“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఆగస్టు 2014, మంగళవారం

అశ్వద్దామా కృపాచార్యుల సంవాదం-ధర్మసూక్ష్మాలు

ఒక గ్రంధాన్ని ఎలా చదవాలి?

ఇదొక  ప్రశ్నా అసలు? అని కొందరికి అనుమానం రావచ్చు.ఇది మంచి ప్రశ్నే.ఎందుకంటే గ్రంధాలను ఎలా చదవాలో చాలామందికి తెలియదు.ఇది కూడా మళ్ళీ వినడానికి వింతగానే ఉంటుంది.

ఒక నవలనో ఒక కధనో ఎలా చదివినా పరవాలేదు.అందులో కాసేపు కాలక్షేపమూ మనోరంజనమే గాని అంతకంటే గొప్ప విషయాలూ జీవితానికి పనికొచ్చే సంగతులూ వాటిల్లో ఏమీ ఉండవు.

ప్రాచీన గ్రంధాలు అలాంటివి కావు.వాటిలో చాలా లోతైన ఉన్నతమైన విషయాలుంటాయి.అవి అర్ధం కావాలంటే వాటిని ఒక ధ్యానస్థితిలో చదవాలి.ఆ మహర్షి ఏం చెప్పాలనుకుంటున్నాడో గ్రహించాలంటే ఆయన వేవ్ లెంత్ లోకి మనం వెళ్ళాలి.అప్పుడే మనకు విషయం అర్ధమౌతుంది.దీనినే ఇంగ్లీషులో reading between the lines అంటారు.

మన గ్రంధాలను చదివేటప్పుడు ఒక కధలాగా పైపైన చదువుకుంటూ పోవడం మనలో చాలామందికి అలవాటు.అది సరియైన విధానం కాదు.అలా చదవడం వల్ల చదివినది మనకు జీర్ణం కాదు.

భోజనం చేసేటప్పుడు కొందరు గబగబా తినేస్తారు.బంతిలో అందరికంటే ముందు తినడం ఒక గొప్ప అనుకునే వారూ ఉన్నారు.ఇంకొంతమంది అనవసరమైన మాటలు మాట్లాడుతూ తినేవారూ ఉన్నారు.ఇంకొందరైతే మంచినీళ్ళు త్రాగుతూ అన్నాన్ని జారమింగేస్తూ ఉంటారు.ఇలాంటివారికి తిన్నది జీర్ణం కాకపోగా అజీర్ణరోగాలూ ఆమ్లపిత్తమూ పట్టుకునే అవకాశాలు బలంగా ఉంటాయి.

ఒక పుస్తకం చదవడం కూడా తిండి తినడం వంటిదే.ఇది మనసుకు తిండి.కనుక తినేటప్పుడు ఎలాగైతే మౌనంగా ఉంటూ హడావుడి లేకుండా నిదానంగా నమిలి తింటామో అలాగే ఒక గ్రంధాన్ని చదివేటప్పుడు కూడా తొందర లేకుండా ఎవరితోనూ మాట్లాడకుండా విషయాన్ని చక్కగా అర్ధం చేసుకుంటూ ధ్యానపూర్వకంగా చదివితే విషయపు లోతులు అర్ధమౌతాయి.

అప్పుడే రచయిత ఏమి చెప్పాలనుకున్నాడో మనకు స్పష్టంగా అర్ధమౌతుంది.

కొందరు నన్ను అడుగుతూ ఉంటారు.

'మీరు భగవద్గీత చదివారా?' అని 

'చదువుతున్నాను' అని మాత్రమే ఎప్పుడడిగినా జవాబు చెబుతూ ఉంటాను.అంతేకాదు ఉపనిషత్తుల గురించి గానీ ఆ స్థాయికి చెందిన ఇంకే సాహిత్యాన్ని గురించి అయినా 'చదువుతున్నాను' అని మాత్రమే ఈనాటికీ చెబుతాను.నా జీవిత చరమాంకం లో ఈ ప్రశ్న ఎదురైనా కూడా ఇదే జవాబు చెబుతాను.ఎందుకంటే కొన్ని గ్రంధాలను చదవడం అనేది ఎప్పటికీ పూర్తి కాదని నాకు తెలుసు.

నిజానికి నేను భగవద్గీతను ఎన్నో సార్లు తిరగా మరగా చదివాను.మొదటి పేజీనుంచి చివరిపేజీ వరకూ ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.నాకు గుర్తున్నంతవరకూ,నాకు ఇరవై ఏళ్ళు వచ్చేలోపే దానిని కనీసం ఒక 100 సార్లు చదివి ఉంటాను.కాని దానిని ఇంకా పూర్తి చెయ్యలేదనే నేటికీ ఎవరడిగినా చెబుతాను.అది ఎప్పటికీ పూర్తికాదు కూడా.

నేటికీ అందులో నాకు ఎన్నెన్నో కొత్తకొత్త భావాలు ఎప్పటికప్పుడే స్ఫురిస్తూ ఉంటాయి.ఎన్నో రహస్యాలు అర్ధమౌతూ ఉంటాయి.చదివిన ప్రతిసారీ ఇంతకు ముందు తెలియని ఒక కొత్త విషయం తెలుస్తుంది.

మహాభారతం కూడా అటువంటిదే.అది ఒక వేదాంత గ్రంధం కాదు.కాని వేదాంత గ్రంధమే.అర్ధం చేసుకుంటే అందులో లేనిది లేదు.

అందుకే ఒక సూక్తి ఉన్నది.

'భారతంలో ఉన్నది ఇంకెక్కడైనా ఉండవచ్చేమోగాని ఇక్కడ లేనిది ఇంకెక్కడా ఉండదు.' అని.

శ్రీరంగానందస్వామి అని ఒక పాతకాలపు స్వామి రామకృష్ణమఠంలో ఒకప్పుడు ఉండేవారు.1982 లో ఆయనకు దాదాపు అరవైఏళ్ళు ఉంటాయి.ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు.కాని ఉంటే మాత్రం తొంభై ఏళ్ళు పైబడే ఉంటాయి.

1982 లో ఆయన నాతో ఇలా అన్నారు.నేను 'గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ' గ్రంధాన్ని నా చిన్నప్పటి నుంచి అంటే దాదాపు నలభై ఏళ్ళ క్రితం నుంచి చదువుతున్నాను.నేటికీ దానిలోని ప్రతి పేజీలో ఒక కొత్త స్ఫురణ నాకు కలుగుతుంది.చదివిన ప్రతిసారీ నా మనోనేత్రం ముందు ఒక కొత్త కిటికీ తెరుచుకుంటుంది. అందులోనుంచి ఇంతకు ముందు చూడని ఒక కొత్త ఆకాశం కనిపిస్తుంది.

ధ్యానస్థితిలో ఉండి చదివినప్పుడే అలాంటి అద్భుతం జరుగుతుంది.

ధ్యానస్థితిలో ఉండి ఒక పుస్తకాన్ని చదవడం వేరు.మామూలుగా పైపైన చదవడం వేరు.మొదటిది ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తే,రెండవది ఉత్త కాలక్షేపానికి పనికొస్తుంది.అంతే.

గొప్ప గ్రంధాలలో గొప్పగొప్ప విషయాలుంటాయి.అయితే వాటిని అర్ధం చేసుకునే తీరులో చూస్తేనే అవి అర్ధమౌతాయి.పైపైన తేలికభావంతో చదివితే అర్ధం కావు.మహానీయులైనా అంతే.వారు బ్రతికి ఉన్నపుడు వారు మహనీయులు కాలేదు.వారు పోయిన తర్వాతనే వారు లోకానికి మహానీయులయ్యారు.మన ఎదురుగా కనిపిస్తుంటే మనకు లోకువ.అదే అందని ద్రాక్ష అయితే పుల్లన ఎక్కువ.దేవుడైనా ఇంతే.

శ్రీకృష్ణుడు దేవుడని భారతంలో చాలామందికి తెలియదు.చివరకు పాండవులకు కూడా తెలియదు.అర్జునుడికి కూడా తెలియదు.విశ్వరూపం చూచిన కాసేపు అర్జునుడికి ఆ తెలివి ఉన్నది.తర్వాత పోయింది.ఒక్క వ్యాసునికి మాత్రమే ఇది తెలుసు.చివరకు గోపికలకు కూడా ఈ రహస్యం తెలియదు.వారికి కృష్ణుడు దేవుడు కాదు.ఒక మధుర ప్రేమికుడు మాత్రమే.

ఎంతసేపూ మన ముందు కనిపిస్తూ తింటూ తిరుగుతూ మనలాగే రోగాలూ రొష్టులూ పడుతూ ఉన్న మనిషిని దేవుడని నమ్మడానికి మన మనస్సులు ఒప్పుకోవు.శ్రీ రామకృష్ణుడిని కూడా మామూలు మనిషనే అందరూ అనుకున్నారు.వివేకానందాది అతికొద్దిమంది అంతరంగ భక్తులకు తప్ప ఆయన అవతారపురుషుడని ఎవరికీ తెలియదు.

చాలామంది ఇళ్లలో ఎన్నో గ్రంధాలు దుమ్ము కొట్టుకుంటూ ఉంటాయి.వాటిని ఏనాడూ తీసి చదివిన పాపాన పోరు.ఎందుకంటే ఏదైనా సరే మన కళ్ళముందు ఎప్పుడూ కనిపిస్తుంటే మనకు చులకన భావం వస్తుంది.'ఆ ఉందికదా ఎక్కడకు పోతుంది?తర్వాత చదువుదాములే.'అనుకుంటారు.ఆ చదవడం మాత్రం ఎప్పటికీ మొదలు పెట్టరు.

అసలు చదవని వారికీ పుస్తకం పూర్తికాదు.శ్రద్దగా చదివేవారికీ అదెప్పటికీ పూర్తికాదు.మధ్యలో గబగబా చదివే వారికి మాత్రం పూర్తి అవుతుంది.కాని వారికేమీ ఉపయోగం మాత్రం ఉండదు.

ఒక పుస్తకానికీ గ్రంధానికీ తేడా అదే.ఏదైతే ఎప్పటికీ చదవడం పూర్తి కాదో,దానినే గ్రంధం అని నేనంటాను.మిగిలినవన్నీ పుస్తకాలే.గ్రంధంలో ధర్మసూక్ష్మాలుంటాయి.పుస్తకంలో ఉబుసుపోని మామూలు విషయాలు మాత్రమే ఉంటాయి.

భారతంలో ఎన్నో ధర్మసూక్ష్మాలున్నాయి.ధ్యానపూర్వకంగా చదివితే వాటిని అర్ధం చేసుకోవచ్చు.ఆచరణలోకి తెచ్చుకోవచ్చు.

మనం ప్రస్తుతం విచారించబోతున్న ఘట్టం కూడా అటువంటిదే.

కృపాచార్యుడు ఆశ్వత్తామకు చేసిన బోధ కూడా అటువంటిదే.

మనిషి ఏ పనిని సాధించాలన్నా మానవప్రయత్నమూ దైవానుగ్రహమూ రెండూ కలవాలని ఆయన అన్నాడు.ఇది అక్షర సత్యం.

మనం ఒక పనిని సాధించాలంటే ఉత్త ప్రయత్నం ఉంటె చాలని అనుకుంటాం.నేటి మేనేజిమెంట్ క్లాసులలో కూడా దీక్షగా ప్రయత్నిస్తే సాధించలేనిది లేదని నూరిపోస్తుంటారు.అది కొంతవరకూ నిజమే.కాని పూర్తి నిజం కాదు.

దీక్షగా ప్రయత్నించిన ఒక పదిమందిలో కూడా ఒక్కడే విజయం సాధిస్తాడు.అతనికీ మిగిలిన తొమ్మిదిమందికీ దీక్షలో పెద్ద తేడాలుండవు. కానీ విజయం ఇతన్నే వరిస్తుంది.ఒక్కొక్కసారి,అంత గట్టిగా ప్రయత్నం చెయ్యనివానిని కూడా విజయం వరిస్తుంది.రాత్రింబవళ్ళూ దీక్షగా ప్రయత్నించిన వానికి అది దూరమౌతుంది.దీనిని మనం చాలాసార్లు నిత్యజీవితంలో గమనించవచ్చు.

కనుక మానవ ప్రయత్నం ఒక్కటే చాలదు.దానికి దైవానుగ్రహం కూడా తోడు కావాలి.దైవానుగ్రహం అంటే ఏమిటి?అది మన పూర్వపుణ్యమే.

అర్హత అనేది ఏ విషయానికైనా చాలా ప్రధానం.ఆ అర్హత అనేది ఎలా వస్తుంది?దానికోసం ఊరకే తపిస్తే అర్హత రాదు.దానిని పొందటానికి కావలసిన పూర్వరంగాన్ని మనం సిద్ధం చేసుకుని ఉండాలి.దానికి కావలసిన పెట్టుబడి పెట్టి ఉండాలి.అప్పుడు మనకు దాని ఫలితం వస్తుంది.పెట్టుబడి పెట్టకుండా ఊరకే ఫలితాన్ని ఆశిస్తే అది రాదు.

ఏమిటా పెట్టుబడి? అంటే అదే పూర్వకర్మ బలం.పూర్వం మనం ఏదైనా ఒక పుణ్యం చేసి ఉంటె,ఒకరికి సాయం చేసి ఉంటె,దాని ఫలితం మనకు ఇప్పుడు వస్తుంది.లేకుంటే మనం అరచి గీ పెట్టినా రాదు.

ఆ పూర్వకర్మనే మనం అదృష్టం అంటాం.దైవానుగ్రహం అంటాం.అదృష్టం అంటే ఏమిటి?దృష్టం కానిది.అంటే మనకు ప్రస్తుతం కనపడనిది.పూర్వం చేసుకున్న పుణ్యం నేడు కంటికి కనబడదు.కానీ అది మన వెన్నంటే ఉంటుంది.దాని ఫలితంగానే నేడు మనకు కార్యానుకూలత కలుగుతుంది. దానినే మనం అదృష్టం అనీ దైవానుగ్రహం అనీ అంటాము.

దైవానుగ్రహం లేకుండా ఉత్త మానవప్రయత్నం ఎంత చేసినా ఉపయోగం ఉండదు.కొందరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.కాని ఫలితం ఉండదు.వారి జీవితమంతా ఓటమితోనే గడుస్తుంది.వారి మానవప్రయత్నంలో లోపం ఉండదు.అలాంటివారికి దైవానుగ్రహం లేదని అర్ధం.

మానవప్రయత్నం లేకుండా ఉత్త దైవం మీద భారం వేసి కూచుంటే కూడా లాభం లేదు.గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఉపయోగం ఏముంది?అది తప్పించుకునే మనస్తత్వం అవుతుంది.దానివల్ల ఏమీ ఉపయోగం లేదు.

మళ్ళీ ఈ రెంటికీ పాళ్ళు ఉన్నాయి.మానవప్రయత్నం గానీ దైవానుగ్రహం గానీ సరిపోయినంత లేకుంటే మళ్ళీ ఉపయోగం లేదు.అవి ఆ కార్యానికి సరిపోయినంత పాళ్ళలో ఉండాలి.అప్పుడే ఆ పని అవుతుంది.

కనుక మన ప్రయత్నం మనం చెయ్యాలి.దైవానుగ్రహం దానికి తోడవ్వాలి. ఆరెండూ సరియైన పాళ్ళలో కూడినప్పుడే ఫలితం వస్తుంది.లేకుంటే రాదు. దైవానుగ్రహం రావాలంటే ఏం చెయ్యాలి?ఎంతసేపూ లోకాన్నో లేదా ఇంకొకరినో దోచుకోవడం కాకుండా,మన కష్టార్జితం నుంచి ఇతరులకు, అందులోనూ నిజంగా ఆపదలో ఉన్నవారికి మనం నిస్వార్ధంగా సహాయపడాలి.ఆ సహాయం వెనుక ఇంకేమీ దురుద్దేశం ఉండకూడదు. పేరుకోసమో ,గొప్పకోసమో ఒకరికి సహాయం చెయ్యడం కంటే అసలు చెయ్యకపోవడమే మంచిది.

నిస్వార్ధంగా ఒకరికి సహాయం చేసినప్పుడు మనకు పుణ్యబలం పెరుగుతుంది.ఆ పుణ్యబలం మనం ఆపదలో ఉన్నపుడు అక్కరకొస్తుంది.

ఇది ఎవరూ దాటలేని కర్మనియమం.

ప్రపంచంలో ఎవరైనా దీనికి మినహాయింపు కారు.

ఈ నియమమే ప్రపంచాన్ని పట్టి నడిపిస్తున్నది.దీనిని మన ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల నాడే అర్ధం చేసుకున్నారు.అనేక గాధలలో దీనిని నిక్షిప్తం చేసి మనకు చెప్పాలని ప్రయత్నించారు.దానిని మనం అర్ధం చేసుకుని జీవితాలలో ఆచరిస్తే మనం అదృష్టవంతులం అవుతాం.మేం వినం అంటే మనల్ని ఎవ్వరూ బాగుచెయ్యలేరు.

ఒక మహాకార్యాన్ని తలపెట్టుకున్నపుడు దానికి తగిన స్థాయిలో మనం సన్నద్దులం కావాలి.ప్రయత్నం చేసినంత మాత్రాన అహంకారం పనికిరాదు. ఆ ప్రయత్నానికి దైవానుగ్రహం కూడా కలిస్తేనే విజయం లభిస్తుందన్న విషయం మనం మరచిపోరాదు.విజయం లభిస్తే మనం గర్వంతో పొంగిపోకూడదు.లభించకపోతే కుంగిపోయి ప్రయత్నం మానకూడదు.

ఈ విషయాన్నే కృపాచార్యుడు ఆనాటి రాత్రి అశ్వత్థామకు బోధించాడు.అశ్వత్థామ దానిని స్వీకరించాడు.దానికి తగిన ప్రయత్నం చేశాడు.అసాధ్యంగా కనిపిస్తున్న కార్యంలో విజయాన్ని సాధించాడు.

అనుల్లంఘనీయమైన కర్మ నియమాన్నీ,విజయం వెనుక ఉండే సూక్ష్మమైన శక్తుల తోడ్పాటునూ కృపాచార్యుని ద్వారా మనకు బోధించాడు మహాగురువు వ్యాసమునీంద్రుడు.

ఆ బోధను అర్ధం చేసుకుని నిత్యజీవితంలో ఆచరిస్తే మనం అదృష్టవంతులమే.నిరాకరిస్తే నష్టపోయేదీ మనమే.ప్రకృతిశక్తులను నేను లెక్కచెయ్యను కర్మనియమాన్ని నేను లెక్కచేయ్యను అంటే నష్టం ఎవరికి?ఆట నియమాలకు నేను ఎదురు తిరుగుతాను అంటే తొలగించబడి ఆటలోనుంచి పక్కకు తప్పుకోవలసి వస్తుంది.ఆట నియమాలను అర్ధం చేసుకుని వాటికి అనుగుణంగా నైపుణ్యంతో ఆడినవానికే విజయం వరిస్తుంది.

సృష్టి అనే ఈ ఆట నియమాలను మనం అర్ధం చేసుకుని తెలివిగా మన ఆటను ఆడినప్పుడే ఈ ఆటలో మనం గెలవగలుగుతాం.లేకుంటే మనకు ఓటమి తప్పదు.

(ఇంకా ఉన్నది)