“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2013, మంగళవారం

ప్రకృతి నేర్పిన పాఠాలు

మాడ్చే వేసవి పగళ్ళు   
వెలిగించాయి జ్ఞానతేజస్సును 
చిమ్మచీకటి నిండిన రాత్రులు
కలిగించాయి తాంత్రికసిద్ధిని 

వణికించే చలికాలం 
ఇచ్చింది నిశ్చలసమాధిని 
మురిపించే వసంతం 
పెంచింది ప్రేమోన్మాదం  

పులకించే వానాకాలం 
ముంచెత్తింది అనుభవ వర్షం
మోడువారిన శిశిరం 
మోసుకొచ్చింది వైరాగ్యం 

పంచభూతాలే నేర్పాయి 
పంచ మకారాలను 
ప్రకృతే పరికింప చేసింది 
నీ నిత్యలీలావినోదాన్ని 

లోకమే నేర్పింది  
లోతైన పాఠాల్ని
శూన్యమే తెలిపింది
ఆత్మారామత్వాన్ని 

ప్రతి మనిషిలో చూచా 
ఒక వింత దీపాన్ని 
నీ ధ్యాసలో మరచా 
ఈ సమస్త ప్రపంచాన్ని ...
read more " ప్రకృతి నేర్పిన పాఠాలు "

27, ఏప్రిల్ 2013, శనివారం

నీవు - నేను

నా కళ్ళలోకి తొంగితొంగి చూడకు 
అక్కడి శూన్యపు లోతులను 
నీవు తట్టుకోలేవు 

నా ఆలోచనలను చదవాలని చూడకు  
అక్కడేమీ లేకుండటం చూచి  
నీవు భయపడతావు 

నా హృదయాన్ని తాకాలని చూడకు 
అక్కడున్న ప్రేమవెల్లువను 
నీవు భరించలేవు

నన్ను ద్వేషించాలని ప్రయత్నించకు 
ఆ ప్రయత్నంలో మునిగి  
నీ అస్తిత్వాన్ని కోల్పోతావు  

నన్నర్ధం చేసుకోవాలనుకోకు  
నీవు నేనుగా మారనిదే 
నన్ను నన్నుగా గ్రహించలేవు

నన్ననుసరించాలనుకోకు 
జారిపోయే శూన్యాన్ని 
నీ చేతితో పట్టుకోలేవు   

అమృతాన్నీ కాలకూట విషాన్నీ 
ఒకేసారి రుచి చూడగలిగితే 
నేనెవరో తెలుసుకోగలవు

అమితసుఖాన్నీ అంతులేని బాధనీ
నీ గుండెలో నింపుకోగలిగితే   
నా స్థాయిని నీవందుకోగలవు  

నాలో కరిగి నీవు మాయమైతేనే 
నన్ను నీవు చూడగలవు
నను చేరే ప్రయత్నం మానితేనే 
నేనెవరో నీవు గ్రహించగలవు 

నీవూహించే ఊహలన్నీ నేనే 
ఆ ఊహల వెనుక శూన్యమూ నేనే 
నాగురించి నీ ఊహలన్నీ తప్పులే
నా ఆనంద మందిరంలో అన్నీ నిట్టూర్పులే 
ఎందుకంటే నాలో అన్నీ ఉన్నా 
మళ్ళీ నాలో ఏవీ లేవు

నీ ఊహలకే ఆధారాన్ని నేను
నీ ఊహకందని అగాధాన్ని నేను
నీ ఆలోచనల వెనుక నిలబడి 
నిను నిత్యం గమనిస్తున్న 
నీ నిశ్శబ్ద ఆత్మను నేను 

చావు పుట్టుకల కెరటాలపై 
నిను  తేలుస్తున్న తెప్పను నేను 
నన్ను మరచి నీవు దూరమేగినా 
నిన్ను వదలని నీడను నేను

మండే వేసవి ఎండల్ల్లో 
నిను తాకే చల్లని గాలిని నేను 
నిను కాల్చే తీరని దుఃఖంలో 
ఓదార్చే సుతిమెత్తని స్పర్శను నేను 

ఏం కావాలో తెలియక నిత్యం 
నీవెప్పుడూ వెతికే సత్యం నేను 
భయపడుతూ నీవెపుడూ కోల్పోయే
నీలోపలి అంతిమ గమ్యం నేను.....
read more " నీవు - నేను "

23, ఏప్రిల్ 2013, మంగళవారం

రత్నగర్భ

మన దేశం రత్నగర్భ

అందుకే...
ఇక్కడ 
రత్నాల్లాంటి పసిపాపలక్కూడా  
గర్భాదానం అవుతుంది 

అందుకే... 
రత్నాలన్నీ 
మ్యూజియాల్లో చేరి 
రాళ్ళు మాత్రం 
సమాజంలో మిగిలాయి

మన దేశం 
అతి ప్రాచీనమైనది 
అందుకే...
ప్రాచీన అడివి మనుషులు 
ఎక్కడ చూచినా... 

ఆధ్యాత్మికం మన ప్రాణం 
అందుకే...
మాటల్లోనే గాని చేతల్లో 
ఎక్కడా కనబడదు 
ప్రాణం 

మన దేశం అగ్నిపునీత
అందుకే...
సత్యాన్నీ ధర్మాన్నీ 
సాంప్రదాయాన్నీ  
అగ్నిపాలు చేసి 
పాపాల పుట్టలా మారింది 

మన దేశం భరతమాత
అందుకే...
ప్రతి శకుంతలా 
జనారణ్యంలో పడి ఏడుస్తోంది 
ఎక్కడ చూచినా కాటేసి 
ముఖం చాటేసే దుష్యంతులే

మన దేశం ధరణీజాత  
అందుకే...
మట్టిలో పుట్టి 
మట్టిలో కలిసిపోయింది 
మౌనంగా రోదిస్తూ.. 

మనదేశం నర్తనశాల 
ఇక్కడ భీముళ్ళు లేరు 
అడుగడుగునా తుమ్మముళ్ళే 
అన్నీ చిక్కుముళ్ళే
అందరూ కీచకతమ్ముళ్ళే 

ఇక్కడ అవకాశం 
వెర్రితలలు వేస్తుంది 
అధికారం నిద్రపోతుంది 
అమాయకం బలౌతుంది 
అపరాధం రక్షించబడుతుంది 

ఇక్కడ ఎన్నెన్నో గుళ్ళు  
అడుగడుక్కీ మసీదులు చర్చిలు
ఎక్కడ చూచినా నీతులూ
ధర్మోపన్యాసాలు 
ఆచరణలో మాత్రం 
రాక్షసులూ పిశాచాలు 

తల్లి మంచిదే 
పిల్లలే 
కుక్కమూతిపిందెలు 
తల్లినే 
వీధిన నిలబెట్టి 
అమ్ముకునే తనయులు 

రత్నాల కోసం 
తల్లి గర్భాన్ని కూడా
ఛిద్రం చెయ్యడానికి 
వెనుదియ్యని 
జాతిరత్నాలు 

నిజమే 
ఇలాంటి వాళ్ళని కన్న
మన దేశం 
రత్నగర్భనే ...
కాదన్నదెవరు?
read more " రత్నగర్భ "

21, ఏప్రిల్ 2013, ఆదివారం

వీరవిద్యాభ్యాసం -1

మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు టెన్త్ క్లాస్ చదివే రోజులనుంచి ఒక వ్యసనం.అది ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.మధ్యలో జరిగిపోయిన మూడున్నర దశాబ్దాల కాలంలో రకరకాల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం,వాటికోసం తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలు తిరగటం, వాటితో ప్రయోగాలు చెయ్యడం,స్కూల్స్ నడపడం,ఆ రాజకీయాలతో విసుగు పుట్టి,వాటినుంచి విరమించుకుని నా సొంత స్టైల్ నేను తయారు చేసుకోవడం, యోగానికీ తంత్రానికీ వీరవిద్య్లకూ ఉన్న సంబంధం మీద రీసెర్చి చెయ్యడం ఇలా అనేక మజిలీలుగా కధ సాగింది.

ఈ వీడియోలో  కుంగ్ ఫూ లోని అనేక శాఖలలో ఒకటైన వింగ్ చున్ సిస్టం కి సంబంధించిన మొదటి ఫాం "సిల్ లుం టావో" ని అభ్యాసం చెయ్యడం చూడవచ్చు.


వీరవిద్యల అభ్యాసం ఒక దండగ అని అనేకమంది అనుకుంటారు.చాలామందికి డబ్బు సంపాదించడానికి పనికొచ్చేవి గాక మిగిలిన పనులన్నీ టైంవేస్ట్ కింద లెక్క.వారి అజ్ఞానానికి నా జోహార్లు. జీవితంలో ప్రతిదాన్నీ ఒక వ్యాపారంగా చూచేవారికి నేనేం సమాధానం చెప్పలేనుగాని ఒక్కవిషయం చెప్పగలను.వీరవిద్యల అభ్యాసం మనిషికి అనేక లాభాలనిస్తుంది.
  • ఒకటి -అభ్యాసి ఆరోగ్యం బాగుంటుంది.
  • రెండు -ఎంత వయసొచ్చినా ఫిట్నెస్ చెక్కు చెదరదు.
  • మూడు -ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది.
  • నాలుగు -బిడియం పిరికితనం మటుమాయం అవుతాయి.
  • అయిదు-అవసరం వస్తే ఆత్మరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది.
  • ఆరు-అన్నిటికంటే ముఖ్యమైనది.దీనిని చివరివరకూ వదలకుండా అభ్యాసం చేస్తే,వేదాంత-యోగ-తంత్ర ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. దానివల్ల మనిషికి అంతిమ సంతృప్తి,జీవన సాఫల్యతా కలుగుతాయి. అయితే ఆస్థాయి వరకూ నేర్చుకునే వారూ ప్రస్తుతం ఎవరూ లేరు. నేర్పేవారూ ఎక్కడా దొరకరు.ఎందుకంటే నేటి మనిషి జీవితం "ర్యాట్ రేస్" లోనే గడచి పోతోంది.అందులో పడి ఉదాత్తమైన అంశాలను స్పృశించే సమయమూ ఓపికా ఎవరికీ ఉండటం లేదు.అది వేరే సంగతి.
మార్షల్ ఆర్ట్స్ అంటే ఉత్త ఫైటింగ్ మాత్రమే అనుకోవడం చాలా అపరిపక్వమైన  అవగాహన.నిజానికి అది క్రమేణా అభ్యాసిని 'జెన్' వైపు తీసుకెళుతుంది. ఎందుకంటే ప్రపంచానికి 'జెన్' ను పరిచయం చేసిన బౌద్ధ గురువు 'బోధిధర్మ' నే 'కుంగ్ ఫూ' విద్యకు కూడా మూలపురుషుడు కాబట్టి.

మార్షల్ ఆర్ట్స్ ను సరిగా, చివరివరకూ నేర్చుకుంటే అది యోగంగా మారుతుందని నేను వ్యక్తిగత అనుభవం నుంచి చెప్పగలను.
read more " వీరవిద్యాభ్యాసం -1 "

నేను

సూర్య కిరణ హస్తాలను
ప్రేమమీర అందుకొనుచు
సువర్లోక సీమలకై
ఎగసిపోవు అగ్నినేను

నింగిరేని నిచ్చెనలను
అందిపుచ్చుకొని ఎంతయు  
వెలుగులోకమును చేరెడి
విద్యనెరుగు వేత్త నేను

విశ్వ భ్రమణము చేయుచు
చుట్టపు చూపుగ ధరణికి
చూచిపోవగా వచ్చిన
చావులేని వెలుగు నేను

చీకటి సీమల మీరుచు
నిత్యము వెలిగెడి లోకపు
పచ్చని పచ్చిక బయళ్ళ
విశ్రమించువాడ నేను

నక్షత్రపు వీధులందు
ఇష్టము మీరగ తిరుగుచు
లోకములెల్లను జుట్టెడి
బంధరహిత యాత్మ నేను

ప్రాపంచిక బాధలందు
మగ్గిపోవు మనుజులగని
వారి కర్మవలయమెంచి
నవ్వుకొనెడి ద్రష్ట నేను

ఇంద్రియాల వలను దాటి 
ఇదే యనుచు చెప్పలేని 
ఆనందాంబుధి నొక్కటి   
మునుగబోవు మౌని నేను 

నిశ్చలంపు మౌనమందు
హృదయసీమ లోతులలో  
నిశిరాత్రిని వినగ వచ్చు 
మధుర వేణునాదమేను 

లోకమెల్ల నిదురించగ 
కళ్ళు తెరచి విస్తరించి 
జగతినెల్ల కమ్ముకొనెడి 
నీరవ నిశ్శబ్దమేను 

యోగియొక్క నేత్రాలను
నిలిచి నిండి వెలుగునట్టి
లోకాతీతపు జ్యోతుల 
చల్లని తేజమ్ము నేను 

మారువేషమున లోకపు
వీధులందు తిరిగి చూచి 
వేసటతో తిరిగిపోవు
విస్మృత చారుడను నేను

మహామౌన సంద్రమందు 
అలవిగాని లోతులలో 
సదా మునిగి యుండునట్టి 
సద్రూపపు శిలను నేను

చావులోన మునిగియున్న 
అజ్ఞానపు లోకమందు 
మరణపు టాజ్ఞల మీరుచు 
మత్తు విడిన మనిషి నేను 

లోకపు నాటక రంగపు
లోతుల నంతయు తెలియుచు 
కర్మల మర్మము నెరిగిన 
దీర్ఘదర్శి నొకడ నేను 

నానా జన్మల మాటున 
నాటకాల నటియించుచు
నన్ను నేను మరువనట్టి 
నిత్యుండగు నటుడ నేను 

ప్రకృతి శక్తుల రూపున  
పరిడవిల్లుచును బాగుగ
లోకమంతటిని నడపెడి  
ముదిమి లేని సత్వమేను

లోకమందు నేను దప్ప 
వేరొక్కటి కానరాని
అవ్యక్తపు స్తితిని చేరు 
ఉన్మత్తపు ఋషిని నేను

నేను అనెడి భావమెల్ల 
నిర్మూలనమవ్వుటకై 
నిరంతరము యత్నించెడి 
నిజమగు నొక నేను నేను
read more " నేను "

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

రామ రావణ జాతకాలు

ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామ రావణ జాతకాలను ఒకసారి పరిశీలిద్దాం.

వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లో శ్రీరాముని జనన వివరాలనూ ఆ సమయంలో ఉన్న గ్రహ స్తితులనూ చక్కగా నిర్దుష్టంగా వివరించాడు.ఆ గ్రహస్తితులు కొన్నివేల ఏళ్ళకు గాని ఖగోళంలో రావు.నవీన సాఫ్ట్ వేర్ లు ఉపయోగించి ఆ గ్రహస్తితులు ఖగోళంలో ఎప్పుడు ఉన్నాయో చూస్తె ఆ సమయం BC 5000 ప్రాంతంలోనూ మళ్ళీ BC 7000 ప్రాంతం లోనూ కనిపిస్తున్నది.అంటే రామాయణకాలం ఈరెంటిలో ఏదో ఒకటి అయి ఉండవచ్చు.అయితే సాంప్రదాయ యుగాల లెక్కకూ ఈ లెక్కకూ పొంతన కుదరదు.'యుగం' అనే పదం యొక్క అర్ధాలు అనేకచోట్ల రకరకాలుగా ఇవ్వబడ్డాయి గనుకా,మహాయుగాలు వేరు,మామూలు యుగాలు వేరు గనుకా కొద్దిగా ఆలోచించి చూస్తె లెక్క సరిగానే సరిపోతుంది.స్వామి యుక్తేశ్వర్ గిరిగారు తన Holy science పుస్తకంలో ఇచ్చిన యుగాల లెక్కలు చాలావరకు శాస్త్రీయంగా ఉన్నట్లు కనిపిస్తుంది.ప్రస్తుతం మన ఉద్దేశ్యం యుగాల లెక్కలు చూడటం కాదుగనుక ఆ విషయం పక్కన ఉంచుదాం.

శ్రీరామచంద్రుని జాతకం అందరికీ తెలిసినదే.ఆయన జాతక చక్రంలోని గ్రహస్తితులు ఇలా ఉన్నాయి.


లగ్నం :కటకం,గురువు,చంద్రుడు.
రవి:మేషం
బుధుడు:వృషభం
కుజుడు:మకరం
శుక్రుడు:మీనం
శని:తుల
రాహుకేతువులు:ధనూ మిధునాలు 




రావణుని జాతకంలో గ్రహస్తితులు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియవు.వాల్మీకి మహర్షి కూడా ఆ వివరాలు ఎక్కడా ఇచ్చినట్లు కనిపించదు.కాని తమిళనాడులో కొంతమంది రావణుని జాతక చక్రాన్ని చూపిస్తారు.అలాగే ఉత్తరభారతదేశంలో కూడా కొంతమంది రావణుని పూజించే ప్రజలున్నారు.వారు అప్పట్లో లంకానగరం నుండి వచ్చి ఉత్తరభారతంలో స్తిరపడిన కుటుంబాల వారు.వారిప్పటికీ రావణుడినే వారి రాజుగా ఆరాధిస్తారు.వారి పండుగలు కూడా మిగతావారికంటే విభిన్నంగా ఉంటాయి.వారివద్ద కూడా రావణుని జాతకచక్రం లభిస్తుంది.పండిట్ గోపేష్ కుమార్ ఓజా గారిచ్చిన వివరాలను బట్టి రావణుని జాతకంలో గ్రహస్తితులు ఈ విధంగా ఉన్నాయి.

లగ్నం:మేషం,సూర్యుడు.
చంద్రుడు:కటకం 
కుజుడు:మకరం
బుధుడు:వృషభం 
గురువు:కటకం
శుక్రుడు:మీనం
వక్రశని:తుల
రాహుకేతులు:మిధున ధనుస్సులు


అవతార పురుషుల జాతకాలలో ఒక అంశం స్పష్టంగా కనిపిస్తుంది.వారి జాతకాలలోని నవగ్రహాలలో సాధ్యమైనన్ని గ్రహాలు ఉచ్ఛస్తితిలో ఉంటాయి.ఈ ఒక్క అంశాన్ని బట్టి అది భగవంతుని అవతారమా కాదా అన్న విషయం చెప్పవచ్చు.మనకు తెలిసిన మహాపురుషులలో ఒక్క శ్రీరామక్రిష్ణుని జాతకంలో మాత్రమే ఇటువంటి గ్రహస్తితులు కనిపిస్తాయి.కనుక ఆయన దైవం యొక్క అవతారం అన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మనకు తెలిసిన మిగతా మహాపురుషుల జాతకాలలో ఈ స్తితులు లేవు.వారి భక్తులు అనుచరులు వారిని ఎంతో గొప్పగా దేవుని అవతారాలుగా భావించవచ్చు గాక,కాని వాస్తవం వేరుగా ఉంటుంది.చివరకు తమను తాము అవతారంగా ప్రకటించుకున్న మెహర్ బాబా,సత్యసాయిబాబాల జాతకాలలో కూడా అవతార పురుషుల స్థాయిని సూచించే గ్రహస్తితులు లేవు.


ఆ విషయం అలా ఉంచితే,ప్రస్తుత రామ రావణ జాతకాలు కరెక్టే అనుకుంటే వీటిల్లో కొన్ని విచిత్రమైన విషయాలు కనిపిస్తాయి.
  • ఇద్దరి జాతకాలలోనూ అయిదుగ్రహాలు ఉచ్ఛ స్తితిలో ఉన్నాయి.అవి-సూర్య,కుజ,గురు,శుక్ర,శనులు.
  • రావణుని జాతకం కూడా శ్రీరాముని జాతకం లాగే చాలా శక్తివంతంగా ఉన్నది.శ్రీరామునితో వైరం పెట్టుకునేవాడు అంతటి శక్తిశాలి అయి ఉండక తప్పదు.హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించి సభలో రావణుని చూచినప్పుడు అతని తేజస్సుకూ బలానికీ విభవానికీ  ముగ్డుడైనాడని రామాయణం అంటుంది.
  • గ్రహాలన్నీ దాదాపుగా ఇరువురికీ సమానమైన శక్తిలో ఉన్నాయి.
  • కుజుడు ఇద్దరి జాతకంలోనూ ఉచ్ఛ స్తితిలో ఉన్నాడు.వీరిద్దరూ యుద్దవిద్యలో సమఉజ్జీలే.రావణుడు కూడా శ్రీరామునివలె శస్త్రాస్త్ర విద్యలలో అజేయుడు.వరసంపన్నుడు.తపోబలం కలిగినవాడు.
  • కాని రాహుకేతువుల స్తితులు మాత్రం తారుమారు అయ్యాయి. రావణుని జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్తితిలో ఉండగా శ్రీరామునికి అవి నీచస్తితిలో ఉన్నాయి.ఇదే అసలైన వింత. రాహుకేతువులు కాలస్వరూపాలు.అవి ఉచ్ఛస్తితిలో ఉంటె కాలం బాగా కలిసి వస్తుంది.లేకుంటే కలిసిరాక అనేక చిక్కులు చికాకులు పెడుతుంది.రావణుని జీవితం బతికినన్ని రోజులూ పట్టిందల్లా బంగారంగా నడిచింది.శ్రీరాముని జీవితం అంతా కష్టాలే.కనుక ఈ గ్రహస్తితి నిజమే కావచ్చు.
  • రావణునికి శని ఉచ్ఛస్తితిలో ఉన్నప్పటికీ వక్ర స్తితిలో ఉన్నాడు. ఇలాంటి వారి జాతకాలలో శని వారికి ముందుగా మహోన్నత స్తితిని ఇచ్చి తర్వాత ఒక్కసారిగా పతనం గావిస్తాడు.వారి ఉన్నతి కూడా వక్రమార్గంలో చేరుకున్నదే అయి ఉంటుంది.కాని శ్రీరాముని జాతకంలో అలా లేదు. అక్కడ శని వక్రస్తితి లేదు.కనుక ఆయన జీవితం అంతా ధర్మానుసారం గడిపాడు.కష్టాలు ఎదురైనా ధర్మాన్ని తప్పకుండా జీవితం సాగించాడు.
  • ఇకపోతే ముఖ్యమైన అంశం లగ్నం.రావణుని లగ్నం మేషం అయింది.లగ్నాధిపతి కుజుడు దశమంలో ఉచ్ఛస్తితివల్ల మహా భూమండలానికి రాజు అయ్యాడు.కాని అదంతా హింసతో సంపాదించాడు.మొండి పట్టుదలా,ఏది ఏమైనా తాననుకున్నది సాగాలనే అహమూ ఇక్కడ కనిపిస్తాయి.కుజుడు సోదరకారకుడు కనుక తన సోదరుడైన కుబేరుని చావగొట్టి లంకా నగరాన్ని ఆక్రమించాడు.
  • లగ్నంలో పంచమాదిపతి సూర్యుని ఉచ్ఛస్తితి వల్ల వేదవేదాన్గాలలో మహాపాండిత్యం వచ్చింది.రావణుడు జ్యోతిశ్శాస్త్రంలో మహాపండితుడు. ఆయన వ్రాసిన 'రావణసంహిత' అనే ఉద్గ్రంధం ఒకటి ఉన్నదని అంటారు గాని అది ప్రస్తుతం ఎక్కడా లభించడం లేదు.ఆ పేరుతో దొరికే పుస్తకాలు అసలైనవి కావు.నకిలీలు. 
  • శ్రీరాముని జాతకంలో లగ్నం కర్కాటకం అయింది.దశమంలో సూర్యుని ఉచ్ఛస్తితివల్ల పూర్వీకుల నుంచి వచ్చిన రాచరికం ఆయన్ను వరించింది.సూర్యుడు పితృకారకుడు కదా.అదీగాక ధర్మపరులైన చక్రవర్తుల వంశంలో పుట్టాడని దీనివల్ల సంకేతం ఉన్నది.
  • అంతేగాక లగ్నంలోని గజకేసరీ యోగం వల్ల దయార్ద్ర హృదయమూ క్షమాగుణమూ ధర్మతత్పరతా కనిపిస్తున్నాయి.
  • రావణుని జాతకంలో సప్తమాధిపతిగా శుక్రుడు ద్వాదశంలో ద్విస్వభావ రాశిలో ఉచ్ఛ స్తితివల్ల,లగ్నాదిపతికి ఉపచయస్తాన స్తితివల్లా కనిపించిన అందగత్తెనల్లా చెరపట్టి తెచ్చుకునేవాడు.చివరకు వావీవరసలు మరచి రంభను కూడా బలాత్కరించాడని,తత్ఫలితంగా శాపానికి గురయ్యాడనీ గాధ ఉన్నది.
  • శ్రీరాముని జాతకంలో సప్తమాధిపతి శని చతుర్దంలో ఉచ్ఛస్తితిలో ఉన్నాడు.గజకేసరీ యోగంలో ఉన్న లగ్నాదిపతికి కేంద్రస్థానంలో ఉన్నాడు.కనుక ధర్మం కోసం తనంతట తానుగా సంసారసుఖం వదులుకుని అడవుల పాలయ్యాడు.జీవితమంతా ధర్మం కోసం నానా కష్టాలు అనుభవించాడు.
  • శ్రీరామునికి బుధుడు లాభస్తానంలో ఉన్నాడు.కనుక ఆయన బుద్ధి పెడమార్గం పట్టలేదు.రావణుని లగ్నానికి బుధుడు మంచివాడు కాదు.పైగా మారక స్తానంలో ఉన్నాడు.కనుక పెడబుద్ధి ఎక్కువై చావు దాకా తెచ్చుకున్నాడు.
  • రావణునికి తృతీయంలోని రాహువు వల్ల శక్తివంతులైన క్రూరులైన సోదరులున్నారు.శ్రీరామునికి తృతీయాదిపతి లాభస్థానస్తితి వల్ల తనకు అనుకూలురైన మంచి సోదరులున్నారు.
  • రావణునికి పంచమాదిపతి సూర్యుడు లగ్నంలో ఉచ్ఛ స్తితివల్ల మహా పరాక్రమశాలి అయిన మేఘనాధుడు జన్మించాడు.శ్రీరామునికి పంచమాదిపతి కుజుని సప్తమ ఉచ్ఛస్తితివల్ల తేజోవంతులైన పుత్రులున్నప్పటికీ వారికి దూరంగా ఉండవలసి వచ్చింది.
  • రావణునికి లగ్నం ఉచ్ఛ సూర్యునితో కూడి శుక్ర బుధుల చేత అర్గళమై ఉన్నది. కుజ దృష్టిని కలిగి ఉన్నది.కనుక ఆయన మనస్సు అతికామం తోనూ,రాజసదర్పంతోనూ,అహంతోనూ,విద్యానైపుణ్యంతోనూ,మేధా సంపత్తితోనూ పదిరకాల దారులలో లాగబడుతూ అనుక్షణం సతమత మయ్యేది.అందుకే బహుశా ఆయనకు దశకంటుడు అని పేరొచ్చింది. శ్రీరాముని లగ్నంలో అటువంటి బాధలేవీ లేకుండా గజకేసరీ యోగం వల్ల దయ,ధర్మం,సత్యసంధత మొదలైన సద్గుణాలతో నిండి ఉండేది.
ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన గ్రహస్తితులున్నప్పటికీ స్వల్ప తేడాలవల్ల వీరిద్దరి జాతకాలలో ఎంత భిన్నత్వం వచ్చిందో పరిశీలిస్తే అద్భుతంగా ఉంటుంది.రావణుడు కూడా అన్నింట్లో శ్రీరామునితో సమఉజ్జీ అయినప్పటికీ ఆయనకున్న స్త్రీవ్యామోహం వల్ల పతనమయ్యాడు.శ్రీరాముని జాతకంలో ఇటువంటి దుర్గుణాలు కనిపించవు.ఈ కోణాలు వారివారి జాతకాలలో చక్కగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ విధంగా రామరావణ జాతకాలు పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలు మనకు దర్శనమిస్తాయి.
read more " రామ రావణ జాతకాలు "

18, ఏప్రిల్ 2013, గురువారం

హోమియో అద్భుతాలు - విడవని దగ్గు హిస్టీరియానా?

ఏప్రియల్ 10 డా|| హానిమన్ పుట్టినరోజు.ఆ సందర్భంగా ఈ మధ్యన నేను చేసిన ఒక కేస్ వివరాలు చూద్దాం.

పేషంట్ వయసు: 40+
సమస్య: నెలల తరబడి విడువని దగ్గు.

డాక్టర్లకు చూపిస్తే ముందుగా కొండనాలిక పరీక్షచేసి జారలేదు బాగానే ఉంది అని చెప్పారు. మళ్ళీ యధావిధిగా పేషంట్ చెబుతున్న వివరాలు ఏమాత్రం వినకుండా వారికి తోచిన క్లినికల్ టెస్ట్ లు వారుచేసి లంగ్స్ క్లియర్ గా ఉన్నాయి అని చెప్పారు. మరి దగ్గు ఎందుకు తగ్గడం లేదు? అనడిగితే చూద్దాం అని కొన్ని మందులు రాసి వాడమన్నారు.అవి వాడినా ఏమీ ఉపయోగం కలగలేదు.దగ్గు ఇంకా ఎక్కువై గొంతు బొంగురు పోయింది.అప్పుడు డాక్టర్ గారికి బల్బ్ వెలిగి ఇది వాయిస్ బాక్స్ ప్రోబ్లం లా ఉంది కనుక ఈఎంటీ స్పెషలిస్ట్ కి చూపించండి.అని చెప్పారు.

అయ్యా దగ్గీదగ్గీ పేషంటు గొంతు బొంగురుపోయింది కాని ఇది ప్రాధమికంగా వాయిస్ బాక్స్ సమస్యలా లేదు,ENT డాక్టర్ అవసరం లేదు అని పేషంట్ పక్కన ఉన్నవారు చెప్పినా డాక్టర్ గారికి అర్ధంకావడం లేదు. చివరికి డాక్టర్ గారికి ఇంకో ఆలోచన వచ్చింది.పేషంట్ ను కొద్దిసేపు బయట కూచోమని  చెప్పి బంధువులతో ఇలా చెప్పాడు. 

'మీ పేషంట్ కు ఏ రోగమూ లేదు.ఎందుకంటే మా టెస్ట్ లలో అంతా నార్మల్ అని వస్తున్నది.ఇదంతా నటన అని నా అనుమానం.కొందరికి హిస్టీరియా ఉంటుంది.వాళ్ళు లేని సమస్యలను కూడా ఉన్నట్లు ఊహించుకుని ఇలా నటిస్తుంటారు.కనుక మీ పేషంట్ ఊరకే నటిస్తున్నాడు.నిజంగా దగ్గులేదు ఏమీలేదు.అందుకని కొన్నాళ్ళు మత్తుమందులు (tranquilizers) ఇద్దాం. అప్పుడు ఆ మత్తులో పడి హిస్టీరియా తగ్గిపోతే దగ్గు కూడా తగ్గిపోతుంది."

ఈ సలహా బంధువులకు నచ్చలేదు.నిక్షేపంగా ఉన్న మనిషికి హిస్టీరియా అంటాడేమిటి ఈ డాక్టర్ కే పిచ్చిలా  ఉంది.ఇక ఈయన ట్రీట్మెంట్ కొనసాగిస్తే ఇంకా రోగం ముదిరేలా ఉంది దేవుడా అని ఆయనకు ఒక దండం పెట్టి బయటకు వచ్చారు. ఈ లోపల పేషంట్ కి కూడా విసుగు వచ్చి ఇక నావల్ల కాదు.ఈ హింస నేను భరించలేను.అని హోమియో విధానానికి షిఫ్ట్ అయ్యారు.

కేస్ నేను టేకప్ చేసేసరికి పరిస్తితి ఇలా ఉంది.
  • లంగ్స్ నార్మల్ గా ఉన్నాయి.వీజింగ్స్ విజిల్స్ లేవు.
  • దగ్గు ఊపిరితిత్తులలోనుంచి కాకుండా పొట్టలోనుంచి వస్తున్నట్లు ఉన్నది.(Sympathetic stomach cough).
  • ఏదైనా తిన్న తర్వాత దగ్గు ఎక్కువ అవుతుంది.కడుపు నిండుగా తింటే దగ్గు మొదలై ఆగకుండా వచ్చి వచ్చి తిన్నదంతా వాంతి అయ్యేవరకూ అలా వస్తూనే ఉంటుంది.
  • వాంతి అయి తిన్నదంతా పడిపోయిన తర్వాత దగ్గు ఆగిపోతుంది.వాంతి ఒక్కొక్కసారి పుల్లగా ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది.
  • రాత్రి పూట తిని నడుం వాల్చిన తర్వాత దగ్గు విపరీతంగా వస్తుంది.మళ్ళీ వాంతి అయ్యే వరకూ అలా వస్తూనే ఉంటుంది.రాత్రంతా దగ్గుతో నిద్ర ఉండదు.(striking and peculiar symptom)
  • దగ్గు ఖళ్ళు ఖళ్ళుమని లోతుగా(deep cough) వస్తుంది. 
  • పేషంట్ కి చలిగాలి పడదు.ఎండలో కూచుంటే హాయిగా ఉంటుంది.
  • స్వతహాగా చల్లని నీళ్ళు ఐస్ క్రీమ్స్ ఇష్టం.కానీ ఇప్పుడు మాత్రం వేడిగా ఏదైనా తాగితే హాయిగా ఉంటుంది.
  • దాదాపు నెల నుంచీ ఆగని దగ్గుతో పక్కలు డొక్కలు అన్నీ నొప్పిగా ఉన్నాయి.దగ్గినప్పుడు నొప్పి బాగా ఎక్కువ అవుతుంది.
లక్షణాలన్నీ పరిశీలించి రిపర్టరైజ్ చెయ్యగా 'నక్స్ వామికా' ఇండికేట్ అయింది.ఆ రోజు రాత్రి దగ్గు వచ్చినపుడు రెండు మాత్రలు 1M పొటేన్సీలో వెయ్యమని చెప్పాను.వేసిన రెండు నిమిషాలకే దగ్గు మాయం అయ్యి పేషంట్ గాఢ నిద్రలోకి వెళ్ళడం జరిగింది.రాత్రంతా మళ్ళీ దగ్గు రాలేదు.

24 గంటలు గడిచినా మళ్ళీ దగ్గు రాలేదు.మర్నాడు భోజనం చేసినా కూడా దగ్గు లేదు.వాంతి రాలేదు.కాని రాత్రి భోజనం చేసి పడుకోగానే మళ్ళీ దగ్గు మొదలైంది.అయితే దగ్గులో మునుపటి తీవ్రత లేదు.లోతునుంచి వస్తున్న శబ్దం పోయి పైపైన వస్తున్నట్లుగా ఉన్నది.మళ్ళీ మందు రిపీట్ చెయ్యమని చెప్పాను.ఈ సారి కూడా మందు పడగానే దగ్గు ఆగిపోయింది.రాత్రంతా నిద్ర హాయిగా పట్టింది.

మూడవరోజు పగలూరాత్రీ దగ్గు రాలేదు.డొక్కలు నొప్పులన్నీ తగ్గిపోయాయి. నిద్ర బాగా పట్టింది.అదే విధంగా నాలుగో రోజూ ఆరో రోజూ మందు వాడవలసి వచ్చింది.అంటే వ్యాధితీవ్రత క్రమేణా తగ్గిపోతూ వచ్చింది.అదే విధంగా మందును కూడా అవసరం ఉన్నపుడే వెయ్యమని,లేకుంటే ఆపమనీ  సూచించాను.

వారం తర్వాత దగ్గు ఎటుపోయిందో ఎలా మాయం అయిందో తెలీదు.పేషంట్ అన్ని విధాలుగా కోలుకోవడం జరిగింది.ప్రస్తుతం ఇది జరిగి దాదాపు రెండు నెలలు దాటింది.ఇంతవరకూ మళ్ళీ దగ్గు రాలేదు.ఆహారం చక్కగా జీర్ణం అవుతున్నది.నిద్ర బాగా పడుతున్నది. Patient is cured.

ఇదీ హోమియోపతి చికిత్స యొక్క అద్భుతం!! సింగిల్ రేమేడీతో అన్ని సమస్యలూ ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా నయం అయ్యాయి.అంతకు ముందు టెస్ట్ లకు దాదాపు అయిదారువేలు అయ్యాయి.కాని ఇక్కడ టెస్ట్ లూ చెయ్యలేదు.ఇరవై రకాల మందులూ వాడలేదు.రోగికి అయిన మందు ఖర్చు ఇరవై రూపాయలు మాత్రమే.

ఇక ఘనత వహించిన మన ఇండియా అల్లోపతీ వైద్యుల డొల్ల ట్రీట్మెంట్ గురించి కొంత చెప్పుకుందాం.

అసలు రోగి ఏమి చెబుతున్నాడో వాళ్ళు సరిగా వినిపించుకోరు.వారి దృష్టి అంతా సాయంత్రానికి మనం ఎంత సంపాదించబోతున్నాం అని డబ్బు మీదే ఉంటుంది కాని అయ్యో పాపం పేషంట్ ఎంత బాధపడుతున్నాడో మనం ఇతనికి ఎలాగైనా సాయం చెయ్యాలి ఈ బాధను నయం చెయ్యాలి అన్న మానవతాదృష్టి వారికి ఉండదు. పోనీ సంపాదిస్తే సంపాదించారు.డబ్బు మీద ప్రతివారికీ ఆశ ఉంటుంది. కాని సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు కదా? అదీ చెయ్యరు.రోగం ఒకటైతే ట్రీట్మెంట్ వేరొకటి.ఈలోపు పేషంట్ కి అదృష్టం బాగుంటే తగ్గుతుంది.లేకుంటే లేదు.ఒకవేళ అటూ ఇటూ అయినా ఎకౌంటబిలిటీ లేదు.ఇదీ మన ఇండియా డాక్టర్ల వరస.

వీళ్ళలో చాలామంది 35 మార్కులతో పాసైన డాక్టర్లే.వారిదగ్గర సబ్జేక్టూ ఉండదు.చిత్తశుద్దీ ఉండదు.ఇక పోతే బాగా చదువుకుని మంచి మార్కులతో పాసైన డాక్టర్లకు దురాశ ఎక్కువ. సాయంత్రానికి లక్షలు కళ్ళజూడాలన్న తలంపు తప్ప వారికి ఇంకోధ్యాస ఉండదు.మన దేశంలో వైద్యం మీద సరియైన చట్ట నియంత్రణా లేదు.సరియైన కంట్రోలూ లేదు.అందుకని ఎవరి ఇష్టం వచ్చిన ఇష్టారాజ్య ట్రీట్మెంట్ వారు ఇవ్వవచ్చు.అడిగేవాడూ లేడు.అడిగినా జవాబు చెప్పేవాడూ ఉండడు.

నేను అనేక వైద్య విధానాలను చాలా ఏళ్ళు చాలా క్లోస్ గా పరిశీలించాను. ఆ అనుభవంతో ఒక్క విషయం చెప్పగలను.హోమియోపతిని మించిన వైద్య విధానం లేనే లేదు. అతి సింపుల్ గా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా,రోగాన్ని మూలం నుంఛి కూకటి వేళ్ళతో నయం చేసేది ఇదొక్కటే అని నేను అనుభవంతో చెప్పగలను.దీనిని రుజువు చేసే అనేక కేస్ లు నా కేస్ ఫైల్స్ నుంచి ఉదాహరణలుగా ఇవ్వగలను.

10-4-2013 న డా||హానిమాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని మరొక్కసారి స్మరిస్తూ ఈ కేస్ లో విజయాన్ని ఆయనకే అంకితం చేస్తున్నాను.
read more " హోమియో అద్భుతాలు - విడవని దగ్గు హిస్టీరియానా? "

16, ఏప్రిల్ 2013, మంగళవారం

మళ్ళీ వచ్చింది చేటుకాలం

ఎవరైనా కొద్దిగా పరిశీలనా శక్తి ఉన్నవారికి ఒక విషయం గోచరిస్తుంది.గత నాలుగైదు రోజుల ముందుకూ ఇప్పటికీ ప్రపంచ సంఘటనల తీరులో మార్పులు కనిపిస్తున్నాయి.ఎక్కడ చూచినా మళ్ళీ ప్రమాదాలు,ప్రాణ నష్టాలు,దుర్ఘటనలు ఎక్కువౌతున్నాయి.ఎందుకిలా జరుగుతున్నాయో ఎవరైనా ఆలోచించారా?

మనిషి జీవితంలోనైనా,సమాజంలోనైనా,కారణం లేకుండా ఏదీ జరగదు. ప్రపంచంలో కాకతాళీయం అంటూ ఏదీ లేదు.అన్నీ కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నవే.అసలు విషయం ఏమిటంటే, ప్రపంచాన్ని కలవరపరిచే చేటుకాలం ప్రస్తుతం మళ్ళీ మొదలైంది. అదేమిటో తెలియాలంటే ప్రస్తుతం ఖగోళంలో నడుస్తున్న ఒక చిన్న గ్రహస్తితిని గమనిస్తే చాలు.

ప్రస్తుతం రాహుశనులకు ఎదురుగా కుజకేతువుల స్తితి మొదలైంది.వీరికి తోడుగా శుక్రుడు సూర్యుడూ కూడా మేషరాశిలోనే ప్రస్తుతం ఉన్నారు.వీరిలో శుక్రుడు మొన్న 11 తేదీన మేషం లోకి ప్రవేశిస్తే కుజుడు 13 తేదీన మేషరాశిలోకి వచ్చాడు.శుక్రుడు మే నాల్గవ తేదీవరకూ మేషరాశిలో సంచరిస్తాడు.ఈ క్రమంలో ఈ నెల 28 న ఖచ్చితంగా కేతువుతో ఒకే డిగ్రీ మీదకు వస్తున్నాడు.25 న పౌర్ణమి అవుతున్నది.ఇకపోతే కుజుడు మే 23 వరకూ మేషరాశి సంచారం ఉంటుంది.ఈ క్రమంలో మే 12 న కుజకేతువుల ఖచ్చితమైన కంజంక్షన్ ఉన్నది.మే 9 న అమావాస్య వస్తున్నది.

ఇన్ని చెడు సమయాలు ఒకేసారి కలిసికట్టుగా దాడి చేసినట్లు రావడం వెనుక ఒక నిగూఢమైన విశ్వప్రణాళిక ఉన్నది.ఈ గ్రహస్తితులన్నీ గమనిస్తే కొన్ని విషయాలు అర్ధమౌతాయి. అవేమిటంటే,ప్రస్తుతం ప్రజలు ఎంతో శ్రద్ధగా పోగు చేసుకుంటున్న పాపకర్మని ప్రక్షాళన చేసే కార్యక్రమం మళ్ళీ మొదలైంది.గ్రహాలు అదే పనిలో ఇప్పుడు మళ్ళీ బిజీగా ఉన్నాయి.

ఏప్రియల్ 11 నుంచి మే 23 వరకూ ఉన్న దాదాపు నలభై రోజుల సమయం చాలా చెడు ప్రభావాన్ని కలిగి ఉండబోతున్నది.మామూలుగా రాహుశనుల కలయిక మంచిది కాదనీ ఇది శపితయోగమనీ ఇంతకు ముందే అనేక ఉదాహరణలతో నిరూపించాను.దీనికి సమానమైన ప్రభావం కలిగినదే కుజకేతువుల సంయోగం.దీనిని అతిశక్తి యోగం అని పిలవవచ్చు.అది కూడా ఖచ్చితంగా రాహుశనులకు సమసప్తకంలో ఉన్నదంటే అది సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

నాది ఉత్తఊహ కాదనీ చేదువాస్తవమేననీ చెప్పడానికి గత కొద్ది రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు గమనిస్తే ఋజువౌతుంది.     

  • కుజుడు 13 తేదీన మేషరాశిలోకి ప్రవేశించి శుక్ర కేతువులతో కలవడం తోనే పాతతరపు మధురగాయకుడు పీబీ శ్రీనివాస్ హటాత్తుగా 14 తేదీన మరణించాడు.శుక్రుడు కళాకారులకు సూచకుడనీ,కుజ కేతువుల సంయోగం వల్ల హటాత్ సంఘటనలు ప్రమాదాలు జరుగుతాయనీ గుర్తుంటే ఈ సంఘటన ఎంత కరెక్ట్ గా జరిగిందో తెలుస్తుంది.భోజనానికి కూచోబోతూ ఆయన 'హటాత్తుగా' చనిపోయాడు. 
  • ఈరోజున పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దులో భూకంపం వచ్చి ప్రాణనష్టం జరిగింది.మేషరాశి పాకిస్తాన్ కు సూచిక అని గుర్తుంటే ఇప్పుడు ఇదెందుకు జరిగిందో అదికూడా మంగళవారం నాడు ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.మంగళవారం అంగారకుని ఆధీనంలో ఉంటుంది.ప్రస్తుతం మేషరాశిలో నాలుగు గ్రహాలు శపితయోగ పరిధిలో ఉన్నాయి.
  • ఈ భూకంప ప్రకంపనలు మన దేశాన్ని కూడా ఉత్తరదేశంలో తాకాయి.మన దేశసూచికలైన మకర,వృషభాలకు మేషరాశి చతుర్ధ ద్వాదశ స్థానాలలో ఉన్నదని గమనిస్తే ఇదెందుకు జరిగిందో తెలుస్తుంది. అంగారకునికి భూమిపుత్రుడని పేరున్నది.భూమికి కారకగ్రహం కుజుడే. కుజశనుల పరస్పర దృష్టివల్ల భూకంపాలొస్తాయ న్నది ఎన్నోసార్లు రుజువైన జ్యోతిషసూత్రం.  
  •  బోస్టన్ బాంబు పేలుళ్ళలో ఎంతమంది చనిపోయారో ఎంతమంది గాయపడ్డారో పేపర్లు టీవీలు చెబుతున్నాయి.మళ్ళీ నేను చెప్పక్కర్లేదు.అది కూడా క్రీడల సందర్భంగా జరగడమూ క్రీడలు కుజుని అధీనంలో ఉంటాయనీ గుర్తిస్తే విషయం అర్ధమై చక్కని క్లారిటీ వస్తుంది.
  • ఇదే గాక ప్రముఖులైన మార్గరెట్ దాచర్,ఆర్పీ గోయెంకా మొదలైన దిగ్గజాలు ఇదే సమయంలో చనిపోయారు.వీరిద్దరూ మహామొండి మనుషులనీ,ఈ గుణం కుజుని లక్షణాలలో ఒకటనీ కూడా గుర్తించాలి.
  • చివరిగా బంగారం వెండీ ధరలు ఒక్కసారి పడిపోవడం కూడా ఇదే గ్రహ ప్రభావం అంటే కొందరికి నవ్వు రావచ్చు.కాని ఇది సత్యం.విలువైన లోహాలకు కారకుడైన శుక్రుడు కేతుగ్రస్తుడు కావడమూ,శపితయోగ పరిధిలోకి ప్రవేశించడమే దీని వెనుక ఉన్న అసలైన కారణం.
  • ఇక చెదురుమదురుగా ప్రతిచోటా జరుగుతున్న ప్రాణ నష్టం గురించీ దుర్ఘటనల గురించీ నేను చెప్పదలుచుకోలేదు.ఎక్కడ చూచినా రాబోయే నలభై రోజులలో అంతా విధ్వంసమే ఉంటుంది.
  • ముందు ముందు ఇంకా ఎన్నో ప్రమాదకర సంఘటనలు తప్పకుండా జరుగుతాయి.ప్రస్తుతం సూర్యుడు ఉచ్ఛస్తితిలో ఉన్నాడు గనుక కేతువుతో కలిశాడు గనుక ప్రముఖులైన వాళ్ళు ఇంకా కొంతమంది మరణిస్తారు.వాళ్ళు రాజకీయ ప్రముఖులు కావచ్చు.సినీ ప్రముఖులూ,వ్యాపార ప్రముఖులూ కావచ్చు.
  • అలాగే ఈ సమయంలో విమాన ప్రమాదాలూ,వాహన ప్రమాదాలూ,అగ్ని ప్రమాదాలూ ఖచ్చితంగా జరుగుతాయి.
  • ఈ సమయంలో రాజకీయ పరిస్తితులు కూడా గందరగోళం అవుతాయి.
ఈ నలభైరోజుల వ్యవధిలో ముఖ్యమైన ప్రమాద సమయాలు కొన్ని గమనిద్దాం.
  • ఈ నెల 21,22 తేదీలు.
  • ఈనెల 25 వస్తున్న పౌర్ణమి.
  • ఈనెల 28,30 తేదీలు.
  • మే 6.
  • మే 9 నుంచి 14 వరకు.
ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం ఉంటుంది.మొండితనం గా వ్యవహరించేవారికీ,పట్టుదలలకు పోయేవారికీ, దురహంకారులకూ, ఆకతాయిలకూ ఈ సమయంలో యాక్సిడెంట్లు,దెబ్బలు తగలడం,కాళ్ళు చేతులు విరగడం,ఆస్పత్రి పాలు గావడం జరుగుతుంది.మరీ చెడు దశలు జరుగుతున్న వారికి ప్రాణాలు కూడా పోవచ్చు.ముఖ్యంగా రోడ్లమీద కార్లలో దూర ప్రయాణాలు చేసేవారు,రాత్రి ప్రయాణాలు చేసేవారు,రాత్రిళ్ళు ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసేవారు,రాష్ డ్రైవింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

అయితే ఏప్రియల్ 30 వరకూ గురువు నవాంశలో ఉచ్ఛస్తితివల్ల దైవ బలం ఉన్నవారికి మాత్రం కొంత రక్షణా ఊరటా ఉంటాయి.కాని ఆ తర్వాత మాత్రం గురు అనుగ్రహం తొలగిపోతుంది.

తెలివైన వారు జాగ్రత్తగా ఉండి,మంచి మాటలు విని,పద్దతులు మార్చుకుని,పరిహారాలు పాటించి,ప్రమాదాలనుంచి తప్పుకుంటారు.కాని అహంకారులు మాత్రం అన్నీ తమకే తెలుసనీ విర్రవీగుతూ దేన్నీ లెక్క చెయ్యకుండా ముందుకు దూసుకెళ్ళి ప్రమాదంలో పడతారు.ఇది ఖచ్చితంగా జరగడాన్ని రాబోయే నలభైరోజుల్లో చూడవచ్చు.కర్మప్రక్షాళణా సమయం మళ్ళీ వచ్చింది.కుజ శని రాహు గ్రహాల వేటలో ఎంతమంది బలి కానున్నారో ముందు ముందు చూద్దాం.

తస్మాత్ జాగ్రత.
read more " మళ్ళీ వచ్చింది చేటుకాలం "

ఆత్మారామత్వం

నీరవ నిశీధిలోన
ఏకాంతపు మందిరాన 
మధురవేణు నాదమొకటి 
మది లోతుల మ్రోగింది 

ఐదుతాళ్ళ పంజరాన 
అఘోరించు రామచిలుక 
విశ్వపు టంచుల దారుల  
విహరించగ ఎగిరింది 

కట్టుకున్న తాళ్ళన్ని 
వాటికవే వదిలిపోవు 
ఉత్తరేణి మంత్రమొకటి 
ఊరకనే దొరికింది

గుదిబండలు వదిలిస్తూ 
గుంజాటనలను  తెంపెడి 
గూఢమైన దారి చేరు  
గుట్టు ఒకటి తెలిసింది 

అంతరాళ సీమలోన 
అమేయమౌ రహస్యాల 
ఆచూకీ తెలియజేయు 
ఆత్మ ఒకటి కలిసింది 

చీకటి ముసుగేసుకున్న 
చేతనాన్ని మందలించి 
చల్లనైన వెలుగొక్కటి
చిరునవ్వులు చిమ్మింది 

అనవసరపు బరువు వదలి 
ఆద్యంతం తేలికపడి 
ఆత్మ ఒకటి తేలిపోయి
అనంతాని కెగసింది

ఏదో ఉందను భ్రమలను 
చిక్కుకున్న వెర్రిమనసు  
ఏమీ లేదని తెలియగ 
ఎంతో ఉప్పొంగింది 

ఎదురుచూపు లెందుకనుచు 
ఆధారము లన్నివదలి 
ఆత్మయందు ఆత్మనిలిచి 
అవ్యయముగ చెలగింది  

మబ్బులన్ని వీడిపోయి 
మసకలింక తొలగిపోయి
అవధిలేని ఆనందం 
ఆత్మలోన పొంగింది
read more " ఆత్మారామత్వం "

14, ఏప్రిల్ 2013, ఆదివారం

కోడికూత స్వామి

చాలా రోజుల క్రితం ఒక స్నేహితుడు కనిపించి ఒకచోటికి ఆహ్వానించాడు.

'భగవాన్ కోడికూత స్వామి' అని ఒకాయన ఊళ్లోకోచ్చాడు.ఆయనకు సన్మానం జరుగుతున్నది.చూద్దాం వస్తావా?

'రాను' అని చెప్పాను.

'ఎందుకు రావు? ఆయన దగ్గర చాలా మహిమలున్నాయిట' చెప్పాడు.

'అందుకే రాను.మహిమలు ఉన్న స్వాములంటే నాకు పడదు.మహిమలూ ఆడంబరాలూ లేని అతి సామాన్య స్వాములు ఎవరైనా ఉంటె చెప్పు.అలాంటి వారి దగ్గరకైతే వస్తాను' చెప్పాను.

'నీ ఇష్టం. నే పోతున్నా' అంటూ స్నేహితుడు వెళ్ళబోయాడు.

'సరే.పోయొచ్చి విశేషాలు చెప్పు' అన్నా.

అలా పోయిన వాడు తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ ఒక చోట కలిశాడు.అప్పుడు కొన్ని వివరాలు చెప్పాడు.

'కోడికూత స్వామి ఐదో తరగతి వరకే చదూకున్నాడు.కాని ఇప్పుడు ఆయన ఆశ్రమానికి మినిస్టర్లు,సినిమా స్టార్లు,అయ్యేయెస్ ఐపీయస్ ఆఫీసర్లు,బడా పారిశ్రామిక వేత్తలు క్యూలు కడుతున్నారు' అన్నాడు.

'అయితే ఇందులో ఏదో మతలబు ఉన్నట్లే.దీనిని ఖచ్చితంగా అనుమానించవలసిందే.ఇంతకీ స్వామివారు వీళ్ళందరి చేతా ఏమి చేయిస్తారు?' అన్నాను.

'ఏం లేదు.అందరికీ ఆయన సమక్షంలో మళ్ళీ పెళ్లి చేయిస్తాడు'.

నాకు మతిపోయింది.

'పెళ్ళా?అదేంటి.వాళ్లకు ఒకసారి పెళ్లి అయింది కదా?ఆయన సమక్షంలో మళ్ళీ పెళ్లి ఏమిటి? అంటే రెండో పెళ్ళా?'అడిగాను.

మిత్రుడికి కోపం వచ్చింది.'నీతో ఇదే తంటా. సరిగా వింటే చెబుతాను.లేకుంటే చెప్పను.' అరిచాడు.

'అప్పుడే ఆయన బుట్టలో పడిపోయినట్లున్నావే.సరే చెప్పు.'

'ఆయన సమక్షంలో పెళ్లి చేసుకుంటే ఆ బంధం కలకాలం నిలుస్తుందట. అందుకే వాళ్ళు తెచ్చుకున్న భార్యతో మళ్ళీ పెళ్లి చేయిస్తాడు' అన్నాడు.

'ఓహో.అగ్నిసాక్షిగా చేసుకున్న పెళ్లి కంటే ఈయన సమక్షంలో చేసుకున్న పెళ్లి పవర్ ఫుల్ అన్నమాట.అయినా తెచ్చుకున్న భార్యేమిట్రా ఉంచుకున్న భార్యన్నట్లు వినటానికే అసహ్యంగా ఉంది?సరే ఏదైతే నాకెందుకుగాని స్వామికి పెళ్లి అయిందా మరి?' అడిగాను.

'అయింది.ఒక పెళ్ళాం.నలుగురు పిల్లలూ ఉన్నారు.కాని వారిని స్వామి ఎప్పుడో వదిలేశారు' చెప్పాడు.

'భేష్.గట్టివాడే.ఆయన సంసారమే నిలబడలేదు.ఇక ఊళ్లోవాళ్ళ సంసారాలు నిలబెడతాడన్నమాట.అద్భుతం అమోఘం.నీకు సరైన గురువు ఇన్నాళ్ళకు దొరికాడు.సంతోషంరా.'అన్నాను.

'అసలు ఆయన సిద్ధాంతం వింటే నీవు మూర్చపోతావు.'అన్నాడు.

'ముఖాన నీళ్ళుచల్లి నీవు లేపుదువుగానిలే.ముందు విషయం చెప్పు.'అన్నా.

'ఆయన ఆశ్రమంలో చేరినవారికి ఒక టైం టేబుల్ ప్రకారం అంతా జరుగుతుంది.ముందుగా ఉదయం మూడు గంటలకే నిద్ర లేవాలి.' చెప్పాడు.

'ఎందుకలా?స్వామికి నిద్రపట్టని రోగం ఏమైనా ఉందా?' అడిగాను.

ఫ్రెండ్ కి మళ్ళీ బోలెడు కోపం వచ్చింది.తమాయించుకుని చెప్పాడు.

'మధ్యలో అడ్డు రాకు.ఫ్లో దెబ్బ తింటుంది.అలా పొద్దున్నే లేవడానికి ఒక కారణం ఉంది.అది తర్వాత చెప్తాను.ముందు అలా మూడింటికే నిద్రలేచి అందరూ తమతమ రూముల్లోంచి బయటకు వచ్చి తూర్పు దిక్కుకు తిరిగి చేతులు పైకెత్తి గట్టిగా 'కొక్కొరో....కో' అంటూ కూత పెట్టాలి.' చెప్పాడు.

నాకు నవ్వుతో పొలమారింది.

'అవున్లే కోడికూత స్వామికదా అందుకే ఇలా కోడికూతతో దినచర్య మొదలౌతుందన్న మాట.చాలా బాగుంది.' నవ్వుతూ అన్నాను.

'దీని వేనకాల లాజిక్ వింటే అప్పుడు అలా నవ్వవు.మనకు ఆరాధ్య దైవం సూర్యభగవానుడు కదా.దీనిని నీవు ఒప్పుకుంటావా?' అడిగాడు.

'ఒప్పుకుంటాను.మన భూగోళానికి ఆయనే సమస్తం ఇచ్చేది కనుక మనకు ఆయనే దైవం.కరెక్టే.'చెప్పాను.

'కానీ ఆ సూర్యుడు ఉదయించబోయే విషయం కూడా కోడికి ముందే తెలుస్తుంది.అందుకే అది మూడింటికే లేచి 'కొక్కొరో..కో'అని కూత పెడుతుంది.కనుక కోడి కంటే గొప్ప దైవం ఉంటానికి వీల్లేదు' చెప్పాడు.

నాకు నోట మాట రాలేదు.'ఎంత గొప్ప లాజిక్ రా.ఇది నీ సొంత బుర్రా లేక స్వామీజీ తన మెదడు నీకు అద్దెకిచ్చాడా?' అడిగాను.

'నా మొహం.నాకింత తెలివి ఎక్కడేడిసింది గాని ఇదంతా స్వామీజీ చలవే. ఇవుగో స్వామి ఉపన్యాసాల సీడీలు.ఇవి విన్నావంటే నీకు జ్ఞానోదయం తప్పకుండా అవుతుంది.'అన్నాడు.

'వద్దులే.నువ్వు ఫ్రీగా ఇచ్చినా వాటిని తీసుకునే ధైర్యం నాకు లేదులే గాని.నీవే ఉంచుకో.ఇంతకీ ఆశ్రమంలో ఆహారం ఏమి ఉంటుంది?' ఆ సీడీలు పక్కకు తోస్తూ అడిగాను.

'అంతా కోడిలాగే ఉంటుంది. లంచ్ టైంలో స్వామీజీ గింజలు వెదజల్లుతూ ఆశ్రమం గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటారు.భక్తులందరూ కోడిలాగా ఎగురుతూ నోటితో ఆ గింజలు ఏరుకుంటూ తినాలి.పెద్ద పెద్ద ఒబేసిటీ పేషంట్లు కూడా అక్కడ చేరారంటే ఒక్క నెలలోనే సన్నగా బక్కపీచుల్లాగా తయారౌ తున్నారు.' చెప్పాడు.

'అబ్బ,ఎంత గొప్ప విషయం చెప్పావురా.అంటే కోడిని అనుసరించడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?' అన్నాను.

'అవును ఇప్పటికైనా స్వామి గొప్పదనం ఒప్పుకుంటావా?' అడిగాడు.

'ఒప్పుకోక చస్తానా?నీకోసమైనా ఒప్పుకుంటాలే గాని ఇంతకీ భక్తుల్ని రాత్రికి బుట్ట కింద పెట్టి మూతలేస్తాడా మీ స్వామి?' అడిగాను.

'లేదు.ఎవరి రూములో వాళ్ళు పడుకోవాలి.కాని దోమతెరనే బుట్టలాగా డిజైన్ చేశారు.అందులో పడుకుంటే మనకు బుట్టకింద పడుకున్న అనుభూతి మిగులుతుంది.' చెప్పాడు.

'మరి భక్తులు పెట్టె గుడ్లను ఎవరు పొదుగుతారు?' సీరియస్ గా ముఖం పెట్టి అడిగాను.

మావాడికి శక్తి ఉంటె వాడు చూచిన చూపుకు నేను భస్మం అయిపోయి ఉండేవాడిని.

'అన్నీ నీకే తెలిసినట్లు ప్రతిదాన్నీ ఎగతాళి చేస్తావురా?' అన్నాడు.

'అదికాదురా.నువ్వు చెప్పేది శ్రద్ధగా వింటున్నాను కదా.మధ్యలో అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? అందుకే అడిగాను.నీకు తెలిస్తే చెప్పు.కోపం ఎందుకు?' అన్నాను.

'నీవు మా ఆశ్రమంలో చేరాలంటే ముందుగా మా ఆశ్రమానికి ఒక వంద కోళ్ళను డొనేట్ చెయ్యాలి.వాటి సంరక్షణ బాధ్యత మాదే.నీకు కావలసినప్పుడు వచ్చి అవి ఎలా ఉన్నాయో చూచుకుని నీ కిష్టం వచ్చినన్ని రోజులు మాతో ఉండిపోవొచ్చు.లేదా పర్మనెంట్ గా ఆశ్రమంలో ఉంటామంటే నీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం' అన్నాడు.

'సారీరా.నాకు ప్రస్తుతం ఏ ఆశ్రమంలోనూ చేరే ఉద్దేశ్యం లేదు.'అని చెప్పాను. ఆ తర్వాత వాడిని ఇంకా కొన్ని అనుబంధ ప్రశ్నలు అడుగుదామని అనిపించింది గాని జవాబులుగా ఇంకేం వినాల్సి వస్తుందో బాగుండదని ఊరుకున్నాను.

తర్వాత ఒక ఏడాదికి మళ్ళీ అదే స్నేహితుడు నీరసంగా ముఖం వేళ్ళాడేసుకుని కనిపించాడు.

'అదేంటి అలా ఉన్నావ్? మీ స్వామీజీ బాగున్నాడా?' అడిగాను. 

'లేదు ఆశ్రమం ఎత్తేశారు' చెప్పాడు.

'అదేంటి ఏమైంది'

'మా ఆశ్రమం బాగా పాపులర్ అవడం చూచి ఎదురుగా ఇంకో స్వామీజీ ఆశ్రమం వెలిసింది.ఆయన పేరు 'కోడికూర స్వామి' చెప్పాడు.

మళ్ళీ నాకు భలే నవ్వొచ్చింది.కాని వాడు ఏడుపు మొహంతో ఉంటె మనం నవ్వటం బాగుండదని మళ్ళీ ఆపుకున్నాను.

ఏం జరిగిందో వాడే చెప్పుకొచ్చాడు.

'కోడికూర స్వామి ఫిలాసఫీ మా స్వామికి పూర్తీ వ్యతిరేకం. ప్రకృతి అంతా నిద్రపోతూ ఉంటె కోడి ఒక్కటే చీకట్లో నిద్రలేచి కూత పెడుతుంది.అంటే అది సైతాన్ అన్నమాట.సృష్టికి వ్యతిరేకంగా పొయ్యేది సైతానే కనుక దానిని బతకనిస్తే దైవసృష్టికి ప్రమాదం అని మా స్వామి నమ్మకం.ఆయనకు సింగిల్ పాయింట్ అజెండా ఉంది.అదేంటంటే కనిపించిన కోడిని కనిపించినట్లు కరకరా వడియంలా నమిలెయ్యడమే.ఆయన శిష్యులందరూ రాత్రిళ్ళు మా ఆశ్రమం మీద పడి మేము ముద్దుగా పెంచుకుంటున్న కోళ్ళను ఎత్తుకుపోయి వండుకుని తినేసేవారు.కొన్నాళ్లకు మా ఆశ్రమంలో ఒక్క కోడీ మిగల్లేదు.చివరకు స్వామీజీ అల్లారుముద్దుగా పెంచిన పల్నాడు కోడిపుంజును కూడా వదలలేదు ఆ దుర్మార్గులు'.కన్నీరు కారుస్తూ చెప్పాడు.

'ఆ తర్వాతేమైంది త్వరగా చెప్పు' సస్పెన్స్ భరించలేక అడిగాను.

'ఏముంది?తన కళ్ళముందే కోడి జాతి అలా అంతమై పోతుంటే తట్టుకోలేని కోడికూత స్వామీజీ తన శిష్యురాళ్ళతో కలిసి ఊటీ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.'

'మరి శిష్యుల్ని ఏమి చేశాడు' అడిగాను.

'వారికో దైవకార్యాన్ని అప్పగించాడు స్వామీజీ.తలా వెయ్యి కోళ్ళు పోగేసిన భక్తుడే ఊటీ ఆశ్రమానికి రావడానికి అర్హుడు అన్న నియమం పెట్టాడు.మేమందరం ఆ పనిలో ఉన్నాం.'

ఇంతలో ఒక కోడి రోడ్డుమీద పోతూ కనిపించింది.

'వస్తాన్రా.ఆ కోడిని పట్టుకోవాలి.నేను టార్గెట్ కి దగ్గర దగ్గరగా వస్తున్నాను.త్వరలో వెయ్యి కోళ్ళు పట్టుకుని ఊటీ వెళ్ళాలి.కొక్కొరో...కో' అంటూ ఆ కోడి వెంట స్పీడుగా పరిగెత్తాడు.అదేమన్నా తెలివి తక్కువదా?వీడికి చిక్కకుండా అదింకా స్పీడుగా పరిగెత్తింది.క్షణంలో కోడీ,వాడూ సందు మలుపు తిరిగి మాయమై పోయారు.

నేను నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయాను.అంతా కలిమాయ.ఈ కలియుగంలో ఇంకెంతమంది ఇలాంటి స్వాములను చూడాలో అని ఆలోచిస్తూ నిదానంగా మా ఇంటి దారి పట్టాను.
read more " కోడికూత స్వామి "

13, ఏప్రిల్ 2013, శనివారం

అవసరానికి పనికి రాని శక్తులెందుకు?

అనగనగా ఒక స్వామిగారున్నారు.ఆయన్ను చూస్తె జనానికి భక్తికి తోడు భయమూ ఎక్కువే.ఎందుకంటే ఆయనకు తాంత్రిక విద్యలు తెలుసని అందరూ గుసగుసలాడుకుంటారు. ఆయన అప్పుడప్పుడూ అమెరికా కూడా వెళ్లి అక్కడి భక్తులను కరుణించి వస్తూంటారు.ఆయన ఆశ్రమంలో రకరకాల పనులు కావడానికి ఎండు మిరపకాయల హోమాలూ,ఆవాల హోమాలూ, బొగ్గుల హోమాలూ అర్ధరాత్రిపూట జోరుగా సాగుతూ ఉంటాయి.ఆయనకు మంత్రుల అధికారుల అండదండలు కూడా బాగా ఉన్నాయని చెప్పుకుంటారు.

ఆయన తంత్రవిద్యలో అఖండుడని ఆయన భక్తబృందం ప్రచారం చేస్తూ ఉంటుంది.ఆయన శిష్యులందరూ అమావాశ్యకీ పౌర్ణమికీ రాత్రిపూట మేలుకుని డాబాల మీద కెక్కి ఆరుబయట హోమాలు చేస్తూ ఉంటారు.వాళ్ళలో కొందరు నగ్నంగా కూడా మారి ఆయా హోమాలు చేస్తూ ఉంటారట.ఆయనకు ఆయన శిష్యులకు అతీంద్రియ శక్తులున్నాయనీ వాళ్ళు పిలిస్తే అమ్మవారు పలుకుతుందనీ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకున్న శక్తుల గురించి రకరకాల కధలు ఉన్నవీ లేనివీ కల్పించి ఆయా శిష్యులు ప్రచారాలు చేస్తూ ఉంటారు.పిచ్చి జనం నమ్ముతూ ఉంటారు.

ఆ మధ్యన ఆకాశంలో దేవతలూ రాక్షసులూ కొట్టుకుంటూ ఉంటె ఆ యుద్ధంలో తిరుపతి వెంకటేశ్వరస్వామి శక్తి హీనుడై ఓడిపోతే అప్పుడు పిట్స్ బర్గ్ వెంకటేశ్వరస్వామి అమెరికా నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ యుద్ధంలో దేవతల పక్షాల పోరాడి రాక్షసులని చావా చితకగొట్టి చెవులు మూసి పంపించాడనీ ఈ సంఘటనకి తానె ప్రత్యక్షసాక్షిననీ ఆయన ఒక ఉపన్యాసంలో చెబుతుంటే సదరు శిష్యులు తన్మయత్వంలో పడి వింటూ ఆనందబాష్పాలు కార్చారు.అంతటితో ఆగకుండా ఆపకుండా చప్పట్లు కొట్టి ఆయన్ను ఉత్తేజపరిచారు.అదీ ఆ స్వామివారి మరియు వారి భక్తుల స్తితి.

కానీ సదరు స్వామిగారి దగ్గర ఒక మంచి అలవాటుంది.అడిగినవారికీ అడగనివారికీ దశమహావిద్యా మంత్రాలను పప్పుబెల్లాల వలె పంచి పెడుతూ ఉంటాడు.నా స్నేహితుడు ఒకాయన భార్యకు బ్రెస్ట్ కేన్సర్ వస్తే ఈ స్వామిగారు అతనికి ధూమవతీ మంత్రాన్ని ఉపదేశం చేసి 'దీనిని జపించు నీ భార్యకు తగ్గిపోతుంది' అని చెప్పారు.పాపం స్నేహితుడు ఆయన చెప్పినట్లే తూచా తప్పకుండా చేశాడు.కాని అతని భార్య మాత్రం కేన్సర్ కు యధావిధిగా బలి అయిపోయింది.మంత్రం పని చెయ్యలేదు.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ మధ్యనే వీళ్ళ గ్రూపులో ఒకాయన కొడుకు ఒక పరాయి దేశంలో ఉన్నట్టుండి కనపడకుండా మాయమయ్యాడు.ఆ తర్వాత పదిరోజులకు అతని శవం ఆ దేశపు పోలీసులకు దొరికింది.మరి ఈ పదిరోజులూ ఈ తాంత్రికస్వామివారూ ఆయన శిష్య బృందమూ హోమాలు చేసి ఆ కుర్రవాడి ఆచూకీ కనిపెట్టి ఉండవచ్చు కదా? పోనీ అమ్మవారితో డైరెక్ట్ గా మాట్లాడే శక్తి మాకుందని వీరంతా చెబుతూ ఉంటారు కదా.అలాంటప్పుడు అమ్మవారితో మాట్లాడి అతనికి జరుగబోతున్న ఆపదను నివారించవచ్చు కదా?దీనిలో ఏదీవారు చెయ్యలేక పోయారు.

పోనీ కర్మ బలీయం కనుక అతనికి అలా రాసిపెట్టి ఉందని,మేము తప్పించలేమనీ వీళ్ళు చెప్పవచ్చు. అంటే కర్మను తప్పించే శక్తి వీరికి లేదని ఒప్పుకున్నట్లేగా? అలాంటప్పుడు ఏవేవో శక్తులున్నాయని మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చెయ్యడం ఎందుకు?నిజంగా శక్తులు ఉంటె పని చెయ్యవలసిన కష్టసమయంలో అవెందుకు పని చెయ్యలేదు?

పోనీ కర్మను తప్పించడం కష్టం అనేమాట నిజమే కాబట్టి మనమూ ఒప్పుకుందాం. కనీసం ఈ పదిరోజులలో ఆ అబ్బాయికి ఏమైందో అతని శవం ఎక్కడ పడి ఉందొ అదైనా వీళ్ళ శక్తులు (అవి వీళ్ళకు నిజంగా ఉంటె) ఉపయోగించి తెలుసుకుని పోలీసులకో తల్లిదండ్రులకో చెప్పవచ్చు కదా? వీరికి వెతుకులాట తప్పేది కదా? లోకాన్ని మొత్తం ఉద్దరించమని నేను చెప్పడం లేదు.అది సాధ్యం కాదని నాకూ తెలుసు.కనీసం వాళ్లకు బాగా తెలిసిన వారికి వచ్చిన ఆపదను కూడా నివారించలేని,కనీసం అతని శవం ఎక్కడ పడి ఉందో కూడా చెప్పలేని వీళ్ళు తమకు ఏవో శక్తులున్నాయని ప్రచారాలు చేసుకోవడం ఆత్మవంచన మాత్రమె కాదు.ప్రజా వంచన కూడా. వీరి వెంటపడే భక్తులు కూడా స్వార్ధంతో తమ పనులు కావడానికి వీళ్ళ వెంట తిరుగుతూ ఉండే చవకబారు భక్తులే.వీళ్ళలో ఎవరికీ నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలీదు.దాని అవసరం కూడా వారికి లేదు.

భక్తుల పనులు కావడం కోసం స్వామి చుట్టూ తిరుగుతారు.స్వామి కూడా అంతే.తన పనులకోసం భక్తులను వాడుకుంటాడు.ఇదొక సింబియాటిక్ రిలేషన్.ఇద్దరికీ దేవుడు అక్కర్లేదు.ఆధ్యాత్మికతా అక్కర్లేదు.అంతా నాటకం మోసం.

ఇంకొక గురువు గారున్నారు.ఆయన లోకుల సమస్యలన్నీ తీరుస్తారని ప్రచారంలో ఉంది.అలా పనులైన భక్తులూ శిష్యులూ ఎన్నో కధలను చెబుతూ కూడా ఉంటారు.సీసా దగ్గర్నుంచి వీసా వరకూ ఏ పని కావాలన్నా ఆయన ఒక్క చూపు చూస్తె అయిపోతుందిట.కాని ఆ గురువుగారి ఇంట్లోనే తీరని సమస్యలు కొన్నున్నాయి.వాటి గురించి ఎవరైనా అడిగితే మాత్రం ఆయన గౌరవప్రదమైన మౌనం వహిస్తారు.లోకుల విషయంలో పనిచేసే ఆయన శక్తులు తన కుటుంబ సభ్యుల విషయంలో ఎందుకో మరి పనిచెయ్యవు.

ఆపరేషన్ దియేటర్ లో కూడా ప్రత్యక్షమై డాక్టర్లను పక్కకు తప్పుకోమని భక్తులకు తానె ఆపరేషన్ చేసారని ఒక స్వామి గురించి చెప్పుకునేవారు.ఆయనగారు ఒకరోజున తన విదేశీ భక్తులిచ్చిన హెయిర్ బ్లోయర్ తన గదిలో కూచుని వాడుకుంటూ తన జుట్టును రింగులు తిప్పుకునే పనిలో ఉండగా,పొరపాటున కరెంటు పోయి అది ఆగిపోయింది.ఏమైందా అని దాని గొట్టాన్ని కంటి దగ్గర పెట్టుకుని ఆయన దాంట్లోకి చూస్తూ ఉండగా అకస్మాత్తుగా కరెంట్ రావడమూ,బ్లోయర్ పనిచెయ్యడం మొదలుపెట్టి వేడిగాలిని ఆయన కంట్లోకి స్పీడుగా చిమ్మడమూ అది వాఛి ఎర్రబడి పోవడమూ తత్ఫలితంగా స్వామివారి దర్శనాలు కొన్నాళ్ళు కేన్సిల్ కావడమూ,పాపం విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఆ రెండుమూడు రోజులు వేచి చూడవలసి రావడమూ చకచకా జరిగిపోయాయి.వేల మైళ్ళ దూరాన ఉన్న ఆపరేషన్ దియేటర్ లో ప్రత్యక్షమై తానె ఆపరేషన్ చెయ్యగల స్వామిగారికి హెయిర్ బ్లోయర్ తో పనేమిటి?భక్తులు బయట ఎండలో వెయిట్ చేస్తుండగా ఈయన తన గదిలో కూచుని జుట్టును రింగులు తిప్పుకునే ఖర్మేమిటి? జవాబులు లేవు.రావు.   

ఇంకో స్వామి గారున్నారు.ఆయన సంగీతంతో రోగాలు తగ్గిస్తానని ప్రచారం చేసుకుంటారు.ఏభై ఏళ్ళు దాటినా ఆయన జుట్టూ బవిరిగడ్డమూ నల్లగా నిగనిగలాడుతూ ఉండేవి.అదంతా ఆయన యోగశక్తి మహిమ అని అందరూ అనుకునేవారు.ఈయన గారు అగ్నిగుండంలో దిగి బయటకు వచ్చినా ఒక వెంట్రుక ముక్క కూడా కాలదని ప్రచారం చేసేవారు.అలాంటిది ఉన్నట్టుండి ఒక వారంలో అంతా తెల్లబడి పోయింది. అదేంటయ్యా అంటే 'స్వామి వారు రంగేసుకోవడం మానేశారు' అని ఒక శిష్యుడు నాకు లోపాయికారీగా తెలియజేశాడు.'పోనీ ఆ బృహత్తర బాధ్యతను మీ శిష్యులలో ఎవరైనా ఒకరు తీసుకుని ఆయనకు రెగ్యులర్గా రంగు వెయ్యవచ్చు కదా' అని అడిగాను.'ఛీ బాగుండదు.గోడకు సున్నం వేసినట్లు గురువుగారి జుట్టుకి గడ్డానికి మేము రంగేస్తే చండాలంగా ఉంటుంది' అని అతను చెప్పాడు.పరవాలేదు కొంచం సెన్స్ ఇతనిలో ఇంకా బతికి ఉంది అనుకున్నాను.

కేన్సర్ వంటి ఇతరుల రోగాలు సంఘీతంతో తగ్గించే ఈ స్వామివారు తన జుట్టు తెల్లబడకుండా అదే సంఘీతాన్ని ప్రయోగించుకోలేడా? అని ఎవరికైనా సందేహం వస్తే ఆ వ్యక్తి హిందూమత ద్రోహి కింద లెక్క. అసలు స్వామివారి జుట్టు నల్లగా ఉంటె ఏమిటి తెల్లగా ఉంటె ఏమిటి?ఆయనేమన్నా తెలుగుసినిమా హీరోనా తొంభై ఏళ్ళోచ్చినా జుట్టు నెరవకుండా చర్మం ముడతలు రాకుండా ఉండటానికి? అయినా స్వామివారికి గ్లామర్ మీద మోజేమిటి? అలాంటి వ్యక్తి 'స్వామి'అనే పదానికి అర్హుడేనా? అని ఎవరైనా అడిగితే అతన్ని రాళ్ళతో కొట్టినా కొట్టి చంపుతారు పిచ్చి తలకెక్కిన భక్తశిఖామణులు. 

సమయానికి పనికిరాని శక్తులు ఎందుకు? అనేదే నా ప్రశ్న. ఇలాంటి స్వాములను నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అనేదే నా సందేహం.అసలు ఈ శకులు వీరికి ఉన్నాయా? ఉంటె అవసర సమయంలో ఎందుకు పనిచెయ్యవు?నిజంగా అవసరం అయినప్పుడు వీళ్ళు ఎందుకు ముఖం చాటేస్తారు?అంటే వీళ్ళు చెప్పేవన్నీ ఉత్తఉపన్యాసాలూ కబుర్లూ అబద్దాలేనా?ఈ ప్రశ్నలకు జవాబులు లేవనీ రావనీ కూడా నాకు తెలుసు.అన్నీ తెలిసినా ప్రశ్నలు అడగటం నా బలహీనత.అన్నీ తెలిసి కూడా జనాన్ని మోసగించడం ఇలాంటి స్వాముల బలహీనత.దురాశకు లోనై మోసపోవడం శిష్యుల బలహీనత.

ఏం చేస్తాం?ఎవరి బలహీనతలు వారివి.లోకమంతా పరస్పర బలహీనతల మీద ఆధారపడి నడుస్తున్నది.ఆశపోతు జనానికి దురాశ నాయకులు, స్వార్ధ భక్తులకు పరమస్వార్ధ స్వామీజీలు,దొంగ శిష్యులకు దొంగ గురువులు ఎవరికి తగిన వాళ్ళు వారికి దొరుకుతారు.లోకం తీరు ఎన్నటికీ మారదన్నది మాత్రం పరమసత్యం.
read more " అవసరానికి పనికి రాని శక్తులెందుకు? "

11, ఏప్రిల్ 2013, గురువారం

పంచాంగ శ్రవణం


పండితుల పంచాంగ శ్రవణాలను వింటూ ఉంటె నాకు నవ్వొస్తూ ఉంటుంది.ముఖ్యంగా అధికారికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణాలు ఫక్తు నవ్వులాటలుగా ఉంటుంటాయి.

అది చదివే పండితుడో జ్యోతిష్కుడో అతనికి ఎదురుగా మంత్రులూ అధికారులూ కూర్చుని ఉంటారు.వారి హావభావాలు చూస్తె ఎవరికీ ఈ కార్యక్రమం మీద శ్రద్ధ ఉన్నట్లు తోచదు.జోకులేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.లేకుంటే 'ఈ ఏడాది ఖజానా నిండుగా ఉంటుంది' అంటూ ఏదైనా ఒక విషయాన్ని పండితుడు చదివినప్పుడు అదేదో ఒక పెద్ద జోక్ లాగ నవ్వుతూ ఉంటారు.మొత్తం మీద ఈ పంచాంగ శ్రవణాలు అనబడేవి ఒక మొక్కుబడి ఫార్స్ గా తయారయ్యాయి.ఏదో మనమూ పంచాంగ శ్రవణం  చేసాము అని తప్ప జ్యోతిష్యవిద్యను సరిగా ఎలా వాడుకోవాలో ఎవరికీ పట్టినట్లు కనిపించదు.

నిజమైన పంచాగ శ్రవణం అనేది ఎలా ఉండాలి?

ముందుగా వర్ష(సంవత్సర)చక్రం వేసి ఆయా వ్యక్తులకు రాబోయే ఏడాది ఎలా ఉండబోతున్నది అన్న విషయం ఆయా జాతకుల వ్యక్తిగత జాతకాన్ని ఈ వర్షచక్రాన్ని కలిపి పరిశీలించి తెలుసుకోవాలి. దానికి సహకారులుగా రాబోయే ఏడాదిలో సంభవించే గ్రహణాలు ఇతర ముఖ్యమైన గ్రహస్తితులు ఆ జాతకునికి ఏఏ భావాలలో కలుగబోతున్నాయి వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గమనించి ఆయా దోషాలను నివారించుకోవడానికి  తగిన పరిహారక్రియలు చూచుకుని వాటిని ఆయా దశా సమయాలలో ఆచరించి ఆ సంవత్సరం అంతా చెడును తప్పుకొని శుభంగా గడిచేలా జీవితాన్ని దిద్దుకోవాలి. అది పంచాగ శ్రవణం యొక్క అసలైన ఉపయోగం. అంతేగాని కందాయ ఫలితాలూ రాజపూజ్య అవమానాలూ చదువుకుని జోకులేసుకుని నవ్వుకోడానికి కాదు.

ప్రస్తుతం అసలైన పంచాంగ శ్రవణ ఉపయోగం మరుగున పడి ఇదొక ఉత్తుత్తి తంతుగా మారింది. ఆ సమయానికి ఏదో తప్పదన్నట్లు పంచాగం వినడం అదికూడా సగం ఎగతాళి ధోరణితోనూ సగం నిర్లక్ష్య భావంతోనూ ముళ్ళమీద కూచున్నట్లు కూచుని పంచాంగ శ్రవణం చేసి,గబగబా తినడానికో తాగడానికో తందనాలకో పరిగెట్టడం జరుగుతున్నది. నేనెప్పుడూ చెప్పేటట్లు ఇది ప్రాణం లేని ఉత్తతంతును జరపడం మాత్రమె.ఇలాంటి మొక్కుబడి పంచాగ శ్రవణాల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు.

తెలియని వాళ్ళు ఏమి మాట్లాడినా మాట్లాడవచ్చు గాక,జ్యోతిష్య శాస్త్రం ఒక మహత్తరమైన సజీవవిజ్ఞానం అన్న విషయం దాని లోతుపాతులు తెలిసినవారికి అవగతమే.ప్రాచీనులు దానిని అనుక్షణమూ అనుసరిస్తూ జీవితాన్ని ఆనందంగా దిద్దుకునేవారు.వ్యక్తిగత జాతకాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఆయా పరిహారాలు చేసుకుంటూ జీవితాలను ఉన్నతంగా నడుపుకునేవారు.కనుకనే జ్యోతిష్య విద్య సజీవంగా అప్పుడు నిలబడి ఉండింది.

రాజులు పాలించే కాలంలో పరిస్తితి భిన్నంగా ఉండేది.నేటి డొల్ల ప్రజాస్వామ్యం తో పోలిస్తే రాజరిక పాలనలు ఎంతో ఉన్నతంగా ఉండేవి.అక్కడక్కడా క్రూరులైన రాజులు ఉన్నప్పటికీ కొన్నాళ్లకు వారి అరాచకమే వారిని పదవీచ్యుతులను గావించేది.రాజులు ముఖ్యంగా ప్రజాక్షేమాన్ని చూచేవారు.ప్రజలకు రక్షణ ఇచ్చేవారు.లా అండ్ ఆర్డర్ నిక్కచ్చిగా త్వరగా అమలు చేసేవారు.వారు స్వయంగా ధర్మాన్ని ఆచరించి ప్రజలకు ఆదర్శంగా నిలిచేవారు.నేరం చెయ్యాలంటే భయం ప్రజలలో ఉండేది.రాజులు మహాపండితులైన ఆస్థాన జ్యోతిష్కుల సలహాలు తీసుకుని దోషపరిహారాలు నిర్వర్తించి రాజ్యంలో ఎలాంటి దుర్భిక్షమూ లేకుండా చూచుకునేవారు. అలాంటి రాజులూ ప్రజలూ నిర్వర్తించే ఉగాది ఉత్సవాలూ,పంచాంగ శ్రవణాలకు ఒక అర్ధమూ పరమార్ధమూ ఉండేది.

నేడు అంతా భ్రష్టత్వం వచ్చింది గనుక ఇదంతా ఒక తంతుగా తయారైంది.ఆ పంచాంగం ఎందుకు చదువుతారో వినేవారికి ఎలాగూ  తెలీదు.ఇక చదివేవారికి ఆయా మంత్రుల అధికారుల వద్ద మెప్పు పొంది ఏవైనా పనులు చేయించుకోవాలని వరాలు పొందాలన్న ధ్యాస తప్ప ఉన్నదున్నట్లు చెబుదామని వారికీ తోచదు.ఉన్నదున్నట్లు చెబితే మళ్ళీ వచ్చే ఏడాది ఈయన్ను పిలవరు.అందుకని ‘వర్షాలు బ్రహ్మాండంగా పడతాయి.అంతా సుభిక్షంగా ఉంటుంది.రాష్ట్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది.’ మొదలైన ఊకదంపుడు మాటలు చెబుతారు.పోయినేడాది కూడా ఇలాగే చెప్పారు.మరి మధ్యలో వర్షాలూ పడలేదు.పంటలూ సరిగా పండలేదు.ఎందుకిలా జరిగింది?మన లెక్కలలో ఎక్కడో ఏదో తేడా ఉందా?లేక లెక్క సరిగా ఉన్నా కూడా,అలా ఉన్నదున్నట్లు చెబితే అధికారులకు నచ్చదు కనుక అలా చెబుతారా? అని ఆలోచిస్తే రెండూ కావచ్చు అని తేలుతుంది.

ఇతరుల మెప్పును ఆశించేవాడూ,వినేవారి దగ్గర నుండి ఏవేవో వరాలు ఆశించెవాడూ అసలు జ్యోతిష్య విద్యకు అనర్హుడు.చెప్పేవారికీ చిత్తశుద్ధి లేదు.వినేవారివీ శుద్ధమైన జీవితాలు కావు. వారికి జ్యోతిష్యం మీద పెద్ద నమ్మకమూ ఉండదు.ఇక ఆ తంతు యొక్క ప్రయోజనం ఏమిటి? అసలెందుకీ పనికిరాని తంతులు? హిందూమతం అంతా ఇలాంటి పనికి మాలిన తంతులతో నిండి పోయి ఉన్నది.

జీవితానికీ లోకానికీ దిక్సూచిగా ఉపయోగపడగలిగే ఒక మహత్తరమైన విద్యను సరిగా వాడుకోవడం తెలియని నేటి తరం మనుషులను చూచి,ఈ నవ్వులాట తంతులను చూచి, ఈ విద్యను లోకానికి అందించిన ప్రాచీన ఋషులూ శాస్త్రవేత్తలూ పై లోకాలలో సిగ్గుతో తలలు బాదుకుంటూ ఉంటారేమో మరి?
read more " పంచాంగ శ్రవణం "