“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, డిసెంబర్ 2019, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (రాహుకాలం - యమగండం)

నేటి పంచాంగాలలో జనాన్ని అనవసరంగా భయపెడుతున్న రెండు మాటలు రాహుకాలం - యమగండం. వీటి అసలు తత్త్వం ఈ పోస్టులో చూద్దాం. కాస్త ధైర్యంగా ఈ పోస్టును చదవండి మరి !

జ్యోతిష్యంలో, మనకు తెలిసిన ఏడు ముఖ్యగ్రహాలకు తోడు ఉపగ్రహాలని ఉన్నాయి. వీటిని పరాశరహోర చెప్పింది. ఫలదీపిక మొదలైన ఇంకా ఇతర ప్రామాణిక గ్రంధాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ ఉపగ్రహాలను ఎలా లెక్కించాలి అనే దానికి ఫార్ములాలు ఉన్నాయి.

కానీ ఈ ఉపగ్రహాలను కూడా తమ జాతక విశ్లేషణలో ఉపయోగించే జ్యోతిష్కులను ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని నేనింతవరకూ ఒక్కడంటే ఒక్కడిని కూడా చూడలేదు.

నిజమే మరి ! నవగ్రహాలే ఇంతవరకూ అర్ధం కాక ఛస్తుంటే వీటికి తోడు ఇంకో తొమ్మిది ఉపగ్రహాలా? మా వల్లకాదు దేవుడోయ్ ! అంటారేమో? సరే అది వారిష్టం. 'ప్రమాణగ్రంధాల నుంచి కూడా మాకిష్టం వచ్చినంత వరకే తీసుకుంటాం' అంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు !

పరాశరహోర ప్రకారం ఉపగ్రహాలు అయిదు. అవి - ధూమ, వ్యతీపాత, పరివేష, ఇంద్రచాప, కేతువులు. ఇవన్నీ సూర్యుని డిగ్రీల నుండి లెక్కించబడతాయి.

ఈ అప్రకాశ (కంటికి కనిపించని) ఉపగ్రహములు సూర్య, చంద్ర, లగ్నములతో గనుక కలిస్తే, క్రమముగా, వంశము, ఆయువు, జ్ఞానములను నశింపజేస్తాయని చెబుతూ పరాశరహోర వీటిని పంచార్కదోషములని అంటుంది. అంటే, సూర్యునికి సంబంధించిన అయిదు దోషములని అర్ధం. 

శ్లో || రవీందు లగ్న గేశ్వేషు వంశాయుర్జ్నాన నాశనం
ఏషాం పంచార్క దోషాణాం స్థితి పద్మాసనోదితా:

ఇవి పూర్వం, బ్రహ్మదేవునిచేత చెప్పబడ్డాయని కూడా అంటుంది ఇదే గ్రంధం.

ఇకపోతే, ఉపగ్రహములను గురించి చెబుతూ మంత్రేశ్వరుడు తన ఫలదీపిక 25 వ అధ్యాయ ప్రారంభశ్లోకం లోనే ఇలా అంటాడు.

శ్లో || నమామి మాన్దిం యమకంటకాఖ్య
మర్ధప్రహారం భువికాల సంజ్ఞం
ధూమ వ్యతీపాత పరిధ్యభిఖ్యాన్
ఉపగ్రహానింద్ర ధనుశ్చ కేతూన్

1. మాంది 2. యమకంటక 3. అర్ధప్రహార 4. కాల 5 . ధూమ 6 . పాత 7 . పరిధి 8. ఇంద్రధనుసు 9. కేతువు అనే తొమ్మిది ఉపగ్రహాలకు నమస్కరిస్తున్నాను అంటాడు.

అసలివన్నీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఉన్న కాల వ్యవధిని బట్టి ఏర్పడతాయి. ఈ టైం స్లాట్ ను ఎనిమిది భాగాలు చేస్తే, ఏడు భాగాలకు ఆ వారంనుంచి మొదలుపెట్టి ఏడు గ్రహాలు అధిపతులు అవుతాయి. ఎనిమిదో భాగానికి ఎవరూ అధిపతి కాదు. రాత్రి పూట అయితే, ఐదో వారం నుంచి లెక్క మొదలౌతుంది.

వీటిల్లో శనీశ్వరుని ఉపగ్రహాన్ని మాంది, లేదా గుళిక అని పిలుస్తారు. గురువుగారి ఉపగ్రహం పేరు యమఘంటక లేదా యమకంటక. అంతేగాని అది 'యమగండం' కాదు.

రాహుకాలం

రాహుకాలం అనేదాన్ని పెద్ద బూచిగా నేటి జ్యోతిష్కులు చూపిస్తున్నారు. ఇది నిజం కాదు. రాహుకాలం అందరికీ చెడ్డది కాదు. ఏ జాతకంలో అయితే రాహువు శుభగ్రహమో, ఆ జాతకానికి రాహుకాలం చాలా మంచిది. ఆ సమయంలో వారు చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఈ విషయం చెప్పకుండా నేటి కుహనా జ్యోతిష్కులు 'ఆమ్మో ! రాహుకాలం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు బాత్రూం కి కూడా పోకూడదు. బిగబట్టుకో.' అని చెబుతున్నారు. పిచ్చిజనం నమ్ముతున్నారు. మోసపోతున్నారు.

రాహుకేతువులు ఒకరి జాతకంలో శుభులైతే, అతడిని అన్నింట్లోనూ శిఖరాగ్రానికి చేరుస్తారు. వారు చేసే మంచి మనం ఊహించలేనంతగా ఉంటుంది. కానీ ఈ విషయం ఎవరూ చెప్పడం లేదు. వారిని దుష్టగ్రహాలుగానే చూస్తున్నారు. కుహనాజ్యోతిష్కులు అలా చూపిస్తూ జనాన్ని నమ్మిస్తున్నారు. గొర్రెలు నమ్ముతున్నారు.

ఒక ఉదాహరణ !

ఒకరి జాతకంలో రాహువు ఉచ్ఛస్థితిలో ఉంది. శుభగ్రహమై ఉంది. ఆ జాతకునికి సరిగ్గా రాహుకాలం సమయంలో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ జ్యోతిష్కులు ఎక్కించిన భయాలతో బిగదీసుకు పోయాడు. లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. కానీ నేను చెప్పిన మాటలు నమ్మి నార్మల్ గా ఇంటర్వ్యూ చేశాడు. ఫలితం ఏమిటో తెలుసా? అతనికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 10th రాంక్ వచ్చింది. ఇది జరిగి ఇప్పటికి ముప్పై ఏళ్లయింది. ఇప్పుడతను ఒక స్టేట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇతను నా మిత్రుడు. రాహుకాలం అతనికి ఏమీ చెడు చేయకపోగా, ఎంతో మంచిని చేసింది.

ఇన్నేళ్ల నా అనుభవం నుంచి, నేను ఇప్పటిదాకా విశ్లేషణ చేసిన 1000+ జాతకాల నుంచి, ఈ విషయంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వగలను.

రాహుకాలం బూచి కాదు. ఇది అందరికీ చెడూ చెయ్యదు. అందరికీ మంచీ చెయ్యదు. కానీ నేటి జ్యోతిష్కులు జనాన్ని 'అమ్మో రాహుకాలం' అంటూ భయపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాహువు ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఫలితాన్నిస్తుంది. ఆ సూక్ష్మాలు తెలుసుకోవాలి.

జ్యోతిష్యశాస్త్రంలో యూనివర్సల్ మంచి గ్రహాలూ, యూనివర్సల్ చెడు గ్రహాలూ లేవన్న విషయం నేటి జ్యోతిష్కులు మరచిపోయారు. అందుకే ఈ పిచ్చి ధోరణులు !

యమగండం

ఇప్పుడు ఇంకో బూచి గురించి చెబుతాను. అదే యమగండం. మీకో విషయం తెలుసా? అసలు యమగండం అనే పదం జ్యోతిష్య శాస్త్రంలో లేనేలేదు.

వింతగా ఉంది కదూ? అదేమరి నేటి జ్యోతిష్కుల మాయంటే??

ఉపగ్రహాలలో, గురువు యొక్క ఉపగ్రహాన్ని 'యమఘంటక' అంటారు. ఈ ఉపగ్రహం యొక్క కాలవేళ మధ్యభాగంలో ఉదయించే లగ్నసమయాన్ని 'యమఘంటక కాలం' అంటారు. దానిని జ్యోతిష్యశాస్త్రపు ఓనమాలు తెలియని నేటి పంచాగజ్యోతిష్కులు 'యమగండం' గా మార్చిపారేశారు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

అసలు 'యమగండం' అనే పదమే శుద్ధబూతు. ఏ ప్రామాణిక జ్యోతిష్య గ్రంధంలోనూ ఈ పదం లేదు. కానీ ఏ పంచాంగం చూసినా ఈ పదం కనిపిస్తుంది. మిమ్మల్ని భయపెడుతుంది. అదేమరి నేటి జ్యోతిష్కుల మాయంటే !

ఇంకో విషయం తెలుసా? ఇదే జ్యోతిష్కులు, గురువును పరిపూర్ణ శుభగ్రహం అంటారు. మరి ఆ గురువు యొక్క ఉపగ్రహమైన 'యమఘంటక' ను మాత్రం చాలా చెడ్డగ్రహం అంటారు. ఇదేంటి? అని అడిగిన వారికి సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగిస్తారు. ఒకసారి అడిగి చూడండి !

పరిపూర్ణ శుభగ్రహం యొక్క ఉపగ్రహం అశుభం ఎలా అవుతుంది? ఏ జ్యోతిష్కుడినైనా చెప్పమనండి చూద్దాం !

ఫలదీపికలో మంత్రేశ్వరుడు ఏమన్నాడో ఒకసారి చూడండి మరి !

శ్లో || గులికస్య తు సంయోగే దోషాన్ సర్వస్య నిర్దిశేత్
యమఘంటక సంయోగే సర్వత్ర కధయే శుభమ్ (ఫలదీపిక 25 - 18) 

'గులికుడు కలిస్తే ఏ గ్రహమైనా చెడిపోతుంది. ఆశుభాన్నిస్తుంది. అదే, యమకంటకుడు కలిస్తే అంతా శుభమే జరుగుతుంది' అని దీని అర్ధం. దీన్ని 'యమగండం' అని మార్చిన పంచాంగ జ్యోతిష్కులు ఇది చాలా చెడుకాలం అని చెబుతున్నారు !

ఇంకో శ్లోకం చూడండి.

శ్లో || దోషప్రదానే గులికో బలీయాత్
శుభ ప్రదానే యమకంటకస్యాత్

'దోషములు ఇవ్వడంలో గులికుడు బలమైనవాడు. శుభ ఫలితములు ఇవ్వడంలో యమకంటక బలీయమైనది' అని దీని అర్ధం.

మరి నేటి జ్యోతిష్కులు దీనికి పూర్తిగా వ్యతిరేకంలో చెబుతున్నారేమిటి? వీరిని శాస్త్రం తెలిసినవారనాలా? దొంగలనాలా? అజ్ఞానులనాలా? మోసగాళ్ళనాలా? లేక ఇంకేమనాలి?

అదే ఫలదీపిక నుంచి ఇంకో శ్లోకం చూడండి !

శ్లో || శనివద్గులికే ప్రోక్తం గురువద్యమకంటకే
అర్ధప్రహారే బుధవత్ఫలం కాలేతు రాహువత్

పైన చెప్పిన ఉపగ్రహాలలో కేతువును గురించి చెప్పారు. గుళిక గురించి చెప్పారు, మరి రాహువు ఎక్కడ అని అనుమానం రావచ్చు. దీనిని వివరిస్తూ పై శ్లోకంలో 'కాలే రాహువత్' - 'కాలము అనే ఉపగ్రహం రాహువు వంటిది' అంటాడు.

కనుక - రాహుకేతువుల ఉపగ్రహాలుగా కాల - కేతువులనూ, శనీశ్వరుని ఉపగ్రహంగా గుళికనూ చెబుతూ, ఇవి చాలా దోషప్రదమైనవి అన్నారు ప్రాచీనఋషులు. 'యమకంటక' అనేది గురువు యొక్క ఉపగ్రహం కనుక చాలా శుభప్రదం అని కూడా వారే చెప్పారు. పైన ఉదాహరించిన శ్లోకాలే దీనికి ప్రమాణాలు.

మరి నేడు ఏ పంచాంగం చూసినా - 'యమగండం' అనే పదాన్ని వాడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదేంటి? ఈ పదాన్ని అసలు సృష్టి చేసిన గిరీశాలెవరు? దాన్ని అదేపనిగా పంచాంగాలలో ఎందుకు, ఎలా వాడుతున్నారు?

అంతేగాక - అంత దోషాన్నిచ్చే గుళిక కూడా, కొన్ని కొన్ని యోగాలలో ఉన్నప్పుడు అమిత శుభాన్నిస్తుంది అని కూడా కొన్ని మినహాయింపులను ప్రామాణిక గ్రంధాలే చెప్పాయి. అదెప్పుదంటే,

శ్లో || గుళిక భవననాధే కేంద్రగే వా త్రికొణే
బలిని నిజగృహస్థే స్వోచ్చమిత్రస్థితేవా
రధగజతురగానాం నాయకో మారతుల్యో
మహిత పృధుయశస్యాత్ మేదినీ మండలేంద్ర:

అంటూ - 

'గులికుడున్న రాశినాధుడు గనుక ఉచ్చ, మిత్ర క్షేత్రములలోగాని, స్వగృహంలో గాని ఉంటూ, అవి కేంద్రకోణములైతే, ఆ జాతకుడిని రధములు, ఏనుగులు, గుర్రములు కలిగినవానిగా, మన్మధుని వంటి రూపసిగా, గొప్ప కీర్తి కలిగిన రాజుగా చేస్తాడు' అంటాడు మంత్రేశ్వరుడు.

కనుక రాహుకేతువులు, శనీశ్వరుడు కూడా కొన్నికొన్ని యోగాలలో ఉన్నప్పుడు అమితమైన శుభాన్ని ఇస్తారని ప్రామాణికగ్రంధాలే చెబుతుండగా, నేటి కుహనాజ్యోతిష్కులు మాత్రం, వీరందరినీ చూపించి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డబ్బుతో బాటు చెడుకర్మనూ మూటగట్టుకుంటున్నారు.

రాహుకేతువులూ, శనీశ్వరుడూ దుష్టగ్రహాలు కారు. యమఘంటక లేదా యమకంటక అనేది కూడా దుష్టగ్రహమూ దుష్టసమయమూ కాదు. 'యమగండం' అనేది అసలు లేనేలేదు. దొంగజ్యోతిష్కుల మాటలు నమ్మకండి !! వీళ్ళే అసలైన దుష్టగ్రహాలు !!

మీకొక అనుమానం రావచ్చు, మీకొక్కరికే జ్యోతిశ్శాస్త్రం తెలుసా? లోకంలో ఇంకెవరికీ తెలీదా? పంచాంగాలన్నీ మరీ ఇంత తప్పులా? అని.

దీనికి సమాధానం వచ్చే పోస్ట్ లో చెబుతాను. యమగండం (?) అనేది చెడు సమయంగా ఎందుకు లోకం భావిస్తోందో కూడా చెబుతాను. వేచి చూడండి మరి !

(ఇంకా ఉంది)
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (రాహుకాలం - యమగండం) "

28, డిసెంబర్ 2019, శనివారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (ఋషులు పెట్టిన ముహూర్తాలు)

ముహూర్తంలోనే అన్నీ ఉన్నాయి అది చాలా ముఖ్యం అనే వాళ్లకు నాదొక ప్రశ్న.

సప్తఋషులలో ఒకరైన వశిష్టమహర్షి పెట్టిన శ్రీరామ పట్టాభిషేక  ముహూర్తం ఎందుకు తప్పిపోయింది? బ్రహ్మఋషి అయిన ఆయనకు మనంత జ్యోతిష్యం రాదా? లేక కావాలనే తప్పిపోయే ముహూర్తం పెట్టాడా?

దీనికి మన పురోహితజ్యోతిష్కులూ పురాణపండితులూ రకరకాల బుకాయింపు   కబుర్లు చెబుతారు.

ఆ ముహూర్తం తప్పిపోతేగాని శ్రీరాముడు అడవికి పోడు. అప్పుడుగాని రావణసంహారం జరగదు. అందుకని అలాంటి తప్పుడు ముహూర్తం పెట్టాడు వశిష్ట మహర్షి - అంటారు వాళ్ళు.

నా జవాబు : అంటే, వశిష్టుని వంటి బ్రహ్మర్షి కూడా అబద్దాలు చెబుతాడన్నమాట ! అబద్దపు ముహూర్తం పెడతాడన్న మాట ! అలాంటాయన బ్రహ్మర్షి ఎలా అవుతాడు?

రావణసంహారం జరగడమే పరమార్ధం అయితే, దానికోసం శ్రీరాముడూ సీతాదేవీ వనవాసం చెయ్యడం ఎందుకు? ఈ మొత్తం గొడవతో ఏ సంబంధమూ లేని లక్ష్మణుడిని కూడా తోడు తీసికెళ్ళి ఆయన్ను హింస పెట్టడం ఎందుకు? సరాసరి రావణుడిమీద యుద్ధం ప్రకటించి అతని యుద్ధంలో చంపెయ్యవచ్చు కదా ! దానికోసం ఇంతమంది ఇంత హింస అనుభవించాలా? సీతమ్మతల్లి అన్ని బాధలు పడాలా?

కనుక ముహూర్తం అనేది జాతకాన్ని అధిగమించలేదు అని స్పష్టంగా తెలుస్తున్నది. అంతేకాదు, ఆ కార్యక్రమం సజావుగా జరగడానికి కూడా ముహూర్తం ఏమాత్రమూ సహాయం చెయ్యదు. అలా చేసే పనైతే, శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తం ఎందుకు తప్పింది?

అందుకనే జిల్లెళ్ళమూడి అమ్మగారు - "పెట్టినది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం" - అన్నారు. 

ఇకపోతే, రెమెడీలతో అన్ని పనులూ సజావుగా జరిగే పనైతే, పాండవులు అన్నేళ్లు అన్ని బాధలు ఎందుకు పడ్డారు? వారి దగ్గర ధౌమ్యుడు ఉన్నాడు కదా ! ఆయనకు జాతకాలు చూపించుకుని రెమెడీలు చేసేసి, తమ రాజ్యాన్ని తాము పొందవచ్చుఁ కదా? అన్నేళ్లపాటు అన్ని బాధలు పడటం ఎందుకు? వాళ్ళు తలచుకుంటే వేళ్ళకు ఉంగరాలు పెట్టుకోలేరా? మెడలో గొలుసులు వేసుకోలేరా?

కనుక వశిష్టమహర్షికి, ముందుముందు జరుగబోయేది తెలియదు అని అర్థమౌతోంది. అలాగే పాండవుల విషయంలో చూస్తే, రెమెడీలు కర్మను తీర్చలేవు అని స్పష్టంగా అర్థమౌతోంది.

ఇంగిలీషు వారి పాలనాసమయంలోనూ, అంతకుముందు తురుష్కుల పాలనా సమయంలోనూ, ఉన్న రాజులూ, సంస్థానాధీశులూ హోమాలు చేయించలేరా? ఉంగరాలు పెట్టుకోలేరా? ప్రదక్షిణాలు చేయలేరా? రెమెడీలు చేయలేరా? వాళ్ళ దగ్గర పురోహితులు లేరా? అన్నీ ఉండి,  పరాయి పాలకుల చేతిలో అన్ని బాధలు ఎందుకు పడ్డారు?

వశిష్టమహర్షి వంటి ప్రాచీన మహర్షుల విషయంలోనే ఇలా  ఉంటే,  మరి నేటి పురోహితులెంత? పంచాంగాలెంత? వీటిల్లో ఒక పంచాంగానికీ ఇంకో పంచాంగానికీ సరిపోదు. ఎవరి ముహూర్తాలు  వారివే. ఎవరి విధానాలు వారివే. కొంతమందికి అమావాస్య చాలా మంచిది. మరికొంతమందికి అమావాస్య చెడ్డది. సాయన విధానానికీ నిరయన విధానానికీ చుక్కెదురు. నిరయనంలో కూడా ఎవరి అయనాంశ వారిదే. అయనాంశ తేడాలవల్ల నక్షత్రాలు మారిపోతాయి. తిధులు మారిపోతాయి. ముహూర్తాలు కూడా మారిపోతాయి. నార్త్ ఇండియాలో ముహూర్తాలు వేరు. సౌత్ ఇండియాలో ముహూర్తాలు వేరు. ఈస్ట్ లో వేరు. వెస్ట్ లో వేరు. మరి, నేటి పంచాంగాలలో ఏ పంచాంగం కరెక్ట్? ఎవరి  ముహూర్తం కరెక్ట్? ఎవరి విధానం కరెక్ట్?

ఇకపోతే, ఇంకొక పాయింట్ ! ప్రపంచ జనాభాలో హిందువుల శాతం ఎంత? 15% కదా? మరి మిగతా 85% ప్రజలు ఏ ముహూర్తాలు చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు? ఏ పంచాంగాలను  అనుసరిస్తున్నారు? ఆ పెళ్లిళ్లు అన్నీ పెటాకులు అవుతున్నాయా? లేదు కదా? ఇంతకుముందు అయితే, 'విదేశాలలో విడాకుల శాతం చాలా ఎక్కువ' అనేవారు. ఇప్పుడు ఇండియాలో కూడా అవి ఎక్కువగానే ఉంటున్నాయి. యూరప్ లో, అమెరికాలో, ఇతర దేశాలలో కూడా ఒకరికొకరుగా జీవితాంతసంసారం సాగిస్తున్న జంటలు చాలామంది ఉన్నారు. అక్కడి కన్సర్వేటివ్ కుటుంబాలలో వివాహవ్యవస్థ కూడా మనలాగే పటిష్టంగానే ఉంటుంది.  అల్లరి చిల్లరగా ఏమీ ఉండదు.

మరి ముహూర్తాలు పెట్టి చేసిన పెళ్ళిళ్ళూ, పెట్టకుండా చేసిన పెళ్ళిళ్ళూ రెండూ ఒకేలాగా ఉన్నప్పుడు, ఫెయిల్యూర్ శాతం రెండింటిలోనూ సమానంగానే ఉన్నపుడు, మనం పెడుతున్న ముహూర్తం విలువ ఎంత? నేటి జ్యోతిష్కులు చెబుతున్న ముహూర్తాలకూ, రెమెడీలకూ విలువ ఎంత? విధిని ఇవన్నీ అధిగమించగలవా? అంత శక్తి వాటిల్లో ఉందా?

ఆలోచించండి !
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (ఋషులు పెట్టిన ముహూర్తాలు) "

25, డిసెంబర్ 2019, బుధవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (జాతకమా - ముహూర్తమా?)

గత పోస్టులో నేను చెప్పిన నిజాలను చాలామంది జీర్ణించుకోలేరు. ఆత్మస్తుతి పరనింద దిశలో నేను చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చాలామంది అనుకోవచ్చు. వాళ్ళు నా పాయింట్ ను సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.

ఈ నా వాదనకు వ్యతిరేకంగా పంచాంగ ముహూర్తాలను సమర్ధించే పురోహితులు, పంచాంగజ్యోతిష్కులు చెప్పే లాజిక్స్ కొన్ని ఉంటాయి. అవేమిటో వరుసగా చూద్దాం.

1. అబ్బాయి అమ్మాయి జాతకాలను బట్టి వారి జీవితం నడుస్తుంది గాని, ముహూర్తాన్ని బట్టి కాదు. కనుక ముహూర్తం లేదని అనకూడదు.

నా జవాబు: జాతకమే సర్వస్వం  అయినప్పుడు ముహూర్తం ఎందుకు? దానికింత ప్రాధాన్యత ఎందుకు? ఏ ముహూర్తానికి పెళ్ళిచేసినా, ఎవరి జాతకాన్ని బట్టి వారికి జరుగుతుంది కదా? మరి ముహూర్తం చూడకుండా పెళ్ళి ఎందుకు చెయ్యకూడదు? పైగా, ఎవరి జాతకాన్ని బట్టి వారికి సరిపోయే ముహూర్తం పెట్టాలిగాని, అందరికీ ఒకే ముహూర్తానికి పెళ్లిళ్లు ఎలా చేస్తారు?

2. ముహూర్తం పెట్టేది, వాళ్ళ జీవితాలు మార్చడానికి కాదు. ఆ కార్యక్రమం సరిగ్గా జరగడానికి మాత్రమే. ముహూర్తం విలువ, ఆ కార్యక్రమం వరకే. అంతేగాని వధూవరుల జీవితాలను అది మార్చలేదు.

నా జవాబు: అలా అయితే, ముహూర్తానికి చతుర్ధశుద్ధి, సప్తమ శుద్ధి, అష్టమశుద్ధి ఎందుకు చూస్తున్నారు? లగ్నశుద్ధి ఒకటే చాలుకదా? కానీ ఎవరూ ఒక్క లగ్నశుద్ధితో ఊరుకోవడం లేదు. కనుక మీరు చెప్పేది కరెక్ట్ కాదు. వాళ్ళ జీవితాలు కూడా అన్నివిధాలుగా బాగుండాలనే ముహూర్తం పెడతారు. మరి అలా ఎందుకు ఉండటం లేదు? కనుక ఈ మొత్తం విషయంలో మీకు అర్ధం కానివి ఇంకా చాలా ఉన్నాయని తెలుసుకోండి. పంచాంగ ముహూర్తాలు కరెక్ట్ కాదు. ఆ ముహూర్తాలకు అందరికీ పెళ్లిళ్లు చెయ్యకూడదు.

3. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయాన్ని మీరు ఎలా కాదంటారు? మీరు అంత గొప్పవారా?

నా జవాబు: నేను సాంప్రదాయ విరోధిని కాను. సత్యాన్వేషిని మాత్రమే. మీరు గుడ్డిగా పాటిస్తున్న అనేక ఆచారాలలో అర్ధం ఏమాత్రమూ లేదని నేను చెబుతున్నాను. మీరు పాటిస్తున్న ఆచారాలు అనేకం, ప్రాచీన వేదకాలంలో లేవు. మధ్యయుగాలలో అవి పుట్టుకొచ్చాయి. అలా పుట్టడానికి, ముస్లిం దండయాత్రల వంటి అప్పటి సామాజికకారణాలు అనేకాలు ఉన్నాయి. ఆయా పరిస్థితులు ఇప్పుడు మన సమాజంలో లేవు. కనుక ఆ ఆచారాలను ఇప్పుడు కూడా పాటించడం అవివేకం.

4. పంచాంగ కర్తల కంటే మీరు గొప్పవారా?

నా జవాబు: పంచాంగ గణితం వేరు. ఫలిత జ్యోతిష్యం వేరు. పంచాంగ కర్తలకు, గణితం మాత్రమే తెలుస్తుంది. ఆ గణితం ప్రకారం లెక్కలు వేసి, వాళ్ళు పంచాంగాలు వ్రాస్తారు. కానీ వ్యక్తిగత జ్యోతిష్యం వారికి రాదు. నిరంతరం పరిశోధిస్తూ, పరిశీలిస్తూ, దానినుంచి నేర్చుకుంటూ ఉండే ప్రక్రియ వారిలో ఉండదు. కనుక వారు వ్రాసే ముహూర్తాలకు విలువ లేదు.

ఫలిత జ్యోతిష్యం తెలిసినవారు తగ్గిపోయి, పురోహిత జ్యోతిష్యం చెప్పేవారు సమాజంలో ఎక్కువ కావడంవల్ల మాత్రమే నేడు మీరు చూస్తున్న ఈ పరిస్థితి వచ్చింది. కనుక గుడ్డిగా పంచాంగ ముహూర్తాలను అనుసరించడం తప్పు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ముహూర్తం పెట్టుకోవాలి. అంతేకాదు, పెళ్ళిలో చేస్తున్న తంతులలో కూడా చాలావాటికి అర్ధం లేదు. వాటిని తీసెయ్యాలి.

5. అలాంటప్పుడు అందరూ వాటిని ఎందుకు పాటిస్తున్నారు? ఎవరికీ మీరు చెప్పేవి తెలియవా?

నా జవాబు: కొంతమంది ఆలోచనాపరులు నాలా ఆలోచించేవారు గతంలోనూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. కానీ, లోకం అంతా భయంతో నిండిపోయి ఉంది. 'ఏమో? ఎదుటివాళ్ళు చేస్తున్నారు, మనం చెయ్యకపోతే ఏ చెడు జరుగుతుందో?' అన్న భయంతో, పనికిరాని వాటిని సాంప్రదాయం అంటూ అందరూ పాటిస్తున్నారు. ఈ పోకడకు కారణం 'భయం' తప్ప ఇంకేమీ కాదు.

నేటి జ్యోతిష్కులందరూ 'భయం' కార్డు వాడుతూ జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కానీ సత్యాన్ని చెప్పడం లేదు. చెప్పాలంటే, ముందు వారికి తెలియాలి కదా ! వారికే సత్యజ్ఞానం లేనప్పుడు లోకానికి ఎలా చెప్తారు? డబ్బు మీద ఆశ ఉన్నప్పుడు నిస్వార్ధంగా ఉన్నదున్నట్టు ఎలా చెప్పగలుగుతారు? 

(ఇంకా ఉంది)
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (జాతకమా - ముహూర్తమా?) "

21, డిసెంబర్ 2019, శనివారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (వివాహ ముహూర్తాలు)

నేడు బంపర్ గా సాగుతున్న రెండు వ్యాపారాలేవంటే జ్యోతిష్యమూ, వాస్తులే. టీవీ పెడితే చాలు రకరకాల బిరుదులున్న జ్యోతిష్కులు ఊదరగొడుతూ కనిపిస్తారు. పత్రిక పేజీ తిప్పితే చాలు, జ్యోతిష్యమూ, వాస్తుల గురించి ప్రశ్నలు సమాధానాలు కనిపిస్తాయి. రోడ్డుమీద ఎక్కడ చూసినా పెద్దపెద్ద బోర్డులు కన్పిస్తాయి. వెరసి సమాజంలో ఇవి రెండూ బాగా చెలామణీ అవుతున్నాయని అందరికీ తెలుసు.

కానీ, నేడు సమాజంలో చలామణీ అవుతున్న జ్యోతిష్యం నిజమైనదేనా? వాస్తు నిజమైనదేనా అంటే, 'కాదంటే కాదని' నేనంటాను. నేటి జ్యోతిష్కులు చెబుతున్న జ్యోతిష్యమూ తప్పే, వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్న వాస్తూ బూటకమే అని బల్లగుద్ది మరీ చెబుతాను. నా ఈ వాదనకు ఆధారాలు జ్యోతిశ్శాస్త్ర ప్రామాణిక గ్రందాల నుంచి, శ్లోకాల నుంచి వందలకొలది చూపించగలను. మిగతా పూర్తి వివరాలకు త్వరలో రాబోతున్న నా పుస్తకం 'జ్యోతిశ్శాస్త్ర రహస్యాలు' చదవండి !

ప్రస్తుతానికి మాత్రం, అందరికీ తెలిసిన కొన్ని విషయాలనుంచి చిన్నచిన్న ఉదాహరణలతో నేను చెబుతున్నది నిజమే అని నిరూపిస్తాను.

వివాహ ముహూర్తాలు

మీరు ఏ పంచాంగం తిరగేసినా, వివాహ ముహూర్తాలు కనిపిస్తాయి. ఒక రోజున ముహూర్తం ఉంటె, ఆ రోజున ఆ ముహూర్తానికి వేల కొలది పెళ్ళిళ్ళు జరుగుతాయి. మరి ఆ వేల పెళ్ళిళ్ళలో అన్ని కాపురాలూ అన్నివిధాలుగా బాగుండాలి కదా? ధనకనక వస్తు వాహనాలతో, అన్యోన్య దాంపత్యంతో, దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి కదా? ఎందుకని అలా ఉండటం లేదు? 

ఖచ్చితంగా వీటిల్లో కొన్ని పెళ్ళిళ్ళు మాత్రమే సక్సెస్ అవుతాయి. కొన్ని చెడిపోతాయి. వీరిలో కొంతమంది చనిపోతారు. కొంతమంది విడాకులు తీసుకుని విడిపోతారు. కొంతమంది తిట్టుకుంటూ కొట్టుకుంటూ సంసారం చేస్తూ ఉంటారు. మరికొంతమందికి పిల్లలు ఉండరు. కొంతమందికి పెళ్లి అయిన వెంటనే పెద్దలు గతిస్తారు. లేదా ఏవేవో అశుభాలు జరుగుతాయి. మరికొంతమంది, పది ఇరవై ఏళ్ళు సంసారం చేసి, పిల్లల్ని కని, ఆ తరువాత డైవోర్స్ తీసుకుని విడిపోతుంటారు. మరికొంతమంది ఒకరు గాని, ఇద్దరూ గాని, extra marital affairs నడుపుతూ ఉంటారు.

ఇదంతా ఏమిటి? అన్నీ చూసి, అన్ని లెక్కలూ వేసి, మంచి సుముహూర్తంలో చెయ్యబడిన పెళ్ళిళ్ళు ఇలా ఎందుకు అవుతున్నాయి? అన్న ప్రశ్నకు ఏ పురోహితుడు గాని, ఏ జ్యోతిష్కుడు గాని, ఏ పంచాంగకర్త గాని జవాబు చెప్పలేడు. ఎందుకంటే, వాటికి అసలైన జ్యోతిష్యం తెలియదు కాబట్టి ! వారికి తెలిసిన జ్యోతిష్యమూ, తెలుసని అనుకుంటున్న జ్యోతిష్యమూ అసలైనది కాదు కాబట్టి !

నేటి జ్యోతిష్కులు, జ్యోతిశ్శాస్త్రం మీద తపనతో, దానిని మధించిన వాళ్ళు కారు. ఏళ్లకేళ్లు దానిని పరిశోధించినవారూ కారు. అమాయకుల్ని మోసం చెయ్యగా వఛ్చిన డబ్బుమదంతో మదించిన వాళ్ళు మాత్రమే. వీళ్ళకు కావలసింది శాస్త్రం కాదు, ధనం. వీళ్ళకు రీసెర్చి చేసే ఓపిక ఉండదు. Investigative thinking ఉండదు. తపశ్శక్తి అసలే ఉండదు. కనుక, అంత లోతైన రీసెర్చి చెయ్యకుండా, అంత కష్టపడకుండా, ఏవేవో నాలుగు మాటలు బట్టీపట్టి, హోమాలని, పూజలని, లోకాన్ని మోసం చేస్తూ, మార్కెటింగ్ చేసుకుంటూ, పబ్బం గడుపుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అందుకే వీరు పెట్టె ముహూర్తాలు ప్రాక్టికల్ గా నిలబడవు. వీరు చెప్పే జ్యోతిష్యాలు నిజం అవవు.

ప్రసిద్ధి గాంచిన వేమన పద్యాన్ని గమనించండి.

ఆ || విప్రులెల్ల జేరి వెర్రికూతలు గూసి
సతిపతుల జేర్చి సమ్మతమున
మును ముహూర్తముంచంగ ముండెట్లు మోసెరా?
విశ్వదాభిరామ వినుర వేమ !

ఎంతో జాగ్రత్తగా జాతకాలు చూసి, పంచాంగాలు వెదికి, వాదప్రతివాదాలు చేసి, మంచి ముహూర్తాన్ని నిర్ణయించి, మంగళవాయిద్యాలతో, వేద మంత్రాలతో, వేదాశీర్వచనాలతో పెళ్లి చేస్తే, అది డైవర్స్ వరకూ ఎందుకు పోతోంది? లేదా కాపురం సజావుగా ఎందుకు సాగడం లేదు? రకరకాల అశుభాలు ఎందుకు జరుగుతున్నాయి? అన్న ప్రశ్న ఈ నాటిది కాదు. ఆలోచనాపరులకు ఏనాడో వచ్చింది. దానికి ప్రతిరూపమే ఈ వేమన పద్యం. ఇందులో ఎంతో నిజం ఉంది.

అసలూ, 'గుంపులో గోవిందా' అన్నట్లు సమాజం మొత్తానికీ ఒకే ముహూర్తం ఎలా సరిపోతుంది? జాతకం అనేది వ్యక్తిగతమా సామూహికమా? ఎవడి జాతకం వాడికి చూస్తారా, లేక లోకం మొత్తానికీ ఒకే జాతకం చూస్తారా? ఎవరి జాతకం వారిదైనప్పుడు, ముహూర్తం మాత్రం వ్యక్తిగతం కాదా? అందరికీ ఒకేరోజున పెళ్లి ముహూర్తం ఎలా ఉంటుంది? ఎవరి జాతకాన్ని బట్టి వారికి సరిపోయే మాసంలో, పక్షంలో, వారంలో, తిధి రోజున, లగ్నాన్ని ఎన్నుకొని వివాహ ముహూర్తం పెట్టాల్సిన అవసరం లేదా? గుడ్డిగా పంచాగం చూసి అందులో ఉన్న ముహూర్తాన్ని అడిగిన ప్రతివాడికీ నిర్ణయించడం తప్పు కదా? అన్న ప్రశ్నకు నేటి పంచాంగ కర్తలతో సహా, ఏ జ్యోతిష్కుడూ జవాబు చెప్పలేడు. ఛాలెంజ్ ! చెప్పండి చూద్దాం !

అందుకే నేనేం చెప్తానంటే - నేటి పెళ్లి ముహూర్తాలన్నీ శుద్ధతప్పులే, పొరపాట్లే, తప్పు ముహూర్తాలే అంటాను. ఆ ముహూర్తాలు రాస్తున్న పంచాంగకర్తలకు నిజమైన జ్యోతిష్యం రాదు. పెళ్లి చేయిస్తున్న పురోహితులకు మంత్రాలు తప్ప, జ్యోతిష్యం తెలియదు. చేయించుకుంటున్న వారికి, భయమూ దురాశా తప్ప, బుద్ధి ఉండదు. అందుకే సమాజం ఇలా ఉంది మరి ! కానీ మనం చెబితే ఎవరు వింటారు? 'వినాశకాలే విపరీత బుద్ధి:' అంటే ఇదే కదూ మరి !

కొన్ని మాసాలు వివాహానికి మంచివి కావనడమే అసలైన పెద్దతప్పు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఏ మాసంలోనైనా వివాహం చెయ్యవచ్చు. దోషం లేదు. శూన్యమాసం అనేది అసలు లేదు. చెడుకాలమూ అంతకంటే లేదు. అనేది నా అభిప్రాయం. ఈ నా అభిప్రాయానికి ప్రాచీన జ్యోతిష్యశాస్త్రపు అండ ఉంది. అనుభవంలో పరీక్షకు నిలిచే సత్తా ఉంది. పంచాగంలో మీరు చూసే ముహూర్తాలకు ఇవి రెండూ లేవు. గమనించండి.

ముహూర్తం అనేది, వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్ణయించాలిగాని, పంచాంగాన్ని బట్టి కాదు. అందరికీ ఒకేరోజున పెళ్ళిళ్ళు చేసే సామూహిక ముహూర్తాలు ఎక్కడా లేవు ఉండవు. కానీ ఏ పంచాగం చూసినా ఇవే మీకు కనిపిస్తాయి. అందరూ వీటినే అనుసరిస్తున్నారు. మోసపోతున్నారు. ఇదే కలిప్రభావం ! ఈ మోసానికి లోను కాకండి. ఈ ఊబిలో ఇరుక్కోకండి.

అసలైన శాస్త్రం తెలియని సో కాల్డ్ ఘనాపాటీలు, జ్యోతిష్యసామ్రాట్లు, టీవీలో ఊదరగొట్టే మాయజ్యోతిష్కులు చెప్పే మాయమాటలకు పడిపోకండి. తప్పుడు ముహూర్తాలకు పెళ్ళిళ్ళు చేసి మీమీ జీవితాలను, మీ పిల్లల జీవితాలను చెడగొట్టుకోకండి !

(ఇంకా ఉంది)
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (వివాహ ముహూర్తాలు) "

15, డిసెంబర్ 2019, ఆదివారం

షష్ఠగ్రహ కూటమి - 2019

ధనూరాశిలో షష్ఠగ్రహకూటమి రాబోతోంది. అంటే ధనూరాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్నాయి. ఇది ఈ నెల 25, 26, 27 తేదీలలో ఉంటుంది. అవి, గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు. ఆరు గ్రహాలు కలవడం వల్ల లోకమేమీ బద్దలై పోదు. అక్కడక్కడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. రక్తపాతం, ప్రాణనష్టం, దేశాల వ్యవస్థలు కూలడం, ప్రకృతి ప్రమాదాలు జరుగుతాయి. కొందరు జ్యోతిష్కులు చెబుతున్నట్టు ప్రపంచం తల్లక్రిందులు ఏమీ కాదు. కాలగమనంలో ఇలాంటివి  చాలా జరిగాయి. ప్రతిసారీ ఏవో ఒక గొడవలు ఉపద్రవాలు మాత్రం జరుగుతుంటాయి.

28-12-2019 నుంచి 12-1-2020 వరకూ చంద్రుడు తప్ప మిగతా అయిదు గ్రహాలు కలసి ధనూరాశిలో ఉంటాయి. ఆ 15 రోజులు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. తరువాత రెండురోజులకు బుధుడు కూడా మకరానికి మారిపోతాడు.  ఆ తరువాత నాలుగు గ్రహాలు కలసి కొంతకాలం ధనూరాశిలో ఉంటాయి. అప్పటివరకూ లోకమంతా ఇదే గోల రకరకాలుగా సాగుతుంది. 

ఈ కూటమిలో ముఖ్యమైన కూడిక గురు శనులది. వీరిద్దరూ దాదాపు ఇరవై ఏళ్ల కొకసారి ఒక రాశిలో కలుస్తారు. పోయినసారి 1999-2000 సంవత్సరంలో కలిశారు. ఇప్పుడు 2019 లో కలుస్తున్నారు. వీరు కలిసిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా మేజర్ మార్పులు ఉంటాయి. గతంలో జరిగాయి. ఇప్పుడూ జరుగుతాయి. మనుషుల కర్మవలయం అంతా ఈ రెండు గ్రహాల మధ్యనే నియంత్రించబడుతూ ఉంటుంది. ఏ జాతకంలో నైనా, ముఖ్యమైన మేజర్ గ్రహాలు ఇవి రెండే. మనిషి జాతకంలో  ఏమి జరగాలన్నా వీరిద్దరి పాత్ర లేనిదే జరుగదు.

ప్రస్తుతం వీరు కలుస్తున్న ధనూరాశి, భారతదేశాన్ని సూచించే మకరరాశికి ద్వాదశరాశి. మనకు స్వతంత్రం వచ్చిన వృషభరాశికి అష్టమరాశి. అంటే ఇండియాలో, కుట్రలు కుత్రంత్రాలు బాగా జరుగుతాయి. ప్రజాజీవితంలో భారీ మార్పులు జరుగుతాయి. నష్టం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న Citizenship Amendment Act గొడవలు అవే. ఈశాన్యభారతం అట్టుడుకుతూ ఉండటం, మిగతా దేశానికి కూడా ఈ గొడవలు పాకడం వీరి చలవే.

ఇకపోతే ఈసారి జరుగబోతున్న అసలైన పెద్దమార్పు మాత్రం అమెరికాలో ఉంటుంది. ఎందుకంటే, అమెరికాను సూచించే మిధునరాశి సరిగ్గా ధనుస్సుకు ఎదురుగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం మిధున - ధనూరాశుల ఇరుసులో రాహుకేతువులు ఉఛ్చస్థితిలో ఉన్నారు. అందుకనే, ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ఇంపీచ్ మెంట్ ను ఎదుర్కొంటున్నాడు. దీని ఫలితంగా మిడిల్ ఈస్ట్ లో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. బ్రిటన్  లో అధికార మార్పు కూడా వీరి కూడిక ఫలితమే.

ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో అనేక రకాలైన మార్పులు ప్రమాదాలు గొడవలను ఈ గురుశనుల కూడిక సూచిస్తుంది. అవన్నీ నేను ఏకరువు పెట్టబోవడం లేదు. ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే, ఆయా  లింకులు స్పష్టంగా మీకు కనిపిస్తాయి. ఆసక్తి ఉన్నవాళ్లు ప్రయత్నించండి.

వ్యక్తిగత జాతకాలలో ఈ యోగం చేసే విధ్వంసాన్ని, మాత్రమే ఇక్కడ చెబుతున్నాను. జాగ్రత్త పడండి.

వృషభంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

జీవితంలో పెద్ద నష్టాన్ని చవిచూస్తారు. మానసికంగా అత్యంత డిప్రెషన్ కు గురౌతారు. దీర్ఘరోగాలు బాధిస్తాయి.

మిధునంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

వివాహజీవితం లేదా బిజిజెస్ అతలాకుతలం అవుతుంది. జీవితభాగస్వామి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది. లేదా అతనికి/ ఆమెకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మానసికంగా తీవ్ర అలజడికి గురౌతారు. పార్ట్నర్స్ మోసం చేస్తారు.

కర్కాటకంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

అనారోగ్యం పాలౌతారు. మనస్సు భయాందోళనలకు గురౌతుంది. శత్రుబాధ పెరుగుతుంది. రుణాలు అవుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.

సింహరాశిలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

మనస్సు అతలాకుతలం అవుతుంది. ప్రేమలో తీవ్ర ఆశాభంగానికి గురౌతారు. సంతానం చర్యలు బాధిస్తాయి. లేదా సంతానానికి తీవ్రనష్టం కలుగుతుంది.  షేర్ మార్కెట్లో ఘోరంగా నష్టపోతారు.

కన్యలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

కుటుంబంలో కలతలు చికాకులు ఎక్కువౌతాయి. మనస్సు అదుపు తప్పి తీవ్ర డిప్రెషన్లో పడుతుంది. చదువు చట్టుబండ లౌతుంది. పరీక్షలలో తప్పుతారు.

ధనుస్సులో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

అన్నీ ఎదురౌతాయి. గందరగోళంలో పడతారు. అన్ని వైపుల నుంచీ అందరూ రకరకాలుగా ఊపుతారు. పరిస్థితులు గజిబిజిగా ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనసు మారుతుంది.

మకరంలో సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా లగ్నం ఉన్నవారు

డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. ఆస్తులు కోల్పోతారు. ఆస్పత్రి పాలౌతారు. స్థానచలనం ఉంటుంది. ఉన్నఊరు వదలి వేరే ఊరికి మారవలసి వస్తుంది. పరువు పోతుంది. ఒంటరితనానికి గురౌతారు.

ముఖ్యంగా ధనుస్సు, మిధున - రాశులు, లగ్నాలకు - ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గమనించండి.
read more " షష్ఠగ్రహ కూటమి - 2019 "

11, డిసెంబర్ 2019, బుధవారం

ప్రపంచ రేపుల రాజధాని

మొన్న కొందరు నాయకులు పార్లమెంట్ లో మాట్లాడుతూ, 'ఇండియాకు ప్రపంచ రేపుల రాజధాని అని పేరోస్తోంది' అన్నారు. Make in India బదులు Rape in India అంటే సరిపోతుంది అని కూడా అన్నారు. కొత్త సినిమా టైటిల్ భలే ఉంది కదూ An evening in Paris, Love in Tokyo లకి సీక్వెల్ లాగా Rape in India!  సినిమావాళ్ళు ఎవరైనా ఈ టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేశారో లేదో నాకైతే తెలీదు మరి !!

అసలూ, ఈ పేరు మన దేశానికి ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. సీతాదేవిని రావణుడు బలాత్కారంగా ఎత్తుకుపోవడం దగ్గరే ఇది ఉంది. నిండు సభలో ద్రౌపదికి బట్టలు విప్పడం నుంచే ఇది ఉంది. ఆడదాన్ని ఒక విలాసవస్తువుగా, ఒక ప్రాణమూ మనసూ లేని commodity గా చూడటం అతి ప్రాచీనకాలం నుంచే మన దేశంలో ఉంది. కాకపోతే, అలా చూసిన వాళ్ళను విలన్లు అన్నాం. వ్యతిరేకంగా పోరాడినవాళ్ళను హీరోలన్నాం. విషయం మాత్రం మొదటినుంచీ ఉంది. అంతే తేడా !

అయితే ఈ పోకడకి కారణం ఏంటో ఇంతవరకూ ఏ సైంటిస్టూ కనుక్కోలేక పోయాడు. ఫస్ట్ టైం నేనే కనుక్కుని చెబుతున్నా ! దీనికంతటికీ కారణం 'మషాలా' ! ఇది విన్నాక 'మాషా అల్లా' అని మాత్రం అనకండి. మళ్ళీ తేడాలొస్తాయి.

సమాజపు కట్టుబాట్లూ, చట్టమూ న్యాయమూ లేని దేశంలో - ఎవరూ మనల్ని చూడటం లేదన్నపుడు - ఏకాంతం దొరికినప్పుడు - ఎంతమంది మనుషులు - వాళ్ళు మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా - పవిత్రులుగా ఉంటారన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ! అసలు 'పవిత్రత' అంటే ఏమిటి? దాని నిర్వచనం ఏమిటి? అది మానసికమా? శారీరికమా? లేక రెండూనా? లేక రెండూ కాదా? అన్నది ఇంకో భయంకరమైన ప్రశ్న ! మౌలికమైన అనేక ప్రశ్నలకులాగే వీటికీ జవాబులు చెప్పడం అంత సులభసాధ్యం కాదు మరి !

'ఇండియాలో ప్రజలకు కామం చాలా ఎక్కువ. వాళ్ళ జనాభాని చూస్తె ఈ విషయం ఎవరికైనా తేలికగా తెలుస్తుంది' అని చాలామంది తెల్ల మేధావులు ఎప్పుడో అనేశారు. ఈ మాటల్లో నిజం ఎంతుందా? అని నిన్నటినించీ తెగ ఆలోచిస్తుంటే, అకస్మాత్తుగా కర్ణపిశాచి స్వరం వినిపించింది.

'నేను చెప్పనా దీనికి జవాబు?'

'అబ్బా ! మా తల్లే ! చాన్నాళ్ళకి వినిపించావ్ గాని, చెప్పు' అన్నా.

'మీ దేశంలో అందరూ మషాలాలు ఎక్కువగా వాడతారు. అందుకే మీకు కామం ఎక్కువ' అంది పిశాచి.

'అదేంటి? మషాలాలకీ, కామానికీ లింకుందా?' అడిగాను తెగ హాశ్చర్యపోతూ.

'ఎందుకు లేదు? మాంసమూ, మషాలాలూ, కామాన్ని బాగా ఉద్రేకిస్తాయని మీ ఆయుర్వేదమే చెబుతోంది. 'మేకమాంస లేహ్యం' పేరు ఎప్పుడైనా విన్నావా లేదా? అది మీ ఆయుర్వేదంలో మంచి aphrodisiac. తెలీదా?' అంది పిశాచి.

'ఆ ప్రయోగాలు చేసే అవసరం ఇంకా రాలేదులేగాని, ఇది నిజమా?' అడిగాను సీరియస్ గా.

'నేను చచ్చినంత ఒట్టు' అంది పిశాచి.

నాకు డౌటోచ్చింది.

'అదేంటి? చస్తేనే కదా పిశాచిగా మారేది. మళ్ళీ 'నేను చచ్చినంత ఒట్టు' అంటుందేంటి?' అనుకుని ఇలా అడిగా.

'చూడూ ! నీ వాలకం నాకేదో అనుమానంగా ఉంది. ఇందాక మీ దేశంలో అన్నావ్ ! ఇప్పుడేమో మీ ఆయుర్వేదం అంటున్నావ్ ! ఇంతకీ నువ్వేక్కడున్నావ్? ఎక్కణ్ణించి నాతో మాట్లాడుతున్నావ్? ఇండియా నుంచి కాదా?' అడిగా.

'కాదు. ప్రస్తుతం అమెరికా నుంచి నీతో మాట్లాడుతున్నా' అంది తను.

నాకు మతిపోయింది.

'అదేంటి? అలా కూడా చెయ్యగలవా?' అడిగా భయపడుతూ.

'ఎలాగైనా చెయ్యగలను. మాది యూనివర్సల్ నెట్వర్క్. నో ప్రాబ్లం' అని నవ్విందది.

'అయినా నీకక్కడెం పని? అమెరికాలో ఎక్కడున్నావ్? డెట్రాయిట్ సమీపంలోనా?' అడిగా మళ్ళీ భయం భయంగా.

'అవున్లే. నీ భయాలు నీవి ! అయినా మీకు అమెరికా అంటే, USA ఒక్కటే గుర్తొస్తుంది. నేనున్నది లాటిన్ అమెరికాలో' అంది తను.

'ఓ, అక్కడున్నావా? ఎన్నాల్లేంటి ట్రిప్?' అడిగా.

'మా బాస్ ఇక్కడ ఒక ద్వీపం కొనేశాడు. అందుకని కొన్నాళ్ళు ఇక్కడ వెకేషన్ కనీ వచ్చా' అంది.

తనేం చెప్తోందో అర్ధమైంది.

'యూ మీన్ Parama Shivam?' అడిగా.

'ఎస్. మేమంతా భూతాలం కదా. ఆయనెక్కడుంటే మేమక్కడే ఉంటాం' అంది తను.

'ఐసీ ! ఈ మధ్యనే మీ భూతాల ఫోటోలు కొన్ని చూశా. మీలో కూడా మాంఛి అందగత్తెలున్నారు సుమీ !' అన్నా చనువుగా.

'ఎందుకుండరు? మాకు ప్రతిరోజూ నాన్ వెజ్జూ, మషాలా కూరలూ లేందే ముద్ద దిగదు. అందుకని మాకు అందమూ ఎక్కువే, అన్నీ ఎక్కువే' అందది వికటంగా నవ్వుతూ.

'ఎలాగైనా మీ బాస్ భలే లక్కీఫెలో కదా ! ' అన్నా అసూయగా.

'ఎందుకో?' అంది తను దీర్ఘం తీస్తూ.

'మరి మీలాంటి అందమైన భూతాల మధ్యన తన దేశంలో తనున్నాడు. న్యాయమూ చట్టమూ అన్నీ మీవే. మిమ్మల్ని అనేవాడూ లేడు, అడిగేవాడూ లేడు. రోజూ మషాలా కూరలు. కేసులుండవు. భలే ఉంది మీ పని' అన్నా.

'ఇదుగో అంటేగింటే మమ్మల్ని ఏమైనా అను, ఊరుకుంటా, మా బాస్ ని ఏమైనా అన్నావో నీ సంగతి చెప్తా' అంది తను కోపంగా.

నాకు నిజ్జంగా భయమేసింది.

'బాబోయ్. అనన్లే. ఇక చాలు చెప్పకు. వినగావినగా నాకూ మీరు తినేవన్నీ రోజూ  లాగించాలనిపిస్తోంది. వద్దులేగాని, మీ ఐలెండ్ లో ఏం జరుగుతోంది అసలు?' అడిగా.

'చూడూ ! కూపీలు లాగాలని చూడకు. నీ ఫస్ట్ డౌట్ గురించి మాత్రమే నువ్వడుగు. అంతేగాని, మా బాస్ గురించి కూపీలు లాగావో చూడు నిన్నేం చేస్తానో?' అని బెదిరించింది అది.

'సర్లే ఆయనేం చేస్తే నాకెందుకులే గాని, అయితే, ఇండియాలో జరుగుతున్న రేపులన్నిటికీ మషాలాలే కారణం అంటావ్?' అన్నా.

'ముమ్మాటికీ అంతే, వాటికి తోడు మద్యం, మాంసం, ఇవి రెండూ కలిస్తే రేపులు కాక ఇంకేం జరుగుతాయి మరి?' అంది తను కాన్ఫిడెంట్ గా.

'ఇక చాలు. నువ్వేమీ చెప్పకుండానే, మీ ద్వీపంలో ఏం జరుగుతుందో నాకు బాగా అర్ధమైపోయింది. కాకపోతే, అక్కడ దాన్ని 'రేప్' అనరేమో? అంతేనా?' అడిగా నవ్వుతూ.

'అవును. ఇక్కడ రేప్ చేసినవాళ్ళమీద కేసుండదు. చెయ్యకపోతే మాత్రం 'ఫలానా సిటిజెన్ మషాలాలు సరిగా తినడం లేదు' అంటూ మా బాస్ కి కంప్లెయింట్ చేస్తాం. అప్పుడు కేసౌతుంది.' అందది.

చచ్చే నవ్వొచ్చింది నాకు.

'అంతా మషాలా మహిమ ! అయితే, మా దేశంలో ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చెయ్యాలి మేం?' అడిగా.

'మందూ, మాంసం, మషాలాలు - మూడూ మానుకొని, రోజూ పచ్చిమొలకలు తింటూ యోగా చెయ్యడం మొదలుపెట్టండి. అందరూ శాంతిగా ఉంటారు. అప్పుడు చూడండి నేను చెప్పేది నిజమో కాదో?' అంది.

'యూ మీన్ sprouts?' అడిగా అమాయకంగా.

'యూ ఫూల్ ! What else could I mean? సర్లే, నీతో ఈ వాదన తెగదులే గాని, నేనొస్తా. పనుంది' అంది మాయమైపోబోతూ.

'ఆగాగు. ఎక్కడికి? అంత అర్జెంట్ పనేముంది?' అన్నా.

'కూరల్లోకి మషాలాముద్ద నూరుకుని రమ్మన్నాడు బాస్. ఈ లోపల నీ బాధ చూడలేక నీ నెట్వర్క్ లోకి అడుగుపెట్టా. త్వరగా వెళ్ళకపోతే ఈ పూటకి చప్పిడికూరలు తినాల్సి వస్తుంది. అప్పుడు జరిగే నష్టానికి నేనే జవాబుదారి. నేనిలాగే లేట్ చేస్తే, మా సిటిజెన్స్ పెర్ఫామెన్స్ లెవల్స్ పడిపోతాయి. సాటి భూతాలనుంచి ఎన్ని కంప్లెయింట్స్ వెళ్తాయో మా బాస్ కి రేపు? నాకొద్దు ఆ పనిష్మెంట్. వస్తా. బై' అంటూ మాయమై పోయింది తను.

'హా పరమశివమ్ ! ఇదా అసలు సీక్రెట్?' అనుకుంటూ కుర్చీలోంచి పైకి లేచా.
read more " ప్రపంచ రేపుల రాజధాని "

8, డిసెంబర్ 2019, ఆదివారం

ఉన్నావా? అసలున్నావా?

ఉన్నావ్ ఘటన దారుణాతి దారుణంగా ముగిసింది. రెండేళ్ళ క్రితం గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలు మొన్న పెట్రోల్ తో సజీవదహనం చెయ్యబడి చంపబడింది. యధావిధిగా నాయకులు అధికారులు వచ్చారు. గోల చేశారు. వరాలు గుప్పించారు. మాయమాటలు, బట్టీ పట్టిన పదాలు వల్లించారు. బాధితురాలి చివరి సంస్కారం అయిపోయింది.

ఈ మాటలు చెప్పిన నాయకులు రేపట్నించీ ఎక్కడా కనిపించరు. వాళ్ళిచ్చిన వరాలు ఎక్కడా కనిపించవు. వాటికోసం, సిగ్గూ అభిమానం చంపుకొని బాధిత కుటుంబం కాళ్ళరిగేలా అధికారుల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇది వాస్తవం !

పైగా, బాధితురాలి చెల్లెలి జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆమె ఈ కేసులో ఒక సాక్షి. కనుక ఆమెకు కూడా ముందుముందు ప్రమాదమే. వాళ్ళుండేది పల్లెటూళ్ళో. మీడియాలూ, పోలీసులూ అక్కడకు చేరేసరికి జరగవలసినవి జరిగిపోతాయి. మళ్ళీ కాసేపు అందరూ గోల చేస్తారు. మెల్లిగా అందరూ వారిని మరచిపోతారు. ఆ పొలాలలో వాళ్ళ సమాధులు మాత్రం మానవత్వం లేని మన సమాజాన్ని వెక్కిరిస్తూ నిలబడి ఉంటాయి. వాటికి జనం పూజలు చెయ్యవచ్చు. భయంతో దానినొక క్షేత్రంగా మార్చవచ్చు. సినిమావాళ్ళు ఈ ఘటన మీద ఒక సినిమాతీసి కోట్లు సంపాదించవచ్చు. కానీ బ్రతికుండగా వారికి న్యాయం మాత్రం ఎవ్వరూ చెయ్యరు. ఇది మన సమాజపు డొల్ల బ్రతుకు !

ఈ ప్రపంచంలో ఆడదానిగా పుట్టడమే ఆమె చేసిన నేరమా? దానికి ఇంత శిక్షా? గ్యాంగ్ రేప్ చాలక, న్యాయం అడిగినందుకు, పెట్రోల్ పొయ్యబడి సజీవ దహనమా? అసలు మనం మానవ సమాజంలో బ్రతుకుతున్నామా లేక అడవిలో మృగాల మధ్యన బ్రతుకుతున్నామా? మన దేశంలో అసలు వ్యవస్థలున్నాయా?

ఉన్నావ్ ఘటన చూశాక, ఆకాశం వైపు తిరిగి 'ఉన్నావా? అసలున్నావా? ఉంటె కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా?' అని అరవాలనిపిస్తోంది.

ఇప్పుడు మనమేం చేసినా, ఎన్ని ఉద్యోగాలిచ్చినా, ఎంత డబ్బులిచ్చినా, ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం న్యాయంగా మారుతుంది? సాధ్యమా అసలు? అసలు ఇవన్నీ ఇవ్వడం సమస్యకు పరిష్కారమా? ఇలా చేసేసి చేతులు దులుపుకుని, కళ్ళు మూసుకుని ఊరుకుంటే సరిపోతుందా?

మనది ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా? ఆటవిక రాజ్యమే నయమేమో? అక్కడైనా న్యాయం అనేది కాస్త కాకపోతే కాస్తైనా ఉంటుంది !!
read more " ఉన్నావా? అసలున్నావా? "

7, డిసెంబర్ 2019, శనివారం

ఈ న్యాయం మిగతా వారికి వద్దా??

దిశ విషయంలో న్యాయం జరిగిందని అందరూ భావిస్తున్నారు. బాగానే ఉంది. కానీ, ఇక్కడ కూడా మానవ హక్కుల కమిషన్ వారు, మహిళా సంఘాలు, నిందితుల తల్లిదండ్రులు 'ఇది అన్యాయం' అంటూ గోల చేస్తున్నారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకునే హక్కు మీకు లేదని పోలీసువారితో వారి వాదన !

ఈ ఉదంతం అంతా ఇంకొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

1. ఇది న్యాయమైతే, ఇదే న్యాయం మిగతా చోట్ల జరగవద్దా?

దిశ ఉదంతం జరిగినప్పుడే ఇలాంటివి ఇంకొన్ని జరిగాయి. అంతకు చాలాముందే, నిర్భయ ఉదంతమూ, ఉన్నావ్ ఉదంతమూ జరిగాయి. ఊరూపేరూ లేనివి ఇంకా చాలా జరిగాయి. అక్కడి బాధిత అమ్మాయిల తల్లిదండ్రులు -'మాకూ ఇదే న్యాయం కావాలి' అని నినదిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగింది నిజంగా న్యాయం అయితే, మరి మిగతావాళ్ళకు కూడా ఇదే న్యాయం అమలు చెయ్యాలి కదా ! అన్నిచోట్లా దీనిని అమలు చెయ్యలేని పరిస్థితి ఉంటె, ఈ కేసులో జరిగినది మాత్రమే న్యాయం ఎలా అవుతుంది?

వేరే కేసుల్లోని పోలీసు అధికారులు వేరేగా ఆలోచించారని అంటున్నారు. ఉదాహరణకు నిర్భయ హత్య కేసును విచారించిన పోలీసు అధికారి 'మేము ఎన్కౌంటర్ దిశగా ఆలోచించలేదు. లీగల్ గా ముందుకు వెళ్లాం' అని అన్నారు. నిజానికి ఎన్కౌంటర్ అనేది ముందుగా ప్లాన్ చేసి చేసేది కాదు. లీగల్ గా చూస్తె, అలా చేసే హక్కు పోలీసులకు లేదు. నిందితులు ఎదురు తిరిగి ఎటాక్ చేశారు గనుక సెల్ఫ్ డిఫెన్స్ కోసం వారిని షూట్ చేయవలసి వచ్చింది అనే వారు చెబుతారు. దానికి తగినట్లే అక్కడి పరిస్థితులు కూడా కనిపిస్తాయి.

నిజానికి, పోలీసు అధికారుల చేతిలో ఏమీ లేదు. అంతా రాజకీయ నిర్ణయమే. నాయకులు ఏది చెబితే అది పోలీసులు చెయ్యవలసి వస్తుంది. కనుక అంతా ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం. నిర్భయ కేసులో అక్కడి ముఖ్యమంత్రి అలా డిసైడ్ చేశారు గనుక అలా జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి ఇలా నిర్ణయించారు గనుక ఇలా జరిగింది. అలాంటప్పుడు, న్యాయం అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుందా? ఉండవచ్చా? న్యాయం చట్టం అనేవి అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండవా? ఒకే దేశం ఒకే చట్టం అనేది ఇదేనా? అనేది ఒక ప్రశ్న.

2. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం కరెక్టేనా?

ఈ ఎన్కౌంటర్ పైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అందరూ 'శెభాష్ పోలీస్' అంటున్నారు. కానీ కొందరు మాత్రం, 'ఇలా చెయ్యకూడదు. లీగల్ గా వెళ్ళడమే కరెక్ట్' అంటున్నారు. వారిది కూడా కరెక్ట్ వాదనే. న్యాయశాస్త్రం ప్రకారం వారు కరెక్టే. కానీ, న్యాయశాస్త్రాన్ని నమ్మి ముందుకు వెళితే, ఎన్నేల్లకూ న్యాయం జరగని పరిస్థితి దేశంలో ఉంది. మరి అలాంటప్పుడు న్యాయం జరిగినా జరగకపోయినా ఆ మార్గంలోనే వెళ్ళాలి అనడం ఎంతవరకూ కరెక్ట్? అనేదానికి జవాబు లేదు. 'చట్టం న్యాయాన్ని చెయ్యనపుడు మనమే చెయ్యాలి. కోర్టులలో న్యాయం జరగడం లేదు గనుక కొర్టు బయట మేము న్యాయాన్ని అమలు చేస్తాం' అనే వాదనకూడా మానవత్వ పరంగా చూస్తె కరెక్టే. కానీ, లీగల్ గా కరెక్ట్ కాదు. మళ్ళీ, అధికారులు ఆ పని చేస్తే, ఒప్పు. అదే, ప్రజలు ఆ పనిని చేస్తే, అది తప్పు. అప్పుడు వాళ్ళను నక్సలైట్లంటారు. చట్టం మీద ప్రజలకు విశ్వాసం పోయె పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతవరకూ వచ్చేదాకా న్యాయవ్యవస్థ ఏం చేస్తోంది?

ఆటవిక సమాజాలలో ఉండే న్యాయం అమలు చేసే పరిస్థితి ఒక ప్రజాస్వామ్య దేశంలో రావలసిన దుస్థితి ఏమిటి?

3. మీడియా పాత్ర

దిశ ఉదంతం హైదరాబాద్ లో జరిగింది గనుక, మీడియా కవరేజి బాగా వచ్చింది గనుక, దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది గనుక, ఈ విషయం ఇలా ముగిసింది. మరి, ఇలాంటివే మరికొన్ని సంఘటనలు, చాలాచోట్ల జరిగాయి. అవి పల్లెల్లో, చిన్న టౌన్స్ లో జరిగాయి. వాటికి ఇంత మీడియా కవరేజి రాలేదు. నేరాలుగా చూస్తె, అన్నీ ఒకటే. మరి వాటికి ఇంత కవరేజి ఎందుకు లేదు? ఇంత రియాక్షన్ ఎందుకు రాలేదు? ఇలాంటి ముగింపు ఎందుకు రాలేదు?

అంటే, దేశవ్యాప్తంగా గోల జరిగితేగాని న్యాయం జరగదా మన దేశంలో? అలా జరిగేది న్యాయం ఎలా అవుతుంది? దేశ వ్యాప్తంగా గోల జరిగినా కూడా నిర్భయ, ఉన్నావ్ ఘటనలలో ఎందుకు ఈనాటికీ న్యాయం జరగడం లేదు? నేరస్తులకున్న రాజకీయ అండదండలే కారణమా?

4. రాజకీయ అండదండలు

ఉన్నావ్ ఘటనలో బాధితురాలు చనిపోయింది. ఆమెను వెంటాడి వెంటాడి పెట్రోల్ పోసి సజీవదహనం చేసి మరీ చంపారు. ఆమె బ్రతికుంటే ప్రమాదం గనుక అలా చంపేశారు. ఆమె ప్రత్యర్ధులు, నేరం చేసినవాళ్ళు, రాజకీయంగా బలవంతులు గనుక చివరకు బాదితురాలినే లేకుండా చేశారు.

దిశ కేసులో కూడా, ఆ నలుగురు ఏ రాజకీయ అండా లేనివాళ్ళు గనుక ఎన్కౌంటర్ పాలబడ్డారు. వాళ్ళకే అండదండలు ఉంటె, ఏమయ్యేది? దిశ బ్రతికుంటే, వాళ్లకు గుర్తుపట్టి, వాళ్ళమీద పోరాటం చేసుంటే ఏమయ్యేది? ఉన్నావ్ ఘటన మళ్ళీ ఇక్కడ కూడా జరిగేది కాదా? అంటే, రాజకీయ పలుకుబడి ఒక్కటే ఈ దేశంలో సర్వస్వమా? అదుంటే, ఏమైనా చెయ్యవచ్చా? ఇక్కడ జరిగింది నిజంగా న్యాయమేనా? లేక, రాజకీయ సమీకరణాల ఫలితమా? ఆయేషా బేగం కేసు ఇంతవరకూ ఎందుకు తేలడం లేదు? మన దేశంలో నిజంగా న్యాయం ఉందా? లేక భ్రమిస్తున్నామా?

బాధితులకు ఒక చెక్కు, ఒక ఉద్యోగం ఇస్తే సరిపోతుందా? ఇది ఆటవిక న్యాయం కాదా? మన న్యాయవ్యవస్థా, రాజకీయవ్యవస్థా ఎటు పోతున్నాయి అసలు?

ఇన్ని గందరగోళాల మధ్యన ఏది సత్యం ఏదసత్యం అనే విచికిత్స ఎప్పటికీ తేలడం లేదు మన దేశంలో.

It happens only in India అంటే ఇదేనేమో?
read more " ఈ న్యాయం మిగతా వారికి వద్దా?? "

6, డిసెంబర్ 2019, శుక్రవారం

శెభాష్ !! ఇదిరా న్యాయమంటే !!

నిర్భయ ఘటనలో
భయం వీడకపోయినా
దిశ ఘటనతో
దేశానికే దశ మారింది

తెలంగాణా పాలకులు
లోకానికే ఒక దిశ చూపించారు
తెలంగాణా పోలీసులు
న్యాయమేంటో దశదిశలా చాటారు

చట్టం మన చేతులు కట్టేసినా
న్యాయం నిలిచి గెలిచింది
ఖర్మ మనల్ని కాటేసినా
ధర్మం నేనున్నానని పిలిచింది

అమ్మాయిలపైన దౌర్జన్యాలు చేసేవారికి
ఇది కావాలి కనువిప్పు
మన దేశంలో ఇంకెక్కడా
ఎవ్వరూ చెయ్యకూడదు ఇలాంటి తప్పు

ఇది మానవత్వానికే విజయం
మనసున్న ప్రతివారిదీ ఈ జయం
'సజ్జనుడు' ఇచ్చిన ఈ తీర్పు
సమాజంలో తేవాలి పెనుమార్పు

శుభవార్తతో కళ్ళుతెరిచింది ఈ ఉదయం
మంచితనంతో నిండిపోవాలి ప్రతి హృదయం
తప్పు చెయ్యాలంటే ఒణికి పోవాలి జనమంతా
దైవం మెప్పు పొందేలా బ్రతకాలి మనమంతా
read more " శెభాష్ !! ఇదిరా న్యాయమంటే !! "

3, డిసెంబర్ 2019, మంగళవారం

దిశ దారుణహత్య - కొన్ని ఆలోచనలు - 2

6. ప్రజలలో విశ్వాసాన్ని పొందలేని పోలీసులు

People friendly policing అనే మాటను తరచుగా మనం పోలీసువారి నోటినుంచి వింటూ ఉంటాం. కానీ ఇది ఆచరణలో ఎక్కడా కనపడదు. నిజానికి ఇంతకంటే పెద్దజోక్ ఇంకెక్కడా ఉండదు.

మన దేశంలో, లాయర్లు, క్రిమినల్స్ మాత్రమే పోలీసులతో చక్కగా కలసిమెలసి ఉండగలుగుతారు గాని సామాన్యుడు పోలీసులంటే భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే, వాళ్ళ ప్రవర్తన చాలా దురుసుగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఒక సమస్య మీద ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళితే, వాళ్ళు వాడిని పెట్టె తిప్పలు ఊహాతీతంగా ఉంటాయి. ముందు వాడినే దొంగలా చూస్తారు. కేసు రిజిస్టర్ చేసుకోరు. దురుసుగా ప్రవర్తిస్తారు. అసలు పోలీస్ స్టేషన్ వాతావరణమే భయానకంగా, బెరుకు బెరుకుగా అనిపిస్తుంది.

మొన్నటికి మొన్న, దిశ కేసులో, కేసు పరిధి మాది కాదంటే మాది కాదని మూడు పోలీసు స్టేషన్లకు తిప్పారని వారలొచ్చాయి. ఇందులో అబద్ధం లేదని నేను నమ్ముతున్నాను. నేనే కాదు, మన దేశంలో ఎవరైనా సరే, నమ్ముతారు. FIR రిజిస్టర్ చేయించాలంటే పై అధికారులో, రాజకీయ నాయకులో ఎవరో ఒకరు తెలిసి ఉంటేనే అది సాధ్యమౌతుంది. అంతేగాని, ఒక సామాన్యుడు వెళ్లి తన సమస్య చెబితే FIR రాయరు. ఎందుకంటే వాళ్ళ స్టాటిస్టికల్ గ్రాఫ్ పెరిగిపోతుందని భయం ! రివ్యూ మీటింగులలో జవాబు చెప్పుకోవలసి వస్తుందని భయం ! అందుకని, ఫిర్యాదీని భయపెట్టి పంపించాలనే చూస్తారు గాని, కేసు రిజిస్టర్ చెయ్యరు. ఇది సర్వసాధారణంగా జరిగే తంతు. దిశ ఉదంతం జరిగాక - 'ఎవరొచ్చి సమస్యను చెప్పినా కేసు రిజిస్టర్ చెయ్యండి, FIR రాయండి' - అని IGP ఆర్డర్స్ ఇవ్వవలసి వచ్చిందంటే, మరి ఇన్నేళ్ళూ ఏం జరుగుతున్నట్లు? Cr.PC  ఏం చెబుతోంది? ప్రాక్టికల్ గా ఏం జరుగుతోంది? ఇది అన్యాయం కాదా? ఇది చట్టవిరుద్ధం కాదా?

ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ గడప తోక్కిందంటే, ఎంతో అలవిగాని సమస్య ఉంటేగాని ఆ పని చెయ్యదు. మొగాళ్ళే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఒక అమ్మాయి అందులోనూ రాత్రిపూట స్టేషన్ కి వచ్చో, పోన్ చేసో, తన సమస్యను చెప్పిందంటే, ఎలా స్పందించాలి? దాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? ఇది పోలీసులకు తెలియదా? ట్రెయినింగ్ లో నేర్పరా? ఏంటి ఇదంతా? ఎలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం అసలు? మళ్ళీ మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం అని బడాయిలు ! ఎక్కడుంది ప్రజలకు స్వామ్యం??

పోలీసుల స్నేహం అంతా రాజకీయ నాయకులు వారి తొత్తుల తోనే అనేది జగమెరిగిన సత్యం. ఏ అండా లేని సామాన్యుడికి ఇక న్యాయం ఎలా జరుగుతుంది?

అమెరికాలో 911 కి ఫోన్ చేస్తే నిమిషాలలో సహాయం అందుతుంది. ఇక్కడో? '100 కి ఫోన్ చేస్తే 100 తిప్పలు' అని అందరూ అంటున్నారంటే అర్ధం చేసుకోవాలి మనం ఎక్కడున్నామో? ఊరకే, విదేశాల సిస్టమ్స్ ని కాపీ కొట్టడం కాదు, వాటిని ఎంత సమర్ధవంతంగా అమలులో పెడుతున్నాం అనేదే ముఖ్యం. అది మాత్రం ఎక్కడా కానరాదు.

7. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ నాయకులు

న్యాయ వ్యవస్థలోనూ, నేరాలను అరికట్టే వ్యవస్థలోనూ, రాజకీయుల జోక్యం మన దేశంలో ఎలా ఉంటుందో అందరికీ తెలిసినదే. చాలామంది నేరగాళ్ళు, ఏదో ఒక పార్టీతో సంబంధాలు కలిగి ఉంటారు. ఆయా నాయకులు వారి కొమ్ము కాస్తూ ఉంటారు. ఏదైనా కేసులో ఇరుక్కుంటే, ఆయా లీడర్ల నుంచి 'మావాడే వదిలెయ్యండి' అంటూ పోలీసులకు ఫోన్లు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అలాంటప్పుడు నేరగాళ్లకు భయం ఎలా ఉంటుంది? ఏ నేరం చేసినా, రాజకీయ అండదండలతో తేలికగా తప్పించుకోవచ్చని వారు అనుకుంటారు. పరిస్థితి ఈ విధంగా ఉంటె, సమాజంలో నేరాలు ఎలా తగ్గుతాయి?

అన్ని కాంట్రాక్టులతొ సహా, లిక్కర్ కాంట్రాక్టులు కూడా, రాజకీయుల బినామీలకే దక్కుతాయి. సారాయిని అమ్మించేది రాజకీయ నాయకుల అనుచరులే. అధికారంలో లేనప్పుడు 'లిక్కర్ బ్యాన్ చెయ్యాలి' అంటూ అరుస్తారు. అధికారం లోకి వచ్చాక మౌనం వహిస్తారు. అప్పుడు దిగిపోయినవాళ్ళు అరుస్తుంటారు. ఇదొక డ్రామా ! ఇక నేరాలు తగ్గమంటే ఎలా తగ్గుతాయి?

'చట్టాలు చేసినంత మాతాన నేరాలు తగ్గవు, లిక్కర్ బ్యాన్ చేసినంత మాత్రాన నేరాలు తగ్గవు, ప్రజలలో మార్పు రావాలి' - అని నిన్న నాయకులందరూ పార్లమెంట్ లో తెగ మాట్లాడారు. ప్రజలలో మార్పు అంటే ఏంటో? అంటే, తెల్లారేసరికి అందరూ బుద్ధ భగవానులు అయిపోవాలా? చుట్టూ తాగుడూ, తందనాలూ, జూదగృహాలూ, వ్యభిచార గృహాలూ, సమాజంలో అవినీతీ అన్నింటినీ మీరు పెంచి పోషిస్తూ - 'ప్రజలలో మార్పు రావాలి' - అంటే ఎలా వస్తుంది? ఎక్కడనుంచి వొస్తుంది? అదేమన్నా తోకచుక్కా పైనుంచి రాలి మీద పడటానికి?

నేర ప్రపంచాన్ని రాజకీయ నాయకులు ఇన్ డైరెక్ట్ గా పోషిస్తూ ఉన్నంత కాలం మన సమాజంలో నేరాలు ఆగనుగాక ఆగవు. ఇది పచ్చి నిజం !

8. కొత్త చట్టాలు అవసరమా?

నేరం జరిగిన ప్రతిసారీ ఒక కొత్త చట్టం కావాలని చట్టసభలలో ఊదరగొడుతూ ఉంటారు నాయకులు. కావలసింది కొత్తచట్టాలు కావు. ఉన్న చట్టాలను సరిగ్గా వాడితే చాలు ! ఆ ప్రక్రియలో రాజకీయులు జోక్యం చేసుకోకుండా ఉంటె చాలు. అది మాత్రం ఎవరూ చెయ్యరు.

పదేళ్ళక్రితం ఘోరమైన నేరం చేసిన వాడికి కూడా ఈనాటికీ ఉరి పడకపోతే, కొత్తగా నేరాలు చేసేవాళ్ళు ఎందుకు భయపడతారు? 'మనం ఏం చేసినా పర్లేదు లేరా, ఉరిశిక్ష వెయ్యరు. మహా అయితే జైలుశిక్ష వేస్తారు. జైల్లో మనల్ని బాగా చూసుకుంటారు. భోజనం బాగా పెడతారు. బయట కంటే లోపలే బాగుంటుంది. ప్రాణం తియ్యరు కదా! కనుక మనం ఏ నేరమైనా చెయ్యొచ్చు. తప్పించుకోవచ్చు' అనుకునే క్రిమినల్స్ చాలామంది సమాజంలో ఉన్నారు.

అరేబియా దేశాలలో ఇస్లామిక్ షరియా అమలులో ఉంది. ఇలాంటి నేరాలు చేస్తే అక్కడ భయంకరమైన శిక్షలు వెంటనే పడతాయి. జనమందరూ కలసి నేరస్తులను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. లేదా కాళ్ళూ చేతులూ నరికేస్తారు. లేదా కళ్ళు పెరికేస్తారు. నాలుగురోడ్ల కూడలిలో ఉరితీస్తారు. ఈ శిక్షలు చాలా త్వరగా అమలౌతాయి. రెండోసారి అలాంటి నేరాలు చెయ్యాలంటే ప్రజలు భయపడతారు. మరి మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది? ఇరవై ఏళ్ళ క్రితం నేరం చేసినవాడికి కూడా నేటికీ శిక్షలు లేవు. ఆయేషా బేగం కేసు ఏమైంది? నేటికీ తేలలేదు. అంతకు ముందు ఇంకో కేసు ఏమైంది? అంతకు ముందు ఇంకో కేసు ఏమైంది? ఏవీ తేలవు. వేటికీ శిక్షలు పడవు. నేరాలు తగ్గమంటే, ఎందుకు తగ్గుతాయి?

పొత్తిళ్ళలో పసిపిల్లను ఎత్తుకెళ్ళి రేప్ చేసిన మానవజంతువుకు కూడా నేటికీ ఉరిశిక్ష పడలేదు. ఇంకేంటి మన న్యాయవ్యవస్థ పనితీరు?? సిగ్గుండాలి మాట్లాడుకోవడానికి??

9. సినిమాల ప్రభావం

ఈ మధ్యన ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఏదైనా నేరం జరగగానే, సినిమా వాళ్ళు వచ్చేసి టీవీలలో తెగ మొసలికన్నీరు కురిపిస్తున్నారు. సమాజానికి మెసేజీలు గుప్పిస్తున్నారు. ఇదొక విచిత్రం ! అదే సినిమా హీరోలూ హీరోయిన్లూ ఒక్కసారి వెనక్కు తిరిగి వాళ్ళు డాన్సులు చేసిన ఐటెం సాంగ్స్, ఆ పాటల్లో టూ పీస్ దుస్తుల్లో డాన్సర్లు వేసిన జుగుప్సాకరమైన నడుము ఊపే స్టెప్పులూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆయా పాటల్లో వాడిన అసభ్యమైన భాషను గుర్తు తెచ్చుకోవాలి. ఆడదాన్ని వాడిపారేసే వస్తువుగా చూపిస్తున్న సినిమా సంస్కృతిని గుర్తు తెచ్చుకోవాలి.

వీళ్ళా మనకు నీతులు చెప్పేది? ఒకవైపు అసభ్యతనూ, అశ్లీలతనూ ప్రోత్సహిస్తున్నది వీళ్ళే. మళ్ళీ సమాజానికి నీతి సూత్రాలు చెబుతున్నదీ వీళ్ళే. ఏంటీ మాయ? వీళ్ళ వేషాలు నమ్మడానికి మనం వెర్రివాళ్ళమా?

టీనేజి కుర్రకారుమీద ఈ అసభ్య సినిమాపాటలు, డాన్సుల ప్రభావం ఎలా ఉంటుందో నేను వివరించనక్కరలేదు. అందరూ కలసి కూచుని త్రాగుతూ ఉంటె, మధ్యలో ఒక టూ పీస్ అమ్మాయి, చుట్టూ తనలాంటి ఒక ఇరవైమంది అమ్మాయిలతో ఎగురుతూ రెచ్చగొట్టే ఐటెం సాంగ్స్ ఎన్నున్నాయి మన సినిమాల్లో? ఈ పాటలన్నీ ఏం సందేశాన్ని ఇస్తున్నాయి కుర్రకారుకి? ఊరకే, తెరమీద ఒక మూలకి, smoking is injurious to health, Consumption of liquor is injurious to health అంటూ కనిపించీ కన్పించని అక్షరాలు కొద్ది సెకండ్లు కనిపిస్తే సరిపోతుందా? ఆ పాటలు, డాన్సులు చేసే మానసిక డామేజిని ఈ సందేశాలు నివారించగలవా? వీటిని అదుపులో పెట్టాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా?

నిలువెత్తు వాల్ పోస్టర్లలో, కటౌట్లలో, రకరకాల కామసూత్ర భంగిమలలో ఉన్న హీరో హీరోయిన్లు రోడ్లమీద ఎక్కడ చూసినా కనిపిస్తారు. లేకపోతే బికినీలోనో, చెడ్డీలోనో విలాసంగా నడిచిపోతూ ఒళ్ళు మొత్తం 70mm లో చూపిస్తున్న హీరోయిన్, దాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్న హీరో - ఇలాంటి దృశ్యాలు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇవి సరియైన పోకడలేనా? ఇవన్నీ ఎలాంటి భావోద్రేకాలని రేకెత్తిస్తాయి మనుషులలో? అరికట్టాల్సిన బాధ్యత మనకు లేదా? డబ్బు సంపాదించాలంటే బ్లూ ఫిలిమ్స్ తియ్యడం ఒక్కటే మార్గమా? ఇక వేరే మార్గాలు లేవా?

10. Internet, Youtube ప్రభావం

నెట్లో ఒక పోర్న్ వీడియో చూడాలంటే ఇప్పుడు మంచినీళ్ళు త్రాగినంత సులభం. చిన్నచిన్న పిల్లలు కూడా వాటిని చూస్తున్నారు. 'ఏడేళ్ళ పిల్లవాడు, నాలుగేళ్ల పిల్లని రేప్ చెయ్యాలని ప్రయత్నం చేశాడు' అని వార్తలు చూస్తుంటే నోట మాటరాని పరిస్థితి ఉంటోంది. పైగా ఆ సీన్ ని వీడియో తీసిన అతని ఫ్రెండ్స్ అట ! మళ్ళీ వాళ్ళందరూ కూడా పదేళ్ళలోపు పిల్లలే. ఇదీ మన ప్రస్తుత సమాజపు తీరు !! ఈ పిల్లలందరూ పెద్దయ్యాక ఏమౌతారు? క్రిమినల్స్ అవుతారా లేక సాధువులు అవుతారా? మీరే చెప్పండి ! 

లారీ డ్రైవర్లూ, క్లీనర్లూ కలసి, హైవే పక్కన విచ్చలవిడిగా దొరికే మద్యం తాగుతూ, ఇలాంటి వీడియోలు చూస్తూ, అలాంటి సినిమాల ఐటెం సాంగ్స్ చూస్తూ, పోలీసులకు మామూళ్ళు ఇస్తూ, వాళ్ళు తీసుకుంటూ, న్యాయవ్యవస్థ అంటే భయం లేకుండా ఉంటూ ఉంటే, రౌడీయిజమే హీరోయిజం అవుతూ ఉంటే, రాజకీయులూ, పోలీసులూ ఈ పోకడలను ఇన్ డైరెక్ట్ గా ప్రోత్సహిస్తూ ఉంటే, ఎలాంటి సంఘటనలు జరుగుతాయి మరి?

11. స్కూళ్ళలో నేర్పే కరాటే కుంఫూలు పనికొస్తాయా?

పనికిరావని నిర్భయ ఉదంతం జరిగినప్పుడే రాశాను. ఇవి ఫాన్సీగా నేర్చుకునేవే గాని ప్రాక్టికల్ గా ఎందుకూ పనికిరావు. అసలు ఆడపిల్లకు కావలసింది కరాటే కుంఫూ కాదు. అతిమంచితనం పనికిరాదు, మెతకదనం పనికిరాదు, చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో తాను ఉన్నానో అంచనా వెయ్యగలిగే మానసికస్థితి ఉండాలి, తననెవరు ఫాలో అవుతున్నారో గమనిస్తూ ఉండాలి, ప్రమాదంలో పడుతున్నాను అనిపించినప్పుడు ఎవరికి ఫోన్ చెయ్యాలి? ఏయే నంబర్లకు SOS మెసేజి ఇవ్వాలి? ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పుకొని సేఫ్ ప్లేస్ కు వెళ్ళాలి? అన్న విషయాలు తెలియాలి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. ఏయే సమయాలలో ఏయే ప్రదేశాలకు వెళ్ళకూడదో తెలియాలి. ఒకవేళ తప్పక వెళ్ళవలసి వస్తే, ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ఏయే యాప్ లు తన ఫోన్లో ఉండాలి. వాటిని ఎలా వాడాలి, ఆయా మనుషులతో ఎలా డీల్ చెయ్యాలి మొదలైన విషయాలన్నీ తెలిసి ఉండాలి. అంతేగాని, పనికిరాని కరాటే కుంఫూలు నేర్చుకుని ఉపయోగం లేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ సారాంశం ఒక్కటే. అశ్లీలతని, చెడుని మనమే పెంచుతున్నాం, మళ్ళీ ఏదైనా ఘోరం జరిగినప్పుడు మనమే గగ్గోలు పెడుతున్నాం. కానీ నిర్మాణాత్మక చర్యలు ఏవీ చేపట్టవలసిన స్థాయిలో చేపట్టడం లేదు. అందుకే ఈ నిర్భయలు, ప్రియాంకలు, మానసలలను మనం చూస్తున్నాం. మన విలువలు లేని తనానికి, మన నీతిరాహిత్యానికి, మన హిపోక్రసీకి బలైపోయిన సమిధలు వీళ్ళంతా !

వీరి బలికి ఎవరిదీ బాధ్యత? ఆ నేరాలు చేసిన వాళ్ళదేనా? మనకు లేదా బాధ్యత? సమాజాన్ని ఇంత దరిద్రంగా నిర్మించుకుంటూ, చెడగొట్టుకుంటూ, మళ్ళీ గోలగోలగా తప్పు మీదంటే మీదని అరుచుకుంటూ, ఒక నిర్మాణాత్మక వైఖరి లేకుండా, మళ్ళీ రేపు ఇంకొక క్రొత్త న్యూసు కోసం ఎదురుచూచే మనలాంటి అసమర్ధ నీచపు మనుషులు ఉన్న సమాజంలో ఇలాంటివి గాక ఇంకెలాంటి సంఘటనలు జరుగుతాయని ఆశించగలం?

అందరూ సుఖంగా హాయిగా ఉండే నేరరహిత సమాజంలో బ్రతికే అర్హత మనలాంటి మనుషులకు ఉందా? మీరే చెప్పండి ! మళ్ళీ కొన్నాళ్ళకు ఇంకో అమ్మాయి ఇలాగే బలి కాకుండా ఉంటుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? నాకైతే నమ్మకం లేదు !!
read more " దిశ దారుణహత్య - కొన్ని ఆలోచనలు - 2 "

2, డిసెంబర్ 2019, సోమవారం

దిశ దారుణహత్య - కొన్ని ఆలోచనలు - 1

దిశ దారుణహత్య మిగిల్చిన గాయాల గురించి, మన సమాజపు డొల్లతనం గురించి కొంత మాట్లాడుకుందాం.

1. పబ్లిక్ మతిమరుపు

ఏడేళ్ళ క్రితం నిర్భయ హత్య డిల్లీలో జరిగింది. జనమంతా గోలగోల చేశారు. సోషల్ మీడియా వెల్లువైంది. కేండిల్ ప్రదర్శనలూ, టీవీల్లో అరుచుకోవదాలూ, రోడ్లేక్కి నినాదాలు ఇవ్వడాలూ, మేధావుల మేసేజిలూ, మౌన నివాళులూ, 'చెల్లీ మమ్మల్ని క్షమించు, మళ్ళీ ఇది జరగనివ్వం' అన్న ప్రతిజ్నలూ అన్నీ జరిగాయి. కానీ ఏడేళ్ళ తర్వాత మళ్ళీ అదే జరిగింది. అయితే ఈ సారి డిల్లీ కాదు, హైదరాబాదులో జరిగింది. ఈ మధ్యలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. కొన్ని బయటకొచ్చాయి. కొన్ని రాలేదు. డబ్బూ పలుకుబడీ ఉన్నవాళ్ళు కొన్నింటిని బయటకు రానివ్వలేదు. అంతే తేడా !

మరి మనం ఏం నేర్చుకున్నట్లు? ఎవరో అన్నట్లు - 'పబ్లిక్ మెమరీ చాలా చిన్నది. ఈ రోజు జరిగినది రేపటికి గుర్తుండదు' అన్న విషయం నిజమేనేమో? మనకు ప్రతిదీ న్యూసే. దిశ ఇంకో రెండు రోజులకు పాతబడి పోతుంది. మళ్ళీ ఇంకో కొత్త న్యూస్ మనకు కావాలి, సోషల్ మీడియాలో మళ్ళీ కాసేపు అల్లరి చెయ్యడానికి. అంతేగాని ఒక నిర్మాణాత్మక ఆచరణ మనలో లేదు. ఇదే మన సమాజపు ప్రధానమైన లోపం.

నిర్భయ సంఘటన నుంచి నేర్చుకోవాల్సినంత పూర్తి స్థాయిలో మనం పాఠం నేర్చుకోలేదనేది సారాంశం ! పాలకులు మాటలు చెప్పినంత ధాటిగా చేతలు చెయ్యడం లేదనేది వాస్తవం. పౌరులు ఇష్టానుసారం తయారయ్యారనేది ఇంకొక వాస్తవం !

2. న్యాయశాస్త్రం నిజంగా సత్వరన్యాయాన్ని అందిస్తోందా?

నిర్భయ కేసు జరిగి ఏడేళ్ళు అయింది. కానీ నిందితులకు ఇప్పటికీ ఉరి పడలేదు. ఎందుకని? తాబేలు కంటే నిదానంగా నడిచే మన న్యాయ వ్యవస్థ కొంతవరకు కారణం కాదా? నేను 30 ఏళ్ళ క్రితం 'లా' చేశాను. న్యాయశాస్త్రం చదివేటప్పుడే అందులో చాలా విషయాలు నాకు నచ్చలేదు. అందులో ఇది ఒకటి. తీవ్రమైన నేరాలలో మన లీగల్ ప్రాసెస్ నత్తనడక నడుస్తుంది. క్రింది కొర్టు నుంచి సుప్రీం కొర్టు వరకు కేసు వెళ్లేసరికి ఆ నేరస్తులలో చాలామంది చనిపోతారు. కేసు నీరుగారిపోతుంది. ఈ లోపల పబ్లిక్ దానిని మర్చిపోతారు. మళ్ళీనేమో - 'న్యాయాన్ని ఆలస్యం చేస్తే, అన్యాయం చేసినట్లే' అనే సామెతలు మాత్రం బాగా చెబుతారు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా, ఎప్పుడో బ్రిటిషు వాడు ఏర్పాటు చేసి పోయిన చట్టాలను మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎందుకని మార్చుకోలేక పోతున్నాం? ఇలాంటి కేసుల్లో ఒక వారం రోజులలోపు ఎందుకని శిక్షలు అమలు చెయ్యలేకపోతున్నాం? ఇలా తాత్సారం చేస్తూ కేసులను నీరుగారుస్తూ ఉంటె, మనకు నిజంగా సమస్యలు పరిష్కారం చెయ్యాలని ఉన్నట్లా లేనట్లా? మనం ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్లు? వారి చిత్తశుద్ధిని శంకించాలా వద్దా? మళ్ళీ న్యాయవ్యవస్థలో ఎందఱో కొమ్ములు తిరిగిన మేధావులు ? దానికొక మంత్రిత్వ శాఖ ? ఏంటో ఇదంతా !

3. న్యాయాన్ని ప్రభావితం చేస్తున్న ఇతర అంశాలు.

మన దేశంలో ఆర్టికల్ 14 అందరినీ సమానంగా చూడమని అంటోందని అంటారు గాని, మళ్ళీ దానికి తొంభై ఆరు వెసులుబాట్లున్నాయి. ప్రతిదానికీ ఒక రిలాక్సేషన్, ప్రతి క్లాజుకీ పది సబ్ క్లాజులున్నాయి. కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, పలుకుబడిని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క న్యాయం మన దేశంలో అమలవుతూ ఉంటుంది. న్యాయం ఇచ్చే అంతిమతీర్పులో ఈ అంశాలు ఉండకపోవచ్చు గాని, న్యాయవ్యవస్థలోని అనేకమంది ఈ అంశాలద్వారా ప్రభావితులై పోతూ, అంతిమ తీర్పును ఇన్ డైరెక్ట్ గా ప్రభావితం గావిస్తారు. న్యాయమూర్తులలో కూడా పార్టీలకు, కులాలకు, వర్గాలకు కొమ్ము కాసేవాళ్ళు, అవినీతిపరులు ఉన్నారంటే మన న్యాయవ్యవస్థ ఏ తీరులో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రజల వైపునుంచి సరైన వత్తిడీ లేదు. పాలకులలో నిజాయితీ లేదు. పోలీసులేమో ప్రజల్ని భయపెట్టేలా తయారయ్యారు. ఇలాంటి వ్యవస్థలో న్యాయం ఎలా జరుగుతుంది?

4. పసలేని ఉద్యమాలు

ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మన జనమంతా రోడ్లేక్కి రెండ్రోజుల పాటు గోలగోల చేస్తారు. ఆ తర్వాత అందరూ దానిని మర్చిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ ధోరణి చాలా ఎక్కువ. అక్కడన్నీ మొక్కుబడిగా చేస్తున్నట్లు కనిపిస్తుంది గాని ఒక ఉద్యమంలో ఉండవలసిన ఆవేశం, ఆ ఆవేశాన్ని చివరివరకూ కొనసాగించడాలు కనిపించవు. కాని, తెలంగాణాలో పరిస్థితి అలా ఉండదు. ఇది ఉద్యమాల గడ్డ గనుక, ఇక్కడి ప్రజలలో కమిట్ మెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇష్యూ పట్టుకుంటే దాని అంతు తెల్చందే నిద్రపోరు. తెలంగాణలో నాకు నచ్చిన అనేక అంశాలలో ఇది ఒక ప్రధానమైన అంశం. దిశ ఇష్యూ లో కూడా, ఆంధ్రాలో చేసిన కేండిల్ లైట్ ప్రదర్శనలన్నీ విద్యార్ధుల చేత కాలేజీ వాళ్ళు చేయించిన మొక్కుబడి ప్రదర్శనల లాగా ఉన్నాయి. చాలామంది విద్యార్ధినీ విద్యార్ధులు కెమేరాకు పోజిచ్చినట్లో, మొక్కుబడిగా చేస్తున్నట్లో, కొందరైతే ముసిముసిగా నవ్వుకుంటూ కనిపించారు. కానీ శంషాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర హైదరాబాద్ పౌరులు చేసిన అలజడి చాలా భిన్నంగా ఆవేశపూరితంగా ఉంది. ఉద్యమం అంటే అలా ఉండాలిగాని, ఎవరి కాలేజీలో వాళ్ళు కేండిల్ ప్రదర్శనలు, ఆడిటోరియం లోపల తలుపులేసుకుని చెప్పుకునే ఉపన్యాసాల వల్ల ఉపయోగం శూన్యం. ఒక ఉద్యమం వల్ల ఆ ఇష్యూ పరిష్కారం కావాలి గాని, కంటితుడుపు చర్యలవల్ల ఏమాత్రమూ ఉపయోగం ఉండదు. కానీ మన సొసైటీ కంటితుడుపు చర్యలకే బాగా అలవాటు పడింది గాని నిర్మాణాత్మక విధానాలకు కాదు.

5. మద్యం అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? వేరే మార్గాలు లేవా?

మద్యం అనేది సమాజంలో నేరాలకు మూలకారణం అనే విషయం పోలీసులకు తెలుసు. న్యాయమూర్తులకూ తెలుసు. మేధావులకూ తెలుసు. రాజకీయ నాయకులకూ తెలుసు. కానీ ఎవరూ మద్యనిషేధం దిశగా కృషి చెయ్యరు. కంటితుడుపు వాగ్దానాలు చేస్తారు గాని అమలు చెయ్యరు. పేదల కిస్తున్న రాయితీలన్నీ మళ్ళీ మద్యంషాపుల ద్వారా ప్రభుత్వానికే చేరుతాయన్నది వాస్తవం. ఈ రాక్షసిని ప్రభుత్వాలే పోషిస్తూ ఉంటె నేరాలు ఎలా అదుపులోకి వస్తాయి?

దిశ హంతకులందరూ త్రాగి ఉన్నారని, ఆమె చేత కూడా బలవంతంగా త్రాగించారనీ వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు దీనికేం సమాధానం చెబుతాయి? ఎక్కడ చూచినా వైన్ షాపులు, లిక్కర్ షాపులు తామరతంపరగా కనిపిస్తున్నాయి. మంచినీళ్ళ బాటిల్ దొరకడం లేదు గాని సారాయి మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతోంది? పైగా, హైవే మీద సారాయి ధారాళంగా దొరుకుతుంది. చాలామంది లారీ డ్రైవర్లు త్రాగి లారీలు నడుపుతారనేది చేదువాస్తవం. రాత్రిళ్ళు ఒకచోట లారీ ఆపవలసి వస్తే, ఆ దగ్గరలో సారాయి కొట్లూ, పాడుకొంపలూ ఉండే చోటనే వాళ్ళు లారీలు ఆపి కొన్ని గంటలు ఉంటారనేది అందరికీ తెలిసిన నిజం. అన్నీ తెలిసి కూడా పోలీసులూ ఇతర అధికారులూ చోద్యం చూస్తూ ఉంటారు. ఎవరి మామూళ్ళు వారికి అందుతూ ఉంటాయి. ఈ విషయాలు అందరికీ తెలుసు. అన్నీ తెలిసి మరి ఇవేమి ప్రభుత్వాలు? వీళ్ళేమి ప్రజాప్రతినిధులు? ఎందుకని మద్యాన్ని నిషేధించకూడదు? ఎందుకని పోలీసు వ్యవస్థలో మామూళ్ళు లేకుండా చెయ్యకూడదు? సమాజ శ్రేయస్సు కంటే మద్యం ఎక్కువా? మామూళ్ళు ఎక్కువా?

(ఇంకా ఉంది)
read more " దిశ దారుణహత్య - కొన్ని ఆలోచనలు - 1 "

1, డిసెంబర్ 2019, ఆదివారం

నవంబర్ 2019 అమావాస్య ప్రభావం - దిశ దారుణ హత్య - విశ్లేషణ

ప్రతి ఏడాదీ నవంబర్ నెలలో వచ్చే అమావాస్య ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని ఇంతకు ముందు ఎన్నోసార్లు వ్రాశాను. కావాలంటే, మనుషుల మీద అమావాస్య పౌర్ణమి ప్రభావాల గురించి నా పాతపోస్టులు చదవండి. మీకు చాలా స్పష్టంగా అర్ధమౌతుంది.

ఈ అమావాస్యలలో కూడా, నవంబర్ లో వచ్చే అమావాస్య చాలా చెడ్డది. దీనికి కారణం ఈ సమయంలో చంద్రుడు వృశ్చికరాశిలో ఉండటమే. ఇది చంద్రునికి నీచస్థానం. అంటే చందుని బలం పూర్తిగా క్షీణించి ఉంటుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు గనుక మనుషుల మనసులు నీచపు ఆలోచనలతో నిండిపోతాయి. బలహీనంగా మారుతాయి. ఇంపల్సివ్ అవుతాయి. లాజిక్, రీజన్ కోల్పోతాయి. అందుకే ప్రతి ఏడాదీ ఈ సమయంలో వచ్చే అమావాస్య చాలా చెడ్డ ఫలితాలను ఇస్తుంది. మీరు గతంలో ఏ సంవత్సరమైనా చూడండి. నవంబర్ లో వచ్చే అమావాస్య పరిధిలో అనేక ఘోరాలు నేరాలు యాక్సిడెంట్లు చావులు జరిగినట్లు స్పష్టంగా చూడవచ్చు. అంతేకాదు, మీమీ జీవితాలలో పరిశీలించుకుంటే, ఈ అమావాస్య పరిధిలో మీమీ కుటుంబాలలో, గొడవలు, వాదప్రతివాదాలు, అలగడాలు, కోపతాపాలకు లోనుకావడాలు ఎన్నో జరిగి ఉంటాయి. గమనించండి.

జ్యోతిశ్శాస్త్ర ప్రకారం - టీనేజ్ లో ఉన్న ఆడపిల్లలకు, అమాయకంగా ఉండే ఆడపిల్లలకు చంద్రుడు సూచకుడు. అందుకే ఈ సమయంలో అలాంటి వాళ్ళే ఎక్కువగా బలైపోతూ ఉంటారు. ఇది ప్రతి ఏడాదీ జరుగుతున్న తిరుగులేని నిజం.

ఈ అమావాస్య పరిధిలో దిశ ఉదంతం ఒక్కటే కాదు, అనేకం జరిగాయి. హైదరాబాద్ కే చెందిన రూత్ జార్జ్ అనే అమ్మాయి చికాగోలో రేప్ చెయ్యబడి చంపబడింది. ఇది కూడా సరిగ్గా నాలుగు రోజుల క్రితమే UIC - University of Illinois Chicago లో జరిగింది. ఈ పనిని చేసింది అప్పటికే ఇంకో నేరం చేసి పెరోల్ లో బయట తిరుగుతున్న డోనాల్డ్ తుర్మన్ అనే అమెరికన్ క్రిమినల్. అంతేకాదు, తమిళనాడులోని కోయంబతూర్ లో ఇంకో ఉదంతం ఇలాంటిదే జరిగింది. నిన్నటికి నిన్న, హైదరాబాద్ లో, నిజాంపేట్ అనే ఏరియాలోని ఒక అపార్ట్మెంట్ లో అత్యాచారం ఒకటి వెలుగు చూసింది. ఇవి బయటకు వచ్చినవి. బయటకు రానివి, రిపోర్ట్ కానివి ఎన్నో? ఇంకెన్నో ??

ఇక ఈ అమావాస్య పరిధిలో జరిగిన యాక్సిడెంట్లకు లెక్కే లేదు. బ్రిడ్జికి గుద్దుకొని ప్రమాదానికి గురైన ఆరంజ్ కంపెనీ ట్రావెల్ బస్సు నుంచి, కెనడాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి దాదాపు పదిమంది అమెరికన్స్ ని, కెనడియన్స్ ని చంపేసిన విమానం వరకూ చిన్నా పెద్దా ప్రమాదాలు అనేకం ప్రతిచోటా జరిగాయి. ఒక్క హైదరాబాద్ లోనే, ఈ అయిదురోజులలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి.

అసలు, ఒకే టైం స్లాట్ లో ఇన్నిన్ని దారుణాలు ఎందుకు జరుగుతాయి? ఈ దారుణాల వెనుక మానవ తప్పిదాలున్నప్పటికీ, ఆ తప్పిదాల వెనుక పనిచేసిన యూనివర్సల్ శక్తులు ఏమిటి? ఇంతమంది మనస్సులు కూడబలుక్కున్నట్లుగా ఒకేసారి ఎందుకు గాడి తప్పుతాయి?ఆలోచించండి. నేను చెబుతున్నది నిజమే అని మీరూ ఒప్పుకుంటారు. అయితే, మరి రెమేడీలు చెయ్యడం ద్వారా ఈ ప్రమాదాలు తప్పవా? అని మీకు సందేహం రావచ్చు. తప్పుతాయి. కానీ అన్నీ తప్పవు. కొన్నింటిని తప్పించడం సాధ్యం కాదు. కొన్ని remedies నయితే అసలు చెయ్యడమే సాధ్యం కాదు. ఏయే కర్మలు పరిహారాలకు లొంగుతాయి? ఏవి లొంగవు? అనే సూక్ష్మాలు ఈ శాస్త్రపు లోతుపాతులే గాక, ఆధ్యాత్మిక లోకపు లోతుపాతులు చూచినవారికే అర్ధమౌతాయి గాని, డబ్బుకోసం ఏ పనైనా చేసే నేటి మిడిమిడిజ్ఞానపు జ్యోతిష్కులకు అర్ధమయ్యే విషయాలు కావు. పైగా, పరిహారాలు చెప్పినా వాటిని అందరూ చెయ్యలేరు. ఈ విషయం నా శిష్యులలో చాలామందికి అనుభవపూర్వకంగా తెలుసు.

రేమేడీలే కాదు, జీవితంలో ఏది చెయ్యాలన్నా అందరూ చెయ్యలేరు. కొందరు మాత్రమే కొన్ని చెయ్యగలరు. అందరూ అన్నీ చెయ్యలేరు. అదే పూర్వకర్మ బలం అంటే. అందుకే ' మనిషి స్వతంత్రుడు కాదు. తన కర్మ చేతిలో బానిస' అని వ్రాశాను.

మనిషి జీవితంలో సాధారణంగా జరిగే పనులు వారివారి పూర్వకర్మానుసారం నెట్టుకొని జరుగుతూ ఉంటాయి. ఆగమన్నా ఆగవు. వద్దన్నా తప్పవు. పూర్వకర్మను జయించాలంటే సాధన కావాలి. సాధన చెయ్యాలంటే సరియైన గురువు దొరకాలి. ఆ గురువును అంటిపెట్టుకుని ఉండే పరిపక్వతా, సంకల్పశక్తీ, నిలకడ కలిగిన మనస్సూ ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు కర్మ తీరదు. జీవితం మారదు. టైం మాత్రం ఏళ్ళకేళ్ళు గడచిపోతూ ఉంటుంది. నెట్టింట్లో జీవితం ఆవిరైపోతూ ఉంటుంది.

ప్రస్తుత అమావాస్య చక్రాన్ని పైన ఇచ్చాను గమనించండి.

ఇందులో సూర్యచంద్రులు వృశ్చికరాశిలో కలిశారు. ఇదే వృశ్చిక అమావాస్య. ఈ కుండలిలో, ఒక్క రాహువు తప్ప, మిగతా గ్రహాలన్నీ, సూర్యచంద్రులను అప్పచ్చి (Sandwitch) చేశాయి గమనించండి. వీరిలో కుజబుధుల కలయిక, మొండితనానికీ, మూర్ఖత్వానికీ సూచిక. శని గురువుల కలయిక గట్టి పూర్వకర్మకు, అనుభవించవలసిన అగత్యానికీ సూచిక. శుక్ర కేతువుల కలయిక ఆడవారిమీద అఘాయిత్యాలకు సూచిక. పైగా ఉచ్చరాహువు ఆర్ద్రా నక్షత్రంలో ఒంటరిగ్రహం (lonely planet) గా మారాడు. అంటే విపరీత దూకుడు ప్రవర్తనను ఇస్తాడు. కనుక, మనస్సుకు కారకుడైన చంద్రుని మీద ఇన్ని గ్రహాల ప్రభావం పడింది. అసలే బలహీనుడు. మతిపోయి ఉన్నాడు. ఇక అలాంటి స్థితిలో ఉన్న అతని మీద ఇన్ని గ్రహాల ప్రభావం పడితే ఏమౌతుంది. రీజన్ లోపిస్తుంది. లాజిక్ కనుమరుగౌతుంది. చేస్తున్న పనికి ఫలితం ముందు ముందు ఎలా ఉంటుంది అన్న విషయం గుర్తుకు రాదు. ఈ లోపల జరగాల్సింది జరిగిపోతుంది. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నవారే నేరాలు చేస్తారు. ఘోరాలు చేస్తారు, యాక్సిడెంట్లు చేస్తారు. ఆత్మహత్యలకు ప్రయత్నిస్తారు. ఇంకా ఎన్నో చేస్తారు. అవే ఇపుడు జరిగాయి.

ఈ జ్యోతిశ్శాస్త్ర కోణాలను, ఆధ్యాత్మిక కోణాలను పక్కన ఉంచి, దిశ దారుణ ఉదంతంలో ఉన్న సామాజిక కోణాలను రాబోయే పోస్టులలో గమనిద్దాం.

(ఇంకా ఉంది)
read more " నవంబర్ 2019 అమావాస్య ప్రభావం - దిశ దారుణ హత్య - విశ్లేషణ "