“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, ఫిబ్రవరి 2014, గురువారం

శివరాత్రి-శివుని ప్రత్యేకతలు-శివతత్త్వం

ఈ రోజు ఉదయమే ఒక అర్జెంట్ ఫోన్ కాల్ తో లేచాను.ఎక్కడో ఏదో అయింది అర్జంటుగా పరిగెట్టాలంటే,వెంటనే పది నిముషాలలో తయారై మావాళ్లకి ఫోన్ చేసి వాళ్ళనూ వెంటనే బయల్దేరమని చెప్పి ఉదయం ఆరింటికే బయల్దేరాము. ఊరిలో పరవాలేదు గాని ఊరు బయటకు వెళ్లేసరికి,ఇంకా సూర్యోదయం బాగా అవలేదేమో మంచుమంచుగా ఉండి ఇది గుంటూరేనా లేక సిమ్లానా అన్నట్లు దారే కనిపించడం లేదు.మొత్తానికి ఆ మంచులో పడి అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ చూడవలసిన పనిని పూర్తిచేసేసరికి ఉదయం పదిన్నరైంది.

మాటల్లో మా కొలీగ్ ఒకాయన ఇలా అన్నాడు.

'పొద్దున్నే లేచి స్నానం చేసి శివునికి పూజ చేసుకుందామని కూచున్నాను. ఈలోపల ఫోన్ కాల్ వచ్చింది.పరిగెత్తుకుంటూ వచ్చేశాను.శివరాత్రిరోజున కూడా ఇదేమిటి ప్రశాంతంగా లేకుండా?ఏమిటో మన ఉద్యోగాలు?' అన్నాడు.

'ఉద్యోగం ఏం చేసింది?ప్రశాంతత బయట ఉందా లోపలుందా?' అడిగాను.

అతను వింతగా చూచాడు.

'అదికాదు సార్.ప్రశాంతంగా పూజ చేసుకోనివ్వకుండా ఇదెంటో ఈ రోజున కూడా మనకు ఈ ఎమర్జెంసీస్?' అన్నాడు.

'ఎమెర్జెన్సీ అంటేనే చెప్పకుండా ముంచుకొచ్చేది.చెప్పివస్తే అది అదెందుకౌతుంది?' అన్నాను.

మళ్ళీ అలాగే చూస్తున్నాడు.

'ముందు ప్రశాంతంగా పని చేసుకుంటే ఆ తర్వాత ఇంటికెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు' అన్నాను నవ్వుతూ.

నేనేమంటున్నానో ఆయనకర్ధం కాలేదు.

'మీరు కూడా నాలాగే పూజలోనుంచి లేచి వచ్చారా?' అడిగాడు.

'పూజా?నేనింకా స్నానమే చెయ్యలేదు' అని జవాబు చెప్పాను.

అతను అదోరకంగా చూచాడు.

ఇక నేను ఏమీ జవాబు ఇవ్వదలుచుకోలేదు.మౌనంగా ఉండిపోయాను.

చాలామంది ఇంతే.లౌకికం వేరు ఆధ్యాత్మికం వేరు అనుకుంటూ ఆ భ్రమలోనే జీవితమంతా వెళ్ళబుచ్చుతూ ఉంటారు.అందుకే చాలామంది సొ కాల్డ్ భక్తులూ ఆధ్యాత్మికులలో కూడా స్ప్లిట్ పర్సనాలిటీలూ స్కిజోఫ్రేనిక్లూ ఉంటారు. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అదే ఆధ్యాత్మికమనీ దేవుని దయ మనమీద ఉన్నదనీ చాలామంది భ్రమపడుతూ ఉంటారు.మనం కోరిన కోరికలు తీరకపోతే దేవుని దయ మనమీద లేదనుకుంటారు.కోరికలు తీరడం ఆధ్యాత్మికత ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాదు.అసలు కోరికలు అంటూ ఎప్పటికైనా పూర్తిగా తీరతాయా?వాటికి అంతూపొంతూ ఉంటుందా అనేది కూడా నాకేమీ పాలుపోదు.ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతూ ఉంటుంది.నిజమైన దేవుని దయ ఎలా ఉంటుందో,అసలదేమిటో,కోటిమందిలో ఒకరికైనా అర్ధమౌతుందో లేదో నాకైతే అనుమానమే.

కోరికలు తీరడమూ దయే,తీరకపోవడమూ దయే.అసలు కోరికలంటూ కోరని స్థితే అసలైన దయ అన్నవిషయం చాలామందికి అర్ధం కాదు.

పని పూర్తయింది.ఇంతలో ఇంకో కొలీగ్ వచ్చి'సార్.అందరం పొద్దున్నే బయల్దేరి వచ్చాంకదా.ఇప్పటిదాకా ఏమీ తిని ఉండరు.ఉప్మా చేయించాను. రండి తిందాం' అన్నాడు.

మొదటి కొలీగ్ ' నేను ఇంటికెళ్ళి మళ్ళీ స్నానంచేసి పూజ చేసుకుంటే గాని ఏమీ తినను తాగను.అందులో ఇవాళ శివరాత్రి కూడా కదా' అన్నాడు.

అతని వైపు జాలిగా చూచాను.అతను బయల్దేరి వెళ్ళిపోయాడు.

'సరే పదండి' అని ఆ ఉప్మా తిని టీ తాగి ఇక ఇంటికి బయలుదేరదామని అనుకుంటూ ఉండగా మావాళ్ళు 'సార్ దారిలోనే కాకాని శివాలయం ఉన్నది.దర్శనం చేసుకుని వెళదాం రండి' అన్నారు.

'సరే పదండి.అయితే ఒకటి.మన పరపతి ఏమీ ఉపయోగించవద్దు.హడావుడి చెయ్యవద్దు.మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం.ఒకవేళ దర్శనం కాకపోయినా మీరు బాధపడకండి' అన్నాను.

సరే అని అందరం తిరుగు ప్రయాణంలో బయలుదేరాము.

కాకాని శివాలయం దగ్గర కనీసం ఒక నాలుగు వేలమంది జనం ఉన్నట్లు కనిపించింది.గుడిచుట్టూ క్యూ నాలుగు రౌండ్లు తిరిగి ఉన్నది.ఆ క్యూలో నిలబడితే దర్శనం అయ్యేసరికి సాయంత్రం అయ్యేలా ఉన్నది.అందుకని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక నమస్కారం చేసుకుని బయటకు వచ్చేసాం.అక్కణ్ణించి కూడా ఆ జనం తలలు తప్ప లోపలున్న శివలింగం అసలేమీ కనబడటం లేదు.

మైకులో ఎవరో శివమహిమను గురించి వివరిస్తున్నాడు.ఏమిటా అని ఒక చెవి అటు వేశాను.'శివునికి చాలా ప్రత్యేకతలున్నాయి.ఆయన లయకారకుడు. భోలా శంకరుడు' అంటూ ఏమేమో చెబుతున్నాడు.

నాకు నవ్వొచ్చింది.మౌనంగా బయటకొచ్చి మా బైకులు తీసుకుని కొద్దిసేపట్లో గుంటూరు చేరుకున్నాము.

ఎక్కడైనా మంచి టీ తాగుదాం అని ఒక టీ స్టాల్ దగ్గర ఆగాము.

టీ తాగుతుండగా 'శివరాత్రి రోజున అనుకోకుండా శివదర్శనం అయింది.చాలా పుణ్యం కదా సార్.' అని మా ఇన్స్పెక్టర్ ఒకాయన అన్నాడు.

'అదేమీ లేదు.' అన్నాను.

ఆయనకూడా వింతగా చూచాడు.

'ఈరోజున శివదర్శనం అయితే ఎక్కువపుణ్యం అనీ ఇంకొకరోజున తక్కువపుణ్యం అనీ ఉండదు.ఏరోజున శివదర్శనం అవుతుందో అదే శుభదినం.అయితే మీరనుకుంటున్న శివదర్శనం గురించి నేను చెప్పడం లేదు.' అన్నాను.

మళ్ళీ అదే చూపు.

'ఇందాక మీరు గుడిలో మైకులో విన్నారో లేదో?శివుని ప్రత్యేకతల గురించి చెబుతున్నాడు ఒకాయన.నిజమేమిటో చెప్పనా?శివునికి ఏ ప్రత్యేకతలూ లేవు.ఏ ప్రత్యేకతలూ లేని సహజతత్త్వమే శివతత్త్వం.ఆయన నిర్వికారుడు. అంటే ఏ వికారమూ ఆయనలో ఉండదు.ఆయన నిశ్చలుడు. అంటే ఏ విధమైన చలనమూ ఆయనలో ఉండదు.ఆయన నిర్గుణుడు.అంటే మూడు గుణాలకూ అతీతుడు.ఆయన నిష్కళంకుడు.అంటే ఏ విధమైన కళంకమూ ఆయనలో ఉండదు.ఆయన నిరవద్యుడు,అంటే ఏ విధమైన చెడూ లేనివాడు.ఆయన నిరంజనుడు.అంటే ఏ విధమైన మాలిన్యమూ లేనివాడు.

ఏదీ తానుకాడు గనుక అన్నీ తానే.ఏదీ తనకు అంటదు కాని అన్నీ తనలో ఉన్నాయి.అన్నిట్లో ఉన్నాడు కనుక దేనికీ లోబడడు.ఇంద్రియములకు అతీతమై నిశ్చలమై అఖండ సచ్చిదానందమై నిత్యమూ వెలుగుతున్నదే శివతత్త్వం.దానిలో ఏ ప్రత్యేకతలూ లేవు.'

"తెలిసీ తెలియనివారు ఇలా మైకుల్లో టీవీలలో ఏవేవో చెబుతూ ఉంటారు. జనం వింటుంటారు.నిజమని భ్రమిస్తుంటారు.కోరికలు తీరితే దేవుని దయ ఉందనుకుంటారు.తీరకపోతే లేదనుకుంటారు.మతాలు మారిపోతుంటారు. దేవుళ్ళని మారుస్తూ ఉంటారు.ఇదంతా మామూలే.మాయాప్రభావం ఇలాగే ఉంటుంది.' అన్నాను.

టీ త్రాగటం అయింది.

'ఇక పదండి ఇళ్లకు పోదాం.'అన్నాను.

'ఇంటికెళ్ళి ప్రత్యెకపూజ ఏమైనా చేస్తారా ఈరోజు?' అడిగాడు.

'ఇప్పుడు చేస్తున్నది పూజ కాకపోతేగా?'అన్నాను.

ఎవరి ఇంటికి వారు బయలుదేరాం.
read more " శివరాత్రి-శివుని ప్రత్యేకతలు-శివతత్త్వం "

26, ఫిబ్రవరి 2014, బుధవారం

ఆంధ్రాను స్వర్గంగా మారుస్తాం

తెలంగాణా పోతే పోయింది మనకు మిగిలిన ఆంధ్రాను స్వర్గంగా మార్చుకుందాం అని చాలామంది నాయకులు బీరాలు పలుకుతున్నారు. వీరందరూ నిన్నా మొన్నటివరకూ 'ఆంధ్రా ఎన్నటికీ విడిపోదు,మా ప్రాణాలు అడ్డు వేసి అయినా రాష్ట్రం చీలకుండా కాపాడుతాం' అని వీధుల్లో వీరంగాలు వేస్తూ బందులు చేయిస్తూ ప్రజాజీవనానికి విఘాతం కలిగిస్తూ గప్పాలు కొట్టిన వారే.ఇప్పుడేమో పేడిగొంతు వేసుకుని 'మా ప్రయత్నాలు మేము చేశాం కుదర్లేదు.అయినా పర్లేదు ఆంధ్రాని డెవెలప్ చేసుకుందాం' అనే కొత్తపాట మొదలు పెట్టారు.

రెండేళ్ళ క్రితమే తెలంగాణా రావడం  ఖాయం అని అందరికీ తెలుసు.కాని నిన్నటివరకూ ప్రజల్ని ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలో అన్ని రకాలుగానూ మభ్యపెట్టారు.బందులు చేయించారు.విద్యార్ధులకు క్లాసులు పోయాయి. బందుల సమయంలో సమయానికి కరెంటు లేకా మందులు దొరకకా ఎందఱో రోగులు చనిపోయారు.ప్రజలకి ఎంతో అసౌకర్యం కలిగింది.కొన్ని లక్షల పనిగంటలు వృధా అయిపోయాయి.అన్నీ తెలిసీ ఈ నాటకాలు ఆడారు. జనాన్ని వెఱ్ఱివెధవల్ని చేసారు.

ముందుముందు మన నాయకులు చెయ్యబోయే డెవలెప్ మెంట్ ఏమిటో నేను ఇప్పుడే చెప్పగలను.

1.ముందుగా కొత్త రాజధాని విషయంలో నానాపుకార్లు లేవదీసి ప్రతి చోటా భూముల ధరలు పెంచి పారేస్తారు.ఇప్పటికే,అంటే ఈ నాలుగురోజుల్లోనే, దొనకొండలోనూ,మాచర్లలోనూ,మంగళగిరిలోనూ భూముల రేట్లు అమాంతం నాలుగైదు రెట్లు పెరిగిపోయాయి.ఒంగోలు కర్నూలు గుంటూరు విజయవాడలలో భూముల రేట్లు ఇప్పటికే చుక్కల్లో ఉన్నాయి.సామాన్యుడు వాటివైపు కనీసం తలెత్తి చూచే పరిస్తితి కూడా ఇప్పుడు లేదు.

2.ఆ తర్వాత అన్ని రంగాలలోనూ అమాంతం పెరిగిపోయిన ధరలతో క్రమేణా సామాన్యుడు బ్రతకలేని పరిస్తితి ఆంధ్రాలో కల్పించబడుతుంది.

3.డెవెలప్ మెంట్ కోసం కేంద్రం విదిల్చిన నిధులని(అసలంటూ ఏవన్నా వస్తే) హాయిగా బొక్కేసి కొన్ని పార్టీల నేతలూ కొన్ని కులాల ప్రతినిధులూ వందల వేలకోట్లు వెనకేసుకుంటారు.ఆ డెవలప్ మెంట్ మాత్రం ఎక్కడా కనిపించదు.మహా అయితే నాలుగు గతుకులరోడ్లూ,ఆరు మనపైనే కూలే ఫ్లైఒవర్లూ కనిపిస్తాయేమో.

4.నీళ్ళు,కరెంటు,పన్నులు,జీతాలు,ఉద్యోగాలు వగైరా అన్నింటిలోనూ తీవ్రమైన సమస్యలు కొద్దినెలలలో తలెత్తబోతున్నాయి.విభజనక్రమంలో ప్రజాజీవనం అతలాకుతలం కావడం ఖాయంగా జరుగుతుంది.ఇది తుపాను ముందటి ప్రశాంతత మాత్రమే.

5.'ఇదేంది సారూ ఇదేనా మీరు సృష్టిస్తానన్న ఆంధ్రా స్వర్గం?' అని ఎవరైనా అడిగితే -'ఒక కొత్తరాష్ట్రం మొదలయ్యేటప్పుడు మొదట్లో కొన్ని త్యాగాలు తప్పవు నాయనా.ఏభై ఏళ్ళుగా నిర్మించిన హైదరాబాద్ ఒక్కరోజులో పోయింది కదా?చెత్తనుంచి మళ్ళీ మన రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి.దానికోసం ప్రజలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి.గంజిత్రాగి బ్రతుకుదాం.అయినా సరే స్వర్గాన్ని నిర్మించుకుందాం'-అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. పిచ్చిప్రజలు ఆ మాటలు నమ్మి గంజి త్రాగటం మొదలుపెడతారు.నాయకులు మాత్రం ప్రజల సొమ్ముతో స్వర్గసుఖాలను నిత్యమూ అనుభవిస్తూనే ఉంటారు.

6.ఈ లోపల మన కులపార్టీలూ కులనాయకులూ కులసంఘాలూ విజ్రుమ్భించి ఎవరికీ దొరికింది వారు ఎడాపెడా దోచుకోవాలని చూస్తారు.ఇదంతా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి అనుకూల ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా ఉంటే జరగబోయే పరిస్తితి మాత్రమే.

7.ఇకపోతే,కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రాలో ఏర్పడితే,అప్పుడేం జరుగుతుందో చూద్దాం.

8.నాయకులు ఊరిస్తున్న సింగపూర్ సీమాంధ్ర కనుచూపు మేరలో ఎక్కడా కనిపించదు.ఎందుకంటే కేంద్రంనుంచి ఏ నిధులూ,ఏ ప్రాజెక్టులూ రావు గనుక.పైగా ప్రతివిషయంలోనూ ఇకమీదట తెలంగాణాకు న్యాయమూ ఆంధ్రాకు అన్యాయమూ జరగడం ఖాయంగా చూడవచ్చు. 

9.ఇక చేసేది ఏమీ లేక,ఉన్న దానిలోనే దోచుకోవాలని నాయకులు ప్రయత్నిస్తారు.ప్రజల్ని ఎప్పటికప్పుడు అనవసరమైన పక్కదారి మాటలతో ఉత్తుత్త సమస్యలతో మభ్యపెడుతూనే ఉంటారు.ప్రజలు కబేళాలో గొర్రెల్లా బ్రతుకుతూనే ఉంటారు.

10.ఈలోపల ఇంకొక ప్రమాదం - అతి ముఖ్యమైనది తలెత్తుతుంది- అదేమిటంటే,ఇకమీద తెలంగాణా ఆంధ్రాలలో ఏ ప్రాజెక్టు ఎవరికోచ్చినా రెండోవారు కెవ్వుమంటూ గోల చెయ్యడం సాధారణమవుతుంది.ఆ తర్వాత మన రెండు రాష్ట్రాలూ కొట్టుకుంటుంటే ఆ ప్రాజెక్టులు ఏ తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలకో తరలిపోవడమూ మన కళ్ళెదుటే జరుగుతుంది.

11.ఎవరి రాష్ట్రాభివృద్ధిని వారు చూచుకోకుండా పక్క రాష్ట్రం మీద పడి ఏడవడం ఎక్కువౌతుంది.తమ చేతగానితనాన్ని కేంద్రంమీద నెట్టేసి చేతులు దులుపుకోవడం మాత్రమే జరుగుతుంది.

12.పనిలో పనిగా ఇంకొక పదేళ్ళో ఇరవై ఏళ్ళో గడిచాక ప్రత్యెక రాయలసీమ ఉద్యమం ఎలాగూ మొదలౌతుంది.చిత్తూరు,అనంతపూరు,కర్నూలు,కడప జిల్లాలతో రాయలసీమ రాష్ట్రం ఉద్భవిస్తుంది.ఆ తర్వాత రాయలసీమ స్ఫూర్తితో ఉత్తరకోస్తా దక్షిణకోస్తా ఉద్యమాలూ మొదలౌతాయి.వెరసి ఆంధ్రా మళ్ళీ మూడుముక్కలుగా విడిపోతుంది.కర్నూలు గనుక రాజధాని కాకపోతే రాయలసీమ ఉద్యమం వచ్చె ప్రమాదం తప్పకుండా పొంచి ఉన్నది.ఇది వెంటనే కాకపోవచ్చు కొన్నేళ్ళ తర్వాత మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.

13.ఈలోపల భూముల ధరలూ ఇతర ధరలూ ఊహించలేనంతగా పెరిగిపోయి సామాన్యుడు రాష్ట్రంలో బ్రతకలేని పరిస్తితి ఖచ్చితంగా వస్తుంది.అవినీతి విచ్చలవిడిగా విజ్రుంభిస్తుంది.ఎవడైనా నీతి గురించి మాట్లాడితే వాడిని ఒక వెర్రివాడిగా జమకట్టే రోజు అతిత్వరలో రాబోతున్నది.'నీకు చేతనైతే డబ్బులిచ్చి పని చేయించుకో లేదంటే నోర్మూసుకొని ఒకమూల కూచో'- అని ఓపెన్ గా చెప్పుకునే రోజు అతి దగ్గరలో మనం చూస్తాం.తత్ఫలితంగా క్రైం రేట్ రాష్ట్రంలో బాగా పెరుగుతుంది.

కొద్దిగా ఆలోచన ఉన్నవారు ఈ ఆంధ్రాలో మనం ఎందుకున్నాంరా దేవుడా అని ఏడిచే పరిస్తితి కల్పించబడుతుంది.

నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నంతవరకూ,ప్రజలకు దేశభక్తి లేనంతవరకూ,కులాల కుమ్ములాటలనే రొచ్చులోనుంచి మనం బయటపడలేనంతవరకూ,దూరదృష్టీ విశాలదృష్టీ మనకు రానంతవరకూ మన రాష్ట్రం బాగుపడటం ఎన్నటికీ జరగదు.

రాష్ట్రం విడిపోవటం మన కళ్ళెదుటే చూశాం.ఇవన్నీ కూడా మన కళ్ళెదుటే ముందుముందు ఖచ్చితంగా చూస్తాం.దేశంలో ఆంధ్రా ఇప్పటికే నవ్వుల పాలయింది.ఇంకా భ్రష్టుపట్టడం రేపటి సూర్యోదయమంత నిజం.

ఆంధ్రాను స్వర్గంగా చేసుకోకుంటే మానె,ప్రత్యక్ష నరకంగా మార్చుకోకుంటే అదే పదివేలు.అవినీతి రాజకీయ నాయకులూ,ఆలోచన లేని స్వార్ధపూరిత ప్రజలతో రెండోదే ఖాయంగా జరుగుతుంది అని నా అభిప్రాయం.త్వరలోనే అదీ చూస్తాంగా తొందరెందుకు?
read more " ఆంధ్రాను స్వర్గంగా మారుస్తాం "

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

జాన్ హిగ్గిన్స్ భాగవతార్ జాతకం

మనలో చాలామందికి మన శాస్త్రీయ సంగీతం అంటే ఏమిటో తెలియదు. అదంటే చాలామందికి ఏమిటో తెలియని ఏవగింపు ఉంటుండటం కూడా నేను గమనించాను.మనవాడే అయిన సద్గురుత్యాగరాజు ఎన్ని కీర్తనలు వ్రాసినాడో మనకు తెలియదు.ఎన్ని రాగాలను ఆయన స్పృశించాడో మనకు అర్ధం కాదు. వాటిలో కనీసం ఒకటి రెండు కీర్తనలన్నా నేర్చుకుందామని మనకు తోచదు.నారాయణ తీర్ధులంటే ఎవరో క్షేత్రయ్య అంటే ఎవరో ఈ తరంలో వారికి చాలామందికి తెలియదు.

తమ సంస్కృతిని నిర్లక్ష్యం చెయ్యడంలో తెలుగువారిని మించిన వారు ఎవరూ లేరు అనేది నా నిశ్చితాభిప్రాయం.పంచెకట్టు తప్ప అసలు మనకంటూ ఒక సంస్కృతి ఉన్నదా అనేది కూడా నాకు అనుమానమే.అదే తమిళనాడుగాని కేరళగాని కర్నాటకగాని చూస్తే వారికంటూ ప్రత్యెక సంస్కృతులు ఉన్నాయి. భాషాభిమానం మనకంటే కొన్ని వేలరెట్లు వారికి ఉన్నది.మనంత దిగజారుడుతనమూ విలువలులేనితనమూ వారికి లేవు.

అసలు మన తెలుగువాళ్లంత దరిద్రపు జాతి ఎక్కడా ఉండదేమో అని నానాటికీ నాకు అభిప్రాయం బలపడుతున్నది.మన భాష మనకు పట్టదు.మన సంస్కృతి మనకు పట్టదు.మన కళలు మనకు పట్టవు.మన ఆధ్యాత్మికత మనకు పట్టదు.చివరికి మన రాష్ట్రం కూడా మనకు పట్టదు.అది ఎన్ని ముక్కలైనా మనకు అనవసరం.ఎవడికి చేతనైనది వాడు దోచుకుంటే చాలు. రాష్ట్రం ఏమైపోయినా మనకు అనవసరం.డబ్బు ఒక్కటి ఉంటే మనకు చాలు.సంస్కృతీ సంప్రదాయమూ మతమూ ఏవీ మనకు అక్కర్లేదు.దొంగల గుంపు తప్ప ఇక్కడ ఏమీ లేదని నాకనిపిస్తున్నది.

ఈ మధ్యలో నాకొక ఆలోచన బలంగా కలుగుతున్నది.ఆంధ్రాను వదిలిపెట్టి ఏదైనా వేరే రాష్ట్రంలో పోయి స్థిరపడదామా అన్నంత అసహ్యం ఇక్కడి మనుషులను చూస్తే నాకు కలుగుతున్నది.ఎక్కడ చూచినా ఇంతమంది దొంగలున్న రాష్ట్రం ఇండియా మొత్తం మీద బహుశా ఇదేనేమో?బహుశా ఇందుకేనేమో నారాయణతీర్ధులు,త్యాగరాజువంటి ఎందఱో మహనీయులు అందరూ ఆంధ్రాను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలలో పోయి స్థిరపడ్డారు.

ఈ మాటన్నందుకు చాలా మందికి కోపం రావచ్చు.అలాంటి ఆషాఢభూతులకు ఒకమాట చెబుతాను.పక్కనే ఉన్న తమిళనాడుని గాని కేరళనుగాని కర్ణాటకనుగాని విభజించాలని ప్రయత్నించి చూడండి.ఏమౌతుందో చూద్దాం. చస్తే కుదరదు.వారికి ఉన్న భాషాభిమానం గాని ఆత్మాభిమానం గాని రాష్ట్రాభిమానం గాని మనకేవి?కనుక నేనన్నమాట వాస్తవమే.ఊరకే కోపాలు వస్తే ఉపయోగం లేదు.వాస్తవాలు కళ్ళెదుట కనిపించాలి.

తెలుగుజాతి అంత దరిద్రపుజాతి ఎక్కడా ఉండదు అనేది వాస్తవం.ఇంతకు ముందు ఎవరైనా ఈమాట అంటే నేనూ ఒప్పుకునేవాడిని కాదు.కాని ఈ మధ్య జరిగిన జరుగుతున్న పరిణామాలు చూచి నా అభిప్రాయం మార్చుకున్నాను.ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా,మనలో ప్రతివాడికీ వ్యక్తిగత స్వార్ధమేగాని ఒక విశాలమైన రాష్ట్రచింతనగాని,రాష్ట్ర భావనగాని  లేవు అనేది పచ్చినిజం.

మాలిక్ కాఫర్ కు ఉప్పందించి మన కోటల దారులూ గుట్లూ అన్నీ చెప్పి కాకతీయ సామ్రాజ్యం పతనం కావడానికి కారకులయినది మన తెలుగువారే.ఇక అక్కడనుంచి తమిళనాడు వరకూ అతను ఊచకోత కోసుకుంటూ పోవడానికి దారులు ఏర్పరచినది కూడా మన తెలుగువారే అన్నది చారిత్రికవాస్తవం.డిల్లీ సుల్తానుల పరిపాలన డెక్కన్ లో వ్యాపించడానికి రాజమార్గాలు తెరిచింది మన తెలుగువారే.

కనుక మొదటినుంచీ కూడా కుట్రలతో మనల్ని మనం నాశనం చేసుకోవడంలో మనకు చాలా ప్రజ్ఞ ఉన్నది అనేమాట పచ్చినిజం.మనకు ఎటువంటి విలువలూ ఆదర్శాలూ లేవు. పచ్చిస్వార్ధమూ, దొంగబుద్ధీ, దోచుకోవడమూ, పక్కవాడిని చెడగొట్టి చివరకు మనంకూడా సర్వనాశనం కావడమూ తప్ప మనకు ఇంకేమీ తెలియదు.

తెలుగుజాతికి విశ్వామిత్రమహర్షి శాపం ఉన్నదని,వీరు తమ పద్ధతులు చాలా త్వరగా మార్చుకోకపోతే ముందుముందు చాలా ఘోరాలు జరుగుతాయనీ నేను రెండుమూడేళ్ళ క్రితం అన్నప్పుడు ఇదే బ్లాగులలో ఎందఱో నన్ను ఎగతాళి చేసి విమర్శించారు.ఇప్పుడెం జరిగిందో చూడండి మరి.

సరే ఆ సోదిని అలా ఉంచి,ప్రస్తుతంలోకి వస్తే,మనల్ని మనం మరచిపోయినా, మన కళలను అక్కున జేర్చుకుని,నేర్చుకుని,జీవితాన్ని వాటికి అంకితం చేసి చరితార్దులైనవారు ఎందఱో ఉన్నారు.వారిలో తమిళుల వంటి పొరుగురాష్ట్రాలవారే గాక విదేశీయులు కూడా ఉన్నారు.వారిలో ఒకడే జాన్ హిగ్గిన్స్ భాగవతార్.

ఈయన 18-9-1939 న మసాచుసెట్స్ లోని యాండోవర్ లో జన్మించాడు.నేను సరిదిద్దిన జనన సమయం ఉదయం 8-51 నిముషాలు.జాతకాన్ని పైన చూడవచ్చు.

ఎంతో ఘర్షణనూ చీధరింపులనూ ఎదుర్కొని,నోరు తిరగని పరాయిభాషను నేర్చుకుని, పరమ చాందసులైన తమిళబ్రాహ్మణుల వద్ద శిష్యరికం చేసి, కర్నాటక శాస్త్రీయసంగీతంలో అనన్యమైన ప్రతిభను సాధించి,వాళ్ళ ఎదుటనే కచేరీలు చేసి,వాళ్ళచేతనే శెభాష్ అనిపించుకున్న ఒక అమెరికన్ పేరు నేడు చాలామందికి తెలీక పోవచ్చు.అతనే జాన్ హిగ్గిన్స్ భాగవతార్.ఆయన జీవితం వికీపీడియాలోనో ఇంకా ఇతర సైట్స్ లోనో చూడవచ్చు.జాతకం వరకూ మనం పరిశీలిద్దాం.

ఆత్మకారకుడు బుధుడు.కారకాంశ ధనుస్సు.అక్కడ నుంచి వాక్స్థానంలో ఉచ్ఛకుజుని వల్ల మంచి గాయకుడయ్యాడు.శని కేతువుతో కలసి పంచమంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక కీర్తనలతో నిండిఉన్న కర్నాటక సంగీతాన్నినేర్చుకుని మంచి ప్రజ్ఞ సాధించాడు.

చంద్రుని నుంచి చూచినా తృతీయంలోని ఉచ్ఛకుజుని వల్ల మంచి సంగీతప్రజ్ఞ కలిగింది.మకరం భారతదేశానికి సూచిక గనుకా,కుజుడు దక్షిణానికి సూచకుడు గనుకా దక్షిణ భారతదేశానికి చెందిన శాస్త్రీయ సంగీత ప్రజ్ఞను ఇచ్చినాడు.

ఆత్మకారకుడైన బుధునితో యురేనస్ పంచమ శుభదృష్టిని కలిగి ఉన్నాడు. కనుక అతీతమైన అనుభవాలను ఇవ్వగల భక్తి సంగీతాన్ని సాధన చేసినాడు. అదే యురేనస్ శని కేతువులతో కలిసి ఉండటం వల్ల అకస్మాత్తుగా అసహజమైన మరణాన్ని ఇచ్చినాడు.

శని గురుల వక్రస్తితి వల్ల ఈయనకు ధార్మికమైన తీరని కర్మశేషం ఉన్నదని తెలుస్తున్నది.అది తీరిన మరుక్షణం ఇతను ఈలోకాన్ని వదలవలసి ఉంటుందని కూడా తెలుస్తున్నది.అలాగే జరిగింది కూడా.

నా ఉద్దేశ్యం ప్రకారం ఈయన లగ్నం కన్య అయి ఉండాలి.అప్పుడే అష్టమం లోని నీచశని కేతువుల వల్ల అసహజమైన మరణం(యాక్సిడెంటల్ డెత్) ఉంటుంది.7-12-1984 న ఎవడో త్రాగుబోతు రాష్ గా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూవచ్చి కుక్కను షికారుకు తిప్పుతున్న జాన్ హిగ్గిన్స్ ను గుద్దేసి పారిపోయాడు.గాయాలతో జాన్ హిగ్గిన్స్ మరణించాడు.అప్పటికి ఆయనకు 45 ఏళ్ళు మాత్రమే.కేతువు ఇక్కడ కుజుని ప్రతినిధి అయ్యాడు.అంటే కుజ శనుల కలయిక అష్టమంలో జరిగింది.ఇక యాక్సిడెంట్ జరగక ఏమౌతుంది?కుజ శనుల కలయికతో ఏమి జరుగుతుందో నేను ఎన్నో వ్యాసాలలో వ్రాసినాను.ఈయన జాతకం కూడా ఈ సూత్రానికి మరొక్క ఉదాహరణ.

లగ్న యురేనస్ ల మధ్యన ఖచ్చితమైన షష్టాష్టక దృష్టి గమనార్హం.ఇది కూడా హఠాత్తుగా జరిగే అసహజ మరణాన్నే(sudden accidental death) సూచిస్తున్నది. 

మరణ సమయంలో శుక్ర/గురు/కేతు దశ నడిచింది.శుక్రుడు లగ్నంలో వ్యయాదిపతి అయిన రవివల్ల అస్తంగతుడు.గురువు ఈ లగ్నానికి కేంద్రాదిపత్య దోషి.అంతేగాక మారకుడు.శని నక్షత్రంలో వక్రిగా ఉండి చాలా దోషంతో కూడుకుని ఉన్నాడు.కేతువు అష్టమంలో నీచ శనితో కలసి ఉన్నాడు.కనుక మారకం జరిగింది.కేతువు శునకాలకు కారకుడన్న విషయం జ్యోతిర్వేత్తలకు సుపరిచితమే.ఇతని చావు సమయంలో కేతు విదశ జరుగుతూ ఉండటమూ ఆ చావుకు ఒక కుక్క కారణం అవడమూ ఎంత విచిత్రమో?పైగా అష్టమం చరరాశి కావడం వల్ల రోడ్డుమీద జరిగిన వాహనప్రమాదం ఈయన ప్రాణాలు తీసింది.ఇది కూడా జ్యోతిష్య సూత్రాల ప్రకారమే తూచా తప్పకుండా జరిగింది.

ఆత్మకారకుడైన బుధుని నుంచి నవమంలో శనికేతువు(కుజు)ల వల్ల ధార్మికమూ మోక్షకారక సంగీతమైన భారతీయ కర్నాటక సంగీత సాంప్రదాయాన్ని నిష్టగా అభ్యసించాడు.

ఈయన వేస్లీయన్ విశ్వవిద్యాలయంలో చదివినాడు.1962 లో సంగీతంలో డిగ్రీ చేశాడు.అప్పుడు బుధ/గురు/బుధ దశ జరిగింది.బుధుడు సంగీతాన్ని ఇస్తాడు.పైగా లగ్నాధిపతి.వ్యయంలో సూర్యుని నక్షత్రంలో ఉంటూ శాస్త్రీయ సంగీతంలో ప్రజ్ఞను ఇచ్చినాడు.ఈయన పాశ్చాత్య సంగీతంలో కూడా శాస్త్రీయ సంగీతాన్నే అభ్యసించాడు.1964 లో ఎమ్మే చేశాడు.అప్పుడు బుధ/శని/బుధ దశ జరిగింది.పంచమాదిపతిగా శని ఉన్నత విద్యను ఇచ్చాడు.1973 లో పీ హెచ్ డీ చేసాడు.ఆ సమయంలో కేతు/బుధ దశ జరిగింది.

ఈయనకు సంగీతం తల్లివైపు నుంచి వచ్చింది.ఆమె ఒక సంగీత బోధకురాలు.లగ్నాత్ చంద్రుడు తృతీయంలో ఉండటమూ చంద్రుని నుంచి కుజుడు తృతీయంలో బలంగా ఉండటమూ గమనిస్తే విషయం బోధపడుతుంది.నీచ చంద్రుని వల్ల పరాయి భాషలో సంగీతాన్ని అభ్యసించినా బలంగా ఉన్న కుజుడు లౌకిక సంగీతాన్ని గాక భగవన్మార్గంలో ఔన్నత్యాన్ని ఇవ్వగల శక్తి ఉన్న భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఇచ్చినాడు. 

త్యాగరాజ కృతులను ఆయన పాడిన తీరు అద్భుతంగా ఉంటుంది.తెలుగు వచ్చిన మనకే అలా పాడటం కష్టం అనుకుంటే,ఒక అమెరికన్ పరాయి భాషను నేర్చుకుని ఆ గమకాలనూ సరిగమలనూ భావయుక్తంగా పాడి మన దేశస్తులను మెప్పించడం ఎంత కష్టమో ఊహించవచ్చు.ఆ!! ఒక విదేశీయుడు త్యాగరాజ కృతులను ఏమి పాడగలడులే? అని చప్పరించిన వారి ఎదుటనే కచేరి ఇచ్చి వారి చేతనే బిరుదులను పొందిన జాన్ హిగ్గిన్స్ భాగవతార్ నిజంగా చరితార్ధుడు.

1960,70లలో ఆల్ ఇండియా రేడియోలో ఆయన కచ్చేరీలు వచ్చేవి.త్యాగరాజ ఆరాధనోత్సవాలలో దిగ్గజాల వంటి గాయకుల ముందు త్యాగరాజ కృతులను పాడి వారిని మెప్పించిన గాయకుడు జాన్ హిగ్గిన్స్.ఆయన గాన పాటవానికి మెచ్చి 'భాగవతార్' అన్న బిరుదును ఆయనకు ఇవ్వడం ఎంతో సమంజసంగా ఉన్నది.

ఎవరో భారతీయ సంగీతజ్ఞుడు ప్రారబ్ధం వల్ల అలా అమెరికాలో పుట్టి కొంతకాలం జీవించి కర్మ తీరాక దేహం చాలించాడని నా అభిప్రాయం.ఇది ఉత్త అభిప్రాయమేకాదు నిజంకూడా.పంచమంలోని ఉచ్ఛకుజుడిని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది.ఇతనికి మనదేశం అంటే ఉన్న ప్రేమవల్లా మన సంగీతం అంటే ఉన్న ప్రేమవల్లా తర్వాత జన్మలో మన దేశంలోనే ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టినాడు.ప్రస్తుతం మన దేశంలో జీవించే ఉన్నాడు.అయితే ఆ వివరాలు యోగరహస్యాలు కాబట్టి ఎక్కువగా వివరించడం కుదరదు.

జాన్ హిగ్గిన్స్ భాగవతార్ పాడిన కొన్ని కీర్తనలని ఇక్కడ వినవచ్చు.

ఎందఱో మహానుభావులు

కృష్ణా నీ బేగనే బారో

గోవర్ధనగిరిధర గోవిందా

అమ్మా రావమ్మా

ఇదే పరంపరలో భాగంగా కొందరు విదేశీయులు పాడిన 'కమలాంబా సంరక్షతు మాం' కృతిని కూడా వినండి.
read more " జాన్ హిగ్గిన్స్ భాగవతార్ జాతకం "

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మోపిదేవి-హంసలదీవి

మొన్నొక రోజున అనుకోకుండా మోపిదేవి,హంసలదీవి పోయివచ్చే అవకాశం కలిగింది.రేపల్లె దగ్గర కృష్ణానదిమీద పులిగడ్డ వారధి వచ్చిన తర్వాత,కృష్ణా జిల్లాలో ఉన్న లంకలు అన్నీ రేపల్లెకు బాగా దగ్గరయ్యాయి.

రేపల్లె పొలిమేరలో ఉన్న పెనుమూడి-పులిగడ్డ వారధిమీదుగా కృష్ణానదిని దాటి కొంతదూరం వెళ్ళగానే మోపిదేవి వస్తుంది.చల్లపల్లి,అవనిగడ్డ అన్నీ అక్కడ దగ్గర దగ్గరగానే ఉంటాయి.మచిలీపట్నం కూడా ఈ దారిలో దగ్గరే.

మోపిదేవి సుబ్రహ్మణ్యక్షేత్రం.నాగదోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేయించుకుంటారు.నాగదోషం అనేది చాలామంది జాతకాలలో ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది.ఇది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా బాధ పెడుతుంది.అమ్మాయిల జాతకాలలో వివాహపరమైన చిక్కులను ఇది కలిగిస్తుంది.అబ్బాయిల జాతకాలలో కూడా చాలామందికి ఇది ఏదో ఒక రూపంలో ఉంటుంది.

ఇష్టంలేని పెళ్ళి చేసుకోవలసి రావడం,పెళ్ళి కాకపోవడం,ఆలస్యం కావడం, పెళ్ళి అయిన తర్వాత విడాకులు తీసుకోవడం,గొడవలు జరిగి విడిపోవడం, లేదా ఇద్దరిలో ఒకరు మరణించడం మొదలైన అనేక పరిణామాలను కుజదోషం కలిగిస్తుంది.

సంతానపరమైన దోషాలకు కూడా ఇదే సర్పదోషం కారణం అవుతుంది.ఈ దోషాలు రకరకాలుగా ఉంటాయి.కొంతమందికి తరతరాలుగా మగపిల్లలు పుట్టరు.ఇంకొందరికి అసలు సంతానమే కలుగదు.కొందరికి సంతానం బాగా ఆలస్యమౌతుంది.కొందరికేమో పుట్టిన పిల్లలు చనిపోతుంటారు.ఇంకొందరికి బాగా పెద్దవారైన తర్వాత తల్లిదండ్రుల కళ్ళెదుట పిల్లలు పోతుంటారు.లేదా సంతానం మొండిగా తయారై పెద్దవాళ్ళ మాట వినకపోవడమూ ఎదురు తిరగడమూ వద్దన్న పనులు చెయ్యడమూ వద్దన్న పెళ్ళిళ్ళు చేసుకోవడమూ ఇలాంటి చర్యలవల్ల పెద్దలు మానసికబాధతో కుంగిపోయి ముసలితనంలో వ్యధతో చనిపోవడమూ ఇలాంటి దోషాలు అసంఖ్యాకమైన రూపాలలో మనుష్యుల జీవితాలలో పీడిస్తూ ఉంటాయి.

స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నవాళ్ళ జాతకాల్లో సర్పదోషం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం వాళ్ళ జాతకం చూడకుండానే చెప్పవచ్చు.మైక్రోస్కోప్ క్రింద పరిశీలిస్తే హ్యూమన్ స్పెర్మ్ లో చిన్నచిన్న పాముల వంటి స్పెర్మటోజోవా అసంఖ్యాకంగా కనిపిస్తాయి.నాగదోషం అనేది పాముపగలాగా తరతరాలు వెంటాడుతుంది అనేది ఖచ్చితమైన నిజం.ఆ దోషం ఉన్న జాతకాలు మూడు నాలుగు తరాలవి వరుసగా పరిశీలిస్తే ఈ సత్యం తేటతెల్లంగా కనిపిస్తుంది.

ఏతావాతా సర్పదోషం అనేది చాలా భయంకరమైన దోషం అనే చెప్పాలి.

అసలు మానవజాతికీ సర్పాలకూ అవినాభావ సంబంధం ఎప్పటినుంచో ఉన్నది.ఎన్నో జంతువులు మానవ జీవితంతో కలిసిమెలసి ఉన్నప్పటికీ సర్పాలకు ఒక ప్రత్యెక స్థానం ఉన్నది.ప్రతి మనిషిలోనూ వెన్నుపామూ మెదడూ కలిసిన వ్యవస్థ,పడగ విప్పిన పాము ఆకారంలోనే ఉంటుంది. సూర్యారాధన ఎంత ప్రాచీనమైనదో సర్పారాధన కూడా అంతే ప్రాచీనమైనది.

యోగసాధనకూ సర్పారాధనకూ కూడా అవినాభావ సంబంధం ఉన్నది. యోగుల జీవితాలలో సర్పాల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.చాలామంది యోగులను సర్పాలు వచ్చి దర్శిస్తూ ఉంటాయి.అవి చూచి పోవడానికి వచ్చాయన్న విషయం తెలియక పక్కన ఉన్నవారు వాటిని చంపేస్తూ ఉంటారు.ఆ దోషం ఆ చంపినవారికే కాక ఆ యోగులకు కూడా పట్టుకుంటుంది.

నాగదోషం ఉన్నవారి జీవితాలలో సూక్ష్మంగా గమనిస్తే ఎన్నో మార్మిక సంఘటనలు నిత్యమూ జరుగుతూ ఉంటాయి.అయితే వాటిని గ్రహించే సూక్ష్మదృష్టి చాలామందికి ఉండదు.అహంకారంతోనూ లెక్కలేనితనంతోనూ మనిషి ఎన్నో విలువైన విషయాలను ఈరకంగా చేజార్చుకుంటూ ఉంటాడు.

ఇంతలో మోపిదేవి ఆలయం రానే వచ్చింది.

ఆరోజున షష్టి కావడంతో గుడినిండా బాగా జనం ఉన్నారు.అయితే ఒక్కరిలోనూ క్రమశిక్షణ లేదు.చేపల మార్కెట్ కంటే అధ్వాన్నంగా అరుచుకుంటూ గోలగోలగా ఉన్నారు.ఒక దేవాలయానికి వచ్చాము మౌనంగా ఉండాలి అన్న భావమే ఒక్కరిలోనూ ఉండదు.మన హిందువులకు పట్టిన అనేక దౌర్భాగ్యాలలో ఇదొకటి.ఈ విషయంలో క్రైస్తవుల నుంచీ ముస్లిముల నుంచీ మనం నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది.వారి ప్రార్ధనాలయాలు ప్రశాంతంగా మౌనంగా ఉంటాయి.దానికి భిన్నంగా,మన దేవాలయాలు సంతకంటే అధ్వాన్నంగా ఉంటాయి.మన దేవాలయాలలో దైవత్వం తప్ప మిగిలిన అన్నీ కనిపిస్తాయి.

హిందువులు ముందుగా సివిక్ సెన్స్ నేర్చుకోవాలి.దేవాలయాలలో మౌనంగా ఉండటం నేర్చుకోవాలి.అతివాగుడూ లోకాభిరామాయణమూ కట్టిపెట్టి కనీసం ఆ కాసేపైనా మౌనప్రార్ధనలో ఉండటం అభ్యాసం చెయ్యాలి.అలా చెయ్యమని నేటి గురువులు బోధించాలి.అప్పుడే కొంతలో కొంత మన దేవాలయాలలో ఉన్న దివ్యత్వాన్ని ఫీల్ అవడం వీలవుతుంది.

క్యూలో నిలబడి గర్భగుడి లోనికి వెళ్ళాము.అక్కడ కూడా ఎవరికి వారు అక్కడున్న లింగాన్ని చూడాలన్న ఆత్రుతలో మెడలు నిక్కించి పక్కవాడిని వెనక్కు తోసేసి మరీ తొంగితొంగి చూస్తున్నారు.ఇలాంటి ప్రవర్తన అంటే నాకు పరమ అసహ్యం.అందుకని నా అంతట నేనే ఒక మూలకు జరిగి కళ్ళు మూసుకుని నిలబడి మిగతావారికి ఒకరినొకరు తోసుకునే అవకాశం చక్కగా కల్పించాను.ఎవరి గోలలో వాళ్ళున్నారు.నా ధ్యానంలో నేనున్నాను.

ఇలాంటి సర్పక్షేత్రాలకు వచ్చినపుడు చెయ్యవలసిన కొన్ని అంతరిక క్రియలు ఉంటాయి.వాటిని చెయ్యడంవల్ల కొన్ని ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. దానివల్ల ఆయా కర్మక్షాళణాలు జరిగాయా లేదా వెంటనే తెలిసిపోతుంది. చుట్టూ రణగొణధ్వనిగా ఉన్న కాకిగోలతో సంబంధం లేకుండా మౌనంగా గర్భగుడిలో ఒక మూలకు నిలబడి నా పనిని ముగించాను.

మంత్రపుష్పం చదివేటప్పుడు కూడా ఆ పూలకోసం ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుకుంటూ ఎగబడుతూ ఉన్నారు.నేనసలు ఆ పూలే తీసుకోలేదు.గుడిలో లోపలికి ఒక మూలకు నిలబడి ఉండటంతో జనం వెనుకగా ఉన్న నేను పూజారికి కనిపించే అవకాశమే లేదు.నాకు విగ్రహం కనిపించే అవకాశమూ లేదు.అయినా నా పనిలో నేనున్నాను గనుక ఇబ్బంది లేదు.పూజ అయిన తర్వాత బయటకు వచ్చాము.

అక్కడనుంచి వెనక్కు రేపల్లె వెళతామని అనుకున్నాను.ఇంతలో 'ఇక్కడ దాకా వచ్చాం కదా హంసలదీవి కూడా చూచి పోదాం' అని మా బృందంలోని ఒకాయన అనడమూ వెంటనే కార్లు హంసలదీవి వైపు తిరిగడమూ వెంటనే జరిగిపోయాయి.లోలోపల నవ్వుకున్నాను.దైవసంకల్పం ఇలాగే సంభవిస్తూ ఉంటుంది.దానికి ఎవరో ఒక వ్యక్తి కారకుడౌతూ ఉంటాడు.ఇలాంటి సంఘటనల వెనుక ఉన్న సూక్షమైన కారణాలూ లింకులూ అంత తేలికగా అర్ధం కావు.కానీ తరచి చూస్తె వాటిని గ్రహించడం కష్టం కాదు.

కృష్ణాజిల్లా లంకలన్నీ అంతా చెట్లూ నీళ్ళతో ఉంటాయి.వాతావరణం బాగుంటుంది.అడవి మధ్యలో ఇళ్ళున్నట్లుగా ఉంటాయి.కేరళ వాతావరణం లాగా ఉంటుంది.కొద్ది దూరం వెళ్ళగానే ఆ చెట్లమధ్యలో ఒక నిదర్శనం నాకు కనిపించింది.దానిని చూడటంతోనే నేను మోపిదేవి గుడిలో చేసిన రెమెడీ పనిచేసిందని,సుబ్రహ్మణ్యస్వామి సమాధానమిచ్చాడనీ వెంటనే నాకు అర్ధమై పోయింది.

దేవుడిని చూడటం కోసం మనం ఎగబడటం కాదు.మనల్ని దేవుడు చూచేలా మనం ఉండాలి.అదే నిజమైన ఆధ్యాత్మికత.అలా మనం ఉండగలిగితే మనం ఎక్కడున్నా దైవం మనల్ని చూస్తూనే ఉంటుంది.మనకు సమాధానం ఇస్తూనే ఉంటుంది.ఆ బంధం ఎప్పుడూ తెగిపోదు.అవసరం తీరాక మరచిపోయేది స్వార్ధపూరిత మానవసంబంధం.ఎన్నడూ మరచిపోనిదీ ఎప్పుడూ తెగిపోనిదీ దైవసంబంధం.మన దృష్టి దైవం మీద పడితే ఉపయోగం లేదు.దైవం దృష్టి మనమీద పడాలి.అట్లా పడే విధంగా మనం ఉండాలి.దైవం ఒక్క విగ్రహంలోనే ఉన్నదా?

మాటల్లోనే హంసలదీవి చేరుకున్నాము.కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం అక్కడకు చాలా దగ్గరలో అంటే నాలుగు కి.మీ దూరంలోనే ఉన్నది.దానిని సాగరసంగమం అనికూడా అంటారు.

మా బృందంలో  ఉన్న శ్రీకాంత్ గారి మామగారే హంసలదీవిలో ఉన్న శృంగేరి సత్రాన్ని చూచుకుంటూ ఉంటారని ఆయన చెప్పినారు.ఆయన మంచి వేదపండితుడు.ఆయనకు దాదాపు అరవైఐదు ఏళ్ల పైనే ఉంటాయి.మేము వెళ్ళగానే ఆయన గబగబా ఎదురొచ్చారు.

ఆయనను చూడగానే శుద్ధ శ్రోత్రియుడని కల్లాకపటం లేని వ్యక్తి అనీ తెలిసి పోతున్నది.వారి సతీమణి కూడా పాతకాలం మడిచీరలో ఉన్నారు.మూడు గదుల చిన్నఇల్లు అతి నిరాడంబరంగా ఉన్నది.ఆ ఇంటిలో మాకు కనిపించినవి కొన్ని వేదాంత గ్రంధాలూ,ఒక వ్యాసపీఠం,శృంగేరి స్వాముల ఫోటోలూ,చాపలూ మాత్రమే.సోఫాలూ కుర్చీలూ టీవీలూ ఏమీ లేవు.

వారు భోజనం చెయ్యమని బలవంతం చేసినారుగాని,మా బృందానికి వంట చేసేపని పెట్టి ఆ కుగ్రామంలో ఆ సాధ్వీమతల్లిని వేళగాని వేళలో ఎందుకు ఇబ్బంది పెట్టాలనిపించి భోజనం వద్దన్నాము.కాఫీ ఇమ్మని చెప్పినాము.భోజనం చెయ్యాల్సిందే అంటూ వారు ఎంతో బ్రతిమిలాడి,మేము వినకపోతే,చివరకు కాఫీ ఇచ్చినారు.

హంసలదీవిలో ఒక మూడొందల ఇళ్ళు ఉంటాయేమో.చాలా చిన్న ఊరు.ఏం కావాలన్నా అయిదారు కి.,మీ దూరంలో ఉన్న కోడూరు అనే ఊరినుంచి తెచ్చుకోవాల్సిందే.చీకటిపడితే ఆదారిలో వీధిదీపాలు కూడా లేవు.అంత కుగ్రామం అది.

'ఈ ఊరికి హంసలదీవి అని పేరెందుకు వచ్చిందో?'అని ఒకాయన కాఫీ తాగుతూ అడిగారు.

'ఇక్కడ హంసల్లాంటి అమ్మాయిలు ఉంటారేమో?' అని మా బృందంలోని ఒకాయన జోక్ గా అన్నారు.

నేను మౌనంగా గమనిస్తున్నాను.

అక్కడే ఉన్న గ్రామవాసి ఒకాయన ఇలా అన్నాడు.

'అనేకవందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక కాకి సముద్రస్నానం చేసి హంసగా మారిందని చెబుతారు.అందుకని ఆ పేరొచ్చింది.'

ఇంతలో మాకు కాఫీ గ్లాసులు అందిస్తున్న శ్రీకాంత్ గారి మామగారు ఇలా అన్నారు.

'హంస అంటే ఏముంది నాయనా?మనమందరమూ హంసలమే. 'హంసస్సోహం'-అని వేదాంతం అంటుంది.మనకు తెలీక కాకుల్లా బ్రతుకుతున్నాం.కాని నిజానికి మనమందరమూ హంసలమే.'తత్త్వమసి' అనే మహావాక్యాన్ని విన్నావా?' అడిగాడు.

ఆ వ్యక్తి అడ్డంగా తలాడించాడు.

'ఈ ప్రదేశంలో కొన్ని వందల ఏళ్లక్రితం పరమహంసలు ఉండేవారు.అంటే మహర్షులన్న మాట.అందుకే దీనికి హంసలదీవి అని పేరొచ్చింది.మా అల్లుడు గారైన శ్రీకాంత్ గారికి దాదాపు రెండుమూడువందల ఏళ్ల క్రితపు పూర్వీకులలో విష్ణ్వానందేంద్రసరస్వతి గారని ఒక స్వామి ఉండేవారు.ఆయన ఇక్కడ చాలాకాలం తపస్సు చేసినారు.అంతటి గొప్పవంశంలోని వాడు గాబట్టే ఈయనకు మా అమ్మాయిని ఇచ్చాను.'అన్నాడు పెద్దాయన.

'లేకపోతే మా శ్రీకాంత్ కి పిల్లనివ్వరా?' అని మా బృందంలోని ఒకాయన చనువుగా ప్రశ్నించాడు.

'మరి అంత మహర్షుల వంశంలోని వాడికి మా అమ్మాయిని ఇస్తే అంతకంటే గొప్ప ఏముంది నాయనా?' అని ఆయన జవాబిచ్చాడు.

ఎంతసేపూ డబ్బూ ఆస్తీ హోదా వగైరాలు చూచి సంబంధాలు కలుపుకునే నికృష్టులు ఉన్న నేటిలోకంలో అలాంటి మాట చెప్పిన వ్యక్తిని ఒక్కరినైనా చూచినందుకు నాకు చాలా ఆనందం కలిగింది.

ఒకే ప్రశ్నకు మూడు జవాబులు!!!

ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఇచ్చిన మూడు జవాబులు నాకు ఎంతో ముచ్చట గొలిపాయి.

మొదటి వ్యక్తి మామూలు సరదా మాటల్లో జవాబు చెప్పాడు.రెండో ఆయన ఆ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న కధను చెప్పాడు.మూడో ఆయన అద్భుతమైన శుద్ధ వేదాంతభావనను చెప్పాడు.ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వారి మాటలు వచ్చాయి.

ఏదేమైనా సరే,పద్ధతిగా జీవించే నిజమైన బ్రాహ్మణుల జీన్స్ లో ఏదో తెలీని ప్రత్యేకత ఉన్నదని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది.ఋషిరక్తం వారిలో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నదనేది వాస్తవం.వారి ఆలోచనలు మామూలు మనుషుల ఆలోచనల కంటె ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి.

ఆ శ్రోత్రియ దంపతులకు నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరాము.

దారిలో ఇలా అన్నాను.'శ్రీకాంత్ గారు! మీ మామగారు సత్పురుషుడు.మన ఆర్షధర్మాన్ని ఇలాంటి వారే ఇంకా నిలబెడుతూ ఉన్నారు.'

'నిజమేనండి.ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు.ఆస్తి లేదు.అసలు వాటిమీద ఆయనకు ధ్యాసే లేదు.అయినా మనిషికి చీకూ చింతా లేదు.ఎంత ఆనందంగా నిబ్బరంగా ఉన్నాడో చూడండి.' అన్నారు శ్రీకాంత్.

'మరి ఆయన ఎక్కడ ఉంటారు?' అడిగాను.

'ఒకచోట అంటూ ఏమీ లేదు.కొడుకుల దగ్గర కొంతకాలం చొప్పున అలా ఉంటూ ఉంటాడు.కొన్ని నెలలు ఇక్కడే ఈ సత్రంలో ఉంటాడు.ఆయన లక్ష్యం ఒకటే.ఈ హంసలదీవిలో వేణుగోపాలస్వామి ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి.అంతే.అందుకోసం ఆయన తపన పడుతూ ఉంటాడు.ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం ఆ కృషి ఫలితమే. ఒక ఏభై ఏళ్లక్రితం ఇంత గుడి ఇక్కడ లేదు.ఆలయానికి ఒక ఇరవై ఎకరాలు ఉన్నది.ఈయన ఇంకొక ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఆవచ్చిన డబ్బుతో ఈ దేవాలయాన్ని వృద్ధిచేస్తూ వస్తున్నాడు.ఈ వయస్సులో కూడా ఇంత కష్టపడతాడు.వద్దంటే వినిపించుకోడు.'అని శ్రీకాంత్ అన్నారు.

కార్లు వేగంగా రేపల్లె వైపు దూసుకు పోతున్నాయి.దారిపక్కనే రాజకీయ భూబకాసురుల ఫ్లెక్సీలు కనిపించాయి.

'శ్రీకాంత్ గారు.మీ బ్రాహ్మణులు ఇక్కడే వెనుకబడి పోతున్నారు.ఎంతసేపూ ఆధ్యాత్మికం,దేవుడు,నీతి,నియమం,నిష్ఠా అంటూ డబ్బునూ ఆస్తిపాస్తులను పోగేసుకోవడం మర్చిపోతున్నారు.ఆ ఫ్లెక్సీ చూడండి.అందులోని వారికి ఎన్ని వేల ఎకరాలూ చాలడంలేదు.ఇంకా ఎక్కడైనా దొరికితే స్వాహా చేద్దామనే చూస్తున్నారు.ఇలాంటివారిని చూచి మీ మామగారు ఎంతో నేర్చుకోవాలి' అని నేను హాస్యంగా అన్నాను.

'వద్దులెండి శర్మగారు.ఇప్పుడు ఆ బుద్ధులన్నీ మనకెక్కడ వస్తాయి?అది రక్తంలో ఉండాలి.రక్తంలో లేనిది ఎలా వస్తుంది?మనం అలాంటి పనులు చెయ్యలేము.ఆస్తిపాస్తుల చింతే మా మామగారి వంటి వారికి ఉండదు.ఇలాంటి మాటలు చెబితే వాళ్ళు నవ్వుతారు' అన్నారు శ్రీకాంత్.

పాతకాలంలో ప్రతి బ్రాహ్మణకుటుంబంలోనూ ఇలాంటి ఋషితుల్యులైన మనుష్యులు ఉండేవారు.ఎదుటివ్యక్తిని మోసం చెయ్యాలనీ,ఆస్తులు కూడబెట్టాలనీ,అవసరమైతే దానికోసం నానా అబద్దాలు చెప్పాలనీ,నీతీ గీతీ గాలికొదిలేయ్యాలనీ,జీవితంలో డబ్బే సర్వస్వమనీ ఇలాంటి ఆలోచనలే వారికి ఉండేవికావు.అటువంటి బ్రతుకులను వారు అసహ్యించుకునేవారు. శాశ్వతంగా నిలిచి ఉండే విలువలే వారికి ప్రధానంగాని ఆస్తులూ డబ్బూ విలాసాలూ వారికి ముఖ్యంకాదు.ఆ శాశ్వతప్రయోజనం కోసం వాళ్ళు దేనినైనా త్యాగంచేసేవారు.నిరాడంబరంగా బ్రతికేవారు.చివరికి అలాగే పోయేవారు. అందుకే వారు ఒకమాట అంటే అది జరిగి తీరేది.అంతటి శక్తి వారిలో ఉండేది.

ఈనాటికీ ఇంతగా కుళ్ళిపోయిన సమాజంలో కూడా అక్కడక్కడా ఇలాంటి మనుషులు ఉండబట్టే వానలు పడుతున్నాయి.పీల్చడానికి గాలి దొరుకు తున్నది.ధర్మం ఏ కొద్దిగా అన్నా నిలబడి ఉన్నదంటే ఇలాంటి వ్యక్తులే కారణం.అంతేగాని ఎక్కడబడితే అక్కడ ఏ రంగంలో బడితే ఆ రంగంలో చెదలా వ్యాపించిన నీతిరహితులూ దొంగలూ కారణం కాదు.

'మన దేశపు నిజమైన బలం ఆధ్యాత్మికత మాత్రమే' అని వివేకానందస్వామి ఎన్నోసార్లు అనేవారు.అది జీవించి ఉన్నంతవరకూ మన దేశానికి నాశనం లేదు.ఈ దేశాన్ని నిలబెడుతున్నది ఆర్షధర్మమే గాని రాజకీయ నాయకులు కాదు.కానీ ఈసంగతి ఎవరికీ అంత త్వరగా అర్ధంకాదు.అర్ధం అయ్యేసరికి సమయం మించిపోతుంది.ఆపుడు అర్ధమయ్యీ ఉపయోగం ఉండదు.అదే విచిత్రం.

ఆలోచనలో ఉండగానే రేపల్లె వచ్చింది.అక్కడ పని ముగించుకుని అందరం గుంటూరు బయలుదేరాము.
read more " మోపిదేవి-హంసలదీవి "

20, ఫిబ్రవరి 2014, గురువారం

దయచేసి మీ పుస్తకాలు మీరే ఉంచుకోండి

మొన్నొకరోజున హైదరాబాద్లో ఉండగా ఒక ఫోనొచ్చింది.

'నాపేరు ఫలానా' అంటూ అవతలి వైపునుంచి ఒక స్వరం వినిపించింది.

నేను వెంటనే ఆ వ్యక్తిని గుర్తుపట్టాను.

అయినా తెలీనట్లు 'మీరెవరో తెలుసుకోవచ్చా?' అనడిగాను.

'నేను 'విశ్వజనని' మాసపత్రిక ఎడిటర్ని' అంటూ ఆయన పరిచయం చేసుకున్నారు.

ఆయన తనను ఎలా పరిచయం చేసుకుంటారో చూద్దామనే నేను అలా అడిగాను.ఎందుకంటే ఆయన జిల్లెళ్ళమూడి అమ్మగారికి మంచి భక్తుడేగాక, కుర్తాళం స్వాములవారి సోదరుడు కూడా.కొన్ని ఉపన్యాస కార్యక్రమాలలో స్టేజి మీద ఆయన్ను చూచాను.

ఆయన తనను వ్యక్తిగతంగా పరిచయం చేసుకుంటారా, ఉద్యోగపరంగా పరిచయం చేసుకుంటారా,సోదరుని రిఫరెన్స్ ఇస్తారా,లేక జిల్లెళ్ళమూడి అమ్మగారి తరఫున రిఫరెన్స్ ఇస్తారా చూద్దామని అలా అడిగాను.సమాధానం సంతృప్తికరంగానే వచ్చింది.

'నేను మీకు తెలీదు కాని,నాకు మీరు తెలుసు సార్' అన్నాను.

'నేను ప్రస్తుతం మీ ఆఫీస్ లోనే ఉన్నాను.ఇక్కడికి వస్తే మీరు లైన్ మీద వెళ్ళారని తెలిసింది' అన్నాడాయన.

నాకు తెలిసి ఆయనకు వయస్సు డెబ్భై ఏళ్ల పైనే ఉండాలి.పాపం అంత పెద్దవాడు వెతుక్కుంటూ నాకోసం రావడం బాధ అనిపించింది.

'నేను రేపు గుంటూరుకు వస్తాను.ఏదైనా పనుంటే చెప్పండి సార్.మీరెందుకు రావడం?నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను' అడిగాను.

'లేదులెండి.(జిల్లెళ్ళమూడి)అమ్మగారి అబ్బాయి మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పినారు.నేనే మళ్ళీ కలుస్తాను' అంటూ ఫోన్ కట్ చేసాడాయన.

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది.

ఆరోజు ఆదివారం.గుంటూరులోనే ఉన్నాను.ఎందుకోగాని ఆ రోజున అకాలవర్షం పడుతోంది.

'మీ ఇల్లు ఎక్కడో చెబితే నేను వచ్చి కలుస్తాను' అన్నారాయన.

మా ఇంటి అడ్రస్ ఆయనకు చెప్పాను.ఆ వర్షంలో పాపం అంత పెద్దాయనని ఇబ్బంది పెట్టడం ఎందుకని ' సార్.ప్రస్తుతం నేను మీ ఇంటిదగ్గర లోనే ఉన్నాను.మీ ఇల్లు ఎక్కడో చూచాయగా నాకు తెలుసు కాని సరిగ్గా తెలియదు.కొండగుర్తులు చెబితే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను.' అని చెప్పినాను.

ఆయన అడ్రస్ చెప్పినారు.

పెద్దగా కష్టపడకుండా సులభంగానే అడ్రస్ దొరికింది.ఇంతలో ఆయనే బయటకు వచ్చి నాకోసం ఎదురొచ్చారు.

'నమస్కారం సార్' అంటూ 'నేనే మీరు ఫోన్ చేసిన సత్యనారాయణ శర్మను' అన్నాను.

'రండి' అంటూ ఇంటిలోకి తీసికెళ్ళాడు ఆయన.

ఇంటిలో ఎక్కడ చూచినా అమ్మగారి ఫోటోలు కనిపిస్తున్నాయి.వాటిలో చాలా పాత ఫోటోలు కూడా ఉన్నాయి.ముందు గదిలో కూచున్నాము.

పరిచయాలూ కుశల ప్రశ్నలూ అయ్యాక 'ఒక్క నిముషం' అంటూ లోనికెళ్ళి రెండు పుస్తకాలు తెచ్చి నాకిచ్చారు.ఒకటి కొంచం లావుగా ఉన్న పుస్తకం. ఇంకొకటి చిన్న హేండ్ బుక్ లాంటి పుస్తకం.

ఈలోపల నేను గోడలకున్న ఫోటోలు చూస్తూ కూచున్నాను.

'నేను 'విశ్వజనని' పత్రికలో చాలా ఏళ్ళనుంచీ వ్రాస్తూ వస్తున్న సంపాదకీయాలు అన్నీ కలిపి ఈ పెద్ద పుస్తకంగా వేశాము.చదవండి.ఇది ఇంకొక చిన్న పుస్తకం.కొత్తవాళ్ళకు అమ్మ గురించి అమ్మ చింతన గురించీ పరిచయం చేస్తుంది.ఇవి మీకిద్దామనే రమ్మన్నాను'- అని రెండు పుస్తకాలు ఇస్తూ అన్నారు.

నేను ఒక్క క్షణం ఆ పుస్తకాలవైపు చూచాను.

'సార్.మీరేం అనుకోకండి.నాదొక చిన్నమాట' అన్నాను.

ఆయన ప్రశ్నార్ధకంగా చూచాడు

'ఈ పుస్తకాలు నాకొద్దు.మీరే ఉంచుకోండి.'అన్నాను.

ఆయన ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.

'అమ్మ గురించి అంతా చదివాను.నాకు మొత్తం అర్ధమైంది అని నేను చెప్పను.ఎందుకంటే ఆ మాట అహంకారం అవుతుంది.కాని సవినయంగా ఒక మాట చెబుతాను.చిన్నప్పటినుంచి అమ్మ సాహిత్యం బాగానే చదివినాను. పుస్తకాలు చదివి ఇంక నేను తెలుసుకోవలసినది ఏదీ లేదని నా ఉద్దేశ్యం. అందుకని దయచేసి ఏమీ అనుకోకండి.ఈ పుస్తకాలు మీ దగ్గరే ఉంచండి.' అని సున్నితంగా చెప్పినాను.

'అలాగా.అయితే మీరు ఫలానా పుస్తకాలు చదివారా?' అంటూ మూడు నాలుగు ముఖ్యమైన పుస్తకాల పేర్లు ఆయన అడిగినారు.

'చదివాను' అని జవాబిచ్చాను.

'మీరు అమ్మగారిని చూచారా?' అడిగారు.

'నాకు 13 ఏళ్ళ వయస్సులో ఒక్క రెండు నిముషాల పాటు అమ్మగారిని దర్శించే భాగ్యం జిల్లెళ్లమూడిలో కలిగింది.అంతకంటే అదృష్టం కలగలేదు' అని మాత్రం చెప్పినాను.

'ఆధ్యాత్మిక మార్గంలో నిజానికి పుస్తకాల ఉపయోగం పెద్దగా ఏమీ లేదు.అంతా వాడి కరుణతో రావలసిందే' అంటూ ఆకాశం వైపు చేతులు చూపాడాయన. 'అయితే నడవాల్సిన దారి ఏమిటో పుస్తకాలు చూపిస్తాయి.అంతవరకే వాటి ఉపయోగం' అన్నాడు.

అది నిజమే కావడంతో నేను మౌనంగా తలాడించాను.

'నేను 1958 నుంచీ జిల్లెళ్ళమూడి వెళుతున్నాను.అప్పట్లో దారి కూడా సరిగ్గా ఉండేది కాదు.రెండు కాలవలు దాటి వెళ్ళాలి.వాటి మీద తాటి దుంగలు వేసి ఉండేవి.ఆ దుంగల మీదుగా నడిచి కాలవలు దాటి వెళ్ళవలసి వచ్చేది.వాన పడితే మోకాలి లోతు బురదలో పొలాలలో నడుస్తూ వెళ్ళేవాళ్ళం.' అన్నాడాయన.

'అప్పటికి నేనింకా పుట్టలేదు సార్' అన్నాను.

నవ్వాడాయన.

'అప్పట్లో పెద్దగా జనం ఉండేవారు కారు.ముఖ్యమైన రోజులలో అయితే ఒక పదీ పదిహేను మంది కంటే వచ్చేవారు కారు.కాని 1962 తర్వాత జనం బాగా రావడం మొదలైంది.ఒక్కోసారి పదివేల మంది అమ్మ దర్శనం కోసం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.అయితే అందరూ అమ్మకోసం వచ్చేవారు కారు.ఒకసారి సినిమా నటులు కృష్ణా విజయనిర్మలా అమ్మ దర్శనం కోసం వస్తే వాళ్ళను చూడటం కోసం ఊరిజనం తండోపతండాలుగా ఎగబడ్డారు.' అని నవ్వాడాయన.

నాకూ నవ్వొచ్చింది.సినిమా నటులు మద్రాస్ నుంచి అమ్మను చూడటానికి వస్తే,ఆ ఊరిలోనే ఉన్న జనం ఆ నటులను చూడటానికి ఎగబడటం ఎంత విచిత్రం?మాయాప్రభావం అంటే ఇదే కదా?ఎంత మహనీయులైనా సరే రోజూ ఎదురుగా కనిపిస్తుంటే వారి విలువ తెలియదు.ఇది సహజమే.

'పిచ్చిజనం! అంతేగా మరి' అనుకున్నాను.

'ఆ రోజులు అమ్మ చరిత్రలో స్వర్ణయుగం అనుకుంటా?' అడిగాను.

'అవును.ఎంతోమంది ప్రముఖులూ గొప్ప గొప్పవాళ్ళూ అమ్మ దర్శనం కోసం వచ్చేవారు.'అంటూ అప్పటి మహాకవులూ పండితులూ సాధకుల పేర్లు చాలా ఉటంకించాడాయన.'వీళ్ళందరూ అమ్మ పాదాల వద్ద కూచున్నవారే.మా సోదరులు ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతి కూడా అమ్మ వద్దకు వచ్చి అమ్మ పాదాలవద్ద కూర్చున్నవారే.' అన్నాడు.

నేను మౌనంగా వింటున్నాను.

'కుర్తాళం స్వాములవారు మా సోదరులే.వారిదే మౌనప్రభ అని ఒక పత్రిక ఉన్నది.దాని బాధ్యతలు కూడా నేనే చూస్తూ ఉంటాను.' అన్నారు.

నేనేమీ మాట్లాడలేదు.

'ప్రస్తుతం చాలామంది స్వామీజీలున్నారు.కాని ఆయనవంటి మంత్రోపాసకులు మాత్రం ప్రస్తుతం ఎవరూ లేరు' అన్నారు.

'ఉపాసకులు లేకుండా ఎలా ఉంటారు?వారున్నట్లు మనకు తెలియకపోవచ్చు. అందర్నీ మనం గుర్తించగలమా?' అన్నాను.

ఆయన కొంచం ఆశ్చర్యంగా చూచాడు.

'మా వంశంలో మూడుతరాలుగా కవిత్వం ఉన్నది.మాతాతగారు మా నాన్నగారు మంచి కవులు.అదే మాకూ అబ్బింది.'-అంటూ ఆయన చిన్నప్పుడు వ్రాసిన రెండుమూడు పద్యాలను చదివి వినిపించాడు.

'బాగున్నాయి'-అన్నాను నవ్వుతూ.

'మా సోదరులు కులపతి గారు ఇప్పటికి ఆధ్యాత్మికత మీద దాదాపు నలభై పుస్తకాలు వ్రాశారు.చదివారా?' అన్నాడు.

'బహుశా ఒకటో రెండో చదివానేమో గుర్తులేదు' అన్నాను నిరాసక్తంగా.

ఆ పుస్తకాల గురించి నా అభిప్రాయాలు చెప్పి పాపం పెద్దాయనని బాధ పెట్టడం ఎందుకనిపించింది.

ఆధ్యాత్మికతనూ అమ్మ తత్వాన్నీ నాకు పరిచయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో ఆయన నన్ను రమ్మన్నట్లు నాకు అర్ధం అయింది.ఆ ఉద్దేశ్యం నెరవేరే అవకాశం నా దగ్గర ఆయనకు కనపడలేదు.బహుశా ఆయన అనుకున్న తీరులో నేను ఆయనకు కనిపించలేదేమో.ఎంతసేపు కూచున్నా నేనేమీ ఆయన్ను ప్రశ్నలు అడగడం లేదు. మౌనంగా కూచుని చూస్తున్నాను.లేదా ముక్తసరిగా జవాబులు ఇస్తున్నాను.అది ఆయనకు ఇబ్బందిగా ఉన్నదని ఆయన బాడీ లాంగ్వేజి చూస్తే నాకర్ధమైంది.

మౌనం తప్ప మాటలు ముందుకు సాగడంలేదు.ఇక బయలుదేరడం మంచిదని నాకు తోచింది.

'నేను వెళ్ళి వస్తానండి.పుస్తకాలలో మీలాంటి పెద్దవారి పేర్లు చదవడమే కాని ఇన్నాళ్ళూ పరిచయం లేదు.మీతో ఈరోజు ఇలా పరిచయం చేయించింది అమ్మ.' అంటూ లేచాను.

'మంచిది' అన్నాడాయన.

అంత పెద్దవయసులో కూడా ఆధ్యాత్మికతనూ అమ్మ తత్త్వచింతననూ నలుగురికీ పరిచయం చెయ్యాలన్న ఆయన తపనకు నాకాశ్చర్యం వేసింది.అదే సమయంలో,పాండిత్యం అనేది సత్యాన్ని ఎలా దగ్గరకు చేరనివ్వకుండా అడ్డుపడుతుందో కూడా మళ్ళీ ఇంకొక్కసారి అర్ధమైంది.

నేర్చుకునేవారికి జీవితంలో అనుక్షణం ఎన్నో అవకాశాలను దైవం ఇస్తూనే ఉంటుంది.జీవితం నిజంగా ఎంతో అద్భుతమైన వరం.దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే అనుక్షణం ఎంతో నేర్చుకోవచ్చు.అంతరికంగా ఎంతో ఎదగవచ్చు.ఉపయోగించుకోలేకపోతే,ఎదురౌతున్న అవకాశాలను వృధా చేసుకోవచ్చు కూడా.చాలామందికి జరిగేది అదే.

కానీ దైవం ఎన్నటికీ విసుగు చెందదు.ఒకదాని తర్వాత ఒకదానిని అలా అవకాశాలను పరంపరగా ఇస్తూనే ఉంటుంది.వాటిని ఎలా స్వీకరించాము వాటినుంచి ఎంత నేర్చుకున్నాము ఎంత ఎదిగాము అన్నదే జీవితంలో అతి ముఖ్యమైన విషయం.

మనం ఎంతవరకు చూస్తే అంతవరకే ఎదుటి మనిషి అర్ధమౌతాడు.మన దృష్టే మనకు దారి చూపిస్తుంది.అదే దృష్టే మళ్ళీ ప్రతిబంధకమూ అవుతుంది.కళ్ళు తెరిచి చూస్తే చూచినంత మేరకే కనిపిస్తుంది.కళ్ళు మూసుకుని చూచే విద్య తెలిస్తే సర్వం కనిపిస్తుంది.కళ్ళు మూసుకుని చూచే కిటుకును నేర్చుకున్న వాడే నిజంగా చూడగలిగినవాడు.వాడే నిజంగా కళ్ళున్నవాడు.

మన దృక్కోణమే మనలను సంకుచితపరుస్తుంది.సత్యాన్ని చూడనివ్వకుండా మన మనస్సే మనకు అడ్డు పడుతుంది.అంతిమంగా మనం చూడాలనుకున్న దానినే మనం చూస్తాం.అంతేగాని ఉన్నదానిని ఉన్నట్టు చూడము.తాను చూడాలనుకున్న దానిని మాత్రమే చూడటం నిజమైన చూపు కాదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడటమే అసలైన దృష్టి.అది లేనంతవరకూ దేవుడు వచ్చి మన ఎదురుగా నిలబడినా మనకు అర్ధం కాబడడు.ఎందుకంటే మన దృష్టి ఎక్కడో ఉంటుంది గనుక.

తెలివైనవాడు జీవితంలోని ప్రతి అడుగులోనూ ఒక కొత్త విషయాన్ని చూస్తాడు.ఒక కొత్త సంగతి నేర్చుకుంటాడు.నేర్చుకోగలిగితే జీవితాన్ని మించిన గురువు ఇంకెవరున్నారు?ప్రతిక్షణమూ దైవం మన ఇంటి తలుపులు తడుతూనే ఉంటుంది.కాని మనం మొండిగా మన తలుపులు మూసుకుని కూచుంటే అది ఎవరి తప్పు అవుతుంది?

జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ఇదే అనేవారు.

'నీవు అడిగితే అడిగినదే ఇస్తాను.అడగకపోతే నీకు అవసరమైనది ఇస్తాను'-అనేది అమ్మ వాక్కులలో ఒకటి.

అడగకుండా ఉండగలిగేవారు ఈ భూమ్మీద ఎందరుంటారు?తమ ఇష్టాన్ని పక్కనపెట్టి,దైవం ఇచ్చిన 'అవసరమైన దానిని' ఆనందంగా స్వీకరించగలిగే వారు ఎందరుంటారు?

చూస్తూ కూడా చూడనివారూ,చూడకుండా చూచేవారూ ఈ పిచ్చిలోకంలో ఎక్కడుంటారు?

లోలోపల నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి మా ఇంటి వైపు పోనిచ్చాను.
read more " దయచేసి మీ పుస్తకాలు మీరే ఉంచుకోండి "

19, ఫిబ్రవరి 2014, బుధవారం

మంచి చాన్స్ మిస్సయింది

మొన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువైన శ్రీశ్రీరవిశంకర్ మంగళగిరికి ఒక ప్రత్యెక రైలులో వచ్చినారు.ఆ రైలుకు సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ చూచే బాధ్యతలో నాకూ భాగం ఉన్నది.ఆ ఏర్పాట్లు అన్నీ యధావిధిగా చేసినాము.ఒక వెయ్యిమంది వాలంటీర్లు ఆయన్ను రిసీవ్ చేసుకోడానికి వస్తారని తెలిసింది.మంగళగిరికి వెళ్ళి అక్కడ ఆ నిర్వాహకులతో మాట్లాడి స్పెషల్ రైలును ఏ ప్లాట్ ఫాం మీదకు తీసుకోవాలి?వగైరా విషయాలు చర్చించడానికి ఒకరోజు ముందుగా ఇంకొక అధికారి మంగళగిరికి వెళ్ళి ఆ పనులు చూచినారు.

'గురూజీ వచ్చేరోజున తెనాలి నుంచి ఆయనతో కలసి స్పెషల్ రైల్లో మనం ప్రయాణం చెయ్యవచ్చు.మంచి అవకాశం.ఆయన్ని దగ్గరగా చూడవచ్చు. పక్కనే కూచుని మాట్లాడవచ్చు.మీరూ రండి.మీకు ఆధ్యాత్మికం అంటే ఇష్టం కదా.' అని ఒక అధికారి నన్నూ అడిగారు.

నేను నవ్వేసి -'ప్రత్యేకించి ఆయన్ను చూడాలని నాకేమీ లేదు.ఉద్యోగబాధ్యత లలో భాగంగా రావలసి వస్తే వస్తాను.' అని జవాబిచ్చాను.

అనుకున్నట్లే ఆరోజు రానే వచ్చింది.మా విభాగం నుంచి ఇద్దరు అధికారులు వెళ్ళి రవిశంకర్ గారితో కలిసి తెనాలి నుంచి మంగళగిరివరకూ ప్రయాణం చేస్తూ వచ్చారు.ఆయన వారికి శాలువాలు కప్పి సత్కరించారు.వారిని ఆశీర్వదించారు.వారితో చక్కగా మాట్లాడారు.మంగళగిరి వచ్చాక ఆయన తన శిష్యులతో కలసి దిగి హాయ్ లాండ్ కు వెళ్ళిపోయాక మా వాళ్ళు తిరిగి వచ్చారు.

'మీరూ వచ్చినట్లయితే బాగుండేది.మీకూ శాలువా కప్పి గురూజీ సత్కరించేవారు.మీతోనూ క్లోజ్ గా మాట్లాడేవారు.మేము ఆయనతో కలసి ఒక గంట సేపు ప్రయాణం చేసినాము.చాలా బాగుంది.' అని నా కొలీగ్ అధికారి ఒకాయన అన్నారు.

'అందుకే నేను రాలేదు.' అని నేను జవాబిచ్చాను.

ఆయన అర్ధం కానట్లు ముఖం పెట్టినాడు.

'నేను వచ్చినట్లయితే మీకూ ఆయనకూ ఇబ్బంది అయ్యేది' అన్నాను.

'మనకు స్పెషల్ పాసులున్నాయి.కావాలంటే హాయ్ లాండ్ లోని మీటింగ్ కి మీరు వెళ్ళి రండి.'అని రెండు పాసులు నాకు ఇవ్వబోయాడు.

పక్కనే ఉన్న ఇంకొకాయన అందుకొని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' చాలా మంచిది.మీరు మీటింగ్ అటెండ్ అయితే బాగుంటుంది.' అన్నాడు.

నేను నవ్వేసి ' నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నాకుంది.ఇంకా కొత్తవి అవసరం లేదు.నా ఆర్ట్ నాకు చాలు' అన్నాను.

'ఆయనేం చెబుతాడో వినొచ్చు కదా?' అని సందేహం వెలిబుచ్చాడు.

'అసలు లివింగే ఒక ఆర్ట్.మళ్ళీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది?మీకు అవసరమైతే మీరు వెళ్ళి రండి' అని పాసులు ఆయనకే ఇచ్చేశాను.

'మీకు ఎవరూ గిట్టరెంటి సార్?' అని అడిగాడు.

'గిట్టకపోవడం అంటూ ఏమీ లేదు.దాహం తీరినవాడికి మంచినీళ్ళెందుకు?'అని నేను జవాబిచ్చాను.

'గురూజీని దగ్గరగా చూచే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది?' అని ఒకాయన అన్నాడు.

'మీరు ఎంత దగ్గరగా చూచారు?' అడిగాను.

'ఆయన పక్కనే కూచుని ప్రయాణం చేశాము' అన్నారు.

'మరి ఆ కాస్త దూరం మాత్రం ఎందుకు? ఇంకా దగ్గరగా వెళ్ళకపోయారా?' అడిగాను.

'అదేంటి సార్? అలాగంటారు?' అన్నాడు.

'అబ్బే ఏమీ లేదు.దగ్గరగా చూడటమే పరమావధి అయితే ఆ కాస్త దూరం మాత్రం ఎందుకు?ఇంకా దగ్గరగా వెళితే బాగుండేది కదా అనేదే నా అభిప్రాయం '- అన్నాను.

నేను ఏ ఉద్దేశంతో అంటున్నానో వారికి అర్ధం కాలేదు.

'ఏంటో మీరు మాట్లాడేది చాలాసార్లు మాకు అర్ధం కాదు.ఏదేమైనా మీరు మంచి  చాన్స్ మిస్ చేసుకున్నారు.' అని ఇదంతా వింటున్న ఒకాయన అన్నాడు.

'నాకొక మిసెస్ ఆల్రెడీ ఉంది.కొత్తకొత్త మిస్సులు అవసరం లేదు.'అని నవ్వుతూ జవాబిచ్చాను.

అదీ వాళ్లకు అర్ధం అయినట్లు నాకనిపించలేదు.

ఈయనతో మాటలు అనవసరం అనుకున్నారో ఏమో వాళ్ళ పనిమీద వాళ్ళు వెళ్ళిపోయారు.

మొత్తం మీద ఒక మంచి చాన్స్ మిస్సయింది.అది నాకో,గురూజీకో,పక్కన చూచేవారికో మాత్రం నాకర్ధం కావడం లేదు.
read more " మంచి చాన్స్ మిస్సయింది "