“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, ఆగస్టు 2014, బుధవారం

BKS Iyengar-శపిత యోగం

నేడు ప్రపంచంలో BKS Iyengar (బేలూర్ కృష్ణమాచార్ సుందరరామ అయ్యంగార్ )పేరు తెలియని వారు ఉండరు.

Light on Yoga, Light on Pranayama మొదలైన గ్రంధాలు అనేకం వ్రాసి దాదాపు 60 పైన దేశాలలో యోగా స్కూల్స్ స్థాపించిన ఈ 95 ఏళ్ళ యోగాచార్యుడు ఈరోజు ఉదయం పూనాలో దేహం చాలించాడు.

ఈ వయసులో కూడా ఆయన అరగంట సేపు శీర్షాసనంలో ఉండగలడు.మిగిలిన ఆసనాలంటే ఇంక చెప్పనక్కరలేదు.అవన్నీ ఆయనకు కొట్టిన పిండి.'లైట్ ఆన్ యోగా' పుస్తకంలో ఆయన చూపించిన యోగాసనాలు చూస్తే అసలు ఈయన శరీరంలో ఎముకలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.

ఈయనకూడా శపితయోగానికి బలయ్యారంటే చదువరులకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది.

ఒక్కసారి ఈయన జాతకం పరికిద్దాం.

ఈయన 14-12-1918 తేదీన కర్ణాటక కోలార్ జిల్లాలోని బేలూర్ లో ఉదయం 3.00 గంటలకు జన్మించారు.తల్లిదండ్రులు సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణులు.

గురుశనుల వక్రీకరణ వల్ల ఈయనకు లోకంతో ఎంతో కర్మసంబంధం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తున్నది.అందుకేనెమో దేశదేశాలు తిరిగి యోగా స్కూల్స్ స్థాపించి భారతీయ హఠయోగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు.

ప్రపంచంలో లక్షలాదిమందికి యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యాన్ని కలిగించారు. ఇలాంటి వ్యక్తి తన చిన్నతనంలో ఫ్లూ మలేరియా టీబీ టైఫాయిడ్ లతో బాధపడ్డారంటే మనకు నమ్మశక్యం కాదు.కానీ ఇది నిజం.

కాలయుక్తి నామ సంవత్సరం మార్గశిర ఏకాదశి రోజున ఆయన జన్మించారు. ఈయన చనిపోయినది కూడా ఏకాదశి రోజుననే కావడం ఒక విచిత్రం.శ్రావణ ఏకాదశి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమికి దగ్గరగా ఆయన చనిపోవడం ఆయనపైన ఉన్న కృష్ణానుగ్రహాన్ని సూచిస్తున్నది. వైష్ణవునిగా జన్మించినందుకు ఏకాదశి రోజునా అందులోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరగా పోవడం చాలా మంచిది.ఈయనకు ఉత్తమ గతులు కలుగుతాయన్న దానికి ఇది సూచన.

అశ్వనీనక్షత్రం రెండోపాదంలో ఈయన జన్మించారు.అశ్వనీ దేవతలు దేవ వైద్యులు.ఈయన కూడా తన యోగవైద్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు.నక్షత్ర లక్షణాలు ఈ విధంగా జీవితంలో కనిపిస్తూ ఉంటాయి.

ఈయన పుట్టినపుడు కేతు/కుజ దశ జరుగుతూ ఉన్నది.కేతు కుజుల సంబంధం గురించీ వీరవిద్యల గురించీ నేను ఇంతకు ముందు వ్రాసి ఉన్నాను.దీనికి ఋజువు మళ్ళీ ఈ జాతకంలో కనిపిస్తుంది.ఈ సంబంధం ఉన్నప్పుడు శరీరంతో చేసే వ్యాయామవిద్యలు చాలా త్వరగా పట్టుబడతాయి.యోగానికీ వీరవిద్యలకూ సంబంధం ఉన్నదని నేను స్వానుభవంతో నిర్ధారణగా చెప్పగలను.

జననకాల దశాదిపతి అయిన కేతువు అష్టమంలో ఉండటంతో ఆయన చిన్నతనం అంతా రోగాలతోనూ గండాలతోనూ గడిచింది. బలహీనంగా, ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండే ఈ పిల్లవాడు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి యోగాగురువు అవుతాడనీ 95 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతాడనీ బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు.

కుజుడు బలంగా ఉన్న జాతకులకు భౌతిక పరిధిలో అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి.వారు దానిని దాటి వెళ్ళలేరు.ఒకవేళ వెళ్ళినా వారి మూలాలు భౌతికం లోనే పాతుకుని పోయి ఉంటాయి.కుజునికి ఉచ్ఛరాశి మకరం కూడా భూతత్వ రాశియే.అందుకే వారికి భౌతిక శరీర సంబంధం అంత త్వరగా వదలదు.

ఈయన జాతకంలో కుజుడు రాశి నవాంశలలో ఉచ్ఛలో ఉన్నాడు.కనుక చాలా బలంగా ఉన్నట్లు లెక్క.కనుక భౌతిక శరీరంతో చేసే హఠయోగాన్ని ఈయనకు వరంగా ప్రసాదించాడు.
  
18 ఏళ్ళ వయసులో 'యోగా' ను నేర్పడానికి ఆయన పూనాలో అడుగు పెట్టాడు.అప్పుడు ఆయనకు శుక్ర/శని దశ జరుగుతున్నది.మొదట్లో ఎన్నో కష్టాలు పడినా క్రమేణా గుర్తింపు లభించింది.శనీశ్వరుడు ఈయన జాతకంలో విద్యకు కారకుడు.కనుక శరీరకష్టంతో కూడిన యోగవిద్య ఆయనకు పట్టుబడింది.శుక్రుడు లగ్నాదిపతిగా మూడింట నవమాధిపతి అయిన బుదునితో కలసి ఉన్నాడు.నవమం నుంచి గురువుతో చూడ బడుతున్నాడు.కనుక దూరప్రాంతానికి యోగాగురువుగా వెళ్ళాడు.

1952 లో వాయులీన విద్వాంసుడు యెహోదీ మెనూహిన్ ద్వారా ఈయన లండన్ లో యోగా క్లాస్ ప్రారంభం చేశాడు.ఆ సమయంలో చంద్ర/గురు దశ ఈయన జాతకంలో జరిగింది.చంద్రుడు సప్తమంలోనూ గురువు నవమంలోనూ ఉండటం చూడవచ్చు.ఈ రెండూ విదేశాలను సూచించే స్థానాలే.

90 ఏళ్ళ వయస్సులో కూడా రోజుకు మూడుగంటలు ఆసనాభ్యాసమూ ఒక గంట ప్రాణాయామమూ ఆయన ఖచ్చితంగా చేసేవాడు.వంక దొరికితే సాధనను ఎగర గొడదామని చూచే నేటి మనుష్యులు ఈయన్ని చూచి బుద్ధి తెచ్చుకోవలసిన అవసరం చాలా ఉన్నది.

ఈయన జిడ్డు కృష్ణమూర్తికి కూడా యోగా నేర్పించాడు.

ఈయనా రజనీషూ ఇద్దరూ పూనాలోనే ఉండేవారు.రజనీష్ చివరలో రకరకాల రోగాలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈయన దగ్గర యోగా నేర్చుకోమని కొందరు సూచించగా రజనీష్ తిరస్కరించాడు.శీర్షాసనం అంతసేపు వేస్తే మెదడులో రక్తనాళాలు చిట్లిపోతాయని రజనీష్ వాదించాడు. మరి నేటివరకూ అయ్యంగార్ కు ఏ రక్తనాళాలూ చిట్లలేదు.

1984 లో నేను గుంతకల్లు లో ఉన్నప్పుడు అక్కడ యోగా క్లాసు మొదలు పెట్టించడానికి అక్కడి వైశ్యప్రముఖులు ఈయనను రప్పించారు.అప్పుడు ఆయన యోగా క్లాసును దగ్గరుండి చూచాను.అప్పటికే నేను మార్షల్ ఆర్ట్స్ మరియు యోగా చాలా తీవ్రంగా చేసేవాడిని.అయ్యంగార్ గారి విధానంలో చాలా రకాలైన props వాడతారు.అవీ మంచివే.కానీ యోగాలో నా విధానం వేరు.నాకు ఆ క్లాసులో కొత్త ఏమీ కనపడలేదు.కనుక నేను అందులో చేరలేదు.

పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు ఈయనను వరించాయి.

పద్మశ్రీ 1991 లో వచ్చింది.ఆ సమయంలో గురు/కేతు దశ జరిగింది.వీరిద్దరూ అష్టమంలో ఉండటం చూస్తే ఈ అవార్డ్ ఈయనకు వ్రాసిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది.గత జన్మలో బాకీ ఉన్న దానిని ఈ జన్మలో ఇలా అందుకున్నాడు.

పద్మభూషణ్ 2002 లో శని/శని దశలో వచ్చింది.శనీశ్వరుడు ఈయనకు విద్యాదిపతిగా దశమ లాభ స్థానాలలో ఉండటం చూడవచ్చు.

పద్మవిభూషణ్ 2014 లో శని/రాహు దశలో వచ్చింది.ఘటీ లగ్నం రాహు నక్షత్రంలో ఉండటం గమనిస్తే ఇది ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.

నేడు అంటే 20-8-2014 న శని/రాహు/శనిదశలో ఈయన మరణించాడు.ఇది ఖచ్చితమైన శపితయోగ దశ అని మళ్ళీమళ్ళీ నేను వివరించనవసరం లేదు.ఇదేమిటో నా పాత పోస్ట్ లు చదివిన వారికి సుపరిచితమే.

ప్రస్తుతం గోచార కుజశనులు ఈయన జననలగ్నం మీద సంచరిస్తున్నారు. అంటే ఈయన జన్మలగ్నానికి శపితయోగం పట్టింది.

రాశి నవాంశలలో ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు ఈయనకు శరీర ప్రధానమైన హఠయోగవిద్యనూ ఇచ్చాడన్నది వాస్తవం.అంతర్జాతీయ గుర్తింపును రాహువూ గురువూ ఇచ్చారు.

మన యోగవిద్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఇటువంటి విశిష్ట వ్యక్తులకు 'భారతరత్న' ఇవ్వడం చాలా అవసరం.అలా ఇవ్వడం ద్వారా మన ప్రభుత్వం తనను తానే గౌరవించుకున్నట్లూ మన విద్యలను గౌరవించినట్లూ అవుతుంది.

మన సంస్కృతిని గౌరవించే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్నది గనుక అలా జరుగుతుందని ఆశిద్దాం.