“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, మార్చి 2023, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 52 (అమ్మ శతజయంతి ఉత్సవాలు - వక్తల ప్రసంగాలు)

అమ్మ శతజయంతి ఉత్సవాలు  జరుగుతున్నాయి. ఇవాళ మూడోరోజు. ఇంకా రెండ్రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజూ స్వామీజీలు మాట్లాడుతున్నారు. అమ్మ భక్తులు వ్రాసిన గ్రంధాలు రోజూ ఆవిష్కరింపబడుతున్నాయి.

సామాన్యులైన భక్తులు వ్రాసిన గ్రంధాలు బాగున్నాయి. ఎంతో  కృషితో వ్రాయబడుతున్నాయి. స్వామీజీల  ప్రసంగాలు మాత్రం బాలేవు. వారి వేషాలకు తగినట్లు లేవు. చాలా పేలవంగా నిరాశాజనకంగా ఉన్నాయి.

మొదటిరోజున కుర్తాళం స్వామీజీ, ఆయన తమ్ముడు ఇంకొక స్వామి, ఆయన శిష్యురాలు ఒక స్వామిని మాట్లాడారు. స్వామినికి సబ్జెక్ట్ లేదు. చక్కని భాషా, వ్యక్తీకరణా రెండూ లేవు. తమ్ముడుస్వామికి కంఠస్వరం లేదు. ఉచ్ఛారణా స్పష్టతా లేవు. ఆయనేం మాట్లాడాడో ముందు వరసవాళ్ళకే వినిపించలేదు. 

ఇకపోతే, కుర్తాళం స్వామీజీ ప్రసంగం చాలా నిరాశపరిచింది. ముప్పైఏళ్ల క్రితం, ఇరవైఏళ్ల క్రితం ఆయన ఏం మాట్లాడాడో అదే మళ్ళీ మాట్లాడాడు. భావపరిపక్వత లేదు. మంత్రాలని, తంత్రాలని, దేవతలని అదే ధోరణి. మొత్తమ్మీద ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడం, పక్కవాళ్ళ డప్పు కొట్టడం తప్ప, అమ్మ తత్త్వాన్ని స్పష్టంగా అర్ధం చేసుకుని,  అమ్మ జీవితం నుంచి చక్కని సంఘటనలతో హృద్యంగా దానిని ఆవిష్కరించడం ఈ ముగ్గురిలో ఒక్కరూ చేయలేదు. అమ్మ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చెయ్యలేదని స్పష్టంగా తెలుస్తోంది.

అమ్మ బ్రతికున్నపుడే ఆమెను స్తుతిస్తూ 'అంబికా సాహస్రి' అనే వెయ్యి పద్యాల పుస్తకాన్ని కుర్తాళం స్వామి వ్రాశారు. ఇదిలా ఉంటే, ఆమె పోయిన ఏడాదిన్నర తర్వాత 'అమ్మ ఎవరు?' అనేది తెలుసుకోవాలని జిజ్ఞాసతో 'ఆత్మావాహన విద్య' ద్వారా అమ్మ ఆత్మను ఆవాహన చేసి రప్పించి ప్రశ్నించానని ఆయన వేదికాముఖంగా చాలాసార్లు చెప్పారు. మొన్నకూడా జిల్లెళ్ళమూడిలో  మళ్లీ అదే చెప్పారు. వినడానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది.

అంటే, అమ్మ ఎవరో తెలీకుండానే ఆమెను అంబికగా స్తుతిస్తూ 'అంబికా సాహస్రి' గ్రంధాన్ని ఈయన వ్రాశారని అనుకోవచ్చునా? ఆత్మావాహన విద్యకు ప్రేతాత్మలు వస్తాయేమో గాని సాక్షాత్ అంబికయే అయిన అమ్మ కట్టుబడుతుందని ఆయనెలా అనుకున్నారో? ఈనాటికీ వేదికల పైనుంచి ఎలా చెబుతున్నారో? వినే గొర్రెలు ఎలా వింటున్నారో? నాకు చాలా అసహ్యమేసింది.

గుంటూరు వాడైన తిక్కన సోమయాజి జిల్లెళ్ళమూడి ప్రాంతంలో ఒక యజ్ఞం చేశాడని, ఆ యజ్ఞశక్తి ఆకాశంలో మేఘం లాగా ఉండిపోయి ఎవరిని ఆవహిద్దామా అని చూస్తుంటే అమ్మ కనిపించిందని, అప్పుడా శక్తి అమ్మలోకి దిగి వచ్చిందని ఒకరన్నారట. వారాహీసంహిత అనే నాడీగ్రంథంలో నేమో, పై లోకాలలో ఉండే ఒక దేవత భూమిపైన జన్మిస్తుందని, ఆమే అమ్మ అని, అమ్మ తల్లిదండ్రుల పేర్లతో సహా ఆ గ్రంథంలో ఉన్నాయని ఆయనన్నారు.  ఇంకొంతమంది మరికొన్ని రకాలుగా అమ్మను దర్సించారట, ఇవన్నీ 1960, 70 లలో జరిగాయట. వీటన్నిటినీ అమ్మకు చెబితే, దేనిని కానీ అవుననీ కాదనీ అనకుండా, 'వాళ్ళు చూచినది వాళ్ళు చెప్పారు' అందిట అమ్మ.

ఒకటే సత్యం ఇందరికి ఇన్ని విధాలుగా ఎలా కనిపిస్తుంది? కనుక ఇవేవీ సత్యాలు కాకపోవచ్చు.

అసలు 'అమ్మ ఎవరు?' అనే విషయాన్ని జ్యోతిష్యం ద్వారా, మంత్రవిద్యల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించడం సమంజసమేనా? సాధ్యమేనా? ఎందుకీ ప్రయత్నం? 22 ఏళ్ల క్రితం నేను జ్యోతిష్యంలో MA చేశాను. కొన్ని వేల జాతకాలను ఇప్పటికి విశ్లేషణ చేశాను. మెడికల్ ఆస్ట్రాలజీ పైన సాధికారిక గ్రంధాలను వ్రాశాను. కానీ, ఈ రోజుకు కూడా అమ్మ జాతకాన్ని విశ్లేషించే సాహసాన్ని నేను చేయలేకపోతున్నాను. 

'నేను నేనైన నేను' అని అమ్మ చెప్పింది. 'ఈ సృష్టి నాది అనాది' అన్నది. 'సృష్టే  భగవంతుడు' అన్నది. తనెవరో చెప్పకనే చెప్పింది. ఇంకేం కావాలి? 

అమ్మ ఎవరో తెలుసుకుంటే మనకు ఒరిగేది ఏముంది? కావలసింది అమ్మ ఎవరో తెలుసుకోవడం కాదు. మనమెవరో ముందు తెలుసుకోవాలి. అమ్మ తత్వాన్ని అర్ధం చేసుకుని, దానిని జీవితంలోకి అనువదించుకుని, ఆచరించి ధన్యత్వాన్ని పొందటం కావాలి. అమ్మ ప్రేమలో ఓలలాడటం కావాలి. అమ్మకు ఇష్టులుగా అవడం కావాలి. పరమహంస పరివ్రాజకులకు ఇంత చిన్నవిషయం ఎలా అర్ధం కావడం లేదో మరి?

జిల్లెళ్ళమూడిలో అమ్మ ప్రారంభించి, ఇతరులను చెయ్యమని చెప్పిన కార్యక్రమాలను ఎన్నింటిని, అమ్మను దేవతగా వేదికలపైనుంచి అభివర్ణించే ఈ స్వాములు వారివారి పీఠాలలో చేస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. అమ్మ జగన్మాత అనే భావన వీరికి నిజంగా ఉంటే అమ్మ బాటలో వీరు ఎందుకు నడవడం లేదు? అనేది నా ప్రశ్న.

రెండో రోజున విశ్వంజీ మాట్లాడాడు. మొదటిరోజుకంటే ఇంకా నిరాశ పరచింది ఈయనగారి ప్రసంగం. అమ్మ గురించి కంటే, సందర్భం లేని ఇతర విషయాలు ఏవేవో ఈయన మాట్లాడాడు. పాతికేళ్ల క్రిందటికీ ఇప్పటికీ ఈయనలో కూడా భావపరిణతి నాకు కనిపించలేదు.  తను వ్రాసిన ఏదో పాటను పాడుతూ, హృదయగ్రంధి అంటూ గుండెను, బ్రహ్మగ్రంధి అంటూ తలనూ, రుద్రగ్రంధి అంటూ మెడ వెనుకను చేతితో చూపించాడాయన. ఆ గ్రంధుల స్థానాలు అవా? నాకు మతిపోయింది. అవున్లే. సత్యసాయి ప్రశాంతినిలయంలో ఇటుకరాయి బొటనవ్రేలి పైన పడి కుండలినీ ప్రబోధం కలిగింది కదా! ఆ దెబ్బకు గ్రంధుల స్థానాలు  అలా మారిపోయి ఉంటాయని సర్దుకున్నాను. చివరలో ఇండియా మాతకూ జై, అమెరికా మాతకూ జై అని సభికులచేత అనిపించాడు. మిగతా మాతలు ఏం పాపం చేశారో నాకైతే అర్ధం కాలేదు. ఈయన ప్రసంగాన్ని వినిన తర్వాత, మొదటి రోజున నాలో కలిగిన ప్రశ్నలే మళ్ళీ ఇంకా గట్టిగా కలిగాయి. నవ్వూ జాలీ ఒకేసారి కలిగాయి.

మూడో రోజైన  ఈరోజున గన్నవరం స్వామీజీ మాట్లాడాడు. ఈయనకూడా కుర్తాళంస్వామి శిష్యుడేనని ఆయనే చెప్పుకున్నాడు. రామాయణంలోని శబరి, ఇప్పుడు అమ్మగా పుట్టిందని ఈయనంటాడు. పాదయాత్రలు, సంఘసంస్కరణ అంటూ ఏదేదో మాట్లాడాడీయన.

కాకపోతే కొంతలో కొంత నయం. 'ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం' అంటూ శ్రీరామచంద్రుని స్మరిస్తూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడీయన. ఇది నచ్చింది. ఇవాళ శ్రీరామనవమి. వక్టలలో కనీసం ఈయనకొక్కరికి గుర్తుంది. సంతోషం !

సమాజంలో రామభక్తి తగ్గిపోతూ, అయ్యలు, అప్పలు, బాబాలు, గురువులు దేవుళ్ళుగా చలామణీ అవడం ఎప్పుడైతే పెరిగిందో, అప్పుడే జనజీవనంలో   ధర్మం తగ్గిపోతూ వచ్చింది. ఇది సత్యం. రామభక్తి తగ్గడమే తెలుగునేలకు పట్టిన దరిద్రం. ఈ విషయాన్ని ఏ స్వామీజీలూ చెప్పడం లేదు. బాధాకరం. 

శ్రీరామునిగా అమ్మను కొందరు భక్తులు ఏ విధంగా దర్శించినది, రామతత్త్వాన్ని అమ్మ ఎలా వివరించింది అన్న విషయాన్ని,  సాక్షాత్తు శ్రీరామనవమి నాడు వక్తలెవరూ మాట్లాడలేదు. శోచనీయం !

హిమాలయాలలో మూడువేల ఏళ్ల క్రితం తాను తపస్సు చేశానని కుర్తాళంస్వామి తనతో చెప్పాడని ఈయనన్నాడు.  సందర్భోచితం కాని ఇలాంటి కాకమ్మకబుర్లను ఇలాంటి వేదికలపైనుంచి ఎందుకు చెబుతారో నాకైతే అర్ధం కాదు. అదే నిజమైతే, అమ్మ ఎవరో తెలుసుకోవడానికి వీరికి నాడీజ్యోతిష్యమూ, ఆత్మావాహన  మంత్రవిద్యలూ అవసరమా? అని నాకనిపించింది. వీరి అవగాహనా రాహిత్యానికి, కాకమ్మ కబుర్లకు చాలా  జాలేసింది.

రాజకీయుల ప్రసంగాలు వీరికంటే ఇంకా పేలవంగా నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రసంగించడానికి వచ్చిన రాజకీయ నాయకులలో ఒక్కరికి కూడా అమ్మ తత్త్వం ఏమిటో తెలియదు. అదికూడా అమ్మ పుట్టిన నూరేళ్ళ తర్వాత ఈనాటికి కూడా ! శోచనీయం !

విశ్వజననీ పరిషత్ చైర్మన్ నరసింహమూర్తిగారి ప్రసంగం ఒక్కటే నన్ను కదిలించింది. ఆయన తన హృదయం నుంచి మాట్లాడాడు. కదిలించింది. రావూరి ప్రసాద్ గారి ప్రసంగం మళ్ళీ కదిలించింది. వీళ్ళు అమ్మ భక్తులు. నిరంతరం అమ్మ ధ్యానంలో పండిపోయినవాళ్లు.  భక్తితో నిండిన హృదయం నుండి ఉప్పొంగి వచ్చిన వీళ్ళ ప్రసంగాల ముందు స్వామీజీల, రాజకీయుల పడికట్టుపదాల ఊకదంపుడు ఉపన్యాసాలు వెలాతెలా పోయాయి. కృత్రిమాలయ్యాయి.

ఈ మూడు రోజుల ప్రసంగాలు విన్న తర్వాత నాకు అమ్మ వాక్యం ఒకటి గుర్తొచ్చింది.

'వక్తలందరూ ప్రవక్తలూ కారు. ప్రవక్తలందఱూ వక్తలూ కారు'.

ఎంత గొప్ప సత్యం !

జయహో మాతా !
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 52 (అమ్మ శతజయంతి ఉత్సవాలు - వక్తల ప్రసంగాలు) "

జిల్లెళ్ళమూడి స్మృతులు - 51 (నేను చేస్తున్నాననే అహం)

మొన్నొకరోజున వాకింగ్ సమయంలో 'శ్రీ' కనిపించాడు. 'ఇంతమంది ఉండి ఇంతచిన్న విషయాన్ని పట్టించుకోవడం లేదేంటి?' అని మైకుల గోల గురించి ఆయన్ను ప్రశ్నించాను.

'ఈగో సమస్యలు' అన్నాడాయన. 'ఎవరికి వారు  మాకెందుకు అనుకోవడం కారణం'

సంస్థలలో ఉండే అహంకారాల వైపు మా సంభాషణ సాగింది.

'ఎవరూ అహాలు పెంచుకోకండి. తలచుకుంటే గడ్డిపోచతో పని చేయిస్తాను' అని అమ్మ ఒకసారి అన్నది. 'మేం కాబట్టి ఇంత పని జరుగుతోంది' అనుకుని విర్రవీగిన కొందరిని చూచి అమ్మ ఆ మాటంది' అన్నాడాయన.

ఒకసారి ఏదో చర్చ జరుగుతుంటే, 'ఈ విషయం నీకు తెలీదులేమ్మా' అని 'రా' అన్నాడు. అహంకారపూరితంగా అనలేదు గాని, మామూలుగా మాటవరసకు అన్నట్లుగా అన్నాడు.  కానీ అదికూడా తప్పే కదా? తర్వాత, 'అదేంటమ్మా? 'రా' అలా అన్నాడు?' అని 'అ' అమ్మను అడిగాడు. దానికి అమ్మ ఇలా చెప్పింది.

'అనుకున్నా చేస్తున్నాడుగా?'

తనేమంటున్నదో  మాకు అర్ధం కాకపోతే, ఇలా వివరించింది.

'నేనే చేస్తున్నాను' అనుకోకపోతే చెయ్యలేడు నాన్నా. ముందు 'నేనే చేస్తున్నాను' అనుకుంటాడు. చేస్తాడు. ఎంతో జీవితం గడిచాక 'చేస్తున్నది నేను కాదు. అది జరుగుతోంది' అని తెలుసుకుంటాడు' అని వివరించింది.

'శ్రీ' చెబుతున్నది విన్నపుడు నాకు చాలా సంతోషం కలిగింది.

'ఇంత అజ్ఞానం మధ్యలో, ఇన్ని అహాలతో ఈ నాటకం నడపడం అమ్మకే సాధ్యమౌతుంది. సృష్టి ఇలాగేగా నడుస్తోంది?' అన్నా.

ఆయన నవ్వేశాడు.

నా దారిన నేనొచ్చేశాను.

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 51 (నేను చేస్తున్నాననే అహం) "

26, మార్చి 2023, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 50 (ఏకాదశ రుద్రాభిషేకం)

అమ్మ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

రుద్రాభిషేకాలు,  చండీ హోమాలు, లలితా పారాయణలు ప్రతిరోజూ జరుగుతున్నాయి. మరొకవైపున క్రైస్తవ మైకులు దద్దరిల్లుతున్నాయి.

అటువంటివేవీ మనకు పడవు గనుక, ఇంట్లోనే ఉంటున్నాం. బుద్ధిపుడితే నిశ్శబ్దంగా అమ్మ ఆలయానికి వెళ్లి ప్రణామం చేసి వెనక్కు వచ్చేస్తున్నాం. లేదంటే పొలాల దారులలో సైలెంట్ వాకింగ్. అంతేగాని ఎవరినీ కలవడం లేదు. 

నిన్న వాకింగ్ చేస్తుంటే ఒక లోకల్ భక్తుడు ఎదురయ్యాడు.

'ఏకాదశ రుద్రాభిషేకాలు ప్రతిరోజూ పొద్దునపూట జరుగుతున్నాయి' అన్నాడు.

'అవును. ఇక్కడ కూడా జరుగుతున్నాయి' అన్నాను

'నేను చెబుతున్నది ఇక్కడి సంగతే' అన్నాడు కొంచం వెటకారంగా.

'అర్ధమైంది. నేను చెబుతున్నది కూడా ఇక్కడి సంగతే' అన్నాను శాంతంగా.

కొంచం అయోమయంగా చూశాడు.

'మరి చూస్తున్నారా?' అన్నాడు

'జరుగుతున్నపుడు చూడటమెందుకు?' అన్నాను.

ఆయనకు అర్ధం కాలేదు.

ఒక పిచ్చివాడిని చూసినట్టు చూసి తన దారిన తను వెళ్ళిపోయాడు.

వెళ్లిపోతున్న పిచ్చివాడిని చూచి నాలో నేను నవ్వుకున్నా.

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 50 (ఏకాదశ రుద్రాభిషేకం) "

25, మార్చి 2023, శనివారం

క్రొత్త వెలుగు

శతాబ్దాల కలతనిద్ర 

వేకువనే కోరుతోంది

పరార్ధాల పాడుబ్రతుకు 

పండుగకై సిద్ధమైంది 


జడివానల నడిరాతిరి 

జాడలేక ముగుస్తోంది 

పడిలేచిన వడికెరటం 

తడితీరం చేరుతోంది 


వెర్రివాడి వెదుకులాట 

చరమాంకం దగ్గరైంది 

వేసారిన వింత ఆట 

విడుపు కోరి వేచింది 


యుగయుగాల ఎదురుచూపు 

ముగిసిందని తెలుస్తోంది 

నరనరాల వెలుగుకైపు 

వెల్లువలై పారుతోంది


తూర్పుదిశను క్రొత్తవెలుగు 

తొంగి తొంగి చూస్తోంది

వేచి ఉన్న ప్రేమికుని 

వెలుగుకన్య తాకింది

read more " క్రొత్త వెలుగు "

24, మార్చి 2023, శుక్రవారం

పద నేస్తం

లోకపు రొచ్చులకూ

శోకపు ఉచ్చులకూ

లోపలి రోతలకూ

లోకుల కోతలకూ

అందని సీమకు అడుగులేద్దాం

పద నేస్తం


సమాజపు కట్టుబాట్లకూ

సనాతన సర్దుబాట్లకూ

సరాగపు వల్లెవాట్లకూ

సహాయపు వెన్నుపోట్లకూ

చిక్కని లోకానికి చేరుకుందాం

పద నేస్తం


మనుషుల మానసాలకూ

తలపుల పానశాలకూ

వలపుల పిలుపులకూ

కొలుపుల కలుపులకూ

చెందని తీరానికి సాగిపోదాం

పద నేస్తం


ఈ భూమివైపు చూడకుండా

ఏ లేమీ మనల్ని సోకకుండా

అంతమన్నది లేని కాంతిలోకంలో

వెలుగుదేహాలలో విహరిద్దాం

పద నేస్తం


జననమరణాల పరిధులు దాటి

కర్మవలయాల అవధులు మీటి

ఇద్దరం ఒక్కటిగా మారే

ఇంద్రధనుసులో నివాసముందాం 

పద నేస్తం

read more " పద నేస్తం "

21, మార్చి 2023, మంగళవారం

పంచవటి

కొడిగట్టిన దీపాలకు

క్రొత్త వెలుగునిచ్చి

మసిపట్టిన మానవాళికి

మళ్ళీ జీవం పోసిన

మహోన్నత దైవత్వం

పాండిత్యపు పంజరాలలో బందీ అయింది


దైవాన్ని భూమిపైకి

దించి తీసుకొద్దామని

రాక్షసత్వ పట్టునుంచి

భూమిని విడిపిద్దామని

చెయ్యబడిన మహాప్రయత్నం

కనపడకుండా కనుమరుగై పోయింది


అమేయమైన ఆత్మతత్త్వాన్ని

ఆచరణలో ప్రదర్శించి

మహోన్నత శిఖరంగా

మానవాళి ముందు నిలిచిన

వేదోపనిషత్తుల సారం

ప్రదక్షిణాల సంత అయింది


అవధిలేని మాతృత్వాన్ని

అక్షరాలా నిరూపించి

గొప్పగొప్ప సత్యాలను

గోరుముద్దలుగా తినిపించిన

రూపుదాల్చిన వాత్సల్యం

సాంప్రదాయ సంకెళ్ళలో సద్దుమణిగింది


మాటను గ్రహించలేని

మానవజాతి మొద్దునిద్రను

ఒక్కసారిగా వదిలించాలని

మట్టిమనుషులను మేల్కొల్పాలని

సంకల్పించిన మహామౌనం

ఎవరికీ గుర్తులేని ఏకాకి అయింది  


అన్నింటినీ ఆకళింపు చేసుకున్న

అమేయమైన చైతన్యం

మానవసమూహాల రొచ్చుకు

అందనంత సుదూరతీరంలో

విశ్వపుటంచులను అన్వేషిస్తూ

తనలో తానై తదేకనిష్ఠలో నిలిచింది

read more " పంచవటి "

20, మార్చి 2023, సోమవారం

అరుణాచల యాత్ర - 9 (సింహాన్ని సింహం గుర్తుపట్టలేదా?)

అరుణాచలంలో ఉండగా ఒకరోజున ఒక సంఘటన జరిగింది.

మేమంతా కలసి ఆశ్రమం రోడ్డులో నడుస్తూ ఉండగా, ఒక స్వామీజీ కనిపించాడు. మేము రోడ్డుకు ఇవతలవైపున్నాము. అతను అవతలవైపున్నాడు.  ఒక పండ్ల బండి దగ్గర ఏదో బేరం చేస్తున్నాడు. అతని డ్రస్సు చూస్తూనే అది రామకృష్ణమఠం డ్రస్సని నేను గుర్తుపట్టాను.

'ఒక తమాషా చూడండి' అని నాతో ఉన్న శిష్యులతో చెప్పి ఆయన వైపు గబగబా నడిచాను.

'నమస్తే స్వామీజీ' అన్నాను ఆయన పక్కనే నిలబడి.

'నమస్తే' అన్నాడాయన నా వైపు చూస్తూ

'మీరు రామకృష్ణ మఠం స్వామీజీనా?' అడిగాను.

'ఒకప్పుడు' అన్నాడు.

ఇది కూడా డ్రాపౌట్ కేసేనని నాకర్ధమైంది. కొంతమంది మఠంలో బ్రహ్మచారి పీరియడ్ పూర్తి చేసుకుని, స్వామీజీలయ్యి, కొన్నాళ్లో, కొన్నేళ్లో ఉండి అప్పుడు బయటకొచ్చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఖర్మ !

కాషాయం కట్టుకున్నంతమాత్రాన ఖర్మ వదలదు కదా !

'మీరంతా ఏంటి?' అన్నాడు మా గ్రూపు వైపు చూస్తూ.

'మేము ఒక ఆశ్రమం కట్టుకుంటున్నాం. అందుకని, దానికంటే ముందు అన్ని ఆశ్రమాలూ స్టడీ చేస్తున్నాం' అన్నా

'ఆశ్రమం ఆలోచన ఎవరిది?' అన్నాడు

'నాదే' అన్నాను

'మంచిదే. కానీ మీకు ధ్యానం గురించి తెలియాలి. ధ్యానం పునాది లేకపోతే, ఆశ్రమం త్వరలోనే బోరు కొడుతుంది' అన్నాడు.

అతనేంటో నాకర్ధమైపోయింది.

'అవును. మా ఉద్దేశ్యం కూడా అదే' అన్నాను

'ఊరకే ఉద్దేశ్యం ఉంటే చాలదు. ధ్యానం గురించి కొంతకాకపోతే కొంతైనా తెలుసుకోండి' అన్నాడు స్వరం పెంచి.

నేను వెంటనే చేతులు కట్టుకుని అటెన్షన్లో నిలబడుతూ 'అలాగే స్వామీజీ. తప్పకుండా తెలుసుకుంటాము. ధ్యానం గురించి  ఉపదేశించేవాళ్ల కోసమే మేమందరమూ వెతుకుతున్నాము' అన్నాను వినయంగా.

'లా రోడ్లమీద వెతికితే ధ్యానం దొరకదు. ధ్యానం మీద నేనొక బుక్కు రాశాను. అది త్వరలో ప్రింట్ అవుతున్నది. చదవండి' అన్నాడు దర్పంగా .

'తప్పకుండా స్వామీజీ. కానీ మాబోటివాళ్లకు అది అర్ధమౌతుందా?' అన్నాను భయభక్తులతో చేతులు అలాగే కట్టుకుని.

'ఇన్నేళ్లొచ్చినై. ఎందుకురా నువ్వు?' అన్నట్లు జాలిగా నావైపు చూశాడు స్వామీజీ.

'సాయంత్రం రండి. నేను ఫలానా చోట ఉంటున్నాను. ఒక్క అరగంట మాత్రం మీకు టైము కేటాయించగలను.  ధ్యానం గురించి మీకు ఫండమెంటల్స్ నేర్పిస్తాను. అంతకంటే టైం ఇవ్వలేను మీకు' అన్నాడు ఆయన సీరియస్ గా.

నాకు లోపల పొట్ట చెక్కలయ్యే నవ్వొస్తోంది. కానీ బయటకు బిగబట్టుకుని మౌనంగా చూస్తున్నా. 

'ఓకేనా?' అన్నాడు పిల్ల స్వామీజీ గదమాయిస్తున్నట్లు.

'ఓకే స్వామీజీ. ప్రస్తుతానికి ఈ డబ్బులుంచండి' అంటూ కొంత డబ్బు ఆయన చేతిలో పెట్టాను.

ఆ డబ్బులు జేబులో పెట్టుకున్న అతను, రోడ్డు క్రాస్ చేసి చాలా విసురుగా నడుస్తూ ఒక సందులోకి వెళ్లిపోయాడు.

ఆయన మాయం కావడంతోనే అందరం ఆ రోడ్డుమీదనే పగలబడి నవ్వుకున్నాం.

'అర్థమైందా స్వామీజీలు ఎలా ఉంటారో?' అడిగాను శిష్యులవైపు తిరిగి.

'బాగా అర్ధమైంది. ఛీ ఇలాంటి వాళ్ళా స్వామీజీలు?' అన్నారు శిష్యులు.

'ఈ ట్రిప్ లో ఇదే హైలైట్ సంఘటన, మీ యాక్టింగ్ మాత్రం అద్భుతం గురూజీ' అన్నాడు గణేష్.

అందరం మళ్ళీ నవ్వుకున్నాం.

'గురూజీ నాదొక సందేహం' అడిగాడు ప్రవీణ్.

'ఏంటది చెప్పు' అన్నాను

'ఒక సింహం ఇంకొక సింహాన్ని గుర్తుపడుతుందంటారు కదా? ఆ స్వామీజీ మిమ్మల్ని గుర్తుపట్టలేదెందుకు?' అడిగాడు.

నవ్వాను.

'వెరీ సింపుల్ ప్రవీణ్. దీనికి లాజికల్ గా మూడే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అతనైనా సింహం కాదు. రెండు, నేనైనా సింహం కాదు. మూడు, ఇద్దరమూ సింహాలం కాదు. ఈ మూడు తప్ప వేరే కావడానికి ఆస్కారం లేదు. అన్నాను.

'అంతే కదా' అన్నాడు ప్రవీణ్

'నేను సింహాన్ని కాను. మామూలు మనిషినే. ఆ సంగతి నాకు తెలుసు. అతను సింహం అయ్యి ఉండవచ్చు. అందుకే మనల్ని చూచి అలా పారిపోయాడు, బహుశా గ్రామసింహం అయ్యుంటాడు' అన్నాను.

మళ్ళీ అందరం నవ్వుకున్నాం.

అరుణాచలం రోడ్లమీద నడుస్తూ శిష్యులతో ఇలా చెప్పాను.

'కాషాయవస్త్రాలు, ఆశ్రమాలు, పటాటోపాలు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి గుర్తులు కావు. కాషాయం చూచి మోసపోకండి. గడ్డాలు పెంచిన అందరూ ఋషులనుకోకండి. నిజమైన ఔన్నత్యం సాధనతో మాత్రమే వస్తుంది. సాధనాబలం లేనప్పుడు ఉత్తవేషం ఎందుకూ పనికిరాదని గ్రహించండి'.

ఇదంతా వింటున్న మరొక శిష్యుడు ఇలా అడిగాడు

'మరి మీరెందుకు ఆ స్వామీజీకి డబ్బులిచ్చారు?'

ఇలా వివరించాను.

'శ్రీ రామకృష్ణుల పేరుమీద అతను సన్యాసి అయ్యాడు. దానికి నేను విలువనిచ్చాను. ఈ మనిషికి నేను విలువనివ్వలేదు. శ్రీ రామకృష్ణులకు ఇచ్చాను. అతనికా డబ్బు ఇచ్చింది కూడా ఆయనే. సంస్థను వదిలేసి వచ్చినా కూడా అతన్ని రామకృష్ణులు అలా కాపాడుతున్నారు. అది ఆయన కరుణకు నిదర్శనం. ఆ విషయం ఈ స్వామీజీ ఎన్నటికీ గ్రహించలేడు. గ్రహించే దృష్టి అతనిలో లేదు. సన్యాసిగా అయిన తరువాత అతను మఠాన్ని వదలిపెట్టి బయటకు వచ్చినట్లున్నాడు. అది అతని ఖర్మ. మనకనవసరం.

ఏదేమైనప్పటికీ అతనొక సాధువు.  పాపం వాళ్లకు ఆదాయం ఏముంటుంది? మనలాగా వాళ్లకు పొద్దున్నే కాఫీలు, టిఫిన్లు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? మనం ఇచ్చిన డబ్బుతో ఆయనకు రెండు రోజుల భోజనం దొరికితే చాలు. ఆయన సక్రమంగా ఉంటే ఇంకా ఇచ్చి ఉండేవాడిని. అతని అహంకారమే అతన్ని పాడుచేసింది. మనల్ని గుర్తించకుండా అతనికి అడ్డుపడినది కూడా ఆ అహమే. అహంకారం వల్ల, తన జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని ఈ స్వామీజీ కోల్పోయాడు. అహాన్ని పెంచే కాషాయం కషాయం అవుతుంది. మాయాప్రభావం ఇలా ఉంటుందని గ్రహించండి'. అన్నాను

'ఇది మాకందరికీ గొప్ప పాఠం గురూజీ' అన్నారు శిష్యులు.

'అవును. ఇంతటితో అతన్ని వదిలెయ్యండి. అతని ఖర్మ అతనిది. పదండి మంచి టీ త్రాగుదాం' అన్నాను.

అందరం కలసి ఆశ్రమం ఎదురుగా ఉన్న టీ హోటల్ వైపు దారితీశాము 

read more " అరుణాచల యాత్ర - 9 (సింహాన్ని సింహం గుర్తుపట్టలేదా?) "

19, మార్చి 2023, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 49 (ధ్వనికాలుష్యంతో నరకంగా మారుతున్న జిల్లెళ్ళమూడి)

జిల్లెళ్ళమూడికి వచ్చిన ఈ వారంలో నేను గమనించిన మరొక విషయం ఏమంటే, ఇంత చిన్న పల్లెలో  కూడా భయంకరమైన శబ్దకాలుష్యం ఉండటం.

నా సర్వీసులో నేనెన్నో సిటీలు చూశాను. మేజర్ రైల్వే స్టేషన్లు అన్నీ చూశాను. ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, మద్రాస్ మొదలైన సిటీలలో భయంకరమైన జనసాంద్రత ఉన్న ప్రదేశాలు చూశాను. అక్కడ శబ్దకాలుష్యం ఉండటం సహజమే. కానీ పట్టుమని వెయ్యిమంది జనాభా లేని జిల్లెళ్ళమూడిలో, విపరీతమైన శబ్దకాలుష్యం ఉండటాన్ని ఇప్పుడే గమనిస్తున్నాను.

ఢిల్లీ కన్నాట్ ప్లేస్ కంటే, కలకత్తా హౌరాబ్రిడ్జి కంటే ఎక్కువ ధ్వనికాలుష్యం జిల్లెళ్ళమూడి కుగ్రామంలో ప్రస్తుతం ఉంది. నమ్మలేరా? ఇది నిజం. వినండి మరి.

జిల్లెళ్ళమూడి జనాభా 1000 మంది మాత్రమే. ఈ పల్లెలో కేవలం ఏడు చిన్నపాటి వీధులున్నాయి అంతే. ఇక్కడ డ్రైనేజి వ్యవస్థ లేదు. ఫోన్ కనెక్టివిటీ సరిగ్గా లేదు. బస్సుసౌకర్యం లేదు. ఇంటర్నెట్ గురించి  చెప్పే పనే లేదు. గట్టిగా వర్షాలు పడితే పొలాలమధ్య నీటిలో చిక్కుకుపోతుంది ఈ ఊరు. 

ఇలాంటి కుగ్రామంలో నాలుగు గుళ్ళున్నాయి. మూడు చర్చీలున్నాయి. ఒక మసీదుంది. అన్నింటికీ మైకులున్నాయి. ఒక్కో చర్చికి నాలుగు దిక్కులకూ నాలుగు మైకులున్నాయి. మసీదుకు కూడా అంతే. వీటి మధ్యలో జిల్లెళ్ళమూడి అమ్మగారి సమాధి ఉన్న ఆశ్రమం ఉన్నది.

మూడు చర్చిలలో ఒక చర్చి ఈమధ్యన బాగా డెవలప్ అవుతున్నది. బయటనుంచి వచ్చే పాస్టర్ల కోసం ఈ మధ్యనే ఒక గెస్ట్ హౌస్ కూడా దాని పక్కనే కట్టారు. మిగతా రెండూ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. డెవలప్ అయిన చర్చికున్న మైకులనుంచి  గంటగంటకూ టైం చెబుతూ, గంటలు కొడుతూ, బైబుల్ వాక్యాలు వినిపించే వ్యవస్థ ఒకటి నడుస్తున్నది. అది ఆటోమేటిక్ వ్యవస్థ. ఈ మైకులు, చుట్టూ ఉన్న నాలుగు ఊర్లకు వినిపించేటంత సౌండ్ తో ఉంటాయి. ఉదయం 5 కు మొదలయ్యే ఈ మైకు రాత్రి 10 వరకూ మోగుతూనే ఉంటుంది. ఊరు దద్దరిల్లిపోతూ ఉంటుంది.

ఇక మసీదు విషయం. మక్కామసీదులో కూడా ఇంత ఠంఛనుగా నమాజ్ చేస్తారో లేదోగాని,  ఈ ఊరి మసీదులో మాత్రం రోజుకు అయిదుసార్లు పక్కాగా నమాజ్ చేస్తారు. అదికూడా పక్క ఊళ్లకు వినిపించేటంత పెద్ద సౌండుతో !

ఇవిగాక, మూడు కులగుళ్ళున్నాయి. ఏ కులానికి వాళ్ళ గుడి ఉంది. వీటిల్లో సినిమా భక్తిపాటలు మారుమోగుతూ ఉంటాయి.

ఇవన్నీ ఆగినప్పుడు అమ్మగారి ఆలయంలో అఖండ నామస్మరణ మైకు 24X7 పెద్ద సౌండుతో నడుస్తూ ఉంటుంది.

వెరసి ఉదయం అయిదునుంచి రాత్రి పదివరకూ ఈ ఊరిలో ఎవరికీ ప్రశాంతత అనేది లేకుండా ఉన్నది. వీకెండ్ వచ్చిందంటే, బయటనుంచి క్రైస్తవపాస్టర్లు దిగుతున్నారు. రోజంతా బైబిలు బోధలతో మైకులు దద్దరిల్లుతున్నాయి. పైగా, ఇక్కడ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ అని ఒక కాలేజీ  ఉంది. అందులో దాదాపు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు. చర్చ్ మైకులలో ఒకటి కాలేజీవైపు, మరొకటి జిల్లెళ్ళమూడి అమ్మగారి ఆలయం వైపు గురిపెట్టబడి ఉన్నాయి. కాలేజీ క్లాసులలో పాఠాలకంటే, బైబిలు వాక్యాలే విద్యార్థులకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళ చదువు ఎలా సాగుతుందో దేవుడికే ఎరుక. ఈ మైకుల గోల వల్ల,  జిల్లెళ్ళమూడి అమ్మగారి ఆశ్రమంలో ధ్యానం చేసుకోవడం భక్తులకు అసాధ్యంగా మారింది. 

చర్చిలు, మసీదు, రెండూ కలసికట్టుగా అమ్మగారి ఆలయాన్ని టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. వీటికి వెనుక, బయటవాళ్ళ నుంచి ఫండింగ్ ఉండటం సుస్పష్టం.

'గట్టిగా వాళ్లకు చెప్పకూడదా?' అని నేను కొందరిని అడిగాను.

'చెప్పాము, వాళ్ళు వినడం లేదు' అని వీళ్లన్నారు.

'కంప్లెయింట్ ఇవ్వండి' అన్నాను.

ఎవరికివారే, 'మనకెందుకు?' అన్నట్లు మాట్లాడారు.

వాళ్ళకు చెప్పాలంటే ముందు వీళ్ళ మైక్ ఆపాలి కదా? వాళ్ళు తిరిగి కంప్లెయింట్ ఇస్తే వీళ్ళేం చేస్తారు? ఎదుటివారికి చెప్పాలంటే, ముందు మనం కరెక్ట్ గా ఉండాలి కదా?

ఆశ్రమకమిటీ వారు భక్తుల  అసౌకర్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒకళ్ళని చూసి మరొకరు మైకులు పెడుతూ అందరూ కలిసి ప్రశాంతమైన పల్లె జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు 

ఇక్కడే స్థిరపడి ఉండాలని వచ్చిన రిటైర్డ్ భక్తులు కొంతమంది, ఈ ధ్వని కాలుష్యానికి భయపడి, కొనుక్కున్న ఇళ్లను అమ్మకానికి పెట్టేసి హైద్రాబాద్ మొదలైన ఊర్లకు వెళ్లిపోయారని నాకు కొందరు చెప్పారు.

ఒకటి రెండు SC క్రైస్తవ కుటుంబాలు కావాలని చేస్తున్న అరాచకంగా దీనిని కొందరు భక్తులు నాకు వర్ణించి చెప్పారు. ఈ దేశసంస్కృతికి వ్యతిరేకంగా తమ భావజాలాన్ని పెంచుకోవడం, అబద్ధాలు నూరిపోసే పరాయిమతాలకు దగ్గరవడం, హిందూమతానికి వ్యతిరేకంగా పనిచేయడం వాళ్ళలో కొత్తేముంది? అని నాకనిపించింది.

హిందూ, క్రైస్తవ, ఇస్లాం ఉన్మాదాలు తలకెక్కితే, ప్రశాంతంగా జీవిస్తున్న ఒక కుగ్రామంలో ఎలాంటి చిచ్చు రేగుతుందో, అక్కడి నిశ్శబ్దం ఎలా  మైకుల నరకంగా మారుతుందో అనడానికి నేటి జిల్లెళ్ళమూడి ఒక ఉదాహరణ !

మితిమీరిన సౌండ్ పొల్యూషన్ వల్ల హార్ట్ దెబ్బ తింటుందని, హార్ట్  ఎటాక్స్ వస్తాయని ఈ పల్లెటూరి గొర్రెలకు ఎవరు చెబితే అర్థమవుతుంది? రోగాలకు కులం మతం తెలీవు. అవి ఎవరికైనా వస్తాయి.

ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల,  ప్రజలుగాని భక్తులుగాని ఇక్కడ ఉండలేని దుర్భరపరిస్థితి త్వరలో తలెత్తేలా ఉంది.

'మీలో చైతన్యం రానంతవరకూ మీరు బాధపడక తప్పదు' అని భక్తులతో చెప్పాను.

'మీరు పూనుకోవచ్చు కదా?' అన్నట్టుగా  వారి ఉద్దేశ్యం ధ్వనించింది.

'నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాను. నాలుగురోజులు ఉండి  నా దారిన  మా ఆశ్రమానికి వెళ్ళిపోతాను.  పర్మనెంట్ గా ఉండేది మీరు. మీరే తేల్చుకోవాలి. నన్నడిగితే ముందు  మీ ఆలయ మైక్ ఆపమంటాను. అందరి మైకులూ తీసేయడం ఒక్కటే దీనికి పరిష్కారం' అని చెప్పాను.

అసలు, భక్తికీ మైకుకీ సంబంధమేంటో?

వాళ్ళెవరూ దీనిని అమలు చేసేటట్లు నాకు కనిపించలేదు. ఈ సమస్యకు పరిష్కారమూ కనిపించడం లేదు. లా అండ్ ఆర్డర్ అధమస్థాయిలో ఉన్న ఇండియాలో ఇంతకంటే ఏం ఆశించగలం?

ఆలయాల మీదా, మహాత్ముల మీదా వీడియోలు తీసి డబ్బు చేసుకునే యూట్యూబు చానెళ్లు ఇలాంటి అసలైన సమస్యల పైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది.

ఒక భక్తుడు నాతో ఇలా అన్నాడు, 'జిల్లెళ్ళమూడి భారతదేశానికి నమూనా' అని.

'నిజమే. రాజుకుంటున్న కులమతద్వేషాల లోనా?' అని నేనన్నాను.

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 49 (ధ్వనికాలుష్యంతో నరకంగా మారుతున్న జిల్లెళ్ళమూడి) "

18, మార్చి 2023, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 48 (శ్వాస మీద నిఘా)

నిన్న ఉదయాన్నే బయటకెళ్ళి ఒక బడ్డీ హోటల్లో టిఫిన్ తెచ్చుకుంటుంటే దారిలో అప్పారావుగారు ఎదురయ్యారు. అమ్మ గుడినుంచి ఇంటికి పోతున్నాడాయన. ప్రతిరోజూ అమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకుని మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి పోతూ ఉంటాడు.

మా ఇళ్లమధ్యన దూరం నాలుగిళ్లే. వాళ్ళ అల్లుడుగారు కట్టించినవే నేనుంటున్న అపార్ట్ మెంట్స్.

'ఎప్పుడొచ్చారు?' అన్నాడు

'రెండు రోజులైంది' అన్నా

'మరి కలవవచ్చు కదా?' అన్నాడాయన

నవ్వేసి, 'వీలు చూచుకొని వస్తా లెండి. మీరీ మధ్యన బాగా బిజీ అని తెలిసింది. మీ యూట్యూబ్ వీడియో చూచామని చాలామంది చెబుతున్నారు' అన్నా

'అవును. నెలక్రితం ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు 'కుండలినీ యోగాన్ని సులభంగా నేర్పించే అజ్ఞాతయోగి' అంటూ ఒక వీడియో చేశారు. అప్పటినుంచీ జనం వరదలాగా వస్తున్నారు. హైద్రాబాద్ నుంచి కూడా కార్లేసుకుని మరీ వస్తున్నారు. కుండలినీ యోగం టెక్నిక్  ఏమిటో చెప్పమంటారు. నేర్పించమంటారు. నేనేం చెప్పేది? అమ్మ ఇచ్చింది. వచ్చింది. అంతే చెబుతున్నాను వాళ్ళకి' అన్నాడాయన

'మీరు మంచిపని చేస్తున్నారు. అబద్ధాలు చెప్పకుండా ఉన్నదున్నట్లు చెబుతున్నారు. అది మంచిది. ప్రస్తుతం కుండలిని అనేది పెద్ద బిజినెస్. దానిపైన కోట్ల డాలర్ల వ్యాపారం నడుస్తోంది. "ఈ టాబ్లెట్ వేసుకో. జ్వరం తగ్గుతుంది" అన్నట్లు జనానికి చెప్పాలి. అప్పుడు వాళ్ళు గురువులై ఇంకో షాపు పెట్టుకుంటారు. కుండలిని అలా రాదని చెబితే ఎవడికి అర్ధమౌతుంది ఈ మాయాలోకంలో? దేవుడిని కూడా రూపాయికి అమ్మేసే మనుషులు ప్రస్తుతం' అన్నాను

'శ్వాస మీద నిఘా వెయ్యి' అని అమ్మ ఒక ఇరవై ముప్పై మందికి చెప్పింది. వాళ్లలో ఇద్దరో ముగ్గురో మాత్రం సక్సెస్ అయ్యాము' అన్నాడాయన

'క్లాసులో అందరికీ డిస్టింక్షన్ రాదుగా. పైగా శ్వాస మీద నిఘా వేసిన అందరికీ కుండలిని అందదు. దానికి శుద్ధమైన ప్రాణశక్తి ఉండాలి, సాధనాబలం ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి కదా' అన్నా నేను నవ్వుతూ.

నా మాట వినిపించుకోకుండా,  ఆయన ధోరణిలో ఆయన  చెప్పడం సాగించాడు.

'మొదట్లో ప్రాణసంచారం దగ్గర ఆగిపోయింది. తరువాత అదంతా భ్రూమధ్యంలో ఒక వెలుగుగా మారింది. అవి మెరుపుల లాగా కనిపించే చిత్కళలు కావు. వెలుగే కనిపించింది. ఆ తరువాత ఆ వెలుగు పలచబడి ఒళ్ళంతా వ్యాపించింది' అన్నాడు.

ఆయన ధోరణికి అడ్డుతగుల్తూ  'మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడా స్థితి వస్తుందా?' అడిగాను

'ఇప్పుడది కూడా అవసరం లేదనిపిస్తోంది. అంతా ప్రశాంతంగా ఉంది. ఆలోచనలు లేవు. రెండూ ఒకేసారి ఉన్నాయి' అన్నాడాయన

'అంటే బాహ్యమూ అంతరికమూనా?'ఆడిగాను. 

'అవును. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా అది ఉంది. రెండూ ఒకేసారి ఫీలౌతున్నా' అన్నాడు.

'మంచిదే, మీరు ముందుకే ప్రయాణిస్తున్నారు. ఇంకా నడవాలి' అన్నాను.

'తర్వాతేమౌతుందో తెలియదు. నాకు శాస్త్రజ్ఞానం లేదు. అమ్మ యోగానుభూతి ఇచ్చింది. అందుకే శాస్త్రాలు తెలిసిన మీలాంటి వారిని అడుగుతున్నాను' అన్నాడాయన.

'నాకూ శాస్త్రాలు తెలీవు. నేనేమీ గురువులదగ్గర శాస్త్రాధ్యయనం చెయ్యలేదు' అన్నా నేను.

'మరి మీరు వ్రాసిన అన్ని పుస్తకాలు?' అన్నాడాయన సందిగ్ధంగా.

'అమ్మ మీకు అనుభూతిని ఇచ్చినట్లే నాకూ ఇచ్చింది. అంతే. అయినా అమ్మ ఇచ్చిందంటున్నారు కదా. ఇతరులను అడగడమెందుకు? అమ్మకే వదిలెయ్యండి. ఎక్కడికి నడిపించాలో అక్కడికి అమ్మే నడిపిస్తుంది. మళ్లీ  దాంట్లో సందేహమెందుకు?' అన్నాను నవ్వుతూ,

'మీ అనుభవాలు చెప్పండి' అన్నాడాయన

నవ్వాను

'మీ అనుభూతిని అర్ధం చేసుకోగలగడమే నా అనుభూతి' అన్నా.

'పెద్దవాడినయ్యాను. ప్రస్తుతం 88 నడుస్తున్నాయి. మీరున్న చోటకు రాలేను. మీరే వచ్చి పోతూ ఉండండి' అన్నాడాయన.

'వీలున్నప్పుడు నేనే మీ ఇంటికి వస్తాను. మీరు శ్రమపడకండి. ఒక్కమాట వినండి. ప్రయత్నంతో వచ్చేది అసహజం. అప్రయత్నంగా వచ్చేది సహజం. ఇది నా మాట కాదు. అమ్మ మాటే' అని చెప్పాను.

ఆయన దారిన ఆయనెళ్లిపోయాడు. నా దారిన నేనొచ్చేశాను.

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 48 (శ్వాస మీద నిఘా) "

జిల్లెళ్ళమూడి స్మృతులు - 47 (సౌందర్యలహరి పారాయణ)

మర్నాడు ఉదయం టిఫిన్లు అయిన తర్వాత 'వ' ఇంటికి వెళదామని బయలుదేరాము. దారిలో 'అ' ఎదురయ్యాడు. ఈయన రైల్వేలోనే పనిచేసి రిటైరై ఇక్కడ సెటిలయ్యాడు. డైరెక్ట్ గా నా క్రింద పని చేయకపోయినా నా స్టాఫ్ లోకే వస్తాడు.

నన్ను చూస్తూనే, 'సార్. పైన సౌందర్యలహరి జరుగుతోంది.  వెళ్లి చూడండి' అన్నాడు

నేను వెంటనే తల పైకెత్తి ఆకాశంలోకి చూస్తూ 'ఎక్కడా?' అన్నాను.

'భలేవారు సార్ మీరు. పైనంటే ఆకాశంలో కాదు. డాబామీద' అన్నాడు

'డాబామీద సౌందర్యలహరేంటి?' అన్నాను అనుమానంగా.
 
'అదికాదండి. హైద్రాబాద్ నుండి మూడు బస్సులలో  సౌందర్యలహరి బ్యాచ్ వచ్చింది. అందరూ  లేడీసే.  పైన  పారాయణం  జరుగుతోంది' అన్నాడు

'మరి మీరిక్కడున్నారేంటి? వెళ్లి పాల్గొనకుండా?' అడిగాను.

'మా మామయ్య వస్తే ఆయనతో ఉన్నా' అంటూ, 'మీరెక్కడికి?' అన్నాడు

'నేను మా అత్తయ్యగారింటికి వెళుతున్నా. అయినా, మీకు మామయ్య ముఖ్యమా సౌందర్యలహరి ముఖ్యమా?' అడిగాను.

'రెండూ ముఖ్యమే అనుకోండి. మీ అత్తయ్యగారు ఇక్కడుంటారా? ఎవరామె?' అన్నాడు అనుమానంగా.

'మీ మామయ్య భార్యే' అన్నాను నవ్వుతూ.

'మీవన్నీ జోకులే సార్. వెళ్లి చూదండి బాగుంటుంది' అన్నాడు.

'తెలుసు, నాకు గతంలో పరిచయమే, బానే ఉంటుంది. అయినా మీరు చెప్పాక చూడకపోతే ఎలా? రండి కలిసే పోదాం' అంటూ గట్టిగా చెయ్యి పట్టుకున్నా.

'ఆమ్మో, నాక్కొంచెం పనుంది. వదలండి సార్' అన్నాడు చెయ్యి గింజుకుంటూ.

'అలా రా దారికి' అని నవ్వుకుంటూ అతని చెయ్యి వదిలేసి 'వ' ఇంటివైపు దారితీశాము.

ఇంట్లోకి వెళ్లి కూర్చోవడంతోనే, 'పైన సౌందర్యలహరి జరుగుతోంది. వెళ్లి చూడండి, మూడు బస్సుల్లో వచ్చారు హైద్రాబాద్ నుండి' అంటూ 'వ' కూడా మళ్ళీ అదే పాట మొదలుపెట్టింది.

చిరాకేసింది.

తాపీగా బెంచీమీద కూచుంటూ, 'చేసేవాళ్ళకే దిక్కులేదు. చూసేవాళ్ళకి ఏమొస్తుంది?' అన్నాను.

'వ' అనుమానంగా చూసింది.

సూక్ష్మంగా చెబుతుంటే ఎంత చెప్పినా వీళ్లకు ఎక్కదనిపించి, ఇలా వివరించాను.

'సౌందర్యలహరి అనేది పారాయణ చేసే స్తోత్రం కాదు. అది తంత్రసాధనా రహస్యాలతో కూడుకున్న సాధనాదిక్సూచి. అది ఆచరించవలసినది. అందులో అనుభవం ఉన్న గురువు  దగ్గర ఆ సాధనలు నేర్చుకుని అభ్యాసం చేయాలి. అది తంత్రశాస్త్రం. ఈ విషయం తెలీని ఆడాళ్ళు పదిమంది చేరి అరుస్తూ పారాయణాలు చేసి మురిసిపోతున్నారు. ఇలాంటి బ్యాచ్ లను ఇప్పుడు మీరు చూస్తున్నారేమో. 1986 లో నేను గుంతకల్లులో ఉన్నప్పుడే అక్కడ ఈ పారాయణాలు చేసేవాళ్ళు నాకు తెలుసు. అంతకు ముందు 1979 ప్రాంతాలలోనే అలా పారాయణాలు చేసేవాళ్లను నేను చూచాను. అసలు విధానం అది కాదు. సౌందర్యలహరి అనేది ఒక తాంత్రిక సాధనామార్గం. శ్రీవిద్యలో లోతుపాతులు తెలిసినవాడికి ఆ శ్లోకాలు, ఆ సాధనారహస్యాలు అర్ధమౌతాయి. ఊరకే పారాయణ చేస్తే నోరునొప్పి తప్ప ఏమీ రాదు. తెలివిలేని వాళ్ళు చేరి పొలోమంటూ పారాయణ చేస్తుంటే నేనెళ్ళి చూడటమేంటి? వెళ్లి చూడమని నువ్వు చెప్పడమేంటి? అర్ధముందా అక్కయ్యా అసలు?' అన్నాను.

నేను చెప్పినది ఆమెకు నచ్చలేదని ఆమె ముఖం చూస్తే అర్ధమైంది. అంతేకాదు, వీళ్ళతో నా వేవ్ లెంగ్త్ కుదరదని కూడా నాకు బాగా అర్ధమైపోయింది.

నాదేమో తాత్విక జ్ఞానచింతనతో కూడిన  ఆచరణాత్మక యోగ-వేదాంత మార్గం. అమ్మలో నాకు నచ్చినది అదే.

వీళ్లేమో పూజలు, పారాయణలు, ప్రదక్షిణలు, వ్రతాలు, మొక్కులు, కోరికలు తీరడాలు, చవకబారు మహిమలలో మునిగిపోయి ఉన్నారు. అమ్మ ఏదైతే వద్దన్నదో దానినే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎవరినైతే నేను  శుద్ధమైన స్వాములుగా గుర్తించనో వారిని గొప్పవాళ్ళుగా వీళ్ళు అనుకుంటున్నారు. చెబితే వినే స్థితిలో కూడా లేరు. చాలా విసుగనిపించింది.

ఇకమీదట జిల్లెళ్ళమూడి రావడం తగ్గించాలని, వచ్చినా అందరినీ కలవకూడదని అదేక్షణంలో నిశ్చయించుకున్నా

ఇక అక్కడ కూచోలేక లేచి మా ఇంటికి వచ్చేశాను.

భోజనాల సమయంలో డైనింగ్ హాలంతా పట్టుచీరల ఆడాళ్ళతో హడావుడిగా ఉంది. పారాయణ అయిపోయినట్టుంది. అందరూ భోజనాలకని క్రిందకు వచ్చి, గోలగోలగా కబుర్లు చెప్పుకుంటూ, సెల్ఫీలు దిగుతూ, ఒక సంతలాగా అటూఇటూ తిరుగుతూ కనిపించారు.

మేము ఒక ప్రక్కగా కూచుని భోజనం చేస్తూ వాళ్ళ గోలను మౌనంగా గమనిస్తున్నాము.

'ప్రపంచమంతా మాయే' అని శంకరులు ఎందుకన్నారో మళ్ళీ ఇంకోసారి నాకర్ధమైంది.
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 47 (సౌందర్యలహరి పారాయణ) "

17, మార్చి 2023, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 46 (స్వామి సింహస్వప్నానంద)

బాపట్లలో రైలు దిగి  జిల్లెళ్ళమూడి చేరేసరికి రాత్రి పన్నెండయింది.

మర్నాడు ఉదయమే లేచి స్నానపానాలు ముగించి అమ్మ దర్శనం చేసుకుని 'వ' ఇంటికివెళ్ళాము.

ఆ  మాటా ఈ మాటా మాట్లాడుతూ కూచుని ఉండగా ఒకామె అక్కడకు వచ్చింది. ఆమె పేరు 'స' అని పరిచయం చేసింది 'వ'. ఆమెకు 40  లోపు ఉంటాయి. ఆరేళ్ళనుంచీ CVV గారి మార్గంలో సాధన చేస్తోందంటూ నాకు గొప్పగా పరిచయం చేసింది 'వ'.

ఒక్క క్షణం ఆమెవైపు చూశాను. విషయం అర్ధమైంది. చచ్చే నవ్వొచ్చింది. చాలా స్పీడుగా ఉందామె.

'నమస్తే' అన్నాను.

ఇంతలో ఆమె ఒక కుర్చీని బర్రున లాక్కుని మా ఎదురుగా కూచుని, ' మీదేదో ఆశ్రమం అని అక్కయ్య చెప్పింది. ఏ ఆశ్రమం మీది?' అడిగింది దర్పంగా.

'ఉత్త ఆశ్రమమే' అన్నాను నేను నవ్వుతూ.

'అలా కాదు' అంటూ, కొంతమంది పాపులర్ గురువుల పేర్లు చెప్పి, 'వాళ్ళ ఆశ్రమం బ్రాంచా?' అడిగింది మళ్ళీ.

'కాదు మా బ్రాంచే' అన్నా నేను నవ్వాపుకుంటూ.

'అంటే మీదాంట్లో ఏముంటుంది? అందామె

'మా దాంట్లో అన్నీ ఉంటాయి' అన్నాను.

'అన్నీ అంటే?' రెట్టించింది దర్పంగా 

'కొన్ని కానివి' అన్నాను కూల్ గా.

ఇలా కాదనుకుందేమో తన గురించి చెప్పడం మొదలుపెట్టింది.

'నేను మొదట్లో సాయిబాబా భక్తురాలిని' అంది.

'ఏ మొదట్లో?' అన్నాను నేను

'అంటే ఆరేళ్లదాకా' అంది.

'మీరు పుట్టినప్పటినుంచీ ఆరేళ్లదాకానా?' అడిగా నేను సీరియస్ గా నవ్వాపుకుంటూ

ఆమెకు కోపమొచ్చింది.

'కాదు. ఆరేళ్ళ క్రిందటిదాకా' అంది స్వరం పెంచి

'సాయిబాబా దేవుడా?' అడిగా నేను సూటిగా రంగంలోకి దిగుతూ

'అవును. ఆయనే నన్ను CVV గారికి అప్పజెప్పాడు' అంది తను

'ఏం తన వల్ల కాలేదా?' అడిగా నేను పొట్ట చేత్తో పట్టుకుంటూ

ఆమె అహం దెబ్బతింది

'CVV గారి ప్రేయర్ తో రోగాలు తగ్గుతాయి' అంది

'అలాగా. మరి CVV గారు ఎందుకు రోగంతో చనిపోయాడు? ఆయన భక్తులందరికీ రోగాలెందుకొస్తున్నాయి?' అడిగాను

'అది వాళ్ళ కర్మ' అందామె 

'అంటే, జరిగితే మన గొప్ప, జరగకపోతే కర్మనా? ఇంతకీ CVV కర్మకు అతీతుడా కాదా?' అడిగాను

'మీరు అయన సాధన చేస్తే తెలుస్తుంది' అందామె

'ఇది తెలియడానికి సాధన ఎందుకు? మీరు చెప్పొచ్చుగా.  అయినా, నేను  సాధన చెయ్యలేదని మీకెవరు చెప్పారు?' అడిగాను

'మీకు CVV గారు ఎప్పుడు తెలుసు?'అడిగిందామె తగ్గకుండా

ఏకవచనంలోకి దిగాను.

'నువ్వు పుట్టడానికి పదిహేనేళ్ల ముందు నుంచి తెలుసు' అంటూ, 'మేకమాంసం తింటూ, హిందూ పద్ధతులు ఏమాత్రమూ పాటించకుండా, నమాజ్ చేస్తూ,  మసీదులో ఉంటూ, అల్లాని ప్రార్ధించిన సాయిబాబా దేవుడని నువ్వెలా అనుకున్నావు? ఎలా పూజించావు?' అన్నాను

తగ్గి, బిక్కముఖం వేసింది.

'వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, MN గారు, EK గారు చివర్లో రోగాలతో ఎందుకు చనిపోయారు? CVV ప్రేయర్ చేసినవాళ్ళే కదా వీళ్ళందరూ?  అయినా, ప్రేయరేంటి? క్రైస్తవులా వీళ్ళు? ఆ తర్వాత నమాజా? ఆడాళ్లకి బురఖానా? లేక మొగాళ్ళకి కూడా వేస్తున్నారా బురఖా?' అడిగాను

'వాళ్లెవరో నాకు తెలీదు' అందా పిల్లకాకి

జాలేసింది. 

ఇంతలో ఆమె మళ్ళీ అందుకుని 'జిల్లెళ్ళమూడి అమ్మగారికి జబ్బుచేస్తే శార్వరిగారి శిష్యులు CVV ప్రేయర్ చేశారు హైదరాబాద్ లో. అప్పుడు అమ్మకు తగ్గింది' అన్నది

'వాళ్లింకా ఉన్నారా?' అడిగాను.

'లేరు. శార్వరిగారు పోయారు,  శిష్యులు కూడా పోయారు' అందామె.

తలుపు దగ్గర అలికిడయింది.

'ఎవరా?' అని చూస్తే, గుంటూరునుంచి మూర్తి. రాత్రి బాపట్లలో దిగకుండా, రైల్లో గుంటూరు పోయి, పొద్దున్నే కారేసుకుని జిల్లెళ్ళమూడి వచ్చేశాడు.

'రా మూర్తీ కూచో ' అంటూ, 'అమ్మగారు కూడా పోయి 38 ఏళ్లవుతోంది. మరి రోగం వచ్చినవాళ్లు, ప్రేయర్ చేసి తగ్గించినవాళ్లు అందరూ  వెళ్లిపోవడమేంటి? ప్రేయర్ చేసుకుంటూ ఇక్కడే శిలాశాసనంగా  ఉండాలి కదా?' అడిగాను.

'అది దేహధర్మం' అన్నదామె తెలివిగా.

'రోగం రావడం దేహధర్మం కాదా?' అడిగాను.

మళ్ళీ తెల్లముఖం వేసింది.

'చావొక్కటే దేహధర్మమైతే మిగతావన్నీ ఏ ధర్మాలు?' అడిగాను.

మళ్లీ బిక్కముఖం.

తేనెటీగ చేతిని కుడుతూ చెయ్యంతా వాచిపోతుంటే, 'పోనీలే దాని భక్తి దానిది' అంటూ చూస్తూ నిర్వికారంగా ఊరుకుంది అమ్మ. 

'అమ్మా, జబ్బు కాస్త తగ్గిందా?' అని భక్తులంతా అడిగితే, 'మీలాగా అది కూడా వచ్చి, వదిలి పోనంటోంది'  అని నవ్వేసింది.

అలాంటి అమ్మెక్కడ? పొద్దున మోషన్ కాకపోతే, "దేవుడా మోషన్ వచ్చేట్టు చెయ్యి ప్లీజ్' అని వేడుకుంటూ దానికోసం ప్రేయర్ లో కూచునే వీళ్లంతా ఎక్కడ? అసలు పోలికుందా? పోల్చడానికి నీకు బుద్దుందా అసలు? అమ్మకు రోగమొస్తే తగ్గించగలిగేవాళ్ళా వీళ్ళు?' స్వరం పెంచాను.

అప్పటికి దిగి నేలమీదకు వచ్చి, 'ఏమోనండి. అంత జ్ఞానం నాకు లేదు' అన్నది.

'జ్ఞానం లేనప్పుడు లేనట్టు ఉండాలి. ఉన్నట్టు మాట్లాడకూడదు. నీకు జలుబో దగ్గో జ్వరమో వస్తే డాక్టర్ని కలుస్తావా? ప్రేయర్ చేసుకుంటూ రూములో తలుపేసుకొని కూచుంటావా? నిజాయితీగా చెప్పు' అడిగాను.

'అంటే మనకంత శక్తి లేదు కదండీ' అన్నది

'మనకు అంటూ నన్ను కూడా కలిపావు సంతోషం. నాకెలాగూ అంత శక్తి లేదు. మరి ఆరేళ్ళ నుంచీ CVV ప్రేయర్ చేస్తున్న నీకుండాలి కదా? ఎందుకు లేదు? ప్రేయర్ అనేది క్రైస్తవ విధానం. అది మనకెందుకు? పోనీ కాసేపు సరే అనుకుందాం. ప్రేయర్ ప్రయోజనం రోగాలు తగ్గడమా?  ఇంకేదైనా ఉందా? చక్రవర్తి దర్బారులో నిలబడి పుచ్చువంకాయలు కోరుకున్నట్లుంది' అన్నాను.

ఆమెకు విషయం అర్థమైంది.

గాభరాగా మొబైల్లో టైం చూసుకుందామె

'ఉంటానండి. పదౌతోంది. ఆఫీసులో  అర్జెంటు పనుంది. వస్తానక్కయ్యా' అంటూ హడావుడిగా లేచి వెళ్లిపోయిందామె.

ఇంతలో తలుపుదగ్గర మళ్ళీ అలికిడైతే అటువైపు చూశాం అందరం.

రాధిక వాళ్ళ బంధువు గతంలో మాతో మాట్లాడినామె. 'వ' కోసం వచ్చినట్టుంది. లోపలకు రాబోయి, నన్ను చూసి, ఏదో దయ్యాన్ని చూసినట్టు గతుక్కుమని, తలుపేసి అమ్మ గుడివైపు గబగబా పారిపోయింది.

మళ్ళీ భలే నవ్వొచ్చింది. 'పిచ్చి రాధిక  చేతిలో బాగా దరువు పడినట్టుంది ఈమెకి' అనుకున్నా. 

ఈ మధ్య ఎక్కడ చూసినా కామెడీ కేసులే.

నవ్వే నవ్వు.

ఇంకెందుకులే అక్కడుండి అందరినీ ఇబ్బందిపెట్టడమని 'వస్తామక్కయ్యా' అంటూ లేచి మా ఇంటికి దారితీశాము. 

దారిలో నడుస్తుండగా 'మూర్తీ. త్వరలో సన్యాసం స్వీకరించి 'స్వామి సింహస్వప్నానంద' అని పేరు మార్చుకుందామనుకుంటున్నా, ఈ ఒక్క నెలే నార్మల్ డ్రస్. ఆ తర్వాత కాషాయవస్త్రాలే. ఇక దరువే అందరికీ' అన్నాను.

అందరూ గొల్లున నవ్వేశారు.

అలా సరదాగా మాట్లాడుకుంటూ అందరం ఇంటిదారి పట్టాం.

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 46 (స్వామి సింహస్వప్నానంద) "

16, మార్చి 2023, గురువారం

జ్యోతిష్యం హోమియోపతి సలహాలు ఇకపైన అడక్కండి

నాకున్న జ్యోతిష్య, హోమియోపతి రంగాలలోని అనుభవం నలుగురికీ ఉపయోగపడాలన్న సదుద్దేశ్యంతో గత పదేళ్లనుంచీ వేలాదిమందికి ఉచిత జ్యోతిష్యసలహాలు, హోమియోపతి వైద్య సలహాలు ఇస్తూ వచ్చాను.

కానీ ఇప్పుడు న్యూ లైఫ్ లో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, జ్యోతిష్యం, హోమియోపతి సలహాలు ఇవ్వడం పూర్తిగా మానేస్తున్నాను. 

కనుక, పాఠకులెవరైనా సరే, ఈ రెండింటికి సంబంధించిన మెయిల్స్ నాకు ఇకపైన ఇవ్వకండి. ఒకవేళ మీరు అలాంటి మెయిల్స్  ఇచ్చినా, నా దగ్గరనుంచి మీకు సమాధానం మాత్రం రాదు.

గమనించండి.
read more " జ్యోతిష్యం హోమియోపతి సలహాలు ఇకపైన అడక్కండి "

అరుణాచల యాత్ర - 8 (చంద్రశేఖర్ తో సంభాషణ)




మేము అరుణాచలంలో ఉన్న మూడురోజులూ చంద్రశేఖర్ రోజూ వచ్చి కలిసేవాడు. ఒకరోజున అతని రూమ్ కి కూడా వెళ్లి వచ్చాము. రమణాశ్రమంలోనూ, రోడ్లమీద నడుస్తూనూ, పేవుమెంట్ షాపుల్లో టీ త్రాగుతూనూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.

తను ఇండియా అంతా బాగా తిరిగాడు. హిమాలయాలలో కూడా కొన్ని నెలలుండి సాధన చేశాడు. ఉత్తరకాశీలో చాలామంది సాధువులు అతనికి వ్యక్తిగతంగా తెలుసు.

మన ఆశ్రమం గురించి, నేను వ్రాసిన పుస్తకాల గురించి, ప్రస్తుతం పంచవటి కార్యక్రమాలగురించి తనతో చెప్పాను. 

'నాకు యోగమార్గం అంతగా తెలీదన్నగారు' అన్నాడు.

'చాలా మంచిది. పెద్ద తలనొప్పి వదిలింది నీకు. దానికంటే తంత్రం ఇంకా బురద. ఈ రెంటి జోలికి నువ్వు రాకపోవడమే మంచిది' అన్నాను.

'ఎందుకో మొదట్నుంచీ నాకీ రెండు మార్గాలతో పరిచయం లేదు' అన్నాడు.

'శుద్ధాద్వైతం తెలిసినవాడికి ఇంకేమీ అవసరంలేదు తమ్ముడూ. ఒక గ్లాసు నీటితో నీ దాహం తీరుతుంటే, నదిలోని నీళ్లన్నీ నీకెందుకు? అని రామకృష్ణులనేవారు. గుర్తుందా?' అన్నాను.

అవునన్నట్లు తలాడించాడు చంద్రశేఖర్.

'నేను ఉత్తరకాశీలో ఉన్నపుడు ఒక సాధువు నాకు పరిచయమయ్యాడు. అక్కడంతా చాలా చలిగా ఉంటుంది. చలికాలంలో అక్కడెవరూ ఉండలేరు. అంత మైనస్ లోకి వెళ్ళిపోతుంది. సాధువులందరూ ఖాళీచేసి హరిద్వార్ వచ్చేస్తారు. కానీ వింటర్లో కూడా ఆయనక్కడే ఉండేవాడు. భయంకరమైన  విల్ పవర్ ఉంటె తప్ప ఆ చలిని నరమానవుడు తట్టుకోలేడు. చలికాలంలో కూడా అక్కడే ఉంటూ తీవ్రమైన తపస్సు చేసేవాడు.  ఆయన కొన్ని తంత్రసాధనలు చేసేవాడు. ఆ క్రమంలో తనకు కొన్ని అద్భుతమైన శక్తులు సిద్ధించాయని నాతో అన్నాడు. ఆ శక్తులు చాలా తీవ్రమైనవి. వాటిని చూస్తే లోకం బిత్తరపోతుంది. నేటి బాబాలకు, స్వాములకు అలాంటి సిద్ధులు కనుచూపుమేరలో కూడా కనిపించవు. అలాంటివి ఆ శక్తులు. అవి ఆయనకు సిద్ధించాయి. అతనికి చాలా భయమేసిందట. ఆయన రూములో శారదామాత ఫోటో ఒకటి ఉండేది. వెంటనే అమ్మ ముందు సాగిలపడి, 'అమ్మా ఈ శక్తులు నాకొద్దు. నీవే తీసుకో' అని వేడుకున్నాడట.  వెంటనే ఆ శక్తులు అతన్ని వదలి పోయాయని నాతో అన్నాడు.

నార్త్ ఇండియాలో గొప్ప గొప్ప సిద్ధులను సంపాదించిన తాంత్రికులు తమ చివరిరోజులలో భయంకరమైన  బాధలు పడి దిక్కులేని చావు చచ్చారు. వయసులో ఉన్నపుడు, శక్తి ఉన్నపుడు, వాటిని తమ పనులకోసం వాడుకుంటారు. వీళ్ళ శక్తి క్షీణించగానే అవి రివెంజ్  తీర్చుకుంటాయి. తాంత్రికులు చాలామంది జీవితాలు విషాదాంతం అవుతాయి అన్నగారు' అన్నాడు.

'నిజమే తమ్ముడు. అందుకే తంత్రసాధన జోలికి పోవద్దని రామకృష్ణులు తమ భక్తులను హెచ్చరించారు. అవన్నీ నీకెందుకు? నీది శుద్ధాద్వైతం. అందులోనే ఉండు' అన్నాను.

రామకృష్ణా మిషన్  నుండి బయటకొచ్చి సొంతంగా బ్రతుకుతున్న నలుగురైదుగురు సన్యాసులు అరుణాచలంలో ఉన్నారని చంద్రశేఖర్ నాతో అన్నాడు. వాళ్లలో ఒకాయన IIT కాన్పూర్ ప్రోడక్ట్ అని, ప్రస్తుతం ఆయన భిక్షాటన చేస్తూ అరుణాచలంలో జీవిస్తున్నాడని నాతో అన్నాడు.

'నిజమైన బ్రాహ్మణ జీన్స్ అలాగే ఉంటాయి తమ్ముడూ. అవి లౌకిక సుఖాలను కోరుకోవు. ఎంతసేపూ తపస్సు,  ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఈ దారులలోకే అవి వెళతాయి. అదంతే' అన్నాను.

'రామకృష్ణా మిషన్ సాధువుల పైన మీ అభిప్రాయం?' అడిగాడు.

'మిగతావాళ్ళకంటే చాలా మెరుగు. కానీ ప్రస్తుతతరం రామకృష్ణమఠం సాధువుల పైన నాకు ఏమాత్రం మంచి అభిప్రాయం లేదు. వజ్రాల్లాంటి పాతతరం సాధువులను నేను చూశాను. వాళ్ళముందు వీళ్లంతా గులకరాళ్లే.  పైగా, మఠాన్ని వదిలేసి బయటకొచ్చారంటే వాళ్ళు వివేకానందస్వామిని ధిక్కరించినట్లే.  ఆయనకంటే గొప్ప జ్ఞానులా వీళ్ళు? అందుకే మఠాన్ని వదిలేసి బయటకొచ్చిన రామకృష్ణమఠం సాధువులంటే నాకు అస్సలు మంచి అభిప్రాయం లేదు' అన్నాను.

సంభాషణ అరుణాచలం వైపు మళ్లింది.

'ఇక్కడ రకరకాల మనుషులు, రకరకాల దేశాలవాళ్లున్నారు అన్నగారు. మొన్నొకడు ఒక రీసెర్చి చేశాడు. ఇక్కడ ఫుట్పాత్ మీద రాత్రిపూట చాలామంది సాధువులు పడుకుంటూ ఉంటారు. వాళ్లంతా బెగ్గర్లని మనం సాధారణంగా అనుకుంటాం. కానీ వాళ్లలో అద్భుతమైన నిజమైన సాధువులు కూడా ఉంటారు. అలాంటి వాళ్లలో IIT, IIM గ్రాడ్యుయేట్లు, పెద్ద MNC లలో పనిచేసి, ప్రపంచమీద విరక్తితో సాధువులుగా మారినవాళ్లు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ అడుక్కుంటూ, రోడ్లమీద పడుకుంటూ ధ్యానంలో కాలం గడుపుతూ ఉంటారు' అన్నాడు.'

'ఉంటారు తమ్ముడు. నూరుమంది నకిలీల మధ్యన ఒక వజ్రం కూడా ఉంటుంది. ఎవరి ఖర్మ వారిది. ఎవరి సాధన వారిది.  నువ్వు మాత్రం అలాంటివాడివే కదా? నువ్వుకూడా అలాంటి పొజిషన్ వదులుకుని వచ్చినవాడివే కదా. అదంతే' అన్నాను.

'ఒక భార్యాభర్తా ఇక్కడున్నారు. కావలసినంత సంపాదించుకున్నాక ఇద్దరూ ఉద్యోగాలు వదిలేశారు. పిల్లలు వద్దనుకున్నారు. ప్రస్తుతం ఇక్కడే ఉంటూ ధ్యానసాధన చేస్తున్నారు. హాల్లో విడివిడిగా ధ్యానానికి కూర్చుంటారు. కలిసి రారు. కలిసిపోరు. ఎవరి లైఫ్ వారిదే. కానీ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటారు అంతే. అలాంటివాళ్ళు కూడా ఉన్నారిక్కడ.  అప్పుడప్పుడూ వచ్చిపోయేవాళ్లు కొందరు. ఇక్కడే స్థిరపడినవాళ్ళు కొందరు. సన్యాసులుగా ఉంటూ మఠాలను వదిలేసి ఇక్కడకొచ్చి ఉంటున్నవాళ్ళు కొందరు. సంసారులు మరికొందరు. భార్యలను ఇళ్లలో వదిలేసి ఇక్కడ ఉంటున్న భర్తలూ, భర్తలకు దూరంగా ఇక్కడే ఉంటున్న భార్యలూ - ఇలా ఎన్నో రకాల మనుషులు ఇక్కడున్నారు. ఇదొక మినీ ప్రపంచమన్నగారు' అన్నాడు.

నవ్వాను.

'అది మహర్షి ప్రభావం తమ్ముడూ. అచంచలమైన జ్ఞానజ్యోతి అది. దాని వెలుగు అలాగే ఉంటుంది' అన్నాను.

'యోగి రామసూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు భిక్ష పెడతారు. తిండికి గడిచిపోతుంది. ఎక్కడో ఒక రూమ్ తీసుకుని అందులో ఉంటూ, భిక్ష తింటూ సాధనలో ఉంటారు. అలాంటివాళ్ళు చాలామంది ఇక్కడున్నారు. హరిద్వార్, రిషీకేశ్ తర్వాత సాధువులకు భిక్ష బాగా దొరికే ప్రదేశం అరుణాచలమే అని ఒక సాధువు నాతో అన్నాడు'

'ఎవరాయన? అన్నాను. 

'ఒక జైన్ సాధువన్నగారు. కానీ ఆయన అద్వైతం పట్ల ఆకర్షితుడై హిందూసన్యాసి అయ్యాడు. నాకు హిమాలయాలలో పరిచయమయ్యాడు. వాళ్ళది చాలా రిచ్ ఫెమిలీ. 

'మా పేరెంట్స్ కి నేను అరుణాచలంలో ఉన్నానని తెలిస్తే, ఒక బజారు మొత్తం కొనేసి బంగారంతో నాకు  ఆశ్రమం కట్టించి ఇస్తారు. అంత రిచ్ ఫెమిలీ మాది. అందుకని వాళ్లకు నా అడ్రసు కూడా  తెలీకుండా హిమాలయాలలో ఉంటున్నాను. అప్పుడప్పుడూ అరుణాచలం వచ్చి  సాధన చేసుకుని మళ్ళీ హిమాలయాలకు పోతాను. నేను బ్రతికున్నానో లేనో కూడా వాళ్లకు తెలీదు. మా జైన్స్ లోనే పెద్ద మఠాధిపతిని చేస్తారు నన్ను. అది నాకిష్టం లేదు. అందుకే ఇలా అజ్ఞాతంగా ఉంటున్నాను' అని నాతో అన్నాడు. అతనికి మొబైల్ కూడా లేదు. వాడడు. మంచి అందగాడు యువకుడు. ఫిల్దీ రిచ్. కానీ సాధువయ్యాడు.  అంతటి వైరాగ్యం. నమ్ముతారా అన్నగారు?' అడిగాడు చంద్రశేఖర్.

'ఎందుకు నమ్మను? గత 50 ఏళ్ల నా నడకలో ఇలాంటివాళ్లను ఎంతో మందిని చూచాను' అన్నాను నేను.

'బాలాజీగారని ఒకాయన ఇక్కడ ఉన్నారు. బయట రూమ్ తీసుకుని ఉంటుంటారు. ఫెమిలీ చెన్నైలో ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడూ ఇక్కడికొస్తారు. కానీ ఈయన రూముకు పోరు. ఈయన కూడా వాళ్లతో ఎక్కువ కలవడు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 9 వరకూ హాల్లో ధ్యానంలో ఉంటాడు. ప్రపంచంలో ఏది ఏమైనా ఈ దినచర్య మాత్రం తప్పదు. నేనూ హాల్లో కూచుని ధ్యానం చేస్తాను. అలా పరిచయమయ్యాడు.

నేను సాధారణంగా హాల్లో ఒక ప్లేస్ లో కూచుంటూ ఉంటాను. అందుకని అది నా ప్లేస్ అయిపొయింది. నేను హాల్లోకి వెళితే అక్కడ కూచున్నవాళ్ళు లేచి నాకు  ప్లేస్ ఇచ్చేవాళ్ళు, అదేదో నా సొంతమైనట్లు. కొన్నాళ్ళు గడ్డం పెంచాను. తెల్లడ్రస్ వేసేవాణ్ని. ఇక్కడే అయిదేళ్లుగా ఉంటున్నా కదా. అందరూ నన్ను గుర్తించి గౌరవించడం మొదలుపెట్టారు. రమణాశ్రమంలో అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ప్రపంచాన్ని వదిలేసి ఇక్కడికొస్తే ఈ గౌరవలేంట్రా భగవంతుడా? అనుకున్నా.  ఐడెంటిటీ కోల్పోడానికి ఇక్కడికొస్తే, ఇక్కడ కొత్త ఐడెంటిటీ తయారౌతోంది. అందుకని గడ్డం తీసేసి, మామూలు డ్రస్సులు వేసుకోవడం మొదలుపెట్టా. హాల్లో నేను మామూలుగా కూచునే ప్లేస్ మార్చేసి రోజుకొక చోట కూచోవడం మొదలుపెట్టా. ఇప్పుడు నన్నెవరూ గుర్తుపట్టరు. ఆ విధంగా వీళ్ళ గౌరవమర్యాదలనుంచి నన్ను నేను కాపాడుకున్నా' అన్నాడు.

'మంచి పని చేసావ్. వెరీ గుడ్' అన్నా.

ఆ మాటా ఈ మాటా మాట్లాడాక, 'ఇక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంది?' అడిగాను.

'ఉందన్నగారు. ఫారినర్స్ అమాయకంగా అందరినీ నమ్ముతారు. ప్రమాదంలో పడతారు. ఇక్కడందరూ మంచివాళ్ళేమీ కాదు. ఒక అమెరికన్ అమ్మాయిని కొండమీద రేప్ చేసి చంపేశారు. ఇంకొక రష్యన్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కు గురైంది. మీడియాలో అదంతా వచ్చింది. చాలా గోల అయింది. కొండలలోకి వంటరిగా పోయి తిరిగితే మాత్రం డేంజరే, అందులోనూ అమ్మాయిలకు మరీ డేంజర్. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. తెల్లవారుజామున గిరిప్రదక్షిణ చేసే అమ్మాయిలను ఎటాక్ చేసేవారు ఉన్నారు. క్రైమ్ ఉంది. ఒకరోజున ఆశ్రమం ముందే నా మొబైల్ లాగుకోబోయారు.  క్షణంలో తప్పుకున్నాను ' అన్నాడు.

'ఇది జ్ఞానభూమి అన్నది నిజమే. మహర్షి మహాజ్ఞాని నిజమే. కానీ లోకల్స్ అందరూ జ్ఞానులేమీ కాదు కదా? వాళ్లలో క్రిమినల్స్ చాలామంది ఉంటారు. మహర్షి బ్రతికున్న రోజులలో దొంగలు ఆయన్నే కొట్టారు కదా.  అంతెందుకు? ఇక్కడ కనిపించే సాధువులలో చాలామంది దొంగసాధువులే.  క్రైమ్ చేసి ఈ వేషంలో తప్పించుకుని తిరిగేవాళ్లు కూడా చాలామంది ఇక్కడ ఉంటారు' అన్నాను.

'అవునన్నగారు. పైగా, యూ ట్యూబర్స్ వల్ల అరుణాచలం ఈమధ్యన చాలా చండాలం అయింది.  ఎవడెవడు ఇక్కడికి వస్తున్నాడో తెలీడం లేదు.  గిరిప్రదక్షిణం అంటూ ప్రతివాడూ ఇక్కడికి వస్తున్నాడు. కొండ చుట్టూ తెగ తిరుగుతున్నారు' అన్నాడు.

'వాళ్ళగురించి నాకు చెప్పకు తమ్ముడూ. అలాంటి నేలబారు గుంపంటే నాకు చాలా అసహ్యమని  నీకు తెలుసు కదా?' అన్నాను.

ఆ తర్వాత ఓషో, జిడ్డు, యూజీ, డోనాల్డ్ హాఫ్ మాన్, నిసర్గదత్త మహారాజ్, రమేష్ బల్సేకర్, మూఁజీ, పాపాజీ మొదలైన వాళ్ళ గురించి చర్చ నడించింది.

కాగ్నిషన్ సైన్స్ గురించి చాలా చెప్పాడు. అంతా విని ఇలా అన్నాను.

'కాగ్నిషన్ సైంటిస్టులు అద్వైతాన్ని సైన్సు పరిభాషలో చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే, కాశ్మీరశైవాన్ని మక్కీకి మక్కీ దించారు. మోడ్రన్ ఫిజిక్స్ అంతా వేదాంతమే. ఈ పోకడ ఫ్రిజాఫ్ కాప్ర మొదలైనవారితో మొదలైంది. ఐన్ స్టైన్ చెప్పినది కూడా మాయావాదానికి దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ ఒదిలేసేయ్యి. ఈ సైంటిస్టులు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఎంత అర్ధం చేసుకున్నా, అంతిమంగా నువ్వు నిర్వికల్పసమాధిలోకి దిగనిదే ఏమీ ప్రయోజనం లేదు. మిగతాదంతా ఉత్తవాగుడు మాత్రమే అని గ్రహించు'.

నేటి పాపులర్ టీవీ/యూట్యూబ్ గురువులగురించి తనేదో చెప్పబోతే, 'వాళ్ళ పేర్లెత్తకు తమ్ముడూ. మన నోళ్లు పాడౌతాయి. వద్దు' అంటూ వారించాను.

అదంతా వ్రాస్తే మరో నాలుగు ఎపిసోడ్లవుతాయి గనుక వ్రాయడం లేదు.

చివరగా, 'మళ్ళీ ఎప్పుడొస్తారన్నగారు?' అంటూ అడిగాడు.

'తెలీదు. ఈసారి ఇంకా తక్కువమందితో వస్తాను. లేదా ఒక్కడినే వస్తాను. అప్పుడు కొద్దిరోజులు ఇక్కడే ఉంటూ తపస్సులో కాలం గడుపుతాను, 

పుస్తకాలు ఎక్కువ చదవకు తమ్ముడూ. తపస్సు చేయి. అదే ప్రధానం, నెట్ ఎక్కువ చూడకు. మొబైల్ టైం బాగా తగ్గించు. నా మొబైల్ ప్రస్తుతం రోజంతా ఆఫ్ లోనే ఉంచుతున్నాను. సాయంత్రం ఒక గంట మాత్రం ఓపెన్ చేస్తాను. మన ఆశ్రమంలో రూల్ ఇది. నాతొ ఉండాలనుకునేవాళ్ళు మొదటగా మొబైల్ ను పక్కన పెట్టాలి. నువ్వూ అలాగే చెయ్యి. ప్రపంచంతో సంబంధాలు బాగా తగ్గించుకో. మన ఆశ్రమానికి వచ్చి కొన్నాళ్లుండు' అని తనకు సలహా ఇచ్చాను.

'వస్తానన్నగారు' అన్నాడు.

ఆ విధంగా మూడ్రోజుల అరుణాచలం యాత్రను ముగించి, కార్లో చెన్నై చేరుకొని, అక్కడ రైలెక్కి, బాపట్లలో దిగి, రాత్రికి జిల్లెళ్ళమూడి చేరుకున్నాం.

ఆ విధంగా పాండిచ్చేరి, ఆరోవిల్, తిరువణ్ణామలై యాత్రలు ముగిశాయి.
read more " అరుణాచల యాత్ర - 8 (చంద్రశేఖర్ తో సంభాషణ) "

15, మార్చి 2023, బుధవారం

ఆరోవిల్ సౌండ్ గార్డెన్ సందర్శన

















ఆరోవిల్ లో ఉన్నపుడు ఒక రోజున సౌండ్ గార్డెన్  ను సందర్శించాం.

అక్కడ సప్తస్వరాలను పుట్టించే రకరకాల సంగీత పరికరాలను  తయారుచేసి అమ్ముతున్నారు. అక్కడున్న ఒక హాంకాంగ్ భక్తుడు మాకు వాటిని గురించి వివరించాడు. అలా వివరిస్తూ యోగచక్రాలకు సప్తస్వరాలకు సంబంధం ఉందని అతనన్నాడు. చూడబోతే ధ్యానసాధకుడిలాగే కనిపించాడు. చైనా జాతీయుడు.

అతని వివరణ అంతా అయిపోయాక పక్కకు పిలిచి ఇలా అడిగాను.

'మీరు అంతరిక నాదాన్ని విన్నారా?'

అతను ఎగాదిగా చూశాడు.

'లేదు' అన్నాడు.

నవ్వాను.

'మీరెన్నాళ్లనుంచీ ఇక్కడుంటున్నారు?'

'ఆరేళ్ళనుంచీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాధన చేస్తూ ఇక్కడే ఉంటున్నాను' అన్నాడతను.

'మీరు తైచీ, కిగాంగ్, జెన్ అభ్యాసం చేస్తారా?'

'లేదు నాకవి తెలీదు. నేను అరబిందో గారి ఇంటెగ్రల్ యోగ సాధకుడిని'అన్నాడు. 

'పోనీ ఒక విషయం చెప్పండి. ఇంటెగ్రల్ యోగా లో ఉన్నత స్థాయిలు అందుకున్న సాధకులు ఎవరైనా మీకు తెలుసా? పుస్తకాలు చదివి మాటలు చెప్పేవాళ్ళు కాదు. అనుభవజ్ఞానం ఉన్నవాళ్లు' 

ఆతను మళ్ళీ ఎగాదిగా చూశాడు.

'అనుభవం అంటే దానిని మాటల్లో చెప్పడం కష్టం కదా?' అన్నాడు.

'సరే వినండి. అరబిందో గారి యోగపరిభాషలోనే అడుగుతాను. ఓవర్ మైండ్, సూపర్ మైండ్ స్థాయిలను అనుభవంలో అందుకున్నవాళ్ళు మీకు తెలిసినవాళ్లలో ఎవరైనా ఉన్నారా?'

అతను తల అడ్డంగా ఆడించాడు.

'మీరు ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కలుసుకున్నట్లే' అన్నాడు.

అతని నిజాయితీ నాకు నచ్చింది.

'ఉత్తమాటలు చెప్పేవాళ్ళతో లోకమంతా నిండి ఉంది. సాధనానుభవాలలో ఔన్నత్యాలను అందుకున్నవాళ్ళు మాత్రం ఎక్కడా లేరు' అని శ్రీ విద్యారహస్యం పుస్తకంలో పదేళ్లక్రితం  నేను వ్రాసిన మాటలు గుర్తొచ్చాయి.

'ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. థాంక్స్. నమస్తే' అని అతనితో చెప్పి 'పదండి పోదాం' అన్నాను శిష్యబృందంతో.

read more " ఆరోవిల్ సౌండ్ గార్డెన్ సందర్శన "

14, మార్చి 2023, మంగళవారం

అరుణాచల యాత్ర - 7 (కాషాయం ఒక భ్రమ)

కాషాయం కట్టినా
కషాయం వదలకపోతే
విషాదంతో ముగిసిపోవడం
వీరసన్యాసుల జీవితలక్షణం

బ్రహ్మచర్య దీక్షలూ
సన్యాసపు టెక్కులూ
అహానికి ఆనవాళ్ళైతే
ఆ జీవితం ఉభయభ్రష్టత్వం

తెల్లగోచీ కట్టుకున్న మహర్షి చుట్టూ
కాషాయాలు కట్టిన సన్యాసులు
పిల్లవాడైన దక్షిణామూర్తి చుట్టూ
వినమ్రులై కూచున్న వృద్ధఋషులు

ధ్యానంలో ఓనమాలు తెలియకుండా
దానిపై గ్రంధాలు వ్రాస్తున్న పిల్లసన్నాసులు
సన్యాస సంస్థను వదిలేసి బయటకొచ్చి
సంసారం సాగిస్తున్న పిచ్చిసన్యాసులు

సన్యాసం పుచ్చుకోవడం కాదు
సన్యాసివి కావాలని
మహర్షి చెప్పిన మాట
ఎంత సత్యం?

సంసారాన్ని నువ్వు వదలడం కాదు
సంసారం నిన్ను వదలాలని
రామకృష్ణులు చెప్పినమాట
అంతే సత్యం

కాషాయం ఒక భ్రమ
సన్యాసం అనవసరపు శ్రమ
పాండిత్యం ఒక బూటకం
పారలౌకికం పనికిరాని నాటకం
read more " అరుణాచల యాత్ర - 7 (కాషాయం ఒక భ్రమ) "