“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, మే 2014, శుక్రవారం

కాంతిపధంలో....

లోకపు వేసట కావల
శోకపు దారుల కావల
అంతులేని కాంతిసీమ
రారమ్మని పిలుస్తోంది

ఇంద్రధనుసు అంచులలో
జారుబండపై జారుచు
దూరపు లోకాల చేర
ఆహ్వానం అందుతోంది

నీలపు నింగిని తేలుచు
విశ్వపుటంచుల తాకగ
వీనుల విందగు విన్నప
మొక్కటి రమ్మని పిలిచింది

నక్షత్రపు మండలాల
సువిశాలపు వీధులలో
విశ్రాంతిగ నడవమనెడు
పిలుపొక్కటి అందుతోంది

సౌరమండలపు అంచుల
మౌనసీమలను జారే
నాదపు జలపాతంలో
స్నానమాడ మనసైంది

నన్ను నేను మరచిపోయి
నిశ్శబ్దపు నిశిదారిని
నింగి అంచులను దాటగ
నిష్ఠ ఒకటి సలుపుతోంది

దేహదాస్య శృంఖలాల
తెంచుకొనే శుభఘడియల 
దైన్యతలెల్లను తీర్చెడు
లాస్యమొకటి విరుస్తోంది

క్షుద్రలోక మాయలొసగు
రొచ్చునంత అధిగమించి
నిద్రలేని సీమలలో
స్వచ్చత రమ్మంటోంది

వెలుగు సంద్రమున దూకి
సుడిగుండపు లోతులలో
విశ్వపు మూలాన్ని చేర
వింత కోర్కె మొదలైంది

దేహపంజరాన్ని వీడి
ఆకాశపు దారులలో
స్వేచ్చమీర తేలాలని
కాంక్ష కనులు తెరుస్తోంది

కాంతిలోన కాంతినగుచు
వెలుగు తెరల వెల్లువలో
విశ్వంలో కరగాలని
వెర్రి మనసు వెదుకుతోంది

చీకటి సంద్రపు లోతుల
అంతులేని వెలుగుసీమ
ఆహ్వానాన్నందిస్తూ
చెయ్యి సాచి పిలుస్తోంది

యుగయుగాల వెదుకులాట
అంతమయే ఘడియలలో
నిశ్చల చేతనమొక్కటి
నింగినంటి వెలుగుతోంది
read more " కాంతిపధంలో.... "

29, మే 2014, గురువారం

కాలజ్ఞానం 23-జ్యేష్టమాసం 2014 ఫలితాలు

నిన్న రాత్రి 00-11 నిముషాలకు న్యూడిల్లీలో జ్యేష్ట శుక్ల పాడ్యమి మొదలైంది.ఈ సమయం ఆధారంగా దేశానికి ఈనెల ఎలా ఉండబోతున్నదో చూద్దాం.

స్వాతంత్ర్య లగ్నానికి మకరం నవమం అవడం వల్ల ఈ నెల అంతా విదేశీ వ్యవహారాలతోనూ దానికి సంబంధించి ఇతరదేశాలతో విధాన సర్దుబాట్ల తోనూ సరిపోతుంది.

హోరానాధుడు కుజుడు కావడం ఆయన నవమంలో ఉండటం కూడా దీనినే బలపరుస్తున్నది.

మన దేశంలో కూడా ధార్మిక విషయాలపైన దృష్టి కేంద్రీకృతమౌతుంది. ధార్మిక విషయాలంటే దేశాన్ని ప్రక్షాళన చెయ్యడం,గంగానదిని ప్రక్షాళన చెయ్యడం,ధార్మిక సంస్థలను బలోపేతం చెయ్యడం,సంఘంలోని అవినీతిని ప్రక్షాళన చెయ్యడం మొదలైనవి.

మన దేశానికి గంగానది జీవనాడి వంటిది.అది కలుషితం కావడం మొదలైనప్పుడే దేశానికి భ్రష్టత్వం పట్టడం మొదలైంది.ఇన్నాళ్ళూ వచ్చిన ప్రభుత్వాలు ఊరకే మాటలకే పరిమితమైనాయి గాని గంగానదిని ప్రక్షాళన చెయ్యాలన్న పనిని మొదలు పెట్టలేదు.మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యడం గొప్ప మార్పుకు నాంది కాబోతున్నది.

చాలామంది భౌతికవాదులకు గంగానది ఒక మామూలు నీటిగుంట కావచ్చు. కాని భారతీయుల ధార్మికవిశ్వాసం వేరు.యుగయుగాలుగా కోట్లాదిజనుల ధార్మికవిశ్వాసాలకు గంగానది కేంద్రబిందువుగా ఉంటున్నది. అలాంటి పవిత్రనది కుళ్ళుగుంటగా మారడం వెనుక మార్మికమైన అర్ధాలే కాదు.కోట్లాది జనుల నీచమైన కర్మలూ సూచితం అవుతున్నాయి.ఇన్నాళ్ళకు గంగానది శుభ్రపడబోతున్నది.అంటే దేశం కూడా బాగుపడబోతున్నది అని అర్ధం.ఏ దేశమైనా తన ధార్మికవిశ్వాసాలను పునాదిగా కలిగి ఉన్నపుడే పురోగమించ గలుగుతుంది.

నాలుగింట శుక్రకేతువుల వల్ల
ప్రభుత్వానికి సోకాల్డ్ కుహనా మేధావులతో చుక్కెదురు అవుతుంది. ప్రభుత్వం ఏది చేయ్యబోయినా దేశాన్ని కాషాయీకరణం చేస్తున్నారు అన్న గోలను ఈ కుహనామేధావులు రేకెత్తిస్తారు.వారి వెనుక దేశ వ్యతిరేకశక్తులు పని చేస్తూ ఉంటాయి.

ప్రజలలో కూడా కొంత అనిశ్చితి ఏర్పడుతుంది.కొత్త ప్రభుత్వంమీద కొంత నమ్మకమూ కొంత భయమూ ఏర్పడుతూ ఉంటాయి.

అయిదింట రవిచంద్రులవల్ల
ప్రతిపక్షాలూ దుష్టశక్తులూ కలసి చేసే దుష్ప్రచారాన్ని ప్రభుత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టగలుగుతుంది.ప్రభుత్వం తీసుకుంటున్న వేగమైన చర్యలవల్ల దేశంలో మేధోమధనం ప్రారంభమౌతుంది.జూన్ ఎనిమిదో తేదీన ఈ మార్పులను స్పష్టంగా చూడవచ్చు.

నక్షత్రనాధుడు చంద్రుడు పంచమంలో ఉండటం వల్ల మేధోపరమైన విధాన నిర్ణయాలు తీసుకోబడతాయి అనీ అవి చాలామందికి నచ్చినా నచ్చకపోయినా దేశానికి మంచి చేసేవి అయి ఉంటాయనీ సూచన ఉన్నది.

ఆరింట గురుబుధులు
కార్మిక,కమ్యూనికేషన్ రంగాలలో వేగమైన విధాననిర్ణయాలు తీసుకోబడతాయి.యధావిధిగా కుహనా మేధావులతో ప్రభుత్వానికి విరోధం ఏర్పడుతుంది.కానీ అంతిమంగా ప్రభుత్వానిదే విజయం అవుతుంది.

నవమంలో కుజుడు
ప్రజలకు చాలా మేలు జరిగే నిర్ణయాలు తీసుకోబడతాయి.ఆర్ధికరంగంలో ఆశాజనకమైన మార్పులకు దారితీసే చర్యలకు శ్రీకారం చుట్టబడుతుంది.షేర్ మార్కెట్ లాభపడుతుంది.శత్రుదేశాలనుంచి కుట్రలు మొదలౌతాయి.

విదీశీ వ్యవహారాలలో మన దేశానికి స్పష్టమైన శక్తివంతమైన వైఖరి ప్రారంభం అవుతుంది.ఇతర దేశాలకు మనమంటే భయమూ గౌరవమూ పెరగడం ప్రారంభం అవుతుంది.

పదింట రాహు శనులు
పరిపాలన ఎత్తులకు పైఎత్తులతో ముందుకు సాగుతుంది.ప్రతిపక్షాలకు మింగుడు పడని గట్టి నిర్ణయాలు తీసుకోబడతాయి.ఏ నిర్ణయాలు తీసుకోబడినా అవి ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి.

ఇప్పుడు జ్యేష్టమాసంలో మన ఆంద్రరాష్ట్రం ఎలా ఉండబోతున్నదో చూద్దాం. సామాన్యంగా దేశానికీ రాష్ట్రానికీ మాసకుండలి ఒకే విధంగా ఉంటుంది.అయితే ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నగరానికి లగ్నం మారింది.కనుక రాష్ట్రం వరకూ మాసఫలితాలు వేరుగా ఉండబోతున్నాయి.అవి ఏమిటో చూద్దాం.

స్వతంత్రలగ్నానికి మాసలగ్నం దశమలగ్నం వల్ల ఈ నెల అంతా రాష్ట్రంలో పరిపాలనా సంబంధ విషయాలు చక్కదిద్దుకోవడమే సరిపోతుంది.

మూడింట శుక్రకేతువుల వల్ల రాష్ట్రవిభజన ప్రక్రియ వేగవంతం అయ్యేకొద్దీ ప్రజలు అనేకమందిలో,ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు భయాందోళనలు పెరుగుతాయి.ధైర్యం సన్నగిల్లుతుంది.

నాలుగింట రవిచంద్రులవల్ల
చాలామందిలో,ముఖ్యంగా హైదరాబాద్ వాసులలో నైరాశ్యమూ అయోమయమూ భయమూ ఎక్కువౌతాయి.జూన్ ఎనిమిదికి ఈ ఆందోళనలు ఊపందుకుంటాయి.వాటికి కారణాలు కూడా ఉంటాయి.

అయిదింట గురుబుదులవల్ల
ప్ర్రజలకు ఒకవైపు ఆశా ఇంకొకవైపు భయమూ ముప్పిరిగొంటాయి.కొంత లాభమూ కొంత నష్టమూ ఎదురుగా దర్శనమిస్తుంటాయి.ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని అయోమయం ఎదురౌతుంది.

ఎనిమిదింట కుజునివల్ల
ప్రజలలో భయం ఎక్కువౌతుంది.అనైతిక కోరికలూ కార్యకలాపాలూ పెరిగిపోతాయి.ఆవేశమూ దూకుడు ఎక్కువైపోతాయి. కొత్త ప్రభుత్వాలు పని చేసే తీరులో అనేక అనిశ్చితులూ గందరగోళాలూ మొదలౌతాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలౌతుంది.ముందుముందు ఇదంతా జరుగుతుంది అని ఇంతకు ముందే కొన్ని పోస్ట్ లలో వ్రాశాను.కావలసిన వారు పాతపోస్ట్ లు ఒకసారి తిరగెయ్యండి.రాష్ట్రవిభజన అనేది సమస్యలకు అంతంకాదు -- ఆరంభం మాత్రమే.

తొమ్మిదింట రాహు శనులవల్ల
మతపరమైన విచ్చిన్నకర దుష్టశక్తుల ప్లానులు ఎక్కువౌతాయి.రాష్ట్ర విభజన పరంగా కొత్తరాష్ట్రాలలో వారి కార్యకలాపాలు ఎలా ఉండాలో ప్లానులు వెయ్యబడతాయి.

కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలుచేసే సహాయాలు అందుతాయి.
read more " కాలజ్ఞానం 23-జ్యేష్టమాసం 2014 ఫలితాలు "

26, మే 2014, సోమవారం

పోగొట్టుకున్న బంగారు గాజు - ప్రశ్నతంత్రం ఏం చెప్పింది?-(1)

ఈ మధ్య మాకు తెలిసిన ఒకామె తన బంగారు గాజును పోగొట్టుకుంది.

ఒక ఫంక్షన్లో దానిని తన చేతినుంచి తీసి ఎందుకో హేండ్ బేగ్ లో ఉంచింది.ఆ తర్వాత దాని గురించి మరచిపోయింది.కొన్నాళ్ళ తర్వాత గుర్తొచ్చి దానికోసం వెదికితే అది బ్యాగ్ లో లేదు.

దానివిలువ లక్షరూపాయలు ఉంటుంది.

ఎక్కడ వెదికినా దొరకలేదు.

'గాజు ఏమైందో కొంచం చూచి చెప్పన్నయ్యా?' అని నన్ను అడిగింది.

నాకు చెల్లెళ్ళు లేరు.కులాలు వేరైనా ఆమెను నా చెల్లెలిగా భావిస్తాను.ఆమె కూడా నన్ను 'అన్నయ్యా' అంటూ ప్రేమగా పిలుస్తుంది. 

ప్రశ్నకుండలి వేసి చూచాను.

చూస్తున్నపుడే నాకు ఒక పాత సంఘటన గుర్తొచ్చింది.

మా అమ్మగారి వద్ద 'అంజనవిద్య' ఉండేది.తమిళనాడులోని ఒక గురువుగారు కాటుకవంటి ఒకదానిని భరిణలో పెట్టి ఇచ్చి ఒక మంత్రం ఉపదేశించి ఆ విద్యను ఎలా వాడాలో మా అమ్మగారికి ఉపదేశం చేశారు.ఆ కాటుకను కొన్ని మూలికలతో ఆయనే తయారు చేసేవారు.అప్పట్లో ఆయన పేరు 'భగవాన్ అనంత' అనేవారు.ఆయన అమ్మవారి ఉపాసకుడు.ఆయన ఆశ్రమం కావేరీ తీరంలో ఉండేది.ఈ విషయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది.

అంజన విధానం ఇలా ఉంటుంది.

ముందుగా కొంత పూజాతతంగం ఉంటుంది. దాని తర్వాత ఆ కాటుకను ఒక చిన్నపిల్ల చేతి బొటనవేలి గోటికి పూయాలి. ఆ చిన్నపిల్లకు పదేళ్ళలోపు వయసు ఉండాలి.ఆ పిల్ల ఎవరైనా కావచ్చు. ఇంకా చిన్నతనం మాత్రం ఉండాలి.అంటే అబద్దాలు చెప్పకుండా చూస్తున్నదానిని ఉన్నదున్నట్లు చెప్పే వయసులో ఉండాలన్నమాట.

ఆ పిల్లను గోటిమీద పూసిన కాటుకలోకి చూస్తూ ఉండమని చెప్పాలి. అప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తూ అక్కడ కూచుంటే,ఆ పిల్లకు గోటిమీద 'టీవీతెర' లాగా విషయం కనిపించడం మొదలౌతుంది.అప్పుడు మనం అడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి సమాధానాలు చెబుతూ ఉంటుంది.జరిగిన జరుగుతున్న జరగబోయిన దేనికైనా జవాబులు వచ్చేవి.ఒకవేళ మనుషుల ప్రదేశాల పేర్లు కావాలంటే అక్షరాల రూపంలో కనిపించేవి.చూచేవారికి తెలిసిన భాషలో(అది ఏ భాష అయినా కావచ్చు) ఆ అక్షరాలు కనిపిస్తాయి.

ఈ అంజనం వేసిన ప్రతిసారీ ఒకే రకంగా ఆ దృశ్యం మొదలౌతుంది.చూచే చిన్నపిల్లలు మాటమాటకీ వేర్వేరుగా ఉండేవారు గాని కనిపించే దృశ్యం మాత్రం ఒకటే ఉంటుంది.ఎందుకంటే ప్రతిసారీ వాళ్ళు ఆ గోటిలో ఒకే సీన్ కనిపిస్తున్నదని చెప్పేవారు.

ముందుగా ఒక నల్లని స్త్రీ వచ్చి ఒకచోట ఊడ్చి కడిగి ముగ్గు వేస్తుంది.ఆ తర్వాత అక్కడ ఒక సింహాసనం వేస్తుంది.అప్పుడు అందులో ఆంజనేయస్వామి వచ్చి ఆసీనుడౌతాడు.ఆమె ఒక నల్లని జెండా పట్టుకుని అక్కడే ఒకపక్కగా నిలబడి ఉంటుంది.ఇక మనం ప్రశ్నలు అడుగవచ్చు. 

మనం అడగరాని కొంటెప్రశ్నలు అడిగినా,అసందర్భపు ప్రశ్నలు అడిగినా జవాబు రాదు.ఆంజనేయస్వామి గుడ్లెర్రజేసి కోపంగా చూస్తూ జాగ్రత్త అన్నట్లుగా తోక చూపిస్తాడు.మన ప్రేలాపన ఇంకా అలాగే కొనసాగిస్తే,కనిపించే దృశ్యం మాయమై పోతుంది.ఇక ఏమీ కనిపించదు.

ఆ నల్లని స్త్రీ ఎవరని మా అమ్మగారిని నేను చిన్నప్పుడు అడిగాను.

ఆమె పేరు 'నీలపతాక' అని ఆమె అన్నారు.ఆమె పేరు దేవీ ఖడ్గమాలలో వస్తుంది.ఆమె నిత్యాదేవతలలో ఒకరని,ఈ అంజనవిద్యకు ఆమె అధిష్టాన దేవత అని మా అమ్మగారు చెప్పినారు.

ఈ విద్య ఖడ్గమాలా దేవతలకూ హనుమత్ ఉపాసనకూ సంబంధించిన విచిత్ర ఉపాసన.

అయితే ఈ విద్యకు చాలా నియమ నిబంధనలుండేవి. ఉదాహరణకు, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ ఆర్తుడు వచ్చి అడిగినా 'ఇప్పుడు కాదు.నేను చూడను.తర్వాత రా' అని చెప్పకూడదు.

అప్పటికప్పుడు తలస్నానం చేసి అంజనక్రియను ప్రారంభం చెయ్యాలి.అబద్దం చెప్పకూడదు.డబ్బు కావాలని అడుగకూడదు.గ్రహణ సమయంలోనూ ఇతర పర్వదినాలలోనూ నిష్టగా ఉండి లెక్కప్రకారం ఇన్నివేలు అని ఆ మంత్రాన్ని జపం చెయ్యాలి.ఇక ఆహార నియమం సంగతి చెప్పనక్కర్లేదు. ఇలా చాలా కట్టుబాట్లు ఉండేవి.మొత్తంమీద దీనిని చేసేవారికి సోషల్ లైఫూ,ఫేమిలీ లైఫూ చాలా దెబ్బతినేది.

చాలామంది వచ్చి ఈ అంజనవిద్య వల్ల ఉపయోగం పొందేవారు.

ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి మా బంధువుల ఇంటిలో పెళ్లి సమయంలో ఒకరి బంగారు గొలుసు పోయింది.పాతకాలంలో పెళ్ళిళ్ళలో ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరిగేవి.కామన్ బాత్రూంలో స్నానం చేసేటప్పుడు బంగారు ఆభరణాలు తీసి అక్కడపెట్టి హడావుడిలో స్నానం చేసి వాటిని మర్చిపోయి బయటకి వచ్చేసేవారు.ఆ తర్వాత చూస్తే అవి ఉండేవి కావు.ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరిగేవి.అలాగే లగేజిని కామన్ గా ఒక రూం లో ఉంచినప్పుడూ ఇలాంటి సంఘటనలు జరిగేవి.

దానిని తీసినవారు ఎవరు? అని అంజనం వెయ్యవలసి వచ్చింది.

అడిగాక తప్పదు గనుక మా అమ్మగారు అంజనం వేసి చూచారు.

ఆ చూస్తున్న చిన్నపిల్ల చెప్పిన ప్రకారం -- ఒక స్త్రీ ఆ గొలుసు ఉన్న గదిలోకి వచ్చి పెట్టె తెరచి ఆ గొలుసు తీసుకుంటున్నదని చెప్పింది.

ఆమె పేరు ఏమిటి? అని ప్రశ్నించడం జరిగింది.

ఫలానా పేరు అని తెరమీద కనిపించగా ఆ అమ్మాయి బయటకు చదివింది.

వీళ్ళకు ఇంకా అనుమానం పోక- 'ఆమె ఎలా ఉంటుంది'? అని ప్రశ్నించారు.

ఆ అమ్మాయి వర్ణించింది.

ఇంకా నమ్మకం కుదరక-'గొలుసు పోగొట్టుకున్న ఆమెకు ఈమె ఏమౌతుంది?' అని అడిగారు.

ఆ బంధుత్వం కూడా తెరమీద కనిపిస్తే చూస్తున్న చిన్నపిల్ల చదివి చెప్పింది.

వినేవాళ్ళు నోరెళ్ళబెట్టారు.

ఇంతా చేస్తే దొంగతనం చేసినది ఎవరో కాదు.ఆ గొలుసును పోగొట్టుకున్న వ్యక్తి తోడికోడలు.ఆమె కట్టుకున్న చీర రంగూ,మనిషి పోలికలూ,పేరూ అన్నీ సరిపోయాయి.పైగా జరిగిన సంఘటననూ అక్కడి పరిసరాలనూ ఆ అమ్మాయి కళ్ళకు కట్టినట్లు వర్ణించింది.

"మమ్మల్ని దొంగలను చేస్తారా?" అంటూ ఇక కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.అవి ఎంతవరకూ పోయాయంటే బంధువులు ముఖముఖాలు చూచుకోవడం కూడా మానేసేటంత వరకూ దారితీశాయి. కొన్ని నెలలపాటు ఆ భార్యాభర్తల మధ్యన మాటలు లేవు.

కాని కొన్నాళ్ళ తర్వాత ఆ గొలుసు ఆమె దగ్గరే దొరికింది.

అయితే 'అదే గొలుసని గ్యారంటీ ఏముంది? మేము కూడా ఇలాంటిదే కొనుక్కున్నాం' అని వాళ్ళు బుకాయించారు.

ఇదంతా చూచి మా అమ్మగారికి విసుగు పుట్టి ఆ విద్యను ఉపయోగించడం మానేశారు.నా చిన్నప్పుడు ఆ విద్యను నాకు చెప్పమని ఎంతో బ్రతిమాలాను.

కాని ఆమె ఒప్పుకోలేదు.

'దీనివల్ల చాలా గొడవలు వస్తాయి.వద్దు' అనేవారు.

అలా ఆ విద్య ఆమెతోనే అంతరించిపోయింది.

ప్రస్తుత ప్రశ్నకుండలిని గమనిస్తున్నపుడు ఎప్పుడో జరిగిన ఈ సంఘటన నాకు గుర్తుకు వచ్చింది.

ఎందుకంటే ఈ బంగారుగాజును తీసినది దగ్గర బంధువుల అమ్మాయే.

ఈ సంగతి ఆమెతో ఎలా చెప్పాలి?

చెబితే ఇంటిలో తప్పకుండా గొడవలు అవుతాయి.

చెప్పకుండా ఎలా ఉండాలి?

చెప్పకపోతే అసత్యదోషం చుట్టుకుంటుంది.

అన్నీ సమస్యలే.

మా అమ్మగారిని మనస్సులో తలచుకుని నమస్కరించి--'మీ గాజు దొరకదు.దాని గురించి మర్చిపోండి' అని మాత్రం చెప్పాను.

ఆమె ఏమేమో ప్రశ్నలు అడిగినా ఇంక నేనేమీ జవాబులు చెప్పలేదు.

ఆమె తృప్తికోసం--'ఎల్లుండి ఒకసారి ఇల్లంతా వెదకండి దొరకవచ్చు.' అనిమాత్రం చెప్పాను.

ఆ మాత్రం అబద్దం చెప్పినందుకే నాకు దారుణమైన రియాక్షన్ వచ్చింది.దానిఫలితంగా ఒక వారం రోజులపాటు బాధపడవలసి వచ్చింది.

ఇంతకీ ఈ నిర్ణయానికి ఎలా రాగలిగాను?ప్రశ్నచక్ర విశ్లేషణ ఎలా చేశాను? అన్నది తర్వాతి పోస్ట్ లో చూడండి.
read more " పోగొట్టుకున్న బంగారు గాజు - ప్రశ్నతంత్రం ఏం చెప్పింది?-(1) "

25, మే 2014, ఆదివారం

బ్రతుకు నిలబెట్టిన జ్యోతిష్యం

ఈ మధ్యనే జరిగిన ఒక సంగతి.

నాకు తెలిసిన ఒక నాయకుడు మొన్నటి ఎలక్షన్లలో పోటీ చేద్దామని ఒకానొక పార్టీ టికెట్ కోసం తెగ ప్రయత్నం చేశాడు.చేస్తే చేశాడు.ఎలక్షన్లలో గెలుస్తానా లేదా అని మధ్యలో నన్నడిగాడు.

అతనికి మొదట్లో జ్యోతిష్యం అంటే నమ్మకం ఉండేదికాదు.జ్యోతిష్యాన్ని తెగ విమర్శించేవాడు.కాని అతని జీవితంలో రెండేళ్ళ నాడు జరిగిన ఒక సంఘటనతో అతనికి జ్యోతిష్యశాస్త్రం అంటే నమ్మకం ఏర్పడింది.రెండేళ్ళ క్రితం ఉత్త కుతూహలంతో నన్ను కలిశాడు.మా సంభాషణ అంతా అతను జ్యోతిష్య శాస్త్రాన్ని విమర్శించడమూ నేను వింటూ మౌనంగా ఉండటమే సరిపోయింది. లాజికల్ గా చేసే చర్చలతో ఇలాంటి వాటిని రుజువు చెయ్యలేమని నాకు తెలుసు.

అందుకే వినీ వినీ చివరకు ఇలా చెప్పాను.

'ఇదంతా ఎందుకు గాని,మీ జాతకవివరాలు ఇవ్వండి.కొన్ని విషయాలు చెబుతాను.అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది'

అతని వివరాలు చూచి గతంలో జరిగిన కొన్ని సంఘటనలు అతనికి చెప్పాను.

అవి సరిపోవడంతో అతనికి సగం నమ్మకం కుదిరింది.

'గతాన్ని చాలామంది చెబుతారు.మా స్నేహితులు వైదీశ్వరన్ కోయిల్ వెళ్లి చెప్పించుకున్నారు.అక్కడి నాడీ జ్యోతిష్కులు వాళ్లకు గతమంతా బాగా చెప్పారు.కాని భవిష్యత్తు మాత్రం వాళ్ళు చెప్పినట్లు ఏమీ జరగలేదు' అన్నాడు.

సరే చూద్దామని కొద్ది నెలలలో జరగబోయే కొన్ని సంఘటనలు అతనికి చెప్పాను.తీసుకోవలసిన జాగ్రత్తలూ చెప్పాను.

అవి అలాగే జరగడంతో అతనికి అప్పుడు నమ్మకం కుదిరింది.ఇక ప్రతిదానికీ నన్ను సంప్రదించడం మొదలు పెట్టాడు.

అతివృష్టి అనావృష్టిలాగ చాలామంది ఇంతే చేస్తారు.నమ్మకపోతే అసలు నమ్మరు.నమ్మితే ఇక అడుగుతీసి అడుగు వెయ్యడానికి జ్యోతిష్యాన్ని సంప్రదిస్తారు.నా దృష్టిలో రెండూ తప్పే.జ్యోతిష్యశాస్త్రానికి మనం బానిసలం కాకూడదు.దానిని ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి.అలా వాడుకునే తీర్పరితనం మనలో ఉండాలి.జ్యోతిష్యం అనేది మనలో భయాన్నీ అనుమానాన్నీ పెంచకూడదు.

ఇదంతా గతం.ఇప్పుడు ప్రస్తుతంలోకి వద్దాం.

ఎలక్షన్లలో తనకు ఒక పార్టీ నుంచి టికెట్ వచ్చేలాగా ఉన్నదని అతను చెప్పాడు.కాకపోతే ఇంకొక పోటీదారుడు తనకంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడనీ తనకు పోటీ వస్తున్నాడనీ అతన్ని ఓడించడానికి ఏం చేస్తే బాగుంటుందో చెప్పమనీ అడిగాడు.

'సారీ.నేనిలాంటి రెమేడీలు చెప్పను.అవి చెప్పేవాళ్ళు వేరే చాలామంది ఉంటారు.వాళ్ళను కలవండి' చెప్పాను.

'మరి మీ సలహా ఏమిటి?' అడిగాడు.

'మీరు టికెట్ కోసం ప్రయత్నం చెయ్యవద్దు.విరమించుకొండి.మీ ప్రత్యర్ధినే ఖర్చు పెట్టుకోనివ్వండి.అతన్నే పోటీ చేయ్యనివ్వండి.ప్రస్తుతం  మీకు ఎలక్షన్లలో విజయం లేదు.' అని చెప్పాను.

అయినా వినకుండా 'ఏదైనా రెమెడీ చెప్పమని' అడిగాడు.

నాకు విసుగొచ్చింది.

'ఒక్కోసారి జీవితంలో నష్టంలోనే లాభం ఉంటుంది' అని మాత్రం చెప్పాను.

అతనికి నా సలహా రుచించలేదు.ఇక ఎంత బతిమాలినా నేనేమీ పలకక పోతుంటే అయిష్టంగా వెళ్ళిపోయాడు.

చాలామంది ఇంతే.వాళ్ళ మనసులో మాటను మన నోటివెంట చెప్పిద్దామని చూస్తారు.వాళ్లకు కావలసింది నిజం కాదు.ఒక మానసిక ఆసరా మాత్రమే. వాళ్ళు చేసేది న్యాయమైనా అన్యాయమైనా దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడనే ఒక ధీమా మాత్రమె వాళ్లకు కావాలి.ఇలాంటివారికి జ్యోతిష్యపరంగా సలహాలు ఇవ్వకూడదు.

ఎలక్షన్లు అయిపోయాయి.

ఈ మధ్యనే అతను మళ్ళీ కలిశాడు.

'సార్ మీరు నా జీవితాన్ని నిలబెట్టారు.'అన్నాడు.

నాకర్ధం కాలేదు.

'ఏమైంది' అడిగాను.

'మీ మాట విని ఊరుకోకుండా నా ప్రయత్నం నేను తీవ్రంగా చేశాను. అవసరమైతే ఆస్తులు అమ్మి మరీ ఎలక్షన్లలో ఖర్చు పెడదామని వెళ్లాను. కాని నా ప్రత్యర్ధి మంచి ఆస్తిపరుడు.నాకంటే ఆర్ధికంగా ఇంకా బలంగా ఉన్నాడు.అతనికే పార్టీ టికెట్ వచ్చింది.అతను కూడా ఇల్లూ స్థలాలూ అమ్మి మరీ ఎలక్షన్లలో డబ్బు పంచాడు.కాని చివరికి ఘోరంగా ఓడిపోయాడు.ఆస్తీ పోయింది.ఎలక్షన్లోనూ గెలవలేదు.రెంటికిచెడ్డ రేవడి అయ్యాడు.ఇప్పుడు తలుచుకుంటే నాకు వణుకు పుడుతున్నది.ఒకవేళ నాకే టికెట్ వచ్చి ఉంటె నేనూ అలాగే మొత్తం ఆస్తిని అమ్మి డబ్బు పంచి ఉంటె నా గతి ఏమయ్యేది? నా కుటుంబం రోడ్డున పడి ఉండేది.దేవుడు నన్ను ఇలా రక్షించాడన్న మాట.' అన్నాడు.

'నేను చెప్పాను.మీరే వినలేదు.సరే అంతా మంచికే జరిగింది.సంతోషం' అన్నాను.

'జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది.ఇప్పుడు నమ్ముతున్నాను.' అన్నాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.

అతను ఇంకా పొగుడుతున్నాడు.

ఇక ఇలా కాదని ' సరే.ఇప్పుడు మీకు ఎంత మిగిలింది?' అన్నాను.

'ఆ అదంతా ఎందుకు లెండి' అన్నాడు.

'పరవాలేదు అంతా అయిపొయింది కదా.చెప్పండి.' అడిగాను.

'ఒక పది కోట్లు మిగిలి ఉంటుంది' అన్నాడు.

అతను అబద్దం చెబుతున్నాడనీ అది చాలా తక్కువ మొత్తం అనీ నాకు తెలుసు.

నేను నవ్వి 'మీకు జ్యోతిష్యశాస్త్రం మేలు చేసింది అంటున్నారు కదా.అందులో జస్ట్ రెండు లక్షలు నాకు ఫీజు గా ఇవ్వండి.' అన్నాను.

అతనిలోని రాజకీయ నాయకుడు బయటకొచ్చాడు.

'నాకు టికెట్ రాదనీ,నా ప్రత్యర్ధికి వస్తుందనీ,అతను భయంకరంగా ఖర్చు పెడతాడనీ,కానీ గెలవడనీ మీరు క్లియర్గా చెప్పలేదు కదా.నీకు రాజకీయంగా టైం బాగాలేదు.పోటీ చెయ్యవద్దు అని మాత్రమె చెప్పారు.అలా కాకుండా జరగబోయేదానిని స్పష్టంగా చెప్పి ఉంటె అప్పుడు మీరు ఎంత అడిగితే అంత నేను ఇచ్చేవాడిని' అన్నాడు.

'ఇప్పుడే కదా మీరన్నారు.జ్యోతిష్యశాస్త్రం నా బ్రతుకును నిలబెట్టింది అని? అన్నాను.

'ఏదో మాటవరసకి అన్నాను.అయినా జరగాల్సినది జరుగుతుంది.జరగనిది జరగదు అని రమణమహర్షి అన్నారు కదా?' అన్నాడు వక్రంగా నవ్వుతూ.

రమణమహర్షి పరిస్థితి ఎంత ఘోరంగా తయారైంది!!!ప్రతి అవకాశవాదీ ఆయన్ని ఆసరాగా తీసుకునేవాడే.

'రమణమహర్షి ఆ మాటను నాతో అనలేదు.మీతో అన్నారేమో నాకు తెలియదు.అందుకని ఆ మాట నిజమో కాదో కూడా నేను చెప్పలేను.అదంతా సరేగాని నా రెండు లక్షలు ఎప్పుడిస్తున్నారు.సీరియస్ గా అడుగుతున్నాను.' అన్నాను.

'మీరు భలే జోకులేస్తారు శర్మగారు.సరే వస్తా సార్ పనుంది.' అంటూ అతను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

'పీడా వదిలింది' మనసులో అనుకున్నాను.
read more " బ్రతుకు నిలబెట్టిన జ్యోతిష్యం "

22, మే 2014, గురువారం

నరేంద్రమోడి ప్రమాణస్వీకార కుండలి-ముహూర్త విశ్లేషణ

నూతన ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం 26-5-2014 సాయంత్రం 6 గంటలకు అని వార్తలొస్తున్న నేపధ్యంలో ఈ ముహూర్తాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరికించవలసిన అవసరం కనిపిస్తున్నది.

ఎందుకంటే నరేంద్ర మోడీ మీద దేశం అంతా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నది.స్వర్ణయుగం రాబోతున్నదని ఆశగా ఎదురుచూస్తున్నది.

ప్రమాణస్వీకార ముహూర్తాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.

ఆ సమయానికి వేసిన కుండలి ఆ ప్రమాణస్వీకార కార్యక్రమం ఎంత సజావుగా జరుగుతుంది అన్న విషయాన్ని మాత్రమె సూచిస్తుంది అని కొందరంటారు.

ఇంకొంతమంది ఆ నాయకుని పదవీకాలం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రమే అది సూచిస్తుంది అని నమ్ముతారు.

మూడోవర్గం వారు ఇలా అంటారు. ప్రమాణస్వీకార సమయంలో ఆయన చేసిన ప్రమాణం ఎంతవరకూ నెరవేరుతుంది?ఎంతవరకూ ఆయన దానిని నేరవేర్చగలడు?అన్న విషయాన్ని మాత్రమె ఆ సమయానికి వేసిన కుండలి సూచిస్తుంది అనేది కొందరి అభిప్రాయం.ఇందులో కూడా కొంతనిజం లేకపోలేదు.

సామాన్యంగా ప్రతి ప్రమాణస్వీకార ఉత్సవమూ బాగానే జరుగుతుంది.ఏవో చిన్నచిన్న అపశ్రుతులు అందులో ఉన్నప్పటికీ మొత్తమ్మీద అవి బాగానే ముగుస్తాయి.పైగా ఒక గంటో రెండుగంటలో జరిగే కార్యక్రమం గురించి అంత తల పగలగోట్టుకోవాల్సిన పనిలేదని నా అభిప్రాయం.కనుక ముహూర్త కుండలి ఆ కాస్త కార్యక్రమం వరకే వర్తిస్తుంది అనే నమ్మకం కరెక్ట్ కాదని నేనూ అంటాను.

కనుక రెండవ అభిప్రాయమే సరియైనది అని నాకనిపిస్తుంది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,నరేంద్రమోడీని ప్రధానమంత్రిగా నియమిస్తూ పత్రాన్ని ఆయనకు అందజేసిన సమయమే అసలైన సమయమనీ ఆ సమయానికే కుండలి వేసి చూడాలనీ కొందరి ఊహ.ఇందులో కూడా కొంత నిజం లేకపోలేదు.

నిజానికి ఆ సమయానికే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర చాలు.ప్రమాణస్వీకారం అనేది లాంఛనంగా జరిపే ఒక వేడుక మాత్రమే.అయితే ఆయన రాష్ట్రపతినుంచి ఎన్ని గంటలకు ఆమోద పత్రాన్ని అందుకున్నారో ఖచ్చితంగా తెలియదు.మంగళవారం నాడు పార్లమెంట్ లొ సమావేశం ముగిశాక ఇది జరిగింది.ఉజ్జాయింపుగా లెక్కించవచ్చు.దీనిని ఇంకోసారి పరికిద్దాం.

ఈ విభిన్న అభిప్రాయాల నేపధ్యంలో మన ప్రస్తుత ముహూర్త కుండలి పరిశీలన ప్రారంభిద్దాం.

సంఖ్యా శాస్త్రజ్ఞులు ఇలా అంటున్నారు.

26 అంటే 8

నరేంద్రమోడీ జననతేదీ 17=8

కనుక ఆ రోజున బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు.ఇది ఇంత సింపుల్ గా తేలే వ్యవహారం కాదు.ఒక దేశప్రధాని ప్రమాణ స్వీకారానికి ఇంత చిన్న సమీకరణం చాలదు.ఇంకా చాలా కోణాలలో ఈ ముహూర్తాన్ని గట్టిగా పరిశీలించవలసి ఉంటుంది. 

మన సాంప్రదాయం ప్రకారం ఒక మంచిముహూర్తానికి కొన్ని ప్రాధమిక లక్షణాలుండాలి.ఏకవింశతి(21) మహాదోషాలనేవి లేకుండా ముహూర్తాన్ని ఎన్నుకోవాలని ప్రామాణిక గ్రంధాలు చెబుతున్నాయి.అయితే సర్వలక్షణ సంపన్నమైన ముహూర్తం దొరకడం దుర్లభం గనుక 'అల్పదోషం గుణాధిక్యం' అనే సూత్రాన్ని పాటించి తక్కువ దోషమూ ఎక్కువ మంచీ ఉన్న ముహూర్తాన్ని ఎంచుకోవడం తప్ప మనం ఏమీ చెయ్యలేము.ఎవరైనా చేసేది ఇదే.

అన్నీ మంచి లక్షణాలే ఉన్న మనిషి ఎలాగైతే ఉండడో,అన్ని రకాలుగా ఒకరికొకరు సరిగ్గా సరిపోయిన జంట ఎలాగైతే ఉండదో,అలాగే అన్ని రకాలుగా మంచిగా ఉన్న ముహూర్తమూ దొరకదు.ఎక్కడో ఏదో ఒక లోపం ప్రతి ముహూర్తంలోనూ తప్పకుండా ఉంటుంది.

ఏకవింశతి మహాదోషాలను ప్రస్తుతానికి కొద్దిసేపు పక్కన ఉంచితే,ముందుగా పంచాగములైన తిధి,వార,నక్షత్ర,యోగ,కరణాదులను పరిశీలించాలి.

తిధి=బహుళ త్రయోదశి అయింది.రెండురోజుల్లో అమావాస్య పెట్టుకుని ఈ ముహూర్తం ఎందుకు పెట్టినట్లో అర్ధం కాదు.ఇంకొక నాలుగురోజులు ఆగితే అమావాస్య తర్వాత ఇంకా బాగుండేది.

వారం=సోమవారం అయింది.చంద్రుని పరిస్థితి బాగులేదు కనుక వారబలం లేదు.

నక్షత్రం=భరణి అధిపతి యముడు కనుక ఈ నక్షత్రం శుభకార్యాలకు మంచిది కాదు.కానీ నరేంద్రమోడీ నక్షత్రం అయిన అనూరాధకు ఇది క్షేమతార గనుక పరవాలేదు అనుకోవచ్చు.ఏదో సరిపెట్టుకోవడమే గాని పూర్తిమార్కులు పడవు.

యోగం=శోభనయోగం.మంచిదే.

కరణం=వణిజ కరణం.మంచిదే.

పోతే,సూర్యుడు ఆ రోజునుంచీ రోహిణీ నక్షత్రంలో ఉదయిస్తున్నాడు గనుక చాలామంచిది అని కొంతమంది జ్యోతిష్కులు అంటున్నారు.ఈ ఒక్క పాయింట్ ను బట్టి అది అతిగొప్ప  ముహూర్తం అని నిర్ణయించడం కుదరదు.

ఇక ముహూర్త కుండలిని ఒక్కసారి పరిశీలిద్దాం.

లగ్నవిషయం చూస్తే,ఎక్కువకాలం స్థిరంగా నిలిచి ఉండవలసిన పనులైన ఉద్యోగప్రవేశం,గృహప్రవేశం,వ్యాపారప్రారంభం,పెళ్లి మొదలైన ముహూర్తాలకు స్థిరలగ్నాలైన వృషభ,సింహ,వృశ్చిక,కుంభాలను మాత్రమె ఎన్నుకోవాలి. ఇది ముహూర్తభాగంలో ఒక ప్రాధమికసూత్రం.కానీ ఈ ముహూర్తానికి చరలగ్నమైన తులను ఎన్నుకున్నారు.ఇది మంచిది కాదు.

ఇంతకంటే సింహ లగ్నాన్ని ఎంచుకుంటే ఇంకా బాగుండి ఉండేది.ఇంతకంటే మంచి యోగాలు అప్పుడు ముందుకు వస్తాయి.

లగ్నంలో యోగకారకుడైన శనీశ్వరుడు ఉండటం మంచిదే.రాహువుతో కూడి ఉండటం కొంత దోషం.యోగకారకుడు వక్రించి ఉండటం దోషం.దీనివల్ల క్షణం తీరికలేని ప్లానింగూ,నిరంతర కార్యవ్రగ్రతా ఎత్తులకు పైఎత్తులూ సూచితాలు.

'సమాజంలో అత్యంత పేదవానికోసం ప్రభుత్వం పనిచెయ్యాలి' అని పార్లమెంట్ లో మాట్లాడుతూ నరేంద్రమోడీ చెప్పిన మాటకు లగ్నంలోని చతుర్దాదిపతి అయిన ఉచ్చవక్ర శని స్థితి ఖచ్చితంగా సరిపోతున్నది.

'ప్రతిరోజూ ప్రతిక్షణమూ దేశం కోసం కష్టపడి పనిచేస్తాను' అని మోడీ చెప్పిన మాట శనీశ్వరుని కారకత్వానికి ఇంకాబాగా సరిపోతున్నది.

అయితే లగ్నంలో శని రాహువులు కలసి ఉండటం మంచిది కాదు.దేశంకోసం నరేంద్ర మోడీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందనీ వాటిని అమలు చెయ్యడంలో ఇంకా ఎన్నో అడ్డంకులు ఉంటాయనీ ఎన్నో ప్రతికూల శక్తులను ఆయన ఎదుర్కోవలసి వస్తుందనీ ఈ యోగం సూచిస్తున్నది.

ఎన్ని చెప్పుకున్నా మనం చివరికి నిజం మాట్లాడుకోక తప్పదు.దేశంలో ప్రజలందరూ మంచివాళ్ళూ ఉత్తములూ సంస్కారవంతులూ ఏమీకారు. చాలామంది దగ్గర నల్లధనం విపరీతంగా ఉన్నది.అవకాశం వస్తే ప్రతివాడూ చట్టాన్ని ఉల్లంఘించేవాడే.మన ట్రాఫిక్ రూల్స్ ను ఎందరు పాటిస్తున్నారో గమనిస్తే చాలు.మన ప్రజలకు ఎంత క్రమశిక్షణ ఉన్నదో మనకు చక్కగా అర్ధమైపోతుంది.

మరి ఇలాంటి అవకాశవాద ప్రజలున్న దేశంలో,ఆర్ధిక రంగాన్నిగనుక మోడీ కట్టుదిట్టం చేసి సంఘంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసే కార్యక్రమం మొదలు పెడితే,దానిని ప్రప్రధమంగా వ్యతిరేకించేది ఇదే ప్రజలే అవుతారు.మంచి మాట్లాడితే ప్రజలు వింటారుగాని ఆచరణలోకి వచ్చేసరికి ఎవ్వరూ సహకరించరు.ఇదే మన దేశపు దౌర్భాగ్యం.ఒకవేళ బలప్రయోగం చేస్తే అప్పుడు ప్రజావ్యతిరేకత తప్పకుండా వస్తుంది.

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి.ఒళ్ళు వంచి కష్టపడి పని చెయ్యమని గట్టిగా చెప్పినందుకేగా పదేళ్ళక్రితం చంద్రబాబుకు ఉద్యోగులు వ్యతిరేక ఓటువేసి పదవినుంచి దించేశారు.ఇది నిజమే గనుక దీనిని ఎవరూ కాదనలేరు.కనుక క్రమశిక్షణా నీతీ నేర్పాలంటే వాటిని నేర్చుకోడానికి మన ప్రజలు అంత త్వరగా ముందుకు రారు.లొంగరు.

కనుక అవినీతి ప్రజలకు నీతిని నేర్పడం ప్రస్తుతం నరేంద్రమోడీ ముందున్న అతిపెద్ద సమస్య అని నేనంటాను.ఇంకొక పక్కన,పార్టీలో అవినీతి లేకుండా చూచుకోవడం ఇంకొక పెద్దసమస్య.అధికారం చేతిలోకి వచ్చాక అందులోనూ అడ్డు లేని అధికారం అయినప్పుడు ఎవరు ఎలా మారతారో ఊహించడం కష్టం.నరేంద్రమోడీ నిజాయితీగా ఉండవచ్చు.కాని ఆయన జంబో మంత్రివర్గంలో అందరూ అలాగే ఉంటారంటే అనుమానమే.కనుక ఇంటా బయటా నీతీ నిజాయితీతో కూడిన వాతావరణాన్ని ప్రాదుకొల్పే క్రమంలో ఆయన ఎంతో శ్రమించవలసి ఉంటుంది.

ఇవన్నీ చెయ్యడానికి ఆయన ఎదుర్కొనబోయే ఆటుపోట్లనూ,ఆయన అనుసరించబోయే వ్యూహాలనూ లగ్నంలోని శని రాహువులు సూచిస్తున్నారు.

లగ్నాధిపతి శుక్రుడు సప్తమంలో కేతువుతో కలిసి ఉండటం మంచిది కాదు.దశమాధిపతి క్షీణచంద్రుడు కావడమూ మంచిది కాదు.ఆయన సప్తమంలో ఉండటమూ అంత మంచిసూచన కాదు.దీనివల్ల,ఎప్పుడూ శత్రువులతో యుద్ధమూ,పరిపాలనలో గొడవలూ ఆటుపోట్లూ సూచితాలు.

2,7 అధిపతి కుజుడు ద్వాదశంలో ఉండటం ఒకరకంగా మంచిదే.శత్రువులు ఈయన చేతిలో ఎప్పుడూ ఓడిపోతూ ఉంటారు.కాని ఆర్ధిక రంగానికి మంచిది కాదు.

లాభాదిపతి సూర్యుడు అష్టమంలో ఉండటం దేశానికి మంచిది కాదు.లాభదాయకంగా ఉండదు.ఇలాంటి కార్యక్రమాలకు ప్రధానంగా చతుర్ధ అష్టమశుద్ధిని పరిశీలించాలి.ఇక్కడ చతుర్ధ శుద్ధి ఉన్నది.కాని అష్టమ శుద్ధి లేదు.అదే సింహలగ్నానికి అయితే రెండూ ఉన్నాయి. 

నవమంలో గురుబుధులు ఉండటం మంచిదే.కాని విదేశాలతో విరోధాలు రావచ్చు.అంటే,స్వదేశీ వ్యాపారులను ప్రోత్సహించి విదేశీ వ్యాపారులను కట్టడి చెయ్యడం జరుగవచ్చు.ఇదే గనుక పూర్తిస్థాయిలో జరిగితే విదేశాల నుంచీ MNC ల నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు.

మంచి ముహూర్తానికి ఎప్పుడూ లగ్నబలం ఉండాలి.అలా ఉండాలంటే ఆ పనికి సరిపోయే సరియైన లగ్నాన్ని ఎంచుకోవాలి.అదికూడా వర్గోత్తమం అయి ఉండాలి.ఈ కార్యక్రమానికి ఆ లక్షణాలు సింహలగ్నానికి మాత్రమే మద్యాహ్నం 12.23 నుంచి 12.38 వరకు మాత్రమె ఉన్నాయి.ఆ సమయంలో సింహలగ్నం వర్గోత్తమంగా నిలిచి ఉన్నది.కనుక ఆ సమయంలో ప్రమాణస్వీకార ముహూర్తం ఎంచుకుని ఉంటె బాగా ఉండేది.

అభిజిత్ లగ్నం కావడం కూడా బాగా ఉపయోగపడేది.దీనిని పల్లెటూళ్ళలో 'గడ్డపార(పలుగు)ముహూర్తం' అంటారు.గడ్డపలుగు భూమిలో పాతి దాని నీడ మాయమయ్యే మిట్టమధ్యాహ్న సమయాన్ని మంచి ముహూర్తంగా స్వీకరించడం చాలా పల్లెల్లో ఉన్నది.పాతకాలపు బ్రాహ్మణులు ఈ మంచి అలవాటును పల్లెప్రజలకు చేశారు. దీనివల్ల,పంచాగం చూడటం రానివారు కూడా ఎక్కువ గందరగోళపడకుండా స్థూలమైన ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకోవచ్చు.ఎందుకంటే ఇలా చేసినప్పుడు సూర్యుడు దశమకేంద్రంలో ఉంటాడు.ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుంది.

ఏదేమైనా ఈ ముహూర్తాన్ని ఏ జ్యోతిష్కుడు నిర్ణయించాడో నాకు తెలియదు కాని ఇది అంత మంచిముహూర్తం కాదని నా ఉద్దేశ్యం.ఇంతకంటే మంచి ముహూర్తాన్ని ఆరోజున(ఒకవేళ అదేరోజు కావాలి అనుకుంటే) నిర్ణయించవచ్చు.అది సింహలగ్నం మాత్రమే అవుతుంది.

బీజేపీ వంటి పార్టీకి జ్యోతిష్కులు ఉండరు అంటే నేను నమ్మలేను.వారు మనలాంటి మామూలు జ్యోతిష్కులు కూడా అయి ఉండరు.మంచి పేరుమోసిన వాళ్ళే ఉంటారు.మరి అలాంటి జ్యోతిష్కులు ఇటువంటి ముహూర్తాన్ని ఎందుకు నిర్ణయించారో నాకు అర్ధం కావడం లేదు.

ఇంకొంతమంది ఇంకొక మాట చెబుతున్నారు.ఇది పొలిటికల్ సర్కిల్స్ కోసం పెట్టిన ముహూర్తం మాత్రమె.అసలైన ముహూర్తం మధ్యాహ్నం సింహ లగ్నంలోనే ఉండవచ్చు.అతి కొద్దిమంది సమక్షంలో అది జరుగవచ్చు. సాయంత్రానికి అందరికోసం ఈ ఫంక్షన్ జరుపుతూ ఉండవచ్చు అని కొందరు నాతో అన్నారు.అది కూడా నిజమే కావచ్చు.ఎందుకంటే అధికారపరంగా అత్యున్నతస్థాయిలో ఉన్నవారికి జ్యోతిష్కుల కొదవా సలహాదారుల కొదవా ఉండదు.

మరి అన్నీ తెలిసి ఇలాంటి ముహూర్తానికి ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నారో దానిని ప్లాన్ చేసినవారికే ఎరుక.మనంమాత్రం అంతా మంచే జరగాలని కోరుకుంటూ భవిష్యత్తులో దేశంలో ఏం జరుగబోతున్నదో వేచి చూద్దాం.
read more " నరేంద్రమోడి ప్రమాణస్వీకార కుండలి-ముహూర్త విశ్లేషణ "

20, మే 2014, మంగళవారం

మళ్ళీ వచ్చిన స్వాతంత్ర్యం!!!సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం ఏమంటున్నాయి?

1947 కేలండరూ 2014 కేలండరూ ఒకటేనని నా బ్లాగు చదువరులలో ఒకరు నాకు గుర్తుచేశారు.

పరిశీలించాను.నిజమే.అంటే మనకు మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చిందన్నమాట.

ప్రపంచంలో కాకతాళీయత అంటూ ఏదీ ఉండదు.There is nothing called an accident in the universe అంటారు స్వామి వివేకానంద.మనిషి జీవితంలో గానీ,లోకంలోగానీ జరిగే ప్రతి సంఘటన వెనుకా లోతైన అర్దాలుంటాయి.మామూలు మనుషులకు అర్ధంకాని కర్మ సమ్మేళనాలుంటాయి.ప్రపంచంలో ఏదీ కారణం లేకుండా జరగదు అనేది సనాతనధర్మపు మూలసూత్రాలలో ఒకటి.

నా ఉద్దేశంలో 16-5-2014 మన అసలైన స్వాతంత్రదినోత్సవంగా జరుపుకోవాలి.ఎందుకంటే,స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటిదాకా దేశం రకరకాలైన స్వార్ధపరశక్తుల చేతుల్లోనే ఉన్నది.దేశభక్తుల చేతుల్లోకి మాత్రం ఇప్పుడే నిజంగా వచ్చింది.

మనకు పేరుకు స్వాతంత్రం వచ్చిందికాని నిజానికి రాలేదు.లోపల్లోపల విదేశీశక్తులే మనదేశాన్ని ఇప్పటికీ నడిపిస్తున్నాయి.నల్లదొరల దోపిడీయే ఇప్పటిదాకా జరుగుతోంది. తెల్లదొరల దోపిడీ డైరెక్ట్ గా పోయింది.కానీ వారు తెరవెనుక ఉండి ఏదైనా కాస్తోకూస్తో మిగిలి ఉంటే దానిని మన నల్లదొరల చేత ఇన్ డైరెక్ట్ గా దోపిడీ చేయిస్తున్నారు.

మధ్యమధ్యలో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కొద్దిమంది నిజమైన నాయకులు అధికారంలోకి వచ్చినా కూడా వారికి మెజారిటీ ఇవ్వని దద్దమ్మప్రజలు ఉండటం వల్ల దేశానికి గొప్పమేలు ఏమీ వారు చెయ్యలేకపోయారు.వారికి చిత్తశుద్ధి ఉన్నాకూడా ఉపయోగం లేకపోయింది.

ఇప్పుడు ప్రతిపక్షం అనేదికూడా లేకుండా అఖండమెజారిటీతో నరేంద్రమోడీని గెలిపించడం వల్ల నిజమైన స్వాతంత్రం దేశానికి ఈరోజున వచ్చినట్లైంది.నిజమైన దేశభక్తుల ఆత్మలన్నీ ఇప్పుడు ఆనందంతో స్వర్గంలో పండుగ చేసుకుంటున్నాయి.

ఇప్పుడు కొద్దిగా న్యూమరాలజీ వైపు చూద్దాం.

15-8-1947

6-8-3

17

8

ఈ తేదీనుంచి దాదాపు 68 ఏళ్ళకే ఇప్పుడు ఈ పరిణామం జరగడం గమనార్హం.రెండవ స్టెప్ లో 6-8 ని గమనించవచ్చు.కానీ రూట్ నంబర్ 8 కావడం అంత మంచిది కాదు.8 శనీశ్వరుని అంకె కావడంతో నిరాశా నిస్పృహా ఆలస్యమూ విషాదమే ఫలితంగా వస్తుంది.ఈ అంకె భౌతిక అభివృద్ధికి మంచిది కాదు.అయితే,ఆధ్యాత్మిక అభివృద్ధికి మాత్రం బాగా సహకరిస్తుంది.

మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తేదీని గమనిద్దాం.

16-5-2014

7-5-7

10

1

రూట్ నంబర్ 1 అయింది.ఇది సూర్యునికి సూచిక.ఉజ్జ్వలమైన భవిష్యత్తును ఇది సూచిస్తున్నది.ఎనిమిదికీ ఒకటికీ చుక్కెదురు అవుతుంది.కనుక నిరాశాజనకమైన గతానికి విభిన్నంగా ఇకముందు దేశభవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండబోతున్నదని సూచింపబడుతున్నది.

15-8-1947 అర్ధరాత్రికి దశాఫలితాలు ఏమంటున్నాయో చూద్దాం.

ఆ సమయానికి శని/శని/కేతు/చంద్రదశ జరుగుతున్నది. అంటే, ఆర్ధికరంగమూ,కార్మికరంగమూ నత్తనడక నడుస్తాయనీ,సాధారణంగా దేశపరిస్థితి అంత బాగుండదనీ,ప్రజలకు మానసికచింతా కుంగుబాటూ ఆటుపోట్లూ తప్పవనీ ఈ సమయానికి దశాఫలితాలు సూచిస్తున్నాయి. అలాంటి గొప్ప సమయానికి మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నమాట!!!

అప్పటి ఘనత వహించిన నేతలు ముహూర్తం నిర్ణయించి మరీ అంతగొప్ప సమయానికి కాలసర్పయోగంలో స్వాతంత్ర్యం తెచ్చుకున్నారన్నమాట. దాని ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పటిదాకా మనం చూచాంకదా.నెహ్రూ జ్య్తోతిష్యాన్ని నమ్మేవాడు కాదని అందరూ అనుకుంటారు.కాని ఒక ప్రముఖ జ్యోతిష్కుని వద్ద ఆయన ఇందిరాగాంధీ జాతకాన్ని వేయించాడని రుజువులున్నాయి.అన్నీతెలిసి అంత గొప్ప సమయాన్ని స్వాతంత్ర ముహూర్తంగా నిర్ణయించారు మన నేతలు!!!

ఇకపోతే 16-5-2014 మధ్యాహ్నానికి ఏ దశ జరుగుతున్నదో చూద్దాం.

అప్పుడు బుధ/శుక్ర/గురు/బుధదశ జరుగుతున్నది.దీనినిబట్టి ఆర్ధిక, రవాణా,కమ్యూనికేషన్,కార్మిక,విదేశీ వ్యవహారాల రంగాలలో దేశం ఇకముందు మంచి అభివృద్ధిని సాధించబోతున్నదని సూచిస్తున్నది.ఇది కూడా పొల్లుపోకుండా ఖచ్చితంగా జరగడాన్ని ముందుముందు మనం చూడబోతున్నాం.

ఒకటి మనం అడుక్కుని తెచ్చుకున్న స్వాతంత్ర్యం.ఇంకొకటి దేవుడిచ్చిన స్వాతంత్ర్యం.

మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యం కంటే భగవంతుడిచ్చిన స్వాతంత్ర్యం ఖచ్చితంగా ఎంతో ఉన్నతంగా ఉంటుంది.

ఇకముందునుంచీ  పాత స్వాతంత్ర్యదినోత్సవంతో బాటు ఈ నూతన స్వాతంత్ర్యదినోత్సవాన్ని కూడా జరుపుకుందాం.

జై భారత్.జైహింద్.
read more " మళ్ళీ వచ్చిన స్వాతంత్ర్యం!!!సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం ఏమంటున్నాయి? "

18, మే 2014, ఆదివారం

అంగారకుని వక్రత్యాగం 19-5-2014-ఫలితాలు

కుజుడు లేదా అంగారకుడు ఈ నెల 19 నుంచి రుజుగతి (Direct motion) లోకి రాబోతున్నాడు.ఇన్నాళ్లుగా కుజుడు వక్రగతి (Retrograde motion) లో ఉండి తులారాశినుంచి కన్యలో ప్రవేశించాడు.ప్రస్తుతం కన్యారాశిలో హస్తానక్షత్రం రెండో పాదంలో (నవాంశలో వృషభరాశిలో ఉన్నాడు).వక్రగతిని వదలి రుజుగతిలోకి వస్తున్న కుజుడు 20-5-2014 నుంచి ఏమి ఫలితాలు ఇవ్వబోతున్నాడో ఒకసారి పరిశీలిద్దాం.

కుజుడు శక్తి కారకుడు.శక్తిహస్తుడు.ఏ పని చెయ్యాలన్నా అతని అనుగ్రహం ఉండే తీరాలి.ఆయన స్థితిని బట్టి పనులు స్తంభించి పోవడమో కదలడమో నిర్ణయింపబడుతుంది.ఇన్నాళ్ళూ ఆయన పరిస్థితి బాగాలేదు.ఇప్పుడు రుజుగతి మొదలు కావడం క్రమేణా వేగాన్ని పుంజుకోవడం వల్ల ప్రభుత్వ,ప్రజా రంగాలలో అనేక వేగమైన మార్పులను మనం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

ఈ గ్రహచలనం వల్ల ముఖ్యంగా రాబోయే మార్పు ఒకటుంది.అది అనేకమంది జీవితాలలో ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది.అది ఏవిధంగా ఉండబోతున్నదో ఇప్పుడు చూద్దాం.

చాలామందికి కొన్ని నెలలుగా ఏ పనులూ ముందుకు కదలక ఆగిపోయి ఉంటాయి.అలాంటి వారు ఆయా పనులలో ఇప్పుడు కదలికను గమనించవచ్చు.కొందరికి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొద్ది నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశ కనిపించడం మొదలౌతుంది.కొంతమందికి ఈ సందర్భంగా స్థానచలనం ఉంటుంది.

కొంతమంది కొన్ని నెలలుగా పరాయి ప్రాంతానికి వెళ్లి ఉండవలసిన పరిస్తితి ఉంటుంది.అది ఉద్యోగరీత్యా కావచ్చు,వ్యాపార రీత్యా కావచ్చు,చదువు రీత్యా కావచ్చు.అలాంటివారు మళ్ళీ ఇప్పుడు స్వస్థలానికి తిరిగివచ్చే సూచనలున్నాయి.

ఎన్నో రంగాలలో పనులు చకచకా కదలడం ఈరోజునుంచి ప్రత్యక్షంగా గమనించవచ్చు.ఇది నేను ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అనడం లేదు.కుజుని వక్రత్యాగాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమె చెబుతున్నాను.

కేంద్రంలో పాతప్రభుత్వం మూటా ముల్లె సర్దుకొని ఇంటిదారి పట్టడమూ,కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టడమూ ఇప్పుడే మొదలు కావడం గమనార్హం. అంతేకాదు ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం తెరమీదకు రావడమూ రాజధాని నిర్ణయమూ ఉద్యోగుల బదిలీ మొదలైన అనేక విషయాలు ఇక చకచకా కదులుతాయి.

పాత వ్యవస్థను ప్రక్షాలన చేసి కొత్తదనాన్ని నింపే దిశలో పరిస్థితులను ఈ కుజగ్రహపు స్థితిమార్పు మొదలు పెట్టిస్తుంది.నవాంశలో మన స్వాతంత్ర్య లగ్నమైన వృషభంలో కుజుని స్థితివల్ల మన దేశం మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.దానికి సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి కదా.అమెరికాకు ఇది ద్వాదశం కావడం వల్ల మనదేశం పట్ల ఆ దేశం తాత్సార ధోరణి వదలిపెట్టి ఓపెన్ గా కలిసి పనిచెయ్యడానికి ముందుకు రావలసిన పరిస్తితిని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది.ఉన్నట్టుండి నరేంద్రమోడీ మీద అమెరికాకు పుట్టుకొచ్చిన ప్రేమకు ఈ గ్రహస్తితే కారణం.

భూమిమీద జరిగే ఏ ముఖ్యమైన పనులకైనా గ్రహముల స్థితిగతులు ఖచ్చితంగా కోరిలేట్ అవుతాయి అనడానికి ఇదే నిదర్శనం.లేకుంటే ఇప్పటిదాకా ఊరుకుని,ఇప్పుడే ఈ పనులన్నింటిలో కదలిక రావడానికి కారణం ఏమిటి?అది సరిగ్గా కుజుని వక్రత్యాగతేదీకి ఖచ్చితంగా సరిపోవడం ఏమిటి? చూచే దృష్టితో చూస్తే అన్నీ అర్ధం చేసుకోవచ్చు.

కానీ కొన్ని నెగటివ్ సంఘటనలు కూడా ఇప్పుడు జరుగుతాయి.ముఖ్యంగా ఎవరి జాతకాల్లో అయితే కుజుడు ఆత్మకారకుడో లేదా లగ్నాదిపతియో లేదా ఇతర ముఖ్యవిషయాలకు కారకుడో వారు ఈరోజు రేపూ జాగ్రత్తగా ఉండాలి.వారికి ఆరోగ్య సమస్యలూ ఆటంకాలూ ఉన్నట్టుండి ఈ రెండురోజుల్లో తలెత్తుతాయి.ఎందుకంటే వక్రస్తితిని వదలి డైరెక్ట్ మోషన్ లోకి రాబోయే ముందు గ్రహములు స్తంభన(immobile)స్థితిలోకి వస్తాయి.కనుక ఈ రెండురోజుల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి.కాని ఆ తర్వాత 20 వ తేదీనుంచి అవన్నీ తగ్గిపోతాయి.

చంద్రునిదైన హస్తానక్షత్రంలో ఇది జరుగుతున్నది.చంద్రుడు సహజ చతుర్దాదిపతి.కనుక ప్రజాభిప్రాయం చాలా వేగంగా ఇప్పుడు మారబోతున్నది. వారి ఆలోచనలలో మంచి మార్పులు ఇప్పుడు వస్తాయి.ఇప్పటివరకూ అర్ధంకాని గందరగోళ మానసిక స్థితిలో ఉన్నవారికి ఇప్పుడు క్లారిటీ తో కూడిన ఆలోచనలు మొదలౌతాయి. 

స్తంభించిపోయి కదలకుండా విసుగు పుట్టిస్తున్న అనేక పనులను కుజుని వక్రత్యాగం చాలా వేగంగా మొదలుపెట్టిస్తుంది.ఈ పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలలో 20 వ తేదీనుంచి అందరూ వీక్షించవచ్చు.
read more " అంగారకుని వక్రత్యాగం 19-5-2014-ఫలితాలు "

17, మే 2014, శనివారం

స్వతంత్రం వచ్చిన 66 ఏళ్ళకు దేశానికి అసలైన ప్రధాని నరేంద్రమోడీ

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66 ఏళ్ళు గడిచాయి.

ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మాత్రమే దేశానికి అసలైన సిసలైన ప్రధానమంత్రి వచ్చాడని నా ఉద్దేశ్యం.అదికూడా మంచి మెజారిటీతో.ఇంతకుముందు వాజపేయి సమర్ధమైన పాలనను అందించాడు.కాని ఆయనకు మెజారిటీ లేదు.

మనకు ఇప్పటిదాకా వచ్చిన ప్రధాన మంత్రులలో కొద్దిమందినే నేను అసలైన నాయకులుగా లేక్కిస్తాను.వారు లాల్ బహదూర్ శాస్త్రి,వాజపేయి,పీవీ నరసింహారావులు మాత్రమె.చివరకు నెహ్రూను కూడా నేను గొప్పనేతగా అంగీకరించను.ఎందుకంటే ఆయన చేసిన తప్పులకు నేటికికూడా దేశం మూల్యం చెల్లిస్తూనే ఉన్నది.

ఇకపోతే,లాల్ బహదూర్ శాస్త్రి,అటల్ బిహారీ వాజపేయిలు విలువలకు కట్టుబడిన వ్యక్తులు.పీవీ నరసింహారావు నిశ్శబ్దంగా దేశరూపురేఖలు మార్చిన వ్యక్తి.పీవీ ఎన్నో రాజకీయవత్తిళ్ళను ఎదుర్కొంటూ దేశపు ముఖచిత్రాన్ని నిశ్శబ్దంగా మార్చివేశాడు.ఈనాడు మనదేశం ఎంతోకొంత ఆర్ధికప్రగతి సాధించిందంటే దానికి కారకుడు పీవీ నరసింహారావే.కాని ఆయనకు ఎన్నెన్ని అవమానాలు  జరిగాయో మనకు తెలుసు.

నా దృష్టిలో ఈ అరవై ఆరేళ్లలో మన దేశపు నిజమైన ప్రధానులు పై ముగ్గురే.మిగిలినవారంతా కీలుబొమ్మలూ తోలుబొమ్మలూ మాత్రమె.పై ముగ్గురి సరసన ఇప్పుడు నరేంద్రమోడీ ప్రధానిగా వచ్చాడు.ఈ పరిణామంతో ఖచ్చితంగా మన దేశానికి మంచిరోజులు ముందున్నాయని నాకు నమ్మకం బలపడుతోంది.114 ఏళ్ళ క్రితం వివేకానందస్వామి చెప్పిన మాట నిజమవుతోంది.

మన దేశపు సింహాసనం మీద కూర్చోవాలంటే కొన్ని అర్హతలుండాలి.మహాజ్ఞాని అయిన ఒక జనకమహారాజు మాత్రమే అలా కూర్చోగలడు.ధర్మమూర్తి అయిన ఒక శ్రీరాముడు మాత్రమె అలా కూర్చోగలడు.ఈ దేశసింహాసనం మీద ఎవరుబడితే వారు కూర్చోకూడదు.ఇది అగ్నిసింహాసనం.అగ్నిపరీక్షకు నిలబడేవారే దీనిమీద కూర్చోడానికి అర్హులు.అర్హత లేకుండా కూర్చున్నవారిని అది భస్మం చేసి పారేస్తుంది.

అసమర్దులూ,దద్దమ్మలూ,అవినీతిపరులూ,అవినీతికి కొమ్ముకాస్తూ వంతపాడే నయవంచకులూ,దేశద్రోహులూ,కపటస్వభావులూ దీనిమీద అసలే కూర్చోకూడదు.ఎందుకంటే మనదేశం అన్నిదేశాల వంటి దేశం కాదు.ప్రపంచం మొత్తం మీద మన దేశానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.ఆధ్యాత్మికత మన ప్రాణం.ధర్మం మన ఊపిరి.న్యాయనిబద్ధత మన జీవం.వేలాది సంవత్సరాలుగా మన దేశపు మట్టిలో ఇవి ఇంకిపోయి ఉన్నాయి.

అలాంటి దేశపు సింహాసనం మీద కోతులూ కుక్కలూ తోడేళ్ళూ ఎలుగుబంట్లూ పులులూ మొదలైన రకరకాలైన వికృతజీవులు ఇప్పటివరకూ చాలా కూచున్నాయి. దానిని అపవిత్రం చేసి పారేశాయి.దానికి కారణం ఈ దేశప్రజల అసమర్ధతా,పిరికితనమూ,దురాశా,తెలివితక్కువతనాలే.

దానికి ప్రతిఫలంగా చాలా మూల్యాన్ని మనం భారీగానే చెల్లించాం.ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.ఒక దేశ చరిత్రలో 66 ఏళ్ళు అంటే తక్కువ సమయం కానేకాదు. ఇందులో మూడో వంతు సమయంలో అగ్రరాజ్యాలుగా ఎదిగిన దేశాలున్నాయి. సక్రమంగా ప్రయత్నిస్తే మనకూ అది సాధ్యమే.

ప్రపంచంలో ఏ దేశానికీ లేని ప్రకృతి వనరులు మనకున్నాయి.ఇక్కడ నదులున్నాయి.ఖనిజాలున్నాయి.ప్రకృతిసంపద ఉన్నది.మంచి భౌగోళిక పరిస్థితులున్నాయి.తెలివైన ప్రజలున్నారు.కష్టపడి పనిచేసే తత్త్వం మనలో ఉన్నది.అన్నీ ఉన్నాయి.కాని సమర్ధుడైన నాయకుడే కరువయ్యాడు.దేశాన్ని దోచుకునే నాయకులు ఎక్కువయ్యారు.అందుకే మన గతి ఇలా అఘోరిస్తున్నది.

నిజమైన నాయకునికి స్వార్ధం పనికిరాదు.కపటం పనికిరాదు.స్వలాభం పనికిరాదు.వక్రబుద్ధి పనికిరాదు.సంకుచితమైన దృష్టి పనికిరాదు.అతనికి విశాలభావాలుండాలి.అతని జీవితం సచ్చీలతకు ప్రతిబింబంలా ఉండాలి.ఈ దేశపు ధార్మికతా,విలువలూ అతనిలో నిండిపోయి ఉండాలి.సంకుచితమైన భావాలకు అతీతంగా అందరి మంచినీ అతడు కోరుకోవాలి.అలాంటివాడే ఈ దేశపు సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు.ఎవరుబడితే వారికి ఆ అర్హత లేదు.అర్హత లేనివారిని మనం కూర్చోబెడితే దానికి భారీమూల్యాన్ని దేశం చెల్లించవలసి వస్తుంది.ఈ 66 ఏళ్ళలో అటువంటి భారీ మూల్యాలను దేశం ఎన్నో సార్లు చెల్లించింది.ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలైంది.విపరీతమైన దోపిడీకి గురైంది.

నరేంద్రమోడీ ప్రధాని కావడం వెనుక ఉన్న కారణాలను ఎవ్వరు ఎన్ని విధాలుగా విశ్లేషించినా,వారెవ్వరికీ కనిపించని ప్రధానమైన కారణం ఒకటి ఉన్నది.అదేమిటో నేను చెబుతాను.దేశంలోని ప్రస్తుతం అలముకుని ఉన్న చీకటి పోవాలనీ,అవినీతి అంతం కావాలనీ,సత్ప్రవర్తనతో కూడిన ధార్మికపరిపాలన రావాలనీ ఎందఱో సాధకులూ,సిద్ధులూ, ఋషులూ, మహానీయులూ దైవాన్ని ఎన్నాళ్ళుగానో ప్రార్ధిస్తూ వస్తున్న ఫలితమే ఈ పరిణామం.

ఈ దేశాన్ని నడిపిస్తున్నది భౌతికశక్తులు మాత్రమె అని ఎవరినా భావిస్తే వారు పప్పులో కాలేసినట్లే అని నేనంటాను.ఎవ్వరి ఊహకూ అందని ఒక అతీతమైన దివ్యశక్తి ఈ దేశపు భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నది.ఆ శక్తికి సహనం  చాలా ఎక్కువ.అది ఎంతోకాలం మన కుప్పిగంతులను సహిస్తుంది.భరిస్తుంది.మనం మారతామేమో అని ఎన్నో అవకాశాలు ఇస్తుంది.కాని ఎల్లకాలమూ అలా చూస్తూ ఊరుకోదు.ఏదో ఒకరోజున అది కళ్ళు తెరుస్తుంది.అప్పుడు ఎవ్వరి ఆటలూ సాగవు.ప్రస్తుతం జరిగింది అదే.

వివేకానందస్వామి భావాలకు ప్రభావితుడై ఆయన అడుగుజాడలలో నడచి ఆత్మసాధనలోనూ దేశసేవలోనూ తరిస్తానని సన్యాసదీక్ష ఇవ్వమని ప్రార్ధిస్తూ శ్రీరామకృష్ణుని శిష్యుడైన స్వామి అఖండానందుల పాదాలు పట్టుకున్నాడు మాధవసదాశివ గోల్వాల్కర్ (గురూజీ). వద్దని వారించారు స్వామి.స్వయానా సన్యాసి అయిన ఆయన,ఒక నిజాయితీపరుడైన యువకుడు సన్యాసం కోరితే తిరస్కరించారు.

'నీ దారి ఇది కాదు.సమాజంలో ఉంటూ దానికి సేవ చెయ్యి.సంఘంలో ఉంటూ దానిని ఉన్నతంగా మార్చడానికి నీ జీవితాన్ని త్యాగం చెయ్యి.ఇదే నీ సాధన.' అంటూ ఆయనకు దారిచూపారు స్వామి అఖండానంద.ఆయన బోధను తూచాతప్పకుండా అనుసరించారు గోల్వాల్కర్.గోల్వాల్కర్ కృషి వల్ల ఒక ఊరికి మాత్రమే పరిమితమైన RSS దేశం అంతటా విస్తరించింది.వేలాది లక్షలాది దేశభక్తులను తయారు చెయ్యగలిగింది.

ఇదే సన్నివేశం కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ పునరావృతమైంది.జీవితపు రహస్యాన్ని అన్వేషిస్తూ తనను తాను అన్వేషిస్తూ బయలుదేరిన నరేంద్రమోడీ రామకృష్ణామిషన్ స్వామి అయిన ఆత్మస్థానందగారిని కలిశాడు.ఒకనాడు గోల్వాల్కర్ అడిగిన మాటనే మళ్ళీ ఈ యువకుడూ అడిగాడు.ఈ స్వామి కూడా ఆనాడు గోల్వాల్కర్ కు అఖండానంద స్వామి చెప్పిన మాటనే చెప్పారు.

'నీ గమ్యం సన్యాసం కాదు.నీ దారి వేరు.సంఘంలో ఉంటూ సంఘానికి సేవ చెయ్యి.నిరాడంబరమైన నిస్వార్ధమైన జీవితం గడుపుతూ దేశం కోసం నిజంగా పాటుపడు.'అని స్వామి ఆత్మస్థానంద చెప్పారు.వారు సామాన్య్లులు కారు.ఒక మనిషిని చూస్తూనే అతని దారీ  తెన్నూ ఏమిటో ఈ భూమి మీద అతని గమ్యం ఏమిటో వారు గ్రహించగలరు.సరియైన దారి చూపించగలరు.అలాంటి శక్తి వారికి ఉంటుంది.

తాను కోరుకున్నట్లుగా నరేంద్రమోడీ సంప్రదాయ సన్యాసి కాలేకపోయాడు. కాని నిరాడంబరమైన నిస్వార్ధమైన సన్యాస జీవితాన్నే గడుపుతున్నాడు. ఆయన దేశంకోసమే బ్రతుకుతున్నాడుగాని తనకోసం కాదు.సింహాసనం మీద ఉండికూడా యదార్ధమైన సన్యాసిలాగా ఆయన జీవిస్తున్నాడు.

మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన బంధువులు అతి సామాన్య జీవితాలు గడుపుతున్నారు.ఒక సామాన్య కార్పోరేటర్ ఈరోజున అవినీతితో కోట్లు గడిస్తున్నాడు.అలాంటిది మూడుసార్లు వరుసగా ముఖ్యమంత్రి అయిన నరేంద్రమోడీ ఇప్పటికీ అతిసామాన్య జీవితాన్ని గడుపుతున్నాడు.ఈ తేడాను స్పష్టంగా గమనించాలి.అవినీతిరహిత జీవితానికీ సచ్చీలతకూ ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?

గాంధీని కాంగ్రెస్ వాదులు ఆదర్శంగా చూపిస్తారు.గాంధీని చంపించింది RSS అంటూ పిచ్చిమాటలు మాట్లాడతారు.కాని అదే గాంధీయొక్క జీవనవిధానాన్ని మాత్రం వారిలో ఒక్కరు కూడా ఆచరించరు.గాంధీ అతి నిరాడంబరంగా బ్రతికాడు.కానీ ఆయన చలవతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారు కోటానుకోట్లు నల్లధనం వెనకేశారు.అత్యంత లగ్జరీ జీవితాలు గడుపుతున్నారు.ఎవరి డబ్బుతో ఇదంతా చేస్తున్నారు?దీనిని దోపిడీ అనక ఇంకేమనాలి?ఇదేనా గాంధేయవాదం?గాంధీ ఫోటోను గోడకు తగిలిస్తే సరిపోదు. ఆయన చెప్పినవాటిని ఆచరించవద్దా?గాంధేయవాదం ఒక జీవనవిధానం. దానిని ప్రస్తుతం ఆయన అనుచరులుగా చెప్పుకునేవారు ఎందరు ఆచరిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా రాజకీయులలో కనిపించరు.

నరేంద్రమోడీలాంటి వారికే ఈ దేశపు సింహాసనాన్ని అధిష్టించే అర్హత నిజంగా ఉన్నది.ఒక జ్ఞాని,ఒక యోగి మాత్రమె ఈ దేశాన్ని నిజంగా పరిపాలించగలడు. ఒక నిజమైన సంపూర్ణమైన దేశభక్తుడు మాత్రమె ఈ సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు.ఆ అర్హత అలాంటి వారికి మాత్రమె ఉంటుంది.

దోపిడీదొంగలు ఈ దేశాన్ని పాలించకూడదు.అది దైవద్రోహం అవుతుంది.దైవం దానిని క్షమించదు.అది వారికీ మంచిది కాదు దేశానికీ క్షేమం కాదు. దానిద్వారా వారు మూటకట్టుకునే ఖర్మ చాలా దారుణంగా ఉంటుంది.అది వెంటనే తెలియక పోవచ్చు.కాని భవిష్యత్తులో తప్పకుండా అది ఫలితం చూపిస్తుంది.ఇంతమంది ప్రజల చెడుకర్మను మూటకట్టుకున్న నాయకుల కుటుంబాలు ఎక్కిరావు.అవి ఏదోరకంగా సర్వనాశనం అవటం తధ్యం.కొందరు దేశనాయకుల కుటుంబాలను చూస్తే నేను చెబుతున్నది సత్యం అని అర్ధమౌతుంది.దీనిని ఎవ్వరూ మార్చలేరు.

ఒక నిజమైన సన్యాసికి మాత్రమె మన దేశాన్ని పాలించే అర్హత ఉన్నది.ఒక నిస్వార్ధమైన,నిరాడంబరమైన,నిజాయితీ కలిగిన ఋషితుల్యునికే అలాంటి అర్హత ఉన్నది.అది ఎవరికీపడితే వారికి లేదు.

ఈలోకంలో ధనం శాశ్వతం కాదు.అందులోనూ అడ్డదారిలో సంపాదించే ధనం అసలే శాశ్వతం కాకపోగా దారుణమైన కర్మను పోగుచేసి పెడుతుంది. పదవులూ శాశ్వతాలు కావు.జీవితమే శాశ్వతం కానప్పుడు ఇక ధనమూ పదవీ ఎలా శాశ్వతం అవుతాయి?

ఉన్నతమైన విలువలతో కూడిన నిస్వార్ధమైన నిరాడంబరమైన ధార్మికమైన జీవితమే సర్వశ్రేష్టమైనది.ఎప్పటికైనా అదే నిలుస్తుంది.లోకానికి మన దేశం ఇచ్చిన ఇస్తున్న సనాతనమైన సందేశం ఇదే.

ఈ సందేశాన్ని పుణికిపుచ్చుకుని జీవితంలో ఆచరిస్తున్న వారే ఈ దేశానికి నాయకులు కావాలి.నరేంద్రమోడీ అలాంటి నేత.పైగా ఆయన వివేకానందుని అనుచరుడు.వివేకానందుని అనుసరిస్తే శ్రీరామకృష్ణుని అనుసరించినట్లే. రామకృష్ణ వివేకానందుల భావాలను అనుసరించే మానవులు మానవులు కారు.వారు దేవతలే.ఇందులో ఎటువంటి సందేహమూ లేదు.

ఈ దేశానికి వివేకానందస్వామి చూపిన మార్గమే శిరోధార్యం.ఎందుకంటే స్వామి తన సొంత భావాలను ఏమీ చెప్పలేదు.వేల సంవత్సరాలుగా ఈ దేశపు ఆత్మలో నిండిఉన్న సనాతనధర్మపు విలువలనే ఆయన బోధించాడు. నవీన కాలానికి అనుగుణంగా వాటిని ఎలా జీవితంలో ఆచరించాలో  ఆయన వివరించాడు.ఈనాడు మనదేశానికి రక్ష వివేకానందుని భావాలే.ఇన్నాళ్ళకు స్వామి భావాలను ప్రేమించి,అనుసరించి,ఆచరించే ఒక నిస్వార్ధ దేశభక్తుడు మనకు ప్రధాని అయ్యాడు.ఇది గొప్ప అదృష్టమని నేను అనుకుంటున్నాను.

మన దేశానికి పూర్తిగా దుర్గతి పట్టలేదు.ఇంకా చాలా పుణ్యఫలం ప్రజలకు మిగిలే ఉన్నది అని ఈ పరిణామం రుజువు చేస్తున్నది.

పరాయిదేశస్తుల పాలనకూ,అవినీతి దోపిడీ పాలనకూ,అన్ని రకాల చెడులకూ నరేంద్రమోడీ యొక్క పరిపాలన చరమగీతం పాడాలనీ,మన దేశం అన్ని రంగాలలో మంచి అభివృద్ధి సాధించాలనీ,అదే సమయంలో మన దేశపు ఆత్మ అయిన సనాతన ధర్మమూ ఆధ్యాత్మికతలను మరచిపోకూడదనీ అలాంటి వరాన్ని మనకు భగవంతుడు ఇవ్వాలనీ ఆశిస్తూ నరేంద్రమోడీగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
read more " స్వతంత్రం వచ్చిన 66 ఏళ్ళకు దేశానికి అసలైన ప్రధాని నరేంద్రమోడీ "

15, మే 2014, గురువారం

సత్యదర్శనం

మనిషి చేసే తప్పుల్లో మొదటిది ఉన్నదానిని ఉన్నట్లు చూడలేకపోవడం.ఈ సూత్రం లౌకికంలోనైనా ఆధ్యాత్మికంలోనైనా కరెక్ట్ గా వర్తిస్తుంది.ఇది చాలా కష్టమైన ప్రక్రియ.

రెండోది ఆ చూచినదానిని ఒప్పుకోలేకపోవడం.ఇది మరీ కష్టమైన ప్రక్రియ.దీనికి మన అహం అనేది చాలా తీవ్రంగా అడ్డొస్తుంది.

చాలామంది ఆధ్యాత్మిక ప్రేమికులు ఇక్కడే బోర్లా పడిపోతుంటారు.సత్యాన్ని గ్రహించలేక దారితప్పిపోతుంటారు.

మొదటిదానికి అడ్డంకులు మనం ఎప్పటినుంచో ఏర్పరచుకున్న భావాలు,అభిప్రాయాలు.వాటి అద్దాలలోనుంచే మనకు చూడటం అలవాటు అయ్యి ఉంటుంది.వాటిని దాటి చూడలేకపోవడమే ఆధ్యాత్మికంగా అసలైన అడ్డంకి.

ఆ చూచినదానిని స్వీకరించలేకపోవడం ఇంకొక పెద్ద అడ్డంకి.ఈ రెండవదానికి కారణం మనలో గూడుకట్టుకుని ఉన్న సంస్కారాలు.మన మనస్సును అవి ఆక్రమించి ఉండటంతో కొత్త దృక్పధానికి అక్కడ చోటు దొరకదు.కనుక సంస్కారాలు మారవు.సంస్కారాలు మారనిదే ఎంతటివారైనా ఆధ్యాత్మికంగా ఎదగడం సాధ్యంకాదు.అహం అనేది పక్కకు తోలగనిదే నిజమైన ఆధ్యాత్మికతను గుర్తించడం ఎవరికీ సాధ్యం కాదు.

ఆధ్యాత్మికత అంటే 'ఇదీ' అని మనకు కొన్ని భావాలు ఏర్పడి ఉంటాయి.ఆ భావాలకు ఆధారాలు మనం పెరిగిన పరిసరాలు,మనం చదివిన పుస్తకాలు,మనం కలిసిన చూచిన వ్యక్తులు.అయితే,ఆధ్యాత్మికత అనేది ఈ పరిధులకు మాత్రమే లోబడి ఉండదనీ,నిజానికి దానికి ఎల్లలు లేవనీ,మన ఊహలకూ అభిప్రాయాలకూ అది ఎంతో భిన్నంగానూ అతీతంగానూ ఉంటుందన్న విషయం చాలామంది గ్రహించలేరు.ఒప్పుకోలేరు.గ్రహించడానికి వాళ్ళ అభిప్రాయాలు అడ్దోస్తాయి.ఒప్పుకోడానికి వాళ్ళ అహం అడ్డొస్తుంది.ఇదే సోకాల్డ్ ఆధ్యాత్మికులు చేసే పెద్ద పొరపాటు.

నా వ్రాతలు చదివిన కొందరు నాతో కొన్నిరోజులు గడపాలని ఉత్సాహ పడుతుంటారు.కాని వాళ్లకు మొదట్లోనే తీవ్రమైన ఆశాభంగం కలుగుతూ ఉంటుంది.ఎందుకంటే వాళ్ళ ఊహలకు అనుగుణంగా నేను ఉండను.నటించను.నాకు ఎవ్వరి మెప్పూ గొప్పా అవసరం లేదు.నా పద్దతిలో నేనుంటాను.

నేనేదో మడి కట్టుకుని ఎప్పుడూ పూజలలో ధ్యానంలో ఉంటానని గడ్డం పెంచుకొని స్వామీజీలా ఉంటాననీ చాలామంది అనుకొని నావద్దకు వస్తుంటారు.కాని నా జీవితవిధానం వాళ్ళ ఊహలకు భిన్నంగా కనిపించడంతో వాళ్ళు నిరాశకు లోనై నాకు దూరమై పోతుంటారు.ఇది చాలాసార్లు జరిగింది.వారిని చూచి జాలితో నవ్వుకొని ఊరుకుంటాను.

నేను గత రెండు మూడేళ్ళనుంచి మాత్రమె ఇవన్నీ వ్రాస్తున్నాను.కానీ ఇంతకు చాలాకాలం ముందు నన్నెరిగిన కొందరు వ్యక్తులుకూడా ఇదే పని చేసేవారు.ఇలాగే వారూ ఆశాభంగానికి గురయ్యేవారు.

చిన్నప్పటినుంచీ నన్నెరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు.చాలా చిన్నవయసులోనే నేను శ్రద్ధగా ధ్యానాభ్యాసం చెయ్యడం అతను అనేకసార్లు చూచాడు.ఆ తర్వాత నేను హైస్కూలు చదువు పూర్తిచేసుకుని కాలేజికి వెళ్ళడమూ అక్కడనుంచి ఉద్యోగంలో చేరడమూ మొదలైనవి జరిగిపోయాయి.ఈ మధ్యలో అతనికీ నాకూ కాంటాక్ట్స్ తగ్గిపోయాయి.అప్పట్లోనే అతను డిటెక్టివ్ పుస్తకాలు బాగా చదివేవాడు.

ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అతను ఒకసారి నాకు ఫోన్ చేశాడు.

'నేనూ ఈ మధ్య ధ్యానం నేర్చుకున్నాను.సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను'అన్నాడు.

'ఎవరి దగ్గర నేర్చుకున్నావ్?ఏ విధానం ప్రాక్టీస్ చేస్తున్నావ్?' అడిగాను.

'అవన్నీ నేనొచ్చి చెబుతాలే.చాలారోజులైంది నిన్నుచూచి. రేపు మీ ఇంటికి వస్తున్నాను.నీతో కొన్నాళ్ళు ఉందామని అనుకుంటున్నాను.నీతో కలిసి ధ్యానం చేద్దామని అనుకుంటున్నాను.'అన్నాడు.

'మంచిది.వచ్చెయ్' అన్నాను.

అనుకున్నట్లే అతను వచ్చాడు.ఒకపూట ఉన్నాడు.

రెండో రోజు ఉదయమే 'నేను బయలుదేరుతున్నాను' అన్నాడు.

నాకు విషయం అర్ధమైనా,ఏమీ అర్ధం కానట్లు నవ్వుతూ 'ఏం? అప్పుడే బయలుదేరుతున్నావ్?'అన్నాను.

'నిజం చెబితే నీవు బాధపడతావ్'అన్నాడు.

'బాధపెట్టేది నిజం కాలేదని నా ఉద్దేశ్యం.ఒకవేళ బాధకలిగినా నిజాన్ని వినక తప్పదుకదా.వినే ధైర్యం నాకుంది.చెప్పే ధైర్యం నీకుంటే చెప్పు' అన్నాను.

'నేను ఊహించినట్లు నీవు లేవు' అన్నాడు.

పగలబడి నవ్వాను.

'అదెలా కుదురుతుంది? నా తీరులో నేనుంటానుగాని నీవు ఊహించినట్లు నేనెలా ఉండగలను?ప్రతి ఒక్కరి ఊహలకు అనుగుణంగా మారడానికి నేనేమైనా ఊసరవెల్లినా?' అడిగాను.

'అదికాదు.నీవు చిన్నప్పుడు బాగా ధ్యానం చేసేవాడివి.కాని ఇప్పుడు చెయ్యడం లేదేం? అడిగాడు.

'ఏమో తెలియదు.ధ్యానానికి కూడా నేనంటే అసహ్యం కలిగి నన్నొదిలి పారిపోయినట్లుంది'అన్నాను నవ్వుతూ.

'అదీగాక నిన్న చూచిన దృశ్యం నా మనస్సును విరిచేసింది'అన్నాడు బాధగా.

'ఏమైంది' అన్నాను నవ్వుతూ.

'అద్దం ముందు నిలబడి నీకు నువ్వే నమస్కారం చేసుకుంటున్నావ్.ఇంత అహంకారం పనికిరాదు.'అన్నాడు.

'ఓహో అదా...'అన్నాను.

అతను వచ్చినరోజున నేను స్నానంచేసి బాత్రూంలోనుంచి వచ్చి, దేవుని దగ్గరకు వెళ్ళకుండా బొట్టు పెట్టుకోకుండా,సరాసరి అద్దం ముందు నిలబడి నాకు నేనే నమస్కారం చేసుకోవడం అతను చూడనే చూచాడు.

అప్పుడే అతని ముఖంలో కదలాడిన భావం చూచి నాకు అనుమానం వచ్చింది.

ఇదా సంగతి అనుకున్నాను.

'తప్పేముంది?నాకు నేనే నమస్కారం చేసుకున్నాను.ఇందులో నీవు బాధపడేది ఏముంది?ఏం నీక్కూడా నమస్కారం చెయ్యాలా?' అడిగాను.

'ధ్యానం మానేసి చివరికి ఇలా తయారయ్యావా?' అడిగాడు. 

'కాదు మరీ ఎక్కువగా చేసి ఇలా అయ్యాను.' చెప్పాను.

'మనం చిన్నప్పుడు నేర్చుకున్న లలితాసహస్రనామం కూడా చదవడం మానేశావ్?' అన్నాడు కోపంగా.

'దానికంటే ఒక డిటెక్టివ్ కథల పుస్తకం చదవడం మేలు' అన్నాను.

అతను కోపంగా బయలుదేరి వెళ్ళిపోయాడు.

పోవడమేగాక నాకెలా భ్రష్టత్వం పట్టిందీ చిలవలు పలవలుగా వివరించి మరీ అందరికీ చెప్పాడు.అది విని మా బంధువులలోనూ,చిన్నప్పుడు నన్నెరిగినవాళ్ళలోనూ,చాలామంది నేనంటే అసహ్యం పెంచుకున్నారు.ఇది జరిగి ఇప్పటికి పద్నాలుగేళ్ళు అయింది.

ఈ మధ్యనే అతను మళ్ళీ ఒకసారి కలిశాడు.

'బాగున్నావా?' నవ్వుతూ అడిగా.

అతను అయిష్టంగా చూస్తూ 'ఆ బాగానే ఉన్నా.నీవెలా ఉన్నావ్?ఇప్పుడు కూడా స్నానం తర్వాత అద్దంముందు నిలబడి నీకు నీవే దణ్ణం పెట్టుకుంటున్నావా?' అడిగాడు.

'లేదు' అన్నాను.

'అమ్మయ్య.పోనీలే ఇప్పటికైనా నీకు కొంత బుద్దోచ్చినట్లుంది' అన్నాడు.

'పూర్తిగా విను.స్నానం చేస్తే కదా అద్దం ముందు నిలబడేది.ప్రస్తుతం పదిరోజులకు ఒకసారి మాత్రమె స్నానం చేస్తున్నాను.అది కూడా చెయ్యాలనిపిస్తేనే.అనిపించకపోతే అదీ చెయ్యను.స్నానమే లెకపోతే ఇక నమస్కారం ఎక్కడినుంచి వస్తుంది?' అన్నాను.

అతను అసహ్యంగా చూస్తూ ఉండిపోయాడు.

'నా సంగతి సరేలే గాని,నీవు డిటెక్టివ్ పుస్తకాలనుంచి సెక్స్ పుస్తకాలకి అప్ గ్రేడ్ అయ్యావా?' అడిగాను అతని చేతిలోని స్వాతి వీక్లీ చూచి.

అతనికి పిచ్చికోపం వచ్చింది.ఏమీ చెయ్యలేక ఊరకే చూస్తూ ఉండిపోయాడు.

కొంచం అతనికి జ్ఞానబోధ చేద్దామని అనుకున్నా.

'చూడు.నీ కళ్ళతో నీవు చూస్తున్నంత సేపూ నీకు సత్యం అర్ధంకాదు.ముందు ఈ మాటని బాగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చెయ్యి.నీకు అర్ధమైతే అదృష్టవంతుడివి.లేకపోతే నీ ఖర్మ.సెక్స్ పుస్తకాలవరకూ ఎదిగావ్.వీడియోల దాకానో బ్లూఫిలింల దాకానో  ఎదిగిన తర్వాత,ఆపైన ధ్యానం ఎలా చెయ్యాలో ట్రయినింగ్ కావాలంటే అప్పుడు నన్ను కలువ్.నేర్పిస్తాను.'అన్నాను.

అతను కోపంతో అలాగే చూస్తున్నాడు.

నవ్వుతూ నా దారిన నేనొచ్చేశాను.
read more " సత్యదర్శనం "