“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, ఏప్రిల్ 2022, గురువారం

భగవంతుడు అలా రాస్తే మనమేం చేస్తాం?

శనీశ్వరుని రాశిమార్పు వల్ల అనేకమార్పులు మీమీ జీవితాలలో ఇప్పటికే కనిపిస్తూ ఉంటాయి. దాని ఫలితంగా పాత పరిచయస్తులు కనిపించడం మాట్లాడటం మొదలైన  సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

వీటిలో భాగంగా నిన్నొకాయన నా ఆఫీస్ చేంబర్ కు వచ్చి కలిశాడు. 2017 లో ఆయన నా తక్షణ పై అధికారిగా గుంటూరులో పనిచేశాడు. రిటైరై అయిదేళ్లవుతోంది. అప్పట్లో నాతో బానే ఉండేవాడు. నా సర్వీసు మొత్తం మీద నాతో గొడవపడకుండా, నన్ను అణగదొక్కకుండా ఉన్న అతితక్కువమంది నా పై అధికారులలో ఈయననొకడు. అందుకని ఈయన్ని మర్చిపోయాను. కానీ చూడగానే గుర్తుపట్టాను. శత్రువులు గుర్తున్నంతగా, మంచిగా ఉన్నవాళ్లు గుర్తుండరు కదా !

ఏదో పనుండి రైల్ నిలయానికొచ్చి, నా పేరు చూచి, పలకరించి పోదామని లోపలకొచ్చాడు. కూచోబెట్టి, కాసేపు మాట్లాడి, కనీసమర్యాద చేసి పంపాను.

రిటైరయినాక ఖాళీగా ఊరుకోకుండా, ఏదో ఒకచోట పనిచేస్తూ, అరవై డెబ్భైవేలు సంపాదించుకునే కొలీగ్ ఆఫీసర్స్ నాకు చాలామంది  తెలుసు. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తూ ఉంటుంది. వాళ్లకు ఉన్నదాంతో హాయిగా బ్రతకొచ్చు. ఏదో  ఒక ఉన్నతమైన దారిలో నడవొచ్చు. కానీ అలా చెయ్యరు. కారూ, ఫ్యూనూ, ఏసీ రూమూ ఇలాంటి చీప్ హోదాల కోసం ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు.

మనిషిగా పుట్టాక, మనిషి జన్మకొక సార్ధకత అంటూ ఉండాలి. అంతేగాని, మనిషిగా పుట్టి జంతువుగా చావకూడదు. చావబోయేవరకూ 'డబ్బు డబ్బు' అంటూ చస్తూ ఉంటే, చివరకు కుక్కచావే అవుతుంది. కుక్కకూడా చివరిక్షణం వరకూ తిండికోసమే బ్రతికి చనిపోతుంది. దానికి తిండి ఉంటే చాలు. మనిషికో? అదొక్కటే చాలదు. ఇంకా చాలా కావాలి. ఎంతున్నా సరిపోక, 70  వచ్చినా 80 వచ్చినా 'ఇంకా ఇంకా' అని అలమటిస్తూ చస్తాడు మనిషి. అలాంటి మనిషి బ్రతుకు, చాలా హీనమని నేను భావిస్తాను. కనీసం పెద్దవయసులో నైనా ఉన్నతమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపకపోతే మనిషి జీవితానికి అర్థమేముంటుంది?

సరే ఈ గోల అలా ఉంచి విషయంలోకొద్దాం.

అదీ ఇదీ మాట్లాడాక, తను ఎంతమంది పై అధికారుల దగ్గర పనిచేసిందీ, వారిలో కొందరు  తననెలా హింసపెట్టిందీ అంతా చెప్పుకొచ్చాడాయన. ప్రస్తుతం ఎవరిని కదిలించినా ఐడెంటిటీ క్రైసిసే కాబట్టి, అందులోనూ రిటైరైన అధికారులను ఎవరూ లెక్కచేయరు కాబట్టి, వాళ్లకి శ్రోతలు ఉండరు కాబట్టి, వాళ్లలో ఈ పోకడ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఓపికగా ఆయన చెప్పినదంతా విన్నాను.

అన్నీ చెప్పి చివరకు, 'భగవంతుడు మన నుదుట అలా రాస్తే, అంతకంటే తేడాగా ఎలా జరుగుతుంది చెప్పండి? దేవుడే మనకలా రాసినప్పుడు, మనల్ని బాధపెట్టిన వాళ్లను అనుకోవడం ఎందుకు? వాళ్ళూ నిమిత్తమాత్రులే?' అన్నాడు వేదాంతధోరణిలో.

అప్పటిదాకా ఆయన గతస్మృతులను మౌనంగా వింటున్న నేను, 'దేవుడెందుకు ఒకరి నుదుట అలా రాస్తాడు?  ఆయనకేమైనా మనమంటే కోపమా?' అన్నాను నవ్వుతూ.

ఆయన వాక్ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఎంతైనా ఒక సివిల్ సర్వెంట్ గా రిటైరైనవాడు కదా ! తెలివితేటలు బానే ఉంటాయి.

'అవుననుకోండి. మనం చేసుకున్నదే మనం అనుభవిస్తుంటాం. అంతే' అన్నాడాయన.

మనుషులెప్పుడూ ఇంతే. ఎక్కడో చదివి, లేదా ఏ టీవీలోనో విని చిలకపలుకులు పలుకుతూ ఉంటారు. లాజికల్ గా ఆలోచిస్తే అరువు తెచ్చుకున్న ఆ అభిప్రాయాలేవీ ఒక్క క్షణంపాటు కూడా నిలబడవు. కాసేపు దేవుడంటారు, కాసేపు మన ఖర్మ అంటారు. ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధాలని వాళ్లకు అర్ధం కాదు.

'దానికీ గ్యారంటీ లేదుకదా.  చాలామంది, వాళ్ళు  సంపాదించినది కూడా వాళ్ళు తినలేరు. మరికొంతమంది వాళ్ళేమీ చెయ్యకపోయినా ఇతరులమీద పడి బ్రతికేస్తూ ఉంటారు. అలాంటప్పుడు, మనం చేసుకున్నదే మనం అనుభవిస్తామని గ్యారంటీగా ఎలా చెప్పగలం?' అన్నాను నవ్వుతూ.

ఆయన ఇరకాటంలో పడ్డాడు. ఆయన టీవీలలో విన్నది అంతే మరి !

'మరేంటంటారు?' అన్నాడు అయోమయంగా.

'ఏమో నాకేం తెలుసు? విషయాన్ని నేను సిద్ధాంతీకరించలేదు. మీరు చెబుతున్నదానికి లాజికల్  గా నాకు తోచినది చెప్పాను' అన్నాను. 

పాపం ఆయనదగ్గర జవాబు లేదు.

సీట్లోంచి లేచాడు.

'ఉంటానండి. మీ బోర్డు కనిపిస్తే పలకరిద్దామని వచ్చాను. ఉంటామరి' అన్నాడు.

'మంచిదండి. ఆరోగ్యం జాగ్రత్త' అన్నాను.

ఆయన నిష్క్రమించాడు.

జీవితం ఎంత కామెడీనో?

మనిషి తనలోకి తను తొంగి చూచుకుంటే, అక్కడ భరించలేనంత వెలితీ శూన్యమూ ఉంటాయి. అందుకని వాటిని పూడ్చుకోడానికి, గతాన్ని జస్టిఫై చేసుకోడానికి, ఎక్కడో చదివినవీ విన్నవీ నలుగురికీ చెప్పబోతూ, తద్వారా తాము కరెక్ట్ అని అనుక్షణం తమని తాము మభ్యపెట్టుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. లేకపోతే ఆ వెలితి వాళ్ళను మింగేస్తుంది. ఇది ప్రతివాడి జీవితంలోనూ జరుగుతుంది. కాకపోతే  రిటైరైన ముసలాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

అలా మభ్యపెట్టుకోకుండా, ఆ వెలితిని డైరెక్ట్ గా ఎదుర్కొని, దానిని పూడ్చడమే అసలైన ఆధ్యాత్మిక జీవితమని, దాన్ని ముసలితనంలో కాకుండా, వయసులో ఉన్నపుడే చెయ్యాలని, నేనంటాను. అయితే, దీనినందరూ చెయ్యలేరు. జనాభాలో 99.99% మనుషులకి, పుట్టిననాటి నుండి, పోయేవరకూ ఈ లోపలి వెలితి అలాగే ఉంటుంది. దానిని అలా మోస్తూనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ అంతరిక వెలితిని కప్పిపెట్టుకోడానికి వేసే వేషాలే జీవితమంటే.

ఎక్కడో చాలా తక్కువమంది మాత్రం దీనిని గ్రహించి, అర్ధం చేసుకుని, ప్రయత్నించి, దానిని పూడ్చుకోగలుగుతారు. అందరికీ ఇది సాధ్యం కాదు.

అయినా, నా  పిచ్చిగాని, భగవంతుడు మన నుదుట అలా రాస్తే మనమేం చెయ్యగలం చెప్పండి? అయినా ఆయనకు మనమంటే ఎందుకంత కోపమో? ఎందుకలా రాసేస్తాడో? ఏ ఇంకుతో రాస్తాడో మన నుదుట?'

ఏంటో అంతా అయోమయంగా ఉంది !

కదూ???
read more " భగవంతుడు అలా రాస్తే మనమేం చేస్తాం? "

26, ఏప్రిల్ 2022, మంగళవారం

మీ విధానంలో జ్యోతిష్యం నేర్చుకుంటే ఏమౌతుంది?

మొన్నొకాయన ఇలా మెయిల్ ఇచ్చాడు.

'మీరు రాసిన 'వైద్యజ్యోతిష్యం' చదివాను. బాగుంది. మీతో కొంచం మాట్లాడాలి. ఫోన్ నంబర్ ఇస్తారా?'

'సరే పాపం కష్టపడి బుక్కు చదివాడు కదా? ఏం మాట్లాడతాడో చూద్దాం', అనుకుని ఇచ్చాను.

వెంటనే ఫోన్ చేసాడు. సంభాషణ ఇలా నడిచింది.

'మీ ఎనాలిసిస్ విధానం నాకు బాగా నచ్చింది. మీ విధానంలో జ్యోతిష్యం నేర్చుకుంటే ఏమౌతుంది?'

ఇలా అన్నాను.

'జ్యోతిష్యం మీద విరక్తి కలిగి, జ్యోతి మీదకు మనసు పోతుంది'

ఆయన ఖంగుతిన్నాడు. కాసేపు ఫోన్లో మౌనం.

'అంటే, అర్ధం కాలేదండి' అన్నాడు.

'ఇందులో అర్ధం కానంత బ్రహ్మసూత్రాలు ఏమీ లేవండి. ప్రతిదానికీ గ్రహాలు, తిధులు అంటూ చూసుకునే ధోరణి పోతుంది. లోకంలో మీరు చూస్తున్న జ్యోతిష్యం అంటే విరక్తి కలుగుతుంది. వెలుగు వైపు దృష్టి మళ్లుతుంది. ఆ వెలుగుని నేను జ్యోతి అన్నాను' అని చెప్పాను.

'ఓ అదా ! చంపేశారు. నేను ఇంకేదో అనుకున్నాను' అని గొల్లున నవ్వాడు.

నేను మౌనంగా ఉన్నాను.

'ఇంకొక్క ప్రశ్న అడగవచ్చా?' అడిగాడు.

'ఓ అడగండి' అన్నా, 'రోలు - పోటు' సామెతని గుర్తు చేసుకుంటూ.

'మీరు అంటున్న వెలుగు ఏమిటి?' అన్నాడు.

'జీవితంలోని మౌలికవిషయాల గురించి మీలో ఆలోచన తలెత్తుతుంది. ఆ దారిలో మీలో ఆలోచనా తరంగాలు పుడతాయి. పాత పోస్టులలో అవేంటో వ్రాశాను. చదువుకోండి' అన్నాను.

'అంటే, ఆ వెలుగు అందినప్పుడు, ఇక జ్యోతిష్యంతో పని ఉండదంటారా?' అన్నాడు.

'ఉండదు' అన్నాను.

'పోనీ, వేరేవాళ్లకు మేము చెప్పొచ్చా మీ దగ్గర నేర్చుకుని?' అడిగాడు.

'డబ్బులు తీసుకోకుండా చెప్పవచ్చు' అన్నాను.

'తీసుకుంటే ఏమౌతుంది?' అన్నాడు.

'వాళ్ళ కర్మ మీ నెత్తిన కూచుంటుంది. మీరు మునుగుతారు' అన్నాను.

'ఆమ్మో. ఇది కొంచం డేంజర్ సబ్జెక్ట్ లాగుంది కదండీ?' అన్నాడు నెమ్మదిగా.

'కొద్దిగా కాదు. చాలా డేంజర్. ఆటలాడితే చేతులు కాలతాయి' అన్నాను సీరియస్ గా.

'అలా కాలకుండా ఉండాలంటే?' మళ్ళీ ప్రశ్న.

'స్వార్ధానికి అతీతంగా ఒక ఋషిలా మీరు బ్రతకాలి. అప్పుడు కాలవు' అన్నా.

'అది కష్టం కదండీ?' అన్నాడు.

'అవును. కష్టమే' అన్నాను.

'మరి చాలామంది జ్యోతిష్కులు ఉన్నారు కదా లోకంలో. వాళ్ళు చేస్తున్నది తప్పంటారా?' అడిగాడు కుతూహలంగా.

'వాళ్ళు తప్పనడానికి నేనెవర్ని? అది వాళ్ళిష్టం. ఈ లోకంలో ఎవడి ఖర్మ వాడిది. చేసుకున్నవాడు పడతాడు. అంతే' అన్నాను.

'మరైతే జ్యోతిష్యం నేర్చుకోవడం తప్పేగా?" అన్నాడు.

'అలా అని నేననలేదు. సరైన దారిలో నేర్చుకోండి అని మాత్రమే అంటున్నాను' అన్నాను.

'అంటే మీ దగ్గరా?' అడిగిన ప్రతి ప్రశ్నకూ చెబుతున్నాను కదా, కొంచం కొంటెదనం ధ్వనించింది.

'అట్లా నేర్పడానికి నేను సిద్ధంగాలేను' అన్నాను.

'సరేనండి. ఇంకో ప్రశ్న అడగవచ్చా?' అన్నాడు.

'ఒక ప్రశ్న అని, ఇప్పటికి ముప్పై ఆరు ప్రశ్నలు అడిగారు. ముచ్చట్లకు నాకు టైం లేదు. నాకు వేరే పనుంది. ఇక ఫోన్ చెయ్యకండి.  చేస్తే మీ నంబర్ బ్లాక్ చేయబడుతుంది' అని ఫోన్ కట్ చేశాను.

read more " మీ విధానంలో జ్యోతిష్యం నేర్చుకుంటే ఏమౌతుంది? "

జీవిత నాటకం

జీవితంలో ఎదురుదెబ్బలు ఎందుకు తగులుతాయి? మనిషి జీవితం ఎందుకు నాశనమౌతుంది? రకరకాలుగా సాగిన మనిషి జీవితంలో చివరికి ఏం మిగులుతుంది?చదవండి.

---------------------------------

అలవాట్లతో కొందరు

అహంతో కొందరు

అగచాట్లతో కొందరు

ఆత్రంతో కొందరు


అలవాట్లతో కొందరు నాశనమౌతారు. దురలవాట్లతో కొందరైతే, అతి మంచి అలవాట్లతో మరికొందరు అవుతారు. తనకు మాలిన ధర్మంతో నాశనమైనవాళ్లు ఎందరో ఉన్నారు.  అదే విధంగా, అహంకారం పెరిగిపోయి కొందరు నాశనమౌతారు. జీవితమంతా కష్టాలతో ఇంకొందరు  నాశనమౌతారు. అన్నింటినీ అనుభవించేసెయ్యాలన్న ఆత్రంతో ముందుముందుకు దూకి మరికొందరు నాశనమౌతారు.


అలవిగాక కొందరు

అలసిపోయి కొందరు

అచ్చిరాక కొందరు

అతికి పోయి కొందరు


కొంతమందికి అలవికాని భార్య లేదా భర్త ఉంటారు. వాళ్ళ మూర్ఖపు దారిలోనే వాళ్ళు పోతుంటారు గాని వీరిమాట వినరు. అలాంటివాళ్లతో కొంతమంది జీవితం పాడైపోతుంది. కుటుంబం కోసం, పిల్లలకోసం చేసీ చేసీ ఇంకొందరి జీవితం నాశనమౌతుంది. మరికొంతమందికి, దేనిని పట్టుకున్నా పాడైపోతూ ఉంటుంది. వాళ్ళు అలా నాశనమౌతారు.  ఇంకొంతమంది ప్రతిదానికీ చాలా అతి చేస్తుంటారు. అలాంటివాళ్ళు అతికి పోయి గుల్ల అవుతారు.


కళ్లుమూసి కొందరు

కావరంతో కొందరు

కష్టపడక కొందరు

కనిపించక కొందరు


కొంతమంది, ఎదురుగా ఉన్నదానిని కూడా చూడలేరు. పిల్లి కళ్ళుమూసుకున్నట్లు బ్రతుకుతూ ఉంటారు. వారి జీవితాలు అలా గడిచిపోతాయి. ఇంకొందరికి కండకావరంతో కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎవరినీ లెక్కచెయ్యరు. విర్రవీగుడుతో వారి బ్రతుకులు ముగుస్తాయి. మరికొందరికి కష్టపడటం అస్సలు ఇష్టం ఉండదు. ఎంతసేపూ ఎదుటివారి కష్టం మీద బ్రతికేద్దామని చూస్తూ ఉంటారు. వారి జీవితాలు అలా ముగుస్తాయి. ఇంకొందరికి ఎంత వెదికినా వారు వెదుకుతున్న దారి కనిపించదు. వారి జీవితాలు నిరాశతో ముగుస్తాయి.


భయంతో కొందరు

బాధలతో కొందరు

బరినిదాటి కొందరు

బలిసిపోయి కొందరు


కొంతమందికి జీవితమంతా భయంలో గడిచిపోతుంది. ఎవరో ఒకరికి అనుక్షణమూ భయపడుతూనే వారు బ్రతుకుతారు. మరికొందరికి అన్నీ ఉంటాయి గాని, బాధలతో యుద్ధం చేస్తూ ఉంటారు. వారి జీవితమంతా బాధలే సరిపోతాయి. ఇంకొందరు హద్దులలో ఉండరు. గిరిగీసుకుని బ్రతకడం వారికసలు ఇష్టం ఉండదు. హద్దు మీరి ప్రవర్తిస్తూ చేతులు కాల్చుకుని నాశనమౌతారు. మరికొందరికి అన్నీ ఎక్కువే. జీవితంలో దేనికీ లోటు లేకపోవడంతో విచ్చలవిడిగా బ్రతికేసి అనేక తప్పులు చేస్తూ నాశనమౌతారు. 


చేతులారా కొందరు

చేవచచ్చి కొందరు

చేతగాక కొందరు

చెయ్యలేక కొందరు


కొందరేమో, చేతులారా చేసుకున్న ఖర్మలు అనుభవిస్తూ నాశనమౌతారు. ఇంకొందరికి ఏది చేద్దామన్నా ఓపిక ఉండదు. నీరసంగా బ్రతుకుతూ వారి జీవితాలు వెళ్లిపోతాయి. మరికొందరికి ఏదీ చేతకాదు. ఎవరినీ కంట్రోల్ చెయ్యలేరు. జీవచ్ఛవాలలా బ్రతుకుతూ వారెళ్లిపోతారు.  ఇంకొందరికి శక్తి ఉంటుంది, చేద్దామన్న ప్లాన్సూ ఉంటాయి. కానీ, ఏదో ఒక కారణం చేత, ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది. వారి జీవితాలు అలా వెళ్లిపోతాయి.


తెలిసి తెలిసి కొందరు

తెంపులేక కొందరు

తెలివిమీరి కొందరు

తెలివిలేక కొందరు


కొందరేమో, తెలిసి తెలిసి తప్పులు చేస్తారు. తప్పని తెలిసినా తప్పించుకోలేరు. ప్రమాదం వైపే వారు ప్రయాణిస్తారు. వారి బ్రతుకులు అలా తెల్లవారతాయి. మరికొందరు ఎంతసేపూ కలలు కంటూ ఉంటారు. వాటిని నిజాలు చేసుకునే ధైర్యమూ తెగింపూ వారికీ ఉండవు. వారి ఖర్మ అంతే. ఇంకొందరికి అతితెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికంటే మేమే తెలివైన వాళ్లమని భావిస్తూ, పప్పులో కాలేసి మోసపోతూ ఉంటారు. మరికొందరు  తెలివితక్కువగా అందరి చేతుల్లోనూ మోసపోతూ ఏడుస్తూ బ్రతికేస్తూ ఉంటారు. వారివి ఏడుపు జీవితాలు.


స్వార్ధంతో కొందరు

సౌఖ్యంతో కొందరు

సరదాగా కొందరు

సరిపోక కొందరు


కొందరు చాలా స్వార్ధపరులు. ఎదుటివాడు ఏమైపోయినా వారికనవసరం. వారి పబ్బం గడిస్తే వారికి చాలు.  వారి జీవితాలు అలా గడుస్తాయి. ఇంకొందరు, సుఖాలకు బాగా అలవాటు పడి ఉంటారు.  ఆ సుఖాలకోసం అందరిజీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. వారు అలా బ్రతికేస్తారు. మరికొందరికి జీవితంలో గమ్యాలంటూ ఏవీ ఉండవు. జులాయిలలాగా గాలికి బ్రతికేస్తూ ఉంటారు. ఇంకొందరికి ఎంతున్నా సరిపోదు. ఇంకా ఇంకా కావాలి.  అంతులేని ఆ వేటలో చివరకు వాళ్ళే బలి అవుతారు.   


కావాలని కొందరు

చావాలని కొందరు

మనసు విరిగి కొందరు

మతులు పోయి కొందరు


కొంతమంది కావాలని వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు. వీళ్ళెప్పుడూ నాశనం వైపే ప్రయాణిస్తూ ఉంటారు. మంచి చెప్పినా వినరు. మరికొందరు బాగా డిప్రెషన్ లో పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకొందరు భగ్నప్రేమికులై, మనసులు విరిగిపోయి, త్రాగుడు డ్రగ్స్ మొదలైన వ్యసనాలకు బానిసలౌతారు. మరికొందరు ఆదర్శవాదులు. లోకం తీరును భరించలేక మతులు పోగొట్టుకుని పిచ్చివాళ్లవుతారు.


ఏదైనా కొన్నాళ్లే జీవితం

ఎల్లకాలం బాగుండదు జాతకం

ఎవరి దారిన వారు పోవడం

చివరికి అంతా శూన్యం కావడం

ఇంతే జీవితనాటకం !

ఇంతే జీవితనాటకం !


పైన చెప్పిన పోకడలతో ఏదైనా సరే, మనిషి జీవితం కొన్నాళ్లే. గట్టిగా చూస్తే, మనిషి బాగా బ్రతికేది  ఒక 20 లేదా 30 ఏళ్ళు మాత్రమే. అందులో కూడా తనకోసం తాను బ్రతికేది ఏమీ ఉండదు. ఎంతసేపూ ఇతరుల కోసం బ్రతకడంలోనే మనిషి జీవితం ఆవిరైపోతూ ఉంటుంది. ఎంత గొప్పవాడి జీవితమైనా ఎల్లకాలం సవ్యంగా ఏమీ ఉండదు. మహారాజులు కూడా పడతారు. ఎలాంటివాడికైనా జీవితం సమరమే. ఆటుపోట్ల మయమే.

ఈ డ్రామా అంతా చివరకు ఏమౌతుంది? అంటే, ఎవడికీ తెలియదు. ఒకటి మాత్రం ఖాయం. చివరకు శూన్యమే మిగులుతుంది. ఆ తరువాత ఏముందో, అసలు 'నేను' అనేది చివరికి మిగులుతుందో లేదో ఎవడికీ తెలియదు. ఎవడి జీవితమైనా ఇంతే !

ఇంతే జీవితనాటకం !

ఇంతే జీవితనాటకం !
read more " జీవిత నాటకం "

24, ఏప్రిల్ 2022, ఆదివారం

ఆ గుడి చాలా పవర్ ఫుల్ అంటగా?

నిన్న పనుండి ఒకచోటకు వెళితే అక్కడ ఒక కొలీగ్ ఆఫీసర్ కలిశాడు. చాలా నియమనిష్టలు పాటిస్తూ, గుళ్ళూ గోపురాలూ తిరుగుతూ, పారాయణాలు చేస్తూ చాలా భక్తిగా ఉంటాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడాక 'ఎక్కడ సెటిలవుతున్నారు?' అన్న ప్రస్తావన వచ్చింది.

'జిల్లెళ్ళమూడిలో కొన్నాళ్ళు, ఒంగోలు ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉంటాను. మిగతా సమయం మనదేశం, ఇతర దేశాలు తిరుగుతాను. హైద్రాబాద్ అప్పుడప్పుడు వస్తాను' అని చెప్పాను.

'జిల్లెళ్ళమూడి అమ్మగారిని మీరు చూశారా?' అడిగాడాయన సంభ్రమంగా.

'చిన్నపుడు ఒక అయిదు నిముషాలు చూశాను' అన్నాను.

'మరి ఇలా, ఎలా?' అన్నాడు.

'భావజాలంలో సారూప్యత. అంతే' అన్నాను.

'అదేంటి? మీది గుంటూరేకదా? రిటైరయ్యాక అక్కడ ఉండరా?' అన్నాడు.

'ఇంట్రెస్ట్ లేదు' అన్నాను. 

'గుంటూరు విద్యానగర్ లో సాయిబాబా గుడి చాలా పవర్ ఫుల్ అట కదా?' అడిగాడు అమాయకంగా.

అరవైలలోకి వస్తున్న ఆయన అలా అడిగితే నవ్వొచ్చింది. జాలేసింది.

'ఏం? కొండరాళ్లతో కట్టారా?'  అడిగా నవ్వుతూ.

ఆయనకర్ధం కాలేదు.

'అదికాదు. అక్కడకు చాలామంది  మహనీయులు వచ్చారట. వాళ్లలో జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ఉన్నారట' అన్నాడు.

ఆయన ఏ పుస్తకం లోంచి ఇది చదివాడో అర్ధమైంది. అయినా తెలీనట్టు 'అవునా? ఎవరు చెప్పారు?' అనడిగా.

'సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తున్నా. అందులో రాసుంది' అన్నాడు.

'ఓ ! భరద్వాజగారు రాసినదా?' అన్నా.

'అవును' అన్నాడు.

'మహనీయులు వచ్చినందుకు గుడికి మహత్యం వచ్చిందా?' అన్నా నవ్వుతూ.

ఇదికూడా ఆయనకు వెలగలేదు.

'మీది గుంటూరే కదా ! ఈ గుడి మహత్యం మీకు తెలిసే ఉంటుందని అడుగుతున్నా' అన్నాడు.

'నేను గుంటూరులో ఉన్న పాతికేళ్లలో ఒక్కసారికూడా ఆ గుడికి పోలేదు' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'ఎందుకు? మీరు సాయిబాబాను నమ్మరా?' అడిగాడాయన.

'ఆయనే నన్ను నమ్మడం లేదు. అయినా నాకు మహత్యాలంటే చాలా భయం. వాటికి  ఆమడ దూరంలో ఉంటా' అన్నా.

'ఏంటో మీరు చెప్పేది ఏమీ అర్ధం కావడంలేదు' అన్నాడు.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది లెండి' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'జిల్లెళ్ళమూడి అమ్మగారిని  నమ్మితే మంచి జరుగుతుందా?' అడిగాడు ఊరుకోకుండా.

'నమ్మకపోయినా జరుగుతుంది' అన్నా.

ఆయనకు కొంచం కోపం వచ్చింది.

'అవుననుకోండి. జరిగేది ఎలాగూ జరుగుతుంది. ఎవరూ తప్పించలేరు. కాకపోతే కొంచం... ' అన్నాడు అర్ధోక్తిగా.

ఇంతలో టీ వచ్చింది. సిప్ చేస్తూ, 'అవును. కొంచం షుగర్  ఎక్కువైంది' అన్నా.

ఆయన అదో రకంగా చూశాడు.

అంతకంటే ఎక్కువగా ఏడిపించడం ఎందుకనిపించి, 'జిల్లెళ్ళమూడి అమ్మగారి తత్త్వం అర్ధమైతే ఒక మిరకిల్ జరుగుతుంది' అన్నా.

'ఏంటది?' అన్నాడు ఆత్రంగా.

'అడుక్కునే మనస్తత్వం పోతుంది, దేవుడినైనా సరే' అన్నా.

'అదేంటి?' అన్నాడు అయోమయంగా.

'ఇదీ అర్ధం కాలేదా? మీరు చేస్తున్న పుస్తకం పారాయణం ఇంకో లక్షకోట్ల సార్లు చెయ్యండి. అర్ధం కావచ్చు. అప్పటికీ అర్ధం కాకపోతే గుంటూరెళ్లి సాయిబాబా గుడిగోడను మీ తలతో మోది చూడండి. ఎంత పవర్ ఫులో తెలుస్తుంది. ఉంటామరి. బై' అని లేచొచ్చేశా.

read more " ఆ గుడి చాలా పవర్ ఫుల్ అంటగా? "

శనీశ్వరుని రాశిమార్పు - ఫలితాలు

ఎల్లుండి అంటే 26-4-2022 న శనీశ్వరుడు మకరరాశిని వదలిపెట్టి కుంభరాశిలోకి మారబోతున్నాడు. కుంభంలో 2025 మార్చి వరకూ ఉంటాడు. ఈ రాశిమార్పు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, దీనివల్ల కోట్లాదిమంది మనుషుల జీవితాలు ఎలా ప్రభావితం అవబోతున్నాయా చూద్దాం.

మేషం

మూడేళ్ళుగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా  పడుతున్న కష్టాలు పోతాయి. లాభాలు మొదలౌతాయి. సంతానలాభం కలుగుతుంది. కొందరికి సంతానంతో కష్టాలు మొదలౌతాయి. సర్కిల్ పెరుగుతుంది.

వృషభం

దానధర్మాలపైన ఆసక్తి పెరుగుతుంది. దేశాలు తిరుగుతారు. కష్టాలు మొదలౌతాయి. తండ్రికి తల్లికి ఆరోగ్యం చెడుతుంది. మానసికంగా కృంగిపోతారు. ఆధ్యాత్మికులైతే గట్టెక్కుతారు.

మిథునం

ఆధ్యాత్మికచింతన ఎక్కువౌతుంది. దూరదేశాలకు వెళతారు. డబ్బుకు ఇబ్బంది పడతారు. పెద్దలకు కష్టకాలం మొదలౌతుంది. గతకర్మ పక్వానికి వస్తుంది. తమ్ముళ్లకు  చెల్లెళ్లకు కష్టకాలం మొదలౌతుంది.

కర్కాటకం

అష్టమశని మొదలౌతుంది. ఇంట్లో చికాకులు ఎక్కువౌతాయి. కష్టాలు నష్టాలు  చుట్టుముడతాయి. ఆరోగ్యం  క్షీణిస్తుంది. కొందరికి ప్రాణగండం కూడా ఉంటుంది.  

సింహం

సప్తమశని మొదలౌతుంది. భార్యకు/ భర్తకు కష్టకాలం. ఇద్దరికీ ఆరోగ్యాలు  చెడతాయి. దూరదేశప్రయాణం ఉంటుంది. వివాహజీవితం దెబ్బతింటుంది.

కన్య

మంచికాలం మొదలౌతుంది. మూడేళ్ళుగా పడుతున్న మానసికవేదన తొలగిపోతుంది. ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్పత్రులు సందర్శిస్తారు. 

తుల

ఆధ్యాత్మిక చింతన ఊపందుకుంటుంది. అది లేనివారు సమాజసేవలో పడతారు. లేదా డిప్రెషన్ కు లోనవుతారు. సంతానానికి మంచి జరుగుతుంది.

వృశ్చికం 

అర్ధాష్టమ శని మొదలౌతుంది. కష్టకాలం. డిప్రెషన్ లో పడతారు. ఇంట్లో చికాకులు ఎక్కువౌతాయి. తల్లికి గండం. చదువు కుంటుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు కలుగుతాయి. వాహనప్రమాదం జరుగవచ్చు.

ధనుస్సు 

ధైర్యం పెరుగుతుంది. గత రెండేళ్లుగా పడుతున్న కష్టాలు  తేలిపోతాయి. స్థలమార్పు ఉంటుంది. సమాజసంబంధాలు పెరుగుతాయి. అధికారయోగం ఉంటుంది. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది.

మకరం 

ఏలినాటిశని మూడవపాదం మొదలౌతుంది. గత అయిదేళ్లుగా పడుతున్న చికాకులు మెల్లిగా మారడం మొదలౌతుంది. కుటుంబం పెద్దదౌతుంది. బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం

ఏలినాటిశని రెండవపాదం మొదలౌతుంది. అనారోగ్యాలు మొదలౌతాయి. స్థలమార్పు ఉంటుంది. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. లోకానికి మేలు చేస్తారు. జీవితభాగస్వామికి కష్టకాలం మొదలౌతుంది.

మీనం

ఏలినాటి శని మొదటిపాదం మొదలౌతుంది. ఖర్చు పెరుగుతుంది. రాబడి తగ్గుతుంది. స్థలమార్పు ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం చెడుతుంది. ఆస్పత్రిని సందర్శిస్తారు.

  • రాబోయే రెండున్నరేళ్ళపాటు ఈ ఫలితాలు వెంటాడతాయి.
  • రాశినుంచి, లగ్నం నుంచి కూడా ఈ ఫలితాలను చదువుకోండి.
  • వ్యక్తిగతజాతకాన్ని, దానిలో ప్రస్తుతం జరుగుతున్న దశలను కూడా కలుపుకుని చూచుకుంటే  ఈ ఫలితాలు 100% సరిపోతాయి.

30 ఏళ్ల క్రితం అంటే, 1992 లో మీ జీవితంలో ఏం జరిగిందో చూచుకోండి. అవే సంఘటనలు ఇప్పుడు జరగకపోయినా, ట్రెండ్స్ మాత్రం అవే ఉంటాయి. అర్ధం చేసుకుంటే అర్ధమౌతాయి.

read more " శనీశ్వరుని రాశిమార్పు - ఫలితాలు "

23, ఏప్రిల్ 2022, శనివారం

విటుల సంఖ్య

 నిన్నొక శిష్యుడు ఇలా అడిగాడు.

'గురూజీ. ఫలానా  జ్యోతిష్కుడు మీకు తెలుసా? యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యాడు'.

నాకు జాలి, నవ్వు, కోపం, అసహ్యం ఒకేసారి కలిగాయి. ఇంత చెప్పినా మళ్ళీ ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలే.

'నువ్వూ పోయి ఆ యూట్యూబ్ లో దూకు. ఇంకోసారి నా దగ్గరకి రాకు. గెట్ లాస్ట్'  అన్నాను.

శిష్యుడు  నొచ్చుకున్నాడు. 

'అదికాదు. మీరు కూడా తారాదేవిని  గురించి వ్రాశారుకదా? అతనుకూడా తారాదేవి హోమం చేసి ఎవరో నటికి మరిన్ని సినిమా ఛాన్సులు వచ్చేలా చేశాడట. అందుకని అడిగాను' అన్నాడు.

'తారాదేవి అంటే నీకర్థమైంది అదా?' అన్నాను.

'అంటే, అదికాదు ఇదికాదు'  అంటూ నసుగుతున్నాడు.

'తారాస్తోత్రం చదివావా?' అడిగాను.

'చదివాను' అన్నాడు. 

'చదివితే ఇలాంటి అనుమానాలొస్తున్నాయా? ఇదేనా నీకర్థమైంది? మీలాంటి మట్టిబుర్రలకి అర్ధంకావాలంటే అంతకంటే ఇంకా సింపుల్  గా ఎలా చెప్పాలి? ఎలా వ్రాయాలి?' అన్నాను.

'అంటే మన కష్టాలు తీరడానికి అమ్మను అడగవచ్చని మీరే ఇంకోచోట వ్రాశారు కదా?' తెలివి ఉపయోగించాడు శిష్యుడు.

'ఏంటి నీకొచ్చిన కష్టం? తింటానికి ఉంటానికి ఉందిగా? ఇంకేం కావాలి? లేకపోతే, నీక్కూడా సినిమా ఛాన్సులు కావాలా?' అడిగాను.

'ఆబ్బె నాకెందుకు?' అన్నాడు.

'మరి నన్నెయ్యమంటావా సినిమాలో వేషాలు?' అన్నా.

'చచ అదికాదు. కష్టాలు తీరాలికదా?' అన్నాడు.

ఈ రకంగా నెమ్మదిగా చెబుతుంటే వినేట్టు లేడనిపించి భాష మార్చాను.

'చూడమ్మా ! కష్టాలు తీర్చమని అడగవచ్చు. సుఖాలు పెంచమని అడగకూడదు. నీ స్థాయిలో అర్ధమయ్యేలా చెబుతా విను. ఒక బ్రోతల్ ఉందనుకో. 'నన్నీ నరకంలో నుంచి బయటపడెయ్యి' అని అమ్మను కోరవచ్చు. అంతేగాని 'ప్రతిరోజూ బోలెడుమంది విటుల్ని తీసుకురా' అని ప్రార్ధించకూడదు. నువ్వు బ్రోతల్ వే. కానీ, మరింతమంది విటుల్ని నీకోసం తేవడానికి దేవుడు నీ బ్రోకర్ కాదు. అర్థమైందా?' అన్నాను.

శిష్యుడు ఖంగుతిన్నాడు.

'అయితే మన మార్గంలో కోరికలు కోరకూడదా? వాటికోసం ప్రయత్నాలు చేయకూడదా?' అడిగాడు  వీలైనంత సౌమ్యంగా.

'కోరుకోవచ్చు. బ్రోతల్ హౌస్ నుంచి బయటపడెయ్యమని కోరుకో. ఎక్కువమంది విటుల్ని తీసుకురమ్మని కోరకు' అన్నా మళ్ళీ.

మౌనంగా చూస్తున్నాడు.

'నీ సందేహం అర్ధమైంది. ఈయనేం గురువు? ఇలాంటి ఛండాలమైన ఉదాహరణలు చెబుతున్నాడు?  అనేగా నీ సందేహం?' అడిగా.

'అబ్బే అదికాదు' అని నసుగుతున్నాడు.

'కాదని బయటకు నటించినా, లోపల నువ్వు అనుకుంటున్నది అదేనని నాకు తెలుసు. కావాలంటే సౌమ్యంగా నూరుసార్లు  వివరించి చెబుతాను. అప్పటికీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇలాగే వస్తాయి జవాబులు. నీకు పడే ఖర్మ ఉన్నపుడు వెళ్లి అలాంటి యూట్యూబ్ జ్యోతిష్కులనే సంప్రదించు. నన్ను విసిగించకు' అని ముగించాను.

ఇదీ లోకం తీరు. గొంతెమ్మ కోరికలు తీరడానికి దేవతాసహాయం కావాల్ట ! ఖర్మకొద్దీ బుద్ధులు ! ఈ లోకాన్ని ఎవడూ మార్చలేడు !

read more " విటుల సంఖ్య "

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

లోకకల్యాణం - ఆత్మకల్యాణం

ఉదయాన్నే చూస్తే చెన్నై నుంచి కోటపాటి కాల్ కనిపించింది. నేనేదో పనిలో ఉండి చూసుకోలేదు. తను నా పాతమిత్రుడు, అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూఉంటాడు. గుంటూరులో ఉండగా అప్పుడప్పుడూ వస్తూ ఉండేవాడు. కమ్మవారైనప్పటికీ ఆధ్యాత్మికచింతన ఎక్కువ. పెళ్లిచేసుకోకుండా ఆధ్యాత్మిక జీవితానికి అంకితం అయిపోయాడు. మంత్రతంత్రాలలో, జ్యోతిష్యంలో బాగా ప్రవేశం ఉన్నవాడు. చెన్నైలో చిన్నసైజు గురువు. రాజమాత గారి భక్తుడు.

నేనే ఫోన్ చేసి, 'బాగున్నారా? చాలాకాలమైంది. ఏంటి ఫోన్ చేశారు?' అంటూ అడిగా.

నన్ను 'అన్నా'అంటాడు

'బానే ఉన్నా అన్నామీరు రాసింది చదివా. రాబోయే 14 ఏళ్లలో లోకం ఎలా ఉంటుందో రాశారు. కానీ అప్పుడే మొదలైపోయింది. చాలా ఘోరంగా ఉంది లోకంఅన్నాడు

అవును. గుంటూరులో 13 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి తెలంగాణా ఆంధ్రాలలో తిప్పుతూ 80 మంది ఆర్నెల్లుగా రేప్ చేస్తున్నారు. వాళ్లందరినీ అరెస్ట్ చేశారు. వారిలో ఒకడు లండన్లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ . వాడినీ ఇప్పుడు అరెస్ట్ చెయ్యబోతున్నారు. వీళ్ళలో పొలిటికల్ మనుషులూ, వ్యాపారస్తులూ, ఉద్యోగస్తులూ, స్వామీజీల భక్తులూ అందరూ ఉన్నారట. ఇలా ఉంది లోకం. మళ్ళీ అందరూ నీతులు చెప్పేవాళ్ళే. స్వామీజీల భక్తులేఅన్నా.

ఆయనకు చాలా కోపం వచ్చింది.

ఘోరం అన్నా. నాయాళ్లని పట్టుకొని ఇరగ్గొట్టాలి. అంత చిన్నమ్మాయి దగ్గర ఏముంటుందన్నా పాపం? మాటకొస్తే అసలు ఆడదాని ఒంట్లో ఏముందన్నా? కొంచం ఆలోచిస్తే అక్కడేమీ లేదు. లోకంలో ఎదవలందరూ ఏదేదో ఊహించుకోని చావడమేగాని ఏముందక్కడ కొంచం ఆలోచిస్తే?’ అన్నాడు కోపంగా.

నేనెప్పుడూ చెప్పేది అదే. లోకమంతా ఊహల్లో బ్రతుకుతోంది. వాస్తవం మీద కాదుఅన్నాను.

ఇక్కడకూడా అంతే ఉందన్నా. ఏదన్నా బస్సులో రైల్లో ప్రయాణం చేద్దామంటే ఎవరి పొడా నాకు గిట్టడం లేదు. ఎవరు తాకినా తట్టుకోలేకపోతున్నా ఒళ్ళు మంటలొస్తోందిఅన్నాడు.

అది సహజమే. సాధనామార్గంలో అలాంటి స్థితి కలుగుతుంది నేనూ అందుకే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణం మానేశాను. సినిమా హాల్స్ కి పోవడం మానేశాను. జనం ఎక్కువగా ఉంటె అక్కడకు పోవడం మానేశాను. ఫంక్షన్స్ మానేశాను. క్యాబ్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మనుషుల లోక్లాస్ 'ఆరా' లు చాలా ఇబ్బంది పెడతాయి. ఇలా జరుగుతుంది. తప్పదు.' అన్నాను.

మధ్యన ఒక బ్రాహ్మలబ్బాయి కలిశాడు. చిన్నోడే. మంచి పద్ధతైనవాడు, మంచి కళగలిగిన మొహం. చానా రోజులకి కనిపించి, ‘అన్నా బాగున్నావాఅంటూ వచ్చి పట్టుకున్నాడు. అప్పుడేమీ అనిపించలా. కానీ రాత్రికి నాలో కామం చెలరేగిందన్నా. ఏందిరా కత ఇట్టా ఉందని మర్నాడు పొద్దున్నే ఫోన్ చేసి, ‘ఏందిరా? నిన్న నన్ను తాకినప్పుడు ఏమాలోచిస్తున్నావురా?’ అనడిగా.

అప్పుడేమీ లేదన్నా. కానీ నాలో కోరికలు పోలేదన్నా. బాగా ఎక్కువగా ఉన్నాయిఅన్నాడా అబ్బాయి. ఊరకే వాడు నన్ను తాకడంతో వాడి మైండు నాకు సోకింది. రాత్రంతా శానా బాధ పెట్టింది. మనుషులు చూడన్నా ఎట్టా ఉండారో?’ అన్నాడు.

అంతే రవీ. బ్రాహ్మల అబ్బాయైనంతమాత్రాన కోరికలెలా పోతాయి? నెయ్యి తిని ఇంకా ఎక్కువౌతాయి. ఇలా జరగడం నిజమే. అందుకనే, సాధనాపరులు ఎవరినీ తాకరు. వేరేవాళ్లని అనవసరంగా తాకనివ్వరుమడి ఆచారం అనేవి ఇలాగే పుట్టాయి. అయితే కాలక్రమంలో అవి ప్రాణంలేని తంతులుగా మారిపోయాయి. మీరు ఫీలైంది సహజమే. ఇది జరుగుతుంది.  అందుకే అనవసరంగా ఎవరినీ తాకకండి, వాళ్ళని తాకనివ్వకండిఅన్నాను.

మామూలు మనుషులే ఇట్లా ఉన్నారని అనుకుంటే తప్పే అన్నా. స్వాములోర్లు కూడా అంతే ఉన్నారుఅన్నాడు.

అవును. అందరూ వేషగాళ్లే. ఆశ్రమాలన్నీ బిజినెస్ హౌసులే. వాళ్ళని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిఅన్నా.

మీరు అవధూతల గురించి రాశారే. అలాంటాయన ఒకాయన్ని చూశా మధ్యనఅన్నాడు.

ఎక్కడ చెన్నైలోనా?’ అన్నా.

అవును. బస్టాండ్ దగ్గర కనిపించాడు. ఒక గోనె పట్టా కట్టుకుని చింపిరి జుట్టుతో ఉన్నాడు. చూస్తే కొంచం కళ కనిపించింది. దగ్గరకెళ్ళి, ‘టీ తాగుతారాఅన్నా మర్యాదగా.

నేనడిగానా నిన్ను?అన్నాడు రివర్స్ లో. సామాన్యంగా అడ్డుక్కునేవాడెవడూ అలా అనడు. ఇంకా ఇవ్వమంటాడు. కానీ ఆయన అలా అన్నాడు.

అప్పుడేం చేశావు?’ అన్నా.

పోనీ డబ్బులు ఉంచుకోఅంటూ కొంచం డబ్బులివ్వబోయా. దానికాయన, ‘నీ దేవుడికిచ్చుకో. ఆయన్నుంచి నాకొస్తాయిలే అవసరమైనప్పుడు. గాలే నా తిండి. నాకు తిండెందుకు?అన్నాడు.

అతను నిజమైన సాధువేఅన్నాను.

అంతేకాదు. అతనింకో మాటన్నాడన్నా, ‘అమ్మ ఇస్తేనే నాకు పని. అప్పుడే చేస్తా. లేదంటే ఈ ప్రపంచంలో నాకేం పనిలేదు. ఇంకో ఏడాది తర్వాత నీకంతా బాగుంటుందిలే పోఅన్నాడు. మీరు రాసినది చదివితే అదే గుర్తొచ్చింది. ఆయన సరిగ్గా అదే మాటన్నాడుఅన్నాడు.

అంతే. అవధూతలలాగే ఉంటారుఅన్నాను.

వాళ్ళు చాలామంది ఉన్నారా?’ అడిగాడు కోటపాటి.

ఉంటారు. కానీ బయటపడరు. బయటపడి ప్రచారం చేసుకునేవారిలో ఎక్కువమంది దొంగలేఅన్నాను.

మరి లోకం ఇలా అధ్వాన్నమై పోతుంటే, వాళ్ళు బయటకు వచ్చి సాయం చెయ్యాలి గదన్నా? ఇట్లా దాక్కోనుంటే ఎట్లా?’ అన్నాడు.

బాగా అర్ధం చేసుకో రవీ. గోదారికి వరదొచ్చిందనుకో. మనం అడ్డం నిలబడితే ఏమౌతుంది. మనమూ దాంట్లో కొట్టుకుపోతాం. వరద పోయేదాకా ఆగాలి. తరువాత నువ్వు చేయవలసింది చెయ్యాలి. అవునా కాదా?’ అడిగాను.

అవునుఅన్నాడు.

అలాగే, ప్రస్తుతం లోకుల గ్లోబల్ ఖర్మ చాలా అధ్వాన్నంగా ఉంది. ఎక్కడ చూసినా ధనమదం, అహంకారం, గర్వం, కామం తాండవిస్తున్నాయి. పరిస్థితిలో మహనీయుడూ అడ్డురాడు. ఎవడికీ మన సాయం అవసరంలేదు. ఒకళ్ళ సమస్యలు తీరుద్దామని నువ్వు అనుకోకు. లోకం ఇలా పోవలసిందే. లోకులు వారి ఖర్మను  వారు అనుభవించవలసిందే. నువ్వు చెప్పినా నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా మనుషులు వినరు. ఇదింతేఅన్నా.

అంటే, ఒక తరం నాశనం అవ్వాలన్నమాటఅన్నాడు.

అవును. ఒకటో రెండో తరాలు పూర్తిగా నాశనమైనాక, అప్పుడు మనుషుల్లో మళ్ళీ మంచితనం, నిదానం, మానవత్వం మొదలౌతాయి. అప్పుడు చెప్పినా ఎవరైనా వింటారు. ప్రస్తుతం పరిస్థితి లేదు. కలిప్రభావం అంత ఘోరంగా ఉంది. అందుకని అవధూతలు, మహనీయులు ఎవరూ బయటకు రారుఅన్నాను.

పాపం లోకాన్ని ఉద్ధరిద్దామన్న ధోరణి రవికి చాలా ఎక్కువ.

అది కాదన్నా మరి లోకకల్యాణం జరిగేదెలా?’ అన్నాడు.

ప్రస్తుతం కావలసింది లోకకల్యాణం కాదు, ఆత్మకల్యాణం. ముందు మనం బాగుపడాలి. అంటే, ముందు మనం సాధనచేసి దైవత్వాన్ని పొందాలి. తరువాత లోకాన్ని ఉద్ధరిద్దాం. లోకాన్ని వదిలేయ్. ముందు నీ సంగతి నువ్వు చూసుకో.’ అన్నాను.

అందుకేన్నా మధ్య ఎవరికీ రెమెడీలు చెప్పడం లేదు. మొన్నొకాయన, ‘ఎవరైనా మంచి గురువును చూపించన్నాఅనడిగితే నీ బ్లాగ్ చదవమని చెప్పా. చదివి చాలా బాగుందని అన్నాడు. ‘చాలా కరెక్ట్ గా చెబుతున్నాడు ఈయనఅన్నాడుఅన్నాడు రవి.

సరే మంచిదేఅన్నా.

'ఇంకో అబ్బాయున్నాడు. అతను చండీ ఉపాసకుడు. ఎంత జపం చేసినా ఏమీ ఫలితం కనపడటం లేదు' అన్నాడు. నేను చూస్తే చండీదేవి అతని పక్కనే కనిపించింది. 'ఒరే నీ పక్కనే ఉందిరా అమ్మ' అన్నాను. నాకు కనపడటం లేదన్నా అంటాడు. నిరంతరం జపం చెయ్యి. జపం పెంచు' అనే చెప్పాను ఆ అబ్బాయికి. ఇది కరెక్టేనా?' అడిగాడు. కోటపాటి.

'విను. చాలామంది జపం చేస్తారు. దేవతలు వస్తారు కూడా. కానీ వీళ్ళ గుండె తలుపులు మూసి ఉంటాయి. దేవత లోనికి రాలేదు. ఇంటిబయట ఒకరు మనకోసం నిలబడి ఉన్నారనుకో. మనమేమో వాళ్ళను పిలుస్తూనే ఉంటాం గాని తలుపులు తెరవము. ఇదీ అంతే. కావలసింది మరింత జపం కాదు. మరింత ఆత్మార్పణం. జపంతో ఏమీ జరగదు. కావలసినవి హృదయశుద్ధి, ఆత్మార్పణలు' అన్నాను.

'సరే అర్ధమైంది. అతనికి అదే చెబుతాను' అన్నాడు.

'మంచిది' అన్నాను.

మన ఆశ్రమం ఆగస్టులో అని రాశావు. ఆగస్టులో వచ్చి అక్కడుంటావా? నేనూ వస్తా మన ఆశ్రమానికిఅన్నాడు.

ఆగస్టులో రాను. అమెరికా పోతున్నాను. అమెరికా శిష్యులు చాలామంది ఎదురుచూస్తున్నారు నాకోసం. వాళ్లలో కొందరు అమెరికన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చూచుకోవాలి కదా? అందుకని ఆర్నెల్లు వాళ్లకు అందుబాటులో ఉంటా. అక్కడ సాధనా రిట్రీట్స్ జరుగుతాయి. నా సాధనామార్గంలో వాళ్లకు దీక్షలిచ్చి యోగరహస్యాలు నేర్పించి సాధన చేయిస్తాను. ఆ తరువాత, జనవరిలో వెనక్కొచ్చి ఆశ్రమంలో ఉంటా. ఈలోపల మనవాళ్ళు ఆశ్రమం సంగతి చూసుకుంటూ దానిని డెవలప్ చేస్తూ ఉంటారుఅన్నాను.

అవునన్నా. అమెరికా వాళ్ళు నమ్మారంటే ప్రాణం ఇస్తారు. మనవాళ్లకు నమ్మకం తక్కువఅన్నాడు.

నిజమే. మనవాళ్లకు అనుమానాలు, ఆశలు, భయాలు, తీరని కోరికలు ఎక్కువ. తెల్లవాడికి అంతగా ఉండవు. అన్నీ తీరిపోయి ఉంటాయి. అందుకని వాళ్ళు నమ్మారంటే ప్రాణం పెడతారు. అయితే నమ్మేదాకా వాళ్ళతోనూ కష్టమేఅన్నా నవ్వుతూ.

సరేన్నా. అయితే ఆశ్రమం ప్రారంభోత్సవానికి పిలువు. వస్టాఅన్నాడు.

ప్రారంభోత్సవం ఏమీ ఉండదు. సింపుల్ గా మొదలౌతుంది. ఎప్పుడు మొదలైందో బ్లాగులో రాస్తా. నీకు ఫోన్ చేసి చెబుతాలే. అప్పుడు రాఅన్నా.

సరేన్నా. ఉంటామరిఅని ఫోన్ కట్ చేశాడు కోటపాటి.

read more " లోకకల్యాణం - ఆత్మకల్యాణం "