“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, సెప్టెంబర్ 2013, శనివారం

పంచవటి సంస్థ (Panchawati Inc.) అమెరికాలో మొదలైంది

"సాటి మానవుని బాధలను పట్టించుకోని వేదాంతం నాకక్కరలేదు" అన్నారు వివేకానందస్వామి.రామకృష్ణుని శిష్యులు మెట్టవేదాంతులు కారు.వారు ఉత్త ఊకదంపుడు ఉపన్యాసకులు కారు.వారు ఆచరణవాదులు.అసలు సిసలైన సాధకులు.అంతేకాదు వారు నిజమైన మానవతావాదులు.

"ఆత్మనో మోక్షార్ధం జగద్ధితాయచ(నీ మోక్షం కొరకు,జగత్తుకు మంచి చెయ్యడం కొరకు నీ జీవితాన్ని అర్పించు) అన్న మహత్తరమైన ఆశయంతో వివేకానందులు రామకృష్ణామిషన్ స్థాపించారు.ఇన్నేళ్ళలో ఈసంస్థ లెక్కలేనంతమంది మహర్షులను మహనీయులను మహాత్ములను సృష్టించింది.

వారందరూ శ్రీరామక్రిష్ణులు చూపిన 'శివభావే జీవసేవ (శివుడినే సేవిస్తున్నాను అన్నభావంతో జీవుడిని సేవించు.జీవుడిలో శివుడిని చూడు)' అన్నబాటలో నడిచి చరితార్దులై ప్రపంచ ఆధ్యాత్మికచరిత్రలో ధృవతారలై వెలుగుతున్నారు.వారి అడుగుజాడలలో నడిచే ప్రయత్నంతోనే ఇప్పుడు పంచవటి సంస్థ(Panchawati Inc.)అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో మొదలైంది.

రాయిలో భగవంతుడిని కొలవడం మంచిదే.మనం కొన్ని వేల ఏళ్ళుగా అదే చేస్తున్నాం.కాని జీవులలో ఉన్న భగవంతుడిని ఆరాధించడం ఇంకా ఉన్నతమైనది.ఈ భావన మన వేదాలలో ఉపనిషత్తులలో ఎప్పటినుంచో ఉన్నది.దానిని బయటకు తీసి ఆచరణాత్మకంగా మలచి కర్మనే యోగంగా చెక్కి,సేవద్వారానే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగగలడు అని చెప్పిన ఘనత వివేకానందస్వామిది.

మానవ జీవితగమ్యం భగవత్ సాక్షాత్కారం.మానవుడు లౌకిక జీవితంలో ఎన్ని సాధించినా సరే,ఇది సాధించకుండా మరణిస్తే అతని జన్మ వృధా అవుతుంది.అతడు అసంతృప్తితో చావవలసి వస్తుంది.తర్వాత ఏ జన్మ వస్తుందో తెలియదు.కనుక మానవజన్మను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో వలసి ఉంటుంది.ఈ విషయాన్ని మనగ్రంధాలు అన్నీ నొక్కిచెప్పాయి. దైవసాక్షాత్కారాన్ని పొందడానికి మన ధర్మంలో మతంలో అనేక మార్గాలున్నాయి.వీటిలో భక్తి,జ్ఞాన,రాజ,కర్మయోగాలు నాలుగూ రాజ మార్గాలవంటివి.మిగిలిన చిన్నచిన్న మార్గాలన్నీ ఈ నాలుగింటిలో కలసి వస్తాయి.వాటిలో ఒకటిగాని,కొన్నిగాని,అన్నీగాని  ఎవరి శక్తిని బట్టి వారు ఆచరించి జీవితగమ్యాన్ని చేరమని వివేకానందస్వామి మహోపదేశం ఇచ్చారు.

మహోన్నతమైన మన సనాతనధర్మం కులానికి మతానికి జాతికి వర్గానికి వర్ణానికి అతీతమైనది.కాని అనేక కారణాలవల్ల తరతరాలుగా ఇవే సంకెళ్ళలో అది చిక్కుకుపోయింది.ఎందరికో దూరమై పోయింది.ఆ సంకెళ్ళను తెంచి దానిలోని అమూల్యసంపదను అందరికీ అర్ధమయ్యేలా పంచి ఆర్తితో వెదుకుతున్న ఎందరికో సరైన దారిచూపి,దాని ఒడిలోనికి వారినందరినీ ఆహ్వానించి,వారి ఆర్తిని తీర్చాలని నేను నావంతుగా మూడేళ్లుగా నా బ్లాగ్ ద్వారా నిజమైన సనాతనధర్మాన్ని వివరిస్తూ ప్రయత్నిస్తున్నాను.

ఈ ప్రయత్నంలో చాలావరకూ సఫలీకృతుడనయ్యాను అనడానికి నేను అందుకున్న వేలాది మెయిల్స్, నేను తీర్చిన వేలాది ఆధ్యాత్మిక సందేహాలే రుజువులు.నా బ్లాగ్ లోని పోస్ట్ లు చదివి -- "నిజమైన సనాతనధర్మం అంటే,హిందూమతం అంటే ఇదా? మన మతంలో ఇంత గొప్పదనం ఉన్నదా?ఇన్ని మహోన్నత విషయాలూ రహస్యాలూ మన ధర్మంలో ఉన్నాయా? అన్న విషయాలు తెలుసుకున్నాము.మీ బ్లాగ్ చదివి ఎంతో నేర్చుకున్నాము.మా ఆలోచనాపరిధి ఎంతో పెరిగింది.మా జీవితాలలో ఊహించని మార్పు వచ్చింది.మీ వ్యాసాలు చదవకుంటే జీవితంలో ఎంతో కోల్పోయి ఉండేవారము" - అంటూ నాకు వచ్చిన మెయిల్స్ కొన్ని వందలున్నాయి.నా ఈ నిస్వార్ధ ప్రయత్నాన్ని చూచి ఈనాడు నాకు తోడుగా ఇంకొందరు వచ్చి నిలిచారు.ఇంకా ఎందఱో మాతో కలవడానికీ,కలసి నడవడానికీ సిద్ధంగా ఉన్నారు.వారందరికీ నా కృతజ్ఞతలు.

పైన వివరించిన మహత్తరమైన ఆశయాలతో ఉత్తేజితులైన కొద్దిమందితో 'పంచవటి' సంస్థ ఈనాడు అమెరికాలో ప్రారంభమైంది.ఈ ఉన్నతమైన ఆశయం వెనుక విష్ణుభొట్ల రామన్నగారు,ఆకెళ్ళ పద్మజగారు,డాక్టర్ సావిత్రిగారు ప్రస్తుతానికి ఉన్నారు.వీరు ముగ్గురినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

త్వరలో మనదేశంలో ప్రారంభించబోతున్న 'పంచవటి ట్రస్ట్' లో చేరి దాని ఆశయాలలో పాలు పంచుకోవడానికి ఇప్పటికే ఉన్న మా 'పంచవటి' గ్రూప్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు.వారికీ నా కృతజ్ఞతలు.

ముందుముందు ఈసంస్థ ఎంతో ఎత్తుకు ఎదిగి,కులమతాలకు అతీతంగా,ఒక మహావృక్షంగా మారి ఎందఱో వ్యదార్తులకు స్వాంతన కలిగిస్తుందనీ ఎందఱో నిస్వార్ధసాధకులకు నిజమైన ఆధ్యాత్మికమార్గం చూపి వారిని భగవదున్ముఖులను గావిస్తుందనీ,దారి తెలియక వెదుకుతున్నవారికి సరియైన మార్గదర్శనం చెయ్యగలదనీ నేను నమ్ముతున్నాను.

ఈ కల సాకారం కావడానికి వెనుక ఎంతో తపన ఉన్నది. ఎన్నో హృదయాల నిరంతర అన్వేషణ ఉన్నది.అమూల్యమైన ఈ మానవజన్మను వృధాగా గడిపి అందరిలాగా చావకూడదన్న ఒక ఆర్తి ఉన్నది. అదంతా నేను ఇక్కడ చెప్పబోవడం లెదు.ఈ మూడేళ్ళలో జరిగిన సంఘటనలను అన్నింటినీ నేను ఇక్కడ వివరించబోవడం లెదు.కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను.

ఈ మార్గంలో మేము ఒంటరులం కాము.మా వెనుక భగవంతుని ఆశీస్సులున్నాయి.అంతేగాక పవిత్రాత్ములైన పరమపూజ్య స్వామి గంభీరానంద,స్వామినందానంద,స్వామిఉద్ధవానంద,స్వామి తపస్యానంద మొదలైన మహనీయుల,జగద్గురువుల,యోగేశ్వరుల ఆశీస్సులున్నాయి. ఇంకెందరో మహనీయుల కటాక్షం నిండుగా మావెంట ఉన్నది.స్వామి ఆత్మలోకానంద,గౌరీవ్రత్ మా మొదలైన ప్రస్తుత మహాత్ముల మార్గదర్శనం ఉన్నది.

'స్వామి ఆత్మలోకానంద','గౌరీవ్రత్ మా' - వీరిద్దరూ భారతీయులు కారు.శ్వేత జాతీయులు.వీరిలో 'గౌరీవ్రత్ మా' యూదు జాతీయురాలు.కాని భారతీయ సనాతనధర్మంతో ప్రభావితురాలై తన జీవితాన్ని రామకృష్ణ వివేకానందుల మహత్తర ఆశయాలకోసం త్యాగంచేసి సన్యాసం స్వీకరించి తపోమయజీవితం గడుపుతూ నలభైఏళ్ళ నుండి అమెరికాలో మనం ఊహించలేనంత గొప్ప సేవ చేస్తున్నారు.

చిన్నచిన్న ఆడపిల్లలను వ్యభిచార ఊబిలోకి దించి వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయించే child trafficking అనేది ఆసియా దేశాల తర్వాత అమెరికాలోనే ఎక్కువ. గౌరీవ్రత్ మా నాలుగు దశాబ్దాల నుంచి ఈ చెడును ప్రతిఘటిస్తూ అమెరికాలో ఎందఱో ఆడపిల్లలను ఈ ఊబినుంచి రక్షించి వారికి నూతనజన్మను ఇచ్చే పనిని చేస్తూ ఉన్నారు.ఒంటరి స్త్రీని నేనేమి చెయ్యగలను అనుకోకుండా,మొక్కవోని ధైర్యంతో,రామకృష్ణ,శారదా వివేకానందుల మీద అమేయమైన నమ్మకంతో,అమెరికన్ మాఫియాకు ఎదురు నిలిచి,ప్రాణాలకు తెగించి,ఎందఱో పురుషులు చెయ్యలేని ఈ పనిని గౌరీవ్రత్ మా ఒక్కరే చేస్తున్నారు.

హిందూ మతంలో పుట్టకపోయినా,భారత దేశానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా,ఈ దేశాన్ని ఈ సంస్కృతిని ప్రేమిస్తూ,ఊరకే మాటలు చెప్పి ఊరుకోవడం కాకుండా అవిచూపిన బాటలో నడుస్తూ,జీవితాలను చరితార్దాలుగా మలచుకున్న విదేశీయులు ఎందఱో నేడు మన కళ్ళెదురుగా ఉన్నారు.

వీరికి mothers trust అనే సంస్థ ఉన్నది.ఆ సంస్థ వివరాలనూ, వారు ఎంతటి అద్భుతమైన సేవను చేస్తూ ఎంతటి ఉదాత్తమైన ఉన్నతమైన జీవితాలను గడుపుతున్నారో ఇక్కడ చూడండి.

స్వామివివేకానంద యొక్క అనేకమంది శిష్యులలో ఒకరు స్వామి విరజానంద.1938 లోనే ఆయన రామకృష్ణా మిషన్ కు ఆరవ సర్వాధ్యక్షులుగా పనిచెశారు.స్వామి వివేకానందుల స్వహస్తాల నుంచి సన్యాసం స్వీకరించిన అదృష్టశాలి విరజానందస్వామి.ఆ భాగ్యమే ఆయనను జగద్గురువును చేసింది.శ్రీరామకృష్ణుల ప్రత్యక్షశిష్యులైన వివేకానందాది మహనీయుల తర్వాత తరంలో మొట్టమొదటి వారు స్వామి విరజానంద.

ఆయన శిష్యులలో ఒకరు స్వామి భాష్యానంద.ఆయన 1960 లలో అమెరికాలో నివసించి వేదాంతప్రచారం గావించారు.సనాతనధర్మాన్ని విదేశీయులకు అర్ధమయ్యేలా చెబుతూ తన ఉదాత్తమైన జీవితంతో ఎందరినో ప్రభావితులను చేశారు.ఆ ప్రభావంతో ఇప్పుడు రామకృష్ణ వివేకానందుల మార్గంలో ఎందఱో విదేశీయులు నడుస్తూ ఉజ్జ్వలమైన ఋషిజీవితాలు గడుపుతూ,భారతీయులమైన మనం సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నారు.మన ధర్మాన్ని గురించి ఈనాడు వారు మనకు బోధిస్తున్నారు. మన వేదాలలో ఏముందో మనకు తెలీదు.దానిని వారు గ్రహించడమే కాదు. జీవితాలలో ఆచరించి చూపిస్తున్నారు.మనమో,డబ్బు వెంటా, ఇంద్రియ సుఖాలవెంటా పిచ్చిగా పరిగెత్తుతున్నాం.కనీసం వారిని చూచైనా మన నిజమైన ధర్మం ఏమిటో మనం నేర్చుకునే ప్రయత్నం చెయ్యకపోతే మనకు నిష్కృతి లేనే లేదు.

మహోన్నతులైన మన పూర్వఋషులు చూపిన మార్గంలో,శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల అడుగుజాడలలో నడవాలనే మహోన్నత ఆశయంతో ఈనాడు అమెరికాలో 'పంచవటి' సంస్థ మొదలైంది.

"పంచవటి" - ఫలాపెక్ష లేని ఒక ఉదాత్తమైన సంస్థ.మాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లెదు.కిరీటాలు అక్కర్లేదు.ఆర్భాటాలు అక్కర్లెదు.పొగడ్తలు అక్కర్లెదు. ఏదో ఆశించి మేము ఈ పనిని చెయ్యడం లేదు.నిజమైన సనాతనధర్మాన్ని ఆచరించి జీవితాలను ధన్యములు చేసుకోవడమూ,ఆర్తి ఉన్న ఇతరులను కూడా ఈమార్గంలో నడిపించి వారిని కూడా ధన్యులను చెయ్యడమే మా ఆశయం.ఈ ఆశయానికి ఊతం శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానంద స్వామి.కులమతాలకు అతీతంగా వారు చూపిన విశ్వజనీనమైన మార్గమే మా బాట.

భగవదవతారమైన శ్రీరామకృష్ణుని కరుణాకటాక్షాలతో ఈ జన్మలోనే మా గమ్యాన్ని చేరగలమన్న నమ్మకం మాకున్నది.మా ప్రయత్నానికి దైవం తన చేయూతనిచ్చుగాక.

మా వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు.

త్వరలో మా కార్యక్రమాలను పై వెబ్ సైట్ ద్వారానూ,ఈ బ్లాగ్ ద్వారానూ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చెయ్యడం జరుగుతుంది.
read more " పంచవటి సంస్థ (Panchawati Inc.) అమెరికాలో మొదలైంది "

19, సెప్టెంబర్ 2013, గురువారం

సద్గురు ప్రణవానంద ఆశ్రమం


సద్గురు ప్రణవానందస్వామి
నేను నంద్యాల పట్టణానికి పోతే అక్కడికి పోయిన పని ముగిసినాక వీలైనప్పుడల్లా దర్శించే స్థలాలు రెండున్నాయి.ఒకటి సద్గురు త్యాగరాజ స్వామి ఆలయం.రెండవది సద్గురు ప్రణవానందస్వామి సమాధి ఉన్న ఆశ్రమం.చాలామందికి తెలిసిన విషయం ఏమంటే తమిళనాడు లోని తిరువయ్యారు లో త్యాగరాజస్వామి సమాధీ ఆలయమూ ఉన్నవి.కాని మన ఆంధ్రదేశంలో త్యాగరాజస్వామికి ఆలయం ఒక్క నంద్యాలలోనే ఉన్నది.ఆ వివరాలు ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను. ప్రస్తుతానికి సద్గురు ప్రణవానందుల ఆశ్రమం గురించి.



నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే దారిలో బుక్కాపురం అని ఒకగ్రామం వస్తుంది.ఆ గ్రామ పొలిమేరలలో దారిపక్కనే ఒక పెద్ద ఊడలు దిగిన మర్రిచెట్టూ దాని పక్కనే పాతకాలంనాటి ఒక ఆశ్రమమూ కనిపిస్తాయి. చాలామందికి తెలియని విషయం ఏమంటే,అది ఒక సద్గురుస్థానం అనీ,నిజమైన వేదాంతీ మహనీయుడూ అయిన ప్రణవానందస్వామి అక్కడే నివసించి సమాధి అయ్యారనీ ఎక్కువమందికి తెలియదు.


నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినప్పటికీ నాకు రాయలసీమ అంటేనే ఇష్టం.దానికి కారణం రాయలసీమలో ఉన్న ఆధ్యాత్మిక తరంగాలే. సర్కార్ జిల్లాల వాతావరణం కలుషితం అయినంతగా రాయలసీమ కాలేదు.పైగా, రాయలసీమలో ఆధ్యాత్మిక వాతావరణం సర్కార్ జిల్లాలలో కంటే చాలాహెచ్చు.ఇప్పటికీ ఎన్నో నిజమైన సాధు సాంప్రదాయాలు రాయలసీమలో ఉన్నాయి.వాటిలో ఒకటి శ్రీమదుమామహేశ్వర గురుపీఠం.ఎందఱో యోగులు,అవధూతలు, మహానీయులు ఇప్పటికీ రాయలసీమ మారుమూల పల్లెలలో కూడా మనకు కనిపిస్తారు.అయితే వారిని గుర్తించగలిగే ప్రజ్ఞ మనలో ఉండాలి.


ప్రణవానందస్వాములకు ముందు వీరి పరంపర నాకు తెలియదు.కాని ప్రణవానందస్వామి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ రాయలసీమలో స్థిరపడి బుక్కాపురంలో సమాధి అయ్యారు.ఆయన శిష్యుడైన సద్గురు సదానందస్వామి గుంతకల్లు దగ్గర ఉన్న గంజిగుంట అనే గ్రామంలో ఆశ్రమం నిర్మించుకుని అందులోనే నిర్యాణం చెందారు.వారి సమాధి అక్కడ ఉన్నది. ఆయన శిష్యుడైన శంకరానందగిరి స్వామి ఉరవకొండ దగ్గర ఉన్న లత్తవరం అనేగ్రామంలో సమాధి చెందారు.వీరు ముగ్గురూ నిజమైన వేదాంతులు. మహనీయులు.సద్గురువులు.

వీరిలో శంకరానందగిరిస్వామిని దర్శించే భాగ్యం నాకు కలిగింది.1984 లో నేను గుంతకల్లులో ఉన్నప్పుడు తిలక్ నగర్లో ఉన్న వారి ఆశ్రమాన్ని తరచూ దర్శించేవాడిని.ఆయన అక్కడకు తరచుగా వచ్చేవారు.

ఒకసారి మా అమ్మగారితో స్వామి దర్శనానికి వెళ్లాను.అప్పుడు మా అమ్మగారు స్వామిని ఒక ప్రశ్న అడిగారు.

'పెద్దవయసు కావడంతో కాళ్ళనొప్పుల వల్ల స్థిరంగా ఆసనంలో కూర్చుని ఎక్కువసేపు జపధ్యానాలు చెయ్యలేకపోతున్నాను.దీనికి మార్గం ఏదైనా చెప్పండి స్వామీ' అన్నారు.

దానికి స్వామి వెంటనే పతంజలి యోగసూత్రాలలో నుంచి ఉదహరిస్తూ-' అమ్మా."స్థిర సుఖమాసనం" అని యోగసూత్రాలలో మహర్షి చెప్పినారు. కనుక పద్మాసనమే కానవసరం లేదు.నీకు శ్రమలేకుండా సుఖంగా ఎక్కువ సేపు కూర్చోనగలిగే ఆసనం ఏదైనా మంచిదే తల్లీ.మనస్సు ఏకాగ్రం కావడం ప్రధానం.'- అని సమాధానం ఇచ్చారు.

అప్పటికి నాకు 20 ఏళ్ళు.నేను అప్పటికే యోగసూత్రాలను అనేకసార్లు తిరగామరగా చదివి ఉండటంచేత వాటిలో చాలాభాగం నాకు కంఠతా వొచ్చు. మా గురువులు చెప్పినది కూడా అదే కావడంతో ఆయన చెప్పిన సమాధానం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.



శంకరానందగిరి స్వామి ప్రవచనాలను వినే అదృష్టం నాకు కొన్నిసార్లు కలిగింది.అనర్గళమైన ఆయన వాగ్ధాటికి ముగ్దులవని వారు అరుదు.ఆయన మాట్లాడటం మొదలుపెడితే మూడునాలుగు గంటలపాటు వేదాలనుంచీ, ఉపనిషత్తులనుంచీ,బ్రహ్మసూత్రాల నుంచీ,భగవద్గీత నుంచీ,యోగవాసిష్టం నుంచీ,యోగసూత్రాలనుంచీ,పురాణాల నుంచీ ఎన్నోశ్లోకాలను సందర్భానుసారంగా అప్పటికప్పుడు అనర్గళంగా ఉదాహరిస్తూ మధ్యమధ్యలో పిట్టకధలను చెబుతూ వేదాంతబోధ చేసేవారు.

ఆయన కన్నడప్రాంతంలో ఒక మంచి సంపన్నకుటుంబంలో జన్మించారు. చిన్నవయసులోనే వైరాగ్యసంపన్నుడై సన్యాసం స్వీకరించి తపస్సులో కాలం గడిపారు.దశనామీ సాంప్రదాయంలో వీరిది 'గిరి' సాంప్రదాయం.తెలుగు, కన్నడ,ఇంగ్లీషు,హిందీ,సంస్కృత భాషలలో ఆయన అనర్గళంగా మాట్లాడగలిగేవారు.సరస్వతీదేవి ఆయన నోటిలో నివాసం ఉన్నదా అనిపించేది.ఆయన ప్రవచనాలను వినినవారు నిజంగా అదృష్టవంతులే.అంత అద్భుతంగా spell binding గా ఉండేవి ఆయన ఉపన్యాసాలు.అప్పటికీ ఇప్పటికీ నేను ఎందఱో ఉపన్యాసకులను విన్నాను. కాని ఆయనతో సాటిరాగల అద్భుతవక్తలు నాకు ఇప్పటివరకూ కనిపించ లేదు.

ఆయనది ఉత్తపాండిత్యం అనుకుంటే పొరపాటు పడినట్లే.పాండిత్యానికి తోడు ఆయన గొప్పతపస్వి.ఆయనలో పాండిత్యమూ తపస్సూ కలసిమెలసి ఉండేవి.ఆయన మహాజ్ఞాని అని ఆయనను చూస్తేనే అర్ధం అవుతుంది. ఒకనిలో పాండిత్యమూ తపస్సూ కలగలసి ఉంటే అది బంగారానికి సువాసన అబ్బినట్లు అవుతుంది అని శారదామాత అనేవారు.శంకరానందస్వామి అట్టి మహనీయుడు.

అప్పట్లో శంకరానందస్వామీ,గండిక్షేత్రం రామక్రిష్ణానందస్వామీ కలసి ఇచ్చిన గీతోపన్యాసాలు ఆంద్రదేశాన్ని ఉర్రూతలూగించాయి.ఇద్దరు మహా పండితులూ మహావక్తలూ,మహాజ్ఞానులూ కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో వాటిని విన్నవారికే ఎరుక.అదృష్టం అంటే వారిదే.వారితో పోలిస్తే నేటి టీవీ ఉపన్యాసకులు చెల్లని రూపాయిలూ పంటికింద రాళ్ళూ అనే చెప్పాలి.



అప్పట్లో ఎన్టీ రామారావు తీసిన 'పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి' సినిమా రిలీజైంది.గుంతకల్లు ప్రసాద్ టాకీస్ లో అది విడుదలైంది.నేను ఆ సినిమా చూడటానికి పోయినరోజే స్వామి కూడా సినిమా చూడటానికి వచ్చారు. హాలు యజమానులు స్వామి శిష్యులు కావడంతో ఆయన్ను ప్రత్యేకంగా బాక్స్ లో కూచోబెట్టి సినిమా చూపించారు.సామాన్యంగా సాంప్రదాయ స్వాములు సినిమాలకు రారు.కొందరేమో 'నేను స్వామీజీని అయ్యుండి సినిమాకి పోవడం ఏమిటి?'అని నామోషీగా అనుకుంటారు.కాని స్వామి అలాంటి భేషజాలు ఏమీ లేకుండా ఒక చిన్నపిల్లవానిలాగా  హాలుకు వచ్చి మరీ ఆ సినిమాను చూచారు.ఆయన మామూలు జ్ఞాని కాదనీ జ్ఞాని స్థాయిని దాటిన విజ్ఞాని అనీ నాకు ఆరోజే అర్ధమైంది.



గంజిగుంటలో స్వామి గురువులైన సదానందయోగీంద్రుల ఆరాధన జరుగుతుంది.1988లో జరిగిన ఆరాధనకు మేము అక్కడున్నాము.ఆరోజున తన గురువుగారి పాదుకలను తలమీద పెట్టుకుని ఎంత భక్తిగా స్వామి మేడమీద తన గదినుంచి కిందకు దిగివచ్చారో ఆ దృశ్యం నాకింకా ఇప్పటికీ కళ్ళముందు మెదులుతుంది.తాను స్వయంగా ఒక జ్ఞాని అయి ఉండీ తన గురువును ఎంతగా గౌరవించేవారో? ఆ దృశ్యం నిజంగా అద్భుతం.



గుంతకల్లులో ఒకసారి బహిరంగసభ జరిగింది.ఎందఱో స్వాములు మహనీయులు ఆసభకు వచ్చినారు.ఎన్నో గొప్ప వేదాన్తోపన్యాసాలు ఇవ్వబడ్డాయి.ఇంతలో ఎక్కడనుంచి వచ్చినదో సభామధ్యంలోకి ఒక ఊరకుక్క ప్రవేశించింది.అందరూ దానిని తరిమి కొడుతున్నారు.అప్పటివరకూ అంతా బ్రహ్మమే అంటూ ఉపన్యాసాలు వినిన భక్తులు అవన్నీ మరచి కుక్కను 'ఛీఛీ' అని అదిలిస్తున్నారు.

శంకరానందస్వామి వేదికపైనుంచి దానిని గమనించి మైకు తీసుకున్నారు. కుక్కవైపు చూస్తూ చేతులు జోడించి 'స్వామీ! మీ దారిన మీరు పోతుంటే వారికి తెలియక మిమ్మల్ని అదిలిస్తున్నారు.వారి అజ్ఞానాన్ని మన్నించి మీదారిన మీరు సుఖంగా వెళ్ళండి' అని మైకులో చెప్పారు.సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది.అందరూ తొలగి దారి ఇచ్చారు.ఆ కుక్క తన దారిన తాను బయటకి వెళ్ళిపోయింది.ఈ సంఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.

వేదాంతాన్ని చెప్పడమే కాదు ఆచరించి చూపించిన మహాజ్ఞాని శంకరానందగిరిస్వామి.ఆయన గురువు సదానందయోగీంద్రులు.ఆయన గురువు ప్రణవానందస్వామి.



వీరి సాంప్రదాయంలో నాకు నచ్చిన ఇంకొక ముఖ్యవిషయం.వీరి ఆశ్రమాలలోని ఆలయాలలో దేవాలయద్వారానికి పైగా ఇరువైపులా శ్రీరామకృష్ణ వివేకానందుల చిత్రాలు తప్పకుండా ఉంటాయి.స్వామి తన ఉపన్యాసాలలో వీరిని గురించి చెప్పకుండా ఉండరు.వివేకానందులనూ రామకృష్ణులనూ చెప్పకుండా వారి ఉపన్యాసం ముగియదు.



అటువంటి మహనీయులను స్మరిస్తే చాలు.మన పాపాలు పటాపంచలై పోతాయి.మన మనస్సులు పవిత్రమైన భావాలతో నిండిపోతాయి.మనకు కూడా బ్రహ్మావలోకన ధిషణ కలుగుతుంది.

ఈ మధ్య నేను బుక్కాపురం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంటుంది.కాపలాగా ఒక్క మనిషి(అతను కూడా భక్తుడే అయి ఉంటాడు) తప్ప అక్కడ సామాన్యంగా ఎవరూ ఉండరు.నిరాడంబరంగా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉండే నిజమైన ఆశ్రమం అది.ధ్యానానికి చాలా అనువైన ప్రశాంతమైన ప్రదేశం.
read more " సద్గురు ప్రణవానంద ఆశ్రమం "