“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, సెప్టెంబర్ 2014, సోమవారం

రోహిణీ శకట భేదనం-1(భారతీయ జ్యోతిష్య విజ్ఞానానికి తిరుగులేని సాక్ష్యం)

రోహిణీ శకట భేదనం!!!

ఈ మాట మనకు పురాణాలలో వినిపిస్తుంది.రామాయణకాలంలో దీనిని గమనించారు.మహాభారత యుద్ధ సమయంలో దీనిని గమనించారు.ఆయా సమయాలలో ఇది ఆకాశంలో కనిపించిన ప్రతిసారీ యుద్ధాలూ తీవ్ర జననష్టాలూ జరిగాయి.

రామాయణ కాలంలో దశరధ మహారాజు ఈ ఖగోళ సంఘటనను గమనించి దాని ఫలితంగా తన రాజ్యంలో ఏదో మహావిపత్తు జరగబోతున్నది అని భావిస్తాడు.

శ్లో|| కృత్తికాంతే శనౌ యాతే దేవజ్నై జ్ఞార్పితో హిసా
రోహిణీ శకటం భిత్వా శనిర్యస్యతి సాంప్రతం

ఇత్థం శకట భేదేన సురాసుర భయంకరం
ద్వాదశాబ్దస్తు దుర్భిక్షం భవిష్యతి సుదారుణం

దేశశ్చ నగర గ్రామా భయభీతా సమం తథా
బ్రువంతి సర్వలోకానాం భయమేతత్ సమాగమం

ఆ సంకట నివారణ కోసం ఆయన శనీశ్వరుని ప్రార్ధించి రచించిన "దశరధకృత శనిస్తోత్రం" మనకు బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది.దానిని ఇప్పటికీ ఎందఱో జపిస్తూ ఉంటారు.ఇది జాతకంలో శనీశ్వరుని దోషాలనుండి, ముఖ్యంగా రోహిణీ శకటభేదన సమయంలో కలిగే విపత్తులనుండి బ్రహ్మాండమైన రక్షాకవచంగా పనిచేస్తుంది.అన్ని విపత్తులనూ నివారిస్తుంది.

మహాభారతంలో ఉన్న కొన్ని శ్లోకాలను చూద్దాం.

శ్లో|| ప్రాజాపత్యం హి నక్షత్రం గ్రహస్తీక్ష్నో మహాద్యుతి:
శనైశ్చర: పీడయతి పీడయన్ ప్రాపినోధికమ్

(ప్రజాపతి నక్షత్రమును (రోహిణిని) తీక్ష్ణుడైన శనైశ్చరుడు పీడిస్తున్నాడు. జనులకు అధికములైన పీడలు కలుగబోతున్నవి)

(సంస్కృత మహాభారతం ఉద్యోగ పర్వం)

శ్లో||రోహిణీం పీడ్యన్నేష స్థితో రాజన్ శనైశ్చర:
వ్యావృత్తలక్ష్మ సౌమస్య భవిష్యతి మహద్భయమ్

(సంస్కృత మహాభారతం భీష్మ పర్వం)

(ఓ రాజా! శనైశ్చరుడు రోహిణీ నక్షత్రాన్ని పీడిస్తున్నాడు.చంద్రుని లక్షణాలు విపరీతంగా కనిపిస్తున్నాయి.ఏదో భయంకరమైన విపత్తు జరుగబోతున్నది)

రామాయణ మహాభారతాలలో నుంచి రోహిణీ శకటభేదన పరంగా ఈ విధములైన శ్లోకాలు మనకు కనిపిస్తున్నాయి.

అసలు--మన పురాణాలలో ఉన్న విషయాలను తేలికగా తీసుకుంటూ,అవన్నీ పిచ్చి కధలుగా కొట్టి పారేసే అలవాటు మనకు ఎలా వచ్చింది? మన ధార్మిక సంపదను మనమే కాలదన్నుకునే దుస్థితి మనకెలా దాపురించింది?

ఇంగ్లీషు చదువులవల్లా,ఇతర మతాల దుష్ప్రచారం వల్లా,మన తల్లిదండ్రులు మనకు నేర్పకపోవడం వల్లా,ఒకవేళ వాళ్ళు నేర్పకపోయినా,మనంతట మనం చదివి తెలుసుకోకపోవడం వల్లా,అనవసరంగా పెరిగిన ధనమదం వల్లా,కుహనా పాండిత్యగర్వం వల్లా ఈ దుస్థితి దాపురించింది.కొండొకచో ప్రక్షిప్త శ్లోకాదుల వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తింది.

అంతేకాదు,పురాణాల లోని అన్ని సంఘటనలూ సాంఘికంగా యధాతధంగా జరిగినవి కావు.వాటిల్లో కొన్నికొన్ని మార్మికార్ధములు కలిగి నిగూడంగా కధలుగా చెప్పబడినవి.అలాంటి వాటిని యధాతధంగా అర్ధం చేసుకోవాలని ప్రయత్నించడమే,మన గందరగోళానికి ఇంకొక కారణం.

అందుకే మనం ఈ "రోహిణీ శకట భేదనం" వంటి వాటిని నమ్మం.ఇవన్నీ జనాన్ని మోసం చెయ్యడానికి బ్రాహ్మణులు వ్రాసిన పిచ్చివ్రాతలని చీప్ గా భావించేవాళ్ళు నాకు తెలిసిన ఇతర కులాలవారిలో చాలామంది ఉన్నారు.ఆ క్రమంలో మన భారతజాతికి గురువైన వ్యాసమహర్షిని కూడా చీప్ గా కామెంట్ చేసినవాళ్ళు నాకు తెలుసు.వారి దోషం ఎక్కడికీ పోదు.అది వారితోనే ఉంటుంది.సమయం వచ్చినపుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు.గర్వంతో మాట్లాడేటప్పుడు తెలియకపోయినా, ఆయా బాధలు పడేటప్పుడయినా మనం చేసిన పనుల ప్రభావం ఏమిటో ఎవరికి వారికి తప్పకుండా తెలుస్తుంది.

అయితే అలాంటి అజ్ఞానులు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.

నిజమైన బ్రాహ్మణుడు ఎవరినీ మోసం చెయ్యడు.అతని జీవన విధానమే విభిన్నంగా ఉంటుంది.ఏదో ఆశించి మాయమాటలు చెప్పి దానిద్వారా స్వలాభం పొందాలని చూడటం బ్రాహ్మణ లక్షణం కాదు.త్యాగం అనేది అతనికి ఉగ్గుపాలతో వస్తుంది.అతిమంచితనం వల్ల ఒకవేళ నష్టపోతే తానే నష్టపోతాడు గాని ఇతరులను దోచుకోడు.ఒకవేళ ఏదో కారణంవల్ల ఈ లక్షణాలు అతనిలో కనిపించకపోతే అది అతని గ్రహపాటనే భావించాలి.

కనుక చెప్పేదేమంటే,పురాణాలలో ఉన్న విషయాలన్నీ మనం అనుకునేటట్లు కట్టుకధలు కావు.ముఖ్యంగా వాటిల్లో ఉన్న ఖగోళ రిఫరెన్స్ లూ,ఆయా సమయాలలో జరిగిన సంఘటనలూ అబద్దాలు కావు.ప్రాచీనులు మనకోసం వాటిని రికార్డ్ చేసి భద్రంగా పురాణాల రూపంలో వాటిని అందించారు.మనమేమో వాటిని ఎగతాళి చేస్తూ నమ్మకుండా విర్రవీగుతూ పిచ్చిమాటలు మాట్లాడుకుంటూ ఎంతో అమూల్యమైన సంపదను చేతులారా కోల్పోతున్నాం.ఇంతకంటే దుస్థితి ఎక్కడైనా ఉంటుందా?

కలియుగ ధర్మం అంటే ఇదేనేమో??

కొద్దిసేపు దానిని అలా ఉంచి,రోహిణీ శకట భేదనం అంటే ఏమిటో దాని ప్రభావాలు మనమీద ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.

'సూర్యసిద్ధాంతం' లో రోహిణీ శకట భేదన  నిర్వచనం ఇలా ఉన్నది.

శ్లో||వృషే సప్తదశే భాగే యస్య యామ్యోంశకద్వయాత్
విక్షేపో అభ్యధికో భింద్యాద్ రోహిణ్యా శకటాం తు సః
(సూర్య సిద్ధాంతం)

(వృషభ రాశిలో 17 డిగ్రీల వద్ద రెండు అంశల కంటే కొద్దిగా ఎక్కువ విక్షేపం దక్షిణం వైపుగా ఉన్న గ్రహం రోహిణీ శకటాన్ని భేదిస్తుంది)

రెండు వేల సంవత్సరాల నాడు వరాహమిహిరుడు తన బృహత్సంహితలో రోహిణీ శకట భేదనాన్ని గురించి ప్రస్తావించాడు.

శ్లో||రోహిణీ శకట మర్కనందనో  యది భినత్తి రుధిరోధవా శిఖీ
కిం వదామి యదనిష్ట సాగరే జగత్సేష ముపయాతి సంక్షయమ్
(బృహత్సంహిత)

(రోహిణీ శకటమును అర్కనందనుడు(శని),రుధిరుడు(కుజుడు) లేదా శిఖి(తోకచుక్కగానీ లేక కేతువుగానీ కావచ్చు) భేదించినప్పుడు కలిగే ఉపద్రవాలను ఏమని చెప్పను? అప్పుడు ప్రపంచం అంతా ఉత్పాత సముద్రంలో మునిగిపోతుంది)

రోహిణీ నక్షత్ర మండలం మధ్యలో అయిదు నక్షత్రాలు ఒక త్రికోణాకారంలో ఉంటాయి.ఆ త్రికోణాకారాన్నే రోహిణీ శకటం అంటారు.అందులో ఉన్న ఆల్ఫా, ఎప్సిలాన్,గామా టారి అనే నక్షత్రాల మధ్యలోనుంచి శని కుజ శిఖి గ్రహాలు సంచరిస్తే అప్పుడు రోహిణీ శకట భేదనం అనబడుతుంది.

కానీ ప్రస్తుతం ఖగోళంలో ఉన్న శనిగ్రహం యొక్క మార్గాన్ని బట్టి ఇది ఇప్పట్లో జరిగే పని కాదు.ఎందుకంటే శనిగ్రహ విక్షేపం (declination) ఉన్న స్థితిని బట్టి ప్రస్తుతం ఆయన యొక్క సంచారమార్గం రోహిణీ శకటప్రాంతానికి దూరంగా ఉన్నది.గత 10,000 సంవత్సరాలలో ఇది ఒక్కసారి కూడా జరగలేదు.కానీ కుజుడు ఈ దారిలో సంచరించినట్లు ఆధారాలు ఉన్నాయి.నేటి ఖగోళ సాఫ్ట్ వేర్లు దానిని నిర్ధారిస్తున్నాయి.

శుద్ధ నిర్వచనం ప్రకారం రోహిణీ శకటంలోనుంచి శనిగ్రహ సంచారం సరిగ్గా 2 డిగ్రీల దక్షిణ డిక్లైనేషన్ తో జరగకపోయినా,ప్రతిసారీ శనిగ్రహం రోహిణీ నక్షత్రంలో సంచరిస్తున్న సమయాలు మనకు తెలుసు.ప్రతి ముప్పైఏళ్ళ కొకసారి ఇది జరుగుతుంది.కుజుడైతే ప్రతి ఏడాదిన్నరకు ఒకసారి ఈ నక్షత్రాన్ని తాకుతాడు.

రోహిణీ నక్షత్రంలో మధ్యలో త్రికోణంలాగా ఉన్న ప్రాంతం మీదుగా శని కుజులు రోహిణీ శకట నిర్వచనం ప్రకారం ఖచ్చితంగా సంచారం చెయ్యడం వేల ఏళ్ళకు ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది.ఎందుకంటే ఈ గ్రహాల మార్గం ఖచ్చితంగా దానిగుండా వెళ్ళదు.

కానీ వీరు రోహిణీ నక్షత్రాన్ని తాకిన ప్రతిసారీ చరిత్రలో ఒక భయంకర వినాశనం జరుగుతూనే ఉన్నది.ఇది నమ్మలేని నిజాలలో ఒకటి. పురాణాలలో చెప్పబడిన విషయం మన కళ్ళముందు అనేకసార్లు జరిగింది.

ఆ సంఘటనలు ఏమిటో మన చరిత్రకు అందినంత వరకూ చూద్దాం.

శనీశ్వరుడు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది అని మనకు తెలుసు.అంటే రోహిణీ నక్షత్రాన్ని శనీశ్వరుడు ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి తాకుతాడు.వృషభం 17 డిగ్రీలంటే అది రోహిణీ నక్షత్రం మూడవ పాదం అవుతుంది.

ఈ మధ్య మనకు దగ్గరగా ఇది జరిగిన సమయంతో మొదలు పెట్టి,వెనక్కు వెళుతూ,ఇది ఆకాశంలో వచ్చిన ప్రతిసారీ భూమి మీద ఏమేమి జరిగాయో ఒక్కసారి చూద్దాం.

1) ఈ మధ్యన, శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో ఉన్న సమయం--మే 2001 నుంచి జూన్ 2002 వరకు.
  • అప్పుడే ఖచ్చితంగా సెప్టెంబర్ 11,2001 న అమెరికా ట్విన్ టవర్స్ సంఘటన జరిగింది.5000 మంది ఆ శిధిలాల క్రింద పడి కనపడకుండా మాయమయ్యారు.ఇప్పటికీ వారి జాడా జవాబూ లేవు.
  • అదలా ఉంచితే,ఆ తర్వాత అమెరికా పౌరుల మనస్సులలో వచ్చిన భయాలూ అనుమానాలూ దానివల్ల మన భారతీయులు ఎంత హింస అనుభవించారో అర్ధం చేసుకుంటే ఇది ఒక పెద్ద ఘోరమే అనకుండా ఉండలేం.దీని ఫలితంగా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లలో ఇంకా యుద్ధం సాగుతూనే ఉన్నది.
  • 'ద్వాదశాబ్దస్తు దుర్భిక్షం భవిష్యతి సుదారుణం(పన్నెండేళ్ళ పాటు దారుణమైన దుర్భిక్షం తాండవిస్తుంది)' అన్న శ్లోకపాదాన్ని గమనిస్తే 2001 లో ఇది జరిగితే పన్నెండేళ్ళ వరకూ ఇంకా ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ లలో యుద్ధ వాతావరణం తగ్గలేదంటే ఈ మాటలోని గూడార్ధం అర్ధం చేసుకోవచ్చు.
  • సరిగ్గా అప్పుడే గుజరాత్ లో భూకంపం వచ్చి 30,000 మంది చనిపోయారు.ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.ఎన్నో సంస్థలు సహాయం చేశాయి.
అప్పుడే ఇంకొక విచిత్ర సంఘటన జరిగింది.
  • నేపాల్ లోని నారాయణ హితీ రాజభవనంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన తండ్రియైన రాజు బీరేంద్రనూ తల్లి ఐశ్వర్యాదేవినీ ఇంకా తన కుటుంబంలోని తొమ్మిదిమందిని మొత్తాన్నీ పిచ్చిపట్టిన వాడిలా కాల్చి చంపాడు.తనూ చనిపోయాడు.ఇది ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ సరిగ్గా తెలియదు.ఏదో 'గ్రహం' ఆవహించినట్లు అతనాపని చేశాడు.ఇదంతా ఒక కుట్ర అని కూడా కొందరంటారు.ఇది సరిగ్గా 1-6-2001 రోజున,శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించిన ఒక నెలకు జరిగింది.
  • అప్పుడే,ఆఫ్గనిస్తాన్ మీద అమెరికా దాడి జరిగింది.WTC సంఘటనకు ప్రతీకార చర్యగానూ,ఆల్ ఖైదా తాలిబాన్ నెట్వర్క్ ని నిర్మూలించే ఉద్దేశ్యంతోనూ ఇది జరిగింది.
  • సరిగ్గా అదే సమయంలో న్యూయార్క్ లో ఒక జెట్ విమానం కూలిపోయి 260 మంది హరీమన్నారు.
  • చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13-12-2001 రోజున భారత పార్లమెంట్ మీద ఉగ్రవాదుల దాడి సరిగ్గా అదే సమయంలో జరిగింది.
2) అంతకు ముందు ఏప్రిల్ 1972 నుంచి జూన్ 1972 వరకూ మరలా డిసెంబర్ 1972 నుంచి ఏప్రిల్ 1973 వరకూ శనీశ్వరుడు రోహిణీ నక్షత్రం మీద సంచరించాడు.
  • 1971 లో సివిల్ వార్ జరిగి పాకిస్తాన్ నించి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.
  • 1972 లో నికారాగ్వాలో వచ్చిన అతిపెద్ద భూకంపంలో 10,000 మంది చనిపోయారు.20,000 మంది గాయపడ్డారు.ఇంకొక 30,000 మంది ఇల్లూ వాకిండ్లను పోగొట్టుకున్నారు.
  • 1973 లో ఈజిప్టూ+ సిరియా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరిగింది.
  • వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండోభవనం ఈ సంవత్సరంలోనే పూర్తయింది.సరిగ్గా ముప్పై ఏళ్ళ తర్వాత శనీశ్వరుడు మళ్ళీ ఇదే స్థానానికి వచ్చినపుడు అది ధ్వంసం అయింది.
3) అంతకు ముందు జూన్ 1942 నుంచి జూన్ 1943 వరకూ శనీశ్వరుడు రోహిణీ నక్షత్రం మీద సంచరించాడు.
  • దాదాపు 17 లక్షల మంది యూదులు చంపబడిన "హోలోకాస్ట్" సంఘటన సరిగ్గా అప్పుడే జరిగింది.
  • మహా విధ్వంసానికి దారి చూపగల 'న్యూక్లియర్ చెయిన్ రియాక్షన్' అనేది సైన్స్ చేత సరిగ్గా అప్పుడే కనుక్కోబడింది.
  • సరిగ్గా ఇదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.ఈ యుద్ధంలో దాదాపు పది కోట్లమంది చంపబడ్డారు.లేదా చనిపోయారు.ఒక్కసారిగా భూభారం విపరీతంగా తగ్గింది.
  • మన దేశంలో "క్విట్ ఇండియా" ఉద్యమం జరిగింది.
4) అంతకు ముందు ఆగస్ట్-సెప్టెంబర్ 1912,ఏప్రిల్-ఆగస్ట్ 1913 లలో శనీశ్వరుడు రోహిణీ నక్షత్ర సంచారం చేశాడు.
  • 1912 సంవత్సరానికి 'ప్రమాదాల సంవత్సరం'(the year of disasters) అనే పేరున్నది.ఎందుకంటే సరిగ్గా అప్పుడే, అంటే, ఏప్రిల్ 1912 లోనే టైటానిక్ ఓడ మునిగిపోయింది.ఈ ప్రమాదంలో దాదాపు 1500 మంది ఒకేసారి నీళ్ళలో మునిగి చనిపోయారు.ఆ ఓడలో గుంటూరు వాస్తవ్యులు కూడా ఇద్దరున్నారు.అప్పట్లో ప్రపంచంలో కనీవినీ ఎరుగని సముద్ర ప్రమాదాలలో ఇది పెద్దది.
  • ఒటోమాన్ సామ్రాజ్యం మీద బాల్కన్ యుద్ధం జరిగింది.ఈ యుద్ధ ఫలితంగా దాదాపు 5 లక్షలమంది చనిపోవడమూ,గాయపడటమూ జరిగింది.
  • చైనాలో విప్లవం జరిగి నవశకం మొదలైంది.ఈ విప్లవంలో కనీసం 2.5 లక్షలమంది హరీమన్నారు.
  • జపాన్లో మెయిజీ వంశంతో రాచరికం అంతరించింది.
  • వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ ను చంపడానికి బెంగాల్ స్వాతంత్ర్యయోధులు వేసిన "డిల్లీ కుట్ర" అప్పుడే జరిగింది. 
5) అంతకు ముందు జూన్ 1883 నుంచి జూన్ 1884 వరకూ మరలా శనీశ్వరుడు రోహిణీ నక్షత్రం మీద సంచరించాడు.
  • ఆ సమయంలో,26-8-1883 న ఇండోనేషియాలో 'క్రకతో' అగ్నిపర్వతం పేలింది.ఆ పేలుడు ధ్వని 4,800 కిలోమీటర్ల వరకూ వినిపించింది అంటే అది ఎంత పెద్ద పేలుడో ఊహించవచ్చు.ఆ దెబ్బకు దాదాపు 36,000 మంది చనిపోయారు.ఆ ద్వీపంలో దాదాపు మూడింట రెండు వంతులు నాశనం అయిపోయింది.
  • The Great English earthquake అనబడే Colchester భూకంపం అప్పుడే జరిగింది.యునైటెడ్ కింగ్ డంలో గత 400 ఏళ్ళలో అలాంటి భూకంపం రాలేదు.దాదాపు 1300 ఇళ్ళను ఆ భూకంపం నేలమట్టం చేసింది.
  • అమెరికాలో వచ్చిన అతిపెద్ద టొర్నడో లలో ఒకటైన Enigma Tornado అప్పుడే వచ్చింది.
  • హోవార్డ్ సౌత్ డకోటా టోర్నడో కూడా అదే సంవత్సరంలో వచ్చింది.
6) అంతకు ముందు మే 1854 నుంచి ఏప్రిల్ 1855 మధ్యలో శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో సంచరించాడు.
  • పొగమంచు కారణంగా రెండు ఓడలు గుద్దుకొని SS Arctic అనే విలాసవంతమైన ఒక పెద్ద ఓడ Newfoundland తీరంలో మునిగి పోయింది.దాదాపు 400 మంది చనిపోయారు.
  • Great fire of New castle and Gateshead అప్పుడే సంభవించింది.
  • నార్త్ అమెరికాలో అప్పట్లో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటైన Baptiste Creek Train accident జరిగింది.
  • Gasconade bridge train disaster జరిగి వంతెన కూలి ఒక రైలు మొత్తం,ఆ బ్రిడ్జి కింద పారుతున్న గేస్కోనేడ్ నదిలో పడిపోయింది.
  • రష్యా ఓటమికి దారితీసిన 'క్రిమియా' యుద్ధం అప్పుడే జరిగింది.ఇందులో దాదాపు 8 లక్షల మంది చనిపోయారు.ఒక లక్షమంది గాయాల పాలయ్యారు.
  • San Salvador భూకంపం అనే ఘోరమైన భూకంపం వచ్చి ఆ సిటీ మొత్తం సర్వనాశనం అయ్యింది.దాదాపు వెయ్యి మంది చనిపోయారని అంచనా.25 మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.
  • లాంగ్ బీచ్ న్యూయార్క్ లో 'పౌచత్తన్' అనే ఓడ మునిగి దాదాపు 500 మంది చనిపోయారు.
  • చైనా గువాన్ డాంగ్ ప్రావిన్స్ లో రెడ్ టర్బన్ విప్లవం మొదలైంది.
  • అమెరికన్ నేవీదళాలు San Juan del Norte అనే  Nicaragua టౌన్ను బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసి పారేశాయి.
  • మన దేశంలో జరిగిన సంథాల్ తిరుగుబాటులో దాదాపు 15,000 మంది పైగానే సంథాల్ తిరుగుబాటు దారులు చనిపోయారు.బ్రిటిష్ వారిచేత ఈ తిరుగుబాటు అతి క్రూరంగా అణచివెయ్యబడింది.
7) జూన్ 1824-జూలై 1825 వరకూ మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • ఇప్పటివరకూ మళ్ళీ రానంత అతిపెద్ద వరదలలో సెయింట్ పీటర్స్ బర్గ్ ఆ సమయంలో మునిగిపోయింది.
  • మూడు పెద్ద ఓడలు ఆ సంవత్సరాలలో మునిగిపోయాయి.
  • ఆ సమయంలో జనానికి ఏదో పిచ్చి పట్టినట్లు ఈ క్రింది యుద్ధాలు జరిగాయి.
  • ఆంగ్లో బర్మీస్ యుద్ధం జరిగింది.దాదాపు 50,000 మంది చనిపోయారు.
  • గ్రీక్ సివిల్ వార్ జరిగింది.
  • ఆర్కాన్సాస్ యుద్ధం జరిగింది.
  • బ్రిటన్ అశాంతే యుద్ధం జరిగింది.
  • ఫ్రాంకో ట్రార్జాన్ యుద్ధం జరిగింది.
  • నెథర్లాండ్స్ జావా యుద్ధం జరిగింది.
  • పోర్చుగల్ బ్రెజిల్ యుద్ధాలు జరిగాయి.
8) మే 1795-మే 1796 వరకూ మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • ఫ్రెంచి విప్లవం సందర్భంగా కిబెరాన్ యుద్ధం(ఫ్రాన్స్ ఆక్రమణ) జరిగింది.దాదాపు 20,000 మంది చనిపోయారు.
  • కోపెన్ హాగెన్ ఫైర్ అనేది అప్పుడే జరిగింది.ఈ మంటలు జూలై అయిదున మొదలై జూలై ఏడు వరకూ రెండురోజులు తగలబడుతూనే ఉన్నాయి.
  • అనేక ఓడలు ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల మునిగిపోయాయి.
  • "కిం వదామి యదనిష్ట సాగరే జగత్సేష ముపయాతి సంక్షయమ్"--'అనేక బాధలనే సముద్రంలో ప్రపంచం మునుగుతుంది' అనిన వరాహ మిహిరుని మాటను పైన నేను ఉదాహరించిన శ్లోకంలో సూక్ష్మంగా గమనిస్తే సముద్ర ప్రమాదాలు ఈ సమయాలలో జరుగుతాయన్న సూక్ష్మసందేశం గోచరిస్తుంది.వేత్తలు వాడే మాటలలో చాలా గూడార్ధాలు ఉంటాయి.అందులో వరాహమిహిరుడు నిగూఢభాషను వాడటంలో సిద్ధహస్తుడు.దీనికి రుజువుగా,రోహిణీ శకటం జరిగిన ప్రతిసారీ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సముద్ర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో 'టైటానిక్' ఓడ మునిగిపోవడం ఒక పెద్ద సంఘటన మాత్రమే. 
  • అదే సమయంలో నార్తంబర్లాండ్,కంబర్లాండ్ బొగ్గు గనుల ప్రమాదాలలో చాలామంది మరణించారు.
  • మన దేశంలో మహారాణి అహల్యా బాయ్ హోల్కార్ మరణించింది.
  • ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి.
9) జూన్-నవంబర్ 1765;మార్చ్ -జూలై 1766 మధ్యలో మళ్ళీ శనీశ్వరుని రోహిణీ నక్షత్ర సంచారం జరిగింది.
  • ఇంగ్లీషు వారికీ ముఘల్ రాజులకూ మధ్య బక్సర్ యుద్ధం అప్పుడే జరిగింది.ఇందులో దాదాపు 12,000 మంది చనిపోయారు.
  • సరిగ్గా అదే సమయంలో సైనో బర్మీస్ యుద్ధం జరిగింది.దీనిలో దాదాపు లక్షమంది చనిపోయారు.
  • బర్మా-సియాం యుద్ధం అదే సమయంలో జరిగింది.కొన్ని వేలమంది ఇందులోనూ చచ్చారు.
  • అమెరికాలో రాజకీయ విప్లవాలు ఆ ఏళ్ళలోనే జరిగాయి.
10) మే 1736 -మే 1737 వరకూ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • మొదటి డిల్లీ (మరాటా - ముఘల్) యుద్ధం జరిగింది.దాదాపు 50,000 మంది చచ్చారు.
  • పోర్చుగీస్ మరాటా యుద్ధం అపుడే జరిగింది.
  • ఆస్ట్రియా-టర్కీ యుద్ధం జరిగింది.
  • కలకత్తాలో భయంకరమైన భూకంపమూ హుగ్లీ తుఫానూ కలిసి ఒక్కసారే వచ్చాయి.చరిత్రలో ఇలా రెండూ కలసి ఒక్కసారి రావడం మొదటిసారిగా అప్పుడే జరిగింది.ఆ తర్వాత ఇప్పటివరకూ అలాంటి విపత్తు కలకత్తాలో మళ్ళీ రాలేదు.
  • తూర్పు రష్యాలో Kamchatka భూకంపం అప్పుడే వచ్చింది.
11) జూలై 1706 నుంచి జూలై 1707 దాకా మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • నెబ్రాస్కాలో భయంకరమైన తుఫానులూ వరదలూ వచ్చాయి.
  • పోలాండ్ లో సివిల్ వార్ అప్పుడే జరిగింది.
  • నార్త్ అమెరికాలో కాలనీల కోసం ఇంగ్లీషు ఫ్రెంచి దేశాల మధ్యన యుద్ధాలు జరిగాయి.
  • ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణం.
12) మే 1677-జూన్ 1678 వరకూ మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • రష్యా టర్కీ దేశాల మధ్య యుద్ధం జరిగింది.
  • జేమ్స్ టౌన్ విర్జీనియాలో 'బేకన్ విప్లవం' అప్పుడే జరిగింది.
  • అమెరికా తీరంలో స్పానిష్ ఓడ ఒకటి మునిగిపోయింది.
  • శివాజీ మహారాజుకీ ముఘల్ సామ్రాజ్యానికీ యుద్ధాలు జరిగాయి.
13) 1647-1648 మధ్యలో మళ్ళీ శనీశ్వరుని రోహిణీ సంచారం జరిగింది.
  • ఈ సమయంలో రెండవ ఇంగ్లీష్ సివిల్ వార్ జరిగింది.
  • ఒక ఏడాది తర్వాత ఒకటవ చార్లెస్ చక్రవర్తికి శిరచ్చేదం అమలు జరిగింది.
  • నార్త్ అమెరికాలో బీవర్ యుద్ధాలు జరిగాయి.వీటిలో కొన్ని వేలమంది చనిపోయారు.
  • ఇప్పుడు న్యూయార్క్ అని పిలువబడుతున్న చోట 'వాపింగర్ వార్' అనేది జరిగింది.అనేక ఘోరాలూ నేరాలూ ఈ సమయంలో జరిగాయి.
  • భారత దేశంలో అయితే,శివాజీ మహారాజుకీ ముఘల్ సామ్రాజ్యానికీ యుద్ధాలు జరిగిన రోజులవి.
--------------------------------------------------------

మన పురాణాలలో చెప్పబడిన "రోహిణీ శకట భేదనం" అనేది ముమ్మాటికీ నిజం అన్న విషయానికి ఋజువులుగా పై ఉదాహరణల కంటే ఎక్కువగా ఇంకా ఏమీ చెప్పనక్కరలేదనుకుంటాను.

ఇలా తవ్వుతూ పోతుంటే తవ్వినకొద్దీ రోహిణీ శకటానికి ఆధారాలు చరిత్రలో కనిపిస్తూనే ఉన్నాయి.కనుక మనుషుల మీద శనిప్రభావం నిజమే అని తెలుస్తున్నది.లేకపోతే,ఆయన రోహిణీ నక్షత్రాన్ని స్పర్శించిన ప్రతిసారీ ప్రపంచంలో ఘోర విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయి?

అలా సంభవిస్తాయని మన పూర్వఋషులు ఎలా కనుక్కున్నారు?అన్ని వేల ఏండ్ల నాడే ఎలా ఈ విషయాన్ని గ్రంధస్తం చేసి ఉంచారు?ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆశ్చర్యంగా లేదూ?

ఈ రకంగా వ్రాస్తూ పోతే దీనికి అంతూ పొంతూ ఉండదు.ఎన్ని సార్లు చూచినా శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో సంచారం చేస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు గానీ,ఘోరాలు గానీ జరిగి జననష్టం తీవ్రస్థాయిలో జరిగినట్లు రుజువులు స్పష్టాతిస్పష్టంగా లభిస్తున్నాయి.

ఈ ఖగోళసూచికను రామాయణ కాలంలోనే అంటే దాదాపు 7000 BC ప్రాంతంలోనే గమనించి రికార్డ్ చేసి పెట్టిన భారతీయ ఋషుల మేధాశక్తిని ఏమని స్తుతించాలో మనకు ఈనాటికీ అర్ధం కావడం లేదంటే అది మన ఖర్మ అనుకోవాలో లేక ఇంత జ్ఞానసంపదను మన గ్రంధాలలో ఉంచుకుని కూడా వాటి విలువను గ్రహించలేని చేతగానితనం అనుకోవాలో లేక ఇంకేం అనుకోవాలో మరి?

సరే జరిగినవి జరిగాయి.భవిష్యత్తు పరిస్థితి ఏమిటి?

మళ్ళీ శనీశ్వరుడు రోహిణీ నక్షత్రంలో సంచరించే సమయం ఎప్పుడో చూద్దామా?

2031-2032 ప్రాంతంలో ఆయన మళ్ళీ రోహిణీ నక్షత్రంలో సంచరించ బోతున్నాడు.అప్పుడు శనీశ్వర ప్రభావం వల్ల మళ్ళీ ప్రపంచ ఉపద్రవాలు ఖచ్చితంగా జరుగుతాయి.

యూదులూ అరబ్బులూ,క్రైస్తవులూ ముస్లిముల మధ్యన జరిగే యుద్ధాలు తీవ్రరూపం దాల్చి  ఆ సమయానికి మూడవ ప్రపంచయుద్ధంగా మారబోతున్నదా?లేక ఇంకేదైనా మహాఘోర విపత్తు భూమికి రాబోతున్నదా?తీవ్రమైన ఉపద్రవాలు జరిగి ఘోర జననష్టం జరిగి మళ్ళీ భూభారం తగ్గబోతున్నదా?

ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ సమయంలో జరిగి తీరుతుంది.ఎందుకంటే ఈ జోస్యానికి గతంలో ప్రతిసారీ జరిగిన సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలు.అవన్నీ పైన వివరించాను.శనీశ్వర ప్రభావం నుంచి ఏ దేశమూ ఏ మనిషీ తప్పుకోలేదు.

అది పూర్తిగా అసాధ్యం.

ఇదంతా చదువుతుంటే 2031-32 సమయంలో ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అనిపించడం లేదూ?

ఏమో? వేచి చూద్దాం ఈసారి ఏం జరుగబోతున్నదో??