“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, జూన్ 2014, మంగళవారం

తెలంగాణా ఆవిర్భావ కుండలి-ఫలితములు(1)

2-6-2014 అర్ధరాత్రి 00.00 గంటలకు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది.

ఆ సమయానికి ఉన్న గ్రహస్థితిని పక్కన ఇచ్చిన రాశి నవాంశ కుండలులలో చూడవచ్చు.

జ్యేష్ట శుక్లచతుర్ధి రోజున ఆదివారం నాడు అర్ధరాత్రిపూట (తెల్లవారిన తర్వాతనే సోమవారం అవుతుంది) పునర్వసు నక్షత్రంలో వృద్ధియోగంలో విష్టికరణంలో శనిహోరలో ధనుర్నవాంశలో తెలంగాణా రాష్ట్రం మొదలైంది.

జ్యేష్టమాస ఫలం
క్షమాస్వభావం, చంచలబుద్ధి, తీవ్రస్వభావం,విదేశయానంలో కోరిక, విచిత్రమైన బుద్ధిని జ్యేష్ట మాసం ఇస్తుంది.

శుక్ల చతుర్ధి
అప్పులు చెయ్యడం,వాదప్రతివాద ప్రియత్వం,ధైర్యం,యుద్ధకౌశలం,జూదం అంటే ఇష్టాలను ఇస్తుంది.

ఆదివారం
పౌరుషాన్నీ,యుద్ధంలో జయించే తత్వాన్నీ,దాతృత్వాన్నీ,ఉత్సాహాన్నీ ఇస్తుంది.

పునర్వసు నక్షత్రం
ఎక్కువమంది మిత్రులనూ,ధనాన్నీ,భూమినీ ఇస్తుంది.

వృద్ధి యోగం
వ్యాపార వృద్దినీ,ధన వృద్ధినీ ఇస్తుంది.

విష్టి కరణం
చపలస్వభావాన్నీ,బలాన్నీ,శత్రుజయాన్నీ,అధిక నిద్రనూ,దుష్టమనస్సునూ ఇస్తుంది.

తృతీయ నవాంశలో జననం
స్త్రీలంటే ఇష్టాన్నీ(స్త్రీలైతే పురుషులంటే ఇష్టాన్నీ),ధర్మబుద్ధినీ ఇస్తుంది.

స్థిరలగ్నమైన కుంభం ఉదయించడం మంచి సూచన.లగ్నాధిపతి శనీశ్వరుడు నవమంలో ఉచ్ఛస్థితిలో ఉండటం చాలామంచిది.లగ్నం కుంభం ఏడుడిగ్రీలలో ఉండి పంచమంలో ఉన్న బుధునిచేత ఖచ్చితమైన కోణదృష్టితో చూడబడుతున్నది.అంటే తెలంగాణా రాష్ట్రం వెనుక ఎన్నో ఏళ్ళతరబడి ఉన్న ఎంతోమంది ఆకాంక్ష వ్యక్తమౌతున్నది.ఆ ఆకాంక్షల ఫలితంగానే ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం వచ్చిందన్న సూచన మంత్రస్థానాదిపతి అయిన బుధుని దృష్టి వల్ల ఉన్నది.

లగ్నాధిపతి శనికి రాహువు స్పర్శ మంచిదికాదు.దానివల్ల విదేశాలకు చెందిన శక్తులతో నిత్యం అప్రమత్తంగా ఉండాలన్న సూచన ఉన్నది.ఆ విదేశం పాకిస్తానే కావచ్చు.కొత్త తెలంగాణా రాష్ట్రాన్ని వాళ్ళు ఒక స్థావరంగా మార్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం తేలికగా తీసుకోరాదు.ఎప్పటికప్పుడు అప్రమత్తంగా లేకపోతే చివరకు ఏదో ఒకనాడు చాలా ఘోరమైన మూల్యాన్ని మనం చెల్లించవలసి వస్తుంది.గతంలో హైదరాబాద్లో గాని దేశంలో ఇంకెక్కడైనా గాని జరిగిన ప్రతి విధ్వంసం వెనుకా మూలాలు హైదరాబాద్ లోనే ఉన్నాయన్న సంగతి ప్రభుత్వం మరువకూడదు.

శనిరాహువుల దృష్టి లాభస్థానం మీద ఉండటం కూడా మిత్రశత్రువులనే (అంటే మంచిగా నటిస్తూ లోలోపల కుట్రలు చేసే మిత్రులను) సూచిస్తున్నది.ఆత్మకారకుడైన గురువు జ్ఞాతికారకుడైన బుధునితో పంచమంలో ఉండటంవల్ల తమతో చేరుతున్నవారు అందరూ తమ మిత్రులు కారన్న విషయం సూచింపబడుతున్నది.

చంద్రుడు రెండుడిగ్రీలలో(పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో)ఉండి రాహువుతో ఖచ్చితమైన ప్రతికూల కేంద్రదృష్టిలో ఉన్నాడు.దీనివల్ల ఈ రాష్ట్రంమీద ఉన్న పరాయి దేశపు కుట్రపూరిత దృష్టి సూచితం అవుతున్నది.

షష్టాధిపతి అయిన క్షీణచంద్రుడు షష్ఠంలో ఉండటం కూడా ఈ భావనకు బలాన్నిస్తున్నది.జ్యోతిశ్శాస్త్రపరంగా క్షీణచంద్రుడు పాకిస్తాన్ కు సూచిక అని మరువరాదు.

షష్ఠంలో ఉన్న చంద్రుని మీద నవమం నుంచి ఉన్న శనియొక్క ప్రత్యేకదృష్టి వల్ల మతపరమైన సంస్థలు బలీయం అవుతాయనీ క్రమేణా వీటివల్ల ప్రభుత్వానికి తలనొప్పులు కలుగుతాయనీ తెలుస్తున్నది.నూతన రాష్ట్రానికి కలగబోయే చికాకులలో మతసంస్థల బలోపేతం అనేది ముఖ్యంగా ఉండబోతున్నది.నవమస్థానంలోని శని రాహువులే దీనికి సూచికలు.

నవాంశ లగ్నాత్ అష్టమంలోని శుక్రచంద్రులవల్లా రాశిచక్రం లోని షష్ఠ చంద్రుని వల్లా నక్సలైట్ల సమస్య అనేది నూతనరాష్ట్రానికి కూడా తప్పకపోవచ్చన్న సూచన ఉన్నది.

రాష్ట్రం ప్రారంభం కావడం గురు/రాహు/బుధ దశలో జరిగింది.గురువుకు రాహుస్పర్శ ఏమాత్రం మంచిదికాదు.ఇది గురుచండాలయోగం అనబడుతుంది.ఉత్తములైన వారు కూడా అధములైనవారి సహవాసంతో పతితులు కావడాన్ని ఈ యోగం సూచిస్తుంది.వీరితో కలిసిన బుధుని వల్ల కలుషితం కాబడిన బుద్ధి సూచింపబడుతున్నది.కనుక నాయకులు విశాల దృక్పధంతో ఉండాలనీ,సంకుచిత స్వభావాలు కలిగిన వారితో తెలిసీ తెలియక చేతులు కలిపితే తాము మోసపోవడమే గాక దేశక్షేమానికే భంగమన్న సూచనలున్నాయి.

సప్తమాధిపతి సూర్యుడు చతుర్దంలోకి వచ్చి ఉండటం కూడా ఈ సూచనకు బలాన్ని ఇస్తున్నది.అంటే అంతశ్శత్రువులు ప్రజలలోనే కలసిపోయి ఉంటారన్న సూచన ఉన్నది.లగ్నాదిపతికి సూర్యుడు ప్రబలశత్రువు కావడమూ దీనిని సమర్ధిస్తున్నది.

అయితే పంచమంలో గురుబుధులు ఉండటం ఈ కుండలికి చాలా బలీయమైన మంచి సూచన.రాష్ట్రానికి దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నదన్న సూచనను ఈ యోగం ఇస్తున్నది.అక్కడనుంచి గురుదృష్టి రాహుశనుల మీద ఉండటం వల్ల దైవబలంతో ప్రతిసారీ పైన చెప్పిన సమస్యలను రాష్ట్రం అధిగమిస్తుందని సూచిస్తున్నది.

శనివీక్షణా కుజవీక్షణా ఉన్న లాభస్థానం పైనే గురువీక్షణ కూడా ఉండటం వల్ల ప్రతిసారీ దైవబలంతో కష్టాలూ ప్రమాదాలూ దాటిపోతాయన్న సూచన ఉన్నది.గురువు యొక్క నవమదృష్టి లగ్నం మీద ఉండటంతో లగ్నానికి రక్షణ ఏర్పడింది.అంటే తెలివైన మంత్రుల మరియు అధికారుల మంత్రాంగమే రాష్ట్రానికి రక్ష అవుతుందని తెలుస్తున్నది. 

రాహువు శుక్రుని సూచిస్తున్నందువల్ల ఇది ఇంకొకరకంగా చాలా మంచి యోగాన్నిస్తుంది.లగ్న,చతుర్ధ,నవమాదిపతులు నవమస్థానంలో కలిసిన యోగం మంచి రాజయోగం అవుతుంది.రాష్ట్రం బాగా అభివృద్ధిలోకి వస్తుంది అన్న సూచనను ఈ కోణం ఇస్తున్నది.

సర్వాష్టకవర్గులో లగ్నబిందువుల కంటే లాభస్థానంలోని బిందువులు ఎక్కువ కావడంవల్ల రాష్ట్రపరిస్థితి ఆర్ధికంగా లాభయుతంగానే ఉంటుందని తెలుస్తున్నది.రాశిచక్ర లాభస్థానం నవాంశ కుండలిలో లగ్నం కావడమూ దీనికి సూచనే. 

తృతీయ దశమాధిపతి కుజుడు అష్టమంలో పడటం మంచి సూచన కాదు. ధైర్యంతో కూడిన సుపరిపాలనను అందించడం ప్రభుత్వానికి కష్టం అవుతుందన్న సూచన ఉన్నది.ఆ కుజునికి సర్వాష్టకవర్గులో 22 బిందువులు రావడం ఏమాత్రం మంచిసూచన కాదు.దీనివల్ల సంక్షోభమూ అల్లర్లూ గొడవలూ తలెత్తే సూచనలున్నాయి.

చతుర్దాదిపతి అయిన శుక్రుడు దానికి ద్వాదశంలో కేతుగ్రస్తుడు కావడమూ దీనిని బలపరుస్తున్నది.ప్రజల ఆశలూ ఆకాంక్షలూ అనుకున్నంత వేగంగా నెరవేరక వారిలో నిరాశ తలెత్తుతుందన్న సూచన ఉన్నది.

ద్వితీయ తృతీయాల మీద అష్టమం నుంచి ఉన్న కుజవీక్షణ వల్ల తొందరపడి మాట్లాడటం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు కనిపిస్తున్నాయి.కనుక అధికారులు మంత్రులు చాలా ఆచితూచి స్టేట్మెంట్లు ఇవ్వవలసిన అవసరం కనిపిస్తున్నది. నోరుజారడం వల్ల శత్రుత్వాలు పెరిగే సూచనలు ఉన్నాయి.

రాహుకేతువులూ చంద్రుడూ వర్గోత్తమాంశలో ఉండటం వల్ల పైన ఉదహరించిన దోషాలు చాలావరకూ నేమ్మదిస్తాయి.

అష్టమంలోని కుజునివల్ల ఇంకొక సూచన ఉన్నది.పెద్దవయసు వారైన తెలంగాణారాష్ట్ర నాయకుల మరణం త్వరలో సూచితం అవుతున్నది.

దశా ప్రభావం

పంచమంలో ఉన్న ఆత్మకారకుడైన గురుని దశ జూలై 2015 వరకూ నడుస్తున్నది.కాబట్టి నేటినుంచీ ఆ సమయం వరకూ మంచి ప్రణాళికలతో రాష్ట్రం ముందుకు పోవడం జరుగుతుంది.అయితే గురువులో రాహువు దశాఛిద్రసమయం గనుక అనుకున్నవి జరుగక మోసపోవడం ఉంటుంది. బహుశా రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రంనుంచి ఆశించినంత,అందవలసినంత సహాయం అనుకున్నంత వేగంగా అందకపోవచ్చు.

ఆ తర్వాత 2034 వరకూ లగ్నాధిపతీ అమాత్యకారకుడూ అయి నవమంలో ఉచ్చస్థితిలో ఉన్న శనిమహర్దశ నడుస్తుంది.ఇది రాష్ట్రానికి మంచి యోగకారకమైన కాలం.అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధిని సాధిస్తుంది.అయితే రాహుస్పర్శ వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలు కూడా ఈ దశలోనే కనిపించడం మొదలుపెడతాయి.

తర్వాత 2051 వరకూ బుధమహర్దశ నడుస్తుంది.ఇది కూడా మంచికాలమే. ఆ తర్వాత 2058 వరకూ నడిచే కేతుదశా,ఆ తర్వాత 2078 వరకూ నడిచే శుక్రదశలు కూడా మంచివే.

రానున్న దశలు అన్నీ స్థూలంగా మంచివే గనుక తెలంగాణారాష్ట్రం ముందుముందు మంచి అభివృద్ధిని సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అయితే ఆయా దశలలో కొన్నికొన్ని చెడుసమయాలు తప్పకుండా ఉంటాయి.అవి కనిపించబోయే కొద్ది ముందుగా వాటిని గురించి చర్చిద్దాం.

ఈ ఫలితాలన్నీ ఎప్పుడు జరుగుతాయి?అంటే,ఆయా దశా సమయాలు వచ్చినపుడు,గోచారరీత్యా గ్రహములు ఆయా స్థానాలలోకి ప్రవేశించి సంచరించినప్పుడు ఆయా ఫలితాలు యాక్టివేట్ కాబడతాయి.తప్పకుండా జరుగుతాయి.

రాబోయే పోస్ట్ లో ఆంద్రప్రదేశ్ ఆవిర్భావ కుండలికీ,తెలంగాణా ఆవిర్భావ కుండలికీ ఉన్న సామ్యాలనూ కర్మసంబంధాలనూ గూర్చి తులనాత్మక పరిశీలన చేద్దాం.