“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జులై 2014, మంగళవారం

ఆధ్యాత్మిక సందేహాలు - యోనితంత్రం -2

1998 డిసెంబర్ లో నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో మూడురోజులు ఉన్నాను.అక్కడకు వెళ్ళిన ఉద్దేశ్యాలలో ఒకటి, అక్కడ జరుగుతున్న తంత్రం ఎలాంటిదో చూద్దామనే.

అప్పట్లో అక్కడ రాత్రి 11 తర్వాత 'తంత్ర గ్రూప్స్' జరిగేవి.అదంతా రహస్యంగా జరిగేది.మామూలుగా జరిగే అన్ని కార్యక్రమాలూ ప్రోగ్రాములూ అన్నీ అప్పటికి అయిపోయేవి.విజిటర్స్ కూడా అందరూ వెళ్ళిపోయేవారు.ఆ తర్వాత ఎంపిక చేయబడిన కొందరితో ఆ గ్రూప్స్ జరిగేవి.వాటిలో నేను పాల్గోనలేదు గాని,అందులోని కొందరితో మాట్లాడి వారినుంచి అక్కడ ఏమి జరుగుతుందో గ్రహించాను.

అదంతా westernized tantra.దానికీ మన నిజమైన తంత్రానికీ సంబంధం లేదు.ఇది తెలియగానే నాకు వారి విధానాలమీద జాలీ విసుగూ ఒకేసారి కలిగాయి.మూడురోజులు అక్కడ ఉండి సాధ్యమైనన్ని విషయాలు గమనించి తిరిగి వెనక్కు వచ్చేశాను.వారి పద్ధతులు నాకు నచ్చలేదు.

ఆలోచనలో ఉన్న నన్ను కదిలిస్తూ 'మరి నాకు మార్గం ఏమిటి?' అడిగాడాయన.

'మీకు ప్రస్తుతం రెండే దారులున్నాయి.ఒకటి- భైరవి కోసం వెదకడం.రెండు-ఇంకో మనిషితో సంబంధం లేని అంతర్గత యోనితంత్రాన్ని నేర్చుకోవడం.

ఇందులో మొదటిది దాదాపు అసంభవం.ఎందుకంటే,అన్ని రకాల అర్హతలూ, తంత్రసాధన అంటే ఇష్టమూ,భయంలేని మనస్సూ,సాధనకోసం ఎవర్నీ లెక్కచెయ్యని ధీరత్వమూ,విశాలదృక్పధమూ,నిజమైన ఆధ్యాత్మికచింతనలు కలిగి,స్వార్ధమూ అహంకారమూ వంటి అవలక్షణాలు లేని యోగిని మీకెక్కడ దొరుకుతుంది?అది జరిగేపని కాదు.ప్రస్తుతకాలంలో అలా దేవతలవంటి స్త్రీలు ఎక్కడా లేరు.ఒకవేళ ఉన్నా మీకు లభించరు.అది అసంభవం.

కనుక మీకు మిగిలింది రెండో విధానమే.అందులో అయితే మీకు ఇంకొకరితో పని లేదు.' అన్నాను.

'ఆ మార్గం నాకు నేర్పగలరా?' అడిగాడాయన.

'అలాగే చూద్దాం.త్వరపడకండి.అంతరికసాధన ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ ప్రస్తుతానికి చెప్తాను వినండి.మీరు రక్తాన్ని అమ్మవారికి అర్పించారు. అమ్మకు రక్తం అంటే ఇష్టమే.అయితే మీరు బాహ్యంగా దానిని చెయ్యనక్కరలేదు.మీ చేతిని కోసుకుని ఆ రక్తాన్ని అమ్మకు పట్టనక్కరలేదు.

ప్రతి మనిషిలోనూ అమ్మ రక్తం త్రాగుతూనే ఉన్నది.కాళి ప్రతి మానవుడి శరీరంలోనూ ఉన్నది.ప్రతిరోజూ సెకండుకు ఇరవైలక్షల పైనే ఎర్ర రక్తకణాలు శరీరంలో పుడుతూ ఉంటాయి.అవి ఒక రెండు నెలలపాటు ఉండి అంతరిస్తాయి.వాటిని ఎవరు స్వాహా చేస్తున్నారు? అదే కాళికాశక్తి.

కనుక బాహ్యంగా మీరు రక్తతర్పణం చెయ్యనక్కరలేదు.మీలోపల అది నిత్యమూ జరుగుతూనే ఉన్నది.మనందరిలో ఉంటూ నిత్యమూ మన రక్తాన్ని త్రాగేస్తూనే ఉన్నది కాళి.అలా రక్తాన్ని త్రాగడం ద్వారా మనకు జీవితాన్ని ప్రసాదిస్తున్నది.ఉన్న రక్తకణాలు నశించి కొత్తవి పుట్టకపోతే మనం ఎక్కువకాలం బ్రతకం.అదే మాత కటాక్షం.గొప్పగొప్ప కాళీ ఉపాసకుల మనుకునే వారికి కూడా ఈ రహస్యం తెలియదు.ఆ రక్తాన్ని త్రాగుతున్న శక్తిని మీరు సాక్షాత్కరించుకుంటే చాలు.అయినా మీరు ఎంత రక్తాన్ని అలా ధారపొయ్యగలరు? ఒక స్పూనో,ఒక గరిటో లేదా ఒక గ్లాసో.అంతే కదా.మరి మీ శరీరంలోని మిగతా రక్తం మాట ఏమిటి?కనుక విధానం అది కాదు.

మీ శరీరంలోని రక్తం అంతటినీ అమ్మకు నివేదన చెయ్యాలి.అది బయట కాదు.లోపల జరగాలి.దానికొక విధానం ఉన్నది.ఒక పద్ధతి ఉన్నది.దానిని ఆచరిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీ కళ్ళారా మీరే చూస్తారు.అప్పుడు అమ్మ ప్రసన్నం అయినట్లుగా ఇంకెప్పుడూ ఇంకే విధానంలోనూ ప్రసన్నం కాదు.

అమ్మవారికి 'రుధిరప్రియ' అన్న నామం ఉన్నది.'శ్రీవిద్య' లో చదవండి. "రక్తధాతువు నందు రాజ్యమేలుచు నిల్చి" అన్న పద్యంలో దీనినే నేను వివరించాను.ఆ పద్యం నాకు ప్రస్తుతం పూర్తిగా గుర్తురావడం లేదు. దాదాపు 1500 పద్యాలలో 'శ్రీవిద్య' వ్రాశాను.కాని వాటిలో ఒక్క పద్యమూ నాకిప్పుడు గుర్తులేదు.అమ్మ వ్రాయించింది.వ్రాశాను.మర్చిపోయాను.ఏరోజు వ్రాసినవి ఆరోజే మర్చిపోతూ వచ్చాను.

అంతరిక సాధన అనేది ఆ విధంగా ఉంటుంది.

ఈ విధంగా యోనితంత్రాన్ని కూడా మీరు internalize చెయ్యాలి.అదీ అసలైన నిజమైన యోనితంత్రం.దానికి ఏ స్త్రీ సహాయమూ అక్కర్లేదు.వాళ్ళకోసం వెతికేఖర్మా వాళ్ళను ప్రాధేయపడే ఖర్మా అక్కర్లేదు.అంతా మీ లోలోపలే జరుగుతుంది.సాధన అనేది బాహ్యం నుంచి అంతరికానికి ఎదగాలి అని నేను ఎప్పుడూ చెప్పేది ఇదే.

ఇప్పుడేగా మీరు నన్ను మొదటిసారిగా కలిసింది.తొందర వద్దు. ముందుముందు ఇంకా చాలాసార్లు కలిసి మాట్లాడి చర్చించి అసలు నేనేంటో ముందు తెలుసుకోండి. నేనూ మిమ్మల్ని ఇంకా గమనించాలి.ఆ తర్వాత చూద్దాం.

ఎందుకంటే,ఈ విధంగా చాలామంది ఏదో ఊపులో ఉన్నపుడు నన్ను కలిసి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.తర్వాత పత్తా ఉండరు.అలా చాలామందిని చూచాను.స్థిరత్వం లేని వారిని నేను శిష్యులుగా స్వీకరించను.ఒక వ్యక్తిని ఎంతోకాలం పాటు సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతనే ఆ అవకాశం ఇస్తాను.

అందులోనూ ఇలాంటి వాటిల్లో అమ్మ అనుజ్ఞ లేనిదే నేను ఎవరికీ ఉపదేశం ఇవ్వను.'పలానావాడికి నీవు ఉపదేశం ఇవ్వు.అతనికి అర్హత ఉన్నది' అని అమ్మ ఆదేశం నాకు స్పష్టంగా వస్తుంది.అది వస్తేగాని నేను ఉపదేశం చెయ్యను.అది రాకముందే చేస్తే అది నా అహంకారం అవుతుంది.అలాంటి ఉపదేశం పనిచెయ్యదు.అమ్మ ఆదేశంతో చేస్తే దానివెనుక శక్తి ఉంటుంది.అప్పుడు ఆ ఉపదేశం ఫలవంతం అవుతుంది.మీకు వేగంగా సిద్ధిని కలిగిస్తుంది.ఎందుకంటే అప్పుడు పనిచేసేది నేను కాదు.జగన్మాత శక్తి నాద్వారా అప్పుడు మీమీద పనిచేస్తుంది. 

ప్రస్తుతానికి నేను వ్రాసిన 'శ్రీవిద్య' సీరీస్ చదవండి.రాబోతున్న నవరాత్రులకు అది పుస్తకంగా రిలీజ్ కాబోతున్నది.అప్పుడైతే మీరు సరాసరి పుస్తకమే చదువుకోవచ్చు.ఈలోపల బ్లాగ్ పోస్ట్ లు చదవండి.ఒకసారి కాదు.పదిసార్లు దానిని బాగా శ్రద్ధగా చదవండి.మీ సందేహాలు అప్పుడు అడగండి. చెప్తాను. ముందు ఆ పని చెయ్యండి.' అన్నాను.

'సరే' అన్నాడాయన.అలా అంటూ తనకొచ్చిన కొన్ని కలలు చెప్పి వాటి అర్ధాలను అడిగాడు.

వాటి అర్ధాలు ఆయనకు విశదీకరించాను.

'ఇక మీ సందేహాలు అడగండి.'-అన్నాను సురేంద్ర వైపు తిరిగి.

'జ్యోతిష్యమూ హస్త సాముద్రికమూ ఒకటేనా?' అడిగాడు.

'రెండూ ఒకటే.భాషలు వేరు.మెసేజ్ ఒకటే.మీ చేతిలోనే మీ జాతకచక్రం ఉంటుంది.ప్రతి మనిషీ తన చేతిలోనే తన జాతకచక్రాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాడు.చూడగలిగితే అరచేతిలోనే గ్రహాలున్నాయి.' చెప్పాను.

'మరి ఫేస్ రీడింగ్ అంటారు అదీ నిజమేనా?' అడిగాడు.

'నిజమే.దానిని సాముద్రికశాస్త్రం అంటారు.అందులో భాగాలే ముఖసాముద్రికం హస్తసాముద్రికం ఇవన్నీ.చేతిలో ఉన్నట్లే ముఖంలో కూడా జాతకచక్రం కనిపిస్తుంది.అక్కడ కూడా గ్రహస్థానాలున్నాయి.

నుదురూ,ముక్కూ,చెవులూ,కళ్ళూ,కనుబొమలూ,బుగ్గలూ,పళ్ళూ,నోరూ,నాలుకా,జుట్టూ,తలతీరూ,మెడా ఇలా ఒకటేమిటి శరీరంలోని అన్ని భాగాలూ ఎన్నో విషయాలను వాటివాటి భాషలో చెబుతూనే ఉంటాయి.ఆ భాష అర్ధమైతే చాలు.దీనినే నేటివారు బాడీ లాంగ్వేజ్ అంటున్నారు.ఒక మనిషి కూచునే తీరు,నిలబడే తీరు,మాట్లాడే తీరు,స్పందించే విధానం,కళ్ళు ఆర్పే విధానం,చేతులు ఆడించే విధానం ఇవన్నీ మనిషి కేరక్టర్ నూ,మనస్తత్వాన్నీ పట్టిస్తాయి.

మామూలు మనస్తత్వశాస్త్రవేత్తలు వీటిని కొంతవరకూ గ్రహించారు.కాని యోగులకు వీటి వెనుక ఉన్న లోతైన విషయాల కర్మజ్ఞానం ఉంటుంది.' అన్నాను.

'నేను మీరు వ్రాసిన 'తారాస్తోత్రం' పారాయణ చేస్తున్నాను.అది చెయ్యడం మొదలు పెట్టాకనే నేను ఇల్లు కట్టగలిగాను.పనులలో కదలిక కూడా వచ్చింది.వాస్తు ప్రకారం జాగ్రత్తగా కట్టగలిగాను.' అన్నాడు.

'జాతకంలోని చతుర్ధభావాన్ని బట్టే మీరు ఉన్న ఇల్లు ఉంటుంది.చతుర్దానికి దోషాలున్నపుడు అవి నివృత్తి కాకుండా మీరు ఎంత ప్రయత్నించినా పూర్తిగా వాస్తు ప్రకారం ఇల్లు కట్టలేరు.మీరు ఎంత జాగ్రత్తగా కట్టినా దానిలో లోపాలు తప్పకుండా వస్తాయి.దీనిని ఆపడం మీ తరం కాదు.' అన్నాను.

ఇంతలో రాజశేఖర్ అనే అతను అందుకుని 'నేను జ్యోతిష్యం చెబుతూ ఉంటాను.' అన్నాడు.

'ఎక్కడైనా నేర్చుకున్నారా?' అడిగాను.

'లేదు.ఒకాయన దగ్గర కొన్ని బేసిక్స్ తెలుసుకున్నాను.సప్తమం వివాహ భావం అలా కొన్నికొన్ని.వాటిని బట్టి పరిశీలన ద్వారా చెబుతుంటాను.'

"రేమేడీలు కూడా చెబుతారా" అడిగాను.

'అంటే బాగులేని గ్రహానికి అవసరమైన ప్రదక్షిణాలు చెయ్యమని చెబుతాను.అంతే.మనం రేమేడీలు చెబితే అవి మనకు చుట్టుకుంటాయా?' అడిగాడు.

'చుట్టుకుంటాయి.వారి కర్మను మీరు తప్పిస్తే అది మీరు అనుభవించవలసి వస్తుంది.తప్పదు.అందుకే జ్యోతిష్కులు సామాన్యంగా ప్రతిరోజూ ఆ దోషం పోవడానికి సహస్రగాయత్రి జపం చేస్తారు.లేకుంటే అది వదలదు.'అన్నాను.

'నాది సింహలగ్నం లాభంలో గురువు వక్రి' అన్నాడు.

'జాతకంలో గురువు వక్రించిగాని నీచలోగాని ఉంటే అది గురుదోషం అవుతుంది.పంచవిధ గ్రహస్తితులైన అస్తన్గత,వక్ర,నీచ,శత్రుక్షేత్ర,గ్రహయుద్ధ స్థితులలో ఉన్నదానిని బట్టీ,ఆయా భావాధిపతులను బట్టీ వారిమధ్యన ఉన్న స్థితులనూ దృష్టులనూ బట్టి  ఆయా దోషాలు తెలుస్తాయి.'

'సామాన్యంగా గురుదోషం ఉన్న జాతకులు పూర్వంలో గురుద్రోహం చేసి ఉంటారు.లేదా గురువు మాట వినకుండా మొండిగా ప్రవర్తించి ఉంటారు.లేదా ఉపదేశం తీసుకుని దానిని నిర్లక్ష్యంతో మధ్యలో వదిలేసి ఉంటారు.లేదా గురుసేవ సరిగ్గా చేసి ఉండరు.లేదా రోజుకొక్క గురువులను మార్చి ఉంటారు.లేదా సద్గురువులను ఎగతాళి చేసి ఉంటారు.లేదా హింసించి బాధపెట్టి ఉంటారు.ఇలా గురుదోషంలో చాలా తేడాలున్నాయి.వాటిని జాతకం చూచి గ్రహించవచ్చు.'చెప్పాను.

'నేను కొన్నేళ్ళ నుంచి సాయిబాబా పూజ చేస్తూ ఉంటాను.ఒక్కొక్కసారి పూజారి రాకపోతే నేనే గుడిలో పూజ చేస్తాను.తరచూ కాకాని శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తాను.అరుణాచలం గిరి ప్రదక్షిణాలు త్వరలో 108 పూర్తి కాబోతున్నాయి.40 రోజులు అరుణాచలంలో చిన్నగదిలో ఉండి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం గిరిప్రదక్షిణ చేశాను.దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదువుతాను' అన్నాడు.

'ఇదంతా గురుదోష ప్రభావమే.మీకు తెలియకుండానే ఆ దోషం పోవడానికి మీ చేత ఇదంతా చేయించబడుతున్నది.సద్గురు కటాక్షం ఉంటే ఇలాగే జరుగుతుంది.మీకు తెలియకుండానే రేమేడీలు మీచేత చేయించ బడతాయి.అది లేకుంటే ఆయా దశలలో ఇంకాఇంకా చెడుకర్మలో కూరుకు పోవడం జరుగుతుంది.ప్రస్తుతం మీకేం దశ జరుగుతున్నది?' అన్నాను.

'ప్రస్తుతం గురువులో చంద్రుడు జరుగుతున్నది.ఈ గురుదోషం ఎప్పుడు పోతుంది?' అడిగాడు.

లోలోపల నవ్వుకున్నాను.ఎందుకంటే గురుదశ జరుగుతున్నపుడే చాలామంది నా దగ్గరకు రాగలుగుతారు.అందులోనూ గురువులో చంద్రుడు జరిగేవారు ఆ సమయంలో ఖచ్చితంగా వచ్చి ఆథ్యాత్మిక సందేహాలూ చర్చలూ అంటూ నన్ను కలవడం ఎన్నోసార్లు గమనించాను.వేరే సమయంలో వాళ్ళు రావాలన్నా రాలేరు.

కారణం? నా జాతకంలో గురుచంద్రులు కలసి మోక్షకారకరాశి అయిన మీనంలో ఉన్నారు.ఈ విధంగా గ్రహాలకు సంబంధించిన లింకులు మనుష్యుల మధ్యా సంఘటనల మధ్యా ఉంటాయి.

'మీకున్న గురుదోషం అప్పుడే పోదు.దాదాపుగా 2018 లో మీకు గురుదశ అయిపోతుంది.ఆ చివరిఘట్టంలో 2016 నుంచి మీకు గురువులో రాహుదశ వస్తుంది.దానిని దశాఛిద్రం అంటారు.ఆ సమయంలో మిమ్మల్ని యమబాధలు పెడుతుంది. ఆ తర్వాత పోతుంది.అంతవరకూ ఇప్పుడు చేస్తున్నవే చేస్తూ ఉండండి. సామాన్యంగా గురుదోషం ఒక్కతరం నుంచే రాదు.చాలా పాతకాలం నుంచి ఉంటుంది.అంటే మీరు కాదు.మీ పూర్వీకులనుంచే ఆ దోషం ఉంటుంది.మీ తండ్రిగారి జాతకం చూస్తే తెలుస్తుంది.' చెప్పాను.

'మా తండ్రిగారి జాతకం లేదు.కాని మా అబ్బాయి జాతకం నాకు తెలుసు. వాడికి నీచరవితో గురువు కలసి ఉన్నాడు.' అన్నాడు.

'చూచారా మరి? అదే నిదర్శనం.అంటే మీ తర్వాత తరానికి కూడా ఈ గురుదోషం ఇప్పటికే సంక్రమించింది.మూడు తరాల జాతకాలు తీసుకుని పరిశీలిస్తే ఇలాంటి వంశపారంపర్య జన్యుదోషాలు స్పష్టంగా కనిపిస్తాయి. జ్యోతిష్యవిద్యలో నా స్పెషలైజేషన్ అదే.' అన్నాను.

'నాకు చతుర్దంలో రాహువు నీచలో ఉన్నాడు.మా ఇంటిలో కూడా దోషాలున్నాయి.ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత గమనిస్తే అర్ధమౌతున్నది.' అన్నాడు.

'మీ ఇంటికి నైఋతి దోషం తప్పకుండా ఉంటుంది.అలాగే ఈశాన్య దోషం కూడా ఉంటుంది.మీ ఇంటిలో వస్తువులు ఏవీ ఎక్కడివక్కడ నీట్ గా ఉండవు.ఇంట్లోకి కాయితాలూ దుమ్మూ వెంట్రుకలూ వస్తుంటాయి.ఇంటి చుట్టుపక్కల ప్రశాంతంగా ఉండదు.గొడవగా ఉంటుంది.గమనించండి' అన్నాను.

'నిజమే.మా ఇంటి ఎదురుగానే ఒక స్కూల్ ఉన్నది.ఎప్పుడూ గోలగానే ఉంటుంది.నైరుతి దోషాలున్న మాట వాస్తవమే.లెట్రిన్ ట్యాంక్ అక్కడే ఉన్నది.దానిని మార్చాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాను.వీలుకావడం లేదు.' అన్నాడు.

'అదేమరి.జ్యోతిష్యజ్ఞానం ఎంత సత్యమో చూచారా?ఇంకోవిషయం వినండి. మీరు స్నేహితుల నుంచి బాగా నష్టపోతారు.నిజమేనా?' అడిగాను.

'నిజమే.అందరూ నన్ను వాడుకొని వదిలేసేవారే.' అన్నాడు.

ఇంతా చేస్తే నేను అతని జాతకం ఇంకా చూడనే లేదు.ఊరకే అతను చెప్పిన కొన్ని గ్రహస్తితులను బట్టి ఇన్ని విషయాలు అర్ధమయ్యాయి.ఇక జాతకాన్ని చూస్తే మొత్తం జీవితమంతా స్పష్టంగా తెలిసిపోతుంది.ఇదీ జ్యోతిష్య శాస్త్రం యొక్క శక్తి.

ఆ విధంగా కాసేపు మాట్లాడుకున్న తర్వాత -'మేం వెళ్ళి వస్తాం.' అంటూ వాళ్ళు లేచారు.

'మంచిది.' అన్నాను.

ఒంటిగంట సమయంలో వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.

భోజనం చెయ్యాలనిపించలేదు.

ఉదయం నుంచీ మబ్బు పట్టి వదలకుండా సన్నగా వాన కురుస్తూనే ఉన్నది. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉన్నది.ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది.

ఎవ్వరూ లేని ఏకాంతగృహాలు తంత్రసాధనకు అనుకూలించే ప్రదేశాలలో కొన్ని అని తంత్రగ్రంధాలు అంటాయి.అది ప్రత్యక్ష వాస్తవం.ప్రపంచంలో మన ఒంటరితనం మనకప్పుడే బాగా అనుభవం అవుతుంది.ఈ ప్రపంచంలో నిజానికి ఎవరూ మనవారు కారు.అంతిమ విశ్లేషణలో మనకు భగవంతుడు తప్ప దిక్కెవ్వరూ లేరు.

ఇంటి తలుపులన్నీ వేసుకుని లైట్లు ఆపేసి ప్రశాంతంగా నా సాధనలో అడుగుపెట్టాను.పిక్నిక్ నుంచి శ్రీమతి తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర అయింది.అప్పటివరకూ నా లోకంలో నేను ఆనందంగా విహరించాను.

ఆ విధంగా ఈ ఆదివారం గడిచింది.
read more " ఆధ్యాత్మిక సందేహాలు - యోనితంత్రం -2 "

28, జులై 2014, సోమవారం

ఆధ్యాత్మిక సందేహాలు-యోని తంత్రం

నా రచనలు చదివి వాటిని అభిమానించే ముగ్గురు వ్యక్తులు కొన్నాళ్ళ నుంచీ నన్ను కలుస్తామని అడుగుతున్నారు.కానీ సమయం కుదరడం లేదు.

'మీరెందుకు నన్ను కలవాలనుకుంటున్నారు?' అని అడిగాను.

కొన్ని ఆధ్యాత్మిక సందేహాలనూ జ్యోతిష్యపరమైన సందేహాలనూ తీర్చుకోడానికి కలుద్దామనుకుంటున్నామని అన్నారు.

ఎవరైనా వారివారి లౌకికసమస్యలతో జ్యోతిష్య రెమెడీల కోసం నన్ను కలుస్తామంటే నాకు ఇష్టం ఉండదు.లౌకికజీవితపు కోరికల్లో కూరుకుని పోయి ఉన్న అలాంటివారితో నా టైం వృధా చేసుకోలేను.కానీ ఎవరైనా నిజాయితీ ఉన్న సాధకులు వారి సాధనామార్గంలో ఎదురౌతున్న నిజమైన సమస్యల పరిష్కారం కోసం కలుస్తామంటే మాత్రం నాకు చాలా సంతోషం కలుగుతుంది.

చాలాసార్లు ఒక విచిత్ర విషయాన్ని ఇలా అడిగేవారు గమనించి ఉంటారు. వారు అనుకున్నంత మాత్రాన నన్ను కలవడం సాధ్యంకాదు.ఈ విషయం నేను ఇంతకుముందు ఒకసారి వ్రాస్తే 'అబ్బో నువ్వంత గొప్పవాడివా?' అంటూ కొందరు నన్ను ఎగతాళి చేశారు.వారి అజ్ఞానానికి జాలిపడి నవ్వుకుని ఊరుకున్నాను.

ఎవరినైతే అంతరాంతరాలలో నిజమైన ఆధ్యాత్మిక తపన ఊపేస్తూ ఉంటుందో వారు మాత్రమే నన్ను కలవగలరు.అనుసరించగలరు.అలా లేనివారు గుంటూరులో మా ఇంటి పక్కనే ఉన్నప్పటికీ నన్ను కలవలేరు.ఇది నేను ఎన్నోసార్లు గమనించిన సత్యం.నాతో Astral Connection ఏర్పడనిదే నన్ను కలిసి మాట్లాడటమూ అనుసరించడమూ సాధ్యంకాదు.

మాత దానికి ఒప్పుకోదు.అలా కలవాలని ప్రయత్నించే వారికి రకరకాల పరీక్షలు పెడుతుంది.ఇది పంచవటి గ్రూప్ లోని వారికి చాలామందికి ప్రత్యక్ష అనుభవమే.

నిన్న ఆదివారమే గనుక వారిని మా ఇంటికి రమ్మని చెప్పాను.ఈలోపల 'రైల్వే ఆఫీసర్స్ క్లబ్ మహిళాసంఘం' వారు గుంటూరు విజయవాడల మధ్యలో ఉన్న 'హాయ్ ల్యాండ్' పిక్నిక్ ప్లాన్ చేశారు.మహిళాసంఘం చాలా పవర్ ఫుల్ కాబట్టి వారు ప్లాన్ చేస్తే భర్తలు నోర్మూసుకుని అనుసరించవలసిందే.అక్కడ వాటర్ స్పోర్ట్స్ తో బాటు ఇంకా చాలాచాలా ఉంటాయి సరదాగా వెళదాం అని అందరూ అన్నారు. 

ఆహూతులను రమ్మని చెప్పాను గనుక,నేను రాలేను,ఇంట్లో ఉంటానని చెప్పి మా శ్రీమతిని పిక్నిక్ కు వెళ్ళి రమ్మన్నాను.ఉదయం 9.30 కు ఒక బస్సు నాలుగు కార్లలో వారందరూ పిక్నిక్ కు వెళ్ళిపోయారు.నేను ఇంట్లోనే కూచుని, వస్తానన్న వారికోసం ఎదురుచూస్తున్నాను.

పదిగంటల ప్రాంతంలో సురేంద్ర,ప్రసాద్,రాజశేఖర్ అనేవారు వచ్చారు.కుశల ప్రశ్నలు అయ్యే సమయంలోనే వారి 'ఆరా' లు రీడ్ చేసి,విషయాలు గ్రహించి, వారేమి అడుగుతారా అని మౌనంగా గమనిస్తున్నాను.

వారిలో ప్రసాద్ అనే ఆయన మొదలు పెట్టాడు.

'మీ రచనలు కొన్ని చదివాను.నాకు చాలా నచ్చాయి.అమ్మవారి ఉపాసన ఇలా ఉంటుంది అయ్యవారి ఉపాసన ఇలా ఉంటుంది అని స్పష్టంగా మీరు వ్రాసిన విధానం నచ్చింది.నాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సందేహాలు అడగాలని వచ్చాను.'

'మంచిది చెప్పండి' అన్నాను.

నాకు చిన్నప్పటి నుంచీ కాళీమాత అన్నా,తంత్రసాధన అన్నా చాలా ఇష్టం.కానీ సరియైన మార్గం చూపేవారు దొరకలేదు.వెదుకుతున్నాను.నాకు చాలాసార్లు అమ్మ దర్శనం ఇచ్చింది.ఎత్తైన కొండల దగ్గర ఒక నది పారుతూ ఉంటుంది.ఆ కొండలలో అమ్మవారి ఎత్తైన విగ్రహం ఉంటుంది.దాని సమక్షంలో నేను పూజలు చేస్తున్నట్లు నాకు చాలాసార్లు స్ఫురణ కలిగింది.

అమ్మను ఎలా పూజించాలో తెలియకపోయినా,తనకు రక్తం అంటే ఇష్టం అంటారు గనుక నా చేతిని కోసుకొని ఆ రక్తాన్ని ఒక ప్లేట్ లో పట్టి అమ్మ ఎదురుగా పెట్టేవాడిని.అమ్మ సంతోషించినట్లే నాకు అనిపించేది.నాకూ ఆనందం కలిగేది.శ్రీవిద్యాదీక్ష కోసం కంచి స్వాములవారైన జయేంద్రసరస్వతి గారిని కలసి అడిగాను.కాని ఆయన ఇవ్వలేదు.

అప్పుడు నడుస్తున్న శనిహోరను గమనిస్తూ 'ఆయన ఏమన్నారు?' అన్నాను.

'నీవు బ్రాహ్మణుడవు కావు కదా.శ్రీవిద్యను చెయ్యగలవా?చాలాకష్టం. కుదరదు.'అన్నారు.

'అలా అన్నారా?'

అవును.ఆయన పక్కన ఉన్నవాళ్ళు కూడా ఎగతాళిగా మాట్లాడారు.నాకు చాలా బాధ కలిగి వెనక్కు వచ్చేశాను.బ్రాహ్మణ కులంలో పుట్టనంత మాత్రాన శ్రీవిద్యకు పనికిరానా అని నాకు బాధ కలిగింది.మా ఇంటికి వచ్చిన తర్వాత డాబామీదకు వెళ్ళి గగనంలో లోకి చూస్తూ ఏడుస్తూ అమ్మను ప్రార్ధించాను. తర్వాత కొన్ని రోజులకు స్వప్నంలో అమ్మ మంత్రాక్షరాలు ఆకాశంలో మెరుస్తూ కనిపించాయి.వెంటనే నిద్రలేచి ఆ మంత్రాన్ని వ్రాసుకున్నాను. అప్పటి నుంచీ దానినే జపిస్తున్నాను.

వింటున్న నాకు చాలా సంతోషం కలిగింది.

'చాలా మంచిది.మనుషులతో పనేముంది?అమ్మే స్వయంగా మిమ్మల్ని కరుణించింది.దీనినే స్వప్నదీక్ష అంటారు.తంత్రంలో ఇది సమ్మతమైన విషయమే.'అన్నాను.

అప్పుడే మేరుప్రస్తారం ఒకటి చేయించుకుని ఇంట్లో పూజలో ఉంచుకున్నాను.కాని ఇంటిలోని వారి పోరు ఎక్కువై పోయింది.నేను వీటిలో పడి ఏదో అయిపోయి సంసారం వదిలేస్తానేమో అని వారు భయపడ్డారు.ఆ పోరు తట్టుకోలేక పూజ చేస్తున్న మేరుప్రస్తారాన్ని నదిలో పారేశాను.అదొక ఘోరమైన తప్పు చేశాను.దానికి ఇప్పటికీ బాధపడుతున్నాను.' అన్నాడు.

'అవునా?' అన్నాను.

'అవును.నాకు యోనితంత్రం అంటే చాలా ఇష్టం.మనస్సు దానివైపే పోతూ ఉంటుంది.ఆ విధానం నేర్పేవారి కోసం వెదుకుతున్నాను.ఈలోపల నాకు తెలియకుండానే దాని అభ్యాసాలు కొన్నింటిని ఆచరించాను.కాని వాటిని ఎలా చేస్తున్నానో నాకే తెలియదు.' అంటూ ఆ అభ్యాసాలను కొన్నింటిని వివరించాడు.

(అవి వ్యక్తిగతమైన వివరాలు గనుక ఇక్కడ వ్రాయడం లేదు)

అమ్మ లీలను గమనించి నాకు కొంత ఆశ్చర్యం కలిగింది.

'ఇదంతా ఎందుకు జరుగుతున్నది?వాటి గురించి ఏమీ తెలియకపోయినా నా మనసు తంత్రమార్గం వైపూ అందులోనూ యోనితంత్రం వైపూ ఎందుకు లాగుతున్నది?' అడిగాడు.

మహనీయులైన నా గురువులనూ జగన్మాత కాళినీ స్మరించి మనస్సును ఏకాగ్రం చేసి చూచాను.విషయం అర్ధమైంది.అంతేగాక ఆయన జాతకంలో గ్రహస్థితులు కూడా తెలిసిపోయాయి.

'మీరు ఒకానొక గతజన్మలో బ్రాహ్మణులే.అప్పుడు అస్సాం బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండేవారు.అప్పుడు మీరు కాళికా తంత్రసాధన చేసేవారు. అందులోనూ యోనితంత్రానికి చెందిన సాధనలు మీరు బాగా చేశారు.ఆ సమయంలో మీరు మామూలు సాధకుడు కారు.మీరు అందులో ఒక గురువుగా సంఘంలో చెలామణీ అయ్యారు.ఆ క్రమంలో మీకు కొన్ని శక్తులు సిద్ధించాయి.వాటిని లౌకిక కార్యకలాపాలకూ శిష్యుల బాధలూ కోరికలూ తీర్చడానికి వాడారు.వాళ్ళ కర్మ మీకు చుట్టుకున్నది.అందుకే మీకు సాధనా భ్రష్టత్వం కలిగింది.కానీ పూర్వజన్మ వాసనలు మిమ్మల్ని వెంటాడు తున్నాయి.అందుకే ఈ జన్మలో బ్రాహ్మణులు కాకపోయినా,కుటుంబంలోని వారి వ్యతిరేకత తీవ్రంగా ఉన్నాకూడా మీ మనస్సు వాటివైపే లాగుతున్నది.' అన్నాను.

'దానిని మళ్ళీ నాకు నేర్పించి నన్ను సరియైన మార్గంలో పెట్టే గురువులు ఎక్కడ దొరుకుతారు?' అడిగాడు.

నవ్వొచ్చింది.

'ఏమో నాకేం తెలుసు?మీరే వెదకాలి.అలాంటివారు వెదికితే దొరకరు.అయినా మీరు ఎక్కడని వెదుకుతారు?వారి అడ్రస్ మీకు తెలియదు కదా?అలాంటివారు సమాజంలో ఉండరు.ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటారు.ఒకవేళ వారు సమాజంలో ఉన్నా,మేము పలానా అని వారి మెడలో బోర్డు కట్టుకుని ఉండరు.అమ్మ అనుగ్రహం లేనిదే మీరు వారిని గుర్తించలేరు.' అన్నాను.

'మరెలా?' అడిగాడు.

'గురువుని వెదకడం అనేది బజారులో ఒక షాపుని వెదికినట్లుగా ఉండదు.ఆ ప్రాసెస్ వేరు.యాడ్స్ చూచి మార్కెట్లో వెదికితే మీరు దొంగగురువుల చేతిలో పడటం ఖాయం.మార్గం అదికాదు.మీలో తపన కలగాలి.మీ హృదయంలో అది ఒక భరించలేనంత స్థాయిలో కలగాలి.పగలూ రాత్రీ నిరంతరం గురువుకోసం మీరు దైవాన్ని ప్రార్ధించాలి.మీ జీవితంలో అది ఫస్ట్ ప్రయారిటీ కావాలి.మిగతా ఏ విషయాలైనా సరే దాని తర్వాతనే ఉండాలి.అవసరమైతే జీవితంలోని దేనినైనా ఒదులుకోడానికి మీరు సిద్ధపడాలి.అంతటి తపన మీలో కలిగినప్పుడు మీ గురువును దైవమే మీ దగ్గరకు చేరుస్తాడు.అంతవరకూ కుదరదు.' అన్నాను.

ఆయన వింటున్నాడు.

'చూడండి.చాలామంది ఆధ్యాత్మికసాధన అని కబుర్లు చెబుతూ ఉంటారు. వాళ్ళను చూస్తె నాకు నవ్వు వస్తూ ఉంటుంది.అవన్నీ పుస్తకాలు చదివి టీవీ ప్రవచనాలు విని చెప్పే కబుర్లు.అవి ఎందుకూ కొరగావు.

నిజమైన సాధకులు అలా ఉండరు.తపనతో వారి హృదయం రగిలిపోతూ ఉంటుంది.సాధన ముందు జీవితంలో ఇంకేదీ వారికి రుచించదు.దానికోసం జీవితంలో ఇంక దేనినైనా వారు పక్కకు తోసివేస్తారు.

ఒక ఉదాహరణ చెప్తాను వినండి.

పరమహంస యోగానందగారు తన గురువుగా యుక్తేశ్వర్ గిరి గారిని కలవక ముందు ఒక ఆశ్రమంలో ఇంకొక గురువు దగ్గర కొన్నాళ్ళు ఉన్నారు.ఒకసారి గురువు చెప్పిన క్రమం తప్పి భోజనం చేసి ఆయన వచ్చేలోపలే యోగానంద గారు నిద్రకు ఉపక్రమిస్తారు.ఆయన వచ్చి చీవాట్లు పెడతారు.అవసరమైతే భోజనం మానెయ్యి అంతేగాని నీ సాధన మానరాదు. అని ఆయన అంటారు.

భోజనమే కాదు.సాధనకు అడ్డొస్తే ఇంక దేనినైనా సరే నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసే దీక్ష మీలో ఉండాలి.అలాంటివారే నిజమైన సాధకులు.అంతేగాని మిగతా పనులన్నీ ముగించి చివరిలో కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తానంటే కుదరదు.ఈ రోజు సినిమాకెళదాము సాధన రేపు చూచుకుందాం అంటే కుదరదు.ఆధ్యాత్మికం అనేది చివరిబేరం కాదు.జీవితంలో మొట్ట మొదటి బేరమే అది కావాలి.దానిముందు పెళ్ళాంపిల్లలూ తల్లి దండ్రులూ బంధువులూ స్నేహితులూ ఉద్యోగమూ ఇంకా ఏదైనా సరే పక్కకు తప్పుకోవాల్సిందే.అదీ సాధన అంటే.' అన్నాను.

'ఈ స్థితి నాకు కొంతకాలం క్రితం కలిగింది.అప్పుడు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండిపోయాను.ఒకరిక్రింద ఉద్యోగం చెయ్యడం నాకు మనస్కరించలేదు.అలా కొంతకాలం ఉన్నాను.'అంటూ కొంతసేపు చెప్పాడు.

నేను మౌనంగా వింటున్నాను.

'ఈ ఊరిలో కూడా కొందరు కాళీఉపాసన చేసినవారు ఉన్నారు కదా?' కాసేపాగి అడిగాడాయన.

'అవును ఉన్నారు.ఎలాగూ వచ్చారుకదా.అక్కడకు కూడా వెళ్ళిరండి.' అన్నాను నవ్వుతూ.

'అబ్బే అలాకాదు.ఊరకే అడిగాను.'అన్నాడు.

'ఏం పరవాలేదు.వెళ్ళి చూడండి.అక్కడ మీకు ఏయే పనులు కావాలంటే ఏయే హోమాలు చెయ్యాలో తెలుస్తుంది.అక్కడకొచ్చే వాళ్ళు కూడా అందరూ అలాంటి కోరికలతో వచ్చేవారే.అంతేగాని నిజమైన ఆధ్యాత్మికతా అంతరిక సాధనా మీకు అక్కడ దొరకవు.'స్పష్టంగా తేల్చి చెప్పాను.

'నేను చేస్తున్నది సరియేనంటారా?చేతిని కోసుకుని రక్తాన్ని అమ్మకు అర్పించడం లాంటివి సరియైన విధానాలేనా?వామాచారం మంచిదేనా?యోనితంత్రం మంచిదేనా?' అడిగాడాయన.

'అన్నీ మంచివే.సాధనాపరంగా చూస్తే ఎక్కువా తక్కువా మెట్లేగాని మంచీ చెడూ అని ఉండవు.లోకం దృష్టితో సాధనా విధానాలను తీర్పు తీర్చరాదు. లోకం గుడ్డిది.దానికేం తెలుసు?ఎంతసేపూ ఇంద్రియభోగాల కోసం కొట్టుకుంటూ మోసంలో కుళ్ళిపోతున్న లోకులకు ఆధ్యాత్మిక రహస్యాలెలా తెలుస్తాయి?అవి వాళ్ళ ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉన్నాయి.

మీరు భగవద్గీత గుణత్రయ విభాగయోగం చూడండి.అందులో ఉపాసనలో భేదాలు భగవంతుడే వివరించాడు.మీరు చేస్తున్న రకం ఉపాసన తామసికమైనది.అదీ మంచిదే.తర్వాతి మెట్టు రాజసికం.అదీ మంచిదే.ఆ తరవాతది సాత్వికం.అది ఉత్తమం.దాని తర్వాతది శుద్ధసాత్వికం.అది అత్యుత్తమం.కానీ అత్యుత్తమం కదా అని మీరు దానిని బలవంతంగా పాటించకూడదు.మీ తత్త్వానికి ఏది సరిపోతుందో దానిని మీరు మొదలు పెట్టాలి.అక్కడనుంచి పైకి ఎదగాలి.అదే సరియైన విధానం.

"మీరు నేను వ్రాసిన 'శ్రీవిద్య' చదివారా?" అడిగాను.

'లేదు' అన్నాడాయన.

'ముందు అది చదవండి.మీలాంటి శ్రద్ధాళువుల కోసమే నా బ్లాగ్లో ప్రత్యేకమైన విభాగంలో దానిని ఉంచాను.దానిలో మీ సందేహాలన్నీ తీరుతాయి.'

'చదువుతాను' అన్నాడాయన.

'మీరు 'గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ' కూడా చదవండి.అందులో రామకృష్ణులు చెప్పినారు.కొలుపులూ బలులూ రక్తతర్పణాలూ ఇలాంటి వాటితో కూడి ఉండేది తామసిక ఉపాసన.ఆడంబరం కోసం చేసేది రాజసిక ఉపాసన.మూడో కంటికి తెలియకుండా చేసేది సాత్విక ఉపాసన.అసలు ఏ ఉపాసనా అవసరం లేని సహజస్థితి శుద్ధసాత్వికం.'

'నేడు లోకకళ్యాణం కోసం అంటూ అనేకమంది హోమాలూ యాగాలూ అట్టహాసంగా చేస్తున్నారు.108 కుండాలూ,1008 కుండాలూ పెట్టి హోమాలు చేస్తున్నారు.ఇదంతా బోగస్.లోకాన్ని సృష్టించినవాడు ఒకడున్నాడు. లోకకళ్యాణం వాడు చూచుకుంటాడు.అందులో మనం వేలు పెట్టనక్కరలేదు. మన ఇంటిని మనం బాగు చేసుకోలేం.లోకాన్ని బాగుచెయ్యగలమా?'

'వారివారి పెళ్ళాలు వారు చెప్పినమాట వినరు.వారి పిల్లల్ని వారు అనుకున్నట్లుగా పెంచలేరు. ఇక లోకాన్ని ఉద్ధరిస్తారా?ఇదంతా భ్రమ.వారు చేసేది లోకకళ్యాణం కోసం కాదు.వారి కళ్యాణం కోసం.పరిచయాలు పెంచుకోవడానికీ,బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోడానికీ హై సర్కిల్స్ లో జరిగే తంతులు ఇవన్నీ.  

నిజమైన సాధకుడు ఏం సాధన చేస్తున్నాడో అతని ఇంటిలోని వారికి కూడా తెలియదు.అదంతా అతనికీ దైవానికీ మధ్య వ్యవహారం.మూడో కంటికి ఆ రహస్యాలు తెలియవు.తెలియకూడదు కూడా.

మీరు చేస్తున్నది మంచిదే.కాని మీరు ముందుకు ఎదగాలి.

'అది ఒకప్పుడు చేశాను.ఇప్పుడు కాదు.ఇప్పుడు రమణమహర్షి మార్గంలోకి వచ్చాను.మేము ముగ్గురమూ తరచుగా అరుణాచలం వెళుతూ ఉంటాము. అక్కడ ఉండి సాధనా గిరిప్రదక్షిణా చేస్తూ ఉంటాము.రాజశేఖర్ త్వరలో 108 ప్రదక్షిణాలు పూర్తి చెయ్యబోతున్నాడు.' అన్నాడు.'

'నేను షిరిడీ సాయి భక్తుడిని.శరత్ బాబూజీని అనుసరిస్తాను'అని రాజశేఖర్ అన్నాడు.

'మంచిదే.సాయిబాబా సద్గురువే.రమణమహర్షి మహాజ్ఞాని.కాని వీరందరూ అమ్మ ముందు చిన్నపిల్లలని మర్చిపోకండి.సమస్త లోకాలనూ సృష్టించి నడిపించి తిరిగి సంహరిస్తున్న మహాశక్తి కాళి.సద్గురువులతో సహా ఎవరైనా ఆమె ముందు చిన్నచిన్న పిల్లలే.'

'మీరు తామసిక సాధనను దాటి సాత్విక జ్ఞానమార్గంలోకి అడుగు పెట్టారు. కాని అన్నీ అమ్మ కంట్రోల్ లో ఉన్నవే.రమణమహర్షి మహాజ్ఞాని. ఆయన మార్గం చాలా మంచిది.కాని అనుసరించడం కష్టం.' అన్నాను.

ఇంకా ఇలా చెప్పాను 

'కాళి తామసిక దేవత కనుక ఆమెను పూజించకూడదు అని హలదారి విమర్శించేవాడు.ఈ విషయంపై వివరణను శ్రీరామకృష్ణులు సరాసరి అమ్మనే అడిగారు.

దానికి అమ్మ నవ్వి--'వాడొక వెర్రివెధవ.అల్పజీవి.వాడికేం తెలుసు?త్రిగుణాలన్నీ నాలోనే ఉన్నాయి.నేనే వాటిని సృష్టించాను.అవన్నీ నేనే. వాటికి అతీతమైన పరబ్రహ్మమునూ నేనే.' అని స్పష్టంగా చెప్పింది.

కనుక తామసికపూజ తప్పుకాదు.అదొక మెట్టు.దానిని దాటి ఎదగాలి. ముందుకు రావాలి.అది తామసికసాధన కనుకనే దక్షిణాచార పరులు సామాన్యంగా మనం అనుకునే వామాచారాన్నిఒప్పుకోరు.కాని నిజమైన వామాచారం చాలా మంచిది.నా ఉద్దేశ్యంలో దక్షిణాచారానికి పైమెట్టు వామాచారం.ఎందుకంటే పరమశివుడు త్వరగా ప్రసన్నుడౌతాడు.ఆయన భోలా శంకరుడు.కాని శక్తి అలా త్వరగా ప్రసన్నం కాదు.ఆమె కరుణించాలంటే చాలా కష్టం.అనేక పరీక్షలు జీవితంలో ఎదురౌతాయి.నిన్ను అనుక్షణం ఆమె పరీక్షిస్తుంది.

శక్తిపూజ చాలాకష్టం అని అందరూ అంటారు.కాని ఆ కష్టం ఏమిటో గ్రహించలేరు.కష్టం అంటే చేసే పూజల్లోనూ నియమాలలోనూ కష్టం కాదు. అమ్మ పెట్టే పరీక్షలలో ఆ కష్టం ఉంటుంది.నీ నిత్యజీవితంలో నిన్ను తల్లక్రిందులు చేసే సమస్యలను అమ్మ ఎదురు చేస్తుంది.నిన్ను ఇంటా బయటా ఊపి పారేస్తుంది.నీ జీవితం అగమ్యగోచరం అవుతుంది.వాటికి నీవు తట్టుకుని నిలబడగలిగితే అప్పుడు అమ్మ కరుణిస్తుంది.నీలో అహం పిసరంత ఉన్నా కింద పడేసి తొక్కుతుంది.శక్తిపూజ కష్టం అంటే అసలైన అర్ధం ఇది.అది మాటలు చెప్పినంత తేలిక కాదు.ఆ దారిలో నడిచేవారికే ఆ విషయాలు అర్ధం అవుతాయి.బయటనుంచి చూచేవారికి అవి అర్ధం కావు.

'యోనితంత్రం రాజమార్గం.సరిగ్గా ఆచరిస్తే అత్యంత త్వరితంగా అది గమ్యానికి చేరుస్తుంది.'అన్నాను.

ప్రసాద్ గారికి ఆనందం కలిగింది.

'నిజమా?' అన్నాడు.

'అవును.కాని దానిని నేర్పించే గురువు అంత సులభంగా దొరకడు.ఒకవేళ మీ అదృష్టం బాగుండి దొరికినా అంత త్వరగా మీకు నేర్పించడు.మీలో నేను పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తేనే నేర్పుతాడు.లేకుంటే కుదరదు.పైగా ఆ సాధనలో మీకొక 'స్త్రీ' సహకారం కావలసి వస్తుంది.

తంత్రసాధనలో సరియైన అవగాహన ఉండి,దానిని సాధించాలనే పట్టుదల ఉన్న స్త్రీని తాంత్రికపరిభాషలో 'భైరవి' అంటారు.అలాంటి భైరవి మీకు నేటి కలికాలంలో ఎక్కడ దొరుకుతుంది?నేడు ఎక్కడ చూచినా వస్తు వ్యామోహమూ,నగలూ చీరలూ డబ్బూ విలాసాలూ కార్లూ ఇళ్ళూ సరదాలూ ఇవే తప్ప, ఉన్నతమైన ఆధ్యాత్మిక చింతన ఉన్న స్త్రీలు ఎక్కడున్నారు?నా ఏభై ఏళ్ళ జీవితంలో ఇంతవరకూ నాకు అలాంటి వాళ్ళు ఒక్కరో ఇద్దరో తప్ప ఎవరూ కనిపించలేదు.ఆ ఒక్కరో ఇద్దరో కూడా సంసారపు బాధ్యతలలో చిక్కుకుని ఉన్నారు.వాళ్ళు ఆ ఊబిలోనుంచి బయటపడలేరు.

అందులోనూ తంత్రసాధన అంటే ముందుకొచ్చే సాహసం ఉన్న స్త్రీ సాధకులు నాకు ఇంతవరకూ తారసపడలేదు.ఎక్కడైనా అస్సాం,బెంగాల్,లేదా హిమాలయాల లోనో,టిబెట్ లాంటి చోట్లలో ఉన్నారేమో?మన ఆంధ్రాలో అలాంటి ఉన్నతులైన తంత్ర సాధకురాండ్రు నాకు తెలిసి ఒక్కరూ లేరు. తంత్రం అంటేనే అసహ్యమూ భయంతో దూరంగా తొలగి పోయేవారు మనకు ఎక్కడ చూచినా కనిపిస్తారు.ఎక్కడో ఒకరిద్దరికి అలాంటి  భావాలున్నప్పటికీ వారు సంసారబంధాలలో ఇరుక్కుపోయారు.

వారికి లోకం ఏమనుకుంటుందో అన్న భయమూ,సంసారం ఏమైపోతుందో అన్న భయమూ ఉంటాయి.ఇలాంటి భయాలున్నవారు తంత్రసాధనకు ఏమాత్రం పనికిరారు.కనుక మీకు అలాంటి సహచరి ఈజన్మకు దొరకదు.' చెప్పాను.

'మరెలా? విశాఖపట్నం దగ్గరి దేవీపురంలో యోనితంత్రం ఉన్నదని విన్నాను. నిజమేనా?' అన్నాడాయన.

'నేనూ అక్కడి బొమ్మలనూ ఆ వీడియోనూ చూచాను.నిజమైన శీవిద్యోపాసన అలా ఉండదు.అంతర్యాగపరులైనా బహిర్యాగపరులైనా అలాంటి అర్ధనగ్న ప్రతిమలను పెట్టి వాటిని పూజించవలసిన పని లేదు.అవి నాకు అసభ్యంగా కనిపించాయి.' అన్నాను.

'ఒక్కొక్క దేవతా ప్రతిమ దగ్గరా వారివారి బీజాక్షరాలను మనచేత అనిపిస్తూ పూజ చేయిస్తారు' అని రాజశేఖర్ అన్నాడు.

నవ్వొచ్చింది.

'అసలైన శ్రీవిద్యా పూజావిధానం అదికాదు.నాకు తెలిసి ప్రస్తుతం యోనితంత్రాన్ని అనుసరిస్తున్న ఒకేఒక్క వ్యక్తి వివాదాస్పద కేసులను ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద.' అన్నాను.

వాళ్ళు ఆశ్చర్యపోయారు.

'అవును.ఆయన ఆశ్రమంలో జరిగేది అదే అని నా విశ్వాసం.' అన్నాను.

'అంటే అది కూడా అమ్మ పెట్టిన పరీక్షేనా?' అడిగాడు ప్రసాద్.

'అవును.ఆ సాధనలు రహస్యంగా జరగాలి.లోకానికి తెలియవలసిన అవసరం లేదు.ఆయన దారి తప్పాడు.లోకంలో ప్రచారం చేసుకుంటూ శిష్యులను పోగేసుకుంటున్నాడు.అమ్మకు కోపం వచ్చింది.నీ గోలేదో నువ్వు చూసుకోకుండా లోకంతో నీకెందుకురా అని అతన్ని శిక్షించింది.

ఇప్పుడు ఎక్కడికి పోయినా జనం రాళ్ళతో కొడుతున్నారు.కోర్టు కేసులు వెంటాడుతున్నాయి.అందుకే ఎక్కడికీ కదలలేక ఒక గదిలో బందీ అయ్యాడు. అమ్మ పెట్టిన పరీక్షను అర్ధం చేసుకుని మళ్ళీ సరియైన దారిలోకి వస్తే ఆయన బాగుపడతాడు.అలా కాకుండా లోకంతో పెట్టుకుని వాళ్ళతో వాదించడమూ కోర్టుకేసుల వెంట పరిగెట్టడమూ ప్రత్యర్ధుల మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించడమూ ఇత్యాదిపనులు చేస్తే అతనికి సాధనాభ్రష్టత్వం కలుగుతుంది.' అన్నాను.

(మిగతాది రెండో భాగంలో)
read more " ఆధ్యాత్మిక సందేహాలు-యోని తంత్రం "

27, జులై 2014, ఆదివారం

విమానయాన రంగానికి అత్యంత చెడు వారం

జూలై 2014 లో ఒక్క వారంలో మూడు భయానకమైన విమాన ప్రమాదాలు జరిగాయి.అదే పోయినేడాది రెండు మిలియన్ల ఫ్లైట్స్ లో ఈ స్థాయి ప్రమాదాలు ఒకటి కంటే తక్కువ జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. 

కనుక ఇది కాకతాళీయం కాదు.వీటి వెనుక మనకు అంతుబట్టని కారణాలు ఉన్నాయని అర్ధం కావడం లేదూ?

మానవప్రయత్న పరంగా తీసుకునే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయంటే అది కూడా ఒక్క వారంలో మూడు ప్రయాణీకుల విమానాలు కూలిపోయాయంటే ఆ వారానికి ఏదో ప్రత్యేకత ఉండాలి.

జ్యోతిష్య పరంగా ఈ వారపు ప్రత్యేకత ఏమిటో చూడబోయే ముందు ప్రపంచ సమాజం ఉద్దేశ్యం ఏమిటో,ఈ సంఘటనలను అది ఎలా తీసుకుంటున్నదో చూద్దాం.

Less than one in 2 million flights last year ended in an accident in which the plane was damaged beyond repair, according to the International Air Transport Association. That includes accidents involving cargo and charter airlines as well as scheduled passenger flights.
"One of the things that makes me feel better when we look at these events is that if they all were the same type event or same root cause then you would say there's a systemic problem here, but each event is unique in its own way," said Jon Beatty, president and CEO of the Flight Safety Foundation, an airline industry-supported nonprofit in Alexandria, Virginia, that promotes global aviation safety.
(Courtesy: Yahoo News @ http://news.yahoo.com/very-bad-week-airline-disasters-come-cluster-203017512--finance.html)
అసలు విషయం వారికి తెలియదు గనుక,ఫ్లైట్ సర్వీసులు పెరిగే కొద్దీ ప్రమాదాలు కూడా పెరుగుతాయి అన్న నిశ్చయానికి వారు వచ్చారు.కాని అది నిజం కాదు.ఎన్ని సర్వీసులు పెరిగినా,వారు పాటించే సేఫ్టీ రూల్స్ ఏమాత్రం మారవు.వాటిలో తేడాలు రావు.ఒక్క ఫ్లైట్ నడిపినా వంద ఫ్లైట్స్ నడిపినా అవే జాగ్రత్తలు ప్రతిదానికీ తీసుకుంటారు.కనుక కారణం అది కాదు.
వారికి అర్ధం కాని కారణాలూ వారికి అంతు చిక్కని కారణాలూ ఏవో ఈ సంఘటనల వెనుక ఉన్నాయి.ఆ కారణాలు ఏమిటో గత నెలనుంచీ నేను సూచిస్తూనే ఉన్నాను.అయితే జ్యోతిష్య శాస్త్రాన్నీ మానవులపైన గ్రహాల ప్రభావాన్నీ నమ్మనివారు నా విశ్లేషణను ఎగతాళి చెయ్యవచ్చు.అది వారిష్టం.దానివల్ల నాకు వచ్చిన నష్టమూ లేదు.వాళ్ళ విమర్శల వల్ల నేను ఉడుక్కునేదీ లేదు.నేను చెబుతున్నది సత్యమే అని నాకు తెలుసు గనుక ఎవరేమనుకున్నా నేను లెక్కచెయ్యను.అలాంటివారితో వాదించి నా సమయం వృధా చేసుకోను.వారికి అసలు జవాబే చెప్పను.
ఇప్పుడు విషయంలోకి వద్దాం.
జూలై 18 న ఇదంతా మొదలైంది.
>>ఆ రోజున మలేషియా విమానం ఉక్రెయిన్ గగనతలం మీద ప్రయాణిస్తున్నపుడు కూల్చివెయ్యబడింది.ఇందులో 298 మంది చనిపోయారు.
>>జూలై 23 బుధవారం నాడు ట్రాన్స్ ఏషియా ఎయిర్ వేస్ విమానం ఒకటి తైవాన్ లో కూలిపోయింది.ఇందులో 48 మంది చనిపోయారు.20 మంది వరకూ గాయపడ్డారు.దీనిలో నేలమీద పోతూ ఉన్నవారు కూడా ఒక అయిదుగురు ఉన్నారు.
>>ఒక్కరోజు తర్వాత, అంటే జూలై 24 న అల్జీరియా విమానం కూలిపోయి 116 మందిని పరలోకానికి పంపింది.
అంటే జూలై 18 నుంచి 24 లోపు మూడు విమానాలు విచిత్రమైన పరిస్థితులలో కూలిపోయాయి.పైగా మూడూ ప్రయాణీకుల విమానాలే.
ఇదంతా గమనిస్తుంటే,దీనివెనుక మనకు కనిపించని శక్తుల బలీయమైన ప్రభావం ఉన్నట్లు తోచడం లేదూ?ఖచ్చితంగా అనిపిస్తుంది.ఏ విధమైన బయాస్ లేకుండా ఓపన్ మైండ్ తో ఆలోచించే వారికి ఈ సంఘటనల వెనుక ఏదో ఉన్నట్లే తోస్తుంది.అది నిజం కూడా.
ఆయా విమానాలు టేకాఫ్ అయిన సమయం తీసుకుని ఆ సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూడవచ్చు.అలా చూస్తె ఖచ్చితంగా ప్రమాద ఘంటికలు మ్రోగినట్లు కనిపిస్తుంది.అది మామూలుగా అందరూ చేసే పద్ధతి. ఈ సారి అలా చెయ్యబోవడం లేదు.
గోచారపరంగా ఖగోళపరంగా ఈ వారంలో ఏయే గ్రహస్థితులు ప్రబలంగా ఉన్నాయో మాత్రమే ఈ పోస్ట్ లో సూచిస్తాను.
ఇప్పుడు జ్యోతిష్యపరంగా ఈ వారపు ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
ఆషాఢమాసాన్ని మన సాంప్రదాయంలో శూన్యమాసం అంటారు.కనుక శూన్యం లేదా అంతం చేసే లక్షణం ఈ మాసానికి ఉంటుంది.ఈ మాసంలో పుట్టినవారు లౌకికంగా కంటే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతారు.దానికి కారణం కూడా ఇదే.వారు శూన్యత్వాన్ని(పూర్ణత్వాన్ని) కోరుకుంటారు. గురుపూర్ణిమ కూడా ఇదే మాసంలో వస్తుంది.
అలా అయితే ప్రతి ఏడాదీ వచ్చే ఆషాఢమాసంలో ఏవో ఒకటి ఇలాగే జరగాలి కదా?అని కొంతమందికి అనుమానం రావచ్చు.అది నిజమే.ప్రతి ఏడాదీ అలా ప్రమాదాలు జరగవు.మరి ఇప్పటి ప్రత్యేకత ఏమిటి?
ఇప్పుడు నడుస్తున్న శపితయోగమే ప్రత్యేకత.ఈ ఇంద్రజాలం అంతా రాహువు,శని,కుజులవల్ల నడుస్తున్నది.ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలన్నీ కూడా వీరు చేస్తున్న కర్మక్షాళనా విధానాలే.వారు ప్రతి ఏడాదీ ఆషాఢమాస సమయంలో ఇదే స్థితులలో ఉండరు.ప్రస్తుతం ఉన్నారు.అదే ప్రత్యేకత.
ఈ ఆషాఢ మాసంలో కూడా మళ్ళీ జూలై 18-24 వారానికి ఎలాంటి ప్రత్యేకత వచ్చిందో చూద్దాం.
ఇది 18-7-2014 గ్రహస్థితి.ఇక్కడ లగ్నాన్ని లెక్కించనవసరం లేదు. గ్రహస్థితులను మాత్రమే గమనిద్దాం. రాహువూ కుజుడూ శనీశ్వరుడూ పక్కపక్కనే ఉన్న రాశులలో వరుసగా ఉన్నారు.కుజుడు ఇప్పుడే రాహువును వదలి శనీశ్వరుని వైపు ప్రయాణిస్తున్నాడు.అంటే రాహువూ శనీశ్వరుల మధ్యన కుజుడు బందీ అయ్యాడు.ఇలాంటి స్థితినే పాపార్గలం అని జ్యోతిష్య శాస్త్రంలో అంటారు.ఈ స్థితి కుజుని వంటి పౌరుష గ్రహానికి చాలా చికాకును కలిగిస్తుంది.అందుకే ఎక్కడ చూచినా యాక్సిడెంట్లూ దుర్ఘటనలూ జరుగుతున్నాయి.కుజశనులు ఇద్దరూ వాయుతత్వరాశిలో ఉండటం వల్ల వాయుయానప్రమాదాలు జరుగుతున్నాయి.

శనీశ్వరుడు నవాంశలో నీచస్థితిలో ఉన్నాడు.అంటే కుజస్థానంలో ఉన్నాడు.కనుక ఆయనకూడా చాలా అసహనంగా చికాకుగా ఉన్నాడు. కుజశనులు ఇద్దరూ కలిస్తే ప్రమాదాలు జరుగుతాయని నేను కనీసం మూడేళ్ళక్రితం నుంచీ అనేక పోస్ట్ లలో వ్రాస్తూ ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనలను ఉదాహరణలుగా చూపిస్తూ రుజువు చేస్తూ వస్తున్నాను.కావాలంటే పాత పోస్ట్ లు ఒకసారి చూడండి.

ఇప్పుడుకూడా వారిద్దరూ చాలా చికాకుగా అసహనంగా ఉన్నారు.పైగా అగ్నికి ఆజ్యం పోసినట్లు రాహువు ప్రభావం వారికి తోడయ్యింది.అందుకే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇది 23-7-2014 కుండలి.ఇక్కడ కొచ్చేసరికి అమావాస్య దగ్గరకు వస్తున్నది.అదొక విపరీత ప్రభావం.కుజుడు తన గమనంలో శనికి దగ్గర అవుతున్నాడు.కానీ ఈ కుండలిలో శనీశ్వరుడు వక్రస్థితి నుంచి బయటకు వచ్చేశాడు. అందుకే ఈ రోజు జరిగిన ప్రమాదంలో గత ప్రమాదంలో జరిగినంత జననష్టం జరగలేదు.దీనిని చక్కగా గమనించాలి.

ఇది 24-7-2014 కుండలి.ఇందులో శుక్ర నెప్త్యూన్ల(వరుణగ్రహాల)మధ్యన ఖచ్చితమైన కోణదృష్టి ఉన్నది. అందుకే విమానం ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని ప్రమాదానికి గురయింది.
అదీగాక 28-6-2014 నుంచి యురేనస్ శనీశ్వరుల మధ్యన ఖచ్చితమైన షష్టాష్టక దృష్టి నెలకొని ఉన్నది.కనుక ఘోరమైన హటాత్ ప్రమాదాలు జరిగే అవకాశం బలంగా ఏర్పడింది.శనీశ్వరుడు వాయుతత్వ రాశిలోనూ యురేనస్ జలతత్వ రాశిలోనూ ఉండటం వల్ల ఈ రెండు మహాభూతాలకు చెందిన ప్రమాదాలే జరుగుతున్నాయి.ఈ యోగం వల్ల ప్రమాదాలలో పొగమంచు ఎదురుగా ఉండటమూ,వానల వల్ల ల్యాండింగ్ కుదరక పోవడమూ మొదలైన ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.తైవాన్ విమాన ప్రమాదంలో జరిగింది అదే.

యురేనస్ శనీశ్వరుల మధ్యన జూన్ 26 నుంచీ కొనసాగుతున్న ఖచ్చితమైన షష్టాష్టక స్థితి వీటన్నిటికీ అతి ముఖ్యమైన కారణం.ఆషాఢ మాసమూ,అమావాస్య ప్రభావమూ,శుక్ర నెప్ట్యూన్ల మధ్య ఖచ్చితమైన దృష్టీ,శనిరాహుకుజుల విచిత్ర శపితయోగమూ ఈ వారంలో జరిగిన అన్ని ప్రమాదాలకూ అసలైన కారణాలు.

ఒక గ్రహస్థితి వల్ల ఇదంతా జరగలేదు.అనేక యోగాలు ఆ సమయానికి కూడి వచ్చి ఒక compounding effect గా రూపుదిద్దుకున్నాయి.ఆ సామూహిక గ్రహప్రభావం వల్ల ఈ సామూహిక జనహననమూ దుర్ఘటనలూ జరిగాయి.చూచారా ఎంత విచిత్రంగా సరిపోయిందో?

మనల్ని గమనిస్తూ,మన కర్మలకు తగినట్లు ఫలితాలను ఇస్తున్న శక్తి ఒకటున్నదని ఇదంతా చూస్తుంటే అర్ధం కావడం లేదూ?అలా అర్ధమైతే జ్యోతిష్య శాస్త్రపు ప్రయోజనాల్లో ఒకటి నెరవేరినట్లే.

చాలామంది 'వీటిని ముందుగా తెలుసుకుంటే తప్పించుకోవచ్చు కదా!' అనుకుంటారు.

అలా సాధ్యం కాదు.తెలుసుకున్నంత మాత్రాన అన్నీ తప్పవు.కర్మలలో తేడాలున్నాయి.అన్ని కర్మలూ ఒకటి కావు.ధృఢకర్మ అయినప్పుడు అది తప్పదు.మిగిలిన కర్మలను మాత్రమే తప్పించగలం.

అందుకే కొన్ని జాతకాలలో -'నీకు ఎన్ని రెమెడీలు చేసినా ప్రయోజనం లేదు.అనుభవించక తప్పదు.కనీసం ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా కొత్తకర్మ పోగుచేసుకోకుండా ప్రస్తుతకర్మను శరణాగత భావంతో సమర్పణాభావంతో అనుభవించు' అని చెబుతూ ఉంటాను.

ఇంతకంటే ఆ జాతకాల్లో మార్గం ఉండదు.పూర్వకర్మ అతి బలీయంగా ఉన్నప్పుడు ఫలితం నుంచి తప్పుకుందామంటే అది సాధ్యమయ్యే పని కాదు.కొన్ని కర్మలను అనుభవించవలసిందే.చేసేటప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి చేసి,ఫలితం వచ్చే సమయానికి తప్పుకుంటాను అంటే ఊరుకోడానికి ప్రకృతి పిచ్చిది కాదు.

ప్రపంచం మారుమూలల్లో ఎక్కడ ఎలా దాక్కున్నా ధృఢకర్మను ఎవ్వరూ తప్పించుకోలేరు.అది వెంటాడి వేటాడుతుంది.అందుకే మన పెద్దవాళ్ళు అంటారు.

"కర్మ చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యండి.ఎవరికీ హాని చెయ్యకండి.మనం ఏం చేసినా పరవాలేదు,ప్రస్తుతానికి మన పబ్బం గడిస్తే చాలు అని ఎప్పుడూ అనుకోకండి.మీ కర్మ పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్కక్షణం ఆలోచించి కర్మ చెయ్యండి.మనల్ని గమనిస్తున్న శక్తి ఒకటున్నది.దాని నుంచి మీరు తప్పుకోలేరు" అని.

మన భారతీయ కర్మసిద్ధాంతం(ఈ పదం నాకు నచ్చకపోయినా ఇంతకంటే మంచి పదం దొరకక దీనిని వాడుతున్నాను) యొక్క మహత్యం ఇదే.

పై యోగాల వల్లా,గ్రహప్రభావాల వల్లా ఈ వారం భయానకమైన విమాన ప్రమాదాలు జరిగాయి అన్నది అసలైన సత్యం.
read more " విమానయాన రంగానికి అత్యంత చెడు వారం "

26, జులై 2014, శనివారం

లెవల్ క్రాసింగ్ గేట్ల ప్రమాదాలకు బాధ్యత రైల్వే శాఖదా? వాహన డ్రైవర్లదా?

UMLCG (unmanned level crossing gates) వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇవి ఇప్పటివి కావు.ఎన్నో ఏళ్ళనుంచీ జరుగుతూనే ఉన్నాయి.నేను గత 15 ఏళ్ళుగా వీటిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను. ఎన్నో యాక్సిడెంట్ స్పాట్స్ ను నేను ప్రత్యక్షంగా చూచాను.అక్కడ ఏమి జరిగిందో గమనించే అవకాశం నాకు కలిగింది.ఆ పరిశీలన నుంచి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను.

ప్రమాదం జరిగిన ప్రతిసారీ పత్రికలు తప్పు ప్రచారం చేస్తున్నాయి.రైల్వేశాఖ నిర్లక్ష్యం అంటూ పెద్దపెద్ద టైటిల్స్ పెట్టి అదే నిజం అని జనాన్ని నమ్మిస్తున్నాయి.

ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం.

"రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్" అనేదానిని మన మీడియా నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

నేను రైల్వేశాఖలో ఉన్నందువల్ల దానిని సమర్ధించడం లేదు.ఒక పౌరుడిగానూ ఒక ఉద్యోగి గానూ ఈ ప్రమాదాలను రెండు కోణాలనుంచీ స్పష్టంగా పరిశీలించే అవకాశం నాకు ఉన్నది.ఆ పరిశీలన నుంచి కొన్ని విషయాలు చెబుతున్నాను.

ఇటువంటి ప్రమాదాలు జరగడానికి కారణాలయ్యే కొన్ని విషయాలను ఇప్పుడు చెప్తాను.నేను చెబుతున్నవి ఊహించి వ్రాస్తున్నవి కావు.

ప్రతి కేసునూ నా అనుభవంలో చూచి వ్రాస్తున్నానని మర్చిపోకండి.

అనవసరమైన తొందర

మనం రోడ్డు మీద పోయేటప్పుడు ఒక విచిత్రాన్ని గమనించవచ్చు. అదేమంటే 'అనవసరమైన తొందర'.

ఇది ప్రతివాడినీ ఆవహించి నడిపిస్తున్నది.పక్కవాడు ఏదో పనిమీద పోతూ మనల్ని దాటి వెళతాడు. 'వాడిపనిమీద వాడు పోతున్నాడులే' అని మనం ఊరుకోం.పక్కవాడు మనల్ని ఓవర్ టేక్ చెయ్యడం మనకొక ఈగో సమస్య అవుతుంది.ఇక రోడ్ రేస్ మొదలౌతుంది.దీనిని నేను అనేకసార్లు ప్రత్యక్షంగా గమనించాను.

ప్రతివాడూ ఏదో కొంప మునిగిపోతున్నట్లు పరుగులే.తీరా చూస్తె హడావుడిగా డ్రైవ్ చేసి గమ్యం చేరినదానికీ హడావుడి లేకుండా ప్రశాంతంగా గమ్యం చేరినదానికీ ఒక అయిదు నిముషాలో లేక పది నిముషాలో మాత్రమే తేడా ఉంటుంది.అంతే.

ఈ అయిదు నిముషాలలో ఆ ముందు చేరినవాడు చేసేది ఏమీ ఉండదు.కానీ ఈలోపల 'పానిక్ డ్రైవింగ్' లో ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం చేరే 'గమ్యమే' మారిపోతుంది.అది ఆస్పత్రి కావచ్చు లేదా యమలోకమే కావచ్చు.

డ్రైవింగ్ లోనే కాదు.ప్రతిదానిలోనూ ఈ ర్యాట్ రేస్ పెరిగిపోయింది.ఇదే కొంప ముంచుతున్నది.నేను ఎన్నో పాత పోస్ట్ లలో వ్రాశాను.రైల్వే గేట్ల దగ్గర ప్రమాదాలు ఎలా జరుగుతాయో స్పష్టంగా వివరించాను.అతి తొందరపాటూ నిర్లక్ష్యాలే ప్రమాదాలకు కారణాలని ఎన్నోసార్లు చెప్పాను.

వాహనాల అహంకారం

కొన్నిసార్లు ఇంకో వింతను గమనించవచ్చు.వాహనాలకు అహంకారం ఉండకపోయినా వాటి ఓనర్లకూ డ్రైవర్లకూ ఉంటుంది.దీనివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి.

ముందు మారుతీ పోతూ ఉంటుంది.వెనుక వోక్స్ వాగెన్ వస్తూ ఉంటుంది.ఆ యజమాని "రెస్పాన్సిబుల్ డ్రైవింగ్" చేస్తున్నప్పటికీ అతని భార్యో కూతురో కొడుకో వెక్కిరిస్తారు.

"ఏంటి? ఇంత చేతగానితనం?ముందు మారుతీ పోతుంటే దాన్ని ఓవర్ టేక్ చెయ్యలేవా? ఇంత నెమ్మదిగా పోయేవాడివి ఇన్ని లక్షలు పోసి ఇదెందుకు కొన్నావ్?కమాన్ తొక్కు" అంటారు.

రోడ్ రేస్ మొదలౌతుంది.

ఆ క్రమంలో ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది.మన అవసరం కొద్దీ మనం స్పీడ్ పోవాలా?లేక ఎదుటి వాడిని చూచి అవసరం ఉన్నా లేకున్నా వాత పెట్టుకోవాలా? అన్న విచక్షణ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణం అవుతుంది.

ప్రభావితం చేస్తున్న సినిమాలు టీవీలు

ఈ ప్రమాదాలలో ఎవరు చనిపోయినా కూడా,కారకులు మాత్రం రోడ్డు వాహనం నడుపుతున్న డ్రైవర్లే.ఆ డ్రైవర్లు అందరూ ఎక్కువగా 20 నుంచి 30 లోపల వయస్సు వాళ్ళే ఉంటున్నారు.ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు నేటి సినిమాలనుంచి తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు.

అదేదో సినిమాలో హీరో ఇలాగే చేస్తూ,రైలు స్పీడుగా వస్తున్నపుడు ఆ ట్రాక్ ను ఒక్క సెకన్ తేడాతో దాటి అవతలకి పోతాడట.అదొక ఘనకార్యం!!అది చూచి మన కుర్రకారు చాలామంది అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.ఇది నమ్మలేని నిజం.కాని నేను విన్నాను.

పల్లెల్లో పనిలేని సమయాలలో వాళ్ళు ఆడే ఆటలు కాసుకునే పందాలు చాలా విచిత్రంగా ఉంటాయి.పేకాట వంటి ఆటలు సరే.అవి పాతతరం వాళ్ళు ఆడుకునే అమాయకపు ఆటలు.ఇప్పటి కుర్రకారు ఆడే ఆటలు వేరుగా ఉంటున్నాయి.

రైలు వస్తున్నపుడు దానిని అతి దగ్గరనుంచి తప్పుకొని అవతలకు పోవాలి.ఇదొక ఆట.చాలా పల్లెల్లో ఈ ఆటను కుర్రకారు ఆడుతున్నారంటే అది కూడా పందేలు కాసుకుని మరీ ఆడుతున్నారంటే మీరు నమ్మగలరా?నమ్మలేరు.కాని ఇది నిజం.చేతిలో ఆడుతున్న డబ్బూ,చూస్తున్న సినిమాలూ,ఇంటర్ నెట్ వీడియోలూ యువత ఆలోచనలను వెర్రితలలు వేయిస్తున్నాయి.

ట్రాక్టర్లో కూలి జనాన్ని తీసుకుని ఒక డ్రైవరు పోతుంటాడు.లెవల్ క్రాసింగ్ గేట్ దగ్గర రైలు రావడం దూరంనుంచి కనిపిస్తూనే ఉంటుంది.అది చెవులు చిల్లులు పడేలా కూత పెడుతూనే ఉంటుంది.ఇంతలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కన ఒకడు కూచుని ఉంటాడు.మన ఆటో డ్రైవర్లకూ ట్రాక్టర్ డ్రైవర్లకూ డ్రైవింగ్ సీట్లో అటూఇటూ ద్వారపాలకుల లాగా ఇద్దరు కూచుని ఉంటారు.అంటే డ్రైవింగ్ చేస్తున్నది ఒక్కడు కాదు.ముగ్గురు.

ఆ ఇద్దరూ పందాలు కాస్తారు.రైలు వచ్చేలోపు మనం దాటి పోగలం అని ఒకరూ,పోలేం అని ఒకరూ.ఇంకేముంది మన డ్రైవర్ హీరోకి సినిమాహీరో ఆవేశిస్తాడు.వీరావేశంతో యాక్సిలరేటర్ గట్టిగా తొక్కుతాడు.కాని తనకు వర్టికల్ గా వస్తున్న రైలు స్పీడునూ  అక్కడి ట్రాక్ గ్రేడియంట్ నూ అతను అంచనా వెయ్యలేడు.

అతను అనుకున్న సమయం కంటే ముందే రైలు వచ్చి విరుచుకు పడుతుంది.ఈలోపల ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న కూలిజనం హాహాకారాలు చేస్తుంటారు.చివరిక్షణంలో తన జడ్జ్ మెంట్ తప్పు అని గ్రహించి ట్రాక్టర్ నుంచి దూకేసి ప్రాణం కాపాడుకుంటాడు డ్రైవర్.కూలిజనం అందరూ ఆహుతి అయిపోతారు.లేదా తను కూడా వారితో బాటు ముక్కలై పోతాడు.

ఇది కల్పన కాదు.నిజంగా జరిగిన ఒక సంఘటన.ఆ ప్రమాదంలో బయట పడిన ఒకడు ఆస్పత్రి బెడ్ లో ఏడుస్తూ నాకే చెప్పిన నిజమైన సంఘటన.

కళ్ళు చెవులు మూసుకుని వాదిస్తూ పాటలు పాడుకుంటూ డ్రైవ్ చెయ్యడం

ఏసి కార్లో ఒక కుటుంబం పోతూ ఉంటుంది.రాత్రి సమయం.చీకటిగా ఉంటుంది.పల్లెల మధ్యన ఒక రైల్వే గేటు వస్తుంది.దగ్గరకు వస్తున్న రైలు హెడ్ లైట్ కాంతి ఒక అరకిలోమీటరు దూరం పడుతూ ఉంటుంది.రైలు డ్రైవరు కొడుతున్న హారన్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరం వరకూ ఉన్న పల్లెలను నిద్ర లేపుతూ ఉంటుంది.కాని ఇవేవీ ఆ కారు తోలుతున్న యజమానికి వినిపించవు.కనిపించవు.కారణం?

ఏసీ కోసం కారు అద్దాలు వేసుకుని ఉంటారు.స్టీరియోలో క్రేజీ ఐటం సాంగ్స్ ఫుల్ సౌండ్ లో వినిపిస్తూ ఉంటాయి.దానికి తోడు పక్కనే ఉన్న భార్యతో వాదన నడుస్తూ ఉంటుంది.అంత హోరులో అతనికి రైలు డ్రైవర్ కిలోమీటర్ దూరంనుంచీ కొడుతూ వస్తున్న హారన్ ఎలా వినిపిస్తుంది?మనస్సు యాజిటేటెడ్ మూడ్ లో ఉంటుంది.వెనక సీట్లో ఉన్న పిల్లలు బిక్కుబిక్కు మంటూ ఇదంతా చూస్తూ ఉంటారు.కారు పూర్తిగా గేట్లోకి ఎక్కిన తర్వాత మీదకొచ్చిన రైలు కనిపిస్తుంది.అప్పుడు ఇంక చెయ్యడానికి ఏమీ ఉండదు.చూస్తున్న రైలు డ్రైవరూ అసిస్టెంట్ డ్రైవరుకూ మాత్రం పై ప్రాణాలు పైనే పోయినంత పని అవుతుంది.

ఇదీ కల్పన కాదు.నిజంగా జరిగిన సంఘటనే.

రూల్స్ ను పట్టించుకోక పోవడం

రైలు గేట్లు పెట్టలేదు అంటారు.కాని పెట్టినచోట ఎంతమంది అక్కడ ఆగుతున్నారు? రైలు రావడం కనిపిస్తున్నప్పటికీ గేటుకింద నుంచి దూరి అవతలకు పోయే మోటార్ సైక్లిష్టులూ స్కూటరిష్టులూ సైకిళ్ళవారూ నడిచి దూరేవారూ ఎంతోమంది ప్రతిచోటా ఉన్నారు.ఈ విషయాన్ని ప్రతివారూ ప్రతిచోటా కళ్ళారా చూడవచ్చు.ఎందుకంత తొందర?ఈ తొందరే ప్రాణాలు తీస్తుందని ఎప్పుడు గ్రహిస్తారు?

ఎక్కువసేపు గేటు మూసి ఉంచిన చోట్ల జనం తిరగబడి రైలు వస్తున్నా సరే గేటు తియ్యమని గేట్ కాపలాదారు మీద దౌర్జన్యం చేసిన సంఘటనలు ఉన్నాయి.గేటు కిందనుంచి దూరి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించినందుకు అతన్ని కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి.

మన దేశంలో రూల్స్ ను పాటించకపోవడం ఒక దినచర్య అయిపోయింది. తనంతట తానుగా వాటిని పాటించేవాడు ఒక పిచ్చివాడుగా చూడబడే స్థాయికి జనాల మనస్తత్వాలు దిగజారిపోయాయి. 

అలవాటైన దారి

ఆటో డ్రైవర్లూ ట్రాక్టర్ డ్రైవర్లే ఎక్కువగా లెవల్ క్రాసింగ్ గేట్లలో ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు.దానికి కారణం అలవాటైన గేటు కావడం.రోజూ ఆ గేట్లోంచి ఒక యాభైసార్లు అటూఇటూ తిరిగే ఆటోలూ ట్రాక్టర్ల డ్రైవర్లకు అది మామూలు విషయం అయిపోతుంది.కనుక గేట్ దగ్గరకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండరు.ప్రమాదం అనేది రోజుకు పదిసార్లు జరగదు.ఎప్పుడో ఒకసారే జరుగుతుంది.ఎన్నోసార్లు అది తప్పిపోయి ఉంటుంది.కాని ఆ డ్రైవర్లకు బుద్ధి రాదు.చివరకు అదే గేటులో ప్రాణం పోగొట్టుకుంటారు.

అలవాటైన దారేగా అనుకొని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే ఆ దారే యమలోకానికి దారి చూపుతుంది.

యమవాహనాలు

వేలం వెర్రిగా నేడు అమ్ముడౌతున్న 350 CC బైకులూ 500  CC బైకులూ స్పోర్ట్స్ మోడల్సూ మన ఇండియా రోడ్లకు అస్సలు పనికిరావు. అడుగడుగునా గుంటలతో నిండిన రోడ్లూ,ట్రాఫిక్ రూల్సు అస్సలు పాటించని మూర్ఖులైన మనుషులూ ఉన్న దేశంలో ఇలాంటి హైస్పీడ్ బైకులు అవసరమా?

దీనికి కారణాలు మళ్ళీ మన సినిమాలూ ఆయా ప్రోడక్ట్స్ ను కొనమని ప్రోత్సహించే యాడ్ లే.

యాడ్ లో హీరో ఒక స్పోర్ట్స్ బైకు నడుపుతూ,వెనుక తన వీపుమీద ఉప్పెక్కినట్లుగా కూచుని ఉన్న హీరోయిన్ను మోసుకుంటూ,ఏ అమెరికా రోడ్లమీదో యూరప్ కొండలలోనో న్యూజిలాండ్ లోయల్లోనో రయ్యిమని పోతూ ఉంటాడు.

మన కుర్రకారు అది చూస్తారు.

ఇంకేముంది??

ఆ బైకు తనకూ కావాలి.తన కాలేజి గర్ల్ ఫ్రెండ్ ను అలా వెనుక కూచోబెట్టుకుని గుంతరోడ్లతో నిండిన తన సిటీలోనో టౌన్ లోనో తనుకూడా అలా రయ్యిమని దూసుకుపోవాలి అన్న దుగ్ధ మొదలౌతుంది.తల్లిదండ్రులు కూడా దానికి వంత పాడుతారు.

'అబ్బాయి టెన్త్ పాసయ్యాడుగా పాపం కొనిపెట్టండీ'- అని ముద్దుగా అడిగే భార్య.గారం చేసే కొడుకు.ఆ తండ్రి ఇంకేం చేస్తాడు.వెంటనే ఆ బైక్ ఇంటిముందు ప్రత్యక్షం అవుతుంది.

ఒక వారంలోపల పత్రికలో వార్తగా ఆ అబ్బాయి మిగిలిపోతాడు.ఇలాంటి బైక్స్ ని నేను 'యమవాహనాలు' అంటాను.వాటి డిజైన్ కూడా యముని దున్నపోతు లాగే భయంకరంగా ఉంటుంది.దానిమీద ఎక్కి పోతుంటే యముడి దున్నపోతు మీద ఎక్కికూచున్నట్లే ఉంటుంది.సినిమా ఫీల్డ్ తో సహా ఎన్నో రంగాలలో ఈ బైక్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నేను చెప్పక్కర్లేదు.అందరికీ తెలుసు.

ఇలాంటి స్పోర్ట్స్ బైక్ లు పిల్లలకు కొనిపెడుతున్న తల్లిదండ్రులు ఒక్క విషయం గుర్తుంచుకోండి.మీ పిల్లలకు మీరే యమలోకానికి టికెట్ కొని ఇస్తున్నారు.ఇది మర్చిపోకండి.

సెల్ ఫోన్ డ్రైవింగ్

సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యడం ఇంకొక కారణం.

చాలామంది కారు డ్రైవర్లూ బైక్ నడిపేవారూ  ఇలా చేస్తూ ఉంటారు.మొన్న జరిగిన మూసాయిపేట గేట్ ప్రమాదంలో కూడా బస్సు డ్రైవరు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నాడు.

స్కూలు పిల్లలు పెద్దగా అరుస్తూ - 'అంకుల్ రైలు వస్తున్నది,రైలు వస్తున్నది'- అంటూ ఎంత హెచ్చరించినా పట్టించుకోలేదు.

ఈ సమయంలో నేను ప్రత్యక్షంగా చూచిన ఒక సంఘటన  గుర్తుకు వస్తున్నది.

నా కళ్ళముందే గుంటూరులో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది.ఒక కాలేజీ స్టూడెంట్ ఇలాంటి బైక్ ఒకటి నడుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఇంకొక బైక్ ను గుద్ది కిందపడిపోయాడు.కాని కిందపడినా కూడా సెల్ ఫోన్ ను వదలలేదు. అలా మాట్లాడుతూనే లేచి నిలబడి దెబ్బలు సవరించుకుంటూ ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు.

రోడ్డు మీద పోతున్న వారు బైక్ ను లేపి నిలబెడితే అప్పుడు దానిమీద కెక్కి,వాళ్ళవైపు తిరిగి 'థాంక్స్' అని చెప్పి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూనే బైక్ స్టార్ట్ చేసుకుని అదొక హీరోయిజం అన్నట్లుగా వెళ్ళిపోయాడు.ఆ మాట్లాడే వాలకాన్ని బట్టి అవతల ఉన్న వ్యక్తి ఎవరో చూస్తున్న మాకందరికీ అర్ధం అయిపోయింది.అది అతని గరల్ ఫ్రెండ్.ఆ మైకంలో తనకు యాక్సిడెంట్ అయిన సంగతి కూడా వాడికి పట్టడం లేదు.

ఇంజనీరింగ్ చదివే అబ్బాయిలు స్త్రీల మెడలలో బంగారు గొలుసులు దొంగిలించే చెయిన్ స్నాచర్స్ గా ఎందుకు మారుతున్నారు?తమ తమ గరల్ ఫ్రెండ్స్ ను హోటల్స్ కు తిప్పడానికీ వారికి ఖరీదైన గిఫ్ట్ లు కొనడానికీ ఇతర సరదాల కోసమూ వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు.కాలేజీ అమ్మాయిలు కొంతమంది కాల్ గరల్స్ గా ఎందుకు మారుతున్నారు?ఫాస్ట్ లైఫ్ కు అలవాటు పడి ఆ ఖర్చులకోసం డబ్బు కోసం అలా మారుతున్నారు.ఇవి నమ్మలేని నిజాలు.కాని నిజాలే.

రోడ్ ఇండికేషన్స్ ను పట్టించుకోక పోవడం.

రైల్వే లెవల్ క్రాసింగ్ గెట్ వస్తున్న అరకిలోమీటరు ముందుగానే గేట్ ఇండికేషన్ బోర్డులు ఉంటాయి.స్పీడ్ బ్రేకర్ ఇండికేషన్ బోర్డులు ఉంటాయి.గేట్ ముందు స్పీడ్ బ్రేకర్లూ ఉంటాయి.రాత్రి పూట అయితే రెట్రో రిఫ్లెక్టివ్ బోర్డులు మెరుస్తూ ఉంటాయి.రైలు ఇంజను హెడ్ లైట్ రాత్రి పూట ఒక అరకిలోమీటరు దూరం వరకూ ఫోకస్ అవుతూ ఉంటుంది.ఇంజన్ హారన్ అయితే చుట్టుపక్కల అయిదు కిలోమీటర్ల వరకూ అన్ని పల్లెలనూ నిద్రలేపుతూ ఉంటుంది.

ఇన్ని కనిపిస్తున్నా కూడా వేటినీ లెక్క చెయ్యకుండా నేనొచ్చి చావు నోట్లో పడతాను.దానికి రైల్వేవారిదే బాధ్యత అంటే అది వినడానికి ఎంత విడ్డూరంగా ఉంటుంది?

నేను ప్రత్యక్షంగా చూచిన ఒక సంఘటన

ఒకసారి సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా నేను ఇంజన్ లో ప్రయాణం చేస్తూ ఉన్నాను.అది పగటి పూటే.100 కిమీ వేగంతో రైలు పోతున్నది.డ్రైవరూ అసిస్టెంట్ డ్రైవరూ గుడ్లప్పగించి ట్రాక్ నూ సిగ్నల్స్ నూ చూస్తూ రైలును పోనిస్తున్నారు.ఆ సమయంలో వాళ్ళు ధ్యానంలో ఉన్న ఒక తపస్విలాగా ఉంటారు.అంత ఏకాగ్రత వారికి ఉంటుంది.

ఇంతలో వారి దగ్గర ఉన్న చార్ట్ ప్రకారం ఇంకొక రెండు కి.మీ దూరంలో కాపలా లేని లెవల్ క్రాసింగ్ గేట్ ఒకటి రాబోతున్నదని వాళ్ళు గమనించారు.జాగ్రత్తగా స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ,హారన్ మోగిస్తూ గేట్ ను అప్రోచ్ అవుతున్నారు.

ఇంతలో పక్కనే ఉన్న పల్లెలనుంచి ఒక ట్రాక్టర్ గేట్ లోకి వస్తూ మాకు కనిపించింది.ఆ డ్రైవర్ మా రైలును గమనించాడు.కానీ స్పీడ్ ఏమాత్రం తగ్గించకుండా వస్తూనే ఉన్నాడు.బహుశా రైలు వచ్చే లోపల ట్రాక్ దాటి పోవచ్చులే అని అనుకొని ఉంటాడు.చాలామంది అలాగే అనుకుంటారు.

ఒక రోడ్డుమీద మనకు ఎదురుగా వస్తున్న లేదా మనముందు అదే దారిలో పోతున్న వాహనం స్పీడ్ మనం తేలికగా అంచనా వెయ్యవచ్చు.కాని మన దారికి టాంజెంషియల్ గా వేగంగా వస్తున్న వాహనం స్పీడ్ ను మనం అంచనా వెయ్యలేం.ఎందుకంటే, 'టాంజెంషియల్ రిలేటివ్ స్పీడ్' అంచనా వెయ్యడం కష్టం.అలా అంచనా వెయ్యడానికి మన మెదడు అలవాటు పడి ఉండదు.ఆ ట్రాక్టర్ డ్రైవర్ కూడా అలాగే అనుకొని ఉంటాడు.

మా ఇంజన్ డ్రైవర్ ఆపకుండా హారన్ మోగిస్తూనే ఉన్నాడు.సరిగ్గా మేం గేట్లోకి వచ్చేసరికి ఆ ట్రాక్టర్ కూడా గేట్లోకి వచ్చింది.ఇంజన్లోంచి చూస్తున్న నేను యాక్సిడెంట్ అయిపోయిందనే అనుకున్నాను.

'సార్.ట్రాక్టర్ ను కొట్టేశాం!?!' 

అంటూ మా డ్రైవర్ పెద్దగా కేకపెట్టి సీట్లోంచి లేచి నిలబడ్డాడు.అసిస్టెంట్ డ్రైవర్ కూడా పెద్దగా కేకపెట్టాడు.ఒక్కక్షణంపాటు నాకూ ఊపిరి ఆగినంత పని అయింది.తీరా కిటికీ లోంచి చూస్తె,ఇంజన్ను రాసుకుంటూ ట్రాక్టర్ ట్రాలీ వెళ్లి పోయింది.ఇంజన్లో ఉన్న మాకు ప్రాణాలు పోయినంత పని అయింది.కాని ఆ ట్రాక్టర్ ను డ్రైవ్ చేసున్న కుర్రవాడు మాత్రం ఏమీ జరగనట్లు మాకు టాటా చెబుతూ నవ్వుకుంటూ పోతున్నాడు.ఆ ట్రాక్టర్ కున్న మైకులో నుంచి పెద్దగా సినిమా పాటలు వినిపిస్తున్నాయి.

మా ఇంజన్ డ్రైవర్ అయితే ఒక పావుగంట సేపు ఘోరమైన బూతుల్లో ఆ ట్రాక్టర్ వాడిని తిడుతూనే ఉన్నాడు.అప్పటికి గాని అతని దడ తగ్గలేదు.

ఇలా ఉంటాయి వాస్తవ సంఘటనలు.

ఇలాంటివి నేను ఎన్నో చూచాను.

ఏం చెయ్యాలి?

కాపలా లేని లెవల్ క్రాసింగ్ వచ్చినపుడు ఇలా చెయ్యాలి.

1.ముందుగా వాహనాన్ని ఆపి కిందకు దిగాలి.

2.ట్రాక్ దగ్గరకు వచ్చి రెండు వైపులా చూచి ఏ రైలూ రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాత వాహనాన్ని ట్రాక్ దాటించాలి.

3.ఒకవేళ ఏ రైలూ దూరం నుంచి కనిపించక పోయినా కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి.అపుడు ఏ ప్రమాదమూ జరగదు.

అలా కాకుండా కిలో మీటర్ దూరం నుంచీ ఎదురుగా వస్తున్న రైలు కనిపిస్తున్నప్పటికీ,ఆపకుండా మోగుతున్న దాని హారన్ వినిపిస్తున్నప్పటికీ,మనం సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ,లేదా యియర్ ఫోన్ లో పాటలు వింటూ,లేదా పక్కన వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ, లేదా గొడవ పడుతూ,లేదా తాగి డ్రైవ్ చేస్తూ ఉంటె ప్రమాదాలు జరగక ఏమౌతాయి?

దానికి రైల్వేశాఖ ఎలా జవాబుదారీ అవుతుంది?

మంచి చెప్పినా వినకుండా ఎగతాళిగా తీసుకునే మనస్తత్వం

రైల్వే సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా మేం ఇలాంటి గేట్ల దగ్గరలో ఉన్న పల్లెలకు కూడా వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడి 'ఎవేర్ నెస్ క్యాంప్' లు పెడుతూ ఉంటాం.వాటిల్లో మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురౌతూ ఉంటాయి.పల్లెల్లో మునుపటి లాగా అమాయకులూ తెలివిలేని పల్లెటూరి బైతులూ ఉన్నారని అనుకోకండి.ప్రస్తుత పల్లెటూళ్ళు పట్నాల కంటే ఘోరంగా కుళ్ళిపోయి ఉన్నాయి.

ఇప్పుడు పల్లెల్లో ఉన్నన్ని సౌకర్యాలూ దురలవాట్లూ వెర్రి వేషాలూ సిటీలలో కూడాలేవు.అక్కడ వారినుంచి పోకిరీ ప్రశ్నలూ,ఎగతాళి మాటలూ, అతి తెలివితో కూడిన ఎత్తిపొడుపులూ మాకు అతి మామూలుగా ఎదురౌతూ ఉంటాయి.

మంచి చెబుతుంటే కూడా వినకుండా ఎగతాళి మాటలతో అదేదో కాలక్షేపంగా తీసుకునే వారికి ఎవరు మాత్రం చెప్పగలరు? తర్వాత కొంతకాలానికి అదే పల్లెదగ్గర అదే గేటులో ఒక ఘోరమైన ప్రమాదం జరుగుతుంది.ఇలా కొన్ని సార్లు జరిగింది.

ఆ ఊరి ప్రెసిడెంటో ఇంకే పెద్దమనిషో అప్పుడు ఇలా అంటాడు.

'సార్.మీరు ఆరోజున వచ్చి మాకు జాగ్రత్తలు చెప్పారు.వీళ్ళు వినలేదు.ఇప్పుడు అదే జరిగింది.' 

ఇలా కొన్ని ఊర్లలో జరిగింది.

మన దురుసుతనమూ,తొందరపాటూ,మూర్ఖత్వమూ,పొగరూ,ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతాయి.

రవాణాశాఖ వారి నిర్లక్ష్యం

నిన్న మూసాయిపేట ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డు రవాణాశాఖ వారు హడావుడిగా తనిఖీలు చేసి దాదాపు 700 డొక్కు స్కూలు బస్సులనూ మినీ వ్యానులనూ స్వాధీనం చేసుకున్నారు.ఈపని ముందే ఎందుకు చేసి ఉండకూడదు?

తమిళనాడులో కొన్నేళ్ళపాటు వాడి పారేసిన డొక్కు బస్సులూ మినీ వ్యానులనూ స్కూలు యాజమాన్యాలు ఇరవైవేలకూ ముప్పైవేలకూ కొనుక్కొస్తారు.వాటి ఇంజన్లు ఎప్పుడో బోరుకు వచ్చి ఉంటాయి.వాటికి బ్రేక్ పవర్ సరిగ్గా ఉండదు.అవి ఇక్కడ మన స్కూలు పిల్లలకు యమవాహనాలై కూచుంటాయి.

వాటికి డ్రైవర్లుగా ట్రాక్టరు నడిపేవాళ్ళూ ఆటోలు నడిపేవాళ్ళూ కుదురుతారు. వాళ్ళు తాగి ఆ బస్సులు నడుపుతూ ఉంటారు.లేకపోతే సెల్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు.లేదా ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు.

ఒక్కొక్కసారి ఆ వ్యానులూ బస్సులూ సరిగ్గా ట్రాక్ మధ్యలోకి వచ్చి అక్కడ కదలకుండా మొరాయిస్తాయి.లేదా వాటి ఇంజన్ అక్కడ ఆఫ్ అయిపోతుంది.ఇలా జరగడం నేను చాలాసార్లు చూచాను.ఇక ప్రమాదాలు జరగక ఏమౌతాయి?

కార్పోరేట్ స్కూల్ ర్యాట్ రేస్

తమ తమ పిల్లల్ని ఇలాంటి స్కూళ్ళలో చేర్చే తల్లి దండ్రులకు అంత శ్రద్ధ ఎలాగూ ఉండదు.ఆ స్కూళ్ళు ఎలాంటి బస్సులు నడుపుతున్నాయి?ఎలాంటి డ్రైవర్లను హైర్ చేస్తున్నాయి? అన్న విషయాలు వాళ్ళు పట్టించుకోరు.అంత తీరిక వారికి ఉండదు.

లక్షలు డొనేషన్లు కట్టి వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో చేర్చడమే గాని ఇలాంటి విషయాలు వాళ్ళు పట్టించుకోరు.ఒకవేళ తల్లిదండ్రులు అడిగినా స్కూలు యాజమాన్యం వారికి జవాబు చెప్పదు.అంతటి బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవరు.

ఇవీ అసలైన కారణాలు

రోడ్డు వాహనాలు కండిషన్లో ఉండవు.

రోడ్లు సరిగ్గా ఉండవు.

డ్రైవర్లకు క్వాలిఫికేషన్లు ఉండవు.

వారిని తనిఖీ చేసే నాధుడూ ఉండడు.

తాగి బండి నడిపినా అడిగేవారు ఉండరు.

రోడ్డు సేఫ్టీ రూల్స్ ఎవరూ పాటించరు.

మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యొద్దంటే వినరు.హెల్మెట్ పెట్టుకొమ్మంటే బాధపడతారు.సీట్ బెల్ట్ కట్టుకొమ్మంటే చికాకు పడతారు.

అందరికీ త్వరత్వరగా ఎదుటివాడిని దాటేసి ఎక్కడికో వెళ్లిపోవాలనే ఆత్రుత.అదెక్కడికో మాత్రం తెలియదు.

కుడీఎడమా ఏమీ చూచుకోరు.ఎటో ఒక వైపునుంచి దూరిపోయి ఎక్కడికో వెళ్ళిపోదామనే ఆత్రం.

రైల్వేగేటు దగ్గర ఒక్కక్షణం పాటు ఆగి,చూచి,తర్వాత దాటుదామని ఎవ్వరికీ తోచదు.రైలు డ్రైవరు చెవులు చిల్లులు పడేలా కొడుతున్న హారన్ సెల్ ఫోన్ పాటల మధ్యలో అస్సలు వినిపించదు.

ఇన్ని కోణాలు ఇందులో ఉన్నపుడు ప్రమాదాలు జరగకపోతే వింత గాని,ఘోరమైన ప్రమాదాలు రోజూ జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు.

నాయకుల జవాబుదారీ రాహిత్యం-ప్లానింగ్ లోపం

ఇకపోతే నాయకుల విషయం చూద్దాం.ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్లకు 'దిగ్భ్రాంతి' కలుగుతూ ఉంటుంది.అది ఎందుకు కలుగుతుందో నాకైతే అర్ధం కాదు.చెయ్యవలసిన పనులు చెయ్యకుండా ఏళ్ళ తరబడి వ్యవహారాన్ని నానబెట్టి,ఏదైనా జరిగినప్పుడు 'దిగ్భ్రాంతి' కలగడం ఏమిటో నాకైతే ఎప్పటికీ అర్ధం కాదు.

నిధుల కొరత-ఓటు బ్యాంక్ రాజకీయాలు- It happens only in India

గత పదేళ్ళ నుంచీ రైల్వే ఫేర్స్ పెరగని దేశం ప్రపంచంలో ఏదైనా ఉంటే అది మన దేశమే.కాని ప్రతి ఏడాదీ అన్ని ధరలూ పెరుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నది.కానీ రైల్వే ఫేర్స్ మాత్రం పెరగకూడదు.పైగా ప్రతి ఏడాదీ ఒక్కొక్క రూపాయి చొప్పున తగ్గుతూ రావాలి.ఇదేమి వింతో నాకైతే అర్ధం కాదు.

రేట్లు పెంచకపోతే ఉన్న ఎస్సెట్స్ ఎలా మెయిన్టెయిన్ అవుతాయి?కొత్త ప్రాజెక్టులకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి?గేట్లలో కాపలా దారులను నియమించడం ఎలా సాధ్యం అవుతుంది?వారికి జీతాలు ఎలా ఇవ్వాలి?

ఒక పక్కన జెనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ కు సహాయం ప్రతి ఏడాదీ తగ్గిపోతున్నది.తమ తమ అంతర్గతమూలాల నుంచి నిధులు సమకూర్చుకొమ్మని(fund generation from internal resources) పార్లమెంట్ రైల్వేలకు చెబుతున్నది.

అక్కడ ఉన్నది మనం ఎన్నుకున్న ఘనత వహించిన ప్రతినిధులే.మొన్న మొన్నటి వరకూ వారు అభివృద్ధిని పక్కన పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలే నడిపారు.ప్రతి ఏడాదీ ఒక్క రూపాయి చొప్పున ఏడేళ్ళ పాటు రేట్లు తగ్గిస్తూ వచ్చారు.వారి ఓట్ల కోసం ప్రజల భద్రతను గాలికొదిలేశారు.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి.వాస్తవిక దృక్పధంలో ఇప్పుడిప్పుడే నడవడం మొదలైంది.ఇన్నాళ్ళూ జరిగిన డామేజి సరిదిద్ద బడటానికి కొంతకాలం తప్పకుండా పడుతుంది.

ఇన్నాళ్ళూ ఓటుబ్యాంకు రాజకీయాలకు అన్ని శాఖల్లాగే రైల్వేశాఖకూడా బలయింది.ఇప్పుడే దానినుంచి బయటకు వస్తున్నది.

సరిపోయినన్ని నిధులు ఇస్తే అన్ని సమస్యలనూ సరిదిద్ది ప్రపంచంలోని ఏ రైల్వేతోనైనా పోటీపడేలా నడిపే సమర్ధులైన అధికారులు ఎందఱో రైల్వేలలో ఉన్నారు.కాని వారి చేతులను రాజకీయులు కట్టేస్తున్నారు.

పాలసీ నిర్ణయాధికారం నిజాయితీ లేని రాజకీయుల వద్ద ఉంటే,ఎంత సమర్ధత ఉన్నా అధికారులు ఏం చెయ్యగలరు?రైల్వేలలో బ్రహ్మాండమైన ఆధునికీకరణ జరగాలంటే ఇప్పటికిప్పుడు వేలకోట్లు కావాలి.రేట్లు పెంచకుండా,జెనరల్ బడ్జెట్ నుంచి సహాయం లేకుండా,అవెక్కడనుంచి వస్తాయి?

రేట్లు మాత్రం పెరగకూడదు,వ్యవస్థ మాత్రం అల్ట్రా మోడరన్ గా మారిపోవాలి అంటే ఎలా సాధ్యం?నిధులివ్వకుండా అభివృద్ధి కావాలంటే ఎలా?

'అవ్వా కావాలి బువ్వా కావాలి'-అంటే ఎలా సాధ్యమౌతుంది?

అస్థిరమైన ప్రజాభిప్రాయం

అసలే మన దేశంలో ప్రజలకు 'షార్ట్ మెమరీ' చాలా ఎక్కువ.

ఈరోజు జరిగినది రేపటికి మర్చిపోవడం మన అలవాటు.

మళ్ళీ కొత్తన్యూస్ కోసం ఎదురు చూడటం ఇంకో పాడు అలవాటు.

పాత సంఘటనల నుంచి ఏమీ నేర్చుకోకపోవడం ఇంకో మహాచెడ్డ అలవాటు.

నాయకులు ప్రజలకు జవాబుదారీ కాకపోవడం ఇక్కడ రివాజు.

లంచాలు మరిగిన అధికారులు ఎక్కడా తనిఖీలు చెయ్యకుండా అన్నింటినీ చూస్తూ ఊరుకోవడం ఇంకొక అలవాటు.

ఏదైనా జరిగినప్పుడు ఎవరిమీదో ఒకరి మీద బురద చల్లేసి అసలు సమస్య ఎక్కడుంది? దానిని ఎలా పరిష్కరించాలి? అన్నవి వదిలేసి దానిని ఒక సెన్సేషన్ గా వాడుకోవడం మన మీడియాకు అలవాటు.

ఇన్ని మంచి అలవాట్లున్న సమాజం ఎలా బాగుపడుతుంది?

అలా బాగుపడాలని ఆశించడమే అసలు తప్పేమో?
read more " లెవల్ క్రాసింగ్ గేట్ల ప్రమాదాలకు బాధ్యత రైల్వే శాఖదా? వాహన డ్రైవర్లదా? "