“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, డిసెంబర్ 2009, గురువారం

పన్నెండు పద్యాలలో రామాయణం



అవతార సంకల్పం
కం || అలపాల కడలి యందున
చెలువంబున లక్ష్మి చెంత నలరుచు నుండన్
తిలకించుచు సురలెల్లరు
నిలలో దుష్టుల దునుమగ నిను బిలువగనే ||

రఘువంశమున జననం
కం || ఇనకులమున నింపారగ
ఘన కీర్తిని బుట్టినావు గణముల తోడన్
అనవరతము ప్రీతి గొనుచు
తనయుల బెంచగ నధిపుడు కొనగొని సతులున్ ||

యాగ రక్షణం - సీతా పరిణయం
కం || వీక్షిం పుచు యాగంమును
రక్షించితి వీవు దాని రాక్షస వధచే
దీక్షగ శివు విల్లు విరచి
దక్షత వరియించినావు ధరణీ జాతన్ ||

అరణ్య వాసం
కం || పితరుం డొసగిన మాటల
నతి దీక్షనిలుప నీవు నడవుల కేగన్
మతి మీరగ నా భరతుడు
గతి నీ పాదుకల దాల్చి గాచెను ధరణిన్ ||

కం || ఘోరాటవులం దిరుగుచు
వీరత నా రక్కసులను జీరుచు నిలలో
నారాధించేడి మునులను
వారించుచు నిచ్చినావు వరములు వడిగా ||

సీతాపహరణం
ఆ || అనుజ కబ్బినట్టి యవమానముం గాంచి
రాక్ష సేశ్వరుండు రోష మొంది
సీత నపహ రించె నీతి దూరుం డౌచు
లవణ సంద్ర మందు లంక దాచె ||

మిత్ర లాభం
ఆ || పక్షి రాజు వల్ల పరగ గుర్తులెరిగి
వానరోత్తములను వాశి గాంచి
వాలి జంపి నీవు వానరున్ సుగ్రీవు
గద్దె నిల్పి నావు గౌర వించి ||

సీతా సందర్శనం
ఆ || వానరాదు లెల్ల వన్నె మీరగనేగి
వెదకి రవనిలోన బెదరు లేక
ఆంజనేయు డంత ఆర్ణవంబును దాటి
లంకలోన సీత నింక గనియె ||

లంకా విధ్వంసనం
ఆ || మాత ఎదుట నిల్చి మన్ననల్ తానంది
అంగులీక మిచ్చి అవనిజకును
వీర విక్రమమున విధ్వంస మొనరించి
లంక గాల్చె రామ కింక రుండు ||

రావణాది రాక్షస సంహారం
ఆ || సేతు బంధ గతిని సంద్రమంతయు మించి
రావణాది సకల రాక్షసులను
సంహరించి నీవు సార్ధకుం డైనావు
సీత కరము బట్టి సంతసమున ||

రామ రాజ్య స్థాపనం
ఆ || చక్ర వర్తి వగుచు చరియించి ధర్మంబు
రాజ్యమేలి సర్వ రక్ష యొసగి
భక్త జనుల మదిని భవ్యంపు మూర్తివై
దైవ మగుచు నిల్చి ధరణి లోన ||

అవతార సమాప్తి
ఆ ||కర్మ లన్ని యపుడు కడతేర గానింక
తనదు దివ్య సీమ జనగ నెంచి
నీదు ధామమునకు నింపార నేగుచున్
నిల్చి నావు నిత్య రూపు డగుచు ||
read more " పన్నెండు పద్యాలలో రామాయణం "

29, డిసెంబర్ 2009, మంగళవారం

ఒంటిమిట్ట శ్రీ రామునిపై ఇంకో ఎనిమిది పద్యాలు











ఆ || మూగవాడు జెప్పు ముచ్చటౌ పద్యాలు
పంగుడెగురు గట్టి పర్వతముల
అన్నమాట నేడు అతిసత్యమైదోచె
నీదు పాదయుగము నంటినంత ||

ఆ || పాదరజము సోకి పడతియయ్యెను రాయి
శబరి ధన్యయయ్యె సొబగులీన
కోతియొకటి మించి కోపించి గాల్చెరా
వేయి యోజనముల విభవపురిని||

ఆ || నీదు నామమందు నేమి మాహాత్మ్యమో
జపము జేసి ఇలను జంతుతతులు
ఇంద్రియముల మించి ఈశ్వరాత్మకులైరి
ఏమి మహిమ నీదు నామమందు?||

ఆ || పుస్తకములనుండు పుక్కింటి సుద్దులు
నిజముగాదు యనుచు నింతసేపు
తలచినట్టి భ్రమలు తలక్రిందులయ్యెరా
రుజువు జూచినంత రూడిగాను ||

ఆ || ఇట్టి వింతలెన్నో గట్టిగా గనుపింప
ముదమునంది ఘనులు మునిగణములు
మానవుడవు గావు మహిలోన నీవంచు
రామబ్రహ్మమనిరి రక్తిమీర ||

ఆ || ధర్మమెల్ల రూపుదాల్చి నిల్చిన యట్లు
సత్యమెల్ల నీదు సన్నిధగుచు
దైవమిలను జూడ దాక్షిణ్యమూర్తి యై
నీదు రూపమందు నిల్చెనిటను ||

ఆ || భ్రమలు దొలగి జూడ బంగారుగవివీవు
ఇహమునందు నింక నిత్యమందు
దైవరాయుడగుచు దగ్గరైనావింక
నిల్పుకొందునింక నిన్ను మదిని ||

ఆ || లోకయాసలేల లోకేశుడుండంగ
ఇంద్రియముల దగులు ఇచ్ఛలేల
మనసునధిగమింతు మరినీదు కరుణతో
ఆత్మనందు కొనెద నబ్బురముగ ||
read more " ఒంటిమిట్ట శ్రీ రామునిపై ఇంకో ఎనిమిది పద్యాలు "

28, డిసెంబర్ 2009, సోమవారం

ఒంటిమిట్ట - మిగిలిన ముప్పై ఎనిమిది పద్యాలు

భవనాశి మాలఓబన్న మహాభక్తుడు. ఈ క్షేత్రములోనే నూట ఇరువది ఏండ్లు బ్రతికి రామనామస్మరణచే ధన్యుడైనట్టి పుణ్యజీవి.కులము గాదు గుణము ప్రధానమని నిరూపించిన సాధుపుంగవుడు.'భవనాశి' అని సార్థకమైన ఇంటిపేరు గలవాడు. నేడు ఈయన కుటుంబమువారు ఇక్కడి దగ్గరిలోనే పల్లెలో 'బోనాసి' వారనే పేరుతొ ఉన్నారు.వారికి ఆలయంలో ఈనాటికీ ప్రత్యెక గౌరవం కలదు.

కం||విత్తంబు నొదలి యోబన
తత్వంబుల బాడెనిచట తన్మయుడగుచున్
చిత్తంబున్ రామునకిడి
మొత్తంబుగ మహిని నిల్చె మోక్షాధిపుడై ||

ధనేషణ వదలి తన చిత్తాన్ని రామునకిచ్చి తత్వాలను పాడుకుంటూ ఇదే క్షేత్రంలో ఓబన్న అనే సాదుపుంగవుడు నివసించేవాడు.

కం||అన్నా యనుచుం జీరిరి
కన్నారము నీదు మహాధన్యపు భక్తిన్
చెన్నారగ రమ్మని యో
బన్నను బట్టుక యేడ్చిరి భక్తవరేణ్యుల్||

ఒకనాడు ఇతడు మాలవాడని తలచి,'వాకిలి ఎదురుగా నీవేమిటి?'అని ఆక్షేపించి అతన్ని ఆలయం వెనుకవైపు కూర్చోనమని ఆదేశించారు ఆలయపెద్దలు.తర్వాత చూడగా సీతారాముల విగ్రహాలు దిశమారి ఆలయం వేనుకవైపునకు చూస్తూ కనిపించాయి. అప్పుడు తమ తప్పు గ్రహించి క్షమించమని అతన్ని ప్రార్ధించి మర్యాదగా ఆహ్వానించి గౌరవించారు.

||తాను తినెడిముద్ద తగ నీకె ర్పించి
కీర్తనముల బాడి ఆర్తుడగుచు
మాలకులము నందు మహనీయ మూర్తియై
ధరణినిల్చె యోబదాసుడిచట||

తాను తినే ముద్దనే నీకు నైవేద్యంగా అర్పించేవాడు.ఆర్తితో కీర్తనములు పాడేవాడు.మాలకులంలో పుడితే మాత్రం ఏమి?మహనీయుడయ్యాడు. అటువంటి ధన్యజీవి ఓబన్న.

ఆ||పండుముసలియగుచు నుండేనీ యోబన్న
నూట ఇరువదేండ్లు వాటముగను
పుణ్యపురుషుడగుచు పూర్ణాయువందెరా
మాలయైన యేమి మాన్యుడతడె||

పండు ముసలి వయస్సులో నూటఇరవైఏళ్ళు బ్రతికి పూర్ణజీవి అయ్యాడు ఓబన్న. మాలయైతేనేమి ఇతడే కదా మాన్యుడు.

ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండిన అయ్యలరాజు తిప్పరాజు అనే కవి ఒంటిమిట్ట నివాసి. ఆయన రామానుగ్రహంతో రఘువీరశతకం వ్రాసినాడు.

కం||రఘువీరుని శతకంబును
జిగిమీరగ జెప్పినావు చిత్రపు రీతిన్
తగ నొంటిమిట్టవాసిగ
జగమేలిన త్రిపురాంతక తిప్పయరాజా||

అయ్యలరాజు రామభద్రకవి పదినెలల పాపగా దేవాలయములో తప్పిపోయి రాత్రంతా మహాలయంలో పురుగూపుట్రా మధ్యలో చీకటిలో ఏడుస్తూ ఉండి,మనసు కరిగిన తల్లి సీతమ్మవారి దయకు పాత్రుడై, ఆయమ్మ స్తన్యమును గ్రోలిన ధన్యజీవి. ఆయన రామాభ్యుదయము అనే కావ్యమును రచించాడు.

కం||పిల్లని తల్లియు తండ్రియు
చల్లన మరి వీడిపోయి రల్లన గుడిలో
తల్లిగ పాలంద్రాపెను
బాలకునా లోకమాత బాగుగ గాచెన్ ||

ఒకనాడు ఉత్సవ కోలాహలంలో ఇతని తల్లీ తండ్రీ పిల్లవానిని గుడిలో వదలి మరచి ఇంటికి పోయారు. అంత పెద్ద దేవాలయంలో చీకటిలో ఏడుస్తున్న పిల్లవానిని సీతామాత కరుణించి పాలిచ్చి కాపాడింది. తెల్లవారి లేచి అందరూ వెదకి చూడగా పిల్లవాడు గర్భగుడిలో నిద్రిస్తూ ఉండటమూ పిల్లవాని నోటినుంచి పాల చారికలు ఉండటమూ చూచి అందరూ విస్తుపోయారు.

కం||ఎంతటి భాగ్యము నీదిర
అంతటనా వేల్పులెల్ల వింతగ జూడన్
మాతయె బ్రహ్మకు పావన
జాతయె నిను ముద్దుచేయు రీతియదేమో?||

రామభద్ర కవీ!!ఏమి భాగ్యమయ్యా నీది?ఆ దేవతలందరూ వింతగా చూస్తుండగా సాక్షాత్తూ లోకమాత నిన్ను ముద్దుచేసి నీకు పాలిచ్చిన సంఘటన ఎంత వింతగా ఉన్నది?

కం||ధన్యము నీదగు జన్మము
ధన్యంబిక నీ గోత్రము ధన్యము భువిలో
ధన్యంబిక ముమ్మాటికి
అన్యము గాదనుట నిజము అయ్యలభద్రా||

ఓ అయ్యలభద్రా,నీ జన్మధన్యం.నీ గోత్రం ధన్యం.ముమ్మాటికి నీవు ధన్యుడవు.నీ గురించి ఇంకేమీ చెప్పలేము.

ఇమాంబేగ్ అనే ముస్లిం పాలనాధికారి దేవాలయాల విధ్వంసం చేసి అందలి సంపదను కొల్లగొట్టి నవాబుకు అర్పించేవాడు.అతడు ఇచ్చట రాముని పరీక్షించి ఆయన వాణిని విని అచేతనుడై రామభక్తుడై దేవాలయాభివృద్ధికి కృషి చేసినాడు.

||తురకలెల్ల జేరి తుచ్చంపు మనమున
బేగునంపి కూల్చి దేవళముల
మంచి వైన యట్టి మాణిక్య రత్నాలు
వారి రాజుకంపు విధము నిచట ||

||బేగుడొచ్చి ఇచట భీకరంబుగనిల్చి
దేవుడున్న యెడల రావలయును
లేని యెడల కూల్తు దేవళంబని జెప్ప
పలికినావు నీవు పట్టుబట్టి||

కం||కలడా దైవంబిట యని
అల్లన బేగుండు జేరి గొల్లున బిలువన్
పలికిన నీ స్వరమును విని
ఉలుకున నీ భక్తుడయ్యె తురకుండిలలో||

పోతులూరి వీరబ్రహ్మంగారు ఇక్కడి శ్రీరాముని దర్శించి తరించిన మహా యోగులలో ఒకడు. ఆయన గురించి తెలియని తెలుగువాడు ఉండడు.

||కందిమల్లపల్లె కవిరాజ ముఖ్యుండు
నిన్ను జూడవచ్చి సన్నుతించి
కలిమిమీర జెప్పె కాలంపు జ్ఞానంబు
నీదు కరుణచేత నిక్కముగను||

||పోతులూరి యోగి పొంకమ్ముగావచ్చి
దండమాచరించి ధన్యుడయ్యె
కాలజ్ఞానసుధను కామితంబుగ జెప్పి
కీర్తినొందెనిచట సార్థకముగ||

||వీరబ్రహ్మయోగి వింతైన తత్వాల
లోతులెరుగ తరమె లోకులకును
నీదుకరుణవల్ల నిజబోధ గల్గురా
మందహాస యొంటిమిట్టవాస||

ద్వాపరయుగంలో పరీక్షిత్ మహారాజుకిచ్చిన శాపంవల్ల తనకు కలిగిన తపో హీనతను పోగొట్టుకోడానికి శృంగిమహాముని ఇక్కడే తపస్సు చేసినాడు. ఇక్కడికి దగ్గరిలోనే శృంగిశైలం అనే పర్వతం ఇప్పటికీ ఉన్నది.

||శృంగిశైలమనెడి బంగారు కొండపై
తపము జేసె శృంగి ద్వాపరమున
బాలకాండ వ్రాసె భళియాంద్ర వాల్మీకి
ఇదియె పర్వతమున నింపుగాను||

||పాము దెచ్చి రాజు పాపమా మునిమెడను
వేసిపోవ శృంగి వేసరిల్లి
తక్షకుండు గఱచి తాజంపు నిన్నంచు
శాపమిచ్చె నపుడు సాహసమున||

||శాపమొసగి తాను శక్తి హీనుండౌట
జూచి శౌనకుండు చల్లగాను
రాముడున్న యట్టి రమ్యమౌ శైలాన
తపము జేయుమంచు తనయునంపె||

ఇక్కడకు దగ్గరలోనే మృకండుకొండయనే ఒక పర్వతం కలదు. దానిమీదనే మార్కండేయుడు తపస్సు చేసి శివుని మెప్పించిన మృకండేశ్వరాలయం ఉన్నది.


కం||వీలుగ మార్కండేయుడు
శూలిని మెప్పించెనిచట కాలుని గెలిచెన్
హాలాహలకంఠుని గని
ఏలెను చిరజీవితమ్ము రాలెను సుమముల్||

కం||కలదొక పర్వతమిచ్చట
నిల మృకండుని కొండను ఇంపగు పేరన్
లీలగ గంగాధరుడిట
కాలుని దండించెనంత బాలుడు బ్రదికెన్||

ఆలయంలోనే 1961 సంవత్సరంలో సమర్థసద్గురు నారాయణ మహారాజ్ గారు పదకొండురోజులు అఖండరామనామ సంకీర్తనం నిర్వహించారు. ఆయన తన దివ్యదృష్టితో అనేకవేల సంవత్సరములనుండీ భూస్థాపితమై ఉన్న స్పటికసాలగ్రామమును భూగర్భములో దర్శించి దానిని బయటకు తీయించి రామలింగేశ్వరుడనే పేరుతో ప్రతిష్ట చేసారు.

||కాంచెనిచట గురుడు ఘనసాలగ్రామంబు
ధరణియందు నొకటి దాగినటుల
త్రవ్వితీసి దాని స్థాపించె నిచ్చోట
రామలింగుడనుచు రక్తిమీర||

మళయాళసద్గురుని శిష్యుడైన సాయంవరదదాసు మంచికవి.ఆయన ఇక్కడివాడే.శ్రీరామునిపైన ఆయన కవిత్వము విని తిరుపతి వెంకటకవులే మెచ్చుకున్నారు.వరదదాసా!!కవివంటే నీవు మేము కాదన్నారు.ఇక ఇతరులు చెప్పెడిదేమి?

||వరదదాసు కవిత వర్ణింప నాలించి
వేంకటాఖ్య కవులు వింతగాను
కవివియన్న నీవు కామంచు మేమని
సన్నుతించిరతని సమ్మతించి ||

కం||మళయాళ గురుని శిష్యుడు
ఇల రాముని కీర్తించుట వినుచును వారల్
భళియని తిరుపతి కవులిట
తలలూచిరి వరదదాస! వరకవి వనుచున్||

మువ్వగోపాలపదముల లోకప్రసిద్ధుడైన క్షేత్రయ్య క్షేత్రమును దర్శించి రామానుగ్రహమునకు పాత్రుడయ్యెనని ఇక్కడ అంటారు

||పదములెల్ల బాడి పరగెనీ క్షేత్రయ్య
పాపమెల్ల బాసి పావనుండు
దేశమెల్ల దిరిగి దైవతంబుల దలచి
నిన్నుగొల్చి తాను ధన్యుడయ్యె||

||మువ్వగోపబాలు ముత్యాల పదముల
బాడినావు నీవు పాపరహిత
సరిగ నాల్గువేల శృంగారతత్వాల
రమ్యతాళ గతుల గమ్యమలర||

ఒంటిమిట్ట కోదండరాముని కీర్తించి ముక్తిని పొందినవారు ఎందఱో ఎందరెందరో?మహాకవులు,మహాభక్తులు,మహాయోగులు ఎందరికో వరము లిచ్చిన ఘనుడీ కోదండరాముడు.

||భక్తకవుల బృంద మత్యంత వినయాన
పొగడి నిన్ను ముక్తి పొందిరిచట
ఇంతకన్న వరము ఇంకేమి కలదురా
మందహాస యొంటిమిట్టవాస||

భగవంతుని ఏది కోరితే అది తప్పక లభిస్తుంది. ధనం కోరితే అదీ లభిస్తుంది. ముక్తి కోరితే అదీ దొరుకుతుంది. ఏది కావలెనో మనమే తేల్చుకోవాలి.

||పసిడి గోరనదియె ప్రాప్తించు నిక్కంబు
నిన్నుగోరి వేడ నిన్నెజేరు
తెలివిగలుగు వారు తేల్చుకోవలెనింక
మందహాస యొంటిమిట్టవాస||

జీవునికి చిట్టచివరి జన్మలయందుగాని మోక్షమందు ధ్యాస కలుగదు.

||తిరిగి జన్మలందు తపియించి జీవుండు
కడమ పుట్టుకమున కనులు దెరచి
నిన్నుదలచినపుడు నిర్వాణమందురా
మందహాస యొంటిమిట్టవాస||

||నేను నాది యన్న నీచంపు భ్రమలేల
బ్రతుకులోన నిన్ని బాధలేల
నిన్ను జేరి నేను నిత్యుండనయ్యెదన్
మందహాస యొంటిమిట్టవాస||

ఏమి స్థలమహాత్యము? ఇట్టి స్పందనలు ఎక్కడా కలుగలేదు కదా?ఇట్టి రసానుభూతి, కవితావేశం కలిగించిన నేలలో ఎంతటి ధన్యత్వం ఉన్నదో

||ఇట్టినేల జూడ నెక్కడైననులేదు
ఎందరెందరిచట బంధ మూడి
పరమముక్తి గనిరి పావనాత్మకులైరి
మందహాస యొంటిమిట్టవాస||

||కవులు యోగులెల్ల కమనీయ మొప్పార
భక్తులెల్ల నిన్ను బాడిరిచట
భక్తి నదిని మునిగి బ్రహ్మరూపకులైరి
మందహాస యొంటిమిట్టవాస||

నీకరుణ ఉన్నచో నాకేమి తక్కువ?నేను నీ భక్తుడను.భుక్తియైనా, భక్తియైనా,శక్తులైనా, మరి ముక్తియైనా నాకు సులభమే.

||నీదు కరుణ యున్న నింకేమి తక్కువ
భక్తియైన దివ్యశక్తులైన
ముక్తియన్న నాకు ముంజేతి దండరా
మందహాస యొంటిమిట్టవాస||

||రామరామ యనుచు రామచంద్రయనుచు
రామభద్ర యనుచు రంగుగాను
నీదు నామమింక నిత్యంబు దలచెదన్
మందహాస యొంటిమిట్టవాస||

శ్రీరామకృష్ణుని మనస్సులో నిరంతరమూ స్మరించిన నా భాగ్యవిశేషమేమో, క్షేత్రములో శ్రీరామానుగ్రహము ప్రాప్తించినది.రాముడైనా కృష్ణుడైనా నేనే అని చెప్పినాడుగా శ్రీ రామకృష్ణుడు.

||రామకృష్ణునింక నీమమ్ముగానేను
గొల్చినట్టి ఫలిత మిద్దియేమొ
రామచంద్రు కరుణ రమ్యంబు గాదక్కె
ధన్యుడైతి నీదు దయను బొంది||

||దేహదాస్య మింక సాహసంబున వీడి
ఇంద్రియముల మించి ఇచ్చగించి
ఆత్మగతిని బొంది అమరుండ నయ్యెదన్
రామ నీదు కరుణ రచ్చలేల||


శ్రీరామా.నీకరుణ చేత సామాన్యుడనైన నేను నూరుపద్యములు ధాటిగా చెప్ప గలిగాను. అది నా గొప్ప గాదయ్యా. నీ కరుణ మాత్రమె.

||ఒంటిమిట్ట యనెడు యొకదివ్య వరభూమి
గాంచియుంటి నేను ఘనతరముగ
నీదు కరుణ దడిసి నిక్కంపు కవినైతి
మందహాస యొంటిమిట్టవాస||

కం||కలమా ప్రాణము లేనిది
బలమై నా రాముడుండ బహువిధరచనల్
కలిగిన రీతిని నాచే
కల్పించితివిట్టి పద్యకవితా గరిమల్||

కం||నీదగు కవితా శక్తిని
నాదగు ఈపాణి బట్టి నడపించితివా
నీ దయ గూరిమి మహిమన్
నాదౌ ఈరచన వెలసెనిటు చిత్రముగా||

క్షేత్రాన్ని దర్శించి, నీ కరుణావృష్టిలో తడిసి నేను ధన్యుడనైనాను. క్షేత్రంలో నాకు కలిగిన ఆంతరికానుభవం ఏమిటో నేను వ్రాయలేను. అది నాలోనే ఉంటుంది. కాని నిన్ను, క్షేత్రాన్ని, ఇక్కడి మహాపురుషులనూ స్మరిస్తూ పద్యాలను ముక్కోటిఏకాదశినాడు వ్రాసి పూర్తిచేయగలిగాను.

కం||ధన్యుడనన్నమ దేశిక
ధన్యుండను తాతాయతి ఘనసిద్ధేశా
ధన్యుండను వసుదాసా
ధన్యుడ నేనొంటిమిట్ట ధరణీనాధా||

ఓ అన్నమయ్యా, ఓ తాతయ్యయోగీ,ఓ సిద్ధేశ్వరా,ఓ వసుదాసా,ఓ కోదండరామప్రభూ!!! మీస్మరణచేత నేను ధన్యుడనయ్యాను.
read more " ఒంటిమిట్ట - మిగిలిన ముప్పై ఎనిమిది పద్యాలు "

25, డిసెంబర్ 2009, శుక్రవారం

ఆంద్ర వాల్మీకిపై వచ్చిన ఇరవై పద్యాలు






























శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు(ఆంద్ర వాల్మీకి) 23-1-1863 న రాయల సీమలోని ప్రొద్దుటూరులో జన్మించారు.1-8-1936 న మదరాసులో పరమ పదించారు. వీరు కాలాంతరమున వాసుదాస స్వామిగా ప్రసిద్ధికెక్కిన మహా భక్తుడు. తపోమయ నిరాడంబరజీవి.

కం || వాసిగ వావిలి కొలనున
బూసెను పద్మంబు నొకటి సుబ్బారావై
వాసుందాస స్వామిగ
దోసిలిబట్టెను రాముని దాసుండయ్యెన్||

వావిలికొలను అనే వంశంలో సుబ్బారావు అనే పేరున్న పద్మం ఒకటి విరబూసింది.వాసుదాసస్వామి అనే పేరుతో కాలాంతరంలో ప్రఖ్యాతి గాంచింది.


ఆయన వాల్మీకి సంస్కృత రామాయణాన్ని ఇరవైనాలుగువేల ఛందోభరిత పద్యాలుగా తెలుగులో వ్రాశారు. దానికి మందరం అని పేరు. ఇది అనితర సాధ్యమైన విషయం.వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలనూ ) 108 సార్లు నియమ పూర్వకంగా పూర్తిగా పారాయణం చెయ్యటం వలన ఆయనకు అందులోని నిగూఢమైన అర్ధాలు స్ఫురించాయి.

కం || తెనుగున రామాయణమును
అనుదినమును వ్రాసినాడు అచ్చపుభక్తిన్
ఘనుడాంధ్ర వాల్మికి యను
మునిపుంగవు డొక్కడుండె ముదమున వినుమా ||


రామాయణాన్ని తెలుగుభాషలో భక్తితో వ్రాసినట్టి 'ఆంద్రవాల్మీకి' బిరుదాంకితుడు ఒక ఘనుడున్నాడు.   


కం || వరుసగ రామాయణమును
ఇరువది నాలుగు వేలగు ఇంపౌపదముల్
తరమే సంస్కృత సమముగ
మరి వ్రాయగ నేరికైన మందరమనుచున్ ||


ఇరవై నాలుగువేల పద్యాలలో సంస్కృత రామాయణాన్ని తెలుగులో వ్రాయడం ఎవరికైనా సాధ్యమేనా?మందరం అన్న ఆ మహాకావ్యం ఎంత చక్కనిదో కదా?


ఆయన వ్రాశిన రామాయణాన్ని మహాసభామధ్యంలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునకు అంకితం ఇచ్చారు.అప్పుడు బళ్ళారిరాఘవ గారి అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు 'ఆంధ్రావాల్మీకి' అని బిరుదు ప్రదానంచేసారు. అలా ఇవ్వడం వల్ల ఆ ఇచ్చినవారే ధన్యులయ్యారు.

కం || ఆంధ్రా వాల్మికి వనుచున్
సాంద్రముగా బిరుదునిచ్చి సత్కవి కికనా
చంద్రార్క ఖ్యాతిం గని
మందరమై నిల్చితీవు మహినటతిలకా ||


ఓ నటతిలకమా.బళ్ళారి రాఘవా! 'ఆంధ్రావాల్మీకి' అంటూ బిరుదును ఈ మహానీయునకు ఇవ్వడం వల్ల నీ ఖ్యాతి ఇనుమడించింది సుమా.

రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికీ వారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి ఆలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకొని ఆయన ఆంద్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో దేవాలయానికి పూర్వవైభవం తెచ్చారు. తన జీవితాన్ని ఒక తపస్సుగా గడిపారు.


కం || రామునకై బిచ్చమడిగె
కాముని వశమందు నుంచె కర్మల నణచెన్
రామాయణమున్ జెప్పెను
పామరు వోలెన్ పండితుడేమరి బ్రతికెన్||

కం || టెంకాయ చిప్ప బట్టుక
శంకాకుల మనము వీడి ఇంకేమనుచున్
బింకపు వాసుందాసక
లంకముగా బిచ్చమెత్తె నింకను వినుమా||

టెంకాయ చిప్పను చేతిలో ధరించి ఊరూరా తిరిగి బిచ్చమెత్తి వచ్చిన ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించారు. ఎంత ధనం తనలో పడినా ఏదీ ఉంచుకోనక రామునకిచ్చి చివరకు తాను ఖాళీ అయిన టెంకాయచిప్ప ను చూచి " నీ జన్మ ధన్యము కదే టెంకయ చిప్పా " అంటూ దానిమీద 'టెంకాయ చిప్ప శతకం' చెప్పిన మహాకవి.

కం || టెంకాయచిప్ప శతకము
పొంకము మీరంగ జెప్పె పొంగుచు మదిలో
ఇంకను లోటేమున్నది
కింకరునకు వాసుదాసవరునకు నిలలో ||

మనస్సులో ఉప్పొంగుతూ టెంకాయ చిప్ప శతకాన్ని చెప్పినావు. నీకింకా లోటేమున్నదయ్యా వాసుదాస యతీంద్రా?


కం ||ఏమీ నీ యదృష్టం

బేమీ నీ భాగ్యగరిమ నెంతని పొగడన్
ఏమీ నీ జీవితమిట
నేమీ నీ ధన్యచరిత టెంకయచిప్పా ||

రామాలయ జీర్ణోద్ధరణకు దేశమంతా తిరిగి నీలో పడిన ధనాన్ని ఒక్క రూపాయి కూడా ఉంచుకోనకుండా చివరికి ఖాళీగా మిగిలిన నీ జీవితం ధన్యం కదా టెంకాయ చిప్పా. నీవలె మేము కూడా ఆశామోహాలను వదల్చుకొని శూన్యాన్తరంగులమై ఎప్పుడు నిలుస్తామో కదా !

ఆయన 1920 ప్రాంతాలలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజిలో తెలుగు పండితునిగా పనిచేసారు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచీ ధరించి రామునికోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేసారు. కాని ఊరిలోని కొందరు స్వార్థపరులు కుళ్ళు రాజకీయాలతో ఆయన్ను అవమానించి ఆలయం లోనికి రానివ్వక వెడలగొట్టారు. ఆయనకు ఊరిలో నిలువలేని పరిస్తితి కల్పించారు. ఆయన దుఖించి, ఆ ఊరిని వీడి, మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెం లోనూ తరువాత అంగలకుదురులోనూ తన ఆశ్రమాన్ని స్తాపించుకొని అక్కడే ఉన్నారు. వారు మొదలు పెట్టిన గురుపరంపర నేటికీ కొనసాగుతూ ఉన్నది. వారి వెబ్ సైట్ ఇక్కడ చూడండి. www.kodandarama.com



కం || పాండితి నొల్లక నీవటు
ఖండితముగ రాముగోరి కరమోడ్పులతో
దండన లొందుచు జెదరక
నుండితి వీ యొంటిమిట్ట వసుదాసేంద్రా||

మహా పండితుడవైనప్పటికీ, ఆ పాండిత్యాన్ని వదలిపెట్టి,రాముని దర్శనాన్ని కోరి గ్రామస్తుల చీదరింపులను సహిస్తూ ఈ ఒంటిమిట్టలో ఒక బికారివలె ఉన్నావు కదా.

కం || రంగుగ నీ గ్రామంబున
పొంగుచు నాధూర్తులెల్ల నిను దిట్టంగా
కుంగుచు నీవటు మదిలో
అంగలకుదురుకు బోయితి వతిఖిలమతివై ||

మంచి చేద్దామని సంకల్పించినట్టి నిన్ను ఆ గ్రామస్తులే రకరకాల మాటలతో అవమానించగా నీవు బాధపడి చివరకు తెనాలి వద్ద గల అంగలకుదురు కు చేరావు కదా.

కం || పోతనయే నివసించిన
ఈ తావున నిల్చి నీవు అతిబింకముగా
యాతనల కోర్చి కూర్చితి
వతి సుందరమౌ కావ్యము మందరమనుచున్ ||

పోతన ఇక్కడ నివసించాడు అన్న కారణం వల్ల నీవు కూడా ఇక్కడే ఉంటూ ఎన్నో యాతనలకు ఓర్చుకుని మందరమనే సుందరకావ్యాన్ని రచించావు కదా.

కం ||మందరమను ఆ కావ్యము

నందముగా గూర్చితీవు అతిచతురతతో

చందురుడినుడే సాక్షులు
అందరితో నౌనె ఇట్టి యద్భుతమనఘా ||

మందరమనే ఈ సుందర కావాన్ని వ్రాయడం ఇతరులవల్ల అవుతుందా? ఈ అద్భుతాన్ని నీవు చెయ్యడం చూచిన చంద్రుడు సూర్యుడే దీనికి సాక్షులు.


కం || భక్తుండవు రామునకిల
రక్తుండవు గావు నీవు రమ్యల యందున్

శక్తుండవు బహు రీతుల
ముక్తుండవు ముదమారగ మునికుల తిలకా||

నీవు రామభక్తుడవు. నీకు సుందరీమణుల యందు మోహం లేదు. ఎన్నో రహస్య శక్తులు కలిగినవాడవు. చివరకు ముక్తిని కూడా పొందినావు.

కం || అచ్చంబగు కవివి నీవుర

స్వచ్చంబగు కవిత నీది సత్యంబిదిరా

తుచ్చత లేదుర నీలో
మచ్చయె  లేనట్టి దివ్య మహిమాన్వితుడా ||

నా దృష్టిలో అచ్చమైన కవివి నీవే. నీ కవిత స్వచ్చమైనది. నీలో అల్పత్వం ఎక్కడా లేదు. నీవు మహిమాన్వితుడవు.

ఆయన మొదట హఠయోగ సాధనలు చేసెడివారు. ఒకనాడు స్వప్నములో ఇద్దరు సోదరులు కనిపించి నీవు నడుస్తున్న దారి ముళ్ళబాట.ఇటు రమ్మని చేయి పట్టుకొని మంచి రాచబాటలో విడిచినట్లు కలగన్నారు.అంతట హఠయోగమును విడచి భక్తియోగమును ఆశ్రయించి కృతార్దుడైనాడు.

కం ||హఠయోగపు సాధనమున
ఇటునటుగా జీవుడలసి స్వప్నము గాంచెన్
బాటను ముళ్ళని ఇరువురు
పాటిగ జేర్చిరి సొంపగు బాటను ఎటులో ||

ఆయన ఎంతటి మహా కవి యంటే ఒక్క ఉదాహరణ. నెల్లూరులో జరిగిన ఒక సభలో సభ అందరి ఎదురుగానే కొన్ని గంటలలో ఆశువుగా రంగ నాయకునిపై నూరు పద్యాలు ఆశువుగా చెప్పి శతకాన్ని పూర్తిచేసారు.


|| రంగ నాయకునికి రంగారు శతకమ్ము

జెప్పినావు నీవు జిత్రముగను
ఎల్లవారి ఎదుట నెల్లూరు సభలోన
ఒక్కపూటలోన నిక్క మిదియె ||

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజు మన దేశాన్ని చూడటానికి ఒచ్చినపుడు, కళాశాల తెలుగు పండితుడు గనుక యువరాజును స్తుతిస్తూ కవితలు చెప్పమని బ్రిటిషు ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. బహుమతిగా బంగారు కంకణం ఇస్తామని ఆశ చూపింది. దాన్ని ఖరాకండి గా తిరస్కరించి తాను రామదాసునే గాని కామదాసును గానని తేల్చి చెప్పాడు.

ఆ || ఇచటికొచ్చువాడు ఇంగ్లీషు యువరాజు
కవిత జెప్పుమన్న కబురు దెలిసి
రామదాసు నేను కామదాసును గాను
కవితలల్లననుచు ఖండితముగ ||

ఆ || ఆశ జూపినట్టి అచ్చంపు బంగారు
నిచ్చగింప బోక నేవగించి
గెల్చినావు నీవు ఘనరాము హృదయంబు
వాసుదాస భక్తవర వికాస ||

ఆ || బిరుదు నిచ్చె నిచట బళ్ళారి రాఘవ
ఆంద్ర వాల్మికంచు నాదరమున
గణుతి కెక్కినావు ఘనసభామధ్యమున
వాసుదాస భక్తవర వికాస ||

తుచ్చమైన లోకంలో స్వచ్చమైన జీవితాన్ని గడపి శ్రీరామసాక్షాత్కారాన్ని పొందిన ధన్య జీవి. నవీనయుగంలో రుషివలె బ్రతికి చూపిన మహాపురుషుడు.

ఆ || తుచ్చమైన నిట్టి లోకంబు నందున
బ్రతికినావు నీవు యతివరేణ్య
పంకసీమయందు పద్మంపు రీతిగా
వాసుదాస భక్తవర వికాస ||
read more " ఆంద్ర వాల్మీకిపై వచ్చిన ఇరవై పద్యాలు "