“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, డిసెంబర్ 2011, బుధవారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం-2

రజనీష్ జాతకంలో కొన్ని ముఖ్యఘట్టాలు మనకు తెలుసు. వీటి సాయంతో, ఆయా దశలనుబట్టి జన్మసమయాన్ని కొంత సరిచేద్దాం.

రజనీష్ తండ్రి (స్వామి దేవతీర్థభారతి)  8-9-1979 న మరణించారు. ఆయన జ్ఞానిగా మారి సమాధిస్తితిలో శరీరాన్ని వదిలిపెట్టాడని రజనీష్ చెప్పాడు. 5.09 అనేది జననసమయంగా మనం తీసుకుంటే ఆరోజున రజనీష్ కు శుక్ర/శని/గురు/రాహు/రాహుదశ జరిగింది. పితృస్థానమైన మకరం నుంచి శుక్రుడు యోగకారకుడు. రాహువు అష్టమాధిపతియగు గురువుకు సూచకుడు. నవమంనుంచి ఈఅష్టమం ద్వాదశం అవుతుంది. రాహువుదృష్టి గురువుమీద ఉంది. గురువు నవమాత్ సప్తమమారకంలో ఉచ్చస్తితిలో ఉన్నాడు. కనుక ఈదశ పితృమారకానికి సరిగ్గా సరిపోయింది. ఇక 5.10 అనేది జననసమయం అనుకుంటే, ఇదే దశ శుక్ర/శని/గురు/శుక్ర/రవి అవుతుంది. సూక్ష్మదశ ప్రాణదశలలో రాహువుస్థానంలో శుక్రరవులు ప్రత్యక్షమైనారు. ఆరోజున గోచారకుండలిని  పరిశీలిస్తే, మీనంలో చంద్రుడు 9 డిగ్రీలలో ఉండి జననకాలరాహువు ఉన్నటువంటి 8 డిగ్రీలకు చాలా దగ్గరలో ఉన్నాడు. కనుక ఈ సంఘటనకు రాహువుకు సంబంధం ఉంది. రాహువు నవమస్థానం నుండి ఆయుష్యస్థానం అయిన తృతీయంలో ఉండటం చూడవచ్చు. కనుక రాహు సూక్ష్మ, ప్రాణదశలను చూపిస్తున్న 5.09 మాత్రమే జననకాలసమయం కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోజున నవమాత్ అష్టమం అయిన సింహంలో ఆరుగ్రహాలు గుమిగూడి ఉండటం చూడవచ్చు. ఈ గ్రహకూటమినిబట్టి రజనీష్ తండ్రిగారు సమాధిస్తితిలో శరీరాన్ని ఒదిలిపెట్టటం నిజమే అని సూచన ఉంది.      

రజనీష్ 19-1-1990 న సాయంత్రం 5 గంటల సమయంలో పూనాలో మరణించాడు. ఆ సమయానికి జాతకంలో శుక్ర/శుక్ర/గురు/చంద్ర/రాహు దశలలో గురుదేహదశ జరిగింది. గోచారకేతువు జననకాల గురువుపైనా, గోచార శనిబుధులు జననకాల చంద్రబుధుల పైన సంచరించారు. శుక్రుడు లగ్నాధిపతి. గురువు ఉచ్ఛస్తితిలో ఉన్న అష్టమాదిపతి. ఇకపోతే చంద్రరాహువుల సూక్ష్మప్రాణదశలను బట్టి ఓషోరజనీష్ కు తీరనికోరికలు ఇంకా ఉన్నాయనీ, ఆయనకు పరిపూర్ణముక్తి లభించలేదనీ చెప్పక తప్పదు. ఓషోరజనీష్ చివరిరోజుల గురించి వచ్చిన పుస్తకం ఒకటుంది. దాని పేరు "Notes of a madman". అందులో ఒకచోట -- "ఓం" అనే అక్షరం రకరకాల రంగులలో వెలుగుతూ తన కళ్ళముందు దర్శనం ఇస్తూ ఉందని, ఆ రంగులలో ఎక్కువగా ముదురునీలం, వయొలెట్ రంగులు కనిపిస్తున్నాయనీ -- ఆయన అంటాడు. ఇలా ఎందుకు జరుగుతున్నదో అర్ధంకావడం లేదనీ, తాను కావాలని ఆ దర్శనాన్ని కోరుకోవడం లేదనీ, అయినా ఆ దర్శనం తనను వెంటాడుతున్నదనీ అంటాడు. ఓం అనేది శబ్దబ్రహ్మానికి, విశ్వచైతన్యానికీ (Universal Consciousness) సూచిక. కాని ఆస్థాయిలో ఉన్నవారికి కూడా తిరిగి పునర్జన్మ ఉంటుంది. దశలో అంతిమంగా రాహుస్పర్శ కూడా దీనినే సూచిస్తున్నది. పునర్జన్మ ఉంటుంది అనిఅన్నంత మాత్రాన రజనీష్ మామూలు మనుషులవంటి సామాన్యుడు అని మనం అనుకోకూడదు.


తనకు జ్ఞానోదయం కలిగిన సమయం 21 -3 -1953 రాత్రి అని, అప్పుడు తనకు 21 ఏళ్ళు అనీ రజనీష్ చెప్పాడు. అప్పుడు ఈయన జాతకంలో గురు/బుధ/బుధ/గురు/బుధ దశ జరుగుతున్నది. జననసమయం 5.09  అనుకుంటే శుక్ర దేహదశా, 5.10 అనుకుంటే చంద్రదేహదశా జరుగుతాయి. శుక్రుడు లగ్నాధిపతి, చంద్రుడు తృతీయాధిపతి  కనుక 5.09 వైపే సమయం మొగ్గు చూపుతున్నది. ఈ సమయంలో  దశానాధులైన గురు, బుధులవల్ల ఒకవిషయం స్పష్టం అవుతున్నది.గురువు అష్టమాదిపతి, బుధుడు పంచమాదిపతి. కనుక ఈయనకు ఆరోజున ఒక అతీత మార్మికఅనుభవం కలిగినమాట వాస్తవమే అని తెలుస్తున్నది. అయితే అది బౌద్ధికపరమైన అనుభవం మాత్రమే అని ఒకసూచన ఉంది. ఇది ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతఅనుభవం అయినప్పటికీ, పూర్ణసిద్ధికి సూచన మాత్రం కాదు. ఆ రోజున తనకు కలిగిన అనుభవం గురించి రజనీష్ చాలా వివరంగా వర్ణించాడు. ఆ అనుభవం తర్వాతకూడా చెయ్యవలసిన సాధన ఇంకా చాలా ఉంటుంది. చేరవలసిన గమ్యాలు చాలా ఉంటాయి. బహుశా అదే అంతిమఅనుభవం అని ఆయన అనుకోని ఉండవచ్చు. అలా అనుకోవడమే తర్వాత తర్వాత ఆయన చేసిన తప్పులకు కారణం అయి ఉండవచ్చు. 

గోచారరీత్యా ఆరోజున కుజశుక్రులు మేషం 8వ డిగ్రీలో ఉండి, జననకాల ధనూకుజునికి సరిగ్గా కోణస్థితిలో ఉన్నారు. గోచారగురువు మేషంలో 26 డిగ్రీలో ఉండి, జననకాల ధనూశనికి కోణస్తితిలోనూ, జననకాలగురువుకు కేంద్రస్తితిలోనూ ఉన్నాడు.   

ఇక్కడ దాగిఉన్న ఒక రహస్యాన్ని వివరిస్తాను. మార్చ్ 21 అనేది సాయనజ్యోతిషరీత్యా వసంతవిషువత్ అనబడుతుంది. ఖగోళశాస్త్రం ప్రకారం ఆరోజున భూమధ్యరేఖ క్రాంతికక్ష్యలు ఒకదానినొకటి ఖండించుకునే ఖగోళబిందువు మీదకు సూర్యుడు ప్రవేశిస్తాడు. అంటే సాయనమేషసంక్రమణం ఆరోజున జరుగుతుంది. మార్చ్ 21 సెప్టెంబర్ 23 లను equinoctial points అంటారు. అంటే ఆరోజులలో భూమ్మీద ఎక్కడచూచినా రాత్రీ పగలూ సమవ్యవధిలో ఉంటాయి. ఈ రెంటిలో మార్చ్ 21 అనేది వసంతవిషువత్ అనీ మేషసంపాతం అనీ   పిలువబడుతుంది. అంటే వసంతఋతువు ఆ రోజున మొదలౌతుంది. ఋతువులు సూర్యుని అనుసరించి ఏర్పడతాయి. రుతువులకూ మనిషిలోని హార్మోన్ స్రావాలకూ సంబంధం ఉంది. శరీరంలోని హార్మోన్ లెవెల్స్ బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. సూర్యగమనం ఆధారంగా లెక్కించే జ్యోతిష్య విధానాన్ని సాయనవిధానం అనీ సూర్యమానం అనీ అంటారు. దీనిని పాశ్చాత్యులు అనుసరిస్తారు. ఇటువంటి ప్రత్యేకమైన రోజునే రజనీష్ కు జ్ఞానోదయం కలిగింది. బుద్ధునికి పూర్ణిమ రోజున జ్ఞానోదయం కలిగింది. మహావీరునికి అమావాస్య రోజున జ్ఞానోదయం కలిగింది. రజనీష్ కు వసంత విషువత్ రోజున జ్ఞానోదయం కలిగింది. కనుక భూమ్మీద జరిగే సామూహిక సంఘటనల పరంగానే కాకుండా వ్యక్తిగత అంతరికవిషయం అయిన  సాధనాపరంగా కూడా ఈ ప్రత్యేకమైన రోజుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అంతేకాక ఆయా సాధకులకు కలిగే అనుభవాలు కూడా ఆయారోజులలో ఉండే ప్రత్యేకప్రభావాలకు అనుగుణంగానే ఉంటాయి. అందుకనే సంక్రాంతి రోజుల్లోనూ, విషువత్తులలోనూ , పౌర్ణమి అమావాస్యల లోనూ సాధన తీవ్రతరం చెయ్యాలని పెద్దలు అంటారు.  

పగలూ రాత్రీ ప్రపంచం మొత్తం సమమైన నిడివితో ఉండే రోజులలో భూమిమీద సమత్వస్తితి నెలకొని ఉంటుంది. "సమత్వం యోగ ఉచ్యతే"- అని యోగానికి నిర్వచనం ఉంది. కనుక ఆ రోజులలో యోగసాధకులకు సిద్ధికారక స్పందనలు ఎక్కువగా ఉంటాయి. రజనీష్ బోధలలో ముఖ్యమైనవి "ఎరుక" మరియు "సాక్షీభావ స్తితి". ఇవి సమత్వానికి పర్యాయపదాలు. సమత్వానికి సూచిక అయిన విషువత్ రోజున సమత్వానికి ప్రతీక అయిన యోగంలో సిద్ధికలగడం ఒక యోగరహస్యం. అంతేకాక ఆత్మజ్ఞానకారకుడైన సూర్యునికి ఈ రోజునించి ఉచ్ఛస్తితి మొదలౌతుంది. దీనికి ఇంకా లోతులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువగా వివరించను. ఒక్కటి మాత్రం చెప్తాను. చాలామంది నిరయనజ్యోతిష్కులు సాయనసిద్ధాంతాన్ని హేళన చేస్తుంటారు. ఈ హేళనాత్మకభావన పూర్తిగా తప్పు అని నేను నమ్ముతాను. సూర్యుడు లేకుండా జ్యోతిష్యం లేదు. కనుక సాయనవిధానాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే అదికూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సాయన విషువత్ రోజుననే రజనీష్ కు జ్ఞానోదయం కలగడం వెనుక సాయనవిధానం యొక్క ప్రాముఖ్యత దాగుంది.

రజనీష్ కు 7 వ ఏట చావు రాసిపెట్టి ఉందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. ఈయన పుట్టినపుడు వీరి తాతగారు ఆఊరిలోని ఒక ప్రసిద్ధజ్యోతిష్కుని సంప్రదించాడు. తీవ్రబాలారిష్టం ఉన్న జాతకమని ఆ జ్యోతిష్కుడు చెబుతూ, ఏడవఏట ఈబాలుడు మరణిస్తాడనీ ఒకవేళ అది తప్పిపోతే అప్పుడు ఇతని జాతకం వేస్తానని, అంతవరకూ ఈ జాతకం చూడననీ చెప్పాడు. ఇతని జాతకంలో ప్రతి ఏడేళ్ళకూ గండాలు ఉన్నాయని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే 14 , 21 కూడా మరణ సూచక వయస్సులేనని అతను అంటాడు.ఏడేళ్ళ వయస్సులో రజనీష్ చనిపోలేదు కాని, ఈయన్ని అమితంగా ప్రేమించిన తాతగారు(తల్లి తండ్రిగారు)  మరణించాడు. అదికూడా ఏడేళ్ళ పిల్లవాడైన రజనీష్ ఒడిలో తలపెట్టుకుని అయన చనిపోయాడు. రజనీష్ కూడా ఆయన్ని అమితంగా ప్రేమించాడు. అది రజనీష్ జీవితంలో అతిపెద్ద మొదటి షాక్. 

"ఆ వయసులో నాకు చావు రాలేదు. కాని నాలో ఒకభాగం చనిపోయింది. అది మా తాతగారితో వెళ్ళిపోయింది" అని తర్వాతికాలంలో రజనీష్ చెప్పాడు. తాతగారికి జబ్బుచేస్తే వైద్యంకోసం వాళ్ళున్న పల్లెనుంచి ముప్పైమైళ్ళ దూరంలోని  పట్నానికి ఎద్దుబండిలో వెళుతూ మార్గమధ్యంలో రజనీష్ ఒడిలో తలపెట్టుకుని తాతగారు నిస్సహాయంగా చనిపోయాడు. అది బాలరజనీష్ మనస్సును తీవ్రంగా కలచివేసింది. వేగంగాపోయే వాహనం లేకపోవడంవల్ల వైద్యసహాయం అందక తాతగారు చనిపోయారు అన్నబాధవల్లేనేమో తర్వాత జీవితంలో 93 రోల్స్ రాయస్ కార్లను ఆయన పోగుచేసాడు. ఇదే నిజమైతే ఆయనలో సంస్కారాలు నశించలేదని, మనోనాశం కలగలేదనీ అర్ధం అవుతున్నది. అలాంటప్పుడు ఆయన పొందిన సిద్ధి పరిపూర్ణసిద్ధి కాదు అనే చెప్పవలసి ఉంటుంది. 

కాని ఒక్కవిషయం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. సిద్ధపురుషులకు ఉండే సంస్కారాలకూ మామూలు మనుషులకు ఉండే సంస్కారాలకూ హస్తి మశకాంతరం  ఉంటుంది. మామూలు మనుషులకు క్షుద్రమైన సంస్కారాలుంటాయి. ఏదో సంపాదించాలని, దేన్నో అనుభవించాలన్న కోరికలుంటాయి. సిద్దులైన వారికి అలాటి కోరికలుండవు. చీకటిలో మగ్గుతున్న లోకులకు జ్ఞానజ్యోతిని చూపిద్దామన్న కోరిక వారిలో కొందరికుంటుంది. స్థూలదృష్టిలో దానిని కోరిక అనీ, సంస్కారం అనీ, అనలేం. కానీ అదికూడా ఒక సంస్కారమే. దానివల్ల కూడా పునర్జన్మ కలుగుతుంది.

అదలా ఉంచితే, ఏడోఏటికి ముందున్న పాతరజనీష్ ఒకరకంగా ఆరోజుతో చనిపోయాడు. జ్యోతిష్కుని జ్యోస్యం తాతగారి మరణంద్వారా నిజమైంది. అప్పుడు రజనీష్ జాతకంలో  అష్టోత్తరీదశాప్రకారం శని/శని/గురుదశ జరిగింది. ఈ సంఘటన జరిగిన తేదీ తెలియదు కనుక సూక్ష్మదశా ప్రాణదశలు లెక్కించలేము. శని గురువులిద్దరూ అష్టమభావంలో ఉండటంవల్ల, మాతామహుని సూచించే ద్వాదశభావం (చతుర్ధానికి నవమం) యొక్క అధిపతి కుజుడుకూడా వీరితో అష్టమంలో ఉండటంవల్ల బహుశా కుజసూక్ష్మదశ అయి ఉండవచ్చు. కుజసూక్ష్మదశ 10 -11 -1938  నుంచి 15 -11 -1938 వరకూ జరిగింది.  శని ఈజాతకానికి యోగకారకుడే కాని అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమాదిపతిగా తృతీయ ఆయుష్యస్థానంలో ఉచ్ఛస్తితిలో వక్రించి ఉన్నాడు. కనుక ఇది మారకదశ అయినప్పటికీ పూర్తిగా మారకదశ కాదు. కనుక ఈయనకు బాగా ఇష్టుడైన తాతగారి మరణం జరిగింది.

అయితే ఈ సంఘటన ఇతని లేతమనస్సు మీద బలమైన ముద్ర వేసింది. అంతేగాక -- "మరణం అంటే ఏమిటి? ఆ సమయంలో అసలేం జరుగుతుంది?" అన్న చింతన ఆ లేతమనస్సులో తీవ్రంగా మొదలైంది. ఈ చింతనాప్రభావం వల్లనే తన సాటివయస్కులతో కలిసి ఆడుకోవడం మొదలైనపనులు రజనీష్ ఆవయసులో చేసేవాడు కాదు. ఆ చేష్టలన్నీ అతనికి పిల్లచేష్టలుగా తోచేవి. ఇక్కడనుంచి 14 ఏళ్ళ వరకూ ఆయన జీవితం ఈ జిజ్ఞాసతోనే సాగింది.

ఇకపోతే 14 ఏళ్ల వయస్సులో ఇంకొక విచిత్రఅనుభవం ఈయన్ను వరించింది. 14 ఏళ్ళు దగ్గరపడుతున్న కొద్దీ జ్యోతిష్కుడు చెప్పిన జోస్యం మళ్ళీ నిజమౌతుందేమో, మళ్ళీ చావు ఇతనికి ఎదురౌతుందేమో అని కుటుంబసభ్యులు చాలా కంగారుపడ్డారు. ఈసంగతి రజనీష్ కి కూడా తెలిసింది. అప్పటికే అతను తన వయస్సుకు మించిన మానసికపరిపక్వతను పొంది ఉన్నాడు. సరే మరణం ఎలాగూ తప్పనపుడు దానికి మనమే ఎదురుపోతే పోలేదా? అలా చావుకు ఎదురువెళితే ఏమి జరుగుతుందో చూద్దామని రజనీష్ అనుకున్నాడు.

ఒక వారంరోజులలో తన 14 వ జన్మదినం వస్తుందనగా రజనీష్ ఒక ప్రయోగం చేసాడు. వారున్న పల్లెటూరిలో ఊరిబయట చెరువుగట్టున ఒక చిన్నగుడి ఉంది. అది దాదాపుగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ రారు. రోజుకొకసారి మాత్రం తనకు కొంత ఆహారం ఇవ్వమని ఆ గుడిపూజారితో ఒప్పందం కుదుర్చుకుని రజనీష్ ఆగుడిలో పడుకొని మరణంకోసం ఎదురుచూడసాగాడు. అది వచ్చినపుడు కంగారుపడకుండా ప్రశాంతంగా దానికి స్వాగతం చెప్పాలని అతని ఊహ. అంతేగాక మరణం ఎలా వస్తుందో, మరణంలో ఏమి జరుగుతుందో చూద్దామని, దాని రహస్యాన్ని చేదించాలనీ అతను భావించాడు. ఒక వారంరోజులు ఒక్కడే ఆగుడిలో రాత్రింబవళ్ళూ ఉంటూ మరణంకోసం ఎదురుచూశాడు. పద్నాలుగేళ్ళ పిల్లవానిలో అంత మానసికపరిపక్వత ఉండటం మామూలువిషయం కాదు. అది చాలా గొప్పవిషయం. ఎన్నోజన్మలనుంచీ అతను చేస్తున్న సాధనవల్లనే అంత పరిపక్వత అతనికి కలిగింది అని మనం భావించవచ్చు. 

ఒకరోజు రాత్రి రజనీష్ అలా పడుకొని మరణంకోసం ఎదురుచూస్తూ ఉండగా ఒక తాచుపాము ఆ గుడిలోకి ప్రవేశించింది. అదొక పల్లెటూరు, చుట్టూ పొలాలు చెరువూ ఉండటంతో అక్కడ పాములు బాగా తిరుగుతూ ఉండేవి. రజనీష్ దానిని గమనించి ఆ రూపంలో చావు వచ్చిందని భావిస్తూ కదలకుండా దానిని చూస్తూ ఉండిపోయాడు. ఆపాము పాకుతూ వచ్చి, పడుకొని ఉన్న రజనీష్ మీదికెక్కి, పాకుతూ అవతలకి దిగి ఎటో వెళ్ళిపోయింది. ఇదంతాకూడా చూస్తూ రజనీష్ కదలకుండా కట్టెలా పడుకుని ఉన్నాడు. ఈ వారంరోజుల చావుకోసం ఎదురుచూపులో, చివరికి జరిగిన ఈ పాము సంఘటనలో అతనికి ఎన్నోవిషయాలు అర్ధం అయ్యాయి.  మరణం అనేది అసలు లేనేలేదనీ, అది శరీరానికే వర్తిస్తుందనీ, శరీరం మరణించిన తర్వాతకూడా నిలిచి ఉండేది ఒకటి ఉంటుందనీ అతనికి అర్ధమైంది.

మరణం అంటే భయపడవలసిన పని లేదనీ, అది ఎంతో విశ్రాంతిగా హాయిగా ఉండే స్తితి అనీ, మన భయంవల్లనే దానిని మనం స్వీకరించలేకపోతున్నామనీ, భయాన్ని వదిలి దానిని స్వాగతిస్తే, ప్రపంచంలో అంతచక్కని విశ్రాంతి ఇచ్చేస్తితి ఇంకొకటి లేదనీ ఆయనకు తెలిసింది. ఆ సమయంలో గురు/రవి/శనిదశ ఆయన జీవితంలో జరిగింది. గురువు అష్టమాధిపతి, రవి మారకస్థానమైన సప్తమంలో ఉన్నాడు. శని ఏకాంతవాసానికీ ఆధ్యాత్మికజీవనానికీ సూచకుడు. కనుక ఈసమయం ఈసంఘటనకు చాలాసరిగ్గా సరిపోయింది. ఇకపోతే, 21 ఏళ్ళ వయస్సులో తనకు కలిగిన జ్ఞానోదయానుభవమే అసలైనమరణం అని రజనీష్ చెప్పాడు.అది ఎలాజరిగిందోపైనచూచాం. ఈ విధంగా పల్లెటూరిలోని   జ్యోతిష్కుడు చెప్పినట్లు ప్రతి ఏడేళ్ళకొకసారి రజనీష్ జీవితంలో మరణం ఎదురుపడింది. మొదటిసారి ఏడేళ్ళ వయస్సులో తాతగారి మరణంతో అప్పటివరకూ అతనిలో ఉన్న బాల్యం చనిపోయి ఆస్థానంలో జిజ్ఞాసతో కూడిన పరిపక్వతా అంతరికపరిశీలనా చోటుచేసుకున్నాయి. 14 ఏళ్ళ వయస్సులో వారం రోజులపాటు అహోరాత్రులూ తదేకంగా మరణంకోసం చూచిన ఎదురుచూపు ఒక తీవ్రధ్యానంగా మారి అతనికి అంతరికలోకపు లోతులు చూపించింది.అప్పటివరకూ ఉన్న రజనీష్ మరణించి మళ్ళీ ఒక కొత్త వ్యక్తీ ఉద్భవించాడు.తిరిగి 21 ఏళ్ళ వయస్సులో తన పరిమిత అహంకారాన్ని దాటిపోవడం ద్వారా కలిగిన అనుభూతి నిజమైన మరణంగా పరిణమించి ఎన్నో జన్మలనుంచీ ఎదురుచూస్తున్న సిద్ధస్తితిని ఆయనకు ఇచ్చింది.పరిమితాహంకారనాశనమూ,విశ్వవ్యాప్త చైతన్యానుభవమూ కలిగేస్థితినే జ్ఞానోదయం అని అంటారు.  ఆధ్యాత్మికకోణంలో అదే నిజమైన మరణం అని చెప్పవచ్చు.

రజనీష్ జీవితంలో జరిగిన ఇంకొక ముఖ్యసంఘటన -- చిన్ననాటి తన స్నేహితురాలైన వివేక్ మరణం. రజనీష్ చిన్నతనంలో ఆయనకు ఒక స్నేహితురాలుండేది. ఆ అమ్మాయి పేరు శశి. ఇద్దరూ ఒకేవయస్సువాళ్ళు అవటంతో, ఆపల్లెటూళ్ళో ఆడుతూపాడుతూ నిష్కల్మషంగా తిరుగుతూ కాలంగడిపారు. వారిద్దరి మధ్యన ప్రేమఉందని మనం ఊహించవచ్చు. రజనీష్ కు 17 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి 15 ఏళ్ళు ఉండేవి. అయితే, ఏదో జబ్బుచేసి ఆ అమ్మాయి హటాత్తుగా చనిపోయింది. ఆ రోజుల్లో మలేరియా, టైఫాయిడ్, జాండీస్, కలరావంటి రోగాలకు కూడా పల్లెల్లో మందులుండేవి  కావు. అలాటిదే ఏదో రోగంతో ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయే ముందు రజనీష్ చేతిలో చెయ్యివేసి, తాను మళ్ళీ పుడతాననీ తనని వెతుక్కుంటూవస్తాననీ చెప్పింది.

తర్వాత కొంతకాలానికి ఇంగ్లాండ్ లో "క్రిస్టిన్ వూల్ఫ్" అనే పేరుతో పుట్టిన ఒకఅమ్మాయి ఇరవైఏళ్లతర్వాత ఏదోతెలియని ఆకర్షణచేత లాగబడి, వెతుక్కుంటూ ఇండియాకు వచ్చింది. రజనీష్ ఉపన్యాసాలు విన్న ఆఅమ్మాయి ఇక ఇంగ్లాండ్ కు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయింది. ఇలాఉండగా రజనీష్ సమక్షంలో ఒకరోజున అనుకోకుండా ఆఅమ్మాయి ఒక రకమైన ట్రాన్స్ లోకివెళ్లి తన పూర్వజన్మఘట్టాలను సినిమాతెరమీద సీన్లలాగా చూసింది. పూర్వజన్మలో  శశిగా ఉన్నప్పుడు తాను రజనీష్ తో కలిసి ఎలా ఆడుకున్నదీ, తరువాత ఎలా చనిపోయిందీ, అప్పుడు తాను చేసిన వాగ్దానమూ ఆ ఘట్టాలన్నీ కళ్ళముందు సినిమాసీన్లలాగా కనిపించాయి. అదే సమయంలో రజనీష్ కూడా ఆఅమ్మాయికి పూర్వజన్మ గురించి చెప్పాడు. ఆ అమ్మాయిని మొదటి సారి చూచినప్పుడే ఆమె తన గతజన్మస్నేహితురాలైన "శశి" అని రజనీష్ గుర్తించాడని చెప్తారు. అయితే ఆవిషయం ఆమెతో చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె ట్రాన్స్ లో తన గతజన్మ జ్ఞాపకాలను చూచిందో అప్పుడు ఆమెకు విషయాన్ని తెలియచేసాడు.

అప్పటినుంచి ఆమె చనిపోయేవరకూ రజనీష్ తోనే ఉండి అతనికి సేవ చేస్తూ ఉండిపోయింది. "మా యోగవివేక్" అని రజనీష్ ఆమెకు సన్యాసనామాన్ని ఇచ్చాడు. అయితే ఈఅమ్మాయి అనుమానాస్పద పరిస్తితుల్లో బాంబేలోని ఒక హోటల్లో 9-12-1989 న మరణించింది. ఆరోజున రజనీష్ జాతకంలో శుక్ర/శుక్ర/గురు/శుక్ర/శుక్రదశ జరిగింది. స్నేహితులను ఏకాదశస్థానం నుంచి చూడాలి. రజనీష్ జాతకంలో ఇది మీనం అవుతుంది. మీనంలో రాహువుయొక్క స్తితివల్ల రజనీష్ కు విదేశీశిష్యులూ స్నేహితులూ ఎక్కువగా ఉన్నారు. రజనీష్ జాతకంలో గురువు, తనయొక్క అష్టమ లాభాదిపత్యాల వల్ల పూర్వజన్మబంధాన్ని సూచిస్తున్నాడు. శుక్రుడు మీనలగ్నానికి మారకుడు. గురువు రజనీష్ కు  లాభాధిపతిగా స్నేహితులను సూచిస్తున్నాడు. శుక్రుడు లగ్న షష్ఠ అధిపతిగా తనకు ఈ కోణంలో మిగిలిఉన్న కర్మశేషాన్ని సూచిస్తున్నాడు.

ఆ రోజున గోచారగ్రహాలస్తితిని బట్టి - గోచారశని సరిగ్గా ధనుస్సు 19 డిగ్రీలమీద సంచరిస్తూ జననకాల శుక్రునిమీద ఉన్నాడు. గోచారబుధుడు ధనుస్సు 9 డిగ్రీల మీద జననకాల సప్తమాధిపతి అయిన కుజునికి చాలా దగ్గరగా ఉన్నాడు. గోచారకుజుడు వృశ్చికం 0 డిగ్రీలో ఉన్నాడు. ఈమె చనిపోయిన సరిగ్గా 40 రోజులకు రజనీష్ కూడా శరీరాన్ని ఒదిలిపెట్టాడు. అప్పటికే రజనీష్ ఆరోగ్యం బాగా క్షీణిస్తూన్నదనీ, దానినిచూచి భరించలేని  వివేక్, ఆయనకంటే ముందుగా పోవాలని, హైడోస్ లో స్లీపింగ్ పిల్స్ మింగిందనీ కొందరంటారు. అదేమీ లేదు, ఆ అమ్మాయి ఏదో వ్యాధితో బాధపడేది. దానికి సంబంధించిన మందులు ఎక్కువ డోస్ లో వేసుకోవడంతో చనిపోయింది అని కొందరంటారు.  

అవన్నీ ఎలా ఉన్నప్పటికీ , ఈ విశ్లేషణ అంతా 5.09 నిమిషాల జనన సమయానికే సరిపోతున్నది.  కనుక ఈ సమయమే రజనీష్ జనన సమయం అని అనుకోవచ్చు.
read more " ఓషో రజనీష్ జాతకం, భావజాలం-2 "

22, డిసెంబర్ 2011, గురువారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం -1

రజనీష్ చంద్రమోహన్ జైన్ అనేది ఓషో అసలు పేరు. ఈయన 11-12-1931  రోజున మధ్యప్రదేశ్ లోని కచ్వారా అనే ఊరిలో పుట్టాడు. జనన సమయం సాయంత్రం 5.00 నుంచి 5.45 లోపు అని అంటారు. ఈయన జాతకంలో ముఖ్య సంఘటనలు మనకు తెలుసు. కనుక ఆయా సంఘటనల ఆధారంగా ఈ జాతకాన్ని రెక్టిఫై చేద్దాం. అదే సమయంలో ఈయన భావజాలాన్నీ పరిశీలిద్దాం.

రజనీష్ చెప్పిన విషయాలలో చాలా నిజాలు ఉన్నమాట వాస్తవమే. అదే సమయంలో ఆయన బోధనలు అనుసరించినవారిలో జ్ఞానులైనవారు ఎక్కడా కనిపించరు. నాకు తెలిసినవారిలో రజనీష్ బోధలు ఆచరించిన వారందరూ దారితప్పారు. రజనీష్ శిష్యులలో ఒక్కరంటే ఒక్కరు జ్ఞానులైన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగినవాళ్ళు నాకు కనిపించలేదు. 

ఇతరులను ఏఏ కోణాలలో అయితే విమర్శించాడో అవే లోపాలు ఆయన దగ్గరా ఉన్నాయి. ఇతర మతాలలో ఏఏ లోపాలను ఎత్తి చూపాడో అంతకు మించిన లోపాలు ఆయన సంస్థలోనూ బోలెడన్ని ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే మామూలు లోపాలు కాదు, భయంకరమైన లోపాలు  ఉన్నాయి. కనుక ఆచరణలేని బోధలవల్ల ఉపయోగం ఏమిటి అని కొందరంటారు. ఓషో మూవ్ మెంట్ కూడా ఒక వెల్లువలాగా పెరిగి, పెద్దకెరటంలాగా విరిగి పతనమై పోయింది. దానికి అనేక కారణాలున్నాయి. అవేమిటో ముందుముందు చూద్దాం. ఆయన నిజమైన మహాత్ముడు అని కొందరంటారు. అదేమీ లేదు ఆయనొక మహాతెలివైన మతవ్యాపారి మాత్రమె, ఆయన చెప్పింది ఎక్కువ, ఆచరించింది తక్కువ అని కొందరంటారు.

ఏదైనా ఒకవిషయాన్ని ఓషో చెప్పేవిధానం చాలా బాగుంటుంది, కాని ఆయన చెప్పినదానిని ఆయనే పూర్తిగా ఆచరించలేకపోయాడు. ఎదుటివారినిమాత్రం తన బోధలతో ఎగదోశాడు. వాటిని ఆచరించినవాళ్ళు అందరూ  భ్రష్టుపట్టారు అని కొందరంటారు. ఏది ఏమైనా ఆయనవల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనుషుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి అన్నది నిజం. చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి అన్నదికూడా నిజం. అదే సమయంలో ఎంతోమందికి మెరుగైన ఉన్నతమైన అంతరిక జీవితం సాధ్యం అయింది అన్నదికూడా నిజం. ఇప్పటికీ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారంటే దానికి కారణాలలో ఒకటి -- విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఓషో లక్షణం. అలాగే లోకానికి ఒక విలక్షణమైన ఆధ్యాత్మికకోణం ఈయన అందించగలిగాడు అన్నదీ నిజమే. దాన్ని ఆయన ఎంతవరకూ ఆచరించాడు అన్నది మళ్ళీ వేరే సంగతి.

ఇప్పుడు, మనకు తెలిసిన ఓషో జీవిత సంఘటనలను బట్టి ఆయన జనన సమయాన్ని రెక్టిఫై చేద్దాం. ఒక జాతకాన్ని ఎన్నో రకాలుగా రెక్టిఫై చెయ్యవచ్చు. భారతీయజ్యోతిష్యం ఎన్నోరకాలైన విధానాలను ఇందుకోసం ఇచ్చింది. ప్రస్తుతానికి వర్గచక్రాలు మరియు దశల సాయంతో ఈ పని చేద్దాం.

తన తల్లిదండ్రులకు కలిగిన 11మంది సంతానంలో ఈయన పెద్దవాడు. తనయొక్క సోదరులను ద్రేక్కాణ చక్రం చూపిస్తుంది. ఓషో జనన సమయాన్ని (వివాదాస్పద నలభైఅయిదునిముషాలను) కనుక ద్రేక్కాణచక్రంలో చూస్తే మనకు మూడుభాగాలుగా  కనిపిస్తాయి. 5.03 వరకూ కన్య, 5.04 నుంచి 5.45 వరకూ మకరం, 5.46  తర్వాత మిథునం ద్రేక్కాణలగ్నాలౌతాయి. కన్యాలగ్నంలో కేతువుండి, సహోదరదోషాన్ని చూపిస్తున్నాడు. ఏకాదశంలో రవి ఉంటూ తనకుపైన అన్నలు ఉన్నారని సూచిస్తాడు. కనుక మొదటిద్రేక్కాణంలో జన్మ జరగలేదు. ఇక రెండవ ద్రేక్కాణంలో, లగ్నంలో ఏ గ్రహమూ లేదు. ఏకాదశాధిపతి కుజుడు ద్వాదశంలో ఉంటూ తనపైన ఎవరూ అన్నలు అక్కలు లేరని సూచిస్తున్నాడు. తృతీయం గురురాహువులతో కూడి చాలామంది కనిష్టులు ఉన్నారన్న సూచన ఇస్తోంది. ఇక మిధునద్రేక్కాణం బట్టి చూస్తే, ఇక్కడ కూడా  జ్యేష్టులూ కనిష్టులూ ఉన్నారని సూచిస్తోంది. కనుక తృతీయద్రేక్కాణంలో జన్మ జరుగలేదు. జననసమయం రెండవ ద్రేక్కాణంలో ఉంది. అంటే జననసమయం 5.04  నుంచి 5.45  మధ్యలో ఉంది.


సమయాన్ని మరికొంత ఫైన్ ట్యూన్ చేద్దాం. ఓషోరజనీష్ జీవితమంతా ఆస్త్మాతో బాధ పడ్డాడు. చివరిదశలో ఏమిటో తెలియని అనేక రోగాలు ఈయన్ని చుట్టుముట్టాయి. కాని జీవితమంతా వదలకుండా  ఈయన్ని బాధపెట్టింది మాత్రం ఒక్క ఆస్త్మానే. దీనికోసం, రోగాలను సూచించే షష్ఠఅంశ చక్రాన్ని పరిశీలిద్దాం. ఇందులో మూడు లగ్నాలు వస్తాయి. 5.03  వరకూ మకరం.అక్కణ్ణించి 5.24  వరకూ కుంభం. అక్కణ్ణించి 5.45 వరకూ మీనం. మకర లగ్నాధిపతి శని నవమంలో మిత్రస్థానంలో కొలువై ఉన్నాడు. మకరం ఆస్తమాను సూచించదు. ఇక కుంభలగ్నాన్ని చూస్తే, శని దీర్ఘరోగాలకు సూచిక అయిన అష్టమంలో ఉంటాడు. ఊపిరితిత్తులకు సూచిక అయిన మిథునం కుంభానికి త్రికోణరాశి అవుతుంది. కనుక కుంభషష్ఠఅంశ సరిపోతుంది. ఇక మిగిలిన మీనరాశి ఇతరకారణాల వల్ల సరిపోదు. కనుక 5.04 నుంచి 5.24 వరకూ జనన సమయం కుదించబడింది.


ఈ ఇరవైనిముషాలను ఇప్పుడు మరింతగా ఫైన్ ట్యూన్ చేయడం కోసం నవాంశం చూద్దాం. రజనీష్ తన జీవితమంతా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. కాని తాను బ్రహ్మచారిని మాత్రం కానని చాలాసార్లు చెప్పాడు. ఈయనకు చాలామంది స్వదేశీ విదేశీ శిష్యురాళ్ళతో సంబంధాలున్నాయని ఆయన శిష్యులే చెప్తారు. ఓషో అనుసరించినమార్గంలో ఈ పద్దతి తప్పుకాదు. ఓషో యొక్క ఈ భావజాలం ఎంతవరకూ కరెక్టో ముందుముందు పరిశీలిద్దాం. ప్రస్తుతానికి ఈకోణంలో నవాంశను పరిశీలిద్దాం. ఇందులో నాలుగు నవాంశలు వస్తాయి. 5.03  వరకూ మిథున నవాంశ. ఇది ద్రేక్కాణ పరిశీలనలో తొలగించబడింది. అక్కణ్ణించి 5.17 వరకూ  కటక నవాంశ. సప్తమాధిపతి శని ఆరింట ఉండి, ద్వాదశం నుంచి కుజునిచే చూడబడుతున్నాడు. సుఖస్థానాధిపతి శుక్రుడు నీచలో ఉండి నవమంనుంచి ధార్మికగ్రహాలైన గురు కేతువులచేత చూడబడుతున్నాడు. కనుక ఈయన మతజీవితం గడపడంకోసం, పెళ్లి చేసుకోకుండ అలా ఉండిపోయాడు అని తెలుస్తోంది.  కాని రాహువుతో శుక్రుడు కలిసిఉన్నందున చాలామందితో సంబంధాలున్నాయని సూచిస్తోంది. అక్కణ్ణించి 17.31  వరకూ సింహ లగ్నం. రవి సప్తమంలో ఉన్నాడు. సుఖస్థానాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. కనుక ఈ సమయంలో పుట్టినవాళ్లకు వివాహం జరుగుతుంది. ఓషో జీవితంలో అలా జరగలేదు గనుక ఈ టైంస్లాట్ పనికిరాదు. 17.45  వరకూ కన్యాలగ్నం ఉంది. ఇందులో రాహుశుక్రులు, సప్తమంలో గురుకేతువులు ఉన్నారు. కనుక రెండు పెళ్ళిళ్ళు అంతకు మించి రహస్యసంబంధాలు ఉండాలి. పెళ్లి జరుగలేదు కనుక ఈ టైంస్లాట్ కూడా కరెక్ట్ కాదు. కనుక ఈ విశ్లేషణ  ప్రకారం 5.04 నుంచి 5.17 లోపు కర్కాటకనవాంశలో జననం జరిగింది అని తెలుస్తోంది.


ఇప్పుడు పదమూడు నిముషాల ఈ జననసమయాన్ని ఇంకా కుదించడానికి విమ్శాంశకుండలి చూద్దాం. ఆధ్యాత్మికవేత్తలకు ఈ వర్గచక్రం చాలా ముఖ్యమైనది. ఇందులో 5.03 వరకూ మకర లగ్నం అవుతుంది. ఇది చరరాశి. కుజుడు రాహుకేతువులూ ఇందులో ఉన్నారు. లగ్నాధిపతి శని కమ్యూనికేషన్ ను సూచించే మూడింట ఉన్నాడు. నాలుగింట తెలివినీ తర్కాన్నీ సూచించే బుధుడు ఉన్నాడు. అయిదింట ఆత్మజ్ఞానకారకుడైన సూర్యుడున్నాడు. ఇది బాగానే సరిపోతుంది. ఇక్కన్నించి 5.14 వరకూ కుంభలగ్నం అయింది. ఇది లోకానికి సహాయపడే రాశి. లగ్నాధిపతి వాక్స్తానంలో ఉన్నాడు. కుజ,రాహు,కేతువులు ద్వాదశంలోకి వస్తారు. తెలివిని సూచించే గ్రహం బుధుడు మూడింటికి వస్తాడు. పైగా శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. అందుకే ఈయన ఇచ్చిన చాలా ఉపన్యాసాలలో బూతుజోకులూ , సెక్స్ టాపిక్సూ చాలా మామూలుగా తడుముకోకుండా చెప్పేవాడు. ఈయన బోధనలలో సెక్స్ అనేది మిళితమై ఉంటుంది. కనుక  ఈ శుక్రప్రభావాన్ని కుంభవిమ్శాంశ మాత్రమే సరిగ్గా చూపిస్తున్నది. అదే మకర లగ్నం అయితే సప్తమం ఖాళీగా ఉంది. అదీగాక చంద్రస్థానం అయింది. అప్పుడు ఈయన సిద్ధాంతంలో ఉన్న సెక్స్ కోణం జాతకంలో ఉండదు. కనుక ఈయన జాతకానికి కుంభవిమ్శాంశ బాగా సరిపోయేటట్లు కనిపిస్తున్నది. అంటే విమ్శాంశ ప్రకారం 5.04 నించి 5.14 లోపల జననం జరిగింది. 

ఈ పదినిముషాల సమయాన్ని కూడా ఇంకా సూక్ష్మీకరించడానికి  చతుర్విమ్శాంశ(సిద్ధాంశ) చక్రాన్ని చూద్దాం. ఇది విద్యను సూచిస్తుంది. రజనీష్ తత్వశాస్త్రంలో PG చేసాడని మనకు తెలుసు. సిద్ధాంశ కుండలిలో 5.09 నుంచి 5.13 వరకూ ధనుర్లగ్నం అవుతుంది. గురు, బుధ, శనులు సప్తమంలో ఉండి   లగ్నాన్ని చూస్తుండటం వల్ల ఈయన విద్యాభ్యాసం అంతా తత్వశాస్త్రం మీదే సాగింది అని సూచన ఈ వర్గచక్రంలో ఉంది. మిగతా సమయపు విభాగాలను లెక్కించవలసిన పని లేదు. కనుక జననసమయం 5.09 నుంచి 5.13  లోపు ఉంది.

ఈ నాలుగునిముషాలను కూడా ఇంకొంచం ఫైన్ ట్యూన్ చెయ్యడానికి, వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే త్రింశాంశ కుండలిని చూద్దాం. ఇందులో పై నాలుగునిముషాల సమయమూ మకర లగ్నమే అవుతుంది. మకరం పట్టుదలకు సూచన. రజనీష్ మహా మొండివాడని మనకు తెలుసు. లగ్నానికి వెనుకా ముందూ ఉన్న బుధకుజుల వల్ల, తెలివీ పట్టుదలలు ఈయన వ్యక్తిత్వానికి పునాదులు అన్న విషయం తెలుస్తుంది. అంతే గాక ఒక ముఖ్య విషయం ఈ వర్గ చక్రం పట్టిస్తుంది. లగ్నాధిపతి దశమంలో ఉచ్ఛస్తితిలో ఉండటం చూస్తే ఈయన యొక్క అంతిమఉద్దేశ్యాలు బోధనలూ మంచివే అని, అవి  ఆధ్యాత్మికతపైన ఆధారపడి ఉన్నాయన్నది సత్యమే అనీ, అందరూ అనుకునేటట్లు విచ్చలవిడి ఎంజాయ్మెంట్ ను అతను బోధించలేదనీ తెలుస్తుంది.

మరికొంత ఫైన్ ట్యూన్ చెయ్యడం కోసం ఇంతకంటే బాగా సూక్ష్మమైన షష్ట్యంశను చూద్దాం. సామాన్యంగా ఈ వర్గ చక్రంలో ప్రతి రెండు నిముషాలకూ లగ్నం మారిపోతుంది. అక్షాంశ రేఖాంశాలను బట్టి ఒక్కొక్కసారి ప్రతి నిముషానికీ కూడా మారుతుంది. ఇందులో 5.09 కి వృశ్చికలగ్నమూ 5.10 కి ధనుర్లగ్నమూ అవుతాయి. వృశ్చికం లగ్నం అయితే నవమాదిపతి చంద్రుడు దశమంలో ఉంటూ ధార్మికపరమైన వృత్తిని సూచిస్తున్నాడు. నాలుగింట రవిబుధశుక్రులు ఉంటూ ఉన్నతవిద్యనూ విస్తృతజ్ఞానాన్నీ సూచిస్తున్నారు. లాభస్థానం నుంచి శని లగ్నాన్ని చూస్తూ విద్యవల్ల తనకు కలిగిన మేలును సూచిస్తున్నాడు. రజనీష్ కొన్నివేల పుస్తకాలను చదివాడని అంటారు. వాళ్ళ శిష్యులు చెప్పేదాన్ని బట్టి ఆయన లక్షా ఏభైవేల గ్రంధాలను చదివి వాటిలోని సారాన్ని జీర్నించుకున్నాడు. ఇది నిజమో లేక కొంత ఎక్కువగా చెప్పారో తెలీదు కాని, ఓషో రజనీష్ చిన్నప్పటినుంచీ పుస్తకాలపురుగు అనేది నిజమే. 

1998 లో నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో ఉన్నప్పుడు విస్తృతమైన ఆయన పర్సనల్ లైబ్రరీని చూచి చాలా ఆశ్చర్యపోయాను. అందులో లక్షకు పైన పుస్తకాలు ఉన్నమాట వాస్తవమే. ఇక మన ఎనాలిసిస్ కు వస్తే, ఈ కుండలిలో మూడింట కేతువుఉండి ఆధ్యాత్మికపరమైన కమ్యూనికేషన్ ను సూచిస్తున్నాడు. అదే ధనుస్సు లగ్నం అయితే వాక్స్తానంలో కేతువువల్ల వాక్చాతుర్యం ఉండదు. కానీ ఓషో రజనీష్ గొప్ప ఉపన్యాసకుడనీ, యూనివర్సిటీ స్థాయిలో ఆల్ ఇండియా డిబేటింగ్ చాంపియన్ అనీ మనకు తెలుసు. కాని మిగతా ఇతర జీవితవిషయాలు ఈ లగ్నానికి కూడా చూచాయగా సరిపోతాయి. కనుక అంతిమంగా సాయంత్రం 5.09 లేదా 5.10 అనే సమయాలు ఈయన జాతకానికి సరిపోతున్నాయి. ఇప్పుడు దశలను పోల్చిచూచి, ఈరెండు సమయాలలో ఏది సరియైన జన్మ సమయమో చూద్దాం.

(మిగతా రెండవ భాగంలో) 
read more " ఓషో రజనీష్ జాతకం, భావజాలం -1 "

18, డిసెంబర్ 2011, ఆదివారం

మార్గశిర పౌర్ణమి - మేదినీజ్యోతిష్యం

మార్గశిరపౌర్ణమికి కొన్ని ముఖ్యమైన గ్రహస్తితులు వచ్చాయి. వాటివల్ల చంద్రుని ప్రభావం నూటికి నూరుపాళ్ళు భూమ్మీద ఉంటుందనీ, అనేక సంఘటనలకు  ఇది కారణం అవుతుందనీ ఈ పౌర్ణమికి మళ్ళీ రుజువైంది. దీనికి సంబంధించి ఎన్నో విషయాలు నేను వ్రాస్తూ రుజువుచేస్తూ వచ్చాను. కనుక  దీన్నొక తిరుగులేని యాస్ట్రో ఎనలిటికల్ ఫేక్టర్ గా పరిగణించవచ్చు అనేది రూడిగా తేలింది. 

ఈ నేపధ్యంలో కొద్దిగా వెనక్కు వెళ్లి వరుస సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మెక్సికోలో 6 .7  స్థాయిలో భూకంపం, రష్యాలో ఎలక్షన్ కుంభకోణం వల్ల లక్షలాది ప్రజల నిరసన, కలకత్తాలో AMRI ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, తమిళనాడు - కేరళ రాష్ట్రాలమధ్య డ్యాం చిచ్చు, నటుడు దేవానంద్ మరణం, ఆంధ్రలో అవిశ్వాసతీర్మానం రూపంలో ప్రభుత్వ ఉనికికి తాత్కాలికప్రమాదం, ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద దాడి, ఇలా చాలా చాలా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ జరిగే చిన్నచిన్న విషయాలు నేను వ్రాయడంలేదు. ఎప్పుడో ఒకసారి జరిగే ముఖ్యమైన పెద్దవిషయాలు మాత్రమె పరిగణనలోకి తీసుకున్నాను.

ఈసారి పౌర్ణమికి తోడుగా సంపూర్ణ చంద్రగ్రహణం కూడా వచ్చి పడింది. కనుక రకరకాలైన ఘటనలు జరిగాయి. మామూలుగానే మార్గశిర పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పుకోబోయే ముందుగా, 26 -12 -2004 న దక్షిణభారతాన్ని కుదిపేసిన సునామీ సరిగ్గా ఇదే మార్గశిర పౌర్ణమి రోజున వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఆ రోజున గ్రహస్తితులను తెలిపే కుండలి ఇక్కడ ఇస్తున్నాను. ఆరోజున వచ్చిన సునామీ ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ దేశాలను అతలాకుతలం చేసింది. దీని ప్రభావం వల్ల హిందూమహాసముద్ర తీరంలోని పద్నాలుగుదేశాలలో దాదాపు రెండులక్షల ఏభైవేలమంది పైగా ఒకే దెబ్బతో మరణించారు. ఇది మన దేశంలో ఉదయం 9.30 నుంచి 10.00 మధ్యలో జరిగింది. 

ఈ సారి వచ్చిన మార్గశిర పౌర్ణమికి ఉన్న ప్రత్యేకతలలో రాహుకేతువుల నీచస్తితి ఒకటి. ఇలాంటి స్తితి పద్దెనిమిది ఏళ్లకొకసారి వస్తుంది. అలాంటి నీచస్తితిలో ఉన్న కేతువుతో కూడిన చంద్ర గ్రహణం కూడా ఈసారి వచ్చింది. అందుకే ఇన్ని సంఘటనలు జరిగాయి.

పోయినసారి ఇలాంటి గ్రహస్తితి పద్దెనిమిది ఏళ్లక్రితం 10-12-1992  న వచ్చింది. దాని ప్రభావంగా అప్పుడు ఏమేం జరిగాయో ఒక్కసారి చూద్దాం.

>> 6-12-1992 న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. దానివల్ల ఇన్నేళ్ళలో ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు.

>>యెమెన్ లో గోల్డ్ మొహర్ హోటల్లో బసచేసి ఉన్న అమెరికన్ సైనికులమీద మొట్టమొదటి ఆల్ ఖైదా ఎటాక్ 29-12-1992 న జరిగింది. 

>> ప్రిన్స్ చార్లెస్ డయానాల పెళ్లి పెటాకులైందనీ వాళ్ళు  విడిపోతున్నారనే ప్రకటన కూడా డిసెంబర్   లోనే  వెలువడింది. కొందరి దృష్టిలో ఇదంత ముఖ్య సంఘటన కాకపోవచ్చు. కాని వారు ప్రముఖవ్యక్తులు గనుక వ్రాస్తున్నాను.

>>అంతకు ముందు 1992  మే లో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో కల్తీ సారా తాగి 200 మంది మరణించారు. దాదాపు ఇంకో 600 మంది ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఈ సంఘటన రాహుకేతువులు నీచస్తితిలో ఉన్నపుడే జరిగింది. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత రాహుకేతువులు అదే నీచ స్తితిలో ఉన్నపుడు మళ్ళీ 13-12-2011  న పశ్చిమ బెంగాల్లో అదే కల్తీమద్యం తాగి దాదాపు 150 మంది చనిపోయారు. 

ఎప్పుడూ ఏదో ఒకటి జరిగి మనుషులు పిట్టల్లా చావడం, మర్నాటికి దానిని అందరూ మర్చిపోవడం, మనదేశంలో సర్వసాధారణం. ఇక్కడ కల్తీసారానే నిందించడం ఎందుకు? మన దేశంలో చాలాప్రాంతాలలో ఉత్తనీళ్ళు  తాగితే చాలు పరలోకప్రయాణం సుఖంగా జరుగుతుంది. ఇక సారా సంగతి చెప్పే పనేముంది? అసలు సారాకీ  గ్రహాలకూ ఏమిటి లింకు? అని కొందరికి సందేహం రావచ్చు. ఒక్క మంచినీళ్లకూ  సారాయికే కాదు, లోకంలో చీమ చిటుక్కుమనడానికి కూడా కారణాలుంటాయి. ఆ కారణాలను గ్రహాలు వాటి భాషలో చెబుతూనే ఉంటాయి. అయితే ఆయా కారణాలను మనం అర్ధం చేసుకోవడంలోనే మన తెలివి పనిచెయ్యాలి. నాదొక్కటే ప్రశ్న. ఒకే రకమైన సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీమళ్ళీ అవే రకమైన గ్రహస్తితులు ఎందుకుంటున్నాయి? వీటి వెనక ఉన్న సంబంధం ఏమిటి?  అన్న నా ప్రశ్నకు వారూ జవాబు చెప్పాలి మరి. ఇది కాకతాళీయం అంటే నేనొప్పుకోను.

>> పోయినసారి రాహుకేతువులు నీచలో ఉన్నప్పుడు 1992 లో సినీరంగానికి చెందిన ప్రముఖులు సత్యజిత్ రే, అమ్జాద్ ఖాన్, ప్రేమ్ నాథ్ మరణించారు. మళ్ళీ పద్దెనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు 2011 లో దేవానంద్, మల్లెమాల చనిపోయారు. 2012 ఏడాది మొత్తం రాహుకేతువులు ఇదే నీచపరిస్తితిలో ఉంటారు. జనవరి 2013 లో మాత్రమే వారి స్థానాలు మారుతాయి. కనుక 2012 లో మరికొందరు సినీపెద్దల మరియు దేశప్రముఖుల అస్తమయం జరుగనుంది అని ఖచ్చితంగా ఊహించవచ్చు.

గ్రహప్రభావం మనుషులమీదా భూమ్మీదా ఉంది అన్నమాట నిర్వివాదాంశం. అది ఏ విధంగా ఉంటుందో  అర్ధంచేసుకుని విజ్ఞతగా ప్రవర్తించడంలోనే మానవుల తెలివి దాగుంటుంది.
read more " మార్గశిర పౌర్ణమి - మేదినీజ్యోతిష్యం "

9, డిసెంబర్ 2011, శుక్రవారం

శ్రీరామరాజ్యం

ఈ సినిమామీద మీఅభిప్రాయం ఏమిటో వ్రాయకూడదా అని ఒకమిత్రుడు అడిగాడు. ఎందుకులే బాబు, నా అభిప్రాయాలు చాలామందికి నచ్చవు. ఏదన్నా అంటే అదుగో ప్రతిదానికీ విమర్శిస్తావు అంటారు. అని తప్పుకుందామని చూశాను. నచ్చటం నచ్చకపోవటం వేరేసంగతి ముందు మీరేమనుకుంటున్నారో మాకు తెలియాలి. చెప్పండి అని బలవంతం చేసాడు. సరే వ్రాస్తాలే అని చెప్పాను.

మొన్నెప్పుడో వినుకొండలో దోమలచేత కుట్టించుకుంటూ ఒక మామూలుహాల్లో ఈసినిమా చూశాను. కొందరు అంటున్నంత మహాగొప్పగానూ లేదు, అలాగని చెత్తగాకూడా ఏమీలేదు అనిపించింది. బాగులేని హాలూ, దోమలబాధ వల్ల కలుగుతున్న అసహనమూ నా అభిప్రాయాన్ని ఏమాత్రమూ ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్తపడుతూ మరీ ఈ సినిమా చూశాను.

బాపు స్వతహాగా చిత్రకారుడు గనుక ప్రతి ఫ్రేమూ చక్కగా చిక్కగా ఒక పెయింటింగ్ లాగా ఉండేలా జాగ్రత్తపడుతూ సినిమాని తీశాడు. కాని ఒక కళాఖండాన్ని తీసేటప్పుడు అదొక్కటే సరిపోదు. అందులోనూ ఉత్తరరామచరితం వంటి మహత్తరమైన కథని తీసేటప్పుడు చాలాజాగ్రత్తగా తియ్యాలి. ఒక్క ఆర్టిస్టిక్ అవుట్ లుక్ ఒక్కటే చాలదు.

ముందుగా కేరక్టర్ ఫిట్నెస్ ఉన్న నటులను ఎంచుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బహుశా ఆయనకు ఈ విషయంలో స్వతంత్రం లేదేమో అనిపించింది.  సీతారాములను మన దేశంలో వాడవాడలా పూజిస్తారు. అలాటి పురాణపాత్రల కథను తీసేటప్పుడు ఎంతో రీసెర్చిచేసి ఎన్నోకోణాల్లో ఆలోచించి మరీ సినిమా తియ్యాలి.అందులోని సంగీతమూ, సాహిత్యమూ, తరతరాలకూ చిరస్థాయిగా నిలిచిపోయేలా జాగ్రత్త వహించాలి.  సరైన ట్యూన్లకోసం, సరైన సాహిత్యం కోసం ఒక తపస్సులాగా నెలల తరబడి సిట్టింగ్స్ చెయ్యాలి. నటీనటుల ఉచ్చారణా, ఆహార్యమూ స్పష్టంగా ఆహ్లాదంగా ఉండేలా చూచుకోవాలి. డైలాగ్స్ మంచి భాషలో ఉండేటట్లు చూచుకోవాలి. ఇవేవీ ఈ సినిమాలో లేవు.  ఇలా చెప్పుకుంటే బోలెడన్ని లోపాలు ఈ సినిమాలో ఉన్నాయి.

>> పౌరాణిక చిత్రానికి ఒక ప్రత్యేకమైన భాష వాడాలి. జానపద భాషలోనో, సాంఘిక భాషలోనో డైలాగులు వ్రాస్తే పౌరాణికానికి అతకదు. పోనీ కధలోని గ్రామీణప్రజల చేత గ్రామ్యభాష మాట్లాడించినా నాగరిక పాత్రలచేతకూడా గ్రామ్యమాండలిక పదాలను పలికిస్తే పాయసంలో రాళ్ళలాగా బాధ కలిగిస్తాయి. గ్రాంధికభాష వాడితే సామాన్యజనానికి అర్ధం కాదు అందుకే అలా  మామూలుభాష వాడారులే అని సర్ది చెప్పుకోవచ్చు. ఇక  ఆ విధంగా దిగజారుతూ పొతే ఆ దిగజారుడుతనానికి అంతూపొంతూ ఉండదు. కనుక ఎక్కడో ఒకచోట ఒక స్థాయిలో సర్దుబాటు చేసుకుని గ్రాంధికానికీ గ్రామ్యానికీ మధ్యేమార్గం పాటించాలి. అలా చెయ్యలేకపోవడం ఈ సినిమాలోని ఒక పెద్ద లోపం.

>> ఇకపోతే ఒక భాషాశైలిని  ఎంచుకున్న తర్వాత, అదే భాషను అన్ని ఫ్రేముల్లోనూ అన్ని సీన్లలోనూ ఉండేలా దర్శకుడు జాగ్రత్తపడాలి. దీన్నే 'డిక్షన్ కంటిన్యూటీ' అంటారు.అందుకు విరుద్ధంగా ఈ సినిమాలోని  కొన్ని ఫ్రేముల్లో గ్రాంధికమూ, కొన్ని ఫ్రేముల్లో సాంఘికమూ, ఇంకొన్ని ఫ్రేముల్లో అదేదో అర్ధంకాని కలగలుపు భాషా,  వినిపిస్తుంది. ఇవీ పాయసంలోని రాళ్ళేనని  చెప్పుకోవచ్చు. ఉదాహరణకు సీతాదేవిని లక్ష్మణుడు అడివిలో వదిలి వెళ్ళిపోయాక భూదేవి ప్రత్యక్షమౌతుంది. అప్పుడు శ్రీరాముని శపించబోతున్న భూదేవిని అడ్డుకుని సీతాదేవి " అసలు నువ్వెందుకోచ్చావ్ ? వెళ్ళిపో ఇక్కణ్ణించి " అనే సాంఘికనాటకరీతిలో మాట్లాడటం చాలా చికాకుగా అనిపిస్తుంది. ఇదే డైలాగులు ఇంకాబాగా వ్రాసి ఉండవచ్చు. ఇలాటి పరిస్తితి సినిమా మొత్తంమీద చాలాసార్లు ఎదురౌతుంది. భాషాశైలిలో ఒక స్తిరమైన నడక లేకపోవడం  పెద్ద లోపం.

>> ఇకపోతే అక్కినేని నటన చాలా నిరాశపరిచింది. ఆయన ముఖంలో వాల్మీకిమహర్షి ముఖంలో ఉండవలసిన మార్దవం ఎక్కడా కనిపించలేదు. ఏదో కరుకుదనం గోచరిస్తూ ఉంది. వాల్మీకి ఒక మహర్షి మాత్రమేకాదు, క్రౌంచపక్షుల వ్యధనుచూచి చలించిన దయార్ద్రహృదయుడు. తన బాధాపూరితభావాన్ని ఆశువుగా శ్లోకరూపంలో చెప్పిన మహాకవి. వాల్మీకియొక్క మహర్షిత్వాన్నీ, ఒక కవియొక్క ముఖంలో ప్రతిఫలించే సున్నితమైన సుకుమారమైన దార్శనికతనూ అక్కినేని పండించలేకపోయాడు. బహుశా ముసలితనం వల్ల ఆయన ముఖంలో భావవ్యక్తీకరణా సామర్ధ్యం తగ్గిపోయిందేమోలే  అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

>> బాలకృష్ణకూ శ్రీకాంత్ కూ ఒత్తులు స్పష్టంగా పలకవు. అయినా సరే డైలాగ్స్ చెప్పడానికి వాళ్ళు శ్రమించిన తీరు పరవాలేదనిపించింది. ఇలా ఎక్కడికక్కడ సర్దుకుంటూ సినిమా చూడటమే కాని శభాష్ అనిపించేలా ఒక్క సీనూ లేదు.

>> పాత్రలకు మేకప్ చేసిన తీరు చూస్తే,  పౌరాణికానికి సరిగ్గా మేకప్ చేసే ఆర్టిస్టులు ఇప్పుడు లేరేమో అన్న సందేహం కలిగింది. ముఖ్యంగా వాల్మీకి ని దగ్గరగా చూపించిన సీన్లలో అవి పెట్టుడుగడ్డమూ, పెట్టుడుమీసమూ, విగ్గూ అని స్పష్టంగా తెలిసేటట్లు మేకప్ చేశారు. ఆంజనేయుడి మూతిని కూడా మరీ కదలటానికి సాధ్యంకాకుండా బిగించి మరీ అతికించారు. ఆయన డైలాగులు చెప్పేటప్పుడు నోరు తెరవలేక పడుతున్న అవస్త స్పష్టంగా కనిపించింది. ఇలాటివి  చికాకు కలిగించాయి.

>> ఇకపోతే ఆంజనేయుడు ఒక పిల్లవాని రూపంలో వాల్మీకి ఆశ్రమంలో కోతిచేష్టలు చేస్తూ సీతమ్మ వారిని అలరిస్తూ ఉన్నట్లు చూపించడం, వినోదంకోసం సినిమాలో  చేసిన మార్పు అని సర్దుకున్నప్పటికీ, మూలకథలో లేదుకనుక అసహజంగా ఉంది. ఇలా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు మార్చడంవల్లే మన పురాణకధలు గందరగోళంగా తయారయ్యాయి. పురాణపాత్రల్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చి రావణుణ్నీ  కర్ణుణ్నీ   దుర్యోధనున్నీ హీరోలుగా చూపించే ఇటువంటి ట్రెండ్ ఎన్టీఆర్ తో మొదలైంది.

>> లవకుశలో ఘంటసాల ఇచ్చిన సంగీతానికీ ఈ సినిమాలో ఇళయరాజా ఇచ్చిన సంగీతానికీ పోలికే లేదు. ఘంటసాల సంగీతమూ అప్పటి సాహిత్యమూ తపోఫలాలుగా అనుకుంటే, ఈ సినిమా సంగీతం ఇమిటేషన్ పండ్లలాగా ఉంది.  ఎంతగా పోలిక కూడదనుకున్నప్పటికీ, ఘంటసాల కూర్చిన పాతపాటలు గుర్తురాక మానవు. ఘంటసాల బాణీలముందు ఇళయరాజా బాణీలు పేలవంగా తేలిపోయాయనే చెప్పాలి. అయితే వినగా వినగా ఇళయరాజా పాటలు కూడా బాగున్నట్లుగానే అనిపించినప్పటికీ, ఘంటసాల పాటలతో పోల్చుకుంటే చాలా నాసిరకంగా ఉన్నాయి.

>>పాటలలో వాడిన సాహిత్యం అన్నింటిలోకీ పరమచెత్త అని చెప్పవచ్చు. పాటలు ఎవరు వ్రాశారో నేను గమనించలేదు గాని, సాహిత్యం ఖూనీ అయింది అనిమాత్రం చెప్పగలను. అది గ్రాన్దికమో, గ్రామ్యమో, ఇంకేదో తెలీనంతగా ఇష్టంవచ్చిన పదాలు కలగాపులగంగా వాడుతూ వినడానికి కంపరం పుట్టించారు. పాటల సాహిత్యంలో జీవం లేదు. కృతకంగా ట్యూన్ కోసం అక్కడ ఆ పదాలను బలవంతంగా ఇరికించి  వాడినట్లుగా ఉన్నాయి.  

>> సీతాదేవిగా నయనతార అభినయం పరవాలేదు అనిపించిందిగాని, సీతాదేవి ముఖంలో పలకవలసిన భావాలు ఆమె ముఖంలో ఏమాత్రం పలకలేదు. మరీ ఎక్కువగా ఒదిగిపోయి నటించడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కన్నెసీతగా చూపించిన సీన్లలో ఆమె హావభావాలు అస్సలు అతకలేదు. పరికిణీ ఓణీ వేసినంత మాత్రాన ప్రౌఢవయస్కురాలు కన్యగా కనిపించడం కష్టమని దర్శకుడు మర్చిపోయాడు లాగుంది. పైగా జీరోసైజు కోసం డైటింగ్ చేసి ఎక్సర్సైజులూ గట్రాలూ చేసేవారి ముఖంలో లావణ్యమూ నవకమూ లోపిస్తాయి. ముఖం ఎండిపోయినట్లుగా, జీవం లేనట్లుగా తయారౌతుంది. ఎంత మేకప్ చేసినా జీవకళ లోపం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా కొన్ని క్లోజప్ షాట్లలో ఆమె నవ్వినపుడు అస్తిపంజరం నవ్వినట్లు అనిపించింది. శ్రీరాముని పాత్ర ఎవరైనా చెయ్యవచ్చు. కాని సీతాదేవి పాత్ర చెయ్యటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖంలో దేవతాభావం, కళ్ళలో పవిత్రతాభావం ప్రతిఫలించాలి. గ్లామర్ పాత్రలకు అలవాటుపడ్డ నయనతార, తన కళ్ళల్లో ముఖంలో పవిత్రతాభావాన్ని పలికించటంలో  పూర్తిగా విఫలం అయింది. నీరసంగా నవ్వినంత మాత్రాన ముఖంలో దైవత్వం కనిపించదు  అన్నది వీళ్ళు తెలుసుకోవాలి.

>> బాలయ్యా, మురళీమోహన్ వంటి సీనియర్ నటుల డైలాగ్ డెలివరీ చాలా అసహజంగా బట్టీపట్టి పట్టిపట్టి ఒప్పజేప్పినట్లు ఉంది. వాళ్ళకు సరిగా అతకని పెట్టుడుపళ్ళసెట్లు ఉన్నాయేమో అని అనుమానం వచ్చింది.

>> ఇకపోతే, సీతాదేవి భూప్రవేశం అడివిలో జరగలేదు. వాల్మీకం ప్రకారం అది సభామధ్యంలో జరిగింది. జైమినిమహర్షి ప్రకారం అసలు జరగనేలేదు. లవకుశలో చూపినట్లు మక్కీకిమక్కీగా ఈ సినిమాలోనూ చూపబోయారు. కాకపోతే నేటి టెక్నాలజీ ఉపయోగించి గ్రాఫిక్స్ బాగా వాడుకున్నారు. నేను లవకుశ చూడలేదు. చాలా చిన్నప్పుడు ఒకటి రెండు సంవత్సరాల వయసులో చూసానేమో గుర్తులేదు. మొన్న యూట్యూబ్ లో లాస్ట్ సీన్ మాత్రం చూశాను.  

>> సీతాదేవి రామబాణాన్ని పూజించడమూ  అదోచ్చి రామ-కుశుల యుద్ధాన్ని ఆపడమూ వంటి కృతకఘట్టాలు ఏమాత్రం అలరించలేకపోయాయి. తన సృజనాత్మకతను దర్శకుడు ఇలాకాకుండా వివిధ రామాయణాలలో ఉన్న ఘట్టాలను రీసెర్చిచేసి ఒక గొప్ప కళాఖండాన్ని నిర్మించడంలో చూపించి ఉంటె ఇంకా బాగుండేది. 

>> మొత్తం మీద రామాయణంమీదా, ఇంకా ఘట్టిగా చెప్పాలంటే సీతాదేవియొక్క ఔన్నత్యంమీదా ఉన్న భక్తీగౌరవాల కొద్దీ ఈసినిమాను చూడవచ్చు. అంతేగాని పెద్ద గొప్పగా ఏమీలేదు. నేను లవకుశ చూడలేదు కాబట్టి దానితోపోల్చి ఈ సినిమాను చూడలేకపోయాను. కాకపోతే లవకుశ పాటలు చిన్నప్పటినుంచి విన్నాను.

>>  బాలకృష్ణ బాగా కష్టపడి జాగ్రత్తగా నటించాడు. అయితే దగ్గర్నించి అతన్ని చూడలేం. వయసుమళ్ళిన చాయలు స్పష్టంగా కనిపించాయి. అదీగాక క్లోజప్ షాట్లలో నీలి మందుడోసు మరీ ఎక్కువైనట్లుంది. లాంగ్ షాట్లు పరవాలేదు.
లవకుశులుగా పిల్లలనటన బాగుంది. బాలహనుమంతుడి నటనా బాగుంది. ఇంతమంది సీనియర్ నటులు నటించిన ఈ సినిమాలో పిల్లల నటన మాత్రమే బాగుంది  అని చెప్పుకోవాల్సి రావడం బాధాకరం.

ముఖ్యంగా నేటికాలంలో ఇలాటి సినిమా తియ్యాలన్న సాహసంచేసిన నిర్మాత ఒక్కడే ఈచిత్రం మొత్తానికీ అభినందనీయుడు.
read more " శ్రీరామరాజ్యం "

5, డిసెంబర్ 2011, సోమవారం

అభీ నా జావో ఛోడ్ కర్

మొన్నొకసారి స్కైప్ మీటింగ్ లో మిత్రులతో అన్నాను గోచారరవి నీచరాహువు దగ్గరకి వచ్చినపుడు ప్రముఖుల మరణం సంభవిస్తుంది,అని. ఇంకా అనేక విషయాలు సంభవించవచ్చు అని కూడా అనుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం వంటివి. కాని విధి విచిత్రం కాకపోతే, దేవానంద్ మరణం కూడా ఇప్పుడే జరగాలా?

మనకున్న సమాచారాన్ని బట్టి దేవానంద్ 26 -9 -1923  న గురుదాసపూర్ లో పుట్టాడు. ఆయన జన్మసమయం తెలియదు. అందుకని చంద్రలగ్నాత్ జాతకాన్ని చూద్దాం. ఈయన రేవతీనక్షత్రంలో పుట్టాడు. రేవతీనక్షత్ర జాతకులకు ప్రస్తుతం అష్టమశని జరుగుతున్నది. అష్టమశని అనేది చెడుకాలం అని ఇంతకుముందు పోస్ట్ లో వ్రాశాను. ఈయనకు ప్రస్తుతం 88 ఏళ్ళు. ఎనిమిదో అంకె శనియొక్క ఆధీనంలో ఉంటుంది. 88 అంటే డబల్ శనిప్రభావం అనుకోవచ్చు. ఈ సమయంలోనే మరణం ఆయన్ను వరించింది.

కన్యారాశిలో ఉన్న బుధశుక్రులయుతి అనేది ఈయన జాతకంలో ఒక విచిత్రయోగం. కన్యారాశి బుధునికి ఉచ్చస్తితినీ, శుక్రునికి నీచస్తితినీ ఇస్తుందని మనకు తెలుసు. శుక్రుడు కళత్రకారకుడేకాక, ప్రేమవ్యవహారాలకు కారకుడనీ మనకు తెలుసు. ఈ శుక్రుని నీచస్తితివల్లనే తాను అమితంగా ప్రేమించిన సురయాను పెళ్లిచేసుకోలేక పోయాడు. శుక్రునినీచత్వం, చంద్రునినుంచి బుధుని యొక్క కేంద్రస్తితివల్ల రద్దుఅయిందని అనుకోవచ్చు. కాని ఇది పూర్తిగా నిజంకాదు. ఎందుకంటే బుధుడు వక్రస్తితిలో ఉండి బలహీనుడుగా ఉన్నాడు. కనుక శుక్రునియొక్క నీచత్వాన్ని బుధుడు పూర్తిగా రద్దు చెయ్యలేడు. అందుకే శుక్రునియొక్క దుష్టప్రభావం ఇతని జీవితంలో అలా పనిచేసింది. ఇతనికి ఒక రొమాంటిక్ హీరో ఇమేజినీ ఇదే ఇచ్చింది. భగ్నప్రేమనూ, బాధాతప్తహృదయాన్నీ ఇదే ఇచ్చింది. ఈ బుధశుక్రులకలయిక ఇతనిజాతకంలోని  "కార్మిక్ సిగ్నేచర్" అని చెప్పవచ్చు. 

ఇతని జీవితంలోని ప్రతిఘట్టంలోనూ ఈగ్రహయుతి ప్రభావం కనిపిస్తుంది. ఈయన వ్రాసుకున్న " రొమాన్సింగ్ విత్ లైఫ్" అనేపుస్తకం పేరుకూడా బుధశుక్రుల ప్రభావానికి అతీతంగా ఏమీలేదు. రొమాన్స్ శుక్రుని ఆధీనంలోనూ, ఓపెన్ గా మాట్లాడటం బుధుని ఆధీనంలోనూ ఉంటుందని మనకు తెలుసు. అందుకే ఆ పుస్తకం పేరుకూడా అలా పెట్టబడింది. ఈ విధంగా జీవితంలో ఒకరు చేసే ప్రతిపనీ గ్రహాధీనంలోనే ఉంటుంది. మన సొంతంగా మనం చేస్తున్నాం అనుకునేపని వెనుకకూడా మనకు తెలీని శక్తులప్రభావం ఉంటుంది. ఇదే గ్రహప్రభావం వల్ల, తనజీవితంలో ఎంతమంది అమ్మాయిలతో తానుప్రేమలో పడిందీ దేవానంద్ బాహాటంగా చాలాసార్లు చెప్పేవాడు. 

ప్రస్తుతం గోచారశుక్రుడు రాహువునుదాటి ముందుకు వచ్చాడు. 14 -11 -11  న శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నప్పటినుంచీ ఈయనగానీ ఈయనసతీమణి గానీ అనారోగ్యంతో బాధపడుతూ ఉండాలి అని నాఊహ. కాని జాతకబలం వల్ల గోచారసూర్యుడు రాహువుతోకలిసి బాగా దగ్గరకు వచ్చేవరకూ మరణం దూరంగా వేచిచూచింది. ఈయన రవివారంరోజున రవిహోరలో కన్నుమూయడం ఒకవిచిత్రం. రవి గుండెకు కారకుడని మనకు తెలుసు, రాహువు నిద్రకు కారకుడు. కనుక రవివారంనాడు, రవిహోరలో, గోచారసూర్యుడు రాహువుకు బాగాదగ్గరగా ఉన్నప్పుడు నిద్రలో గుండెపోటుతో తనువు చాలించాడు.

అష్టమశనికి తోడు, గోచారరవిబుధులు నీచరాహువుకు బాగాదగ్గరగా వచ్చారు. రాహువు విదేశాలకు కారకుడు. అందుకే విదేశం అయిన లండన్లో మరణాన్ని ప్రసాదించాడు. అంతేకాక  రవిబుధులు వృశ్చికం 17 డిగ్రీ మీద కంజంక్షన్లో ఉన్నారు. వృశ్చికం 17 డిగ్రీ అంటే నవాంశలో ధనుస్సు అవుతుంది. జైమినిమహర్షి ప్రకారం ధనురాశి హటాత్ పరిణామాలకూ, ఉన్నతస్థానంనుంచి  పతనానికీ కారణం అవుతుంది. ప్రస్తుతం అదే జరిగింది.

నవంబర్ 15  న శనిభగవానుడు తులారాశికి మారినప్పటి నుంచీ రేవతీనక్షత్రజాతకులకు అష్టమశని ప్రభావంవల్ల అనేక బాధలు మొదలయ్యాయి. ఈ బాధలనేవి ఆయా జాతకుల దశాభుక్తులను బట్టి, వారివారి వయస్సును బట్టి జరుగుతుంటాయి. ప్రస్తుతం దేవానంద్ 88 ఏళ్ల వృద్ధుడు. ముసలివయసులో శనిగోచారం ప్రమాదకరమైనది. కనుక అష్టమశని ఈయనకు దేహబాధల నుంచి విముక్తి ప్రసాదించింది. జీవితమనే స్టేజిమీదనుంచి గ్రీన్ రూం లోకి  తీసుకెళ్ళింది. మళ్ళీ కొత్తమేకప్ వేసుకుని ఇంకోకొత్తవేషంలో ఎక్కడో ఏదోనాటకంలో ఇంకోపాత్ర ధరింపచేయడానికి భగవంతుడు ఆయన్ని తీసుకెళ్ళాడు. 


జీవకారకుడైన జననగురువుపైన కర్మకారకుడైన గోచారశని సంచరించడం మరణసూచకం (సరైన దశలు నడుస్తుంటే). నాడీజ్యోతిష్యంలో ఇదొక రహస్యం. ప్రస్తుతం దేవానంద్ జాతకంలో అదే జరిగినట్లుంది.

ఈ రహస్య విశ్వప్రణాళికలో, తన కర్మానుసారం చేరవలసిన సరైనచోటుకి, దేవానంద్ ఆత్మ చేరుతుందని ఆశిద్దాం.   
read more " అభీ నా జావో ఛోడ్ కర్ "

30, నవంబర్ 2011, బుధవారం

Yoga is the work of devil

మొన్న డెక్కన్ క్రానికల్ లో ఒకవార్త ప్రముఖంగా ప్రచురించబడింది. గాబ్రియేల్ అమోర్త్ అనే 80 ఏళ్ల వాటికన్ వృద్ధమాంత్రికుడు చెప్పినదాని ప్రకారం యోగా అనేది సైతానుయొక్క సృష్టిట. ఇది చదివి, నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇంత వయసొచ్చినా ఆయనగారి జనరల్ నాలెడ్జి స్థాయి అలా ఉందంటే, ఇక ఆయనగారి IQ ఏస్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. బహుశా దానికి తగిన మాంత్రికుడి ఉద్యోగమే ఆయనకు దక్కినట్లుంది. ఆయనకు మతి పూర్తిగా భ్రమించిందని నా నమ్మకం.

జీవితమంతా 'లేని' దయ్యాలను వదిలించేపనిలో ఉంటూ, పిచ్చి క్రైస్తవులను మోసం చేసే పనిలో కాలం గడుపుతున్న ఆయనకు క్రైస్తవంకాని ప్రతీదీ సైతాన్ లాగా కనిపించడం ఆశ్చర్యం ఏమీలేదు. ఒకసారి బ్రహ్మంగారు సిద్ధయ్యను ఇలా అడిగారట. "సిద్దా, ప్రపంచం ఎలా ఉందిరా?". "మనం ఎలా చూస్తే అలా ఉంది గురువుగారు" అని సిద్దయ్య సమాధానం చెప్పాట్ట. దీన్నే మన హిందూమతంలో "యద్భావం తద్భవతి" అంటారు. ఏదైనా మన దృక్కోణాన్ని బట్టే మనకు కనిపిస్తుంది. అంటే ఇరవైనాలుగ్గంటలూ మనం దేన్నయితే తలుస్తామో అదే మనం అయి కూచుంటాం. ఈ వృద్ధమాంత్రికుడు ఎప్పుడూ సైతాన్ ధ్యానంలో ఉండటంవల్ల ఆయనకు ప్రతిదీ సైతాన్ చర్యలాగే కనిపిస్తుంది. ఇదేమీ విచిత్రం కాదు. సైతాన్ ధ్యానం మానేసి హిందూ మతమో, బౌద్ధమో నేర్పే ధ్యానం ఈయన నేర్చుకుంటే బాగుంటుంది.

క్రైస్తవం మొదట్నించీ క్రీస్తు యొక్క బోధనలను వక్రీకరిస్తూనే వచ్చింది. అసలైన క్రీస్తుబోధనలు సెయింట్ పాల్ చేతిలో పూర్తిగా వక్రీకరించబడ్డాయి. ముఖ్యంగా క్రైస్తవాన్ని గట్టిగా ప్రోమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా, క్రైస్తవం కాని ప్రతివిషయాన్నీ సైతాన్ కు అంటగట్టే ప్రయత్నం గత రెండువేల ఏళ్లుగా జరిగింది. ఆ క్రమంలో భాగంగా, అనేక ఇతరమతాలనూ, వాటి జ్ఞానసంపదనూ కాలగర్భంలో కలిపింది క్రైస్తవం. క్రీస్తుపూర్వంనుంచీ ఉన్న ఎంతో జ్ఞానసంపద ఈ అజ్ఞానపూరితచర్య వల్ల నాశనమై పోయింది. ఎందఱో జ్ఞానఖనులను "విచ్చ్ హంట్" పేరుతో సజీవదహనం చేసిన ఘనచరిత్ర క్రైస్తవానిది. తనకు అర్ధంకాని ప్రతీదీ సైతానే అనుకోవడం క్రైస్తవానికీ ఇస్లాంకూ ఉన్నఅనేక దుర్లక్షణాలలో ఒకటి.

"యోగా" అనేది భారతీయ షడ్దర్శనాలలో ఒకటి. అంటే భగవంతుని చేరుకునే ఆరువిధానాలలో "యోగదర్శనం" ఒకటి అని మన హిందూమతం చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహనీయులైన అందరు ప్రవక్తలూ యోగులే. "యోగం" అనే మాటలోనే " కలపడం " అనే అర్ధం ఉంది. వ్యక్తిని దేవునితో కలిపేదే యోగం. వ్యష్టిని సమిష్టితో కలిపేదే యోగం. పరిమితమైన వ్యక్తిత్వాన్ని విశ్వవ్యాపకచైతన్యంతో కలిపేదే యోగం. యోగం అనేమాటకు ఉన్న అర్ధం ఇలా ఉంటె, వృద్ధమాంత్రికుడు అలా చెప్పడంలో అర్ధం ఏమిటో ఆ సైతాన్ కే తెలియాలి. బహుశా సైతానే ఆ విధంగా అతనిచేత పలికించి ఉండవచ్చు.

అసలు సైతాన్ (devil) అనేదే ఒక కల్పితజీవి. సైతాన్ అనేది అసలు లేనేలేదు. There is no devil anywhere at all. ఎందుకంటే, సెమిటిక్ మతాలు చెప్పే సైతాన్ అనేది నిజంగా ఉంటే, అది దేవుణ్ణి అపహాస్యం చెయ్యడమే అవుతుంది. సైతాను ఉన్నదీ అంటే అది దేవునికి ప్రశ్నార్ధకమే. సైతాన్ని తన సృష్టిలో అసలెందుకు ఉండనిస్తున్నాడు దేవుడు? అన్న ప్రశ్నకు ఈ మతాల వద్ద జవాబు లేదు. దీనికి మనమే జవాబు చెప్పుకుందాం. 

ఒకటి -- దేవునికంటే సైతాన్ కు ఎక్కువ శక్తి ఉండి ఉండాలి. అప్పుడే అది దేవుణ్ణి ధిక్కరిస్తూకూడా ఆయన సృష్టిలో మనుగడ సాగించగలుగుతుంది. 

రెండు -- సైతాన్ తనసృష్టిలో ఉండి మానవుల్ని హింసపెట్టడం దేవునికి ఇష్టం అయ్యి ఉండాలి. అందుకని దాని ఆగడాలని ఆయన చూచీచూడనట్లు ఊరుకుంటూ ఉండి ఉండాలి. పై ప్రశ్నలకు ఇవి రెండుతప్ప వేరే లాజికల్ కారణాలు ఉండటానికి వీల్లేదు. అయితే ఈ జవాబుల  వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్తితులు తలెత్తుతాయి.

మొదటి కారణం నిజమైతే, మనుషులు దేవుణ్ణి పూజించడం మానేసి సైతాన్నే పూజించడం మంచిది. ఎందుకంటే సైతాన్ తో పోలిస్తే శక్తిహీనుడైన దేవుణ్ణి పూజించి ఉపయోగం ఏముంది? సైతాన్ని ఏమీ చెయ్యలేక తన సృష్టిలో ఉండనిస్తున్న దేవుడు దాని బారినుంచి మనల్ని ఎలా కాపాడగలడు? కాపాడలేడు. కనుక దేవుని పూజించడం అనవసరం.

లేదా రెండోకారణం నిజం అనుకుంటే, కుట్రపూరితంగా సైతాన్ని తనసృష్టిలో ఉండనిస్తూ, దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటూ, చెడునంతా దానిమీదకు తోసి, మంచినంతా తాను హస్తగతం చేసుకుంటున్న అటువంటి దేవుణ్ణి పూజించి ఉపయోగం ఏమిటో మనం ఆలోచించాలి. ఇటువంటి కుట్రలుచేసే దేవుడు అసలు దేవుడేకాడు. కనుక ఎలాచూచినా దేవుడికి పరువు పోవడం ఖాయం.

సైతాన్ ఉన్నదీ అంటే, అది దేవుణ్ణి తక్కువ చెయ్యడమే అవుతుంది. కనుక సైతాన్ అనేది అస్సలు లేనేలేదు. అది క్రైస్తవుల సృష్టి. అంతేకాని దేవుని సృష్టి కాదు. గేబ్రియల్ అనేవాడు మొదట దేవదూత అనీ, తర్వాత అతడు దారి తప్పి, దేవునికి ఎదురుతిరిగి , సైతాన్ గా మారాడనీ క్రైస్తవ కధనం. కాని దేవదూత అయినవాడు అసలు ఎలా దారి తప్పగలడు? దేవుని సంకల్పం లేకుండా, అతని మనసులో ఎదురుతిరగాలనే ఆ బీజం ఎలా పడింది? కనుక దేవదూత సైతాన్ గా మారడానికి దేవుడే కారణమా? అని అడిగితే వారు సమాధానం చెప్పలేరు. ఒకవేళ గాబ్రియేల్ డెవిల్ గా మారాడు అనుకున్నప్పటికీ, అతనిలోని చెడును ఖండించి వెంటనే అతన్ని మళ్ళీ దేవదూతగా దేవుడు ఎందుకు మార్చలేకపోయాడు? అంటే, దేవుడు అతని ఖర్మకు అతన్ని వదిలేశాడా? తన దూత పాడైపోతుంటే బాగుచేసుకోలేనివాడు ప్రపంచాన్ని ఎలా రక్షించగలడు? ఈ ప్రశ్నలకు బైబిల్లో ఎక్కడా జవాబులు లేవు.

జవాబు చెప్పలేని ప్రశ్నలు అడగటం మహాపాపం అని ముద్రవేసి, ఇలా ప్రశ్నించిన వారిని దైవద్రోహులుగా పరిగణిస్తే  చాలా సింపుల్ గా సమస్య పరిష్కారం అవుతుంది. కనుక ప్రశ్నించడాన్ని క్రైస్తవం మొదటినుంచీ అణగదొక్కుతూ వచ్చింది. "నోర్మూసుకుని మేము చెప్పింది నమ్ము" అన్నదే మొదట్నుచీ వారి సిద్ధాంతంగా ఉంటూ వచ్చింది. అలా నోరెత్తకుండా నమ్మేవారి దగ్గర ఎలాటి కాకమ్మకబుర్లైనా చెప్పి నమ్మించవచ్చు. ఎందుకంటే అసలు పునాదే "నమ్మకం" అయినప్పుడు, ప్రశ్నించడం "దైవద్రోహం" అయినప్పుడు నోరెత్తకుండా అలా ప్రతిదాన్నీ నమ్మేవారిదగ్గర మతప్రచారకుల ఆటలు బ్రహ్మాండంగా సాగుతాయి. కనుక రెండువేల ఏళ్లనుంచీ వారిప్రచారం ఇదే పంధాలో సాగింది. చాలామంది అమాయకుల్ని మోసం చేసింది. సెమెటిక్ మతాలలో ప్రశ్నించడానికి తావు లేదు. వారు చెప్పింది గుడ్డిగా నమ్మటమే దారి. కాని హిందూమతం దీనికి పూర్తిగా వ్యతిరేకం. హిందూమతంలో ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తారు. తర్కం అనేది భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒక వరంగా భావిస్తారు.

సైన్సు కూడా సైతాన్ సృష్టే అని మధ్యయుగాలలో ఇదే క్రైస్తవప్రచారకులు చాలాకాలం ఊదరగొట్టారు. భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్లో ఉంది గనుక-- " బైబిల్లో ఉన్నది అబద్దం. భూమి అలా లేదు, అది గోళాకారంలో ఉంది  మొర్రో" అని మొత్తుకున్న గెలీలియోను చిత్రహింసలు పెట్టారు. ప్రపంచానికి భూమికేంద్రంగా ఉంది అని బైబుల్ చెప్పింది గనుక -- "అది వట్టి అబద్దం. ప్రపంచానికి భూమి కేంద్రం కాదు. సూర్యుడు కేంద్రంగా  ఉంటె, అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి" అని చెప్పిన కోపర్నికస్ ను చిత్రహింసలు పెట్టిందీ ఈ క్రైస్తవులే. "సైన్స్ సైతాన్ సృష్టి" అని మధ్యయుగాల్లో చర్చి అధికారగణం ఎంత మొత్తుకున్నా సైన్స్ పురోగతి ఆగలేదు. అందుకని కొన్నాళ్ళు పోయాక ఆవాదన మానుకున్నారు. ఇప్పుడు హిందూమతం మీదా ఇదే ప్రచారం మొదలు పెట్టారు.

"యోగా" అనేది  ఎవరు ఆపినా ఆగకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది . దాని యొక్క మహత్యాన్ని లోకమంతా ఇప్పుడు గుర్తిస్తోంది. ఇదే వాటికన్ కు దడ పుట్టిస్తున్న విషయం. ఎందుకంటే యోగాతో బాటు హిందూమతానికి చెందిన "కర్మ", "జ్ఞానం", "భక్తి", "ముక్తి"  లాంటి కొన్ని  పదాలూ అందరికీ తెలుస్తాయి. "పునర్జన్మ" వంటి కాన్సెప్టులూ తెలుస్తాయి. ఈవిధంగా మెల్లిగా హిందూమతం యొక్క పరిజ్ఞానం అందరికీ తెలుస్తుంది. హిందూమతంలో ఉన్న జ్ఞానసంపదనూ, విశాలదృక్పధాన్నీ ఒక్కసారి చవిచూచినవారు ఇక ఇతర మతాలుచెప్పే అబద్దాలు ఎంతమాత్రం నమ్మరు. అప్పుడు ఈ ప్రచారకుల ఆటలు సాగవు. కనుక ఎలాగైనా యోగాని నిరోధించాలి. నిషేధించాలి. ఎలా? దానికి ఒకటే మార్గం. యోగా అనేది సైతాను సృష్టి అని ఊదరగోడితే పని సులువుగా అవుతుంది. ఇదీ వీరి ప్లాన్.

కాని వీరికి తెలియని విషయం ఒకటుంది. ప్రాచీన కాలంలో ఎవరి దేశంలో ఎవరిమతంలో వారుండేవారు. కారణమేమంటే అప్పుడు కమ్యూనికేషన్ ఇంతగా లేదు. లోకంలో ఎన్ని దేశాలున్నాయో, ఎన్ని మతాలున్నాయో చాలామందికి అప్పుడు తెలియదు. అప్పుడంతా ఈ క్రైస్తవ ప్రచారకుల దగాకోరు ప్రచారాలు అమాయకుల దగ్గర సాగాయి. కాని ఇప్పుడలా కాదు. ఇప్పుడు ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇతర మతాలను గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు చాలా తేలిక. అలాటి తులనాత్మక అధ్యయనం చేసేవారికి అనేక  కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పటివరకూ వారు ఎంత భ్రమల్లో ఉన్నారో తెలుస్తుంది. ఇతర మతాలకు పట్టుకున్న భయం అదే.

హిందూమతంలో ఉన్న అద్భుతమైన సత్యాలను తెలుసుకునేవారి మానసికపరిధి క్రమేణా విస్తృతం అవుతున్నది. అందులో ఉన్న యోగావంటి ఆచరణాత్మక విషయాలు ప్రపంచదృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ ను నివారించడానికి గాబ్రిఎల్ అమోర్త్ లాంటివారు అప్పుడప్పుడూ ఇలాటి హాస్యాస్పద వ్యాఖ్యలుచేస్తూ నవ్వుల పాలౌతుంటారు. తెలియనివారు ఈ మాటలు నమ్మవచ్చు. కాని స్వల్పంగానైనా జెనెరల్ నాలెడ్జి ఉన్నవారు ఇటువంటి ప్రచారం ఎంతమాత్రమూ నమ్మరు.

యోగా అనేది దేవుడు మనిషికిచ్చిన అద్భుతమైన వరం. మానవుడు దేవతగా మారడానికి "యోగా" రాజమార్గం. ప్రపంచానికి మనదేశం ఇచ్చిన అనేక బహుమతుల్లో యోగా ఒకటి. అంతెందుకు జీసస్ క్రీస్ట్ కూడా భారతదేశంలో నివసించి ఉన్నతమైన యోగసాధనలు నేర్చుకున్నవాడే. దాని ద్వారా సిద్దుడైనవాడే. దీనికి చాలా ఆధారాలున్నాయి. అయితే ఈసంగతి క్రైస్తవులు ఒప్పుకోరు. ఒప్పుకుంటే జీసస్ స్థాయి దిగిపోతుంది కదా మరి! అందుకని సత్యానైనా భూస్తాపితం చేస్తారు. ఇది వారికి వెన్నతో పెట్టిన విద్యే కదా!!

ఒక విషయాన్ని మనం ఒప్పుకోనంత మాత్రాన అది అబద్దం అయిపోదు. అది వేరే విషయం. కనుక, సంకుచిత దృక్పథాన్ని వీడి, యోగాభ్యాసం చేస్తే ఏమి జరుగుతుందో వృద్ధమాంత్రికుడు తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు. ఆచరించి చూడాలి. అప్పుడు ఇలాటివాళ్ళు తమ అభిప్రాయాన్ని తప్పక మార్చుకుంటారు. అప్పుడు మాత్రమె యోగా అనేది సైతాన్ సృష్టి కాదనీ, దేవుడు మానవాళికిచ్చిన అద్భుతమైన వరాలలో "యోగా" ఒకటి అనీ తెలుస్తుంది.

క్రైస్తవాన్ని ఇతరులకు బోధించడం కాదు. ముందుగా దానిని ఆచరించడం క్రైస్తవులు నేర్చుకోవాలి. Judge not, so that you shall not be judged. అని కొండమీద చేసిన ప్రసంగం (Sermon on the mount) లో క్రీస్తు చెప్పాడు. దానిని ఆచరిస్తే, ఎదుటివారిమీద బురదజల్లుడు కార్యక్రమం    ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. క్రీస్తుయొక్క ఇలాటి నిజమైన బోధనలను "ఆచరించే" మంచిబుద్ధిని గాబ్రిఎల్ అమోర్త్ లాటి   కుహనా క్రైస్తవులకు ఈశ్వరుడు ప్రసాదించుగాక !!
read more " Yoga is the work of devil "

27, నవంబర్ 2011, ఆదివారం

తిరుపతి ప్రయాణంలో -2

మర్నాడు ఉదయమే లేచి VIP break లో దర్శనం చేసుకోవడం జరిగింది. దేవాలయంలోనుంచి బయటకు వచ్చి, పడుతున్న వాన తుంపరలో నడుస్తూ,పిల్లలు అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలు చెప్తూ,గెస్ట్ హౌస్ కు చేరుకున్నాం. 

"నాన్నా. రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతప్రవర్తకుడు అని నిన్న చెప్పావు కదా. అసలు త్రిమతాలైన ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల యొక్క మౌలిక బోధనలు ఏమిటి? అసలు ఇన్ని రకాల సాంప్రదాయాలు ఎందుకు?"అని పిల్లలు అడిగారు. వారి వయసుకు మించిన జిజ్ఞాసకు ముచ్చట అనిపించింది.

" చెప్తాను. శ్రద్ధగా విని అర్ధం చేసుకోండి" అంటూ ఇలా చెప్పాను.

"వేదాంతము ముఖ్యంగా జీవుడు, జగత్తు, బ్రహ్మము అనే మూడు విషయాలను చర్చిస్తుంది. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని త్రిమతాచార్యులు దర్శించిన భేదాలవల్ల ఆయా సిద్ధాంతాలు ఒకదానికొకటి భిన్నములుగా దర్శనం ఇస్తాయి.

జీవుడు అంటే జీవాత్మ. ఈ జీవాత్మలు కోటానుకోట్లు ఉన్నాయి. పెద్ద అగ్నిగుండం లోనుంచి బయటకు వచ్చే నిప్పురవ్వలలాగా ఇవి ఉంటాయి. జగత్తు అంటే మనకు కనిపించే ప్రపంచం. వేదాంతంలో చెప్పబడే బ్రహ్మాన్నే మనం భగవంతుడు అనీ, దేవుడు అనీ, సామాన్యభాషలో పిలుస్తాం.

జీవుడూ, జగత్తూ, బ్రహ్మమూ వేరువేరుగా అనాదిగా ఉంటున్నాయి. ఇవి మూడూ ఎప్పటికీ విడివిడిగానే ఉంటాయి. వీటికి మూడింటికీ ఎప్పటికీ నాశనం లేదు. జీవుడు ఈ జగత్తులో భక్తిభావంతో ఉంటూ పూజ, అర్చన, జప తపాదులద్వారా బ్రహ్మాన్ని ఉపాసించాలి. ఇది ద్వైతవాదం. దీన్ని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. పాపులర్ హిందూమతం అంతా ఈ స్థాయికి చెందినదే. అంతేకాక దాదాపుగా సామాన్యజనాలు అనుసరించే  అన్ని మతాలూ, ఆచరణలూ, ఈ స్థాయిలోనో ఇంకా తక్కువ స్థాయిలోనూ  ఉంటాయి. 

జీవునిలో బ్రహ్మముయొక్క అంశ ఉంటుంది. జగత్తుకూడా బ్రహ్మము యొక్క అంశమే. బ్రహ్మము చేత సృష్టించబడిన ఈ జగత్తులో, జీవుడు శరణాగతతత్వంతో భక్తిమార్గంలో నడుస్తూ, చివరకు బ్రహ్మములోని ఒకఅంశముగా మారాలి.ఇది విశిష్టాద్వైత తత్త్వం. ఇది రామానుజాచార్యుల మతం.   

జగత్తు అనేది నిజానికి ఒక భ్రమ. అది ఎప్పుడూ లేదు. జీవుడూ బ్రహ్మమూ ఒకదానికొకటి వేరువేరు కాదు. జగత్తు ఉంది అనుకోవడమూ,జీవుడూ బ్రహ్మమూ వేరు అనుకోవడమూ మాయ. సాధనవల్ల ఈ మాయ తొలగినప్పుడు  సత్యం బోధపడుతుంది. ఇది అద్వైతవాదం. దీనిని శంకరాచార్యులు ప్రతిపాదించారు.

కొన్ని శతాబ్దాలుగా వీరి అనుచరుల మధ్య, ఈ సిద్ధాంతాల మీద రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఒకరిని చూస్తె ఒకరికి పడకపోవడమూ, ఒకరి కుటుంబాలలో ఇంకొకరు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడమూ, బంధుత్వాలు ఉండకపోవడమూ ఇత్యాదులు తరతరాలుగా ఉంటున్నాయి. నా దృష్టిలో ఇదొక పనికిమాలిన పిచ్చితనం. 

ఈ సిద్ధాంతాలలో ద్వైతం అనేది చాలా సులభంగా అందరికీ అర్ధం అవుతుంది. అనుసరించడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎందుకంటే, దేవుడు సర్వశక్తివంతుడు.మనిషి అల్పుడు.మన కష్టాలు తీర్చమని మనం దేవుణ్ణి ప్రార్దిస్తాం. వరాల కోసం అర్దిస్తాం. పూజా పునస్కారాలు చేస్తాం. ద్వైతం ఇంతవరకే అర్ధం చేసుకుంటుంది. మామూలుస్థాయిలో ఉండే సామాన్యజనానికి ద్వైతం బాగా నప్పుతుంది. నిజానికి ప్రపంచంలో ఉన్న అన్నిమతాలూ, అవి దేవుణ్ణి నమ్మేవైతే, ద్వైతసిద్ధాంతం క్రిందకే వస్తాయి. దీనికంటే ఇంకొంచం పైది విశిష్టాద్వైతం. ఇందులో జీవుడు భగవంతుని అంశగా మారగలడు అని భావిస్తారు. ఇదీ చాలామందికి బాగానే నచ్చుతుంది. శరణాగత భావంతో, భగవత్ ప్రసాదంగా ప్రపంచాన్ని అనుభవించవచ్చు అని వీరు భావిస్తారు. ఇదీ మంచిదే. ఇకపోతే అద్వైతం ఇంతకంటే పై స్థాయికి చెందినది. అందులో జీవుడూ దేవుడూ అన్న భేదానికి తావే లేదు. జగత్తుకు అసలు ఉనికే లేదు. ఇది చాలా కష్టసాధ్యం. ఊహక్కూడా దుర్లభం. అందుకే ఈ స్థాయిని అందరూ అందుకోలేరు. అద్వైతులమని చెప్పుకునేవారుకూడా ఈ స్థాయిని అందుకోలేరు. కాని ఇది అత్యున్నతమైన ఒక అనుభవస్తితిని ప్రతిపాదిస్తున్నది. కనుక ఇదీ సత్యమే.

నిజంగా చూస్తే, ఈ మతానుయాయుల మధ్యన ఉన్న స్పర్ధలు అసలు అనవసరమైనవి. వీరితో వచ్చిన చిక్కేమిటంటే వీరిలో ప్రతిఒక్కరూ వారి సిద్ధాంతమే అంతిమసత్యం అనుకున్నారు. జీవుడు దేవునితో ఏ నాటికీ సమానుడు కాలేడని మొదటి రెండు వర్గాలూ భావిస్తాయి. అసలు అలా భావించడమే మహాతప్పుగా వారు తలుస్తారు. అద్వైతంలో అలాటి అపరాధభావన ఏమీ ఉండదు. జీవబ్రహ్మైక్యాన్ని తెలుసుకోవడమే సార్ధకత అని వారు తలుస్తారు.

శ్రీరామకృష్ణులు ఈ మూడుమతాల మధ్యనా ఉన్న గొడవలను చాలా సులభంగా పరిష్కరించారు. ఇవి మూడూ సాధనామార్గంలో మూడుమెట్లని ఆయన చెప్పారు. ఇవి మూడూ పాక్షికసత్యాలే. ఏ మెట్టులో ఉన్నవారికి ఆ మెట్టే చివరిమెట్టుగా అనిపిస్తుంది. కాని నిజానికి ప్రయాణంలో అదొక మజిలీ మాత్రమే. ఈ మూడుస్తాయిలే కాకుండా వీటిని మించిన ఇంకా అనేక పై స్తాయిలున్నాయని శ్రీరామకృష్ణులు చెప్పారు. నిజానికి ఈ మూడు సిద్ధాంతాలూ, వాదాలకు ప్రతివాదాలకు పనికొచ్చే సిద్ధాంతచర్చా విషయాలు కానేకావు. ఇవి సాధనలో అనుభవంలోకి తెచ్చుకోవలసిన విషయాలు. సాధన చేసేవారికి ఇవి అనుభవంలోకి వస్తాయి. అలాకాకుండా ఊరకే సిద్ధాంతాలు చదివి, చర్చలు చేసి, గొడవలు పడే పండితులకు ఉత్త అహంకారమే మిగులుతుంది. 

ఉన్నతమైన అద్వైతస్తితిలో ఒక మనిషి ఎల్లకాలమూ ఉండటం అందరికీ సాధ్యం కాదు. కనుక అద్వైతానుభవాన్ని పొందినతర్వాత కూడా చాలామంది మానవులు క్రిందిస్తాయిలలోకి దిగివచ్చి విశిష్టాద్వైత స్తాయిలోనో, లేక ద్వైతస్తాయిలోనో ఉంటూ ఈ జగత్తు తోనూ అందులోని జీవులతోనూ వ్యవహరించాల్సి వస్తుంది. ఇంతకంటే వేరే మార్గం ఉండదు. కాని అద్వైతానుభవాన్ని నిత్యజీవితంలో అనుసంధానం చేసుకుంటూ వ్యవహరించే స్తితి  చాలా పరిపక్వస్థితి. దీనిలో, ఈ మూడుస్తాయిలలోని పరిపూర్ణజ్ఞానం అనుభవరూపంలో ఆవ్యక్తిలో ఉంటుంది. దీనినే శ్రీ రామకృష్ణులు "విజ్ఞానం" అన్నారు. భక్తునిస్తితి కంటే, జ్ఞానిస్తితి కంటే, ఈ విజ్ఞానిస్తితి చాలా గొప్పది. పరిపక్వమైనది.

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదీ శ్రీరామక్రిష్ణులు చెప్పినదే. ఒక మనిషి ఇంటిలో, డాబామీదకు వెళ్ళడానికి మెట్లుంటాయి. ఆ మెట్లు ద్వైతం విశిష్టాద్వైతం అనుకోవచ్చు. డాబా మీది కప్పుని అద్వైతం అనుకోవచ్చు. మనిషి మెట్లమీదుగా పైకెక్కి కప్పుమీదకి చేరుతాడు. కాని డాబామీదికెక్కిన తర్వాత ఎల్లకాలం అక్కడే ఉండలేడు. కాసేపు అక్కడఉండి, తర్వాత కిందికిదిగి, ఇంటిలోకి రావలసిందే. కాని కొందరుమాత్రం, ఎప్పుడూ డాబా మీదే ఉండిపోతారు. ఇక కిందికి రారు. వారు ప్రపంచపు వాసన సోకని నిత్యసిద్ధులు. సనక సనందనాది మహర్షులు ఈ కోవకు చెందినవారు. వారు ఎప్పుడూ ఈ ప్రపంచానికి అతీతమైన భూమికలో ఉండే మహనీయులు. 

మనిషి మెట్లెక్కి ఇంటిమీదకి చేరాలి. మళ్ళీ మెట్లు దిగి ఇంటిలోకి రావాలి. ఒకసారి పైకెక్కి దిగిన తర్వాత ఇంతకు ముందున్న మానసిక స్తితి అతనికి ఉండదు. కారణమేమిటంటే పై కప్పుమీద నుంచి చూస్తే, ఇంతకు ముందు తనకు తెలియని ఎన్నో కొత్తవిషయాలు అతను చూస్తాడు, గ్రహిస్తాడు. కనుక అతని మనస్తత్వమూ స్వభావమూ తదనుగుణంగా మారిపోతాయి. అతని దృక్కోణంలో మౌలికమైన అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కప్పు ఏ పదార్ధంతో తయారైందో మెట్లూ ఇల్లూ కూడా అదే పదార్ధంతో నిండి ఉన్నాయని అతడు గ్రహిస్తాడు. తనకు వివిధమెట్లమీదా, పైకప్పుమీదా కలిగిన అనుభవాలదృష్ట్యా ఇప్పుడతని ప్రవర్తన ఉంటుంది. అందుకే ఆ అనుభవాలు లేని లోకులకు అతని భావాలూ ప్రవర్తనా అర్ధం కావు".

"ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ దారిలో నడవక తప్పదు. ఈ రోజు కాకపోతే రేపైనా, ప్రతివారూ ఈ దారిలో నడవాలి. ఇది ప్రకృతినియమం. దీనికి ఎవ్వరూ మినహాయింపు కారు. అందుకే ప్రతిమనిషికి అంతర్లీనంగా ఏదో సాధించాలన్న తపన ఉంటుంది. కాని తెలీక, దాన్ని భౌతికరంగాలలో ఉపయోగిస్తాడు. లోకంలో ఎంతో సంపాదించాననీ, ఎన్నో విజయాలు సాధించానని అనుకుంటాడు. ఎన్ని సాధించినా జీవితచరమాంకంలో వెనక్కి తిరిగి చూచుకుని తానేమీ సాధించలేదని, జీవితం వృధాగా గడిపాననీ గ్రహిస్తాడు. ఎందుకంటే జీవుడు, జగత్తు, బ్రహ్మము అనే మూడూ అతి మౌలికమైన సమస్యలు. వీటిని తెలుసుకోకుండా మనిషి జీవితంలో ఎన్నటికీ అంతిమమైన తృప్తి కలగదు. ఎన్ని బాహ్యవస్తువులు పొందినా అవి అంతరికమైన ఈ మౌలిక విషయాలను స్పర్శించలేవు కనుక అంతిమతృప్తి అనేది మనిషికి ఎన్నటికీ కలుగదు. లోపల వెలితి అలాగే మిగిలిపోతుంది.

జగత్తును తెలుసుకుందామని సైన్సు ప్రయత్నం చేస్తున్నది. (సైకాలజీ మనస్సును తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నది) పేరాసైకాలజీ ఆత్మను గురించి తెలుసుకుందామని ప్రయత్నం సాగిస్తున్నది. సాధకులు దైవాన్ని తెలుసుకుందామని చూస్తున్నారు. కాని ఎవరైతే ఈ మూడింటినీ పూర్తిగా సమగ్రంగా తెలుసుకుంటారో వారి జీవితమే ధన్యం. లేకపోతే ఆ జీవితం వ్యర్ధం. మనిషి ఎంత సంపాదించినా చివరకు అది వ్యర్థమే. అది ఏమాత్రమూ లెక్కలోకి రాదు. అంతిమమైన సంతృప్తిని ఇవ్వలేదు. ఈ మౌలిక సమస్యలను సాల్వ్ చెయ్యగలిగిన వారి జీవితం మాత్రమే ధన్యం అవుతుంది. లేకపోతే మానవజన్మ వ్యర్ధమే.

"ఒకరు ఈ సమస్యలను సాల్వ్ చేస్తే అది అందరికీ ఉపయోగపడదా? ఎందుకంటే సైన్స్ లో ఒక ఆవిష్కరణ జరిగితే అది అందరికీ అందుబాటులోకి వస్తుంది కదా? అలాగే ఈ రంగంలో కూడా జరగడానికి ఆస్కారం లేదా?" మా అమ్మాయి అడిగింది.

నాకు నవ్వొచ్చింది.

"అలా కుదరదమ్మా.అంతరిక జీవితంలో ఎవరి ఆవిష్కరణ వారిదే. కాకపోతే నేను నడిచినదారిని మీకు చూపించగలను. మార్గంలో ఎత్తుపల్లాలు ఎక్కడున్నాయో చెప్పగలను. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలను. కాని మిమ్మల్ని భుజాలపైన ఎత్తుకొని నేను నడవలేను. ఆ దారిలో నడక మాత్రం మీరు నడవాల్సిందే. మీ అనుభవం మీదే. ఇంకొకరి అనుభవం మనకు అంతవరకే ఉపయోగపడుతుంది. 

సైన్స్ కూ ఆధ్యాత్మికతకూ ఉన్న భేదం గురించి చెప్తాను విను. సైన్స్ అనేది ఆబ్జెక్టివ్ ప్రయోగం. అది బయట వస్తువులతో చేసేది. అక్కడ ప్రయోగం చేసేవాని సబ్జెక్టివ్ స్తితితో, అతను చేసే ప్రయోగానికి సంబంధం ఉండదు. కాని సాధన అలా కాదు. ఇది పూర్తిగా సబ్జెక్టివ్ వ్యవహారం. ఇక్కడ ప్రయోగశాలా తనే. ప్రయోగమూ తనమీదే. చేసేదీ తానే. కనుక కలిగే అనుభవమూ తనతోనే ఉంటుంది. దాని ఛాయ కొంతవరకూ బయటకి కనిపిస్తుంది. కాని పూర్తిగా బయటివారికి అర్ధంకాదు. అదీ తేడా." అని చెప్పాను.

వింటున్న వారి ముఖాలలో సంభ్రమంతో కూడిన ఏదో ఆనందం కనిపించింది. జీవితంలో మౌలికసమస్యల  పరిష్కారం కనుగొన్న బుద్ధుని ముఖంలో కనిపించే నిర్మలత్వం వారిముఖాలలో చూచాయగా దర్శనమిచ్చింది.

తర్వాత ప్రయాణం మామూలుగానే సాగింది. కొండ కిందకు దిగి, తిరుపతిలో పద్మావతీ అమ్మవారి ఆలయమూ, కపిల తీర్ధమూ దర్శించి, కొద్దిపాటి విశ్రాంతి తర్వాత, సాయంత్రానికి బండెక్కి ఊరికి చేరాము. ప్రయాణమంతా వింటున్న ఈవిషయాలు మౌనంగా నెమరు వేసుకుంటున్నట్లుగా దారిలో పిల్లలముఖాలు చూస్తే నాకనిపించింది.
read more " తిరుపతి ప్రయాణంలో -2 "

19, నవంబర్ 2011, శనివారం

హస్తసాముద్రికం -- అద్భుతశాస్త్రం

హస్తసాముద్రికం అనేది ఒక అద్భుతమైన శాస్త్రం. దీని గురించి కొంత మాట్లాడుకుందాం. చేతిలో గీతలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని తెలియనివాళ్ళు అనుకుంటారు. కాని అలా ఉండవు. చూట్టానికి ఒకేరకంగా ఉన్న మనుషుల్ల్లో కూడా హస్తరేఖలు ఒకేలా ఉండవు. వేళ్ళ అమరికలోనూ, ఆకారంలోనూ, చర్మపుతీరులోనూ, గోళ్ళ తీరులోనూ, కణుపుల తీరులోనూ మనిషికీ మనిషికీ చాలా తేడాలుంటాయి. ఇక గ్రహస్థానాలు, రేఖలు, ప్రత్యెకమైన గుర్తులు ఇలా ప్రతి విషయంలోనూ తేడాలుంటాయి. 

తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు పిడికిలి బిగించి చేతులు ముడుచుకుని ఉంటుంది కనుక ఆ గీతలు ఏర్పడతాయని హేతువాదులూ నాస్తికులవంటి అజ్ఞానులు టీవీలలో చెబుతుంటారు. అందరూ శిశువులూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకేలా పిడికిలి బిగించుకుని ఉంటారు. కాని హస్తరేఖలు ఏ ఇద్దరు శిశువులకూ ఒకేలా ఉండవు. అంతే  కాదు, ఒకే శిశువులోనే కుడిచేతిరేఖలకూ ఎడమచేతిరేఖలకూ తేడాలుంటాయి. దీనికి ఎవ్వరూ వివరణ ఇవ్వలేరు. 

అసలు విషయం అది కాదు.నాడీశాస్త్రం ప్రకారం శరీరంలోని నాడులన్నీ అరచేతిలోనూ అరికాళ్ళలోనూ కేంద్రీకరించబడతాయి. ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్ విద్యలు కూడా ఈ నిజాన్ని గ్రహించినవే. కనుకనే చేతిలోనూ కాళ్ళలోనూ ఉన్ననాడులను మాసేజ్ చెయ్యడం ద్వారా చాలా రోగాలను తగ్గించవచ్చు. మార్షల్ ఆర్ట్స్ లో శరీరంలోని మర్మకేంద్రాల జ్ఞానంకూడా ఇలాగే ఉంటుంది. మనిషి ఒంటిలో ఎక్కడ ఏరకంగా కొడితే స్పృహ తప్పించడం నుంచి, పక్షవాతం వంటి స్తితులు వచ్చేట్టు చెయ్యడం లేదా స్పాట్లో ప్రాణం తియ్యగల ప్రమాదకరమైన దెబ్బల వంటివి అన్నీ మర్మవిద్యలో ఉన్నాయి. అదే వేరే సబ్జెక్టు గనుక ప్రస్తుతం మన విషయానికి వద్దాం.

Face is the index of the mind. అన్న సామెత బాగా వాడుకలో ఉన్నదే. కాని ముఖం ఒక్కటే కాదు. మనిషి శరీరంలోని ప్రతి అవయవమూ మనిషి యొక్క మనస్తత్వాన్నీ, ఆలోచనా సరళినీ, అలవాట్లనూ పట్టిస్తుంది. అలాగే హస్తరేఖలు కూడా మనిషిని గురించి సమస్తమూ వెల్లడిస్తాయి. జాతకచక్రం ఎంతో మనిషి అరచెయ్యి యొక్క ప్రింటూ అంతే. ఇవి రెండూ రెండు రకాల భాషలు అనుకుంటే, అవి చెప్పే విషయం మాత్రం ఒకటే ఉంటుంది. మనిషి ఆలోచనల ప్రభావం నాడుల ద్వారా హస్త రేఖలను మారుస్తూ ఉంటుంది.

మనిషి ఆలోచనలు అతని శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, చేతి రేఖలనూ ప్రభావితం చేస్తాయి. అందుకే మన ఆలోచనా ధోరణి మారుతున్న వయస్సులో చేతి రేఖలూ మారుతాయి. పాతరేఖలు మాయం అవుతాయి. కొన్ని కొత్తరేఖలు పుట్టుకొస్తాయి. ఇది ఎవరి చేతిలో వారే గమనించుకోవచ్చు. అప్పుడు నేను చెబుతున్నది నిజమే అని ఎవరికి వారికే అర్ధం అవుతుంది. ఈ విషయాన్ని మన ప్రాచీన ఋషులు ఎప్పుడో గమనించారు. గమనించడమే కాదు, ఈ శాస్త్రాన్ని చాలా లోతుగా రీసెర్చి చేసి అనేక సూత్రాలను వ్రాసిపెట్టారు. ఆయా సూత్రాలను ఉపయోగించి చూస్తే, అవి చాలావరకూ నిజం కావడం మనం చూడవచ్చు.

మనిషి చేతిలో గ్రహాలను దర్శించవచ్చు. జాతక చక్రాన్ని మనిషి చేతిలో చూడవచ్చు. చేతిని చూచి మనిషి యొక్క జాతకాన్ని ఖచ్చితంగా వ్రాసే విద్య మన దేశంలో ఉంది. అలా వ్రాయగలిగిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారు గీసిన జాతకచక్రం, మన జనన సమయానికి పంచాగంతో మనం గుణించిన జాతకచక్రం ఒకేలా వస్తాయి. గ్రహాల పోజిషన్స్ అన్నీ ఒకేలా సరిపోతాయి. చాలా మందికి జనన సమయం ఉండదు. అనేక కారణాలవల్ల తల్లితండ్రులు ఆ సమయాన్ని గుర్తుంచుకోక పోవచ్చు. ఒకవేళ గుర్తున్నా, అన్ని కుటుంబాలలోనూ జాతకాలు వ్రాయించే అలవాటు ఉండదు. కనుక అటువంటి వారికి ఈ విధానం ద్వారా జాతక చక్రాన్ని రాబట్టవచ్చు. దాన్ని బట్టి జననతేదీని నిర్ధారణ చెయ్యవచ్చు. అంటే చేతిని చూచి ఒక వ్యక్తి యొక్క date of birth చెప్పడం సాధ్యమే అన్నమాట. ఇదెంత అద్భుతమో చూడండి. అంటే మనిషి ఒక రకంగా తన జాతకాన్ని ఎప్పుడూ తన చేతిలోనే మోస్తూ తిరుగుతున్నాడు.

అంగుష్ఠవిద్య అని దీనిలో సూపర్ స్పెషలైజేషన్ ఒకటుంది. అందులో అయితే చేతిరేఖలను కూడా పరిశీలించరు. ఒక్క బొటనవేలి మీద ఉన్న గీతలనుబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం మొత్తాన్నే చదివేస్తారు. ఈ విద్యలో రావణుడు అఖండమైన ప్రజ్ఞాశక్తి కలిగినవాడని అంటారు. ఆయన వ్రాసిన 'రావణసంహిత' అనే గ్రంధంలో ఈ వివరాలు ఉన్నాయి. ఇలా అనేకానేక అద్భుత విద్యలు మన దేశంలో ఉండేవి. అవన్నీ కాలక్రమేణా కనుమరుగు అయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇవన్నీ పునరుజ్జీవనాన్ని చవిచూస్తున్నాయి. దీనికి కారకులు మన వాళ్ళే కాదు , అమెరికా, యూరోప్ లోని అనేకమంది పాశ్చాత్యులు ఈ విద్యల గొప్పతనాన్ని గుర్తించి వాటిమీద అనేక సంవత్సరాలుగా రీసెర్చి చేస్తున్నారు. నేడు మన జ్యోతిష్యం గురించి మనకు తెలియని అనేక విషయాలను మనమే బిత్తరపోయేలా చెప్పగల అనేకమంది పాశ్చాత్యులు ఉన్నారంటే వింతగా ఉన్నా ఇది నిజం. దానికి కారణాలు -- ఒకపక్క  మన చేతగానితనమూ, మన ప్రాచీన విద్యలను మనమే ఎగతాళి చేసుకుని, అదొక ఫేషన్ అనుకునే భావదారిద్ర్యమూ, సూడో సైంటిఫిక్ వాదమూ, కమ్యూనిస్టువాదమూ వగైరా వగైరాలు. 

పాతతరంలో కీరోవంటి మేధావులు మనవిద్యలను నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు. ఈ తరంలో కూడా మన జ్యోతిష్యాది విద్యలను లోతుగా అధ్యయనం చెయ్యడంలో అనేకమంది పాశ్చాత్యులు పరిశ్రమ చేస్తున్నారు.  

బహుశా తెల్లవాళ్ళు చెబితేగాని మన సంస్కృతి ఎంత గొప్పదో మనకు తెలియదేమో. దీన్నంతా చూస్తుంటే, మన ప్రాచీనవిద్యల గొప్పతనాన్ని గురించి పాశ్చాత్యులు వివరిస్తుంటే నోరెళ్ళబెట్టి మనం వినేరోజు దగ్గరలోనే ఉంది అనిపిస్తోంది. అప్పటికైనా మనకు పట్టిన భావదరిద్రం వదులుతుందా?
read more " హస్తసాముద్రికం -- అద్భుతశాస్త్రం "

14, నవంబర్ 2011, సోమవారం

కీరో జాతకంలో మంత్రసాధనాయోగాలు

పాశ్చాత్యజోస్యులలో చెప్పుకోదగ్గ ప్రముఖుడు కీరో. ఈయన 1 -11 -1866 న ఐర్లెండ్ లోని డబ్లిన్ దగ్గరలో జన్మించాడు. (ఈయన జనన తేదీమీద భిన్నాభిప్రాయాలున్నాయి). ఈయన అసలు పేరు "విలియం జాన్ వార్నర్". అయితే తానుగా "కౌంట్ లూయీ హేమన్" అనే పేరును స్వీకరించాడు. హస్తసాముద్రికాన్ని "కీరోమాన్సీ" అనే పేరుతో పిలుస్తారు. ఆ విద్యలో ఈయనకున్న అద్భుతపాండిత్యంవల్ల ఈయనకు "కీరో" అనే పేరు స్తిరపడింది.  తన జీవితకాలంలో ఈయన కొన్ని వేలమందికి ఖచ్చితమైన రీడింగ్స్ ఇచ్చాడు. వారిలో ప్రపంచప్రముఖుల నుంచి సామాన్యులవరకూ అన్ని రకాలవారూ ఉన్నారు. 69 సంవత్సరాల వయసులో అక్టోబర్ 8,1936 న హాలీవుడ్ లో మరణించాడు. ఆరోజులలోని అనేకమంది యూరోపియన్ ప్రముఖులకూ, రాజులకూ, రాణులకూ, ప్రపంచ ప్రఖ్యాతులకూ  చెయ్యిచూసి వారి జీవితవిశేషాలను అచ్చు గుద్దినట్లుగా చెప్పడమేకాక జరగబోయే విశేషాలను కూడా ఖచ్చితంగా చెప్పాడు. ఆయా సంఘటనలు ఆయన చెప్పినట్లుగానే జరిగినప్పుడు లోకమంతా నివ్వెరపోయింది. ఇవన్నీ రికార్డ్ చెయ్యబడిన నిజాలు. ఈయన జాతకంలోని కొన్ని ముఖ్య విశేషాలను చూద్దాం.


ఈయన వ్రాసిన జ్ఞాపకాలలో, తానీ విద్యను భారతదేశంలో నేర్చుకున్నట్లుగా చెప్పాడు. తన టీనేజిలో బాంబేలో తాను కలుసుకున్న ఒక కొంకన్ బ్రాహ్మణుడు తనను మహారాష్ట్రలోని వారి గ్రామానికి తీసుకు వెళ్లి, తన శిష్యునిగా అంగీకరించి, వారివద్ద తరతరాలుగా వస్తున్న సాముద్రికగ్రంధాలను పరిశీలించే అవకాశాన్ని ఇచ్చాడనీ, వారివద్ద తాను రెండేళ్ళపాటు శిష్యరికంచేసి ఈవిద్యను నేర్చుకున్నట్లుగా చెప్పాడు. 

జ్యోతిష్యశాస్త్రం కంటే హస్తసాముద్రికానికి కీరో ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాడు. సామాన్యంగా హస్తసాముద్రికులకు కొన్ని మంత్రాలసాధన కూడా తప్పకుండా తోడుగా ఉంటుంది. అప్పుడే వారు ఆశ్చర్యకరమైన ఫలితాలు చెప్పగలుగుతారు. కీరో కూడా కర్ణపిశాచినీ మంత్రాన్ని సాధన చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అతని చేతికి ఆ మంత్ర సంబంధితమైన ఒక తాయెత్తు ఉండేదనీ ఆ తాయెత్తును ఆయనకా విద్య నేర్పించిన గురువు కట్టాడనీ, అది ఉన్నంతవరకూ కీరో చెప్పింది చెప్పినట్లుగా జరిగిందనీ, పెద్దవయస్సులో ఆ తాయెత్తును  కీరో పోగొట్టుకున్న తర్వాత ఆయన జోస్యాలు కొంత మేర తప్పాయనీ కొందరు అంటారు. ఈ మేరకు కీరోభార్య వ్రాసిన ఉత్తరం ఒకటి బీ.వీ.రామన్ గారికి చేరిందని రామన్ గారు తన ఆత్మకధలో వ్రాశారు. 

కీరో జాతకాన్ని మనం పరిశీలిస్తే, మంత్రసాధనను సూచించే కొన్ని విచిత్రమైన యోగాలు కనిపిస్తాయి. కీరో మఖానక్షత్రంలో వృశ్చికలగ్నంలో జన్మించాడు. ఇతనికి మూడింట గురువూ తొమ్మిదింట కుజుడూ ఎదురెదురుగా ఉండటం ఒక విచిత్రయోగం. ఇది ఇతనికి పూర్వజన్మ నుంచీ భారతదేశంతో ఉన్న సంబంధాన్ని సూచిస్తోంది. మకరలగ్నంతో సంబంధం ఉన్నవారికి మనదేశంతో తప్పక కర్మానుబంధం ఉంటుంది. అది ఏ రకమైన సంబంధమో ఆయాజాతకాల ద్వారా పరిశీలించి తెలుసుకోవాలి. చంద్రలగ్నాత్ మకరం షష్ఠస్థానం అయ్యింది. కటకం ద్వాదశం అయ్యింది. 

ఈయన జాతకంలోని ఇంకొక ముఖ్యయోగం -- లగ్నాత్ ద్వాదశంలో తులారాశిలో శనిసూర్యుల కలయిక. ఈ స్థానం శనికి ఉచ్చస్తితినీ సూర్యునికి నీచస్తితినీ ఇస్తుంది. ఒకేచోట రెండు పరస్పర విరుద్ధగ్రహాలు ఒకటి చాలాబలంగా ఇంకొకటి చాలాబలహీనంగా ఉండటం వెనుక ఎన్నో మార్మికమైన అర్ధాలున్నాయి. చంద్రునినుంచి ఈస్థానం తృతీయం అవుతుంది అన్నవిషయం కూడా గమనించాలి. ఇప్పుడు రాహుకేతువుల స్తితిని పరిశీలిస్తే,  పంచమలో కేతువూ, లాభంలో రాహువూ దర్శనమిస్తారు. వీరు చంద్రలగ్నాత్ అష్టమ, ద్వితీయస్థానాలలో కనిపిస్తారు.

ఈ మూడు ముఖ్యమైన యోగాలను గుర్తించాం గనుక ఇక వీటిని విశ్లేషిద్దాం. 

అష్టమాదిపతి అయిన బుధుడు జ్యోతిర్విద్యా కారకుడు. ఇతను లగ్నంలో ఉండటం వల్ల ఈయనకు మార్మిక సంబంధమైన జ్యోతిర్విద్య పట్టుబడింది. అయితే ఇది హస్త సాముద్రికం అయ్యింది. కారణం ఏమంటే చేతులకు సూచకమైన తృతీయంలో గురువు నీచలో ఉండటం. పంచమంలో కేతువు ఉండటం, నవమంలో కుజుడు నీచలో ఉండటాలవల్ల మంత్ర సంబంధమైన ప్రజ్ఞాపాటవాలు ఇతనికి ఖచ్చితంగా ఉన్నట్లు మనం చూడవచ్చు.

ఇక్కడ ఒక రహస్యం దాగుంది. కేతువున్న పంచమ స్థానాధిపతి అయిన గురువు విక్రమస్థానంలో నీచలో ఉండటం వల్ల, ఈయన ఒక క్షుద్రమంత్రాన్ని ఆరాధించాడన్న  సంగతి సూచనగా తెలుస్తున్నది. కనుక కర్ణపిశాచినీ మంత్రసిద్ధి ఈయనకు ఉందన్న విషయం నిజమే కావచ్చు. లేకుంటే అంత ఖచ్చితంగా కొన్నివేల మందికి భవిష్యత్తును నిర్ధారణగా చెప్పటం సాధ్యం కాదు.

హస్త సాముద్రికంలో కీరో ప్రజ్ఞాపాటవాల గురించి అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి కీరోవద్ద చెయ్యి చూపించుకోడానికి వచ్చిన ఒకవ్యక్తి ఒక షరతు విధించాడట. తాను ఒక తెరచాటున కూచుని, తన అరచేతిని మాత్రమే ఆ తెర వెనుకనుంచి బయటకు చాచి చూపిస్తాననీ, తెరకు అవతల పక్కన కీరో కూచుని ఆ చేతిని మాత్రమే పరిశీలించి తనవివరాలు చెప్పాలనీ చాలెంజ్ చేసాడు. సరేనని ఒప్పుకున్న కీరో ఆచేతిని పరిశీలించిన మీదట, అవతల వ్యక్తిని ఒక యూరోపియన్ రాచకుటుంబీకునిగా గుర్తించి దానికి తగిన గౌరవసంబోధనతో ఆవ్యక్తిని పలకరించి అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసాడట. జ్యోతిషాన్ని ఏమాత్రమూ నమ్మని  ప్రముఖరచయిత "మార్క్ ట్వేయిన్" కూడా కీరోతో తన జాతకాన్ని చెప్పించుకుని ఆశ్చర్యచకితుడవడమే కాక ఆ విషయాన్ని ఒప్పుకుంటూ కీరోవద్ద ఉన్న గెస్ట్ బుక్ లో వ్రాసి సంతకం కూడా చేసాడు.  

విక్టోరియారాణి మరణ తేదీనీ, కింగ్ ఎడ్వర్డ్ చనిపోయే నెలనీ సంవత్సరాన్నీ, రష్యా జార్ చక్రవర్తికి పొంచిఉన్న ఆపదనీ, ఇటలీ రాజు హంబర్ట్ హత్య చెయ్యబడతాడనీ, ఇలా ఎన్నెన్నో కరెక్ట్ గా జరిగిన సంఘటనలను కీరో ఖచ్చితంగా ముందే ఊహించి చెప్పాడు. ఈ జ్ఞానాన్ని "విస్మరించబడిన హిందువుల విజ్ఞానం" (forgotten wisdom of the Hindus) అన్న పేరుతో  అతను పిలిచాడు.


ఒకచోట కీరో ఇలా అంటాడు. 

There are many such treasures in Hindustan; but all are so jealously guarded by the Brahmans that neither money, art, nor power will ever release such pledges of the past.


కీరో  చెప్పిన  పైమాటలకు నావంతుగా నేను ఈ మాటల్ని కలుపుతాను.

However, such treasures are certainly, if not easily, accessible to one who possesses sincerity and humility, an urge to know the mysteries of the spirit, and a heart that bows in reverence before that ancient and mighty wisdom of Rishis.


కీరో జాతకంలోని విచిత్రయోగాలను వివరంగా వచ్చే  పోస్టులో చూద్దాం.
read more " కీరో జాతకంలో మంత్రసాధనాయోగాలు "