“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, జనవరి 2012, సోమవారం

వీరవిద్యలు- వింతవాస్తవాలు

కుజప్రభావానికి మనమూ అతీతులము కాము కదా. కనుక కుజ కారకత్వాలలో ఒకటైన మార్షల్ ఆర్ట్స్ గురించి కొంత మాట్లాడుకుందాం.


మార్షల్ ఆర్ట్స్ ప్రపంచం కూడా మాయకు అతీతం ఏమీ కాదు. అందులో కూడా బోలెడంత మోసం ఉంది. కుళ్ళూ కపటమూ ఉన్నాయి. అదొక బిజినెస్. వందల సంవత్సరాల నాటి  మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో విలువలుండేవి. ఇప్పటి స్కూల్స్ లో అవి పోయి రాజకీయాలు పెరిగాయి. డబ్బులిస్తే బ్లాక్ బెల్ట్ లు పడేసే మాస్టర్లు బోలెడు మంది ఉన్నారు. అసలైన ఆర్ట్ ని నేర్పకుండా టోర్నమెంట్లు పెట్టుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్న మాస్టర్లు బోలెడు మంది ఉన్నారు. కొన్నాళ్ళు ఒక సంస్థలో నేర్చుకుని వేరు కుంపటి పెట్టుకున్న వాళ్ళు ఎందఱో ఉన్నారు. నేను  చెప్తున్నది ఒక ఇరవై అయిదేళ్ళ క్రిందటి మాట. ఆనాటి మాస్టర్లు చాలామంది స్కూల్స్ మూసేసి ఈనాడు ఇతర వ్యాపారాలలో స్తిరపడ్డారు. చాలామంది అమెరికాకు వెళ్ళిపోయి సాఫ్ట్ వేర్ రంగంలో స్తిరపడ్డారు. నాకు తెలిసిన హైదరాబాద్ మాస్టర్లు కొందరు   ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు.


బ్రూస్లీ పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా వీరవిద్యలకు ఒకప్పుడు డిమాండ్ వెల్లువెత్తింది. కాని జనాలకు తెలియక కరాటే నేర్చుకోవడం మొదలు పెట్టారు. బ్రూస్లీ అభ్యాసం చేసింది కరాటే కాదు. అతను కుంగ్ఫూ నేర్చుకున్నాడు. తర్వాత చాలా దేశాల వీరవిద్యలనుంచి చాలా టెక్నిక్స్ కలగలిపి ఒక సాంబార్ వండాడు. దానిపేరు 'జీత్ కునే డో'. ఇదంతా జనాలకు తెలియక 1970 -80  దశకాల్లో  'కరాటే' విద్య వైపు పిచ్చిగా మళ్ళారు. అప్పట్లో మన దేశంలో కుంగ్ఫూ నేర్పేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. చాలామందికి కరాటే కుంగ్ఫూ విద్యల మధ్య తేడా తెలీదు. రెండూ ఒకటే అనుకునేవాళ్లు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.


కరాటేని దాదాపు పదేళ్ళు అభ్యాసం చేసిన తర్వాత  అదంటే నాకు మొహం మొత్తి ఇతర విద్యల వైపు మళ్ళడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది - టోర్నమెంట్ కరాటే అసలు కరాటేనే కాదు. అదొక చెత్త. పాయింట్ సిస్టం పెట్టి శుద్ధమైన కరాటేని ఖూనీ చేశారు. కరాటే టోర్నమెంట్లలో  జరిగే రాజకీయాలు అన్నీఇన్నీకావు.అందులో కులమూమతమూ జోరబడ్డాయి. ప్రాంతీయాభిమానాలూ భాషాభిమానాలూ ఉన్నాయి. ఇక టోర్నమెంట్డలో డబ్బు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రేపు టోర్నమెంట్ అనగా రాత్రికి మాస్టార్ని బారుకు తీసుకుపోయి పార్టీ ఇచ్చి మందు పోయించి మర్నాడు పోటీలో మార్కులు కొట్టేసి పతకాలు సంపాదించిన ఘనులు నాకు తెలుసు. తాగి పడిపోయి టోర్నమెంట్ కి ఆలస్యంగా ఉబ్బరించిన మొహంతో వచ్చిన మాస్టర్లూ నాకు తెలుసు.


ఈ కుళ్ళుని అలా ఉంచితే, అసలు కరాటే సిలబస్ కూ, నేర్చుకున్న విద్యకూ, టోర్నమెంట్ లో జరిగే 'డాన్స్' కూ పోలికే ఉండదు. ఏళ్లకేళ్ళు కష్టపడి నేర్చుకున్న "కటాస్" టోర్నమెంట్లో ఎందుకూ పనికిరావు. కటాలలో నేర్చుకున్న ఏ ఒక్క టేక్నిక్కూ టోర్నమెంట్లో ఉపయోగపడదు. ఉపయోగపడని టెక్నిక్స్ అలా ఏళ్లతరబడి ఎందుకు నేర్చుకోవాలో ఏ ఒక్క మాస్టారూ చెప్పడు.చెప్పటానికి వాడికే తెలిసిచావదు. క్లాస్ లోనేమో గంటలుగంటలు చెమటోడ్చి ఒళ్ళొంచి కటాస్ నేర్చుకుంటారు.టోర్నమెంట్లో కొచ్చేసరికి కోతిలా ఎగురుతూ చెత్తచెత్త మూమెంట్స్ తో ఏవో మార్కులు కొట్టేయ్యాలని చూస్తారు. ఇది చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది. టోర్నమెంట్ కరాటేకూ నిజమైన కరాటేకూ పోలికే లేదు.


నిజమైన కరాటే ప్రాణాపాయ పరిస్తితుల్లోంచి పుట్టింది. ప్రాచీన జపాన్లో అది నేర్చుకోకపోతే సైనికుల చేతుల్లోనో బందిపోట్ల చేతుల్లోనో వాడికి చావు మూడినట్లే. కనుక చాలా సీరియస్ గా ఆ విద్యని నేర్చుకునేవారు.ఆనాటి అభ్యాస విధానాలు కూడా వేరు. ఈనాటి కరాటేని చూస్తె ప్రాచీన యోధులు 'ఇదొక వీరవిద్యా?' అంటూ నవ్వుతారు. అంత చెత్తగా తయారైంది నేటి కరాటే. టోర్నమెంట్ కరాటే అనేది కోతిగంతులు తప్ప ఇంకేమీ కాదు. టోర్నమెంట్లో మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళు స్ట్రీట్ ఫైట్ లో మామూలు మనుషులచేతిలో బాగా దెబ్బలు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. టోర్నమెంట్ కరాటే నిజజీవితంలో పనికిరాదు. ఈ విషయం అర్ధమైన తర్వాత నిజజీవితంలో స్ట్రీట్ ఫైట్ లో పనికొచ్చే కరాటే (లేదా ఇతర వీరవిద్యల) టెక్నిక్స్ మీద నా దృష్టి పెట్టడం సాగించాను. ఇదంతా 1980 -90 మధ్యలో జరిగింది. ఆ రోజుల్లో రోజుకు మూడు నాలుగుగంటల ప్రాక్టీస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి.


తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో నాకు నచ్చని ఇంకొక అంశం -- నాది 'ఫలానా స్టైల్' అని గిరిగీసుకోవడం.ఇది నాకస్సలు నచ్చేదికాదు. అందుకే అన్ని మార్షల్ ఆర్ట్స్ నుంచీ ఎన్నో టెక్నిక్స్ నేను అభ్యాసం చేసేవాణ్ణి.నా శిష్యులకు కూడా నేర్పించేవాణ్ని.నా శిష్యులలో మంచి ఫైటర్స్ చాలామంది ఉన్నారు. కాని ప్రాణవిద్యాస్థాయికి ఎదిగిన వాళ్ళు ఒక్కరూ లేరు.ఈ విషయంలో బ్రూస్లీని మెచ్చుకోవాలి. 'గిరి గీసుకుని కూచుంటే ఆ గిరి బయట ఉన్న విజ్ఞానం మనకు దూరం అయినట్లే' అని అతను భావించేవాడు. అందులో చాలా వాస్తవం ఉంది. ఒక రకంగా నేడు అమెరికాలో బహుళ ప్రచారంలో ఉన్న 'మిక్సేడ్ మార్షల్ ఆర్ట్స్ స్టైల్' (M.M.A)కు ఇతనే ఆద్యుడని చెప్పవచ్చు.


నేను నేర్చుకునే రోజుల్లో చాలామంది కొట్లాటకు పనికొచ్చే నాలుగు టెక్నిక్స్, నాలుగు కటాస్ నేర్చుకుని 'నాకు కరాటే వచ్చేసింది' అనుకునేవారు. నాకేమో అంతటితో సంతృప్తి ఉండేది కాదు. దీనిలో ఇంకా ఏదో లోతు ఉంది అని నా మనసుచెప్పేది. ప్రాణవిద్యా రహస్యాలు, మర్మవిద్యా రహస్యాలు ఎవరూ స్కూళ్ళలో చెప్పరేమిటి? అవన్నీ ఏమి పోయాయి?అని నాకు అనిపించేది. అసలైన రహస్యవిద్య ఇది కాదు, ఇంకేదో ఉంది అని నాకు లోలోపల అనిపించేది. అదొకటి ఉందని నాకు ఎవరో లోపల్నించి చెప్తున్నట్టు ఉండేది.


తర్వాత ఆ ఫీల్డ్ లో ఎంతో రీసెర్చి చేసిన అనంతరం మర్మవిద్యా రహస్యాలు నాకు అవగతమయ్యాయి. నేడు 4th degree, 5th degree black belts అని చెప్పుకునే వారికి కూడా ప్రాణవిద్యా  రహస్యాలు తెలీవని నేను గట్టిగా చెప్పగలను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్నవారికి కూడా మర్మవిద్యలో ఓనమాలు తెలియవు. అవి ఏ స్కూల్స్ లోనూ నేర్పరు. నేర్పడానికి అసలు వాళ్ళకే అవి తెలియవు. ఒక్క కేరళలోని 'కలరిపయట్' విద్యలో మాత్రం ఇంకా ఆ రహస్యాలు మిగిలి ఉన్నాయి. కాని వాటిని నేర్పే మాస్టర్లు అక్కడా అంతరిస్తున్నారు. వాటిని ఎవరికి పడితే వారికి చచ్చినా నేర్పరు. శిష్యుడిపైన ఎంతో నమ్మకం కుదిరితే కాని ఆ రహస్యాలు చెప్పరు. మర్మవిద్యతో పోలిస్తే నేటి కరాటే పరమచెత్తవిద్య అని నేను అనుభవ పూర్వకంగా చెప్పగలను. కాని అది నేర్చుకోవాలంటే ఒక ప్రాచీనకాలపు గురుకులంలో చేరి గురువుకు సేవచేస్త్తూ నిష్టగా విద్య నేర్చుకునే శిష్యుడికి ఉండే లక్షణాలు ఉండాలి.ఒక యోగవిద్యా సాధకుడికి ఏఏ నైతిక విలువలూ లక్షణాలూ ఉండాలో మర్మవిద్యా సాధకుడికి కూడా అవే ఉండాలి.ఆ స్థాయిలో విలువలు పాటిస్తూ అసలైన విద్యను నేర్చుకునే శిష్యులే ప్రస్తుతం లేరు. ఇదొక విచిత్ర సంకటంలా ఉంది. అర్హత ఉన్నవాడికే ఈ విద్యను నిస్వార్ధంగా నేర్పించాలి. ఆ అర్హత ఉన్నవాడు మాత్రం ఎక్కడా దొరకడు. చాలా విద్యలు ఇలాగే నశించి పోయాయని నాకు చాలాసార్లు అనిపిస్తుంది.


కేరళలో మర్మవిద్యా గురువులు ఎందఱో తమ రహస్యాలను ఎవరికీ చెప్పకుండా అలాగే వెళ్లిపోయారు. కొందరైతే తమ తాటాకు పుస్తకాలను కాల్చేసి మరీ చనిపోయారు. ఇదేంటి అని అడిగిన కొందరికి 'అర్హత ఉన్నవాడికి వాడి తపనే అంతా నేర్పిస్తుంది' అని మాత్రం చెప్పారుట. ఈ విషయం కేరళలో ఒక 'కలరి' లో విన్నాను.


నిజమైన తపన ఉన్నవాడికి, అది ఏవిద్య అయినా కావచ్చు, అందులో సంతృప్తి మాత్రం ఉండదు. ఉండకూడదు. అప్పుడే వానికి నిరంతర పురోగతి కొనసాగుతూ ఉంటుంది. ఒక విద్యను నేర్చుకోవాలంటే దానికోసం తపించాలి. గురువులకోసం వెదకాలి. సమయమూ ధనమూ వెచ్చించాలి. అదొక జీవితాశయంగా మారినప్పుడే ఇదంతా సాధ్యమౌతుంది. గ్రాండ్ మాస్టర్ ఒయామా అలాంటి తపనతోనే 'క్యోకుశింకై కరాటే'ను మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు అదీ ఒక నిర్బంధచట్రంలా తయారైంది. ఆ నిర్బంధం నచ్చని కొందరు దాన్నుంచి బయటకొచ్చి 'అషిహర కరాటే' మొదలు పెట్టారు. కొన్నాళ్ళకు అదీ నచ్చని ఇంకొందరు మళ్ళీ విడిపోయి 'ఎన్షిన్ కరాటే' మొదలు పెట్టారు.  ఇంతా చేస్తే మొదటి దాంట్లో మొద్దు బలానికీ లీనియర్ మూమెంట్స్ కీ ప్రాధాన్యత ఉంటె, రెండవ మూడవ స్టైల్స్ లో స్పీడ్ కీ సర్కులర్ మూమెంట్స్ కీ ప్రాధాన్యత  ఉంటుంది. ఇంతే తేడా. 'సబాకి' అనే టెక్నిక్ తోనే రెంటి మధ్యా తేడా వస్తుంది. ఈ 'సబాకి' అనే టెక్నిక్, కుంగ్ఫూ విద్యలోని 'వాటర్ ప్రిన్సిపుల్' నుంచి పుట్టింది. వైట్ క్రేన్,ప్రేయింగ్ మాంటిస్, వింగ్ చున్ మొదలైన కుంగ్ఫూ స్టైల్స్ లో ఇదే ప్రధానసూత్రం. ఇది సాప్ట్ స్టైల్స్ లో వాడేటటువంటి విధానం. హార్డ్ స్టైల్స్ కు ఇది తెలీదు.మరి రెండూ ఒకదానిలోనే ఎందుకు ఇమడలేవు?  లీనియర్ మూమెంట్స్, సర్కులర్ మూమెంట్స్, హార్డ్ టెక్నిక్స్, సాఫ్ట్ టెక్నిక్స్ ఒకే స్కూల్లో ఎందుకు కలిసిమెలిసి ఉండలేవు? అనేది నా ప్రశ్న. ఈ ప్రశ్నే నన్ను మార్షల్ ఆర్ట్స్ లో రీసెర్చికి పురికొల్పింది.


పందెపు ఎద్దులను కూడా ఒకే గుద్దుతో మట్టి కరిపించిన గ్రాండ్ మాస్టర్ 'ఒయామా'చివరికి హాంకాంగ్ లో ఒక బలహీనంగా కనిపిస్తున్న ముసలివాడి చేతిలో ఓడిపోయాడని చెప్తారు.ఆ ముసలివాడు 'తాయ్ చీ' విద్యలో అఖండుడు. అతని గురించి ఒయామా ఎంతో విన్నాడనీ, కాని అతనితో ఫైట్ చెయ్యాలని హాంగ్ కాంగ్ వెళ్ళిన ఒయామా,సన్నగా ఒక పేషంట్లా ఉన్న అతన్ని చూచి, అసలితను ఒక మాస్టరేనా అన్న అనుమానంతో, గుద్దితే అతను చనిపోతాడేమో  అన్న భయంతో,  ఫైట్ చెయ్యకుండా వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నాడనీ అంటారు.


"ఇక్కడి దాకా వచ్చావుకదా, 'తాయ్ చీ' ఎలా ఉంటుందో కూడా చూడు" అన్న ముసలిమాస్టర్ ఆహ్వానంతో బరిలోకి దిగిన ఒయామా కొద్ది నిముషాలలోనే, అతన్ని ఓడించడం అసాధ్యం అన్నసంగతి గ్రహించాడు.ఒయామా ప్రయోగించిన పంచెస్ కిక్స్ అన్నింటినీ ముసలిమాస్టర్ అతి సులభంగా న్యూట్రలైజ్ చెయ్యగలిగాడు. ప్రత్యేకమైన 'చెన్ స్టైల్ తాయ్ చీ' టెక్నిక్స్ ఉపయోగిస్తున్న ఆ ముసలి మాస్టర్ను ఒయమా గుద్దులు అసలు తాకలేకపోయాయి. చాలాసేపు ఫైట్ చేసిన అనంతరం 'ఒయామా' ఆయాసంతో కూలబడ్డాడు. కాని ముసలి మాస్టర్ మాత్రం నవ్వుతూ మామూలుగా ఉన్నాడు. 'ఈ రహస్యం ఏమిటి?' అని అడిగిన ఒయామాకు ' నీది మామూలు కండబలం.నాది ప్రాణశక్తి. అందుకే నువ్వు అలిసిపోతున్నావు. నాకు అలుపు లేదు.నీవి లీనియర్ మూమెంట్స్. నావి సర్కులర్ మూమెంట్స్.నీ శక్తిని నీవు ఉపయోగిస్తున్నావు.నేనేమో నీశక్తిని తిప్పి నీమీదే ప్రయోగిస్తున్నాను.నీ శక్తి ఖర్చై పోతున్నది. నా శక్తిలో మార్పు లేదు. అదీ మనిద్దరికీ తేడా.' అని 'తాయ్ చీ' మాస్టర్ జవాబిచ్చాడు. ఈ సంఘటన జరిగిన తరువాతే క్యోకుశిన్ కరాటేలో సర్కులర్ మూమెంట్స్ కి ప్రాధాన్యత పెరిగింది అని ఒక వాదన ఉన్నది. పాయింట్ అండ్ సర్కిల్ మెథడ్ మీదే క్యోకుశిన్ కరాటే ఆధారపడి ఉంటుంది.


కండబలం మీద ఆధారపడే మొద్దువిద్యలకూ, ప్రాణశక్తి మీద ఆధారపడే వీరవిద్యలకూ చాలా తేడా ఉంటుంది. అది విశ్వామిత్రుడికీ వశిష్టుడికీ  మధ్య ఉన్న తేడా లాంటిది. కండబలం త్వరగా వస్తుంది. త్వరగా పోతుంది. ప్రాణశక్తి త్వరగా రాదు. ఒకసారి పట్టుపడితే ఎన్నటికీ పోదు. కండబలానికి పరిమితులు ఉంటాయి.ప్రాణశక్తికి లిమిట్స్ లేవు. కండబలం తిండినుంచి,వ్యాయామంనుంచీ  వస్తుంది. ప్రాణశక్తి ప్రకృతిలో అమితంగా ఉంది. దాన్ని శరీరంలోనికి స్వీకరించే రహస్యం తెలిస్తే దానికి అంతంటూ ఉండదు. అదేన్నటికీ నశించదు కూడా.


కరాటే స్కూల్స్ మధ్యకూడా హార్డ్ సాఫ్ట్ అంటూ తేడాలు పెట్టుకుని గిరిగీసుకుని శత్రుత్వాలు పెంచుకుంటూ ఉంటారు.ఉదాహరణకి శోటోకాన్  కరాటే అనేది హార్డ్ స్టయిల్. గోజుర్యు కరాటే అనేది సాఫ్ట్ స్టయిల్. ఇలా గిరి గీసుకోవడం వల్లే ఒక స్కూల్ కీ, ఇంకొక స్కూల్ కీ  మధ్య గొడవలు విభేదాలు పెరిగిపోయాయి. అజ్ఞానంతోనే ఇలాంటి గిరి గీసుకోవడం జరుగుతుంది. ఇది మంచిది కాదని నా ఉద్దేశం.


ఏ హార్డ్ స్టైల్ అయినా సాప్ట్ స్టైల్ లో ఉన్న రహస్యాలు కూడా అవగతం చేసుకున్నప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుంది. ఎందుకంటే సాప్ట్ స్టైల్ అనేది ప్రాణవిద్య మీద ఆధారపడి ఉంటుంది.  మొద్దుబలం పనికి రాదు అన్న విషయం మనిషికి నిదానంగా తెలుస్తుంది. సాప్ట్ స్టైల్స్ అంత  త్వరగా పట్టు చిక్కవు.మామూలు కరాటేను నేర్చుకోవడానికి ఒక అయిదేళ్ళు సరిపోతే, సాఫ్ట్ స్టైల్ కరాటే నేర్చుకోవడానికి పన్నెండేళ్ళు పడుతుంది. అసలైన 'తాయ్ చీ' విద్యను ఫైట్లో సమర్ధవంతంగా వాడాలంటే వెయ్యిమందిలో ఒక్కరే ఆ పని చెయ్యగలరు.కారణం,వారికి ప్రాణశక్తి యొక్క రహస్య విజ్ఞానం అనుభవం లోకి రావాలి. అది అంత త్వరగా పట్టు చిక్కదు. దానికంటే జిమ్ కెళ్ళి కండలు పెంచడం అతి సులభం. ఆ కండలు మళ్ళీ కరిగిపోవడమూ అంతే త్వరగా జరిగిపోతుంది.


అందుకే నా అనుభవంతో నేను తయారు చేసుకున్న స్టయిల్ కి 'ఇంటెగ్రల్ మార్షల్ ఆర్ట్' అని పేరు పెట్టుకున్నాను. ఇదీ ఒక రకమైన మిక్సేడ్ మార్షల్ ఆర్టే అని చెప్పవచ్చు. యోగవిద్యా రహస్యాలు కలిసిన ఈవిద్య ఒక పరిపూర్ణ వీరవిద్య అని నేను భావిస్తాను. మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో ఉన్న కుళ్ళు నన్ను ఈరకంగా కాపాడింది అని, అసలైన వీరవిద్యకోసం వెదికేలా చేసింది అనీ, నాదైన ఒకవిద్యను నాకు చూపింది అనీ ఎప్పుడూ అనుకుంటాను. చెడునుంచి  కూడా మంచిని తీసుకోవచ్చు అంటే ఇదేనేమో?
read more " వీరవిద్యలు- వింతవాస్తవాలు "

28, జనవరి 2012, శనివారం

కుజుని వక్రత్వ ఫలితాలు మొదలు

జనవరి 23న కుజగ్రహం వక్రగతిలో ప్రవేశించింది. అప్పటినుంచి ఏప్రియల్ 13 వరకూ ఈ వక్రత్వం కొనసాగుతుంది. ఫిబ్రవరి 8 నుంచి శని కూడా వక్రస్తితిలో ప్రవేసిస్తున్నాడు.మార్చి 13 న కుజరాహువులు సరిగ్గా కేంద్రదృష్టిలోకి వస్తారు.ఇప్పటినుంచి ఏప్రియల్ వరకూ  మధ్యలో ఉన్నకాలం మంచిదిగా కనిపించడం లేదు.


కుజుడు వక్రించి నాలుగురోజులు కాకముందే యానాంలో కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసకాండ జరగడం ఒక ఎత్తు అయితే ప్రజలే దొంగలలాగా మారి సెరామిక్ ఫేక్టరీని ధ్వంసం చేసి అందినమేరకు వస్తువులు దోచుకెళ్ళడం ప్రజల అనైతికప్రవర్తనకు అద్దం పడుతోంది.ఎదుటిమనిషికి  నీతులు చెప్పడం దానికి పూర్తిగా విరుద్ధంగా తాము  ప్రవర్తించడం నేటి భారతదేశపు జనజీవన విధానంలాగా కనిపిస్తోంది. మన దేశంలోని పరమ అధ్వాన్నపు లా అండ్ ఆర్డర్ పరిస్తితికి కూడా ఇదొక మంచి ఉదాహరణ. ఈ దేశంలో నాయకులూ దొంగలే, ప్రజలూ దొంగలే. అందుకే దొందూదొందే లాగా ఒకరికొకరు బాగా సరిపోయారు. ఎవరికి తోచినట్లూ చేతైనట్లూ వారు ప్రతిదాన్నీ చక్కగా దోచుకుంటున్నారు.


ప్రాచీనకాలంలో రాజులూ ప్రజలూ కూడా నీతిగా జీవించేవారు. రాజు ధర్మాన్ని తప్పేవాడు కాదు. కనుక ప్రజలు కూడా "యధారాజా తధాప్రజా" అన్నట్లు నీతిగా బ్రతికేవారు. తరువాత తరువాత నాయకులు నీతికి తిలోదకాలిచ్చారు. ప్రజలను భయపెట్టటం సాగించారు. కాని కొంతలో కొంత ప్రజలు నీతిగానే ఉండేవారు. కానీ ప్రస్తుతం మాత్రం నాయకులూ ప్రజలూ అందరూ దొంగలయ్యారు. అవకాశం దొరకనంతవరకే ఎవరి నీతులైనా. అవకాశం దొరికితే మాత్రం ఎవ్వరూ దేనినీ వదలటం లేదు. అదీ ప్రస్తుత పరిస్తితి.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హింసకూ,విధ్వంసానికీ,యుద్దాలకూ కుజగ్రహంతో  సంబంధం ఉంది. మార్స్ అనే పేరు మీదనే యుద్ధవిద్యలకు మార్షల్ ఆర్ట్స్ అనే పేరు వచ్చింది. వీరుల జాతకాలలో కుజుని పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కుంగ్ఫూ వీరులు బ్రూస్లీ, జాకీ చాన్, జెట్లీల జాతకాలు  చూస్తే ఈ విషయం తేటతెల్లంగా కనిపిస్తుంది. అలాగే ప్రపంచయుద్ధాలు గమనిస్తే కూడా కుజుని పాత్ర కనిపిస్తుంది.


ఆ విషయం అలా ఉంచితే, మొన్న 23 తేదీన కుజుడు వక్ర స్తితిలో ప్రవేశించీ ప్రవేశించక మునుపే మళ్ళీ విధ్వంసకాండలు మొదలయ్యాయి.యానాంలో నిన్న జరిగిన విధ్వంసం చాలా దారుణమైనది.దానికి మనకు కనిపించే కారణాలు ఏమైనప్పటికీ,కుజవక్రత్వం యొక్క ప్రభావం మనుషులమీద ఈ విధంగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.ఇటువంటి సంఘటనలు రాబోయే మూడునెలలలో మరిన్ని జరుగవచ్చు అనడానికి ఇదొక సూచన మాత్రమే. ఈ ప్రభావంవల్ల హటాత్తుగా మనుషుల మూడ్స్ రెచ్చగొట్టబడే సంఘటనలు జరుగుతాయి. తద్వారా విధ్వంసం తలెత్తుతుంది.రాబోయే మూడునెలలలో ఏఏ తేదీలు ఎక్కువ ప్రమాదకారులో చూద్దాం.


ఫిబ్రవరి 7 న పౌర్ణమి వస్తున్నది. ఆరోజున వక్రకుజ చంద్ర రాహువులు నవాంశలో ధనుస్సులో ఉన్నారు. మిథునంలో కేతుగురువులున్నారు. కనుక ఆ తేదీకి అటూ ఇటూగా గొడవలు హింసా జరగవచ్చు. అవి మతపరమైనవి కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మర్నాటినుంచీ శని వక్రస్తితి మొదలు కాబోతున్నది. కనుక ఆ సమయంలో భూకంపాలు గానీ, వాయుయాన ప్రమాదాలు గానీ జరుగవచ్చు. ఫిబ్రవరి 21 అమావాస్య అయ్యింది.ఆరోజున నవాంశ చక్రంలో వక్రశని,వక్రకుజుడూ,రాహువూవృశ్చికంలో గుమిగూడారు.ఇది కుట్రలకూ విధ్వంసరచనకూ సూచిక. ఈ తేదీకి అటూఇటూగా కూడా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గొడవలు,విధ్వంసాలు జరిగే అవకాశాలున్నాయి. మార్చి 7,8 తేదీలలో వస్తున్న పౌర్ణిమ నాటి గ్రహస్తితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఆరోజున చంద్రుడు వక్రకుజునితో డిగ్రీయుతిలో ఉన్నాడు. బుధుడు నీచస్తితిలో ఉన్నాడు.రాహుకుజులమధ్యన ఖచ్చితదృష్టి ఉన్నది. నవాంశలో శని చంద్రులూ రాహువూ మళ్ళీ వృశ్చికంలో కలిశారు.రవి,కేతుగ్రస్తుడయ్యాడు.ఇదికూడా ప్రమాదసూచక సమయమే. ఈసమయంలో కళాకారులకూ, మేధావులకూ,ఉన్నతవర్గాలవారికీ ప్రమాదం పొంచి ఉన్నది.మార్చి 22  న వచ్చే అమావాస్యనాడు వక్ర బుదుడూ రవీ డిగ్రీ కన్జంక్షన్లో ఉన్నారు.నవాంశలో శని కుజులు వృశ్చికంలో ఉన్నారు. కనుక ఇదీ మంచిది కాదు.


ఈ మూడునెలలలో కుజుడు తాను ప్రస్తుతం ఉన్న ఉత్తరా నక్షత్రం నుంచి వెనక్కు వెళుతూ పూర్వఫల్గుణి, మఖా నక్షత్రాలలో సంచారం చేస్తాడు. ఉత్తరానక్షత్రం అధిపతి రవి కనుకనూ అగ్నితత్వరాశి అయిన సింహంలో ఉండటం వల్లనూ ప్రస్తుత ప్రమాదాలన్నీ అగ్నితత్వ ప్రధానంగా ( ఆస్తులు తగలబెట్టడం, పేలుళ్లు, దాడులు వగైరాలుగా)  ఉంటాయి. ప్రస్తుతం కుజుడు రాశి నవాంశలలో  తూర్పును సూచించే సింహ,ధనూ రాశులలో ఉండటం వల్ల తూర్పున ఉన్న యానాంలో ఈ విధ్వంసం జరిగింది.


కుజుడు పుబ్బానక్షత్రసంచారంలో ఉండే సమయంలో సినిమావారికి,కళాకారులకు,విలాసజీవితాలు గడిపే ఉన్నతవర్గాలవారికి ప్రమాదాలున్నాయి.మఖానక్షత్ర సంచారంలో హటాత్ ప్రమాదాలు, వాహనప్రమాదాలు, పేలుళ్లు, జలప్రమాదాలు వగైరాలు జరుగవచ్చు.ఆయా సమయాలలో కుజుని నక్షత్రపాదాల స్తితిమీదా, రాశి నవాంశలలో ఉన్న స్తితిమీదా,కుజునిపైన ఇతర గ్రహస్తితుల పైనా జరుగబోయే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.


మొత్తంమీద ఈమూడునెలలూ కుజప్రభావంవల్ల జనజీవనంలో విధ్వంసం తప్పదు అని జ్యోతిష్యపరమైన సూచన ఉన్నది.కుజుని వక్రస్తితి మొదలైనప్పటినుంచీ అక్కడక్కడా భూకంపాలు(మన ఆంధ్రాలోకూడా)కనిపిస్తూ ఉండటం గమనార్హం.ఈమూడునెలలూ ముఖ్యంగా పైతేదీలలో వాహనాలు స్పీడుగా నడపకుండా ఉండటం,దూకుడు తగ్గించుకోవడం,గొడవలకు దూరంగా ఉండటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం  జనులకు చాలా మంచిది. లేకుంటే చెడుఫలితాలు తప్పవనే చెప్పాలి.
read more " కుజుని వక్రత్వ ఫలితాలు మొదలు "

24, జనవరి 2012, మంగళవారం

మాయల మరాటీలు

"ఫలానా సామీజీ దర్శనం చేసుకుందాం వస్తారా ?" అడిగాడు మిత్రుడు. మిత్రుడి పేరును సంక్షిప్తంగా "కోపా" అని పిలుద్దాం.కోపా ఊళ్ళో అడుగుపెడితే నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు.ఎక్కడో ఒకచోట కలుసుకుని కొన్ని గంటలపాటు రకరకాల విషయాలమీద మాట్లాడుకోవడం జరుగుతుంది.ఎక్కువగా ఆధ్యాత్మికతే మా మాటల్లో దొర్లుతుంది.


"ఆయనంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు" చెప్పాను.


నా చిన్నతనంనుంచీ నిజమైన స్వాములను చూచి వారితో తిరిగి ఉండటంవల్ల, కొద్దిసేపు చూస్తె చాలు ఎవరు నిజమైన సాధువో ఎవరుకాదో నేను వెంటనే చెప్పగలను. కొద్దిసేపు వారి మాటలు వింటే చాలు, వారి ఆధ్యాత్మికస్థాయి ఎంతలో ఉందో కూడా నాకు తెలిసిపోతుంది అని వినమ్రంగా చెప్పగలను. ఇది గర్వంతో చెప్పేమాట కాదు.


చిన్నతనంనుంచీ స్వీట్ల మధ్య పెరిగినవాడు ఏ స్వీట్ ఎలాంటిదో చూచి టక్కున చెప్పగలడు. ఇదే సూత్రం బిజినెస్ కి కూడా వర్తిస్తుంది. చిన్నతనం నుంచీ ఒక బిజినెస్ రంగంలో తిరిగినవారు దానికి సంబంధించిన కిటుకులు టక్కున పట్టుకోగలరు.ఆరంగంలో ప్రవేశం లేనివారు ఆపని అంత సులువుగా చెయ్యలేరు.ఇదీ అలాటిదే.ఏరంగంలోనైనా అనుభవం ఉన్నవారికి దానివిషయం టక్కున తెలిసిపోతుంది.ఇది అనుభవంతో వచ్చే నైపుణ్యం.అంతేకాని ఇదేదో అతీతశక్తి అనుకోకూడదు.


చాలా ఆశ్రమాలలో జరిగే తంతులు నాకు అస్సలు  నచ్చవు.ముఖ్యంగా రాజకీయులకూ మతగురువులకూ ఉండే అక్రమసంబంధాలు,డబ్బుకోసం నడిచే దొంగనాటకాలు నాకు కంపరం పుట్టిస్తాయి. అందుకని నాకు ఆషామాషీ స్వామీజీలు నచ్చరు. నిఖార్సైన వజ్రంలా ఉండేవారినే నేను ఇష్టపడతాను.అలాటివారు ప్రస్తుతం ఎక్కడాలేరు. కనుక ప్రస్తుతసమాజంలో చెలామణీలో ఉన్న ఏస్వామీజీ అయినా సరే నాకొక బఫూన్ లాగే కనిపిస్తాడు.


కర్మకాలి ఇంతకు ముందు ఒకటి రెండుసార్లు ఈ స్వామీజీ ఆశ్రమానికి నేను వెళ్లి ఉన్నాను.ఆ సమయానికే జరుగుతున్న కొన్ని వ్యవహారాలు నా కంట పడటమూ, ఇక దానితో మళ్ళీ ఆ చాయలకు నేను వెళ్ళకపోవడమూ  జరిగింది. అదే విషయం కోపాతో చెప్పాను. "అలాటివి పట్టించుకోకూడదు. ఆ స్వామీజీకి మంత్రశక్తులున్న మాట నిజమే" అని కోపా అన్నాడు. "ఉంటే ఉంచుకోమనండి నాకు వాటిమీద పెద్దగా ఆసక్తి లేదు" అంటూ, పోనీలే అడిగాడు కదా ఒకసారి వెళ్లిచూద్దాం అనిపించి, "సరే మీతో కలిసి వస్తాలే" అని చెప్పాను. "నాకేమీ సందేహాలు లేవు. స్వామీజీని మీరే ఏమైనా అడగండి." అన్నాడు కోపా. "నాదీ అదే పరిస్తితి. మీరు రమ్మన్నారు కదా అని మీతో వస్తున్నాను. లేకుంటే నేనా చాయలక్కూడా వెళ్ళను." చెప్పాను.


"సరే రామకృష్ణుడు గొప్పవాడా షిర్డీసాయి గొప్పవాడా? రామకృష్ణునికి గుళ్ళూ గోపురాలూ ఎందుకు లేవు? బాబాకి ఎక్కడ చూచినా ఎందుకు ఉన్నాయి? అని అడుగుతాను. మీరు గమ్మున ఊరుకోండి." అన్నాడు. 


"అలాగే. నేనేమీ మాట్లాడను. కనీసం నేను ఫలానా అని పరిచయం కూడా చేసుకోను.లోప్రొఫైల్లో ఉంటాను." అని ఒప్పుకున్నాను. కాకపోతే ఆరోజున ఆదివారమూ అమావాస్యా అయి కూచుంది. "కనుక ఆరోజు అక్కడ క్షుద్రహోమాలు చాలా జరుగుతాయేమో, అక్కడికి వెళ్లి వాటిని, వాళ్ళ ముఖాలను చూచే ఖర్మ మనకెందుకు. ఇంకో రోజు వెళ్లి చూద్దాంలే." అని అన్నాను. వాళ్ళ ఆశ్రమానికి కోపా వెళ్లి కనుక్కుంటే ఆరోజుకి ఒక నలభైమంది  పనికిమాలిన జనం అప్పటికే స్వామీజీ దర్శనార్ధం వచ్చి ఉన్నారనీ, ఆరోజు ఆయన దర్శనం కుదరకపోవచ్చుననీ తెలిసింది. పైగా అప్పుడే ఒక రాజకీయప్రముఖుని నుంచి కబురువస్తే ఈ స్వామీజీగారు పరిగెత్తుకుంటూ రాజకీయ అధికారి దర్శనార్ధం వెళ్ళాడని కోపా ఫోన్లో చెప్పాడు. నాకు బాగా నవ్వొచ్చింది. ఈ స్వామీజీలు ఇలాటిచోట్లే అడ్డంగా దొరికిపోతారు. రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే స్వామీజీ గోచీ ఊడుతున్నా చూసుకోకుండా పరిగెత్తిపోవడం ఏమిటో నా మట్టిబుర్రకు ఎంత తన్నుకున్నా అర్ధం కాలేదు.


"సర్వసంగపరిత్యాగికి రాజకీయాలతోనూ, నైతికంగా కుళ్ళిపోయిన నాయకులతోనూ పనేమిటి? స్వామి దర్శనార్ధం వారురావాలి గాని వారు పిలిస్తే వీరు పరిగెత్తిపోవడం ఏమిటి?" అడిగాను.


"అంటే, వారికీ వీరికీ ఏవో కొన్ని పనులుంటాయి కదా? వాటికోసం కొన్నికొన్ని చెయ్యక తప్పదు". అన్నాడు కోపా.


"అలాటప్పుడు "సర్వసంగపరిత్యాగి""పరమహంస పరివ్రాజకాచార్య" అంటూ వారికివారే తగిలించుకునే బిరుదుల  ప్రయోజనం ఏమిటి?వారు దేనిని పరిత్యజించినట్లు? ఒకసారి ఇందిరాగాంధీ తన దర్శనార్ధం వస్తే కంచిపరమాచార్య ఆమెకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దానికి కారణం ఆమె ఎమర్జెన్సీ విధించడమూ, ఆ సమయంలో జరిగిన అకృత్యాలూనూ. ఆయన ఉన్న పూరిగుడిసెలోకి తడికెతలుపు తోసుకుని ఆమె వెళ్ళలేక కొన్నిగంటలు బైటే వేచిచూచి చివరికి తన సెక్యూరిటీతో సహా వెనక్కు వెళ్ళిపోయింది. అదీ స్వచ్చమైన తపశ్శక్తి  అంటే. అంతేగాని రాజకీయనాయకులు పిలవగానే వీరు పరిగెత్తి పోవడం కాదు."అన్నాను.


"మీకు నేను చెప్పలేనుగాని, రేపు స్వామీజీ ఖాళీగా ఉంటే మనం వెళదామా?" అడిగాడు.


"అలాగే. ఆశ్రమం వద్దకు మీరు వెళ్లి ఆయన ఖాళీగా ఉంటే నాకు ఫోన్ చెయ్యండి. నేను వస్తాను." అని చెప్పాను.


సాయంత్రం ఆరు తర్వాత ఫోన్ మోగింది. "స్వామీజీ ఖాళీగా ఉన్నారు వచ్చెయ్యండి. మళ్ళీ కొద్దిసేపటిలో  ఆయన జన్మదిన సన్మానకార్యక్రమానికి వెళ్ళాలిట"  కోపా గొంతు మోగింది.


"స్వామీజీకి జన్మదినమా? అదేంటి?" మళ్ళీ నాకు సందేహం తలెత్తింది.


"అంటే ఆ పండుగను ఆయన చేసుకోకూడదు. భక్తులు చెయ్యవచ్చు." కోపా చెప్పాడు.


"రెంటికీ తేడా ఏంటి? ఆయన చేసుకున్నా వాళ్ళు చేసినా కార్యక్రమం జరుగుతుంది కదా?సన్యాసం స్వీకరించినవానికి సన్మానం ఏమిటి?జన్మదిన కార్యక్రమం ఏమిటి? ఇంకెక్కడి జన్మదినం? విరజాహోమంలో పాతజీవితం అంతా భస్మం అవ్వాలి కదా? అలాంటప్పుడు జన్మతేదీ ఎక్కడుంటుంది? దానికి మళ్ళీ సెలబ్రేషన్ ఏమిటి? "అడిగాను.


"బాబూ నీకు నేను చెప్పలేను గాని తొందరగా రా" అని ఫోన్లో వినిపించింది.నేను ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడేవో హోమాలూ అవీ మాంచి జోరుగా జరిగినట్లు పొగలు వస్తున్నాయి.అక్కడే బయట వేచి ఉన్న కొందరు పెద్ద మనుషుల్లా కనిపిస్తున్న వారిని "ఏమండీ స్వామీజీ ఉన్నారా? కలవొచ్చా?"అనడిగాను."ఆ! ఉన్నారు. ఎవరితోనో మాట్లాడుతున్నారు.వారోచ్చాక మీరు వెళ్లి కలవచ్చు." అన్నారు.


కోపా ఎక్కడా అని పరికించి చూచాను.స్వామీజీరూము బయట తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు.నన్ను చూచి నా దగ్గరకొచ్చి తానూ అదే చెప్పాడు.సరే నేను కూడా తనతో కలిసి ఆ తలుపు బయట కాపలా నిలబడ్డాను.మాతో బాటు ఎర్రటి బట్టలు వేసుకుని గడ్డం పెంచి పెద్ద బొట్టుతో ఒక మాంత్రికునిలాఉన్న ఒకవ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు.


అలా కాసేపు ఆ పొగని భరిస్తూ నిలబడేసరికి, పంచె కట్టుకున ఒక ముసలిశాల్తీ తలుపు తోసుకుని బయటకొచ్చి "అందరూ ఒక పక్కగా నిలబడండి. ఏమిటిది అడ్డదిడ్డంగా నిలబడ్డారు?"అని కసురుకుంది.ఆ శాల్తీని నేను గుర్తుపట్టాను. కాని ఆయన నన్ను గుర్తుపట్టలేదు. ఒకానొక గురువుకు శిష్యున్నని చెప్పుకుంటూ వేదికలెక్కి ప్రేమతత్వం గురించి ఉపన్యాసాలు తెగదంచే మనిషి ఆయన. అనవసరంగా మమ్మల్ని అలా కసురుకోవాల్సిన అవసరం ఏమిటో నాకర్ధం కాలేదు. బహుశా ప్రేమతత్వం ఎక్కువైతే ఇలా వికటిస్తుందేమోలే అని సరిపెట్టుకున్నాను. సరే అందరం గోడకు ఆనుకొని బల్లుల్లా ఒకమూలకు నిలబడ్డాం.


అలా కొంతసేపు గేటుకాపలా కాసినతర్వాత, ఎర్రడ్రస్ మాంత్రికుడు లోపలకెళ్ళాడు.కోపాకూడా లోపలకి తొంగిచూచి నన్నూ రమ్మని సైగచేస్తూ లోపలకి అడుగుపెట్టాడు.సరే నేనూ లోపలకెళ్ళాను.ఇద్దరం ఒక పక్కగా నిలబడ్డాం. మాతోబాటు ఇంకా ముగ్గురు నిలబడి ఉన్నారు.స్వామీజీ ఒక ఫేము కుర్చీలాంటి దానిలో కూర్చుని ఉన్నాడు. ఆ ముగ్గురి వాలకమూ చూస్తే మేము తొందరగా బయటకెళితే ఏదో రహస్యవిషయం స్వామీజీతో మాట్లాడటానికి వేచి ఉన్నారని అర్ధమైంది. చేతుల్లో ఏవో సంచులు ఉన్నాయి.


ఎర్రగుడ్డల మాంత్రికుడు ఆయన ముందు నిలబడి ఏదో అడుగుతున్నాడు. "ఐశ్వర్యం వచ్చే మార్గం ఉపదేశించండి స్వామీ"అన్నట్లుగా నాకర్ధమైంది.స్వామీజీ ఇలా చెప్తున్నాడు.


"మీరు హోమాలు ఏమైనా చేస్తారా? బలులు ఇస్తారా?" అడిగాడు స్వామీజీ.


"చేస్తుంటాను. కాని బలి ఇవ్వను."మాంత్రికుడు చెప్పాడు.


"అదే మీరు చేస్తున్న పొరపాటు. హోమాలు చేసేటప్పుడు ఏదైనా బలి ఇవ్వాలి. లేకుంటే దేవతలు తృప్తి చెందరు.కనుక హోమంచేసి తర్వాత కూష్మాండంకాని గుమ్మడికాయకాని బలి ఇవ్వండి.తామరపూలతో హోమం చేస్తే మీకు ఐశ్వర్యం వస్తుంది.ఎర్రటి అన్నం మీకు మీరే దిష్టి తీసుకుని పక్షులకు వెయ్యండి."అంటూ ఈ ధోరణిలో ఏదేదో చెబుతున్నాడు.నాకు నవ్వు ఆగడం లేదు.బలవంతాన నవ్వు ఆపుకున్నా ముఖంలో  నవ్వు తెలిసిపోతోంది. "ఏంటి అందరూ భయభక్తులతో నిలబడి ఉంటే ఇతను ఇలా నవ్వుతున్నాడు?"అన్న భావంతో స్వామీజీ ఒకటి రెండుసార్లు నా వైపు తేరిపార  చూచాడు.


ఈలోపల కోపా వంతు వచ్చింది. ఆయన ఒకడుగు ముందుకేసి తన ప్రశ్న సంధించాడు. "స్వామీ. షిరిడీబాబా గొప్పవాడా? రామకృష్ణుడు గొప్పవాడా? బాబాకు గుళ్ళు విపరీతంగా ఉన్నాయి. రామకృష్ణునికి లేవు. ఎందుకలా?"


స్వామీజీ అసహనంగా చూచాడు.


"వాళ్లకి గుళ్ళు లేకపోతే మనకెందుకు?" అన్నాడు.


"అదికాదు స్వామి.ఈ సందేహం చాలాకాలం నుంచి నన్ను వేధిస్తున్నది." అడిగాడు కోపా.


"నువ్వడిగిన దానికి నేనొక ఉపన్యాసం చెప్పాలి. ఇప్పుడు  నాకంత టైం లేదు.జపం ధ్యానం చెయ్యి.నీకే అర్ధమౌతుంది."అన్నాడు స్వామీజీ.అలా అంటూ "ఇక మీరు వెళ్ళవచ్చు" అన్నట్లుగా ఒక అరటిపండు కోపా చేతిలో పెట్టాడు.


తేరగా డబ్బులు వచ్చి ఒళ్లో పడాలి అనడిగిన ఒకాయనకు బాగా వివరించి మరీ హోమాలు ఎలా చెయ్యాలో చెప్పాడు. ఒక మంచి ఫిలసాఫికల్ ప్రశ్న అడిగిన కోపా కేమో ఇలా అసహనంగా జవాబు చెప్పాడు. ఇదంతా నేను నవ్వుతూ చూస్తున్నాను.చేసేదిలేక కోపా వెనక్కితిరిగి బయటకొచ్చాడు. స్వామీజీకి ఒక నమస్కారం పడేసి నేనూ అనుసరించాను.


"ఎప్పుడూ స్వామీజీ బాగానే మాట్లాడతాడు.ఈసారి చుట్టూ మనుషులు ఉన్నారని నాతో అలా మాట్లాడాడు." అన్నాడు కోపా.


"పాపం ఆయనకొకపక్క సన్మానానికి టైం అవుతోంది. ఆయన తొందర ఆయనది. ఎంతైనా అన్నీ వదిలేసిన "పరమహంస పరివ్రాజకాచార్య" కదా.మన పిచ్చి ప్రశ్నలతో ఆయన్ను విసిగిస్తే ఎలా?మనం కూడా ఒక వెయ్యికోట్లు ఎలా తేరగావచ్చి వొళ్ళో పడతాయో అడిగితే మార్గం చెప్పేవాడు.ఇలాటి పిచ్చిప్రశ్నలు అడిగితే ఆయనకి కోపం రాదూ మరి." అన్నాను.


కోపా ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు. సరే నేను వస్తానని చెప్పి నాదారిన నేను బయల్దేరాను.


నేటి స్వామీజీల తంతు ఇదీ.వాళ్ళు సంసారాన్ని వదిలామని చెప్పుకుంటారు.కాని అంతకంటే పెద్ద సంసారంలో చిక్కుకున్నారు.వాళ్ళకూ ఈషణత్రయంలో ఈతకొడుతున్న సామాన్యులకూ ఏమీ భేదం లేదు. ఒకరకంగా చూస్తే సామాన్యుడే మంచివాడు.తన స్తితిని తాను ఒప్పుకుంటాడు.కాని అన్నీ వదిలామనీ గురువులమనీ చెప్పుకుంటూ తద్భిన్నమైన జీవితాలు గడిపే స్వాములను ఏపేరుతో పిలవాలో అర్ధంకాదు.ఈతిబాధలకు తరుణోపాయాలు చెప్పేవాడు, సత్యాన్ని చెప్పనివాడూ,ఏమైనా కావచ్చు కాని సద్గురువూ జగద్గురువూ మాత్రం కాలేడు.సద్గురువైనవాడు పేరు ప్రఖ్యాతులకోసం ఏమాత్రం ఆరాటపడకుండా సత్యాన్ని ఉన్నదున్నట్లు చెప్పాలి.అది ఇతరులకు నచ్చినా నచ్చకపోయినా సరే.ఒకరి మెప్పును ఆశించేవాడు సద్గురువు ఎలా అవుతాడు?


మౌనంగా ఆలోచిస్తున్న నాలో "సన్యాసం తీసుకోవడం కాదు. సన్యాసిగా మారాలి"అన్న రమణమహర్షి అమృతవాక్కులు గింగురుమన్నాయి.
read more " మాయల మరాటీలు "

20, జనవరి 2012, శుక్రవారం

ఎం ఎఫ్ హుసేన్ జాతకం - పరిశీలన



వివాదాస్పద పెయింటర్ హుసేన్ 17-9 -1915 న మహారాష్ట్ర లోని పండరిపురంలో జన్మించాడు. జననసమయం 6.18  అనీ 7.20 అనీ అంటున్నారు. ఇతను చనిపోయిన తేదీ మనకు తెలుసు. చనిపోయిన సమయమూ తెలుసు. 9-6-2011 న ఇతను లండన్లో చనిపోయాడు. దానిని బట్టి జననసమయాన్ని లెక్కించవచ్చు.అలాటి పద్దతులు జ్యోతిష్యశాస్త్రంలో ఉన్నాయి. కాని ఆ వివాదంలోకి నేను పోదలుచుకోలేదు. ఇతని జాతకాన్ని లోతుగా పరిశీలించి రెక్టిఫై చేద్దామనీ నాకు ఉద్దేశ్యం లేదు. అంత సమయం ఇలాటి నీచుడికి ఇవ్వడం నాకిష్టం లేదు. పైపైన పరిశీలించి అసలు ఇతని వివాదాస్పద వ్యక్తిత్వానికి ఏఏ గ్రహాలు ఎలా కారణమయ్యాయో చూద్దామని మాత్రమే ఈ ప్రయత్నం.

భరతమాతనూ, సరస్వతీదేవినీ, లక్ష్మీదేవినీ నగ్నంగా చిత్రించి అదో గొప్ప ఈస్తటిక్ సెన్స్ అని డప్పు కొట్టుకున్న ఇలాటి వెధవజాతకం అసలు చూడాలా అని కొంతమందికి ఒక అనుమానం రావచ్చు. శ్రీరాముని జాతకాన్ని చూచి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే రావణుడి జాతకాన్ని చూచికూడా కొన్ని విషయాలు రాబట్టవచ్చు. అందులో మంచి కనిపిస్తే, ఇందులో చెడు కనిపిస్తుంది. అయితే చెడు జాతకంలో కూడా, వారికి పట్టిన వైభవమూ,రాజయోగాలూ,ఎలావచ్చాయో, కారణాలేమిటో  పరిశీలించవచ్చు. తద్వారా దురూహ్యమైన కర్మగతిని అంచనా వెయ్యవచ్చు. 'కాదేదీ కవిత కనర్హం' అని శ్రీశ్రీ అన్నట్లు, జ్యోతిష్య శాస్త్రవేత్తలకు ఎవరి జాతకమూ అంటరానిది కాదు. ఇలాటి జాతకాలు చూచి వారివారి వ్యక్తిత్వాలలోని శాడిస్టు ఆనందాన్నీ, కుత్సిత మనస్సునీ ఏఏ గ్రహాలు ఎలా సూచిస్తున్నాయో, అదే సమయంలో వారి జాతకంలోని రాజయోగాలు ఏమిటో, అవి ఎలా వచ్చాయో చదవవచ్చు. కాకపోతే రావణుడూ, కీచకుడూ, కంసుడూ,దుశ్శాసనుడూ మొదలైనవారి జాతకవివరాలు మనకు ప్రస్తుతం లభించడం లేదు. ఇలాటి జాతకాలు చూడటం ద్వారా అలాటివారి జాతకాలలో ఏఏ గ్రహయోగాలు ఉండేవో మనం ఊహించవచ్చు. ఈ జాతకాల ప్రయోజనం అంతవరకే.

ఇకపోతే, పోయినవారి జాతకాలు చూచి ప్రయోజనం ఏమిటి? అని కొందరు అంటారు. వారి అజ్ఞానానికి నా జోహార్లు. గతించిన విషయాలనూ, జరుగుతున్న విషయాలనూ జాగ్రత్తగా పరిశీలిస్తేనే శాస్త్రవేత్తలకు ప్రకృతి సూత్రాలు అర్ధమయ్యాయి. అవుతాయి కూడా. వాటిని ఉపయోగించి భవిష్యత్తులో కూడా అలాటివి పునరావృతమైనప్పుడు ఆయా ఫలితాలను అంచనా వెయ్యవచ్చు. ఇది శాస్త్రీయ విధానమే. పైగా చనిపోయిన ప్రతివారీ జాతకమూ చూడవలసిన పనిలేదు. చూడకూడదు కూడా. మంచో చెడో ఏదో ఒక పేరు సంపాదించినవారి జాతకంలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. కనుక అలాటివి చూడవచ్చు. వాటికి కారణాలు ఆయా గ్రహయోగాలు దర్శించవచ్చు. ప్రముఖుల జాతకాలైతే ఎప్పుడైనా చూడవచ్చు. హిట్లర్ జాతకాన్ని ఇప్పటికీ ఎంతో మంది జ్యోతిష్కులు విశ్లేషించారు. ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. కనుక పోయినవారి జాతకాలు చూచి ప్రయోజనం ఏమిటి? అన్న  ఆరోపణ అర్ధరహితమని గ్రహించండి. ప్రముఖుల జాతకాలు, వారున్నా పోయినా, ఎప్పటికీ నిత్యనవీనాలే. ఆ ప్రముఖుల పేరు మంచిది కావచ్చు, లేదా చెడ్డది కావచ్చు. జాతక పరిశీలనకు రెండూ ఉపయోగపడుతాయి. ఇక విషయంలోకొద్దాం.

లగ్నం వివాదాస్పదం గనుక స్థూలవిచారణ చేద్దాం. ఉచ్ఛబుధుని వల్ల తెలివైన మనస్తత్వమూ, లలితకళలలో ప్రావీణ్యతా కలిగాయి.నీచశుక్రునివల్ల నీచకామాసక్తీ, గౌరవించి పూజించదగినవారిని నగ్నంగా చిత్రించే శాడిష్టు నీచ మనస్తత్వమూ వచ్చాయి. కీర్తిని ఇచ్చే రవి వీరితో కలిసి ఉండటంతో ఇలాటి పనులవల్ల కీర్తి కలిగింది. నవాంశలో శనినీచత్వం వల్ల, రాశిచక్రపు బుధశుక్రులకు ఇది అష్టమం అవడంవల్ల నీచమైన కర్మవల్ల వచ్చే ప్రఖ్యాతి సూచితం. రాశిశనికి ఈ స్థితి లాభస్థానం కనుక, ఈ వివాదం ఇతనికి వృత్తిపరంగా లాభాన్నే కలిగించింది అని చెప్పవచ్చు. 

గురుని వక్రతవల్ల విపరీతమైన వక్రించిన మతభావాలు కలిగినవాడని చెప్పవచ్చు. నవాంశలోని రాహుగురువులు రాశిగురువుకు పంచమంలో ఉండటంవల్ల ఇది మరీ కరెక్ట్ అవుతున్నది. వారు రాశిరాహువుకు సప్తమంలో ఉండటం వల్ల మతసంబంధగొడవల మూలకంగా ఇతరదేశాలలో తలదాచుకోవలసిన పరిస్తితి వస్తుంది అని సూచన ఉంది. 

రవిగురువుల బలహీనతవల్ల వారి కారకత్వాలు బాగా దెబ్బతిన్నాయి.కనుక వారిచ్చే అన్ని వరాలూ పనికిరాకుండాపోయాయి అని చెప్పవచ్చు.అందుకే ముసలి వయసులో కూడా తగ్గనికామానికి, సౌందర్యారాధన అని ముసుగుపేరు పెట్టుకున్నాడు. శుక్రుని నీచత్వమూ బలహీనతా, అతనిమీద శనితో కూడిన కుజునిదృష్టీ, శనిక్షేత్రంలోని  రాహువుయొక్క దృష్టీ అన్నీ ఇదేకోణాన్ని నిరూపిస్తున్నాయి.

పై రెండు సమయాలకూ లగ్నం కన్యే అవుతుంది. ఒకవేళ అది నిజమే అనుకుంటే విశ్లేషణ ఇలా ఉండవచ్చు.

పంచమరాహువు యొక్క దృష్టి నవమంమీద పడుతూ ఇతని కళానైపుణ్యం విదేశాలలోనే రాణిస్తుంది. స్వదేశంలో భంగపడుతుంది అని చెబుతోంది.దానికి తగినట్లే దశమంలోని శనికుజుల తృతీయదృష్టి ద్వాదశం మీద ఉంటూ, వృత్తిపరమైన చిక్కులవల్ల ఇతను విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది అని సూచిస్తున్నది.

చతుర్ధంలోని క్షీణ చంద్రునివల్ల ఇతని మానసిక స్థితి అంత మంచిదేమీ కాదని సూచితం. ఈ చంద్రుణ్ణి,దశమం నుంచి శనికుజులు చూస్తున్నారు. ఈ గ్రహస్తితివల్ల ఇతను చిన్న తనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లిప్రేమ అంటే ఏమిటో తెలియని ఇతనికి ప్రతి స్త్రీమూర్తీ ఒక భోగవస్తువుగానూ, విలాసవస్తువుగానూ, కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కుజునికి పట్టిన అష్టమాదిపత్యంవల్ల ఇతనిలోని అమిత కామాసక్తి సూచితం అవుతున్నది.ఇతని ఆత్మకారకుడు కూడా కుజుడే కావడం గమనించాలి. నవాంశలో శనిక్షేత్రంలోని శుక్రరవికేతువులవల్ల ఏమి జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.చతుర్దంలో నీచ శని ఉన్నాడు.పంచమంలో శుక్రక్షేత్రంలో కుజుడు ఉన్నాడు. కనుక ఈ జాతకుడికి కనిపించిన ప్రతి అమ్మాయీ (వయసులో ఉంటే చాలు) మహాఅందంగా కనిపిస్తుంది. వక్రించిన సప్తమాధిపతి గురువు యొక్క పంచమదృష్టి కుజశనులమీద పడుతూ అక్కణ్ణించి చతుర్ధంలోని చంద్రునిమీదకు వారినుంచి సరఫరా అవుతున్నది. ఈ గ్రహప్రభావమే ఇతనిలోని సౌందర్యారాధన అనే ముసుగులో ఉన్న తోడేలును క్లియర్ గా చూపిస్తున్నది. స్త్రీలో ఇతనికి వంపుసొంపులు తప్ప ఇంకేమీ కనిపించవు. అందువల్లే తల్లికంటే ఎక్కువగా గౌరవించవలసిన దేవతామూర్తులను బూతుబోమ్మలేసి అవమానించి ఆనందించే శాడిస్టుగా మారాడు. దేవతలను కూడా కామదృష్టితో చూచేవారిని ఏమి పేరుతో పిలవాలో నిఘంటువు వెదికినా కనిపించదేమో.   

సప్తమంలోని వక్రగురువుమీద ఇదే శనికుజుల దృష్టివల్ల, వృత్తిపరంగా చేసిన తప్పులవల్ల ఇతను విదేశాలలోనే మరణించక తప్పదు అని సూచన ఉంది. చంద్రలగ్నాత్ పంచమాదిపతి అయిన కుజుని సప్తమస్తితికూడా ఇతనికి గల పరాయిమతాభినివేశమూ, చివరికి పరాయిదేశంలోనే ఉండిపోవడమూ సూచిస్తోంది.

దేవతామూర్తుల మీద తాను గీసిన అశ్లీల పెయింటింగులతో  హిందువుల మనోభావాలను ఇతను ఎంత తీవ్రంగా గాయపరచాడో తెలిస్తే ఇతన్ని 'పికాసో ఆఫ్ ఇండియా' అని కొనియాడిన  ఫోర్బెస్ మేగజైన్ 'పిచ్చికుక్క ఆఫ్ ఇండియా' అనేదేమో తెలియదు. కాని చాలామంది హిందువుల అభిప్రాయం మాత్రం ఇదే. పికాసో పెయింటింగ్స్ మార్మికంగా ఉండేవి. వాటిలో కొన్నికొన్ని అస్సలు అర్ధమయ్యేవి కావు. చూచేవారికి వాటిలోని అర్ధాన్ని ఎవరైనా వివరించవలసి వచ్చేది. కాని హుసేన్ గీసిన పెయింటింగ్స్ లోని అర్ధం మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది. అందులో అర్ధంకాని మార్మికత ఏమీ లేదు. అంతఃసౌందర్యం కూడా ఏమీ లేదు.  

ఇతని జాతకంలో గ్రహాలు మాత్రం ఒక  వికృత కళాకారుడిని సూచిస్తున్నాయి. ఇతను పుట్టిన సంవత్సరం కూడా 'రాక్షస' నామ సంవత్సరమే. రాక్షసులకూ పిశాచాలకే ఇలాటి వికృత ఆలోచనలు వస్తాయి. గురువారంనాడు ఇతను పుట్టాడు. గురువు ఇతని జాతకంలో వక్రించి ఉన్నాడు. సూర్యహోరలో ఇతను పుట్టాడు. సూర్యుడు అతి బలహీనుడుగా రాశిసంధిలో ఉన్నాడు. ధార్మికగ్రహాలైన ఈ రెండూ ఇలాఉన్న స్తితిలో పుట్టినవాడు ఇంతకంటే మంచి పేరు ఎలా తెచ్చుకోగలడు? 

ఒక దేశసంస్కృతిని తన అసభ్య బొమ్మలతో అవమానించినవాడికి అదే దేశం పద్మశ్రీలూ, పద్మభూషణ్ లూ ఇచ్చి గౌరవించడం మన దేశంలోనే సాధ్యం. ఇతనే చైనాలో పుట్టి ఇలాటి పనులు అక్కడ చేస్తే, ఇతన్ని ఇలా శిక్షించేవారో ఊహించుకుంటేనన్నా మనకు బుద్ధి వస్తుందా? తనకు దురుద్దేశ్యాలు ఎంతమాత్రం లేవనీ ఇదంతా సౌందర్యపోషణ మాత్రమేననీ వాదించిన అతను మొహమ్మద్ నూ, క్రీస్తునూ కూడా నగ్నంగా చిత్రించి తన నిజాయితీని నిరూపించుకుని ఉంటే  బాగుండేది. 

అయితే మరి ఇలాటి వాళ్లకి కూడా ధనమూ భోగభాగ్యాలూ ఎలా వస్తాయి అని అనుమానం వస్తుంది. హుసేన్ చాలా పేదరికం నుంచి మంచి సంపన్నుడయ్యాడు. అలా జరగాలంటే జాతకంలో మంచియోగాలు తప్పకుండా ఉండాలి. అవేమిటో చూద్దాం.

ఇతని జాతకంలో పంచమాదిపతి అయిన శని దశమ కేంద్రంలో ఉండటంవల్ల రాజయోగం పట్టింది. కాని అష్టమాదిపతి అయిన కుజుని కలయికవల్ల అది భంగమై అతను విదేశాలలో తలదాచుకోవలసి వచ్చింది. చంద్ర లగ్నాత్ చూస్తే, చతుర్ధ కేంద్రాదిపతి అయిన గురుని మీద నవమ కోణాదిపతి అయిన సూర్యుని దృష్టి వల్ల రాజయోగం పట్టింది. దశమ లాభాదిపతులైన బుధశుక్రులు దశమ స్థానంలో ఉండటంవల్ల కూడా వృత్తి పరంగా మంచి లాభార్జన కలిగింది. వీరితో భాగ్యాధిపతి అయిన రవి కలిసి ఉండటం మంచి ధనయోగం. ఈ యోగమే సినిమా హోర్డింగులు గీసుకునే ఇతనికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టింది. ఇలాటి యోగం పూర్వపుణ్యం వల్లనే వస్తుంది. కాని ఈ జన్మలో చేసిన చెడు కర్మ కూడా ఇతను అనుభవించక తప్పదు. కర్మ అనే బాలెన్స్ షీట్ లో మంచికి మంచీ చెడుకు చెడూ తప్పదు. లగ్నం నుంచీ చంద్ర లగ్నం నుంచీ ఉన్న మంచి రాజయోగాలూ ధనయోగాల వల్ల ఇతను ధనాన్నీ కీర్తినీ ఆర్జించగలిగాడు. ఇంతకంటే ఈ జాతకాన్ని ఎక్కువగా చర్చించనక్కరలేదు.   

ఏది ఏమైనా, భక్తిమార్గప్రవర్తకులైన ఎందఱో మహానుభావులకు జన్మనిచ్చిన 'పండరిపురం' లో ఇలాటివాళ్ళు కూడా జన్మించడం చాలా బాధాకరం. ఇలాటి వారిని సమర్ధించే 'భారతీయులు' కూడా ఉండటం ఇంకా బాధాకరం.
read more " ఎం ఎఫ్ హుసేన్ జాతకం - పరిశీలన "

12, జనవరి 2012, గురువారం

భరతమాత ముద్దుబిడ్డ వివేకానందస్వామి -2 (హస్తముద్రా విశ్లేషణ)


ఇది వివేకానంద స్వామి హస్తముద్ర. 6-4-1895 న ఈ హస్తముద్ర రికార్డ్ చెయ్యబడింది. ఈ హస్తరేఖాముద్రను ప్రఖ్యాత సాముద్రికుడు "కీరో" తన పుస్తకంలో ఇచ్చాడు. ఇది స్వామి సంతకంతో ఉన్న ఆయన కుడిచేతి హస్తముద్ర. ఇప్పటివరకూ నేను హస్తసాముద్రికం గురించి కొన్ని వ్యాసాలు వ్రాశానేగాని ఎవరి చేతినీ ప్రయోగాత్మకంగా  విశ్లేషించి వివరించి చూపలేదు. ఇప్పుడు వివేకానందస్వామి హస్తముద్రలోని రేఖలను విశ్లేషిద్దాం. స్వామి యొక్క హస్తపుతీరు చూడగానే ఇది తాత్వికహస్తాల (philosophic palm) గ్రూపులోకి వచ్చేదిగా వెంటనే చెప్పవచ్చు. అయితే అరచేయి యొక్క చతురస్రనిర్మాణం వల్ల ఇందులో ఆచరణాత్మకహస్తం (practical palm) కూడా కలిసి కనిపిస్తుంది. స్వామి ఉన్నతభావ సంశోభితుడు అని,తాత్విక చింతన కలిగినవాడు అనీ, అదే సమయంలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగిన ఒక లీడర్ అనీ ఈ చెయ్యి చూచి వెంటనే చెప్పవచ్చు.  

మొదటగా స్వామి యొక్క జీవితరేఖ (life line) చాలా చిన్నదిగా ఉండటాన్ని చూడవచ్చు.ఇది శిరోరేఖతో కలిసి చాలాదూరం కలిసి వచ్చింది. ఆ ప్రాంతంలో గొలుసుకట్టు నిర్మాణం ఉండటాన్ని చూడవచ్చు. అక్కడే ఉన్న ద్వీపనిర్మాణం (island) వల్ల స్వామికి చిన్నవయస్సులో కుటుంబపరమైన దుర్ఘటన జరిగింది అని తెలుసుకోవచ్చు. స్వామికి 18 ఏళ్ళ వయస్సులో ఆయన తండ్రిగారు మరణించాడు. వారి కుటుంబం దిక్కులేనిదయ్యింది. అలాగే జీవితరేఖ యొక్క హ్రస్వత్వం వల్ల స్వామి చిన్నవయస్సులోనే ( 39 ఏళ్ళకే) మరణించాడు.

స్వామియొక్క శుక్రస్థానం (mount of Venus) విశాలంగా బలంగా ఉండటం చూడవచ్చు. అందుకే ఆయనది చాలా ఊహాత్మకమైన ఆలోచనాశక్తి. ఆయనకు కవితాశక్తీ అధికమే. అంతేగాక గానం,వాయిద్యప్రతిభా ఆయనలో ఉండేవి. ఆయన తబలాను అద్భుతంగా వాయించేవాడు. ఆయనకు శృతి లయజ్ఞానం అమోఘంగా ఉండేది.ఆయన గానం గంధర్వగానంలా ఉండేదని చాలాచోట్ల వ్రాసి ఉంది. ఆయన పాటపాడితే శ్రీరామకృష్ణులు అదివిని తన్మయత్వంతో సమాధిస్తితిలోకి వెళ్ళేవారు. స్వామి గానం అంత మధురంగా ఉండేది. " ఓ మన్. చలో నిజనికేతనే." (ఓ మనసా నీ స్వస్థానానికి నీవు వెళ్ళు) అన్న కీర్తనను ఆయన మొదటిసారిగా శ్రీరామకృష్ణుల సమక్షంలో గానం చేశాడు. అది విని శ్రీరామకృష్ణులు పరవశులై సమాధి స్తితిని పొందారు.

శుక్రస్థానంలో ఎక్కువభాగం బొటనవేలు యొక్క అధీనంలో ఉండటం చూడవచ్చు. అంటే ఈయనకు గల లలిత కళలన్నీ కూడా ఆత్మశక్తికి లోబడి ఉన్నాయని అర్ధం అవుతుంది. ఒక కళాకారునికీ ఒక యోగికీ గల తేడాలలో ఇది ముఖ్యమైనది. కళాకారునికి ఆత్మనిగ్రహం ఉండవచ్చు లేకపోవచ్చు. కాని యోగికి ఆత్మనిగ్రహం ప్రాణం వంటిది. ఆత్మశక్తి అంగుష్ఠం (thumb) చేత తెలియబడుతుంది.

క్రిందుగా అమరిఉన్న బొటనవేలు (low set thumb) స్వామికి అజేయమైన ఆత్మశక్తీ, విశాలమైన భావపటిమా ఉన్నాయన్న విషయాలు సూచిస్తున్నది.  

విశాలమైన గురుస్థానం (mount of Jupiter) వల్ల ఆయనకు గల ఆధ్యాత్మికశక్తి సూచితం అవుతున్నది. అక్కడ ఉన్న చతుర్భుజగుర్తు (square symbol) వల్ల స్వామికి దైవకృప మెండుగా ఉందన్న విషయం తెలుస్తున్నది. సాలమన్స్ రింగ్(Solomon's ring)స్వామి చేతిలో ఉందో లేదో కనిపించడం లేదు. కాని మార్మికయోగుల చేతిలో ఉండే ఆగుర్తు స్వామి చేతిలో తప్పక ఉండే ఉంటుంది.

ధనరేఖ(fate line) స్వామి చేతిలో ఉంది. కాని హృదయరేఖ(heart line) క్రిందుగా ఆగిపోయి ఉండటంతో, తన హృదయానికి ఇష్టమైన ఆధ్యాత్మికత కోసం తనంతట తాను ధనసంపాదన జోలికి వెళ్ళలేదు అని తెలుస్తోంది. అంటే స్వామి స్వచ్చందంగా పేదరికాన్ని ఒక నియమంగా స్వీకరించి ఆచరించాడు. ఇది మన దేశంలో సాంప్రదాయ సాధువులు ఆచరించే నియమమే.

శిరోరేఖ ధనరేఖను ఖండిస్తూ చంద్రస్థానం(mount of Moon) వైపు వంగి ఉంది. కనుక స్వామి ఆలోచనలు ధనసంపాదన వైపు వెళ్ళలేదు. ధనరేఖ, చంద్రస్థానాల కలయిక స్వామి యొక్క జాతకంలో శనిచంద్రుల సంబంధాన్ని సూచిస్తోంది. స్వామి జాతకంలో శనిచంద్రులు కలిసి కన్యారాశిలో ఉన్నారు.ఇది వైరాగ్యయోగం, తాత్విక చింతనాయోగం.

శిరోరేఖ చంద్రస్థానం వైపు అమితంగా వెళ్ళినా చివరకు బలహీనంగా మారింది. దీనివల్ల స్వామికి గల భావావేశ స్వభావం(emotional nature) కనిపిస్తున్నది. కాని అది చివరకు బలహీనంగా మారినందువల్ల, భావావేశం స్వామి నిగ్రహంలోనే ఉండేదన్న విషయం తెలుస్తున్నది.

హృదయరేఖ చివరిలో అయిదురేఖలుగా చీలింది. ఒకటి గురుస్థానం వైపూ,మిగిలిన నాలుగూ శనిస్థానం వైపూ వెళ్ళాయి. ఇదొక అద్భుతయోగం. దీనివల్ల నాయకత్వ లక్షణాలూ, యోగశక్తీ, కష్టించి పనిచేసే లక్షణమూ  సూచింపబడుతున్నాయి. అయిదు తలల పాములాగా ఈ చిహ్నం ఉండి, వికసించిన కుండలినీ శక్తిని సూచిస్తోంది.


శనిస్థానం మీద ఉన్న చంద్రవలయం (circle of Moon) వల్ల ఒక రహస్యవిషయం బయట పడుతున్నది. స్వామి జాతకంలో శనిచంద్రులు కలిసి ఉన్నారన్న విషయం ఇది సూచిస్తున్నది. ఇదొక ఆశ్చర్యకరమైన సూచన. ఈ విధంగా చేతిని చూచి జాతకాన్నీ, జాతకాన్ని చూచి చేతిరేఖలనూ అంచనా వెయ్యవచ్చు. ఇవి చాలా సార్లు కరెక్ట్ గా సరిపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ గుర్తు వల్ల కలిగే ఫలితం తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి గుర్తు చేతిలో ఉన్నవారిలో దివ్యశక్తులూ, ఆత్మజ్ఞానమూ,బ్రహ్మజ్ఞానమూ, అతీతసిద్ధులూ ఉంటాయి. ఉపాసనాబలమూ,ఈశ్వరసాక్షాత్కారమూ వీరికి కరతలామలకాలు. వీరికి వాక్శిద్ధి ఉంటుంది. వీరు ఒకమాట అంటే,అది శాపమైనా వరమైనా,జరిగి తీరుతుంది. విధిని మార్చగల తపశ్శక్తి వీరికి ఉంటుంది. చేతిలో ఈగుర్తు ఉన్నవారిని సద్గురువులుగా గుర్తించవచ్చు.

హృదయరేఖనుంచి రవిస్థానంలో(mount of Sun)ఉన్న రేఖలు ఒక కప్పు వంటి ఆకారంలో ఉన్నాయి. దీనివల్ల ఆయన రాజులకు, సమాజంలోని ఉన్నతులకు సన్నిహితుడౌతాడని  సూచన ఉంది. క్షత్రియకుటుంబంలో పుట్టడంతో ఆయనలో రాజరిక ఠీవి ఉండేదని కూడా మనకు తెలుసు. కాని ఈ రేఖ కేతుస్థానం(mount of Ketu) నుంచి చేతి మధ్యలో నుంచి బయలుదేరటంతో, ఈ పరిచయాలు ఆధ్యాత్మిక సంబంధమైనవనీ, స్వామి నడివయస్సు నుంచే ఇవి మొదలౌతాయనీ తెలుస్తుంది. స్వామి బతికినది 40 ఏళ్లే గనుక ఆయనకు నడివయసు అంటే 20 ఏళ్ళ నుంచే ఉంటుంది.అదేవిధంగా మహారాజులతోనూ, మహానీయులతోనూ ఆయనకు ఆవయస్సు నుంచే పరిచయాలు ఏర్పడ్డాయి.  

శిరోరేఖ,హృదయరేఖల మధ్యన ఉన్న అనేక డైమండ్ ఆకారాల (mystic crosses)వల్ల ఆయనలో అతీతశక్తులు ఉన్నాయని తెలుస్తోంది. గురుస్థానం క్రిందుగా ఉన్న "mystic eye" సింబల్ జాగ్రత్తగా పరిశీలిస్తే కనిపిస్తుంది. దీనివల్ల ఆయనకు దివ్యదృష్టి (divine clairvoyant vision) ఉన్నదన్న విషయం తెటతెల్లం అవుతున్నది.

చంద్రస్థానంలో గల రెండు అడ్డరేఖలవల్ల విదేశీ ప్రయాణాలు సూచితం అవుతున్నాయి. స్వామి అమెరికా మొదలైన విదేశాలకు రెండుసార్లు వెళ్లి వచ్చాడన్న విషయం గమనించాలి. 

బలహీనంగా అనేక రేఖలతో ఖండింపబడి ఉన్న ఆరోగ్యరేఖవల్ల(line of health) స్వామి చివరిలో అనేకరోగాలతో బాధ పడ్డాడని తెలుస్తోంది. ఆయనను చివరి రోజులలో బీపీ, షుగరూ, ఆస్తమా బాధించాయి.

మసకగా కనిపిస్తున్న ఈ హస్తముద్ర నుంచి ఇంతకంటే వివరాలు ఊహించడం కష్టం. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. హస్తసాముద్రికం ఎంతటి ఖచ్చితమైన ఫలితాలను సూచిస్తుందో ఈ విశ్లేషణవల్ల తెలుసుకోవచ్చు. అయితే చదువరులకు ఒక అనుమానం రావచ్చు. మీకు స్వామి జీవితం ముందే తెలుసు గనుక అలా చెప్పగలిగారు అని అనుకోవచ్చు. నేను వ్రాసిన ఫలితాలు రేఖలను బట్టే చెప్పాను. ఈ చెయ్యి వివేకానందస్వామిది కనుక అలా చెప్పలేదు.ఏ హస్తసాముద్రికుడైనా ఆ రేఖలను చూస్తే ఇవే ఫలితాలు చెప్తాడు. ఇందులో అతిశయోక్తులు ఏమీ లేవు. ఈ విషయం సాముద్రికజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా అర్ధం అవుతుంది.


జ్యోతిష్యానికి సాముద్రికానికి ఉన్న తేడా ఇదే. జ్యోతిష్య శాస్త్రం కష్టమైనది. అందులో కారకత్వాల గందరగోళం ఉంటుంది. అక్కడ జ్యోతిష్కుని ఊహాశక్తి చాలా  ఖచ్చితంగా ఉండాలి. స్ఫురణ శక్తి పని చెయ్యాలి. గ్రహబలాలూ భావబలాలూ బేరీజు వెయ్యాలి. గణితభాగం తెలిసి ఉండాలి. సాముద్రికం కూడా  కష్టమైన విద్యే,  కాని జ్యోతిష్యం కంటే తేలికైనది. ఎందుకంటే దీనిలో విషయం కళ్ళముందు కనిపిస్తూ ఉంటుంది కనుక ఎక్కువగా కష్టపడవలసిన పని ఉండదు. మనం ఎక్కువ కష్టపడకుండా ప్రకృతే మన చేతిలో మన జాతకాన్నిపెట్టింది. కాని ఇక్కడ కూడా మంచి విశ్లేషణాశక్తి లేనిదే ఫలితాలు ఊహించలేము.
read more " భరతమాత ముద్దుబిడ్డ వివేకానందస్వామి -2 (హస్తముద్రా విశ్లేషణ) "

భరతమాత ముద్దుబిడ్డ వివేకానందస్వామి

నేడు తేదీలపరంగా చూస్తే వివేకానందస్వామి పుట్టినరోజు. నవీనకాలంలో భరతమాత కడుపున పుట్టిన మహనీయులలో వివేకానందస్వామి అగ్రగణ్యుడు. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్నీ భావజాలాన్నీ ఈనాడైనా కొంత తెలుసుకుందాం.

మానవశరీరాల వాసనను దేవతలు ఏవగించుకుంటారని వేదం అంటుంది. దీనికి నిదర్శనం మనకు శ్రీ రామకృష్ణుని జీవితంలో కనిపిస్తుంది. కామకాంచనాలలో ఆసక్తులైనవారి స్పర్శను సాన్నిహిత్యాన్నీ శ్రీ రామకృష్ణులు సహించలేకపోయేవారు. అటువంటివారు తాకితే ఆయన ఒంటిమీద తేళ్ళూజెర్రులూ పాకినట్లు ఉండేది. ఎప్పుడూ డబ్బు గురించీ, ఇంద్రియసుఖాల గురించి ఆలోచించేవారి చుట్టూఉన్న ప్రాణవలయాలు చాలా తక్కువస్థాయికి చెందినవిగా ఉంటాయి. జంతువుల aura కూ వీరి aura కూ పెద్ద తేడా ఉండదు. కొండొకచో జంతువుల aura లే నయం అనిపిస్తాయి. వాటిలో ఒకరకమైన అమాయకత్వం ఉంటుంది. వీరిలో అదీ ఉండదు. సంస్కారం నేర్పని చదువువల్ల వచ్చిన cunningness వీరిలో ఉంటుంది. కనుక ఇలాటివారి aura ను అత్యంత ఊర్ధ్వస్థాయిలలో ఉన్న మహనీయులు భరించలేరు.మామూలు మనుషులమైన మనమే కొంతమందిని ఎక్కువసేపు భరించలేము. ఎప్పుడెప్పుడు వారినుంచి దూరంగా పారిపోదామా అనిపిస్తుంది. కనుక, అత్యంత ఉన్నత పవిత్రస్థాయిలో మనస్సు సంచరించే దివ్యాత్ములు నిమ్నస్థాయికి చెందిన స్వార్ధపూరిత ఆలోచనలు ఉన్న మనుషుల సామీప్యాన్ని ఏవగించుకుంటారు.అందుకనే నిజమైన సిద్ధపురుషులు జనసమాజాలకు దూరంగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.

అలాటి పవిత్రతామూర్తి అయిన శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు (అప్పటికి ఆయన 17 ఏళ్ల పిల్లవాడు) కనిపిస్తే ఆనందంతో పరవశించేవారు. ఆయన మనస్సు సమాధి స్థితికి ఎగసిపోయేది. తన సొంత కుమారునిలా దగ్గరకు తీసుకుని ముద్దుచేసేవారు. తన చేతితో స్వీట్లు తినిపించేవారు. మిగిలినవారు ఆయన చర్యలను చూచి ఆశ్చర్యపడేవారు. ఆయన ఎందుకలా చేస్తున్నారో వారికి అర్ధం అయేది కాదు. నరేంద్రుని యొక్క ఉన్నత వ్యక్తిత్వానికీ, నిస్వార్ధ మనస్తత్వానికీ, కామకాంచనస్పర్శకు దూరమైన ఆయనయొక్క వైరాగ్యపూరిత  ఆలోచనాధోరణికీ ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. అటువంటి పవిత్రతామూర్తి నరేంద్రుడు. అప్పటికి నరేంద్రుడు ఏ రకమైన సాధనలూ చెయ్యలేదు. ఆయనకు వేదవేదాంత జ్ఞానమూ అప్పటికి లేదు. కాని ఆయనలోని పవిత్రాత్ముని, సిద్దాత్ముని, శ్రీ రామకృష్ణుల దివ్యచక్షువు గమనించింది. భవిష్యత్తులో వివేకానందునిగా భారతదేశపు వేదవేదాంతజ్ఞానాన్ని లోకానికి వెదజల్లుతాడని శ్రీరామక్రిష్ణునికి అప్పుడే తెలుసు. ఇదే విషయాన్ని ఆయన అనేకసార్లు చెప్పారు. గొంతు కాన్సర్ తో బాధపడుతూ, మాట్లాడలేని స్తితిలో ఉన్న సమయంలో ఆయన ఒక కాగితంమీద ఇలా వ్రాసి చూపించారు. "నరేన్ భవిష్యత్తులో లోకానికి బోధిస్తాడు". దానిని చదివి నరేంద్రుడు "నేనెన్నటికీ అలాటి పనులు చెయ్యను" అన్నాడు. దానికి శ్రీ రామకృష్ణులు " చెయ్యకపోవడానికి నువ్వెవరు? నీ ఎముకలు ఆ పనిని నీచేత చేయిస్తాయి." అన్నారు. జీన్స్ అన్న పదం అప్పట్లో లేదు. కనుక ఎముకలు అన్నపదం ఆయన వాడారు.నరేంద్రుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన చెయ్యవలసిన పని ఏమిటో శ్రీ రామకృష్ణులకు ముందుగానే తెలుసు.

135  సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ సంస్కృతికి పట్టుకొమ్మ అయిన కలకత్తాలోని ఉత్తమకాలేజీలలో ఇంగ్లీషు చదువులు చదివి, భోగవిలాసాల మధ్యన పెరిగిన నరేంద్రుడు అంతటి వివేకవైరాగ్యమూర్తిగా ఎలా ఉన్నాడో ఊహించడానికి అసాధ్యంగా ఉంటుంది. కనుక ఈ లక్షణాలు ఆయనకు ఒకరిచేత నేర్పబడినవి కావనీ అవి పుట్టుకతో జీన్స్ లో వచ్చినవనీ అర్ధం అవుతుంది. స్వామి జాతకంలో శనిచంద్రుల కలయిక కన్యారాశిలో ఉండటం చూస్తే ఈ విషయం ఇంకా క్లియర్ గా అర్ధం అవుతుంది.

స్వామికి గల సాధనాబలం ఎలాటిదో కొంత వివరిస్తాను. ఆయన శ్రీ రామకృష్ణుని వద్దకు వచ్చేసరికి బహుశా 18 వ సంవత్సరం ఆయనకు నడుస్తున్నది. శ్రీ రామకృష్ణుల శిష్యరికంలో నాలుగేళ్ళు గడిచేసరికి తన 23 ఏట ఆయన నిర్వికల్పసమాధిని పొందగలిగాడు. సాధనామార్గంలో ఆ స్తితి అత్యున్నతం అయినది. మహర్షులు ఈ స్తితికోసమే ప్రయత్నిస్తారు. మామూలు మనుషులకు ఈస్తితి ఊహక్కూడా అందదు. ఈ స్తితి పొందాలంటే సాధకులైన వారికే ఎన్నో జన్మలు పడుతుంది. అటువంటి స్తితిని స్వామి నాలుగేళ్ళలో అందుకోగలిగాడు. ఇందులో వింతేమీ లేదు. అంతటి వివేకవైరాగ్యమూర్తికి అలాంటి స్తితి అందటంలో వింత ఏముంది? దానికి తగినట్లే స్వామి జాతకంలో శని చంద్రులు, గురువు, రాహు కుజులూ, బుధ శుక్రులూ, రవీ అందరూ ఇదే కోణాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు.

మహనీయుల జీవితాలలో మనకు ఒక విశేషం గోచరిస్తుంది. మొదటగా వారి వ్యక్తిగతసాధన సమాప్తి చేసుకుంటారు. వారు చేరవలసిన పరమగమ్యాన్ని చేరేవరకూ ఏకాగ్రమనస్సుతో ప్రయత్నిస్తారు. తరువాత లోకానికి మేలు చెయ్యాలని చూస్తారు. ఈ క్రమంలో వారు చెయ్యగలిగినంత చేసిన తర్వాత ఇక నిష్క్రమిస్తారు. కాని నేటి దొంగస్వాములను చూస్తె ఇంకొక విషయం అర్ధం అవుతుంది. వీరి సాధన ఇంకా పూర్తి కాలేదు. ఏవో సాధనలుచేసి కొన్ని శక్తులు సాధిస్తారు. వాటిని అడ్డు పెట్టుకొని ఇక శిష్యగణాన్ని పోగేసుకోవడం, సంస్థలు పెట్టటం,భజనబృందాన్ని చుట్టూ చేర్చుకోవడం చేస్తుంటారు. క్రమేణా తేరగా వచ్చిన డబ్బుతో విలాసజీవితం అలవాటు అవుతుంది. వారి చుట్టూ కోటరీ ఏర్పడుతుంది.రాజకీయనాయకులతో సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయాలు మొదలౌతాయి. ఏతావాతా గురువూ శిష్యులూ మొత్తంగా భ్రష్టుపట్టి చివరికి అందరూ కలిసి మురికిగుంటలో పడతారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే తెలీని మనుషులు వీరిని నమ్మి మోసపోతుంటారు. చాలామంది నేటి స్వామీజీల విషయంలో జరిగింది జరుగుతున్నదీ అదే. 

23  ఏళ్ళ వయసులో స్వామి ఈ లోకానికి వచ్చిన పని పూర్తయింది. తానెవరో తనకు తెలిసింది. తన లోకమేమిటో తెలిసింది. తానిక్కడ ఒక యాత్రికుణ్ణి మాత్రమె అనీ, తన స్వస్థానం ఇది కాదనీ ఆయనకు స్పష్టంగా కనిపించింది. ఇక ఆయన జీవించవలసిన పనిలేదు.శరీరాన్ని యోగసమాధిలో విడిచిపెట్టి తన ధామానికి తాను వెళ్లిపోవచ్చు. కాని గురుదేవుల ఆజ్ఞ వేరుగా ఉంది. 

మహర్షులకు పుట్టిల్లు, వేదవేదాంత యోగాది మహత్తర జ్ఞానసంపదకు  నెలవూ  అయిన భరతభూమిలో చీకటి ఆవరించి ఉన్న సమయం అది. సంస్కృతీ సంస్కారాలు అంటే తెలియని తురకల పరాయిపాలనలో వెయ్యేళ్ళు మగ్గింది భరతమాత. దానికి కారణాలు -- పాలకుల అనైక్యత, హ్రస్వ దృష్టి, స్వార్ధం, విలాసాల పైని మోజులు. ఆ కాలంలో మనదేశం తనదైన ఆధ్యాత్మిక ధార్మికసంపదను అంతా పోగొట్టుకుంది. తర్వాతి రెండువందలఏళ్లు భౌతిక సంపదను తెల్లవాళ్ళు కొల్లగొడుతున్నారు. వెరసి అన్ని రకాలుగా భ్రష్టుపట్టి అతిదీనావస్తలో ఉంది భారతదేశం. ఇలాంటి స్తితిలో ఉన్న తమదేశాన్ని చూచి ఏడుస్తున్న ఎందఱో దేశభక్తుల హృదయాక్రందన భగవంతుని చెవికి చేరింది. ఆయన సంకల్పం ప్రాణం పోసుకుంది. భరతమాత తిరిగి తన పూర్వవైభవాన్ని పొందాలి. భౌతికంగా ఆధ్యాత్మికంగా తన పూర్వతేజస్సును తిరిగి పొందాలి. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన ఋషులు మళ్ళీ భరత భూమిలో పుట్టాలి. జ్ఞానజ్యోతుల్ని మానవుల గుండెల్లో వెలిగించాలి. భారతదేశ పునర్వైభవం ఆధ్యాత్మికసౌధం పైనే స్థాపన కావాలి.వేలాది దేశభక్తుల ప్రార్ధనలను భగవంతుడు ఆలకించాడు.సప్తఋషి మండలంలో జ్ఞానజ్యోతులుగా ప్రకాశిస్తున్న మహర్షులలో ఒక మహర్షిని ఈ పనికోసం భూమికి పంపాడు. అంతే కాదు. భారత దేశపు ఆధ్యాత్మిక చీకటిని పారద్రోలడానికి తానూ భూమికి వెళుతున్నాననీ తనతో వచ్చి ఆ పనిలో సాయం చెయ్యమని ఆదేశించాడు. అలావచ్చిన జ్ఞానస్వరూపుడైనమహర్షే వివేకానందస్వామి.

స్వామి శ్రీ రామకృష్ణుని శిష్యరికంలో ఉన్నపుడు ఒకసారి ఈ సంఘటన జరిగింది. శ్రీ రామకృష్ణులు ఇలా ప్రశ్నించారు. "నరేన్ !! నీ అత్యున్నత ఆదర్శం ఏమిటి? ఆధ్యాత్మికంగా నువ్వు ఏ స్థాయిని అందుకోవాలని అనుకుంటున్నావు?" దానికి నరేంద్రుడు ఇలా చెప్పాడు. " గురుదేవా. నిర్వికల్ప సమాధిలో నిరంతరం మునిగి ఉండి, వారానికో పదిరోజులకో ఒకసారి ఆ స్తితినుంచి క్రిందకు వచ్చి కొంచం ఆహారం తీసుకుని మళ్ళీ అగాధ ఆనందమయ ధ్యానసమాధిలో మునగాలని నా కోరిక." దానికి శ్రీ రామకృష్ణులు నరెంద్రునితో ఇలా అన్నారు. " ఇదా నీ కోరిక!! ఇంతకంటే ఉన్నతస్తితులు మరెన్నో ఉన్నాయని గ్రహించు. నీ ఆనందాన్ని నీవు చూచుకోవడం కాదు.ఇతరులకు నీడనిచ్చే ఒక మహావటవృక్షంలా నువ్వు ఉండాలి."హే భగవాన్ !ఈ సర్వం నీవే"అని నీవే కదా పాడతావు". ధ్యానంలో ఉన్నప్పుడేకాకుండా, ధ్యానంలో లేనప్పుడుకూడా సమస్తచరాచరజగత్తునూ సమస్తజీవరాసులనూ భగవన్మయంగా దర్శిస్తూ ఉండే ఉత్తమసమాధిస్తితిని గమ్యంగా పెట్టుకొమ్మని నరెంద్రునికి శ్రీరామకృష్ణులు సూచించారు.జాగ్రదావస్థలో ఉంటూ కూడా సమాధిస్థితిలో నిరంతరమూ  నిలిచిఉండే సహజ సమాధిస్తితిని  పొందమని శ్రీరామకృష్ణులు నరెంద్రునికి సూచించారు. అంతేకాదు ఆయనింకా ఇలా అన్నారు. " మంచిది. ప్రస్తుతానికి ఇదే భావాన్ని నిలుపుకో. నీవు చెయ్యవలసిన పని ఈ లోకంలో మిగిలిఉంది. దానిని పూర్తిచేసిన అనంతరం నీవు కోరుకుంటున్న స్థితికంటే ఉత్తమస్తితిని నీకు ఇస్తాను". వివేకానందస్వామి చివరి రోజులలో అటువంటి అద్భుతమైనస్తితిని అందుకున్నాడని మనం ఆయన జీవితాన్ని చదివితే గమనించవచ్చు.

తాను పూర్తిచెయ్యవలసిన పనికోసం తన సమాధ్యనుభావాన్ని వివేకానందస్వామి ఒకపక్కన ఉంచాడు.తాను జ్ఞానసిద్ధిని పొందాడు.ఇంద్రియాతీత పరబ్రహ్మానుభూతిని అందుకున్నాడు. బాగానే ఉంది. కాని, తాను వచ్చినపని పూర్తి చేయ్యనిదే ముందుకు వెళ్ళడానికి వీలులేదు. ఆపని ఎలా చెయ్యాలో తెలియదు. ఎలా ముందడుగు వెయ్యాలో తెలియదు. చుట్టూ కటికచీకటి అలముకొని ఉంది. తానయితే జ్ఞానాన్ని పొందాడు. మానవ జన్మకు సార్ధకత కలిగించే గమ్యాన్ని చేరాడు. దీనిని ఇతరులకు ఎలా చెప్పాలి? భరతజాతికి తన ప్రాచీనవైభవాన్నీ ఔన్నత్యాన్నీ ఎలా గుర్తు చెయ్యాలి? పరాయి పాలనలో మగ్గుతున్న బానిసజాతికి జవజీవాలను ఎలా అందించాలి? దేశంలో నిజమైన ఆధ్యాత్మికజ్యోతులను ఎలా వెలిగించాలి? అన్న తపనతో ఆయన నిద్రలేని రాత్రులు గడిపాడు. శరణాగత భావంతో గురుదేవులను ప్రార్ధించాడు. అజేయమైన భగవత్సంకల్పం ఆయన్ను ముందుకు నడిపింది. ముందుగా సామాన్య జనజీవితంలో ఉన్న దుర్భరమైన బాధలని స్వయానా ఆయన చూడటం కోసం ఆయన్ను మన దేశం నలుమూలలా తిప్పింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారివరకూ పయనించి దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న పరిస్తితులను ఆయన కళ్ళారా చూచాడు.అప్పట్లో భాషాప్రయుక్త రాష్ట్రాలు లేవు. రాజుల జమీందారుల పాలనలో ఉన్న చిన్నచిన్న ముక్కలు మాత్రమే ఉండేవి. వాటన్నిటిలో స్వామి సంచరించాడు. అనేక చోట్ల మహారాజుల సత్కారాలను అందుకున్నాడు. అనేకచోట్ల ఎదురైన చీదరింపులనూ సమభావంతో స్వీకరించాడు. చివరికి ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ఉద్దరించడం కష్టం అని ఆయనకు అర్ధం అయింది.  బానిసజాతిని మేల్కొలపాలంటే వారి ప్రభువుల మన్ననను  ముందుగా పొందాలి.

కన్యాకుమారిలో సముద్రమధ్యంలో ఉన్న రాతికొండమీద మూడురోజులు ధ్యానసమాధిలో గడిపిన స్వామికి తాను చెయ్యవలసిన పని అర్ధం అయింది. జగజ్జనని ఆదేశం ఆయనకు గోచరించింది. గురుదేవుల దర్శనమూ అయింది. సముద్రం మీదుగా నడుస్తూ కనిపించిన శ్రీ రామకృష్ణులు, తనను అనుసరించి పాశ్చాత్య భూములకు రమ్మని చెప్పినట్లు కలిగిన దర్శనం ఆయనకు భవిష్య కార్యాచరణను సూచిందింది.అప్పుడే చికాగోలో సర్వమత మహాసభ జరుగబోతున్నది.అక్కడికి వెళ్లి వేదాంతజ్యోతిని వారికి చూపించాలని స్వామి అనుకున్నాడు. కాని దారి లేదు. చేతిలో డబ్బు లేదు. ఎలా అక్కడికి చేరాలో తెలియదు.దేవుడు తప్ప ఎవరూ తనకు దిక్కులేరు. దైవబలం తప్ప ఏఇతర బలమూ లేదు. భగవదనుగ్రహంతో క్రమేణా సర్వం సాధ్యం అయ్యాయి. ఆ విధంగా అమెరికా చేరిన స్వామి అక్కడకూడా ఎన్నో బాధలు పడుతూ, చివరికి చికాగోలోని సర్వమత మహాసభలో ఇచ్చిన అపూర్వప్రసంగంతో ఒక్కసారిగా ప్రపంచదృష్టిని ఆకర్షించాడు. స్వామిని ప్రపంచం ఆరాధించడం ఆ రోజుతో మొదలైంది.

ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తాను. స్వామి భరతదేశంలో సంచరించిన రోజులలో అనేకబాధలు పడ్డాడు. తినడానికి తిండి లేక అనేకరోజులు పస్తులున్నాడు. ఈ "పుణ్యభూమి"లో ఆయనకు ఒక ముద్ద పెట్టినవాళ్ళు లేరు. అనేకసార్లు వారం రోజులవరకూ తినడానికి తిండి దొరకక నీళ్ళు తాగి ఉండేవాడు. కాని పస్తులుండటం నిజమైన బాధ కాదు. తనకు తిండి లేనందుకు ఆయన బాధపడలేదు.తన దేశపుప్రజల భౌతిక ఆధ్యాత్మిక దుస్తితిని చూచి ఆయన బాధపడేవాడు. తన దేశప్రజల పేదరికాన్నీ, ఆధ్యాత్మిక భావదారిద్యాన్నీ చూచి ఆయన దుఖించేవాడు. ఒకప్పుడు ఉజ్జ్వలజ్ఞానతేజస్సుతో వెలిగిన తనదేశం ఇప్పుడు ఇలా ఉన్నందుకు మౌనంగా విలపించేవాడు. ఆ జ్ఞానజ్యోతులను మళ్ళీ వెలిగించమని భగవంతుని ప్రార్ధించేవాడు. కాని చాలా చోట్ల తన దేశస్తుల అజ్ఞానంవల్ల ఆయన వారినుంచే నిరాదరణనూ తిరస్కారాన్నీ అందుకున్నాడు.

అలా స్వామి భారతదేశంలో సంచరిస్తున్న కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆయన పొందిన అవమానాలకు ఈ సంఘటన అద్దం పడుతుంది. స్వామి కేరళలో సంచారం చేస్తున్నాడు. అక్కడ పాలఘాట్ సమీపంలోని కొడుంగల్లూర్ భగవతీఆలయానికి ఆయన వెళ్ళాడు. అక్కడి అమ్మవారిని కొడుంగల్లూర్ మహారాజులు ఎప్పటినుంచో ఆరాధించేవారు. ప్రాచీన కాలపు అమ్మవారి ఆలయం అది. అక్కడి పూజారులు స్వామియొక్క  బికారి అవతారాన్ని, చినిగిన బట్టల్నీ గడ్డాన్నీ చూచి అసలు ఇతను హిందువో కాదో అని అనుమానించి ఆలయంలోనికి రానివ్వలేదు. స్వామి వారితో ఏమీ వాదించకుండా, మౌనంగా ఆమ్మవారి ఆలయం ఎదురుగా ఒక ప్రదేశంలో కూర్చొని మూడుగంటలపాటు నిశ్చలధ్యానసమాధిలో ఉండిపోయాడు. తరువాత లేచి ఆలయం బయటినుంచే అమ్మకు ప్రశాంతంగా ప్రణమిల్లి  తనదారిన తాను మౌనంగా వెళ్లిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత చికాగోలో స్వామి పొందిన విజయాన్ని పేపర్లలో చదివి, ఆయన ఫోటోను చూచి, గుర్తుపట్టిన అదే ఆలయపూజారులు ఆశ్చర్యచకితులై, "ఈ మహనీయుడినా తాము నిరాదరించింది" అని తీవ్ర పశ్చాత్తాపానికి గురైనారు.ఇటువంటి నిరాదరణను ఆయన మనదేశంలో ఎన్నోచోట్ల ఎదుర్కొన్నాడు. ఒక్కసారి విదేశాలలో విజయం సాధించిన స్వామిని ఇదే భారతీయులు నెత్తిన పెట్టుకుని పూజించారు. బానిస మనస్తత్వం అంటే ఇదే మరి.

(మిగతా తర్వాతి భాగంలో)    
read more " భరతమాత ముద్దుబిడ్డ వివేకానందస్వామి "

8, జనవరి 2012, ఆదివారం

విజయవాడ బుక్ ఎక్జిబిషన్ విశేషాలు

ఎప్పటిలాగే జనవరి ఒకటినుంచి విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలైంది. వెళదాం వెళదాం అనుకుంటూ నిన్నటికి కుదిరింది. "నవ్వులాట" శ్రీకాంత్, "హోరాసర్వం" సోమశేఖర్, వీరుభోట్లవెంకటగణేష్, మదన్, మాధవ్, సత్యా, నేనూ పుస్తక ప్రదర్శనలో కలిశాము. ఒక నాలుగుగంటలపాటు సరదాగా మాట్లాడుకుంటూ గ్రౌండ్ లో తిరుగుతూ కాలక్షేపం చేశాము.

"నవ్వులాట" శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సరదాగా మాట్లాడతాడు. కాకపోతే ఆయన ఒకటాపిక్ మొదలుపెట్టాడంటే దానిని ఆపడం ఎవరితరమూ కాదు. మనం శ్రోతల్లా వింటూ ఉండాల్సిందే.ఇక సోమశేఖర్ "horasarvam" బ్లాగు వ్రాస్తుంటాడు. భారతీయజ్యోతిష్యం మీద మంచిపట్టు ఇద్దరికీ ఉంది. శ్రీకాంత్ తనకున్న బహుముఖప్రజ్ఞను తన బ్లాగులో ఎక్కడా బయట పడనివ్వడు. కాని ఆయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు.చాలావిషయాలమీదఅనర్గళంగా మాట్లాడగలడు. మహా ఓపిక.

సోమశేఖర్ వృత్తిరీత్యా ఆడిటర్ అయినప్పటికీ, ప్రవృత్తి రీత్యా జ్యోతిష్కుడు. నిత్యపరిశోధకుడు. తన పరిశోధనలో కొన్ని కొత్తసూత్రాలు కనుక్కున్నాడు. తాజక సహమాలను ఉపయోగించడంలో దిట్ట. జాతకంలో రాహుకేతువుల యొక్క పాత్రమీద, గెలాక్టిక్ సెంటర్ యొక్క పాత్రమీదా కొన్ని మంచిసూత్రాలు తనపరిశోధనలో రాబట్టాడు. అష్టకవర్గసిద్దాంతం ఆధారంగా జాతకాన్ని ఎక్కువగా విశ్లేషిస్తాడు. గ్రహాల షడ్బలాలు మొదలైన విషయాలలో పరిశోధన చేస్తున్నాడు.

వెంకటగణేష్ చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుబ్లాగర్లకు సుపరిచితుడు. నా బ్లాగుకు నిత్య సందర్శకుడు. పంచవటి గ్రూపు సభ్యుడు. మొదటినుంచీ నాకు మంచిమిత్రుడు. మంచివ్యక్తిత్వంతో బాటు, విషయాలమీద ఆసక్తి మెండు. చర్చల్లో ఎక్కువగా పాల్గొనకపోయినా శ్రద్దగా వింటూ ఉంటాడు.

మదన్ ప్రభుత్వోద్యోగి. ఆధ్యాత్మిక విషయాలమీద అమితమైన ఆసక్తి ఉన్నవాడు. నిరంతరం పుస్తకాలు బాగా చదువుతాడు. మంచి ఆలోచనాపరుడు. మాట్లాడేది తక్కువే కాని మాట్లాడిన ఒక్కమాటా చాలాలోతుగా ఉంటుంది. మాధవ్, సత్యా, ఇద్దరూ త్వరలో చెన్నై టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గా చేరబోతున్నారు.

అన్ని స్టాల్స్ తిరుగుతూ "కినిగే" వారి స్టాల్ కూడా దర్శించాము.అట్లూరి అనిల్ గారు కనిపిస్తే వారితో కొంచంసేపు మాట్లాడాము.అక్కడ రహ్మానుద్దీన్ షేక్ అనే బ్లాగర్ కలిశారు. "బ్లాగులెలా వ్రాయాలి?" అని అతనూ  సుజాతగారూ కలిసి వ్రాసిన పుస్తకం చూపించారు. నవ్వొచ్చింది. షాపులు తిరిగి ఎవరికి కావలసిన పుస్తకాలు వారు కొనుక్కున్న తర్వాత ఒకచోట కూర్చుని ఇక చర్చ మొదలుపెట్టాం. జ్యోతిష్యానికి ఉన్న పరిమితులు, తాజకవిధానం, జ్యోతిష్యంలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అసలెందుకు, జాతకంప్రకారం ఏరత్నాన్ని ధరించాలి అని ఎలా చెప్పగలం, స్వామీజీలు వాళ్ళ మోసాలు, ఇలా చాలా టాపిక్స్ దొర్లాయి. శ్రీకాంతూ సోమశేఖరూ మంచి స్నేహితులు, కాని సబ్జెక్టులో మంచి ప్రత్యర్ధులు కూడా. వారి వాదన వింటుంటే మహాముచ్చటగా ఉంటుంది. జ్యోతిష్యంలో కొన్ని మౌలికసమస్యల గురించి వాదన నడిచింది. ఎవరి వాదనలు వారు చాలాలాజికల్ గా సమర్ధవంతంగా వినిపించారు. అంతావిని 'వాదనలో గెలిచినవారు మాకందరికీ మైసూరు బజ్జీలు ఇప్పించాలి' అని నేను చెప్పాను. "అమ్మో అలా అయితే నేను ఓడిపోతాను"-- అని శ్రీకాంత్ అన్నాడు. "బ్రాహ్మల చర్చలన్నీ ఇదుగో ఇలా ఉంటాయి" అని నేను సరదాగా కామెంట్ చేసాను. 'మైసూరుబజ్జీలు నవనవలాడుతూ కనిపించడానికి వంటసోడా బాగా దట్టించినట్లున్నాడు. అవి తింటే వచ్చే అల్సర్ తగ్గాలంటే మైసూరువెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలేమో?' అని నవ్వుకున్నాం.

వారికి తెలిసిన ఒక స్వామీజీ ఒక మధ్యాన్నంపూట ఉన్నట్టుండి అలిగి కూచున్నాడుట. ఆయన బాలాత్రిపురసుందరి అమ్మవారి అవతారం అని వారి నమ్మకమట. అప్పటికప్పుడు తనకు నగలు కావాలని అలిగి కూచుంటే, భక్తులందరూ డబ్బులు వేసుకుని ఎనిమిదో తొమ్మిదో లక్షలు పోగేసి అప్పటికప్పుడు ఆయనకీ నగలు చేయించారుట. ఈ సంగతి సోమశేఖర్ చెప్పాడు. "ఇంకానయం. ఆయన మధ్యాన్నం పూట కోరిన కోరికల సమయంలో మీవాళ్ళు వున్నారు. కనుక వాటిని తీర్చగలిగారు. ఆయన రాత్రిపూట కోరే కోరికలు వింటే తీర్చలేక చచ్చేవారు.ఇప్పటికిప్పుడు శివుణ్ణి తీసుకురమ్మంటే ఎక్కణ్ణించి తెచ్చేవారు?"-- అని నేనన్నాను. వారి నమ్మకానికి స్వామీజీ పెట్టిన ప్రైస్ టేగ్ అది. ఇలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసాము.

మొన్న ఆరోతేదీ సాయంత్రం చంద్రకేతువుల డిగ్రీ సంయోగం వృషభరాశిలో జరిగింది.వివిధలగ్నాలమీద దాని ప్రభావాన్ని గురించి కాసేపు మాట్లాడుకున్నాం.సోమశేఖర్ లగ్నం సింహం అని నాకు గుర్తుంది.కనుక తన దశమ స్థానంలో జరిగిన ఈయుతివల్ల తనకు వృత్తిపరంగా ఏదోఒక హటాత్ సంఘటన ఆరోజున జరిగి ఉండాలి. అదేవిషయం అడిగితే అవును జరిగింది అని సోమశేఖర్ చెప్పాడు.అదే గ్రహయుతి శ్రీకాంత్ కు ద్వాదశంలో జరిగింది. చంద్రుడు రెండోఅధిపతి గనుక ఏదైనా అనుకోనివాదన ఎవరితోనైనా జరిగి ఉండాలి. లేదా ఏదైనానష్టం జరిగిఉండాలి.ఇదే విషయం తనను అడిగితే, నిన్న జరుగలేదుగాని ఈరోజు ఒక సంఘటన జరిగింది అని చెప్పాడు.నాకు వృషభం పంచమం అవుతుంది. కనుక ఒక మంచిమిత్రునితో ఆరోజు అనుకోకుండా ఒకఅపార్ధమూ చిన్నపాటి ఘర్షణా జరిగాయి. నావైపునుంచి నేను ప్రశాంతంగానే ఉన్నాను.తనవైపు నుంచి కొంత సంఘర్షణ కలిగింది. మాధవ్ ది మేషలగ్నం. కనుక గృహసంబంధ విషయాలలో ఏదోఒక హటాత్ వాగ్వాదం ఆరోజున జరిగి ఉండాలి. ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైర్ మిషన్ సర్వీసువాడు ఎన్నిసార్లు కంప్లెయింట్ ఇచ్చినా రాకపోతుంటే అదేరోజున వాళ్ళ ఆఫీసుకెళ్ళి అరిచి తిట్టి మరీవచ్చాడు.ఇక్కడ చంద్రుడు చతుర్దాధిపతిగా రెండింట కేతుగ్రస్తుడయ్యాడు.కనుక అతనికి అలా జరిగింది. ఇంకొక వ్యక్తిది తులా లగ్నం, తనపనిలో ఆరోజున చాలా అలసట ఫీలయ్యే పరిస్తితి అనుకోకుండా ఎదురైంది. చంద్రుడు దశమాదిపతి అష్టమంలో కేతుయుతిలో ఉంటూ విసుగునూ చికాకునూ సూచిస్తున్నాడు.కనుక తనకు అలా జరిగింది.ఈవిధంగా  గ్రహప్రభావం ఖచ్చితంగా మనుషులమీద ఉండి తీరుతుంది. ఏరోజున అది జరుగుతుందో కూడా చెప్పవచ్చు.

ఇలాటి చర్చలు జరుగుతూ ఉండగా, అమెరికానుంచి విష్ణుభొట్ల రామన్నగారు ఫోన్ చేసారు. ఈరోజున నేను పుస్తకప్రదర్శనకు వస్తున్నానని పంచవటి గ్రూప్ లో ముందే వ్రాశాను గనుక, అదేసమయానికి ఆయన గుర్తుంచుకొని మరీ అమెరికానుంచి ఫోన్ చేసారు. నేనూ శ్రీకాంతూ ఆయనతో మాట్లాడాము. అంతదూరంనుంచి గుర్తుంచుకొని మరీ ఫోన్ చేసిన ఆయన స్నేహశీలతకు చాలా సంతోషం కలిగింది.

మన జ్యోతిష్య గ్రంధాలలో అనేకరహస్యాలు  కలగాపులగంగా ఉన్నాయి.అది ఒక స్టోర్ రూం లాగా ఉంది.అందులో ఉన్న వస్తువులు ఎలా ఉపయోగపడుతాయో ఎవరూ చెప్పరు.అన్ని వస్తువులూ అక్కడ ఉంటాయి.అలా విడమర్చి చెప్పే సూత్రాలూ పద్దతులూ ప్రస్తుతం నశించాయి. కనుక ఎవరి వ్యక్తిగత స్టైల్ వారు తయారు చేసుకోవాలి. ఎక్కువగా వర్క్ అవుట్ అయిన సూత్రాలను పట్టుకొని వాటిని వాడుకుంటూ మరింత పరిశోధనచేస్తూ ముందుకు సాగాలి.జ్యోతిష్యం యొక్క పరిశోధన అంతా స్థూలంనుంచి సూక్ష్మానికి సాగుతుంది. ఒక సంఘటన ఖచ్చితంగా ఫలానారోజున జరుగుతుంది అని చెప్పగలిగే నైపుణ్యతను జ్యోతిష్కుడు సాధించాలి. పరాశరులు దీనికోసం షడ్బలాలను,వర్గ చక్రాలను,దశలను వాడారు. జైమినిమహర్షి తనదైన విధానంలో ఆత్మకారకుని,కారకాంశను,ఉపపదాన్ని,రాశి దశలను,రాశిదృష్టులను,చరదశ మొదలైన ప్రత్యెకదశలను వాడాడు. తాచకవిధానంలో వర్షచక్రాన్ని,ముంథాను, పంచవర్గీయబలాన్ని,ముద్దదశ మొదలైన ప్రత్యెకదశలను వాడారు.కృష్ణమూర్తి పద్దతిలో కృష్ణమూర్తిగారు నక్షత్రాలను తొమ్మిదిముక్కలుగా విభజించుకుంటూ పోయాడు.సబ్ కూ సబ్ సబ్ కూ, రూలింగ్ ప్లానేట్స్ కూ  ప్రాధాన్యతనిచ్చాడు. ఈవిధంగా ఎవరు ఏ విధానాన్ని ఉపయోగించినా, అంతిమలక్ష్యం మాత్రం ఖచ్చితంగా ఫలానాసంఘటన ఫలానా నిమిషానికి జరుగుతుంది అని చెప్పగలగటమే. అలా చెప్పడం సాధ్యమే.కాని ఆయా విధానాలు అనేక కారణాలవల్ల నశించాయి.వాటిని తిరిగి ఉద్ధరించడం సాధ్యమే అని మనకున్న స్వల్పజ్ఞానంతో మనకు అర్ధమౌతుంది.ఆ దిశగా రీసెర్చి సాగాలి.ఈక్రమంలో ఎవరి వ్యక్తిగత స్టైల్ వారికి ఏర్పడుతుంది.ఈ విధంగా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక సెలవు తీసుకుని ఎవరిదారిన వాళ్ళు తిరుగు ప్రయాణం కట్టాము.

పుస్తకప్రదర్శనలలో మనకు కనిపించిన ప్రతిపుస్తకాన్నీ కొనకూడదు. మనకు నిజంగా అవసరమైన పుస్తకాలు ఎక్కడో ఒక స్టాల్లో దాక్కొని ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవాలి. శ్రీకాంత్ ఒక మంచి పుస్తకాన్ని అలావెతికి మరీ పట్టుకున్నాడు. స్వామిని శారదాప్రియానందగారు  "స్త్రీలు - వైదికనియమాల" గురించి వ్రాసిన ఒక మంచి పుస్తకం అది. హైదరాబాద్ సంస్కృత సమితి వాళ్ళు వేసిన విద్యారణ్యుల "వేదాంత పంచదశి" కూడా మాకు కనిపించిన మంచి పుస్తకాలలో ఒకటి. పదిహేనో శతాబ్దంలో డుండిరాజు వ్రాసిన 'జాతకాభరణం' ఇంకొక మంచిపుస్తకం.దీన్ని గొల్లపూడి వీరాస్వామి వారు వేశారు. సేనాపతిగారు 'హస్తసాముద్రికం' మీద వ్రాసిన పుస్తకమూ బాగుంది. అభినవగుప్తుని తెలుగుప్రజలకు పరిచయం చేసిన దేవరకొండ శేషగిరిరావుగారు 'కంచి పరమాచార్యుల ప్రసంగాల'మీద వ్రాసిన పుస్తకాలూ అద్భుతంగా ఉన్నాయి.  శ్రీకాంత్ కు చాలామంది పబ్లిషర్స్ తెలుసు. వారు వేసిన, వేస్తున్న పుస్తకాలగురించి చాలా విషయాలు చెప్పగలడు. 

తిరుగుప్రయాణంలో రైల్లో వస్తున్నపుడు న్యూస్ పేపర్ చూస్తుంటే, ఒక విషయం కనిపించింది.ఎవరో వెంకాయమ్మ అనే గుంటూరుజిల్లా మనిషి శిలువ వేయించుకుందట. అలా వేయించుకోమని జోసెఫ్ తంబి అనేవాడు స్టౌ మంటల్లో కనిపించి చెప్పాట్ట.అదంతా చదివితే ఒళ్లంతా కంపరం పుట్టింది.మనిషి అజ్ఞానంలో ఏ స్థాయికి దిగజారిపోతున్నాడో అర్ధం కాలేదు.కొత్తగా మతం మారినవాళ్ళకు మహాపిచ్చి ఉంటుంది.వాళ్ళే ఇలా ప్రవర్తిస్తారు. వాడెవడో కనిపించి శిలువ వేయించుకోమని చెప్పడమేంటో, ఆమె రెడీ కావడమేంటో, కొంతమంది ఆమెను పడుకోబెట్టి చేతులకు మేకులు కొట్టటం ఏంటో, ఇదంతా చదువుతుంటే వీళ్ళసలు మానవజన్మకు అర్హులేనా అనిపించింది.పిచ్చి అనేక రకాలు.వాటిలో మతపిచ్చి మరీ భయంకరమైనది.అసలైన హిందూమతాన్ని సామాన్యజనానికి విడమర్చి చెప్పి వారిచేత ఆచరింప చెయ్యలేకపోతున్నందుకే ఇలాటివాళ్ళు ఎంతోమంది ఇతరమతాలలోకి మారిపోతున్నారు.తిక్క తిక్క పనులు చేస్తున్నారు.

ఇలాటివాళ్ళు ప్రస్తుత హిందూమతంలో కూడా ఉన్నారు. అయ్యప్ప సీజన్లో వాళ్ళు చేసే గోలకూడా ఇలాటిదే. కేరళలో ఎవరైనా అయ్యప్పదీక్ష తీసుకుంటే పక్కింట్లోవాళ్లకుకూడా వారుచేసే పూజ గురించి తెలీదు.మన ఆంధ్రాలో మాత్రం ఆ ఊరి ఊరంతటికీ వీళ్ళుచేసే భజనలు వినిపించాలి. అదొక ఈగో శాటిస్ఫేక్షన్. రాక్షసులలాగా అర్ధరాత్రి సమయంలోపూజలు, అర్ధరాత్రి పిశాచభోజనాలు,అయ్యప్పో అయ్యప్పో అంటూ అరుపులు పొలికేకలు, అసలు వీళ్ళు మనుషులో కొరివిదెయ్యాలో అర్ధంకాదు.ఇదేం పిచ్చో అర్ధం కాదు.లోకంలో ఎక్కడ ఏజాడ్యం పుట్టినా దాన్ని అంటిన్చుకోడంలో తెలుగువాడు ముందుంటాడు. 

"మతం మత్తుమందు" అని మార్క్స్ అన్నది నిజమే అని చాలాసార్లు అనిపిస్తుంది. గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగే విదేశీమతాలను చూచి మార్క్స్ ఆ మాట అన్నాడంటే, ఇక సంతలో కొలుపుల మాదిరిగా నేలబారుగోలతో సాగే ఇలాటి దీక్షలను చూస్తే ఇంకేమాట అనేవాడో?

నేనిలా అంటే కొందరు హిందూసోదరులకు నచ్చదు. వారిలా అంటారు. "ఇలాటి దీక్షలవల్లే ఏదోరకంగా మన మతం కనీసం బతికిఉంది. అయ్యప్ప దీక్షలవల్లే హిందూమతం బతికి బట్టకడుతోంది. లేకపోతే వీళ్ళందరూ ఎప్పుడో క్రైస్తవంలోకి మారి ఉండేవారు".అంటారు. ఇలాటి పనికిమాలిన బట్టలు కట్టుకోకపోతే నష్టం ఏమీ లేదని  నేనంటాను. శుభ్రంగా మంచిబట్టలు కట్టుకోవాలిగాని ఇలాటి బికినీలు వేసుకొని ఉపయోగం ఏముంది? తుమ్మితే ఊడే ముక్కు ఎప్పుడో ఒకసారి ఊడకతప్పదు. చవకబారుదీక్షలు చేస్తూ అదే అసలైన హిందూమతం అన్న పిచ్చిలో ఉన్న మనుషుల్ని హిందూమతంలో ఉంచడానికి ఇలాటి దీక్షలు ప్రోమోట్ చెయ్యాల్సిన అవసరం ఏమాత్రం లేదని నా భావన. క్రమేణా ఇలా దిగజారబట్టే ప్రస్తుతం మన హిందూమతం యొక్క మౌలికస్వరూపం ఎవరికీ తెలీకుండా పోయినంత అజ్ఞానంలో మనంఉన్నాం. పిచ్చిపిచ్చి దీక్షలను ప్రోమోట్ చెయ్యడం కాదు మనం చెయ్యాల్సింది. హిందూమతం యొక్క నిజమైన సిద్ధాంతాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగాలి.  ఇటువంటి పిచ్చిదీక్షలవల్ల అదెప్పటికీ జరగదు.

శిలువేయించుకున్న వెంకాయమ్మ బ్రతికింది గనుక సరిపోయింది. లేకుంటే అక్కడొక చర్చి కట్టి, ప్రతేడాదీ ఆరోజున అందరూ శిలువలమీద పడుకొని మేకులు కొట్టించుకునే దీక్షలు మొదలుపెట్టి ఉండేవారు. చిన్న పిల్లల్ని వీళ్ళే పడుకోబెట్టి మరీ మేకులు కొట్టేవారు. ఇటువంటి మనుషులకంటే జంతువులు నయం. అసలు మనదేశంలో ఇతరులకు అసౌకర్యం కలిగించే మత సంబంధమైన సామూహిక తంతులన్నింటినీ నిషేధించాలి అని నా భావన. మతం వ్యక్తిగతం. అది సైలెంట్ గా తనకూ దేవునికీ మధ్యన ఉన్న వ్యవహారం. దాని బజార్న పెట్టి, మైకులు పెట్టి, గోలగోల చేసే ప్రతితంతునూ నిషేధించాలి.దానితో బోలెడంత శబ్దకాలుష్యమూ భావకాలుష్యమూ లేకుండా పోతుంది. మనుషుల్లో కొంచం మానవత్వమూ, వివేచనా అయినా పెరుగుతాయి.

హిందూమతంలో గాని, ఇతరమతాలలోగాని అలాటి మంచిమార్పు మన చెత్తసమాజంలో ఇప్పట్లో వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. 
read more " విజయవాడ బుక్ ఎక్జిబిషన్ విశేషాలు "

7, జనవరి 2012, శనివారం

హోమియో విజ్ఞానవిశిష్టత

హోమియోపతి చాలా గొప్ప సైన్స్. కాని నేటికీ దీనిని క్వాకరీ అనుకునే అజ్ఞాన దేశాలు అనేకం ఉన్నాయి. అలాగే ఇదసలు వైద్యమే కాదు అనుకునే బుర్రతక్కువమనుషులూ బోలెడంతమంది ఉన్నారు. అణురహస్యాలతో ఆటలాడుకునే శాస్త్రవేత్త,పొలందున్నుకునే పల్లెటూరిబైతుకు పిచ్చివాడిలాగే కనిపిస్తాడు. అలాగే, అర్ధం చేసుకోలేనివారికి హోమియోపతి అసలు వైద్యంలా కనిపించదు. అలాటివారు దానియొక్క ఆశ్చర్యం గొలిపే క్యూర్స్ చూచినపుడే దానిని నమ్మగలుగుతారు.

మామూలు ఇంగ్లీష్ వైద్యం చెయ్యడానికి ఎంత నేర్పు కావాలో హోమియో వైద్యంలో అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ నేర్పు కావలసి ఉంటుంది. ఇంగ్లీష్ వైద్యం ఎవరైనా చెయ్యగలరు. పల్లెటూరి RMP కూడా సిటీలో ఉన్న మల్టీ స్పెశాలిటీ ఆస్పత్రిలో వాడే మందులే ఇవ్వగలడు. కొన్ని సార్లు వారికంటే నిజాయితీగా వైద్యం చెయ్యగలడు కూడా. కానీ హోమియో వైద్యం అందరూ చెయ్యలేరు. దానికి ఎంతో పరిశీలన కావాలి. మానవ మనస్తత్వం తెలియాలి. హోమియోవిధానానికి ప్రత్యేకం అయిన "క్రానిక్ డిసీజస్"  గురించి లోతైన అవగాహన ఉండాలి.రోగిలక్షణాలూ, రోగలక్షణాలూ,మందులక్షణాలూ క్షుణ్ణంగా తెలియాలి. ఇలాటి ప్రజ్ఞ సాధించాలంటే ఒక తపస్సులా హోమియోపతీని అధ్యయనం చెయ్యాలి. ఈ విధంగా ఎవ్వరూ నేర్చుకోరు. హోమియో వైద్యులమని బోర్డ్ పెట్టుకున్న ప్రతివారూ సక్సెస్ కాలేకపోవడానికి కారణం అదే. ముందుగా హోమియో సిద్ధాంతాలలో గట్టిపట్టు సాధించాలి.తర్వాత తెలివిగా వాటిని ప్రాక్టీస్ లో అన్వయించుకోవాలి. డబ్బుకు ఆశపడి షార్ట్ కట్ మెతడ్స్ ఉపయోగించకూడదు.అప్పుడే ఆ వైద్యుడు స్థిరమైన సక్సెస్ రేటును సాధించగలడు.

మొన్న మా అమ్మాయి హోమియో మెడికల్ కాలేజీలో చేరుతోందని తెలిసి వాళ్ళ ఫ్రెండ్ నాన్న ఎగతాళి చేశాడు. ఇంకేమీ దొరకలేదా చదవడానికి? దానికంటే డెంటల్ తీసుకోక పోయావా? అని. చిన్నప్పటి నుంచీ నా దగ్గర హోమియో సిద్ధాంతాలు విని అర్ధం చేసుకున్న మా అమ్మాయి నవ్వేసి -- "మీలాటి వాళ్లకి అర్ధం కాదులే అంకుల్" అని చెప్పింది. మనుషులు ఎంత అజ్ఞానంలో బతుకుతుంటారో చూస్తె ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో అన్నీ తమకు తెలుసనుకుంటూ ఉంటారు. అదే విచిత్రం.

ఇదిలా ఉంచితే, హోమియో కాలేజీలలో కూడా పరిస్తితి అద్వాన్నంగానే ఉంది. చాలా చోట్ల థియరీ నేర్పిస్తున్నారు గాని, క్లినికల్ అనుభవం ఉండటం లేదు. వాళ్ళ అవుట్ పేషంట్ క్లినిక్కులు అన్నీ వెలవెలా బోతూ ఉంటాయి. అందుకే హోమియో వైద్య విద్యార్ధులకు క్లినికల్ అనుభవం ఉండదు. చాలామంది BHMS లు మామూలు జ్వరాన్ని ట్రీట్ చెయ్యడం చేతకాక యాంటీ బయాటిక్స్ ఇవ్వడం నాకు తెలుసు. హోమియో విధానాన్ని కనిపెట్టడానికి హన్నేమాన్ పడిన కష్టాన్ని అలాటివాళ్ళు మర్చిపోతున్నారు.

మా అమ్మాయి రూమ్మేట్ ఒకమ్మాయిని కూడా హోమియో తీసుకోవద్దని ఒక హోమియో వైద్యుడే వారించాడుట. ఇది మరీ విచిత్రంగా ఉంది. హోమియో చదివి నా జీవితం నాశనం చేసుకున్నాను. ఎందుకు దీన్లో చేరుతున్నావు? ఇంతకంటే డెంటల్ తీసుకోకపోయావా? అని అదే మాట అతను కూడా అన్నాడట. ఇలాటి వారికి ఒక విషయం చెప్తాను. హైదరాబాద్లో ఒక హోమియో వైద్యుని అప్పాయింట్ మెంట్ తీసుకోవాలంటే మూడునెలల తర్వాతే దొరుకుతుంది. ఆయన పేరు ప్రస్తావించను. చాలామందికి ఆయనెవరో తెలిసే ఉంటుంది. హోమియోపతీలో సరైన పట్టు చిక్కితే అంత డిమాండ్ ఈరోజున దానికి ఉంది. కాని అంత పట్టు చిక్కాలంటే చాలా కష్టపడి శ్రద్దగా చదవాలి. దానిలో తలపండిన వారివద్ద నేర్చుకోవాలి. బాగా ఎక్కువ కేసులు స్టడీ చేసి క్లినికల్ అనుభవం సంపాదించాలి. అప్పుడు హోమియోలో అద్భుతాలు చెయ్యవచ్చు. ఇతర విధానాలలో ఇక తగ్గవు హోప్ లెస్ అని వదిలేసిన కేసులు కూడా తగ్గించవచ్చు. అంత కష్టపడకుండా ఏదో ఆషామాషీగా చదివేసి బయటకొస్తే అంతా అయోమయమే. MD లూ  DM లూ అనవసరమైన టెస్ట్ లు చేయించి ఆ టెస్టులలోనే సాయంత్రానికి వేలూ లక్షలూ సంపాదిస్తుంటే చూచి ఇలాటివాళ్ళు తాము చదివిన చదువు శుద్ధదండగ అనుకుంటారు.కాని అదినిజం కాదు. జీవితానికి డబ్బొక్కటే పరమావధి కాదు. విలాసాలు పరమగమ్యాలూ   కావు. వాటికి అంతూ పొంతూ లేదు. నిజానికి ఒకస్థాయికి వచ్చిన తర్వాత డబ్బుతో ఏమి చెయ్యాలో అర్ధం కాదు.శాశ్వతంగా ఆనందాన్నిచ్చే ఉన్నతమైన విషయాలను  గురించి మనిషి కనీసం అప్పుడైనా ఆలోచించాలి.

డబ్బొక్కటే పరమావధి అనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే సరిపోతుంది. దానికి మెడిసిన్ చదవక్కరలేదు.సేవాభావం ఉన్నవారు మాత్రమే వైద్యవృత్తిలోకి రావాలి, మోసం లేకుండా శుద్ధంగా వైద్యం చేసే వైద్యులు సమాజంలో ఎక్కువమంది రావాలి  అనేది నా నిశ్చితాభిప్రాయం.

ఇక హోమియో కాలేజీలలో చదువుతున్న నేటితరాన్ని గురించి చూద్దాం. వీరిలో చాలామంది MBBS సీటు రాక ఏదో ఒకటి చదువుదాంలే అని అక్కడ చేరినవారే గాని హోమియోవైద్య విధానం మీద ప్రేమతో చేరినవారు ఎవరూ లేరు. అదే వీరిలో పెద్ద లోపం. ఇక అక్కడ చదువుతున్న అమ్మాయిలను చూస్తే, పరీక్షలు ఇంకో రెండునెలల్లో వచ్చినా కూడా లెక్కచెయ్యకుండా లాప్ టాప్ లలో సినిమాలు చూడటం, టాబ్లెట్ పీసీల్లో చాటింగులు చెయ్యటం చేస్తున్నారు. కొందరిని కదిలించి చూస్తే, వాళ్ళల్లో సబ్జెక్టు పెద్దగా ఏమీ వచ్చినట్లు కనపడలేదు. నాలుగోసంవత్సరం చదివేవారికి కూడా పెద్దగా సబ్జెక్ట్ లేదు. జూనియర్స్ ని రాగింగ్ చెయ్యడం, ప్రేమకబుర్లూ, అతివేషాలూ, రాత్రుళ్ళు పాటలు పెట్టుకుని డాన్సులూ మాత్రం బాగా కనిపించాయి. ఇంత అధ్వాన్నంగా చదివేవాళ్ళు రేపు బయటకొచ్చిన తర్వాత ఎలా ప్రాక్టీస్ చేస్తారో అర్ధంకాలేదు.వీళ్ళలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని మామూలు గృహిణులుగా స్థిరపడేవారే కన్పించారు. మా అమ్మాయిని కూడా మొదట్లో రాగింగ్ చేయ్యబోయారు. తనకి మార్షల్ ఆర్ట్స్ లో ట్రెయినింగ్ ఉందన్న సంగతి వారికి తెలీదుగా మరి. ప్రమాదకరమైన జాయింట్ బ్రేకింగ్ టెక్నిక్స్ తనకు టెన్త్ నుంచే నేర్పించాను.తొందరపడి నీవిద్యను వారిపైన ప్రయోగించవద్దు. మళ్ళీ ఏదన్నా జరిగితే ప్రమాదం. లో ప్రొఫైల్ లో ఏమీ తెలియనట్లు ఉండు. మరీమితిమీరితే అప్పుడుచూద్దాం అని నేనే చెప్పాను. అదృష్టవశాత్తూ దానిని ఉపయోగించవలసిన పరిస్తితి ఇంకా తలెత్తలేదు.

అద్భుతమైన హోమియోవైద్యాన్ని నేర్చుకునే అవకాశం వచ్చికూడా దానినిసక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్న ఆ విద్యార్ధులను చూచి నాకు చాలా జాలేసింది. ఏం చేస్తాం? ప్రపంచం భలే విచిత్రమైనది. ఇక్కడ ఒక దానికోసం వెతికేవారికి అది దొరకదు. తేరగా దొరికినవారికి దాని విలువ తెలీదు. ఉపయోగించుకోవడమూ తెలీదు. ఒక విషయాన్ని ఔపోశన పట్టాలన్న తపనతో దానివెంటపడి శ్రమించి దానిని సాధించిన వారికే దాని విలువ తెలుస్తుంది. వారికి కలిగే ఆత్మతృప్తి కూడా అమోఘంగా ఉంటుంది. ఆ తృప్తిని ఏ డబ్బూ కొనివ్వలేదు.

ప్రపంచం విలువిచ్చే విషయాలు  నిజమైన విలువ ఉన్నవి కావు.నిజమైన విలువఉన్న విషయాలు ప్రపంచంలో అందరికీ అందవు.చాలాసార్లు తమ చేతిలో ఉన్నదాని విలువ తమకే తెలియదు.దృష్టి మాత్రం ఎక్కడో దూరంగా ఉన్నదానిమీద ఉంటుంది.అది నిజంగా విలువైనదో కాదో తెలీకపోయినా సరే. ఇదే ఈలోకంలోని విచిత్రం.
read more " హోమియో విజ్ఞానవిశిష్టత "

6, జనవరి 2012, శుక్రవారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం -4

రజనీష్ జాతకంలో కొన్ని విచిత్ర గ్రహస్తితులున్నాయి. పంచమ స్థానంలో కేతువువల్ల ఆయనకు ధ్యానంలో గట్టి అభ్యాసం ఉందన్న విషయం విదితం అవుతున్నది. కేతువు బుధుని సూచకుడుగా ఉచ్చస్తితిలో ఉన్న బుధుని సూచిస్తున్నాడు. ఆ బుధుడు అష్టమంలో ఉంటూ మార్మిక విషయాలను సూచిస్తున్నాడు.

ఈ జాతకానికి యోగకారకుడూ వైరాగ్యకారకుడూ అయిన శనికూడా అష్టమంలో ఉంటూ ఈయనకు గల బలమైన ఆధ్యాత్మికచింతనను సూచిస్తున్నాడు. ఇకపోతే రజనీష్ జాతకంలో గ్రహదశలు  ఎలా జరిగాయో ఒక్కసారి చూద్దాం. రజనీష్ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించాడు కనుక జనకాలదశ శుక్రదశ అవుతుంది.

1931 లో పుట్టినప్పటి నుంచి 1938  వరకూ  శుక్రదశ.
అక్కణ్ణించి 1944 వరకూ రవిదశ.
అక్కణ్ణించి 1954 వరకూ చంద్రదశ.
అక్కణ్ణించి 1961 వరకూ కుజదశ.
అక్కణ్ణించి 1979 వరకూ రాహుదశ.
అక్కణ్ణించి 1990 లో చనిపోయేవరకూ గురుదశ.

1944 నుంచి 1954 వరకూ నడిచిన చంద్ర దశలోనే రజనీష్ సాధన అంతా సాగింది. చంద్రుడు అష్టమంలో ఉండటమే కాక శనిబుధులతో కూడి ఉండటమే దీనికి కారణం. 1948  నుంచి 1950 వరకూ చంద్ర దశలో శని అంతర్దశ జరిగింది. చంద్రశనులకలయిక ఆశాభంగాలనూ, వైరాగ్యాన్నీ, జీవితంలో మరిచిపోలేని చేదుఅనుభవాలనూ ఇస్తుంది. ఈ సమయంలోనే స్నేహితురాలు శశి మరణం ఆయనకు ఇంకొక షాక్ లాగా తగిలింది. ఏడేళ్ళ వయసులో తాతగారి మరణం ఆయనకు మొదటి షాక్ గా పనిచేసి జిజ్ఞాసాపరుణ్ణి  చేసింది. పదిహేడేళ్ళ వయసులో శశి మరణం జీవితపు ఆశాశ్వతత్వాన్ని మళ్ళీ ఆయన కళ్ళముందు నిలిపింది.  1953 లో తనకు కలిగిన "జ్ఞానోదయం" కూడా ఈ చంద్ర దశలోనే కలిగింది. తరువాత జరిగిన ఏడేళ్ళ కుజదశలో ఆయన తత్వశాస్త్ర ఆచార్యునిగా పనిచేశాడు. 1961 నుంచి 1979 వరకూ జరిగిన రాహుదశ ప్రారంభంలోనే ఆయనకు విదేశీ శిష్యులు రావడం మొదలైంది. రాహువు స్నేహితులను సూచించే ఏకాదశంలో ఉంటూ మంత్రస్థానమైన పంచమాన్ని చూస్తున్నాడు. అందుకే ఈ సమయంలో రజనీష్ పేరు దేశదేశాల్లో మార్మోగిపోయింది. రాహుప్రభావంవల్ల విదేశాలనుంచి తండోపతండాలుగా శిష్యులు రావడం మొదలుపెట్టారు.

అంతేకాక ఇదేసమయంలో,వివాదాస్పదమైన వామాచార తంత్రవిధానాలకు నవీనరంగు పులిమి తన ఆశ్రమంలో "తంత్ర గ్రూప్స్" పేరిట గ్రూప్ సెక్స్ మొదలు పెట్టించాడు. పోనీ తంత్రమన్నా సక్రమంగా అభ్యాసం చేసారా అంటే, అదీ లేదు. వామాచార సాధనను సక్రమంగా నేర్పించే గురువులు రజనీష్ ఆశ్రమంలో ఎవ్వరూలేరు.ఈ తంత్రాగ్రూప్స్ కు లీడర్స్ అందరూ విదేశీశిష్యులే. వారికి వామాచారతంత్రం  ఏమి తెలుస్తుంది? అది తంత్రంలోనే అతిరహస్యమైన విధానం. గురుముఖతా నేర్చుకోనిదే దాని రహస్యాలు ఎవరికీ అంతుబట్టవు. దానిని నేర్పించే గురువులు దొరకడం దుర్లభం. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాటి గురువులు ఎక్కడా దొరకరు. కనుక విచ్చలవిడి సెక్స్ నే వారు తంత్రం అనుకున్నారు. ఇది అతిపెద్ద పొరపాటు. ఈమొత్తం వ్యవహారమంతా రాహుదశలోనే జరిగింది. శుక్రునికి ఉచ్చస్తితి అయిన మీనంలో రాహువు ఉన్నాడనీ,క్షేత్రాదిపతిగా గురువును సూచిస్తున్నాడనీ, రాహు శుక్రులిరువురూ కలిసి ఈయన నవాంశలో కన్యలో ఉన్నారనీ,శుక్రునికి కన్య నీచస్తితి అనీ మనం గుర్తుంచుకుంటే ఈవిషయం మొత్తం చక్కగా అర్ధం అవుతుంది. ఈ సమయంలోనే ఆయనకు "సెక్స్ గురు" అన్న పేరు ఖాయంగా మారింది. ఇదంతా రాహుశుక్రుల ప్రభావమే.

1980 ప్రాంతాలలో ఈయనకి గురుదశ మొదలైంది. ఇది ఈయన జీవితంలో కీలకమైన మలుపు అని చెప్పవచ్చు. సామాన్యంగా రాహువులో గురువు గాని లేదా గురువులో రాహువుగాని మనిషికి చుక్కలు చూపిస్తుంది. జీవితంలో వెనక్కు తీసుకోలేని తప్పుడునిర్ణయాలు తీసుకోవడం లేదా భయంకరంగా మోసగించబడటం ఆదశలలో ఖచ్చితంగా జరుగుతాయి. అటువంటి దశాసమయంలోనే ఆయన భారతదేశం వదిలి అమెరికాలో స్థిరపడాలన్న తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఇక అక్కణ్ణించి ఆయనకు దుర్దశ మొదలైంది.తన రాశిలో ఉన్న గ్రహాల అన్నింటిదశలలో గురువు మంచిఫలితాలే ఇచ్చాడు. కాని తనదశ రావడంతోనే వక్రించిన తన లక్షణాలను చూపించడం మొదలుపెట్టాడు. అందుకే గురుదశలో రజనీష్ నానాబాధలూ పడ్డాడు. ఒరేగాన్లోని రాంచ్ లో పెట్టిన రజనీష్ ఆశ్రమం అనేక వివాదాలకూ నేరాలకూ కేంద్రబిందువుగా మారింది. చివరికి అరెస్ట్ కాబడ్డాడు. అమెరికానుంచి వెళ్ళగొట్టబడ్డాడు.ఏదేశంలోనూ దిక్కుతోచక ఆశ్రయందొరక్క తిరిగితిరిగి చివరికి భరతమాత ఒడిలోకే చేరాడు. మాతృదేశం విలువ ఆయనకు అప్పుడు తెలిసివచ్చి ఉంటుంది.కాని అప్పటికే సమయం మించిపోయింది. ఏదో తెలియని రోగం ఆయన్ను పీల్చి పిప్పి చేసింది. చివరికి హార్ట్ ఎటాక్ తో 1990 లో  మరణించాడు.

ఒక బానిసదేశం నుంచి వెళ్లి పరాయిదేశాలలో  వారికి కొత్తదైన వేదాంతప్రచారం చేసి ఏప్రమాదానికీ లోనుకాకుండా తనదేశానికి తిరిగివచ్చిన ఘనత ఒక్క వివేకానందస్వామికే మొదటిసారి దక్కుతుంది. విదేశాలలో ఉన్నపుడు ఆయన మీదకూడా హత్యాప్రయత్నాలు జరిగాయి.ఈసంగతి చాలామందికి తెలీదు. అయితే శ్రీ రామకృష్ణులు నీడలా వెనుకే ఉండి ఆయన్ను అనుక్షణం కాపాడారు. కనుకే క్రైస్తవమిషనరీల విషప్రయోగంనుంచి ఆయన తప్పించుకొని మళ్ళీ ఇండియాకు రాగలిగాడు.సెమెటిక్ మతాలైన జుదాయిజం, క్రైస్తవం, ఇస్లాములు ఇతరమతాల విషయంలో చాలాక్రూరంగా వ్యవహరిస్తాయి. సమాజపరంగా వారుచెప్పే ఉదారవాదమూ, సమానత్వవాదమూ,స్వేచ్చావాదమూ,మొదలైనవి మతం విషయంలో ఏమాత్రం పనిచెయ్యవు.ఇతర మతాలను వారు క్రూరంగా అణగదొక్కుతారు.భగవద్గీతను నిషేధించాలన్న నేటి క్రైస్తవుల ప్రయత్నమూ దీనికి ఒక ఉదాహరణే. వారు చెప్పే నీతులు ఆచరణలో కనిపించవు. ఈప్రమాదాన్ని పరమహంసయోగానంద ఒక్కడే తెలివిగా అధిగమించాడు. క్రియాయోగగురువులలో జీసస్ ను కూడా ఉంచడం ద్వారా ఆయన క్రైస్తవుల ద్వేషపూరిత కుట్రలనుంచి తెలివిగా తప్పుకున్నాడు. ప్రస్తుతానికి ఆ  విషయాలు అలా ఉంచుదాం. 

నీతిగా నిజాయితీగా నిజమైన దివ్యజీవనాన్నీ యోగవేదాంతాల సందేశాన్నీ బోధించిన వివేకానందాది మహనీయ గురువులకే విదేశాలలో బాధలు తప్పలేదు. ఇక తిక్కతిక్క బోధలు చేసిన రజనీష్ను వారు ఊరికే వదులుతారా? పైగా క్రిస్టియానిటీని రజనీష్ విమర్శించినంత తీవ్రస్థాయిలో ఇంకెవ్వరూ విమర్శించలేదు. ఇంకాపైగా మతబోధలకు  పరిమితం కాకుండా, అక్కడి లోకల్ రాజకీయాలలో కల్పించుకోవాలని రజనీష్ శిష్యులు  ప్రయత్నించారు. ఆ క్రమంలో అనేక కుట్రలు కుతంత్రాలూ విషప్రయోగాలూ హత్యాయత్నాలూ  చేశారు. ఇవన్నీ రజనీష్ కి తెలిసే జరిగాయో, తెలీక జరిగాయో మనకు అనవసరం.తెలిసే జరిగాయని ఆధారాలున్నాయని కొందరు అంటారు.పరాయి దేశానికి పోయి ఇలాంటి పనులు చేస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? కనుక అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. రజనీష్ ను వెంటాడి వేటాడింది. అయితే, దానివెనుక బలమైన క్రైస్తవ లాబీ ఉందన్న సంగతి జగద్విదితం.

అయితే అసలంటూ రజనీష్ చేసిన తప్పులు ఏమిటి? అని ప్రశ్నించుకుంటే కొన్ని విషయాలు కనిపిస్తాయి. విచ్చలవిడిగా సెక్స్ ను ప్రోత్సహించడం మొదటి తప్పు. నువ్వు ఏలాగైనాజీవించు,ఏమైనాచెయ్యి,కాని ధ్యానంకూడా చెయ్యి అని చెప్పడం రెండవ తప్పు. తననే నమ్మివచ్చిన వేలాదిశిష్యుల జీవితాలతో అమెరికాలోని ఒరెగాన్ స్టేట్లో చెలగాటం ఆడటం మూడోతప్పు.నీతియుత జీవితాన్ని ప్రోత్సహించకుండా ఆశ్రమంలో జరుగుతున్న స్మగ్లింగ్నూ వ్యభిచారాన్నీ(దీనికి తంత్రం అని పేరుపెట్టారు) చూచీ చూడనట్లు ఊరుకోవడమే గాక ప్రోత్సహించడం నాలుగో తప్పు. ఇష్టం వచ్చినట్లు తన ఫిలాసఫీని మారుస్తూ పోవడం ఐదో తప్పు. తన మాటలు నమ్మి ఆశ్రమం ఒక స్వర్గం అని ఆశించి వచ్చినవారిని తన ఇన్నర్ సర్కిల్ చేతిలో నానాబాధలూ అవమానాలూ పెట్టించడం ఆరో తప్పు. మతంలోనూ రాజకీయంలోనూ  తాను దేన్నయితే విమర్శించాడో అవే నియంతృత్వ పోకడలు తన ఆశ్రమంలో తలెత్తుతుంటే ఖండించకుండా వాటిని ప్రోత్సహించడం ఏడో తప్పు. తనకు లేని స్థాయిని శిష్యులు తనకు ఆపాదిస్తుంటే ఆమోదించడం ఎనిమిదో తప్పు. సరియైనగమ్యాన్ని వారికి చూపించకుండా సగం దారిలో వారిఖర్మకు వారిని వదిలెయ్యడం తొమ్మిదో తప్పు.ఆధ్యాత్మికగురువై ఉండీ డబ్బుకు అత్యంతప్రాధాన్యత ఇవ్వడం పదోతప్పు. అప్పనంగావచ్చిన శిష్యులడబ్బుతో విలాసజీవితం గడపడం పదకొండోతప్పు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈలిస్టు కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంటుంది.

"నేర్పరి అయిన నాట్యగాడు ఏనాటికీ తప్పటడుగు వెయ్యడు"-- అని శ్రీ రామకృష్ణులన్నారు. రజనీష్ బోలెడన్ని తప్పటడుగులు వేశాడు.జ్ఞాని ఏనాటికీ పొరపాటు చెయ్యడు.  అతను నిజమైన జ్ఞాని అయితే అతని ద్వారా తప్పు అనేది ఎప్పటికీ జరుగనే జరుగదు. ఒకవేళ జరిగితే అతనికి జ్ఞానం ఇంకా చాలాదూరంలో ఉంది అనే అర్ధం చేసుకోవాలి. అతనింకా పరమగమ్యాన్ని చేరలేదు అనే తెలుసుకోవాలి. ధర్మంతో ఏకత్వానుభూతి పొందినవాడు వేసే ప్రతిఅడుగూ ధర్మమయంగానే ఉంటుంది.కాని రజనీష్ దీనికి వ్యతిరేకార్ధం చెప్పాడు. జ్ఞాని ఏమిచేసినా అది కరెక్టే అని రజనీష్ అన్నాడు.  అంటే జ్ఞాని అయినవాడు తప్పుపని చేసినా అది తప్పు కాదు ఒప్పే అని ఆయన అన్నాడు. ఇతరుల అజ్ఞానంవల్ల  వారికి అది తప్పుగా తోచవచ్చు. కాని అతను చేసింది ఒప్పే అని రజనీష్ వాదించాడు. అసలు తప్పొప్పులనేవి లేనే లేవనీ అవి చూచే వ్యక్తినిబట్టి ఉంటాయనీ వాదించాడు. ఇది వితండవాదమే.

రజనీష్ చెప్పిన కొన్ని సిద్ధాంతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సంపూర్ణ మనస్సుతో చేసినపని ఏదైనాసరే అది సరైనదే అని ఒక విచిత్రసిద్ధాంతాన్ని ఆయన చెప్పాడు. అంటే ఊగిసలాట లేకుండా ఒక పనిని స్థిరచిత్తంతో చేస్తే అది ధర్మమే అన్నాడు. ఇది చదివినప్పుడు నాకు చచ్చే నవ్వొచ్చింది.రజనీష్ మూమెంట్ ఎందుకు విఫలం అయిందో నాకు అర్ధమైంది.ఇది పూర్తిగా తప్పుడుభావన. రేపులూ హత్యలూ దొంగతనాలూ చేసే క్రిమినల్స్ కూడా సంపూర్ణ స్థిరచిత్తంతోనే, నిమగ్నతతోనే, తమ సర్వశక్తులూ ఉపయోగించి  ఆ పని చేస్తారు. అంతమాత్రాన ఆ తప్పుడు పనులన్నీ యోగం అయిపోవు. అలా చేసేవాళ్ళు అందరూ  జ్ఞానులూ అవరు. ఇలాటి తప్పుడుభావనలు బోధించి ఆయన చాలామందిని పెడత్రోవ పట్టించాడు.

మనసుపెట్టి, త్రికరణ ఏకత్వంతో చేస్తే ఏపనైనా యోగం అవుతుంది అన్నభావన ఆయన బోధించిన వాటిలో ఒకటి. ఇక్కడ ఒక్కవిషయం స్పష్టం చేయ్యదలుచు కున్నాను. మనిషికి కావలసింది త్రికరణ ఏకత్వం కాదు. త్రికరణశుద్ధి కావాలి.ఒక రాక్షసుడిలో కూడా త్రికరణఏకత్వం ఉంటుంది.కాని త్రికరణశుద్ధి ఉండదు. అందుకే అతను యోగి కాలేడు. దివ్యాత్ముడు కాలేడు. కనుకనే మన మతం ఎప్పుడూ త్రికరణశుద్ధిని నొక్కిచెప్పింది కాని త్రికరణఏకత్వాన్ని కాదు.

రావణుడూ దుర్యోధనుడూ కీచకుడూ మొదలైన పౌరాణిక విలన్లు కూడా వాళ్ళుచేసే దుర్మార్గాలు అన్నింటినీ త్రికరణఏకత్వంతో చేసారు, కాని త్రికరణశుద్ధితో చెయ్యలేదు. ఆలోచన,మాట,చేతలనే త్రికరణాలు అంటారు. ఈ మూడూ ఒకేత్రాటిమీద ఉండే త్రికరణఏకత్వం వల్ల సంకల్పశక్తి వస్తుంది. కాని ఆశక్తి ధర్మమార్గంలో ఉండాలని రూలేమీ లేదు.అది ధర్మమార్గంలో ఉండాలంటే ఆ త్రికరణాలలో శుద్ధి ఉండాలి. అప్పుడు విశ్వవ్యాప్తమైన ధర్మంతో ఆవ్యక్తికి  అనుసంధానం ఏర్పడుతుంది. అప్పుడు అతని చర్యల్లో ధర్మం ప్రతిఫలిస్తుంది. క్రిమినల్స్ అందరూ త్రికరణఏకత్వం ఉన్నవారే. కనీసం వాళ్ళు నేరం చేస్తున్న క్షణంలోనైనా వాళ్ళ సంకల్పమూ క్రియా ఒకే తాటిమీద ఉంటాయి. అంతమాత్రం చేత వాళ్ళు యోగులూ సిద్ధులూ కాలేరు. వాళ్ళు చేసినపని ధర్మం అనీ చెప్పలేము.

ఒక కష్టసాధ్యమైన పనిని సాధించిన ప్రతివాడూ త్రికరణ ఏకత్వం ఉన్నప్పుడే దానిని సాధించాడు. అది ఒక రోగి ప్రాణం కాపాడటానికి గంటలుగంటలుపట్టే ఒక క్లిష్టమైన మెడికల్ ఆపరేషన్ కావచ్చు లేదా బాంక్ లూటీ కావచ్చు లేదా ట్విన్ టవర్స్ పేల్చివేత కావచ్చు. మాఫియాదొంగలు, తీవ్రవాదులూ, రాజకీయనాయకులూ కూడా గొప్ప సంకల్పబలంతోనూ త్రికరణఏకత్వంతోనూ వాళ్ళ పనులు  నెరవేరుస్తారు. అంతమాత్రాన వాళ్ళందరూ జ్ఞానులు కారు. వాళ్ళు చేసేపనులన్నీ ధర్మపరమైనవీ కావు.

సంపూర్ణమనస్సుతో చేసిన ప్రతిపనీ యోగం కాదు, కాలేదు. శుద్ధమనస్సుతో చేసినపని మాత్రమే యోగం అవుతుంది. ఒక పనిని ఏదోరకంగా సాధించడానికి త్రికరణఏకత్వం ఉంటె సరిపోతుంది. కాని ధర్మపరంగా ఒక పనిని చెయ్యాలంటే త్రికరణశుద్ధి తప్పనిసరిగా ఉండాలి. ఈ సున్నితమైన తేడాను మనం స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.
(మిగతా ఐదో భాగంలో)
read more " ఓషో రజనీష్ జాతకం, భావజాలం -4 "

3, జనవరి 2012, మంగళవారం

రివర్స్ పామిస్ట్రీ

నిన్న ఒక పెద్దాయన నా దగ్గరకి వచ్చి పరిచయం చేసుకున్నాడు.  

"నా పేరు ఫలానా. నేను కొన్నేళ్ళ క్రితం రిటైర్ అయ్యాను. మీరు జ్యోతిష్యం చెబుతారని తెలిసి పలకరిద్దామని వచ్చాను." అంటూ తన కార్డ్ ఇచ్చాడు.

ఆయన బాగా చదువుకున్నవాడూ డబల్ పీజీ, డాక్టరేటూనూ. సరే ఏం చెబుతాడో విందాం అనుకుంటూ "లేదండీ నేను ప్రొఫెషనల్ జ్యోతిష్కున్ని కాను. అడిగినవారందరికీ నేను చెప్పనుకూడా. జస్ట్ హాబీగా చూస్తుంటాను.నాకు జ్యోతిష్యవిద్య  పెద్దగా తెలీదు. ఏదో మిడిమిడి జ్ఞానం అంతే. కాకుంటే పదేళ్ళ క్రితం MA Astrology చేసాను. చేసాక అదొక టైంవేస్ట్ అని తెలిసింది." అన్నాను.

"నేను రివర్స్ పామిస్ట్రి  చెప్తాను." అన్నాడు పెద్దాయన ఏదో నములుతూ. బహుశా వక్కపొడి అనుకుంటా.

"రివర్స్ పామిస్ట్రీనా? అంటే? " అన్నాను.

"నేను అరిచేతులు చూచి జాతకం చెప్పను. చేతుల వెనుకభాగం చూచి జాతకం చెప్తాను" అన్నాడు అదోరకంగా చూస్తూ.

నాకు ఫకాల్న నవ్వొచ్చింది. కాని తమాయించుకున్నాను. అలా నవ్వు రావటానికి ఒక కారణం ఉంది. కొన్నాళ్ళ క్రితం రోడ్డుమీద పోతుంటే, నా ముందు ఒక కారు పోతోంది. దాని వెనుక గ్లాస్ మీద "ముఖ జ్యోతిష్కులు" అని పెద్ద  అక్షరాలతో వ్రాసుంది. అంటే ఆ కారులోనివాడు ముఖం చూచి జ్యోతిష్యం చెప్పేవాడన్నమాట. నా చిన్నప్పుడు  "ముఖంచూస్తె చెప్పవచ్చు" అని అంబడిపూడి వ్రాసిన పుస్తకం ఒకటి ఉండేది. బహుశా వీడూ ఆ బాపతు అయి ఉంటాడు. ఎవడి పిచ్చి వాడికానందంలే అనుకోని నా దారిన నేను వెళ్లాను.తర్వాత ఈసంగతి మా ఫ్రెండ్ వెంకటేశ్వరరావు గారికి చెప్పాను. వెంకటేశ్వరరావుగారికి జ్యోతిష్యవిద్య తెలుసు. ఏడోభావం విషయాలు చెప్పటంలో ఆయన మంచిదిట్ట. ఒకప్పుడు జ్యోతిష్యాన్ని బాగా కుస్తీ పట్టి ప్రస్తుతం దానికి దూరంగా ఉంటున్నాడు. కాని చర్చలలో మాత్రం పాల్గొంటాడు. ఆయన కో ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ గా రిటైర్ అయ్యాడు. ఆయన సర్వీసంతా ప్రకాశం జిల్లాలోనూ పల్నాడులోనూ గడిచింది. సర్వీసంతా పిటీషన్లూ, కోర్టులూ,గొడవలూ,ఇదే సరిపోయింది.   ఆ ఖర్మో ఏమోగాని ఆయన మాటల్లో పల్లెటూరి మోటుభాష కొంచం ఎక్కువగా  వాడుతూ ఉంటాడు. నేను చెప్పినమాటవిని ఆయన వెటకారంగాచూస్తూ"ముఖజ్యోతిష్కుడా?వాడి మొహమేం గాదూ?ముడ్డిజ్యోతిష్కుడని పెట్టుకోకపోయాడూ?"అని దీర్ఘంతీశాడు.ఆ డైలాగ్ కి అక్కడున్నవారంతా పడీపడీ ఒకటే నవ్వు.

ఆ సంగతి గుర్తొచ్చి నాకు మళ్ళీ చచ్చేనవ్వొచ్చింది. అయినా పెద్దాయన ముందు కారణం లేకుండా నవ్వడం బాగుండదని బలవంతాన నవ్వాపుకుని సీరియస్ గా ముఖం పెట్టాను.

"చేతులవెనుకభాగం చూచి జాతకం చెప్తారా?ఎందుకలా?" అనడిగాను.

"ఏమో నాకేతెలీదు. నేను గత నలభైఏళ్లనుంచీ దీనిని ప్రాక్టీస్ చేస్తున్నాను " అన్నాడు.

అతన్ని చూస్తే నాకు జాలేసింది. ఏదేమైనా గుంటూరోళ్ళకి పైత్యం బాగా ఎక్కువే అనుకున్నా. దీనికి నేనూ మినహాయింపు కాదనుకోండి.  

"ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ విద్యని?" అని అడిగాను. 

"ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. నేను బాబా భక్తుణ్ణి. ఆయనే నా గురువు. అన్నీ ఆయనే నేర్పిస్తాడు" అన్నాడు.

"భలేదొరికాన్రా నాయనా నీకుపొద్దున్నే" మనసులో  అనుకుంటూ "మరి బాబాకి పామిస్ట్రీ రాదుగా మీకెలా నేర్పించాడు?" అన్నాను.

"మూర్ఖుడా !!!"అన్నట్లు చూచాడు పెద్దాయన.

"బాబా ధ్యానంలోఉంటె అన్నీ అవే స్పురిస్తాయి " అన్నాడు. తర్వాత ఆయన చెప్పిన ప్రేడిక్షన్సూ అవి ఎలా నిజమయ్యాయో ఆ సంగతులు చెబుతూ చాలాసేపు సుత్తికొట్టాడు.

"మీరు చెప్పినవాటిలో ఫెయిల్యూర్స్ ఏమీలేవా?" అడిగాను.

"ఉన్నాయి. కొన్ని 70% జరుగుతాయి. కొన్ని 80% జరుగుతాయి. కొన్నిసార్లు 50% వరకూ కూడా ఫెయిల్ అయ్యాయి. అన్నీ జరగవు." అన్నాడు 

ఈ మాటలోని నిజాయితీ నాకు నచ్చింది. పరవాలేదు కాస్త ఓపెన్ మైండ్ ఉన్నవాడే అనుకున్నా.

"జరగబోయే వాటిని చాలావరకూ తెలుసుకోవచ్చు. రెమెడీస్ తో కొంతవరకూ వాటి తీవ్రత తగ్గించవచ్చు. కాని సమస్యని  పూర్తిగా తొలగించగలవాడికోసం వెతుకుతూ ఉన్నాను. ఇప్పటివరకూ అలాటివాడు దొరకలేదు." అన్నాడు.

"అలాటివాడి అడ్రస్ బాబాని అడక్కపోయారా? అన్నీ చెప్పే బాబా అదెందుకు చెప్పటంలేదో?" అందామని నోటిదాకా వచ్చింది. పోనీలే మొదటి సమావేశంలోనే షాక్ ఇవ్వడం ఎందుకు అని ఆలోచించి -"బహుశా అలాటివాడు ఎప్పటికీ దొరక్కపోవచ్చులెండి " అన్నాను.

"కావచ్చు. నేను ఇప్పటికి 4  నుంచి 5  లక్షలచేతులు(అంటే చేతుల వెనుకభాగాలు) చూశాను. నాకు 6000  మంత్రాలు తెలుసు. వాటిని ఉపయోగించి సమస్యల తీవ్రత తగ్గిస్తాను." అన్నాడు.

"అలాగా. మంచిదే." అన్నాను.

ఎన్ని చెప్పినా నేను అస్సలు ఇంప్రెస్స్ కాకపోవడంతో కాసేపటికి ఆయనకీ విసుగు పుట్టినట్లుంది. కనీసం నా చెయ్యి వెనుకభాగం చూడమని కూడా నేను అడగకపోతిని. ఇక చాల్లే అనుకున్నాడో ఏమో " వస్తానండీ మరి" అని లేచాడు.

"అలాగే మంచిది. వెళ్లి రండి.నాతో ఏదైనా పనుంటే చెప్పండి. నా పరిధిలో సాయం చెయ్యగలను " అని అన్నాను. ఆయన వెళ్ళిపోయాడు.

ఇలాంటి విచిత్రవ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన చెప్పే విద్యకు శాస్త్రప్రామాణికత లేదు. సాముద్రికశాస్త్రంలో మనిషిశరీరాన్ని గమనించి అతని మనస్తత్వాన్ని భవిష్యత్తునూ అంచనా వెయ్యవచ్చు. అంతేగాని రివర్స్ పామిస్ట్రీ, అబ్వర్స్ ఆస్ట్రాలజీ, వర్టికల్ వాస్తు, హారిజాంటల్ హేండ్ రీడింగ్ వగైరాలు ఎక్కడా లేవు. పైగా దీనికి బాబా ట్రేడ్ మార్క్ ఒకటి. ఆయనొకడు దొరికాడు ప్రతివాడికీ. ఎవడెవడి పైత్యానికీ సపోర్ట్ గా ఆయన్ని వాడుకుంటారు. పాపం బాబాకి కాపీరైట్ లేదుకదా. అడుక్కుండేవాడి దగ్గర్నించి అందరూ బాబాకింద షెల్టర్ తీసుకోవడమే. పాపం బాబాకి ఎంత గతిపట్టింది ఈ లోకంలో అని జాలేసింది నాకు. 

ఆరోజు సాయంత్రం మా ఫ్రెండ్ వెంకటేశ్వరరావుగారు మళ్ళీ కలిశారు. కాని రివర్స్ పామిస్ట్రీ విషయం ఆయనకి చెప్పదలుచుకోలేదు. ఇది వింటే ఆయన ఇంకే డైలాగు వదులుతాడో ఖర్మ, అది వినలేక మనం చావాలి అని ఈ విషయం ఆయన దగ్గర ఎత్తలేదు.

మొదటిసారి గనుక మొహమాటం కొద్దీ ఊరుకున్నాను. రివర్స్ పామిస్ట్రీగారు ఈసారి కనిపిస్తే ఆయనకి రివర్స్ గేర్ తప్పదు మరి.
read more " రివర్స్ పామిస్ట్రీ "