“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, డిసెంబర్ 2009, గురువారం

తాళ్ళ పాక-ఒంటిమిట్ట విశేషాలు


మొన్న పదకొండోతేదీ నుంచి నేటివరకూ తెలంగాణా ఆందోలనవల్ల ప్రత్యెకబాధ్యతలతో ఊపిరిసలపని పనిసరిపోయింది. సందర్భంగా కడప, నందలూరు, ధర్మవరంలలో వారమంతా గడిచింది.

నందలూరులో తినటానికి ఏమీ దొరకదు. ఒకప్పుడు ఊరు గొప్పగా వెలిగిన ఊరు. సౌమ్యనాదస్వామి అనివిష్ణు మూర్తి ప్రాచీనఆలయం చోళరాజులకాలం నాటిది ఇక్కడ ఉంది. కాని ప్రస్తుతం ఊరిలో సగభాగం సాయిబులే కనిపిస్తున్నారు. సౌమ్యనాథస్వామీ ఆలయం చుట్టూ కూడా ముస్లిం ఇళ్ళే ఉన్నాయి. ఊరిలో ఎక్కడ చూచినా మాంసం కొట్లు, బార్లు. కడుపులో తిప్పి వాంతి వచ్చినంత పనైంది.

ఫలహారం, భోజనంకోసం పక్కనేఉన్న రాజంపేట పోయి అక్కడ ఒక వైశ్యుల హోటల్లోతిని వెనక్కురావాలి. నందలూరు రాజంపేట మధ్యలోనే అన్నమాచార్యుని జన్మ స్థలం తాళ్ళపాక ఉంది. నందలూరు-కడప మధ్యలో పోతన భాగవతం వ్రాసిన ఒంటిమిట్ట రామాలయం ఉంది. కనుక రెండుక్షేత్రాలు కొద్దితీరిక సమయంలోదర్శించటం జరిగింది. అక్కడ తీసిన ఫోటోలు, పైన చూడవచ్చు.

తాళ్ళపాక:

రోడ్డు మీద తీ.తీ.దే వారు నిర్మించిన 108 అడుగుల ఎత్తైన అన్నమాచార్యుని విగ్రహం ఉంది. దాని పక్కనుంచి తాళ్ళపాక గ్రామానికి దారి ఉంది. అక్కణ్ణించి తాళ్ళపాక అయిదుకిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపు వెయ్యిఇళ్ళు ఉన్న ఊరు తాళ్ళపాక. అక్కడే అన్నమయ్య జన్మించిన పూరిపాకను కనుగొని ఆచోటులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసారు.

ఆ ప్రక్కనే అన్నమయ్యకు మొదట శ్రీనివాసుని దర్శనం కలిగిన చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. ఆవరణద్వారం వద్ద చక్రాయుధానికి దేవాలయం ఉంది. చెన్నకేశవస్వామీ ఆలయం పురాతనమైనది. ఇక్కడ భక్తిభావతరంగాలు బలంగా ఉన్నాయి. తేలికగా మనస్సు భగవంతుని యందు లగ్నం అవుతుంది. ఆవరణ అంతా పచ్చనిచెట్లతో ఆహ్లాద కరంగా ఉంది. నేను వెళ్ళినరోజున మబ్బులుపట్టి చిరు చినుకులు పడుతూ ఇంకామనోహరంగా ఉంది.

ఈ దేవాలయానికి కొంచం దూరంలో సిద్దేశ్వరస్వామి  అనే శివుని ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు కామాక్షీదేవి. అన్నమయ్య పూర్వీకులు శివార్చకులు. అన్నమయ్య కూడా మొదట శివుని అర్చించేవాడట. తరువాత చెన్నకేశవస్వామీ ఆలయంలో మొదటసారి విష్ణుదర్శనం కలిగి అక్కణ్ణించి తిరుమల వెళ్లి ముద్రలు వేయించుకొని వైష్ణవమతాన్ని స్వీకరించాడట.

సిద్దేశ్వరస్వామి ఆలయం చాలా పురాతనమైనది. దాదాపు 1600 ఏళ్ల క్రిందటిది అని చెప్పారు. ఇందులో ఏకాతాతయ్య అనే ఒక సిద్ధునివిగ్రహం శివుని ఎదురుగా చూస్తున్నట్లు ఉంటుంది. ఈ ఏకాతాతయ్య అనే సిద్ధుడు తలనొప్పులు పోగొట్టుకోటానికి శివుని గూర్చి తపస్సు చేసాడట. తరువాత అక్కడే సమాధి అయ్యాడని దానిమీదే ఆయన విగ్రహం ధ్యానముద్రలో ఉంది. సంసారచింతలను కూడా తలనోప్పులనేగా యోగులంటారు.

ఈ ఆలయంలో రావి, మర్రి, జువ్విచెట్లు ఒకే మొదలు నుంచి వచ్చి పెరిగిన ఒకవృక్షం ఉంది. కాండం చాలా ఎత్తువరకూ ఒకటిగానే ఉంది తరువాత దానిలోనుంచి మూడుచెట్లు వచ్చాయి. దీనికింద చక్కని ధ్యానానుకూలవాతావరం ఉంది. ఈ ఆలయంలోని నందివిగ్రహాన్ని ఎవరో దుండగులు గుప్తనిధులకోసం పగులగొట్టారు. నిలువునా చీలి ఉంది. యోగాభ్యాసపరులకు బ్రహ్మాండమైన స్పందనలు ఈ ఆలయంలో ఉన్నాయి.

ఒంటిమిట్ట: 

దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు.

ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని ప్రస్తుతం శిధిలం. ఆయన దున్నిన మడికూడా రామసరోవరం పక్కనే ఉంది. ఆలయంలోజయ విజయుల విగ్రహాలప్రక్కన పోతన విగ్రహం ఉంది. ఇంకొక విశేషం- ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బారావుగారు (వాసుదాసస్వామి) సంస్కృతం నుంచి సరాసరి ఇరువైనాలుగువేల పద్యాలతో "మందరం" అనబడే తన తెనుగు రామాయణాన్ని ఇక్కడే వ్రాసారు. ఆయన నిరాడంబరపవిత్రజీవి. తపోమయజీవితాన్ని గడపుతూ కొన్నేళ్ళు ఇక్కడే పోతనఉన్న ఇంటిలోనే నివసించారు. తరువాత ఊరివారి మూర్ఖపుప్రవర్తన మొరటుతిట్లకు విసిగి ఊరువిడచి తెనాలిదగ్గర అంగలకుదురులో ఉన్నారు.

ఈ దేవాలయాన్ని దర్శించి శ్రీరాముని సేవించి తరించిన మహనీయులు, కవులు, భక్తులు, ఎందఱో ఉన్నారు. వారిలో ముఖ్యులు "రామాభ్యుదయం" వ్రాశిన అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతన, అన్నమయ్య, వీరబ్రహ్మం గారు, ఉప్పుగుండూరు వెంకటకవి,వరకవి, ఇమాం బేగ్, భవనాసి మాలఒబన్న, ఆంధ్ర వాల్మీకివాసుదాసస్వామి, సద్గురుసమర్థనారాయణ మహారాజ్, సాయం వరదదాసు మొదలగువారు.

వీరిలో అయ్యలరాజు రామభద్రుడు పదినెలల చిన్నవానిగా ఉన్నప్పుడు ఒక ఉత్సవ సమయంలో, అతన్ని తల్లిదండ్రులు 
దేవాలయంలో మర్చిపోతే, అర్చకులు కూడా చూచుకోకుండా దేవాలయానికి తాళంవేసి ఇంటికి పోతారు. తెల్లవారి చూడగా పాపడు గర్భ గుడిలో సీతామాతవిగ్రహం పాదాలవద్ద నిద్రిస్తూ ఉండటము, బాలునికి పాలుద్రాపిన చారికలు బుగ్గపై ఉండటము చూస్తారు. సీతమ్మతల్లి ఏడుస్తున్నపిల్లవానికి పాలిచ్చి రాత్రంతా కాచినది. ఆ మహాత్మ్యమో ఏమో ఆయన పెద్దవాడై మహాకవి అయ్యాడు.

ఇక పోతనామాత్యులు " పలికెడిది భాగవతమట "అంటూ తన తెనుగు భాగవతాన్ని ఇక్కడి శ్రీరామునకే అంకితం ఇచ్చాడు. ఆయనకు ఇక్కడే శ్రీరామదర్శనం కలిగింది. తాళ్ళపాక అన్నమయ్య ఇక్కడ శ్రీరాముని దర్శించి " జయజయ రామా సమరవిజయరామా భయహర నిజభక్త పారీణ రామా" అనే కీర్తనను రచించాడు. ఇక్కడి కోదండరాముని పోతులూరి వీర బ్రహ్మంగారు దర్శించినట్లు వారి చరిత్రలో ఉంది. బ్రహ్మంగారి మటం ఇక్కడకు ఎనభై కి.మీ దూరంలో ఉంది.

పోతనామాత్యుని విగ్రహం వద్ద ఈ పద్యం వ్రాసి ఉంది.

|| ఇమ్మను జేస్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముం బాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పెనీ
బమ్మెర పోత రాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ ||

ఉప్పుగుండూరు వెంకటకవి "దశరధ రామ "మకుటం తో శతకం చెప్పారు. వారి శతకం లో మచ్చుకు ఒకపద్యం.


||నిగ నిగ మెరయు కిరీటము
ధగ ధగమను పట్టు దట్టి తగిన కటారున్
భుగ భుగ వాసన నీకే
తగు తగురా యొంటి మిట్ట దశరధ రామా ||

వరకవి " కోదండరామ శతకం " వ్రాశాడు. అది ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యపరిశోధనశాఖ వద్ద ఉన్నది. 1670 లో కడప నవాబు ప్రతినిధి ఇమాంబేగ్ ఇక్కడకొచ్చి దేవుని పిలువగా ఆయన పలికాడని, ఇమాం బేగ్ రామభక్తునిగా మారి ఇక్కడ బావి తవ్వించి, గోపురాలు కట్టించాడు.

భవనాసి మాలఒబన్న సంకీర్తనలో తన్మయంచెందే భక్తుడు. పూజారులు ఆయన్ను మాలవాడని తరుమగా విగ్రహాలు ఆ తరిమిన వైపుకు తిరిగాయట. అంతట పూజారులు తప్పుగ్రహించి ఆయన్ను గర్భగుడిలోకి రావించి మహాభక్తునిగా గౌరవించారని గాధ.

ఇక వాసుదాసస్వామి విషయం అద్భుతం. ఆయన అపర వాల్మీకి. మచ్చుకు ఆయన పద్యం ఒక్కటి.

ఉ ||ఖండిత పాతకోత్కర నఖండ యశోజయ భాగ్యశాలి మా
ర్తాండ కుల ప్రకాండు నహితాన్దజ పన్నగ వైరి సత్క్రుపా
మండన భూషితుం గడపమండలవాసుని నొంటిమిట్ట కో
దండ రఘూత్తము న్నియత దాస్యమున న్భజియింతు భక్తిమై ||


1652 లో మన దేశాన్ని దర్శించిన ప్రెంచియాత్రికుడు "టావెర్నియర్" ఒంటిమిట్ట కోదండ రామాలయం భారతదేశంలో చూడవలసిన అద్భుతకళా ఖండాలలో ఒకటి అని వర్ణించాడు.

ఇక్కడ మహాద్భుతమైన తపోతరంగాలున్నాయి. కవితామయ నిరాడంబరజీవితాన్ని గడపిన మహాభక్త తపోధనుల ఆత్మలు ఇక్కడనే ఉన్నవా అనిపిస్తుంది. దేవాలయంలో కూర్చొని ధ్యానించి కొంతసేపు వారినిగూర్చి ఆలోచనలోపడిన నా నోటివెంట అరవై పద్యాలు వెల్లువలా ఉబికివచ్చాయి.

ఇది నా జీవితంలో ఈమధ్యన జరిగిన అద్భుతాలలో ఒకటి. రామానుగ్రహమే దీనికి కారణంతప్ప వేరొకటి కాలేదు. ఈ ఆలయం నేను దర్శించిన అతి ప్రభావవంతములైన దేవాలయాలలో ఒకటి అని నిస్సందేహంగా నమ్ముతున్నాను. మామూలుమనిషినైన నా నోటివెంట ఇలా వరదలా ఇన్ని పద్యాలా? ఇక్కడి దైవశక్తికి అప్రతిభున్నైనాను.

"కడప దేవుని గడప" అని ఎందుకంటారో ఒక్క ఒంటిమిట్ట కోదండరామాలయం చూస్తె చాలు అర్థంఅవుతుంది. ఈ దేవాలయంలో కోతిమూకలు అసంఖ్యాకం. భక్తులకంటే అవే ఎక్కువగా ఉంటాయి. కాని అపకారం చెయ్యవు. కొత్తవాళ్ళు  వాటిని చూచి భయపడుతూ ఉంటారు.

తరువాతి టపాలో ఆశువుగా నా నోటివెంట వరదలా వచ్చిన అరవై పద్యాలూ వరుసగా ఇస్తాను.