్రంలోని దశా అంతర్దశల వలెనే ఇవి ఉంటాయి.

జ్యోతిశ్శాస్త్రంలోని దశలలో కొన్ని విచిత్రములైన దశలున్నాయి.వాటిని చాలా కొద్దిమంది మాత్రమె వాడుతూ ఉంటారు.వాటిలో "కాలచక్ర దశ" ఒకటి.సాధారణంగా అందరూ విమ్శోత్తరీ దశనే వాడుతారు.కొందరు మాత్రం ఇలాంటి ఇతర దశలను కూడా ఉపయోగిస్తారు.ఈ కాలచక్రదశకూ యుగచక్రానికీ దగ్గర సంబంధం ఉన్నది.యుగసిద్దాంతం యొక్క చక్రభ్రమణానికీ జాతకచక్రంలో గ్రహాల చక్రభ్రమణానికీ దగ్గర సంబంధం ఉన్నది.

దశావతారాలు కూడా యుగనిష్పత్తి అయిన 4:3:2:1 ను పాటించడం మనం గమనించవచ్చు.

కృతయుగంలో నాలుగు అవతారాలు వచ్చాయి.అవి-మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ అవతారాలు.

త్రేతాయుగంలో మూడు అవతారాలు వచ్చాయి.అవి వామన, పరశురామ, రామ అవతారాలు.

ద్వాపరయుగంలో రెండు అవతారాలు వచ్చాయి.అవి బలరామ,కృష్ణ అవతారాలు.నవీనకాలంలో బలరాముని తీసి బుద్ధుడిని చేర్చారు.కాని మొదట్లో దశావతారాలలో బుద్ధుడు లేడు.బలరాముడు ఉన్నాడు.

కలియుగంలో కల్కి అవతారం ఒక్కటే ఉన్నది.

కనుక ఇక్కడ కూడా 4:3:2:1 నిష్పత్తి ఉన్నట్లు మనం చూడవచ్చు.

సత్యయుగం(కృతయుగం)లో సత్యమూ ధర్మమూ నాలుగుపాదాలతో ఉంటాయని సామాన్యంగా మనం అనుకుంటాం.కానీ అది నిజంకాదు. ఎందుకంటే,ప్రతి యుగమూ మళ్ళీ నాలుగు భాగాలుగా ఉంటుంది.అలా లేకుంటే సృష్టి నడవదు.శుద్ధ బంగారంతో ఆభరణం తయారు కాదు.కొంత రాగో ఇత్తడో కలిస్తేనే ఆభరణం తయారు చెయ్యడానికి కావలసిన గట్టిదనం దానిని వస్తుంది.అలాగే యుగాలు కూడా ఉంటాయి.

ఉదాహరణకు వ్యావహారిక కృతయుగం-4800 సంవత్సరాలని మనకు తెలుసు.

దీనిలో ఉపయుగాలు:-

కృతయుగం-1920
త్రేతాయుగం-1440
ద్వాపరయుగం-960
కలియుగం-480
మొత్తం =4800 అవుతుంది.

అవరోహణా కృత/కృతయుగం లో ధర్మం నాలుగు పాదాలతో ఉంటుంది.కానీ అవరోహణా శక్తి నడుస్తూ ఉన్నది కనుక ప్రవాహం అధోముఖంగా పోతూ ఉంటుంది.కృత/త్రేతాయుగంలో అది ఒక పాదం క్షీణిస్తుంది.కృత/ద్వాపర యుగంలో ఇంకొక పాదం క్షీణిస్తుంది.అలా కృత/కలియుగంలో ధర్మం ఉన్నప్పటికీ అధర్మం కూడా బాగానే ఉంటుంది.ఎందుకంటే,అవరోహణా యుగంలో ధర్మం తగ్గుతూ వస్తుంది.అది దాని విధానం.

దీనికి విభిన్నంగా ఆరోహణా కృతయుగంలో అధర్మం క్రమేణా తగ్గుతూ ధర్మం పెరుగుతూ పోతుంది.ఇది ఆరోహణాయుగ చక్రపు ధర్మం.

అలా కాకుండా కృతయుగంలో సత్యమూ ధర్మమూ నాలుగు పాదాలతో పరిపూర్ణంగా నడిస్తే, ప్రకృతిలోని మత్స్య కూర్మ వరాహ నృసింహ మొదలైన జీవుల రూపంలో అసలు భగవంతుని అవతారాల అవసరం ఎందుకు వచ్చింది?

చేపరూపంలో ఉన్న విష్ణువు వేదాలు దొంగిలించిన శంఖాసురుడిని సంహరించినట్లు మనకు కధ ఉన్నది.అలాగే, జలప్రళయ సమయంలో వైవస్వత మనువునూ సప్తరుషులనూ మహాప్రళయం నుంచి రక్షించినట్లు కూడా కధ ఉన్నది.కనుక కృతయుగంలో కూడా అధర్మం ఉన్నది.పోనీ శంఖాసురుని కధ ప్రక్షిప్తం అనుకుంటే కూడా,లోకానికి ఒక మహాపద రావడమూ ఆ ఆపదనుంచి జీవకోటిని రక్షించడానికి భగవంతుడు ఒక రూపాన్ని ధరించి మానవులను రక్షించడమూ కృతయుగంలో కూడా ఉన్నది.

సత్యమూ ధర్మమూ పరిపూర్ణంగా ఉన్నపుడు మానవాళికి అసలు ఆపద అంటూ ఎలా వస్తుంది?

అలాగే,కూర్మావతారంలో చూస్తే,సముద్రమధనానికి ఆధారంగా తాబేలు రూపంలో విష్ణువు మంధరపర్వతాన్ని మోసినట్లు మనం చదువుతాం.ఇక్కడ కూడా లోకానికి సహాయం చేసే విధమైన అవతారమే వచ్చింది.ఒకరిని సంహరించ వలసినంత అవసరం అప్పటికి దైవానికి రాలేదు.ఎందుకంటే మానవులలో అప్పటికి ఇంకా అంత దానవత్వం పెచ్చు మీరలేదు.అయితే సముద్రమధన సమయంలో వర్గపోరాటమూ ఆశా ఇరువర్గాలలోనూ కన్పిస్తాయి.

పోతే హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని విశ్వసముద్రంలో అట్టడుగున దాక్కుంటే విష్ణువు వరాహావతారంలో అతడిని సంహరించి భూమిని లేవనెత్తి రక్షించినట్లు మనం చూస్తాం. ఈ అవతారం కూడా కృతయుగం లోనిదే.అంటే అప్పటికి ఒకనిలో రాక్షసత్వం మూర్తీభవించడమూ స్వార్ధం పరాకాష్టకు చేరడమూ భూమిని మొత్తం స్వాహా చేసేద్దామని ప్రయత్నించడమూ వానిని సంహరించడానికి భగవంతుడు అవతరించి రావడమూ జరిగింది.ఇదంతా కృతయుగంలోనే జరిగిందని మర్చిపోరాదు.ధర్మమూ సత్యమూ నాలుగు పాదాలతో నడుస్తుంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది?కనుక ఆ యుగంలో కూడా రాక్షసత్వమూ అధర్మమూ ఉన్నాయి కదా.

అయితే ఇక్కడకు వచ్చేసరికి ఊరకే సహాయం చెయ్యడం కాకుండా ఒక రాక్షసుడిని వధించే విధంగా దైవంయొక్క అవతారం వచ్చింది.అంటే మనుషులలో రాక్షసప్రవృత్తి పెరిగింది.అంటే కృతయుగంలో కూడా ధర్మక్షీణత ఉన్నది అని తెలుస్తున్నది కదా.

ఇదే నేను చెప్పే యుగాలు- వాటిలోని ఉపయుగాల ప్రభావం. 

కనుక దైవయుగపు మహాచక్రంలో,వ్యావహారిక యుగమూ,దానిలోని ఉపయుగమూ వాటివాటి ధర్మాలను అనుసరిస్తూ ఆరోహణా అవరోహణా లక్షణాలను బట్టి వృద్ధి చెందుతూ క్షీణిస్తూ వృత్తాకారంగా నడుస్తూ ఉంటాయి.అలాగే ధర్మమూ అధర్మమూ రకరకాల పాళ్ళలో కలసిమెలసి ఆయా సమయాన్ని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

ఇలాగే మిగతా యుగాలలో కూడా ఉపయుగాలు ఎలా ఉంటాయో చూద్దాం.

త్రేతాయుగం-3600 years.

త్రేతా/కృత -1440 years
త్రేతా/త్రేతా-1080 years
త్రేతా/ద్వాపర-720 years
త్రేతా/కలి-360 years

ద్వాపర యుగం-2400 years

ద్వాపర/కృత-960 years
ద్వాపర/త్రేతా-720 years
ద్వాపర/ద్వాపర-480 years
ద్వాపర/కలి-240 years

కలియుగం-1200 years

కలి/కృత-480 years
కలి/త్రేతా-360 years
కలి/ద్వాపర-240 years
కలి/కలి-120 years

ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న వ్యావహారిక యుగచక్రానికి ఉపయుగాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం.

13800 BC నుంచి 1800 BC వరకూ ఒక 12000 సంవత్సరాల అవరోహణా యుగచక్రం జరిగింది.


అందులో 13800 BC నుంచి 9000 BC వరకూ అవరోహణా కృతయుగం నడిచింది.

13800 నుంచి 11880-కృత/కృత

11880-10440-కృత/త్రేతా
10440-9480-కృత/ద్వాపర
9480-9000-కృత/కలి

9000 BC నుంచి 5400 BC -త్రేతాయుగం


9000-7560-త్రేతా/కృత

7560-6480-త్రేతా/త్రేతాయుగం (ఇక్కడ శ్రీరాముని జననం జరిగింది)
6480-5760-త్రేతా/ద్వాపర
5760-5400-త్రేతా/కలి

5400 BC నుంచి 3000 BC వరకూ ద్వాపరయుగం నడిచింది.


5400-4440 ద్వాపర/కృత

4440-3720 ద్వాపర/త్రేత
3720-3240 ద్వాపర/ద్వాపర
3240-3000 ద్వాపర/కలి--(ఇక్కడ శ్రీకృష్ణుని జననం జరిగింది)

3000 BC నుంచి 1800 BC వరకూ కలియుగం నడిచింది.


3000-2520 కలి/కృత
2520-2160 కలి/త్రేతా
2160-1920 కలి/ద్వాపర
1920-1800 కలి/కలి--(ఇక్కడ బుద్ధుని జననం జరిగింది.దీనికి వివరణ కావాలంటే కోట వెంకటాచలం గారి పరిశోధనా పూర్వక రచనలు చదవండి)

1800 BC నుంచి 10200 AD వరకు ఆరోహణా యుగచక్రం మొదలైంది.
ఆరోహణా చక్రంలో నడక క్రిందినుంచి పైకి ఉంటుంది.అంటే కలియుగంతో మొదలై కృతయుగానికి ఎదుగుతుంది.

1800 BC-600 BC ఆరోహణా కలియుగం.

1800-1680 కలి/కలి

1680-1440 కలి/ద్వాపర
1440-1080 కలి/త్రేత
1080-600 కలి/కృత

600 BC నుంచి 1800 AD ఆరోహణా ద్వాపరయుగం


600 BC-360 BC ద్వాపర/కలి-(ఇక్కడ ఆదిశంకరాచార్యుల జననం జరిగింది).
360 BC-120 AD ద్వాపర/ద్వాపర
120 AD-840 AD ద్వాపర/త్రేతా
840-1800 AD ద్వాపర/కృత

1800 AD-5400 AD ఆరోహణా త్రేతాయుగం


1800-2160 త్రేతా/కలి--(ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము)
2160-2880 త్రేతా/ద్వాపర
2880-3960 త్రేతా/త్రేత
3960-5400 త్రేతా/కృత

5400 AD-10200 AD ఆరోహణా కృతయుగం


5400-5880 కృత/కలి

5880-6840 కృత/ద్వాపర
6840-8280 కృత/త్రేత
8280-10200 కృత/కృత


అక్కడనుంచి మళ్ళీ యుగచక్రం క్రిందకు తిరగడం మొదలౌతుంది.ఈ చక్రభ్రమణం అంతులేనిది.ఇప్పటికి ఎన్ని కోటానుకోట్ల పరిభ్రమణాలు ఇలా జరిగాయో లెక్కే లేదు.ఎన్నిసార్లు నాగరికతలూ శాస్త్ర పరిజ్ఞానాలూ ఈ భూమిమీద పుట్టి పెరిగి గతించాయో లెక్కే లేదు.ఇప్పటికి ఎన్నిసార్లు ఈ భూమిమీద మనం పుట్టి గతించామో లెక్కేలేదు.

ఈనాడు మనం చూస్తున్న సైన్స్ మొదటిసారి మనకు తెలిసినది కాదు. ఇప్పటికి ఇలాంటి సైన్స్ మనకు చాలాసార్లు తెలుసు.ఇంతకంటే ఇంకా గొప్ప సైన్స్ కూడా తెలుసు.అలా ప్రాచీనకాలంలో మనకు తెలిసిన సైన్స్ ఆనవాళ్ళే భూమిమీద ఇప్పటికీ ఉన్న అనేక అంతుబట్టని వింతలు.


భూమిమీద అనేక చోట్ల ఉన్న అణుయుద్ధపు ఆనవాళ్ళూ,భూమినుంచి కొన్ని మైళ్ళు ఆకాశంలోకి పోయి చూస్తెగాని అర్ధంకాని విచిత్ర రేఖాగణిత డిజైన్లూ,మైళ్ళకు మైళ్ళు విస్తరించి ఉన్న శ్రీచక్రం వంటి గుర్తులూ ఇలా అనేక రుజువులు ఇప్పటికీ భూమి మీద అనేకచోట్ల ఉంటూ అతిప్రాచీన కాలంలో భూమిమీద ఉన్న గొప్ప సైన్స్ కు ఆనవాళ్ళుగా మనకు కనిపిస్తున్నాయి.

సైన్స్ పరంగా మనకంటే ఇంకా ఎంతో ఎక్కువ ముందుకెళ్ళి అకస్మాత్తుగా సర్వనాశనమై సముద్ర గర్భంలో కలసి పోయిన 'అట్లాంటిస్' నాగరికత కూడా ఈ భావననే నిరూపిస్తున్నది.

మహాభారతంలో బ్రహ్మాస్త్రం మొదలైన దివ్యాస్త్రాలు ప్రయోగింపబడినప్పుడు ఏమి జరిగింది?వాటి ప్రభావం ఎలా ఉన్నది? మొదలైన ఘట్టాలనూ వ్యాసమహర్షి వర్ణించిన శ్లోకాలనూ మనం చూస్తే నేటి అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు ఏ తీరులో విధ్వంసం జరిగిందో అదే తీరు కళ్ళకు కట్టినట్లుగా వర్ణింపబడటం చూడవచ్చు.

బ్రహ్మాస్త్రప్రయోగం జరిగినప్పుడు "ఒక బ్రహ్మాండమైన పుట్టగొడుగు వంటి విస్ఫోటనం జరగడమూ,క్షణాలలో మైళ్ళ దూరంవరకూ ఆహారపదార్ధాలన్నీ విషంగా మారడమూ,వేలాది సైనికుల ఒళ్ళు క్షణంలో కాలి మాడిపోవడమూ,ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు ఎంతో దూరంలో ఉన్న ప్రజలకు కూడా రకరకాల వ్యాధులు రావడమూ"ఇదంతా సైన్స్ అనేది ఏమీ తెలియని అడివిలో ఉండే ఋషులకు ఎలా తెలుసు?మహాభారతంలో ఇదంతా ఎలా వర్ణింపబడింది?వేల సంవత్సరాల క్రితం వ్యాసమహర్షి ఇదంతా ఎలా వ్రాయగలిగాడు?

కనుక నాగరికతా,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమూ మనం ఇప్పుడే మొదటిసారిగా చూడటం లేదు.ఇంతకు ముందు ప్రాచీనకాలంలో ఇలాంటి నాగరికత ఎన్నో సార్లు ఉన్నది.ఇప్పుడు మనకు తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ సైన్స్ చాలాసార్లు ఈ భూమిమీద విలసిల్లింది.కానీ అదంతా నాశనమై పోయింది.అలా నాశనం కావడానికి మానవుడి దురాశా గర్వమూ అహంకారాలే కారణాలు.

కాలచక్ర భ్రమణంలో మనుషులైనా నాగరికతైనా సైన్సైనా పుట్టడం పెరగడం తరగడం నశించడం మళ్ళీ పుట్టడం తప్పదు.ఇదొక చక్రభ్రమణం.దీనికి అంతులేదు.

ఈ సత్యాన్నే యుగసిద్దాంతం నిరూపిస్తున్నది.

(ఇంకా ఉన్నది)
read more " యుగసిద్ధాంతం-7(వ్యావహారిక యుగములు-ఉపయుగములు) "

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

యుగసిద్ధాంతం-6(స్వామి యుక్తేశ్వర్ గిరిగారి లెక్క తప్పిందా?ప్రస్తుతం నడుస్తున్నది త్రేతాయుగమా?)

ఈ పోస్ట్ లో ఇంకొన్ని విప్లవాత్మకములైన,అయినప్పటికీ,సత్యములైన భావాలను మీ ముందు ఉంచుతాను.ఏ విధమైన కల్మషమూ మనసులో పెట్టుకోకుండా నిర్మలమైన మనస్సుతో దీనిని చదివితే నేను వ్రాస్తున్నది నిజమే అని మీరే ఒప్పుకుంటారు.

The Holy Science అనే పుస్తకంలో శ్రీ యుక్తేశ్వర్ గిరిగారు వ్రాసిన విధంగా అయితే 11,500 BC లో మొదలైన ఒక 12,000 సంవత్సరాల అవరోహణ యుగం 500 AD లో ముగిసింది.అక్కడనుంచి మొదలైన ఆరోహణా కలియుగపు 1200 సంవత్సరాల కాలం 1700 AD తో ముగిసింది.కనుక ఆయన చెప్పిన ప్రకారం చూస్తే ప్రస్తుతం మనం ఆరోహణా ద్వాపరయుగంలో 314 వ సంవత్సరంలో ఉన్నాం.

కానీ,పరిశోధకులు చెబుతున్నట్లుగా కలియుగ ప్రారంభతేదీకీ స్వామి యుక్తేశ్వర్ గిరిగారి వాదానికీ పొత్తు కుదరదు.ఎలాగంటే,చాలామంది ప్రస్తుతం ఒప్పుకుంటున్న దానినిబట్టి కలియుగం అనేది 3102 BC లో మొదలైంది. డా||నరహరి ఆచార్ మొదలైన కొందరు పరిశోధకులు నిర్ధారించిన దానిని బట్టి మహాభారత యుద్ధం అనేది  3067 BC లో జరిగింది.ఆ తర్వాత 36 ఏళ్ళకు కృష్ణుడు దేహత్యాగం చేశాడు గనుక 3031 BC లో కలియుగం మొదలై ఉండాలి.కనుక వీరి వాదనను బట్టి అది 3031 BC లో మొదలైంది.స్థూలంగా చూస్తే కలియుగ ప్రారంభం 3000 BC ప్రాంతంలో అని అనుకోవచ్చు.కానీ స్వామి యుక్తెశ్వర్ గిరిగారి ప్రకారం కలియుగం అనేది 700 BC లో మొదలైంది.అప్పుడే అది 500 AD కి తన 1200 సంవత్సరాల అవరోహణా కాలాన్ని పూర్తి చెయ్యగలుగుతుంది.
  • జ్యోతిష్య,ఖగోళ పరిశోధనల ప్రకారం కలియుగం 3000 BC ప్రాంతంలో మొదలైంది.
  • కానీ, స్వామి యుక్తేశ్వర్ గిరి గారి లెక్క ప్రకారం అది 700 BC లో మొదలైంది.
మరి ఈ రకరకాలైన సంవత్సరాలలో అసలైన కలియుగం మొదలైనది ఎప్పుడు?

BC 3102 లోనా? లేక BC 3031 లోనా?లేక BC 700 లోనా?పోనీ ఏదో ఒకటిలే అనుకోవడానికి కుదరదు.ఎందుకంటే ఈ మూడూ పక్కపక్కన లేవు.మూటికీ ఒక ద్వాపర యుగానికి ఉన్నంత అంటే 2400 సంవత్సరాల తేడా ఉన్నది.

కనుక ఈ మూటిలో ఒకటి మాత్రమే సాధ్యమౌతుంది.

వీటిలో BC 3102 కి మాత్రమే కొంత ప్రామాణికత కనిపిస్తున్నది.ఎందుకంటే ఆ సమయానికి మాత్రమే మహాభారతంలో చెప్పబడిన ఖగోళపరిస్థితులు ఆకాశంలో ఉన్నాయి.700 BC కి ఈ ఆధారాలు లేవు.

కనుక స్వామి యుక్తేశ్వర్ గిరిగారి ఊహ తప్పని నిర్దారింప బడుతున్నది. ఈ సందర్భంగా ఆయన భావాలనూ లెక్కలనూ కొంచం లోతుగా పరిశీలిద్దాం.

అసలు 12000 సంవత్సరాల నిడివి గల వ్యావహారిక మానవయుగ ప్రారంభాన్ని BC 11500 గా ఆయన ఎలా తీసుకున్నారు? అనే సందేహం తలెత్తుతుంది.నవీన మంచుయుగం BC 12500 - BC 10500 మధ్యలో ఎప్పుడో ఒక సమయంలో అయిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఇది రెండు మూడు సంవత్సరాల సమయం కాదు.2000 సంవత్సరాల కాలవ్యవధి.అంటే ఒక కలియుగమూ లేదా దాదాపు ఒక ద్వాపరయుగమూ కూడా అయిపోయేటంత సమయం.

ఇదంతా ఆలోచిస్తే ఒక్క విషయం స్ఫురిస్తుంది.

AD 1700 తర్వాతనే సైన్స్ ఆవిష్కరణలు బాగా ప్రారంభమయ్యాయి. విద్యుత్తూ,అయస్కాంత శక్తీ,పారిశ్రామిక విప్లవమూ ఇవన్నీ ఆ తర్వాతే మొదలయ్యాయి.కనుక అప్పటికి ఒక యుగం అయిపోయి ఇంకొక యుగం మొదలయి ఉంటుందన్న ఊహతో ఆ సమయానికి సరిపెట్టడానికి ఆయన BC 11500 ని యుగచక్రప్రారంభంగా తీసుకుని ఉండవచ్చు.ఈ విషయాన్ని ఆయన తన పుస్తకం ముందుమాటలో స్పష్టంగానే వివరించాడు.

కానీ ఈ లెక్కలు 3102 BC ని కలియుగ ప్రారంభంగా నిర్ధారిస్తున్న ఖగోళపరమైన జ్యోతిష్య పరమైన లెక్కలతో సరిపోవడం లేదు.

ఒకవేళ 3102 BC అనేది కలియుగ ప్రారంభ సంవత్సరం అనుకుంటే,దానిని వ్యావహారిక యుగసంవత్సరాలతో కొలిస్తే,

అప్పుడు 3102 BC-2400(1200 అవరోహణా కలియుగం+1200 ఆరోహణా కలియుగం)=700 BC కి 2400 సంవత్సరాల ఆరోహణా ద్వాపరయుగం మొదలై ఉండాలి.అది 1700 AD తో అయిపోయి ఉండాలి.

అలాంటప్పుడు 1700 AD నుంచి ఆరోహణా త్రేతాయుగం మొదలై ఉండాలి.

అంటే మనం ఇప్పుడు 2014AD లో,314 త్రేతాయుగంలో ఉన్నామన్నమాట.

పోనీ కలియుగం 3031 BC లో మొదలైందన్న రెండో వాదనను స్వీకరిస్తే అప్పుడు AD 1800 నుంచీ ఆరోహణా త్రేతాయుగం మొదలై ఉండాలి.

అలా చూస్తే ఇప్పుడు మనం 214 త్రేతాయుగంలో ఉన్నామన్నమాట.అంటే ఒక నూరు సంవత్సరాల అటూ ఇటూగా మనం ప్రస్తుతం వ్యావహారిక(మానవ) త్రేతాయుగంలో ఉన్నామన్న విషయం తార్కికంగా తెలుస్తుంది.

అంటే,మహాసంకల్పం ప్రకారం ప్రస్తుతం విశ్వంలో కలియుగం నడుస్తున్నప్పటికీ,వ్యావహారిక యుగాలలెక్కలలో మాత్రం త్రేతాయుగం నడుస్తున్నదా?

నా లెక్కలను బట్టి అవుననే అంటాను.

అయితే,దీనిని బట్టి నవీన మంచుయుగం లెక్కలు కూడా మారిపోతాయి.

ఎలా?

3102 BC కలియుగ ప్రారంభం గనుక 1900 BC తో అది అయిపోయి ఉండాలి.అంటే అంతకు ముందు 12000 సంవత్సరాల క్రితం 13900 BC లో నవీన మంచుయుగం మొదలై ఉండాలి.కనుక యుక్తేశ్వర్ గిరిగారు అనుకున్నట్లు యుగచక్రం 11500 BC లో కాకుండా 13900 BC లో మొదలై ఉండాలి.

లేదా కలియుగ ప్రారంభ సంవత్సరం BC 3031 అనుకుంటే,అప్పుడు యుగచక్రం 13800 BC లో మొదలై ఉండాలి.మంచు యుగం కూడా అప్పుడే అయిపోయి ఉండాలి.

ఇప్పుడు మన ఊహాశక్తికీ స్ఫురణశక్తికీ  పదును పెడదాం.

పైన అనుకున్నట్లుగా,ఆరోహణా ద్వాపరయుగం అనేది 700 BC నుంచి 1700 AD వరకూ 2400 సంవత్సరాల కాలం పాటు జరిగితే  ఆ సమయంలో ద్వాపరయుగంలో రావలసిన కృష్ణుని అవతారం మళ్ళీ వచ్చి ఉండాలి. అయితే అలాంటి అవతారం ఆ సమయంలో వచ్చిందా? అని ఆలోచిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి.

ప్రతీ వ్యవహారిక ద్వాపరయుగంలోనూ కృష్ణుని అవతారం రాదు.ప్రతి వ్యవహారిక త్రేతాయుగంలోనూ శ్రీరాముని అవతారం రాదు.ఆ అవతారాలు దైవయుగాల లెక్కలలో వచ్చే ద్వాపర,త్రేతాయుగాలలో మాత్రమే వస్తాయి. వ్యావహారిక యుగాలలో అవి రావు.

కానీ అలాంటి పోకడలే ఉన్న మహాపురుషుల లేదా దైవాంశ సంభూతుల జననం ఆయా వ్యావహారిక యుగాలలో కూడా జరుగుతుంది.

ఈ లెక్కన చూస్తే ఈ వ్యావహారిక ద్వాపరయుగపు కాలంలో 700 BC-1700 AD మధ్యలో జీసస్ క్రీస్ట్ జననం జరిగింది.

క్రీస్ట్ జీవితానికీ కృష్ణుని జీవితానికీ చాలా పోలికలున్నాయి.

చాలామంది ప్రాశ్చాత్యులే ఈ విషయాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.కొంతమంది ఎంతదూరం వెళ్ళారంటే అసలు క్రీస్ట్ అనేవాడు పుట్టనే లేదు.కృష్ణుని జీవితాన్నే క్రైస్తవులు కాపీ కొట్టారు అని వ్రాసేటంత వరకూ వెళ్ళారు.ఈ పనిని మనవాళ్ళు చెయ్యలేదు.పాశ్చాత్య రచయితల లోనే ఈ వర్గం వారు చాలామంది ఉన్నారు.

ఇప్పుడు క్రీస్తు కీ కృష్ణునికీ ఉన్న పోలికలు గమనిద్దాం.

  • Christ అనే పదానికీ Chrishna అనే పదానికీ సామ్యం ఉన్నది.
  • కృష్ణ జననసమయంలో అనేక మహిమలు జరిగాయి.క్రీస్ట్ జనన సమయంలో కూడా అనేక మహిమలు జరిగాయి.
  • కృష్ణుడు పుట్టిన సమయంలో ఆయన్ను చంపాలని కంస మహారాజు ప్రయత్నించాడు.చాలామంది పిల్లలను చంపించాడు కూడా.ఎందుకంటే ఆ పిల్లవాని చేతిలో తనకు చావున్నదని జ్యోతిష్కులు చెప్పడం వల్ల.
  • అలాగే క్రీస్ట్ పుట్టిన సమయంలో హీరోడ్ అనే రాజు అతన్ని చంపాలని ప్రయత్నించాడు.ఆ సమయంలో పుట్టిన పిల్లలను అనేకమందిని చంపించాడు కూడా.అతనికి కూడా ఈ విషయం జ్యోతిష్కులే చెప్పారు.
  • అయితే,కొంతవరకే ఈ సామ్యాలున్నాయి.పూర్తిగా లేవు.ఉదాహరణకు కృష్ణుడు కంసున్ని సంహరించాడు.కానీ క్రీస్తు హీరోడ్ ను చంపలేదు.అయితే కృష్ణుడూ క్రీస్తూ ఇద్దరూ కొంతకాలం పాటు అజ్ఞాతంలో బ్రతికారు.
  • కృష్ణుడూ క్రీస్తూ తమతమ జీవితాలలో ఎన్నో మహిమలు చేశారు. ఎందరికో జ్ఞానబోధ చేశారు.
  • కృష్ణుడు అనాకారి అయిన కుబ్జను ఉద్ధరించి అపురూప సౌందర్యవతిగా మార్చాడు.వేశ్య అంటూ లోకమంతా అసహ్యించుకుంటున్న మగ్దలేన్ మేరీని క్రీస్తు చేరదీసి ఆదరించాడు.
  • కృష్ణునకు గోపికలతో రాసలీల జరిగింది.అలాగే క్రీస్ట్ కూ మాగ్డలీన్ మేరీ తో పెళ్ళయిందనీ ఆమె అతని అనుచరురాలూ భక్తురాలూ మాత్రమే గాక ప్రియురాలు కూడా అనీ నమ్మే ఒక వర్గం ఇప్పటికీ ఉన్నది.కాశ్మీర్లో నివసించిన క్రీస్ట్ ఆమెతో సంసారం జరిపాడనీ వారికి పుట్టిన సంతానమే ఫ్రాన్స్ రాచరిక కుటుంబమనీ నమ్ముతూ అనేక పుస్తకాలూ పరిశోధనలూ సినిమాలూ కూడా వచ్చాయి.
  • కృష్ణుడు తన కాలికి తగిలిన ఒక బోయవాని బాణం దెబ్బకు మరణించాడు.క్రీస్ట్ కూడా తన కాళ్ళకూ చేతులకూ కొట్టబడిన మేకుల దెబ్బలకు మరణించాడు.బాణం దెబ్బా మేకు దెబ్బా దగ్గర దగ్గరగా ఒకరకంగానే ఉంటాయి.
కృష్ణుడే క్రీస్తు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.కానీ వీరి ఇద్దరి జీవితాలలో పోలికలు ఉన్నాయని చెప్పడంవరకే నా ఉద్దేశ్యం.పైగా మన లెక్కలలో తేలుతున్న వ్యావహారిక ద్వాపరయుగపు సమయంలోనే క్రీస్ట్ జననం జరిగింది.

కనుక మన లెక్కలలో తేలిన వ్యావహారిక ద్వాపర యుగంలో కృష్ణుని అవతారం రాలేదు గాని,కృష్ణునితో కొన్ని పోలికలున్న క్రీస్ట్ జననం జరిగింది.

ఇక పోతే 1700 AD లేదా 1800 AD తర్వాత మన లెక్క ప్రకారం త్రేతాయుగం మొదలైంది.అప్పుడు త్రేతాయుగం గనుక శ్రీరాముని అవతారం వచ్చి ఉండాలి.అది ఎక్కడుంది?

చదువరులకు దిగ్భ్రాంతి కల్గించే విషయం ఇప్పుడు చెబుతాను.

సరిగ్గా 1836 AD లో శ్రీరామకృష్ణుని జననం జరిగింది.పూర్వయుగాలలో రాముడూ కృష్ణుడూ తానే అని ఆయన ఎన్నోసార్లు తన అంతరంగ భక్తులతో చెప్పడమే గాక దానికి అనేక నిదర్శనాపూర్వకములైన దర్శనాలు వారికి అనుగ్రహించి ఉన్నారు.స్వయానా వివేకానందస్వామితో ఈ మాటను ఆయన అన్నారు.

ఆయన జాతక చక్రాన్ని గనుక మనం గమనిస్తే ఒక దైవావతారానికి ఉండవలసిన శక్తివంతములైన లక్షణాలు ఆ జాతకంలో ఉండటం జ్యోతిశ్శాస్త్రం ఏ కొద్దిగా తెలిసిన ఎవరికైనా స్ఫురిస్తుంది.

తన చివరిదశలో శ్రీరామక్రిష్ణులు టెర్మినల్ కేన్సర్ తో చాలా బాధపడుతూ ఉన్నారు.ఆ సమయంలో నరేంద్రుడు ఒకరోజున ఆయన మంచం దగ్గర కూర్చుని ఈ విధంగా తనలో తాను అనుకున్నాడు.

'తాను దైవం యొక్క అవతారాన్నని గురుదేవులు చాలాసార్లు మాతో అన్నారు.తాను పడుతున్న ఈ బాధ అంతా లోకపు పాపాన్ని తన శరీరం మీదకు ఆవహింప చేసుకున్నందుకే అని కూడా ఆయన చాలాసార్లు చెప్పి ఉన్నారు.కానీ భయంకరమైన బాధను అనుభవిస్తున్న ఈ సమయంలో కూడా ఆయన అదే మాటను అంటే అప్పుడు మాత్రమే నేను ఆ విషయాన్ని నమ్ముతాను.'

భగవంతుడైనా సరే మన కళ్ళ ఎదురుగా ఒక దేహంతో వచ్చి మనలాగే తింటూ తిరుగుతూ రోగాలతో రొష్టులతో బాధపడుతూ ఉంటె ఆయనను మనం నమ్మలేం కదా?మాయాప్రభావం చాలా గట్టిది.నరేంద్రుడు సామాన్య మానవుడు కాదు.కారణజన్ముడు.కానీ ఆయనను కూడా మాయ ఒదిలిపెట్టలేదు.

స్వయంగా శ్రీరామకృష్ణుని స్పర్శతో నరేంద్రుడు సమాధిస్థితి అంటే ఏమిటో చవిచూచాడు.అయినా సరే,ఆయనొక మహాపురుషుడని అనుకున్నాడు గాని అవతారం అని ఆయనకూడా చాలాకాలం నమ్మలేకపోయాడంటే భగవంతుని యోగమాయా ప్రభావం ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు.

"మమ మాయా దురత్యయా(నా మాయను దాటడం అంత సులభం కాదు)" అని స్వయానా భగవంతుడే గీతలో చెప్పినాడు.

మహనీయుడైన నరేంద్రుడినే మాయ అలా కప్పితే ఇక మూర్ఖులూ అహంకార పూరితులూ అయిన మామూలు మనుషులను వదులుతుందా?అలాంటి మూర్ఖులు ఏం చేస్తారో భగవంతుడే స్వయంగా గీతలో చెప్పినాడు.

శ్లో||అవజానన్తి మాం మూఢాం మానుషీం తనుమాశ్రితాం
పరం భావమజానన్తో మమ భూత మహేశ్వరం

"నేను మానవదేహంలో అవతరించినపుడు మూర్ఖులైన మానవులు నన్ను అర్ధం చేసుకోలేక ఎగతాళి చేస్తారు.కానీ సమస్త జీవులకూ ప్రభువునైన భగవంతుడను నేను అన్న విషయం వారు ఎరుగలేరు."

(భగవద్గీత 9:11)

నరేంద్రుని మనస్సులో ఈ ఆలోచన మెదిలీ మెదలక ముందే శ్రీరామకృష్ణులు స్పష్టంగా ఇలా అన్నారు.

'మునుపు ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో అతడే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాడు.అయితే అది నీ వేదాంతపు కోణంలో కాదు.'

'వేదాంతపు కోణంలో'- అనే మాటకు అర్ధం ఏమంటే,వేదాంతం చెప్పేటట్లు "జీవో బ్రహ్మేతి నాపర:" అనే మాట ప్రకారం ప్రతి జీవుడూ బ్రహ్మమే గనుక నేనూ బ్రహ్మమునే అనే భావంలో కాదు.వేదాంతభావానికి భిన్నంగా- "నేను సత్యమైన దైవావతారాన్నే" అని అత్యంత స్పష్టంగా నిర్దుష్టంగా ఆయన వివేకానందునికి చెప్పినారు.

అయితే శ్రీ రామకృష్ణుని జీవితానికీ శ్రీరాముని జీవితానికీ సామ్యాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.
  • శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం చేసాడు.
  • శ్రీరామకృష్ణులు 14 ఏళ్ళు పంచవటి అనే అడవిలో ఉంటూ లోకంతో సంబంధంలేని మహోన్నత దివ్యస్థితులలో సాధన గావించారు.
  • దశరధుని ప్రార్ధనల ఫలితంగా యాగఫలితంగా శ్రీ మహావిష్ణువు ఆయనకు కుమారునిగా జన్మించాడు.
  • శ్రీరామకృష్ణుని తండ్రి అయిన ఖుదీరాం చటోపాధ్యాయ యొక్క అత్యంత నియమనిష్టలతో కూడిన ఋజువర్తనాపూరిత తపోమయ జీవితపు ఫలంగా ఆయన కలలో గయాక్షేత్రాధిదేవతా గదాధరుడూ అయిన మహావిష్ణువు దర్శనం ఇచ్చి 'నీ కుమారునిగా నేను జన్మిస్తున్నాను' అని చెప్పాడు.అందుకే తన కుమారునికి "గదాధరుడని" ఖుదీరాం నామకరణం గావించాడు.శ్రీ రామకృష్ణుని అసలుపేరు "గదాధర్".
  • ఇంకొక సమయంలో శ్రీరామచంద్రుడు ఆయన కలలో కనిపించి- "నేను నీ ఇంటికి వస్తున్నాను" అని పలికి మాయమౌతాడు.వారి కులదైవం కూడా రఘురాముడే.రఘువీర సాలగ్రామం వారి ఇంటిలో తరతరాలుగా ఉండేది.దానిని వారు ప్రతిరోజూ నిష్టగా పూజించేవారు.
  • రావణుని బాధతో తల్లడిల్లి పోతున్న లోకాన్ని రక్షించడానికి శ్రీరాముడు అవతరించాడు.
  • ఆధ్యాత్మిక చీకటిలో మగ్గిపోతున్న లోకాన్ని ఉద్ధరించి దానికి దైవత్వపు వెలుగును ఇవ్వడానికి శ్రీరామకృష్ణుని అవతారం వచ్చింది.అందుకే మనం గనుక గమనిస్తే శ్రీకృష్ణుని తర్వాత సాగిన దాదాపు 5000 ఏండ్ల అజ్ఞానపు చీకటిని పోగొడుతూ వచ్చిన అవతారం శ్రీరామకృష్ణులదే.
  • ఆయన అవతరించిన తర్వాత ఈ రెండువందల సంవత్సరాలలో ఎంతమంది మహనీయులు పుట్టుకొచ్చారో వారు మరి ఇన్ని వేల ఏండ్లుగా ఎందుకు పుట్టలేదో,ఉన్నట్టుండి గత రెండువందల ఏళ్ళుగా మాత్రమే ప్రపంచంలో ఇంత ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నట్టుండి ఎందుకు కనిపిస్తున్నదో జాగ్రత్తగా గమనిస్తే శ్రీ రామకృష్ణుల అవతారతత్త్వం ఏమిటో దాని ప్రభావం ఏమిటో అర్ధమౌతుంది.
  • రామభక్తుడైన ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకకు పోయి సీతమ్మ జాడను కనుగొనిన కారణంగా ఈనాటికీ మనదేశంలోని గ్రామగ్రామానా పూజలందుకుంటూ ఉన్నాడు.
  • శ్రీరామకృష్ణుని ప్రియశిష్యుడైన వివేకానందస్వామి సముద్రాన్ని దాటి విదేశాలకు పోయి అక్కడ భారతీయ సనాతనధర్మం యొక్క దివ్యవాణిని వినిపించి ప్రపంచపు కళ్ళు తెరిపించి మనం మరచిపోయిన మన అసలైన ధర్మాన్ని మన కళ్ళ ఎదుట నిలిపినందుకు ఈనాటికీ ఆయన్ను మనం ప్రాతస్మరణీయునిగా గౌరవిస్తున్నాం.
  • అంతేకాదు వివేకానందస్వామిలో శివాంశ ఉన్నదని శ్రీరామకృష్ణులు తరచూ అనేవారు.ఆంజనేయుడూ శివాంశసంభూతుడే అని మన నమ్మకం కదా.
  • ధర్మస్థాపన కోసం శ్రీరాముని అవతారం వచ్చింది.
  • "స్థాపకాయచ ధర్మస్య" అన్న మాటతో శ్రీరామకృష్ణస్తోత్రాన్ని వివేకానందులు ప్రారంభించారు."సర్వధర్మ స్థాపకత్వం సర్వధర్మ స్వరూపక:" అని స్వామి అభేదానంద రచించిన శ్రీరామకృష్ణస్తోత్రం ఆయన్ను స్తుతిస్తుంది.
  • శ్రీరాముని అవతారం వచ్చినపుడు ఆయా దేవతలూ ఆయుధాలూ ఆయనతో దిగివచ్చారు.
  • శ్రీరామకృష్ణుని అవతరణం జరిగినప్పుడు దివ్యలోకాలలో ఉండే మహనీయులు ఆయనతో దిగి వచ్చారు.వివేకానందస్వామి సప్తఋషులలో ఒకరని రామకృష్ణులు చెప్పినారు.
  • అలాగే ఆయన జీవితలీలలో ఉన్నట్టి మిగతావారు కూడా దైవాంశ సంభూతులే.
  • ఉదాహరణకు,శ్రీరామకృష్ణుని ప్రత్యక్షశిష్యులలో ఒకరైన స్వామి విజ్ఞానానంద పూర్వజన్మలో జాంబవంతుడు.మంచి ఒడ్డూపొడుగూ ఉన్న యువకుడైన విజ్ఞానానందస్వామితో మధ్యవయస్సులో బలహీనంగా ఉన్న శ్రీరామకృష్ణులు ఒకనాడు సరదాగా కుస్తీపట్టి సునాయాసంగా ఆయన్ను గోడకు అణచిపట్టి ఓడించారు.
  • "గురుదేవా.మీరెందుకు నాతో కుస్తీ పట్టాలని అనుకుంటున్నారు?" అని అడిగిన విజ్ఞానానందస్వామితో ఆయన ఇలా అన్నారు."ఇది మొదటిసారి కాదు.ఇంతకు ముందు కూడా ఒక సందర్భంలో నీతో నేను కుస్తీ పట్టాను.అది నీవు మరచిపోయావు."
  • విజ్ఞానానందస్వామి ఆజన్మ బ్రహ్మచారి.కానీ తన కుటుంబాన్ని(అంటే తల్లినీ,చెల్లెళ్ళనూ,తమ్ముళ్ళనూ) పోషించి వారిని ఒక దారికి తేవడానికి ఆయన నూరు సంవత్సరాల క్రితమే సివిల్ ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు.తన లౌకిక బాధ్యతలను నిర్వర్తిస్తూ గురుదేవుల ఉపదేశం ప్రకారం బ్రహ్మచర్యమూ అంతరిక సాధనతో కూడిన జీవితాన్ని ఆయన గడిపారు.తన బాధ్యతలు తీరిన తర్వాత సన్యాసం స్వీకరించారు.
  • లంకకు వారధి నిర్మిస్తున్న సమయంలో జాంబవంతుడు కూడా ఆ పనిని దగ్గరుండి పర్యవేక్షించాడు.బేలూర్ మఠంలో ప్రస్తుతం ఉన్న శ్రీరామకృష్ణుని బృహత్తర దేవాలయాన్ని డిజైన్ చేసి దగ్గరుండి దానిని కట్టించినది విజ్ఞానానంద స్వామియే.ఈ రకంగా పూర్వజన్మ సంస్కారాలు తరువాతి జన్మలలో కూడా జీవులను నడిపిస్తాయి.
  • బాలకృష్ణుని నిత్యదర్శనాన్ని తనయొక్క చర్మచక్షువులతో పొందిన 'గోపాలేర్ మా' యశోదాదేవి అంశతో జన్మించిన మహనీయురాలు.ఆమె శ్రీరామకృష్ణుని అంతరంగ భక్తులలో ఒకరు.శ్రీరామకృష్ణుని చూస్తూనే ఆమెకు సమాధిస్థితి కలిగేది.ఆయనకు తన చేతితో ప్రేమగా స్వీట్లు తినిపించేది.శ్రీరామకృష్ణుని జీవితం చదివితే ఈ విషయాలన్నీ తెలుస్తాయి.
  • శారదామాత 1920 ప్రాంతంలో దక్షిణదేశయాత్రకు వచ్చారు.ఆ సమయంలో రామేశ్వరంలోని శివలింగాన్ని చూచినప్పుడు ఆనంద సమాధిస్థితి(blissful trance)లో ఉన్న అమ్మ ఇలా అనడం పక్కన ఉన్నవారు విని రికార్డ్ చేసి ఉంచారు.
"అప్పట్లో నేను ప్రతిష్టించిన శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నది"
  • రామేశ్వర శివలింగాన్ని ప్రతిష్టించినది సీతారాములే అన్నది జగద్విదితం.
  • శ్రీరామకృష్ణులు దివ్య సమాధిస్థితులలో ఉన్నపుడు కొన్నిసార్లు ఇలా అనేవారు-"నా ధనుస్సూ బాణాలూ ఎక్కడ?వాటిని తెచ్చి ఇవ్వండి".
  • ఒకసారి సమాధిస్థితిలో ఉన్నపుడు ఆయన ఇలా అనడం పక్కనే ఉన్న వివేకానందాది శిష్యులు విన్నారు-"ఒక సందర్భంలో నేను పద్నాలుగేళ్ళ పాటు అడవిలో నివసించాను".
ఈ విధంగా శ్రీరాముని జీవితానికీ శ్రీరామకృష్ణుని జీవితానికీ చాలా పోలికలున్నాయి.గతంలో "శ్రీరాముడను తానే" అని ఆయన ఎన్నోసార్లు తన అంతరంగిక భక్తులకు చెప్పినారు.ఊరకే చెప్పడమే గాక దానికి రుజువులుగా అనేక దివ్యదర్శనాలను తన అంతరంగిక భక్తులకు ఇచ్చారు.

కనుక 1700/1800 AD లో మొదలైన త్రేతాయుగంలో శ్రీరాముని అవతారం రాలేదు గాని,ఆయన జీవితంతో సామ్యం ఉన్న ఇంకొక భగవదవతారం శ్రీరామకృష్ణుని రూపంలో వచ్చింది.


కనుక 1800 AD ప్రాంతంలో మొదలై ఆ తర్వాత 3600 సంవత్సరాల పాటు సాగే వ్యావహారిక త్రేతాయుగంలో ప్రస్తుతం మనం ఉన్నామని నేనంటున్నాను.

స్వామి యుక్తేశ్వర్ గిరిగారు యుగాల లెక్కలను సరిదిద్దటానికి ఒక మంచి ప్రయత్నం చేశారు.కానీ "ప్రమాదో ధీమతామపి" అన్నట్లుగా ఆయన లెక్కలలో కూడా పొరపాటు దొర్లింది.

అదేమిటో,ఆ తప్పు ఎలా దొర్లిందో పైన వివరించాను.అర్ధం చేసుకున్నవారు ధన్యులు.

నా వాదనకు ఇంకొక ఋజువును ఇప్పుడు చూపిస్తాను.

కృతయుగంలో ప్రత్యేకమైన భగవంతుని అవతారాలు లేవు.ఉండవు కూడా.ఎందుకంటే సత్యమూ ధర్మమూ నాలుగు పాదాలతో పరిపూర్ణంగా నడుస్తున్న స్థితిలో ఇతరములైన ప్రత్యేక అవతారాల అవసరం ఉండదు.

చేపగా,తాబేలుగా,సూకరంగా,నరసింహంగా ఇలా ప్రకృతిలో ఉండే జీవుల రూపంలోనే కృతయుగపు కాలంలో భగవంతుడు కనిపించాడు. త్రేతాయుగంలో మాత్రమే మానవ ఆకారంలో ఉన్న అవతారాలు వచ్చాయి. వామనావతారం దానిలో ప్రధమమైనది.అంటే కృతయుగంలో ప్రకృతినీ దానిలోని జీవులనూ దైవంగా భావించే విశాలదృక్పధం ఆ యుగంలోని మానవులకు ఉంటుంది.అక్కడ ప్రత్యేకమైన దైవాలూ మానవ ఆకారంలో ఉన్న అవతారాలూ ఉండవు.ప్రవక్తలూ మహాపురుషులూ అసలే ఉండరు.ఎందుకంటే ఆ యుగపు మానవులకు అలాంటి అవసరం ఉండదు. సరాసరి ప్రకృతిలోనే దైవాన్ని దర్శించగలిగే ప్రజ్ఞ వారిలో ఉంటుంది.

మన లెక్కప్రకారం ప్రస్తుతం 1800 AD నుంచి మొదలైన త్రేతాయుగం 200 సంవత్సరాలు మాత్రమే గడచింది.అంటే,ఇంకా 3400 సంవత్సరాల కాలం గడిచాక అప్పుడు 4800 సంవత్సరాల నిడివిగల కృతయుగం మొదలౌతుంది.మనం ప్రస్తుతం 12000 సంవత్సరాల వ్యావహారిక ఆరోహణా యుగచక్రంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి.

ఇప్పుడు ఊహించండి.

గత రెండువందల ఏళ్ళుగా చరిత్రను పరిశీలిస్తే,ఇప్పటికే దైవం గురించి మానవుని దృక్పధంలో ఎంతో మార్పు వచ్చినట్లు మనకు తెలుస్తుంది.

"మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకునే ఆటవిక సంస్కృతి క్రమేణా తగ్గుతూ వచ్చి,అన్ని దేశాలలోనూ అన్ని సంస్కృతుల లోనూ మహాపురుషుల జననం జరిగింది.అన్నిచోట్లా అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ ఆయా ప్రజలకు తగినట్లుగా దైవాన్ని చేరుకునే మతాలూ మార్గాలూ ఉపదేశింపబడ్డాయి"- అనిన ఒక విధమైన విశాలదృక్పధం నేటి మానవులకు మెల్లిగా అలవడుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు.

ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే,మానవుని ఆలోచనలోనూ ఒకరినొకరు అర్ధంచేసుకునే పద్ధతిలోనూ ఇంకా 3400 సంవత్సరాల తర్వాత ఇంకెంత మార్పు రాబోతున్నది?

ఆలోచించండి.

అప్పటికి- "దైవం అంటే వేరే ఎక్కడో లేదు ప్రకృతే దైవం,జీవులలోనే దైవం ఉన్నాడు,ఈ సృష్టిలోని సమస్తంలోనూ దైవం నిండి ఉన్నాడు వేరే ఎక్కడో వెతకవలసిన అవసరం లేదన్న" మహోన్నత భావన తప్పకుండా ఈ భూమిపైన అప్పటికి ఉండే మానవులకు కలుగుతుంది.ఉత్త భావన కలగడమే కాదు,దానికి సరిపోయే సైంటిఫిక్ పరిజ్ఞానం కూడా అప్పటికి కనుగొనబడుతుంది.అప్పటికి ఉండే సైన్స్ ను ఇప్పుడున్న మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం.అంతటి విప్లవాత్మకములైన మార్పులు సైన్స్ రంగంలో ఇంకొక 3400 ఏళ్ళలో కలుగబోతున్నాయి.

ఆ తర్వాత రాబోయే 4800 ఏళ్ళపాటు ఉండే ఆరోహణా కృతయుగంలో దేవతలే ఈ భూమిమీద తిరిగే రోజులు వస్తాయి.కృతయుగంలో దేవతలూ ఇతరలోకాలలో ఉండే మహనీయులూ ఈ భూమిమీద తిరిగారని మన పురాణాలు చెబుతున్నాయి.అంటే ఇతర గ్రహాలలో గేలక్సీలలో ఉన్న జీవులు ముందు ముందు ఇంకొక 5000-6000 సంవత్సరాలలో మన భూమిమీదకు వచ్చి తిరుగబోతున్నారు.మనం కూడా చంద్రుడూ అంగారకుడూ మొదలైన ఇంకా ఇతర గ్రహాలకూ,ఇతర గెలాక్సీలకూ కూడా వెళ్లి అక్కడ ఉండే జీవులతో స్నేహం చెయ్యబోతున్నాం.ఇవన్నీ కృతయుగం అనబడే రాబోయే 3400 సంవత్సరాల నుంచి 8200 సంవత్సరాల లోపు ఖచ్చితంగా జరుగుతాయి.

అంటే,కృతయుగపు లక్షణాలైన అతీతశక్తులూ,తలచుకున్న క్షణంలో ఏదైనా పొందగలగడమూ,సద్యోగర్భాలూ,దూరలోక గమనమూ,ఇతర లోకాలలో ఉన్న జీవులతో సంబంధాలూ,వారు వచ్చి మన భూమిమీద సంచరించడమూ అప్పటికి భూమిమీద నిత్యకృత్యాలు అవుతాయి.కనుకనే అది కృతయుగం అవుతుంది.

కనుక ప్రస్తుతం జరుగుతున్నది వ్యావహారిక త్రేతాయుగమే అని నేనంటున్నాను.

ఇదంతా చదివిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్నది త్రేతాయుగమే అని నేననే మాటలో నిజం ఉన్నదని ఒప్పుకోవాలనే మీకూ అనిపిస్తున్నది కదూ?

కానీ అలా ఒప్పుకోడానికి ఏదో అడ్డు వస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది.అలా అడ్డు వచ్చే ఆలోచన చాలా బలహీనమైనది.చిన్నచిన్న సవరణలు కొన్ని మీ ఆలోచనలలో చేస్తే ఈ అడ్డు వెంటనే తొలగి పోతుంది.

ఆ సవరణలు ఏమంటే-

1) సృష్టిలో రెండుయుగాలు ఏకకాలంలో నడుస్తూ ఉన్నాయన్న విషయం మొదటగా గుర్తించాలి.అవి Macro మరియు Micro యుగాలు.

2) Macro స్థాయిలో ప్రస్తుతం కలియుగం మొదటి పాదమే నడుస్తున్నది.ఇది మహాసంకల్పానుసారం,దైవయుగప్రమాణం అయిన 43,20,000 సంవత్సరాల దైవయుగాన్నీ,మన్వంతరాలనూ,కల్పాన్నీ,బ్రహ్మదేవుని జీవితకాలాన్నీ అనుసరిస్తుంది.ఈ లెక్కలన్నీ ముందు పోస్టులలో వివరించాను.

3) రెండవదైన Micro యుగాల స్థాయిలో ప్రస్తుతం వ్యావహారిక యుగాల 12,000 యుగప్రమాణపు లెక్కప్రకారం ఆరోహణా త్రేతాయుగం నడుస్తున్నది.

4) ఇలా నడవడానికి ఏమీ అభ్యంతరం ఉండనవసరం లేదు.ఎందుకంటే, జ్యోతిష్యజ్ఞానం కొద్దిగా తెలిసినవారికి దశలు వాటిలోని అంతర్దశల వలె ఈ మేక్రో మరియు మైక్రో యుగాలు ఉంటాయన్న విషయం తేలికగా అర్ధమౌతుంది.

5) కనుక నిత్యసంకల్పంలో "కలియుగే ప్రధమే పాదే" అని చెప్పిన తర్వాత "వ్యావహారిక యుగచక్రే త్రేతాయుగే" అని చెబుతూ అక్కడనుంచి ఇప్పుడు నడుస్తున్న 214 సంవత్సరాన్ని"ద్విశతాధిక చతుర్దశ సంవత్సరే" అని చెప్పుకుంటే చక్కగా సరిపోతుంది.

6) ఈ గొడవంతా ఎందుకని అనుకునేవారు "కలియుగే ప్రధమే పాదే" తోనే ఆపి దైవయుగపూర్వకమైన సాంప్రదాయ సంకల్పాన్ని అనుసరిస్తే అది మరీ మంచిది.

విషయం అంతా ఇప్పుడు చక్కగా అర్ధమైంది కదూ.

(ఇంకా ఉన్నది)
read more " యుగసిద్ధాంతం-6(స్వామి యుక్తేశ్వర్ గిరిగారి లెక్క తప్పిందా?ప్రస్తుతం నడుస్తున్నది త్రేతాయుగమా?) "

18, సెప్టెంబర్ 2014, గురువారం

షష్టి-సప్తమి-యోగజాతకుల జనన సమయం

ఒక స్నేహితురాలు అమెరికానుంచి మొన్న మాట్లాడుతూ షష్టి సప్తమి రోజులలో బాగా డిస్టర్బ్ అయ్యాననీ ఎందుకో తెలియడం లేదనీ చెప్పింది.తనకు సైకిక్ ఎబిలిటీస్ ఉన్నాయి గనుక విశ్వంలో ఒక మార్పు జరిగినప్పుడూ కొన్ని ప్రత్యెక సందర్భాలు ఖగోళంలో ఏర్పడినప్పుడూ ఇటువంటి వ్యక్తులకు అలా ఏదో తెలియని మానసిక అలజడి కలగడం సహజమే.అదే విషయం తనకు చెప్పాను.

మొన్న 14-9-14 న షష్టి రోజున ఖగోళంలో ఒక మంచి యోగసమయం వచ్చింది.అదే పరిస్థితి 15-9-2014 సప్తమి రోజున కూడా ఉన్నది.ఈ రెండురోజుల్లో మంచి యోగజాతకులు కొందరు ఈ భూమి మీద జన్మించారు.వారు ఇంతకు ముందు జన్మలలోనే ఆధ్యాత్మికంగా మంచి స్థాయిని అందుకున్న ఆత్మలు.ప్రస్తుతం ఈ జన్మలో వారికీ లోకంతో ఉన్న ఋణానుబంధాన్ని తీర్చుకోడానికి మళ్ళీ జన్మ ఎత్తారు.

గురువూ శనీశ్వరుడూ ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఖగోళంలో ఉన్నారు.ఆ రెండురోజుల్లో చంద్రుడు కూడా ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు.బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు.సూర్యుడు స్వక్షేత్రం లో ఉన్నాడు.కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు.కనుక నాలుగుగ్రహాలు ఉచ్ఛస్థితిలోనూ రెండు గ్రహాలు స్వక్షేత్రం లోనూ ఉన్న స్థితి ఈ రెండురోజుల్లో ఉన్నది.కనుక యోగజాతకులైనవారు భూమిపైన జన్మించడానికి ఇది చాలా మంచి సమయం.

జూలైలో గురువుగారు కర్కాటక రాశిలో ప్రవేశించారు.శనీశ్వరుడు నవంబర్లో తులారాశినుంచి పక్కకు వెళ్ళిపోతాడు.కనుక మధ్యలోని నాలుగు నెలల కాలం మాత్రమె వారిద్దరూ ఉచ్చస్థితిలో ఉంటారు.

ఈ నాలుగు నెలల్లో చంద్రుడు నాలుగుసార్లు ఉచ్చస్తితిలోకి వస్తాడు.కానీ సూర్యుడు ఆగస్ట్-సెప్టెంబర్ మధ్యలోనే సింహరాశిలో స్వక్షేత్రంలో ఉంటాడు. అలాంటి ఒక యోగకారక కాలం మొన్న ఈ రెండురోజుల్లో ఖగోళంలో వచ్చింది.

ఆ రెండు రోజులలో శనివర్గ రాశులైన మకర,వృషభ,మిధున,తులా రాశులలో జన్మించిన శిశువులు పెరిగి పెద్దవారైనప్పుడు మంచి యోగజీవితాన్ని (అంటే ఆధ్యాత్మికపరమైన జీవితాన్ని) గడుపుతారు.రాహుకేతువులు ప్రస్తుతం అనుకూల స్థితులలో లేరు గనుక వీరిది ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరమైన జీవితాలే అవుతాయి గాని లౌకిక పరమైన జీవితాలు కావు. 

పైగా ఇక్కడ ఒక మర్మం ఉన్నది.

గురువూ శనీశ్వరుడూ ఇద్దరూ ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు గురువుగారి దృష్టి శనీశ్వరుని మీద ఉండదు.కానీ శనీశ్వరుని దృష్టి గురువుగారి మీద ఉంటుంది.పైగా వీరిద్దరి మధ్యన కేంద్ర దృష్టి ఉంటుంది.

కనుక అలాంటి సమయంలో పుట్టే జాతకులు లోకంతో ఆధ్యాత్మికపరమైన కర్మఋణాన్ని కలిగిఉంటారు.భోగపరమైన ఋణాన్ని కాదు.ఆ ఋణాన్ని తీర్చుకోడానికే ఈ సమయంలో వారు పుడతారు.పెద్దవారైనాక వారు ఆధ్యాత్మికంగా మంచి స్థాయులు అందుకుంటారు.లోకానికి ధర్మబోధను ఆధ్యాత్మిక బోధను గావిస్తారు.

ఈ అవకాశం గురువర్గాలలో పుట్టినవారికి లేదు.శనివర్గాలలో పుట్టినవారికే ఈ యోగాలు పడుతున్నాయి.కనుక వీరివి కర్మజాతకాలని చెప్పక తప్పదు. అంటే లౌకిక సుఖాలు అనుభవించే జాతకాలు వీరివి కావు.లోకంతో ఉన్న ఆధ్యాత్మిక ఋణాన్ని తీర్చుకోవడానికి ఈ సమయంలో ఆ జీవులు భూమిమీదకు వచ్చారు.

పైగా ప్రస్తుతం పితృదేవతలకు చెందిన మహాలయ పక్షాలు నడుస్తున్నవి. కనుక పితృలోకాలనుంచి ఈ జీవులు ఇప్పుడు భూమిమీదకు వచ్చారని నేను చెబుతున్నాను.

మొన్న ఆ రెండురోజుల్లోనూ భాద్రపద బహుళ షష్టి మరియు సప్తమి తిధులు నడిచాయి.వీరిలో మళ్ళీ షష్టినాడు పుట్టిన వారికంటే సప్తమినాడు పుట్టినవారి జాతకాలు ఎక్కువ ఆధ్యాత్మికమైన బలంతో ఉంటాయి.నేను చెప్పిన లగ్నాలలో పుట్టిన పిల్లల తల్లిదండ్రులను గమనించండి.వారిలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీన్స్ ఉంటాయి.వారివారి వంశాలలో పాతకాలంలో మహనీయులైన వ్యక్తులు ఖచ్చితంగా ఉండి ఉంటారు.

ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదంటే,అలా చెబితే,ఆశపోతులూ ఆత్రగాళ్లైన కొందరు తల్లితండ్రులు ఆయా సమయాలకు ఆపరేషన్లు చేయించి మరీ వారివారి శిశువులను ముందే బయటకు తీయించే ప్రయత్నం కూడా చేస్తారు.నేటి ఆశపోతు ప్రజలకు ఇది సహజమే.అందుకే ఈ విషయాన్ని ముందుగా నేను వ్రాయలేదు.

సృష్టిలోని కర్మవలయాన్నీ,గ్రహప్రభావాన్నీ,మనమీద మన కంటికి కనిపించని సూక్ష్మశక్తుల ప్రభావాలనూ  గమనిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.

ఆ సమయాలలో ఆపరేషన్ ద్వారా కాకుండా సహజంగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

ఇప్పుడు పుట్టిన మీమీ పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచండి.ఎందుకంటే,వాళ్ళు ముందుముందు మహనీయ వ్యక్తులుగా రూపుదిద్దుకోబోతున్నారు.వాళ్ళు ఎవరో కాదు.మీ పితృదేవతలలోని మహనీయులే ఇప్పుడు మీ పిల్లలుగా జన్మించారు.వారిని జాగ్రత్తగా పెంచండి.అందుకోసం ముందుగా మీమీ జీవితాలను చక్కదిద్దుకోండి.మీ పిల్లలకు చెప్పాలంటే ముందు మీరు సక్రమంగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి.

వారి జీవితగమనంలో మీ పాత్రను సరిగ్గా పోషించి మీ జీవితాలకు కూడా సార్ధకతను తెచ్చుకోండి.

మరొక్కసారి ఆ శిశువుల తల్లిదండ్రులకు నా అభినందనలు.
read more " షష్టి-సప్తమి-యోగజాతకుల జనన సమయం "

17, సెప్టెంబర్ 2014, బుధవారం

యుగసిద్ధాంతం-5(మహాసంకల్పం-బ్రహ్మదేవుని ప్రస్తుత వయస్సు)

భగవద్గీతలో కూడా యుగముల గురించిన ప్రస్తావన వస్తుంది.

శ్లో||సహస్ర యుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు:

రాత్రిం యుగసహస్రాంతాం తే అహోరాత్రా విదో జనా:

(భగవద్గీత 8:17)

వెయ్యి యుగములు బ్రహ్మకు ఒక పగలు.అంతే సమయం ఆయనకు ఒక రాత్రి.ఈ విషయం పగలూ రాత్రుల జ్ఞానం కలిగినవారికి తెలుసు-అని భగవద్గీత అంటుంది.


అయితే ఈ 'మహాయుగం' అనేమాట లోనే తేడాలున్నాయి.యుగముల లెక్కలలో రెండు వర్గాలున్నాయి.

ఒకటి సనాతనవర్గం.వీరు దైవయుగాలను లెక్కిస్తారు.అంటే మానవ మహాయుగం వేరు.దైవమహాయుగం వేరు అని వీరంటారు.రెండూ ఉన్నాయి గాని సృష్టి గణనానికి దైవయుగాలనే లెక్కించాలని వీరంటారు.

రెండు నవీనవర్గం.వీరు మానవయుగాలనే లెక్కించాలంటారు.దైవయుగం అనేది లేదని వీరి వాదన.

నవీనవర్గంలోకి బాలగంగాధరతిలక్ గారు,స్వామి యుక్తెశ్వర్ గిరిగారు,శ్రీ రామశర్మ ఆచార్యగారూ వస్తారు.వీరి లెక్కల ప్రకారం యుగం అనేది 12,000 సంవత్సరాలు మాత్రమే.దైవయుగం అనేది లేదు.అంటే దీనిని 360 తో హెచ్చించవలసిన పని లేదని వీరంటారు.అనేక పురాణ శ్లోకాలలో ఉన్న 'దైవ' అనే పదం ఉత్త విశేషణం మాత్రమేగాని అది దేవతల యుగాన్ని సూచించదని వీరి నమ్మకం.

రెండువర్గాల వారి వాదనల ప్రకారమూ లెక్కించి చూద్దాం.

మొదటి వర్గం వారి లెక్క

ఒక యుగప్రమాణం=12000 సంవత్సరాలు
అలాంటివి ఒక వెయ్యి అయితే బ్రహదేవుని ఒక దినం గనుక,
బ్రహ్మదేవుని ఒక పగలు=1,20,00,000
=1.2 కోట్ల సంవత్సరాలు

మనకు తెలిసిన విశ్వం వయస్సు 1375 కోట్ల సంవత్సరాలు.

మొన్నమొన్నటి వరకూ విశ్వం వయస్సు 2000 కోట్ల సంవత్సరాలని శాస్త్రజ్ఞులు అనుకున్నారు.కానీ ఇప్పుడు నవీన లెక్కల ప్రకారం 1375 కోట్ల సంవత్సరాలని అంటున్నారు.అది మళ్ళీ మారే అవకాశం ఉన్నది.

బ్రహ్మదేవుని ఒక పగలు అయిపోయిన తర్వాత రాత్రి వస్తుంది గనుక,రాత్రి సమయం ప్రళయం గనుక మనం లెక్కించలేము గనుకా మనకు తెలిసిన విశ్వం వయస్సు బ్రహ్మదేవుని పగటి ప్రమాణం లోపే ఉండాలి.అంటే ప్రస్తుతం ఇంకా పగలే జరుగుతూ ఉండాలి.అదే ప్రస్తుతం రాత్రి అయితే, ఈ లెక్కలు వెయ్యడానికి మనం ఎవ్వరమూ మిగిలి ఉండము.

ఈ లెక్క ప్రకారం బ్రహ్మదేవుని పగలు 1.2 కోట్ల సంవత్సరాలే.కనుక 1375 కోట్ల సంవత్సరాల కాలం దీనిలో ఇమడదు గనుక ఈ లెక్క తప్పు అని తేలుతున్నది.ఒకవేళ 1375 కోట్లు అనే సంఖ్య తప్పు అయినా + or - కొంత తేడా ఉంటుంది గాని మరీ 1 నుంచి 1375 అంత తేడా ఉండదు.

పోనీ బ్రహ్మ తన జీవితకాలం మొదట్లో సృష్టి చేసినది ప్రస్తుత విశ్వాన్నే అనుకుంటే అప్పుడు 1375/2.4=572.91 అంటే 572 రోజులు ఆయన జీవితంలో ఇప్పటివరకూ గడచి ఇప్పుడు 573 రోజులో 2,18,40,000 సంవత్సరాల కాలం అయిపోయి ఉండాలి.పోనీ అలా అనుకుంటే కూడా 360 రోజులు ఒక సంవత్సరం గనుక ప్రస్తుతం 573 వ రోజుగా రెండో సంవత్సరమే జరుగుతూ ఉండాలి.

కానీ మనకు తెలిసిన ఇతర వివరాల ప్రకారం ఆయన జీవితంలో ప్రస్తుతం 50 ఏళ్ళు గడచి 51 వ ఏడు జరుగుతున్నది గనుక 50x2.4x360 cr=43,200 కోట్ల సంవత్సరాలు ఆయన జీవితంలో ఇప్పటికి గడచి ఉండాలి.

కనుక లెక్క సరిపోవడం లేదు.

దీనిలో ఇంకొక లొసుగు కూడా ఉన్నది.బ్రహ్మజీవిత కాలంలో ప్రతిరోజూ చీకటిపడిన తర్వాత మనకు ప్రళయం అవుతుంది.ఆ ప్రళయ సమయాన్ని మన లెక్కలు అందుకోలేవు.ఒక పగటి సమయాన్ని మాత్రమే మనం అందుకోగలం లెక్కించగలం.ఒక వేళ మొదటినుంచీ ప్రతిరోజూ అనేక ప్రళయాలను పొందుతూ వస్తున్న విశ్వపు వయస్సు 1375 కోట్ల సంవత్సరాలని మనం అనుకున్నప్పటికీ ఈ లెక్క సరిపోవడం లేదు. 

ఈ రెంటికీ లెక్క పొసగడం లేదు గనుక మొదటి వర్గం వారి లెక్క తప్పని తేలిపోతున్నది.

ఇక రెండవదైన సనాతన వర్గం వారి లెక్కను పరిశీలిద్దాం.

రెండవ వర్గం వారి లెక్క

వీరి లెక్కప్రకారం బ్రహ్మదేవుని జీవితకాలంలో ఒకరోజు=864 కోట్ల సంవత్సరాలు.

ఒక రోజు=864 కోట్లు
మరుసటి రోజు పగలు=432 కోట్లు
----------------------------------
మొత్తం =1296 కోట్ల సంవత్సరాలు

ఇది నేటి విశ్వపు వయస్సుకు దగ్గరదగ్గరగా వస్తున్నది.కానీ ఇది కూడా పూర్తిగా సరిపోవడం లేదు.ఎందుకంటే ప్రస్తుత విశ్వపు వయస్సు అయిన 1375 కోట్ల సంవత్సరాల కాలం రాత్రి సమయంలో పడుతున్నది.రాత్రిపూట ప్రళయం అవుతుంది.మనం ప్రస్తుతం ప్రళయంలో లేము.సృష్టిలోనే ఉన్నాము గనుక ఈ లెక్క కూడా సరికాదు.కానీ మొదటివర్గం కంటే చాలా దగ్గరగా వచ్చింది.

విశ్వపు నేటి లెక్క అయిన 1375 కోట్ల సంవత్సరాలు కూడా సరియైన లెక్క అని చెప్పలేము.ఎందుకంటే మొన్నటివరకూ విశ్వం వయస్సు రెండువేల కోట్ల సంవత్సరాలని చెప్పిన శాస్త్రవేత్తలు ఈ మధ్యన దానిని మార్చి అది 1375 కోట్లు మాత్రమే అంటున్నారు.ఈ సంఖ్య ఇంకా కొంచం క్రిందకు దిగి 1200 లోపలకు వస్తే అప్పుడు సనాతనవాదుల లెక్కతో కరెక్ట్ గా సరిపోతుంది.

కనుక సనాతనవాదుల ఉద్దేశ్యం అయిన దైవయుగం=360xమానవయుగం అనే లెక్క మాత్రమే సరియైనది అని తెలుస్తున్నది. 

కనుక యుక్తేశ్వర్ గిరిగారు కూడా లెక్కలలో పొరపాటు పడ్డారని చెప్పక తప్పదు.

బ్రహ్మదేవుని ప్రస్తుత వయస్సు

ఇప్పుడు మనకు తెలిసిన లెక్కల ప్రకారం బ్రహ్మదేవుని వయస్సు ఎంతో గమనిద్దాం.

బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మంది మనువులు పుట్టి గతిస్తారు.

వారి వివరాలు ఏమిటంటే-
  • స్వాయంభువ మనువు
  • స్వారోచిష మనువు
  • ఉత్తమ మనువు
  • తామస మనువు
  • రైవత మనువు
  • చాక్షుష మనువు
  • వైవస్వత మనువు
  • సావర్ణి మనువు
  • దక్ష సావర్ణి మనువు
  • బ్రహ్మ సావర్ణి మనువు
  • ధర్మసావర్ణి మనువు
  • రుద్ర సావర్ణి మనువు
  • దేవ సావర్ణి మనువు
  • ఇంద్ర సావర్ణి మనువు
ఏడవ మనువు 71 దివ్యయుగాలలో 27 దివ్యయుగాలు గతించి 28 వ దివ్యయుగం ప్రస్తుతం నడుస్తున్నది.

ఇక్కడ మహాసంకల్పాన్ని కొంచం గమనిద్దాం.సంకల్పం అనేది సృష్టి మొదలు నుంచి మొదలై,ప్రధమంగా కాలస్మరణమూ తరువాత దేశ స్మరణమూ ఆ తర్వాత గోత్రఋషుల స్మరణమూ ఆ తరువాత తనపేరు చెప్పి ఆ తర్వాత చెయ్యబోతున్న కర్మస్మరణం ఉంటుంది.

అంటే-
  • కాలస్మరణం
  • దేశ స్మరణం
  • గోత్రస్మరణం
  • కర్మస్మరణం
వీటితో కూడినదే మహాసంకల్పం.

శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య = శ్రీమహావిష్ణువు ఆజ్ఞతో నడచుచున్న

అద్యబ్రహ్మణ:=బ్రహ్మదేవుని

ద్వితీయ పరార్ధే=రెండవ సగభాగంలో

శ్వేత వరాహకల్పే=శ్వేతవరాహ కల్పంలో

వైవస్వత మన్వంతరే=వైవస్వతుడనే మనువు యొక్క కాలంలో

కలియుగే ప్రధమే పాదే=కలియుగపు ప్రధమపాదంలో

ఇక్కడ కొందరు వ్యావహారిక శకాలను స్మరిస్తారు.

ఇంతవరకూ కాలస్మరణం.ఇక్కడనుంచి దేశస్మరణం జరుగుతుంది.

భరతవర్షే భరతఖండే మేరో:---దిగ్భాగే....అంటూ సాగిసాగి చివరకు తామున్న ఇంటివరకూ సంకల్పంలో వస్తుంది.

ఆ తర్వాత తమ గోత్రనామాదులను స్మరించి,తాను ఏమి చెయ్యబోతున్నాడో ఆ కర్మను స్మరించి సంకల్పపూర్వకంగా నీటిని తాకి ఆ కర్మసంబంధిత మంత్రములను చదవుతూ ఆ కర్మను చెయ్యడం జరుగుతుంది.

ఇందులోని కాలగణన భాగంలోని మాటల లెక్కను గమనిద్దాం

A) బ్రహ్మదేవుని 50 ఏండ్లు=50x360x864 కోట్ల సంవత్సరాలు
=1,55,52,000 కోట్ల సం.

B) మొదటిదైన శ్వేతవరాహ కల్పంలో ఆరుగురు మనువులు గతించారు.
=6x71x43,20,000(ఒక మహాయుగం నిడివి)
=1,84,03,20,000 సం.

C) ఏడవవాడైన వైవస్వత మనువు కాలంలోని 71 మహాయుగాలలో 27 గడిచాయి.

=27x43,20,000=11,66,40,000

D) 28 వ మహాయుగంలో కలియుగం మొదటిపాదంలో ప్రస్తుతం మనం ఉన్నాం.

=కృతయుగం 1728000
=త్రేతాయుగం 1296000
=ద్వాపరయుగం 864000
---------------------------
=                   38,88,000

కనుక బ్రహ్మదేవుని ప్రస్తుత వయస్సు = A+B+C+D

అంటే 1,55,52,195,69,60,000.4 సంవత్సరాలు గడచి ఆ తర్వాత 1,72,800 సంవత్సరాలలోపు కాలంలో మనం ప్రస్తుతం ఉన్నాం.

దీనిని సులభంగా చెప్పాలంటే,

2000 దైవయుగాలు(బ్రహ్మదేవుని ఒకరోజు)x360x50+6 మన్వంతరాల కాలం+ఏడో మన్వంతరం లోని కృత,త్రేతా,ద్వాపర యుగాలు గడచి కలియుగం మొదటిపాదం జరుగుతున్న సమయంలో మనం ప్రస్తుతం ఉన్నామన్నమాట.

(ఇంకా ఉన్నది)
read more " యుగసిద్ధాంతం-5(మహాసంకల్పం-బ్రహ్మదేవుని ప్రస్తుత వయస్సు) "

15, సెప్టెంబర్ 2014, సోమవారం

యుగసిద్ధాంతం-4(పురాణాలలో సృష్టిక్రమం)

మన పురాణాలలో సృష్టి అధ్యాయం ఒకటి తప్పకుండా ఉంటుంది.

అంటే-

అసలు సృష్టి ఎలా మొదలైనది? ఈ సృష్టిలో ఏయే లోకాలు ఎలా ఉంటాయి?వాటి వరుసలు ఏమిటి? కాలం అంటే ఏమిటి? మానవ పితృ దైవ కాలమానాలు ఎలా ఉంటాయి? మొదలైన వివరాలు వాటిలో ఇవ్వబడినాయి.

మహాభాగవతం తృతీయస్కంధం పదకొండో అధ్యాయంలో సృష్టి వర్ణనమూ కాలవిభజనమూ ఉన్నాయి.అలాగే విష్ణుపురాణంలో ఉన్నాయి.బ్రహ్మాండ పురాణంలో కూడా ఉన్నాయి.ఇవన్నీ ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయి(స్వల్ప భేదాలతో).

నేటి సైన్స్ నిన్నగాక మొన్న కనుక్కున్న అణువు పరమాణువు మొదలైన మాటలు మన పురాణాలలో వేల సంవత్సరాల నాడే వాయబడి ఉన్నాయి.మన పురాణాలలో ఇవి వ్రాయబడిన సమయానికి నేడు వరల్డ్ లీడర్స్ అని చెప్పబడుతున్న దేశాలు కొన్ని లేనే లేవు.అవి అప్పటికి పుట్టనే లేదు.

మన పురాణాలు వ్రాయబడిన సమయానికి ఆయా దేశాలలోనూ ఉన్న మనుషులకు కనీసం బట్టలు ఎలా కట్టుకోవాలన్న విషయం కూడా తెలియదు.అంతటి ఆటవికస్థితిలో వాళ్ళు ఆ సమయంలో బ్రతుకుతున్నారు. అదే సమయానికి మన ఋషులు ప్రపంచం యొక్క స్థితినీ గతినీ సృష్టినీ ప్రళయాన్నీ ఆయా కాలగమనాలనూ కూడా స్పష్టంగా అర్ధం చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు.

ఈ విషయాన్ని పరికిస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ విషయంలో మహాభాగవతం ఏమంటున్నదో చూద్దాం.

చరమః సద్విశేషాణామనేకో సంయుత: సదా
పరమాణు సవిజ్నేయో నృణామైక్య భ్రమో యత:

అనేకములుగా కనిపిస్తున్న ఈ సమస్తానికీ మూలం పరమాణువే.ఇవి అన్నీ నశించినా అది నశించదు ఏక రూపంలో నిలిచి ఉంటుంది.ఈ విషయం తెలియక మానవుడు భ్రమలో మునిగి ఉంటాడు.

ఈనాడు సైన్స్ చెబుతున్న మాటనే భాగవతం వేల ఏళ్ళనాడు చెప్పింది. అణువు పరమాణువు అనేమాటలు భాగవతంలో మనకు కనిపిస్తాయి.వీటిని కనుక్కోక ముందు,ఎందఱో ఈ భావాలు చదివి ఎగతాళి చేసేవారు.ఇప్పుడు వారే నోళ్ళు మూసుకుంటున్నారు.

అహంకారమూ దురుసుప్రవర్తనా కలియుగపు ప్రజల సహజలక్షణాలు. విచిత్రమేమంటే ఆధ్యాత్మికులుగా చెప్పుకునే వారిలోకూడా ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.వారిది ఏ రకమైన ఆధ్యాత్మికతో వారికెలాగూ అర్ధం కాదు.కనీసం వారి సోకాల్డ్ గురువులకైనా అర్ధమైతే అదే చాలు.

సత ఏవ పదార్ధస్య స్వరూపావస్తితస్య యత్
కైవల్యం పరమ మహాన్విషేశో నిరంతర:

మనకు కనిపించే పదార్ధం యొక్క స్వరూపమూ స్థితీ కూడా కేవలం అయిన పరమాణువులే.వాటికి ఏ విశేషమూ లేదు.అవి నిరంతరం నిలిచి ఉన్నాయి.

ఏవం కాలోప్యనుమిత: సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ
సంస్థాన భుక్త్యా భగవానవ్యక్తో వ్యక్తభుగ్విభు:

కనుక కాలమును స్థూల సూక్ష్మ ఉత్తమ స్థితులలో కొలవగలము.ఈ పరమాణువుల రకరకాల మేళవింపుల ద్వారా కదలికల ద్వారా,కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని భగవంతుడు నియంత్రిస్తున్నాడు.కాని తానుమాత్రం ఎవరికీ కనిపించకుండా ఉంటాడు.

స కాల: పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతామ్
సతో విశేష భుగ్యస్తు కాల: పరమో మహాన్

పరమాణు కాలం పరమాకాశగమనం లో కొలవబడుతుంది.స్థూల మహాకాలం అనేది స్థూలంగా కొలవబడుతుంది.

స్థూలమైన వాటిని కొలవాలంటే స్థూలవిధానాలు అవసరమనీ సూక్ష్మమైన వాటిని కొలవడానికి సూక్ష్మవిధానాలే శరణ్యమనీ ఇక్కడ సూచన ఉన్నది.

అన్నింటినీ సైన్స్ పరికరాలతో కొలవటం సాధ్యం కాదు.ఆత్మ ఉనికిని ఏ సైన్స్ పరికరమూ నిరూపించలేదు.ఎందుకంటే భౌతిక పరికరాల స్థితీ స్థాయీ వేరు. ఆత్మయొక్క స్థితీ స్థాయీ వేరు.కనుక వాటితో ఆత్మను నిరూపించడం ఎన్నటికీ సాధ్యం కాదు.

పరమాణువు నుంచి బ్రహ్మదేవుని వరకూ కాలగణనం

అణుద్వౌ పరమాణూ స్యాత్రసరేణు స్త్రయ: స్మృత:
జాలార్క రశ్మ్వ్యవగత: ఖమేవానుపతన్నగాత్

రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది.అవి మూడు కలిస్తే ఒక త్రసరేణువు అవుతుంది.ఇవన్నీ ఎలాఉంటాయో చూడాలంటే ఒక వలలో(network)నుంచి ప్రసరిస్తున్న సూర్యరశ్మిలో చూస్తే ఆకాశంవైపు ఎగసిపోతున్న అనేక సూక్ష్మరేణువులు కనిపిస్తాయి కదా.ఈ అణువులూ పరమాణువులూ ఆ విధంగా ఉంటాయి.

త్రసరేణు త్రికం భుంక్తే య: కాల: స త్రుటి స్మృత:
శతమాగస్తు వేధ: స్యాత్తై స్త్రిభిస్తు లవ: స్మృత:

మూడు త్రసరేణువులు కలవడానికి ఎంత సమయం పడుతుందో అది త్రుటి అవుతుంది.నూరు త్రుటులు ఒక వేధ అనబడుతుంది.అవి మూడు కలిస్తే లవము అనబడుతుంది.

నిమేషస్త్రిలవో జ్ఞేయ:అమ్నాతస్తే త్రయ క్షణ:
క్షణాన్ పంచవిదు: కాష్టాం లఘు తా దశ పంచ చ

మూడు లవములు ఒక నిముషం.మూడు నిముషములు ఒక క్షణం అవుతుంది.అయిదు క్షణములు ఒక కాష్టము అవుతుంది.పదిహేను కాష్టములు ఒక లఘువు అవుతుంది.

లఘూనివై సమామ్నాతా దశ పంచచ నాడికా
తే ద్వే ముహూర్త: ప్రహర: షడ్యామ: సప్తవా నృణాన్

పదిహేను లఘువులు ఒక నాడి అవుతుంది.ఇవి రెండు కలిస్తే ఒక ముహూర్తం అవుతుంది.ఆరు లేదా ఏడు నాడులు కలిస్తే ఒక ప్రహరం(ఝాము) అవుతుంది.

ద్వాదశార్ధ పలోన్మానం చతుర్భిశ్చతురంగులై:
స్వర్నమాషై క్రుతస్చిద్రం యావత్ప్రస్థ జలప్లుతం

నాడి అనే కాలమానాన్ని కొలిచే పరికరం తయారుచేసే విధానం:--

ఆరు పలముల బరువున్న ఒక రాగిపాత్రలో నాలుగు అంగుళముల రంధ్రాన్ని ఒక బంగారుమాసం తో చెయ్యాలి.ఈ పాత్రను నీటిపైన ఉంచినపుడు దానిలో నీరు ప్రవేశించి అది పూర్తిగా మునగడానికి పట్టే సమయం ఒక నాడీకాలం.

యామాశ్చత్వార చత్వారో మర్త్యానామహనీ ఉభే
పక్ష: పంచదశాహాని శుక్ల కృష్ణశ్చ మానద

నాలుగు నాలుగు యామములు(ఝాములు) పగలు రాత్రులలో ఉంటాయి.అలాంటి పదిహేను రోజులు ఒక పక్షంలో ఉంటాయి.అలాంటి రెండు పక్షములు(శుక్ల,కృష్ణ పక్షములు) కలసి ఒక మాసం అవుతుంది.

తయో సముచ్చయో మాస: పిత్రునాం తదహర్నిశం
ద్వౌ తావ్రుతు: షడయనం దక్షిణం చోత్తరం దివి:

అలాంటి ఒక మాసం పితృదేవతలకు ఒక రోజు అవుతుంది.రెండు మాసములు ఒక ఋతువు.అలాంటి ఆరునెలలు ఒక అయనం అవుతుంది. సంవత్సరములో ఉత్తర దక్షిణములనే రెండు అయనములున్నాయి.

అయనే చాహనీ ప్రాహుర్వత్సరో ద్వాదశ స్మృత:
సంవత్సర శతం నృణాం పరమాయుర్నిరూపితం

ఒక అయనం దేవతలకు ఒక పగలు అవుతుంది.అలాంటి ఒక పగలూ ఒక రాత్రీ కలసి పన్నెండు మాసములతో కూడిన ఒక మానవ సంవత్సరం అవుతుంది.అలాంటి సంవత్సరములు ఒక నూరు కలిస్తే అది మానవుని పరమాయువు అవుతుంది.

పై కాలగణనాన్ని సంక్షిప్తంగా చూస్తే

మానవుని ఆయువు-100 సంవత్సరములు.
ఒక సంవత్సరం-12 నెలలు.
ఒక నెల-రెండు పక్షములు
ఒక పక్షము-15 దినములు+15 రాత్రులు
ఒక దినము(లేదా రాత్రి)-4 ఝాములు
ఒక ఝాము-ఆరు/ఏడు నాడులు=180 నిముషములు
ఒక నాడీ=30 నిముషములు=15 లఘువులు
ఒక లఘువు=2 నిముషములు=15 కాష్టములు
ఒక కాష్టము=8 సెకండ్లు(ఇప్పటి లెక్కలో)=5 క్షణములు
ఒక క్షణం=8/5 సెకండ్లు=మూడు నిమేషములు
ఒక నిమేషము=8/15 సెకండ్లు=మూడు లవములు
ఒక లవము=8/45 సెకండ్లు=మూడు వేధలు
ఒక వేధ=8/135 సెకండ్లు= నూరు త్రుటులు
ఒక త్రుటి=8/13500 సెకండ్లు=మూడు త్రసరేణువులు
ఒక త్రసరేణువు=8/40,500 సెకండ్లు=మూడు అణువులు
ఒక అణువు=8/1,21,500 సెకండ్లు=రెండు పరమాణువులు
ఒక పరమాణువు=8/2,43,000 సెకండ్లు
=1/30,375 సెకండ్ల కాలం.

1/30,375 సెకండ్ల కాలాన్ని ఒక పరమాణుకాలం అని భాగవతం అన్నది. అంటే సెకండ్ లో ముప్పైవేల వంతువరకూ వ్యాసమహర్షి ఊహించగలిగాడు. అంతేకాదు ఆ లెవల్ అనేదే 'అటామిక్ టైం స్కేల్' అన్న విషయాన్ని ఆయన వేల సంవత్సరాల క్రితం మనకు సూచించాడు.

ఇలాంటి విషయాలు మన పురాణాలలో ఉన్న సంగతి గ్రహించలేని మనం, వాటిని 'పుక్కిటి పురాణాలు' అని ఎగతాళి చేస్తుంటాం.ఈ దేశపు మహత్తరమైన ప్రాచీన సంపద ఎదురుగా ఉన్నాకూడా దానిని సక్రమంగా అర్ధం చేసుకోలేని వారికీ దానినే కువిమర్శలు చేస్తూ కాలం గడిపేవారికీ ఈ దేశంలో పుట్టే హక్కు ఉన్నదో లేదో అలా ఎగతాళి చేసేవారు ఒక్కసారి ఆలోచించుకుంటే సిగ్గుతో చచ్చిపోవాల్సిన పరిస్థితి వారికి తలెత్తుతుంది (వారికి మనసనేది ఒకటి ఉంటే).

గ్రహర్క్ష తారా చక్రస్థ పరమాణ్వాదీనా జగత్
సంవత్సరావసానేన పర్యేత్యనిమిషో విభు:

పరమాణువులు గ్రహాలూ నక్షత్రాలతో కూడిన ఈ సమస్త జగత్తూ ఒక సంవత్సరకాలంలో ఒక పరిభ్రమణం గావిస్తుంది.ఈ మొత్తాన్నీ కాలాతీతుడైన విభుడు (భగవంతుడు) నియంత్రిస్తున్నాడు.

సంవత్సరః పరివత్సర ఇడావత్సర ఏవచ
అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాశ్యతే

సంవత్సరం అయిదు రకాలుగా ఉన్నది.ఈ భేదములు వేత్తలకు తెలుసు.

1.సూర్య గమనంతో వచ్చేది.
2.బృహస్పతి గణనంతో వచ్చేది.
3.నక్షత్ర గణనంతో వచ్చేది.
4.చంద్రగమనంతో వచ్చేది.
5.మామూలుగా రోజుల గణనంతో వచ్చేది.

మానవుడు పుట్టిన మొదటిది సంవత్సరం,రెండవది పరివత్సరం,మూడవది ఇడావత్సరం,నాల్గవది అనువత్సరం,అయిదవది వత్సరం.వీటియొక్క అంతరార్ధములూ,ఉపయోగములూ కూడా వేత్తలైన వారికి తెలుసును.

మనిషి జీవితానికి కావలసిన ప్రాణశక్తి సూర్యుడూ, చంద్రుడూ, బృహస్పతీ, నక్షత్రాల కాంతీ,పగలూ రాత్రీ ఇచ్చే శక్తి నుంచీ వస్తున్నది.వాటిని మరచి పోవడం పరమ ఘోరమైన పాపం.కృతఘ్నత అంటే అదే.

యః సృజ్యశక్తి మురుధోచ్చ్వసయన్ స్వశక్త్యా
పుంసోభ్రమాయ దివి ధావతి భూతభేద:
కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వం
స్తస్మై బలిం హరత వత్సర పంచకాయా

పుట్టిన దగ్గరనుంచీ ప్రతి అయిదు సంవత్సరాల కొకసారి యధాశక్తిగా సూర్య భగవానుని అర్చన చెయ్యాలి.అలాంటి ఒక క్రియ ప్రాచీనకాలంలో ఉండేది. నేడు అవన్నీ గాలికెగిరిపోయాయి.ప్రస్తుత మానవునికి రెండే దైవాలు.ఒకటి డబ్బు.రెండు ఇంద్రియభోగములు.ఈ రెండు తప్ప ఎవరికీ ప్రస్తుతం ఏ దైవాలూ లేరు.మనిషి ఏ దైవాలనూ ఏ గురువులనూ కొలుస్తున్నా ఈ రెంటికొరకే.వీటిని అప్పనంగా ఇచ్చే దేవుళ్ళకు పాపులారిటీ ఉంటుంది. మార్కెట్ ఉంటుంది.యదార్ధం చెప్పే దేవుళ్ళూ గురువులూ అనామకులుగా ఉండిపోతారు.కనుక నేటి మానవుని నిజమైన దైవాలు ఈ రెండే అని నేనంటాను.

పంచభూతాలను నడిపిస్తున్నది సూర్యభగవానుడే.కనుక ఒక అయిదు సంవత్సరాల కాలం జీవితంలో సక్రమంగా గడిచినందుకు ఆ తర్వాత సూర్యార్చన గావించాలి.అలా జీవితాంతమూ ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉండాలి.మన జీవితమూ ప్రాణశక్తీ రక్షింపబడుతూ ఉన్నందుకు ప్రకృతికీ సూర్యునకూ మనం చూపే కృతజ్ఞత అది.

ఇలాంటి సున్నితమైన భావాలూ,కృతజ్ఞతతో కూడిన హృదయ స్పందనమూ నేటి మనుషులలో కరువై పోయాయి.నేటి వారికి ఎంతటి మేలు చేసినా ఇంకా చాలదు.వారికేం కావాలో వారికే తెలియదు.వారి ఆశలకు అంతులు ఉండవు.'ఇంకా కావాలి,ఇంకా కావాలి'.. అన్న అరుపులు తప్ప భగవంతుని చెవులకు ఇంకేమీ ప్రస్తుతం వినిపించడం లేదు.పోనీ ఇప్పటివరకూ పొందిన వరాలకు వారికి కృతజ్ఞతాభావం ఉంటుందా అంటే అదీ ఉండదు.అవసరం తీరిన మరుక్షణం,ఆ దేవుడు కూడా మళ్ళీ ఇంకొక అవసరం తలెత్తేవరకూ గుర్తురాడు.అదీ నేటి మానవుని హీనస్థితి.

కృతజ్ఞతా,ఉత్తమసంస్కారమూ,మర్యాదాపూర్వక ప్రవర్తనా ఇవన్నీ నేడు మృగ్యములై పోతున్నాయి.ఇది కలిప్రభావమే.

పితృదేవ మనుష్యాణా మాయు: పరమిదం స్మృతం
పరేషాం గతిమాచక్ష్వ యే స్యు: కల్పాద్ బహిర్విద:
భగవాన్ వేదకాలస్య గతిం భగవతో నను
విశ్వం విచక్షతే ధీరా యోగరాద్దేన చక్షుషా

పితృదేవతల మనుష్యుల ఆయువు ఎలా ఉంటుందో వివరించావు.ఇప్పుడు కల్పచక్రం బయట నివసించే వారి గతి ఏమిటో వివరించు.కాలగతిని నీవు ఎరిగినవాడవు.విశ్వగమన గతిని నీ యోగచక్షువులతో ధీరుడవై గమనించగల శక్తివంతుడవు.

యుగములు - వాటి వివరం

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగం
దివ్యైర్ ద్వాదశభిర్వర్షైహి సావధానం నిరూపితం

కృత,త్రేతా,ద్వాపర,కలి-అనేవి నాలుగు యుగములు.ఈ నాలుగు కలసి 12 దివ్యవర్షములౌతున్నాయి(12,000) సంవత్సరాలు.

చత్వారి త్రీణి ద్వై చైకం కృతాదిషు యధాక్రమం
సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతానిచ

కృతయుగం మొదలుకొని నాలుగు,మూడు,రెండు,ఒకటి చొప్పున వేలూ వందలలో రెట్టింపుగా ఇవి ఉంటాయి.

సంధ్యా సంధ్యాంశయో ర్యన్తర్యో కాల: శతసంఖ్యయో:
తమేవాహుర్యుగం తజ్నా తత్ర ధర్మో విధీయతే

యుగముల మధ్యలో వచ్చే సందికాలములు వందల సంఖ్యలో ఉంటాయి.ఈ విధంగా యుగములు ఉంటాయి.

ధర్మ చతుష్పాన్ మనుజాన్ కృతే సమనువర్తతే
స ఏవాన్వేష్వధర్మేణ వ్యేతి పాదేన వర్ధతా

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది.మిగతా యుగాలలో అది ఒక్కొక్క పాదం తగ్గిపోతుంది.

త్రిలోక్యా యుగసాహస్రం బహిరా బ్రహ్మణో దినం
తావత్యేవ నిశా తాత యన్నిమీలతి విశ్వసృక్

ఈ యుగములు వెయ్యి జరిగితే బ్రహ్మకు ఒక దినం అవుతుంది.అంతే సమయం రాత్రి అవుతుంది.ఆ సమయంలో సృష్టికర్త యైన బ్రహ్మ నిద్రిస్తాడు.

నిశావసాన ఆరబ్దో లోకకల్పో అనువర్తతే
యావద్ధినం భగవతో మనూన్ భుంజం చతుర్దశ

రాత్రి అయిపోయి మళ్ళీ పగలు వచ్చినపుడు లోకకల్పములు మళ్ళీ మొదలౌతాయి.బ్రహ్మదేవుని ఒక పగటి కాలంలో పద్నాలుగురు మనువులు పుట్టి గతిస్తారు.

స్వంస్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హ్యేకసప్తతిం

ఒక్కొక్క మనువు కాలప్రమాణం 71 మహాయుగములు ఉండి ఇంకొంచం ఎక్కువ ఉంటుంది.ఎందుకంటే 71x14=994 సంవత్సరాలే అవుతుంది.వెయ్యి దివ్య సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక పగలు గనుక,మిగతా ఆరు సంవత్సరాల కాలం ఈ 14 మంది మనువులకు సంధికాలంగా ముందు వెనుకలలో సర్దబడుతుంది.

దీని జ్యోతిష్యపరమైన అర్ధం ఏమిటో తర్వాతి పోస్ట్ లలో వివరిస్తాను.

మన్వంతరేషు మనవస్స్తద్వంశ్య ఋషయస్సురా:
భవంతి చైవ యుగపత్సురేశాశ్చాను ఏ చ తాన్

ఒక మన్వంతరం అయిపోయిన తదుపరి ఇంకొక మనువు ప్రభవిస్తాడు. ఆయనతో బాటు ఆయన పరివారమైన ఆయా సప్తఋషులూ ఇంద్రాది దేవతలూ పుట్టుకొస్తారు.

ఏష దైనందిన స్సర్గో బ్రహ్మస్త్రైలోక్య వర్తన:
తిర్యన్నృపిత్రు దేవానాం సంభవో యత్ర కర్మభి:

ఈ విధంగా బ్రహ్మదేవుని ఒక్కదినంలో(స్వర్గము,భూలోకము,పాతాళము) అనబడే మూడు లోకములు వాటిలో ఉండే దేవతలు, పితరులు, మానవులు, జంతువులు మొదలైన సమస్త జీవరాశులూ వారి వారి కర్మానుసారం పుట్టి గతిస్తూ ఉంటారు.

మన్వంతరేషు భగవాన్ భిభ్రాత్సత్వం స్వమూర్తిభి:
మన్వాదిభిరిదం విశ్వమవత్యుదిత పౌరుష:

ప్రతి మన్వంతరంలోనూ మనువు మొదలైన దివ్యపురుషులుగా భగవంతుడు అవతరిస్తూ లోకాన్ని నడిపిస్తూ ఉంటాడు.

తమోమాత్రాముపాదాయ ప్రతిసంరుద్ధ విక్రమ:
కాలేనానుగతాశేష ఆస్తే తూష్ణీం దినాత్యయే

బ్రహ్మదేవుని పగలు అంతమయ్యే కాలంలో అజ్ఞానపు ఒక ఛాయ రాత్రిగా సృష్టిని ఆక్రమిస్తుంది.ఆ సమయంలో సమస్త సృష్టీ అందులోని జీవజాలం అంతాకూడా అణగిపోతుంది.

అంటే సృష్టి మొత్తం ఒక రకమైన hibernation లోకి వెళ్ళిపోతుంది.

తమేవాన్వపి ధీయంతే లోకా భూరాదయస్త్రయ:
నిశాయామనువృత్తాయాం నిర్ముక్త శశిభాస్కరం

ఈ బ్రహ్మదేవుని రాత్రి అనేది వచ్చినపుడు భూరాది మూడు లోకాలలోనూ వెలుతురు అనేది ఉండదు.చంద్రుడు సూర్యుడు మొదలైన గ్రహములు కాంతిని కోల్పోతాయి.అవి ఉంటాయి.నశించవు.కానీ కాంతిహీనములౌతాయి. సమస్త విశ్వమూ అప్పుడు చీకటి మయం అవుతుంది.

త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నినా
యాన్త్యూష్మణా మహర్లోకాజ్జనం భృగ్వాదయోర్దితా:

ఆ సమయంలో మూడులోకాలనూ(భూ,భువ,సువ) దహించే సంకర్షణాగ్ని తీక్షణతకు తట్టుకోలేక మహర్లోకంలో ఉండే భ్రుగువు మొదలైన మహర్షులందరూ అంతకంటే పైదైన జనలోకానికి చేరుకుంటారు.

తావత్త్రిభువనం సద్య: కల్పాన్తైధిత సింధవ:
ప్లావయన్త్యుత్కటాటోప చండవాతే రితోర్మయ:

మూడు లోకాలనూ నశింపచేసే ఈ కల్పాంత సమయంలో భయంకరమైన వాయువుచే ప్రేరేపించబడి సముద్రాలన్నీ పొంగి భూమిని ముంచివేస్తాయి.

అంత: స తస్మిన్ సలిల ఆస్తే నంతాసనో హరి:
యోగనిద్రానిమీలాక్ష: స్తూయమానో జనాలయై:

ఆ భయంకర ప్రళయ జలమధ్యంలో విష్ణువు యోగనిద్రలో ఉండి నిమీలిత నేత్రుడై శయనించి ఉంటాడు.జనలోకం మొదలైన పైలోకాలలోని ఉన్నత జీవులు ఆయన్ను ధ్యానిస్తూ ఉంటారు. 

ఏవం విధైరహోరాత్రై: కాలగంత్యోపలక్షితై:
అపక్షితమివాస్యాపి పరమాయుర్వయ:శ్శతం

కనుక ప్రతి లోకంలోనూ ఆయాలోకాలకు తగిన పగలూ రాత్రీ ఉంటాయి. ఆయా జీవులకు ఆయాలోకాలకు తగిన నూరు సంవత్సరాల ఆయుస్సు ఉంటుంది.

యదర్ధమాయుష్తస్య పరార్ధ మభిదీయతే
పూర్వ: పరార్దోపక్రాంతో హ్యాపరోధ్య ప్రవర్తతే

బ్రహ్మదేవుని ఆయుస్సులో పూర్వము పరము అని రెండు భాగాలున్నాయి.వాటిలో పూర్వభాగం అయిపొయింది.ప్రస్తుతం పరార్ధం నడుస్తున్నది.

అంటే నూరేళ్ళ ఆయన ఆయుస్సులో 50 ఏళ్ళు అయిపోయి రెండో 50 ఏళ్ళ కాలం ప్రస్తుతం నడుస్తున్నది.

పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రాహ్మో నామ మహానభూత్
కల్పో యత్రా భవద్బ్రహ్మా శబ్దబ్రహ్మేతి యం విదు:

బ్రహ్మదేవుని యొక్క పూర్వార్ధంలో బ్రహ్మకల్పం అనే సమయం ఉన్నది.ఆ సమయంలోనే శబ్దబ్రహ్మము యొక్క పుట్టుక జరిగింది.

శబ్దబ్రహ్మం అంటే వేదం అని అర్ధం చేసుకోవచ్చు.

కానీ దానిని The great Universal sound అని కూడా అర్ధం చేసుకోవచ్చు. అలాంటప్పుడు The great explosion of the Universe or The Big Bang అనే సంఘటనను ఈ శ్లోకం సూచిస్తున్నదా?తన దివ్యదృష్టితో విశ్వం పుట్టక ముందు జరిగిన ఈ సంఘటనను తిలకించిన వ్యాసమహర్షి ఈ శ్లోకంలో తన అనుభవాన్ని గుప్తంగా నిక్షిప్తం చేశాడా?

అవుననే నేను భావిస్తున్నాను.

తస్యైవ చాన్తే కల్పోభూద్ యం పద్మ మభిచక్షతే
యద్ధరేర్నాభి సరస ఆసీల్లోకసరోరుహం

ఆ తరువాత వచ్చినదానిని,అంటే బ్రహ్మకల్పం అనే సమయం తర్వాత వచ్చినదానిని, పద్మకల్పం అంటారు.ఆ సమయంలోనే ఈ విశ్వం అనే పద్మం విష్ణునాభి నుంచి ఉద్భవించింది.

విష్ణునాభి అనే ప్రాంతం ధనూరాశిలో మూలానక్షత్ర మండలం ప్రాంతంలో ఉన్న ఒక గాలక్సీ క్లస్టర్ అని మనకు తెలుసు.విష్ణునాభినుంచి ఒక పద్మము వికసించి అందులో బ్రహ్మదేవుడు కూర్చుని సృష్టి గావిస్తున్నాడని మనం చిత్రాలలో చూస్తాం.వాస్తవంగా సృష్టిలో జరుగుతున్న ప్రక్రియకు అది ఒక భావుకుని రూపకల్పన.అంతకంటే సృష్టిని ఒక pictorial representation రూపంలో చెప్పడం అసాధ్యం.

పద్మం వికసించడం అంటే ఒక చిన్న బిందువు నుంచి మహావిస్ఫోటనం జరిగి విశ్వం నలుమూలలా విస్తరిస్తూ పోవడం.విశాలమైన అంతరాళంలో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఒక విశాలమైన సరస్సులో ఒక పద్మం వికసించిన రీతిలో ఉంటుంది.నేటి సైన్స్ కూడా విశ్వం ఇంకా వ్యాకోచిస్తూ ఉన్నదనే చెబుతున్నది.

విష్ణునాభి అనేది Big bang జరగడానికి ముందు ఉన్నటువంటి ఒక highly condensed super density state in space.ఆ స్థితికి ముందు విశ్వం అంతా విస్తరించి చడీచప్పుడూ లేని స్థితిలో మౌనంగా శయనించి ఉన్న మహాశక్తి స్వరూపాన్నే మనం మహావిష్ణువనీ అనంతపద్మనాభస్వామి అనీ అంటున్నాం.


అంటే ఎటుచూచినా ఏమీలేని మహాశూన్యపు చీకటిస్థితిలో ఒక మహా విస్ఫోటనం జరిగి విశ్వంలో వెలుగుతో కూడిన నక్షత్ర మండలాలు ఉద్భవించి నలువైపులా ఒక పద్మం వికసించినట్లు వెదజల్లబడిన స్థితిని వ్యాసమహర్షి తన దివ్యదృష్టితో వీక్షించి ఆ దర్శనాన్ని ఈ శ్లోకరూపంలో మనకు అందించాడా?

అవుననే నేను అంటాను.ఎందుకంటే,దివ్యదృష్టికి తప్ప,మామూలు మానవుల క్షుద్రమైన మనస్సుల దృష్టికి ఇలాంటి భావనలు అందేవి కావు.

అయం తు కధిత: కల్పో ద్వితీయస్యాపి భారత
వారాహ ఇతి విఖ్యాతో యత్రాసీచ్చూకరో హరి:

బ్రహ్మదేవుని రెండవ జీవితభాగంలోని మొదటి కల్పాన్నే వరాహకల్పం అని అంటారు.ఎందుకంటే ఈ కల్పంలోనే భగవంతుడైన విష్ణువు వరాహరూపంలో అవతరించాడు.

కాలోయం ద్విపరార్దాఖ్యో నిమేష ఉపచర్యతే
అవ్యాకృతస్యానంతస్య హ్యనాదేర్జగదాత్మన:

ఈ రెండు అర్ధభాగములతో కూడిన బ్రహ్మదేవుని జీవిత కాలం మొత్తమూ కూడా -- ఏ హద్దులూ లేని అనంతుడైన భగవానునికి ఒక నిమేష కాలం మాత్రమే.అంటే బ్రహ్మదేవుని మూడు కోటికోట్ల మానవసంవత్సరాల జీవితకాలం మహావిష్ణువుకు దాదాపు అర సెకండ్ కాలం మాత్రమే.


చదువరులారా -- అదీ పరిస్థితి!!!

ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏకాంతంగా కూర్చొని ఈ కాలాన్ని ఊహించే ప్రయత్నం చెయ్యండి.విశ్వవీక్షణం చెయ్యండి.సృష్టి ముందు ఉన్న మహాతమస్సునూ శూన్యపు చీకటినీ ఊహించండి.ఆ తర్వాత జరిగిన మహాజ్యోతివిస్ఫోటనాన్నీ,ఒక పద్మం విచ్చుకున్నట్లు సృష్టి నలువైపులకూ వ్యాపించడాన్నీ ఊహించండి.దేవతల యుగాన్నీ అంటే 43,20,000 సంవత్సరాల కాలాన్నీ,అలాంటి 71 యుగాల కాలమైన ఒక మన్వంతరాన్నీ,అలాంటి  14 మనువుల కాలంతో సమానమైన బ్రహ్మదేవుని ఒక దినాన్నీ అంతే ప్రమాణం కలిగిన ఒక రాత్రినీ అలాంటి 360x100=36000 రోజులతో కూడిన ఆయన జీవితకాలాన్నీ, ఆ బ్రహ్మజీవిత కాలం ఒక అరసెకండ్ తో సమానమైన మహావిష్ణువు యొక్క కాలాన్నీ ఊహించండి.

మనసూ మెదడూ దిమ్మెరపోయి,మొద్దు బారిపోయి,ఏమీ తెలియని ఒక విధమైన అచేతనమైన స్థితిలోకి వెళ్ళిపోయి రోజంతా అలాగే ఉండిపోతాము.   

కాలోయం పరమాన్వాది ద్వీపరార్ధాంత ఈశ్వర:
నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరో దామమానినాం

ఈ కాలం అనేది పరమాణువు మొదలుకొని బ్రహ్మదేవుని జీవితకాలం వరకూ సమస్తాన్నీ నియంత్రిస్తుంది.కానీ అది సమస్తానికీ ప్రభువైన భగవంతుని నియంత్రించలేదు.దానిని ఆయనే నడిపిస్తున్నాడు.

తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణకారణం
విష్ణోర్ధామ పరం సాక్షాత్పురుషస్య మహాత్మన:

కాలానికి లొంగని,నాశనంలేని,ఈ పరబ్రహ్మమే సర్వసృష్టికీ పరమకారణం. పరమపురుషుడైన ఆయనే భగవంతుడైన విష్ణువు.

(ఇంకా ఉన్నది)
read more " యుగసిద్ధాంతం-4(పురాణాలలో సృష్టిక్రమం) "