
"తెలియనంతవరకూ బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య" అన్నట్లు, లోతుపాతులు తెలియనంతవరకూ జ్యోతిషశాస్త్రం గందరగోళంగా ఉంటుంది. ఒకసారి దానిలో పట్టుచిక్కితే మాత్రం, ఆపైన నల్లేరుమీద నడకే అవుతుంది. అప్పుడు ఒక జాతకాన్ని గానీ, జీవితాన్ని గానీ చదవడం మంచినీళ్లు త్రాగినంత సులభమౌతుంది.
నయ్యర్ జాతకంలో - సుఖస్థానమైన మకరంలో సన్యాసయోగముంది. అందులోనే నీచగురువున్నాడు. కనుక తీవ్రమైన గురుదోషం కూడా ఉంది. దానికి తోడుగా, వృశ్చికంలో విధ్వంసయోగముంది. కళలను, ప్రేమలను, భావుకతను, సృజనాత్మకతను సూచించే శుక్రుడు బుద్ధిస్థానంలో శనిక్షేత్రంలో ఉన్నాడు. శనిదృష్టి సన్యాసయోగంపైన ఉంది. కుజదృష్టి శుక్రునిపైన ఉన్నది. ధనుస్సుకు, మకరానికి అర్గళం పట్టింది. రాహువు ఏకాకిగ్రహమయ్యాడు.
అయిపోయింది. మొత్తం జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి ఇవి చాలు. ఒక మనిషిని అర్ధం చేసుకోవడానికి, అయిదునిముషాలు సరిపోయినట్లే, ఒక జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా అయిదే నిముషాలు చాలు.
ఈయన జీవితాన్ని మొత్తాన్నీ శాసించినవి ఈ గ్రహస్థితులే.
అయితే, రాశిచక్రాన్ని ఒక్కదాన్ని చూచి, మనకంతా అర్థమైందని అనుకోకూడదు. నవాంశను, ఇతర వర్గచక్రాలను సరిదిద్దాలి. షష్ట్యంశ వరకూ సరిచేయాలి. అప్పుడు మాత్రమే ఆ జాతకం సరియైనదౌతుంది. లేదంటే తప్పుదారి పట్టిస్తుంది. ఇదంతా చేయాలంటే, జననకాలసంస్కరణ ఎలా చేయాలో తెలియాలి. దానికి స్ఫురణశక్తి (ఇంట్యూషన్) ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడే ఒక జాతకాన్ని స్పష్టంగా చదవగలుగుతాము. అప్పుడే కర్మరహస్యాలు అర్ధమౌతాయి. జన్మజన్మాంతరాలలో ఆ జీవి యొక్క నడకా అర్ధమౌతుంది.
థియరీని పక్కనపెట్టి, జాతకంలోకొద్దాం.
నయ్యర్ జననసమయం ఎక్కడా దొరకడంలేదు. కొందరు వృషభలగ్నమని, కొందరు తులాలగ్నమని అంటున్నారు. ఇంకొందరేమో ఏకంగా, జననసంవత్సరం 1926 కాదు, 1927 అంటున్నారు. ఉదయం 2 గంటలని కొన్నిచోట్ల ఉన్నది. కానీ ఏదీ ఖచ్చితంగా లేదు.
ఈ గందరగోళాన్నంతా సరిదిద్ది, ఈయన జననసమయాన్ని నేను సంస్కరించాను. అంటే, రెక్టిఫై చేశాను. అది 16-1-1926 ఉదయం గం. 1.23 అయింది. ఎలాచేశానో అడక్కండి. చెప్పను. ఆ సమయానికి షష్ట్యంశచక్రం ఇలా ఉంది.
రాశిలో నీచస్థితిలో ఉన్న గురువు, ఇక్కడ ఉచ్ఛస్థితిలోకి పోయాడు. కానీ, నీచకేతుశుక్రుల అర్గళంలో చిక్కుకున్నాడు. ఇదే అర్గళం శనిచంద్రులకు కూడా వర్తిస్తుంది. నీచకేతువును రవిగురుల అర్గళం బంధించింది. రాహుకేతువులు నీచస్థితులలో ఉన్నారు. శనిచంద్రయోగం ఉన్నది. నీచబుధ, కుజయోగం ఉన్నది. సూర్యుడు బలంగా ఉన్నాడు. శుక్రుడు లగ్నంలోకి వచ్చాడు. ఇప్పుడు, రాశిచక్రంతో షష్ట్యంశను అన్వయించుకుంటే, ఈయన జాతకం అద్దంలో చూచినంత స్పష్టంగా ఉన్నది.
సింహావలోకనం
శనికుజులవల్ల నోటిదురుసూ, కోపం, స్నేహితుల నుంచి మోసపోవడం, పైల్స్ మొదలైన రోగాలు కనిపిస్తాయి. శుక్రునివల్ల ప్రేమవ్యవహారాలు, కళాతృష్ణ, గొప్పదైన టాలెంట్, సినిమారంగంలో పేరు, సృజనాత్మకత వస్తాయి. సన్యాసయోగంవల్ల వృత్తికి, కుటుంబానికి దూరంకావడం, ఒంటరిగా జీవించడం, అలాగే మరణించడం మొదలైనవి కలుగుతాయి. బుధునివల్ల వాయిద్యాలతో నేర్పరితనం, రాగాలను పాటలను సృష్టించడం వస్తుంది. అయితే, ఈయన దుర్మార్గుడు కాదని, సంసారం దెబ్బతింటుందని, తప్పులను చేశానని గ్రహించి, వాటిని దిద్దుకునే క్రమంలో ఒంటరిజీవితాన్ని గడిపి, అనామకంగా కన్నుమూస్తాడని షష్ట్యంశచక్రం చూపిస్తోంది.
జననకాలదశ
నా విధానంలో జననకాలదశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమంటే, అది జీవితం మొత్తాన్నీ ఒక ముద్దలో పెట్టి చూపిస్తుంది. జననకాలదశ అయిన కుజ రాహు రాహు గురు శుక్రదశ - దూకుడు ప్రవర్తన, స్నేహితులతో మోసపోవడం, అక్రమసంబంధాలు, సినిమాజీవితం, గురుదోషం వల్ల చిన్నాభిన్నమై జీవితం, కళారంగంలో పేరుప్రఖ్యాతులను స్పష్టంగా చూపిస్తోంది.
కుజదశ
ధనిష్టానక్షత్రం ఒకటోపాదం కాబట్టి, జననసమయానికి 6 ఏళ్ల 6 నెలల 26 రోజుల కుజమహర్దశ మిగిలి ఉన్నది. ఆరేళ్లతర్వాత 18 ఏళ్ల రాహుమహాదశ నడిచింది. దానికి తగినట్లుగానే, ఈయనకు చదువుపైన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దానిబదులు సంగీతమూ, సౌందర్యపోషణా ఈయన మనసును ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఆయనే బాహాటంగా చెప్పాడు.
"Woman, I am of woman, by woman, for woman. Women are my inspiration.' అని తన తర్వాతి జీవితంలో ఆయన చాలాసార్లు అంటూ ఉండేవాడు.
వీరిది సంగీతకుటుంబం కాదు. తండ్రి, మెడికల్ స్టోర్స్ లో సూపర్నెంటుగా పనిచేసేవాడు. నయ్యర్ మాత్రం చిన్నప్పటినుంచే సంగీతమంటే చెవికోసుకునేవాడు. దానికి కారణం, గర్భవతిగా ఉన్న సమయంలో ఈయన తల్లిగారు, హార్మనీ ముందేసుకుని స్వరాలను అభ్యాసం చేస్తూ ఉండటం కావచ్చు. అంతకంటే వేరే కారణమేదీ కనిపించదు.
ఈయనపైన ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య ఉన్నారు. అక్కయ్య తప్ప మిగిలిన అన్నలందరూ, డాక్టర్లే. వారిలో ఒకన్నయ్య హైద్రాబాద్ లోనే మిలిటరీ డాక్టర్ గా ఉండేవాడు. సంగీతరంగంలో అడుగుపెట్టినప్పటికీ, చివరకు ఈయనకూడా హోమియోపతి డాక్టరే అయ్యాడు. ఇది, కుటుంబంలో ఎప్పటినుండో ఉన్న మెడికల్ జీన్స్ ను చూపిస్తోంది. ఇదెలా వచ్చిందో చూడటం మన సబ్జెక్టు కాదు కాబట్టి దానిని వివరించడం లేదు.
రాహుదశ
ఏడేళ్లవయసులో రాహుదశ మొదలైంది. నయ్యర్ సంగీతాన్ని నేర్చుకోవడం తండ్రికి ఇష్టముండేది కాదు. ఆ రంగం అంత మంచిది కాదని, అప్పట్లో అనుకునే చాలామంది సాంప్రదాయకుటుంబాలలాగే ఆయనకూడా అనుకుని, 'సంగీతం నేర్చుకుని ఏం చేస్తావ్? రోడ్లమీద పాటలు పాడుతూ అడుక్కుతింటావా?' అంటూ నయ్యర్ ను తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. కానీ నయ్యర్ మనసంతా సంగీతం పైనే ఉండేది. తండ్రిమాటను వినలేదు. కానీ చివరకు తండ్రిమాటే చాలావరకూ నిజమైంది. జీవితం ఆఖరిలో ఇతరులపైననే ఆధారపడి అనామకంగా జీవించి, చనిపోయాడు.
అయితే సంగీతాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. సొంతంగా రహస్యంగా అభ్యాసం చేసి పియానో, ధోలక్, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. ఇలా దేనినైనా సొంతంగా నేర్చుకునే ప్రజ్ఞ ఆయనలో ఉండేది. దీని సాయంతోనే, పెద్దయ్యాక, హోమియోపతిని, జ్యోతిషాన్ని కూడా స్వయం-అధ్యయనంతో నేర్చుకున్నాడు. దీనికి కారణం దశమంలోని రాహువు. ఇలాంటి జాతకులు సంప్రదాయానికి భిన్నంగా నడుస్తారు. ఒకవిధమైన మొండిగా, విప్లవాత్మకంగా ఉంటారు. నయ్యర్ కూడా అలాగే తయారయ్యాడు.
చిన్నవయసులోనే లాహోర్ ఆల్ ఇండియా రేడియోలో సింగర్ గా పనిచేస్తున్న సమయంలో, సరోజ్ అరోరా అనే డాన్సర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె రచయిత్రి కూడా. ఈమె వ్రాసిన 'ప్రీతమ్ ఆన్ మిలో' అనే పాటను 19 ఏళ్ల నయ్యర్ స్వరపరచగా, Ch. Atma పాడాడు. ప్రయివేట్ ఆల్బమ్ అయినప్పటికీ, ఈ పాట పాన్ ఇండియా హిట్ అయింది. ఈ సంఘటన 1945 లో జరిగింది. అప్పుడు నయ్యర్ కు రాహు-శుక్రదశ నడుస్తున్నది. వయసు 19 ఏళ్ళు. ఈ దశ ఏం చేస్తుందో జ్యోతిషవిద్యార్థులకు తెలిసినదే కదా ! ఈయనకు సరోజ్ అరోరాకు ప్రేమ మొదలైంది.
ఈలోపల 1947 లో దేశం మూడుముక్కలైంది. అప్పుడీయనకు రాహు-చంద్ర-రాహు గ్రహణదశ నడిచింది. వీరి కుటుంబం ఇండియాలోని అమృత్ సర్ కు మారింది. పాటియాలాలో ఉంటూ, ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు.
19-5-1951 తేదీన, నయ్యర్, సరోజ్ అరోరాల పెళ్లిజరిగింది. అప్పటికి నయ్యర్ కు 25 ఏళ్ళు. సరోజ్ కు కూడా అటూఇటుగా అంతే ఉండవచ్చు. అయితే, నయ్యర్ చాలా ముక్కుసూటి మనిషి. 'నేను పక్కా స్త్రీలోలుడిని. నా జీవితంలో, అనేకమంది స్త్రీలతో నేను సంబంధాలను పెట్టుకోవచ్చు. ముందే చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం' అని పెళ్ళికి ముందే సరోజ్ తో ఖండితంగా చెప్పేశాడు.
దానికి ఒప్పుకున్న సరోజ్ 'సరే నీ ఇష్టం. కానీ ఇంకో పెళ్ళిమాత్రం చేసుకోకు' అని షరతు పెట్టింది. దానికి నయ్యర్ ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందాలతో వీరి పెళ్లి జరిగింది. అప్పట్లోనే ఇంత విశాలదృక్పథాలతో కూడిన పెళ్లిళ్లు జరిగేవన్నమాట !
ఆనాడు నయ్యర్ జాతకంలో గురు గురు చంద్ర రాహు శుక్రదశ నడుస్తోంది. ఇందులో వ్యామోహమే ఎక్కువగా కనిపిస్తోంది. గజకేసరీయోగాన్ని కాస్తా గురువుయొక్క నీచత్వం మ్రింగేసింది. దానికింకొక కారణం గోచారశని. ఈయన కన్యలో ఉంటూ వక్రించి సింహంలోకి వస్తున్నాడు. అంటే,అష్టమశని దశ జరుగుతోంది. అందుకే ఈ పెళ్లి చివరకు పెటాకులై పోయింది.
గురుమహర్దశ
గురుదశ నవంబర్ 1949 లో మొదలైంది. ఇది ఈయన జీవితాన్ని అనేక మలుపులు త్రిప్పింది. గురుదశలోనే గురుదత్ తో పరిచయం ఏర్పడింది. తను తీసిన సినిమాలన్నింటిలో నయ్యర్ కు ఛాన్సిచ్చాడు గురుదత్. అంతేగాక, నయ్యర్ కూడా గీతాదత్ చేత తన పాటలన్నింటినీ పాడించేవాడు.
1949 లోనే బాంబేకు మకాం మార్చి 'కనీజ్' అనే సినిమాకు నేపధ్యసంగీతాన్ని అందించాడు. 1952 లో 'ఆస్మాన్' అనే సినిమాకు మొదటిసారి సంగీతదర్శకత్వాన్ని వహించాడు.
కెరీర్ ప్రారంభ దశ
ఈయన కెరీర్ లో 1949-52 మధ్య సమయాన్ని ప్రారంభదశగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో గురు-గురు, గురు-శని దశలు నడిచాయి. గోచారగురువు మకరం నీచస్థితినుండి వృషభం వరకూ సంచరించాడు. గోచారశని సింహ, కన్యలలో సంచరించాడు. అది అర్ధాష్టమశని దశ. కనుక మొదటి మూడుసినిమాలు సంగీతపరంగా అంత బాగా ఆడలేదు.
గీతాదత్ దశ
1953-56 మధ్యదశను గీతాదత్ దశగా చెప్పుకోవచ్చు.
1954 లో తన 'ఆర్ పార్' సినిమాకు గురుదత్ ఈయనను సంగీతదర్శకుడిగా ఎన్నుకున్నాడు. ఆ సమయంలో గోచారశని దశమంలో ఉచ్ఛస్థితికి వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
దానితర్వాత 1955, 56 లలో వరుసగా గురుదత్ తీసిన మిస్టర్ అండ్ మిసెస్ - 55, సిఐడీ సినిమాలు ఘనవిజయాలను సాధించాయి. గోచారశని దశమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. అందుకే అలా జరిగింది.
అయితే, గోచారశని వృశ్చికంలోకి మారి, జననకాల శనికుజులపైకి రాగానే, ఈయన జీవితాన్ని ధ్వంసం చేసిన ఆశాభోంస్లే పరిచయం అయింది. ఆ సమయంలో ఈయనకు గురు-బుధదశ మొదలైంది. బుధుడు నవమాధిపతి, చంద్రలగ్నాత్ కూడా 6-9 ఆధిపత్యం ఉన్నది. కనుక బలమైన గతకర్మానుసారంగా, ఈ పరిచయం ప్రేమగా మారింది.
ఆమెను తన టీమ్ లోకి తీసుకున్నాడు. అప్పటివరకూ అక్క లతా నీడలో దాగి, క్లబ్బు పాటలను పాడుకుంటున్న ఆమెను ఒక ముఖ్యగాయనిగా తీర్చిదిద్దాడు. అప్పటివరకూ తన పాటలను పాడుతున్న షంషాద్ బేగం, గీతాదత్ లను పక్కనపెట్టి ఈమెకు ఛాన్సులివ్వడం మొదలుపెట్టాడు. ఇది తన జీవితంలో చేసిన పొరపాట్లలో ఒకటని తర్వాతి కాలంలో ఒప్పుకున్నాడు.
ఆశాభోంస్లే దశ
1957-68 ను ఆశాభోంస్లే దశగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో 20 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. వాటిల్లో అన్నీ హిట్ పాటలే.
1957 లో బీ.ఆర్.చోప్రా తీసిన 'నయా దౌర్' తో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫెర్ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. వృశ్చికశని వక్రించి తులాశని ఫలితాన్నిచ్చాడు.
1958 లో వీరిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. పంచమశుక్రుడు మళ్ళీ ప్రేమలో పడవేశాడు. అప్పుడు మొదలైన వీరి ప్రేమాయణం 14 ఏళ్లపాటు సాగి, 1972 లో ముగిసింది.
Ek Musafir Ek Hasina (1962), Phir Wohi Dil Laya Hoon (1963), Kashmir Ki Kali (1964) ల వరుసవిజయాలతో ప్రసిద్ధ రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. ఆ సమయంలో రాహుకేతువులు మిధున-ధనుస్సులలో ఉచ్ఛస్థితులలో ఉన్నారు.
అక్టోబర్ 1964 లో గురుదత్ అర్ధాంతరంగా చనిపోవడం నయ్యర్ ను దెబ్బకొట్టింది. అది గురు-రాహు దశ. దీనిని ఛిద్రదశ అంటారు. ఇది జీవితాలను చిదిమేస్తుంది. గురుదత్ మరణంతో నయ్యర్ కు కష్టకాలం మొదలైంది. ఆ సమయంలో నయ్యర్ కు ఏలినాటిశని రెండవపాదం నడుస్తోంది. శని కుంభంలో వక్రించి ఉన్నాడు. గురువు వృషభంలో వక్రించాడు. కనుక, అదృష్టం వక్రించింది.
శనిమహర్దశ
1965 లో మొదలైన శనిదశతో ఈయనకు అవకాశాలు సన్నగిల్లడం మొదలైంది. దానికి కారణాలు అనేకం. జ్యోతిషకారణం మాత్రం, శని బాధకస్థానంలో, శత్రువైన కుజునితో కలసి ఉండటం. అది దుర్ఘటనాయోగం కావడం.
ఈయనకు PR చేతకాదు. తనదగ్గరకు వచ్చిన నిర్మాతలకు మాత్రం మ్యూజిక్ చేసిపెట్టేవాడు. కానీ, పరిచయాలు పెంచుకొని, స్నేహాలు కలుపుకొని, పార్టీలిచ్చి, ఛాన్సులను సంపాదించడం ఈయనకు రాదు. పైగా, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. దానికితోడు అతి డిసిప్లిన్ ఈయనతో ఉండేది.
ఒక రికార్డింగ్ కు రెండుసార్లు పిలిచినా లతామంగేష్కర్ రాలేదని, ఆమెతో ఎప్పటికీ పనిచెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. ఆమేమో, హీరోయిన్లకు తప్ప వేరే పాత్రలకు తను పాడనంటుంది. క్రమేణా ఆమెకూడా ఈయనపైన పగబట్టి, తన చేతిలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన అనిల్ బిశ్వాస్ ద్వారా పావులు కదిపి ఈయనకు అవకాశాలు రాకుండా చేసింది.
సమయపాలన లేకపోతే ఎంతటివాడినైనా అందరిముందూ తిట్టేసేవాడు. రఫీ, ఆశాల డ్యూయెట్స్ ను ప్రోత్సహించి, రఫీని బాగా సపోర్ట్ చేసింది ఈయనే. అలాంటిది, ఒకరోజున శంకర్ జైకిషన్ రికార్డింగ్ లో లేటై, తన రికార్డింగ్ కు ఆలస్యంగా వచ్ఛాడని మహమ్మద్ రఫీని తిట్టి పంపేసి, రెండేళ్లపాటు పాటలివ్వకుండా బహిష్కరించాడు.
ప్రముఖ వేణువిద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాను కూడా ఇదే కారణంతో వెనక్కు పంపించేశాడు.
తలత్ మహమూద్ మంచి గాయకుడు. కానీ, మన పీబీ శ్రీనివాస్ లాగా, ఆయనది సాఫ్ట్ మేల్ వాయిస్. గొంతును కొంచెం బొంగురుగా చేసుకోవడానికి అప్పట్లో కొంతమంది గాయకులు సిగరెట్ త్రాగేవారు. రికార్డింగ్ గ్యాప్ లో తలత్ మెహమూద్ సిగిరెట్ త్రాగుతుండటం నయ్యర్ చూచాడు. కోపంతో అతన్ని తిట్టి పంపించేశాడు. ఆ తర్వాత అతనికి ఛాన్సులివ్వలేదు.
ఈ విధంగా, ఆర్టిస్టుల దగ్గర క్రమశిక్షణ లేకపోతే ఊరుకునేవాడు కాదు. ఆత్మాభిమానం, కోపాలు ఎక్కువ. పట్టూవిడుపూ లేకపోతే సినిమారంగంలో నెగ్గడం కష్టం. ముఖంమీద ఉమ్మేసినా తుడుచుకొని పోయేవారికే అక్కడ రాణింపు ఉంటుంది. అది ఈయనకు చేతకాదు.
ఇలాఉండగా, ఈయన మార్కు సంగీతం క్రమేణా పాతబడిపోయింది. వెస్ట్రన్ బీట్స్ కలిసిన మ్యూజిక్ పాపులర్ అయింది. ఆర్దీ బర్మన్ వంటి క్రొత్తతరం ముందుకొచ్చింది.
ఈయన ఆశాభోంస్లే ను అమితంగా ప్రేమించాడు. కానీ ఆశా, తన అవకాశాలను, కెరీర్ ను మాత్రమే ప్రేమించింది. నయ్యర్ కు క్రమేణా ఛాన్సులు తగ్గాయి. పైగా ఈయన బాగా పొసెసివ్ గా ఉండేవాడు. ఆశా ఏ పాటను పాడాలో ఏదివద్దో ఈయనే నిర్ణయించేవాడు. ఏ సినిమా ఒప్పుకోవాలో ఏది వద్దో తనే చెప్పేవాడు. ఇదంతా అనవసరమైన నసగా ఆశాకు అనిపించింది. నయ్యర్ తన కెరీర్ కు అడ్డుగా మారాడని ఆశా భావించింది. ప్రతిదానికీ గొడవలు మొదలయ్యాయి. క్రమేణా ఈయనకు దూరమై, ఆర్దీబర్మన్ కు దగ్గరైంది.
ఒకరోజున ఏదో చిన్నతప్పు చేసిందని, ఆశా కూతురు వర్షాభోంస్లేను అరిచి, చెయ్యెత్తి కొట్టబోయాడు. దానికి ఆశా అడ్డొచ్చింది. ఇద్దరికీ గొడవైంది. కోపంతో ఆమెను వదలి బయటకు వచ్చేశాడు.
ఆ విధంగా 5-8-1972 న ఆశాభోంస్లే తో విడిపోయాడు. అప్పటికి ఆమెతో 324 పాటలను పాడించాడు. కానీ ఆశా ఈయనను వదిలేసి ముందుకెళ్ళిపోయింది. ఈయన ఒక పిచ్చివాడిలాగా మిగిలిపోయాడు.
ఆ సమయంలో, ఈయన జాతకంలో శని-శుక్ర-రవి దశ నడిచింది. రవికేతువులు గ్రహయుద్ధంలో ఒకే డిగ్రీమీదున్నారు. పదకొండో అధిపతిగా రవి, పేరు ప్రఖ్యాతులున్న ఆశాను సూచిస్తున్నాడు. కనుక ఆ సమయంలో వీరిద్దరికీ గొడవై, విడిపోయారు. తిరిగి జీవితంలో కలుసుకోలేదు.
1972-79 కష్టాలు మొదలు
ఆశాతో విడిపోయాక, నయ్యర్ కెరీర్ బాగా తగ్గడం మొదలైంది. లతాతో పాటలు చెయ్యడానికి ఒప్పుకోడు. రఫీని దూరం పెట్టాడు. అందరితో సత్సంబంధాలు లేవు. PR లేదు. ఇక ఛాన్సులెలా వస్తాయి?
చివరకొకనాడు, తగ్గి, తనే రఫీ ఇంటికి వెళ్లి మాట్లాడాడు. రఫీ మెత్తబడ్డాడు. మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారు. కానీ ఆశా దూరమైంది. ఆమె స్థానంలో వాణీజయరాం, దిల్రాజ్ కౌర్, కృష్ణా కల్లే, పుష్పా పగ్దరే, కవితాకృష్ణమూర్తి మొదలైన అప్పుడప్పుడే పైకొస్తున్న సింగర్స్ కు ఛాన్సులిచ్చి, వారిచేత పాడించాడు. కానీ వారెవరూ, ఆశా భోంస్లే మ్యాజిక్ ముందు తూగలేకపోయారు.
రఫీ మాత్రం నయ్యర్ ను బాగా సపోర్ట్ చేశాడు. కానీ మారిన సంగీతపు ట్రెండ్ లో, నయ్యర్ సంగీతం జనానికి నచ్చడం తగ్గింది. 1979 కల్లా ఛాన్సులు బాగా తగ్గిపోయాయి.
మాధురీ జోగ్లేకర్ దశ
అది శని - చంద్రదశ. 1976-77 ప్రాంతాలలో మాధురీ జోగ్లేకర్ అనే మరొక సింగర్ ఈయనకు పరిచయమైంది. ఈ దశను బట్టి వీరిది అందరూ అనుకునేటట్లుగా శృంగారసంబంధం కాదని అనిపిస్తుంది. శృంగారం కంటే ఎక్కువగా, అభిరుచులు, భావుకత, ఫిలాసఫీ మొదలైన హృదయసంబంధమైన విషయాలలో వీరికి శృతి కలిసి ఉండాలి. ఇదే నిజమని తన తర్వాతి ఇంటర్వ్యూలలో మాధురీ చెప్పింది.
మొదట్లో, ఈయన మ్యూజిక్ ట్రూపులో కోరస్ సింగర్ గా ఈమె చేరింది. అప్పటికే ఆమె మ్యూజిక్ లో MA చేసి ఉన్నది. ఈమెలో టాలెంట్ ను చూచిన నయ్యర్ ఈమెను దగ్గరకు తీశాడు. చర్చ్ గేట్ ఏరియాలో ఉన్న నయ్యర్ ఇంటికి ఈమె రోజూ వస్తూ ఉండేది. అప్పటికే నయ్యర్ హోమియోపతి, జ్యోతిష్యాలను బాగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వాటిలో కూడా ఈమె సాయం చేస్తూ ఉండేది. చాలావరకు ఈయనకు సెక్రటరీగా పనిచేసేది. ఈయనకూడా 1976 నుంచే, బాంబే శివార్లలో వీరార్లో ఉన్న ఈమె ఇంటిలోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు.
1974 లో (అంటే 22 ఏళ్ల వయసులోనే) ఈమె UPSC పరీక్షను క్లియర్ చేసి FCI లో ఆఫీసర్ గా చేరింది. అయినా సరే, సంగీతంపైన ఉన్న మక్కువతో, ఒకవైపు ఉద్యోగం చేస్తూ కూడా, నయ్యర్ కు సాయపడుతూ ఉండేది. క్రమేణా వీరిమధ్య రొమాంటిక్ సంబంధం ఏర్పడింది. ఈమె నయ్యర్ కంటే 26 ఏళ్ళు చిన్నది. అప్పటికి నయ్యర్ కు 50 ఏళ్ళు, ఈమెకు 24 ఏళ్ళు.
అప్పటివరకూ నయ్యర్ ప్రేమాయణాలను ఓపికగా భరిస్తూ వచ్చిన భార్యాపిల్లలు దీనికి అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు. నయ్యర్ పిల్లలుకూడా పాతికేళ్ళవయసులోకి వచ్చారు. ఎన్నాళ్ళని ఈయన వేషాలను భరిస్తారు? వాళ్ళనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేసరికి నయ్యర్ కోపం తెచ్చుకున్నాడు. ఒకవైపు ఛాన్సులు తగ్గిపోయాయి. ఇంకోవైపు తను అమితంగా ప్రేమించిన సంగీతరంగం వెక్కిరిస్తోంది. ఆశా ఇచ్చిన షాకు చాలా గట్టిగా తగిలింది. ఇప్పుడు కుటుంబసభ్యులు ఎదిరించేసరికి తట్టుకోలేక, వారిని ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మని గద్దించాడు. గట్టిగా నిలబడిన వాళ్ళు, ఆస్తిలో వాటాకోసం కోర్టులో కేసువేశారు. తెగేవరకూ లాగవద్దని, కోర్టుబయట ఒప్పందమే మంచిదని లీగల్ నిపుణులు ఈయనకు సలహా ఇచ్చారు. ఇంటిని, ఆస్తిని వారికి రాసేసి, నయ్యర్ కట్టుబట్టలతో ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఇదంతా 1979 లో జరిగింది.
తనవైపునుండి తాను కరెక్ట్ కావచ్చు. కానీ ఎదుటివారినుండి, అందులోనూ కుటుంబసభ్యులనుండి కూడా ఆలోచించాలి. భౌతికసంబంధాలు లేకుండా, గాలికి ఎగిరిపోతూ, భావప్రపంచాల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉండే ఇటువంటి కళాత్మకమనస్తత్వాలు, జీవితవిధానాలు ఉన్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోకూడదు.
'నేనింతే' అని పెళ్ళికి ముందే చెప్పాడు కాబట్టి నయ్యర్ కరెక్టే అనడమే అసలు కరెక్ట్ కాదు. 'నేనింతే, నేను పెళ్ళికి పనికిరాను. మన పెళ్లి ఒద్దు. నాతో నువ్వు సుఖపడలేవు. నువ్వేకాదు, నాతో ఎవ్వరూ సుఖపడలేరు. నా దారి వేరు.' అని చెప్పాలి. అలా చెప్పకపోవడం నయ్యర్ చేసిన తప్పు. నయ్యర్ చెప్పినప్పటికీ సరోజ్ ఒప్పుకోవడం ఆమె తప్పు. వెరసి ఇద్దరిఖర్మా అలా ఉంది. పాపం, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు?
ఆ విధంగా, 1979 లో కుటుంబంతో విడిపోయి విలాసవంతమైన తన చర్చ్ గేట్ ఇల్లును వదిలిపెట్టాడు. ఆ సమయంలో శని-రాహుదశ నడిచింది. ఇది శపితదశ అని గతంలో ఎన్నో జాతకాలలో నిరూపించాను. ఈ దశ ఏం చేస్తుందో కూడా వందలాది జాతకాలలో వివరించాను. ఈయన్ని కూడా ఈ దశ చావుదెబ్బ కొట్టింది.
ఇంటినుండి బయటకు వచ్చి, కుటుంబంతో తెగతెంపులు చేసుకుని, బాంబే శివార్లలో ఉన్న వీరార్ లో మాధురీతో కలసి ఆమె ఇంటిలో ఉండటం మొదలుపెట్టాడు. వీరి సహజీవనం 1976 నుండి 1996 వరకూ 20 ఏళ్లపాటు సాగింది. అయినా సరే, మధ్యమధ్యలో అప్పుడపుడు కొన్ని సినిమాలకు సంగీతాన్నిస్తూ ఉండేవాడు.
(ఇంకా ఉంది)