“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2021, శుక్రవారం

స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -2 (జాతక విశ్లేషణ)

సామాన్యంగా, మహనీయుల యొక్క ఖచ్చితమైన జాతకవివరాలు మనకు లభించవు. అందులోను, 150 ఏళ్ల క్రితం జన్మించిన వారి వివరాలు సరిగ్గా లభించడం మన అదృష్టమేనని చెప్పాలి. Swami Nirmalananda - His life and teachings అనే పుస్తకంలో స్వామియొక్క జననవివరాలు లభిస్తున్నాయి. శ్రద్ధ ఉన్నవారు చదవండి. ఎంతసేపూ పనికిరాని చెత్తపుస్తకాలు చదవడం, నెట్టు, యూట్యూబు, సొల్లుకబుర్లలో కాలం గడపడం కాదు మనిషి చెయ్యవలసింది. మనిషి పుట్టుక పుట్టినందుకు ఇలాంటి మహనీయుల జీవితాలు చదవాలి. కొంతైనా వారి సువాసన మనకు అంటించుకోవాలి. వారు చూపిన మార్గంలో కొద్దిగానైనా నడవాలి. అప్పుడే మనిషి జన్మ ఎత్తినందుకు మనకు కూడా  కొంత సార్ధకత ఉంటుంది.

ఈయన 23-12-1863 న రాత్రి 8.30 ప్రాంతంలో కలకత్తాలో జన్మించాడు. ఆరోజున మార్గశిర శుక్ల చతుర్దశి, బుధవారం, రోహిణీ నక్షత్రం - 4 వ పాదం నడుస్తున్నది. కుందస్ఫుట విధానంలో జననకాల సంస్కరణ (Birth time rectification) చేయగా జననసమయం రాత్రి 8-32-30 అవుతున్నది. ఆ సమయానికి వేసిన జాతకం, వర్గచక్రములు, దశలు, జాతకుని జీవితంలోని ఘట్టములు ఇత్యాదులతో ఖచ్చితంగా సరిపోతున్నందున ఇదే స్వామియొక్క అసలైన జననసమయమని నేను నిర్ధారిస్తున్నాను.

లగ్నం, కర్కాటకం 27 డిగ్రీలలో పడుతూ, మీననవాంశను సూచిస్తున్నది. షడ్వర్గులలో సింహహోర, మీనద్రేక్కాణము, మిథున ద్వాదశాంశ, వృశ్చిక త్రిమ్శాంశలు ఉదయిస్తున్నాయి. ఆధ్యాత్మికజీవితాన్ని సూచించే వింశాంశకుండలి లగ్నం తుల అవుతున్నది. ఈయనకు జననసమయంలో చంద్ర - రవి - బుధ దశ నడుస్తున్నది.

నక్షత్రాధిపతి అయిన చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటూ మంచి మనస్సును, జాలిగుండెను, దయాస్వభావాన్ని సూచిస్తున్నాడు. అయితే, ఈ జాతకంలో రాహుకేతువులు నీచస్థితిలో ఉండటాన్ని గమనించాలి. ఉఛ్చచంద్రుడు నీచకేతువుతో కలసి ఉండటం ఈ జాతకంలో ఒక విచిత్రమైన యోగం. ఇది తల్లివైపునుంచి సంక్రమించిన ఒక శాపాన్ని సూచిస్తున్నది. ఆ శాపమేమిటి అన్న లోతైన విషయాలను నేనిక్కడ చర్చించను. దీనివల్ల తెలివితేటలు, దయాహృదయం ఉన్నప్పటికీ, జీవితపు చరమాంకంలో దుర్భరమైన మానసికవేదనను పడవలసి ఉంటుందన్న సూచన ఉన్నది. స్వామి జీవితంలో ఖచ్చితంగా అదే జరిగింది. దీనికారణం తెలియాలంటే నా పద్ధతిలో జ్యోతిష్యవిశ్లేషణ చేయడం మీకు తెలియాలి.  లాభస్థానమనేది ద్వితీయ కర్మస్థానం కూడా. గతకర్మ ఛాయలు ఇక్కడ గోచరిస్తాయి. అవి ఏయే రూపాలలో  ఈ జన్మలో ప్రకటితమౌతాయో ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు.

ఈ యోగం ఇంకొక విచిత్రమైన ఫలితాన్నిస్తుంది. షష్టాధిపతి మేనమామకు సూచకుడు. ఈ జాతకంలో షష్టాధిపత్యం పట్టిన గురువు చతుర్దంలో శుక్రునితోకలసి ఉంటూ పాపార్గళానికి గురయ్యాడు.  మేనమామకు వివాహము లేకపోవడాన్ని, సంతానం లేకపోవడాన్ని, ఆయనొక సాధువైపోవడాన్ని ఈ యోగం సూచిస్తుంది. దీనికి తగినట్లుగానే, స్వామి మేనమామ  అయిన నిత్యగోపాల్ అనే ఆయన సన్యసించి జ్ఞానానంద అవధూత అనే పేరుతో బెంగాల్లో అనేక మఠాలు స్థాపించాడు. వాటిని 'మహానిర్వాణమఠం' అంటారు. అవన్నీ ఇప్పటికీ నడుస్తున్నాయి. ఈ నిత్యగోపాల్ అనే ఆయన శ్రీరామకృష్ణుల దగ్గరకు వస్తూపోతూ ఉండేవాడు. ఆయన్ను ఆరాధించేవాడు. కానీ, తర్వాత తనదంటూ ఒక ప్రత్యేక సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈయన భక్తులు ఈయన్ను బలరాముని అవతారంగాను, శీరామకృష్ణులను  కృష్ణుని అవతారంగాను ఈనాటికీ కొలుస్తారు.

కనుక దైవసాధనలో పడి లౌకికజీవితాన్ని త్యజించడము, సన్యాసం స్వీకరించి సాధువుగా మారడము అనేవి వీరి కుటుంబంలో ఉన్నాయి. ఈ విధంగా కొన్ని కొన్ని పోకడలు జీన్స్  లో వస్తాయి. తమతమ పూర్వీకులలో ఎవరైనా ఋషులు ఋషితుల్యులు లేనిదే ఇలాంటి పోకడలు ఉన్నపళంగా ఎవరికీ రావు. గోత్రమహిమ అంటే ఇదే. వివేకానందస్వామి జీవితంలో కూడా దీనిని గమనించవచ్చు. వారి వంశంలో, తరానికొకరు చొప్పున పెళ్లి చేసుకోకుండా సాధువులుగా మారిపోవడం ఉన్నది. వివేకానందస్వామి చిన్నప్పుడు  ఆయన శ్రీరామకృష్ణుల వద్దకు తరచుగా పోతూ ఉండటం చూచి ఆయన తల్లి 'ఈ పిల్లవాడు కూడా సన్యాసి అయిపోతాడేమో?' అని భయపడేది. ఆ భయమే నిజమైంది. ఈ విధంగా కొన్ని పోకడలు కొన్ని వంశాలలో కొన్ని కుటుంబాలలో ఉంటాయి. అదే విధంగా నిర్మలానంద స్వామి గారి కుటుంబంలో కూడా తల్లివైపునుంచి ఈ పోకడలున్నాయి.

స్వామి మేనమామగారైన నిత్యగోపాల్ (జ్ఞానానంద అవధూత) గారి వివరాలను ఇక్కడ చూడవచ్చు.


నిర్మలానందస్వామి జాతకంలో సూర్యుడు దారాకారకుడయ్యాడు. ఆయన ఆరవ ఇంటిలో ఉండటం, అది సహజరాశిచక్రంలో నవమస్థానం కావడం, ద్వాదశాధిపతి అయిన  బుధుడు సూర్యునితో కలసి ఉండటం వల్ల ఈ జాతకునికి వివాహజీవితం లేదని తెలుస్తున్నది. చంద్రలగ్నం నుంచి ఇదే దారాకారకుడైన సూర్యుడు అష్టమంలో ఉండటం కూడా ఈ ఫలితాన్ని బలపరుస్తున్నది. ఆరూఢలగ్నమైన మీనం నుంచి సప్తమంలో శని కూర్చుని ఉండటం వివాహభావాన్ని ధ్వంసం చేసింది. పైగా, నేనెన్నో పాత పోస్టులలో వ్రాసినట్లుగా, పౌర్ణమి నాడుగాని,  సమీపంలోగాని పుట్టినవారి వివాహజీవితం విఫలం అవుతుంది. లేదా పరిష్కరించలేని సమస్యలు దానిలో తప్పకుండా ఉంటాయి.  ఈ కొండగుర్తును ఎన్నో  జాతకాలలో నేను గమనించాను.

స్వామి శుక్ల చతుర్దశి నాడు జన్మించారు. మర్నాడే పౌర్ణమి. అంటే ఆయన జననం పౌర్ణమి ఛాయలోనే జరిగింది. మరి ఆయన పెళ్లి చేసుకోకపోవడంతో వింత ఏమున్నది? ఒకవేళ చేసుకునిగనక ఉన్నట్లయితే దానికి సంబంధించిన బాధలు విపరీతంగా పడి ఉండేవాడు. 

ద్వాదశభావం నుంచి తల్లిగారి పూర్వీకుల దర్శనం అవుతుంది. ఇది మిథునం అవుతున్నది. నవమాధిపతి అయిన శని చతుర్దంలో ఉంటూ, తల్లిగారి పూర్వీకులు లోతైన ఆధ్యాత్మిక చింతనాపరులని తెలియజేస్తున్నాడు. సప్తమాధిపతి అయిన గురువు మంత్రస్థానంలో మంత్రస్థానాధిపతి అయిన శుక్రునితో కలసి ఉంటూ, ఆధ్యాత్మిక సాధనాపరులైన వీరు వివాహానికి దూరమౌతారన్న సత్యాన్ని రుజువుచేస్తున్నాడు. కనుక తల్లిగారి నుంచి ఈయనకు లోతైన ఆధ్యాత్మిక చింతనాపరమైన జీన్స్ సంక్రమించాయి.

జననకాలదశను నా విధానంలో విశ్లేషణ చేద్దాం. జనకాలదశ : చంద్ర - రవి - బుధదశ  అయింది.

చంద్రుడు లగ్నాధిపతిగా ద్వితీయపూర్వకర్మస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. పూర్వ ఆధ్యాత్మికకర్మకు కారకుడైన నీచకేతువుతో కలసి ఉన్నాడు. శుక్రుని కేంద్రస్థితివల్ల కేతువుకు నీచభంగమైంది. కనుక, ఈ జన్మలో చేసే తపస్సువల్ల పూర్వజన్మలలోని చెడుకర్మ పక్వానికివచ్చి హరించుకు పోతుంది. జీవితచరమాంకంలో దీని శేషం వల్ల మానసికవేదన ఉంటుంది. సూర్యుడు కుటుంబస్థానాధిపతిగా కర్మ - ఋణ క్షేత్రంలో ఉన్నాడు. ఇది సహజరాశిచక్రంలో  ఆధ్యాత్మిక జీవితానికి సూచికగా నవమస్థానమైన ధనుస్సయింది. వీరి కుటుంబంలో ఉన్న లోకపరమైన ఆధ్యాత్మికరుణం దీనివల్ల సూచితమౌతున్నది. లోకులకు వీరు ఎంతో చెయ్యవలసి ఉంటుంది. ఈయన కూడా సంసారజీవితాన్ని త్యజించి, సాధువుగా మారి, ఎంతోమందికి ఎంతో మార్గదర్శనం, సహాయం, సేవలను చెయ్యవలసి ఉంటుంది. బుధుడు తృతీయాధిపతిగా పూర్వజన్మల కర్మలకు సూచకుడు.  అవి ఈ జన్మలో ఆ స్థానంలో ఉన్న శనిద్వారా పక్వానికి వస్తూ, సామాన్యజనానికి ఈయన ఎంతో సేవ చెయ్యవలసి ఉన్నదని సూచిస్తున్నది.

శని నవమస్థానాన్ని చూస్తూ, సన్యాసజీవనం, కర్మయోగం, సేవామార్గాల ద్వారా ఈయన జీవనగమనం సాగుతుందని చెబుతున్నాడు. ఈ స్థానం సహజరాశిచక్రంలో కర్మ ఋణ స్థానమైన కన్య కావడం గమనార్హం. దీనివల్ల - ఎంతో మంది బ్రహ్మచారులకు సన్యాసులకు ఈయన గురుస్థానాన్ని అధిరోహిస్తాడన్న సత్యం  సూచింపబడుతున్నది.  స్వామికి దాదాపుగా వెయ్యిమంది శిష్యగణం ఉన్నది. కర్ణాటక, కేరళలలో దాదాపుగా 20 మఠాలను ఈయన స్థాపించారు. ఎన్నివేలమంది స్వామి మార్గదర్శనంలో ఆధ్యాత్మికజీవితాలను గడిపి ధన్యులైనారో లెక్కేలేదు.

ఈ విధంగా స్వామి జాతకం ఒక మహత్తర యోగిపుంగవుని జాతకంగా కనిపిస్తున్నది.

( ఇంకా ఉంది )
read more " స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -2 (జాతక విశ్లేషణ) "

28, ఏప్రిల్ 2021, బుధవారం

స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు

ఏప్రియల్ 26 - చరిత్ర విస్మరించిన ఒక మహనీయుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిన రోజు. ఒక నిజమైన వేదాంతి, యోగి, నవీనఋషి మరణించిన రోజు. దానిని మరణం అనకూడదేమో? నాకు తెలియదు. నిర్వాణం, మహాసమాధి మొదలైన మాటలను నేను ఇష్టపడను. మరణం మరణమే. అందుకే మామూలు మాటైనా సరే, మరణం అనే పదాన్నే నేను వాడటానికి ఇష్టపడతాను. ఏప్రియల్ 26 అలాంటి మహత్తరమైన రోజు.  ఇంతకీ ఎవరా మహనీయుడు. చరిత్ర ఆయన్ను ఎందుకు మరచిపోయింది?

ఆయనే - రామకృషుని ప్రత్యక్షశిష్యుడైన నిర్మలానందస్వామి. సన్యాసం తీసుకోడానికి ముందు ఈయన పేరు తులసీచరణ్ దత్తా. కలకత్తాలో ఒక క్షత్రియకుటుంబంలో 1863 లో జన్మించాడు. తన 75 వ ఏట కేరళలోని ఒట్టపాలెంలో 1938 లో చనిపోయాడు.

దక్షిణ భారతదేశంలో శ్రీ రామకృష్ణుని దివ్యబోధనలను ప్రచారం చేసినవారిలో స్వామి నిర్మలానంద అతి ముఖ్యుడు. దక్షిణభారతాన్ని శ్రీ రామకృష్ణుని శిష్యులైన వివేకానంద, బ్రహ్మానంద, రామకృష్ణానంద, నిర్మలానందస్వాములు దర్శించారు. వీరిలో రామకృష్ణానందగారు చెన్నై రామకృష్ణమఠాన్ని స్థాపించారు. కేరళకు నిర్మలానందస్వామిని పంపించారు. నిర్మలానందస్వామి పవిత్రపాదస్పర్శతో కర్ణాటకలోని బెంగుళూరులో, కేరళలోని దాదాపు 20 చోట్ల రామకృష్ణ ఆశ్రమాలు వెలిశాయి. వందలాది కుటుంబాలు ధన్యత్వాన్ని పొందాయి. నిర్మలానందస్వామి చాలా మహనీయుడు. ఉత్తమోత్తముడు. కారణజన్ముడు. దక్షిణభారతంలో శ్రీరామకృష్ణుని దివ్యబోధలు నిలదొక్కుకున్నాయంటే ఆయనే కారణం. అలాంటి మహనీయుడు చివరకు రామకృష్ణమఠం వారిచేత వెలివేయబడి, బహిష్కరింపబడి, తన 75  వ ఏట కేరళలోని ఒట్టపాలెం ఆశ్రమంలో కన్నుమూశాడు. ఇదంతా 1930 లలో జరిగింది. ఈ విషయాన్ని రామకృష్ణమఠం వారు కప్పిపెట్టి, చరిత్రను వక్రీకరించి, నిర్మలానందస్వామి రామకృష్ణుని ప్రత్యక్షశిష్యుడే కాదని నేడు ప్రచారం చేస్తున్నారు. నేటి తరపు శ్రీ రామకృష్ణ భక్తులకు ఈ విషయాలేవీ తెలియవు. కనుక వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈ సీరీస్ వ్రాస్తున్నాను.

1911 లో కేరళలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఆ రోజులలో కులవ్యవస్థ చాలా బలంగా ఉండేది. సహపంక్తి భోజనాలంటే ఊహించలేని సంఘటనలు. ఒకరిని ఒకరు తాకడానికి కూడా సంకోచించే ఆ రోజులలో, వేరే కులంవారితో కూర్చొని కలసి భోజనాలు చెయ్యడం ఊహకు కూడా అందని పని. కానీ రామకృష్ణుని బోధనలు వేరు. ఆయన కులమతాలను లెక్కించలేదు.  హృదయశుద్ధికే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఆయన మొదటి తరం శిష్యులూ భక్తులూ కూడా అలాంటివారే. వారిలో బ్రాహ్మణులు, క్షత్రియులు ఎక్కువమంది. కానీ వారందరూ సమాజోద్ధరణకు ఎంతో కృషి చేశారు. కులవ్యవస్థను తొలగించడానికి ఎంతో పాటుపడ్డారు. ఈ సంవత్సరంలో నిర్మలానందస్వామి కేరళలో అడుగు మోపారు. కేరళలో హరిపాద్ అనే ఊరిలో ఉన్న శ్రీరామకృష్ణ భక్తులు, చెన్నైలో ఉంటూ రామకృష్ణుని బోధనలను ప్రచారం చేస్తున్న రామకృష్ణానందస్వామిని కేరళకు  ఆహ్వానించారు. కానీ, ఆయన, తన సహచరుడైన నిర్మలానందస్వామిని అక్కడకు పంపించారు. అదే ఆ గొప్ప సంఘటన !  

నిర్మలానందస్వామి బోధనల ప్రభావంతో 1913 లో కేరళలో మొట్టమొదటి రామకృష్ణాశ్రమం మొదలైంది. ఆ ఆశ్రమంలో కులమతాలు లేవు. ఎవరైనా ఆలయంలో పూజ చేయవచ్చు. అందరూ కలసి భోజనం చెయ్యాలి. కలసిమెలసి ఉండాలి. కానీ సమాజం ఈ మార్పులను తట్టుకోడానికి సిద్ధంగా లేదు. ఆశ్రమానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారు స్థానికులు. వాటినన్నటినీ తట్టుకుని  నిలబడ్డారు నిర్మలానందస్వామి, ఆయన అనుచరులు. రామకృష్ణుని బోధనలకోసం, ఆయన చూపిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు పెట్టారు.

మరుసటి సంవత్సరం 1914 లో ఆశ్రమం మొదటి వార్షికోత్సవం జరిగింది. కులమతాల ప్రసక్తి లేకుండా అందరూ కలసి భోజనాలు చేశారు. చేతులు కడుక్కున్నారు. విస్తళ్ళు ఎత్తాలి. ఎవరూ ముందుకురావడం లేదు. అందరూ నిలబడి చూస్తున్నారు. కనీసం పనివాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. ఒక సస్పెన్స్ నెలకొన్నది. నిర్మలానందస్వామి ఈ పరిస్థితిని గమనించారు. ఆయనిలా అన్నారు.

'మీరందరూ భగవంతుడైన రామకృష్ణుని భక్తులు. నేనాయనకు సేవకుడిని. కనుక మీకూ నేను సేవకుడినే. నాకు కులం లేదు. మీకుందేమో? ఉంటే, మీ కులాన్ని మీరు కాపాడుకోండి, అలాగే చూస్తూ నిలబడి ఉండండి' - ఇలా అంటూ ఆ ఎంగిలి విస్తర్లను ఆయనే ఎత్తడం మొదలుపెట్టారు. ఆయనే ఎత్తుతుంటే ఎవరూరుకుంటారు? కుల కట్టుబాట్లన్నీ ఒక్కదెబ్బతో కూలిపోయాయి.  అందరూ పొలోమంటూ  విస్తర్లను ఎత్తడం మొదలుపెట్టారు. ఎవరు తిన్న విస్తరిని ఎవరు ఎత్తారో, ఎవరు ఆ చోటిని శుభ్రంచేశారో, ఎవరి కులం ఏమిటో ఎవరికీ గుర్తులేదు.  అందరం భగవంతుని పిల్లలమే అన్న భావం అందరి హృదయాలలో నిలిచిపోయింది. 

1914 లో జరిగిన ఈ మహత్తరమైన సంఘటనతో సాంప్రదాయరాష్ట్రమైన కేరళలో నవీనభావాలకు, ఆచరణాత్మకమైన వేదాంతభావాలకు పునాదులు పడ్డాయి. అవి ఈనాటికీ కొనసాగుతున్నాయి.

కానీ ఇంతటి మహనీయుడైన నిర్మలానందస్వామి తర్వాత్తర్వాత రామకృష్ణమఠం వారిచేత వెన్నుపోటు పొడవబడ్డాడు. లోకాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన, అమెరికాలోకూడా మూడేళ్లుండి, న్యూయార్క్ లో వేదాంతప్రచారం చేసివచ్చిన ఆయన చివరకు తన తరువాతితరం రామకృష్ణమఠపు సన్యాసుల చేతిలో హింసింపబడి, మానసికవేదనకు గురై,  కేరళలోని ఒట్టపాలెంలో తాను స్థాపించిన ఆశ్రమంలో 26-4-1938 న  చనిపోయాడు. ఆయన సమాధి అక్కడున్న శ్రీరామకృష్ణ నిరంజన ఆశ్రమంలో ఉన్నది. త్వరలో ఈ ఆశ్రమాన్ని  నేను సందర్శించబోతున్నాను. 

ఎందుకిలా జరిగింది? వచ్చే పోస్టులలో తెలుసుకుందాం.

(ఇంకా ఉంది) 

read more " స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు "

బహుశా పోయాడేమో !

నాల్రోజులనాడు ఒక మెయిలొచ్చింది. ఆయన చాలాకాలం నుంచీ, అంటే పదేళ్లనుంచీ నాకు తెలిసినాయనే. ఒక రకంగా చెప్పాలంటే నాకు మిత్రశత్రువన్నమాట. అదేంటి ఆ పదం వాడారని మళ్ళీ తుమ్మకండి. చెప్తా వినండి.

నేను ఏ పోస్టు రాసినా, దానికి ఒక యాంటీ మెసేజి నాకు పంపిస్తూ ఉండేవాడు చాలాకాలంపాటు. చాలావరకూ ఆ మెసేజిలు ఎగతాళిగానే ఉండేవి. ఉదాహరణకు, ఒక మంచి ఆధ్యాత్మిక పోస్ట్ రాస్తే, దానిని ఎగతాళి చేస్తూ ఒక మెసేజి ఇచ్ఛేవాడు. మంచిగా ఒక విషయం మీద పోస్టు రాస్తే, దానికి యాంటీగా మెసేజి ఇచ్చేవాడు.

ఎక్కడో ఏదో వరద భీభత్సమో, ఇంకేదో ఆపదో వచ్చినపుడు నేను జ్యోతిష్య విశ్లేషణ వ్రాస్తే, దానికి ఎగతాళిగా 'ఆత్మకు చావులేదు. జననం ఉన్నపుడు మరణం ఉంటుంది. ఇది అనివార్యం, ధీరుడు శోకించరాదు' అంటూ భగవద్గీత శ్లోకాలు కోట్ చేసి ఒక స్మైలీ పంపేవాడు ఎగతాళిగా. ఇలా చాలాసార్లు చేశాడు.ప్రతి పోస్టుకీ చేసేవాడు. నేను చదివి నవ్వుకుని ఊరుకునేవాడిని. చివరాఖరికి తనకే విసుగొచ్చి మానుకున్నాడు. ఒంటిచేత్తో ఎన్నాళ్లని చప్పట్లు చరచగలడు పాపం ! తర్వాత్తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆయనొక చిన్నపాటి గురువుగా చెలామణీ అవుతున్నాడని. జ్యోతిష్యం వగైరాలు చెబుతూ డబ్బులు కూడా బానే సంపాదిస్తున్నాడని. సరే ఎవరి ఖర్మ వాడిదని వదిలేశాను.

ఆ సదరు మహనీయుడు మెయిలిచ్చాడు.

'గురువుగారికి నమస్కారం. ప్రస్తుతం కరోనా వచ్చింది. క్వారంటైన్ లో ఉన్నాను. నా జాతకంలో ఫలానాదశ నడుస్తోంది. నేను బ్రతికి బయటపడాలంటే ఏయే రెమెడీలు పాటించాలి? ఏమేం చెయ్యాలి? మీ మాటమీద నాకు చాలా నమ్మకం. గురి. మీరేది చెయ్యమంటే అది చేస్తాను. దయచేసి జవాబు ఇస్తారని ఆశిస్తున్నాను. జాతకం కోసం నా జనన వివరాలు జత చేశాను. గమనించగలరు'

నేనిలా జవాబిచ్చాను.

'నమస్తే. నేను మీకు గురువెప్పుడయ్యానో నాకు గుర్తు లేదు. మీరే ఒక గురువుగా ఉన్నారని విన్నాను. కనుక మీ సంబోధనను నేను ఒప్పుకోలేను. కరోనా చాలా మందికి వస్తోంది. మీకు కూడా వచ్చింది. ఇందులో వింతేమీ లేదు. జ్యోతిష్యశాస్త్రంలో పండిపోయిన మీకు, జాతకం ఆయుస్సును పొడిగించలేదని తెలియకపోవడం వింతగా ఉంది. రెమెడీలతో అలా జరిగే పనైతే పాతకాలపు జ్యోతిష్కులు, ఋషులు, మహారాజులు చావకుండా మన మధ్యనే ఇంకా తిరుగుతూ ఉండాలి. జ్యోతిష్యంలో ఉద్దండులైన వరాహమిహిరుడు వగైరాలు మన కళ్ళముందే ఉండాలి. కానీ అలా  జరగడం లేదు. నా ప్రతి పోస్టునీ పనిగట్టుకుని మరీ ఎగతాళి చేసే మీకు సడన్ గా నా మీద ఎప్పుడు గురి కుదిరిందో అర్ధం కావాలంటే ముందు నా జాతకం చూపించుకోడానికి నేను కేరళ వెళ్ళాలి. ప్రస్తుత పరిస్థితులలో ప్రయాణం చెయ్యడం అంత మంచిది కాదు గనుక, ఒకటిరెండు నెలలలో కేరళ వెళ్లే పనుంది గనుక, అప్పుడు చూపించుకోగలవాడను. నన్ను మీకు గుర్తుకు తెచ్చిన కరోనాకు  ధన్యవాదములు'.

ఆ మెయిల్ చదివి ఆయనకు ఎగశ్వాస మొదలైందని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.  బహుశా ఆక్సిజన్ లెవల్స్ కూడా తగ్గిపోయి ఉండవచ్చు. ఆ పరిస్థితిలో కూడా వెంటనే ఇలా మెయిలిచ్చాడు. 

'ఆపదలో ఉన్నవారితో పరాచికాలాడటం సంస్కారం అవుతుందా?'

నేనూ తక్కువ తినలేదు కదా ! ఇలా తిరుగు మెయిలిచ్చాను.

'అన్నీ బాగా ఉన్నపుడు మంచిమాటలను ఎగతాళి చెయ్యడం ఏమౌతుందో ముందు చెప్పండి. ఆపదలోనే అన్నీ గుర్తుకురావడం ఎలాంటి సంస్కారమో మీరే ఆలోచించుకోండి'. 

అప్పుడు అసలు బాధ బయపడింది.

'నా బాద్యతలు తీరలేదు. అన్నీ సగంలోనే ఉన్నాయి. ఇప్పుడు నాకేదైనా అయితే నావాళ్లు ఏమికావాలి? అందుకే మిమ్మల్ని రిక్వెస్టు చేస్తున్నాను. రెమెడీలు చెప్పండి'.

ఆయన గతంలో నాకు పంపించిన ఎగతాళి మెయిల్సన్నీ నా మెయిల్ బాక్సులోనే ఇంకా పడిఉన్నాయి. వాటిని కాపీ చేసి ఆయనకు పంపిస్తూ ఇలా చెప్పాను.

'భగవద్గీతనుంచీ, పురాణాలనుంచీ పుంఖానుపుంఖాలుగా శ్లోకాలను కోట్ చేస్తూ మీరు గతంలో నాకు చేసిన హితబోధలు ఇవిగో. అవి ఇతరులకు చెప్పడానికా? లేక మీరు ఆచరించడానికా? అవసరానికి పనికిరాని ఆధ్యాత్మికత ఎందుకు? 'ఆత్మకు చావు లేదు' అని మీరు నాకు చాలాసార్లు చెప్పారు. మరి ఇప్పుడు మీరెందుకు చావుకు భయపడుతున్నారు? మీరిప్పుడు పోతే ఏమౌతుంది? ఆత్మకు చావులేదుకదా? మళ్ళీ ఇంకోచోట పుడతారు. దానికేమైంది? ఇంత సింపుల్ విషయానికి అంత బాదెందుకు? అందుకని హాయిగా చచ్చిపోండి. లేకపోతే మీరు నాకు గతంలో ఉపదేశించిన భగవద్గీత శ్లోకాలన్నీ అబద్దాలౌతాయి మరి ! నాకే జ్యోతిష్యమూ రాదు. నాకే రెమెడీలూ తెలీవు. నన్నడక్కండి'

ఆ తరువాత ఆయన్నుంచి నాకు మెయిల్ రాలేదు.

బహుశా పోయాడేమో !

read more " బహుశా పోయాడేమో ! "

25, ఏప్రిల్ 2021, ఆదివారం

సెల్ఫీ శీను

నిన్న పొద్దున్నే ఫోన్ మ్రోగుతోంది.

ఎవరా అని చూశా. 

మా ఫ్రెండ్ శీనుగాడు. ఎప్పుడో గాని ఫోన్ చెయ్యడు. కానీ సెల్ఫి ఫోటోలు మాత్రం తెగ పంపిస్తూ ఉంటాడు.

ఫోన్ చేతులో లేకుండా తనని మేమెప్పుడూ చూడలేదు. అంతేగాక ప్రతిదాన్నీ ఫోటో తీసి తన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవాళ్లందరికీ పంపడం వాడికొక సరదా. తత్ఫలితంగా వాడి జీవితం ఒక ఓపెన్ బుక్ అయిపొయింది. అలాంటివాడు ఏంటా ఫోన్ చేశాడనుకుంటూ హలొ అన్నా.

'ఒరేయ్ ! అయిపోయింది.. ఐసీయూలో ఉన్నా, ఆక్సిజన్ పెడుతున్నారు. బహుశా ఇదే ఆఖరి ఫోన్ కావచ్చు' అన్నాడు నీరసంగా.

'అదేంట్రా ! ఎప్పుడు చేరావ్?' అడిగా.

'కరోనా వచ్చి వారమైంది. ఐసీయూలో నిన్న చేరా. ఇప్పుడే ఆక్సిజన్ పెట్టారు. సెల్ఫీ పంపా చూసుకో' అంటూ కట్ చేశాడు.

ఫోటో చూశా.

నర్సులు వాడికి ఆక్సిజన్ పెడుతుండగా ఒక సెల్ఫీ తీసుకుని దాన్ని పోస్ట్ చేశాడు - 'ఆక్సిజన్ పెట్టించుకుంటున్న నేను' అంటూ.

'ఓరి నీ సృజనాత్మకతో !' అనుకున్నా.

ఏంటో ఈ లోకం. అస్సలు ప్రయివసీ లేకుండా పోయింది. ప్రతిదీ ఫోటోలు తీసుకోవడం, చూసుకోమంటూ నెట్లో పెట్టడం. ఏంటో ఈ గోల ! మొన్నొకరెవరో చెప్పారు. 'మా ఫస్ట్ నైట్' అంటూ ఎవడో వీడియో పెట్టాట్ట. హతవిధీ అనుకున్నా ఈ న్యూస్ విన్నపుడు.

ఆలోచిస్తూ బెడ్ మీద వెనక్కు వాలా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. ఒకటే కలలు. కలల్లో కూడా మెసేజిలు, ఫోటోలు శీనుగాడినుంచి తెంపులేకుండా  వస్తూనే ఉన్నాయి. అన్నీ సెల్ఫీలే.

'యమదూతలతో నేను'

చెరోపక్కనా ఇద్దరు యమదూతలు, మధ్యలో ఫ్రెండ్ గాడు నిలబడి సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశాడు. 

'వైతరణిలో ప్రయాణిస్తూ నేను'

ఏదో నదిలో స్టీమర్లాంటి పడవలో పోతున్నాడు. యమదూతలు పక్కనే ఉన్నారు. ఇంకో యమదూత డ్రైవ్ చేస్తున్నాడు.  వీడేమో ఇకిలిస్తూ సెల్ఫీకి పోజిచ్చాడు.

'యమధర్మరాజుతో నా మొదటి సెల్ఫీ'

సీరియస్ గా చూస్తున్న యముడు. ఇకిలిస్తున్న వీడు.

'శనగపిండిలో మునుగుతూ' అంటూ ఇంకో సెల్ఫీ.

ఈ సెల్ఫీ చాలా కళాత్మకంగా ఉంది. అక్కడి శిక్షలేమో అవి. వీడిని బజ్జీలాగా శనగపిండిలో ముంచుతున్నారు.  వీడేమో పక్కకి చూస్తూ సెల్ఫీ.

'నూనెలో వేగుతూ నేను\' ఇంకో సెల్ఫీ. ఇది కూడా చాలా బాగా వచ్చింది.

'దోరగా వేయిస్తూ కోరగా చూస్తున్న కింకరబావతో నేను' ఈ సెల్ఫీ చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్రెండ్ గాడు, కింకరుడు ఇద్దరూ భలే పోజిచ్చారు. నూనెలో వేగుతున్న బాధకంటే, సెల్ఫీకి ఫోజిచ్చే ఆత్రమే వీడి ముఖంలో ప్రస్పుటంగా కనిపిస్తోంది.

చివరగా వచ్చిన సెల్ఫీ మాత్రం నాకు సూపర్ గా నచ్చేసింది.

'యమదూతగా మొదటి షిఫ్ట్ లో నేను' అంటూ యూనిఫామ్ వేసుకుని ఒక సెల్ఫీ పంపాడు.  ఓహో ప్రొమోషన్ వచ్చి యమదూతయ్యాడన్న మాట ! వెరీ గుడ్ ! సెల్ఫీ బాగుంది.

'ఏమండోయ్ లేవండి లేవండి. మీ ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు' అంటూ శ్రీమతి నిద్ర లేపుతోంది. ఓహో ఇవన్నీ కలలా అనుకుంటూ లేచి ఫోనెత్తా,. మళ్ళీ వీడే.

'ఏరా ! ఇప్పుడే డ్యూటీలో జాయినయ్యా ! సెల్ఫీలు బాగున్నాయా ! కొత్త జాబు, కొత్త లోకం భలే బాగుందిలే' అంటూ వాడే కాల్ చేస్తున్నాడు.

'ఎక్కణ్ణించిరా ?' భయంతో నా స్వరం నాకే పీలగా వినిపించింది.

'ఇంకెక్కణ్ణించి? యమలోకంనుంచిరా. ఇప్పటిదాకా నీకు కలల్లో పంపించిన సెల్ఫీలన్నీ అక్కణ్ణించే. బాగున్నాయా? నవ్వుతూ అడిగాడు వాడు.

'ఓరి నీ సెల్ఫీ పిచ్చి పాడుగాను. దారంతా సెల్ఫీలు తీసుకుంటూనే పోయావన్నమాట. సర్లే ఫస్ట్ ఎసైన్మెంట్ ఏ ఊర్లో ఇచ్చారు?' అడిగా.

'యమధర్మరాజుగారిని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లోనే ఫస్ట్ డ్యూటీ వేయించుకున్నా. ఎంతైనా మనూరుకదా! అభిమానం అలా ఉంటుంది మరి. దార్లో ఉన్నా! వస్తున్నా' అన్నాడు వికటంగా నవ్వుతూ.

'బాబోయ్ ! వస్తే వచ్చావుగాని చూసిపోదామని ఇటువైపు మాత్రం రాకు' అన్నా.

'అలాగే. అంత టైం కూడా లేదులే. ఒక్క హైదరాబాద్ లోనే బోలెడన్ని హాస్పిటల్స్ తిరగాలి. చాలామంది మాలోకానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ డ్యూటీలోనే రాజుగారు బోల్డు వర్కిచ్చారు. కానీ సెల్ఫీలు మాత్రం పంపిస్తూనే ఉంటా! ఓకేనా? బై మరి !' అన్నాడు.

'ఓరి నీ సెల్ఫీ పిచ్చి పాడుగాను అలాగే కానీయ్' అంటూ ఫోన్ కట్ చేశా.

read more " సెల్ఫీ శీను "

21, ఏప్రిల్ 2021, బుధవారం

కాళిక నవ్వుతోంది

ఉన్నట్టుండి దబదబా

లోకమంతా పాటిస్తున్న మడిని చూచి

కాళిక నవ్వుతోంది

ఉన్నట్టుండి గజగజా

వణికిపోతున్న మానవజాతిని చూచి

కాళిక నవ్వుతోంది


మూతీ ముక్కూ గుడ్డతో మూసుకోడాలూ

చేతులూ కాళ్ళూ కడుక్కోవడాలూ

దూరంగా ఉండు తాకొద్దు అనడాలూ

అంటరానితనాన్ని మళ్ళీ పాటించడాలూ

మా ఇంటికి రావద్దని తలుపులేసుకోడాలూ

బంధుత్వాలన్నీ మటుమాయం కావడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


కుయ్యో కుయ్యో మంటూ అంబులెన్స్ లు 

కుక్కపిల్లల్లా తిరుగుతూనే ఉండడాలూ

బెడ్లన్నీ హౌస్ ఫుల్ అని

ఆస్పత్రులు బోర్డులు పెట్టడాలూ

పీల్చడానికి గాలికూడా లేదు ఆక్సిజన్ నిల్లంటూ

గాలి సైతం స్తంభించిపోవడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


అప్పటిదాకా వాటేసుకున్నవాళ్ళే

బాబోయ్ అంటూ దూరం పరిగెట్టడాలూ

నా అన్నవాళ్ళందరూ ఇంట్లో ఉన్నా

అనాథలా ఆస్పత్రిలో చావుకెదురు చూడటాలూ

కన్నవాళ్ళని కూడా కంటిచూపు లేకుండా

కాటికి సాగనంపడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


అడ్డగోలుగా సంపాదించినవాళ్లు

అడ్డంగా ఆస్పత్రుల్లో పడి మూలగడాలూ

డబ్బులెక్కువై అడ్డంగా బలిసిన వాళ్లు 

లక్షకింకో లక్ష పారేసి పేదోళ్ల బెడ్లు కొనుక్కోవడాలూ

పేదోడి అంబులెన్స్ తలుపు కూడా తియ్యకుండా

పేషంటును వెనక్కి సాగనంపడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


మహారాష్ట్ర నుంచి శ్రీమంతులొచ్చి

హైదరాబాద్లో ఆస్పత్రి బెడ్లు ఆక్రమించడాలూ

ఇక్కడి వాళ్లకి దిక్కూ దివాణం లేక

అంబులెన్స్ లోనే అసువులు బాయడాలూ

రోజూ ఎన్నో చావులను ఎదురుగా చూస్తున్నా

డాక్టర్లు డబ్బులకోసం అంగలార్చడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


డబ్బొక్కటి చాలు ఇంకేమీ అక్కర్లేదన్నవాళ్ళే

మమ్మల్ని కాపాడమంటూ ఏడవడాలూ

ఎంతైనా ఇస్తాం మీ కాళ్ళు మొక్కుతాం

మమ్మల్ని బ్రతికించమని మొత్తుకోడాలూ

బెడ్లకోసం ఆస్పత్రులలో నడుస్తున్న

డబ్బుల వేలంపాటలూ దందాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


నిన్నటిదాకా సర్వస్వమనుకున్నవి

ఈ రోజున విలువలేకుండా పోయాయి

విర్రవీగే మనుషుల జీవితాలన్నీ

ఒక్కసారిగా తారుమారై పోయాయి

డాబూ దర్పం అందం అహం

డబ్బూ మదం పదవీ పందేరం

అన్నీ ఒక్కసారిగా  ఆవిరైపోవడం చూసి

కాళిక విరగబడి నవ్వుతోంది


దేనిని చూచైతే మనిషి విర్రవీగుతూ

అహంకారాన్ని పెంచుకుంటున్నాడో

అదే ఒక్క క్షణంలో లేకుండా పోవడమూ

పోతున్న వాళ్ళని చూసి కూడా

ఉన్నవాళ్ళకి ఏమాత్రమూ బుద్ధిరాక

మేమిక్కడే ఉంటామని అనుకోవడమూ చూసి

కాళిక విరగబడి నవ్వుతోంది


మానవసంబంధాలన్నీ ఆవిరైపోవడాలూ

మానవత్వం మంటగలిసి పోవడాలూ

కళ్లెదుట చావు కరాళ నృత్యం చేస్తున్నా

కరెన్సీయే ముఖ్యమై పోవడాలూ

పక్కవాడిని తోసేసి క్యూలు దాటేసి

సిఫార్స్ తో వాక్సిన్ పొడిపించుకున్నా

కరోనా తప్పకపోవడాలూ చూస్తూ

కాళిక విరగబడి నవ్వుతోంది


కాలం నడుస్తూనే ఉంది

కాళిక నవ్వుతూనే ఉంది

read more " కాళిక నవ్వుతోంది "

20, ఏప్రిల్ 2021, మంగళవారం

చనిపోయాక ఆత్మకేమౌతుంది?

ఉదయాన్నే రవి ఫోన్ చేశాడు. ప్రస్తుతం నడుస్తున్నది కరోనా టైమ్స్ కాబట్టి, అవే మాటలు నడిచాయి.

తనకు తెలిసినవాళ్లలో ఎంతమందికి కరోనా పాజిటివ్ వచ్చిందీ, వాళ్లలో ఎంతమంది పోయిందీ, ఎంతమంది బయటపడిందీ, హైదరాబాద్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదీ, మిగిలిన చోట్లకూడా ఎలా ఉన్నదీ, ఎంతమందికి పాజిటివ్ వస్తున్నా ఆఫీసులు మాత్రం యధావిధిగా ఎలా నడుస్తున్నదీ, ఉద్యోగులు ఎంత రిస్కుతో పనిచేస్తున్నదీ  అన్నీ మాట్లాడుకున్నాక చివరికిలా అడిగాడు.

'ఇదంతా సరేగాని ఒకటి చెప్పు, మనిషి పోయాక ఏమౌతుందంటావ్?'

నవ్వొచ్చింది. 

'ఏంటి ఉన్నట్టుండి ఈ ప్రశ్న అడుగుతున్నావ్? ప్రపంచంలో టాపిక్స్ ఇంకేం లేనట్టు?' అన్నాను.

'చుట్టూ అవే చూస్తున్నాం, అవే వింటున్నాం, అందుకే ఈ ఆలోచన వచ్చింది' అన్నాడు.

'ఏమీ కాదు. తగలేస్తారు లేదా పాతేస్తారు' అన్నా నవ్వుతూ.

'అంతేనా ఇంకేం చెయ్యరా?' అడిగాడు తనూ చులాగ్గా.

'చెయ్యచ్చు, పార్సీలైతే టవర్ ఆఫ్ సైలెన్స్ లో వదిలేస్తారు. కొందరు జలసమాధికూడా చేస్తారు. ఎవరి పద్ధతి వాళ్ళది' అన్నా.

'సర్లే ఏదో ఒకటి. నేనడిగింది అదికాదని నీకూ తెలుసు. జోకులాపి సమాధానం చెప్పు' అన్నాడు.

'ఏమో నాకేం తెలుసు? నేను చూడలేదు నీకు చెప్పటానికి' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'అదే నీ దగ్గర. నీకు తెలీకుండా ఎలా ఉంటుంద? చెప్పు' అన్నాడు.

 నవ్వి ఊరుకున్నా. 

'నిన్న టీవీలో విన్నాను. ఒక ప్రవచకుడు చాలా చక్కగా వివరించాడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో?' అన్నాడు.

'అవునా? ఏం జరుగుతుందిట?' అడిగాను.

'జీవుడు సూక్ష్మశరీరంతో స్వర్గం నరకం ఎలా సందర్శిస్తాడు? పుణ్యపాపాలు ఎలా అనుభవిస్తాడు? అవన్నీ భలే వివరించాడు' అన్నాడు.

'అవునా? చూసొచ్చి చెప్పాడా? చూడకుండా చెబుతున్నాడా?' అడిగాను.

'మళ్ళీ నీ జోకులు ! చూశాక తిరిగి ఎవడొస్తాడు?' అన్నాడు తానే.

'మరి చూడకుండా ఎలా చెబుతున్నాడు? స్వానుభవం కాదా? ఇతరుల అనుభవాలను తనవిగా చెబుతున్నాడా?' అడిగాను.

'పురాణాల్లో ఉందిట. ఋషులు చూసి రాశారట' అన్నాడు అమాయకంగా.

'ఏ ఋషి చూసి తిరిగొచ్చి రాశాడో కొంచం ఆయన అడ్రసు చెప్పమనకపోయావా? వెళ్లి కనుక్కునేవాళ్ళం కదా ?' అన్నాను.

'అదే మరి నీతో ! పురాణాలు రాసిన ఋషులు' అన్నాడు.

'అలాగా ! మరి ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా రాశారేంటి ఋషులు?' అన్నాను.

'అదేమో నాకు తెలీదు. అన్నింట్లో ఒకే రకంగా లేదా?' అడిగాడు.

'ఉందని ఆ ప్రవచక విదూషకుడు చెప్పాడా?' అడిగాను.

'అనే అంటున్నాడు' అన్నాడు.

'మరి మన పురాణాలొక్కటేనా? ఎన్నో దేశాలు, ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు. వాళ్ళ పుస్తకాలలో ఎక్కడికక్కడ వేరువేరుగా రాసుంది. అదేంటి మరి?' అన్నాను.

'అబ్బా నీతో ఇదే గోల ! ఏదీ చెప్పవు. తెగనివ్వవు. అయితే ఏంటంటావు?' అన్నాడు.

'అదికాదు. చూసినవాళ్లు ఒకే విధంగా వ్రాయాలి కదా? వేర్వేరుగా ఎందుకు రాశారో మరి?' అడిగా.

'అదీ నువ్వే చెప్పు' అన్నాడు.

'అక్కడ ఉన్న విషయం ఒకటే అయితే, ఎంతమంది చూసినా ఒకటే కనిపించాలి. లేదా చూసినవాళ్లు రకరకాలుగా చూసి ఉండాలి. అప్పుడే తేడాలొస్తాయి' అన్నాను.

'లాజిక్ ప్రకారమైతే అక్కడి విషయం ఒకటే ఉండాలి. అయితే చూసినవాళ్లు రకరకాలుగా చూశారన్నమాట' అన్నాడు.

'ఊ ! అంతే అయుండొచ్చు' అన్నా.

'మరి ఈ అన్ని పురాణాలలో పుస్తకాలలో అసలు సత్యమేంటో?' అడిగాడు.

'చూస్తేనేగాని చెప్పలేం. చూసినా చెప్పలేమేమో? అలా చెప్పినవాళ్లు ఎవరూ లేరుగా మరి!' అన్నా నవ్వుతూ.

'మరెలా?' అన్నాడు.

'కరోనాతో పోయినవాళ్ళైతే అందరూ కూడబలుక్కుని 'కరోనా గ్రూప్' అని గూగుల్ గ్రూప్ పెట్టుకోవచ్చు అక్కడ' అన్నా నవ్వుతూ.

'చంపకుండా విషయం చెప్పు' అడిగాడు.

'ఏం లేదు. సింపుల్. దానికేం పురాణాలు చదవక్కర్లేదు. నువ్వు రాత్రిపూట ఏం చేస్తావ్ రోజూ?' అడిగా.

'ఏముంది? నిద్రపోతా?' అన్నాడు.

'తర్వాత?' అడిగా.

'కలలు కంటా' అన్నాడు.

'తర్వాత' అడిగా మళ్ళీ.

'ఏముంది? పొద్దున్నే మేలుకుంటా' అన్నాడు.

'ఇదీ అంతే. నిద్రపోతుంది, కలలు కంటుంది, మళ్ళీ మేల్కొంటుంది. ఆత్మగా కొన్నాళ్ళు ఏవేవో లోకాలలో ఉంటుంది. తర్వాత మళ్ళీ జన్మెత్తుతుంది. నిద్రంటే చావు. కలలంటే స్వర్గనరకాలు. మెలకువ మళ్ళీ జన్మ. కానీ ఇదంతా తెలుసుకుని ఉపయోగం లేదు. టీవీలో, యూట్యూబులో ఇవన్నీ అంత భలేగా చెప్పిన ప్రవచకుడిది ఉత్త పుస్తకజ్ఞానమేగాని అనుభవజ్ఞానం కాదు. ఈ విషయాలు అలా తెలిసేవి కావు. ఆయా లోకాలను చూడగలిగే శక్తి నీకు ఉండాలి. అక్కడికి పోయి తిరిగి రాగలిగే శక్తి, భౌతికంగా కాదు మానసికంగా, నీకుండాలి. అప్పుడు నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వు చెప్పిన పురాణాలలో లేని అనేక క్రొత్త విషయాలు కూడా నువ్వు చూస్తావు, ఇంకా ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకుంటావు' అన్నాను.

'మీ ఛానల్లో నువ్వూ చెప్పొచ్చుగా అవన్నీ' అన్నాడు.

'అవి ఉబుసుపోక ముచ్చటించుకునే ముచ్చట్లు కావు. అనుభవంలో ప్రత్యక్షంగా చూచి గ్రహించవలసినవి. అలా చెప్పి ఉపయోగం లేదు' అన్నాను.

'అర్ధం కాలేదు' అన్నాడు.

'చెప్పేవాడికి తెలియవు. తెలిసినవాడు చెప్పడు' అన్నాను

'ఎందుకలా?' అడిగాడు కుతూహలంగా.

'అదంతే. అన్నీ బజార్లో పెట్టి చెప్పకూడదు. కావాలంటే నువ్వే అక్కడికెళ్లి చూసొచ్చి రాత్రికి ఆఫీసునుంచి ఇంటికొచ్చాక నాకు చెప్పు' అన్నా నవ్వుతూ.

'బాబోయ్ వద్దులే. నాకాఫీసులో చాలా పనుంది. కరోనా పాజిటివ్ వచ్చి అసలే పదిమంది స్టాఫ్ క్వారంటైన్ అయ్యారు. బోలెడంత వర్క్ పెండింగ్లో ఉంది. చేసుకుంటా. ఉంటా' అన్నాడు.

'సరే చేసుకో' అని నవ్వుతూ ఫోన్ కట్ చేశా.

read more " చనిపోయాక ఆత్మకేమౌతుంది? "

19, ఏప్రిల్ 2021, సోమవారం

భూమి బల్లపరుపుగా ఉందా? బల్లమీదుందా?

నా చిన్నప్పుడు సైన్స్ ల్యాబ్ లో సైన్స్ మేష్టారు నన్నొక  ప్రశ్న అడిగారు.

'భూమెక్కడుందిరా?'

అప్పట్లో టీవీలూ లేవు. బొడ్డూడకముందే మొబైల్ కొని చేతికివ్వడమూ లేదు. ఇప్పటి పిల్లలకున్నంత అతితెలివితేటలు కూడా అప్పట్లో మనకు లేవు.

అటూ ఇటూ చూశాను. ఎదురుగా ఆయన టేబుల్ మీదే గ్లోబుంది. అమాయకంగా లా చెప్పాను.

'మీ బల్లమీదుందండి'.

వీపుమీద ఒక్క చరుపు చరిచాడాయన.

'బల్లమీదుందా? బల్లపరుపుగా ఉందా? నీ తెలివితేటలూ నువ్వూనూ?' అంటూ భూమి ఒక బంతిలా శూన్యంలో తేలుతుందని వివరించాడాయన. క్లాసు పిల్లలమందరం నోరెళ్ళబెట్టి విన్నాం.

ఇదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే, మొన్నొకాయన ఇచ్చిన అజ్ఞాత మెయిల్ కారణం.

'మీ బ్లాగు చదివాను. బాగుంది. అనేక విషయాలలో మీకున్న జ్ఞానం అమోఘం. కానీ చంద్రయానం  గురించి మీరు రాసినది నిరాధారం. అబద్దం. మీరన్నట్లు భూమి గోళాకారంలో లేదు. బల్లపరుపుగా ఉంది. నేనీ విషయం మీద గత ఇరవై ఏళ్లుగా ఎన్నో పుస్తకాలు చదివాను. కావాలంటే ఎవడో ఇంగిలీషు గాడు రాసిన ఈ పుస్తకాలు చదవండి. మీకూ జ్ఞానోదయం అవుతుంది. మీరూ మా సొసైటీలో చేరండి. అసలు మన పురాణాలలోని లోకాలన్నీ కరెక్ట్. వాటిల్లో ఎక్కడా భూమి గోళాకారంలో ఉందని రాయలేదు. పురాణాలు రాసిన వాళ్లకి తెలివిలేదా? ఆలోచించండి. సైన్స్ భ్రమలో పడి మోసపోకండి. మా గ్రూప్ తో కలవండి'. అనేది ఆ మెయిల్ సారాంశం.

యధావిధిగా నవ్వొచ్చింది. జాలేసింది. పిచ్చి బాగా ముదిరిన బాపతని అర్ధమైంది. 'అయ్యో పాపం' అని అనుకుని వదిలేశాను.

వారం తర్వాత మళ్ళీ ఇంకో మెయిలొచ్చింది.

'నేనిచ్చిన పాత మెయిల్ చూశారా? చూస్తే, మీ అభిప్రాయమేంటి? మాతో కలుస్తారా? లేదా? మీకిష్టమైతే ఇలా చెయ్యండి. అలా చెయ్యండి' అంటూ మళ్ళీ పాత సొల్లే.

మార్కెటింగ్ బాగా స్ట్రాంగ్ గా ఉందనిపించి, వెంటనే ఆ మెయిల్ని బ్లాక్ చేశేశాను. అంతటితో ఆ పీడా వదిలింది.

ఇలాంటి అమాయకులు, పిచ్చివాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. విదేశాలలో కూడా భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. సొసైటీలే ఉన్నాయి. ఇది ఇప్పటి పిచ్చి కాదు.

అసలూ, తిన్నదరక్కపోతే, పనీపాటా లేకపోతే ఇలాంటి ధోరణులు పుడతాయి. భూమి బల్లపరుపుగా ఉంటె నీకేంటి? గోళాకారంగా ఉంటె నీకేంటి? నీ కడుపులో చల్ల కదలకుండా సోమరిపోతులా కూచొని ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్పవచ్చు.. ఉపయోగమేంటి?

నువ్వు పుట్టినందుకు రెండే ప్రయోజనాలు. ఒకటి - నువ్వైనా ఎదగాలి. రెండు - నీవల్ల నీవాళ్ళైనా ఎదగాలి. రెండూ లేనప్పుడు నీ జన్మ నిరర్ధకం. ఇది మరచిపోయి, 'భూమి బల్లలాగా ఉంది, లోపలంతా డొల్లగా ఉంది, పైన తెల్లగా ఉంది, కింద చల్లగా ఉంది' అంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతుంటే నువ్వు భూమికి భారమని అర్ధం. నీ పుటకే వేస్టని అర్ధం.

వివేకానందస్వామి ఇలా అనేవారు.

'నువ్వు పుట్టినందుకు ఏదైనా ఒక గొప్పపనిని చెయ్యి. నువ్వు పోయిన తర్వాత కూడా వందలాది ఏళ్లపాటు మానవజాతి నిన్ను గుర్తుంచుకోవాలి. అలాంటి గొప్పపనులు, మంచిపనులు నువ్వు చెయ్యాలి. లేకపోతే నీ జన్మకు విలువలేదు. వానాకాలంలో పుట్టే ఉసిళ్లకూ నీకూ భేదమేముంది?'.

ఎంతసేపూ తినడం, ఎంజాయ్ చెయ్యడం ఇలాంటి నిరర్ధకజీవితాలు గడపడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. మానవజన్మకు పరమప్రయోజనం ఆత్మసాక్షాత్కారం దైవసాక్షాత్కారం పొందటం. పోనీ,  వాటిని అందరూ అందుకోలేరు. కనీసం నీవల్ల నలుగురికి ఉపయోగం కలగాలి. నువ్వు పోయాక కనీసం కొందరైనా నిన్ను తలచుకొని కన్నీరు పెట్టేవిధంగా నువ్వు బ్రతకాలి. లేకపోతే నీ జన్మ వృధా. 

మనుషులలోని అజ్ఞానం ఎన్ని విధాలో? ఓరి దేవుడా ! ఎలాంటి మనుషులని సృష్టించి, వాళ్ళని బ్రతికిస్తూ, వాళ్ళ పిచ్చి వేషాలు ఎన్ని రకాలుగా భరిస్తున్నావురా? నీ ఓపికకి నా జోహార్లు సుమా !

read more " భూమి బల్లపరుపుగా ఉందా? బల్లమీదుందా? "

కరోనా రెండవ రాకడ - 2021 - గ్రహాలేమంటున్నాయి?

'యేసు త్వరగా వచ్చుఁచున్నాడు సిద్ధపడుడీ --  పడుడీ' అని క్రైస్తవసోదరులు రెండువేల ఏళ్ళనుంచీ మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ ఆయన రావడం లేదు. బహుశా మనల్ని, మనలాంటి మనుషుల్నీ చూసి భయపడి ఉంటాడు. లేదా పాతగాయాలు ఇంకా మాని ఉండవు. మానాక చూద్దాంలే అని జర్నీ పోస్ట్ ఫోన్ చేసుకుని స్వర్గంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి ఉండవచ్చు.  లేదా, ఈ మధ్యలోనే ఇంకో వేషంలో వచ్చి  వెళ్ళిపోయినా మనం గుర్తించలేకపోయి ఉండవచ్చు. ఇదెలా సాధ్యమంటూ  ఎక్కువగా హాచ్చర్యపోకండి. తుమ్ము రాగలదు !

'నేనే భగవంతుడి అవతారాన్ని' అని రామకృష్ణుడన్నాడు. ఓపెన్ గా అనకపోయినా తన ఇన్నర్ సర్కిల్ భక్తులతో అన్నాడు. ' ఇంతకుముందు జీసస్ గా, చైతన్య మహాప్రభువుగా వచ్చింది తనేనని ఆయనన్నాడని మహేంద్రనాధ్ గుప్తాగారు వ్రాశారు. ఆ మాట తనతోనే అన్నాడని కూడా ఆయన వ్రాశారు. ఇంకో నూరేళ్ళ తర్వాత మళ్ళీ తానొస్తానని అప్పుడు చాలామంది ముక్తిని పొందుతారని, అటు తర్వాత మాత్రం మానవజాతి చాలాకాలం ఆగవలసి ఉంటుందని కూడా ఆయనన్నాడు. కానీ ఆయన మాటల్ని ఎవ్వరూ నమ్మలేదు. ఏదో పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని ఎక్కువమంది అనుకున్నారు.

అప్పటికే పాత అవతారాలైన శ్రీరాముడు శ్రీకృష్ణుల భక్తులున్నారు. వాళ్ళెవరూ ఆయన్ను నమ్మలేదు. 'అప్పుడు నేనేరా వచ్చింది, ఇప్పుడు ఇలా వచ్చాను' అని ఆయన అన్నా కూడా ఎవరూ నమ్మలేదు. విసుగొచ్చి ఆయనెళ్లిపోయాడు.

దాదాపుగా నూరేళ్ళ తర్వాత మెహర్ బాబా వచ్చారు.  'నేనే భగవంతుడి అవతారాన్ని' అంటూ ఓపెన్ గా డిక్లెర్ చేసింది ఈ కాలంలో  ఆయనొక్కడే. కానీ అందరూ నమ్మలేదు. విచిత్రమేమంటే రాముడి భక్తులూ నమ్మలేదు, కృష్ణుడి భక్తులూ నమ్మలేదు. యధావిధిగా రామకృష్ణుని భక్తులూ నమ్మలేదు. ఆయనేమో ' మీరెంత ఎదురుచూసినా, ఇంకో 700 ఏళ్లదాకా ఎవడూ రాడు. ఆ తర్వాత మళ్ళీ నేనే ఇంకో వేషంలో వస్తాను. అప్పటిదాకా ఇలాగే చస్తూ బ్రతుకుతూ ఉండండి' అని చెప్పి చక్కాపోయాడు.

ఈలోపల సందట్లో సడేమియా అన్నట్లు, కొందరు దొంగబాబాలూ, గడ్డంస్వాములూ 'మేమే దేవుడి అవతారాలం' అంటూ ప్రచారాలు చేయించుకుని డబ్బులు పోగేసుకున్నారు. పిచ్చి గొర్రెలు వాళ్ళచుట్టూ చేరి భజనలు చేసి మోసపోయారు. వాళ్ళ టైం అయిపోగానే వాళ్ళెళ్ళి పోయారు. భజన బృందాలకు దిక్కు దివాణం లేకుండా పోయింది.

జీసస్ భక్తులైతే వీళ్ళలో ఎవరినీ నమ్మలేదు. వాళ్ళు ఆయనకోసమే మొండిగా ఎదురుచూస్తున్నారు. డొక్కలో బల్లెం పోట్లతో సహా, ఆయన ఒర్జినల్ వేషంలో ఆయనొస్తే తప్ప, వాళ్ళు ఎవరినీ నమ్మరు. అంటే ఏంటి? దేవుడైనా సరే, మన ఇష్టమైన వేషంలో, డ్రస్సులో రావాలి. అంతేగాని ఆయనిష్టమొచ్చినట్లు కనిపిస్తే మనం నమ్మం. మళ్ళీ అందరూ భక్తులే. దేవుడికి కనీసం డ్రస్సుమార్చుకునే చాన్సు కూడా వీళ్లివ్వరు. భలే ఉంది కదూ !

ఇదంతా చూస్తుంటే నాకొక పాతసామెత గుర్తొస్తోంది. 'అందరూ వైష్ణవులే బుట్టలో చేపలు మాత్రం మాయం !' అనేదే ఆ సామెత. సర్లే, ఈ ఆధ్యాత్మిక సోది ఎప్పుడూ ఉండేదేగాని కాసేపు దాన్నొదిలేసి ప్రస్తుతంలోకి వద్దాం. 

యేసుకోసం ఆకాశంలోకి చూస్తుంటే ఈలోపల పక్కనుంచి కరోనా మళ్ళీ వచ్చి గూబ గుయ్ మనిపించింది.

'నువ్వింకా పోలేదా? వాక్సినన్నారు అదన్నారు ఇదన్నారు. ఇంకా ఉన్నావేంటి?' అంటే 'అబ్బా ఎంతాశో మీకు? ఎక్కడికిరా పోయేది? మిమ్మల్ని తీసుకుపోకుండా నేనెక్కడికి పోతాను?' అంటోంది. అసలేంటి దీనిగోల?

జ్యోతిష్కులేమో డిసెంబరులో పోతుంది, మార్చిలో పోతుంది, మేలో పోతుంది అని రోజుకొక్క నెల పేరు చెబుతున్నారు. ఆదిమాత్రం ఎక్కడికీ పోవడం లేదు. రోజురోజుకీ ఇంకా ఇంకా  ఎక్కువౌతోంది. మళ్ళీ లాక్ డౌన్లు మొదలౌతున్నాయి.

మహారాష్ట్ర ఏరియాలో అకోలా టౌన్లో నా కంట్రోల్లో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ మొన్న ఆదివారంనాడు చనిపోయాడు. శనివారం ఆయన భార్య చనిపోయింది. ఆదివారం ఈయన పోయాడు. రెండే రెండురోజుల్లో ఇద్దరూ పోయారు. గుంటూరులో నాతో  కలసి పనిచేసిన ఒక మెకానికల్ ఇంజనీర్ నిన్న చనిపోయాడు. మా శిష్యురాలి మేనత్త భర్త నాల్రోజులనాడు కరోనాతో హైదరాబాద్లో చనిపోయాడు. ఈ విధంగా ప్రతిరోజూ మళ్ళీ చావువార్తలు వింటున్నాం. ఇక్కడ హైదరాబాద్ లో మా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ లో పదిమందిదాకా గత మూడ్రోజుల్లో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అందరూ హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. అందరికీ మళ్ళీ గుండెల్లో దడ మొదలైంది. బట్టలు తడుస్తున్నాయి.

ఏంటి ఇలా జరుగుతోంది? ఇదెంటో కొంచం చూడొచ్చుకదా అని కర్ణపిశాచాలు చెవిలో జోరీగల్లా పోరుపెడుతూ అడుగుతున్నాయి. సరే చూద్దాం !

గురువు ఏడాదినుంచీ నీచస్థితిలో ఉన్నాడు. అది పోయాక గురువు కుంభంలోకి వచ్చాక కరోనా పోతుంది అని కొందరు జ్యోతిష్కులు గతంలో అన్నారు. గురువు కుంభంలోకి మారాక కరోనా మళ్ళీ విజృంభించింది, రెండవ రాకడ వచ్చింది. ఇదేంటి గోల? అసలీ జ్యోతిష్కుల లెక్కలు ఎప్పుడు కరెక్ట్ అవుతాయో ఏంటో? ఒక్కసారి కూడా కరెక్ట్ గా చెప్పి చావరు. సరే వినండి !

గురువునీ శనినీ చూసుకుంటూ అసలైన రాహువుని మర్చిపోయారు అందరూ. గ్రహాలన్నింటి లోకీ అతిబలమైన గ్రహం రాహువు. విషవ్యాధులకు కారకుడూ సూచకుడూ ఆయనే.  ఆయన్ని మరచిపోయి ఏవేవో లెక్కలేస్తున్నారు ఘనతవహించిన జ్యోతిషక విదూషకులు. అందుకే ఆ లెక్కలు డొక్కలౌతున్నాయి.

గ్రహస్థితిని కొంచం గమనిద్దాం.

ప్రస్తుతం కుంభరాశిలో వేగంగా ముందుకెళుతున్న గురువుగారు జూన్ 20 న మళ్ళీ వక్రీకరించి వెనక్కు మళ్లుతారు. ఆ విధంగా వెనక్కు ప్రయాణించి సెప్టెంబర్ 14 న మకరంలోకి వస్తారు. అంటే జూన్ 20 నుంచి సెప్టెంబర్ 13 వరకూ ఆయనకు వక్రస్థితి. అక్కడనుంచీ ఋజుగతిలోకి వచ్చిన ఆయన నవంబర్ 19 న మళ్ళీ కుంభంలోకి ప్రవేశిస్తారు. 

ఈ గ్రహస్థితులు ఫలితంగా - జూన్ వరకూ కరోనా విజృంభణ ఇలాగే కొనసాగుతుంది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుంది. సెప్టెంబర్ నుంచీ ట్రెండ్ రివర్స్ అయ్యి నవంబర్లో మళ్ళీ పెరుగుతుంది. ఇదేమీ ఒక నెలా రెండు నెలలలో పోయే మహమ్మారి కాదు.

మరెప్పుడు దీనినుండి మనకు విముక్తి? రాహువు గోచారంలో జవాబు దాగుంది. రాహువు మేక్రో పిక్చర్లో శని గురువుల గోచారాన్ని మైక్రో లెవల్లో అర్ధం చేసుకుంటే కరెక్టుగా విషయం అర్ధమౌతుందిరా పిచ్చి జ్యోతిష్కుల్లారా !

ఏప్రిల్ 13 - 2022 న రాహువు వృషభాన్ని విడచి మేషంలోకి ప్రవేశించేవరకూ కరోనా బెడద మనకు తప్పదు. అంటే ఇంకా ఏడాదిపాటు కరోనా విశ్వరూపాన్ని మనం చూస్తూనే ఉంటాం  -  ఈలోపల  మనం పోకుండా బ్రతికుంటే !

మరి దీనికేమీ రెమెడీలు లేవా? అంటే ఎందుకు లేవూ తప్పకుండా ఉన్నాయ్.

'చేసిన పాపములకు పశ్చాత్తాపపడుడి, మళ్ళీ వాటిని చేయకుండా ఉండుడి, మారుమనస్సు పొందుడి, ప్రార్ధించుడి, మీ ఖర్మను మీరు అనుభవించుడి. టైం వస్తే పోవుడి'

ఇది తప్ప ఎవరికీ వేరే మార్గం ఏదీ లేదు ! రెమెడీ  కూడా లేదు !

చేసే వెధవపనులన్నీ చేసేసి, ఫలితాలు మాత్రం అంటకుండా తప్పించుకుందామని ఎంత దురాశో ఈ మనుషులకి !

read more " కరోనా రెండవ రాకడ - 2021 - గ్రహాలేమంటున్నాయి? "

17, ఏప్రిల్ 2021, శనివారం

Indianapolis Fedex shooting - Astro analysis

15-4-2021 రాత్రి పదకొండు గంటల సమయంలో అమెరికాలోని ఇండియానా స్టేట్ లో, ఇండియానాపోలిస్ సిటీలో ఒక 19 ఏళ్ల అబ్బాయి, ఫెడెక్స్ షాప్ దగ్గర కాల్పులు జరిపి ఎనిమిది మందిని చంపేశాడు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. గ్రహస్థితి ఏమంటున్నదో గమనిద్దాం.

ఆ సమయంలో అక్కడ వృశ్చికలగ్నం ఉదయిస్తున్నది. ఉచ్చ రాహువుతో ఉచ్చచంద్రుడు చాలా దగ్గరగా కలవగా రాహుకేతువుల ఇరుసు లగ్నాన్ని సూటిగా కొడుతున్నది.  రాహుచంద్రులకు ఒకవైపున ఉఛ్చసూర్యుడు మరొకవైపున హింసకు సూచకుడైన కుజుడు ఉంటూ అర్గళాన్నిస్తున్నారు. బుద్ధికారకుడైన బుధుడు నీచస్థితిలో ఉంటూ బుద్ధిలేని చర్యలను సూచిస్తున్నాడు. గ్రహాలన్నీ దాదాపుగా మాలికాయోగంలో ఉన్నాయి.

చంద్రుడు మనస్సుకు సూచకుడు. అతని ఉఛ్చస్థితి సామాన్యమానవులలో అయితే మానసిక సమతుల్యతను కోల్పోయేలా చేస్తుంది.  ఉఛ్చ రాహువుతో కలయిక దూకుడుతనాన్ని, ఆలోచనలేని చర్యలను సూచిస్తుంది. సూర్యుని ఉఛ్చస్థితి వల్ల అహంకారధోరణి విజృంభిస్తుంది. 'నేను చేస్తున్నది కరెక్టే' అన్న దూకుడు కలుగుతుంది. ఇవన్నీ కలుపుకుని చూడండి. ఏమి జరిగిందో అర్ధమౌతుంది.

ఇదొక్కటే కాదు. చాలామంది జాతకాలలో, ముఖ్యంగా నిన్నటి రోజున, అనుకోని సంఘటనలు చాలా జరిగి ఉంటాయి. దూకుడుగా ప్రవర్తించి ఉంటారు. కొంతమందికి దుర్ఘటనలు జరిగితే కొంతమందికి జరగకపోవచ్చు. అది వారి వారి జాతకాలను బట్టి ఉంటుంది.  కానీ, మనస్సు సమతుల్యత కోల్పోవడం, అతిగా ప్రవర్తించడం, ఆలోచనలేని పనులు చెయ్యడం, బుద్ధి దారితప్పడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.  మీ జీవితాన్ని గమనించుకోండి. మీకే అర్ధమౌతుంది. అప్పుడు నేను చెబుతున్నది నిజమే అని మీరూ ఒప్పుకుంటారు.

read more " Indianapolis Fedex shooting - Astro analysis "

6, ఏప్రిల్ 2021, మంగళవారం

గురువుగారి కుంభరాశి ప్రవేశం - ఫలితాలు

గురుగ్రహం ఈరోజున కుంభరాశిలో ప్రవేశించింది. ఏడాదిపాటు ఈ రాశిలో సంచరిస్తుంది. దీనివల్ల  మనుషుల జీవితాలలో అనేక మార్పులు జరుగుతాయి. మీ మీ జీవితాలలో ఉన్నట్టుండి జరిగే మార్పులను, ఇప్పటివరకూ జరగని  సంఘటనలను మీరు  ఇప్పుడు గమనించవచ్చు.. అవి గురుగోచార ఫలితాలే.

మేషరాశి

మిత్రలాభం కలుగుతుంది. కలిసొస్తుంది. సహాయం లభిస్తుంది. తోడబుట్టినవారికి మంచికాలం.

వృషభరాశి

పనివత్తిడి పెరుగుతుంది. దీర్ఘరోగాలు పట్టుకుంటాయి. జీర్ణశక్తి తగ్గుతుంది.

మిధునరాశి

దూరదేశాలకు వెళతారు. ప్రయాణాలు చేస్తారు. జీవితభాగస్వామికి కలిసొస్తుంది.

కర్కాటకరాశి

స్వల్పకాలిక, దీర్ఘకాలిక రోగాలు బాధిస్తాయి. నష్టాలు, కష్టాలు ఎక్కువౌతాయి.  సంతానానికి చిక్కులు. 

సింహరాశి

ఉద్యోగాలలో, వ్యాపారాలలో నష్టాలొస్తాయి. సంతానం దూరదేశాలకు వెళతారు. అక్కడ  ఇబ్బందులు పడతారు.

కన్యారాశి

గృహసౌఖ్యం కరువౌతుంది. తల్లికి గండం. చదువు కుంటుపడుతుంది. వాహనప్రమాదం ఉంది.

తులారాశి

సంతానంతో గొడవలు. వారికి ఉత్సాహం ఎక్కువౌతుంది. దానినుంచి కష్టాలుంటాయి. చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

వృశ్చికరాశి

గృహసౌఖ్యం బాగుంటుంది. చదువులో రాణిస్తారు. వాహనయోగం ఉంటుంది. ధనలాభం కలుగుతుంది.

ధనూరాశి

ధైర్యం పెరుగుతుంది. అదే సమయంలో ఇబ్బందులూ పెరుగుతాయి. తల్లికి కష్టకాలం. చదువు సంధ్యలు కుంటుపడతాయి.

మకరరాశి

కంటి, పంటి రోగాలు బాధిస్తాయి. ధననష్టం. సోదరులకు కష్టకాలం.

కుంభరాశి

లాభం కలుగుతుంది. మిత్రులు, బంధువులు సహాయపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనరాశి

ఉద్యోగంలో రహస్య కార్యక్రమాలు జరుగుతాయి. చెడ్డపేరు వస్తుంది. ఆస్పత్రిని, క్లినికల్ లాబ్ లను దర్శిస్తారు. ప్రయాణాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కలుగుతుంది.

రాశులనూ లగ్నాలనూ కలిపి చూచుకుంటే ఫలితాలు ఎక్కువగా సరిపోతాయి. ఆయా జాతకాలలోని దశలను, శనిగోచారాన్ని కూడా కలుపుకుని చూచుకోవాలి.

నీతిగా, శుద్ధంగా బ్రతకడం ద్వారా, దైవప్రార్ధన, నిజాయితీ, నిస్వార్థసేవల ద్వారా సమస్యలను దాటవచ్చు.. దొంగపూజలు, హోమాలు, తంతులవల్ల ఏమీ ఉపయోగం ఉండదు. 

ప్రయత్నించండి.

read more " గురువుగారి కుంభరాశి ప్రవేశం - ఫలితాలు "

4, ఏప్రిల్ 2021, ఆదివారం

రాతియుగం మనుషులు

రాతి విగ్రహాలను పూజిస్తూ

రాతి గుండెలై పోయేవాళ్ళు కొందరు

రాళ్ళను పూజించవద్దంటూ 

వాళ్ళను రాళ్ళతో కొట్టేవాళ్ళు కొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


ఎదురుగా ఉన్నదాని కోసం

ఎక్కడెక్కడో వెదుకుతూ కొందరు

ఎదురుగా వచ్చి నిలబడినా

ఎవరెస్ట్ ను చూడలేరు మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


కాగితాన్ని పూజిస్తారు కొందరు

కాపట్యాన్ని కళ్లకద్దుకుంటూ కొందరు

కనిపించే మనిషిని వదలి

కనిపించని దేవుడికోసం మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు

 

దేవుడితో వ్యాపారం కొందరు

దేవుడిని చూపించి వ్యాపారం కొందరు

దేవుడికోసం దేవుళ్ళాడే వాడిని

దేబిరించేవారు మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


బ్రతకడం తెలీనివారు కొందరు

బ్రతుకుతూ బ్రతికించేవారు కొందరు

బ్రతకడం నేర్పేవాడిని

బడితెపూజ చేసేవాళ్ళు మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


ప్రేమించడం తెలీక కొందరు

ప్రేమ కోసం అల్లాడుతూ కొందరు

ప్రేమ తలుపు తడుతున్నా

తెరవడం తెలీక మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


ఈ కవిత చదివి

రాతియుగపు మనిషి ఇలా అన్నాడు

నా పేరెందుకు వాడుకుంటారు?

మిమ్మల్ని చూస్తే నాకు సిగ్గేస్తోంది

నేను రాతియుగం మనిషినే కావచ్చు

కానీ మీలా రాతిమనిషిని కాను...

read more " రాతియుగం మనుషులు "

1, ఏప్రిల్ 2021, గురువారం

ప్రశ్నలు - జవాబులు

వరదలా నాకొచ్ఛే పాఠకుల ప్రశ్నలు, వాటిలో కొన్నింటికి  నేనిచ్చిన జవాబులు ఈ పోస్టులో చదివి తరించండి ! మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకుని మరీ తరించండి !

1. గురువుగారు ! మా అమ్మకు 82 ఏళ్ళు. షుగరు, బీపీ, థైరాయిడ్ ఉన్నాయి. ఇప్పుడు గుండెజబ్బు కూడా వచ్చింది. మొన్ననే సీరియస్ అయితే ఐసీయూ లో చేర్చాము. సమస్యేంటంటే, మూన్నెళ్లక్రితం నేనూ మా ఆయనా కలిసి పారిస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. టికెట్లు, హోటళ్లు అన్నీ బుక్ అయిపోయాయి. సరిగ్గా ఇప్పుడే మా అమ్మ ఐసీయూలో చేరింది. ఏం చెయ్యాలో  తోచడం లేదు. నేను పదేళ్లనుంచీ మీ బ్లాగ్ చదువుతూ ఉంటాను. హైదరాబాద్  లోనే ఉంటున్నాము. కానీ మిమ్మల్ని కలవాలని ప్రయత్నం అయితే చెయ్యలేదు. మీరెలా చెయ్యమంటే అలా చేస్తాను. మీమాట మాకు వేదవాక్కు. మీరే మాకు దైవం. దయచేసి త్వరగా జవాబు చెప్పండి.

జవాబు: నాకింత మంచి భక్తురాలుందా? కర్ణపిశాచికూడా నీ సంగతి నాకు చెప్పలేదే? బహుశా అదికూడా నిన్ను చూసి భయపడి ఉంటుంది. అమ్మదేముందమ్మా? ఈ అమ్మ కాకపోతే ఇంకో అమ్మ వస్తుంది. పారిస్ పోతే మళ్ళీ రాదుకదా ! అందుకని పారిసే ముఖ్యం. వెంటనే ఫ్లయిటెక్కు. ఈ లోపల ఇక్కడేదన్నా అయితే ఎవరో ఒకరు చూసుకుంటార్లే నీకెందుకు? నీ ఎంజాయిమెంట్ నీకు ముఖ్యం కదా. వెళ్ళు. అప్పుడే కదా వచ్చే జన్మలో కుష్టురోగం ఉన్న కుక్కగా పుట్టే అదృష్టం పట్టేది? సరేగాని, నీకు పిల్లలున్నరామ్మా? ఉంటె, నీ పెద్ద వయసులో వాళ్ళు 'హు ఆర్ యు డర్టీ క్రీచర్ గెట్ లాస్ట్' అని తప్పకుండా అంటారు. నీ ప్రాడక్ట్ అంతకంటే మంచిగా ఎలా ఉంటుందిలే? అందుకని ఇప్పుడే ఏదో ఒక లగ్జరీ ఓల్డేజి హోంలో బెడ్ బుక్ చేసుకో. అప్పటికి ఖాళీలుండకపోవచ్చు.

2. గురువుగారు ! నేను చాలా ఏళ్ల నుంచీ డాక్టర్ వంతెన గారి ఫాలోయర్ని. ఆయన చెప్పినట్లే డైట్ తీసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాను. గత పదేళ్లనుంచీ నా బరువు 35 కేజీలే. అలా మెయింటెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ మధ్యన డాక్టర్ మహమ్మద్ బీన్ తుగ్లక్ గారి వీడియోలు చూస్తున్నాను. అందులో ఆయన  ఆకుల కషాయాలు త్రాగమని పోరుపెడుతున్నాడు. అన్నీ మానేసి గడ్డి తినమంటున్నాడు. ఇవి మొదలు పెట్టాక మరో అయిదు కేజీలు తగ్గి 30 కి వచ్చాను. ఇంకా బరువు తగ్గితే పోతావని మా ఫెమిలీ డాక్టర్ చెబుతున్నాడు. ఇప్పుడేం చెయ్యాలో నాకు తెలీడం లేదు. అర్జన్టుగా నేను బరువు పెరగాలి.  ఏం చెయ్యాలో చెప్పగలరు. 

జవాబు : పదేళ్లనుంచీ 35 కేజీలేనా? చాలా  బాగుంది నాయన ! అది చాలలేదా ఆకులు అలములు తింటానంటున్నావు? అవి తింటూ ఇలాగే కషాయాలు త్రాగితే త్వరలో బరువు 15 కేజీలకు దిగుతావు. అప్పుడు గాల్లో ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికైనా ఖర్చులేకుండా  వెళ్లిపోవచ్చు. కారూ స్కూటరూ ఏదీ అవసరం ఉండదు. ఇంకా కష్టపడి మరో పదికేజీలు తగ్గితే సింపుల్ గా 5 కేజీల బరువుకొస్తావు. అప్పుడైతే ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి సంకల్పమాత్రంతో వెళ్లిపోవచ్చు. కాకపోతే ఒకటి, నీకందరూ కనిపిస్తూ ఉంటారు. నువ్వుమాత్రం ఎవరికీ కనిపించవు. అంతే ! సరే ఇంత మోజు పడుతున్నావు కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను. విను. ఉదయం పూట వంతెనగారు చెప్పినట్లు చెయ్యి. సాయంత్రం తుగ్లక్ గారి సలహాలు పాటించు. రాత్రికి మాత్రం ఓషోగారిని తలచుకుని 'ఓపెన్ హెవెన్' బారుకెళ్ళు. అక్కడ అమృతమే కాకుండా అప్సరసలు కూడా ఉంటారు. ప్రపంచంలోని ఏ దరిద్రపు జంతువునైనా వండి వడ్డిస్తారు. అవన్నీ బాగా మెక్కు.  తెల్లవార్లూ అక్కడ గడిపి తెలతెలవారుతుండగా ఇంటికెళ్ళు. ఒక్క నెలరోజులు ఇలా చేశావంటే, నీ బరువు 100 కేజీలు సునాయాసంగా వస్తుంది. అందులో నీ పొట్ట ఒక్కటే 90 కేజీలుంటుంది. ఆ తర్వాత బారుకెళ్లే పని ఉండదు. ఎందుకంటే లేవలేవు. కదల్లేవు కదా. నీ ఇల్లే అప్పుడు బారైపోతుంది. అన్నీ నీ ఇంటికే వస్తుంటాయి. కాకపోతే బరువు అంతటితో ఆపు. లేకపోతే 200 అవుతావు. అప్పుడు ఓపెన్ గా హెవెన్ కెళ్తావు. జాగ్రత్త ! గుడ్ లక్.

3. ఇంకొకాయన సంబోధనా గింబోధనా ఏమీ లేకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చాడు.  బహుశా యమబిజీ పర్సన్ అయుంటాడు. పనీపాటా లేనోళ్ళం మనమేగదా ప్రపంచంలో. లేదా పరిచయం చేసుకోడానికి మొహమాటం అడ్డొచ్చి ఉంటుంది. ఎవడో స్వామీజీ అయ్యుంటాడు. ఆయనిచ్చిన మెయిల్ ఇలా ఉంది.

నా వయసు 45. 25 ఏళ్ళనుంచీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. నాకు మంత్రం, తంత్రం, జ్యోతిష్యం, యోగం, మట్టీ మశానం అన్నీ తెలుసు. నా గమ్యం రమణమహర్షి పొందిన జ్ఞానాన్ని పొందటం. కానీ అదే కనుచూపుమేరలో కన్పించడం లేదు. మా గురువేమో 'వస్తుంది వస్తుంది ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి' అని చెప్పీ చెప్పీ మొన్నీమధ్య తనే పోయాడు. నాకు ఆత్మసాక్షాత్కారం వస్తుందా రాదా? నా జాతకం చూసి క్విక్ గా చెప్పండి. అవతల చాలా పనులున్నాయి. 

జవాబు: మీ ప్రశ్నకు ఒక వాక్యంలో జవాబుచెప్పడం కష్టం. మీకు ఒకటికి మించి ఛాయిసెస్ ఇస్తాను. వినండి. 

ఒకటి - నువ్వు కూడా వెంటనే చచ్చిపోయి మీ గురువు దగ్గరకు వెళ్ళు. ఆయన్నే అడుగు 'నాకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వకుండా ఎక్కడికిరా పారిపోతున్నావ్' అని. ఉపదేశం వాడిదగ్గరా? ప్రశ్నలు నన్నా? తినేది మొగుడి తిండీ, పాడేది ఎవడిదో పాట అన్నట్లుంది నీ సంగతి.

రెండు -  నీకు పట్టిన మంత్రం, తంత్రం, జ్యోతిష్యం, యోగం, మట్టీ మశానం అవన్నీ వదిల్తేగాని రమణమహర్షి స్థితి రాదు. పోనీ ఒక ఉపాయం చెప్తా విను. ఆయన గోచీతో ఉండేవాడు. నువ్వు అది కూడా వదిలేసి డైరెక్టుగా రోడ్డెక్కు. అప్పుడు ఆయనకంటే త్వరగా ఆ స్థితిని పొందవచ్చు.

మూడు - ఇన్ని మాయవిద్యలు పెట్టుకుని ఇంతబిజీగా జనాన్ని మోసంచేస్తూ బ్రతికే నీకు రమణమహర్షి స్ధితెలా వస్తుందిరా పిచ్చిసన్నాసి? ఈ జన్మకే కాదు. ఇంకో లక్ష జన్మలెత్తినా నీకా స్థితి  అనుమానమే. అందుకని నీ మాయబ్రతుకులో నువ్వుండు. నన్ను మళ్ళీ కదిలించకు.

4. ఈలోపల ఇంకో మహామంత్రసాధకుడు ఇలా మెయిలిచ్చాడు.

నేను పుస్తకంలో చూసి 'ఊగ్ర భైరవి' మంత్రం జపిస్తున్నాను. ఆమె దర్శనం కావడం లేదు. ఎలా అవుతుంది ? చెప్పండి.

జవాబు: ఆమె పేరు ఊగ్రభైరవి, వయాగ్రా భైరవి కాదు నాయనా. ముందు ఆ దేవత పేరు సరిగ్గా పలకడం  నేర్చుకో. పేరే సరిగ్గా పలకలేనివాడివి మంత్రమేం జపిస్తావు? ఆమె దర్శనం కాకపోవడమే ఆమె అనుగ్రహం నీ మీదుందని నిదర్శనం. ఆమె కనిపిస్తే ఆ తర్వాత ఆమె ఒక్కతే ఉంటుంది. నువ్వుండవు. గుండాగి స్పాట్లో చస్తావు. ఆమె కాళికాదేవికి ఒకరూపం. అలాంటి మంత్రాలు పుస్తకాలలో, నెట్లో చూసి జపం చెయ్యకూడదు. వెంటనే ఆపు. తేడా వస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి. నువ్వు నా మాట వినవని, ఆపవని నాకు తెలుసు. నిజం చెప్పాలిగనుక చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం.

-----------------------------------

ఇలా ఉంటున్నాయి మహాజ్ఞానులైన పాఠకులిస్తున్న మెయిల్స్.

ఆమ్మో ! లోకం ఎంత ముందుకు పోతోంది?  జనం ఎంతెంత జ్ఞానులై  పోతున్నారు? మనం వెనుకబడిపోతున్నాం. అర్జన్టుగా నేనుకూడా ఓపెన్ హెవెన్ బారుకెళ్ళి వయాగ్రా రంభ మంత్రం జపించాలి. టైమౌతోంది. మళ్ళీ బారు మూసేస్తారు. వస్తా !

read more " ప్రశ్నలు - జవాబులు "